Monday 31 July 2023

శ్రీదత్త పురాణము (213)

 


కృష్ణా మలకం కథ


ఒకానొక సందర్భంలో ఏక వీరా దేని ఆజ్ఞ మేరకు చతుర్ముఖుడు విష్ణు సందర్శన కాంక్షతో క్షీర సముద్రానికి బయలు దేరాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. ఎంత వెదికినా ఎంతసేపున్నా శేష శాయి దర్శనమే కాలేదు. ఏమిటి ఈ వింత చెప్మా- అని భయ సందేహ పరాభవాది భావాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా అక్కడ ఒక అమలకీ తరువు (ఉసిరిక) కనిపించింది. అది విద్యుత్కాంతులు విరజిమ్ముతున్న కృష్ణామలకీ తరువు. దాన్ని తీసుకొని తిరిగి వచ్చాడు విరించి, ఆ తరు రూపంలో స్వయంగా విష్ణుమూర్తి వచ్చినట్లే అనిపించి రేణుకాదేవి పరశురామునితో - నాయనా! మరొక్కసారి ఈ కృష్ణామలకీ రూప విష్ణుమూర్తిలోకి ప్రవేశించు. శివ స్వరూపుడైన నీ తండ్రిని స్తుతించు. ఈ కృష్ణామలకం త్రిభువనేశ్వరుడు. సాక్షాద్విష్ణువు, నీ తండ్రి సదాశివుడు. కనుక తరువు అవుతుంది.


Sunday 30 July 2023

శ్రీదత్త పురాణము (212)

 


జననీ! త్రిలోక వందితా! గాయత్రీ! వేదమాతా! కటాక్షించు. వేదాలను మరచిపోయాము ఏ ఒక్క మంత్రమూ గుర్తుకు రావడం లేదు. నువ్వు పరమేశ్వరివి. జగద్గురుత్వం నీది. సర్వదేవతా మయివి. నీ అక్షరరూపాన్ని నా బుద్ధిలో తిరిగి ప్రకాశింపజెయ్యి.


చతురాననా! వెళ్ళి దత్తాత్రేయుణ్ని అభ్యర్ధించు. అతడు వర్ణమాత్రా సహితంగా సకల విద్యలూ నేర్చినవాడు అని రేణుకా దేవి బ్రహ్మకు చెప్పి వెంటనే దత్తాత్రేయుణ్ని పిలిచింది. జ్ఞానవేత్ఛ పురస్కృతా! సర్వదేవ నమస్కృతా! ఈ బ్రహ్మ దేవుడు ఏదో అంటున్నాడు. కొంచెం కనుక్కో నాయనా అని చెప్పింది. అప్పుడు దత్త దేవుడు బ్రహ్మను సమీపించాడు. చతుర్ముఖా ! సర్వజ్ఞానవేత్తా! ఏమిటి అడుగుతున్నావో చెప్పు. నాకు తెలిసింది తప్పక చెబుతాను.


మునిశ్రేష్టా! వేదాలను, వేదాంగాలనూ, ఉపనిషత్తులను సమస్తమూ మరచిపోయాను. దయజేసి వర్ణమాత్రాస్వరాత్మాంకంగా వాటిని నాకు బోధించు. 


విరించీ! కకారాది సకల వర్ణాలలోనూ ఏకైకమై పరిఢవిల్లే అనంత వాదాత్మకత ఒక్కటే. అది ఎవరిలో ప్రకాశిస్తుందో ఆ దేవిని “సవర్ణ” అంటారు. ఆ సవర్ణ - ఈ రేణుకాదేవియే తప్ప మరొకరెవ్వరూ కాదు. సవర్ణ - వేదమాత - సావిత్రి- బ్రహ్మరూపిణి- అన్నీ ఆ జగద్ధాత్రి రేణుకాదేవియే. రెండవ శక్తి లేదు. ఏకమాత్ర ఏక వీర ఓంకారైక స్వర - అన్నీ ఆమెయే. అష్టపర్యాయక వాచక అని కూడా ఆమెను అంటారు. (హ్లాదిని విమల ఉత్కర్షిణి జ్ఞానయోగ ఇత్య ఈశాన ప్రసీ అనుగ్రహ అని అష్టపర్యాయ వాచకాలు) ఒక్కటే అయినా అనేక రూపాలు ధరిస్తుంది. - - - - కనుక ఏక వీర అన్నారు. ఆమెయే వేదమాత. గాయత్రి బ్రహ్మ రూపిణి.


మునిశ్రేష్ట ! సాధు, వేదమాత అన్నా, గాయత్రి అన్నా, బ్రహ్మ రూపిణి అన్నా ఒక్కరేనని చాలా చక్కని విషయం స్పష్టపరిచావు.


దత్తాత్రేయ చతుర్ముఖులు ఇలా సంభాషించుకుంటూ ఉండగానే దత్తదేవుడి అంకపీఠ నివాసినియైన శ్రీదేవి ముఖం నుంచి చతుర్వేదాలు వెలువడి రేణుకాదేవి శరీరంలో ప్రవేశించాయి. దీనితో సంతృప్తి చెందిన చతుర్ముఖుడు రేణుకాదేవియే వేద మాత అని గుర్తించి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. తల్లీ! ఛందస్స్వరూపిణివి నీవు. ఓం కార స్వరూపిణివి నీవు. అనంత రూపిణివి నీవు. తెలిసిగానీ, తెలియక గానీ నిన్ను నిందించే వాళ్ళు సకల పుణ్య ఫలాలనూ కోల్పోతారు అని స్తుతించి మరొక్కసారి నమస్కరించి దత్తాత్రేయుడికి ప్రణమిల్లి పురాతన వేద స్మృతిని తిరిగిపొంది సత్యలోకానికి వెళ్ళిపోయాడు.


ఆ జగదంబికయే రేణుమహారాజు చేసిన తపస్సుకు సంతుష్టయై వారింట కన్యగా జన్మించి శివస్వరూపుడైన జమదగ్నిని పరిణయమాడింది. సేవలు చేసినది. ఆ దంపతులు కొంతకాలానికి లౌకిక దేహాలను విడిచిపెట్టి శివశివాని రూపాలతో కైలాసం తిరిగి చేరుకున్నారు. దీపకా! ఈ కధ నీకింతకు ముందే చెప్పాను కదా! అంచేత నీ మరో ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను. తిలకించు అని వేద ధర్ముడు కొనసాగించాడు. -



Saturday 29 July 2023

శ్రీదత్త పురాణము (211)

 


గురూత్తమా! కార్త వీర్యార్జుని అవతార సమాప్తితో పాటు పరశురాముని వృత్తాంతం కూడా నాకు తెలియజెప్పి ఎనలేని ఆనందం సమకూర్చారు. అయితే ఇక్కడ నాదొక సందేహం. ఈ రేణుకాదేవి ఎవరు? సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడైన దత్తాత్రేయుడే నమస్కరించి స్తుతించాడంటే ఆ తల్లి అవతారగాధ వినవలసిందే. అనుగ్రహించండి. రేణు అనే మహారాజు ఒకరు ఉండే వాడనీ, ఆయనగారి కూతురు రేణుక అనీ, నేనెప్పుడో ఎక్కడో విన్నాను. అటువంటి రేణుకను దేవదేవుడు నమస్కరించడమేమిటి చెప్మా? అని నా సందేహం. అలాగే కాన్యకుబ్జంలో ఉండే పరశురాముడికి సహ్యాద్రిలో అమలకీ గ్రామం ఎందుకు ఆశ్రమమయ్యింది? అవి ఇప్పటికి నా చిరు సందేహాలు. దయచేసి వీటిని తీర్చండి.


దీపకుడి అభ్యర్ధనతో వేద ధర్ముడు వీటికి సమాధానాలు వివరించాడు. నాయనా, దీపకా! ఇదే విషయాన్ని పూర్వకాలంలో శ్రీశైల శిఖరం మీద మహర్షులడిగితే కుమారస్వామి వారికి వివరించాడు. అదంతా నీకు చెబుతాను - అంటూ ప్రారంభించాడు.


రేణుకా వృత్తాంతం


కృతయుగారంభంలో సృష్టి కర్త అయిన పితామహుడు అనేకోపాయాలతో ఈ జగత్ సృష్టి చేసాడు. దేవ - దైత్య - మనుష్య - పశు - పక్షి వృక్షాది జాతుల్ని వర్ణాశ్రమ ధర్మాలను సమస్తమూ వేద నిర్దిష్టమైన మార్గంలో సృజించాడు. ముల్లోకాలు హాయిగా ఉన్నాయి. అందరూ జ్ఞాన విజ్ఞాన పారంగులై తపోనిష్టులై కామ క్రోధ రాగ ద్వేష రహితులై శాంతి సౌఖ్యాలతో ప్రసన్నంగా కాలం గడుపుతున్నారు. బ్రహ్మదేవుడు గమనించాడు. ఇలాగైతే ఇక సృష్టి వృద్ధి చెందినట్టే - అనుకున్నాడు. ఆలోచించాడు. తమోగుణం, మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం - అనే పంచ పర్వాలతో అవిద్యను సృష్టించి ప్రాణికోటిని సమ్మోహపరచడానికి లోకం మీదికి వదిలిపెట్టాడు. అతడు సృష్టించిన అవిద్య ముందుగా అతడినే ఆవరించింది. దాని మహిమతో వేదాలు మరిచిపోయాడు. ఎంత గింజుకున్నా ఒక్క మంత్రమూ గుర్తురావడం లేదు. కళ నళపడ్డాడు. భయపడ్డాడు. వెంటనే బయలుదేరి హంసవాహనం అధిరోహించి సహ్యపర్వతం చేరుకున్నాడు. ఒక ప్రశాంత రమణీయ స్థలంలో అమలకీ వనంలో (ఉసిరిక) కూర్చుని నిష్టాగరిష్టుడై రేణుకామాతను ధ్యానించాడు. ఆ తల్లి కరుణామయి. క్షణకాలంలో దర్శనమనుగ్రహించింది. చతుర్ముఖుడు ప్రణమిల్లి నిలిచి బహువిధాల స్తుతించాడు. మెల్లగా తన అవస్థను విన్నవించాడు.


Friday 28 July 2023

శ్రీదత్త పురాణము (210)

 


స్వామిన్! దత్తదేవా! అరిందమా! నేను విష్ణువును కాను, మహాశూరుణ్ని కాను. ఇది నిజం. గురుదేవ-ద్విజులకు నేను శిష్యుణ్ని, వటువుని, సందేహం ఏమీ లేదు. దేవ ఋషి- పితృ తృప్తి కోసం ఏదో చెయ్యాలను కుంటున్నాను. దానికి నీ సహాయం కోరుతున్నాను. దయచేసి గురుస్థానం అంగీకరించు అంటూ ఒదిగి పరశురాముడు దత్తాత్రేయుడికి నమస్కరిస్తూ ప్రదక్షిణం చేశాడు. దత్తదేవుడు చిరునవ్వుతో అంగీకరించాడు.


ఆ రమ్యమైన సహ్యాచలమే యాగ భూమి అయ్యింది. ఋషులంతా ఆహుతులై విచ్చేశారు. ద్వారతోరణ పతాకాలంకారాలతో యాగ మంటపం సిద్ధమయ్యింది. వేదికలూ యజ్ఞ కుండాలూ శాస్త్రీయంగా రూపొందాయి. బ్రహ్మవేత్తలైన ఋత్విక్కులు. ఋజుభక్తి తాత్పర్యాలతో సమర్చితులై యజ్ఞాంగాలను అన్నింటినీ నిర్దుష్టంగా సంపూర్ణంగా నిర్వహించారు. దివ్యాభరణ వస్త్రాదులను బహుమతులుగా పొందారు. యజ్ఞశాలకు వచ్చిన ప్రతి విప్రుడికీ సువర్ణోపస్కురాలు దక్షిణలుగా అందాయి. అన్నపానాలు సమృద్ది చెప్పనవసరమే లేదు. అన్ని జాతుల వారికీ కావాలన్నదల్లా పుష్కలంగా అందింది. ఇలా రామయజ్ఞం సుసంపన్నం, సుసంపూర్ణం అయ్యింది. దేవ మానవ యక్ష కిన్నెర నాగరాక్షస చారణ సిద్ధ సాధక జాతులవారందరూ పితృదేవతలూ ధన - ఘన సన్మానాలతో సంతృప్తులయ్యారు. సోమంతో ఇంద్రుడూ, భూరి దక్షిణలతో భూసురులూ, అన్న పాన వస్త్రాదులతో దీనులూ పరితుష్టి చెందారు. ప్రధాన ఋత్విక్కుగా అన్నీ నడిపించిన కాశ్యపుడికి చాతర్ హోత్ర విధానంగా సంపూర్ణ క్షితి మండలాన్నే దక్షిణగా సమర్పించాడు భార్గవరాముడు. ఇరవై యొక్క మార్లు క్షత్రియ సంహారం చేసి భుజబలంతో తాను గెలుచుక్ను భూగోళమిది. కశ్యపుడికి దక్షిణ అయ్యింది.


ఆచార్యకత్వం నెరపిన దత్తస్వామిని రత్నాభరణాలతో దివ్య వస్త్రాలతో సత్కరించి ఆర్చించాడు. రాముడిచ్చిన వాటిని అన్నింటినీ దత్తదేవుడు అక్కడున్న మునులకూ, బ్రాహ్మణులకూ నమస్కరించి మరీ సమర్పించాడు. కాశ్యపుడు భార్గవరాముని అనుమతి తీసుకొని తన క్షితి మండలాన్ని విప్రులందరికీ పంచిపెట్టాడు. దీనికి పరశురాముడు చాలా సంబరపడ్డాడు. కాశ్యపా! నీ వంటి జ్ఞానులు చెయ్యవలసిన పనిని చేశావు. ముండిత శిరస్కుడై, దిగంబరుడై మన మధ్య నడయాడుత్ను ఈ యోగివర్యుడు దత్తాత్రేయుడు స్వయంగా సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. సందేహం లేదు. ఇంత సుదుష్కరమైన ఈ మహాయజ్ఞం ఇంత తేలికగా ఒక లీలగా పరిసమాప్తమయ్యింది అంటే కేవలం ఇది వీరి అనుగ్రహమే, శ్రీ దేవీ కరుణా కటాక్షమే - అని తన భక్తి భావాన్ని ప్రకటించి కాశ్యపునికి దత్త దేవునికీ మరొకసారి నమస్కరించి రేణుకామాతను మనస్సులోనే ధ్యానించి సురసిద్ద మునీంద్ర దేవ బ్రాహ్మణులందరికీ ఇంకొక పర్యాయం కృతజ్ఞతగా శిరసువంచి అభివాదం చేస్తూ అందరి దగ్గరా సెలవు తీసుకొని భార్గవరాముడు మహేంద్ర పర్వత శిఖరాగ్రాన తపస్సుకి వెళ్ళిపోయాడు.


Thursday 27 July 2023

శ్రీదత్త పురాణము (209)

 


అటు పైని బ్రాహ్మణులను అర్చించి మహదాశీర్వచనం తీసుకున్నాక పరశురాముడు స్వయంగా దత్తాత్రేయుణ్ని పాదాభివందన పురస్సరంగా పూజించాడు. దత్తదేవుడి అనుమతి పొంది అమలకీ వనం నుంచి బయలుదేరాడు. తన ప్రతిజ్ఞను తీర్చుకోడానికి భూమండలం మీద విరుచుకుపడ్డాడు. పొడి తప్పిన క్షత్రియులందర్నీ ముయ్యేడు మార్లు గాలించి రాసాడి రాపాడి ప్రతిన నెరవేర్చుకున్నాడు. భూమిని క్షత్రియరహితం చేసేశాడు. గతమత్సరుడై అదే జలం తీసుకొని దత్తాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ తన ఆయుధాలను ప్రక్షాళించి ఆయుధాధి దేవతలను అర్చించాడు. దత్తాత్రేయుడికి నమస్కరించాడు. అంతలో తల్లితండ్రులు దివ్యదర్శనం అనుగ్రహించారు. సకల క్షత్రియాంతకా! నీ సాహసానికీ శౌర్య పరాక్రమాలకూ సంతృప్తి చెందాను. ఇక ప్రతీకారాగ్నిని శాంతింపజేసుకో. హింసా ప్రవృత్తివల్ల మూటగట్టుకున్న మహాపాపం తొలగించుకోవడంకోసం మహాయజ్ఞాలు చెయ్యి వాటితో శుద్ధి పొందుతావు- అని తండ్రి జమదగ్ని ఆజ్ఞాపించాడు. నాయనా! బ్రహ్మచారిని గదా ధర్మపత్ని తోడు లేకుండా యజ్ఞాలు ఎలా చేస్తానని సంశయించకు. దత్తాత్రేయుణ్ని గురువుగా అభ్యర్ధించు. కాశ్యపుణ్ని ప్రధాన ఋత్విక్కుగా వరించు. బంగారపు ప్రతిమను భార్యగా చెంత ఉంచుకో. యజ్ఞాలు చెయ్యి - అని తల్లి రేణుక ఉపాయం చెప్పింది.


ఇలా ఆజ్ఞాపించిన తల్లిదండ్రులిద్దరికీ సభక్తికంగా నమస్కరించి వీడ్కోలు పలికాడు. సహ్యాద్రి ఆమలకవనంలోని ఏక వీరాశ్రమ పదంలో ఇది జరిగింది. ఫలపుష్పభరితాలైన తరులతా గుల్మాలతో పక్షుల కిలకిల రావాలతో నానామృగ గణాకీర్ణమై దివ్యనదీ పరీవాహక ప్రాంతమై అన్నిటికీ మించి దత్తాత్రేయ సంరక్షితమైన ఆ ప్రదేశం తపస్సులకే కాదు యజ్ఞయాగాదులకూ అనువైన స్థలం. ఆ ఆశ్రమంలో ఒక రమ్యమైన పర్ణశాల ఉంది. పరశురాముడు అందులోకి ప్రవేశించాడు. అది దత్తాత్రేయుడి పర్ణశాల. సురసిద్ధ సాధ్య మునీశ్వర సేవితుడై దత్తదేవుడు కొలువుతీరి ఉన్నాడు. పరశురాముడు వినయవిధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తితో మౌనంగా స్తుతించాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆనందతుందిలుడై పరశురాముణ్ని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మృదువుగా సంభాషించాడు.


నాయనా, భార్గవరామా! నువ్వు చాలా కష్టసాధ్యమైన ఘనకార్యాలు చేశావు. కార్తవీర్యార్జునుడంతటి వాణ్ని అనాయాసంగా బాహు పరాక్రమంతో మట్టుబెట్టావు. దైత్య రాక్షస వీరులెందర్నో సంహరించావు. క్రూర కర్ములూ అధార్మికులూ అయిన దుర్జయ క్షత్రియ మహావీరులందరినీ ముయ్యేడు మార్లు ఏరి ఏరి మట్టి కరిపించావు. ఇంతలేసి ఘనకార్యాలు సాధించావంటే శిశూ! నువ్వు సాధారణ శూరుడవో బ్రాహ్మణుడవో కావని నా అభిప్రాయం. ఈ లోకంలో ఈ రూపంలో సంచరిస్తున్న స్వయం శ్రీమహావిష్ణుడవని నా నమ్మకం.


Wednesday 26 July 2023

శ్రీదత్త పురాణము (208)

 


"ఓయీ పరశురామా! దత్తాత్రేయునితో కలిసి మంత్ర పూర్వకంగా విధి విధానంగా మీ తండ్రికి అంతిమ సంస్కారాలు శ్రద్ధగా నిర్వహించు" ఇది వినడంతోనే పరశురాముడు నాలుగువైపులకూ తేరిపార చూశాడు. కందమూల ఫల సమృద్ధితో పచ్చగా ప్రశాంతంగా ఉన్న ఆశ్రమంలో తామున్నట్టు గుర్తించాడు. కావిడి దింపుకున్నాడు. దృష్టి ముందుకు సారించాడు. గుబురుగా ఉన్న చెట్ల మాటున ఎవరో ఉన్నట్టనిపించి అటు నాలుగు అడుగులు వేశాడు. ఒక దిగంబర మహర్షి పానపాత్రను చేతబట్టి కనిపించాడు. రాముడు సభక్తికంగా నమస్కరించాడు. కన్న తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించమని ప్రార్ధించాడు. ఏమిటి? నేను జరిపించాలి? నాకు విధివిధానములు, ధర్మాధర్మములు తెలియవు. ఏదో నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తోచిన దారిలో నువ్వు వెళ్ళు అన్నాడు దత్తస్వామి.


స్వామిన్ ! నీకు ధర్మాధర్మాలు తెలియవంటే నేనెలా నమ్ముతాను. సకల దేవతలకూ సకల మునులకూ నువ్వు పరమ గురువువి. జగత్ప్రసిద్ధుడివి. యోగీశ్వరుడివి నువ్వే సంశయం లేదు.

జమదగ్ని పాదాలకు నమస్కరించి పరశురాముని వైపు చూశాడు. రామా! శుభప్రదాలైన సర్వతీర్ధ క్షేత్రాలలో స్నానం చేసిరా. నేను చెప్పినట్టు సంస్కారం చేద్దువు గాని - అని ఆజ్ఞాపించాడు. రాముడు వెంటనే ధనస్సు సంధించి దివ్యబాణం ఎక్కుపెట్టి సహ్యాద్రిని గురిచూసి వదిలాడు. ఆ బాణ రంధ్రం నుంచి భుక్తిముక్తి ప్రదాలైన సకల పుణ్య నదీ తీరాలూ క్రమంగా ఆవిర్భవించాయి.


ఇలా తన దివ్యబాణ శక్తితో రప్పించుకొన్న పవిత్రనదీ తీర్ధజలాలలో పరశురాముడు స్నానం చేసి తండ్రి కళేబరానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి అగ్నిని ఉజ్వలంగా ప్రజ్వలింపజేసి దహన సంస్కారం జరిపాడు - జగన్మాతయైన రేణుక సర్వాభరణ భూషితయై నిలిచి దత్తాత్రేయా! పతివెంట నేను కూడా స్వస్థానానికి వెడదామనుకుంటున్నాను అని చెప్పి, నాయనా, భార్గవరామా! గురుదేవ, ద్విజులను రక్షించు నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని ఆజ్ఞాపించి, ఆ జగదంబిక తన పతిదేవుడి చితిలో సాంజలి బంధంగా ప్రవేశించింది. మరుక్షణాన భార్యా భర్తలిద్దరూ దేదీప్యమాన దివ్యరూపులై ఆనందమూర్తులై విను వీధిలో నిలిచారు. దత్తాత్రేయ, పరుశురాములిద్దరూ ఆ దంపతుల్ని చూసి సంబరపడుతూ శిరసువంచి నమస్కరించారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి వీడ్కోలు పలికారు.


Tuesday 25 July 2023

అడవిలో కంద మూలాలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సు కీడును శంకించింది. త్వరత్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరం కళ్ళారాచూసాడు. తండ్రిని తలుచుకొని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధ పడ్డాడు. కన్నతల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వొణికి పోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరిని ఒక్కసారిగా పట్టుకొని బావురుమన్నాడు పరశురాముడు. అమ్మా! నా కారణంగానే ఈ దారుణం జరిగింది. నేనే - నేనే బాధ్యణ్ణి అనుకుంటూ తలబాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు. కుమిలిపోతున్న తల్లితో సమానంగా రోదించాడు. రెండు క్షణాల్లో తెప్పరిల్లాడు. చివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళల్లో నీళ్ళు నిండుకొని విప్పారి ఒక్కక్షణంలో ప్రళయ కాలరుద్రుడిగా మారిపోయాడు. అశక్తుడిలా నేను నిలపించడం ఏమిటి? కర్తవ్యాన్ని విస్మరించడం ఏమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు. ధనుర్భాణాలూ గండ్రగొడ్డలీ ధరించాడు. సోదరులూ ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చెయ్య లేదు. ఎవరి మాటా వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడి గాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందర్ని ఊచకోత కోసేసాడు. అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేట్లుగా జలదభీషణంగా భీకర ప్రతిజ్ఞ చేసాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్క సారికాదు ఇరవై ఒక్క మార్లు చేస్తాను. ఇందులో అసత్యం గానీ అధర్మం గానీ లేదు - అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ టముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేసాడు. నాయనా! నీ ప్రతిజ్ఞలూ ప్రతీకారాలు తరువాత. ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపూ మీ తండ్రి శరీరం మరొక వైపూ కావిడికి ఎత్తుకుని బయలుదేరు - ఆగు - ఆగు - అనే మాట వినిపించిన చోట దింపు. సర్వ శాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకూ ఉచిత సంస్కారములు జరిపించు. రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరినీ కావిడకు ఎత్తుకొని తమ కావ్యకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులూ బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలూ, తాపసాశ్రమాలూ, వనాలూ, అరణ్యాలూ, పర్వతాలూ, నదులూ అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్య పర్వతం చేరుకున్నారు. ఆమలకీ తరుమండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది.

 


అడవిలో కంద మూలాలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సు కీడును శంకించింది. త్వరత్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరం కళ్ళారాచూసాడు. తండ్రిని తలుచుకొని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధ పడ్డాడు. కన్నతల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వొణికి పోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరిని ఒక్కసారిగా పట్టుకొని బావురుమన్నాడు పరశురాముడు. అమ్మా! నా కారణంగానే ఈ దారుణం జరిగింది. నేనే - నేనే బాధ్యణ్ణి అనుకుంటూ తలబాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు. కుమిలిపోతున్న తల్లితో సమానంగా రోదించాడు. రెండు క్షణాల్లో తెప్పరిల్లాడు. చివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళల్లో నీళ్ళు నిండుకొని విప్పారి ఒక్కక్షణంలో ప్రళయ కాలరుద్రుడిగా మారిపోయాడు. అశక్తుడిలా నేను నిలపించడం ఏమిటి? కర్తవ్యాన్ని విస్మరించడం ఏమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు.


ధనుర్భాణాలూ గండ్రగొడ్డలీ ధరించాడు. సోదరులూ ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చెయ్య లేదు. ఎవరి మాటా వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడి గాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందర్ని ఊచకోత కోసేసాడు. అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేట్లుగా జలదభీషణంగా భీకర ప్రతిజ్ఞ చేసాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్క సారికాదు ఇరవై ఒక్క మార్లు చేస్తాను. ఇందులో అసత్యం గానీ అధర్మం గానీ లేదు - అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ టముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేసాడు.


నాయనా! నీ ప్రతిజ్ఞలూ ప్రతీకారాలు తరువాత. ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపూ మీ తండ్రి శరీరం మరొక వైపూ కావిడికి ఎత్తుకుని బయలుదేరు - ఆగు - ఆగు - అనే మాట వినిపించిన చోట దింపు. సర్వ శాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకూ ఉచిత సంస్కారములు జరిపించు.


రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరినీ కావిడకు ఎత్తుకొని తమ కావ్యకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులూ బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలూ, తాపసాశ్రమాలూ, వనాలూ, అరణ్యాలూ, పర్వతాలూ, నదులూ అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్య పర్వతం చేరుకున్నారు. ఆమలకీ తరుమండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది.

Monday 24 July 2023

శ్రీదత్త పురాణము (206)

 


దీపకా! అటుపైన కార్తవీర్యుడి పుత్ర సంతానం మరొక స్వయం కృతాపరాధం కారణంగా పరశురాముని చేతిలోనే హతులయ్యారు. హతాశేషులు అతడి అనుగ్రహంతో రాజ్య పాలన చేసారు. పరశురాముడు ఈ భూగోళాన్ని క్షత్రియ శూన్యం చేస్తానని ప్రతిజ్ఞచేసి అలా నెరవేర్చుకున్నాడు.


గురూత్తమా! కార్తవీర్యుని అవతార సమాప్తిని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి చెప్పారు. అతడి సంతానం కూడా పరశురాముని చేతిలో హతులయ్యారంటే మరి వాళ్లు ఏ తప్పు చెయ్యడంవల్ల అలా జరిగింది? క్షత్రియ సంహారానికి రాముడు ఎందుకు ప్రతిజ్ఞ చేసాడు? ఇది తెలుసుకోవాలని ఉంది. దయచేసి అనుగ్రహించండి అని దీపకుడు అడగడమేమిటి వేదధర్ముడు కధా కధనం ఇలా ఆరంభించాడు.


పరశురామ ప్రతిజ్ఞ


కృతవీర్యుడి కుమారుడు కదా ఈ కార్తవీర్యుడు. ఇతడు లొట్ట చేతులతో పుట్టి తల్లితండ్రులకి తీవ్రమనస్తాపం కలిగించాడు. ఆ పైన దత్తస్వామిని అర్చించి ఆరాధించి సంప్రీతుణ్ని చేసి వెయ్యి బాహువులతో పాటు అనేక అమోఘ నరాలు పొందాడు. తనకు సమానుడో తన కన్నా అధికుడో అయిన ద్విజుడి చేతిలో మరణం ఆ వరాలలో ఒకటి. అందుకని పరశురాముని చేతిలో అలా నిహతుడయ్యాడు. దానికి హోమ ధేను హరణమనే మిష ఒకటి స్వయం కృతాపరాధమై సహకరించింది. విధి బలీయమనీ, ఏ అవతారమైనా ఉపసంహరింపబడవలసిందేననీ చెప్పుకున్నాం. కదా!


అయితే కార్తవీర్యార్జునుని కుమారులు పరశురాముని మీద కక్షగట్టి అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ వేచి ఉన్నారు. ఎదిరించే ధైర్యంలేక, శక్తి లేక దొంగచాటుగా ప్రతీకారం తీర్చుకోడానికి, పొంచి ఉన్నారు. తమ తండ్రిని సంహరించాడు కనుక అతడి తండ్రిని చంపాలని వారికసి. కొంత కాలానికి అనువైన సమయం దొరికింది. పరశురాముడు అడవికి వెళ్ళాడు. అతడి సోదరులు ఆట పాటల్లో తేలుతూ అల్లంత దూరాన ఎక్కడో ఉన్నారు. జమదగ్ని పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఋషి పత్ని రేణుకా మాత ఇంటి పనుల్లో మునిగివుంది. ఇంత కన్నా మంచి సమయం దొరకదని రాకుమారులు సాయుధులై జమదగ్ని పర్ణశాలలో ప్రవేశించారు. జమదగ్ని శిరస్సు ఖండించారు. వద్దు వద్దంటూ రేణుకాదేవి అడ్డుపడినా విలపించినా, ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. రాక్షసంగా శిరస్సు ఖండించి మెరుపువేగంతో వెళ్ళిపోయారు.


Sunday 23 July 2023

శ్రీదత్త పురాణము (205)

 


విక్రమిస్తున్న అర్జునునితో మృదువుగా ప్రారంభించి అతడి పరాక్రమాన్ని చూసి సంబరపడుతూ క్రమక్రమంగా విజృంభించాడు సాక్షాత్ శ్రీ మన్నారాయణుడైన పరశురాముడు. మహా వాయువు ఆకాశంలో మేఘ శకలాలను చెల్లా చెదురు చేసినట్లు అర్జునుడి బాణాలన్నింటినీ తన బాణాలతో మార్గ మధ్యంలోనే ఎగర గొట్టాడు. కార్తవీర్యుని ధనుస్సును కూడా విరుగ గొట్టాడు. కార్తవీర్యుడు కొత్త ధనుస్సును తీసికొన్నప్పుడల్లా ఇలాగే విరగ్గొట్టాడు. మొత్తం వంద ధనస్సులు అయ్యాయి. శర పంజరంలో బద్ధుడై సింహంలాగా గర్జించాడు కార్తవీర్యార్జునుడు. అయిదు వందల ధనుస్సుల్ని ఒకేసారి ధరించి ఆ సహస్ర బాహువు అయిదువందల బాణాలనూ ఎక్కుపెట్టి ఒక్కసారిగా రాముని మీదకు వేగంగా విడిచిపెట్టాడు. ప్రళయ కాల మేఘాలు తమ ఘోరవృష్టితో కాలాగ్నిని చల్లార్చినట్లు రాముడు ఆ బాణాలన్నింటినీ క్షణంలో వృధా చేసాడు.


కార్చిచ్చుల్లా ప్రజ్వరిల్లి మెరుపు వేగంతో శరవర్షం కురిపించి అర్జునుడి రధాన్ని తుత్తునియలు చేసాడు. నిరధుడై సహస్ర బాహువులతో రెక్కల పర్వతంలా నిలబడ్డ అతడి మీదకు లంఘించి గండ్ర గొడ్డలితో చెక్కేసాడు. మహా వృక్షం కొమ్మల్ని చెరిగినట్లు రెక్కలను నరికేశాడు. ఖండన వేగానికి అవి ఆకాశంలో ఎగిరి గిరికీలు కొడుతూ కల్ప వృక్షశాఖల్లా వచ్చి నేల మీదపడ్డాయి. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్లా, మహాశివుడి దయవల్లా, అతడికి వెయ్యి రెక్కలూ మళ్ళీ వెంటనే మొలుచుకువచ్చాయి. కొత్త చేతులతో శక్తి ఆయుధం ధరించి పరశురాముడి ధనుర్భాణాలనూ గండ్రగొడ్డలనీ ఎగరగొట్టాడు. ఇలా ఒక వంద ధనస్సులూ ఒక వంద పరశువులూ అయ్యాయి. రామునిలో రోషం భగ్గుమంది. ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఒక్కసారిగా వెయ్యి చేతులూ మొదలంటా మార్చేసి మరింక మొలవకుండా చేసాడు. రెక్కలు తెగిన పక్షిలా నిరాయుధుడై నిలబడ్డాడు అర్జునుడు. ఆ నిమిషంలో అంతరాత్మ మేల్కొంది. యోగాభ్యాస దక్షుడు, కనుక వెంటనే ధ్యాన సమాధిలోకి ప్రవేశించి పరతత్వాన్ని స్మరించాడు. బాహ్య స్మృతిని కోల్పోయి స్థాణువులా నిలబడ్డ కార్తవీర్యార్జునుడి శిరస్సును ఒకే ఒక్క గొడ్డలి వేటు నేలకు రాల్చింది. పండిన తాటి పండు తనంత తాను నేలకు రాలినట్లు అది అల్లంత దూరాన దభీమని పడింది.


ఆ వెంటనే మొదలు నరికిన చెట్టులా కార్తవీర్యార్జునుడి కళేబరమూ నేలకు ఒరిగి పోయింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. యోగ విద్యాపారంగతుడు కనుక అతడు ఇది వరకే జీవన్ముక్తుడు. ఇప్పుడు శరీరం రాలి పడిపోవడంతో విదేహముక్తుడయ్యాడు. కైవల్యం పొందాడు. శరీరంలోని పంచ భూతాలూ ప్రకృతిలోని పంచభూతాలలో కలిసిపోయాయి. పరశురాముని కోపం శాంతించింది. సంతోషంగా హోమధేనువుని తోలుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు. జరిగినదంతా తండ్రికి నివేదించి తపస్సుకి వెళ్ళిపోయాడు.


Thursday 20 July 2023

శ్రీదత్త పురాణము (204)

 


సమిధలూ, దర్భలూ, ఏరుకు రావడానికి అడవిలోకి వెళ్ళిన పరశురాముడు ఈ సంఘటన జరిగిన కాసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రికి నమస్కరించి కూర్చున్నాడు. సోదరులు చుట్టుముట్టి జరిగిన సంగతంతా చెప్పారు. వింటూనే పరశురాముడు క్రోధారుణ విఘూర్ణితనేత్రుడై ఉవ్వెత్తున లేచాడు. లేస్తూనే పర్ణశాలలో ప్రవేశించి గండ్ర గొడ్డలి విల్లంబులతో ఇవతలకి వచ్చాడు. వస్తూనే భూమి కంపించేట్టు ఆమడకు అంగవేస్తూ బయలు దేరాడు. అధర్మం చేసి భూమికి భారంగా మారిన హైహయుణ్ని సంహరించడానికి మాహిష్మతీనగరం చేరుకున్నాడు.


చతురంగ బలాలతో కార్తవీర్యుడు సరిగ్గా పుర ప్రవేశం చెయ్యబోతూ వుండగా వెళ్ళి వెనుక నుండి ఆటకాయించాడు !!!


ఓరీ క్షత్రియా ! నన్ను పరశురాముడంటారు. జగద్విఖ్యాతుణ్ని. ఏదీ నీ ముఖం చూపించు, అని మేఘ గంభీర స్వరంతో గర్జించాడు. ఆశ్చర్యచకితుడై అర్జునుడు పరశురాముణ్ని చూసాడు. చూస్తూనే త్రిభువనేశ్వరుడని గుర్తించాడు." భూభారం తగ్గించడానికి అవతరించిన శ్రీమన్నారాయణుడని గమనించాడు. అయినా క్షత్రియ ధర్మం ప్రకారం తన సైన్యాన్ని యుద్ధానికి పురికొల్పాడు. రాజాజ్ఞను శిరసావహించి ఆ క్షత్రియవీరులంతా రకరకాల భీకర ఆయుధాలతో పరశురాముడి మీదకు లంఘించారు. సూర్యుడు తన కిరణాలతో చీకట్లను నాశనం చేసినట్లు, రెప్పపాటు కాలంలో ఒంటి చేతితో పరశురాముడు ఆ చతురంగ బలాలను మట్టు బెట్టాడు. సైన్య నాశనానికి బాధ కలిగినా తన పరాక్రమమూ ఇంతటిదే కదా అని మురిసిపోయాడు కార్తవీర్యుడు. చేస్తే ఇటువంటి వాడితోనే యుద్ధం చెయ్యాలి. ఇన్ని వేలు సంవత్సరాలకి ఒక్కడు దొరికాడు. ఇంద్రాదులు సైతం ఇతణ్ని ఎదిరించి నిలబడలేరు. ఇతడి తోనే ద్వంద్వ యుద్ధం చెయ్యాలి. బలవీర్య పౌరుష పరాక్రమాలను సార్ధకం చేసుకోవాలి. నాకితడు సమానుడో అధికుడో తేల్చుకోవాలి. దత్తస్వామి ఇచ్చిన వరం ఉండనే ఉందికదా కనుక ఈ బ్రాహ్మణుడితో కలబడతాను - అని ఒక నిశ్చయానికి వచ్చాడు. ప్రళయ కాల సూర్యుడిలా సహస్ర బాహువులూ ధరించి హోర రూపుడై సహస్రాయుధాలను సంధించిన పరుశురాముని మీదకు విసిరాడు. మండిపడుతున్న గోళాళ్ళాంటి కష్ట సమూహాలను ఆ తపస్వి విభుడైన పరశురాముని మీదకు కురిపిస్తూ అతి భీషణంగా గర్జించాడు. ఆ ధ్వనికి విమోహితులై మానవులు ఎక్కడి వారక్కడే నేల రాలిపోయారు.


Wednesday 19 July 2023

శ్రీదత్త పురాణము (203)

 




అలనాడు దత్తాత్రేయుణ్ని సేవలతో మెప్పించి చాలా వరాలు పొందాడు. అందులో ముఖ్యమైనది తన మరణం గురించి సంగ్రామ రంగంలో నాతో సమానుడిచేతిలో గానీ, నాకంటే అధికుడు చేతిలో గానీ, నేను మరణించాలి. అంతేగానీ రోగాలూ, రొష్టులతోనో, అల్పుడి చేతిలోనో మరణించకూడదు అని వరం అడిగాడు. స్వామి తధాస్తు అన్నారు. ఈ మాట జరగాలికదా. అందుకు అవసరమైన కర్మాచరణను అతడితో ఈ బలీయమైన విధి చేయించింది. అది చెబుతాను. విను.


ఒకనాడు కార్త వీర్యార్జునుడు రధారూఢుడై చతురంగ బలాలతో భూగోళం అంతా విహరించి తిరిగి వస్తూ ఋచీక పుత్రుడైన జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు. చతురంగ బలాలను ఆశ్రమానికి దూరంగా నిలిసి తానూ మరో ఇద్దరు మిత్రులూ కలిసి పాదచారులై ఋషి దర్శనం కోరి ఆశ్రమంలో ప్రవేశించారు. జమదగ్ని ఋషికి భక్తితో నమస్కరించి బద్ధాంజలితో స్తుతించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఎట్ట ఎదుట శిలా వితర్థిక మీద వినయంగా కూర్చున్నాడు. ఉభయకుశలోపరి అయ్యాక ఆ మహర్షి కార్తవీర్యార్జునుణ్ని సర్వ సైన్య సమేతంగా అతిధ్యానికి పిలిచాడు. తన ఆశ్రమంలో ఉన్న హోమధేనువు సురభి మహిమతో అందరికీ అపూర్వమైన విందు విలాసాలూ దివ్యభోగాలూ అందించాడు. ఆ దివ్య భోగాలను చూసి ఆనందించవలసిన కార్తవీర్యుని మనస్సు విధి ప్రేరణతో ఈర్ష్యా కలుషితమయ్యింది. యావదఖండ పృధ్వీపతియై యుండి తాను ఏర్పాటు చేయలేని రీతిలో ఒక సాధారణ ఋషి విందు అందించడం తనకు పరాభవమని అనిపించింది. ఆ విందు విలాసాలూ భోగభాగ్యాలూ వాటికి అవేసాటి. స్వర్గ లోకంలో కూడా కన్నవి కావు విన్నవి కావు వీటిని తనకు అందించాడంటే ఇదితప్పక నన్ను అవమానించడమే. కించపరచడమే. ఈ పరాభవానికి మూల కారణం ఈ ఋషి దగ్గరున్న హోమధేనువు. దీన్ని ఇప్పుడే యాచించి సొంతం చేసుకుంటాను. దానంగా ఇవ్వనంటే స్వాధీనం చేసుకుంటాను. దీనికీ ఒప్పుకోకపోతే ఉండనే ఉన్నది. బలప్రయోగం - శాంతి పరాయణుడైన ఈ ఋషి నన్నేమి ఎదిరించగలడు? ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ముందు వినయంగా ఋషిని అభ్యర్ధించాడు. ఫలించలేదు. ధనం కోరినంతా ఇస్తానన్నాడు. ఋషి అంగీకరించలేదు. అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు. నీ వల్ల అయితే అలాగే తీసికెళ్ళు అని ఋషి శాంతంగా పలికి ఎప్పటిలాగే ప్రశాంతంగా కూర్చున్నాడు. హైహయుడు దూడతో సహా హోమధేనువును తాళ్ళతో బంధించి బలాత్కారంగా తన రాజధానికి లాక్కుపోయాడు.


Tuesday 18 July 2023

శ్రీదత్త పురాణము (202)

 


నాయనా! దీపకా! ఆందోళన చెందకు ఈ సృష్టిలో ప్రతి జీవికీ జీవితంలో తప్పనిసరిగా జరగాల్సినవి కొన్ని ఉంటాయి. అవి జరిగే తీరతాయి. వాటిని ఆపడం. వాటికి ప్రతీకారం చెయ్యడం ఎవరి తరమూకాదు. అదే సాధ్యమైతే నల-రామ-యుధిష్టిరులు అన్ని కష్టాలుపడే వారా? అంత దుఃఖం అనుభవించే వారా?


అంతే కాదు, పురాణాలలో ఋషులు ఏనాడో చెప్పారు - బ్రహ్మాదులు కూడా ఈ జరగవలసిన దానికి వశవర్తులే తప్ప, స్వతంత్రులు కారని దీనినే "విధి" అంటారు. అది అనుల్లంఘ్యం. వైకుంఠానికి ద్వారపాలకులై యుండీ జయవిజయులు సనక సనందనాదుల శాపాన్ని తప్పించుకోలేక పోయారు. తత్వజ్ఞులూ జ్ఞాననిధులూ - ఎవరైనా గానీ విధిని అతిక్రమించలేరు. ఇలా విధికి లోబడినంత మాత్రాన ఆయా మహానుభావుల తత్వవిజ్ఞానానికి వచ్చిన లోటు ఏమీ లేదు. దాని ఫలం అది ఇస్తుంది. కేవలం శరీరమే కర్మాచరణ చేసి కిల్బిషాలు పొందుతూ వుంటుంది. ఫలం అనుభవిస్తూ వుంటుంది.


మరొక విషయం గమనించు సకల సృష్టికీ జనార్ధనుడు కర్తా హర్తా కూడాను. అంచేత దేహాది ఉపాధులను ఉపసంహరించడం అతడి అవశ్య కర్తవ్యం. పైగా పుట్టినది ఏదైనా గిట్టక తప్పదు. శరీరం నశించినంత మాత్రాన ఆ లోపల ఉన్న ఆత్మకు జరిగే నష్టం ఏమీ లేదుగదా! ఆ చిదాత్మ శాశ్వతమే. తత్వజ్ఞులైన పెద్దలు స్వీయ ప్రయత్నంతో వినాశం కొని తెచ్చుకోరు. అటువంటి పనులు కావాలని చెయ్యరు. కర్మ ప్రేరితులై చేస్తుంటారు. ఇది చాలా బలీయమైనది. పరమేశ్వరుడు సైతం స్వభావతః ఇచ్చానుసారం ఏ పనీ చెయ్యడు. ఆయా జీవుల కర్మలను అనుసరించియే సృష్టి జరుపుతాడు. అంచేత విధి అనూ-కర్మ అనూ అది అనుల్లంఘ్యం. అవశ్యంభావి. దాన్ని తప్పించుకోవడం ఎవరి తరమూకాదు. దత్తభక్తుడూ తత్త్వజ్ఞుడు అయిన కార్తవీర్యార్జునుడి అవతారం ముగియడానికి శ్రీమన్నారాయణుడే ముగింపజెయ్యడానికి కారణ భూతమైన కర్మ ఏమిటో వివరించనా. విను.


Monday 17 July 2023

శ్రీదత్త పురాణము (201)

 


శ్రీదత్త పురాణము


చతుర్ధ భాగము


సూతమహర్షీ ! జగదీశుడైన దత్తాత్రేయుడి చరితం వినిపించి మమ్మల్ని కృతార్ధుల్ని చేశావు. ఆ వేళ సాక్షాత్కరించిన స్వామి మాకు సమర్ధుడైన వక్తగా సర్వజ్ఞుడవైన నిన్ను అందించి ఎంతో మేలు చేసాడు. ఎంత విన్నా ఇంకా వినాలనిపించే తీరులో నువ్వు చెబుతూవుంటే మా మనస్సులు ఇక దేనిని స్మరించడంలేదు. ఎంత విన్నా తృప్తి తీరడం లేదు. ఆకొన్నవాడికి అన్నమూ దప్పిక గొన్నవాడికి పానీయమూ అందిస్తే అధిక ఫలదాయకమని పెద్దలమాట. అందుచేత హరి లీలామృతాన్ని మాకు ఇంకా పంచిపెట్టు. ఈ దాహం తీరేది కాదు. గురుశిష్యుల సంభాషణ ఏ తీరున సాగింది? దీపకుడు ఏమి అడిగాడు? వేదధర్ముడు ఏమి చెప్పాడు? సవిస్తరంగా తెలియజెప్పు.


శౌనకాదిమునుల అభ్యర్ధనను విన్న సూతుడు సంబరపడి అలాగే చెబుతాను ఆలకించండి. - అంటూ కొనసాగించాడు. దత్తాత్రేయులవారి వద్ద సెలవు తీసికొని మాహిష్మతీపురం చేరుకున్న కార్తవీర్యార్జునుడు మృషాకల్పితమని ఎరిగి రాజ్యాన్ని ఎంతకాలం పరిపాలించాడు? ఎలా పాలించాడు? యజ్ఞయాగాదులు చేశాడా? అసలు అతడి సామ్రాజ్య విస్తీర్ణం అప్పటి భూగోళంలో ఏపాటి? జైత్రయాత్రలు ఏమైనా చేశాడా? ఎవరెవరితో తలపడ్డాడు? ఎవరెవరిని జయించాడు? చివరకు అతడి కథ ఎలా ముగిసింది? ఇవన్నీ సందేహాలే గురుదేవా! తమరే తీర్చాలి అని దీపకుడు వేద ధర్ముణ్ని పాదాభివందనం చేసి మరీ అభ్యర్ధించాడు. దానికి ఆ మహర్షి సంతోషించి వెనకటికి మైత్రేయుడు ఇలాగే అడిగితే పరాశర మహర్షి ఆ కధ అంతా వివరించాడు. అదే యధాతధంగా నీకిప్పుడు చెబుతాను, ఆలకించు - అని వేదధర్ముడు అందుకున్నాడు.


కార్తవీర్య అవతార సమాప్తి


హైహయాన్వయుడైన కార్తవీర్యార్జునుడు సకల ద్వీపాలతోనూ కూడిన యావధ్భూగోళాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించాడు. అమోఘంగా పదివేల యజ్ఞాలు భూరిదక్షిణలతో చేసాడు. కార్తవీర్యుడుకి సాటి వచ్చే భూపతి భూతకాలంలో లేదు. భవిష్యత్కాలంలో ఉండదు- అని ఇప్పటికీ అతడిని భూగోళం అంతా కీర్తిస్తోంది. యజ్ఞాల్లోగానీ, దానాల్లో కానీ, తపస్సులో కానీ, వినయంలో కానీ, జ్ఞానంలో కానీ, అతడికి అతడే సాటి అని ప్రజలంతా కీర్తించారు. అలా ఎనభై అయిదువేల సంవత్సరాలు పాటు తిరుగులేని బలపరాక్రమాలతో మాహిష్మతి రాజధానిగా మొత్తం భూగోళాన్ని పరిపాలించాడు. ఒకనాడు ఆనందాతిశయంతో నర్మదా నదిలో జలక్రీడలు ఆడుతున్న వేళ ఈ హైహయుని చెంతకు దిగ్విజయకాంక్షతో దశకంఠుడు (రావణాసురుడు) వచ్చాడు. దేవ, దైత్య, గంధర్వులను గడగడలాడించిన ఆ రావణున్ని ఒక బలిపశువులా బంధించి కారాగారంలో పడేశాడు. ఇంతటి కార్తవీర్యార్జునుడూ ఎనభై అయిదు వేల సంత్సరముల తరువాత శ్రీమన్నారాయణాంశ సంభవుడైన పరశురాముని చేతిలో అవతార సమాప్తి పొందాడు. అదేమిటి గురూత్తమా! శ్రీమన్నారాయణుడు తన భక్తుల్ని తానే వధించుకున్నాడా? లీలావతారాలు చాలా ధరించాడు శ్రీహరి, కానీ ఏ అవతారంలోనూ భక్త ద్రోహం చెయ్యలేదే. సర్వజ్ఞుడూ సర్వసాక్షీ ఇలా ఎందుకు చేసాడు? తత్వజ్ఞాన సంపన్నుడైన కార్తవీర్యుడు అంతటి అపరాధం ఏమి చేశాడు? ఎలా చేశాడు? దత్త దేవుని అనుగ్రహానికి పాత్రుడైవుండీ స్వయంగా యోగి అయ్యిండీ దేవదేవణ్ని గుర్తించలేకపోయి అపరాధం చేశాడా? రాజమాత్రుడుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ గుర్తించలేకపోయాడే అనుకుందాం. గుర్తించగలిగిన శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత భక్తుడూ మహాయోగీశ్వరుడూ అయిన పార్ధివుణ్ని ఎలా సంహరించగలిగాడు? ఎందుకు సంహరించాడు? దయచేసి ఈ సంశయాలు నీవు దీర్చకపోతే నా మనస్సు కుదుటబడదు. గురుసత్తమా! అనుగ్రహించు.


Sunday 16 July 2023

శ్రీదత్త పురాణము (200)

 


నాయనా! దీపకా! కార్యవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చెప్పిన ధర్మోపదేశాలూ యోగ సారమూ మాఘమహాత్మ్యమూ అన్నీ నీకూ తెలియపరిచాను. ఒకప్పుడు ఇదే మాఘమహిమను వశిష్ఠుడు తన శిష్యుడైన దిలీపుడికి చెప్పాడు. ఇంకా నువ్వు ఏమి వినాలనుకుంటున్నావో అడుగు చెబుతాను. నువ్వు నాకు సేవలు చేసి సంతృప్తి పరిచావు కనుక మహారోగ నివారణకు తోడ్పడ్డావు గనక ఆ ప్రేమను పురస్కరించుకుని మరొక రహస్యం నీకు చెబుతున్నాను విను. ఒకప్పుడు ఆ పార్వతీదేవికి ప్రేమగా శివుడు ఉపదేశించిన పద్నాలుగు దత్తనామాలు నీకు ఉపదేశిస్తాను. వీటిని జపిస్తే సహస్ర నామజప ఫలం దక్కుతుంది అని శివుడి ఆజ్ఞ. పార్వతి వీటిని జపించి అంతటి పుణ్యఫలం పొందింది. 


వరదః కార్తవీర్యాదిరాజ రాజ్య ప్రదోఽ నఘః 

విశ్వశ్లాఘ్యఽమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః 

పరాశక్తి పదాక్లిష్లో యోగానంద స్పదోన్మదః 

సమస్త వైరి తేజోహృత్సరమామృత సాగరః ||

అనసూయాగర్భ రత్నం భోగమోక్షముఖ ప్రదః । 

నామాన్యేతాని దేవస్య చతుర్ధశ జగద్గురోః ॥ 

హరేన్దత్తాభిధానస్య జప్త వ్యాధి దినేదినే! 

సహస్ర నామ జాప్యస్య యదిచ్ఛసి ఫలమ్ శుభమ్ ||


1. వరదుడు 2. కార్యవీర్యాది రాజులకు రాజ్య ప్రదుడు 3. అనఘుడు 4. విశ్వశ్లాఘ్యుడు 5. ఆమితాచారుడు 6. దత్తాత్రేయుడు 7. మునీశ్వరుడు 8. పరాశక్తి పదాశ్లిష్టుడు 9. యోగానందుడు 10. సదోన్మదుడు 11. సమస్త వైరితేజో హరుడు 12. పరమామృత సాగరుడు 13. అనసూయా గర్భరత్నం 14. భోగ మోక్ష సుఖప్రదుడు. జగద్గురువైన దత్తాత్రేయుడి పద్నాల్గు నామాలివి. సహస్రనామ జప ఫలం కావాలనుకుంటే వీటిని రోజూ జపించాలి. వత్సా! శుభ ప్రదాలైన ఈ చతుర్దశ నామాలను నువ్వు కూడా త్రిసంధ్యల్లోనూ జపించు. ఇంకేమి వినాలి అనుకుంటున్నావో సందేహించక అడుగు అని వేదధర్ముడు ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన ఈ వృత్తాంతాన్ని నేను మీకు చెబుతున్నాను. శ్రద్ధగా వింటున్నారు గదా అని సూతుడు శౌనకాది మహర్షులను హెచ్చరించాడు.


Saturday 15 July 2023

శ్రీదత్త పురాణము (199)

 


అటువైపే చూస్తూ నిలిచిన కాంచన మాలినిమీద హఠాత్తుగా పుష్పవృష్టి కురిసింది. కిలకిల రావాలతో దేవకన్యలు చుట్టుముట్టారు. ఒక్కొక్కరూ మృదువుగా కౌగలించుకున్నారు. నేస్తురాలా! చిత్రంగా ఈ రాక్షసుడికి ముక్తి ప్రసాదించావు. అతడికన్నా మేము సంతోషిస్తున్నాం. ఈ దుష్టుడికి భయపడి ఇన్నేళ్ళుగా మేమెవ్వరమూ ఈ గిరికానన కందరాలకు రావడం మానుకున్నాం. నీ పుణ్యమా అని ఈ రోజునుంచీ హాయిగా విహరిస్తాం. అంటూ బుగ్గమీద చిటికెలు వేసి తూనిగల్లా తుర్రుమన్నారు. కాంచన మాలిని తనలో తాను హాయిగా నవ్వుకుంది. దివ్యవిమానం దూసుకు పోవడం నుంచి పూర్తిగా తేరుకుంది. సొంతపుణ్యం నుంచి కొంతదానం చేసి ఒకడికి సద్గతి కల్పించి మహోపకారం చేశాననే సంతృప్తితో గొప్ప ధర్మకార్యం చేసి కృత కృత్యురాలనయ్యాననే ధన్యతా భావనతో ముఖం వికసించగా ఆనంద భాష్పాలు కన్నుల్లో కమ్ముకోగా ఒక్క నిమిషం మురిసిపోయి కైలాసం వైపు తన ప్రయాణం సాగించింది.


కార్తవీర్యార్జునా! ఈ కాంచన మాలినీ వృత్తాంతం చదివినవారూ విన్నవారూ సాంసారిక సకలబంధ నివృత్తి పొందుతారు. ధర్మ పరాయణులవుతారు. శ్రద్ధగా విన్నావుగదా, మాఘస్నాన మహాత్యం ఎంతటిదో, క్లేశ నివారణ జరగాలన్నా స్వర్గం లభించాలన్నా మోక్షమే కావాలన్నా పకాములకూ నిష్కాములకూ సర్వశ్రేయస్కరం మాఘస్నాన మహావ్రతం, అర్జునా! నువ్వు నా మిత్రుడివి. స్నేహితుడివి. భృత్యుడివి. భక్తుడివి. నువ్వంటే నాకెంతో ఇష్టం. అంచేత నువ్వు ఏది అడిగినా కాదనను. అడుగు. ఇంకా ఏది వినాలని అనుకుంటున్నావో ఏమి తెలుసుకోవాలి అనుకుంటున్నావో, అడుగు చెబుతాను అని దత్తదేవుడు ఒక్క నిమిషం విరమించాడు.


గురుదేవా! సాక్షాత్తు శ్రీ వికేతనుడవైన నవ్వు ప్రసన్నుడవై యుండగా నాకింక అలభ్యమేముంటుంది? ఈ లోకంలో అత్యంత శ్రేయస్కరమైనవన్నీ నాకు దయతో ప్రసాదించావు. దృశ్యమానమైన ఈ మిధ్యా ప్రపంచంలో వస్తురూపంగా నీ నుంచి నేను అభ్యర్ధించవలసింది ఏదీ లేదు. భవభాగ్యనిధివి, భగవంతుడవు నువ్వు ఇలా ఎప్పుడూ. నా పట్ల ప్రసన్నుడుగా ఉంటే చాలు. నాకు ఇంకేమి అవసరము లేదు. నీ అనుగ్రహం కన్నా నేను కోరవలసింది ఏదీ లేదు. నీ ఉపదేశాలతో నన్ను కృతార్ధుణ్ని చేశావు. నన్నిప్పుడు ఏమి చెయ్యమంటావు? నీ పాదసేవ చేస్తూ ఇక్కడనే ఇలా


ఉండిపోనా? లేక ఇంటికి పోనా ? ఏమి ఆజ్ఞ ? కార్తవీర్యార్జునుడి ఆర్ద్ర వాక్కుల్లోని హృదయాన్ని అందుకున్నాడు దత్తస్వామి. అర్జునా ! నువ్వు రాజువి. రాజ్యపాలన చెయ్యడం నీ కర్తవ్యం. కనక వెంటనే బయలుదేరు. మహిష్మతీపురం చేరుకో. పరిపాలన సాగించు. అని అనుమతించాడు. కార్తవీర్యుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ముని మండలికి అంజలి ఘటించి ఆశీస్సులందుకుని బయలుదేరాడు. దత్తనామస్మరణ చేస్తూ మహిష్మతీపురం చేరుకున్నాడు.


Friday 14 July 2023

శ్రీదత్త పురాణము (198)

 



కాంచన మాలికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ఉపకారం వల్ల ఒక రాక్షసుడు దేవతగా మారడమే ఒక ఆనందమైతే, అలా మారినవాడూ విమానమెక్కి తుర్రుమనక తన ఉపదేశం అర్ధించడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ప్రేమగా ధర్మోపదేశం చేసింది.


మిత్రమా! ఏనాడూ ధర్మం తప్పకు. ప్రాణి హింసకు పాల్పడకు. సాధు పురుషులను సేవించు. కామక్రోధాధుల్ని పరిత్యజించు. ఇతరుల దోషాలనో, గుణాలనో కీర్తిస్తూ కాలయాపన చెయ్యక నిత్యమూ సదాశివుణ్ణి ధ్యానించు. అంతర్భహిరింద్రియాలన్నింటినీ (స్వర్ణభాన్ని) జయించు. అస్థిమాంస రుధిరాలతోనూ మలమూత్రాలతోనూ నిండిన ఈ శరీరం చివరికి క్రిమికీటకాలకు ఆహారమవుతుంది. పురుగులు పడుతుంది. దీని మీదా దీనితో ముడిపడిన భార్యాపుత్రుల మీదా మమకారం విడిచిపెట్టు. ఈ జగత్తు క్షణభంగురమని తెలుసుకో. ఒక వైరాగ్యభావం అలవరచుకో. యోగాభ్యాసం వైపు దృష్టి నిలుపు. నీ మీద ప్రేమతో నీ మాట కాదనలేక ఏదో నాకు తెలిసిన ధర్మోపదేశం చేశాను. మనస్సులో పెట్టుకో. ప్రధానంగా శీల సంపన్నుడనై మెలుగు. జ్యోతిర్మయదేవుడవై వెలుగు. ఇక బయలు దేరు. సుఖంగా నాకలోకం చేరుకో.


అమ్మా! కాంచనమాలిని! అద్భుతమైన ధర్మోపదేశం చేశావు. నాకే కాదు అన్ని లోకాల వారికీ ఆచరణీయమైన నీతి మార్గం ఉపదేశించావు. ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి, పావనీ! నవ్వు కూడా ఇలాగే ఎప్పుడూ సుఖసంతోషాలతో జీవించు. ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపు. సాధ్వీ! నీకు సర్వదా శుభమగుగాక! కైలాసంలో శివ సన్నిధిలో ఆచంద్రతారకంగా నివశించు. పార్వతీదేవికి నీ మీద ప్రేమ ఇలాగే అఖండితంగా వర్ధిల్లుగాక. తల్లీ! ధర్మనిష్టా తపోనిష్టలతో నీ జీవితం చరితార్థమగుగాక. శరీర వ్యామోహం మరింకెన్నడూ నీకు కలుగకుండు గాక, ఇలాగే ఎల్లవేళలా ఆ పన్నుల ఆర్తిని హరింతువుగాక - సెలవు తల్లీ ! సెలవు అంటూ శిరస్సున అంజలి ఘటించి విమానంతో సహా - ముమ్మారు ప్రదక్షిణం చేసి నాకలోకానికి దూసుకు వెళ్ళిపోయాడు.


Thursday 13 July 2023

శ్రీదత్త పురాణము (197)

 


వృద్ధరాక్షసుడి ఆవేదన కాంచన మాలినిని కరుణారసార్ధ్రను చేసింది. ఒకప్పటి తన ఆవేదన తన పశ్చాత్తాపం గుర్తుకు వచ్చాయి. పుణ్యదానం చెయ్యాలనిపించింది. రాక్షసోత్తమా! ఇప్పుడే నీకు నిష్కృతి కలిగిస్తాను. దుఃఖించకు. నీ ముక్తికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఏటేటా మాఘస్నానాలు చేశాను. ఎన్నో ఏళ్ళ తరబడి చేస్తున్నాను. అదీ శ్రద్ధగా చేస్తున్నాను. త్రివేణీ సంగమంలో చేస్తున్నాను. కనుక ఎంతో కొంత పుణ్యం రాశిపడి ఉంటుంది సందేహం లేదు - అది నీకు కొంత ధారపోస్తాను. ఆర్తుడికి చేసిన దానమే దానమని వేదవిదులు ప్రశంసిస్తున్నారు. సముద్రంలో కురిసిన మేఘుడు ఏ ఫలం మూటగట్టుకుంటున్నట్టు?


మిత్రమా! త్రివేణీ సంగమంలో చేసిన ఒక మాఘ స్నాన వ్రత ఫలం నీకు సమర్పిస్తున్నాను. దీనితో నీకు దేవతాకారమూ స్వర్గతీ లభిస్తాయి. ఆ పుణ్యఫలం ఎంతటి మహిమాన్వితమో నేనింతకు ముందు అనుభవించాను కనక సద్య స్సర్వపాప వినాశకంగా అమరత్వ ప్రదాయకంగా దాన్ని నీకు దానం చేస్తున్నాను అని చెప్పి కాంచన మాలిని నీళ్ళోడుతున్న తన చీర చెంగును చేతిలోకి పిండుకుని ఆ వృద్ధరాక్షసుడి దోసిట్లోకి ఇదమేకం మాఘజం - పుణ్యం తుభ్యమహం సంప్రదదేనమమ - అని ధారపోసింది. ఆ ధార దోసిట్లో పడటమేమిటి రాక్షసుడు దేవతాకారం ధరించడమేమిటి ఒక్కసారిగా జరిగిపోయాయి. అతడి దివ్యతేజస్సు దశదిశలనూ దగద్ధగాయమానం చేస్తోంది. అంతలోకి దేవతా విమానం వచ్చి అతడి చెంత నిలిచింది. హర్షిత్ఫుల్లలోచనుడై అధిరోహించాడు.


కళ్యాణీ! నిష్కృతియే లేదనుకున్న నాకు ఇంతటి మహోపకారం చేశావు. సదసత్కర్మలకు అనువైన ఫలం అందించే దేవదేవుడు నీకు సమస్త సన్మంగళాలనూ ప్రసాదించుగాక! కారుణ్యమయీ! మరికాస్త అనుగ్రహించి నాకు సర్వనీతిమయమైన మార్గం ఉపదేశించు. నువ్వు నాకు గురుస్థానీయవు. నీ మాట నాకు శిరోధార్యం, జీవితంలో నేనింక ఏ పాపమూ చెయ్యకుండా తగిన ఉపదేశం ఇయ్యి. అది విన్నాక నిన్ను స్తుతించి ధన్యుణ్ని అవుతాను. అటుపైనీ సురలోకం చేరుకుంటాను. ఆకాశమార్గాన విమానంలో తన చెంత నిలబడి అభ్యర్ధించాడు ఆ నూతన త్రిదశుడు.


Wednesday 12 July 2023

శ్రీదత్త పురాణము (196)

 


వృద్ధ రాక్షసుడి పూర్వజన్మ


పూర్వ జన్మలో నేను కాశీ నివాసిని. ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఋగ్వేదపారం ముట్టాను. కానీ రేవులో కాకినై నానాదానాలు పట్టాను. రాజుల నుంచి పుల్కసులదాకా ఎవడు ఏ పాపిష్టివాడు ఏ భయంకరదానం ఇచ్చినా విధినిషేధాలు లేకుండా చెయ్యిజాపాను. వారి పాపాలన్నీ మీద వేసుకున్నాను. అప్రతిగ్రహంగా జీవించవలసిన వేదవేత్తను ఇలా దానాలు పట్టేవాడిగా మారిపోయాను. పరహితం కోసం దానాలు పట్టినా ప్రాయశ్చిత్తాలు చేసుకున్నానా? లేదు. పోనీ అంటే నేనెవరికైనా ఏదానమైనా ఇచ్చానా? లేదు. అర్ధ లోభంతో నేను చెయ్యని దుష్కృత్యం లేదంటే నమ్ము. ఇతర ప్రదేశాలలో చేసిన దోషాలు కాశీలో గంగా స్నానంతో తొలగిపోతాయి. కానీ అవిముక్త క్షేత్రమైన కాశీలో చేసిన పాపాలు మేరు పర్వతాల్లా పేరుకుపోతాయే తప్ప ఏ పుణ్యకార్యానికీ కరగవు. అసలు నేను ఏ పుణ్యకార్యమైన చేస్తే గదా! రోజులూ వారాలూ నెలలూ సంవత్సరాలూ గడిచిపోయాయి. ముసలితనం వచ్చిపడింది. శరీరమన్నాక నేడో రేపో రాలిపోవలిసిందేగా. మరణించాను. అయితే అవి ముక్తక్షేత్ర మహిమవల్ల నేను నరకానికి పోలేదు. కాశీకి యమదూతలు రారు. ఎంతటి మహాఘోరపాపిష్టి అయినా కాశీలో మరణిస్తే నరకానికి పోడు, గర్భవాస క్లేశంలేని ముక్తిని పొందుతాడు. కానీ నేను చేసిన పాపాలన్నీ అవిముక్తంలోనే కనక అవి నన్ను ముక్తిని పొందనివ్వలేదు.. వజ్రలేపాలై తగిలి నిలిచాయే తప్ప విడిచిపెట్టలేదు. ఆ కారణంగా నీచ జన్మలు ఎన్నో ఎత్తాను. అయితే కాశీ క్షేత్ర మహిమవల్ల గర్భవాస క్లేశంలేని అయోనిజ జన్మలే లభించాయి. ఇది కాశీలో మరణించిన నావంటి పాపిష్టులకు శ్రీ భైరవానుజ్ఞ (పదమంజరీ వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి:) హిమాలయాల్లో గ్రద్దగా రెండు జన్మలు, వ్యాఘ్రంగా మూడు జన్మలు, సరీసృపంగా గుడ్లగూబగా మలభక్షక క్రిమిగా పందిగా ఒక్కొక్క జన్మ అయ్యి ఇదిప్పుడు ఈ రాక్షసరూపం పదవజన్మ. ఈ జన్మ ఎత్తి ఇప్పటికి డబ్బై అయిదువేల సంవత్సరాలయ్యింది. అయినా అతీగతీ లేదు. నాకు నిష్కృతి లభిస్తుందనిగానీ ఈ దుఃఖసాగరం నుండి విముక్తి పొందుతానని గానీ ఆశ కూడా లేదు. భద్రే! ఈ ముప్పాతిక వేల సంవత్సరాలలో ఏ పాపమూ ఎరగని ఎన్ని ప్రాణుల్ని భక్షించానో. మూడు యోజనాల మేర జంతు వేదైనా కనిపిస్తే ఒట్టు, పూర్తిగా నిర్జంతుకమైపోయింది. ఈ మహా పాపాలన్నీ అనుక్షణమూ నా హృదయాన్ని దహించివేస్తుంటే మనశ్శాంతి కరువై అలమటిస్తున్న నాకు నీ దర్శనం అమృత సేచనంగా లభించింది. కొసకొంగు నుంచి జారిపడిన నీటి బిందువు హృదయ శల్యాన్ని తొలగించింది. తీర్థయాత్రలూ, తీర్ధస్నానాలూ ఎప్పటికో ఫలిస్తాయట. సజ్జన సాంగత్యం మాత్రం తక్షణమే ఫలిస్తుందట. అందుకే మహాత్ములు ఈ సత్సంగతిని బహుధా కొనియాడుతుంటారు.


తల్లిగా ! నా దుఃఖాలా దుష్కృతాలూ అన్నీ నీ ముందు వెళ్ళబోసుకున్నాను. ఎదుటి వారి కష్టాలను కనీసం ఓపికగా వినిపించుకునే సజ్జనులు మరీ అరుదైపోతున్న రోజులివి. నువ్వు విన్నావు. అంతే చాలు. ఇక నేను చెప్పవలసింది ఏమిలేదు. ఈ దుఃఖసముద్రానికి ఆవలి తీరం ఎక్కడో జన్మపరంపరలకు ముగింపు ఎప్పుడో తెలిస్తే పుణ్యం - కట్టుకో, సజ్జనుల సంపద ఏదైనా అది పరులకోసమే అన్నారు. అందరికీ అనుభవించే హక్కు సమానమే అన్నారు. క్షీర సముద్రంలోని పాలు హంసలన్నింటికీ సమానంగా ఉపజీవనాలు కావడం లేదూ. అలాగేనటమరి.


Tuesday 11 July 2023

శ్రీదత్త పురాణము (195)

 


అంతటి మహిమ కలది ప్రయాగ సంగమం. కనుక ఓ కాంచన మాలినీ ! నువ్వు వెంటనే బయలు దేరి వెళ్ళు. త్రివేణీ సంగమంలో స్నానం చెయ్యి. పాప విముక్తి పొందుతావు. సద్గతులు కల్గుతాయి అని రాజపురోహితుడు ఉపదేశించాడు. వెంటనే వారి పాదాలకు నమస్కరించాను. ఇంటినీ బంధువర్గాన్నీ దాసదాసీ జనాన్ని ఆస్తిపాస్తుల్నీ తృణప్రాయంగా పరిత్యజించాను. విషయ వాంఛలను విషగ్రాసంలాగా వదిలేశాను. నశ్వరమైన ఈ శరీరం కోసమా ఇంత కాలమూ ఇన్ని పాపాలు చేశాను! ఈ దుస్సాంగత్యాలవల్ల దక్కే ఫలితమేమిటి? దారుణ నరక నివాసం - ఇలా ఉడికిపోతున్న హృదయంతో త్వరత్వరగా ప్రయాగ చేరుకున్నాను. నా అదృష్టం బాగుండి అది మాఘ మాసారంభం. పాడ్యమినాడు త్రివేణీ సంగమంలో సీతాసిత జలంలో స్నానం చేశాను. కాలపవ్యాఘ్రా! (రాక్షపోత్తమా) ఆ స్నానమహిమ ఏమని చెప్పను. మూడు రోజుల స్నానాలతో నా పాపాలన్నీ తొలగిపోయాయి. తక్కిన ఇరవై ఏడు రోజుల స్నానాలతో లభించిన పుణ్య విశేషంవల్ల నాకు ఈ దేవత్వం దక్కింది. కైలాసంలో పార్వతీదేవికి ఇష్ట సఖినై పరిచర్యలు చేస్తూ ఆనందిస్తున్నాను. అప్పటి నుంచీ ప్రతి మాఘమాసంలోమా నిత్యమూ లేదా కనీసం మూడు పర్యాయాలైన వచ్చి త్రివేణిలో స్నానంచేసి వెడుతుంటాను. ఆశ్చర్యచకితుడవై అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ సవివరంగా సమాధానం చెప్పాను. నీ ముఖ కవళికలు చూస్తుంటే సంప్రీతి చెందావని తెలుస్తోంది. మరి నీ కథ చెప్పి నాకు కూడా ఇలాంటి సంప్రీతి కలిగించవచ్చుగా, నీ కసలు ఈ భయంకర రాక్షసరూపం ఎలా వచ్చింది? నీ దుష్కర్మకు ఫలమిది? ఈ మీసాలూ దీర్ఘదంష్ట్రులూ మాంస భోజనం గిరిగస్వార నివాసం ఏమిటిదంతా?


కళ్యాణీ, కాంచన మాలినీ! సజ్జనులకు కొన్ని లక్షణాలున్నాయి. ఇతరులకు ఇష్టమైనదాన్ని ఇస్తారు. తమకు ఇష్టమైన దాన్ని అడిగి తీసుకుంటారు. ఎంతటి రహస్యాలనైనా ప్రీతితో చెబుతారు. అలాగే అడిగి తెలుసుకుంటారు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయి. కనుక నువ్వు సజ్జన శ్రేణికి చెందుతావు. కనుక ఇంతకాలానికి, నన్ను గౌరవించే ఒక ప్రాణివి దొరికావు. నేను అడిగానని నీ కథ అంతా చెప్పావు. నన్ను పట్టించుకుని నా దుర్గతికి కారణం అడిగావు. చెబుతాను. ఈ క్రూరజన్మకు కారణమైన నా దుష్కృత్యాలూ, స్వయంకృతాలూ అన్నీ చెబుతాను. దాపరికం లేకుండా చెబుతాను. నీలాంటి సజ్జనులకి వినిపిస్తే దుఃఖభారం తగ్గుతుంది. కాసింత హాయి దక్కింది. అదృష్టం బాగుంటే నిష్కృతి లభించవచ్చు. చెబుతున్నాను విను.


Monday 10 July 2023

శ్రీదత్త పురాణము (194)

 


బృహస్పతి బయలుదేరాడు. అతడి వెంట అందరూ కదిలారు. మేరుశిఖరం చేరుకున్నారు. స్వర్ణకమలాల కనువిందు చేసింది. ఏ స్వర్ణకమల కోటరంలో ఉన్నాడో మహానుభావుడు. బృహస్పతి ఎలుగెత్తి పిలిచాడు. వెంటనే ఇంద్రుడు బయటకు వచ్చాడు. వస్తూనే గురువుగారి పాదాలపై పడ్డాడు. కాపాడండి. నా పాపానికి నిష్కృతి చెప్పండి. బుద్ధి తక్కువై అహంకరించి పాడుపని చేశాడు. ఫలితం అనుభవిస్తున్నాను. కరుణించి తరుణోపాయం ఉపదేశించండి. గురుదేవా? అని మొరపెట్టుకున్నాడు.


చేసిన నేరానికి శిక్ష అనుభవించావు కనుక, తరుణోపాయం చెబుతున్నాను. పద, నేనూ వస్తాను. ప్రయాగ వెడదాం. అక్కడ త్రివేణీ సంగమంలో మునుగుదువుగాని వెంటనే పాప విముక్తి పొందుతావు.


బృహస్పతి వెంట బయలుదేరి ప్రయాగ చేరుకున్నారందరూ. గంగాయమునా సితాసిత జలౌఘంలో స్నానం చేశాడు దేవేంద్రుడు, పాప విముక్తి పొందాడు. బృహస్పతి సంతుష్టుడయ్యాడు. ఇంద్రా! పాప విముక్తుడవు అయ్యావు కాబట్టి నీకొక వరం ఇస్తున్నాను. ఈ క్షణం నుంచీ నీ శరీరం మీద ఈ సహస్ర భగచిహ్నాలు ఈక్షణాలుగా మారిపోతాయి. సహస్రాక్షుడవుతావు. బృహస్పతి ఈ మాట అనడమేమిటి దేవేంద్రుడి శరీరం మీద ఆ మార్పు వచ్చేసింది. పద్మాల్లాంటి సహస్ర లోచనాలు సాక్షాత్కరించాయి. సహస్ర కమలాల మానససరోవరంలాగా భాసించాడు. 


బృందారకులు జయజయ ధ్వానాలు చేశారు. మునీశ్వరులు మంగళాశీస్సులందించారు. గంధర్వులు స్తోత్రపాఠాలు వినిపించారు. అప్సరసలు ఆనంద లాస్యాలు ప్రదర్శించారు. అందరూ తిరిగి అమరావతికి చేరుకున్నారు. 


Sunday 9 July 2023

శ్రీదత్త పురాణము (193)

 


ఇంద్రుడికి శాప విమోచనం


గౌతమ మహర్షి ఇల్లాలు అహల్య. అపూర్వ సౌందర్య రాసి. దేవేంద్రుడు చూసి కామ మోహితుడయ్యాడు. మహర్షి ఆశ్రమంలో లేని వేళ తాను గౌతమ రూపంలో వచ్చి కోరిక తీర్చమని అభ్యర్ధించాడు దేవరాజు. అహల్య కుతూహలంతో అంగీకరించింది. అప్పుడే ఆశ్రమానికి చేరుకున్న గౌతమ మహర్షికి ఇద్దరూ దొరికి పోయారు. కామంతో కళ్ళు మూసుకుపోయి ధర్మ హాని చేసినందుకు మహర్షి కోపోద్రిక్తుడై ఇంద్రుడ్ని శపించాడు. దానితో ఇంద్రుడు కురూపి అయ్యాడు. సహస్ర భగచిహ్నితుడయ్యాడు. తలదించుకొని దేవరాజు విష్క్రమించాడు. అతిలజ్జాకరమైన ఆ కురూపం భరించలేక ఎవరి కంట బడటమూ ఇష్టంలేక తనను తాను నిందించుకుంటూ అసహ్యించుకుంటూ మేరు పర్వతం చేరుకున్నాడు. ఇంద్రలోకాన్ని ఇంద్ర పదవినీ విడిచి పెట్టేశాడు. ఆ పర్వత శిఖరం మీద ఒక విశాల సరోవరం. ఆ సరస్సులో ఒక పద్మం, ఆ పద్మ గర్భంలో దాక్కుని బలవంతంగా రోజులు నెట్టుతున్నాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఈ కామం ఎంత నింద్యమైనది. వెంటనే నరకంలోకి తోసేస్తుంది. ఆయుష్షు కీర్తి యశస్సు ధర్మం ధైర్యం - అన్నింటినీ ధ్వంసం చేస్తుంది. దురాచారుడైన మన్మధుణ్ని ఏమి చేసినా పాపం లేదు. సకల సంపదలకు అతడే మూలం. మానవులకు అత్యంత బలీయుడైన అంతశ్శత్రువు, అణచడానికి వీలు లేకుండా శరీరంలోనే తిష్ట వేసుకొని కూర్చున్న గూఢ దుర్మదుడు. నిత్యమూ అసంతుష్టుడు. నిత్యమూ అరుంతుదుడు. (మర్మ భేదకుడు. ఆయువులను పట్టి పీడించేవాడు)


పద్మ గర్భంలో దాక్కుని ఇలా ఇంద్రుడు కుమిలిపోతూంటే అక్కడ దేవలోకం పాలకుడు లేక బెగ్గడిల్లింది. దేవతలందరూ శచీదేవిని ముందు నిలుపుకొని దేవ గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. సాష్టాంగ పడ్డారు. గురూత్తమా! దేవపతి జాడ తెలియరాలేదు. ఎక్కడికి వెళ్ళాడో? ఎక్కడ ఉన్నాడో? ఎక్కడని వెదకాలి? ఏమీ తోచక సలహాకోసం మీ సన్నిధికి వచ్చాం. ఇంద్రుడు లేని నాకలోకం కొడుకులేని వంశంలా క్షీణోమ్మఖం అవుతోంది. దీన్ని అరికట్టాలి. ఆలస్యం చెయ్యకండి. వెంటనే ఆలోచించి ఉపాయం చెప్పండి కర్తవ్యం ఉపదేశించండి అని ముక్త కంఠంతో దేవతలంతా ప్రార్ధించారు. శచీదేవి బిక్కమొగం వేసుకొని దీనంగా చూస్తూ నిలబడింది. 


దేవతలారా! శిష్యులారా! కంగారు పడకండి. ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. స్వయం కృతాపరాధానికి రజోగుణ ప్రేరితమైన ఒక పాప కృత్యానికి ఫలం అనుభవిస్తున్నాడు. నీతిమాలిన పనులు చేస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. రాజ్యమదోన్మత్తుడై కార్యాకార్య వివేకం కోల్పోయాడు. ఇహపరాలను నాశనం చేసే నింద్యము గర్హితమూ కుత్సితమూ ఆవాచ్యమూ అయిన అకృత్యం చేశాడు. దైవోపహత చేతస్కులై బాలిశులు ఇలా ఆపరాదాలుచేస్తారు. ఇహపరాలలో జన్మను నిప్పులం చేసుకుంటారు. చాలామంది ఇంతే. నడవండి ఇంద్రుడి దగ్గరకు వెడదాం.


Saturday 8 July 2023

శ్రీదత్త పురాణము (192)


 

ఏ ప్రాణికి నేను చేసిన ఉపకారం అంటూ లేదు. ఎందుకొచ్చిన బ్రతుకు ఇది? నా కన్నా చెట్టూ పుట్టానయం. నోరు లేని జీవాలు నయం. పొరపాటుననైనా పిసరంత పుణ్యకార్యం చేసి ఎరుగను. మహాపాపాలు మాత్రం ఎరిగి ఎరిగి చాలా చేసాను. ఈ బాధతో ఈ ఆవేదనతో నా మనస్సు నన్ను దహించి వేస్తోంది. ఎన్నో రోజులు పగలూ రేయీ ఏకాంతంగా విలపించాను. నిద్రాహారాలకు దూరమై చిక్కి శల్యమయ్యాను. ఈ దశలో ఒక రోజున ఓపిక కూడ దీసుకొని రాజపురోహితుడి ఇంటికి వెళ్ళాను. కాళ్ళ మీద బడి వలవలా విలపించాను. శీల సంపన్నుడైన ఆ వేద విద్వాంసుడు ఎంతగానో నన్ను ఊరడించాడు. చాలా సేపటికి తేరుకున్నాను.


బ్రహ్మన్! నా పాపాలకు నిష్కృతి లేదు. చెప్పండి నేను సద్గతులు పొందే మార్గం ఉపదేశించండి. స్వయం కృతాపరాధాలతో నేను దహించుకు పోతున్నాను. ఏకాకినై విలపిస్తున్నాను. పాప పంకిలంలో మెడలోతు దిగబడిన నన్ను దయచేసి జుట్టు పట్టుకొని పైకిలాగండి. కారుణ్యవర్షం కురిపించండి. పాపపంకిలం వదిలించండి. అయిన వారికి అందరూ ఉపకారాలు చేస్తారు. నా బోటి విపన్నులకు సహాయం చేసిన వారే నిజమైన సాధు సజ్జనులు. క్షీర సముద్రం హంసలకేనా? కొంగలకు ఉపకరించదా? ఇదేమి అన్యాయం? స్వామి దారి చూపండి.


కాంచన మాలినీ! నీ జీవితం అంతా నేనెరుగుదును. నీ నిషిద్ధాచరణలు నేనెరుగుదును. ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగింది. సంతోషం. నువ్వు వెంటనే బయలు దేరు. ప్రజాపతిక్షేత్రం అయిన ప్రయాగ చేరుకో. అక్కడ త్రివేణీ సంగమంలో స్నానం చెయ్యి. అది ఒక్కటే సమస్త పాపాలనూ ప్రక్షాళన చెయ్యగలిగిన తీర్థం. ఇంతకన్నా మరొక దారి కన్పించడం లేదు. సకల పాపాలకు తీర్ధ స్నానమే ప్రాయశ్చిత్తంగా మునులు చెప్పారు. కానీ ఆ తీర్ధంలో ఉండి అమంగళాలను అశుభవాంఛలనూ మనస్సులోకి ఏ మాత్రం రానివ్వకూడదు. ఇది గుర్తుంచుకో. వెళ్ళిరా. ప్రయాగస్నానంతో పాపశుద్ధి పొంది నువ్వు స్వర్గానికి వెడతావని నాకు అనిపిస్తుంది. దాని శక్తి అటువంటిది. ఆ తీర్ధంలో తప్ప ఇతర ప్రాంతాలలో చేసిన ఎంతటి మహాపాతకమైనా మునిగిన తక్షణమే వదిలిపోతుంది.


పురాణ కాలంలో దేవేంద్రుడు ఒక తప్పిదం చేసి ఈ త్రివేణీ సంగమంలోనే మునిగి కిల్బిష విముక్తి పొందాడు. మనస్సు కుదుటపడుతుంది. నీకు ఆ కధ చెబుతాను శ్రద్ధగా విను.


Friday 7 July 2023

శ్రీదత్త పురాణము (191)

 


వృద్ధ రాక్షసుడు గౌరవభావంతో కళ్ళప్పగించి చూస్తూ మౌనంగా తల ఊపాడు. కాంచన మాలిని ఆకాశం నుండి దిగి వచ్చింది. ఇద్దరూ ఒక చెట్టు నీడన చెరొక రాతి బండల మీద కూర్చున్నారు. కధనం ఇలా కొనసాగింది.


మా తండ్రి పేరు సుమేధుడు. గంధర్వనాయకుడు. నేను వారి పుత్రికను, కన్యకను. ఇంత తేజస్వంతమైన దివ్య రూపంతో ఎలా జన్మించానో అదీ చెబుతాను ఆలకించు. పూర్వ జన్మలో నేనొక వేశ్యను. కళింగ రాజు చేరికలో ఉండే దాన్ని. నా రూపం లావణ్యం కళింగ రాజధానిలో ఒక విధంగా మగ వారికీ మరొక విధంగా ఇల్లాండ్రకూ నిద్ర లేకుండా చేసింది. సర్వ యువతీ శిరోమణిగా సౌందర్య మదగర్వంతో విర్రవీగుతూ సకల రాజ భోగాలూ అనుభవించాను. రాజధాని మాత్రమే కాదు మొత్తం కళింగ సామ్రాజ్యమంతా నా యౌవన రూప సంపదకు సమ్మోహితమయ్యింది అంటే అతిశయోక్తి కాదు. కాంచన రత్నా భరణాలో, మనోహర వస్త్రాలో, అనూహ్య పరిమళ ద్రవ్యాలో, ఏవో ఒకటి కళింగాధిపతి రోజూ నాకు కానుకలుగా పెట్టేవాడు. ఇవే ఏమిటి, అతడి అధికారం అతడి కోశాగారం అన్నీ నా అధీనంలో ఉండేవి.


వింటున్నావు గదా! రాజు గారి కన్ను కప్పి నా నివాసమందిరంలో కొందరు యువకులు ఎప్పుడూ ఉండేవారు. కామ మోహితులై నాకు సేవలు చేసేవారు. కాళ్ళు పట్టేవారు. నేను అందరినీ వంచించాను. మాయచేసి అందరి ధనమూ లాగేశాను. వాళ్ళళ్ళో కొందరు పరస్పరం అసూయలతో హత్యలు చేసుకున్నారు. నిర్దనులై కొందరు ఆత్మ హత్యలు చేసుకున్నారు. కళింగ నగరంలో నా జీవితం ఇలా సాగింది ఆడింది ఆటగా పాడింది పాటగా.


శ్రోతా! ఎందుకో గానీ యౌవనం ఎప్పుడూ వేగంగా పయనిస్తుంది. వార్ధక్యలక్షణాలు నన్ను దురాక్రమణ చేసాయి. నా హృదయం భరింపరాని దుఃఖంతో మూలిగింది ఏమి లాభం? కాలానికి కళ్ళెం వెయ్యగలనా? పోయిన వయస్సును తీసుకురాగలనా? ఎంత సంపద ఉండి ఏమి ప్రయోజనం. ఎంత ప్రభావం ఉండి ఏమి ఫలం? నాలో ఒక ఆవేదన బయలు దేరింది. ఎండమావుల వెంట పరుగులు తీసాను. అదే ఎరుకగలిగింది. శాశ్వతానందం కోసం ఇకనైనా ప్రయత్నించాలనే సంకల్పం దృఢంగా ఏర్పడింది. ఒక దానమా? ఒక ధర్మమా? జపమా, తపమా? ఏమి చేసానింత కాలమూ? గుడికి పోలేదు. గోపురానికి పోలేదు. పుణ్య దినం లేదు. పర్వదినం లేదు. అంతా నాటకం. ధనార్జన, ధనార్జన శివుడినెత్తిన ఒక్క చెంబెడు నీరు కుమ్మరించిన పాపాన పోలేదు. శ్రీరంగేశుడి ముంగిట ముగ్గు కర్ర తీర్చిన పాపాన పోలేదు. దేవీనవరాత్రులలో రోజుకొక అలంకారంతో కనువిందు చేస్తుంది అమ్మ. చెలి కత్తెలు చెబుతూ వున్నా వినిపించుకోలేదు. వీళ్ళ పిచ్చిగానీ నన్ను మించిన సౌందర్యమా అని భీష్మించాను. ఎంత పిచ్చి దానిని, ఎంత దురహంకారిణిని. ఏనాడూ విప్రులకు విద్వాంసులకూ చెయ్యి విదిలించింది లేదు.


Thursday 6 July 2023

శ్రీదత్త పురాణము (190)

 


అర్జునా! అసలే నేను శిష్య పరాధీనుణ్ని నువ్వానన్ను గెలుచుకున్న వాడివి. నువ్వు అడగడమూ నేను కాదనడమూనా, తప్పకుండా చెబుతాను. ఇదీ పుణ్య ప్రదమైన కథ. అత్యంత పురాతనమైన ఇతిహాసం. దీన్ని చెప్పడమో వినడమో కాదు. తలుచుకుంటే చాలు అశ్వమేధ ఫలం లభిస్తుంది. శ్రద్ధగా విను.


కాంచన మాలినీ వృత్తాంతం


అనగా అనగా ఒక అప్సరస. అత్యద్భుత రూప సంపన్న పేరు కాంచన మాలిని. ప్రయాగలో మాఘ స్నానం చేసి కైలాసానికి వెళుతోంది. ఆకాశ మార్గాన వెడుతున్న కాంచన మాలిని ఒక పర్వత నికుంజం నుంచి ఒకానొక వృద్ధ రాక్షసుడు చూసాడు. అపూర్వ తేజస్సుతో ధగ ధగ లాడుతోంది. పేరుకు తగ్గట్లే మేలిమి బంగారు కాంతులు నిరజిమ్ముతోంది. సుదీర్ఘలోచన. చంద్రావన. సుకేశి. పీనోవ్నతపయోధర. తను మధ్య వతానాభి. సుశ్రేణి. అందాల రాశిని చూసి ఆశ్చర్యచకితుడై ఆ రాక్షసుడు ఆరాధనా భావంతో మృదువుగా పలకరించాడు.


ఎవ్వతినే నీవు? భీతి హరిణేక్షణా! ఎక్కడి నుండి నీ రాక? తడిసిన నీ చీర, నీళ్ళోడుతున్న జుట్టుతో ఎక్కడ నుండి వస్తున్నావు? ఎక్కడకు వెడుతున్నావు? కమలాక్షీ ! నీకు ఈ ఆకాశ గమనం ఎలా వచ్చింది ? నీ దేహం నీ రూపం అపూర్వమైన తేజస్సుతో సౌందర్యంతో ధగ ధగ లాడుతున్నాయి. మనోహరంగా వున్నాయి. ఏం పుణ్యం చేసుకున్నావ్? నీకొస కొంగు నుండి జారిపడిన నీటిబొట్టు ఒకటి నా శిరస్సును అలంకరించింది. ఆ క్షణం నుండీ నా క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది? విశాలాక్షీ! ఇది నీ చీర మహిమా? లేదా నీరమహిమా? దయజేసి వివరించు? ఇంతటి సౌందర్యం ఉన్నదంటే సౌశీల్యమూ ఉండే వుంటుంది.


ఓయీ రాక్షసా! నేనొక అప్సరసను. కామ రూపిణిని. నన్ను కాంచన మాలిని అంటారు. ప్రయాగ నుండి వస్తున్నాను. అందుకే నాదుస్తులు నీళ్ళోడుతున్నాయి. సీతాసితజల సంగమంలో స్నానం చేసాను. ఎక్కడికి వెడుతున్నానో చెప్పలేదు కదూ! కైలాస పర్వత శిఖరానికి వెడుతున్నాను. అక్కడ దేవదానవ పూజితుడైన గౌరీ పతి కొలువుతీరి వుంటాడు గదా. పార్వతీ దేవిని సేవించుకోడానికి అక్కడికి వెడుతున్నాను. నీ క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది అన్నావు కదా అది నా చీర మహిమ కాదు ముమ్మాటికీ నీరమహిమే. త్రివేణీ సంగమంలోని నీటి బిందువు అది. దానికి అటువంటి మహిమ ఉంటుంది సహజం. నాకధ అంతా వింటే నీకే అవగతమవుతుంది. ఎవ్వతివే నీవు అన్నావు కనుక ఈ తేజస్సు ఏమిటి అన్నావు కనుక అంతా చెప్పాలి. వింటావా మరి?


Wednesday 5 July 2023

శ్రీదత్త పురాణము (189)

 


జీవుడి ఆవిర్భావం నుండీ జన్మ జన్మాంతరాల్లో మనోవాక్కాయ కర్మలతో కూడబెట్టుకున్న మహాపాపరాశి అంతా ఇక్కడ మాఘ స్నానంతో పిడికెడు బూడిదయై నీళ్ళల్లో కరిగిపోతుంది. ఇక్కడ మూడు మాఘ స్నానాలు చేస్తే చాలు ఎంతటి నరాధముడైనా కుబుసంలా పాపాలను వదిలేసి పవిత్రుడై అమరధామం చేరుకుంటాడు. కురుక్షేత్రంలో ఎక్కడ గంగా స్నానంచేసినా ఇదే ఫలితం. ఇంతకన్నా వింధ్యాగంగా సంగమంలో నైతే పదిరెట్లూ, ఉత్తర వాహినిగా గంగ ప్రవహిస్తున్న కాశీలోనైతే వంద రెట్లూ, గంగా యమునా సంగమంలోనైతే అంతకన్నా నూరురెట్లూ. పశ్చిమ వాహినిగా గంగ ప్రవహిస్తున్నచోటనైతే వెయ్యిరెట్లూ అధికంగా స్నాన పుణ్యఫలం లభిస్తుంది.


అర్జునా! పశ్చిమ వాహినిగా ప్రవహిస్తున్న గంగానదిని దర్శిస్తే చాలు బ్రహ్మహత్యా మహాపాతకం కూడా తొలగిపోతుంది. పశ్చిమంగా ప్రవహించే గంగానది కాళిందిలో సంగమించినచోట మాఘ స్నానం చేస్తే కల్పకల్పాంతర సంప్రాపాలైన నిఖిల దోషాలూ ఆస్తమిస్తాయి. అందుకనే ఈ త్రివేణీ సంగమాన్ని "అమృతము" అని కల్పకల్పాంతరాల నుండీ కీర్తిస్తున్నారు మహర్షులు.


ఇక్కడ మాఘ స్నానముహుర్తం దేవతలకు సైతం కష్టసాధ్యం. అణిమాది గుణసిద్ధులైన యోగీశ్వరాలు బ్రహ్మజ్ఞానులూ, సతీసమేతులై హరి హర విరంచి పురందరులూ ఆదిత్యులూ మరుత్తులూ గంధర్వులూ, లోకపాలకులూ, యక్షులూ, గుహ్యకులూ, కిన్నెరులూ, నాగులూ అలాగే ఘృతాచీ మేనకా, రంభా, ఊర్వశి, తిలోత్తమా, ప్రభృతి అప్సరోబ్బందమూ, పితృదేవతా గణమూ అందరూ ఈ త్రివేణీ సంగమంలో మాఘస్నానం చేయడానికి వస్తారు. కృత యుగంలోనైతే స్వస్వరూపాల తోనూ కలియుగంలోనైతే ప్రచ్ఛన్న రూపాలతోనూ వచ్చి స్నానాలు చేసి వెడతారు. ఈ ప్రయాగలో ముమ్మారు మాఘస్నానం చేసిన వారు వెయ్యి అశ్వమేధాలకన్నా అధికపుణ్య ఫలం పొందుతారు. వెనకటికి కాంచన మాలిని ఇలాగే త్రివేణిలో మూడు నాళ్ళు మాఘ స్నానాలు చేసి సంపాదించుకున్న పుణ్యాన్ని ఒక రాక్షసుడికి ధారపోసింది. దానితో ఆ పాపాత్ముడు కలికల్మష విముక్తుడయ్యాడు.


దత్తాత్రేయుడినోట ప్రసంగవశాత్తూ ఈ మాట వచ్చింది. అంతే కార్తవీర్యార్జునుడు పట్టుకున్నాడు. స్వామి! స్వామి ! ఎవరీకాంచన మాలిని? ఎవడా రాక్షసుడు? వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఆవిడ తన పుణ్యాన్ని ఎందుకు ధారపోసింది? తెలుసుకోవాలని కుతూహలంగా వుంది. అత్రి సంతతి భాస్కరా! అది పుణ్య ప్రదమైనదని నువ్వు భావిస్తే దయచేసి నా కుతూహలం దీర్చు.


Tuesday 4 July 2023

శ్రీదత్త పురాణము (188)

 


వేడి నీళ్ళతో ఆరేళ్ళపాటు మాఘస్నానాలు చేసిన పుణ్యఫలం ఒక్కసారి మకర వేళ పెరటి బావిచన్నీళ్ళతో స్నానించినందువల్ల లభిస్తుంది. పన్నెండేళ్ళు పెరటి బావి స్నానాల ఫలితం ఊరి వెలుపలి వాపీ కూపతటాకాల్లో ఒక్కసారి స్నానించినందునే దక్కుతుంది. తటాక స్నానంతో ద్విగుణంగా, పిల్లకాలువ స్నానంతో చతుర్గుణంగా, దేవఖాత స్నానంతో (కోవెలకోనేరు) దశగుణంగా మహానదీ స్నానంతో శత గుణంగా, నదీ సంగమ స్నానంతో చతుశ్శత గుణంగా గంగా స్నానంతో సహస్ర గుణంగా పుణ్యఫలం లభిస్తుంది. గంగానదిలో మకర నూఘస్నానం చేస్తే ఆ పుణ్యాత్ములు చతుర్యుగ సహస్రాంతాలకూ దేవలోకం నుంచి పతనం చెందరు. ఇదే స్నానాన్ని గంగా యమునా సంగమ స్థలంలో చేస్తే ఇంతకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ప్రతిరోజూ వెయ్యి సువర్ణ నిష్కాలను, లేదా వెయ్యి గిత్తలను, లేదా అయుత కపిల గోవులను దానం చేస్తే - వచ్చేపుణ్య ఫలం, గంగా యమునా సంగమంలో చేసిన ఒకే ఒక్క మాఘస్నానంతో కైవశమవుతుంది.


ప్రయాగ మహిమ


కార్తవీర్యా ! గంగా యమునా సంగమస్థలాన్ని ప్రయాగ అంటారు. ఇది మహా పాప సమూహాలకు దహన వాటికగా, పాపరూప పశువులకు విశసన స్థలిగా (గదేళా) బ్రహ్మ దేవుడు ఈ ప్రయాగను సృష్టించాడు. ఇది తెలుపూ (గంగ) నలుపూ (యమున) జలాల కూడలి. దీని గర్భంలో సరస్వతీ నది కూడా వుంది. అయితే అది అదృశ్యరూప. ఇలా ఇది త్రివేణీ సంగమం. బ్రహ్మలోకానికి ఇది మార్గం. ఈ సంగమస్థలంలో మకర రవివేళ మాఘ స్నానం చేసిన భాగ్యశాలికి మరెప్పుడూ ఏ గర్భకోశంలోనూ మునుగవలసిన అవసరం ఏర్పడదు. అపునర్భవమైన ముక్తిని పొందుతాడు. దేవతలకు సైతం దురాసదమైన వైష్ణవ మాయ కూడా మాఘంలో ఇక్కడ దగ్ధమవుతుంది. అంతటి శక్తి అంతటి పవిత్రతా ఉన్న తీర్ధ మీదొక్కటే, రకరకాల పుణ్యకార్యాలకు ఫలాలుగా దక్కిన ఆయా తేజోమయ లోకాలలో విహరించి భోగాలను అనుభవించిన పుణ్యజీవులు ఈ సంగమ తీర్ధంలో మాఘస్నానం చేసి శ్రీ మన్నారాయణుడిలో లీన మవుతారు.


మకర రవివేళ ఈ సీతాసిత జల సంధిలో స్నానం చేసినందువల్ల వచ్చే పుణ్యాన్ని గానీ, ఆ పుణ్యానికి తగిన స్థానాన్నిగానీ చిత్ర గుప్తుడైనా లెక్క కట్టి చెప్పలేదు. నూరేళ్ళ నిరాహార వ్రతానికీ, మూడు వందల ఏళ్ళ యోగాభ్యాసానికి కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయాన నూరు బారువుల బంగారం దానంచేసిన దానికీ వెయ్యి రాజసూయ యాగాలు నిర్వహించిన దానికీ లభించే పుణ్యఫలం ఇక్కడ ఈ త్రివేణిలో మూడు మాఘస్నానాలు చేస్తే చాలు వచ్చి ఒడిలో పడుతుంది. మరొక రహస్యం విను ఈ భూగోళం మీద వున్న సకల తీర్ధాలూ, సమస్త పుణ్య క్షేత్రాలూ ఈ త్రివేణిలో మాఘ స్నానానికి వేంచేస్తాయి. అప్పటి దాకా తమలో మునిగిన పాపాత్ముల కిల్బషాలతో నల్లబడ్డ ఈ తీర్ధాలు త్రివేణీ మాఘ స్నానంతో కిల్బషాలను పూర్తిగా వదిలించుకొని తెల్లబడతాయి.


Monday 3 July 2023

శ్రీదత్త పురాణము (187)

 


మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినది మొదలు కొని ప్రతీ రోజూ స్నాన దానాది సత్కార్యాలకు యోగ్యమైనదే. అయితే మాఘ స్నానాలు పెరట్లో చేసే కంటే వెలుపలి నదీ ప్రవాహాలలోనో సరోవరాలలోనో చెయ్యడం శ్రేయస్కరం. మాఘ స్నానం ఒక వ్రతమన్నారు గదా! దాని నియమాలు తెలుసుకో. తెలుసుకొని పాటిస్తే అధిక పుణ్యఫలం దక్కుతుంది. నెల నాళ్ళూ నేల మీదనే పరుండాలి. స్థండిల శయనమే తప్ప హంస తూలికా తల్పాలు పనికి రావు.


తిలవి మిశ్రితమైన ఆజ్యంతో హోమాలు చేయాలి. సనాతనుడైన వాసుదేవుణ్ని ముప్పొద్దులా అర్చించాలి. మాధవార్పణంగా అఖండ దీపారాధన చెయ్యాలి. వ్రతం ముగిసేదాకా దీపం మలగరాదు. కంబళ్ళు - ధోవతులు - పాదరక్షలు - పసుపు కుంకుమలు - నెయ్యి - నూనె - కార్పసకౌశేయాలు (చొక్కా గుడ్డలు) - దూది - నూలు దుప్పట్లు ఇలాంటివే ఇంకా ఉపయోగపడే వస్తువుల్ని శక్తి సామర్థ్యాలు దాచుకోకుండా దానం చెయ్యాలి. గురివింద గింజంతయినా బంగారం బ్రాహ్మణుడికి దానం చెయ్యగల్గితే అది సముద్రంలాగా అక్షయమై ఎప్పుడూ తరంగితమవుతూ వుంటుంది. వ్రత స్వీకారం చేసిన విప్రుడు పరాగ్నిని సేవించకూడదు. దానాలు పట్టరాదు. శీతబాధా నివారకమైన ఇంధనాన్ని ఈ నెలలో దానం చేస్తే మరీ మంచిది.


మాఘ స్నానవ్రతం ముగిసిన వెంటనే ధన లోభం లేకుండా అన్న సంతర్పణ చెయ్యాలి. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. దక్షిణతాంబూలాలు అందించాలి. ఏకాదశినాడు మాఘోద్యాపనం అచ్యుతార్పణంగా శ్రద్దగా విధివిదానంగా చెయ్యాలి. బంగారం లేదా వెండి శ్రీ హరి ప్రతిమలను ద్విజోత్తములకు వినయ విధేయతలతో అర్చించి బహుకరించాలి. బ్రాహ్మణ దంపతులను లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి యధోచితంగా పూజించి భోజన సంతృప్తుల్ని గావించాలి. 


మకరస్థే రవౌమాఘే గోవిందాచ్యుతమాధవ 

స్నానేనానేన దేవేశ యధోక్త ఫలదోభవ ॥


ఈ శ్లోకాన్ని మనస్సులో జపిస్తూ మౌనంగా స్నానం చెయ్యాలి. సారాంశం ఏమంటే దిక్కులు చూస్తూ మనస్సు చెదరగొట్టుకోకుండా కేశవనామాలు జపిస్తూ స్నానం చెయ్యాలి. దేవేశా! ఈ స్నానంతో నాకు రావలసిన పుణ్యాన్ని దక్కించు - అని ప్రార్ధిస్తూ స్నానం చెయ్యాలి. చేశాక కూడ కేశవ నామాలే జపిస్తూ ఇంటికి చేరుకోవాలి. యదావిధిగా అర్చనలూ పూజలూ దానాలూ జపాలూ సాగించాలి.



Sunday 2 July 2023

శ్రీదత్త పురాణము (186)

 


శ్రీ దత్తగురుత్తమా! మాఘ స్నానానికి ఇంతటి అద్భుత శక్తి ఎలా వచ్చింది? ఒక్కసారి స్నానం చేస్తే గత జన్మల పాపాలు తొలగిపోవడం మరోసారి స్నానం చేస్తే స్వర్గలోకం స్వాధీనమవ్వడం ఆశ్చర్యకరంగా వుంది. వణిక్కుమారుడు ఘోరపాపాలు చేసినా మాఘస్నానంతో విముక్తుడై స్వర్గానికి చేరుకోవడం మరీ వింతగా వుంది. దీని రహస్యం ఏమిటో బోధించమని తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను. స్వామి! దయచేసి అనుగ్రహించు.


మాఘ స్నాన విధి


కార్తవీర్యార్జునా! సలిలానికి సహజంగానే మలపంకిలాలను ప్రక్షాళన చేసే శక్తి వుంది. అది స్వయంగా నిర్మలం. స్నానం చేస్తుంటే ప్రాణానికి హాయిగా వుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే నీరనేది ద్రావకం - దాహకం ధారకం పోషకం. తనలో మునిగిన వస్తువుల్ని క్రమక్రమంగా కిలుము వదిలిస్తుంది. పొరలు పొరలుగా తనలో కలుపుకుంటుంది. కనుక ద్రావకం - పాపాలను దహిస్తుంది కనుక దాహకం. జీవకోటికి ప్రాణాలు నిలుపుతుంది కనుక ధారకం - పోషిస్తుంది కనుక పోషకం వేదాలు సైతం యోపామాయతనం వేద - మొదలైన మంత్రాలతో నీటిని నారాయణ రూపంగా కొనియాడుతున్నాయి. అంతే కాదు గ్రహాలలో సూర్యగ్రహం నక్షత్రాలలో చంద్ర బింబం మాసాలలో మాఘమాసం - ఉత్తమోత్తమాలు. ఈ మాఘ మాసాన నిర్మల ప్రాతఃవేళ సూర్యుడు మకరంలో వున్న శుభ గడియల్లో గోష్పాదమంతటి (ఆవు డెక్క) నీటి ఘడియలో స్నానం చేసినా చాలు ఎంతటి పాపిష్టినైనా అది స్వర్గానికి చేరుస్తుంది.


మాఘ మాసం నెలవాళ్ళు తెల్లవారుజామున నదీ స్నానం చెయ్యడం అనేది ఒక వ్రతం. ఒక యోగం. దీనికి అశక్తులైన వారు కనీసం మూడు నాళ్ళయినా మాఘ స్నానాలు చెయ్యాలి. యధాశక్తిగా ఏదో ఒక వస్తువు దానం చెయ్యాలి. అలా చేసిన వ్యక్తి మరింక ఏ జన్మలోనూ దారిద్ర్యం అనుభవింపడు. పైగా ధనవంతుడుగా దీర్ఘాయుష్కుడుగా ఇహపరసుఖాలు పొందుతాడు. అయిదు రోజులు గానీ ఏడు రోజులుకానీ చేస్తే అతడి పుణ్య ఫలం చంద్ర కళల్లాగా వృద్ధి చెందుతుంది.


Saturday 1 July 2023

శ్రీదత్త పురాణము (185)

 


వణి క్పుత్రకా ! యతి పాదోదకం పురాకృత పాప సంఘాలను పారద్రోలుతుంది. అది అక్షయోదకం. సప్తజన్మలనూ పాపరహితాలుగా ప్రక్షాళన చేస్తుంది. ఇక ఆ పరమ హంసలకు ఆతిథ్యమిచ్చిన పుణ్య ఫలం ఎంతటిదంటే - వెయ్యి సంవత్సరాలకైనా నేను వివరించలేను.


ఈ చరాచర జగత్తులో ప్రాణులు శ్రేష్టమైనవి. ఆ ప్రాణుల్లో మతి జీవులు శ్రేష్టమైనవి. మతి మంతులలో నరులు శ్రేష్టులు. వారిలో 'బ్రాహ్మణులూ వారిలో 'విద్వాంసులూ విద్వాంసుల్లో ధర్మనిర్ణయం చెయ్యగలిగిన కృత బుద్ధులూ వారిలో మళ్లీ స్వయంగా ధర్మాచరణచేసే కర్తలూ, ఆ కర్తల్లోనూ బ్రహ్మవేత్తలూ ఉత్తమోత్తమములు. బ్రహ్మ వేత్తల కన్నా ఉత్తములూ శ్రేష్టులూ భూతకాలంలో లేరు. భవిష్యత్తులో ఉండరు. అంచేతనే బ్రహ్మవేత్తలు జగత్రయ పూజ్యులు. వారి సాంగత్యం సర్వపాప వినాశకం. సకల పుణ్య ప్రదాయకం.


అటువంటి యతి పుంగవులు అంతటి బ్రహ్మనాదులు నీ యింట సత్కారాలు పొందారు. ఆతిథ్యం స్వీకరించారు.


విశ్రాంతి తీసుకున్నారు. వికుండలా! ఎనిమిదవ జన్మలో ఇలా నువ్వు ఆర్జించుకున్న పుణ్యం కొండంత ఉంది. అది నీ అగ్రజుడికి ధారపొయ్యి. నరకం నుండి విముక్తి పొందుతాడు.


వికుండలుడు సంబర పడుతూ యమదూతకు ధన్యవాదాలు పలికి సాష్టాంగ నమస్కారం చేసి తన పూర్వ పుణ్య ఫలాన్ని శ్రీ కుండలునికి ధారపోశాడు. వెంటనే శ్రీ కుండలుడు అసి పత్ర మహానరకం నుండి విముక్తుడయ్యాడు. యమదూత సత్కృతుడై వీడ్కోలు తీసుకున్నాడు. దేవతలు ఆ ఇద్దరు సోదరుల మీదా పారిజాత పుష్పవృష్టి కురిపించారు. దివ్య విమానంలో నాకలోకానికి తీసుకు వెళ్ళారు.


మాఘస్నాన మహిమను చెప్పడానికి దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి వినిపించి, ఈ కధను చదివిన వారు, విన్న వారు వెయ్యి గోవుల్ని సద్విప్రులకు దానం చేసిన ఫలం పొందుతారని ఫలశ్రుతి ప్రకటించాడు.