Tuesday 30 November 2021

శ్రీ హనుమద్భాగవతము (88)



వెంటనే హనుమానునిదృష్టి పవిత్రమైన ఒక భవనముపై పడీంది. అచట భగవానుని ఆలయమొకటి శోభిల్లుతున్నది. ఆ భవన కుడ్యములపై నంతట అనేకమైన అవతారముల యొక్క, లీలల యొక్క చిత్రములు, రామనామము అంకితమై ఉన్నాయి. దాని ద్వారముపై రాముని ఆయుధములైన ధనుర్బాణములచిహ్నములు అంకితమై ఉన్నాయి. అచట మణుల వెలుగులలో కుంకుమపువ్వుతో పాటు, ఇతరపుష్పములతో పాటు మడులలో తులసిమొక్కలు స్పష్టముగా కనిపిస్తున్నాయి. దీనిని చూడగానే హనుమంతుడు ఎంతో ఆశ్చర్యము చెందాడు, ధర్మమునకు, వేదపురాణములకు, యజ్ఞయాగములకు, గోవులకు, ద్విజులకు, దేవతలకు, భగవానునకు సహజశత్రువులైన రాక్షసుల పట్టణములలో ఈ ఆలయము౦డుటేమి?


అప్పుడే రావణుని సోదరుడైన విభీషణుడు నిద్ర నుండి లేచి శ్రీరాముని నానుమును స్మరింపసాగాడు. అతని నోటినుండి శ్రీరామనామము వినబడినంతనే నిజంగా ఇతడు భగవద్భక్తుడే అనే నమ్మకము హనుమానునకు కలిగింది. శరణాగత వత్సలుడైన హనుమానుడు వెంటనే బ్రాహ్మణవేషమును ధరించి భగవన్నామమును ఉచ్చరింపసాగాడు. రామనామమును విన్న వెంటనే విభీషణుడు బయటకు వచ్చి బ్రాహ్మణ వేషధారీ, జగత్పావనుడైన పవనపుత్రుని చరణములను ఆదరపూర్వకంగా నమస్కరించి ఇలా - ' బ్రాహ్మణ దేవా! మీరెవరు? మీరు భగవద్భక్తులే అని నా మనస్సు చెప్పుచున్నది. మిమ్ము చూసినంతనే నా మనస్సులో ప్రేమ ఉత్పన్నమవుతున్నది. లేదా మీరు మీ భక్తులకు సుఖమును కలిగించుటకై నన్ను ధన్యునిగా చేయుటకై వచ్చిన నా స్వామియైన శ్రీరాముడవు కావు గదా! దయ యుంచి నాకు మీ విషయమును చెప్పండి.


సంసారభయనాశకుడైన అంజనీనందనుడు పూర్ణమైన మధురవాక్కులను ఇట్లు పలికాడు. ప్రేమ 'నేను మహా పరాక్రమవంతుడైన వాయు దేవుని పుత్రుడను, నా పేరు హనుమానుడు. నేను శ్రీరాముని భార్య, జగజ్జనని అయిన జానకీ దేవీ జాడను తెలుసుకొనుటకై ఆయన ఆదేశాన్ని అనుసరించి ఇచటకు వచ్చాను. నిన్ను చూడగానే నా మనస్సు సంతోషముతో ఉప్పొంగినది. దయయుంచి వివరించండి”.


Monday 29 November 2021

శ్రీ హనుమద్భాగవతము (87)



మతిమంతుడైన హనుమానుడు రావణుని ఆ విశాల భవనమునంతటిని తిరిగి నిదురిస్తున్న వేలకొలది సుందరీమణులను శ్రద్ధగా చూసాడు. వెంటనే అతని మనస్సులో ఒక ఆలోచన వచ్చింది - 'నేను బాల బ్రహ్మచారిని, శ్రీరామునిదూతను, లోకమాతను వెదకుటకు వచ్చాను. కాని ఇచట నేను గాఢ నిద్రాముద్రితలై ఉన్న పరస్త్రీలను చూసాను, నాకిది తగదు. నా దృష్టి ఇంతవఱకెప్పుడూ నా తల్లిని విడచి మరియే స్త్రీ మీదను పడలేదు, కాని నేడు నేను ధర్మమునుండి చ్యుతుడనైతిని. 


ధర్మమూర్తియు, వీరకర్ముడైన హనుమానుడు ధర్మ భయముచే శంకితుడయ్యాడు, కాని మనస్సులోను, ప్రాణములోను ఆయన శరీరములోను, సర్వాంతర్యామియైన శ్రీరాముడే విరాజిల్లుచున్నాడు. అందువలన మరుసటి క్షణములోనే అతని మనస్సునకు సమాధానము తట్టినది. ఆయన ఇట్లా  ఆలోచింపసాగాడు -- ‘రావణుని స్త్రీలు సందేహము లేనివారై నిద్రించుచున్నారు. ఆ అవస్థలో వారిని నేను జాగ్రత్తగా చూసాను. కాని నా మనస్సులో ఎట్టి వికారమును కలుగలేదు. శుభాశుభములకు ప్రేరకము మనస్సు, నా ఈ మనస్సు సంపూర్ణముగా శాంతముగానూ, స్థిరముగానూ ఉన్నది. దానికి రాగముగాని ద్వేషముగాని లేదు. అందువలన నా ఈ స్త్రీ దర్శనమువలన ధర్మమునకు ఎట్టి లోపము కలిగియుండక పోవచ్చు. నేను కావాలని వారిని చూడలేదు. జానకిని అన్వేషించుటకు, గుర్తించుటకు వారిపై దృష్టిను ఉంచాను, స్త్రీ అగుట వలన సీతా దేవిని స్త్రీలలోనే వెదుకవలసివచ్చినది. ఆమెను నేను పరిశుద్ధమైన మనస్సుతోనే అన్వేషించాను, కనుక నేను పూర్తిగా దోషరహితుడనే.”


కామవిజేతయైన హనుమంతుడు జానకీ దేవిని అన్యస్థలములలో కూడా వెతికాడు. ఆయన లంకలో మిగిలిన గృహములను, వనములను, ఉపవనములను, వాటికలను, వాపీకూపములను, మందిరములను, పశుశాలలను, సభాభవనములను, సైనిక స్థావరములను, రహస్యస్థావరములను చూసాడు. ఇట్లాయన సావధానముగా రాత్రియంతా సీతను అన్వేషిస్తూనే ఉన్నాడు. కాని ఆమె జాడ ఎక్కడ తెలియరాలేదు. అతడు విచారగ్రస్తుడగుచున్నాడు. రాత్రి గడచుచున్నాడు. బ్రాహ్మముహూర్తము సమీపించుచున్నది.


Sunday 28 November 2021

శ్రీ హనుమద్భాగవతము (86)



ఇటు అటు చూస్తూ హనుమానుడు స్ఫటికమణినిర్మితమైన దివ్యమైన ఒక వేదికను చూసాడు. దానిపై రత్న నిర్మితమైన రావణుని పర్యకముండింది. దానికి నలువైవులు చాలా మంది స్త్రీలు నిలువబడి చామరములను ధరించి విసరుచున్నారు. ఉజ్జ్వలమైన ఆ పర్యంకముపై లంకాధిపతియైన రావణుడు సుఖముగా నిద్రించుచున్నాడు; అచట బ్రహ్మచారియైన హనుమానుడు రావణుని పత్నులను కూడా చూసాడు. వారాతని చరణములకు అటు నిటు నిద్రించుచున్నారు. సమీపమునందే అతనికి సంతోషమును గలుగ జేసే వీణావాదినులైన సుందరీమణులు గాఢనిద్రలో పడి ఉన్నారు. ఇంకా కొందఱి వక్షఃస్థలముపై వీణులు పడియే ఉన్నాయి. కోమలమైన వారివేళ్ళు వీణాతంత్రులను స్పృశించుచునే ఉన్నాయి. 


వారందఱికంటె వేఱుగా ఎంతో సుందరమైన శయ్యపై పరుండి ఉన్న అనుపమ రూపలావణ్యసంపన్నయైన ఒక యువతిని హనుమానుడు చూసాడు. కోమలములు, సుందరమైన ఆమె అవయవములపై ముత్యములతోనూ మణులతోనూ కూడిన వివిధమైన ఆభూషణాలు విరాజిల్లుచున్నాయి. ఆమె శరీరకాంతి సువర్ణమువలె మెఱయు చుండింది. అనుపమ రూపవతియైన ఆమె రావణుని భార్యయైన మండోదరి. ఆమెను చూసినంతనె హనుమానునకు 'ఈమె సీతా దేవియా' అనే అనుమానము కలిగింది. అతని సంతోషమునకు ఎంతు లేకపోయింది. హర్షిన్మత్తుడై ఆయన తన తోకను నేలపై కొడుతూ ముద్దిడు కొనసాగాడు. వానరుల ప్రకృతిని అనుసరించి ఆయన ఇటు అటు పరుగిడసాగాడు. ఆయన ఒక మారు స్తంభముల ఎక్కుతూ, వెంటనే మఱల క్రిందకు దూకాడు.


సద్గుణములకు నిలయమైన పవనకుమారునకు వెంటనే మఱియొక ఊహ తట్టెను - “పరమపతివ్రతయైన సీతా దేవి ప్రభువైన శ్రీరాముని వియోగమున ఎప్పుడూ అలంకరించుకొని వస్త్రాభరణములను ధరించదు. ఆమె భోజనము చేయదు, సుఖముగా శయనించదు, మద్యపానము స్వప్నమునందైనా చేయదు. శ్రీరామునితో సాటివచ్చు సౌందర్యవంతులు దేవ దానవనాగకిన్నరులలోగాని ఈ భూమిపై గల మానవులలో గాని ఎవ్వరునూ లేరు. ఇక సీత వంటి పతివ్రతా స్త్రీ పరపురుషునికడకు ఎలా వెళుతుంది? అందువలన ఈమె సీతా దేవి ఏ మాత్రమును గాదు”.


Friday 26 November 2021

శ్రీ హనుమద్భాగవతము (85)



మరల ఆయన రావణుని భవనము కడకు వేగముగా వెళ్ళాడు. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు లంఘించి రావణుని భవనములోనికి ప్రవేశించాడు. అచ్చట ఆయన శూలములు, ముద్గరములు, శక్తి, గదలు, పట్టిసములు, కోదండములు, ముసలములు, పరిఘలు, భిందిపాలములు, బల్లెములు, పాశములు, తోమరములు మున్నగు శస్త్రాస్త్రమములను ధరించి ఉన్న అసంఖ్యాకులైన రాక్షసులను, రాక్షసస్త్రీలను చూసాడు. వారందఱు విశాలకాయులు, వీరులు, అపారశక్తి సంపన్నులు. వారి దృష్టిలో పడకుండా పింగళకేశుడైన హనుమానుడు సూక్ష్మరూపముతో రావణుని భవనములోని ప్రతికక్ష్యును జాగ్రత్తగా చూస్తూ వెళ్ళుచున్నాడు. అచట ఆయన బంగారము వంటి కాంతిగలది, అనేకములైన రత్నములచే నిండినది, వివిధములైన వృక్షముల పుష్పములచే ఆచ్ఛాదితమైనది, అనుపమమైనదైన పుష్పకవిమానమును చూసాడు. అది తన దివ్యమైన కాంతిచే ప్రజ్వలితమగుచున్నట్లుంది. అద్భుతము, పరమమనోహరమైన విమానమును చూసి హనుమానుడు ఎంతో విస్మితుడయ్యాడు. కాని నలువైపులు తిరిగి చూసినా పూజనీయురాలైన సీతాదేవి కనబడకపోవుటచే అతడు చింతితుడయ్యాడు.


చింతితుడైన హనుమానుడు సీతాన్వేషణమునకై శస్త్రాస్త్రసంపన్నులైన రాక్షసవీరుల నుండి తప్పించుకొంటూ, రాక్షసరాజైన రావణుడు నివసించు ప్రదేశమునకు చేరాడు. అచట రాక్షసజాతీయపత్నులు, హరించి తెచ్చిన వేలకొలది రాజకన్యలు ఉన్నారు. అచట వరుసగా సువర్ణమయమైన దీపాలు ప్రజ్వరిల్లుచున్నాయి. అచటి నేల స్ఫటిక మణి నిర్మితము, సోపానములు మణిమయములు, వాతాయనములు సువర్ణ నిర్మితములు. 'రావణుని ఆ నివాసము స్వర్గముకంటెను ఎంతో గొప్పగా ఉన్నట్లు తోచుచున్నది.


సగమురాత్రి గడచింది. ఆ భవనమున పవనకుమారుడు రంగురంగుల వస్త్రమములను పుష్పమాలలను ధరించి అనేకమైన వేషభూషలచే విభూషితలైయున్న వేలకొలది సుందరీమణులను చూసాడు. మద్యపానము చేత, ఎక్కువగా మేలుకొని యుండుట చేత వారు ఆయా ప్రదేశములలో ఆ రాత్రి గాఢ నిద్రాపరవశలై ఉన్నారు. వారి వస్త్రములు అస్తవ్యస్తములై ఉన్నాయి. హనుమానుడు సీతా దేవిని ఇంతకుమునుపు ఎన్నడూ చూసి ఉండలేదు, కాని పతివ్రతయైబ జానకి యొక్క పరమ సాత్త్వికము, తేజస్వంతమైన రూపము గుర్తింపదగినట్లుంది. అందువలన హనుమానుడు ఆ సుందరీమణులను శ్రద్ధగా చుస్తున్నాడు. 

Thursday 25 November 2021

శ్రీ హనుమద్భాగవతము (84)



హనుమంతుడు విభీషణుని గలిసికొనుట


కపికుంజరుడైన శ్రీ పవనపుత్రుడు మూడులోకములచే నమస్కరింపదగినదైన సీతా దేవిని దర్శించుటకై ఎంతో వ్యాకులపడుచున్నాడు. అందువలన ఆయన భయంకరులైన రాక్షసులకు కనబడకుండగా విచిత్రములైన పుష్పమయ ఆభరణముచే అలంకృతమైయున్న లంకలోని ముఖ్యస్థలాలను జాగ్రత్తగా చూడసాగాడు. నగర మధ్య భాగమున రావణుని గూఢచారులెందరో ఆయనకు కనబడ్డారు. అంతేకాదు ఆయన రావణుని అంతఃపురమును జాగ్రత్తగా కాపలాకాయుచున్న శస్త్రసంపన్నులైన ఒక లక్ష మంది సైనికులను కూడా చూసాడు. అంజనానందనుడు దశాననుని అశ్వశాలను, గజశాలను, అస్త్రాగారాన్ని, మంత్రణాలయాన్ని, సైన్యస్థావరాన్ని శ్రద్ధగా చూసాడు. ఆయన సీతా దేవిని అన్వేషిస్తూ రాక్షసుల హర్మ్యములలో ప్రవేశించి వారి ఆహారవిహారములను, పడకలను, మనోరంజనాదుల స్థలాలు మొదలైనవాటిని కూడా చూసాడు.


అచట వీరవరుడైన ఆంజనేయుడు ఐశ్వర్యమదమత్తులైన నిశాచరులను, మద్యపానమత్తులైన రాక్షసులను ఎందఱినో చూసాడు. శ్రీరాముని దూతయైన హనుమంతుడు జగత్రయ విజేతయైన రావణుని లంకలోనూ ఉత్కృష్టమైన బుద్ధిగలవారు, సుందరముగా పలుకువారు, గొప్ప శ్రద్ధగలవారు, అనేక విధములైన రూపములు వర్ణములు గలవారు, సుందరములైన నామములు గలవారైన అసురులనెందఱినో చూసాడు. కాని వారిలో జనకనందిని ఎచ్చటనూ కానరాలేదు. వారి సంభాషణముల వలన కూడా ఆమె ఉనికి తెలియలేదు.


అందువలన కామరూపధారియైన పవనకుమారుడు సీతాదేవి అన్వేషిస్తూ స్వర్ణమయములైన కోటగోడలతో చుట్టబడి ఉన్న రావణుని మహలులోనికి ప్రవేశించాడు. రాజోచితములైన సామగ్రులతో నిండిన శ్రేష్ఠము సుందరమైన ఆ భవనమును చూసి సమీరకుమారుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ భవనద్వారము మిలమిలలాడే బంగారము చేయబడినది. వెండి చే చేయబడిన చిత్రములతో దానిశోభ అద్భుతముగా ఉంది. దాని రక్షణకై శస్త్రములను ధరించిన లక్షల కొలది వీరులు సావధానముగా నిలబడియుంన్నారు. సైనికులందఱు అభేధ్యమైన కవచాలను ధరించి యుంన్నారు. ఏనుగులతోను, గుఱ్ఱములతోను, రధములతోను నిండియున్న ఆ భవనము యొక్క సాటిలేని రూపమును చూసి పవనకుమారుడు ఎంతో చకితుడయ్యాడు, కాని ఆయన నేత్రములు జనక నందినిని అన్వేషించుటలోనే నిమగ్నములై యున్నవి.


సర్వవిద్యావిశారదుడైన హనుమంతుడు ఆ భవనమునకు చుట్టుప్రక్కలనున్న భవనములలో ప్రవేశించి సీతా దేవి జాడను తెలుసుకునే పని ప్రారంభించాడు. ఆయన లంఘించి కుంభకర్ణుని భవనంలోకి ప్రవేశించాడు. అచట నుండి మహోదర విరూపాక్ష విద్యుజ్జిహ్వ విద్యున్మాలురగృహములలోనికి వెళ్ళాడు. ఆ అసురులు అమిత సంపదలను, మహావైభవమును చూస్తు నిర్భయుడైన హనుమంతుడు దూకి వజ్రదంష్టశుక సారణుల గృహములలోనికి వెళ్ళాడు. ఆయన సీతను అన్వేషిస్తూ ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలీల ఇళ్ళకు కూడా వెళ్ళాడు. అచట సీతా దేవి కనబడలేదు. అమితవిక్రమశాలియైన హనుమానుడు రశ్మి కేతు సూర్యశత్రు వజ్రకాయులభవనములోనికి వెళ్ళాడు. సీతా దేవి జాడను తెలుసుకొనుటకు పవననందనుడు ఎంతో శ్రమపడుచున్నాడు. ఆయన ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, చక్రుడు, శరుడు, కపటుడు, హ్రస్వ కర్ణుడు, దంష్ట్రుడు, లోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, ద్విజిహ్యుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు మొదలైన సుప్రసిద్ధులైన అసురుల గృహములలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. కాని అచట ఎక్కడ గూడ జానికి దర్శనము కాలేదు.

Wednesday 24 November 2021

ఆచారాలను తర్వాతి తరాలకు నేర్పాల్సింది పెద్దలే



మన సంస్కృతి, సంప్రదాయలు, మన ఇంటి ఆచారవ్యవహారలు మన తర్వాతి తరాలు కూడా పాటించాలంటే అన్నిటికంటే ముందు కుటుంబాల్లో ఉన్న పెద్దలు శ్రద్ధగా సంప్రదాయలను పాటించాలి. ఇతర దేశాల్లో దీని మీద పరిశోధనలు కూడా జరిగాయి. పిల్లలు ఏది పాటిస్తారని చూడగా, పెద్దలు చెప్పింది చూసి పిల్లలు నేర్చుకోరట, పెద్దల నడవడిని మాత్రమే పిల్లలు చూసి నేర్చుకుంటారని తేలింది.


బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళలో కూడా ఇంట్లో పూజలు చేసుకోవడం రానివారిని కూడా నేను చూసాను. దళిత కుటుంబాల్లో పుట్టినా, తమ పెద్దలు శ్రద్ధగా పాటిస్తున్న ఆచరాన్ని చూసి నేర్చుకుని పాటించే వాళ్ళానీ చూశాను. అంటే బ్రాహ్మణులంతా అలా ఉంటారని కాదు. కాని అదొక్క చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంట్లో ఎవ్వరూ పాటించకున్నా నేర్చుకునేవారు కూడా లేకపోలేదు. అది మినహాయింపు అనుకోండి. దానికి కారనం పూర్వజన్మ వాసన.


మా చిన్నప్పుడు మా బామ్మ, అమ్మ, అమ్మమ్మ మన సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పారు. కార్తిక మాసం మొదలైనవి వచ్చినప్పుడు సాయంకాలం చీకటి పడే సమయానికి బడి నుంచి వచ్చిన మేము కాళ్ళు చేతులు కడ్డుక్కుని శుభ్రంగా ఉంటే ఆవిడ దీపం వెలిగించి దణ్ణం పెట్టుకోమనేవారు. మాతోనూ పెట్టించేవారు. అలా మాకు చిన్నప్పుడే కార్తికమాసం అంటే దీపాలు పెట్టాలని తెలిసింది. మూడవ తరగతి నాటికే మిత్రబృందం (అందరం చిన్నపిల్లలమే) అంతా గుడికి వెళ్ళి, అక్కడ కూడా దీపాలు వెలిగించేవాళ్ళము. కార్తిక సోమవారమని ఇంట్లో ఉపవాసాలు చేస్తుంటే మేమూ చేసేవాళ్ళము. మాతోటి స్నేహితులు కూడా అంతే. అదీగాక సహవాసదోషం కూడా ఉంటుంది గదా. మమ్మల్ని చూసి మా స్నేహితులు కూడా నేర్చుకున్నారు. అప్పట్లో మా పెద్దలు ఆచరించారు కాబట్టే ఇప్పుడు ఎవరూ చెప్పకున్నా పాటిస్తున్నాము.


మనమేమీ పాటించకుండా, కేవలం వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం సమూహాల్లో వచ్చే సందేశాలను చదివి, 'ఫార్వార్డ్' చేస్తూ, అంతరాజలంలో దొరికిన దీపాల చిత్రాలను 'స్టేటస్సులు'గా పెట్టుకుని కూర్చుంటే; మైకులు లౌడ్ స్పీకర్లు పెట్టి అరిచినా లేక షార్ట్-ఫిలంలు తీసినా సరే,  ఈ తరానికి లేదా రాబోయే తరానికి మన సంస్కృతి అందదు. కనుక పెద్దలైనవారు శ్రద్ధగా మన ఆచారాలను పాటించాలి. ఆ పండుగ వాతావరణాన్ని ఇంట్లో కలిగించాలి. అప్పుడే పిల్లలు నేర్చుకుంటారు. దీని గురించి ధూర్జటి చెప్పిన ఒక పద్యం చూడండి. 



మ. మొదలం జేసిన వారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు

ర్మదులై యిప్పటి వార ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న

వ్వదె? రానున్న దురాత్ములెల్లఁ దమత్రోవం బోవరే? యేల చే

సెదరో మీదు దలంచి చూడ కతముల్‌ శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - శ్రీ కాళహస్తీశ్వరా! పాత కాలం వారు ఆచరించిన ధర్మాలను పాటిపెట్టి, అవి పనికిరానివని చెప్పి, తాము ఆచరించేదే ధర్మమని, ఈ తరం వారు అధర్మాలను ఆచరిస్తుంటే దైవం నవ్వకుండా ఉంటుందా? ఎందుకంటావా! రాబోయే తరలావారు కూడా ఈ దుర్మార్గాల పాలై పతనమవ్వరా! పిల్లలకు ఆస్తులు కూడా బెట్టి వారు సుఖంగా ఉండాలని తలచే ఈ మూఢజనులు ఈ విషయంలో ఎందుకు ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తున్నారు?

Tuesday 23 November 2021

కృష్ణ అంగారక చతుర్థి మహత్యం



కృష్ణ అంగారక చతుర్థి మహత్యం


మంగళవారం వచ్చిన చవితి (చతుర్థి) తిథి వెయ్యి సూర్యగ్రహణాల పుణ్యకాలానికి సమానం. కృష్ణ అంగారక చవితి నాడు గణపతి ప్రీత్యర్ధం ఉపవసించిన భక్తునికి వచ్చే పుణ్యం అనంతం మరియు 1000 పడగల ఆదిశేషునకు సైతం ఆ వైభవాన్ని వివరంచుట వీలుకాదు.


మాఘమాస కృష్నపక్షంలో అంగారక చతుర్థి రావడం చాలా అరుదు మరియు అది గణేశోపాసకులకు అత్యంత విశేషం. ఆ తర్వాత భాద్రపద మరియు కార్తిక బహుళ చతుర్థిలకు ఆ విశేషముంది. మిగితా మాసాల్లో వచ్చిన కృష్ణ అంగారక చతుర్థులకంటే ఇవి చాలా ఫలప్రదం.


ఈ ఏడాది మనకు మాఘమాసంలోనూ మరియు కార్తిక మాసంలోనూ కృష్ణ అంగారక చవితులు వచ్చాయి.


గణపతి ముందు 16 దీపాలను వెలిగించి షోడశ గణపతులను ఆవహన చేసే ప్రక్రియ కూడా ఈరోజు చేస్తారు.


కృష్ణ అంగారక చవితి నాడు గణపతిని పూజిస్తే అతి శీఘ్రంగా ఫలాలు పొందవచ్చు. అందునా ఈ రోజు ఉపవాసం చేస్తే ఏడాదిలో వచ్చి ప్రతి సంకటహర చవితికి ఉపవాసం చేసిన ఫలితం వస్తుందని కొన్ని గ్రంథాల్లో చెప్పగా, 21 సంకటహర చవితులు ఉపవసించిన ఫలం లభిస్తుందని కొన్ని పురాణ గ్రంథాల్లో కనిపిస్తుంది. అంగారక చవితి నాడు గణపతిని ఆరాధిస్తే కుజుడు కూడా ప్రసన్నుడవుతాడు. కుజుడు గణపతి కోసం చేసిన వెయ్యి సంవత్సరాల తపః ఫలితం ఈనాడు గణపతిని ఆరాధించవారికి లభించి, వారు అభివృద్ధి చెందుతారని గణపతి చెప్పాడట.


గణేశాయ నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక |

సంకష్టం హరమేదేవాం గృహణార్ఘ్యం నమోస్తుతే ||


ఓం శ్రీ గణేశాయ నమః 

Monday 22 November 2021

23 నవంబరు 2021, మంగళవారం, కార్తిక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి.

 


23 నవంబరు 2021, మంగళవారం, కార్తిక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, అంగారక చతుర్థి.


ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, సంకష్టహర చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.


ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.


ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.


ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి.)


23 నవంబరు 2021 మంగళవారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.49 నిమి||

మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది

https://www.drikpanchang.com/sankashti/ganadhipa/ganadhipa-sankashti-date-time.html?year=2021


కార్తిక మాసంలో వచ్చిన దీనికి గణాధిప సంకష్టహర చవితి అని పేరు.


ఓం గణాధిపాయ నమః

ఓం గం గణపతయే నమః

శ్రీ హనుమద్భాగవతము (83)



హనుమంతుడు మిక్కిలి సూక్ష్మరూపమును ధరించినా లంకకు హనుమంతుడు మిక్కిలి సూక్ష్మరూపమును ధరించినా లంకకు అధిష్ఠాత్రియైన లంకిణి అనే ఆమె ఆయనన్ చూసింది. అది ఆయనను గద్దించుచు “ఓరీ! నీవెవ్వడవు? దొంగవలె ఈ నగరములోనికి ప్రవేశించుచున్నావు. చావుటకు పూర్వము నీవు నీ రహస్యమును వెల్లడించు'మని పలికింది. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడిట్లా తలచాడు - ‘మొదటనే ఈ వ్యక్తితో వివాదపడటం మంచిది కాదు. రాక్షసులు ప్రోగైతే ఇచ్చటే యుద్ధము ప్రారంభమవుతుంది. సీతా మాతను కనుగొనుటలో అంతరాయమేర్పడుతుంది! వెంటనే ఆయన ఆ వ్యక్తిని స్త్రీగా భావించి తన కుడి చేయి పిడికిలితో మెల్లగా గొట్టాడు. వజ్రమయ దేహుడైన హనుమానుని పిడికిలి పోటుచే లంకిణి నేత్రములు బైరులు గ్రమ్మాయి. అది రక్తము క్రక్కుకొంటూ భూమిపై బడి మూర్ఛిల్లింది. కాని కొద్ది సమయములోనే ఆమె మూర్ఛ నుండి లేచి కూర్చున్నది. 


అప్పుడు లంకిణి వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతునితో 'శ్రీరామదూతవైన హనుమా! నీవు లంకాపట్టణముపై విజయము సాధించావు. పొమ్ము, నీకు శుభమగుగాక! సీతా దేవి కారణముగా దురాత్ముడైన రావణుని వినాశమునకు కాలము సమీపించినది. పూర్వము చతుర్ముఖుడైన బ్రహ్మ నాతో ఇలా పలికాడు. 'త్రేతాయుగమున సాక్షాత్తుగా క్షీరోదధిశాయీ, వినాశరహితుడైన నారాయణుడు దశరథకుమారుడైన శ్రీ రాముని రూపమున అవతరిస్తాడు, ఆయన భార్య, మహామాయారూపిణీ అయిన సీతా దేవిని రావణుడు హరించాడు. ఆమెను ఆన్వేషిస్తూ రాత్రివేళ ఒక్క వానరుడు లంకలోనికి ప్రవేశించాడు. వాని పిడికిలి పోటుచే నీవు కలత చెందుతావు. ఇక రాక్షసవంశమునకు చేటుమూడినదని నీవప్పుడు తెలిసికో! నా అదృష్టవలన సుదీర్ఘ కాలము తరువాత నేటికి నాకా భవాబ్ధిపోతయైన శ్రీ రాముని ప్రియ భక్తుని దుర్లభ సాంగత్యము లభించినది. నేడు నేను ధన్యురాలనైతిని. నా హృదయమున విరాజిల్లు దశరథనందనుడైన శ్రీరాముడు నాపై ఎల్లప్పుడు కృప చూపుగాక.”


తద్భక్తసంగోఽప్యతిదుర్ల భో మమ 

ప్రసీదతాం దాశరధిః సదా హృది ||


(అ.రా. 5–1–57) 

వాయునందనుడు మిక్కిలిసూక్ష్ము బుద్ధిమంతుడైన రూపమును ధరించి, కరుణామయుడైన భగవానుని మనస్సులో స్మరించుకొని అసురరక్షితము, దుర్భేద్యమైన లంకలోనికి ప్రవేశించాడు.

హనుమంతుని సముద్రోల్లంఘన లంకా ప్రవేశములతో పాటు జగజ్జననియైన జానకికి కుడిభుజము, లంకాధిపతియైన రావణునకు ఎడమకన్ను, సురవందితుడైన శ్రీ రామునకు ఎడమపార్శ్వము అదరినవి.


Sunday 21 November 2021

శ్రీ హనుమద్భాగవతము (82)



ఆంజనేయుడు ఒకమారు నలువైపుల చూసాడు. పిమ్మట అతడు లంకలోనికి ప్రవేశించుటకు ఆలోచింపసాగాడు. దుర్ధర్షుడైన దశానునితో యుద్ధము తప్పదు. అందువలన ఇక్కడ అపరిమితమైన వానరభల్లూక సేనతో స్వామి నివసించటానికి స్థలమును గురించి, ఆహార పానీయములను గురించి తెలుసుకోవాలి. ఈ దుర్గము ఎంతో దుర్గమముగా తోస్తున్నది. అందువలన ఆక్రమణదృష్టితో ఇక్కడి విషయములను ఒక్కొక్క దానిని గురించి తెలుసుకోవటం తప్పనిసరి. కాని ఈ విశాల వేషముతో ఉన్న పగటిపూట వెలుగులో అసురులకు నా ఆగమన రహస్యము తెలియగలదు. అందువలన రాత్రివేళ సూక్ష్మవేషమున దుర్గమమైన ఈ దుర్గములోనికి ప్రవేశించుట తగును అని అతడు ఆలోచించెను. 


ఆంజనేయుడు ఎగిరి ఒక పర్వతమును ఎక్కి, అచటి నుండి లంకాపట్టణమును చూడసాగాడు. ఆ పురము సుదృఢమైన దుర్గమైయుండెను. దాని సౌదర్యము అనిర్వచనీయంగా ఉంది. దానికి నలువైపుల సముద్రముంది; దాని ప్రాకారములు సువర్ణ నిర్మితములైయున్నాయి. దాని ద్వారములన్నీ సువర్ణ నిర్మితములే. ప్రతి ద్వారము మీద ఇంద్రనీల మణినిర్మితములైన వేదికలున్నాయి. అచటి పథములు విస్తృతముగా, స్వచ్ఛముగా, ఆకర్షకముగా ఉన్నాయి. రావణునిచే పాలింపబడు లంకాపట్టణమున ప్రతిస్థలం అందునా సుందరములు నిర్మలజలపూరితములైన జలాశయములున్నాయి. దాని నిర్మాణమున విశ్వకర్మ తన బుద్ధినంతటిని వ్యయము చేసినట్లు కనిపిస్తోంది.


లంకలో అంతట శస్త్రధారులు భయంకరులైన సైనికుల రక్షణవ్యవస్థ చాలకట్టుదిట్టంగా ఉండింది. విదేహా నందినిని హరించి తెచ్చిన తరువాత రావణుడు అచటి రక్షణ వ్యవస్థకు కట్టుదిట్టము చేసాడు. దానికి నలువైపుల ధనుర్బాణములను ధరించిన భయంకరులైన రాక్షసులెందఱో రేయింబవళ్ళు జాగ్రత్తగా పహరా ఇస్తున్నారు.


రాక్షసరాజైన రావణుని పట్టణమైన లంక యొక్క ఈ దృశ్యమును చూస్తూ మహావీరుడైన హనుమానుడు సాయంకాలమునకై ఎదురు చూడసాగాడు. ఇంతలో సాయం కాలమయ్యింది. పవననందనుడు అణిమ అనే సిద్ధిని అనుసరించి ఎంతో సూక్ష్మరూపమును ధరించి మనస్సులో శ్రీరఘునాథుని చరణములకు ప్రణామముల జేసి పవిత్రమైన ఆయన మూర్తిని హృదయంలో నిల్పుకొని లంకలోనికి ప్రవేశించాడు.

Saturday 20 November 2021

శ్రీ హనుమద్భాగవతము (81)



సురస దేవలోకమునకు వెళ్ళగా ఉగ్రవేగుడైన శ్రీమారుతాత్మజుడు గరుడుని వలె ముందుకు మైనాకవందితుడు, వానరశిరోమణి, శ్రీరామదూత అయిన హనుమానుడు వాయు వేగముతో ఎగురుతున్నాడు. మార్గమున సింహికయైన రాక్షసి సముద్రమున ఎదురపడింది. ఆమె ఆకాశమున ఎగిరి వెళుతుండే ప్రాణులను వాటి ప్రతిబింబములద్వారా లాగి చంపుతుండేది. ఛాయాగ్రాహీణియైన సింహిక సముద్రమునుండి పవనపుత్రుని ఛాయను కూడా పట్టుకొంది. హనుమానుని గమనము ఆగిపోయింది. ఆశ్చర్యపడిన శ్రీ రామదూత నలు వైపుల చూసాడు, కాని అతనికి ఎక్కడా ఏమీ కనబడలేదు. క్రిందకు చూడగా నీటి పై స్థూలశరీరము కలిగిన భయంకరరాక్షసి కనబడింది. అప్పుడు విశాలకాయుడైన హనుమంతుడు వేగముగా సింహికపైకి దూకాడు. భూధరాకారుడు, మహా తేజస్వి, మహాశక్తిశాలీ అయిన పవన పుత్రుని బరువును ఆ రాక్షసి ఎలా సహించగలదు? నలిగి పొడిపొడి అయ్యింది.


హనుమానుడు చేసిన ఈ భయంకర కార్యమును చూచి ఖేచరులు ఆయనను స్తుతిస్తూ ఇలా పలికారు - " కపివరుడా! విశాల కాయము గలిగిన ఈ ప్రాణిని సంహరించి గొప్ప పని చేసావు. ఇక ఇప్పుడు నీవు ఆపదలు లేనివాడవై ముందుకు పోగలవు. వానరేంద్రా! ఏ పురుషునిలో నీవంటి ధైర్యము, తెలివి, బుద్ధి' కౌశల్యము అను ఈ నాలుగు గుణములుంటాయో అతనికి అతని కార్యమున ఎప్పుడూ అసఫలత కలుగదు.


ఆకాశమున సంచరిస్తూ ప్రాణుల వాక్కులను వింటూ పవనపుత్రుడు దక్షిణదిక్కుగా ఎంతో వేగముతో పయనించుచున్నాడు. కొద్ది కాలములోనే అతడు నిర్విఘ్నముగా సముద్ర తటమునకు చేరుకొన్నాడు. అక్కడ వివిధ సుగంధపుష్పములతోనూ, ఫలములతోనూ నిండి యున్న వృక్షములుగల సుందరోద్యానములున్నాయి. అవి తుమ్మెదల ఝంకారముల చేత, అనేక విధములైన సుందరపక్షుల కలరవములచే ప్రతిధ్వనిస్తూ ఉండేవి. అక్కడ మృగశాబకములు క్రీడిస్తూ ప్రసన్నముగా ఇటు ఇటు పరుగెడుతూ ఉండేవి. శీతలమందపవనము వీచుచుండేవి. అది మనోరమదృశ్యము. అచటి నుండి త్రికూట పర్వతశిఖరములపై నిర్మింపబడి నలువైపుల ప్రాకారములతో చుట్టబడియున్న రావణుని లంకానగరము స్పష్టముగా కనబడేది.


Friday 19 November 2021

శ్రీ హనుమద్భాగవతము (80)



అంజనానందనుడిట్లా సమాధానం ఇచ్చాడు - “తల్లీ ! సురసా! నా నమస్కారములను స్వీకరించు. నేను ఆర్త త్రాణపరాయణుడైన రఘునాథుని కార్యమునకై లంకకు వెళుతున్నాను. ఇపుడు సీతా దేవిజాడను తెలిసికొనుటకై నీవు నన్ను పోనిమ్ము. అచట నుండి వెంటనే తిరిగివచ్చి రామునకు సీతా దేవి క్షేమసమాచారములను తెలియ జెప్పి నేను నీనోటిలోనికి ప్రవేశింపగలను” .


కాని శ్రీరామదూతయొక్క బలబుద్ధులను పరీక్షించుటకై వచ్చిన సురస ఆయనను ఏ విధముగా కూడా ముందుకు పోనీయకపోయింది. అపుడు హనుమంతుడు ఆమెతో 'మంచిది నీవు నన్ను భక్షించుము' అని పలికాడు. 


సురస తన నోటిని ఒక యోజనము వెడల్పు తెరిచింది. వాయునందనుడు వెంటనే తన శరీరమును ఎనిమిది యోజనముల వెడల్పు చేసాడు. ఆమె తన నోటిని పదహారు యోజనములు పెంచగా పవనకుమారుడు వెంటనే ముప్పై రెండు యోజనములు పెరిగాడు. సురస ఎంతగా తన భయంకరమైన నోటిని తెరుస్తోందో బృహత్కాయుడైన హనుమానుడు దానికి రెట్టింపుగా తన శరీరమును పెంచుచున్నాడు. సురస తన నోటిని నూఱు యోజనములు పెంచగా వాయుపుత్రుడు అంగుష్ఠమాత్ర ప్రమాణుడై ఆమె నోటిలోనికి ప్రవేశించాడు.


సురస తన నోటిని మూసికొనపోవుచుండగా మహామతియైన ఆంజనేయుడు ఆమె నోటి నుండి బయటకు వచ్చి వినయముగా తల్లీ ! నేను నీ నోటిలోనికి వెళ్ళి బయటకు వచ్చాను. నీ మాట పూర్తియైనది. ఇప్పుడు నన్ను నా స్వామి కార్యమును తీర్చుటకు పోనిమ్ము’.


సురస శ్రీరామదూతను పరీక్షించుటకే వచ్చినది. ఆమె ఇలా పలికింది :- వాయునందనా ! నీవు జ్ఞాననిధివి. దేవతలు నిన్ను పరీక్షించుటకై నన్ను పంపారు. నేను నీ బలబుద్ధులరహస్యము నెఱింగాను. ఇప్పుడు నీవు వెళ్ళి శ్రీరాముని కార్యమును నెరవేర్చు. నీకు తప్పక సాఫల్యము కలుగుతుంది. నేను హృదయపూర్వకముగా నిన్ను ఆశీర్వదించుచున్నాను”.


Thursday 18 November 2021

శ్రీ హనుమద్భాగవతము (79)



మైనాకుడు ఎంతో ఆదరముతోను ప్రేమతోనూ “వాయునందనా ! నీతో నాకీ పవిత్రసంబంధమున్నది. నీవు నాకు మాననీయుడవు. అంతేకాదు సముద్రుడు కూడా నీకు విశ్రాంతిని ఒసంగమని నన్ను ఆజ్ఞాపించినాడు. నీవు నాయందు గల వివిధములైన మధుర ఫలములను భుజించు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకో. పిమ్మట నీపనికై వెళ్ళు” అని హనుమంతునితో పలికాడు.


మైనాకుని మాటలు విని ఆంజనేయుడు ఎంతో ప్రేమతో “మైనాకా! నిన్ను కలుసు కొనుటవలన నాకు సంతోషము కలిగినది. నా ఆతిథ్యమైనది. నా స్వామి కార్యమునకై త్వరగా వెళుతున్నాను. అందువలన నేనిపుడు విశ్రమించుట అసంభవము" అని పలికాడు.


కేసరీనందనుడైన హనుమంతుడు నవ్వుతూ మైనాకుని స్పృశించి తీవ్ర వేగముతో ముందుకు వెళ్ళాడు. అప్పుడు శైలప్రవరుడైన మైనాకుడు, సముద్రుడు ఇరువురు అతని వైపు ఎంతో ఆదరముతోనూ, ప్రేమతోనూ చూసి అతనిని ఆశీర్వదించారు.


ఆంజనేయుడు శ్రీరామచంద్రుని కార్యమునకై వేగముగా లంక వైపు ఎగిరి వెళుతుండటం చూసి దేవతలు అతని బలమును బుద్ధిని పరీక్షింపదలచి నాగమాతయైన సురసను పంపారు. దేవతల ఆదేశమును అనుసరించి సురస వికటము, భయంకరమైన రూపమును ధరించాడు. దాని నేత్రములు పచ్చగాను, దవడలు భయంకరముగాను ఉన్నాయి. ఆమె ఆకాశమును స్పృశించునట్లు వికటతమమైన తన నోటిని తెరచి హనుమానుని మార్గమున నిలుచుంది.


హనుమంతుడు తన వైపు వచ్చుట చూచి నాగమాత ఇలా పలికాడు —— “బుద్ధిమంతుడా! నేను తీవ్రమైన ఆకలి బాధచే వ్యాకులపడుతున్నాను. దేవతలు నిన్ను నాకు ఆహారముగ పంపారు. నీవు నా నోటిలోనికి రమ్ము. నా ఆకలి బాధను శాంతపరచు.

Wednesday 17 November 2021

శ్రీ హనుమద్భాగవతము (78)



అప్పుడు వాయునందనునిలో తేజస్సు, బలము, పరాక్రమము అద్భుతముగా ఉన్నవి. దేవతలు జయజయధ్వానములను, ఋషులు శాంతిపాఠములను చేయసాగారు. ఆంజనేయుడు దక్షిణమువైపుగా తన రెండు బాహువులను చాచి మిగుల వేగముతో ఆకాశము మీదకు గరుడుని వలె ఎగిరాడు. అతని వేగముతో ఆకర్షింపబడిన ఎన్నో వృక్షములు పెకలింపబడి తమ తమ కొమ్మలతో కూడా ఎగిరిపోయాయి. పుష్పించిన వృక్షముల పుష్పములు అతని పైబడాఆయి. అవి వాయుపుత్రుని పూజించుచున్నట్లు ఉన్నాయి.


పవనపుత్రుడైన హనుమానుడు వాయు వేగముతో శ్రీ రామ కార్యార్ధమై వెళ్ళటం చూచి సాగరుడిట్లా ఆలోచించాడు. ఇక్ష్వాకు వంశీయుడైన సగర చక్రవర్తి యొక్క పుత్రులు నన్ను పెంచి ఉన్నారు; అభయుడు, వజ్రకాయుడైన హనుమానుడు ఇక్ష్వాకులోత్పన్నుడైన శ్రీరాముని కార్యార్థమై లంకకు వెళుతున్నాడు. అందువలన ఇతనికి మార్గమున విశ్రాంతిని ఒసంగుటకు ప్రయత్నించాలి.”


సముద్రుడు మైనాకపర్వతముతో ఇలా పలికాడు - "శైలప్రవరుడా! చూడు, కపిశ్రేష్ఠుడైన ఈ హనుమానుడు ఇత్వాకు వంశీయుడైన శ్రీ రామునకు సాహాయ్యము చేయుటకై తీవ్రవేగముతో లంకకు వెడలుచున్నాడు. ఈ పవిత్రవంశీయులు  నాకు పూజ్యులు, నీకు పరమ పూజనీయులు. అందువలన నీవు హనుమానునకు సహాయం చేయ్యి. నీవు వెంటనే నీటిలో నుండి పైకి లెమ్ము. దానిచే ఇతడు కొద్ది సేపు నీ శిఖరముపై విశ్రమించుగాక”!


మైనాకుడు సువర్ణమణిమయములైన తన అనేక శిఖరములతో కూడా సముద్రము నుండి చాలా పైకి లేచి, ఒక శృంగముపై మనుష్య వేషములో నిలుచుని హనుమంతుని ఇట్లా ప్రార్థించాడు. - “కపిశ్రేష్ఠా! నీవు వాయుపుత్రుడవు, ఆయనవలె అపరిమితశక్తిసంపన్నుడవు, ధర్మజ్ఞుడవు. నిన్ను పూజిస్తే సాక్షాత్తు వాయుదేవుని పూజించినట్లే అవుతుంది.


పూజితేత్వయి ధర్మక్షే పూజాం ప్రాప్నోతి మారుతః ||


(వా. రా. 5-1-122) 

అందువలన నీవు తప్పక నాకు పూజనీయుడవు. మొదట పర్వతములకు ఱెక్కలుండేవి. అవి ఆకాశమున ఇటు ఇటు వేగముగా ఎగురుచుండేవి. ఇలా అవి ఎగురుతుండటంతో దేవతలు, ఋషులు, సర్వప్రాణులు మిగుల భయపడిపోతుండేవారు. దీనికి కోపించి సహస్రాక్షడు లక్షల కొలది పర్వతముల ఱెక్కలను నరికాడు. వజ్రాయుధమును తీసుకుని క్రుద్ధుడైన సురేంద్రుడు నా వైపు కూడా వచ్చాడు. కాని నీ తండ్రి అయిన వాయు దేవుడు ఈ సముద్రమున పడవేసి నన్ను రక్షించినాడు.


Tuesday 16 November 2021

శ్రీ హనుమద్భాగవతము (77)



సీతా దేవిని ఇచటకు తీసికొనిరావాలా? లేక రావణునితో పాటు లంకనంతటిని తగులబెట్టి బూడిద చేయాలా? లేక రాక్షసరాజైన రావణుని కంఠమున తాడును తగిలించి అతడిని లాగుతూ ఇక్కడకు తెచ్చి శ్రీ రామచంద్రుని పాదముల దగ్గఱ పడవేయలా? లేక జగన్మాతయైన జానకిని చూసే తిరిగి రావాల? ఏమి చేయాలో చెప్పు. " 


పరమశక్తిశాలియైన పవనకుమారుని వాక్కులను విని జాంబవంతుడు ప్రసన్నుడై ఇలా పలికాడు:- “నాయనా! నీవు సర్వసమర్థుడవు. కాని నీవు భగవానుని దూతవు, నీవు కేవలము సీతాదేవిని దర్శించి ఆమె సమాచారమును తీసికొనిరా, దీని తరువాత శ్రీరాముడు అక్కడికి వెళ్ళి అసుర కులమును ఉద్ధరింపగలడు, ఆయన పవిత్రికీర్తి విస్తరింపగలడు, మనమందఱము ప్రభువు కార్యమున సహాయకులమై ధన్యులవుదుము, మన వానర భల్లూక వీరుల ప్రాణములు నీ ఆధీనములో ఉన్నివి, మేమందఱము ఆతురతతో నీకై ఎదురు చూస్తుంటాము, నీవు త్వరగా వెళ్ళము, ఆకాశమార్గము ద్వారా వెళ్ళే నీకు శుభమగుగాక”!

 

వృద్ధులైన వానర భల్లూక వీరుల ఆశీర్వాదములచే ప్రసన్నుడై మహాపరాక్రముడు, శత్రుమర్దనుడు, శ్రీరామదూత అయిన హనుమానుడు ఎగిరి మహేంద్రగిరి పర్వత శిఖరము పైకి ఎక్కాడు. అతని చరణముల ఒత్తిడితో పర్వతము క్రిందకు కూరుకొనిపోసాగింది. వృక్షములతోపాటు పర్వతశృంగము 

విరిగి క్రిందపడసాగింది. అప్పుడు సర్వప్రాణులకు వాయుపుత్రుడు, మహాత్ముడు అయిన హనుమానుడు మహాపర్వతమువలె విశాల కాయముగలవాడుగాను, సువర్ణవర్ణుడైన బాలసూర్యుని వలె మనోహరమైన ముఖము గలవాడుగాను, సర్పరాజువంటి దీర్ఘములైన భుజములు గలవాడుగాను కనబడసాగాడు.


(మహానగేన్ద్ర ప్రతిమో మహాత్మా సువర్ణ వర్ణోఽరుణ చారువక్త్రః 

మహాఫణీంద్రాభ సుదీర్ఘ బాహుర్వాతాత్మజోఽదృశ్యత సర్వభూతైః। (అ.రా.4.9-29)


సముద్రమును దాటుటకు సిద్ధముగానున్న ఆంజనేయుడు పూర్వాభిముఖుడై తన తండ్రియైన వాయుదేవునకు నమస్కరించి, పిమ్మట శ్రీరామచంద్రుని స్మరించి వానరభల్లూక వీరులతో పలికాడు - "వానరులారా! నేను పరమప్రభువైన శ్రీరామునికృప చేత, అమోఘమైన ఆయన వాక్కును అనుసరించి లంకలోనికి వెళ్ళి జగజ్జననిని దర్శించి మరల తిరిగివస్తాను. ప్రాణాంతకాలమున ప్రభువుయొక్క నామమును స్మరించి మానవుడు సంసార సాగరమును దాటుతాడు, నేను ఆయన దూతను, దివ్యమైన ఆయన అంగుళీయకము నా దగ్గర ఉన్నది. నా హృదయమున ఆయనమూర్తి, వాక్కున ఆయన నామము విరాజిల్లుతున్నవి. నేను ఈ తుచ్ఛసముద్రమును దాటి కృతకృత్యుడ నవుతాను. ఇందులో గొప్ప విషయమేమి ఉన్నది? మీరు నేను తిరిగివచ్చునంతవఱకు కందమూలములను ఆహారముగా తింటూ ఇక్కడనే నాకై ఎదురు చూస్తూ ఉండండి”.

Monday 15 November 2021

శ్రీ హనుమద్భాగవతము (76)



అంగదుడు దుఃఖితుడై “అలాగైతే సముద్రోల్లంఘనము సంభవము కానట్లు తోస్తున్నది. ఇక మనము ప్రాయోపవేశము చేసి కూర్చుందుముగాక” అని పలికాడు.


“లేదు కుమారా! శ్రీరాముని కార్యము తప్పక నెరవేరుతుంది” అని అంగదుని ఓదార్చుస్తూ జాంబవంతుడు అంజనా నందనుని వైపు చూచాడు. అతడు పూర్తిగా మౌనంగా కూర్చుని ఉన్నాడు. వజ్రకాయుడైన ఈ హనుమంతుడు శాపము వలన భస్మాచ్ఛన్నమగు అగ్నివలె శాంతముగా ఉన్నాడని ఋక్షరాజునకు తెలుసు. ఇతనికి తన అపరిమేయ శక్తినిగూర్చి తెలియదు. లేకపోతే ఇతడు తన ప్రభువు సుగ్రీవుడు సంకటగ్రస్తుడై ఉండుట చూసీ ఎలా ఊరుకొని ఉండగలడు? ఇతడు నిజముగా వాలిని శిక్షించి ఉండేవాడే. జాంబవంతుడు హనుమంతునకు అతని శక్తిని గుర్తు చేస్తూ ఇలా పలికాడు- “ శ్రీ రామునకు ఆనన్య భక్తుడవు, వజ్రకాయుడవు అయిన హనుమఁతుడా! శ్రీ రాముని కార్యార్థమై నీవు అవతరించావు. ఎందుకు మిన్నకున్నావు? మహావీరా! నీవు పవనపుత్రుడవు, అఁజనా దేవి క్షీరములను త్రాగావు. బాల్య కాలమునందే నీవు సూర్యుని అరుణఫలమని తలంచి అతనిని భక్షించుటకై ఒక్క దూకులో అతని దగ్గఱకు వెళ్ళావు. బ్రహ్మాది దేవతలు నీకు అలౌకికమైన వరములను ఇచ్చారు. మహావీరుడవైన కేసరిపుత్రా! నీవు అపరిమితశక్తిసంపన్నుడవు. నీ గమనము అడ్డులేనిది. విశాలమైన ఈ జలధి నీకొక లెక్కలోనిది కాదు. లెమ్ము, సముద్రమును దాటి లంకలోనికి వెళ్ళు. అచట సీతా దేవిని దర్శించి వెంటనే తిరిగిరమ్ము. మాకు ప్రాణదానం చేసి మమ్ము కాపాడు. వివేకమునకు, జ్ఞానమునకు నిధి అయిన వాయుపుత్రా! చూడు. చింతించుచున్నవారు, విచారగ్రస్తులైన ఈ  అసంఖ్యవానర భల్లూక వీరులు నీవైపు చూస్తున్నారు.


జాంబవంతుని మాటలు వినినంతనె భగవత్స్మరణమున నిమగ్నుడై ఉన్న హనుమానునకు తన బలపరాక్రమములు గుర్తుకువచ్చాయి. వెంటనే అతని శరీరము పర్వతాకారమువలె అయ్యింది. అతడు తన లోని అపారశక్తిని గుర్తించి భయానకముగా గర్జించాడు. ఆ గర్జనము వలన భూమ్యాకాశములు, సమస్త దిక్కులు కంపించిపోయాయి.


కనకభూధరాకారుడైన పవన కుమారుడు గర్జిస్తూ ఇలా పలికాడు - "వానరులారా! నేను భగవత్కృపవలన ఆకాశమున సంచరిస్తూ సమస్త గ్రహములు మొదలైన వాటిని అతిక్రమించి ముందుకు పోవుటకు సిద్ధముగనున్నాను. నేను తలచుకొంటే సముద్రమును ఎండింపజేయగలను, పృథివిని చీల్చి వేయగలను, ఎగిరి ఎగిరి పర్వతములను పొడిపొడిగా  చేయగలను, తుచ్ఛమైన ఈ సముద్రము నాకొక లెక్కలోనిది కాదు. ఇప్పుడు చెప్పండి, నేనేమి చేయాలి? నేను లంక లోనికి వెళ్ళి దానిని పెకలించి నముద్రములో కలిపివేయాల?

Sunday 14 November 2021

శ్రీ హనుమద్భాగవతము (75)



సముద్రోల్లంఘనము : లంకాప్రవేశము


గృధ్రరాజైన సంపాతివలన జనక రాజపుత్రిక వార్తను విని వానరభల్లూక వీరులు హర్షాధిక్యతచే గంతులు వేయసాగారు. వారు సముద్రపు ఒడ్డును చేరుకొని, ఆ సముద్రము యొక్క స్వరూపమును చూసి భయపడ్డారు. 'భయంకరముగా గర్జిల్లు ఉత్తుంగ తరంగయుక్తమైన ఈ అపారసాగరాన్ని ఎలా దాటాలీ అని వానర భల్లూక వీరులందఱు చింతిస్తూ విషాదగ్రస్తులై ఉండటం చూసి యువరాజైన అంగదుడు అనేక విధాల వారికి ధైర్యమును కలుగజేసాడు. మహాసాగరమువలె వీర వానర భల్లూక సైన్యమును సుస్థిరముగా ఉంచుటకు సమర్థులు అంగదుడు హనుమంతుడు ఇరువురే.


వాలికుమారుడైన అంగదుడు వానర భల్లూక వీరులందఱితో ఇలా పలికాడు - 'మిత్రులారా! మీరందఱు సాటి లేని వీరులు, మీ గమనము ఎప్పుడూ ఆగిపోయేది కాదు. జగన్మాతయైన జానకీ దేవి యొక్క జాడను కనుగొనుటకై అపారమైన ఈ సముద్రమును దాటి లంకలోనికి చేరుకొను వీరుడు మీలో ఎవరున్నారు?'


అంగదుని వాక్కులను విని మొదట వానర భల్లూక వీరులందఱు మిన్నకుండి పోయారు. కాని కొంతసేపైన తర్వాత గజనామక వానరుడు 'నేను పదియోజనముల దూరము దూకగలను' అని పలికాడు. ఇదే విధముగా గవాక్షుడు ఇరువది యోజనములు, శరభుడు ముప్పై, ఋషభుడు నలభై, గంధమానుడు యాభై, మైందుడు అఱవై, ద్వివిదుడు డెబ్బై, సుషేణుడు ఎనభై యోజనముల వరకు దూకగలమని చెప్పారు. వయోవృద్ధుడు, ఋక్షరాజైన జాంబవంతుడు ఇట్లా పలికాడు - "పూర్వము యౌవనకాలమున నేను కూడా చాలా దూరము దూకుతుండేవాడను. కాని ఇపుడు ఆ శక్తి నాలో లేదు. అయినా వానర రాజైన సుగ్రీవుని యొక్క, కౌసల్యాంనదుని యొక్క కార్యమును ఉపేక్షించుట సంభవము కాదు. ఈ వృద్ధావస్థలో నేను కేవలము తొంబై యోజలముల దూరము వరకు దూకగలను. పూర్వకాలమున విష్ణువు త్రివిక్రమావతారమున మూడడుగులు కొలుచుకొనేటప్పుడు అంతలో ముల్లోకములను అతిక్రమించి ఉన్న అతని ఆకారమును నేను ప్రదక్షిణముగా ఇరువది యొక్క మార్లు చుట్టివచ్చాను. కాని ఇప్పుడు ఈ మహాసముద్రమును దాటుట నా వలన కాని పని.'


అంగదుడు పలికాడు - నేను సముద్రమును దాటగలను. కాని తిరిగిరాగలనో లేదో చెప్పలేను.


అంగదుని వాక్కులను విని వాక్యకోవిదుడు, వృద్ధుడైన జాంబవంతుడు అతనిని ప్రశంసింస్తూ “అంగదా! నీవీ పనిని చేయుటకు పూర్తిగా సమర్ధుడవై ఉన్నావు. కాని నీవు మాకందఱకు నాయకుడవు. అందువలన నిన్ను పంపుట మాకు తగదు, నీవు ప్రత్యేకముగా కాపాడదగిన వాడవు." అని పలికాడు. 


Saturday 13 November 2021

శ్రీ హనుమద్భాగవతము (74)



'సీతా దేవి విలాపాన్ని విని ఆమెనుండి ఎడబాటు గలిగిన రామలక్ష్మణుల పరిచయమును పొంది, దశరథ మహారాజుతో నాకు గల స్నేహమును గుర్తుకు తెచ్చుకొని, నాపుత్రుడు సీతా దేవిని కాపాడలేదు. తన ఈ ప్రవర్తనచే అతడు నన్ను సంతోష పెట్టలేకపోయాడు. అనగా నాకు ఇష్టమైన పనిని జరుగనీయలేదు'.


గొప్ప అదృష్టవంతుడైన సంపాతి వానరులకు తన కథ చెబుతుండగానే అతని రెండు టెక్కలు తిరిగి ఉత్పన్నమయ్యెను. అతనికి యౌవనకాలము నాటి బలము కూడా కలిగింది. మహర్షి యైన చంద్రుని వాణిని స్మరించి అతడు ఎంతో సంతోషించి వానరులతో ఇలా పలికాడు :


సర్వథా క్రియతాం యత్నః సీతామధిగమిష్యథ || 

పక్షలాభో మమాయం వః సిద్ధిప్రత్యయకారకః | (వా. రా. 4.68–12–13)


వానరులారా ! మీరన్ని విధముల ప్రయత్నించండి. తప్పక మీకు సీతా దేవిదర్శనము కలుగుతుంది. నాకు ఱెక్కలు మొలచుట మీ కార్యసిద్ధికి సూచన’. 


తరువాత అతడు మంగళమయమైన శ్రీ రామచంద్రుని నామముయొక్క గొప్పతనమును గురించి వర్ణిస్తూ సముద్రోల్లంఘనము మీకు ఎంతో సులభ కార్యమని చెప్పి వారితో సంపాతి ఇట్లా పలికాడు ;


యన్నామస్మృతిమాత్రతో ఽపరిమితం సంసార వారానిధిం 

తీర్త్వా గచ్ఛతి దుర్జనోఽపి పరమం విష్ణోః పదం శాశ్వతమ్ | 

తస్యైవ స్థితి కారిణస్త్రిజగతాం రామస్య భక్తాః ప్రియా 

యూయం కిం న సముద్రమాత్రతరణే శక్తాః కథం వానరాః || 

(అ. రా. 4-8-55) 


‘వానరులారా ! ఎవని నామస్మరణము చేతనే దుష్టజనులు కూడా ఈ అపారసంసార సాగరాన్ని దాటి విష్ణుభగవానుని సనాతన పరమపదమును పొందుతున్నారో, మీరు ముల్లోకములను కాపాడే ఆ శ్రీరామచంద్రునకు ప్రియభక్తులు. ఇక క్షుద్రమైన ఈ సముద్రమును దాటుటకు మీఎందుకు సమర్థులు కారు?


వినీతాత్ముడు, మహాపరాక్రమశాలియైన పవనకుమారుడు అదృష్టశాలియైన సంపాతి పలికిన ఒక్కొక్క మాటను ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. సీతా దేవి యొక్క స్పష్టమైన జాడ తెలిసింది. పిమ్మట అతని సంతోషమునకు అవధులు లేకపోయాయి. అతని రోమరోమము పులకించిపోయింది.


అప్పుడు పక్షి శ్రేష్ఠుడైన సంపాతి ఆ పర్వతశిఖరము నుండి ఎగిరి వెళ్ళిపోయాడు. 


----------***********------------


Friday 12 November 2021

శ్రీ హనుమద్భాగవతము (73)

 


సంపాతిద్వారా సీతా దేవిజాడను వానర బృందము తెలుసుకుని మహదానందము పొందింది. తర్వాత కుతూహలము గలవారై వారు సంపాతియొక్క జీవిత చరిత్ర పూర్తిగా తెసుకునిదలచి అడిగారు. అతడు వారికి ఎంతో ఆదరముతోనూ, ప్రేమ తోనూ తని ఱెక్కలు భస్మమవ్వటం గురించి, చంద్రముని చెప్పిన సమస్త విషయములను గురించి చెప్పాడు. అనంతరము అతడు ఇట్లా - "వానరులారా ! ఱెక్కలు లేని పక్షి యొక్క పరిస్థితిని గురించి ఏమని చెప్పేది? ఈ దయనీయమైన స్థితిలో ఆ పుత్రుడు పక్షి ప్రవరుడైన సుపార్శ్వుడే తగు విధముగా ఆహారము ఇచ్చి నన్ను పోషిస్తున్నాడు. మా ఆకలి ఎంతో తీవ్రమైనది. ఒకనాడు నేను ఆకలి బాధచే పీడింపబడుచున్నాను, కాని నా కుమారుడు ఆలస్యముగా వట్టి చేతులతో తిరిగివచ్చాడు. అందువలన నేను అతనిని చాలా పరుషముగ దూషించాను. అతడు వినయముగా నాతో ఇట్లా పలికడు - “నేను ఆహారమునకై తగిన సమయమున ఆకాశమునందు ఎగిరి తిని, మహేంద్రగిరి ద్వారమును అడ్డగించి నా ముక్కును వంచి సముద్రములోని ప్రాణులను చూస్తున్నాను. అప్పుడు అక్కడ నేనొక కాటుక కొండవలె ఉన్న బలవంతుడైన ఒక పురుషుని చూచాను. అతడు నేను చూస్తుండగానే అలౌకిక తేజస్సంపన్నులాఇన ఒక స్త్రీని బలాత్కారముగ తీసికొనిపోవుచున్నాడు. ఆ స్త్రీ పురుషులద్వారా నేను మీ ఆకలిని తీర్చుటకు నిశ్చయించుకున్నాను. కాని మధురము వినమ్రమైన ఆ పురుషుని వాక్కుచే ప్రభావితుడనై నేను అతనిని విడిచిపెట్టాను.

 

అనంతరము నాకు మహర్షుల వలన సిద్ధపురుషులవలన ఆ అలౌకిక తేజస్సు కలిగిన స్త్రీ దశరథనందనుడైన శ్రీరామచంద్రుని భార్యయైన సీత అనీ, ఆ నల్లని పురుషుడు లంకాధిపతియైన రావణుడనీ విన్నాను. సీతా దేవి జుట్టు విడిపోయి ఉంది. ఆమె మిగుల దుఃఖముతో రామలక్ష్మణుల నామములను ఉచ్చరిస్తూ విలపించుచుండెను. ఆమె ఆభరణములు జారిపోతున్నాయి. అందువలన నేనిచటికి వచ్చుట ఆలస్యమైనది.

 

టెక్కలు లేనివాడను, నిస్సహాయుడను, వివశుడను అయిన నేను గిలగిలలాడుతూ ఉన్నాను. ఏమీ చేయ లేక పోయాను. దుష్టుడైన రావణునిశక్తి నాకు తెలిసే ఉన్నది. అందువలన జగదంబయైన సీతా దేవిని రక్షింపలేకపోవుటచే నేను అతనితో కఠినముగా పలికాను.

 

తస్యా శ్రుత్వా విలపిం తౌ చ సీతావియోజితౌ ||

న మే దశరథ స్నేహాత్- పుత్రేణోత్పాదితం ప్రియమ్ |

 

(వా. రా. 4–68–7–8)

Thursday 11 November 2021

శ్రీ హనుమద్భాగవతము (72)



అతడు నలువైపుల తన దృష్టిని ప్రసరింపజేసి ప్రభువుయొక్క ప్రియభక్తులతో ఆదరముగా ఇలా పలికాడు :


త్రికూటపర్వతముపై లంకానగరమున్నది. అక్కట రావణుడు సహజముగానే శంకారహితుడై ఉన్నాడు. అచట అశోకం అనే ఒక ఉద్యానవనమున్నది. అక్కడ సీతా దేవి శోకమగ్నమై కూర్చుండి ఉన్నది. నేను అంతా చూస్తున్నాను. మీకు కనబడుటలేదు. ఎందుకనగా గృధ్రదృష్టి అపారమైనది అనగా చాలా దూరమువరకు వెళుతుంది. నేను వృద్ధుడనైయ్యాను, లేకపోతే మీకు చాలా సహాయం చేసి ఉండే వాడను'.


ఇంకా వారిని ప్రోత్సాహపరుస్తూ సంపాతి ఇట్లా పలికాడు -


తద్భవన్తో మతి శ్రేష్ఠ బలవన్తో మనస్వినః ||

ప్రహితాః కపిరాజేన దేవైరపి దురాసదాః | (వా.రా. 4-59_25 - 26)


మీరు కూడా ఉత్తమబుద్ధియుక్తులు, బలవంతులు, దేవతలకు దుర్జయులై ఉన్నారు. అందువలననే వానర రాజైన 'సుగ్రీవుడు మిమ్ములను కార్యమునకు పంపినాడు.


తదనంతరము అతడు శ్రీరామలక్ష్మణుల తీక్ష్ణశరముల మహిమను గానము చేస్తూ వానర భల్లూకములతో ఇలా పలికాడు 


రామలక్ష్మణబాలాశ్చ విహితాః కంకపత్రిణః ||

త్రయాణామపి లోకానాం పర్యాప్తాస్త్రాణనిగ్రహే |

కామంఖలు దశగ్రీవ స్తేజోబలసమన్వితః | 

భవతాం తు సమర్ధానాం న కించిదపి దుష్కరమ్ |


(వా.రా.4.59-26-27)


కంకపత్రములతో కూడిన శ్రీ రామలక్ష్మణుల బాణములు సాత్తుగా విధాతచే నిర్మితములైనట్టివి. అవి ముల్లోకములను సంరక్షించుటయందు, నిగ్రహించుటయందు సమర్థము లైనట్టివి. మీకు శత్రువైన రావణుడు తేజస్వి మరియు బలవంతుడైనా మీ వంటివీరులు అతనిని ఓడించుట దుష్కరముకాదు. 


ప్రోత్సహించిన తర్వాత సంపాతి ఇలా పలికాడు - "మీరు ఏదో విధముగా సముద్రాన్ని దటడానికి ప్రయత్నించండి. రాక్షసరాజైన రావణుని వీరవరుడైన శ్రీరామచంద్రుడు సంహరించగలడు. సముద్రమును దాటి లంకలోనికి వెళ్ళి, సీతా దేవిని దర్శించి, ఆమెతో మాటలాడి మరల సముద్రమును దాటివచ్చే వీరుడు మీలో ఎవడున్నాడో ఒకసారి ఆలోచించండీ.


Wednesday 10 November 2021

శ్రీ హనుమద్భాగవతము (71)



తన ప్రాణప్రియసోదరుడైన జటాయువు ప్రభువు కొఱకు ప్రాణములను అర్పించాడనీ, అతని అంతిమగతి సుఖపూర్ణముగా అయ్యిందని విని సంపాతి ఆనందవిహ్వలుడయ్యాడు. ఇంతే కాదు మహామునియైన చంద్రునివాక్కును అనుసరించి పరమశ్రేయస్సు కలిగే క్షణం ఆసన్నమయ్యిందని ఎఱిగి సంపాతి తన దుఃఖమునంతటిని మరచాడు. అతని శరీరమంతా పరమానందముచే పులకితమయ్యింది.


అంగదస్య వచః శ్రుతా శ్రుత్వా సంపాతి గృష్టమానసః || 

ఉవాచ మత్రియో భ్రాతా ప్లవగేశ్వరాః | 

జటాయుః బహువర్ష సహస్రాంతే భ్రాతృవార్తా శ్రుతా మయా | 

(అ.రా. 4.7.46-47)


'అంగదుని మాటలు విని చిత్తము ప్రసన్నము కాగా సంపాతి ఇలా పలికాడు - కపీశ్వరులారా! జటాయువు నాకు పరమప్రియుడైన సోదరుడు. నేను కొన్ని వేలసంవత్సరముల తరువాత నా సోదరుని గురించి విన్నాను.'


వాఙ్మతిభ్యాం హి సర్వేషాం కరిష్యామి ప్రియం హి వః || 

యద్ధి దాశరథేః కార్యం మమ తచ్చాత్ర సంశయః |


(వా.రా. 4.59.24-25) 


నేను వాక్కు ద్వారా, బుద్ధిద్వారా మీ అందరికి ప్రియమైన పనిని తప్పక చేస్తాను. ఎందుకనగా దశరథనందనుడైన శ్రీరాముని కార్యము నా కార్యమే, ఇందులో సందేహము లేదు.  


సంపాతి ఇంకా ఇలా పలికాడు :- ' మొట్టమొదట మీరు నన్ను నీటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అక్కట నేను నా సోదరునకు తర్పణములను ఇవ్వాలి. తర్వాత మీ పని నెరవేరుటకై నేను తగినమార్గమును చెప్పగలను.'


సంపాతి కోరికను విని, మహావీరుడైన హనుమంతుడు అతని ఎత్తుకొని సముద్రతటమునకు తీసుకొనిపోయాడు. అచట సంపాతీ స్నానము చేసి జటాయువునకు తర్పణములను ఇచ్చాడు. పిమ్మట వానరులు అతనిని అతని స్థానమునకు తీసుకుని వెళ్ళారు. అక్కడ శ్రీరామచంద్రుని భక్తులు ఎదుట కూర్చుండగా చూసిన సంపాతి యొక్క సుఖమునకు అంతములేక పోయింది. అతని శారీరక మానసిక కష్టము మొదటనే తొలగిపోయింది. 


Tuesday 9 November 2021

శ్రీ హనుమద్భాగవతము (70)



భోజనమునకై తహతహలాడుచున్న మహా కాయము కలిగిన సంపాతిని చూసి వానరులు ఎంతో భయపడుతూ ఇలా ఆలోచింపసాగారు — “మనము శ్రీరామునకు ఎట్టి సేవను చేయలేదు, సుగ్రీవుని ఆజ్ఞను పరిపాలించలేదు. ఇపుడు మనము వ్యర్థంగా దీని కడుపులోనికి పోనున్నాము.” తర్వాత వారు ఱెక్కలు లేని అగృధ్రమునకు వినబడునట్లుగా ఈ విధంగా పలికారు -


అహో జటాయుద్ధర్మాత్మా రామస్యార్థే మృతః సుధీః |

మోక్షం ప్రాప దురావాసం యోగినామప్యరింధమ ||


(అ.రా. 4.7.34)


"ఆహా! ధర్మాత్ముడైన జటాయువు ఎంత ధన్యుడు? బుద్ధిమంతుడైన అతడు శ్రీ రాముని కార్యార్థమై తన ప్రాణములను ఒసంగినాడు. చూడు, ఆ శత్రుదమనుడు యోగులకు కూడా దుర్లభమైన మోక్ష పదవిని పొందినాడు".


జటాయువు పేరు విని సంపాతి ఎంతో దుఃఖతుడై అత్యంతాశ్చర్యములో వానరులతో ఇట్లా పలికాడు - కే వా యూయం మమ భ్రాతః కర్ణ పీయూష సన్నిభమ్ ||

జటాయురితి నామాద్య వ్యాహరన్తః పరస్పరమ్ |

ఉచ్యతాం వో భయం మా భూన్మతః ప్లవగసత్తమాః ||

(అ.రా.4-7-36-36)


"వానర శ్రేష్ఠులారా ! మీరెవరు? మీలో మీరు నా కర్ణములకు అమృతమువలె ప్రియాన్ని కలిగించే నా సోదరుడైన జటాయువు నామాన్ని ఉచ్చరిస్తున్నారు. మీరు ఏ మాత్రము భయపడక మీ వృత్తాంతమును నాకు వినిపించండి".


సంపాతి ధైర్యము చెప్పినా వానరయూధపతులు అతనిని నమ్మలేదు. మాంసభోజియైన మహాకాయము కలిగిన ఆ గృధ్రమును వారు అనుమానించారు. దీర్ఘాలోచనానంతరము వానరులు ఆయన వద్దకు వెళ్ళారు.


యువరాజైన అంగదుడు అతనికి శ్రీరాముని జన్మనుండి సీతాహరణము వరకు జరిగిన కథనంతటిని సవిస్తరముగా వినిపించాడు. పిమ్మట జటాయువు సీతా దేవిని రక్షించుటకై రావణునితో యుద్ధము చేసి శ్రీ రాముని ఒడిలో సుఖంగా ప్రాణములను వదలిన విషయాన్ని, పరమకారుణికుడైన శ్రీరాముడు ఆ జటాయువునకు చేసిన అంతిమసంస్కారము గురించి వానరులు చెప్పారు. చివరకు వారు 'మా వానర రాజైన సుగ్రీవుని ఆజ్ఞను అనుసరించి సీతా దేవిని అన్వేషించుటకై ఇచటికి వచ్చాము, కాని ఇంతవరకు ఆమె జాడ తెలియలేదు, అందువలన మేము దుఃఖముతో ధైర్యహీనులము, వ్యాకులరము అవుతున్నాము” అని చెప్పారు.

Monday 8 November 2021

ఉమాంగమలజ వరద వినాయక చవితి



ఓం ఉమాంగ మలజాయ నమః 


గాణాపత్యంలో ప్రతి చవితికి ఒక విశేషం ఉందని ఇంతకముందు చెప్పుకున్నాము గదా. ఈరోజు కార్తిక శుద్ధ చవితి. దీన్ని గణపతి ఆగమలు ఉమాంగమలజ వరద వినాయక చవితి అని, మలజాత వరద వినాయక చవితి అని అంటాయి.


ఉమా అంటే పార్వతీదేవి. మల అంటే ఆమె శరీరం పైనున్న మట్టి. జా అనగా దాన్ని నుండి అవతరించిన వాడు. పార్వతీదేవి స్నానం చేసే ముందు తన శరీరానికి నలుగు పిండి రాసుకుంది. దాన్ని నలచగా వచ్చిన వ్యర్ధంతో ఒక బాలుడిని చేసి ప్రాణం పోసిందని మనం వినాయకచవితికి కధ చదువుతాము గదా. అది జరిగినది కార్తిక శుక్ల చవితి నాడే. అందుకే దీనికి ఉమాంగమలజ వరద వినాయక చవితి అని పేరు.


అలాగే గణపతి శివగణాలతో  పోరాడి అందరినీ ఓడించింది, శివునితో జరిగిన యుద్ధంలో నరముఖం కోల్పోయి గజవదనంతో తిరిగి లోకాన్ని అనుగ్రహించింది కూడా ఈరోజే. 


భగవానుడు అమలుడు, విమలుడు (అనగా లేశమాత్రమైన మలం (దోషం) కూడా తనయందు లేనివాడు). కానీ అద్వైతంలో సర్వమూ ఈశ్వరుడే అని నిరూపించుట కొఱకు  పూర్ణబ్రహ్మమైన గణనాథుడు పార్వతీదేవి మలం నుంచి ఆవిర్భవించాడు. అయినప్పటికీ అక్కడ అమ్మవారిని ఉమా అన్నారు. సర్వ ఉపనిషత్తుల సారమే ఉమా అనే పదం. అ ఉ మ కలిస్తే ఓం అనే అక్షరం ఏర్పడింది. అందులో ఉ అనే అక్షరంతో మొదలులెట్టి చదివితే ఉ మ అ (ఉమా) అవుతుంది. అనగా ఓంకారం నుంచి ఉద్భవించవాడు, ఓంకారస్వరూపుడు ఆయనే.


ఈ రోజు గణపతి ప్రీతికొరకు గాణాపత్యులు మరియు గణేశభక్తులు దీపదానం చేస్తారు. అలగే గణపతి యొక్క 12 అవతారలకు సూచనగా 12 ఆవునేతి దీపాలను గణపతి ముందు వెలిగిస్తారు.  ఈ రోజు చేసే మఱొక ముఖ్యమైన విధి - గణపతికి నారికేళబలి ఇవ్వడం, అనగా గణపతి ముందు కొబ్బరికాయ కొట్టడం. ఇదే రోజున గణపతికి రుద్రుడు కొబ్బరికాయ సమర్పించాడట. 


భాద్రపద శుక్ల చవితి (వినాయక చవితి )ఎంత విశేషమో, ఈ కార్తిక శుద్ధ చవితి అంత విశేషం. అమాటకు వస్తే స్వామి భక్తులకు ప్రతి పక్షంలో వచ్చే చవితి ప్రత్యేకమే.


ఓం గణేశాయ నమః

ఓం ఉమాంగ మలజాయ నమః 

Sunday 7 November 2021

శ్రీ హనుమద్భాగవతము (69)



ఇట్లా యువరాజైన అంగదునకు ధైర్యము చెప్పిన తర్వాత మహాపరాక్రమశాలీ, రామదూత అయిన హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానరులతో కలిసి సీతా దేవిని అన్వేషిస్తూ మెల్లమెల్లగా దక్షిణ సముద్ర తటముపై గల మహేంద్రపర్వతము యొక్క లోయలోనికి చేరుకొన్నాడు. అచట ఎదురుగా అగాథమైన హద్దులేని మహాసాగరంలో భయంకరమైన అలలను చూసి వానరులు భల్లూకములు భయపడిపోయారు. సీతాన్వేషణార్థమై సుగ్రీవుడు ఇచ్చిన ఒక మాసము గడువు కూడా పూర్తి అయ్యింది. ఎదుట మహాసముద్రము. వీరులైన వానర భల్లూకముల బుద్ధి పనిచేయడం ఆగిపోయింది. అందువలన వానరరాజైన సుగ్రీవుని కఠోర దండనమును గురించి ఆలోచించి వారు ఇలా పలికారు.


"రాజైన సుగ్రీవుడు. దుర్దండుడు. ఆయన తప్పక మనలను చంపగలడు. సుగ్రీవుని చేతిలో మరణించుట కంటే ప్రాయోపవేశనమునందే (అన్నమును, నీటిని వదలి మరణించుటయందే) మనకు శ్రేయస్సు ఉన్నది" అని నిర్ణయించుకొని వారందఱు దర్భలను పఱచుకొని మరణింపదలచి అక్కడే కూర్చున్నారు.


వానరుల కోలాహలమును విని గృధ్రరాజయైన సంపాతి వింధ్యగిరికందరము నుండి బయటకు వచ్చి అన్న పానీయములను వదలి మరణించుటకు నిశ్చయించి కుశాసనములపై కూర్చుని ఉ వానర భల్లూకములను చూసి హర్షాతిరేకముతో ఇలా పలికాడు :


విధిః కిల నరం లోకే విధానేనానువర్తతే | 

యధాయం విహితో భక్ష్యశ్చిరాన్మహ్యముపాగతః ||

పరంపరాణాం భక్షిష్యే వానరాణాం మృతం మృతమ్ |


(వా. రా. 4-56-4-5) 


లోకంలో పూర్వజన్మకర్మఅను అనుసరించి మానవునకు తాను చేసుకొన్న ఫలము లభించినట్లు నేడు దీర్ఘ కాలానంతరము ఈ భోజనము నాకు దానియంతటదే లభించినది. ఇది నేను చేసుకొన్న కర్మఫలమై ఉండవచ్చు. ఈ వానరులలో ఎవరెవరు చనిపోతారో వారిని నేను క్రమంగా భక్షిస్తాను.


Saturday 6 November 2021

శ్రీ హనుమద్భాగవతము (68)



మనము అమరావతీపురము (స్వర్ఘము) లోని సుఖసామగ్రులతో కూడి ఉన్న ఈ గుహలోనే సుఖంగా ఉండగలము.

వానరులు మెల్లగా చెప్పిన మాటలు విని పరమనీతిజ్ఞుడైన పవననందనుడు యువరాజునకు ధైర్యము చెబుతూ ఎంతో ప్రేమతో ఇలా పలికాడు : 'యువరాజా ! నీవు వ్యర్థముగా ఎందుకు చింతిస్తున్నావు? నీవు మహారాణియైన తారకు ప్రాణప్రియ పుత్రుడవగుటవలన సుగ్రీవునకు కూడా సహజముగానే ఇష్టుడవై ఉన్నావు. నీయందు శ్రీ రాఘవేంద్రునకు ప్రేమ ప్రతి దినము లక్ష్మణుని పై కంటెను అధికమవుతున్నది. వానరులు నిన్నీ గుహలో నిష్కంటకముగా ఉండమని పలికారు. కాని అదివ్యర్థము. ఎందుకనగా ముల్లోకములలో ఏ లక్ష్యము కూడా శ్రీరాముని బాణములచే అభేద్యముకాదు. భార్యాపుత్రులను ఎప్పుడును ఎడబాయని ఈ వానరులు నీకు తగిన సలహా ఇవ్వడం లేదు”.


పవనపుత్రుడు ఎంతో ప్రేమతో అంగదునకు నచ్చ చెబుతూ ఇంకా ఇలా పలికాడు :- "కుమారా ! ఇంతేకాదు నేను నీకొకరహస్యాన్ని చెబుతున్నాను. శ్రద్ధగా వినుము. శ్రీరామచంద్రుడు సామాన్యమానవుడు కాడు. ఆయన సాక్షాత్తుగా నిర్వికారుడైన శ్రీనారాయణుడు. సీతా దేవి జగన్మోహినియైన మాయ. లక్ష్మణుడు త్రిభువనధారుడైన సాక్షాత్తు ఆది శేషువే. వారందఱు 'బ్రహ్మదేవుని ప్రార్థనను అనుసరించి రాక్షస వినాశమునకై మాయామానవరూపమున జన్మించారు. ఒక్కొక్కరు ముల్లోకములను రక్షింపసమర్థులు. 


అన్యద్గుహ్యతమం వశేష్యే రహస్యం శ్రుణు మే సుత| 

రామో న మానుషో దేవః సాక్షాన్నారాయణేఽవ్యయః || 

సీతా భగవతీ మాయా జనసమ్మోహకారిణీ | 

లక్ష్మణో భువనాధారః సాక్షాచ్ఛేషః ఫణీశ్వరః ||

బ్రాహ్మణా ప్రార్థితాస్సర్వే రహోగణవినాశనే | 

మాయామానుషభావేన జాతా లోకైకరక్షకాః ||


(వా. రా. 4–7–16-18) 


మనము పరమప్రభువు లీలా కార్యంలో కారణంగా ఉండటమే అదృష్టం.


Friday 5 November 2021

శ్రీ హనుమద్భాగవతము (67)



సంపాతిద్వారా సీతాదేవి జాడను తెలుసుకొనుట


వాసరభల్లూక వీరులు మరల సీతాన్వేషణార్థమై బయలు దేరారు. అధికశ్రమతో వెతికినా రావణుని జాడగాని, సీతా దేవి జాడగాని తెలియరాలేదు. అలసిన వానరభల్లూక వీరులు కూర్చుని 'ఇక ఏమి చేయాలని పరస్పరం ఆలోచించ సాగారు. అపుడు మరల దుఃఖతుడై అంగదుడు ఇట్లా పలికాడు - ఈ గుహలో తిరుగుట మొదలై దాదాపు ఒక మాసము గడచినది. సుగ్రీవుడు చెప్పిన గడువు గడచిపోయినది. సీతాదేవి జాడ తెలియరాలేదు. ఇక ఇపుడు కిష్కంధకు తిరిగి వెళితే మనకు చావు తప్పదు. నన్ను ఆయన విడువడు, నేను ఆయన శత్రువునకు పుత్రుడను గదా ! అందువలన తప్పక చంపగలడు. నన్ను ధర్మాత్ముడు, వీరవరుడైన శ్రీరాముడు కాపాడినాడు. ఇపుడు ప్రభువుకార్యము నెరవేర్చలేదనే నెపముతో ఆయన నన్ను ప్రాణములతో విడువడు. అందువలన నేను తిరిగి వెళ్ళను. ఏదో ఒక విధముగా ఇచట ప్రాణములను విడుస్తాను.”


ఇట్లా అశ్రునయనములతో యువరాజైన అంగదుడు విలపించుట చూసు వానరులు చాలా బాధపడ్డారు. సానుభూతితో వారు అంగదునితో ఇలా పలికారు - “నీవు చింతింపవలదు. మేము మా ప్రాణములను ఇచ్చి అయినా సరే నీ ప్రాణములను కాపాడుతాము.

Thursday 4 November 2021

శ్రీ హనుమద్భాగవతము (66)



తపః పూతయైన ఆ యోగిని హనుమంతునితో ఇట్లా పలికింది - 'నేను చాలా ధన్యురాలను. తపస్సు ఫలించినది, నా ఆనందమునకు అవధులు లేవు. పూర్తిగా శంకారాహితులై మీరు మొదట యథేచ్ఛగా మధురఫలములను భుజించండి. అమృతమయమైన జలమును త్రాగండి, తృప్తులై నా సమీపమున కూర్చుని విశ్రాంతి తీసుకోండి. అప్పుడు మీకు నా వృత్తాంతమును చెబుతాను.


హనుమంతుడు వానరులతో కలిసి మధుర ఫలముల భక్షించి, శీతలజలమును త్రాగి తృప్తులు ప్రసన్నులయ్యారు. తర్వాత వారు యోగిని దగ్గఱకు వెళ్ళి చాలా వినయముగా  కూర్చున్నారు. 


భక్తురాలైన ఆ యోగిని వానరసహితుడైన హనుమంతునితో ఇలా చెప్పసాగింది- 'పూర్వకాలమునాటి విషయము, విశ్వకర్మకు హేమ అనే ఒక లావణ్యవతి యైన పుత్రిక ఉండింది. ఆమె అద్భుత నృత్యమునకు సంతుష్టుడై శివుడు దివ్యము, విశాలము అయిన ఈ నగరం ఆమెకు నివసించుటకై ఇచ్చాడు. ఇచట ఆమె వేలకొలది సంవత్సరములు నివసించింది. ఆమె నాకు ప్రాణసఖి, బ్రహ్మలోకమునకు వెళుతూ ఆమె నన్ను నిజమైన ముముక్షురాలనీ, క్షీరాబ్ధి శాయి మహావిష్ణువును ఉపాసించు దానిని అని తెలుసుకుని ప్రేమ పూర్వకముగా నాతో నీవీ ఏకాంతము శాంతమైన స్థానంలో ఉండి తపస్సు చేసుకో. త్రేతాయుగంలో స్వయముగా నారాయణుడు భూభారహరణార్థమై అయోధ్యాధిపతి యైన దశరథునకు ఆయన ధర్మపత్నియైన కౌసల్యకు పుత్రరూపమున జన్మిస్తాడు. ఆయన ధర్మసంస్థాపనమునకు, దుష్టవినాశమునకు వనంలో సంచరిస్తాడు. ఆయన యొక్క భార్యను అన్వేషిస్తూ కొందఱు వానరులు ఈ గుహలో నున్న నీ దగ్గరకు వస్తారు. నీవు భక్ష్య భోజ్యములతోను, మధుర ఫలములతోను వారికి స్వాగతమిచ్చి పరమప్రభువైన ఆ శ్రీ రాముని దగ్గరకు వెళ్ళు. ఆయనను దర్శించి, ప్రేమపూర్వకముగ ప్రార్థించు. ఆయన దయచే యోగులకు దుర్లభమైన విష్నుధామానికి వెళ్ళగలవు."


కృతజ్ఞతాపూర్వకముగా హనుమంతుని చుస్తూ ఆమె మఱల ఇలా పలికినది- “నేను దివ్యుడనే గంధర్వుని పుత్రికను. నా పేరు స్వయంప్రభ. నేడి ఇచట మీ పవిత్రచరణములు సోకటంతో నా భాగ్య భానుడు ఉదయించినాడు. ఇపుడు నేను భగవానుడైన శ్రీరాముని దర్శనమునకై తహతహలాడుతున్నాను. మీరు మీమీ నేత్రములను మూసుకొనండి, వెంటనే ఈ గుహ నుండి బయటకు వెళ్ళగలరు. సీతా దేవిని దర్శించగలరు. నిరాశ చెందవలదు. ”


స్వయం ప్రభ ఆదేశమును అనుసరించి భల్లూక వానరులందఱు నేత్రములను మూసుకొనగా వెంటనే వారు గుహకు బయటగల అరణ్యములోనికి వెళ్ళారు.

Wednesday 3 November 2021

శ్రీ హనుమద్భాగవతము (65)



కొద్దిదూరము వఱకు గాఢాంధకారము వ్యాపించి ఉండింది, కాని ముందుకు వెళ్ళగానే వారికి నిర్మలమైన జలముతో నిండిన సరోవరము సాల తాల తమాల, నాగ కేసర, అశోక, చంపక, నాగవృక్షములు, పుష్పములతోను, మధురమైన ఫలములతోను కూడియున్న వృక్షములు కనబడ్డాయి. ఇంతేకాక అక్కడ వారు అద్భుతమైన వస్త్రాలంకారములతో కూడి ఎంతో సుందరమైన ఒక భవనమును కూడా చూశారు. ఆ భవనమున దివ్యములైన భక్ష్యభోజ్యాది సామగ్రులన్నీ అమర్చబడి ఉన్నాయి. అక్కడ స్వర్ణ సింహాసనముపై , లావణ్యమయి అయిన ఒక రమణి (స్త్రీ) కూర్చుని ఉంది. ఆమె వల్కలములను, కృష్ణమృగచర్మమును ధరించి ధ్యానమగ్నమై ఉంది. ఆమెను చూసి ఆవానరులు ఒకరి ముఖము ఒకరు చూసుకొనసాగారు. ధ్యానమగ్నురాలైన ఆ యోగిని శరీరము నుండి తేజస్సు ప్రసరితమవుతోంది. భయాక్రాంతులైన వానరులు ఎంతో శ్రద్ధతో ఆమె చరణములకు ప్రణమిల్లారు.


తనకు నమస్కరించిన ఆ వానరులను చూసి యా యోగిని శాంతచిత్తముతో మధుర వాక్కులతో ఇట్లా అడిగింది -'మీ రెచటినుండి వచ్చారు? మీరెవరు? ఏ ఉదేశ్యముతో దుర్గమములైన ఈ ప్రదేశములలో విహరిస్తున్నారు? నా ఈప్రదేశాన్ని మీరెందుకు పాడుజేస్తున్నారు?'


విశాలకాయుడైన హనుమానుడు వినయముతో ఆమెకు ఇట్లా ప్రత్యుత్తరమిచ్చాడు - ఆదరణీయురాలైన ఓ దేవి! అయోధ్యాధిపతి అయిన దశరథుని పుత్రుడైన శ్రీరాముడు తన తండ్రి ఆజ్ఞననుసరించి ధర్మపత్ని అయిన జానకీ దేవితోనూ, సోదరుడైన లక్ష్మణునితోనూ కలిసి వనవాసమునకు బయలుదేరాడు. అక్కడ పరమసాధ్వియైన సీతను లంకాధిపతియైన రావణుడు హరించినాడు. శ్రీరామునితో స్నేహము చేసి యుండుటవలన సుగ్రీవుడు మమ్మల్ని జానకీ దేవిని వెదకుటకై పంపినాడు. ఆ శుభ కార్యమునకై మేము ఇటువచ్చాము. ఆకలిదప్పికలచే కలత జెందిన మేమీ పవిత్రమైన గుహలోనికి ప్రవేశించాము - ' దేవీ ! నీవెవరు ? దయయుంచి ఈ విషయమును మాకు చెప్పూ అని అడిగాడు.

Tuesday 2 November 2021

దీపావళి - దివిటీలు - పితృ ఆరాధన




దీపావళి అమావాస్యలో లక్ష్మీపూజ ఎంత ముఖ్యమో పితృదేవతా స్మరణ కూడా అంతే ముఖ్యం. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సంక్రాంతికి కూడా పితృదేవతలతో సంబంధం వుంది. అందునా ఇది దక్షిణాయనం, అంటే పితృదేవతల కాలం. 


పితృ ఆరాధన అంటే అశుభం అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. పితృదేవతల అనుగ్రహం లేకుండా కుటుంబంలో శుభకార్యాలు జరగవు. కనుక ప్రతి శుభకార్యానికి ముందు వారిని స్మరించాలి. పెళ్ళిలో కూడా ముందుగా నాందీ శ్రాద్ధం అని క్రతువు ఉంటుంది. అందులో పెళ్ళికి పితరులను ఆహ్వానిస్తారు. కనుక పితృకర్మలు అశుభం అనే అపోహను హిందువులు వీడాలి.


దీపావళి నాడు పితృదేవతలకు తర్పణాలు తప్పకుండా వదలాలి. 

తర్పణాలు ఎవరైనా వదలవచ్చా అని అడుగుతున్నారు. తర్పణాలు కేవలం తల్లిదండ్రులు లేనివారు మాత్రమే వదలాలి. మిగితవారు పితృదేవతలను మనఃస్ఫూర్తిగా స్మరించాలి.

దీపావళి సాయంకాలం పితృదేవతల ప్రీత్యర్ధమై దివిటీలను వెలిగించి చూపించే ఆచారముంది. దీన్ని దివిటీలి కొట్టడమంటారు. కొన్ని ప్రాంతాల్లో కర్రలకు, కొన్ని చోట్ల గోంగూర కాడలకు వస్త్రం చుట్టి నూనెతో వెలిగించి వెలిగించి చూపించాలి. ఇది పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తుంది. కాకరపువ్వొత్తులు కాల్చామా, చిచ్చుబుడ్డీలు కాల్చామా అన్నది ప్రధానం కాదు, దీపావళి నాడు దివిటీలు వెలిగించామా లేదా అన్నది ప్రధానం. ఈ దివిటీలను కూడా పురుషులే కొట్టాలని, స్త్రీలు పక్కన నిల్చుని చూడాలని నండూరి శ్రీనివాస్ గారి విడియోలో చూశాను.


అలాగే దీపావళి పండుగ రోజు సూర్యోదయవేళ కూడా దీపాలు వెలిగించి ఇంటి ముంగిట పెట్టాలి. మా చిన్నప్పుడు మా పెద్దలు ఇంట్లో ఇలా చేయడం మేము చూసాము. కార్తీకమాసంలో కూడా ఇప్పుడు అందరూ సాయంకాల వెళ మాత్రమే కార్తీకదీపాలు వెలిగిస్తున్నారు గానీ ఈ నరకచతుర్దశి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రతి రోజు ఉదయం వేకువఝామునే దీపాలను వెలిగించి ఇంటి గడపల వద్ద, తులసిచెట్టు వద్ద పెట్టాలి.


నరకచతుర్దశి సాయంకాల వేళ కాళీమాతను, దీపావళి అమావాస్య సాయంకాలం వేళ మహాలక్ష్మీని పూజించాలి. 


వీటి గురించి అనేక విషయాలను తెలుసుకొనుటకు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, చాగంటి కోటేశ్వర రావు గారు, నండూరి శ్రీనివాస్ గార్ల ప్రవచనాలను వినవచ్చు.

Monday 1 November 2021

శ్రీ హనుమద్భాగవతము (64)



ఇట్లు పవనకుమారుని గుణములను కీర్తిస్తూ సర్వ వానరులను సీతాన్వేషణార్థమై ఆదేశించి సుగ్రీవుడు శ్రీ రాముని సమీపమున కూర్చున్నాడు. వీరులైన వానరులు, భల్లూకములు కమలనయనుడైన శ్రీరాముని చరణములకు ప్రణమిల్లి పయనమయ్యాడు. చివరకు హనుమానుడు ప్రభువు సమీపమునకు చేరాడు. అప్పుడు శ్రీరాముడు వానితో ఇట్లు పలికాడు – 'వీరవరుడా! నీ ప్రయత్నము, ధైర్యము, పరాక్రమము సుగ్రీవుని సందేశము అనే విషయములను బట్టి నీ వలన నా పని తప్పక నెఱవేరునని నాకు తోచుచున్నది, నీవు నా ఈ ఉంగరమును తీసుకో. దీనిపై నా నామాక్షరములు చెక్కబడియున్నవి. దీనిని నా గుర్తుగా ఏకాంతమున సీతా దేవికి ఇవ్వు. కపిశ్రేష్ఠా ! ఈ కార్యమునకు నీవే తగిన వాడవు. నీ బుద్ధిబలము గూర్చి నాకు చక్కగా తెలుసు. మంచిది, వెళ్ళు, నీకు శుభము కలుగుగాక !


(అభిజ్ఞానార్థ మేతన్మే అంగులీయకముత్తమమ్ | 

మన్నామాక్షరసంయుక్తం సీతాయై దీయతాం రహః || 

అస్మిన్ కార్యే ప్రమాణం హి త్వమేవ కపిసత్తమ | 

జానామి సత్త్వం సర్వం గచ్ఛ పంథాః శుభ స్తవ || (వా. రా. 4-6-28,29)


పవనకుమారుడు ఎంతో ఆదరముతో రాముని ముద్రికను తీసుకుని, ఆయన చరణకమలములకు నమస్కరించాడు. భక్తవత్సలుడైన శ్రీ రాముని కరకమలము స్వయముగా హనుమానుని శిరముపైకి వెళ్ళినాయి. అతికష్టముతో హనుమానుడు లేచాడు. పవిత్రమైన ప్రభువు చరణధూళిని అతడు తన శిరమున ఉంచుకొని, ఆయన దివ్యమూర్తిని తన హృదయములో నిలుపుకొని అతడు ఉత్సాహముతో బయలుదేరాడు. అతడు నిరంతరము శ్రీరామ నామమును జపించుచుండేవాడు.


హనుమానుడు స్వయంప్రభను గలిసికొనుట


ఆంజనేయుడు వానరసమూహముతో కలిసి సీతా దేవిని వెదకుతూ గహనమైన వింధ్యారణ్యమునకు వెళ్ళాడు. దట్టమైన ఆ అరణ్యమున ముళ్ళతో కూడి ఎండిపోయిన చెట్లు తప్ప నీరనునది ఎక్కడ కూడా కనబడలేదు. వానర భల్లూక సమూహము ఇటునటు తిరుగుట చేత ఎంతో దప్పికను పొందాయి. వారికి నీరెక్కడ కనిపింపలేదు. దప్పిక చేత వారికంఠములు ఎండిపోతున్నాయి. కాని జ్ఞానులలో శ్రేష్ఠుడు, సంకట మోచనుడైన ఆంజనేయుడు వారి వెంట ఉన్నాడు. ఆయన ధైర్యముతో నలువైపుల చూశాడు. కొద్ది దూరములో ఆయనకు తృణగుల్మలతాదులచే కప్పబడిన ఒక విశాలమైన గుహ కనిపించింది. ఆయన దాని నుండి హంసలు, క్రౌంచపక్షులు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు మొదలైన పక్షులు బయటకు రావటం చూశాడు. ఆ పక్షుల రెక్కలు తడిసియున్నాయి. దానివలన అక్కడ నీరున్నట్లు ఆయనకు అనుమానము కలిగింది. వెంటనే అందఱు అక్కడికి వెళ్ళవలసిందని ఆయన వారితో చెప్పాడు, దుర్గమములైన అరణ్యముల విషయము తెలిసిన ఆ హనుమంతునితో కలిసి వానర భల్లూక వీరులు ఒకరి చేతినొ ఒకరు పట్టుకొని మెల్లమెల్లగా గుహలోనికి ప్రవేశించారు.