Monday 29 February 2016

రుక్మిణి ఆరుండలె గారికి వందనాలు



భరతముని భరతనాట్యాన్ని అందిస్తే, ఆవిడ మరణిస్తున్న భరతనాట్యానికి ఊపిరిలూదారు. భరతనాట్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనురాలు ఆవిడే. ఆవిడ లేకపోతే బహుసా భరతనాట్యం ఉండేదని కూడా హిందువులకు తెలిసి ఉండేది కాదు. ఈరోజు ఆవిడ పుట్టిన రోజు సదర్భంగా గూగుల్ లో ఆవిడకు చెందిన డూడుల్‌ని పెట్టి, ఆవిడకు గౌరవం ప్రకటించింది. ఆవిడ గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇది చదవాల్సిందే.

వేల ఏళ్ళుగా సనాతనధర్మం దాడులు జరుగుతూనే ఉన్నాయి, జరిగిన ప్రతిసారీ ఎవరో ఒకరు ధర్మరక్షణకు ముందు నిలబడుతూనే ఉన్నారు, ధర్మాన్ని రక్షిస్తూనే ఉన్నారు. వేయి సంవత్సరాలకు పైగా భారతదేశంపై అధికారం చెలాయించిన విదేశీయులను వెళ్ళగొట్టడానికి స్వాతంత్ర పోరాటం ఒక్కటే సరిపోదు, ఈ దేశానికి ఆయువుపట్టు అయిన ధర్మాన్ని జాగృతం చేయడం, ప్రచారం చేయడం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి తోడ్పడడం, ధార్మికులలో నూతనోత్సాహం కలిగించడం అతవ్యశకమని ఎందరో మహానుభావులు భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. స్వామి వివేకానందులు, అరబిందో యోగి, స్వామి దయానందులు మొదలైన అనేకమంది హిందూ గురువులు చేసిందదే. వారి చలువ వల్లనే ఎందరో ప్రభావితమై దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలను అర్పించి స్వాతంత్రం తెచ్చారు. ఇదే కోవకు చెందుతారు శ్రీ రుక్మిణి దేవీ ఆరుండలె. 29 ఫిభ్రవరి 1904 లో తమిళనాట మదురైలో జన్మించారు రుక్మిణి ఆరుండలె.

17 వ శతాబ్దం నుంచి భారతీయ సంప్రదాయ నృత్యం మీద క్రైస్తవ మిషనరీలు విషం చిమ్ముతూనే ఉన్నాయి. సంప్రదాయ నృత్యాన్ని నీచమైన కళగా చూపించడం లక్ష్యంగా ప్రచారం సాగించాయి. దేవదాశీ వ్యవస్థపై పోరాటం చేస్తున్నామంటూ దీన్ని లక్ష్యంగా చేసుకునేవారు. దేవాలయానికే తమ జీవితాలను అంకితం చేసి, భగవంతుని ముందు నృతం చేస్తూ జీవితం గడపడమే ఈ వ్యవస్థ యొక్క లక్ష్యం. 10, 11 శతాబ్దాల్లో ఎంతో శాస్త్రీయంగా నడిచిన ఈ వ్యవస్థ దేశంపై ముస్లింలు దండెత్తడంతో నాశనమైంది. మొఘల్ పాలకులు ఈ దేవదాశీలను హింసించి తమ కామాన్ని తీర్చుకునేవారు, వారి జీవితాన్ని ఛిద్రం చేసేవారు. ఫలితంగా కొన్ని శతాబ్దాలకు ఈ వ్యవస్థను వ్యభిచార వ్యవస్థగా మార్చేశారు. ఆంగ్లేయుల రాకతో ఇది మరీ తీవ్రమైంది.

ఇంగీష్ విద్య బాగా తల్లకెక్కించుకున్న భారతీయులు పూర్వపక్షం చేయక, ఆంగ్లేయుల మాటలే వేదవాక్కుగా భావించి ఈ వ్యవస్థ సనాతనధర్మంలోనే ఉందని, ఇది వెనుకబాటు తనానికి కారణమని చెప్పుకోసాగారు. దేవదాశీ వ్యవస్థ రద్దు చేయాలనే  మిషతో సంప్రదాయ భరతనాట్యాన్ని పూర్తిగా అంతం చేయాలని మిషనరీలు భావించాయి. ఆ సందర్భంలో దేవదాశీలు ఆంగ్లేయ ప్రభుత్వానికి భరతనాట్యం యొక్క ఆధ్యాత్మిక పునాదులను, ఔన్నత్యాన్ని వివరిస్తూ అనేక లేఖలు రాశారు. వారి వ్యవస్థను రద్దు చేయడం కంటే చరిత్రలో ఒకనాడు (మొగల్ పాలకులకు పూర్వం) ఉన్న విధంగా దాన్ని ఉద్ధరించమని ప్రార్ధిస్తూ, తమకు విద్యను (ఇంగీష్ విద్య కాదు, సానతన భారతీయ విద్య) అందించమని, భగవద్గీతను, రామాయణాన్ని తమకు బోధించమని, ఆగమాలు, ప్రార్ధనా విధానాలు వివరించమని వేడుకున్నారు. అది దేవదాశీ అమ్మాయిలకు స్పూర్తినిస్తుందని, తద్వారా వారు మైత్రేయి, గార్గి, మణిమేఖల వంటి స్త్రీ ఋషుల వలే తయారవుతారని, వేదాన్ని గానం చేస్తారని చెప్పుకున్నారు. 'మేము మరలా ధార్మ ప్రవచకులం అవుతాం .......... చిన్న వర్గాల పట్ల మీరు ప్రేమ కురిపిస్తారు. మేము మా ధర్మాన్ని పాటించి  మోక్షం పొందేందుకు మీరు మమ్మల్ని అనుమతించండి. మాలోని భక్తిని, జ్ఞానాన్ని వ్యక్తపరిచే అవకాశం ఇవ్వండి, పెరుగుతున్న భౌతికత, ఎన్నో కష్టాలు, ఒడిదుడుకుల మధ్య నలిగిపోతున్న భారతీయ సనాతన ధర్మాన్ని రక్షించి, దాని సందేశాన్ని ప్రపంచానికి తెలియజెప్పే అవకాశాన్ని ఇవ్వండి' అని రాశారు. అయినప్పటికి మిషనరీలు తమ దుష్ప్రచారాన్ని అపలేదు. భరతనాట్యాన్ని అసంబద్ధం, అమానవీయం, ఆటవికంగా ప్రచారం చేశాయి.

క్రైస్తవ విష కోరల నుంచి నాట్యాన్ని రక్షించేందుకు అనేకమంది హిందువులు పాటుపడ్డారు. అటువంటి సమయంలో వచ్చినవారే రుక్మిణి ఆరుండలె. ఈవిడ వచ్చే సమయానికి భరతనాట్యం అంటే వేశ్యలు చేసే నృత్యంగా సమాజంలో ప్రచారం వచ్చింది. అయినప్పటికి తాను భరతనాట్యం నేరుకుని వ్యతిరేక పరిస్థితుల మధ్య బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. భరతనాట్యానికున్న ఆధ్యాత్మిక వైభవాన్ని పునరుద్ధరించారు. దాన్ని నాట్య-రూపకంగా మార్చారు. భరతనాట్యం పేరు చెప్తే అసహయించుకునే స్థితిని నుంచి సాధరణ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా ఈ తప్పక నేర్చుకోవలసినదిగా ప్రచారం చేశారు. భరతనాట్యాన్ని రక్షించడం కోసం 1936 లో కాళాక్షేత్రం అనే ఒక నృత్య పాఠశాలను ఏర్పాటు చేశారు. అది చూడటానికి ఆధునిక క్షేత్రంగా కనిపించినా, అందులో గురుకుల విధానాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ నేర్చుకునే పిల్లలు శాఖాహారం మాత్రమే తీసుకోవడం, నృత్యం ప్రారంభించే ముందు సంప్రదాయబద్ధంగా గణపతికి వందనం అర్పించడం వంటి నిబంధనలు ఏర్పాటు చేశారు. తాను దివ్యజ్ఞాన సమాజం వారిచే ప్రభావితమైన ఆ కళాక్షేత్రంలో హిందూ సంస్కృతి మూలాలుండి, ధర్మం పట్ల శ్రద్ధా విశ్వాశాలున్న వారినే అందులో విద్యార్ధులుగా స్వీకరించారు. ఈవిడ చేసిన కృషి వల్లనే తమిళనాట ఆధునిక కాలంలో గురుకుల వ్యవస్థ అత్యంత క్రింద స్థాయి వరకు చేరింది. భరతనాట్యం ఒక ఆధ్యాత్మిక కళగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కళాక్షేత్రం ఒక విశ్వవిద్యాలయం స్థాయికి చేరింది. ఆవిడ కృషికి గానూ ఆవిడకు 1956 లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి భారతప్రభుత్వం సత్కరించింది.

భరతనాట్యానికి కొత్త ఊపిరిలూదిన శ్రీ రుక్మిణి ఆరుండలె గారికి వందనాలు. కానీ ఆవిడ కళాక్షేత్రంలోకి ప్రవేశించిన ఓ దుష్టశక్తి కళాక్షేత్రాన్ని, భరతనాట్యాన్ని నాశనం చేస్తోంది. సంప్రదాయ నృత్యాన్ని క్రైస్తవంలో విలీనం చేసే యత్నం చేస్తూ కొంతవరకు విజయ సాధించింది. అది మళ్ళీ చెప్పుకుందాం.

http://christianizingbharatanatyam.blogspot.in/

Sunday 28 February 2016

హిందూ ధర్మం - 197 (వేదంలో గోసంరక్షణ - 2)

ఋగ్వేద సామవేదాలు ఆవుని అఘ్న్యా, అదితి అన్నాయి. అనగా వధింపకూడనిద, పూజించదగినది అని అర్థం. ఋగ్వేదంలో 9 సార్లకు పైగా (1.64.27, 5-83-8, 7-68-9, 1-164-40, 8-69-2, 9-1-9, 9-93-3, 10-6-11, 10-87-16) ఆవును అఘ్న్యా అంటూ వధించకూడదని తేల్చి చెప్పింది. గోవు వధించ రానిది, అగౌరవపరచ రానిదని, ఆవుపాలు మనసును శుద్ధి చేసి, పాపముల నుంచి దూరంగా ఉంచుతాయని చెప్పింది.

అఘ్న్యేయం సా వర్ధతాం మహతే సౌభగాయ - ఋగ్వేదం 1.164.27

గోవు - వధింపకూడనిది. అది మాకు ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను తీసుకువస్తుంది.

సుప్రపానం భవత్వఘ్న్యాయః - ఋగ్వేదం 5.83.8

అఘ్న్యా అయిన గోవుకు చక్కని నీటి సదుపాయం ఉండాలి.

అనగో హత్యావై భీమక్రియతే
మా నో గామశ్వం పురుషూం వధీః - అధర్వణ వేదం 10.1.29

అమాయకులను చంపటం మహాపాపం. మన ఆవు లను, గుర్రాలను, మనుష్యులను చంపకండి.

మా గామనాగా మదితిం వధిష్ట - ఋగ్వేదం 8.101.15

ఆవును చంపకండి. ఆవు అమాయకురాలు. అదితి - ముక్కలు చేయకూడనిది అంటూ గోవధకు దేశబహిష్కారం శిక్ష వేయమని చెప్పింది.

యః పౌరుషేయేణ క్రవిషా సమఙ్క్తే యో అశ్వ్యేన పశునా యాతుధానః
యో అఘ్న్యాయా భరతి క్షీరమగ్నే తేషాం శీర్షాణి హరసాపి వృశ్చ - ఋగ్వేదం 10.87.16

ఎవరైతే మనిషి, గుర్రం లేదా ఇతర జంతువుల మాంసం తింటారో, ఎవరైతే పాలతో జనులను పోషించే అఘ్న్యాలను - గోవులను (గోజాతిని) నశింప జేస్తారో వారిని కఠినంగా శిక్షించాలి (capital punishment).

అథర్వణవేదం 8-3-16 మంత్రమైతే గోహత్య మహాపాపం చేసినవారికి శిరశ్చేదనం (తల నరకమని) చేయమని చెప్పింది.

పై మంత్రాన్ని అనుసరించి గోవులను చంపేవారికి కఠినమైన శిక్ష విధించాలని వేదమే చెప్పింది. #వేదం అనగా భగవంతుని ఊపిరి, వేదం - భగవంతుడు, ఇద్దరూ వేరు కాదు. ఒక్క గోవులనే కాదు, ఏ జంతువును చంపినా శిక్ష విధించమంటోంది. మనదేశంలో కొన్ని రాష్ట్రాలు గోవును వధించినవారికి కఠిన శిక్ష ఉండాలని చట్టాలు చేస్తే, అది నేరమని, ఘోరమని కొందరు ధర్మద్వేషులు, అధర్మీయులు తెగ గొడవ చేస్తారు. ఈ దేశంలో ఆయా మతస్థులకు వారి వారి మతగ్రంధాలను అనుసరించి, వాటికి అనుగుణంగా చట్టాలున్నాయి. ఉదాహరణకు ముస్లిమకు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం భారతదేశంలో నేరం కాదు. ఎందుకంటే బహువివాహాలను ఖురాన్ అంగీకరించింది. ఖురాన్‌కు అనుగుణంగానే వారికి షిరియా చట్టం ఏర్పడింది. అలాగే విడాకుల విషయంలో కూడా వారికి వేరే పద్ధతి ఉంది. భారతదేశంలో ఇస్లామేతర ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు కాగా, వారికి కనీస వయసు 15 సంవత్సరాలు.

వారి మతగ్రంధాన్ని అనుసరించి చట్టం ఏర్పడినప్పుడు హిందువులు, తమ ధార్మిక గ్రంధాలకు అనుగుణమైన చట్టం కావాలని అడగడంలో తప్పేంటి? ధర్మం ప్రకారం గోవధ సహిచరాని నేరం. ఈనాడు కొన్ని రాష్ట్రాలు గోవధకు కఠిన శిక్షలు వేయడమంటే ధార్మిక గ్రంధాలకు అనుగుణంగా చట్టం ఏర్పడిందని అర్దం కదా. మరి ఈ ఒక్క విషయాన్నే వ్యతిరేకించడం ఎందుకు? ఇది ఆ కుహన మేధావులది ద్వంద్వనీతి కాదా అని హిందువులు ప్రశ్నించాల్సి ఉంటుంది.

To be continued ....................

Source: http://agniveer.com/no-beef-in-vedas/

Saturday 27 February 2016

హిందూ ధర్మం - 196 (వేదంలో గోసంరక్షణ - 1)

గోవుకు, ఎద్దుకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకున్నాం కదా. అసలు నిజంగా వేదంలో గోవధ ఉందా లేదా అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

వెజిటెరీయనిజం (Vegetarianism)  అనేది ఈ రోజు ప్రపంచంలో బాగా ప్రజాదరణ పొందింది. భూతాపాన్ని నివారించటం కోసం, కాలుష్యాన్ని అరికట్టడం కోసం, సంపదల దుర్వినియోగాన్ని, అతివినియోగాన్ని తగ్గించటం, ఆరోగ్యం కోసం అందరూ వెజిటెరీయనిజం వైపు మళ్ళాలని ఐరాస (ఐక్య రాజ సమితి) సహా అనేక అంతర్జాతీయ సంస్థలు, అనేక దేశాల ప్రభుత్వాలు, పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమంగా ప్రచారం చేస్తున్నాయి. జంతువులకు కూడా మనుష్యుల వలే హక్కులుంటాయాని, వాటిని చంపడం నేరమని అనేకమంది జంతుప్రేమికులు వాదిస్తున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని వేదం కూడా చెప్పింది. వేదం శాఖాహారాన్నే తీసుకోమని చెప్పింది. ఒక జీవికి ప్రాణం పోయలేని మానవుడికి, ప్రాణం తీసే హక్కు లేదని వేదం చెప్పింది. అనాదికాలం నుంచి ఈ విషయాన్ని అనేక గురువులు నిరంతరం ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణ శ్రీ త్రైలింగ స్వామి వారు.

ఒకసారి ఉత్తరభారతదేశంలోని అడవులలో ఒక పులిని వేటాడటం కోసం కొందరు రాజభటులు వెంబడిస్తున్నారు. ఆ పులి తప్పించుకుని వెళ్ళి, అక్కడికి దగ్గర్లోనే మౌనంగా తపస్సు చేసుకుంటున్న గణపతి స్వామి వద్దకు వెళ్ళి, ఆయన ఒళ్ళో పిల్లిపిల్లలా భయంతో బిక్కుబిక్కుమంటూ చేరింది. అది చూసి ఆశ్చర్యంతో రాజభటులు నిశ్చేష్టులవ్వగా, అక్కడున్న గణపతి స్వామి ఆ భటులతో, 'ఒక జీవికి ప్రాణం పోయలేని మనకు ప్రాణం తీసే హక్కులేదు. ఏ జీవిని చంపరాదు. జీవులను చంపటం పాపం' అని వారికి ఉపదేశం చేస్తారు. అది విన్న ఆ రాజభటులు స్వామికి సాష్టాంగ ప్రణమిల్లి వెళ్ళిపోతారు. ఆ గణపతి స్వామి ఎవరో కాదు, 250 ఎళ్ళకు పైగా జీవించిన యోగి, సిద్ధపురుషులు, శ్రీ త్రైలింగ స్వామి వారు.

భౌద్ధం రాకముందు నుంచే 'అహింస' అనేది ధర్మంలో ముఖ్యమైన లక్షణంగా, వ్రతంగా చెప్పబడి ఉంది. వేరొక విధంగా చెప్పాలంటే వేదంలో ఉన్న అహింసావాదాన్నే భౌద్ధజైనాలు స్వీకరించాయి. కానీ వాటి వాదానికి, ధార్మిక వాదనకు కొంత వ్యత్యాసం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల, కొన్ని కుతంత్రాలను పారించడానికి మార్కిస్టు మేధావులు, అధర్మ ప్రచారకులు వేదంలో గోవధ ఉందని ప్రచారం చేస్తున్నారు.

ముందు ఒక విషయం గ్రహించాలి. వేదంలో గో అన్న మాట అనేక సందర్భాల్లో అనేక అర్దాలను కలిగి ఉంది. ఆవు, జలం, సూర్యకిరణాలు, విద్యావంతులు, వైదిక సూక్తాలు, భూమాత ........ వీటన్నిటికి గో అన్న శబ్దాన్నే వాడారు.

To be continued ................

Sunday 14 February 2016

హిందూ ధర్మం - 195 (గోవు ప్రాముఖ్యత - 7)

గోవు గురించి ఎంత చెప్పుకున్నా, చెప్పుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అన్ని విశిష్టతలున్నాయి గోమాతకు. అయితే అసలు విషయం పక్కదారి పట్టకూడదు కాబట్టి ఇది ఇక్కడకు ఆపేద్దాం. తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. అయితే గో సంరక్షణ అన్నప్పుడు అందులో వృషభాలను కూడా కలపవలసి ఉంటుంది. ఎందుకంటే ఆవు లేకపోతే ఎద్దు లేదు, ఎద్దు లేకపోతే ఆవు లేదు. ఆ రెండు లేని వ్యవసాయం నిరర్ధకం. ఆవుకు ఎంత ప్రాధాన్యం ఉందో, ఎద్దుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. గోమాత పుత్రుడే వృషభరాజు. 'దేశీఆవుకు పుట్టిన దూడ ఆడదైతే ఆవు అవుతుంది, మగదైతే ఎద్దు అవుతుంది. కేవలం నాటావు కోడేదూడ మాత్రమే ఎద్దు అవుతుంది. జెర్సీకి పుట్టిన కోడేదూడ ఎద్దు అవ్వదు, ఎందుకంటే దానికి నూపురం ఉండదు' అన్నారు రాజీవ్ దీక్షిత్. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన జీవి ఎద్దు. ఎద్దుకు ఉండే నూపురమే నాగలిని, బండ్లను లాగటానికి ఉపయోగపడుతుంది. చెరుకు, నూనె గానుగలను లాగటానికి ఉపయోగపడుతుంది. ఆ నూపురమే లేకపోతే దాని ఉపయోగమేమీ ఉండదు.


ఈశ్వరసృష్టిలో ఇది ఒక అద్భుతం. మానవుడి ఆకలిని తీర్చటానికి, ఆహారాన్ని పండిచటానికి అవసరమైన ఎరువులను, పంటకు వచ్చే పురుగును నివారించే ఔషధాలను ఆవు అందిస్తే, ఎద్దు పొలంలో దుక్కుదున్ని రైతుకు సాయం చేస్తుంది. ఎంతటి బరువునైనా తన మీద మోసి, పొలం దున్నుతుంది. రైతు కుంటుంబంలో కలిసిపోతుంది. అవి చేసే మేలు మరవలేకేనే, వాటి కోసం ఓ పండగ వచ్చింది. అదే కనుమ. కనుమ జంతువులకు కృతజ్ఞత తెలుపుకునే పండగ. అచ్చమైన వ్యవసాయపండుగ.

ఎద్దు వ్యవసాయ క్షేత్రంలో కాళ్ళు పెట్టినప్పుడు దాని గిట్టల నుండి అమృతబిందువులు రాలుతాయని, అందువలన ఎద్దు తిరిగిన పొలం పంటను ఆహారంగా స్వీకరించినవారికి నేత్రవ్యాధులు రావని వేదం చెప్తోంది. ఈ విషయాన్ని అనేకమార్లు చాగాంటి కోటేశ్వరరావుగారు తమ ప్రవచనాల్లో ప్రస్తావించారు. మహానారయణోపనిషత్తు ఇత్యాదులు కూడా రైతులకు సందేశం ఇస్తూ 'ఓ భూమిపుత్రుడా! ఈ భూమి నీ తల్లి, ఈమెను విషములతో కలుషితం చేయ్యకు. గోమయం, గోపంచకాలతో శుద్ధి చేయు, సారాన్ని పెంచి ఆమెను పూజించు' అని రైతుకు సందేశం ఇస్తున్నది. భూమి కలుషితమవడంలో ట్రాక్టర్ల పాత్ర కూడా ఉంది. ట్రాక్టర్లు తిరిగిన భూమి యొక్క సారం త్వరగా క్షీణించిపోతుంది. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ కూడా ఈ విషయాన్ని చెప్తూ, ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నందున రాబోయే 400 ఏళ్ళలో అమెరికాలో భూసారం పూర్తి నశిస్తుందని చెప్పారు. ట్రాక్టర్లతో దున్నే భూమిలో 1000 ఏళ్ళ తర్వాత పచ్చి గడ్డిపరక కూడా మొలవదు. భారతదేశంలో వేళ్ళ ఏళ్ళ నుంచి వ్యవసాయం జరుగుతున్నా, భూసారం క్షీణించకుండా ఉండటానికి కారణం పొలంలో ఎడ్లను ఉపయోగించటమే.

ట్రాక్టర్లతో దున్నినప్పుడు నాగలి అవసరమైన లోతు కంటే ఎక్కువలోతుకు వెళ్ళి, భూమిలోని శత్రుజీవాలతో పాటు మిత్రజీవాలను సైతం నాశనం చేస్తుంది. ఆ కారణంగా భూమి నిస్సారమవుతుంది. అప్పుడు నీరు కూడా ఎక్కువగా అవసరమవుతుంది. అమెరికాలో ఈ పద్ధతి వల్లనే వేల ఎకరాల భూమి నిస్సారమైపోయింది. ట్రాక్టర్ల ఉపయోగం వలన వాయుమండలం కూడా కలుషితమవుతుంది. ఇవన్నీ వనరుల దుర్వినియోగానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద సమస్య భూతాపం (Global Warming). దీనికి గ్రీన్ హౌస్ వాయువులు కారణం. ఇప్పుడు అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతుల వలన భూతపానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువుల్లో మూడింట ఒక వంతు (One-third) వ్యవసాయ క్షేత్రాల నుంచే వెలువడుతుండడం బాధాకరమైన విషయం. వీటిన్నిటికి పరిష్కారం వ్యవసాయంలో ఎద్దును ఉపయోగించటమే. అయితే ఇది భారతీయులకు కొత్త విషయం కాదు.

పాడిపంటలు అనే మాట మనకు భాషలో ఎప్పటి నుంచో ఉంది. పాడి అంటే పశువులు. అందులో ఎడ్లు కూడా వస్తాయి. దున్నడం దగ్గరి నుంచి కోసుకొచ్చిన పంటను ఇంటికి చేర్చడంలో, దాన్ని అంగడికి తీసుకువెళ్ళడంలో ఎద్దు పాత్ర ఉంది. అది రైతుకు, వ్యవసాయానికి వెన్నుముక వంటిది.      

'భగవంతుడు భారతదేశానికిచ్చిన వరం ఆవు అన్నారు మహర్షి వాగ్భటుడు. ఎడ్లలో కూడా రెండు రకాలున్నాయి. తక్కువ పాలిచ్చే ఆవుకు పుట్టినవి చాలా బలం కలిగి ఉంటాయి. ఇది నేను ప్రయోగాత్మకంగా చేసి చూశాను. 3 టన్నుల బరువును ఎలాంటి శ్రమ లేకుండా, ఎక్కడా ఆగకుండా 40 కిలోమీటర్లు లాగగలుగుతాయి. వాటితో పోటీ పడలేము. అదే ఎక్కువ పాలిచ్చే గోసంతతి ఎడ్లు కూడా 3 టన్నుల బరువును లాగగలిగినా, మధ్యలో అక్కడక్కడా ఆగి, విశ్రాంతి తీసుకుంటాయి. ముందు చెప్పిన వాటికంటే కాస్త నెమ్మదిగా పరిగెడతాయి. అయినప్పటి ప్రతి జాతికి దాని విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి' అని శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఒక ఉపన్యాసంలో వెళ్ళడించారు.

To be continued ................

Sources -
https://www.youtube.com/watch?v=Xp3o-6OQBAY
https://www.youtube.com/watch?v=yvR-SQ90tPI
http://www.nature.com/news/one-third-of-our-greenhouse-gas-emissions-come-from-agriculture-1.11708

Friday 12 February 2016

సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి సూక్తి


దేవాలయాల నుంచి సంస్కృతి దశదిశల వ్యాపిస్తున్న తరుణంలో మన కర్మలు ఫలప్రదం, మనసులు సృజనాత్మకం, వాక్కులు పవిత్రమవుతాయి, హృదయం ఆనందంతో నిండుతుంది, మనం మంచి పౌరులువుతాము. ధర్మం మనల్ని మంచి పౌరులుగా తయారు చేస్తుంది, ఎందుకంటే అంతరంగంలో శాంతంగా ఉంటూ మన భూమిపై శాంతిని కోరుకుంటాము గనుక. శాంతి అనేది మొదటగా వ్యక్తి నుంచే వస్తుంది. ధార్మిక జీవనం, ఆరాధన, సంస్కృతి చేత మనం శాంతిని పొండకుండా ఇతరుల నుంచి శాంతిని ఆకాంక్షించడం అవాస్తవంగా ఉంటుంది.      

సద్గురు శివాయ శుభ్రమునియ స్వామిz

నేతన్నల కోసం, నేలతల్లి చలువ కోసం - ఒకసారి ఆలోచించండి

నేతన్నల కోసం, నేలతల్లి చలువ కోసం - ఒకసారి ఆలోచించండి • 1800 కు పూర్వం వరకు ప్రపంచ వస్త్ర తయారీలో భారత్ ముందుండేది. • ఇండియా ప్రపంచానికి దుస్తులు తొడిగిందని 'హౌ ఇండియా క్లాత్డ్ ద్ వరల్డ్' అనే పుస్తకంలో పేర్కొన్నారు. • ఈ రెండున్నర శతాబ్దాల్లో భూతాపం పెరగడానికి ముఖ్య కారణం చేనేత వస్త్రం పారిశ్రామిక వస్త్రంగా మార్పు చెందడమే. • ఒక మీటరు ఖాదీ తయారు చేయాలంటే కేవలం 3 లీటర్ల నీరు సరిపోతుంది. అదే ఒక జత జీన్స్ ప్యాంట్కు అవసరమైన వస్త్ర తయారు కావాలంటే 10 వేల లీటర్ల నీరు కావాలి. • అమెరికన్ బ్రాండ్ టీ షర్టు తయారు చేయాలంటే 4 వేళ లీటర్ల నీరు కావాలి. విషతుల్య పదార్ధాలను వాడాలి. • ఒక స్పోర్ట్స్ టీషర్టు వల్ల వెలువడుతున్న కాలుష్యం ఒక కారు 15 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే వెలువడే కార్బన్ మోనాక్సైడ్కు సమానం.

ఏది వాడాలో నిర్ణయించుకోండి.

Sunday 7 February 2016

హిందూ ధర్మం - 194 (గోవు ప్రాముఖ్యత - 6)

శరీరానికి కలిగే అనారోగ్యాలను తొలగించడంలో బంగారానికి కూడా ప్రాముఖ్యత ఉంది. ఎంతో జాగ్రత్తలతో స్వర్ణాన్ని భస్మం చేసి, పసిపిల్లల మొదలుకొని పెద్దలవరకు అందరికి వచ్చే వ్యాధులకు ఔషధంగా ఇచ్చే విధానం ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. ఒక్క స్వర్ణభస్మమే కాక, ఇంకా అనేక రకాల భస్మాలను సైతం తయారు చేసే విధానాన్ని ఋషులు అందించారు. దీనికి ధాతుశోధన (Metallurgy) శాస్త్రం యొక్క సంపూర్ణ విజ్ఞానమే కాదు మానవశరీరంపై ఖనిజాల ప్రభావం గురించి విజ్ఞానం కూడా అవసరం. ఈ విధానం భారతదేశంలో ఎప్పట్నుంచో ఉందంటే పూర్వకాలంలోనే మనకు ఎంత జ్ఞానం అభివృద్ధి చెందిందో అర్దం చేసుకోవచ్చు. అయితే ఈ భస్మాల మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఇది అన్ని సమయాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ కాలంలో అయితే బంగారం ధర పెరగడంతో ఈ రకమైన వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదుతో కూడిన అంశం. కానీ గోమూత్రానికున్న విశేషమిటంటే అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత కొంత భాగం శరీరానికి అవసరమైన బంగారంగా మారి, దేహంలో కలిసిపోతుంది. తద్వారా వ్యాధినివారణ జరుగుతుంది, రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ విషయం చెప్పగానే కొందరు కుహనా మేధావులు, అలా అయితే బంగారం కొనడమెందుకు, రోజు గోమూత్రం త్రాగుతుంటే శరీరమే బంగారం అవుతుందిగా! అలా అవ్వడం లేదేమీ అని వ్యంగ్యంగా విమర్శించవచ్చు. వాళ్ళు అర్దం చేసుకోవలసిన విషయం ఒక్కటే. శరీరంలోకి వెళ్ళిన తర్వాత, అక్కడ జరిగే రసాయనిక పరిచర్యల (Chemical reactions) వలన ఏ మేరకు ఏ ధాతువు శరీరానికి అవసరమో, అది ఆ మేరకు ఏర్పడుతుంది. అది కూడా దేహం జీర్ణం (Soluble) చేసుకునే విధంగానే ఏర్పడుతుంది. సంస్కృతి మీద ద్వేషాన్ని ఇలా చూపించి మీ అజ్ఞానాన్ని ప్రదర్శించకండి అని వారికి సమాధానం చెప్పవలసి ఉంటుంది.

మన చుట్టు ఉంటే వాతావరణంలో ఎన్నో విద్యుత్- అయస్కాంత తరంగాలుంటాయి. అవి నిత్యం శరీరంతో సమ్యోగం చెంది, దేహం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. అతి సూక్ష్మమైన ఈ తరంగాలు రాగి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. గోమూత్రం త్రాగడం వలన శరీరానికి తగు మోతాదులో రాగి ఖనిజం కూడా లభిస్తుంది. అందువలన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందు రోజు సూర్యస్తమయానికి పూర్వమే రాగి పాత్రలో నిలువ చేసిన నీటిని త్రాగమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. మహర్షి వాగ్భటుడు ఇత్యాది అనేక మంది సనాతనయోగులు చెప్పిన విషయం ఇది. దాని వెనుక ఉన్న రహస్యం కూడా ఇదే. రాగి పాత్రలో నిలువ చేసిన నీరు మంచి విద్యుత్-అయస్కాంత తరంగాలను తనలో గ్రహించి ఉంటుంది.

'సర్వే రోగాఃహి మందాగ్ని' అనేది సూత్రం. సర్వరోగాలకు కారణం మందాగ్ని అని, మందాగ్ని అనగా ఆకలి సరిగ్గ వేయకపోవడం, తిన్నది అరగకపోవడం. గోమూత్రాన్ని ఔషధంగా స్వీకరిస్తే మందాగ్ని సమస్య తొలగిపోతుంది.

అంతరాత్మ ప్రభోధానికి వ్యతిరేకంగా, అధర్మంగా, అన్యాయంగా పని చేయడం వలన హృదయం (ఇక్కడ చెప్పేది భౌతికమైన హృదయం - గుండె గురించి కాదు), మనసు సంకుచితం అవుతాయి. ఇదే రోగాలను కలిగిస్తుంది. కానీ గోమూత్రం సద్భావనలను కలిగిస్తుంది. అందువల్ల మనసు మంచి పనులు చేయడంలో సహాయపడుతుంది.

గోమూత్రంలో నత్రజని (Nitrogen) ఉంటుంది. అది రక్తంలోని విషాలను, లోపాలను హరిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. అందులో ఉండే సల్ఫర్ పెద్దప్రేగుల్లో కదలికలకు ఉపయుక్తంగా ఉంటుంది. రక్తశుద్ధిని చేస్తుంది. రాగి అనవసరమైన కొవ్వులను ఏర్పడకుండా చూస్తుంది. జన్యుపరంగా సక్రమైంచే కీళ్ళవాతాన్ని నివారించడంలో ఔషధంగా పని చేసే పొటాషియం కూడా గోమూత్రంలో ఉంటుంది. గోమూత్రం కండరాల బలహీనతను, బద్దకాన్ని తొలగిస్తుంది.

To be continued ..................

Source: https://cowurinebenefit.wordpress.com/2012/10/06/cow-urine-benefits/

Tuesday 2 February 2016

సద్గురు జగ్గీవాసుదేవ్ చెప్పిన కధ



నన్ను కలవడానికి వచ్చిన ఓ యువకుడు నన్నిలా ప్రశ్నించాడు. 'సద్గురూ! నాకు ఇండియాలోనే ఉండాలన్నది ఆశ. కానీ, ఇక్కడకన్నా పది రెట్లు జీతం ఎక్కువని మా అన్నయ్య అమెరికా వెళ్ళిపోయాడు. నాలాంటి యువకులకు ఇండియాలో భవిష్యత్తు లేదా?" అని.
ఈ ప్రశ్నే చాలా వేడుకగా ఉంది.

ఎండాకాలంలో శంకరన్ పిళ్ళై మకాము గ్రామానికి మార్చాడు. ఏరు పారేచోటు ఎండి ఇసుక దారిగా మారిపోయింది. అక్కడ ఒక గుడిసె వేసుకుని భార్యబిడ్డలతో కాపురం పెట్టాడు. వానాకాలం వచ్చింది. ఏరు పొంగి పారింది. అన్నిటినీ పెకలించుకు పోతున్న వరదనీరు శంకరన్ పిళ్ళై గుడిసెను కూడా వదల్లేదు. వరద పొంగు తగ్గింది. శంకరన్ పిళ్ళై ఒక్కొక్కటిగా ఏరడం మొదలు పెట్టాడు. మళ్ళీ అక్కడే గుడిసె వేశాడు.

మామూలు జీవితానికి అతనికి దాదాపు ఆరు నెలలు పట్టింది. ఆ లోపు మళ్ళీ వానాకాలం వచ్చింది . మళ్ళీ వరద.గుడిసె తునాతునకలైపోయింది. అంతా నీటిలో కొట్టుకుపోయింది. శంకరన్ పిళ్ళై ఎంతో ప్రయాసపడి చాలా నెలలకు మళ్ళీ అదేచోటు గుడిసె వేశాడు. మళ్ళీ వరద వచ్చినపుడు గుడిసె పాడైపోయింది.
శంకరన్ పిళ్ళై ఒక జ్యోతిష్యు ణ్ణి కలిసి తన జాతకాన్ని చూపించాడు. "అయ్యా! నా గుడిసె ఎన్నే ళ్ళిలా ఏరులో కొట్టుకపోతుందో చెప్పగలరా?" అని అడిగాడు.
ఏరు పారేదారిలో గుడిసె వెయ్య కూడదనే జ్ఞ్యానం ఉండి ఉంటే, శంకరన్ పిళ్ళై జోస్యుడని వెతకాల్సిన పనేలేదు కదా? శంకరన్ పిళ్ళైలాగే మీరూ నన్ను భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఎం చేయాలని ఆలోచించడానికి, మీ బాధ్యత స్వీకరించడానికి మీరు తయారుగా లేరు. అయితే, 50 ఎళ్ళ తర్వాత దేశం ఏమవుతుంది అని జోస్యం అడుగుతున్నారు. అంతేకదా!

మీలాంటి బాధ్య తారాహిత్యులు వున్నంతవరకు, మీలాంటివారుండే దేశం ఏమవుతుంది? ఎలా ఎదుగుతుంది? చీకటిని తొలగించడానికి దీపం వెలిగించకుండా 'చీకటి ఎప్పుడు పోతుంది? వెలుగు ఎప్పుడు వస్తుంది?' అని ఎవరికైనా చేయి చూపిస్తూ కుర్చోవడాన్ని తెలివిటేతలంటారా? ఏం జరుగుతోందని మిగిలిన గ్రహాల్ని చూసి లెక్క వేయడాన్ని వదిలేసి, మీరు జీవిస్తున్న గ్రహాన్ని కాస్త బాధ్యతాయుతంగా చుడండి.

ఈ భూమిలో వీధుల్ని మార్చినవాళ్ళంతా ఆయా కాలాల్లో ఉన్నవాటినీ, అవసరమైనవాటినీ గమనించి ఎంతో ప్రేమగా తమ బాధ్యతల్ని నెరవేర్చారు. 50 ఏళ్ళు లేదా 500 ఏళ్ళు లేదా 5000 ఎళ్ళ తర్వాత ఎవరైనా దీన్ని చేయకపోతారా అని వాళ్ళు ఎదురు చూడలేదు.

- సద్గురు జగ్గీవాసుదేవ్

sent by Ashwin kumar Dulluri