Thursday 31 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 29 వ భాగం



తాత్కాలిక సత్యం గురించి చెప్పేటపుడు మంచి చెడు కర్మలు, దానికి తగిన ఫలాన్ని ఈశ్వరుడిస్తాడనే మాట కుదురుతుంది. అందువల్ల సత్కర్మలు చేయండని, దానికి తగిన ఫలాన్ని ఈశ్వరుడిస్తాడని, చిత్త శుద్ధి కల్గుతుందని, తరువాత అతని అనుగ్రహం లభిస్తుందని, తద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించి అతనిలో లీనం కావచ్చని చెబుతారు. ఈ మంచి కర్మలు, ధర్మశాస్త్రం విధించిన కర్మలు.


అంతా శూన్యమని దీనినందుకొనుటయే మోక్షమని చెప్పే బౌద్ధమతం, సత్యాహింసలను పాటించాలని అంటుంది. హింసను పాటిస్తే తప్పేమిటి? మంచి నడవడిక ఎందుకుండాలని ప్రశ్నించవచ్చు. అటువంటివారికి వారి దగ్గర సమాధానం దొరకదు. శంకర సిద్ధాంతంలో సమాధానం దొరుకుతుంది. మాయా జగత్తు మిథ్యయని చెప్పినపుడు ఇది పూర్తిగా సత్యము కాదు. అసత్యమూ కాదని చెప్పినపుడు ఈ మధ్యలో సత్కర్మలకు మంచి ఫలాన్ని ఇస్తాడని, మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుందని, జ్ఞాన మార్గాన్ని అవలంబించుటకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడనే మాటకు ఆస్కారం ఉంటుంది. అందుకే మీమాంసకుల కర్మ మార్గాన్ని వీరు స్వీకరించారు. బౌద్ధుల మాయావాదాన్ని ఒక దశలో స్వీకరించారు. జైనుల అహింసామార్గాన్ని గ్రహించారు. ఆయా స్థానములలో అన్నిటినీ గ్రహించారు.


అన్నీ అబద్ధమని చెప్పిన బౌద్ధమతం గాని, ఏదీ స్పష్టంగా నిర్వచించని జైన మతంగాని కర్మ - దాని ఫలాలు నిర్వహించుటలో విఫలం పొందాయి. సాధారణంగా ఈశ్వర సంబంధం లేని మతానికి ప్రజలు మ్రొగ్గు చూపరు.


బౌద్ధ జైనాలు - ప్రజల మనః ప్రవృత్తి

 

సాధారణ ప్రజలు తత్త్వాన్ని గూర్చి ఆలోచించరు. ఏదో ఒక శక్తి, ఈ జగత్తు నంతటినీ నడుపుతోందని భావిస్తారు. ఏదో మహాత్ముణ్ణి ఆదర్శంగా తీసుకొని అతడు చెప్పినది సత్యమని నమ్మి పాటిస్తూ ఉంటారు. అతడు చెప్పిన తత్త్వం ఒంటబట్టిందా లేదా అనే విచారణ లేకుండా అతణ్ణి పూజిస్తూ ఉంటారు. ఏ మతస్థులైనా కొంతైనా ఆచరిద్దామని భావిస్తారు.


Wednesday 30 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 28 వ భాగం



కర్మ జడం కదా! తగిన ఫలాన్ని అది ఎట్లా ఈయగలదు? వేదాన్ని నమ్ముతూ కర్మ, తనంతట తానే ఫలాన్నిస్తుందని, ఈశ్వరుడవసరం లేదని ఒకవైపు మీమాంసకులనగా; వేదాలను కాదని కర్మ, ఎట్లా ఫలాన్నిస్తుందో బౌద్ధ జైనాలు వివరించలేదు. కర్మ ప్రకారం మరల పుట్టుక ఉందంటారు. కనుక వీరు పునాది లేని సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంతా శూన్యమని అంటూనే, అంతా నిరంతరం మార్పు చెందుతోందని అంటూ ఫలానా కర్మలు, ఫలానా ఫలాన్ని ఇస్తాయని బౌద్ధులెట్లా నిర్ణయించగలరు? అంతా మాయయని కొట్టివేయకుండా దీనినంతటినీ నడిపే గొప్ప మనస్సు (మహత్తు) లేదా ఈశ్వరుడన్నాడని వేదాంతులంటారు.


వేదాంతులు బ్రహ్మమే సత్యమని చెబుతూ మాయా సిద్ధాంతాన్ని బౌద్ధుల నుండి తీసుకొన్నారని వేదాంతులను ఇతరులక్షేపిస్తారు. వారొక భేదాన్ని తప్పక గుర్తించాలి. మాయవల్ల బ్రహ్మము ప్రపంచంగా కన్పిస్తోందని ఈశ్వరుడు తన ఆధీనంలో మాయ నుంచుకొని ఫలాలనందిస్తాడని వేదాంతులంటారు. మరొక విధంగా చెప్పాలంటే నిర్గుణ బ్రహ్మము, నిష్క్రియ బ్రహ్మము మాయాశక్తితో కలిసి ఈశ్వరుడగుచున్నాడని, సగుణ బ్రహ్మము (ఈశ్వరుడు) ప్రపంచ వ్యవహారాలను నడిపిస్తున్నాడని అద్వైతులంటారు. సగుణ బ్రహ్మము నుండి నిర్గుణ బ్రహ్మము వైపు పయనించడమే అద్వైత లక్ష్యం. అందువల్ల మాయతో కూడిన సగుణ బ్రహ్మము యొక్క అనుగ్రహం కావాలని, జ్ఞాన మార్గానికి వెళ్ళడానికి ముందు భక్తితో ఈశ్వరుని భజించాలని అద్వైతం అంటుంది. ఇట్లా బౌద్ధానికి ఇది భిన్నం.


మరొక భేదం ఉంది. మాయ అంటే కేవలం అబద్ధం కాదు. దానిని అత్యంత అసత్ అనలేదు. నిర్గుణ బ్రహ్మమే అసలైన సత్యం. దీని మధ్యలో ప్రాతిభాసిక సత్యం ఉంది. అనగా సత్యమని భ్రమింపచేసి అసత్యమని నిరూపించుట. ఇది ఎండలో ముత్యపు చిప్ప, వెండిగా కనబడే స్థితి. ఈ మాయాలోకాన్ని ప్రాతిభాసిక సత్యమన్నారు. ఇది జ్ఞానంలో కనుమరుగై పోతుంది. కనుక ప్రాతిభాసిక సత్యం కేవలం అసత్ కాదు. అట్లాగే జగత్తు అసత్యం కాదు. ఇది మిథ్య. అనగా తాత్కాలికంగా సత్యంగా కనబడేది.


Tuesday 29 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 27 వ భాగం



కర్మలు, అణు స్వరూపాలై, ఆత్మలో చొచ్చుకొని ఆత్మను బంధిస్తాయని; బంధాలను త్రెంపుకొంటే ఆత్మకు విముక్తియని, ఆకాశం చివర భాగంలో సంతోషంతో ఉంటుందని అంటారు. అణుస్వరూపాలుగా ఆత్మలో కర్మలు ప్రవేశించడాన్ని అడ్డుకోవాలని, అందుకై తీవ్రవ్రతాలను అనుసరించాలని అంటారు.


అహింసకు ఈ మతం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దాన ధర్మాలకూ అంతే. ప్రాపంచిక జీవితంపై తీవ్ర ద్వేషంతో ఉంటుంది. సిద్ధాంతాలు బాగుండవచ్చుగాని సామాన్యులకు అందుబాటులో ఉండవు. అందువల్ల దానిని అనుసరించువారే దానిపై తిరుగుబాటు చేస్తారు. మన మతంలో గృహస్థాశ్రమానికి, పురుషార్థాలకు తగిన స్థానం ఉంది, అందర్నీ ఉన్నత స్థితిని చేరుకోవడానికి రకరకాల మార్గాలను సూచించింది. పరిపక్వమైన మనస్సులు కానివారికి అట్టి బౌద్ధ జైనాలు సంతృప్తి నీయలేదు. అపరిపక్వమైన పండు చెట్టునుండి పడితే రుచికరంగా ఉంటుందా? సామాన్యులు ఆ సిద్ధాంతాలను ఆచరించడం సాధ్యం కాదు కనుక ఈ దేశం నుండి అవి పోవడమో, లేదా ఈ దేశపు ఆచారాలకై మరల వారు మ్రొగ్గు చూపడమో జరిగింది.


భగవత్ తత్త్వం 


కర్మ సిద్ధాంతం గురించి కొంత మాట్లాడుకుందాం. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కారణానికి కార్యం ఉంటుంది. దీనినుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మంచి చెడు కర్మలకు తగిన ఫలముంటుంది. శరీరం పోయినా జీవుడు మరొక శరీరం దాల్చి గత జన్మలకు తగిన ఫలాన్ని పొందవలసిందే. ఈ చక్రం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మీమాంస, బౌద్ధ, జైనాలు, ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఈశ్వరుడు మాత్రం ఫలదాత కాదంటారు. ఇదీ చిత్రం.


Sunday 27 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 25 వ భాగం

 

జడమైన ప్రకృతియే ప్రపంచానికి కారణమని సాంఖ్యులన్నట్లు, న్యాయ వైశేషికాలు ప్రపంచానికి అణువులే కారణమంటాయి. కనుక వైదిక మత విరుద్ధములున్నారు శంకరులు.


ఇక బౌద్ధులకు, జైనులకు వేదము లేదు, వేదాధ్యయనమూ లేదు. కర్మకాండలు లేవు, వర్ణాశ్రమాలసలే లేవు. ఈశ్వరునే వారు కాదన్నారు. మన ధర్మ శాస్త్రాలలో ఉన్న సామాన్య ధర్మాలను వారు స్వీకరించారు. సత్యం, అహింస, అస్తేయం (దొంగతనం లేకుండుట) బ్రహ్మచర్యం, అపరిగ్రహం (అవసరాన్ని మించి ప్రోగు చేయకుండా ఉండడం) మొదలైన వాటిని గ్రహించి ఇవి అందరికీ అని అన్నారు. మనుష్యులలో పరిపక్వతను గ్రహించకుండా తీవ్రంగా అందరికీ ఈ ధర్మాలను విధించారు. జైన మతంలో భిక్షువులవలంబించే మహావ్రతము ఉంది. సామాన్యులకు తక్కువస్థాయి అను వ్రతం ఉంది. ఆ మతంలో వర్ణాశ్రమ ధర్మం లేకపోవడం వల్ల సామాన్య జనులు, ఈ అనువ్రతాలను అవలంబించలేకపోయారు. శరీరాన్ని బాధపెట్టడం వల్ల (శ్రమ) కర్మలను చేయమంటుంది. అందుకే వారిని శ్రమణులంటారు.


ఇది నిశ్చయమని మనమేమీ చెప్పనవసరం లేదని, ఎవరి అంతటవారే విచారించాలని కొద్దిగా తత్త్వాన్ని బుద్ధుడు అందించాడు. ఆ చెప్పినది, తరువాత వచ్చిన వారికి భిన్న భిన్నంగా తోచి వైభాషికమని, సౌతాంత్రికమని, యోగాచారమని, మాధ్యమికమని నాల్గు మార్గాలైంది. రెండు ప్రధాన భేదాలుగా మహాయాన హీనయానములున్నాయి. యోగాచారం, మాధ్యమికం, మహాయానం పరిధిలోనికి రాగా; సౌతాంత్రికము, వైభాషికము హీనయాన పరిధిలోనికి వస్తాయి. ఇదంతా వాద వివాదాలతో ఉంటుంది.


బుద్ధుడు వేదంలో కొంతయే చెప్పాడని అన్నాను. ఉపనిషత్తులనుండి మాయనే గ్రహించాడు. కాని ఆ మాయకు ఆధారమైన సత్యాన్ని గ్రహించలేదు. కనుక సచ్చిదానందుడైన పరబ్రహ్మము చేరుట లక్ష్యంగా బౌద్ధము చెప్పదు. ఈ మాయనుండి, మాటిమాటికీ మారే జగత్తునుండి విముక్తులై శూన్యస్థితిని అందుకోవడమే నిర్వాణమని, లేదా మోక్షమని అంటుంది. ఉన్నదానిని లేదంటూ ధ్యానం వల్ల ఎట్లా తెలిసికోగలం? బ్రహ్మానందముండగా అంతా శూన్యమవడం ఎట్లా? నిత్య వ్యవహారంలోనే బ్రహ్మానంద మనుభవించామని అంటాం కదా! ఇక సమాధిలో అనుభవించిన వారికి ఎట్లా లేదని చెప్పగలం?


శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 26 వ భాగం



ప్రపంచం లేదు, జీవం లేదు. ఈశ్వరుడు లేడు, ఆత్మ లేదు, పరబ్రహ్మము లేదు, కనబడేదంతా భ్రాంతియే. కనబడుట, కనబడకపోవుట నిరంతరంగా సాగుతూ ఉండడం వల్ల జీవం ఉన్నట్లు భ్రాంతి కల్గుతోంది. ఊదితే దీపం, ఆరిపోవునట్లు అన్నిటినీ ఊది వేయగా నిర్వాణం కల్గుతుందని బౌద్ధం అంటుంది. జీవుడు పరమాత్మలో ఐక్యమయినపుడు ఈ జగత్తు జీవించుట అంతా అబద్ధమని వేదాంతము చెబుతుంది. జ్ఞానం రానంతవరకూ, అతనిలో ఐక్యం కానంతవరకూ మాయా శక్తితో కూడిన ఈశ్వరుడై బ్రహ్మము ఇదంతా ఆడిస్తున్నాడని, ఒక క్రమపద్ధతిలో ఈశ్వరుడు దీనిని నడుపుతున్నాడని, ప్రపంచము పారమార్థిక సత్యం కాపోయినా, వ్యావహారిక సత్యమని (కొంత కాలం ఉండిపోయేదని) జ్ఞానం పట్టుబడనంతవరకూ ధార్మికమైన నియమాలు అందరూ పాటించాలని అంటుంది వేదాంతం. బౌద్ధం, ఈశ్వరునీ నమ్మదు, వ్యావహారిక సత్యాన్నీ నమ్మదు. అన్నీ కనిపిస్తూ మరుగైపోతాయంటుంది. అయితే కర్మసిద్ధాంతాన్ని బౌద్ధులంగీకరిస్తారు. కారణ కార్యాలుండడం వల్ల పునర్జన్మనూ అంగీకరిస్తారు. ఇట్టి పద్ధతి అసంబద్ధంగా ఉంటుంది.


బ్రహ్మము గురించి జైన మతము చెప్పక పోయినా, అది ఉందని గాని, లేదని గాని కంఠోక్తిగా చెప్పదు. దీనిని స్యాత్వాదమంటారు. కొన్ని ఇట్లా ఉండవచ్చు అని అంటుందే కాని ఇది ఇట్లా ఉంటుందని గట్టిగా చెప్పదు. కావచ్చు, కాకపోవచ్చనే భేదం, ఇది ఏడు రకాలుగా ఉంటుంది. (సప్తభంగి). కాని ఒక చిక్కు సమస్యలా ఉంటుంది. స్యాత్ అస్తి = వస్తువక్కడ ఉండవచ్చు; స్వాత్ నాస్తి=అందుండకపోవచ్చు; స్యాత్ అస్తి నాస్తి = అది అక్కడ ఉండవచ్చు, లేకపోవచ్చు; స్యాత్ అవక్తవ్య= దానిని నిర్వచించకపోవచ్చు; స్యాత్ అస్తిచ అవక్తవ్య = అది అక్కడ ఉన్నా నిర్ధారణగా అది ఎట్లానో చెప్పలేకపోవచ్చు; స్వాత్ నాస్తిచ అవక్తవ్య : = ఆ వస్తువు అక్కడ లేకపోయినా దాని స్వరూపాన్ని చెప్పలేకపోవచ్చు; స్యాత్ అస్తిచ, నాస్తిచ అవక్తవ్య= ఆ వస్తువు వుందని గాని లేదని గాని చెప్పుటకు వీలు పడకపోవచ్చు.


ఇట్లా సాగుతూ ఉంటే ఏ నిర్ణయానికి వచ్చినట్లు? జ్ఞాన స్వరూపము, ఆత్మయని జైనమతం అంగీకరిస్తూ, శరీరమెంత ఉంటుందో ఆత్మ అంత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పింది. చీమలో చీమంత ఆత్మ; ఏనుగులో ఏనుగంత ఆత్మయని; చీమ, ఏనుగుగా జన్మిస్తే ఏనుగంత ఆత్మ ఉంటుందని అంటుంది.


Saturday 26 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 24 వ భాగం



అఖండ చైతన్యమైన బ్రహ్మమే ప్రపంచానికి కారణమని ఉపనిషత్తులంటాయి. కాని జడమైన ప్రకృతియే కారణమని సాంఖ్యం అంటుంది. ఈ ప్రధానమైన భేదాన్ని మనసులో పెట్టుకొని సాంఖ్యం, వైదిక సంప్రదాయానికి చెందినదని శంకరులన్నారు.


వేదాంతుల మాదిరిగానే, సాంఖ్య పురుషుడు (ఆత్మ) నిష్క్రియుడు. కాని ఇతని తృప్తికోసం ప్రకృతి సృష్టిస్తోందని సాంఖ్యమంటుంది. ఇది వేదాంతానికి, బుద్ధికి రుచించనిమాట. అనుభవించుట యనేది ఒక క్రియ కాదా? పురుషుడు నిష్క్రియుడైతే తనంతట తాను ప్రకృతి వ్యవహరించగలదా? సమాధి సుఖాన్ని పొందినవారు, పురుషుడైన ఆత్మ, పనికి కారకుడు కాదని, అతడనుభవించబడడని అంటారు. ఒకమూల పురుషుడు, కర్త కాదంటూ అనుభవించడం సబబుగా ఉందా?


చిత్తాన్ని అదుపులో ఉంచేది యోగపద్ధతి. సమాధి స్థితి, ఎట్లా పట్టుబడుతుందో చెబుతుంది. ఇది అష్టాంగాలలో ఉంటుంది. దీనిని అనుసరించేవారు నేటికీ ఉన్నారు. లాభాలను పొందుతున్నారు. దీనిలో ఈశ్వరుడున్నాడు. మిగిలినదంతా సాంఖ్యాన్ని అనుసరిస్తుంది. కనుక సాంఖ్యంలోని లోటుపాట్లు, ఇందులోనూ ఉంటాయి. చరాచర వస్తు ప్రపంచాన్ని నడిపేవాడు ఈశ్వరుడనే మాటను, ఫలదాతయనే మాటనూ పలుకకుండా అతడు శుద్ధుడని, దుఃఖాలంటనివాడని, అభ్యాసకునకు ఆదర్శప్రాయుడని, చితైకాగ్రతకు దోహదం చేస్తాడని వీరు అంటారు.


న్యాయ, వైశేషిక మతాలు కేవలం బుద్ధి గమ్యాలు. తర్కంపై న్యాయం ఆధారపడింది. బ్రహ్మ సత్యమని, మాయ, జీవులనే తొడుగులు తొడిగిందని జ్ఞానం వల్ల ఆ ముసుగులును తొలగించాలని, బ్రహ్మముతో ఐక్యం కావాలని వేదాంతం చెప్పగా పై రెండు మతాలు జీవులు, ప్రపంచమూ సత్యమేయని, ముసుగులంటూ ఏమీ లేవని ఒక్క పరమాత్మ అనుటకు పెక్కు ఆత్మలని అంటాయి. వైశేషిక సిద్ధాంతము, న్యాయ మతాన్నే అనుసరిస్తుంది. చరాచర వస్తువులలోనున్న విశేషాన్ని గుర్తిస్తుంది. అనగా ప్రత్యేకతను. దీని మత ప్రకారం జగత్తు, జీవభావం జ్ఞానం వల్ల పోదని, చరాచర వస్తు ప్రపంచం అంతా అణువులతో నిర్మితమైందని, అవి విభజించడానికి వీలు లేవని, అణువుల కలయిక వస్తూత్పత్తి మొదలైన విషయాలనందిస్తుంది. శరీరము ప్రపంచమూ అంతా అణువులతో నిర్మింపబడిందే, ఆత్మయే చైతన్య స్వరూపమని తెలిసి, జీవన మరణ ప్రవాహం నుండి విముక్తులు కావాలని చెబుతుంది. సాంఖ్యంలో ఏ లోటుపాటులున్నాయో, ఈ వైశేషికంలోనూ అవే ఉన్నాయి. కర్మనాశన మెట్లా? వాదప్రతివాదాలతో సంబంధ విముక్తి ఎట్లా?


Friday 25 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 23 వ భాగం



సాంఖ్యంలో 24 తత్వాలు, ప్రకృతి నుండి పంచ భూతాలవరకూ లెక్కింపబడ్డాయి. ప్రపంచానికి ప్రకృతియే కారణమంటారు. మనస్సు, ఇంద్రియాలు ప్రకృతి నుండే వచ్చాయని అది సత్వ రజస్తమో గుణాలను కలుపుతుందని, చరాచర వస్తు ప్రపంచమూ దాని నుండే వచ్చిందని అంటారు. ఇక జీవంతో ఉన్నవాడు పురుషుడే. అతడు ప్రకృతితో సంబంధం లేకుండా ఉండగలడు. అతడు కార్యాలలో మునిగి తేలడు. కాని ఇతని సన్నిధానం వలన ప్రకృతి, అన్ని కార్యాలను నిర్వహిస్తుంది. జీవుడు ఈ 24 లను (పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు మొదలైనవి) నిశితంగా గమనించి వాటిని తొలగించుకుని, పై మూడు గుణాలకు సమతౌల్యం తీసుకొని రాగలిగితే ప్రకృతి నుండి విడివడి కేవలం పురుషునిగా ఉండగలగడమే కైవల్యమని, లేదా మోక్షం అంటారు. ఇది వారి సిద్ధాంతము.


వీరి పురుషుడు వేదాంతులు చెప్పే నిర్గుణమైన ఆత్మతో; ప్రకృతి - మాయతో సమానము, కాని మన వేదాంతము, ఆత్మయే పరమాత్మయని లేదా బ్రహ్మమని, ప్రపంచము కనబడుతున్నట్లుగా ఉంటుంది, మాయవల్ల కల్పనగా ఉందని అంటుంది. ఇక మాయ లేదా ప్రకృతి అన్నిటికీ కారణమైనపుడు ఆత్మ, జ్ఞానంతో ఉన్న పురుషుడు, ఒక్కరు కాదా? పెక్కు ఆత్మలుంటాయా?


మీమాంసకులున్నట్లుగానే సాంఖ్యులు కూడా ఈశ్వరుని అంగీకరించరు. కాని వేదాంతులేమంటారంటే సగుణ బ్రహ్మయైన ఈశ్వరుడు తన ఆధీనంలో మాయ నుంచుకొంటాడని, నిర్గుణ బ్రహ్మము మాయతో కలిసినపుడు ఈశ్వరుడై ప్రపంచ ప్రవర్తకుడౌతున్నాడని చెబుతుంది. పురుషుని కెట్టి సంబంధం లేదని, అతడుండడం వల్లనే ప్రకృతి, ఈ నాటకం ఆడుతోందని సాంఖ్యులు చెప్పే మాట సబబుగా లేదు.


నిష్కామ కర్మయోగం వల్ల చిత్తశుద్ధిని పొంది ఈశ్వరుణ్ణి భక్తితో భజించి ఏకాగ్రతతో జ్ఞానం విచారించి చేస్తే, ప్రకృతి బంధంనుండి విముక్తులు కావచ్చని వేదాంతులంటారు. కర్మకాండను ఈశ్వరుణ్ణి విడిచి కేవలం విడువదగిన 24 తత్త్వాలను విచారణ చేస్తేనే విముక్తి ఎట్లా సిద్ధిస్తుందని వేదాంతులంటారు.


Thursday 24 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 22 వ భాగం



వేదాలలో శివవిష్ణు సంబంధమైన విషయాలుంటాయి. విశిష్టాద్వైత, ద్వైత సంప్రదాయాలలో శివుని విడిచి కేవలం విష్ణు సంబంధమైన వాటినే స్వీకరించారు. అట్లే శివాద్వైతంలో శైవ సిద్ధాంతాలలో విష్ణువును విస్మరించారు.


ఇక మీమాంసకులు వేదంలోని కర్మమార్గాన్నే గ్రహించి జ్ఞాన కాండను విస్మరించారు. వేదంలో జగత్తు, మిథ్య అనే మాటనే తీసుకొని దీనికొక రూపునిచ్చి బౌద్ధం వచ్చింది. ఇట్లా పదాలలో కొంత గ్రహించడం, కొంత మానివేయడం ఇతర సంప్రదాయాలలో కన్పిస్తాయి. శంకర మతం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. శంకర సంప్రదాయంలో ఉన్నది వైదిక మతమే. వీరు వేదంలోని కర్మ, భక్తి, జ్ఞాన యోగ, ధర్మ, శివ, విష్ణు సంబంధ విషయాలన్నిటినీ గ్రహించి సమన్వయించారు. అందరి దేవతలను పూజించారు.


ఇతర మతాల గురించి


శంకరులు అసంపూర్ణ మతాలు లేకుండా ఎట్లా చేసారో వివరిస్తాను. కర్మకాండకు ప్రాధాన్యమిచ్చే మీమాసంకుల గురించి చెప్పాను. ఈశ్వరుడీ జగత్తును సృష్టించాడని వీరనరు. అతడు కర్మఫలదాత యని కూడా వీరనరు. వారికి సగుణ బ్రహ్మమూ లేదు, నిర్గుణ బ్రహ్మమూ లేదు. ధ్యానించరు. ఈశ్వరుణ్ణి పూజించరు. స్వర్గంగాని, లేదా దాని పైనున్న మోక్షంగాని కావాలన్నా కర్మానుష్ఠానం చేస్తే చాలని వారంటారు. తామే వేదాన్ని పూర్తిగా పాటిస్తున్నామని, జ్ఞానం పేరుతో కర్మను విడిచిన సన్న్యాసిని చూడడం కూడా పాపమని భావిస్తారు.


వేదాంతులతో బాటు వేదాన్ని పూర్తిగా నమ్మినవారు మీమాంసకులు. వీరు వేదంలో చెప్పబడిన కర్మలనే ఆచరిస్తారు. అవి న్యాయ, వైశేషిక, సాంఖ్య యోగాలు. వేదమంత్రాల ప్రామాణ్యాన్ని శంకించరు. అయితే తమ సిద్ధాంతాలకు వేదమే మూలమని గట్టిగా వాదించరు. అయినా మీమాంస, అసంపూర్ణమైన మతమే. పాఠశాల చదువునుండి కళాశాలలోకి వెడతాం. ఆ పాఠశాల చదువే గొప్పదంటే ఎలా?


Wednesday 23 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 21 వ భాగం

 

అయితే అందరూ శంకర సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారా? లేరు. రామానుజ, మధ్వ, శ్రీ కృష్ణ చైతన్య, వల్లభాచార్య, శ్రీ కంఠాచార్య, మేయ కండర్ మొదలైనవారి సంప్రదాయ వాదులున్నారు. ఇవన్నీ శంకరుల తరువాత వచ్చిన సంప్రదాయాలే. ఒక్క అద్వైతం, అవిచ్ఛిన్నంగా వస్తోంది. శంకరులు తరువాత వచ్చిన వారు శంకర సంప్రదాయాన్ని నిర్మూలించలేకపోయారు. రామానుజులు వచ్చిన తరువాత, అద్వైతం కనుమరుగైపోయిందా? మధ్వాచార్యులు వచ్చిన తరువాత అద్వైతం, విశిష్టాద్వైతం లేకుండా పోయాయా? ఇతర సంప్రదాయాలను క్రొత్తగా వచ్చినవి నిర్మూలింపలేకపోయాయి. శంకరుల కాలంలోనే అందరూ అద్వైత సంప్రదాయానికి తల ఒగ్గారు. వారి తరువాత చాలాకాలం వరకూ అట్లాగే సాగింది. అందుకే వారు జగద్గురువులయ్యారు. ఈ బిరుదు కేవలం గౌరవంతో పెట్టింది కాదు.


జగత్ అనినపుడు మిగతా దేశమతాల ప్రస్తావన తీసుకొని రానవసరం లేదు. ఈ దేశం కర్మభూమి కనుక, ప్రపంచానికే గుండెకాయ వంటిది. కనుక, దీని గురించి మాట్లాడదాం. భారతదేశం పూర్వకాలంలో భరత ఖండంగా ప్రసిద్ధి. ఇది ఎంతో విస్తరించిన ప్రాంతం, అంగ, వంగ, కళింగాది 56 దేశాలతో ఉండేది. ఆచార్యులు వాటన్నిటిలోనూ పర్యటించి మిగతా మతాల ఖండన చేసి అద్వైత స్థాపన చేసారు. కనుక వీరికి జగద్గురుత్వం వచ్చింది.


శంకర సంప్రదాయమే వైదికం, అన్నిటిని సమన్వియించేది


ఈనాడే సంప్రదాయమున్నా అన్నిటికీ వేదమే కదా ఆధారం. మిగిలిన వారు వేదాన్ని అంగీకరించినా లేకపోయినా మిగిలిన దేశాలలో అనుసరించేవాటికి కూడా మూలాలు వేదంలో కన్పిస్తాయి. ఈనాటికీ సిద్ధాంతాలే కాదు, కర్మకాండ యొక్క ఛాయలూ మిగతా దేశాలలో కన్పిస్తాయి (లోగడ ఉపన్యాసాలలో అనేక ఉదాహరణలను స్వామివారు పేర్కొన్నారు. చూ. అమృతవాణి-6).


Tuesday 22 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 20 వ భాగం



ఇక బుద్ధ మతం, ఇక్కడ పుట్టినా అంతరించి మిగతా దేశాలలో వ్యాపించింది. ఇక జైన మతానికి ప్రత్యేకత ఉన్నా హిందూ పూజా విధానాన్నే స్వీకరించింది. వీరికీ హిందువులకూ పరస్పర వివాహ సంబంధాలున్నాయి. శంకరుల భాష్యంలో దీనిని గురించి ఎక్కువగా ప్రస్తావింపబడలేదు. అంతేకాదు, బౌద్ధ మతాన్ని కూడా వీరు విస్తారంగా ఖండించలేదు. తరువాత దీనిపై చర్చిద్దాం.


ఈనాడు శైవం, వైష్ణవం ఉన్నా శంకరులు ఖండిచిన శైవ వైష్ణవ సిద్ధాంతాలు వేరు, శంకరుల తరువాత వచ్చిన ఆచార్య పురుషులు శంకరుల కాలంలోని ఈ మతాలలో కొన్నిటిని గ్రహించి యుండవచ్చు. రామానుజుల వైష్ణవంలో పాంచరాత్ర సిద్ధాంతాలున్నాయి. అట్లాగే సిద్ధాంత శైవంలో శంకరులు ఖండించిన పాశుపత సిద్ధాంతాలున్నాయి. కనుక ఈనాడు ప్రచారంలో ఉన్న శైవ వైష్ణవాలకు క్రొత్త రూపును సంతరింప చేసారు పై ఆచార్య పురుషులు.


న్యాయ మీమాంసలను నేడధ్యయనం చేస్తున్నా వీటి అనుయాయులు నేడు లేరు. అంటే న్యాయ మతాలవలంకులు, మీమాసంతావలంబకులు లేరన్నమాట. ఈనాడు యోగాన్ని అభ్యసిస్తున్నా యోగమతాన్ని అనుసరిస్తున్నామని ఎవ్వరూ అనరు. ఇట్లా అనేక మతాలు కనుమరుగైపోయాయి.


శంకరుల అద్భుత కృత్యం చాలా మతాలు నేడంతరించాయని దీనికి కారణం ఒక సన్న్యాసి అంటే వారి ఆధ్యాత్మిక శక్తి, మేధా సంపదన వాదనా పటిమలను చూసి అట్టి వారిని అవతారమని కీర్తించమా? వారు జీవించిన కాలం 32 సంవత్సరాలే కదా!


Monday 21 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 19 వ భాగం



శంకర విజయం


శంకరుల కాలంలో 72 మతాలున్నాయని, శంకర విజయం చెప్పిందని లోగడ అన్నాను. విజయం అంటే జయించుట. ఏమిటక్కడ విజయం? ఎవరిపై విజయం? ప్రజల మనస్సులపై విజయం. రాజులు చేసేది, దిగ్విజయం. మహాత్ములు ఆత్మజయాన్ని పొందారు కనుక, చెడ్డ భావాలు దరి చేరవు కనుక అందరి మనస్సులను జయించారు. శంకరులకు 'ద్విసప్తతి మతోచ్చేత్రేనమః' అని ఒక నామం. అనగా 72 మతాలను లేకుండా చేసారని అర్ధం.


72 మతాలు


వీటి పేర్లు కూడా నేడు తెలియవు. 40 లేదా 45 మతాలను గుర్తించవచ్చు. అన్నిటికీ ఆధార గ్రంథాలు లభించవు. అందు మీమాంస, న్యాయ వైశేషిక మతాలు వేద ధర్మానికి కొంత బాసటగా ఉంటాయి. 72 మతాల పేర్లు చెప్పలేనంత మాత్రంచే ఏవో కాకమ్మ కథలు, శంకర విజయాలు చెప్పాయని భావించవద్దు.


ఆనాడు, శైవ వైష్ణవ మతాలతో బాటు బ్రహ్మను పూజించే హిరణ్య గర్భ మతమూ ఉంది. అట్లాగే ఇంద్ర, కుబేర, మన్మథ, యమ మతాలూ ఉండేవి. వారినే పరమదైవములుగా కొలిచేవారుండేవారు. అట్లాగే పితృభూత, బేతాళాదులను పూజించేవారు. 20 లేక 25 మతాలకు ఒక సిద్ధాంతమూ ఉండేది. ఇక సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, పాశుపత, కాలాముఖ, భాగవత, పాంచరాత్రాలు (శాంకర భాష్యంలో ఇవి రెండూ కలపబడ్డాయి) వేదానుకూలం కాగా, వేద విరుద్ధమైన ఆచారాలతో ఉండే గాణపత్యం, కౌమారం, శైవం, వైష్ణవం, సౌర మతాలను శంకరుడు సంస్కరించి వైదిక మతాలుగా తీర్చి దిద్దారు. వేద విరుద్ధమైన జైన, బౌద్ధాలూ ఉన్నాయి. కేవల భౌతిక వాదంతో ఉండే చార్వాకమూ ఉండేది. ఇట్లా కొన్ని మతాలను గుర్తించవచ్చు గాని చాలా వాటి పేర్లు కూడా వినబడవు. గ్రంథాలు లేవు.


Sunday 20 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 18 వ భాగం



పురాణాలలో కలి తీవ్రత, అతిశయోక్తులతో నిండి యుంటుంది. శంకరులవతరించడానికి ముందు వేదధర్మం అడుగంటిందని దేవతలు పరమేశ్వరునితో మొరపెట్టి నట్లుంది. శంకరులు కాలడిలో అవతరించినప్పుడు వేద ధర్మం పూర్తిగా అడుగంట లేదు.


యుగారంభంలో కలిలో ప్రవృత్తి మార్గానికి, నివృత్తి మార్గానికి అవకాశం ఉంటుందా అని ధర్మ శాస్త్రాలు చర్చించాయి. ఎంతవరకూ అగ్నిహోత్రం ఉంటుందో, వేదాధ్యయనం ఉంటుందో, వర్ణ విభజన ఉంటుందో అంతవరకూ నివృత్తి (సన్నాసం) ఉంటుందని నిర్ణయించాయి. కొడిగట్టే దశలో ఒక మహానుభావుడు వచ్చి దీపాన్ని వెలుగునట్లు చేస్తాడు. శంకరుల కాలంలో సంప్రదాయ విద్య, అవిచ్ఛినమైన గురు పరంపరతోనే సాగుతోంది. మిగతా యుగాలతో పోల్చినపుడు కొంత క్షీణ దశలో ఉండవచ్చు. లేకపోతే కర్మానుష్ఠానాలు చేసే సద్వంశంలో పుట్టడం గాని, గోవింద భగవత్పాదుల యొద్ద ఉపదేశం గాని శంకరులకు దక్కి యుండకపోవచ్చు. వీరికి ముందు కాశకృత్స్నుడు, ద్రవిడాచార్యుడు, బ్రహ్మానంది, భర్తృ ప్రపంచుడు, భర్తృహరి, బ్రహ్మదత్తుడు, సౌందర పాండ్యుడు మొదలైనవారు అద్వైతాన్ని గురించి చెప్పినవారే. పూజలూ, ఆలయాలూ ఉండేవి. తాంత్రిక పద్ధతులలో సాగేవాటికి వైదిక మార్గాన్ని బోధించి శంకరులు పునరుద్ధరించారని చదువుకున్నాం.


మరి ఎందుకు అంతా నాశనమైపోతోందని అన్నాయి? ప్రమాదపు హెచ్చరికలు చేసాయి? దొంగలుంటారు, జాగరూకత వహించండని రక్షక భటులు హెచ్చరించరా? అన్ని వస్తువులను బైట ఉంచి దొంగతనానికి ప్రేరేపిస్తామా? అట్లా కలి, ప్రవేశించిందని, ధర్మాన్ని రక్షించుకోండని హెచ్చరించడానికే పురాణాలట్లా చెప్పాయి.


ఇట్లా కలిలో తనను గురించి ఎవడు సమీపిస్తాడా అని భగవంతుడెదురు చూస్తూ ఉంటాడు (అని మహాస్వామి వారు చమత్కరించారు). అలా వచ్చిన వానిని అక్కున చేర్చుకుంటాడు.


మిగతా యుగాలలో ఎంతో ధ్యానము, యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు చేస్తేనే గాని అనుగ్రహించని దేవుడు కలిలో నామస్మరణ చేస్తేనే అనుగ్రహిస్తాడని చెప్పబడింది. అందుకే వ్యాసుడు కలిః సాధుః, కలిః సాధు: అని రెండు సార్లన్నాడు.


Saturday 19 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 17 వ భాగం



ఒక ముళ్ళ చెట్టు పెరిగిందంటే దానికి తగిన విత్తనం, తగిన నేల ఉన్నపుడే వృద్ధి పొందుతుంది. మానవుల మనస్సులు, పైవారి సిద్ధాంతాలను బలపరచినపుడు మాత్రమే అవి వృద్ధి పొందుతాయి. వేద ధర్మంపట్ల విముఖులైనపుడవి వృద్ధి పొందుతాయి. ఏ కర్మకాండల అవసరం లేకుండా నిర్వాణమో, లేక మోక్షమో వస్తుందంటే ప్రజలెగబడుతారు. కనుక కలిలో రాక్షసులుండరని, వారు మానవుల మనస్సులలో దూరి విజృంభిస్తారని లోగడ, అందుకే చెప్పాను. ఇతర మతాల వారు ధర్మం గురించే చెబుతున్నారని ప్రజలు భ్రాంతి పడతారు. ఇట్లా కలిపురుషుడు వీళ్ళచేత నాటకాలిస్తాడు.


కలియుగం ప్రారంభమై 2500 సంవత్సరాలు గడిచేవరకూ కృష్ణుడు, వ్యాసుడు మొదలైనవారు బోధించిన వైదిక ధర్మంవల్ల వైదిక మతం క్షీణ దశను చేరుకోలేదు. ప్రజలు నిర్లక్ష్యం చేయడం వల్ల సోడా కొట్టినపుడు ఒకమాటు బుస్సుమని గాలి తన్నుకు వచ్చినట్లు కలి విజృంభించాడు. దీనివల్ల సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే 72 మతాలు అప్పుడు ప్రచారంలో ఉండేవని కొన్ని గ్రంథాలవల్ల తెలుస్తోంది.


అధర్మానికై కలి విధింపబడ్డాడా?


చతుర్యుగాలలో కలిలో ధర్మం క్షీణిస్తుందని అనడం భగవత్ సంకల్పం కదా! కనుక కలిని ద్వేషింపనేల? అధర్మం ఉంటుందని అంటే దానిని తగ్గించే బాధ్యత మనకు లేదా? దానిని ఎగసన త్రోద్దామా?


నాటకంలో వివిధ రసాలుంటాయి. క్రోధాన్ని, భయాన్ని, క్రౌర్యాన్ని చూపించవలసి వస్తుంది. అవి హద్దు మీరకుండా దయతో ప్రజలను భగవానుడు రక్షిస్తూ ఉంటాడు. పైవి ఎక్కువ స్థాయిలో ఉంటే అది రసస్థాయికి తీసుకొని రాలేదు. విరసమే మిగులుతోంది. ఒకమూల అధర్మం ప్రబలుతూ ఉన్నా ప్రవచనాలు, భజనలు, కుంభాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కలికాలం అంతమయ్యే సమయంలో కూడా ఏ కొద్దిమందో ధార్మికులుంటారు. విత్తనాలు నశించవు, కల్కి, ఎక్కడ పుడతాడో కూడా పురాణాలు వివరించాయి. తామ్రపర్ణి నదీ తీరంలో ఉన్న విష్ణుయశస్ అనే బ్రాహ్మణుడికి కుమారుడిగా అతడు జన్మిస్తాడని అన్నాయి.


Friday 18 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 16 వ భాగం



బుద్ధిమంతులైన కొందరు, వేద ధర్మంలో కొంత గ్రహించి అదే పరమార్ధమని కొన్నిటిని ఖండించడం మొదలు పెట్టారు. వేద విరుద్ధమైన వాటిని, వేద సమ్మతములని ప్రజలచే విశ్వసింపజేసి ప్రచారం చేసారు.


ఇంద్రియ నిగ్రహం కలిగి, సదాచారం, ప్రేమా హింసలను పూర్తిగా పాటించిన బుద్ధుడు, జినుడు వంటివారు, ఈ శరీరం పోయినా ఫరవాలేదు, ఉన్నత లక్ష్యం చేరుకోవడమే మా ప్రయత్నము అని చెప్పి వేదాలు, వేద మతానుష్ఠానం అవసరం లేదని చాటారు. అయితే మన ప్రమాణ గ్రంథాలలో ఏముంది? బృహదారణ్యకోపనిషత్తులో (4-3-22) జ్ఞానికి తండ్రి లేదు, తల్లి లేదు, ప్రపంచం లేదు, దేవతలు లేరు, వేదం లేదని చెప్పబడింది. ఆ స్థితి పట్టుబడాలంటే ఎట్లా ఉండాలో వివరించింది. 'తత్త్వమసి' మహావాక్యాన్ని అందించిన ఛాందోగ్యోపనిషత్తు కూడా ఇట్లా చెప్పింది.


వేదాధ్యయనం, శాస్త్ర ప్రకారం అనుష్టానం, ఇంద్రియ నిగ్రహం, వేదం విధించిన హింస తప్ప అన్నివిధాల అహింసాపాలనం, ఉన్నవానికే అట్టి ఉన్నత స్థితి కల్గుతుందని చెప్పింది. అందువల్ల జ్ఞానులు కాని వారు, వేద విధులను పాటించవలసిందే. అందరూ బుద్ధుడూ, జినుడు కాలేరు. క్రింద మెట్టునుండి పై మెట్టునకు అడుగు వేయాలని మన మతం అంటోంది. జ్ఞాని తన నడవడిక ద్వారా దిగువ స్థాయిలో నున్నవానికి చేయూత నందీయాలని చెప్పింది. ఈ విషయమై గీత "శ్రేష్ఠుడాచరించినదే ఇతరులూ ఆచరిస్తారని” నొక్కి చెప్పింది. కనుక మహోత్తమ జ్ఞానులకుండవలసిన ధర్మాలు సామాన్యునకుండవు. ఇట్టి సందర్భంలో ఇతరమత ఖండన తప్పదు. అంటే కేవలం ఖండించడం కాదు, మన మతాన్ని సరిగా అర్థం చేసుకొనేటట్లు మనం చేయాలి. ఒప్పించగలగాలి. అందుకే శంకరులవతరించారు.


Thursday 17 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 15 వ భాగం



మన మతాన్ని ఖండించేవారిని ఎదుర్కొనడమే లక్ష్యం


అన్ని మతాలలోనూ మహాత్ములున్నారు. అందరూ భూతదయాది గుణాలను ప్రశంసించినవారే. బౌద్ధ, జైన, సాంఖ్యాది మతాలలో ఎందరో విజ్ఞాన వంతులు ప్రభవించిన మాట వాస్తవం. నాకూ బౌద్ధ నాగార్జునుని రచనలంటే ఇష్టమే.


భౌతిక దశను దాటి అభౌతిక దశను అందరూ కీర్తించినవారే కాని మన మతం జీవ బ్రహ్మైక్య వాదాన్ని చెప్పింది. భిన్న మతాలకు ప్రత్యేక లక్షణాలుండి అవి మన సంప్రదాయాన్ని తెలిసికోకుండా ఖండిస్తూ ఉన్నా వాటిని సహిస్తూ ఉండడమా? మన సంప్రదాయాన్ని వివరించవద్దా? జీవ బ్రహ్మలకు భేదం లేదని ఒక మూల చెబుతూ వర్ణ విభజన అంటూ గోడలు కట్టారేమిటని ఇతరులు ప్రశ్నిస్తే ఎందుకిట్లా ఉందో వివరించవలసిన అవసరం లేదా?


అన్ని పద్ధతులలోనూ మంచి యుంటుందని, మనం వైదిక మతస్థులతో కలిసి మెలిసి యుందామని బౌద్ధ, జైనులు భావించలేదు సరికదా, ఖండించారు. అపుడు మనం సమాధానం చెప్పవద్దా? అనేక దేశాలలో అనాదిగా వస్తున్న బలమైన మతం లేకపోవడం వల్ల బౌద్ధం, క్రైస్తవం, మహమ్మదీయ మతం ఆయా ప్రజలకు సంతృప్తినిచ్చాయి. కానీయండి, మనలను విమర్శిస్తూ ఉన్నపుడు మానవులలో, అధికారి భేదాలుంటాయని వాటికి అనుగుణంగా ఆచార వ్యవహారాలుంటాయని, క్రమ క్రమంగా అందరూ ఉన్నతిని పొందే మార్గాలున్నాయని వివరించవద్దా?


సరియైన కారణాలను చెప్పి వారూ మనలను ఖండించవచ్చు. మనమూ వారిని ఖండించవచ్చు. విమర్శించడానికి అందరికీ హక్కు ఉంది. విమర్శ అనేది రెండు రకాలుగా తప్పు. సరియైన కారణాలు చూపించకుండా వితండవాదం చేయడం ఒకటి. ఇక రెండవది మనస్సులో శత్రుత్వం పెట్టుకొని వాదించడం. భిన్న అభిప్రాయాలున్నంత మాత్రంచే ద్వేషించనవసరం లేదు. ప్రేమతోనే విమర్శించవచ్చు. వ్యక్తులనుద్దేశించి కాక అభిప్రాయ భేదాలపై దృష్టిని పెట్టి విశదీకరించవచ్చు.


Wednesday 16 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 14 వ భాగం



కలియుగం


కృష్ణావతారం ముగుస్తుందనగా కలి ప్రవేశించాడు. అంశావతారమైన వ్యాసుడు ప్రజలకు ప్రవృత్తి నివృత్తి మార్గాలలో పెట్టుటకు ఆవిర్భవించాడు. వేద విభజన చేసాడు. ఉపనిషత్ సందేశాన్ని బ్రహ్మ సూత్రాల రూపంలో అందించాడు. 18 పురాణాలనూ అందించి భక్తి మార్గాన్ని ప్రతిష్ఠించాడు.


బౌద్ధమతం జైన మతం హిందూ మతం -


అభ్యుదయ భావాలనందించాయని బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని, నేటి గాంధీ సిద్ధాంతాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. పై రెండు మతాల చరిత్రతోనే చరిత్ర పుస్తకాలు మొదలౌతాయి. హిందూమతంలోని యజ్ఞంలో హింస యుందని, వర్ణ విభజన యుంది కనుక పైవాటిని పొగుడుతూ ఉంటారు. వివిధ మనః ప్రవృత్తులు కలవారికి వివిధ ప్రవృత్తులని, సంఘం సక్రమంగా సాగాలంటే అందరూ అహింసను పాటించడం కుదరదని గుర్తించారని, నాల్గు ఆశ్రమాలను ఏర్పాటు చేసి మానవోన్నతికి దారి చూపించారు హిందువులని పొగడరు.


అందరికీ అహింసను చెప్పిన బౌద్ధమతం యొక్క నేటి పరిస్థితిని ఇతర దేశాలలో చూడండి. బౌద్ధ భిక్షువులే మాంసాహారులై యున్నారు కదా! ప్రభుత్వ పరంగా యుద్ధాలు వారు చేయవలసి వచ్చింది. ఒక్క అశోకుడు తప్ప ఏ బౌద్ధ, జైన రాజులూ యుద్ధాలు వద్దని బోధించలేదు. ఇవి తప్పని సరియని గుర్తించడం వల్లనే వారూ యుద్ధాలు చేయవలసి వచ్చింది. మన మతంలో కొందరికే యుద్ధ విద్య తప్ప మిగిలినవారికి లేదు. సన్న్యాసులకే అహింసానియమం తప్ప మిగిలిన వారికి లేదు. మాంసాహారం కూడా కొందరికే. ఇట్లా మన మతం అధికారి భేదాన్ని గుర్తించింది. ఒక కట్టుబాటు ఉండడం వల్లనే ఎందరో మహాత్ములీ మతంలో ప్రభవించారు. గొప్ప సంస్కృతి అనాదిగా పరిఢవిల్లింది. బాబిలోనియా, ఈజిప్టు, గ్రీకు నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయినా హిందూజాతి, అవిచ్ఛిన్నంగా సాగిపోతూనే యుంది. కళలు విద్యలు, నాగరికత, సంస్కృతి ఎడదెగకుండా సాగుతూనే యున్నాయి. దీనికంతటికీ రాగద్వేషాలు లేకుండా ఆలోచిస్తే వర్ణాశ్రమ విభజనయే కారణమని అంగీకరించక తప్పదు. ఒక ప్రత్యేకమైన వర్ణానికి అనేక నియమ నిష్ఠలను చెప్పడం వల్ల వారిని ఆదర్శంగా మిగిలినవారు గ్రహించి జీవించేవారు.


Tuesday 15 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 13 వ భాగం



పూర్వావతరాలలో రాక్షసుల బాధ ఉండడం వల్ల వారిని సంహరించడం, ప్రజలు భయం లేకుండా తమ తమ ధర్మాలను అనుసరిస్తూ ఉండడం సాగిపోయేది. వారి వారి స్వభావాలనుగుణంగా కొందరు ప్రవృత్తిలో, కొందరు నివృత్తిలో మార్గంలోనూ నడుస్తూ ఉండేవారు.


మధ్య మధ్య జ్ఞానం యొక్క గొప్పదనాన్ని ప్రకటించడం కోసం దత్త, హంసావతారాలనెత్తవలసి వచ్చింది. తీవ్రమైన బాధ లేర్పడినప్పుడు తన శక్తినంతటినీ ప్రకటిస్తూ ప్రత్యేకావతారాల నెత్తవలసి వచ్చింది. అది దశావతార ప్రయోజనం.


నర, నారాయణ, కపిల, దత్త, వ్యాస మొదలైన అవతారాలను అంశావతారాలని అంటారు. 24 అవతారాలలో అంశావతరాలూ ఉన్నాయి. ఇందు జ్ఞానోపదేశం కోసం వచ్చినవి కొన్ని, దశావతారాలు, ధన్వంతరి, మోహిని మొదలగు అవతారాలు ఉన్నాయి.


ఇక రామకృష్ణావతారాలలో అసురులే మానవాకారాలు ధరించి కంస, జరాసంధ, కౌరవాదుల రూపంలో అనేక పాలకులుగా వచ్చారు. కొందరు దుష్టక్షత్రియ సంహారము, పరశురాముడు చేయవలసి వచ్చింది. అసురుల తాకిడికి తట్టుకోలేక భూదేవి బ్రహ్మనడుగుట దేవతలను వెంట బెట్టుకొని బ్రహ్మాది దేవతలు విష్ణువును సమీపించుట - అందువల్ల కృష్ణావతారం ఆవిర్భవించుట తెలిసిందే. మానవునిగా అతడవతరించి నవనీత చౌర్యం, రాసక్రీడ, గోవర్ధన గిరి నెత్తుట, విశ్వ రూప దర్శనం, పాండవులను రక్షించుట, కుచేలాదులను బ్రోచుట మొదలైనవి ఎన్నిటినో చేసాడు. అందులో ఉపదేశం చెయ్యడం ఒకటి. ఉపదేశం చెయ్యడం కోసమే అతడవతరించలేదు. అవతారం కాలం చాలాకాలం గడిచిన తరువాతనే ఉపదేశం ఇచ్చాడు. చివరగా భక్తుడైన ఉద్ధవునకుపదేశించాడు. అదే ఉద్ధవగీత.


Monday 14 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 12 వ భాగం



కనుక ప్రవృత్తి మార్గం, కర్మ యోగంగా మారితే, దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడితే జ్ఞాన మార్గం వల్ల నివృత్తి మార్గంలో ప్రవేశించాలని సారాంశం. మీమాంసకులు చెప్పిన కర్మ మార్గంలోనే మునిగితే ఇక నివృత్తి మార్గం ఎట్లా పట్టుబడుతుంది? అతని కాలంలో నివృత్తి మార్గం అడుగంటడం వల్ల మొత్తం ప్రవృత్తి నివృత్తి మార్గాలను పునరుద్ధరించడం కోసం అవతరించాడు.


శ్రీ కృష్ణుడు - శంకరులు


కృష్ణావతారంలో పరిస్థితులెట్లా ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా అవి శంకరుల కాలంలో ఉన్నాయి. ధర్మానికి హాని జరిగినప్పుడు తానవతరిస్తానని కృష్ణుడు మాట ఈయడం వల్ల శంకరులవతరించారు. కృష్ణుడు లేకపోతే శంకరుల అవతారమూ లేదు. శంకరులే భజగోవిందం అని నల్గడలా వ్యాపింపజేసారు. వారి కులదైవం కృష్ణుడే. శంకరులకంటే ముందుగా కృష్ణునకు జగద్గురువనే బిరుదుంది. జగద్గురువైనవాడు గీతోపదేశం చేయగా మన జగద్గురువులైన శంకరులు దానికి భాష్యం వ్రాసేరు. కనుక శంకరుల గురించి చెప్పేటపుడు ముందుగా కృష్ణుని స్మరించవలసి వచ్చింది. కృష్ణావతార పరిస్థితుల కంటె దిగజారిన పరిస్థితులలో శంకరులవతరించి వలసి వచ్చింది.


పూర్వావతారాలు


కృష్ణుని ముందు చాలా అవతారాలున్నాయి. వారెవ్వరూ ఉపదేశాలీయ లేదు. ఉపదేశం ఈయవలసిన పరిస్థితి, కృష్ణుని కాలంలోనే వచ్చింది. ఎందుకంటే కర్మయోగాన్ని తరతరాలనుండి అనుసరిస్తున్నారని కృష్ణుడు ముందన్నాడు కదా!


Sunday 13 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 11 వ భాగం



ఇది కూడా అవతార ప్రయోజనమే. ఈ రెండు యోగాలలో అన్ని యోగాలూ కలుస్తాయి. అయినా ఉపదేశము సాంఖ్యయోగంతో ఆరంభపడి మోక్ష సన్యాస యోగంతో ముగుస్తుంది. కనుక ఉపదేశ లక్ష్యము, నివృత్తి మార్గమే. కొన్ని సందర్భాలలో కర్మయోగాన్ని ప్రశంసించడం వల్ల ఇతడు కర్మయోగాన్నే చెప్పాడని భ్రాంతి పడుతూ ఉంటారు. దీనికి కారణం, అర్జునుడు కర్మయోగానికే ప్రస్తుతం అర్హుడు కనుక, కర్మయోగ ప్రస్తావన చేయవలసి వచ్చింది.


జ్ఞానం ద్వారా, అనగా నివృత్తి మార్గం ద్వారా మోక్షమని చెప్పడమే కృష్ణుని లక్ష్యమని శంకరులు, గీతాభాష్య ఉపోద్ఘాతంలో వివరించారు.


కృష్ణావతారం ముందు అన్ని యోగాలూ క్షీణదశకు చేరాయి. ఇంద్రియాలను అదుపులో పెట్టామని చెబుతూ ఇంద్రియ సుఖాలకై అఱ్ఱులు చాచేవారిని మిధ్యాదారులని గీతలో (3-6) అన్నాడు. కనుక ఆనాడూ నివృత్తి మార్గంలో ఉన్నవారు సరిగా ప్రవర్తించలేదని అర్థం వస్తోంది. ఇక రెండవ అధ్యాయంలో వేదాల సారాంశాన్ని గ్రహించకుండా ప్రవర్తించే మీమాంసకులను (2-42; 43) వేదవాదరతా:- వేదాలను అనుసరిస్తున్నామని అనుకొనేవారిని గురించి చెప్పాడు. వీరు జ్ఞాన విచారం చేయడం లేదని, కేవలం కోరికలను కోరేవారని, కామాత్ములని, స్వర్గపరులని ఈసడించాడు. జనులను కర్మలలో ముంచి జనన మరణ ప్రవాహంలో కొట్టుకొనిపోయేటట్టు చేసి అందమైన మాటలను పుష్పితం వాదం (Fలౌఎర్య్ ళంగూగె) పలికేవారని, వీరూ 'అవిపశ్చితః'- సరియైన విద్వాంసులు కారని నిందించాడు కదా. అనగా కృష్ణుని కాలంలో కర్మయోగం దిగజారిపోయినట్లే.


భక్తి యోగం, వెఱ్ఱి తలలు వేసిందని, తమోగుణ భక్తివల్ల అనర్ధమని అతడు చెప్పినట్లు లోగడ చెప్పాను. కనుక అన్ని మార్గాలనూ ఉద్దరించడమే కృష్ణుని అవతార ప్రయోజనం.

Saturday 12 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 10 వ భాగం




అద్వైతంలో శాశ్వత యోగం


ఈ యోగం కూడా నిరంతరం పరమాత్మతో కూడి యుండాలి. అంటే అంతరం లేకుండా. మధ్య విరామం లేకుండా అని. రెండు వస్తువులు ఒకటైనంత వరకూ మధ్య ఎడం ఉంటుంది. ఆ ఎడం, దూరం అవుతందనే భయం పట్టుకొంటుంది. అట్టి ఎడం లేకుండా నిరంతరమూ కలిసి యుండుట, అనగా జీవ బ్రహ్మ అభేద యోగం గురించి తైత్తిరీయ ఉపనిషత్తులోని ఆనందవల్లి చెప్పింది. ఏమాత్రం ఎడం ఉన్నా ఐక్యానికి భంగం కల్గుతుందనే భయం పుడుతుందని దానిలోని ఒక మంత్రం వివరించింది. ముముక్షువు, బ్రహ్మములో ఉండగా అతనికి అభయ ప్రతిష్ట కల్గుతుందని చెప్పింది. గీతలోనూ, ఈ జీవబ్రహ్మ అభేదం చెప్పబడింది. ఈ నివృత్తి మార్గోపదేశం, క్షత్రియుడై కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న అర్జునునకు పట్టుబడడం వెంటనే సాధ్యం కాదని అతనికి ముందుగా కర్మయోగాన్ని, దాని గొప్పతనాన్ని వివరించాడు. చివరకు మోక్ష సన్న్యాస యోగాన్ని ఉపదేశించాడు. అన్ని పనుల ఫలాలను తనకు అర్పించాలని, తాను ఫలదాత అని, అప్పుడు సమస్త పాపాలనుండి విముక్తుణ్ణి చేస్తానని 'మా శుచః = దుఃఖ' పడవద్దని అన్నాడు.


తిరిగి పుంజుకునేటట్లు చేసిన కృష్ణుడు


కృష్ణుడు - అర్జునునితో " ఈ ఉపదేశాన్ని ముందుగా సూర్యునికిచ్చాను, కొన్ని తరాల వరకూ ఈ ఉపదేశం సాగింది. నీవు నా భక్తుడవు, స్నేహితుడవు కనుక నీకు ఉపదేశిస్తున్నాను అని అర్జునుని మిషగా పెట్టుకొని లోకానికి అంతటికీ అందించాడు. "కాలం గడచిన కొలదీ ఈ యోగం క్షీణదశను పొందింది, దానిని తిరిగి ఉద్ధరించి అందిస్తున్నాను" అని చెప్పాడు.


ఇక్కడ చెప్పిన యోగము, కర్మయోగమే. ఈ యోగాన్ని పూర్వరాజులు రక్షిస్తూ ఆచరిస్తూ ఉండేవారు. అది క్షీణించగా రాజవంశానికి చెందిన అర్జునునకు ఉపదేశించాడు. జ్ఞానయోగాన్ని సన్న్యాసులకు, అనగా సాంఖ్యులకు నిష్కామ కర్మ యోగాన్ని ఏనాడో అందించానని అన్నాడు. 'లోకేస్మిన్ ద్వివిధా నిష్ణాపురాప్రోక్తా మయానఘ జ్ఞాన యోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం' అనగా ప్రవృత్తి మార్గంలోనున్న వారికి కర్మయోగాన్ని, నివృత్తి మార్గంలో ఉన్నవారికి జ్ఞాన యోగాన్ని తిరిగి అందించాడు. 


Friday 11 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 9 వ భాగం



గీతలో యోగాలు

ఇందు 18 అధ్యాయాల పేర్లలో యోగం అని యుంటుంది. మొదటి అధ్యాయమే అర్జున విషాదయోగం. దీనిని యోగం అనడం ఏమిటి? 


అసలీ పేర్లు ఎవరు పెట్టారు? సమాధానం చెప్పలేం. భగవానుడు ఉపదేశించాడని నమ్మితే చాలు. వ్యాసుడే ఉంచాడన్నా తప్పులేదు. వ్యాసుడు కూడా అతని అంశావతారమేకదా!


విషాదం ఎట్లా యోగమౌతుంది? ఇందాత్మ గురించి అర్జునుడాలోచించడం లేదా? అది ఒక కారణం. అంతకు ముందు అన్నిటిని జయించి విజయుడయ్యాడు. యుద్ధ రంగంలో బంధువులను చూసి వీరిని చంపడమా? దీనికంటే ముష్టి ఎత్తుకోవడం మేలని భావించాడు. పరిపక్వమైన మనస్సులో పుట్టిన విరక్తి కాదిది. కాని అజ్ఞానం వల్ల పుట్టిన మమకారం వల్ల వీళ్ళు నావాళ్ళని భావిస్తున్నాడు. ధర్మయుద్ధం చేయవలసినవాడు ఇట్లా బెంబేలు పడడాన్ని కృష్ణుడు ఛీత్కరించాడు. ఈ విషాదాన్ని చూసే భగవానుడు, ఉపదేశం చేయవలసి వచ్చింది. ఎన్నిటిలోనో సాయం అందించిన కృష్ణుడు (సుభద్రా వివాహం మొదలైనవి) జ్ఞానోపదేశం చేయడానికి ఇంతవరకూ అవకాశం చిక్కలేదు. ఇతని తాత్కాలిక విషాదం, మంచితో సమాప్తమైంది కనుక ఇది విషాదయోగమైంది.


పరమాత్మతో ఏ రకమైన సన్నివేశమైనా అది యోగంగా మారుతుంది. లోకంలో ఫలానా వాడికి యోగం బాగుంది కాబట్టి అంత సంపాదించాడు అంటారు. ఏమిటి దీని అర్ధం? జాతకంలో గ్రహాల కలయికను బట్టే కదా! అన్ని యోగాలలో ఏది గొప్పది? పరమాత్మతో ఐక్యం కావడం గొప్ప యోగం.


Thursday 10 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 8 వ భాగం



సాధారణ ప్రజలు యోగ, వేదాంత, మీమాంసలపై దృష్టి పెట్టక కొద్దిపాటి భక్తితో ఉంటారు. ఏదో ఒక శక్తి మనలను నడిపిస్తోందని దానిని వేడితే ధనాదుల వంటివి లభిస్తాయనే నమ్ముతారు. భౌతిక ప్రయోజనాలకై ప్రయత్నం చేస్తూ, ఈశ్వరానుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు. ఉన్నది ఒక్కడైనా పెక్కుమంది దేవతలు వివిధ ఫలాలను ఇస్తారని నమ్ముతారు.


ఇది భక్తి కాదు, ఇది వట్టి వ్యాపార ధోరణియని కొందరు గేలిచేసినా వీరు భక్తి కలిగియుంటారు. అయితే ఇందులోనూ కొందరు అక్రమ మార్గాలను త్రొక్కారు. కర్మయోగం, మీమాంసకుల చేతిలో పడి ఎట్లా రూపు మాసిందో, భక్తియోగం కూడా దిగువస్థాయికి చేరుకుంది. దీనిని గీతలో 'అనేకమైన కోర్కెలకై అనేక దేవతలను కొలుస్తున్నారని' జ్ఞాన విజ్ఞాన యోగంలో గీతాచార్యుడన్నాడు. సత్త్వగుణంతో ఉన్నవారు దేవతలను, రజోగుణంతో ఉన్నవారు యక్ష రాక్షసులను, తమోగుణంతో ఉన్నవారు భూత ప్రేతాలను కొలుస్తారని శ్రద్ధాత్రయ విభాగయోగంలో సెలవిచ్చాడు. రాను రాను భక్తిమార్గంలో క్రూరకర్మలు, నరబలులూ కూడా ప్రవేశించాయి.


ప్రవృత్తి, నివృత్తి మార్గాలు పరస్పర విరుద్ధాలైనపుడు మూడవది ఎందుకుంటుందని అడగవచ్చు. భక్తి యుండడం సాధారణం కనుక కర్మ జ్ఞానాలనే పేర్కొన్నాడు. ఇదంతా మాయగా చూచే జ్ఞాని కూడా భక్తిలోనే మునిగి, మాయను గుప్పిట్లో ధరించిన భగవానుని ఈ లీలేమిటని ఆశ్చర్యపడతాడు. కొందరు భక్తులు జ్ఞానమార్గాన్ని, కర్మమార్గాన్ని విడిచి భగవానుని వాత్సల్యాది గుణాలను కీర్తిస్తూ ఉంటారు. కొందరు ప్రవృత్తిలోనే ఉండి మాకు జ్ఞానాన్ని, నివృత్తి మార్గాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తూ ఉంటారు. కర్మయోగులు, జ్ఞాన యోగులగుటకు చిత్తశుద్ధితో పాటు ఏకాగ్రత కూడా కావాలి. ఈశ్వర స్మరణ వల్ల వారికి ఏకాగ్రత లభిస్తుంది. వీరూ భక్తి మార్గంలో ప్రవేశిస్తారు. అతడు ఫలదాతయని భక్తితో ఉంటారు. ఇక చాలామంది కర్మయోగులు కాకుండా పనులు చేస్తూ, కేవలం ఫలాలనే ఆశిస్తూ కొబ్బరికాయలను కొట్టడం, అంగ ప్రదక్షిణలు మొదలైనవి చేస్తూ ఉంటారు. నాకు ఫలానాది ప్రసాదించుమని అడగడమే భక్తియని భావిస్తారు. కొన్ని కూడని పనులను చేస్తున్నా తాము భక్తులమని అతడనుగ్రహిస్తాడని భ్రాంతి పడుతూ ఉంటారు. భక్తిని అభ్యసించుటకు వేదాలలోని ఉపాసనా కాండ కావాలంటారు కొందరు. గీతలో కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు వరుసగా చెప్పబడ్డాయి.


Wednesday 9 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 7 వ భాగం



గృహస్థాశ్రమం తరువాత వానప్రస్థ, సన్న్యాసాశ్రమాలను ధర్మశాస్త్రాలు విధించాయి. ముందు ఇంద్రియ తృప్తికై కర్మలను చేసినా, కర్మయోగులై అనగా నిష్కామ కర్మయోగులై ప్రాణాలను విడిచిపెట్టేవారు. దానినే కాళిదాసు, రఘువంశంలో రాజులు చివరకు యోగులై శరీరాలను విడిచి పెట్టారని అంటాడు.


ఆనాడు కూడా కర్మను యోగంగా భావించినవారరుదే. కాని కర్మయోగుల పట్ల, జ్ఞానయోగుల పట్ల అధికాదరణ యుండేది. రాను రాను ఫలాలను ఆశించేవారెక్కువయ్యారు. ఇదే మంచిదని, సన్న్యాసం తప్పని భావించారు. రానురాను, ఈశ్వరుడు, ఆత్మసాక్షాత్కారం అనే మాటలకు స్వస్తి చెప్పి వేదంలో చెప్పిన కర్మలను చేస్తే అవే ఫలాలనిస్తాయని భావించేరు. ఈశ్వరుడు, ఫలదాత అనే మాటలను విసర్జించారు. కర్మలు చేస్తేనే స్వర్గ ప్రాప్తియనే మాటను గట్టిగా నమ్మారు, మోక్షమనేది, కేవలం జ్ఞాన విచారం వల్ల రాదని భావించారు. స్వర్గం కంటే మోక్షం ఎక్కువని భావించినా అది వస్తే రానీయండి, అనే ధోరణి ప్రబలింది. వేదం చివర భాగంలో ఉన్న ఉపనిషత్తు జ్ఞాన మార్గం చెప్పగా అది ఉత్తరమీమాంసయని; కర్మ భాగం చెప్పేది పూర్వమీమాంసగా ప్రసిద్ధిని పొందింది.


రెండు మార్గాల ఉపదేశాలు


నివృత్తి మార్గానికి, దక్షిణామూర్తి ముఖ్య గురువు. విష్ణువు కూడా హంస, దత్తాత్రేయ, హయగ్రీవ రూపాలలో అవతరించాడు. అయితే దశావతారాలలో చూపించినట్లుగా పూర్తిగా వీటిల్లో తన శక్తిని ప్రదర్శించలేదు. దక్షిణామూర్తి మౌఖికంగా ఉపదేశించలేదు గాని, ఆత్మానుభవాన్ని భక్తులు పొందునట్లు చేసాడు. అట్లాగే హయగ్రీవుడు మొదలగు దేవతలను కొలవగా వారి అనుగ్రహాన్ని చూపించారు. పరమ శివునికే, నివృత్తి మార్గోపదేష్టగా పట్టం కడతారు. దత్తాత్రేయుడు, సనకాదులూ నివృత్తి మార్గాన్ని ఉపదేశించారు. అయితే ఉపదేశమే వారి అవతార లక్ష్యమని ప్రకటించలేదు. అయితే నివృత్తి మార్గం, సామాన్యులకు అందేది కాదు. అందువల్లనే ఎందరో మహాత్ములను పంపి తాను దిగివచ్చి ఉపదేశం చేసాడు. గీతలో, భగవానుడే సూర్యునకు అనగా వివస్వంతునకు, కర్మఫలాలను ఆశించకుండా కర్మలను చేయాలని, అపుడది కర్మయోగమని పిలువబడుతుందని చెప్పాడు. సూర్యుడు తన కొడుకైన వైవస్వత మనువుకు ఉపదేశించాడు. అతని పేరుతోనున్న వైవస్వత మన్వంతరంలో మనమున్నాం. అతడు తన కొడుకునకు - ఇట్లా పరంపరగా ఉపదేశం సాగింది. ఇట్లా గీతలో కర్మయోగ, జ్ఞానయోగాలు చెప్పబడ్డాయి. మరి భక్తి యోగం మాటేమిటి? జ్ఞానయోగంలో కర్మానుష్ఠానం లేదు. ధ్యాన విచారణలే ఉంటాయి. భక్తిలో పూజలు మొదలైనవి ఉంటాయి. ఇవే కర్మలు లేని ధ్యానంలో ప్రవేశపెడతాయి. అనగా సవికల్ప సమాధి ఏర్పడుతుంది. అందే పరమేశ్వరునితో ఐక్యం.


Tuesday 8 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 6 వ భాగం



కర్మ, జడం కనుక అది ఫలాన్నియ్యదు. ఈశ్వరుడే ఫలదాత. చేసిన కర్మలకు ఫలం ఉంటుంది. పవిత్రమైన మనస్సును ప్రసాదించుట పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే. కర్మయొక్క ఫలం, చిత్త శుద్ధి అని భావించవద్దు. కర్మఫలాన్ని విడిచిపెట్టుటను, ఈ అర్థంలో భావించాలి. కర్మఫలాల త్యాగం వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.


జ్ఞాన మార్గంలో అడుగు పెట్టలేని వారు కర్మలను విదలలేరు. కనుక కర్మలను చేస్తూ ఉండి, ఫలాలను ఆశించకండని చెప్పాడు. కర్మలను చేయుట, ఫలత్యాగం నా కోసమే అని చేయండి. దానివల్ల మీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అపుడు జ్ఞాన మార్గంలోకి పయనిస్తారు. ఇప్పుడు కర్మమార్గం, కర్మయోగ మవుతుంది. జ్ఞాన మార్గమెప్పుడూ జ్ఞాన యోగమే అని అన్నాడు గీతలో.


యోగమనగా కలుపుట. జీవుణ్ణి పరమసత్యంతో కలుపుట. అనేక యోగాలు చిన్న చిన్న సందుల వంటివి. ఇవి ప్రధానమైన రహదారితో కలిసి ఉంటాయి. ఇట్లా కలపడమూ యోగమే. జ్ఞాన యోగం ఒక్కటే గమ్యాన్ని చేర్చేది. కర్మయోగం పెద్ద రహదారికి తీసుకొని వెళ్ళే సందు వంటిది. కర్మయోగంలో ఉన్నవారనేక జన్మలనెత్తి, ముఖ్యమైన రహదారికి ఏనాటికో చేరుతారు.


కాలగమనంలో కర్మయోగం యొక్క క్షీణదశ


అనాదినుండి కొందరు ప్రవృత్తి మార్గాన్ని, కొందరు నివృత్తి మార్గాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ప్రవృత్తి మార్గమైనా ఈశ్వరునే లక్ష్యంగా చెప్పింది కనుక ఒక హద్దును అతిక్రమించలేదు. కర్మమార్గము, కర్మయోగమై చిత్తశుద్ధిని పొంది నివృత్తి మార్గాన్ని అవలంబించి మోక్షాన్ని పొందుతూ ఉండేవారు.


Monday 7 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 5 వ భాగం



కొందరు ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలకై వెంపర్లాడుతూ ఉంటారు. అయితే సక్రమ మార్గంలో అనుభవించండని, మీకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఉండండని, శాస్త్రప్రకారమే కర్మకాండలు చేయండని చెప్పడం ఒకటి. ఇందులో పెక్కు నియమాలుంటాయి.


ఇక మరొక మార్గం ఉంది. కొందరు, మాకీ కర్మలూ వద్దు, ఇహ పర సుఖాలూ వద్దు, అయినా నివృత్తి మార్గం పట్టుబడలేదని వాపోతూ ఉంటారు. అట్టివారికి కర్మఫలాలను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేయండని చెప్పాడు భగవానుడు. దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని, ఇవి భగవదాజ్ఞగా చేస్తున్నామని అంటే ఆవి ఇతణ్ణి బంధించవని అన్నాడు. పరమేశ్వర ప్రీత్యర్థం అనే భావనతో చేయాలన్నాడు. అపుడు చిత్తశుద్ధి ఏర్పడిన తరువాత కర్మలను విడిచి పెట్టే స్థితి ఏర్పడుతుంది. క్రమక్రమంగా నివృత్తి మార్గంలోకి పయనిస్తాడు. అనగా అతనిలో ధ్యానం, విచారణ మొదలౌతుంది.


ఇట్లా కర్మమార్గం వల్ల రెండు ఫలాలు లభిస్తాయి. ఒకటి ఇహ పరలోక సౌఖ్యం. రెండవ మార్గంలో చిత్తశుద్ధి. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయడం చిత్తశుద్ధితో అంతం కాదు. అది జ్ఞాన మార్గంలో పయనించడానికి అర్హతను సంపాదించి పెడుతుంది.


ఫలాలను ఆశించేవాడు కూడా వేదమార్గంలో నడిస్తే ఒక క్రమశిక్షణ అతనిలో ఏర్పడి, తనకూ, సంఘానికి మేలు కలుగజేస్తుంది.


ఇంట్లోకి వాడుకోవడానికి కూరలు తోటలో పండిస్తాం. పండిన వాటిని అనుభవిస్తాం. ఒకనికి వాడుకోవడానికి కూరలు అవసరం లేకపోయినా ఏదో వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడినపుడు, ఆ బాధను మరిచి పోవడానికి కూరలను పెంచాడనుకోండి. వ్యాపార నష్టం పోతుందా? అది ఉండనే ఉంది. అట్లాగే కర్మ ఫలాలనాశించకుండా కర్మలు చేయడం వల్ల వచ్చిన లాభమేమిటి? చిత్తానికి శుద్ధి ఏర్పడడం, కర్మఫలం కాదు. కర్మఫలాలను ఆశించకుండా కర్మానుష్ఠానం చేస్తున్నాడని, నా ఆజ్ఞను పాటిస్తున్నాడని, నడవడికకు భంగం తీసుకొని రావడం లేదని, ఇతనికి చిత్త మాలిన్యం పోగొట్టాలని భగవానుడు భావిస్తాడు. అంటే భగవదనుగ్రహం కావాలన్నమాట.


Sunday 6 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 4 వ భాగం



కొందరు ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలకై వెంపర్లాడుతూ ఉంటారు. అయితే సక్రమ మార్గంలో అనుభవించండని, మీకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఉండండని, శాస్త్రప్రకారమే కర్మకాండలు చేయండని చెప్పడం ఒకటి. ఇందులో పెక్కు నియమాలుంటాయి.


ఇక మరొక మార్గం ఉంది. కొందరు, మాకీ కర్మలూ వద్దు, ఇహ పర సుఖాలూ వద్దు, అయినా నివృత్తి మార్గం పట్టుబడలేదని వాపోతూ ఉంటారు. అట్టివారికి కర్మఫలాలను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేయండని చెప్పాడు భగవానుడు. దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని, ఇవి భగవదాజ్ఞగా చేస్తున్నామని అంటే ఆవి ఇతణ్ణి బంధించవని అన్నాడు. పరమేశ్వర ప్రీత్యర్థం అనే భావనతో చేయాలన్నాడు. అపుడు చిత్తశుద్ధి ఏర్పడిన తరువాత కర్మలను విడిచి పెట్టే స్థితి ఏర్పడుతుంది. క్రమక్రమంగా నివృత్తి మార్గంలోకి పయనిస్తాడు. అనగా అతనిలో ధ్యానం, విచారణ మొదలౌతుంది.


ఇట్లా కర్మమార్గం వల్ల రెండు ఫలాలు లభిస్తాయి. ఒకటి ఇహ పరలోక సౌఖ్యం. రెండవ మార్గంలో చిత్తశుద్ధి. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయడం చిత్తశుద్ధితో అంతం కాదు. అది జ్ఞాన మార్గంలో పయనించడానికి అర్హతను సంపాదించి పెడుతుంది.


ఫలాలనాశించేవాడు కూడా వేదమార్గంలో నడిస్తే ఒక క్రమశిక్షణ అతనిలో ఏర్పడి, తనకూ, సంఘానికి మేలు కలుగజేస్తుంది.


ఇంట్లోకి వాడుకోవడానికి కూరలు తోటలో పండిస్తాం. పండిన వాటిని అనుభవిస్తాం. ఒకనికి వాడుకోవడానికి కూరలు అవసరం లేకపోయినా ఏదో వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడినపుడు, ఆ బాధను మరిచి పోవడానికి కూరలను పెంచాడనుకోండి. వ్యాపార నష్టం పోతుందా? అది ఉండనే ఉంది. అట్లాగే కర్మ ఫలాలనాశించకుండా కర్మలు చేయడం వల్ల వచ్చిన లాభమేమిటి?

Saturday 5 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 3 వ భాగం





జీవులు కర్మ సంగులగుటకు ప్రకృతియే కారణమని అదియే మాయయని అన్నారు. అయితే మాయ, తనంతట అది పనిచేస్తుందా? దీనిని నియమించువాడు, ఈశ్వరుడే. ప్రకృతియే మాయయని, దానిని తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈశ్వరుడని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పింది. నా మాయను దాటడానికి ఎవ్వరికీ శక్యం కాదని గీతలో 'మమ మాయా దురత్యయా' అన్నాడు. అందరూ నివృత్తి మార్గంలో ఉండగలరా? ఉంటే ఈ జగన్నాటకం ఎట్లా సాగుతుంది? సనకాదులు, నివృత్తి మార్గంలో ఉండడాన్ని గమనించి బ్రహ్మ, ప్రజాపతులను సృష్టించాడని వారివల్ల ప్రజోత్పత్తి అయిందని భాగవతంలో చదువుకొన్నాం కదా! అందరూ జ్ఞానులైతే ఇక నాటకం ఎట్లా సాగుతుంది?


అయితే నాటకంలో ఇష్టం వచ్చినట్లు నటించవచ్చా? కూడదని, వారికిచ్చిన స్వేచ్ఛ కొద్దిపాటిదని విచ్చలవిడిగా వారుపయోగించకూడదని ఈశ్వరుడు, ఋషుల ద్వారా సందేశమిచ్చాడు. తాత్కాలిక భోగాలననుభవిస్తున్నా వారి మధ్యలో ఒక నియతి, ప్రేమ, అందం, పరస్పర సహకారం ఉండాలని, ధర్మంతో అన్నీ కూడి యుండాలని నిర్దేశించాడు. వేదం ద్వారా ప్రవృత్తి మార్గాన్ని అందించాడు. అందే కర్మానుష్ఠాన పద్ధతి యుంటుంది.


జ్ఞానకాండాన్ని చివరగా ఉపనిషత్తులందించాయి. సంసారం నుండి విముక్తమైతే మోక్షం. పుణ్యకర్మల నిచ్చేది స్వర్గం.


కర్మమార్గం ఇచ్చే రెండు ఫలాలు


నిరంతరం కార్యమగ్నులమై ఉంటాం. తాత్కాలిక సుఖం లభిస్తూ ఉంటుంది. అయినా తృప్తి యుండదు. ఏమిటి ఇదంతా అనే తాత్కాలిక వైరాగ్యం కల్గుతూ ఉంటుంది. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యాన్ని రుచి చూస్తాం తాత్కాలికంగా. నీటిమీద వ్రాత మాదిరిగా అవి కలకాలం మనల్ని పట్టుకొని యుండవు. మరల కర్మలలో మునుగుతూ ఉంటాం. ధ్యానాదులను చేయలేం. కర్మకాండలు చేస్తూ నివృత్తి మార్గంలో పయనించడానికి అందులో రెండు మార్గాలున్నాయి.

Friday 4 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 2 వ భాగం



పెక్కుమందికి పెక్కు మార్గాలు


ఈశ్వరుడాడించే జగన్నాటకంలో మీరందరూ అరణ్యాలకు పొండి సన్యాసాన్ని స్వీకరించండి, అత్మ విచారణ చేయండంటే నూటికి 99 మంది వినరు కూడా. అట్టి తీవ్రేచ్ఛ ఉండడాన్ని ముముక్షత్వమంటారు. ముముక్షువులే ఈ జ్ఞానమార్గాన్ని అనుసరిస్తారు. ఏ నూటికో, కోటికో ఒక్కనికే పట్టుబడుతుంది. అందరూ ఏదో ఒక పనిలో మునిగి తేలుతూ ఉంటారు. ఇతరుల సాహాయ్యం, సాధనాల సాహాయ్యం అపేక్షించకుండా ఉండలేరు. వారినే గీతలో కర్మసంగులని అన్నారు. ఎందుకట్లా ఉన్నారంటే వారిలో కోరిక, కర్మ ఉండడం వల్లనే. ఆ కోరిక నెరవేరాలంటే ఊరకే కూర్చుంటే నెరవేరుతుందా? ఆత్మ సాక్షాత్కారానికే ఏ పని చేయకుండా స్తిమితంగా ఉండగలగాలి. మిగిలిన వాటిని సాధించడానికి కార్యమగ్నులు కావలసిందే.


అంటే పనులు చేస్తున్నామంటే లోనున్న ఆత్మను మరిచి దానికి దూరంగా ఉండి బాహ్యమైన వాటిల్లో తగుల్కొంటున్నామన్నమాట. దానిని ప్రవృత్తి యనే పదమే వెల్లడించింది.


ఆత్మవైపు మళ్ళడం, నివృత్తి పదం సూచిస్తుంది. అనగా ప్రవృత్తిలో కార్యమగ్నత, నివృత్తిలో కార్య విముఖత. కనుక కోరికలతో నున్నవారిని ఆత్మవిచారణ చేయండని నిర్బంధించలేం.


కార్యమగ్యులైన వారిని చెడ్డ కోరికలు కోరకుండా ఉండడానికి, మోసాలు చేయకుండా ఉండడానికి, వేదాలు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి కొన్ని విధులు నేర్పాటు చేసాయి. ధార్మిక మార్గాలను సూచించాయి. ఋషుల మాటల ద్వారా ప్రవృత్తి మార్గాన్ని సక్రమంగా ఉండేటట్లు భగవానుడే చేసాడు.


యతః ప్రవృత్తం భూతానాం యేన సర్వమిదం తతం


అని గీత చెప్పింది. అనగా ఈశ్వరుని నుండే జీవులకు ప్రవృత్తి మార్గం వచ్చిందని చెప్పింది. ఈశ్వరుడే జీవులలో ఉండి వారిని ప్రవృత్తి మార్గంలో పెడుతున్నాడని శంకరులు భాష్యంలో వివరించారు.

Thursday 3 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 1 వ భాగం



ప్రవృత్తి నివృత్తి


వేదాలు ప్రవృత్తి, నివృత్తియని రెండు మార్గాలు చూపించాయి. ప్రపంచ వ్యవహారాలను ధార్మికంగా నిర్వహించడం ప్రవృత్తిమార్గం. ప్రాపంచిక వ్యవహారానికి దూరంగా ఉండి జనన మరణ ప్రవాహం నుండి విముక్తుడగుట, పరమాత్మతో ఐక్యమగుట నివృత్తిమార్గం.


ప్రవృత్తిమార్గం, వేదచోదిత ధర్మంపై ఆధారపడి వర్ణాశ్రమాలతో ఉండి తన శ్రేయస్సునకు, సంఘ శ్రేయస్సునకు తోడ్పడే రీతితో ఉంటుంది. పుణ్య కర్మ ఫలం క్షీణించగా మరల జన్మనెత్తుట జరుగుతుంది. అంటే స్వర్గ సౌఖ్యము శాశ్వతము కాదని తేలినట్లే గదా! లోకంలో గాని, స్వర్గంలో కాని శాశ్వత సుఖం అంటూ లేదు. ఇక్కడా, అక్కడా భయం, దుఃఖం, క్రోధం మామూలే! కన్ను, చెవులు మొదలైన ఇంద్రియాల వల్ల కొంత సౌఖ్యం అనుభవించే మాట నిజమే. కాని లోనున్న ఆత్మకు ఇవి సంతోషాన్ని ప్రసాదిస్తాయా? ఆత్మతృప్తి కల్గుతుందా?


అఖండానందం అనుభవించాలంటే నివృత్తి మార్గాన్నే అనుసరించాలి. సంఘానికి దూరంగా ఉండి ఆత్మనే చింతిస్తూ అదే బ్రహ్మమని భావిస్తూ సమాధి స్థితిలో ఉండిపోవడమే. లౌకిక సుఖాలననుభవిస్తూ ఒక్కొక్కప్పుడు బ్రహ్మానందం అంటూ ఉంటారు. నిజమైన బ్రహ్మానందం నివృత్తి మార్గంలోనే. ఇట్లా అని నేను చెప్పడం కాదు. వేదమే 'అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్' అని చెప్పిందని బ్రహ్మసూత్రాలలో ఉంది. శబ్దమనగా ఇక్కడ వేదం. ఇదే ఛాందోగ్యోపనిషత్ మరల మరల చెప్పింది. నివృత్తి మార్గం వల్లనే పరమ సుఖమని, వీటి తాత్పర్యం.

Wednesday 2 March 2022

శ్రీ హనుమద్భాగవతము (176)



మూర్తీభవించిన కృతజ్ఞతలో శ్రీ రఘునాథుడు ఎంత ప్రసన్నుడై ఆంజనేయుని తన వక్షఃస్థలమునకు హత్తుకొని ఇట్లు పల్కెను.


శ్లో॥ మారుతిం ప్రాహ వత్సాద్య త్వత్ప్రసాదాన్మహాక పే॥ 

నిరామయం ప్రపశ్యామి లక్ష్మణం భ్రాతరం మమ


(ఆధ్యాత్మ రామాయణం 6-7.30)


వత్సా! మహాకపీశ్వరా ! నేడు నీ కృపావిశేషము వలననే నేను నా సోదరుడైన లక్ష్మణుని నిరామయునిగా గాంచ గల్గుచున్నాను.


వజ్రంగబలి యైన ఆంజనేయుడు ఒనరించిన ఈ మహత్తర కార్యమును శ్రీరాముడు, పునర్జీవితమును పొందిన లక్ష్మణుడు ప్రశంసించుటయేగాక వానర భల్లూక వీరులందఱు వే నోళ్ళ పొగడనారంభించి. కాని అభిమానశూన్యుడైన ఆంజనేయుని హృదయములో ఎట్టి అహంకారము కలుగ లేదు. తానేమియు చేయనివానివలె ఆయన మిన్న కుండెను. అంతయు చేయువాడు మరియొకడు కలడని, ఆయనయే అభిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీరామచంద్రుడని, తాను కేవలము నిమిత్తమాత్రుడనని ఆంజనేయుని భావము. అతడు ఒంటరిగా, అందరినుండి దూరముగా ఉండి మనస్సులో అరుణకమలముల వలె ప్రకాశించు సుకోమలములైన ప్రభువుయొక్క చరణారవింద ధ్యానములో లీనుడయ్యెను.


ఇది శ్రీకృష్ణపరమాత్మ చరణారవిందమిళిందాయ మా మాససత్వ మహావైభవ సంపన్నుడు శ్రీ మట్టుపల్లి వేంకట మహాలక్ష్మీ జగన్నాథుల తనూభవుడు భక్తజన దాసానుదాసుడు సుజన విధేయుడైన శివ సుబ్బారాయ గుప్తచే ప్రణీతంబైన శ్రీ హనుమద్భాగవతమందు పూర్వ భాగము సమాప్తము. 


శ్రీ హరిః ఓం తత్సత్


Tuesday 1 March 2022

శ్రీ హనుమద్భాగవతము (175)



శ్రీరామచంద్రుని సంక్షిప్త సమాచారమును అందఱు ఆలకించిరి. లక్ష్మణుని కొఱకై దీనాతిదీనముగా దుఃఖించుచున్న కరుణాభరితమైన శ్రీ రాముని దశ చూడగనే అందఱి నేత్ర ములు అశ్రుభరితములయ్యెను. రాత్రి గడచి పోవుచుండెను. ఆ విషయమును గ్రహించిన భరతుడు ఇట్లు పల్కెను. "వీర హనుమానుడా! నీవు నా బాణముపై కూర్చుండుము. నా బాణము నిన్నీ క్షణమందే ప్రభుని చెంతకు చేర్చగలదు. క్షణమైనను ఇక ఆలస్యము కారాదని పల్కెను. "ఏమి ! ఈ బాణము పర్వత సహితముగా నున్న నా భారమును భరింపగలదా " అని ఆంజనేయుడు తనలో శంకించెను. ఈ మహానుభావుడు వదలిన మొనలేని బాణముచే నేను మూర్ఛిల్లితిని. శ్రీరామచంద్రుని కృపనలన అంతయు సంభవమే అని ఆలోచించి ఆంజనేయుడు అంజలి ఘటించినవాడై భరతునితో 'రామానుజా ! ప్రభువు యొక్క ప్రతాపముతో నీ ఆశీర్వచనముతో ఈ క్షణమే నేను రణరంగమును చేరగల'నని పలికెను. తదనంతరము భరతుని చరణారవిందములకు ప్రణమిల్లి వాయునందనుడు వాయు వేగముతో ఆకాశమునకు ఎగిరెను.


రణరంగములో రాత్రి అధికముగా గడచుట శ్రీరాముడు అధైర్యమును పొందినవాడై దుఃఖించుచు ఇట్లు పలుకనారంభించెను. నా ప్రియసోదరుడు లక్ష్మణుడు నా కొఱకై తల్లిని, తండ్రిని, భార్యను మాత్రమేగాక సకలరాజ భోగములను, సుఖములను త్యాగం ఒనరించెను. నన్ను సేవించుటకు, సుఖంపజేయుటకు అరణ్యములందు శ్రమించెను. అట్టి త్యాగమూర్తియైన లక్ష్మణుడు లేకుండగా అయోధ్య మరలిపోగలను? వైదేహి లభించినను లక్ష్మణుడు లేనిదే నేనెట్లు జీవింపగలను? ప్రాణప్రియుడైన నా సోదరుడు లేనిచో నిశ్చయముగా నేను ప్రాణములను త్యజించెదను. తదనంతరము నా మువ్వురు తల్లులు, భరతుడు, శత్రుఘ్నుడు, సీత జీవింపరు. ఈ విధముగా అయోధ్య సర్వనాశము కాగలదు. నేను లేని కారణమున సుగ్రీవుడు, అంగదుడు మొదలగు వానర వీరులందఱు పోరును విరమించి కిష్కింధకు వెడలగలరు. కాని విభీషణునకు నేను ఒసంగినవచనం ఏమి కాగలదు? విభీషణుడు నన్నాశ్రయించెను. నాకు శరణాగతుడయ్యెను. పరమభక్తుడైన విభీషణునకు నేనొసంగినమాట చెల్లింపలేక పోయెదనేమో అని నా హృదయము భీతిల్లుచున్నది.


లీలామానుష విగ్రహుడు, భగవంతుడైన శ్రీ రాఘవేంద్రుని నయనముల నుండి అశ్రువులు ప్రవహింప నారంభించెను. కరుణాభరితమైన ఆయన విలాపమును గాంచి వానర భల్లూక వీరులు అధైర్యము చెంది విలపింప ఆరంభించిరి. వారు దుఃఖించుచు మాటి మాటికి ఆకాశము వంక చూచుచుండిరి. ఆంజనేయస్వామి వచ్చునేమో అని వారి ఆశ. సూర్యోదయసమయం ఆసన్నమగు చుండెను. అందఱు నిరాశాహృదయులైరి. సూర్యునివలె ప్రకాశించుచున్న వానర వీరుడు ఓషధిపర్వతమును హస్తమునందు ధరించి 'జయ శ్రీ రామ' జయ జయారావములను పలుకుచు ఆంజనేయుడు ఆకాశమార్గమున ఆ ప్రదేశమును చేరెను. పర్వతమును ప్రక్క నుంచి మారుతి శ్రీ రామచంద్రుని చరణముల పై పడెను. వానరవీరుల ఆనందమునకు మేర లేదు. వారందఱు ఆంజనేనుయుఇని వివిధ రీతులలో కీర్తింప ఆరభిన్చిరి. ఇంతలో సుషే ణుడు పర్వతమునుండి సంజీవని తెచ్చి లక్ష్మణునకు వాసన చూపించెను. నిద్రనుండి మేల్కాంచుచున్నట్లు లక్ష్మణుడు లేచినవాడై ఇట్లు పల్కెను. “మేఘనాథుడెక్కడ? వానికి మరణం ఆసన్నమైనది.