Tuesday 31 March 2015

బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?

బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?

చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అనుకుని క్షమించి వదలివేసింది. అంతకుమించి...మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వవిద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి. కానీ... ధర్మ పరిరక్షణకు, సమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు.
గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది. ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం. సమాజంలో తమదే ఉన్నతస్థానమని చాటుకునేందుకే బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా రూపొందించుకున్నారని, సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా. అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ, వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి.

బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే. వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు. చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి చారిత్రక ఆధారమేదైనా ఉందా? (సమైక్య భారతావనికోసం చంద్రగుప్త వౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు. చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు. అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం. వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం. కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడు). పురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా? కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది. సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు. ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం. బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి. ఆయన కిరాతుడని పురాణాలు చెబుతున్నాయి. కిరాతులు ఇప్పుడు ఎస్టీలుగా కొనసాగుతున్నారు.

మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి. భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు. బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు. మరి..ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా? వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు. ఓబిసీలు సైతం దళితులను అణగిదొక్కినవారే. కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన. బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు?

చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే? ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం. ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది. ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం. ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు? తిరువళ్లువార్ తిరుక్కురళ్‌ను ఎలా లిఖించగలిగాడు? ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా? మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా? వశిష్టుడు, వాల్మీకి, కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, మహావీరుడు, తులసీదాసు, కబీర్, వివేకానంద...వీరంతా బ్రాహ్మణేతరులే. వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా? అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ? మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే! ఆయన ఓ క్షత్రియుడు. కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు. ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి. అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే.
అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు. గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు. బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి. ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా? వారణాసి, గంగాఘాట్, హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు. పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు. ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరికి, వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు. కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు. ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? (్భరత్‌కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు. దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని). సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు. జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు.

కాశ్మీర, గాంధార దేశాల్లో (ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు) సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనా కనిపించరు. ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు ఉన్నాయా?

(పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. ఉగ్రవాదులు చేపట్టిన కాశ్మీరీ లోయ ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి తాళలేక కాశ్మీరీ పండిట్లు విలువైన తమ ఆస్తిపాస్తులనే కాదు...ప్రాణాలనూ కోల్పోయారు. ఐదు లక్షలమందికి పైగా పండిట్లు కాశ్మీర్ లోయను వదలిపెట్టి వలస పోయారు. వీరిలో 50వేలమందికి పైగా ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లోనే కాలం గడుపుతున్నారు. కాశ్మీరీ పండిట్లు ఇంత పీడనకూ, వేదనకూ గురైనా ఎన్నడైనా తిరగపడిన ఉదంతాలు ఉన్నాయా?)

భారత్‌పైకి అరబ్బు దేశంనుంచి దండెత్తి వచ్చిన మహమ్మద్ బీన్ ఖాసిం బ్రాహ్మణులంతా సున్తీ చేయించుకోవాలని షరతు విధించాడట. వారు నిరాకరించినందుకు పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు మరణశిక్ష విధించేవాడట. ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాస్తవమిది. భారత్‌పై దండయాత్రలు జరిగిన సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు. కానీ...బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు ఒక్కటీ కనబడవు.

19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ దీపావళి రోజున టిప్పు సుల్తాన్ సైన్యం మేల్కోటే ప్రాంతంపైకి దండెత్తివచ్చి 800 మందిని ఊచకోత కోసింది. మృతుల్లో అత్యధికులు మాం డ్యం అయ్యంగార్లే. సంస్కృతంలో ప్రవీణులు వారు. (ఇప్పటికీ మేల్కోటేలు దీపావళి పండుగ జరుపుకోరు). వారణాసిలో రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులనే విషయం ఎంతమందికి తెలుసు? ఢిల్లీ రైల్వే స్టేషన్లలో బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. న్యూ ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతం మంది బ్రాహ్మణులే. ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లలో పనిచేసేవారు, వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే. మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు. వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస పోతున్నారు. అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు. మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు? గత కాలపు బ్రాహ్మణ సమాజం మొత్తం పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు. వారిలో ఏ కొద్దిమంది చేతులకో రక్తం అంటి ఉండవచ్చు. వారు చేసిన తప్పులను మొత్తం బ్రాహ్మణులందరికీ అంటగట్టడం సబబేనా?

సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ ప్రపంచం ఏనాడో మరచిపోయింది. బ్రాహ్మణులు కేవలం వేదాలు, గణిత, ఖగోళ శాస్త్రాల అధ్యయనానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయుర్వేద, ప్రాణాయామ, కామసూత్ర, యోగ, నాట్య శాస్త్రాలను అభివృద్ధి చేసి మానవాళికి అందించిన ఘనత నిస్సందేహంగా వారిదే. బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే, విలువైన ఈ శాస్త్రాలన్నిటిమీద హక్కు తమదే అని చాటుకునేవారు. అతి ప్రాచీనమైన శాస్త్రాలపై తమ పేర్లు లిఖించుకుని ఉండేవారు. ‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అనే ఒకే ఒక్క ఆశయంతో మానవాళి సంక్షేమంకోసం తమ జీవితాలను త్యాగం చేశారు. అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని శిలువపైకి ఎక్కించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తోంది. ఎంత విచారకరం!

- ఉదయ్‌లాల్ పాయ్ sanskritimagazine.com 18/01/2015
ఆంధ్రభూమి దినపత్రిక నుంచి సేకరణ
http://www.andhrabhoomi.net/content/brahmalu

Sunday 29 March 2015

హిందూ ధర్మం - 152 (వేదాలు, వ్యాసమహర్షి)

వేదమనగా జ్ఞానం. జ్ఞానానికి పరిధి ఉండదు. అందునా వేదములు ఈశ్వరీయములు. అంటే భగవంతునిచే ఇవ్వబడినవి. మానవులు రాసిన విషయాలు కొంత పరిధి ఉంటుంది, కానీ అనంతుడైన భగవంతునిచే చెప్పబడిన విషయాలకు పరిధులను ఎవరు నిర్ణయించగలరు. ఇంతకముందు చెప్పుకున్నట్టుగా వేదం అనగా జ్ఞానం అని అర్దం. విశ్వానికి, విశ్వకర్తకు సంబంధించిన అపర, పర జ్ఞాన భాగమే వేదం.
-------------------------------------------------------------------------

వేదం యొక్క విస్తృతి తెలియపరచే ఒక సంఘటన ఉంది. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి, బ్రహ్మచర్యం  అవలంబించి, బ్రహ్మదేవునితో మూడుసార్లు ధీర్ఘాయువు పొందారు. నాలుగు యుగాలు (43,20,000 సంవత్సరాలు) వేయి సార్లు పునారవృతమైతే బ్రహ్మకు ఒక పగలు, ఇంకో వేయి మహాయుగాలు (అంటే 1,000*43,20,000 = 4,32,00,00,000 సంవత్సరాలు) బ్రహ్మకు ఒక రాత్రి. 8,64,00,00,000 సంవత్సరములు బ్రహ్మ దేవుడికి ఒక రోజు. అటువంటి మూడు బ్రహ్మదివసాలను (25,92,00,00,000 సంవస్తరములు) గురువు వద్ద వేదం నేర్వడానికి సరిపోక తపస్సు చేస్తే, బ్రహ్మ సాక్షాత్కరించి, 'వేదం పూర్తిగా నాకే తెలియదు. నీకు వేదరాశిని చూపుతాను, చూడు!' అని చెప్పి కోటి సూర్య్ల కాంతితో వెలిగిపోతున్న మేరుపర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడిది చూసి భయపడి, 'అయ్యో! నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో పిడికిడైనా లేదే! వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా?' అని తలిచి, 'నాకవసరమైనది మీరే నిర్ణయించండి' అని బ్రహ్మదేవునితో అంటాడు. అప్పిడి బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశిని మూడు పుడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి, 'ఇదంతా అధ్యయనం చేసేంతవరకూ నీవు జీవింతువు గాక!' అని వరమిచ్చాడు. కానీ ఆ మూడు పిడికిళ్ళ వేదాధ్యయనమే ఇంతవరకు పూర్తికాలేదు అంటూ శ్రీ నృసింహ సరస్వతీ స్వామి గురుచరిత్రలో శిష్యులకు వివరిస్తారు.
---------------------------------------------------------------------------

ఇంత విస్తారమైన వేదాన్ని గ్రంధస్థం చేయడం పెద్ద సాహసోపేతమైన చర్య. అటువంటిది ఇంత విస్తారమైన వేదాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఔపోసన పట్టినవాడు మాత్రమే వాటిని గ్రంధస్థం చేయగలడు. అతడు మేధావి, అపర ప్రజ్ఞావంతుడై ఉండాలి, వేదం మొత్తం అర్ధం చేసుకున్నవాడై ఉండాలి. అటువంటి వాడు, వేదాలను గ్రంధస్థం చేయుట కొరకు జన్మించిన కారణజన్ముడు వ్యాసమహర్షేనని ఋషిమండలి గుర్తించి, వేదాలను గ్రంధస్థం చేసే కర్తవ్యాన్ని వ్యాసమహర్షికి అందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

To be continued .................

Saturday 28 March 2015

రామాయణం మన రక్తంలో ఉంది.

రామాయణం మన రక్తంలో ఉంది.

రాముడు మనలాంటి మాములు మనిషే. రామాయణంలో రాముడు ఎక్కడా మహిమలు చూపలేదు. ఒక మాములు వ్యక్తిగా పుట్టిన వ్యక్తి దాదాపు 10,00,000 నుంచి 18,00,000 సమవత్సరాలు గడిచిపోయినా, ఇంకా అదే వైభవంతో వెలగడానికి కారణం రాముడి సత్యనిష్ట, ధర్మ నిబద్ధత.

రాముడు తన బాణాలతో 18,000 మంది కరదూషణాదులను చంపాడు కానీ తనకు అమోఘమైన శక్తి ఉన్నదని గర్వించలేదు. వాలి ప్రపంచంలో ఉన్న వానరసైన్యాన్ని ఏక తాటిపైకి తీసుకువచ్చి, సమన్వయ పరిచాడు. వాలి ఎంత శక్తివంతుడంటే, వాలికి రావణాసురుడు కూడా భయపడ్డాడు. అటువంటి వాలితో స్నేహం చేస్తే, సీతమ్మను క్షణంలో లంక నుంచి తీసుకురావచ్చని తెలిసినా, వాలి తన ధర్మం తప్పాడని అతని సాయం కోరలేదు. వాలిని చూసి భయపడుతున్న సుగ్రీవునికి అండగా నిలబడ్డడు. వాలిని చంపి, రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పజెప్పాడు కానీ తాను రాజ్యంలో కొద్ది భాగం కూడా తీసుకోలేదు.

శత్రువు తమ్ముడైనా, తనను శరణు వేడుకున్నాడని విభీషణుడికి గౌరవం ఇచ్చాడు, స్నేహం కుదిరిని వెంటనే విభీషణునికి లంకాధిపతిగా సముద్రజలాలతో పట్టాభిషేకం చేశాడు శ్రీ రాముడు. అప్పుడు అక్కడున్న వారికి ఒక ప్రశ్న తలెత్తింది. విభీషణుడు శరణుజొచ్చాడని అతనికి పట్టాభిషేకం చేశావు, మరి రేపు రావణుడు శరణు వేడితే ఏం చేస్తావు రామా?! అని అడిగారు అక్కడున్న వారు. నేను ఆడినమాట తప్పను, అదే జరిగితే, విభీషణుడిని అయోధ్యకు రాజును చేస్తాను అన్నాడు. ఇంత ధైర్యంగా ఈ మాటను ఎవరు చెప్పగలరు ఒక్క మన రాముడు తప్ప!

రామరావణ యుద్ధం అప్పట్లో ఒక ప్రపంచ యుద్ధంగా చెప్పచ్చు. రావణుడు సమస్తప్రపంచాన్ని హడలుగొట్టిన వీరుడు. అటువంటి రావణుడితో యువకుడైన రాముడు  పోరాటం చేయడానికి పూనుకోవడం, అది కూడా వైరంతో కాదు, తన భార్య కోసం ............... ఒక చారిత్రాత్మిక సంఘటన. రాముడు అందగాడు, రాకుమారుడు, ఆజానుబాహుడు, తను కోరుకుంటే ప్రపంచంలో ఉన్నా సుందరీమణులందరూ రాముడిని వివాహం చేసుకోవాడానికి సిద్ధపడతారు. అయినా, కట్టుకున్న భార్యను కాపాడటం భర్త విధి. ధర్మార్ధకామాలలో నేను నీ చేయి విడిచి పెట్టను అని వివాహసమయంలో చేసిన ప్రమాణాన్ని గట్టిగా పాటించి, లోకానీకి మార్గం చూపినవాడు శ్రీ రాముడు.

తన భార్య కోసం రావణుడితో భీకరయుద్ధానికి సిద్ధమయ్యాడు. అది మాములు యుద్ధం కాదు, అందులో అణ్వస్త్రాలు (న్యూక్లియర్ వెపన్లు), మిస్సైల్స్, రాడర్లకు అంతుచిక్కని విధంగా తయారు చేయబడిన యుద్ధ విమానాలు మొదలైనవి రావణుడి చెంత ఉన్నా, వాటికి బెదరలేదు శ్రీరాముడు. ఎదురించి, యుద్ధం చేసి గెలిచాడు, రావణుడి చెంత బంధీలుగా ఉన్నా ఎందరో స్త్రీలను విడిపించాడు, సీతమ్మను గ్రహించాడు. ఇంత చేసినా, లంక నుంచి రూపాయి తీసుకోలేదు, రాజ్యంలో వాటా అడగలేదు. లంకలో ధర్మస్థాపన చేసి, విభీషణుడిని లంకాధిపతిని చేశాడు.

అప్పటికి రాముడికి రాజ్యం మీద ఆసక్తిలేదు. భరతుడి మనసు మారిందేమో, భరతుడు రాజ్యపరిపాలన చేయాలనుకుంటున్నాడేమో, ఒక వేల అదే నిజమైతే, తాను తన జీవితాన్ని అడవిలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ పరిస్థితి చూసి రమ్మని హనుమను పంపారు, భరతుడు రాముడి రాక ఆలస్యమైందని ఆత్మాహుతికి సిద్ధం అవుతున్నాడని తెలుసుకుని, తన తమ్ముడి ప్రాణం కోసమే రాముడు అయోధ్య చేరాడు.

ఒక్కసరి చరిత్ర గమనిస్తే మన దేశం మీద ఎందరో దాడి చేశారు, సంపదను దోపిడి చేశారు, సంస్కృతిని నాశనం చేశారు, చరిత్ర మొత్తం క్రైస్తవ, మహమ్మదీయ అకృత్యాలే కనిపిస్తాయి. కానీ చరిత్రలో ఎప్పుడైనా హిందుస్థాన్(భారత్) ఏ దేశం మీదనైనా దందయాత్ర చేసిందా? ఏ దేశసంపదనైనా దోచుకుందా? రాముడి డి.ఎన్.ఏ మనది. అందుకే దోచుకోవడం, దోపిడి చేయడం, దండయాత్ర చేయడం మన హిందూ చరిత్రలో లేదు. ఇతర దేశాల్లో వారి ధర్మస్థాపన కోసం కలగజేసుకోవాలి. వారి దేశసంస్కృతిని మనం కాపాడాలి, అది నేపాల్ అయినా, టిబెట్ అయినా, లేక మరే ఇతరదేశమైనా. అంతవరకే మన కర్తవ్యం. అదే మనకు రాముడు నేర్పాడు. రాముడు, రామాయణం మన రక్తంలో ఉన్నాయి.

Originally posted: 0-April-2014
1st Edit: 28-March-2015

Friday 27 March 2015

శ్రీ రామ నవమి

* శ్రీ రామ నవమి*
************************
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు  భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.


ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. మద్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ రాముడి కల్యాణం జరుగుతుంది. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు.

సేకరణ: Sahana Meenakshi​ గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో

*ఆయుర్వేద రహస్యం *
*******************************
ఈ రోజు బెల్లం, మిరియాలు కలిపి చేసిన పానకం, వడపప్పు (నానపెట్టిన పెసరపప్పు) నివేదన చేయాలి. దీనికి ఆయుర్వేదంలో ప్రాశస్య్తం ఉంది. రామనవమి వసంత నవరాత్రుల్లో చివరి రోజున చేస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు శిస్రఋతువు ముగుసి వసంతఋతువు ప్రారంభంలో వస్తాయి. ఋతువుమార్పు వలన ప్రజల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. పానకంలో వేసే మిరియాలు ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబులను నివారిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాని మిరియాలకు వేడిని కలిగించే లక్షణం ఉంది, దానికి విరుగుడుగా బెల్లం నీళ్ళు, వడపప్పు పెడతారు. ఇవి చలువ చేస్తాయి. పెరుగుతున్న ఎండల నుంచి తట్టుకోవాలంటే చలువ చేసే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అందుకోసమే వడపప్పు, పానకం నివేదన. కనుక శ్రీరామనవమి రోజు తప్పకుండా వడపప్పు, మిరియాలతో చేసిన బెల్లం పానకం తీసుకోవడం వలన రామనుగ్రహంతో పాటు ఆరోగ్యం రక్షించబడుతుంది.

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు 

Thursday 26 March 2015

లక్ష్మణ స్వామి మనకు ఆదర్శం


ఓం శ్రీ రామాయ నమః

సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయిన తరువాత రామలక్ష్మణులు ఆమెను వెతుకుతూ ఋష్యమూక పర్వతం వద్దక చేరడం, హనుమంతుడితో సంభాషణ తరువాత సుగ్రీవుడిని కలవడం జరుగుతుంది. రావణుడు సీతను ఎత్తుకుపోయే సమయంలో పర్వత శిఖరం మీద సుగ్రీవుని గమనించిన సీతమ్మ, తన చీరలో కొద్ది భాగం చింపి, తన ఆభరణాలను అందులో మూట కట్టి సుగ్రీవునికి వద్ద పడేలా విసిరేస్తుంది. ఆ ఆభరణాలను సుగ్రీవుడు రాముడికి చూపగా, రాముడు వాటిని తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడుస్తాడు.

వాటిని లక్ష్మణుడికి చూపి 'లక్ష్మణా! చూడు, ఈ ఆభరణాలు సీతవే. సీతే వీటిని విడిచి ఉండవచ్చని నాకు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, నువ్వూ ఓసారి పరీశీలించి చెప్పు ' అంటాడు.

అప్పుడు లక్ష్మణుడు

నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే |
నూపురే తు అభిజనామి నిత్యం పాద అభివందనాత్ ||  

చేతికడియాలు, చెవి దుద్దుల సీతమ్మవో కావో నాకు తెలియదు. నేను ఎప్పుడు సీతమ్మ పాదాలకే వందనం చేసేవాడిని అన్నయ్య, కనుక కాళ్ళకు సంబంధించిన నూపురములు(కడియాలు) మాత్రం ఖచ్ఛితంగా సీతమ్మవే అన్ని చెప్పగలను అంటాడు. సీతమ్మను తల్లిగా భావించిన లక్ష్మణస్వామి, ఎప్పుడు సీతమ్మ పాదాలే చూస్తూ మాట్లాడేవాడు. ఈ సంఘటన వనవాసానికి వచ్చిన కొత్తలో జరగలేదు, సీతరామలక్ష్మణులు 13 ఏళ్ళు వనవాసం చేశాక జరిగిన సంఘటన ఇది.

భార్య తప్ప ఇతర స్త్రీలను తల్లిలా చూసిన మహోన్నత సంస్కృతి మనది. స్త్రీని తల్లిగా చూసిన సంస్కృతి హిందువులది. కానీ ఈ రోజు మనం రామాయణం మర్చిపోయాం, అందులోని విలువలు మర్చిపోయాం. పిల్లలకు ఇటువంటి విషయాలు చిన్నవయసులో చెప్పకపోవడం వల్లే, ఎందరో ఉన్మాదులుగా తయారయి స్త్రీల మీద అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా మనం మీద రామానుగ్రహం కలిగి మనలో మంచి సంస్కారాలు కలగాలని రాముడిని వేడుకుందాం. ఇటువంటివి తల్లిదండ్రులు పిల్లకు చెప్పి, వారిలో మంచి సంస్కారాలు కలిగించాలి. 

ఓం శ్రీ రామాయ నమః
Originally posted: April 2013
1st Edit: 05-April-2014
2nd Edit: 26-March-2015

Wednesday 25 March 2015

రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు ఆదర్శం కావాలి.

ఓం శ్రీ రామాయ నమః

అన్నదమ్ముల అనురాగబంధం అంటే ఏలా ఉండాలో రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు బాల్యంలోనే మనకు చూపించారు. నలుగురు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు.

లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదు. రాముడు లేకుండా లక్ష్మణుడు తినేవాడు కాదు. తల్లి కౌసల్య వద్దకు రాముడు వచ్చి 'అమ్మా! ఈ రోజు ఆటలో తమ్ముడు భరతుడు గెలిచినందుకు ఆనందంగా ఉంది ' అని చెప్పేవాడు. అలాగే భరతుడు, కౌసల్యతో 'అమ్మా! అన్నయ్య నన్ను గెలిపించడం కోసం తాను ఓడిపోయాడు. అందుకు నాకు బాధగా ఉంది ' అనేవాడు. ఒకరి ఆనందం కోసం మరొకరు పడిన ఆరాటాన్నీ, అన్నదమ్ముల ప్రేమను చూసి కౌసల్య ఉప్పొంగిపోయేది.

అన్నయ్య అభ్యుదయాన్ని చూసి తమ్ముడు అసూయ చెందకుండా, తమ్ముడి ప్రగతిని చూసి అన్నయ్య ఈర్ష్య చెందకుండా, ప్రేమానురాగాలతో జీవించాలంటే నాలుగు వేదాల లాంటి ఈ నలుగురు అన్నదమ్ములు మనకు ఆదర్శం కావాలి.

సేకరణ : శ్రీ రామకృష్ణ ప్రభ

ఓం శ్రీ రామాయ నమః

Originally posted: April 2013
1st Edit: 04-April-2014
2nd Edit: 25-March-2015

Monday 23 March 2015

భగత్‌సింగ్ - శ్రీ రాజీవ్ దీక్షిత్‌గారి ఉపన్యాసం

23 మార్చి, భారతీయ యోధులు, అమరవీరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భగత్‌సింగ్‌లను ఉరితీసిన రోజు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించడానికి సరిగ్గా 90 సంవత్సరాలకు పూర్వం 1857లో భారతీయులు ఆంగ్లేయులకు ఎదురు చేసి, ఆంగ్లేయుల తలలు నరికి, 300 పట్టణాలకు స్వాతంత్రం సాధించగలిగారు. ఇది భారతీయ తొలి స్వాతంత్ర సంగ్రామం. కానీ స్వార్ధపరులైన కొందరు రాజుల కారణంగా భారతదేశం తిరిగి తెల్లదోరల పాలనలోకి వెళ్ళిపోయింది. బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంపై అధికారం సంపాదించింది. ఈ తొలి స్వతంత్ర సంగ్రామం చూసి నివ్వెరపోయిన ఆంగ్లేయులు భారత్‌ను పాలించాలంటే, కొత్త చట్టాలను చేయాలనీ, అప్పటివరకు దేశంలో అమలులో ఉన్న భారతీయ విద్యా విధానాన్ని నాశనం చేసి, బానిస విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా భారతీయులను అణిచివేయడానికి ఆంగ్లేయులు చేసిన ఒక చట్టం ఇండియన్ పోలిస్ యాక్ట్.

ఈ దేశంలో నిరసన తెలిపినవారిని నిరంకుశంగా కొట్టినా, చావబాదినా, ఆఖరికి చంపినా, అది తప్పు కాదని చెప్తూ, తాము చేస్తున్నా అత్యాచారాలను, అఘాయిత్యాలను, అక్రమాలను చట్టం మాటున సక్రమం చేయడమే దీని లక్ష్యం.

అటు తరువాత భారతదేశంలో కొత్తగా చేయాల్సిన చట్టాల గురించి అధ్యయనం కోసం సైమన్ కమీషన్‌ను నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ కమీషన్‌కు వ్యతిరేకంగా స్వాతంత్ర సమరయోధులలో ప్రముఖుడైన లాలా లజపతి రాయి గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. అక్కడున్న పోలీసు అధికారి లాలాలజపతిరాయ్ గారిపై దారుణంగా దాడి చేశారు. లాఠీతో తలపి బాదారు. ఒక్కసారి కాదు, దాదాపు 14-15 సార్లు, రాయ్ గారి తలపగిలేవరకు. రాయి్‌గారిని ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది, వారు మరణించారు. ఈ సంఘటన చూసిన భగత్‌సింగ్ బాధపడి, ఆ పోలీసు అధికారిపై వర్య తీసుకోమని కోర్టులో కేసు వేశాడు. ఎవరైనా మనిషిని శరీరం మీద కొడతారు కానీ, తలపై లాఠీతో కొట్టడం తప్పని భగత్‌సింగ్ వాదించినా, చట్టం ప్రకారం పోలీసులు ఏమైనా చేయచ్చు, అందులో తప్పులేదని కోర్టు తీర్పు ఇచ్చి, ఆ సదరు అధికారి నిర్దోషి అని ప్రకటించింది.

కోర్టు న్యాయం చేయకపోతేనేమి, నేను చేస్తాను అని యువుకుడైన భగత్‌సింగ్ ఆ అధికారిని చంపేశాడు. అటు తరువాత చాలా జరిగింది, భగత్‌సింగ్‌కు ఉరుశిక్ష విధించారు. ఉరి శిక్షకు గురైన భగత్‌సిగ్‌ను కలవడానికి అనేకమంది జనం జైలుకు వస్తూండేవారు. వారితో భగత్‌సింగ్ చెప్పిన ఆఖరి కోరిక 'నేను ఎలాగో మరణిన్సితున్నాను, ఈ దేశానికి స్వతంత్రం వచ్చేలోపు అనేక మంది భారతీయుల మరణాలకు కారణమైన ఈ ఇండియన్ పోలిస్ యాక్ట్ చట్టాన్ని తొలగించాలి' అని కోరుకున్నాడు. భారత్‌కు స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా అదే చట్టం దేశంలో అమలవుతోంది. కనీసం సవరణలు కూడా చేయలేదు మన పాలకులు. ఇదా మనం భగత్‌సింగ్‌కు ఇచ్చే నివాళి?

సేకరణ: శ్రీ రాజీవ్ దీక్షిత్‌గారి ఉపన్యాసం

ఇక భగత్‌సింగ్ గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. భగత్‌సింగ్ కమ్యూనిస్ట్ కాదు. కమ్యూనిస్టులే భగత్‌సింగ్‌ను హిజాక్ చేశారు, గాంధీని కాంగ్రెస్ హైజాక్ చేసినట్టు........... మన రాష్ట్రానికి చెందిన ఒక ఐ.పీ.యస్. ఈ విషయమై తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన భగత్‌సింగ్ కుటుంబ సభ్యునితో మాట్లడి తెలుసుకున్న విషయం ఏమిటంటే భగత్‌సింగ్‌లో జాతీయవాదానికి కారణం మాన్యులు, ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద్ సరస్వతి గారని, దయానందుని స్వతంత్ర కాంక్ష చేత భగత్‌సింగ్ ప్రభావితం చెందారు. భగవద్గీత కూడా భగత్‌సింగ్‌పై ఎనలేని ప్రభావాన్ని చూపింది.ఒకరకంగా చెప్పాలంటే భగత్‌సింగ్ నాస్తికుడు కాదు, పూర్తి ఆస్తికుడు.

అదేకాకుండా ప్రముఖ హిందూజాతియవాది వీర్ సర్వార్కర్ గారిని రత్నగిరిలో కలిసారు. వారి రాసిన  First ever war of Indian Independence పుస్తకం కూడా భగత్‌సింగ్‌పై అమితమైన ప్రభావాన్ని చూపించింది.

జోహార్ భగత్‌సింగ్
వందేమాతరం
జై హింద్

Originally Posted: 23-03-2014
1st Edit: 23-03-2015

Sunday 22 March 2015

మార్చి 22, ప్రపంచ జల దినోత్సవం


అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలవర్ణంతో కనిపించడానికి కారణం నీరు. భూభాగంలో నీటి వనరులు 75% వరకు ఉన్నాయి.

భూగోళం మీద ఉన్న నీటి వనరులలో 99 % ఉన్నది ఉప్పు నీరే. ఇది 97% సముద్రాల్లోనే ఉంది. మిగితాది నదులు, చెరువుల్లో ఉంది. త్రాగడానికి పనికోచ్చే శుద్ధ జలాలు కేవలం 1% మాత్రమే ఉన్నాయి. అందులో 0.86% చెరువుల్లో , 0.02% నదుల్లో ఉండగా మిగిలినవి భూగర్భ జలాలు. అంటే ప్రపంచ వ్యాప్తంగా 0.3% త్రాగడానికి ఉపయోగపడే నీరుమాత్రమే మనకు అందుబాటులో ఉంది.

ఈ శుద్ధ నీటి వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 కోట్ల జనాభ దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి. పరిశ్రమలకు, కర్మాగారాలకు ఉపయోగపడుతున్నాయి. ఎన్నో జీవాలకు బ్రతుకునిస్తున్నాయి.

భారతదేశంలో సింధు-సరస్వతీ నాగరికత, ఈజిప్టులో నైలు నదీ తీరంలో  నాగరికత ఇలా ప్రపంచ చరిత్రలో అనేక నాగరికతలు నదీ తీరాల్లో, నీటి వనరులకు సమీపప్రాంతంలో వైభవోపేతంగా విలసిల్లాయి. మన చరిత్రంతా జలవనరులతోనే ఉన్నది.

జీవం నీటిలోనే మొదలైంది. ప్రకృతి నీటితోనే నడుస్తోంది. అభివృద్ధి జరగాలంటే నీరు కావాలి. జీవవైవిధ్య రక్షణకు నీరు అవసరం. నీటితోనే జీవం సాధ్యమవుతుంది.


ఇవన్నీ మనకు తెలుసు కానీ మనం చేస్తున్నదేంటీ? ఈరోజు జరుగుతున్నదేంటీ? నీరును వృధా చేస్తున్నాం. కలుషితం చేస్తున్నాం. విషతుల్యం చేస్తున్నాం. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది త్రాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే, ఉన్న నీటిని వృధాగా నేల పాలు చేసేస్తున్నాం. నీటి వనరులలో చెత్తచెదారం కలిపి త్రాగడానికి ఉపయోగపడకుండా చేస్తున్నాం, చేసుకుంటున్నాం.   

మనం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు 2050 నాటికి ప్రపంచపరిస్థితిని అంచనా వేసారు. 2050 నాటికి ఈ ప్రపంచంలో త్రాగడానికి పుష్కలమైన జలం ఉండనే ఉండదని, స్నానాలు చేయడం మానేసి జనం శరీరానికి రసాయనికలేపనాలు పులుముకుంటారని, కెమికల్ బాత్ చేస్తారని, సరిహద్దుల్లో ఉండవలసిన సైన్యం నీటి వనరుల చుట్టు కాపలా ఉంటారని, తలంటు కోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడి గుండుతో జీవిస్తారనీ, స్త్రీపురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుందని, ఇంకా ఇలాంటి అనేక భయానకమైన విషయాలను తన ప్రెసంటెషన్‌లో ఉంచారు.

భారతీయులమైన మనకు నీటి విలువ కాబట్టే నీటిని గంగమ్మ అంటూ పూజిస్తాం, నదులకు, చెరువులకు, జలాశయాలకు హారతులిస్తాం.

నారము అంటే నీరు. నీటి యందు ఉంటాడు కనుక శ్రీ మహావిష్ణువుకు నారాయణుడు అని పేరు. నీటినే రూపంగా స్వీకరించి విష్ణువు నీటి విలువను చెప్తున్నాడు.

శివుడు ఏకంగా గంగను తల మీద ధరించి గంగాధరుడయ్యాడు. నీరు పారబోయవలసినది కాదు, నెత్తిన పెట్టుకుని పూజించవలసినదని సమస్త మానవాళికి సందేశం ఇస్తున్నాడు.

నీటిని వృధా చేయడం సృష్టికి వ్యతిరేకం. భగవత్తత్వానికి వ్యతిరేకం. సమస్త ప్రాణకోటికి వ్యతిరేకం. నీటిని కాపాడాలి, ప్రతి నీటి బొట్టు విలువైనదే.


ఆలోచించండి. 0.3% మాత్రమే ఉన్నాయి శుద్ధనీటి వనరులు. ఇప్పటికే చాలా భాగం కలుషితమయ్యాయి. పూర్తిగా కలుషితమైతే మనకు దిక్కేది? మన వారసులకు మనం ఇచ్చేదేంటి?

చిన్న చిన్న జాగ్రత్తలతో ప్రతి ఒక్కరు చాలా శాతం నీటి వృధాను అరికట్టవచ్చు. అందరూ పాటిస్తే కొన్ని కోట్ల లీటర్ల నీటి వృధా అరికట్టబడుతుంది.

రండి! నీటిని, తద్వారా జీవాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకుందాం. ప్రతి నీటి చుక్క విలువైనదే.

మార్చి 22, ప్రపంచ జల దినోత్సవం. నీటి వనరుల రక్షణ గురించి జనంలో చైతన్యం తెద్దాం.             

Originally published: 21-03-2013
1st Edit : 20-03-2014
2nd Edit : 21-03-2015

హిందూ ధర్మం - 151 (ఋషుల అత్యవసర సమావేశం)

మహాభారత యుద్ధం నాటికి వర్ణవ్యవస్థ మాత్రమే ఉండేది. కులవ్యవస్థలేదు. ఆ యుద్ధంలో ఎందరో యోధులు, వేదశాస్త్రాలను అభ్యసించిన పండితులు, అనేక నాగరికతలకు మూలపురుషులు, అనేక రాజ్యాల రాజులు పాల్గొన్నారు. అందులో వేదసారాన్ని ప్రచారం చేసిన పండితులు కూడా ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా వారందరూ మరణించారు. అదీగాక, యుద్ధంలో వాడిన అస్త్రాలు పడి చాలా రాజ్యాలు తుడిచిపెట్టుకొని పోయాయి. అప్పటివరకు వేదం గ్రంధస్థం కాలేదు. ఆ యుద్ధం సమయానికి దాదాపు 197,29,43,963 సంవత్సరాలకు ముందు వేదం మానవాళికి ఇవ్వబండింది. అప్పటినుంచి పరంపరగా, ఎక్కడా ఆటంకం లేకుండా గురుశిష్యపరంపరగా వచ్చింది. కానీ ఈ యుద్ధం ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. భారతదేశంలో రోడ్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇదంతా చూసిన ఋషులు, మునులు తీవ్ర ఆలోచనలో పడ్డారు. 'ఋషిః ఆ క్రాంతి దర్శనః' - భవిష్యత్తును దర్శించగలవారిని ఋషులు అంటారు. మానవజాతి మూలపురుషులైన ఋషులు ప్రపంచ భవిష్యత్తును గమనించారు.

అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఋషులందరూ భరతభూమికి తరలివచ్చారు. తొలిసారిగా 88,000 మంది మహర్షులతో భారతదేశంలో ఒక పెద్దసమావేశం జరిగింది. అది ఒకరకంగా అత్యవసరసమావేశం లాంటిదే. ప్రపంచభవిష్యత్తుపై మేధోమధనం జరిగింది. అది ఒక యజ్ఞం లాంటిది, అనేకులు దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. యుద్ధం ద్వాపరయుగాంతం యొక్క ప్రభావ ఫలితమే. అందుకే అంతపెద్ద జనవినాశనం సంభవించింది. శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణంతో ద్వాపరయుగాంతం అవుతుంది. అప్పుడు ప్రపంచాన్ని ఒక మహాజలప్రళయం ముంచెత్తుంతుంది. ప్రపంచనాగరికతలన్నీ నాశనమవుతాయి. అసలే వేదంలో ఉద్దండులైన వారందరూ యుద్ధం కారణంగా మరణించారు, వేదం నశించకపోయినా, వేదం తెలిసినవారందరూ నశించారు. వేదం నిరంతరం అధ్యయనం చేయాలి, అప్పుడే మానవజాతి పురోగమిస్తుంది, ప్రపంచం శాంతి మార్గంలో ప్రకృతి నియమాలకు లోబడి అభివృద్ధి చెందుతుంది. అందరూ రక్షించబడతారు. ................ రాబోయేది కలియుగం. ప్రజల్లో అధ్యాత్మిక భావన తగ్గిపోతుంది, నాస్తికం, దురాచారం, అధర్మం ప్రభలుతుంది. అప్పటివరకు శరీరంతో ఉన్న రాక్షసులు ఈ యుగంలో మానవ మనసుల్లో తిష్టవేస్తారు. వర్ణాశ్రమ ధర్మాలు మంటగలుస్తాయి. కొత్త మతాలు, వాదాలు పుట్టి జనాలను పక్కదారి పట్టిస్తాయి. అప్పటివరకు సమాజంలో సంచరించిన ఋషులు, మునులు ఇవి చూడలేక సమాజానికి దూరంగా తపస్సులో మునిగిపోతారు. ఎప్పుడో ఒకసారి ఒక మహానుభావుడికి దర్శనం ఇచ్చి, ధర్మరక్షణకు పురికొల్పుతారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే  ఈ కలియుగంలో మానవుల ఆయుర్దాయం చాలా తక్కువ, కేవలం 120 సంవత్సరాలు మాత్రమే. అది కూడా సక్రమంగా వాడుకోరు. పైగా అల్పబుద్ధులు, అనంతమైన వేదాన్ని ధారణలో నిలుపుకోలేరు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని గ్రంధస్థం చేయవలసిన అవసరం ఏర్పడింది అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.. అది మహాసాహసకృత్యం, అప్పటివరకు ఎవరు చేయడానికి పూనుకోనిది.

To be continued ................

Saturday 21 March 2015

21 మార్చి ప్రపంచ అటవి దినోత్సవం

అలకనంద .. హిమాలయాల్లో ఒదిగిన అందాల లోయ. కాలం కన్నుకుట్టుకునేంతటి ప్రకృతి మాయ. ఆ లోయలో ప్రతి సెలయేరు, చెట్టుగట్టు, ఎగుడూదిగుడు ఆ కుర్రాడికి సుపరిచితం. అప్పట్లో ఆ ప్రాంతంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో భాగం. ఆ కుర్రాడు ఒకసారి అమ్మతో 'రుద్రనాధ్' ఆలయానికి వెళుతూ ఆల్‌పైన్ వృక్షాల తోటను చూశాడు. 'అబ్బ ....... ఎంత అందంగా ఉన్నాయో!' అనుకుంటూ అటువైపు పరుగు మొదలుపెట్టడంతోనే .....

'ఆగు ...!' అంటూ అరిచింది అమ్మ.
'ఏమిటీ?' అన్నట్టు చూశాడీ కుర్రాడు.
'అటువైపు చెప్పులతో వెళ్ళకు, పువ్వులు నలిగిపోతాయ్, పువ్వలంటే దేవతలురా ...!' ఆదేశించింది అమ్మ.

పర్వత ప్రాంత ప్రజలకు ప్రకృతంటే ఎంత ఆరాధనో ఉందో తెలిపే సంఘటన ఇది. పర్యావరణ పరిరక్షణ వంటి పెద్దపదాలు తెలియకున్నా సామాన్యులకు - ప్రకృతికి మధ్యనున్న సమన్వయం గురించి చెప్తుందీ సంఘటన. అది ఆ పిల్లాడిలో చాలా మార్పు తీసుకువచ్చింది, చిప్కో ఉద్యమానికి దారి తీసింది. గిరిజనులకు, అడవి మీద ఆధారపడి జీవించేవారికి అడవంటే కేవలం చెట్లు, పుట్టలే కాదు, అది వారికి తల్లి, అడవితల్లి. అటువంటి అడవితల్లి ఇప్పుడు ప్రమాదంలో పడింది.

పక్షి, జంతు జాతులకు నివాసాలు వనాలు. అరుదైన వృక్షసంపదకు, వనమూలికలకు ఆవాసాలు, నదీనదాలుకు ఆవిర్భావ స్థలాలు అడవులు. అడవులు భూమాతకు ఊపిరితిత్తుల వంటివి. జీవవైవిధ్యానికి పట్టుకొమ్మలు అడవులు.

జీవుల నుంచి విడుదలయ్యే కార్బన్-డై-ఆక్సయిడ్ ను పీల్చుకుని, చక్కని ఆక్సిజెన్ ను మనకందించి మన జీవనానికి తోడపడుతున్నాయి చెట్లు. చెట్లె లేకపోతే ప్రతి రోజు విడుదలయ్యే కొన్ని కోట్ల టన్నుల కార్బన్-డై-ఆక్సైడ్ భూమికి భారమవుతుంది. ఫలితంగా ఉష్ణొగ్రతలు పెరిగి భూతాపం మరింత పరుగుతుంది. మానవ మనుగడ ప్రశార్ధకం అవుతుంది. చెట్లు, అడవులు లేని మన జీవనాన్ని ఊహించలేం.

వర్షాలు పడి వరదలు వస్తే, సారవంతమైన మట్టి వర్షపు నీటికి కొట్టుకుపోకుండా ఆపుతున్నవి చెట్లు/అడవులే. చెట్లు, అడవులు లేకపోతే భూమి తన సారం కోల్పోయి, ఎడారిగా మారిపోతుంది. మానవ జీవనం దుర్భరమవుతుంది.

పచ్చని చెట్లు భూగర్భజలాలను పట్టి ఉంచుతాయి. సూర్యుడి కిరణాలు డైరెక్టుగా నేలమీద పడకుండా అడ్డుకుని భూమి తేమను కోల్పోకుండా కాపాడుతున్నాయి చెట్లు. చెట్లు లేకపోతే భూగర్భజలాలు అడుగంటిపోతాయి.

మనిషికి మానసికంగా అభివృద్ధి చెందాలంటే మెదడు సక్రమంగా పని చేయాలి, మెదడుకు రక్తప్రసరణ బాగా జరగాలి. రక్తప్రసరణ బాగా జరగాలంటే ఆక్సిజెన్ కావాలి. చెట్లను నరికేస్తే మనకు ఆక్సిజెన్ ఎక్కడిది? చెట్లను నరికేయడం అంటే మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడం అవుతుంది, మానవుడి ఉన్నతి ఆగిపోతుంది.

అడవులు నరికేస్తే ఏమవుతుందిలే అనుకోవచ్చు. ఈ ప్రకృతిలో ప్రతి జీవికి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉంటుంది. దేనికి హాని కలిగినా, అది అన్నిటి మీద ప్రభావం చూపుతుంది. పెద్దవాళ్ళకు గుర్తుండే ఉంటుంది. కోస్తాంధ్రా తీరప్రాంతం 1977 లో భయానకమైన తుఫానును చవిచూసింది. దివిసీమ మొత్తం స్మశానంలా మారిపోయింది. తీర ప్రాంతమంతా అతలాకుతలం అయింది. దానికి కారణం ఏమిటో తెలుసా? తీరప్రాంతంలో ఉన్న మడ అడవులను నాశనం చేయడమే. మడ అడవులు ప్రకృతి ఏర్పరుచుకున్న కంచుకోటలు. అవి దట్టంగా ఉన్నంతవరకు తుఫాన్ల ప్రభావం తీరంపై ఉండదు. వాటికి తుఫానలకు సంబంధం ఉంటుంది. ఎప్పుడు మడ అడవులు నరికేసినా, అప్పుడు భీకరతుఫానలు పుట్టి వేల జనాన్ని నశింపజేస్తాయి.

ప్రతి ఏటా రాష్ట్రంలో తుఫాను రావడం, భారీ నష్టం ఏర్పడడం, నష్టపరిహారం కోసం రాజకీయం చేయడమే తప్ప, శాశ్వతమైన పరిష్కారం కోసం మన రాజకీయ నాయకులు పట్టించ్కోవడం లేదు. తీరం నుంచి 1-2 కిలోమీటర్ల మేర మడ అడవులను పెంచితే, నష్టం నివారించవచ్చు.

కానీ ఈ రోజు జరుగుతున్నదేంటి? ప్రపంచవ్యాప్తంగా చెట్లను నరికేస్తున్నాం. ప్రతి ఏటా 13 మిలియన్  హెక్టార్ల అటవిసంపదను నాశనం చేసేస్తున్నాం. రోజు సగటున 100 పైగా అరుదైన ఆయుర్వేద వనమూలికలు అంతరించిపోతున్నాయని అంచనా. అడవులు నరికివేయడం వలన ఆవాసం కోల్పోయిన వన్యప్రాణులు పల్లెలు, పట్టణాల్లోకి వచ్చి జనం చేతులో చచ్చిపోతున్నాయి. దీనికి తోడు మానవుడి అత్యాశ, ముందు చూపు లేని అభివృద్ధి నమూనా కారణంగా అక్రమ రవాణా, మైనింగ్ పేరిట ఎంతో విలువైన అటవి సంపద తరిగిపోతోంది. ఇది మానవుడు చేస్తున్న అతి పెద్ద వినాశనం. మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం.

జరుగుతున్నదంతా అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతో, జనంలో చైతన్యం రావాలనే  21 మార్చి ని ప్రపంచ అటవి దినోత్సవంగా ప్రకటించారు. మనం కాస్త ఆలోచించాలని, మన పంధాను మార్చుకోవాలని
గుర్తుచేస్తోంది ప్రపంచ అటవి దినోత్సవం.

మరి మన బాధ్యత ఏమిటి? మన పరిసరాలలో చెట్లను పెంచాలి. సముద్ర తీర ప్రాంతంలోనూ, నగరాల్లో, గ్రామాల్లో ప్రజలంతా ఐక్యంగా చెట్లు నాటి సామాజికవనాలను అభివృద్ధి చేసుకోవాలి. తరగిపోతున్న అటవీ సంపదను రక్షించడానికి, అటవీ సంపద అక్రమరవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసి అమలు పరచాలి. అన్నిటికన్నా ముందు ప్రజలు చైతన్యవంతులై ఉన్న చెట్లను, అడవులను రక్షించుకోవాలి.పర్యావరణానికి హాని చేసేది ఏదైన సరే, ప్రజలు తిరస్కరించాలి.

Originally Published: 20-March-2013
1st Edit: 20-March-2014
2nd Edit: 21-March-2015

ఉగాది మనకిచ్చే సందేశం ఏమిటి?

ఉగాది మనకిచ్చే సందేశం ఏమిటి?

షడ్రుచుల(6 రకాల రుచుల) సమ్మేళనం ఉగాది పచ్చడి. అవే చేదు, తీపి, వగరు, ఉప్పు, పులుపు, కారం. దీనిని మనం దైవప్రసాదంగా స్వీకరిస్తాం. జీవితం కూడా అంతే. జీవితంలో అన్ని సుఖాలే ఉండవు, అన్నీ దుఃఖాలే ఉండవు. అన్ని భావాలు ఉంటేనే అది పరిపూర్ణమైన జీవితం అవుతుంది. మన జీవితంలో వచ్చే కష్టాల నుండి మన పాఠాలు నేర్చుకుంటే ఉన్నతస్థానానికి వెళ్ళగలం. జీవితంలో ఏది వచ్చినా అది దైవప్రసాదంగానే భావించాలి తప్ప తిరస్కరించకూడదు. ఉగాది పచ్చడిలో మొదట కొందరికి తీపి తగిలితే, కొందరికి చేదు తగులుతుంది. చేదు తగిలిందని ఉగాది పచ్చడి పడేయం కదా. అలాగే జీవితంలో కష్టాలు వచ్చాయని జీవితాన్ని సగంలోనే ముగించడం కాదు, రాబోయే సంతోషం కోసం ఎదురుచూడాలని మనకు చెప్తోంది ఉగాది పచ్చడి. నిజానికి భవిష్యత్తులో ఏదో సుఖం వస్తుందని ఆశించడం కాదు, మన ఈ జీవితం గత జన్మలో మనం చేసుకున్న కర్మ యొక్క ఫలం. అందుకని జీవితాన్ని యదాతధంగా అంగీకరించాలి. అదే ఉగాది పచ్చడి పరమార్ధం.

ఎంతో పుణ్యం చేస్తే కానీ రాదు ఈ మనిషి జన్మ.  మళ్ళీ మనిషిగా పుట్టాలంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. వచ్చిన జన్మను సక్రమంగా, దైవప్రసాదంగా జాగ్రత్తగా వాడుకోమని గుర్తుచేస్తోంది ఉగాది పచ్చడి.

నలుగురికి సాయం చేయాలి, ప్రతిసారీ డబ్బు సాయమే చేయక్కర్లేదు, కష్టాల్లో ఉన్నవారికి కాస్త మాట సాయం చేసినా చాలు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి. మనతో కలిసి బ్రతికే జంతువులు, పక్షులను ఆదుకోవాలి, కుదిరితే కొద్దిగా ఆహారం పెట్టాలి, కుదరకపోతే కనీసం నీరైన పెట్టాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన తర్వాతి తరాల వారికి ప్రకృతిని జాగ్రత్తగా అందించాలి. దేశభక్తి కలిగి దేశానికి సేవ చేయాలి. మన ధర్మాన్ని మనం పాటించాలి. ప్రపంచ శాంతి కోరుకోవాలి. ఇదే మన నుండి దేవుడు ఆశించేది.

ఈ ఉగాది మన జీవితంలో ఒక నవశకానికి పునాది అవుతుందని ఆశిద్దాం. మనం చేసే మంచిపనుల్లో మనకు ఈ సంవత్సరం అన్నీ విజయాలే ఇస్తుందని ఆశిద్దాం.

అందరికి ఉగాది శుభాకాంక్షలు.

Originally posted: Ugadi 2012
1st Edit: 31-03-2014
2nd Edit: 21-03-2014

ఉగాది పండుగలో ఉన్న వైజ్ఞానిక అంశాలేంటి?

ఉగాది పండుగలో ఉన్న వైజ్ఞానిక అంశాలేంటి?

ఉగాది వసంత ఋతువులో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలరకాల వ్యాధులు వ్యాపిచే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. ఈ సమయాన్నే మన ఋషులు "యమద్రంస్టలు" అన్నారు. యమద్రంస్టలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను  నాశనం చేస్తాడని అర్దం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్యజాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా అదే.

ఉగాది పచ్చడి ఒక మహాఔషధం. ఈ పచ్చడిని ఒక్క ఉగాది రోజూ మాత్రమే కాదు ఉగాది మొదులుకొని శ్రీ రామనవమి వరకు లేదా చైత్ర పౌర్ణిమ వరకు ప్రతిరోజు స్వీకరించాలి. ఈ విధంగా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు. ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ-వైరల్ లక్షణలు కలిగింది. కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది ఉగాది పచ్చడి. మనకొచ్చే రోగాలలో చాలాశాతం వీటివల్లే వస్తాయి.

ఉగాది రోజు చేసే తైలాభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం) శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విష పదార్ధాలు)ను తొలగిస్తుంది.

ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్ళు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వలన మన చుట్టు వాతావరణం నుంచి మన రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. బంతి పూలు యాంటీ-సెప్టిక్, యాంటీ-బయోటిక్ లక్షణలు కలిగినవి. మామిడి ఆకుల గురించి ఇందాకే చెప్పుకున్నాం. ఇవి ఇంట్లోకీ రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి.

ఉగాది నుంచి శ్రీ రామనవమి వరకు 9 రోజుల పాటూ వసంతనవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీ రామచంద్ర మూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో రోజుకోక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఞానికంగా చూస్తే, ఒక్క రోజు కాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచిశుభ్రతగా ఉంటూ, రోజు దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారుచేసిన ఆహారం తింటూ గడిపేస్తాం.

మొత్తంగా చూస్తే ఉగాదిపచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు చస్తాయి. ఉగాదిస్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత, మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. 15 రోజుల పాటు నియమబద్ధ జీవితం, పవిత్రమైన, పుష్టకరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ఇవి ఉగాదిలో ఉన్న కొన్ని వైజ్ఞానిక అంశాలను మాత్రమే.

చూశారా! మన ఋషులు ఒక పండుగ చేసుకోమని చెప్తే అందులో ఎన్ని అంశాలుంటాయో. అందుకే హిందువైనందుకు గర్వించండి. హిందువుగా జీవించండి. పర్యావరణాన్ని రక్షించండి. తోటివారికి సహాయం చేయండి.

మన్మధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Originally published: 2013 Ugadi
1st Edit: 30-03-2014
2nd Edit: 31-03-2015

Friday 20 March 2015

ఉగాది ఎలా జరుపుకోవాలి?

ఉగాది ఎలా జరుపుకోవాలి?

ఉగాది నాడు తెల్లవారుఝామునే (సూర్యోదయానికి గంటన్న ముందు) నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్వచ్ఛమైన నువ్వుల నూనెను శరీరానికి, తలకు పట్టించుకుని, నలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి.

స్నానం చేశాక కొత్త బట్టలు/కొత్త బట్టలు కొనే పరిస్థితులు లేకపోతే ఉతికిన బట్టలు, ఆభరణాలు ధరించాలి. కొత్తబట్టలు ధరించాక మీ ఇష్టదైవాన్ని(వినాయకుడు, శివుడు, కృష్ణుడు, రాముడు........ఇలా మీకు ఎవరంటె ఇష్టమో వారిని) పూజించాలి. పూజ చేయడం రాకపోతే ఒక స్తోత్రం చదవండి, అది రాకపోతే ఆ దేవుడి నామం/ పేరును చెప్పినా చాలు. భక్తితో ఒక్క నమస్కారం చేసినా చాలు, దేవుడు ఆనందిస్తాడు.  

ప్రజలంతా ఉగాది రోజు తమ కుటుంబసభ్యులతో కలిసి వేపచెట్టుకు పసుపుకుంకుమ పూసి, దాని చుట్టు ప్రదక్షిణ చేసి దానినుండి వచ్చే ప్రాణవాయువును తృప్తిగా, దీర్ఘంగా పీలుస్తూ ఆ చెట్టునుండి వేప పువ్వును సేకరించుకుని ఇంటికి తెచ్చుకోవాలి. వేపగాలి పీల్చడం వలన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదదు మొదలైన ప్రధాన భాగాలు చైతన్యవంతమై వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

వేప పచ్చడి/ఉగాది పచ్చడిని పరకడుపున (అంటే ఖాళీ కడుపున) ఉదయం 8 గంటలలోపు సేవిస్తేనే దాని ఔషధ గుణాలు శరీరాన్ని రోగరహితం చేస్తాయని ఆయూర్వేద గ్రంధాలు చెప్తున్నాయి.

సాయంత్రం స్థానిక దేవాలయంలో కానీ, లేక ఇతర పవిత్ర ప్రదేశంలో కానీ పంచాంగశ్రవణం చేయాలి. శ్రవణం అంటే వినడం అని అర్దం. కొత్త ఏడాదిలో దేశం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఏలాంటి ఫలితాలుంటాయి, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పడతాయి...... మొదలైఅనవన్నీ పంచాంగశ్రవణం లో చెప్తారు. పంచాంగశ్రవణం చేయడం వల్లనే అనేక దోషాలు తొలగిపోతాయి. గంగా స్నానం చేసిన పుణ్యం వస్తుంది.

దేవాలయంలో కానీ, సాంస్కృతిక కూడలిలో కానీ పంచాంగ శ్రవణం చేయాలి. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే 5 ని "పంచ అంగములు" అంటారు. వీటిని వివరించేదే పంచాంగం. పంచాంగం ఉత్తరముఖంగా కూర్చుని వినాలని శాస్త్రం.

పంచాంగశ్రవణంలో సంవత్సర ఫలితాలు, సంక్రాంతి పురుషుడు, నవనాయకులువంటి వారితో పాటు వివిధ రాశులవారి ఆదాయ, వ్యయాలు, రాశిఫలాలు చెప్తారు. పంచాంగ శ్రవణంలో నవగ్రహాలను స్మరించడం వలన చాలా రకాలుగా సత్ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది.

పంచాంగ శ్రవణం ఫలితంగా సూర్యుడివల్ల శౌర్యం, చంద్రుని వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వ మంగళాలు, బుధుడివలన బుద్ధి వికాసం, గురువు వలన జ్ఞానం, శుక్రుడి వలన సుఖం, శని వలన దుఖఃరాహ్యితం, రాహువు వలన ప్రాబల్యం, కేతువు వలన ప్రాధాన్యత లభిస్తాయి.
Originally posted: 30-03-2014
1 St Edit : 20-03-2015

ఉగాది - విశేషాలు

21 మార్చి 2015, శనివారం, చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది

ఉగాది గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం

ఉగాది ఎందుకు జరుపుకుంటాం?

యుగాది అంటే యుగం ప్రారంభమైన రోజు. ఈ యుగాదే కాలక్రమంలో ఉగాది గా పిలువబడుతోంది.

హిందూ కాలమానంలో మొత్తం మనకు 4 యుగాలున్నాయి.

1. కృత యుగం/ సత్య యుగం - 17,28,000 సంవత్సరాలు
2. త్రేతా యుగం - 12,96,000 సంవత్సరాలు
3. ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు
4. కలియుగం - 4,32,000 సంవత్సరాలు

ఈ నాలుగు యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. దీనినే మహా యుగం అంటారు.

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, అన్ని గ్రహాలు మేషరాశిలో ఉన్న సమయంలో ప్రారంభమైంది కలియుగం. ఈనాటి ఇంగ్లీష్ క్యాలండర్ ప్రకారం చెప్పాల్సివస్తే, సరిగ్గా 5116-17 సంవత్సరముల క్రితం ఫిబ్రవరి 19-20, 3,102 BCలో శ్రీ కృష్ణ పరమాత్మ అవతరపరిసమాప్తి జరిగిన వెంటనే ద్వారపరయుగం అంతమై, కలియుగం మొదలైంది.

ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలోనే. ఈ కలియుగ ప్రారంభానికి సూచికగా చాంద్రమానాన్ని అనుసరించి మనం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటాం.

ఉగాది పచ్చడి గురించి శాస్త్రం ఏం చెప్తోంది?

ఉగాది పచ్చడిలో ఆ రోజే కోసిన వేపపువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, అరటి ముక్కలు, కొబ్బరి ముక్కలు వేస్తారు. వీటితో పాటు మామిడి చిగురు, అశోక చిగుళ్ళు కూడా వేయాలని శాస్త్రం చెప్తోంది.

త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ
పిబామి శోకసంతప్తాం మామశోకం సదాకురు

అనే శ్లోకాన్ని చెప్తూ తినాలట.

వసంతంలో చిగిర్చిన ఓ అశోకమా! నిన్ను సేవించిన నాకు ఎటువంటి శోకములు(బాధలు) లేకుండా చేస్తావు అని పై శ్లోకం అర్దం.

శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకందలభక్షణం

అంటే "ఈ వేప పచ్చడి తినడం వలన గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైన సర్వారిష్టాలు నివారింపబడి, సర్వ సంపదలు, దీర్ఘాయువు, వజ్రంలాంటి దృఢమైన, ఆరోగ్యకరమైన శరీరము లభిస్తాయి" అని పై శ్లోకం అర్దం. ఈ ఉగాది పచ్చడిని సూర్యోదయానికి పూర్వమే తినాలని శాస్త్రం.

Originally published:
1st Edit: 30-03-2014
2nd Edit: 20-03-2015

Thursday 19 March 2015

మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

పంటపొలాలు, చెట్లకు పట్టే పురుగులని తిని జీవిస్తాయి పిచ్చుకలు. పిచ్చుక చూడడానికి చిన్న ప్రాణియే అయినా, జీవవైవిధ్యంలో తన వంతు పాత్రను పోషిస్తోంది. పిచ్చుకలు అంతరించిపోతే ఏమవుతుంది అన్న ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్తున్నది. ఒకప్పుడు చైనాలో పిచ్చుకలంటె చీడ పురుగులుగా భావించేవారు, అది చిన్న ప్రాణి, అల్పమైనది, బలహీనమైనది, అది పంటలను నాశనం చేస్తుంది, ఆహార ధాన్యాలను అధికంగా తినేస్తోందన్న అపోహతో చైనాలో పిచ్చుకల జాతిని నాశనం చేయండన్న ప్రచారం ఊపందుకున్నది. ఫలితంగా అతి తక్కువ సమయంలో పిచ్చుకలు మొత్తం నశించాయి. పిచ్చుకల ఆహారం పంటపొలాలపై దాడి చేసే పురుగులు. పిచ్చుకలు లేని కారణంగా పంటలకు మరింతగా పురుగుపట్టి 1958-61 మధ్య చైనా తీవ్రమైన ఆహారకొరతను ఎదురుకొంది, కరువు సంభవించింది, ప్రజలు ఆకలితో మాడి ప్రాణాలు విడిచారు. ఈ వార్తను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టింది. చిన్ని పిచ్చుకే .............లేకపోతే ఏమవుతుందిలే అనుకున్నారు, జనం ప్రాణం పోతే కానీ తెలియలేదు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరుగుతోంది. భారత్‌లో మారిన జీవశైలి, వ్యవసాయంలో రసాయనిక మందులు వాడడం, బి.టి. విత్తనాలు పిచ్చుకలు గూడు కట్టుకోవడానికి వీలు లేకుండా నిట్టనిలువునా అట్టపెట్టాలా కట్టేస్తున్న పెద్ద పెద్ద భవనాలు పిచ్చుకల జాతికి మరాణశాసనంలా మారాయి. పిచ్చుకలు ఉనికి ప్రమాదంలో పడటానికి కారణం సెల్ టవర్లని మొదట్లో భావించినా, మారిన మానవ జీవినశైలి, ఆధునిక గృహనిర్మాణశైలి ప్రధాన కారణాలని తర్వాత గ్రహించారు. పిచ్చుకలు అంతరించిపోవడం పెనుప్రమాదానికి సంకేతం. పిచ్చుకలు అంతరించిపోతే ప్రపంచ ఆకలితో అలమటించాల్సి వస్తుంది.

ఒకప్పుడు మన పెద్దలు ఇంటి ముందు కాసిన్ని పప్పులు, జొన్నలు, సజ్జలు, రాగులు లేక ఇతర ధాన్యపు గింజలను ఒక పళ్ళెంలో పెట్టి, ఒక మట్టి ముంతలో పక్షుల కోసం నీరు పెట్టేవారు. కానీ మనకు అంత ఆలోచన లేదు, విశాల భావాలు అంతకంటే లేవు, ఎందూకంటే మనం ఆధునికులం కదా. ఉరుకులుపరుగుల జీవితం తప్ప, మన తోటిజీవాల గురించి ఆలోచన లేదు. అందుకే మనం వాటికి ఆహరం, నీరు పెట్టే అలవాటును మానుకున్నాం. అవి కూడా పిచ్చుకలు అంతరించిపోవడానికి ఒక కారణం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పిచ్చుకల జాతి అంతరించిపోకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన రావాలనీ, మార్చి 20ని ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా ప్రకటించారు.

పిచ్చుకలను కాపాడడానికి మనవంతుగా వాటికి గూటిని, కాసింత ఆహారాన్ని, పరిశుభ్రమైన నీటిని అందిద్దాం. పిచ్చుకలను మన పిల్లకు పుస్తకాల్లో కాకుండా ప్రత్యక్షంగా చూసేలా అవకాశం ఇద్దాం.

గ్రీన్ క్లైమేట్ : పచ్చని వాతవరణం మాసపత్రికలో 2013 పిచ్చుకల గురించి ప్రచురితమైన కధనం మీ కోసం, క్రింద చదవండి.

అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జీవజాతులలో తాను చేరిపోయానంటూ కన్నీరుపెట్టుకుంటోంది మన చిన్ననాటి నేస్తం, మన బాల్యపు జ్ఞాపకం, మనల్ని నమ్ముకున్న చిన్న ప్రాణి మన ఇంటి పిచ్చుక.

ఒకప్పుడు మన ఇళ్ళచూరలు పట్టుకుని కిచకిచలాడుతూ వేలాడుతూ మనతో పాటే ఉండేది....

పల్లెగ్రామాల్లో రైతుల ముంగిళ్ళలో వేలాడె ధాన్యపుకంకుల గుచ్ఛాలపై  పువ్వులా మెరిసేది........

నేడు పూరిళ్ళు, లోగిళ్ళూ కాస్తా సిమ్మెంటు గూళ్ళైపోయాయి.......

చిన్న పిచ్చుక బ్రతకడానికి గూడు లేకుండా చేసాయి.

పోలాల్లో చల్లే రసాయనక్రిమిసంహారక మందులు పిచ్చుకలను వాటి తిండికి దూరం చేసాయి

పట్టణాలలోనూ ఇంటి పిచ్చుక జీవితం ఒక ప్రశ్నగా మారింది......

ఇక్కడా వాటిని రసాయనక్రిమిసంహారకాలు వదలలేదు
ఆకాశహర్మ్యాలెన్నో పట్టణాలలో కట్టినా ఇంటి పిచ్చుకలకు ఆ ఇంటి కాసింత చోటు లేకుండా పోయింది

అక్కడితో ఆగలేదు........? సెల్ టవర్ ల రేడియోధార్మికత పిచ్చుకలకు కడుపుకోత తెచ్చిపెట్టింది.............

నేడి ఇంటి పిచ్చుక జీవనం ప్రమాదంలో పడింది........ ఆ చిన్నపొట్టకు తినేనుందుకు ఇంత తిండి దొరకడం లేదు........
ఎండావానల్లో తడవకుండా అయిదున్నర అంగుళాల మేర గూడుకట్టుకోవడానికి మనింట దానికి రవ్వంత చోటు లేదు
అంతరించిపోతున్న ఈ చిన్నారి ఇంటిపిచ్చుక జాతిని రక్షించాలంటే మనందరి తక్షణ కర్తవ్యం ఏమిటి?.............

జరిగిపోయిన తప్పిదాలను మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఆ పిచ్చుకల జాతిని కాపాడుకోవాలి ఇంటింటా దానికో గూడుకట్టి. పిడికెడు గింజలు చల్లి, కాసిన్ని నీళ్ళు పెట్టి మన ఇంటి పిచ్చుకలను బతికిద్దాం..........

పర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్య సంరక్షణలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం............

మన ఇంటి పిచ్చుకలను మనమే పరిరక్షించుకుందాం

మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినం.

ప్రకృతిలోని అన్ని జీవాలు చల్లగా ఉంటేనే మానవ మనుగడ సాధ్యం. ఈ రోజు నుంచే పిచ్చుకల కోసం నీరు, ఆహారం పెడదాం. మన ఇంటితో పాటు హృదయంలో కూడా కాసింత చోటిద్దాం.

Monday 16 March 2015

విద్యుత్‌ను పొదుపుగా వాడుకుందాం

విద్యుత్ లేని జీవితాన్ని ఊహించలేమని తరుచూ చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ అదే విద్యుత్ వాడకం, విద్యుత్ ఉపకరణాలు కర్బన ఉద్గారాలను పెంచి, భూతాపాన్ని కలిగిస్తున్నాయి. అందుకే తరుచూ విద్యుత్‌ను పొదుపుగా వాడండి అనే ప్రచారాన్ని చూస్తుంటాం. వెంటనే మనకు అనిపిస్తుంది 'నేను వాడుతున్న దానికి డబ్బులు కడుతునప్పుడు ఎంత వాడుకుంటే ఏంటి? ' అని ప్రశ్నిస్తారు. పొదుపు చేయమంటే మేము కరెంటు వాడద్దు అంటున్నారు? మీరు వాడటం లేదా? లైట్లు, ఫ్యాన్లు వాడుకోవటం లేదా? అన్నీ మానేసి కూర్చోమంటారా? అంటూ మూర్ఖంగా వాదించే వారిని కూడా నేను చూశాను. ఒక వస్తువును ఉపయోగించడానికి, దుర్వినియోగం చేయటానికి మధ్య బేధం తెలియని వారికి ఎలా చెప్పాలో అర్దం కానీ పరిస్థితి. అసలు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవడం ఎందుకు? దాని వల్ల ఇతరులకు ఉపయోగమేమిటి? దేశానికి మనం చేసే మేలు ఏమిటి? ఈ విషయంపై ఈనాడు పేపర్‌లో 2013 లో వచ్చిన కధనం చూడండి.



'కాసేపు కరెంటు లేకపోతే ఉక్కిరిబిక్కిరైపోతున్నామే, మరి గ్రామాల్లో మన సోదరులు, మనకు అన్నం పెట్టే రైతులు గంటలుగంటలు కరెంటు లేకుండా ఎలా ఉండగలరు?

విద్యుత్ సంక్షోభం నేపధ్యంలో రాష్ట్ర ఇంధన వనరుల విభాగం పాఠశాల్లలో విద్యుత్‌పొదుపు పై ప్రచారం చేపట్టింది.జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో, భారతీయ విద్యాభవన్, ఓబుల్ రెడ్డి స్కూల్ విద్యార్ధులు కలిసి 2 నెలల్లో దాదాపు 60వేల యూనిట్లు పొసుపు చేశారు. వీటితో మూడు చిన్న గ్రామాలకు నెల రోజుల పాటు విద్యుత్ అందించవచ్చని ఏపీసీపీడీసీయల్ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే ఆదా చేసిన దాంతో పల్లెలకు ప్రస్తుతం ఇచ్చే దానికంటె మెరుగైన సర్ఫరా చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ ఇలా చేస్తే ఏటా రూ.7 వేల కోట్లు విలువ చేసే 1500 కోట్ల యూనిట్లు పొదుపు చేయచ్చని రాష్ట్ర ఇంధనవనరుల సంరక్షణ పధకం, సీఈఓ, చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.

వాడకం పెరిగితే డిమాండు పెరుగుతుంది. సర్ఫరాకు డిమాండుకు మధ్య అంతరం పెరిగి లోటు ఏర్పడుతుంది. ఫలితంగా కోతలు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి ఆలోచించండి'.

విద్యుత్‌ను పొదుపు చేయడం వలన ప్రభుత్వాలు అధికంగా బొగ్గు కొని ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా కాలుష్యం తగ్గుతుంది, దేశసంపద కూడా ఆదా అవుతుంది. దేశభక్తి అంటే దేశం గురించి నాలుగు ప్రసంగాలు చేయటం కాదు, దేశం యొక్క వనరులను రక్షించుకోవటం, సంపదను కాపాడటం.   

మనం పొదుపు చేసే విద్యుత్ (ఒక్క యూనిట్ అయినా సరే) మరొకరికి ఉపయోగపడవచ్చు. ఆ పాఠశాల విద్యార్ధులను మనం ఆదర్శంగా తీసుకుందాం. విద్యుత్‌ను పొదుపుగా వాడుకుందాం.

విద్యుత్‌ను పొదుపు చేసే మార్గాలు కోసం ఈ లింక్ చూడండి. http://ecoganesha.blogspot.in/2013/05/save-energy-save-earth.html

మన సనాతనధర్మంలో వనరుల వినియోగం, దుర్వినియోగం గురించి ఏం చెప్పబడింది? మన ధర్మం ఏంటి? ............ ఈ లింక్ లో చూడండి. http://ecoganesha.blogspot.in/2014/03/36-3.html
జై హింద్ 

Originally Published: 28-April-2013 
1st Edit: 16-March-2015

Sunday 15 March 2015

హిందూ ధర్మం -150 (మహాభారతం అణుయుద్ధమా?)

హిరొషిమా, నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగేవరకు ఇటువంటి భయంకరమైన మారణ అస్త్రాలు ఉంటాయని ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకు భారతీయ ఇతిహాసాలను చదివిన పాశ్చాత్యులు వీటిని కేవలం కల్పనలుగానే భావించారు. కానీ జపాన్ పై దాడి తర్వాత ఆ భావన పూర్తిగా తొలగిపోయింది. అదికాక రేడియో ధార్మికత వలన మానవులకు ఎటువంటి అనారోగ్య ప్రభవాలు ఏర్పడతాయో కుడా భారతంలోనే ప్రస్తావించడం, అచ్చం అలానే జపాన్‌లో జరగడంతో పశ్చిమ దేశాలు ఒక్కసారి ఖంగుతిన్నాయి. అణుబాంబు నుంచి వెలువడిన రేడియేషన్ వలన గోళ్ళు ఊడిపోతాయి, వెంట్రుకలు రాలిపోతాయి, తాత్కాలికంగా నీటిలో మునిగి ఉపశమనం పొందినా, అది దీర్ఘకాలిక ఉపశమనాన్ని ఇవ్వలేదు. హరప్పా, మోహంజెదారొ ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ చెల్లాచెదురూగా పడి ఉన్న 44 అస్తిపంజరాలను కనుగొన్నారు. వాటి స్థితిగతులను గమనించి, ఏదో భయాంకరమైన ఉపద్రవం సంభవిస్తే, తప్పించుకోడానికి ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని పరుగులు తీస్తున్న విధంగా ఉన్నాయి. ఇవి సాధారణ పురావస్తు పరిశోధనలు చేసినా, అవి వేల సంవత్సరాల నాటివని నిర్ధారణ చేశారు. ఈ తర్వాత అనేకానేక ప్రశ్నలు తలెత్తినా, హరప్ప నాగరికత అణుబాంబు వంటి ఒక మానవ ఉపద్రవం వలననే నశించిందని అనేకమంది శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.



ఇక్కడ దొరికిన అస్తిపంజరాలు అత్యంత రేడియో ధార్మికత కలిగి ఉన్నాయి. దాదాపు హిరోషిమా, నాగసాకిలో అణుబాంబు కారణంగా మరణించిన వారి అస్తిపంజరాలకంటే కూడా అధికం అని చెప్పవచ్చు. ఒక ప్రదేశంలో రష్యన్ పరిశోధకులు పరిశోధన జరుపగా, అక్కడ రేడియోధార్మికత సాధరణ స్థాయి కంటే 50 రెట్లు అధికంగా ఉంది. ఇదేగాక, ఉత్తరభారత దేశంలో భారి పేలుళ్ళ కారణంగా ద్వంసమైనవిగా భావిస్తున్న మరికొన్ని నగరాలు కనుగొన్నారు. అటువంటి ఒక నగరం గంగానదికి,  రాజ్‌మహల్ పర్వతాలకు మధ్య ఉన్నది. అది అత్యధిక ఉష్ణోగ్రతకు లోనైన ప్రదేశం అని చెప్తున్నారు. అక్కడే భారీ స్థాయిలో కట్టడాలు, పునాదులు ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి. వాటికి కారణం అణుబాంబు విస్పోటనం కానీ, లేక అగ్నిపర్వతం బద్దలవ్వడం .......... రెండిటిలో ఏదో ఒకటి కావాలి. అక్కడ ఎటువంటి అగ్నిపర్వతం లేకపోవడం చేత, ఆయా నగరాలు అణుబాంబు కారణంగానే నశించాయని భావిస్తున్నారు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం గ్రహించాలి.  అణుబాంబు పితామహుడిగా ప్రపంచం ఓఫెనిహీమర్‌ను గుర్తించింది. ఒకసారి ఓఫెనిహీమర్ ఒక కాలేజీలో ప్రసంగానికి వెళ్ళినప్పుడు అక్కడున్న విద్యార్ధి ' లో జరిగిన అణుబాంబు పరీక్ష మొట్టమొదటిదనీ మీరు భావిస్తున్నార?' అని అడుగుతాడు. అంటే ఆ విద్యార్ధి ఉద్ద్యేశం ఇంతకముందు యు.ఎస్.లో ఎప్పుడైన అణుబాంబు పరీక్ష నిర్వహించారా అని. దానికి సమాధానంగా ఓఫెనిహీమర్ 'అవును, ఆధునిక కాలంలో ఇదే మొదటిదీ అని సమాధానం ఇస్తారు. (అనగా ఆధునిక కాలంలో ఇదే మొదటిది, ఇంతకముందు చాలా పూర్వం అనేకం జరిగాయని ఆయన నమ్మకం). ఓఫెనిహీమర్ హార్వర్డ్‌లో అండర్ గ్రాడుయేషన్ చేసారు. తర్వాత ఒక వ్యక్తి పరిచయం ద్వారా సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతంలో భగవద్గీతను చదివారు. అటు తర్వాత సనాతనధర్మానికి సంబంధించిన గ్రంధాల మీద ప్రత్యేక ఆసక్తి చూపించి, వాటిని అభ్యసించారు. తరుచూ ఆయన ప్రసంగాల్లో మహాభారతం, భగవద్గీత నుంచి శ్లోకాలు ప్రస్తావించేవారు. శివుడి గురించి, కృష్ణుడి గురించి మాట్లాడేవారు. మొదటి అణుబాంబు పరీక్షా సమయంలో కూడా ఓఫెనిహీమర్ భగవద్గీత నుంచి శ్లోకం గట్టిగా చదివి వినిపించారు. భారతీయులకు అణుబాంబుల గురించి జ్ఞానం వేల ఏళ్ళ క్రితమే తెలుసునని నమ్మినవారిలో ఒకరు ఓఫెనిహీమర్. ఈ విధంగా మహాభారతం అణుయుద్ధం అని చెప్పడానికి అనేకానేక పురావస్తు ఆధారాలతో పాటు అనేకమంది  పాశ్చ్యాతుల పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.

To be continued ...............

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు: http://www.worldwideashram.org/worldwideashram/2011/07/new-proofs-of-nuclear-war-in-ancient-india/

Sunday 8 March 2015

హిందూ ధర్మం -149 (మహాభారతం అణుయుద్ధమా?)

మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రుకలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.

మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.

కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.

ఇదికాక, మహాభారత యుద్ధం నాటి అణుబాంబుల రేడియో ధార్మికత ప్రభావం రాజస్థాన్ ప్రాంతంలో ఈనాటికి ఉంది. రేడియో ధార్మికత ప్రభావం కలిగిన బూడీ పొరలు జోధ్‌పూర్‌కు పశ్చిమంగా 10 మైళ్ళ దూరం లో 3 మైళ్ళ మేర విస్తరించి ఉంది. దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలు అంగవైకల్యాలతో పుట్టడం, క్యాన్సర్ బారిన పడడం గమనించారు. అక్కడున్న రేడియేషన్ స్థాయులు గమనించిన ప్రభుత్వం, ఆ ప్రాంతాన్ని నివాసయోగ్యం కానిదిగా భావించి, అక్కడ గృహనిర్మాణాలు చేపట్టలేదు.

ఆ ప్రదేశంలో శాస్త్రవేత్తలు ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు. దాని వయసు సుమారు 8,000 నుంచి 12,000 సంవత్సరాలుగా ఆత్యాధునిక పద్దతులలో పరిశోధించి నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతం భారీ అణువిస్పోటనానికి గురైందని, చాలా నిర్మాణాలు నాశమయ్యాయని, 5 లక్షలకు పైగా జనాభా ఆ బాంబు కారణంగా మరణించారని భావిస్తున్నారు. ఒక పరిశోధకుడి అంచనా ప్రకారం అక్కడ పడిన అణుబాంబు జపాన్‌లో పడిన అణుబాంబుకు సమానమైందని అంటున్నారు.

To be continued ...........................

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
ఆంధ్రప్రభ 3 జనవరి 2015, శనివారం ప్రచురితమైన వ్యాసం.
http://higher-perspective.blogspot.in/2013/10/ancient-city-discovered-in-india.html

Friday 6 March 2015

హోలీ శుభాకాంక్షలు

ఫాల్గుణ మాసంలో వసంత ఋతువు సమీపిస్తుంటే చలి తగ్గుతుంది. వాతావరణంలో వేడి పుంజుకుంటుంది. మొక్కలు, చెట్లకు పచ్చగా మారి ఆహ్లాదాన్ని పంచుతూ, మొగ్గలు తొడుగుతాయి. పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే మానవుడిలో కామభావనలు పెరుగుతాయి. సామాజిక కట్టుబాట్లనే బంధనాలతో కట్టబడి ఉన్న మనిషి అధిక స్వేచ్ఛను ఆశిస్తాడు. భౌతిక సుఖాల కోసం వెంపర్లాడతాడు. ఇది కట్టడి చేయకపోతే విశృంఖలత్వాం పెరిగి వ్యక్తికి, సమాజానికి, మొత్తం మానవజాతికి పెనుముప్పుగా మారుతుంది. కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇదంతా అజ్ఞానం వలన జరుగుతుంది.

శ్రీ కృష్ణపరమాత్మ గీతలో జ్ఞానాన్ని కామం ఆవరించి ఉంటుంది అని చెప్తారు. జ్ఞానం కావలంటే కోరికలు విడిచిపెట్టాలి. అన్ని కోరికలు విడిచిపెట్టనవసరం లేదు. ధర్మ బద్ధంకానీ కామాన్ని(కోరికలను) త్యజించాలి.

ఇక్కడ జరిగేది అదే. రాత్రి పూట కామదహనం. రాత్రి అంటే చీకటి, అజ్ఞానం. కామదహనం అంటే అసభ్యకరమైన, ధర్మబద్ధంకానీ కామపు ఆలోచనలను, విశృంఖలమైన కోరికలను భస్మం చేయడం. మరునాడు సూర్యోదయం అవుతుంది అంటే మనిషికి, సమాజానికి జ్ఞానోదయం అవుతుంది. రంగుల పండుగ హోలీ అవుతుంది అంటే జీవితం రంగులమయం అవుతుంది. కోరికలను అదుపులో పెట్టుకొమ్మనే సందేశాన్ని ఇస్తోంది హోలీ.

పరమశివుడు కామదహనం చేశాడు. ఈ సంఘటన వలన మనకు చక్కని సత్యం బోధపడుతుంది. వసంతాన్ని కారణం చేసుకుని మన్మధుడైనా మర్యాదను ఉల్లంఘిస్తే పరమేశ్వరుని చేత దండన అనుభవించాల్సి ఉంటుంది. మర్యాదను, సమాజపు కట్టుబాట్లను, ధర్మాన్ని పాటించడం సంపద, ఉల్లంఘించడం వినాశనం.

అందరికి హోలీ శుభాకాంక్షలు                        

దివ్య లీల హోలీ

మనిషి అందం శరీరవర్ణంలో కాదు, మనసులో ఉంటుంది, అతని గుణగణాలలో, చేసే కర్మ(పని)లో ఉంటుంది. అది చెప్పడానికే అన్ని వర్ణాలకు అతీతమైన పరమాత్మ, ఏ రూపమూ, ఏ రంగు లేని పరమాత్మ, కృష్ణ (నల్లని)వర్ణంలో శ్రీ కృష్ణుడిగా అవతరించాడు.


ఒకసారి చిన్ని కృష్ణుడు యశోదమ్మ దగ్గరకు వచ్చి " అమ్మా! చూడమ్మా! రాధ తెల్లగా, అందంగా ఉంది. నల్లగా ఉన్నానని నన్ను ఆటపట్టిస్తోంది" అంటాడు. బాధ ఎందుకు కన్నయ! నేను ఉన్నానుగా, ఆ విషయం మనం చూసుకుందాంలే అన్న యశోద, రాధ మీద రంగులు చల్లమని సలహా ఇస్తుంది.

అల్లరి కృష్ణుడు రాధతో పాటు బృందావనంలో ఉన్న గోపికల మీద కూడా రంగులు చల్లుతాడు. ఎన్ని రంగులు చల్లినా రాధ మాత్రం పున్నమి చంద్రుని వలె వెలిగిపోతుంటుంది. అలా శ్రీ కృష్ణపరమాత్మ రాధతో జరిపిన లీల హోలీ.

నిజానికి రాధ అంటే ఒక పాత్ర/వ్యక్తి కాదు. మహాభారతంలో రాధ ప్రస్తావన ఎక్కాడ కనిపించదు. రాధ అంటే ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాల మీద పట్టు సాధించినవారని/జయించినవారని అర్దం. ఆత్మ తత్వం అర్దమైనవారు ఇంద్రియాలను జయిస్తారు. అలాంటి వారు పరమాత్మకు చాలా దగ్గరగా జీవిస్తారు. అలా పరమాత్మకు దగ్గరైనవారి మీద ఆయనకు అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. అటువంటి వారితో(రాధ)  పరమాత్ముడు ఆడే దివ్య లీల హోలీ.

1st Edit: 14-March-2014
2nd Edit: 06-March-2015

హోలి కధ

హోలి పండుగ గురించి శ్రీ మద్భాగవతంలో ఒక ఘట్టం ఉంది (క్లుప్తంగా చెప్పుకుందాం).

హిరణ్యకశిపుడనే వాడు రాక్షసులకు రాజు. ఇంట్లో లేదా బయట, పగులు లేక రాత్రి సమయంలో కానీ, మనిషి లేదా మృగం చేత కానీ, భూమి లేక ఆకాశంలో కానీ, రోగాల వలన, ఆయుధముల వలన తనకు మరణం ఉండరాదని బ్రహ్మ దేవుని వద్ద వరం కోరుతాడు. వరం పొంది తనను ఎవరు ఏమీ చేయలేరన్న అహకారంతో యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తాడు. గోశాలలను, పోలాలను, అడవులను, ఉద్యానవనాలకు నిప్పు పెట్టిస్తాడు. చెరువులను కలుషితం చేసి, విషతుల్యం చేస్తాడు. జనాలను అష్టకష్టాలు పెడతాడు. స్వర్గలోకం మీద దాడి చేసి ఇంద్రుడి ఆధిపత్యానికి విఘాతం కలిగిస్తాడు. తానే దేవుడినని, తననే పూజించాలని ప్రజలకు ఆజ్ఞ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువంటే హిరణ్యకశిపుడికి మహాద్వేషం.

ఈయన పుత్రుడే 'ప్రహ్లాదుడు'. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఎల్లప్పుడు విష్ణు నామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు సజీవంగా అగ్నిలో పడేసి ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు.

హిరణ్యకశిపుడికి హోలికా అనే సోదరి ఉంది. సజ్జనులకు (మంచివారికి) అపకారం కలిగించనంతవరకు ఈమెకు అగ్ని వల్ల ప్రమాదం ఉండదని వరం ఉంది. ప్రహ్లాదుడు అగ్నిలోంచి పారిపోకుండా ఉండడానికి అగ్ని జ్వాలల మధ్య హోలికను కూర్చోబెట్టి, హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెడతారు. ప్రహ్లాదుడు ఏ మాత్రం భయపడకుండా విష్ణు నామన్ని జపిస్తూ హాయిగా కూర్చుంటాడు. తనని కాపాడమని కూడా విష్ణువును ప్రార్ధించడు.

ఎందుకంటే నమ్ముకున్న వారిని రక్షించడం పరమాత్ముడి బాధ్యత. ప్రత్యేకించి అడగాల్సిన అవసరం లేదు. 'నా మే భక్తః ప్రణశ్యతి', నన్ను పూర్తిగా నమ్మినవారు ఎన్నటికి నాశనమవ్వరు అని పరమాత్మే గీతలో చెప్పాడు. అసలు భక్తి అంటే అవ్యాజయమైన ప్రేమ. నేను నమ్మాను కనుక నన్ను దైవం రక్షించాలి, నన్ను ఉద్ధరించాలి అని నిజమైన భక్తుడు కోరుకోడు. నాకు ఏది మంచో అది నా దేవుడు ఇస్తాడని కష్టాలను సైతం ఎదురుకుని పరమాత్ముడిపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. అందుకే ప్రహ్లాదుడు ప్రత్యేకించి రక్షించమని అడగలేదు.

పరమాత్ముడి అనుగ్రహం ప్రసరించింది. హిరణ్యకశిపుడి ఆలోచన బెడిసికొట్టింది. అగ్ని ప్రహ్లాదుడికి చిన్న అపకారం కూడా చేయలేదు. కానీ హోలిక ఆ అగ్నిజ్వాలలకు మడి మసైపొయింది. పసివాడు, పరమభాగవతుడైన ప్రహ్లాదుడు చిరునవ్వులు చిందిస్తూ అగ్ని నుండి బయటకు వచ్చాడు.

మన చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు చిహ్నంగా హోలికా దహనాన్ని చేసి హోలి జరుపుకుంటాం.

సజ్జనులు, తపస్వులు, సత్యవంతులైన భగవత్భక్తులకు అపకారం చేయదలిస్తే సర్వనాశనమవుతారని, భగవంతుడుని నమ్ముకున్న వారు సదా రక్షింపబడతారని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మాత్రమే.

ఓం నమో నారాయణాయ              

Thursday 5 March 2015

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు

## Must read this ##

6 మార్చి 2014, శుక్రవారం, హోలీ

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు.

భారతీయుల ప్రతి పండుగలోనూ పర్యావరణము, ఆరోగ్యం ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. హోలీకా దహనం కూడా అలాంటిదే. హోలికా దహనంలో వాడే కట్టెలు కూడా ఔషధగుణములున్న వాటినే ఎంచుకునేవారు. యావత్ భారతదేశంలో ఒకేరాత్రి హోలికా దహనం చేయటం వల్ల శీతాకాలపు చలి- వేసికాలపు వేడి కలిసే ఈ ఋతుపరివర్తన సమయంలో వ్యాపించే మలేరియా, చర్మవ్యాధులు వంటి అంటురోగాలకు కారకాలైన క్రిమికీటకాలు నశిస్తాయి. సూర్యుడి వేడి ఇంకా పెరగకముందే వాయుమండలాన్ని వేడెక్కించడం, వాతావరణలోనికి ఔషధ గుణములున్న పొగను పంపించడం ద్వారా రోగకారక క్రిములు నాశనమవుతాయి. హోలీ దహనజ్వాలకు ప్రదక్షిణం చేయటం వలన 140 °F శరీరానికి తగిలడం, అక్కడున్న వారంత ఆ వాయువును పీల్చడం వలన శరీరంలో ఇంతకముందే ప్రవేశించి ఉన్న రోగకారక క్రిములు నాశనమవుతాయి.

కానీ మనం ఆధునికులం కదా. అందుకే మన పూర్వీకులకు భిన్నంగా హోలీకా దహనంలో రబ్బరు టైర్లు, ఇతర చెత్తాచెదారం వేసి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం, మన ఆరోగ్యాలను చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. భూతాపాన్ని ఇంకా పెంచేస్తున్నాం.

రంగుల విషయానికి వద్దాం. మోదుగ పూలు తెచ్చి, రోట్లో దంచి కుండలోపోసి, రసం తీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. ఆ రసం ఎర్రగా ఉంటుంది. దీనికే వసంతం అని పేరు. దానీ వావివరసుల పాటించకుండా అందరూ ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ మోదుగ పూల నుండి తీసిన కషాయం ఈ మాసం వాతావరణంలో మన దేహం మీద పడటం వలన శరీరానికి కాంతి, వర్ఛస్సు పెరుగుంతుందని, ఆరోగ్యం చేకూరుతుందని, శరీరంలో రక్తపోటు వంటి జబ్బుల వలన కలిగే ఉద్రేకాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇదంతా మన పూర్వీకుల ఆలోచన.

కానీ మనమేం చేస్తున్నాం? చెట్ల వ్రేళ్ళు, ఆకుల నుండి తీసిన సహజ రంగులకు భిన్నంగా రసాయన రంగులు వాడుతున్నాం. వాటిలో బోరిక్ యాసిడ్, గాజు పొడితో తయారైన పొటాషియం డైక్రోమేట్, ఆంలం వాడతారు. జింక్ క్లోరైడ్ కలిసిన రంగులు కొంత విషప్రభావాన్ని కలిగుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మన శరీరానికి చర్మం  రక్షాకవచం లాంటిది. స్వల్పంగా హానీ కలిగించే రసాయనిక తత్వాలు తగిలినా రక్తంలో కలువనివ్వదు. కాని, శరీరంపై గాయం ఉండటం, గాయం అప్పుడే జరిగి ఉండడటం లేదా పూర్తిగా మానని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో దానిపై ఈ రసాయనిక రంగులు తగిలితే, ఆ గాయం రంగుల రసాయనిక ప్రభావం వలన రక్తంలో ప్రసరించే ప్రమాదం ఉంది. నీటితో కలిసి లోపల ప్రవేశించిన రంగులు మలమూత్రాదుల ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ, సీసం - తగరం వంటి పదార్ధాలు శరీరంలోనికి ప్రవేశిస్తే బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. జింక్ క్లోరైడ్ వంటి రసాయనాలు కలిసిన రంగులు చర్మంపై పడితే బొబ్బలు లేచే ప్రమాదం ఉంటుంది. ఈ రంగులు ప్రమాదవశాత్తు నోటిలో పడి శరీరంలో ప్రవేశిస్తే శరీరంలోని సునితమైన భాగాలు దెబ్బతినటమే కాక చర్మం రంగు నీలంగా మారే ప్రమదం ఉంటుంది. గులాల్ తయారిలో పొటాషియం డైకోమేట్ ఉపయోగించారంటే వివిధ చర్మవ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.  

బజారులో దొరికే గులాల్ చాలావరకు రసాయనిక మిశ్రమాలే. అందుచేత వాటిని శరీరంపై ఉత్సాహం కొద్దీ రాసుకోవటంలో సంతోషం కంటే ప్రమాదమే అధికం. పిల్లల విషయంలొ మరీ  జాగ్రత్తగా ఉండాలి. కారణం- వారికి వెంటనే రంగులను దులుపుకోవాలని కానీ, కడిగేయాలని కాని తోచదు. అందుకే పిల్లలు హోలీ ఆడుతుంటే పెద్దలు దగ్గరే ఉండండి. కళ్ళలో రంగులు పడనీయకండి.

ఈ వసంతం తయారు చేసుకోవడంలో ఎంత సరదా ఉండేదో. తయారు చేస్తూనే ఒకరు మీద ఒకరు చల్లుకునేవారు, చాలా సరదాగా గడిపేవారు. పెద్దవాళ్ళని ఒకసారి కదిపితే, ఇప్పటికి ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఎంత సంతోషపడతారో. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు, జనానికి అన్నీ రెడీమేడ్ కావాలి, అవసరమైతే డబ్బు పడేస్తాం, కానీ అంత కష్టం ఎవరు పడతారు, మాకు అంత ఓపిక లేదంటారు, ఇలా అనే చాలా సరదాలను, మధురజ్ఞాపకాలను కోల్పోతున్నారు. పైగా మార్కెట్‌ను చైనా రంగులు ముంచెత్తుతున్నాయి. ఆ రంగులను కొని చైనా ఆర్ధికవ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నాం. ఒకసారి ఆలోచించండి ..................

కొత్త పోకడలు ఆరోగ్యాన్ని, ప్రకృతిని, సరదాలను, పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయి. భారతీయులు తిరిగి సంప్రదాయ బద్దంగా పండుగుల జరుపుకోవాలి. సంప్రదాయాలను కాపాడాలి.

సహజ రంగులనే వాడండి. పర్యావరణాన్ని కాపడండి. ఆరోగ్యవంతులుగా జీవించండి.

హోలీ శుభాకాంక్షలు

Wednesday 4 March 2015

హోలికా దహనం వీశేషాలు

5 మార్చి 2015, గురువారం, హోలికా దహనం
6 మార్చి 2014, శుక్రవారం, హోలీ

హోలికా దహనం ఆంతర్యం, విశేషాలు తెలుసుకుందాం.

సనాతన భారతీయ ధర్మంలో అగ్ని ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండుగలోనూ అగ్నిదేవుని ఆరాధన ఉంటుంది. హోలి అగ్నిదేవుడికి సంబంధించిన పండుగ. హోలీ ముందురోజు రాత్రి చేసే హోలికా దహనంతో మొదలవుతుంది హోలీ అంటారు Yogi Ananda Saraswathi గారు. అగ్ని దహించడానికే కాదు, కొత్త ఆరంభానికి సూచిక. అందుకే మనం ప్రతి శుభకార్యాన్ని దీపారాధనతో ప్రారంభిస్తాం. ఋగ్ వేదంలో తొలి సూక్తం కూడా అగ్నితోనే 'అగ్ని మీళే పురోహితం' అంటూ మొదలవుతుంది.

అగ్ని దేవుడు మానవులు అగ్నిహోత్రంలో వేసిన హవిస్సును (యజ్ఞ గుండంలో వేసే వాటిని హవిస్సు, హవ్యము అంటారు) ఎంత పవిత్రంగా వేస్తామో, అంతే పవిత్రంగా దేవతలకు చేరవేసి, యాగశాలకు దేవతలను తీసుకువస్తాడు. జనుల కోరికలను తీరుస్తాడు. అందుకే అగ్ని దేవుడు సంతృప్తి చెందితే సకల దేవతలు సంతృప్తి చెందుతారు.

వైదిక కాలంలో ఈ పండుగను 'నన్నావేష్టి యజ్ఞం' అనేవారు. పొలంలో సగం పండి, సగం పచ్చిగా ఉన్న ధాన్యం తెచ్చి హోమం చేసి ప్రసాదంగా స్వీకరించేవారు. ఆ అన్నం హోలీ అనబడేది. అందుచేత ఈ పండుగను హోలికోత్సవం అనేవారు.


ఆయుర్వేద శాస్త్రంలో హోలికా దహనం గురించి తెలుసుకుందాం. హోలికి ముందు రోజు రాత్రి కామదహనం చేస్తారు. కామదహనమైనా, హోలికా దహనమైనా అగ్నిని ప్రజ్వలింపజేయడం, అక్కడ నలుగురు చేరడం కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న ఆరోగ్య సూత్రం ఉంది. హోలీ శిశిర ఋతువు చివరలో వస్తుంది. కామదహనంలొ ఔషధ మూలికలకు (మామిడి, రావి, లేక మరేదైనా కావచ్చు, ఋతువును బట్టి కూడా ఏ ఏ సమిధిలను దహనం చేయాలో కూడా మనవాళ్ళు చెప్పారు) సంబంధించిన కర్రలను వాడాలి. ఈ ఆయుర్వేద ఔషధ సమిధలు కాలుతున్న సమయంలో వెలువడే ఔషధవాయువు వల్ల కొద్ది రోజుల్లో వాతావరణమార్పుకు తట్టుకునేల అక్కడున్న జనంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. తద్వారా అందరి ఆరోగ్యం కాపాడబడుతుంది. అందుకే కామదహనంలో ఔషధమూలికలను మాత్రమే కాల్చాలి. ఏ చెత్త పడితే ఆ చెత్తను కాల్చి, ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. హోలికా దహనం వెనుకనున్న ఆయుర్వేద రహస్యం ఈ లింక్‌లో ఉంది. http://ecoganesha.blogspot.in/2013/03/blog-post_26.html

ఈ పోస్టు రాయడంలో కొంతవరకు సహాపయడిన పుస్తకం :  దైవం, దివ్యానుగ్రహ మాసపత్రిక).

Edited 1st time: 15- March-2014
Edited 2nd time: 04-March-2015

Sunday 1 March 2015

హిందూ ధర్మం -148 (మహాభారతం అణుయుద్ధమా?)

47,23,920 మహాభారత యుద్ధంలో పాల్గొన్నా యుద్ధం ముగిసేసరికి 10 మాత్రమే మిగిలారు. అందులో పాండవుల పక్షం నుంచి పంచపాండవులు (ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు), శ్రీ కేష్ణుడు, సాత్యకి (యుయూధనుడు) కలిపి 7 మంది, కౌరవుల పక్షం నుంచి 3, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. ఇంత భారీ జననష్టం కలగడానికి కారణం మహాభారత యుద్ధంలో అణ్వస్త్రాలు ప్రయోగించడమే అనే వాదన కూడా ఉంది. మహాభారతం మాములు యుద్ధం కాదు అణుయుద్ధం అని అనేకమంది పాశ్చాత చరిత్రకారులు, శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఈ విషయం మీద దాదాపు 100 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ కొంత సంధిగ్దత నెలకొంది.

18 రోజుల్లో 47 లక్షల పై చిలుకు జనాభా మరణించడం సామాన్యమైన విషయం కాదు. అది మాములు ఆయుధాలతో సాధ్యమయ్యేదీ కాదు. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఇప్పుడు చెప్పబడుతున్న కురుక్షేత్రం ప్రాంతం కంటే చాలా పెద్దది. ధార్మిక గ్రంధాల్లో రెండు రకాల అస్త్రాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి అస్త్రాలు, రెండు శస్త్రాలు. అస్త్రం అనగా మంత్రించి ప్రయోగించేది, మంత్రించిన గడ్డిపరక కూడా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. శస్త్రం అనగా అణ్వస్త్రం, మిస్సైల్. బాణాలను లాంచర్స్ గా అర్దం చేసుకోవచ్చు.

అర్జునుడి గాండీవం కూడా లాంచరే (launcher) అంటున్నారు పాశ్చాత్య పరిశోధకులు. అట్లాగే అక్షయ బాణ తూణీరాలు అనగా మిస్సైల్స్‌ అని చెప్తున్నారు. ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది.

మహాభారతంలో గ్రహాంతరవాసులు కూడా పాల్గొన్నారని కొంతమంది విదేశీ పరిశోధకుల వాదన. 'కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. ఈ విద్యలో సైతం గ్రహాంతరవాసులే శిక్షణను ఇచ్చినా మరీ భీకర అస్త్రాల నియంత్రణ గెలాక్సీ నివాసుల చేతుల్లోనే వుండివుండాలి. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చు' అంటున్నారు జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.

అసలు ఆ కాలంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉందా? క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన ‘అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు.

మహాభారతం అణుయుద్ధం అనడానికి ఏమైనా ఆధారాలు దొరికాయా?

To be continued ..................

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
https://ramanan50.wordpress.com/2013/09/29/details-of-army-strength-mahabharata/
ఆంధ్రప్రభ 3 జనవరి 2015, శనివారం ప్రచురితమైన వ్యాసం.