Tuesday 31 January 2023

శ్రీదత్త పురాణము (36)



క్షేత్ర, క్షేత్రజ్ఞ విలువలను గుర్తించు, ద్వంద్వ ప్రవృత్తిని జయించు. ఏకాంతవాసంతో, యోగాభ్యాసంతో అంతరేంద్రియాలను నిగ్రహించు. భిక్షాటనతో దేహాన్ని నిలుపుకుంటూ నిరంతరం జాగరూకుడవై యోగమార్గాన పయనిస్తే ఆత్మ బ్రహ్మైక్యానుసంధానం చెందుతుంది, భవరోగాలన్నింటికీ అదే దివ్య ఔషధం. జనన మరణాల చక్రము నుండి బయటపడే సాధనం ఇదే, మరొకటి లేదు. యోగమార్గాన ప్రయాణం చేయడమే శరణ్యం. ఈ క్షణములోనే నీవు ధృడంగా సంకల్పించుకో.


నాయనా ! కళ్ళు తెరిపించావు. ఈ సంసారము నుండి బయటపడాలి. బయటపడాలి అనుకోవడమే తప్ప బయటపడే మార్గం తెలియక ధైర్యంచాలక కొట్టుకుంటున్నాను. దారి చూపించావు. ధైర్యం కలిగించావు. జన్మ పరంపరల సుడిగుండం నుంచి తప్పించే యోగవిద్య నాకు ఉపదేశించు. భవదావాగ్నిలో మాడిపోతున్న నా అంతరంగానికి బ్రహ్మ జ్ఞానమనే జడివానతో ఉపశమనం కలిగించు. అవిద్య కృష్ణసర్పం కాటువేసి మూర్చపోయిన నన్ను నీ మంత్రోపదేశంతో బయటపడేయి. ఇల్లు వాకిలి ఇల్లాలు బిడ్డలు ధనధాన్యాలు ఇలా వేయి పాశాలు ముడివేసుకొని గిలగిలా కొట్టుకుంటున్నాను. యోగవిద్య అనే ఖడ్గంతో నా బంధనాలు చేదించి స్వేచ్ఛ ప్రసాదించు.


తండ్రీ! యోగాభ్యాసానికి కావలసిన పరిణతి నీకులభించింది. తప్పకుండా ఉపదేశిస్తాను. వెనుక దత్తయోగీంద్రుడు అలర్కుడికి చెప్పిన యోగవిద్య నీకు చెప్తాను, శ్రద్ధగా విను. నాయనా కుమారా నువ్వు బోధించే యోగవిద్యలో ఈ అంశాలు వస్తాయో రావో, మళ్ళీ చివరలో ఈ సందేహాలు గుర్తుంటాయో ఉండవో అందుకని ముందే అడుగుతున్నాను. దత్తయోగీంద్రుడు ఎవరు? అలర్కుడు అంటున్నావు. ఆయన ఎవరు? వీళ్ళ జన్మ వృత్తాంతాలు ముందుగా చెప్పి ఆపైన యోగవిద్య చెబుదువుగాని. తండ్రీ అడగవలసిందే అడిగావు. వీరిద్దరి గురించి చెప్పకుండా యోగవిద్య ఎలా చెప్పగలను. ముందుగా దత్త యోగీంద్రుని ఆవిర్భావానికి హేతువయిన పావన గాధ చెబుతాను విను.

Monday 30 January 2023

శ్రీదత్త పురాణము (35)



ఆశ్చర్యచకితుడై కళ్ళు అప్పగించి తండ్రి రవ్వంత తేరుకున్నాడు. ఇంతటి జ్ఞాని తన ఇంట పుట్టినందుకు ఆనందం కల్గుతున్నా చిన్నవాడి వైరాగ్య మాటలు అతన్ని కలవరపరచాయి. జడుడు అనుకున్నవాడు నేడు జ్ఞాని అయ్యాడని సంతోషించాలో ఈ ధోరణికి దుఃఖించాలో అగమ్యగోచరంగా ఉంది. నాయనా సుమతి ఏమిటి నీ మాటలు, ఒక్కనిమిషంలో నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? పూర్వజన్మల స్మృతి ఎలా కలిగింది? ఏదైనా శాపకారణంగా నీవు మా ఇంట జన్మించావా ? నన్ను మీ అమ్మను మళ్ళీ దుఃఖ సాగరంలో ముంచి వెళ్ళిపోతావా? అసలు నీ జన్మ రహస్యం ఏమిటి ? చెప్పు అని ఆందోళనతో అడిగాడు. వేదవేదాంగాలు అభ్యసించిన తండ్రి పుత్రవ్యామోహంతో అలా రోదిస్తుంటే సుమతికి నవ్వు వచ్చింది. ఇలా అన్నాడు. తండ్రీ నీకు పుత్రుడుగా జన్మించడానికి ముందు చాలా శాస్త్రాలు అభ్యసించాను. ఆ ఇంటికి వచ్చిపోయే సాధు సజ్జనులతో సాంగత్యం కలిగింది. వేదాంగ చర్చలు అనేకం చేసాను. ముక్తిమార్గాలు తెలుసుకున్నాను. జ్ఞానం ఉదయించింది. అంతరంగం నిండా వెలుగునింపుకొంది. ఏకాంత వాసంలో చాలాకాలం గడిపాను. నా నియమనిష్టలు పరిపక్వదశకు వచ్చే సమయంలో, బ్రహ్మసాక్షాత్కారం లభించే సమయంలో ప్రమాద వశాత్తు మరణించాను. యోగశక్తి కారణంగా అప్పటి నుండి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. నేను చేసిన జ్ఞాన దానాల ఫలితంగా పదివేల పూర్వజన్మల్లోని అన్ని విషయాలు నాముందు నిలచాయి. నిర్వేదంతో, సంగతీత, ద్వంద్వాతీత స్థితి కలిగింది. దానినే ఈ జన్మతోను కొనసాగించదలచాను. ఇప్పుడు ఆ జ్ఞాన మార్గాన్ని విడిచి నువ్వు చెప్తున్న కర్మమార్గం అవలంభించలేను. ఏ మార్గంలో ఎవరు ప్రయాణం చేసినా అందరూ చేరుకొనేది గమ్యమే. అదే అందరి లక్ష్యము. నా మార్గంలో నేను గమ్యం చేరుకుంటాను. అందువలననే ఈ జడ స్థితి. కాలం వృధా చేసుకోకూడదు కదా ! ఈ శరీరానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికెరుక, కనుక ముక్తిలభించే వరకు అనుక్షణము ఆత్మానుభవపరుడై తదేక దీక్షలో గడపడం నా ధృడసంకల్పం. నీ ఇంట పుట్టాను కనుక పితృఋణం తీర్చుకోవడం నా ధర్మం. జ్ఞాన దానం చేసి ఋణ విముక్తి పొందుతాను. తండ్రీ నీకేమైనా సందేహాలుంటే అడుగు అన్నాడు.


కిందటి క్షణం వరకు జడుడుగా ఉండి ఇప్పుడు ఇంతటి జ్ఞానిగా ప్రసంగిస్తున్న కొడుకు ఆ తండ్రికంటికి మహాయోగీశ్వరుడులా కనిపించాడు. హిమాలయ శిఖరంలా గోచరించాడు. సుమతికి తాను పెట్టిన పేరు సార్ధకమయ్యిందని సంబరపడ్డాడు. కుమారా, నాయనా ఇంతకీ ఇప్పుడు నా కర్తవ్యము ఏమిటి చెప్పు. నేను ఈ జన్మ పరంపరలలో ఇలా మునిగి తేలవలసిందేనా ! దీనికి విముక్తి ఏమిటి ? దయచేసి తెలియచెప్పు. కన్నకొడుకుతో మాట్లాడుతున్నానన్న చనువు, మహాజ్ఞానితో మాట్లాడుతున్నానన్న బెరుకు తండ్రి స్వరంలో వినిపించాయి. సుమతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తండ్రితో ఇలా అన్నాడు.


తండ్రీ నా మాటలమీద నీకు నిజంగా గురి కుదిరింది కదా ! అయితే చెబుతాను విను. ఈ సంసారము నిస్సారమని ముందు నువ్వు గ్రహించు. ఆ తరువాత ఆలస్యం చేయకుండా గృహస్థాశ్రమం వదలి వానప్రస్థం స్వీకరించి అమ్మతో సహా అడువులకు వెళ్లి భగవధ్యానం చేసుకుంటూ నిస్సంగత్వం అలవరుచుకో. ఆ పైన సన్యాసం స్వీకరించు.   

Sunday 29 January 2023

శ్రీదత్త పురాణము (34)


తండ్రీ మీరంటున్న వేదాలు శాస్త్రాలు కళలు కావ్యాలు ఇవి అన్నీ నేను ఎన్నో సార్లు అభ్యసించాను. ఇవి ఏమీ నాకు కొత్తకాదు. గ్రుడ్డి, మూగ, చెవుడు, జడుడు అనుకున్న కొడుకు ఇలా మాట్లాడటమేమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఇందులో ఆశ్చర్యం ఏమిలేదు. నా కథ చెబుతాను విను. ఇంతవరకూ నేను కొన్ని వేల జన్మలు ఎత్తాను. అవన్నీ నా కళ్ళ ఎదుట బొమ్మలు లాగా కదులుతున్నాయి. ప్రతిజన్మలో జరిగిన ప్రతీ విషయం నాకు జ్ఞాపకం ఉంది. ఎందరెందరు తల్లిదండ్రులు ఎందరెందరు బంధుమిత్రులు ఎందరెందరు భార్యాపుత్రులు లెక్క పెట్టి చెప్పడం ఎవ్వరి తరమూకాదు. ఎన్నెన్ని సుఖాలు ఎన్నెన్ని దుఃఖాలు ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని అనుభూతులు. తలుచుకుంటేనే తల తిరిగిపోతుంది. నరజన్మలేనా మృగజన్మలేదా పశుపక్షి, కీటకాదిక్రిముల జన్మలేనా అన్నీ నేను అనుభవించాను. ప్రతి పుట్టుకా ఒక నరకం. మలమూత్ర పంకిలమైన జననీ జకర నివాసం. శైశవ, బాల్య, యౌవన, కౌమార, వార్థక్యాలలో సుఖదుఃఖాల వెలుగునీడలు స్వయం కృతాలు, పరాకృతాలు, అన్ని చాలా రుచి చూసాను. భృత్యజన్మల్లో కృంగిపోయాను. రాజజన్మల్లో విర్రవీగాను, పిరికిపందగా పారిపోయాను. మహాశూరుడిగా విజృంభించాను. దరిద్ర, ధనిక, చోర, కిరాతక, జూదరిజన్మలు ఎన్నో ఎత్తి వంచించాను, వంచింపబడ్డాను. త్యాగిగా కీర్తింపబడ్డాను. లోభిగా నిందింపబడ్డాను. సర్వాంగ సౌందర్యాలు, అంగవైకల్యాలు అన్నీ గుర్తువున్నాయి. అవన్నీ కలిగించిన నిర్వేదంతో ఈనాడు ఇలా జడపదార్థంలా మారిపోయి మీ ఇంటిలో జన్మించాను. పూర్వజన్మప్మృతి లేకపోవడం నిజంగా మానవుడివరం, లేకపోతే నాలాగే అందరూ జడపదార్థముల వలె ఉండేవారు. నిర్వేదంలో మునిగిపోయేవారు. సరే ఆ జన్మలూ, ఆ కష్టాలు, ఆ వైరాగ్యాలు, వాటి మాటకేం గాని తండ్రీ నీవు చెబుతున్న వేదోక్త కర్మలపట్ల నాకు సదభిప్రాయం లేదు. అవి నాకు రుచింపవు. యజ్ఞయాగాదులు చెయ్యడం స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం సంపాదించుకున్న పుణ్యం ఖర్చుకాగానే మళ్ళీ భూలోకంలో గర్భవాస నరకం అనుభవించడం ఏదో ఒక జన్మ మళ్ళీ ఎత్తడం మళ్ళీ దుష్కర్మలు సత్కర్మలూ నరకయాతనలు సుఖదుఃఖాలు అనుభవించడం మళ్ళీ పుట్టడం మళ్ళీ గిట్టడం ఇంతేగదా జనన మరణ చక్రంలోబడి కొట్టు మిట్టాడటం. దీనికి విసుగూ విరామం లేదా ? నువ్వంటునట్లు కర్మమార్గం ఇంతకన్నా ఉత్తమ పదాన్ని అందిస్తుందా? ఇంతకన్నా ఉన్నతపదం ఉంది అని అసలు నీవు గుర్తించావా? జననమరణాలకు అతీతమైన శాశ్వత ఆనందధామం కదా మనం చేరుకోవలసింది దాన్ని పొందాలి అంటే జ్ఞాన మార్గం ఒక్కటే శరణ్యం. నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడం. ఒక్కటే జ్ఞానమార్గం, సర్వ సంగపరిత్యాగము, రాగద్వేషాది ద్వందాలకు లొంగని ప్రవృత్తి అలవరచుకోవడమే జ్ఞానమంటే. ఇది ఉన్నవాడికి దుఃఖం ఉండదు. కర్మబంధం ఉండదు. జన్మరాహిత్యమే చివరఫలం. తండ్రీ ఇది నువ్వు తెలుసుకోవాలి.

Saturday 28 January 2023

శ్రీదత్త పురాణము (33)


 సుమతి వృత్తాంతం


అనగనగా ఆర్యావర్తంలో ఒక పల్లెటూరు. ఆ వూళ్లో ఒక బ్రాహ్మణుడు. వేదవేదాంగ పారంగతుడతడు. సర్వసద్గుణ సంపన్నుడు. సర్వసామ్యుడు. శాంత స్వభావి. ధర్మపత్నీ సమేతుడై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ ఆచరిస్తూ వుండేవాడు. కాని ఎంతకూ వారికి సంతానం కలుగలేదు. ఇంక మన బ్రతుకులు ఇంతే! ఈ తనువు ఇలా రాలిపోవలసిందే అని దిగులు చెందుతున్న నడి వయస్సులో వారి కలలు ఫలించి ఆమె కడుపు పండింది. పది నెలలూ మోసి పండంటి మగ బిడ్డను ప్రసవించింది. బంగారు మేనిఛాయతో దివ్యతేజస్సుతో సౌందర్య రాశి లా వున్నాడు బిడ్డడు. రోజుల గడుస్తున్న కొద్దీ బిడ్డడు అంధుడని, చెవిటివాడని, మూగవాడని ఆ తల్లితండ్రులు గుర్తించి భోరు భోరున విలపించారు. అవిటివాడైతేనేమి కొడుకు పుట్టాడు అంతే చాలు అనుకొని గుండెలురాయి చేసుకొని బ్రతుకుతున్నారు. అల్లారుముద్దుగా బిడ్డడిని పెంచుకొంటున్నారు. సుమతి అని నామకరణం చేసి సంబరపడ్డారు. ఏనాటికైనా అతడు ఆరోగ్యవంతుడవుతాడని ఆశతో ఎదురుచూస్తూ జీవితం గడుపుతున్నారు. కాని అది అడియాశే అయ్యింది. ఏ చైతన్యం లేని జడపదార్థంలా సుమతి ఎదుగుతున్నాడు. ఎనిమిదేళ్ళు వచ్చాయి. వయస్సుకు తగిన బుద్ధి వికసించలేదు. కాని ముఖ వర్చస్సు మాత్రం అద్భుతంగా వుండేది. ఉపనయనంజేసి కనీసం గాయత్రినైనా జపిస్తే ఫలితం కలుగుతుందని తండ్రి ఆశపడి ముహూర్తం ఏర్పాటు చేసి ఒడుగు జరిపించాడు. చెవిలో గాయత్రిమంత్రం జపించాడు. విన్న అలికిడి ఆ బిడ్డ ముఖంలో కన్పించలేదు. తండ్రి గాంభీర్యం అంతా సడలిపోయింది. అయ్యో నాయనా ఇంత జడుడుగా వున్నావేరా అంటూ బిడ్డని గుండెలకు హత్తుకొని భోరు భోరున విలపించాడు. బిడ్డలు లేనంతకాలం అదొక్కటే దిగులు ఇప్పుడు నిన్ను పెంచి పెద్ద చెయ్యటం అనుక్షణము మాకు అగ్ని పరీక్ష అంటూ దుఃఖించాడు. ఏ జన్మలో ఏ పాపం చేసానో ఈలాంటి బిడ్డని భగవంతుడు అనుగ్రహించాడని ఇదీ ఒక పరీక్షే అని ఆ దంపతులు ఒకరినొకరు ఓదార్చుకొని దుఃఖిస్తున్నారు.


ఓ రోజు సాయంకాలం సంధ్యను ఉపాసింపజేసి తొమ్మిదేళ్ళ సుమతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనయా ! ఉపనయనం చేసాను. వేదాధ్యయనానికి నీకు వయస్సు వచ్చింది. గురుకులంలో వేస్తాను గురుసేవ చేస్తూ చదువుకో బాగా వివేకం సంపాదించు. వయస్సు వచ్చాక వేదాధ్యయనం అయ్యాక అనువైన సంబంధం చూసి నీకు వివాహం జరిపిస్తాను. గృహస్థాశ్రమం ధర్మబద్ధంగా నడిపి సత్పుత్రులను పొంది వారికి నీ బాధ్యతలు నెరవేర్చి వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆ తరువాత అనుబంధాలన్ని తెంపుకొని సన్యాసం పుచ్చుకో. ఆ దీక్షతో నీకు ముక్తి లభిస్తుంది. సుమతి అంతా శ్రద్ధగా వింటున్నాడు అతడికి అన్ని తెలుస్తున్నాయి అనే భ్రమతో పాపం ఆ పిచ్చి తండ్రి ఇంతటి బోధ చేస్తున్నాడు. సుమతి మాత్రం ఉలకలేదు, పలకలేదు అసలు అతనికి వినిపించిందో లేదో కూడా తెలియలేదు. తనపుత్ర వ్యామోహానికి తానే దిగులుపడి కళ్ళల్లో నీళ్ళు కుక్కుకున్నాడు. పాపం ప్రతీ రోజు ఈ తంతు ఇలా జరుగుతూనే వుంది. ఒకనాటి మధ్యాహ్నం సమయాన సుమతి హఠాత్తుగా మాట్లాడాడు. తనను తానే నమ్మలేనంతగా ఆశ్చర్య చకితుడై వింటున్నాడు తండ్రి.

Friday 27 January 2023

శ్రీదత్త పురాణము (32)


 శ్రీదత్త పురాణము


ద్వితీయభాగం


సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. శౌనకాది మునులారా బ్రహ్మ కలిపురుషుడుకి చెప్తున్న దీపక వేదధర్ముల సంభాషణ ఇలా జరిగింది. అంతా కూలంకషంగా చెప్తాను ఆలకించండి.


వేదధర్ముడు చెప్పిన యదు - అవధూత సంభాషణని విన్న దీపకుడు శ్రద్ధగా విని పులకరించిపోయి, ఆనందంతో గురూత్తమా! నీ పాద పద్మాలను సేవించుకొనే భాగ్యం నాకు దొరికింది. నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు, ప్రహ్లాద - అజగర సంభాషణ - యదు - అవధూత సంభాషణలు రెండుకి రెండు అత్యంత మనోహరాలు నిగూఢార్ధ ప్రభోధాలు. అయినా తనివి తీరలేదు. ఇంకా దత్త మహిమల్ని వినాలి తెలుసుకోవాలి అనే కుతూహలం నా మనస్సును తొందరపెడుతున్నది. దయచేసి మిగతా దత్త కధలు కూడా చెప్పి నన్ను తరింపజెయ్యండి నా జన్మ చరితార్ధం చేసుకొంటాను. దప్పికతో ఉన్నవాడు మధుర పానీయాలు ఆశించినట్లు నేను దత్త కధామృతాన్ని యాచిస్తున్నాను అనుగ్రహించు అన్నాడు.


నాయనా దీపకా ఈ దత్త కధల పట్ల నీకు ఇంత ప్రీతి కలుగడం నిజంగా నీ అదృష్టం. జనన మరణాలతో సంబంధం లేని ముక్తి నీకు లభించును. దత్త కధలలో అద్భుతమైన సుమతి వృత్తాంతంవుంది చెబుతాను విను. 


Thursday 26 January 2023

శ్రీదత్త పురాణము (31)


 

ఇలా ఇరవై నలుగురు గురువుల నుంచి ఆత్మోపదేశాలు పొందాను. ఇవేకాదు నా శరీరమే నాకొక పరమ గురువు. ఇది నశ్వరమని మనకు తెలుసు. దీనిలోపల జుగుప్సాకరమైన పదార్థాలు ఉన్నాయని తెలుసు. అయినా దీని మీద అందరికీ వల్లమాలిన మమకారం. కళ్ళ ఎదుట ఎందరి శరీరాలు రాలిపోతున్నా, తన శరీరం మాత్రం శాశ్వతమునుకుంటాడు ప్రతివాడూ, దీన్ని పోషించడానికి, దీని సంరక్షణకు ఎన్నెన్ని అగచాట్లు పడతాడో, ఎంత లేసి ఘోరాలు చేస్తాడో, పోనీలే అనుకుంటే ఈ శరీరానికి కృతజ్ఞత ఉందా? అలువంతయినా లేదు. చెప్పాపెట్టకుండా ఎప్పుడో హఠాత్తుగా రాలిపోతుంది. దీన్ని ఆశ్రయించుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సవతుల్లా పోరాడుతూ జీవులను సుఖభ్రాంతిలో ముంచి కడపటికి నరకంలోకి త్రోసేస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఇదే మోక్షానికి సాధన మవ్వడం. వివేకంతో వైరాగ్యంతో ఇంద్రియాలను అదుపు చేసుకొని దీని అశాశ్వతత్వాన్ని గుర్తించి మెలగగలిగిన వాడు ధన్యుడు. నిజానికి మానవ శరీరం ఎన్నో జన్మలకు గానీ, దొరకదు. అన్ని పురుషార్థాలకీ ఇదే సాధనం. ఇది మృత్యుగుహ్వరంలో ప్రవేశించక ముందే మేల్కొని మోక్షపురుషార్ధ సాధనకు మనం ప్రయత్నం చెయ్యాలి. ఇందరు గురువులు, ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన ప్రబోధాలను గుర్తించి అహంకార మమకారాలకు లొంగకుండా ఆత్మనిష్ఠలో సంచరిస్తున్నాను. యదురాజా! ఏ ఒక్క గురువు పరిపూర్ణ జ్ఞానాన్ని అందించలేడు. పలువురు పలువిధాలుగా ఉపదేశిస్తుంటారు. బ్రహ్మతత్వం ఏకైకమే అయినా ఋషులలో అభిప్రాయ భేదాలు మాత్రం అనేకం. దీనిని నిరసించక అన్నింటినీ గ్రహించి ఆకళింపు చేసుకోవడం మన కర్తవ్యం.


అవధూత చెప్పిన ఈ మహా విషయాలను యదు మహారాజు ఆకళింపు చేసుకున్నాడు. కొత్త వెలుగు ఏదో తనకు కనిపించినట్టు అయ్యింది. సంతృప్తి చెందాడు. అవధూతను సత్కరించి పునఃపునః దండప్రణామాలు ఆచరించి సెలవు తీసుకొని తన రాజధానికి చేరుకున్నాడు. ఉద్ధవా! మన వంశంలో పూర్వీకుడైన ఈ యదు మహారాజు, అవధూత చేసిన జ్ఞానభోధను ఆచరణలో పెట్టి సర్వసంగ విముక్తుడూ సర్వప్రాణి సమచిత్తుడూ అయ్యి ధర్మబద్ధంగా పరిపాలన సాగించి అపునర్భవమైన ముక్తిని పొందాడు అంటూ శ్రీకృష్ణుడు తన ప్రసంగం ముగించాడు. శ్రద్ధగా విన్న ఉద్ధవుడు ఆత్మతత్వాన్ని ఆకళింపు చేసుకొని సంతృప్తి చెందాడు.


నైమిశారణ్యవాసులారా! ఋషీశ్వరులారా వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడుకి చెప్పిన దత్తావధూత మహిము ఇది అంటూ బ్రహ్మ కలిపురుషుడుకి గురు మహిమను చెప్పి కనువిప్పు కలిగించాడు అని చెప్పి సూత మహర్షి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.


ప్రథమ భాగం సమాప్తం

Wednesday 25 January 2023

శ్రీదత్త పురాణము (30)



శరకారుడు : మీరందరూ ఉపయోగించే బాణాలను తయారుచేసే శరకారుడు నా ఇరవై ఒకటవ గురువు. అతడిని ఎప్పుడు నీవు గమనించి ఉండవు. బాణం తయారుచెయ్యడం చాలా క్లిష్టమైన విద్య. పొడువు లావు కొసకోనా బరువూ బలమూ వీటన్నింటికీ సమతూకాన్ని సాధించాలి. ఏది తేడా వచ్చినా విలుకాడి గురి తప్పుతుంది. వేగం మందగిస్తుంది. అంచేత శరకారుడు బహు జాగరూకుడై చేస్తాడు. అతడు ఒక బాణాన్ని తయారు చేస్తున్నపుడు పక్కనేభేరి ఢాంకారాలు చేసినా మహరాజే వచ్చి నిలిచినా అతడికి పట్టదు. అతడి కంటికి ఆ బాణం తప్ప మరేమీ కనిపించదు. చెవికి మరేమి వినిపించదు. అది పూర్తి అయ్యేవరకు లేవడు. అంతటి ఏకాగ్రతను యోగి అలవరచుకోవాలి. రోజుల తరబడి నిష్టగా కూర్చోగలగాలి. నిశ్చలంగా మనస్సును భగవంతుడి మీద నిలపడం ఎలాగో శరకారుడివల్ల తెలుసుకున్నాను. బాహ్య ప్రపంచంతో ప్రమేయం లేకుండా సమాధి స్థితి నిలుపుకోవడం నేర్చుకున్నాను.


సర్పం : సర్పం అంటే అందరూ భయపడతారు. కానీ నాకు అదీ ఒక గురువు. అది ఎక్కడ ఉంటుందో తన ఉనికిని ఎవ్వరికీ తెలియనివ్వదు గదా. ఎప్పుడూ ఒంటరిగానే సంచరిస్తు ఉంటుంది తనకో నివాసం ఏర్పరుచుకోవాలని తాపత్రయపడదు. చీమలు పెట్టిన పుట్టల్లో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తుంది. యోగ మార్గంలో ప్రయాణించే వాడికి ఈ మూడు గుణాలు తప్పనిసరి.


భ్రమరం : యదువరా! భ్రమరకీట న్యాయమని నువ్వు వినే ఉంటావు. భ్రమరం ఒక రకం కీటకాన్ని పట్టితెచ్చి తన గూటిలో పెట్టి ఝంకారం చేస్తూ దాని చుట్టు పరిభ్రమిస్తుంది. ఆ కీటకం భయోద్వేగంతో ఆ నాదాన్ని వింటూ ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కీటకం, భ్రమరనాదాన్నే కాదు, భ్రమర రూపాన్ని కూడా పొందుతుంది. మానవుడు ఇంతే. ఏ కారణంగానైతేనేమి తన మనస్సును దేనిమీద పూర్తిగా నిలుపుతాడో దాని లక్షణాలను పొందుతాడు. భగవంతుడి మీద నిలిపితే భగవత్ లక్షణాలు అలవడతాయి. ఈ జన్మలో కాకపోయినా దేహాంతంలోనైనా సారూప్యముక్తి పొందుతాడు. ఇదీ కీటకం నేర్పిన పాఠం.


సాలె పురుగు : చివరిది ఊర్లనాభం. సాలెపురుగు. తన లోంచి దారాలను వెలువరించి గూడు అల్లుతుంది. అందులో కొంచెం సేపు క్రీడిస్తుంది. ఈగల్లాంటి జంతువులను బంధించి ఆడిస్తుంది. మళ్ళీ ఆదారాలను తానే మింగేస్తుంది. తనలో లీనం చేసుకుంటుంది. సృష్టి స్థితి లయలు ఇలా జరుగుతున్నాయి. సృష్టి చెయ్యాలని సంకల్పించు కొన్నపుడు బ్రహ్మతత్వం తన మంచి త్రిగుణాత్మకాలైనా మాయా తంతువులను ఆవిష్కరిస్తుంది. త్రిగుణాత్మక జగత్తును సృష్టిస్తుంది. అందులో తాను క్రీడిస్తుంది. జీవుల్ని ఆడిస్తుంది. ఇది స్థితి విలాసం. ప్రళయకాలంలో ఆ పరబ్రహ్మమే - తాను సృష్టించిన ఈ ప్రపంచాన్ని తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ పరమ రహస్యాన్ని సాలెపురుగును చూసి గ్రహించాను.

Tuesday 24 January 2023

శ్రీదత్త పురాణము (29)



కురరం : మరొక గురువు కురరం. అంటే లకుముకి పిట్ట. అది ఎక్కడో ఒక మాంసపు ముక్కను సంపాదించి ముక్కున కరుచుకుని గూటికి ఎగురుతోంది. మరొక పెద్దపులుగు చూసింది. లకుముకుని వెంటాడింది. ఈ చిన్ని పిట్టకు భయం వేసింది. మాంసం ముక్కను వదిలేసింది. పెద్దపులుగు దాన్ని తన్నుకుపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంది లకుముకి. రాజా! గ్రహించావా? మరొకరికి కన్నుకుట్టే వస్తువు మనదగ్గర ఉంటే అది మన ప్రాణాలకే ముప్పు, బలహీనుడు ఈ రహస్యం తెలుసుకోవాలి. లేదంటే ఆపదల్లో పడతాడు.


పసిబాలుడు : పసిబాలుడు నా పరమ గురువు. చీకూ చింత లేకుండా కేరింతలు కొడతాడు. తన ఆటలేవో తనవి. తన ఆనందమేమో తనది. మిగతా ప్రపంచం ఏమైపోయినా అతడికి పట్టదు. అవధూత కూడా ఇలాగే ఉండాలి. ఈ సృష్టిలో నిశ్చింతగా ఆనందించేది వీరిద్దరే. ఒకడు అమాయకుడు, మరొకడు మాయాతీతుడు.


కన్య : కన్యకా వృత్తాతం ఏమి నేర్పిందో చెబుతాను విను, అనగనగా ఒక వూరు. ఆ వూళ్ళో ఒక కన్యక. రూప యౌవన వతి. గుణవతి. శీలవతి. పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. చూస్తున్నారు. వెడుతున్నారు. ఇంకా ఏదీ ముడిపడలేదు. ఒక రోజున తల్లిదండ్రులు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళిన సమయాన పొరుగూరు నుంచి మగపెళ్ళివారు వచ్చారు పిల్లను చూసుకుందామని. వరుడూ అతడి తల్లిదండ్రులూ, బంధుమిత్రులూ ఒక అయిదారు మంది వచ్చారు. కన్యకామణి స్వయంగా స్వాగతం పలికి కాళ్లు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తడి ఒత్తుకోవడానికి తువ్వాళ్ళు ఇచ్చి నడవలో చాపలు పరచి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. తాగడానికి మంచి నీళ్ళు అందించింది. ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ వంట గదిలోకి వెళ్ళింది. ఏదైనా ఫలహారం చేసి పెడదామని డబ్బాలు వెదికి వరిపిండి తీసి పళ్లెంలో పోసి రెండు చేతులతోను తడిపి ముద్ద చేస్తోంది. ఆ కదలికలకి గాజులు గలగలలాడాయి. ఏదో చేస్తున్నామని అతిధులు గ్రహిస్తారని ఒక్కొక్క చేతికి రెండేసి గాజులే ఉంచి మిగతావి తీసేసింది. అవి కూడా ఒక దానికి ఒకటి తగిలి రొద చేస్తున్నాయి. అప్పుడు ఒక్కొక్క గాజునే ఉంచుకొని గబగబా పిండి కలిపి జంతికలు వండిపెట్టింది. మగ పెళ్ళివారు అమ్మాయి పని మంతురాలని గ్రహించి సంబరపడి మరొక రోజు వచ్చి మీ నాన్న గారితో మాట్లాడతాములే అని చెప్పి బయలుదేరారు. తరువాత ఏమయ్యిందో వదిలి వేద్దాము. ఇప్పటికి ఈ ముక్కచాలు. యదువీరా! ఏమైనా గ్రహించగలిగావా? పది మంది ఒక చోట చేరితే గాజులలాగ గలగలలాడటమూ కలహించుకోవడమే తప్ప పరమార్ధ విచికిత్స ఉండదు. ఇద్దరు ఉన్నా వృధా సంభాషణలతో కాలయాపన జరుగుతుందే కాని ఒరిగేదేమీ ఉండదు. అంచేత నిరాటంకంగా ధ్యానం సాగాలంటే అంతర్ దృష్టి విస్తరించాలంటే సాధకుడు ఒంటరిగానే ఉండాలి. ఇదీ గాజుల గలగలలు నాకు నేర్పిన పాఠం. 


Monday 23 January 2023

శ్రీదత్త పురాణము (28)

 


మధుహారి : మధుహారి అంటే తేనెను సేకరించేవారు. వేల సంఖ్యలో తేనె టీగలు నెలల తరబడి శ్రమపడి తేనె పట్టులో తేనెను కూడబెడితే మధుహారి వచ్చి పొగపెట్టి ఆ తేనె టీగలను సంహరించి క్షణంలో తేనెను అపహరించి పట్టుకుపోతాడు. లుబ్ధులై ఎవరు ఏ ధనాన్ని కూడ బెట్టినా, బలవంతులు ఎవరో వచ్చి దాన్ని కాజేస్తారు. కనుక తన అవసరానికి మించి సంపదలను కూడబెట్టుకోవడం చాలా హానికరమని గ్రహించాను. అలాగే గృహస్తుల కన్నా ముందు యాచకులు వెళ్ళి వారి వంటకాలను అడిగి ఆరగించడం తగదనీ గ్రహించాను.


హరిణం : హరిణమంటే లేడి. అది వేటగాడి సంగీతానికి మోహపడి వలలో చిక్కుకుంటుంది. యతీశ్వరుడు కూడా అలాగే సంగీతాది లలిత కళలకు సమ్మోహితుడయితే ధ్యాన నియమనిష్టల నుంచి పరిభ్రష్టుడవుతాడు. ఋష్యశృంగుడి కథ ఎరుగుదువు కదా! విలాసవతుల నృత్య గీతాలకు వివశుడై సంసారంలో చిక్కుకొన్నాడు.

మీనం : నాకు మరొక గురువు మీనం. అంటే చేప ఎరకి ఆశపడి గాలానికి తగులుకుంటుంది. జిహ్యచాపల్యం ప్రాణాలు తీస్తుంది. యోగులకు కూడా జిహ్యేంద్రియాన్ని జయించడం కష్టసాధ్యం. దీన్ని జయిస్తే అన్నింటినీ జయించినట్టే. ఈ రహస్యం నేర్చుకున్నాను చేపను చూసి.


పింగళ : పింగళ ఒక వేశ్య. విదేహ పట్టణంలో నివసిస్తుండేది. చాలా అందగత్తె. ధనవంతులకు గేలం వెయ్యడం వారిని బికారులను చెయ్యడం దాని వృత్తి. ఒకనాటి సాయంకాలం అద్భుతంగా సింగారించుకొని తన భవంతి గుమ్మంలో నిలబడింది. వీధినపోయే ధనవంతుల్ని పసికట్టి ఆకర్షిద్దామని దాని ఆశ. గంటలు గడుస్తున్నాయి. గానీ ఎవడూ ఈమెకేసి కన్నెత్తి అయినా చూడడం లేదు. అయినా ఆశగా అలాగే నిలబడింది. చీకట్లు ముసురుకున్నాయి. గుడ్డివెన్నెల కాసింది. పింగళ ఒక సారి లోపలికి వెళ్ళి సింగారానికి సవరింపులు చేసుకుని మళ్ళివచ్చి నిలబడింది. వీధిలో జనసంచారం తగ్గింది. అర్ధరాత్రివేళగదా అప్పుడైనా విటులు వస్తారని ఆశగా అలాగే నిలబడింది. ఫలించలేదు. కాళ్ళు లాగాయి. విసుగు వచ్చింది. ఇక నిలబడలేక లోపలికి వెళ్ళి హంస తూలికా తల్పం మీద నడుం వాల్చింది. అంతలో వాకిట గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయితే విటుడెవడో వచ్చాడనుకొని చివాలున లేచి చరాలున గుమ్మంలో నిలిచింది. ఎవ్వరూ లేరు. అంతా గుడ్డి వెన్నెల చెట్లనీడలు, సగం నిద్రలో ఉలిక్కిపడిన పులుగు కూనల కువకువలు. అంతటా నిశ్శబ్దం- ఒక్కసారిగా సింగళ హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి? నేను చేస్తున్న పని ఏమిటి? నా జన్మకు ప్రయోజనం ఏమిటి? ఎంతమందిని బికారుల్ని చేశాను? ఎంత కూడ బెట్టాను? చచ్చిపోయేటపుడు ఇందులో ఎంత కూడా పట్టుకు వెడతాను? ఎక్కడికి వెడతాను? నరకానికే అక్కడ నేను అనుభవించే యాతన లేమిటి? నేను చస్తే ఒక్కడైనా అయ్యోపాపం అంటాడా? ఆలోచనలు ఉవ్వెత్తున చెలరేగాయి. సమాధానాలూ దొరికాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. తన వృత్తి మీద జుగుప్స కలిగింది. వైరాగ్యభానుడు ఉదయించాడు. అయ్యో! ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నాను. ఒక్కనాడైనా హరి నామస్మరణ చెయ్యలేదే. అనంత సుఖప్రదుడూ మనశ్శాంతి కారకుడూ అయిన భగవంతుణ్ని, చేరువలో ఉన్న పెన్నిధానాన్ని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని నిధులు పంచుతాడనీ ఎండమావుల వెంట పరుగులు తీశాను. ఛీ! ఇక ఆ జీవితానికి స్వస్తి-ఇలా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ క్షణం నుంచి శేష జీవితాన్ని హరినామస్మరణతో గడిపింది. ధర్మ కార్యాలు ఆచరించింది. తీర్ధయాత్రలు చేసింది. పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకుని మనశ్శాంతితో తనువు చాలించింది. యదుపతీ! ఈవిడ జీవితం నాకు నేర్చిన పాఠమేమిటో గ్రహించావా? ఆశ అనేది దుఃఖ ప్రదమనీ వైరాగ్యం సుఖ ప్రదమనీను.


Sunday 22 January 2023

శ్రీదత్త పురాణము (27)

 

పతంగం : యదువల్లభా ! పతంగమంటే తెలుసుగా, మిడత. ఇది నాకు మరోరకం పాఠం చెప్పింది. దీనికి మంటలు కనబడితే చాలు ఒళ్ళు తెలియదు. మాడిపోతామని తెలిసీ నిగ్రహించుకోలేదు. ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి మసి అయిపోతుంది. ప్రపంచంలో కనిపించే రకరకాల యోషిత్ (స్త్రీ) హిరణ్య అంబరాది ఆకర్షణలకి మానవుడు లోనై అలాగ బలైపోతున్నాడు. వట్టి తోలుతిత్తి అని తెలిసికూడా సౌందర్యాలకు మోహపడి ప్రలోభాలకు ఆశపడి జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నాడు. అహంకరించి మసి అయిపోతున్నాడు. ఈ సందేశం అందించింది కనుక మిడత నాకు మరో గురువు.


మధుకరం : మధుకరం అంటే తేనెటీగ. ఇది పాఠాలు నేర్పింది. పువ్వు పువ్వుకి వెళ్ళి పువ్వుకి నొప్పి కలగకుండా బొట్టు బొట్టుగా మకరందం గ్రహించి పొట్టనింపు కుంటుంది తేనెటీగ. యోగి కూడా ఇలాగే ఇల్లిల్లు తిరిగి ఇంటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్దగా ఆహారం స్వీకరించి పొట్టపోసుకోవాలి. ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే గ్రోలినట్లు ఏ గుమ్మం దగ్గర ముద్దను ఆ గుమ్మం దగ్గరే ఆరగించాలి. కడుపునిండిన తక్షణం ఆ పూటకు మధూకర వృత్తిని మానుకోవాలి. మనకు రకరకాల శాస్త్రాలున్నాయి. వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా యోగి ఇదే మధూకర వృత్తిని ఆవలంభించాలి. తేనెటీగలు మకరందాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరికి అవి ఆ తేనెను అపహరించేవారి చేతిలో మృతి చెందుతున్నాయి. కాబట్టి యోగి ఆహారాన్ని కూడ బెట్టకూడదు. ఈ రెండు పాఠాలు నేర్చుకున్నాను మధుకరాల నుంచి.


ఏనుగు : నువ్వు రాజువి కాబట్టి, అడవిలో స్వేచ్ఛగా సంచరించే మదపుటేనుగుల్ని ఎలా బంధిస్తారో ఎరుగుదువు. ఒక పెద్ద గొయ్యి తవ్వి, దాని మీద సన్నని కర్రలు వేసి, వాటి మీద గడ్డి పరచి, దాని మీద మధ్యలో ఒక పెద్ద ఆడ ఏనుగు బొమ్మను నిలబెట్టి, మీ రాజుభటులు చుట్టు పక్కల పొదలలో దాగి, పొంచి ఉంటారు. అటువైపు వచ్చిన మదపు టేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికిందని పరుగు పరుగున వచ్చి గోతిలో పడుతుంది. ఇది కాక నిజమైన ఆడ ఏనుగే దొరికి ఒక మదపుటేనుగు దాని వెంట పడితే మరికొన్ని మదపుటేనుగులు ఎగబడి, పరస్పరం పోరాడుకొని మరణిస్తాయి. పురుషుడికి స్త్రీ వ్యామోహం ఎంతటి వినాశానికి దారితీస్తుందో ఈ గజ వృత్తాంతం తెలియజేస్తోంది.


Saturday 21 January 2023

శ్రీదత్త పురాణము (26)



కపోతం : ఒక అడవిలో ఒక చెట్టుమీద గూడు కట్టుకుని కపోత దంపతులు సుఖంగా జీవిస్తున్నాయి. అనుక్షణము కలిసిమెలసి తిరుగుతూ ఆహారం సంపాదించుకుంటూ ఆనందంగా అన్యోన్యంగా వుంటూ కులాసాగా తమ జీవితాన్ని గడుపుతున్నాయి. ఇంతలో కొన్నాళ్ళకి ఆడ పావురం గర్భం ధరించి గ్రుడ్లు పెట్టింది. వాటిని ఎంతో ప్రేమతో పొదిగింది. అన్నీ పిల్లలయినాయి వాటి పెంపకంలో కపోత దంపతులు క్షణం తీరికలేకుండా ఆనందం అనుభవిస్తున్నాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి రుచికరమైన ఆహారము సేకరించి తెచ్చి ముక్కులతో అందించి సంబరపడుతున్నాయి. పిల్లల కేరింతలు చూచి మురిసిపోతున్నాయి. ఒకరోజున కపోత దంపతులు అడవికి మేతకు వెళ్ళిన సమయంలో ఒక బోయవాడు వచ్చి ఆ చెట్లు క్రింద నూకలు జల్లి వలపన్ని దగ్గరలో వున్న పొదలో దాగి కూర్చున్నాడు. పాపం అప్పుడప్పుడే రెక్కలు వస్తున్న పిల్ల పావురాళ్ళు ఆ కొమ్మా ఈ కొమ్మమీద దూకుతూ చెట్టు క్రింద ఆ వలలో చిక్కుకున్నాయి. అదే సమయానికి కపోత దంపతులు వచ్చి ఆ సంఘటన చూచి భోరున విలపించాయి. కన్న తీపిని వదులుకోలేక ఆడ పావురం పిల్లల్ని రక్షించుకుందామని వచ్చి తామ వలలో చిక్కుకుంది. భార్యాపిల్లలు వలలో చిక్కుకుని విలపిస్తుంటే మగపావురం భరించలేక వీళ్ళులేకపోయాక నా జీవితమెందుకు అని తానుకూడా వలలోకి చిక్కుకుంది. పొద నుండి వచ్చిన బోయవాడు రెండు రోజులకి సరిపోయే ఆహారం దొరికిందని సంబరపడుతూ అన్నింటిని వలలో గట్టిగా బంధించి భుజాన వేసుకొని చక్కగా పోయాడు. యదు మహారాజా! కుటుంబీకుడైన వాడికి వుండే అనురాగాలు, మోహాలు, ఎలా బంధనాలు అవుతాయో, ఆత్మ వినాశమునకు ఎలా దారితీస్తాయో, ఈ కపోత దంపతుల ద్వారా నేర్చుకున్నాను. ముక్తి ద్వారం లాంటి మానవ జన్మను పొంది గృహలంపటుడు అయ్యేవాడు మూర్ఖుడుకాక మరి ఏమిటి అతి స్నేహం పనికిరాదని నేర్చుకున్నాను కపోతాల ద్వారా.


అజగరము : అజగరమంటే మహాసర్పం (కొండచిలువ) కదలదూ మెదలదు. ఆహారం కోసమైనా ఏ ప్రయత్నమూ చెయ్యదు. అప్రయత్నంగా లభిస్తే తింటుంది. లేకపోతే పస్తులుంటుంది. ఇలాగే మనమూను. దైవికంగా ప్రాప్తమయ్యే సుఖ దుఃఖాలను అనుభవించడమే తప్ప వాటికోసం కర్మాచరణ చెయ్యడం మానుకోవాలి. నిద్రహారాలను పరిత్యజించి ఆత్మనిష్టను అలవరచుకోవాలి. ఇది నేర్పింది కాబట్టి అజగరం నాకు మరో గురువు.


సముద్రం : తనలాగ గాంభీర్యం అలవరచుకోమని ప్రభోదించింది సముద్రం. దానిలోతు ఎవడికైనా తెలుసా? దాన్ని దాటగలవాడు ఉన్నాడా? ఎన్ని నదులు వచ్చి చేరినా ఉప్పొంగుతుందా? సూర్య కిరణాలకు ఎంత నీరు ఆవిరి అవుతూన్న దిగులుపడి కృశిస్తోందా? తనలో ఏవస్తువులూ ఏ జంతువులూ ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో తెలియనిస్తోందా? దీనికి గట్టులూ అవధులు ఉన్నాయా? ఆత్మనిష్టుడు ఈ గాంభీర్యాన్ని అలవరచుకోవాలి.


Friday 20 January 2023

శ్రీదత్త పురాణము (25)



అగ్ని : అగ్ని మహాతేజశ్వి, సర్వభక్షకుడు అయినా సర్వదా పవిత్రుడు. అందరికీ ఆరాధ్యుడు. ఈ లక్షణాలు యోగి అగ్ని నుండి గ్రహించాలి. అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపంలో మాత్రమే వుంటాడు. పరమాత్మ కూడా ఏ జీవిలో వుంటే ఆ రూపం ధరిస్తాడని గ్రహించాను అగ్ని నుండి. అగ్ని వున్నప్పటికీ ఒక్కోసారి కంటికి కనిపించదు. అలాగ జీవికి జన్మాది వికారాలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగున పడివుంటాయి.


ఇవీ నాకు పంచభూతాలు ఉపదేశించిన బోధ, నేను గ్రహించిన తత్వం.


చంద్రుడు : చంద్రుడు వృద్ధి, క్షయములకు లోనవుతూవుంటాడు. అవి అతడి కళలే గాని అతని పూర్ణరూపంగాదు. అలాగే షడ్భావ వికారములు శరీరమునకే కాని ఆత్మకు కాదని తెలుసుకున్నాను చంద్రునివల్ల. 


సూర్యుడు : సూర్యుడు ఒక్కడే అయినా అనేక జలాశయాల్లో కనిపించి అనేకానేక ప్రతిబింబములుగా కన్పిస్తాడు. అంటే ఆత్మ ఒక్కటే అయినా అనేకంగా కన్పిస్తుంది అని గ్రహించాను. అంతేకాక సూర్యుడు శుభ్ర, అశుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా విరాజిల్లుతునే వుంటాడు. అన్నిరకాల జలాలను స్వీకరిస్తాడు. పరిశుభ్రపరిచి వర్షములుగా కురిపిస్తూ వుంటాడు. కానీ అతడి చేతులకి మలినం అంటదు. సూర్యుడు నిత్య పరిశుభ్రుడు. యోగి కూడా ఇలాగే ఇంద్రియాదులతో సుఖదుఃఖాదులన్నింటిని సమదృష్టితో చూడాలని వాటికి అతీతుడుగా నిత్యశుద్ధుడుగా వుండాలని తెలుసుకున్నాను సూర్యుడు నుండి.


యయాతినందనా! తక్కిన పదిహేడుమంది గురించి చెబుతాను తెలుసుకో. ముందుగా కపోతం గురించి విను.


Thursday 19 January 2023

శ్రీదత్త పురాణము (24)



అప్పుడు అవధూత ఇలా చెప్తున్నాడు.


యదుమహారాజా నాకు ఇరవై నాలుగు మంది గురువులు. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కోణంలో పొందాను. జీవన్ముక్తుడవై సంచరించుచున్నాను. పంచభూతాలు, సూర్యచంద్రులు, అజగర కపోతములు, సముద్రపతంగాలుగా, మధుకరగజాలు, మధుహారి హరిణములు, మినపింగళలు, కురర బాకులు, కన్యకాశరకారులు, పర్పకీటక ఊర్ణనాభాలు - ఇవీ నా ఇరవైనాలుగు గురువులు


పృధివీవాయురాకాశమాపోః గ్నిశ్చంద్రమారవిః | 

కపోతోంజగరః సింధుః పతంగో మధుకృత్ గజః ||

మధుహా హరిగోమినః పింగళు కురరోకార్చకః |

కుమారీ శరకృత్ సర్పడిన్దనాభిః సుపేశకృత్ ||


భూమి : మానవులు కాళ్ళతో త్రొక్కినా గునపములు తీసికొని త్రవ్వినా భూమి ఓర్చుకుంటుంది. అంతేకాక వారికి కావలసిన ఆహారం పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది. సహనాన్ని భూమి ద్వారా గ్రహించాను. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం భూమి నుండి నేర్చుకున్నాను.


వాయువు : అలాగే మన శరీరంలో వుండేది ప్రాణవాయువు. మనం తినే ఆహారాన్ని గ్రహిస్తుంది కాని విషయవాంఛలకు అతీతంగా వుంటుంది. ఉత్తమజ్ఞాని కూడా ఇలావుండాలి. జ్ఞానానికి దేహం, దేహమునకు ప్రాణం, ప్రాణమునకు ఆహారం అత్యవసరం. ఇక శరీరమునకు వెలుపల సంచరించే గాలి శీతోష్ణ దుఃఖములను సమముగా చూస్తుంది. రకరకాల దుర్గంధాలను, సుగంధాలను సమంగా గ్రహిస్తుంది. అయినా గంధ గుణం వాయువుకు లేదు. యోగి అయినవాడు ఈ రెండు గుణాలను వాయువు నుండి నేర్చుకోవాలి. పంచభూతాత్మక శరీరంలోకి ప్రవేశించినా ఆ గుణాలు అంటకుండా చూసుకోవాలి. దీన్నే నిర్దేపత్వం అంటారు. దీన్ని గ్రహించాను వాయువు నుండి.


ఆకాశం : ఆకాశం నుండి సర్వవ్యాపకత్వము, సర్వ బ్రహ్మతత్వం, అభంగత్వము అసంగత్వము గ్రహించాను.


జలం : జలం నుండి నిర్మలత్వం, స్నిగ్ధత్వము, మధురత్వం, పావనత్వం నేర్చుకున్నాను. ఇవి గ్రహించిన యోగులు తమని తల్చుకున్న వార్ని పావనం చెయ్యగలుగుతారు.


Wednesday 18 January 2023

శ్రీదత్త పురాణము (23)



నాయనా దీపకా, దీనిని నీవు అనుసంధానం చేసుకోవడంలో పొరపాటు బడుతున్నావు. మొట్ట మొదటే చెప్పాను కదా దత్తుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తువుంటాడని అదీ గాక బ్రహ్మనారదునికి చెప్పిన విషయం గుర్తుచేసుకో తన పాద పద్మాలను సేవించిన యదు, కార్తవీర్య, ప్రహ్లాద, అలర్కులను దత్తదేవుడు ఆత్మ విద్య భోదించాడని బ్రహ్మదేవుడు చెప్ప లేదూ! వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకే తెలుస్తుంది. ఆ వరుసలోనే యదువుకి దత్తుడు తత్వం ఉపదేశించిన వృత్తాంతం ఇప్పుడు చెపుతాను ఆలకించు అంటూ వేదధర్ముడు మళ్ళీ ఇలా చెప్పుతున్నాడు.


అవధూత యదుమహారాజు సంవాదం


నాయనా దీపకా ఒకప్పుడు ఉద్దవుడు శ్రీ కృష్ణభగవానునికి నమస్కరించి దయచేసి ఆత్మతత్వం భోదించమని అడిగాడు. అప్పుడు వాసుదేవుడు ఉద్దవునితో ఇలా అన్నాడు. ఉద్ధవా ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారా? ఎవరి మటుకు వారు తెలుసుకోవాలి. మానవులు మంచి చెడ్డ విచక్షణా జ్ఞానం కలవారు. తమని తామే ఉద్ధరించుకోవాలి. ఆత్మకు గురువు ఆత్మయే. అందుకనే సాంఖ్యులు మానవశరీరంలోనే సర్వజ్ఞుడైన పరమాత్మను దర్శిస్తూవుంటారు. సృష్టిలో ఆపాద, ద్విపాద, త్రిపాద, చతుష్పాద, బహుపాద జీవరాసులు వున్నాయి. వీటిలో పురుష శరీరం అంటేనే నాకిష్టం. ఎందుకంటే ఆ శరీరంలోనే సాధకులు నన్ను అన్వేషించి తెలుసుకుంటున్నారు. అందుచేత మానవ శరీరం అంటేనే నాకు ప్రీతి. ఇందులో నివసించే మనో, బుద్ధి, చిత్త, అహంకారములు జడ పదార్ధములు. వాటిని ప్రకాశింపజేసి చైతన్యం తెస్తున్న శక్తి సంపన్నుడు ఒకడెవడో వుండాలి. అందుచేత వెతుకుదాం అని సాధకులు ప్రయత్నించి సాధనతో నన్ను తెలుసుకుంటున్నారు. బుద్ధ్యాధులు సాధనములు కనుక వీటికి సాధ్యుడు వుండాలి అని అనుమాన ప్రమాణంతో నన్ను అన్వేషిస్తున్నారు. కనుక మానవ శరీరం అంటేనే నాకు చాలా ఇష్టం. ఇందులో వున్న ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే కొంతవరకు అవధూత - యదువు సంవాదం గురించి చెబుతాను ఆలకించు. యదువు తెలుసుకదా యయాతిపుత్రుడు మహాతపశ్శాలి, ధర్మజ్ఞుడు. ఒకరోజు ఒక అవధూతను దర్శించి నమస్కరించి ఇలా అడిగాడు.


మహానుభావా ! నీవు సుందరుడవు, కవీశ్వరుడవు, సత్యసంధుడవు, మహాజ్ఞానివి, అయినా జడుడులా ఉన్మత్తుడిగా పంచరిస్తున్నావు ఎందుకని ? యింద్రియతృప్తి కోసం నీవు ఏ పనీ చేయటంలేదు. ఈ వివేకం నీకు ఎలా కలిగింది ? పండితుడవయ్యుండి బాలుడిగా ప్రవర్తిస్తున్నావు ఎందుకని ? సాధారణంగా మానవులు పడే ఏ తాపత్రయమూ నువ్వు పడ్తున్నట్లుగాలేదు. సిరిసంపదలు వృద్ధి చేసుకోవాలని నీవు రవ్వంతయినా ప్రయత్నం చేయటంలేదు. ఇది చాలా వింతగా వుంది. అందరికన్నా భిన్నంగా వుంది నీ తీరు. గంగానదిలో మునిగిన ఏనుగులా ఎక్కడో వుంటున్నావు. ఒంటరిగా గడుపుతున్నావు. ఎవరి జోలికి పోవటంలేదు. ఏ స్పర్శలు నీకు అంటటం లేదు. అయినా ఎప్పుడూ ఆనందంగా కన్పిస్తున్నావు. నీకిది ఎలా సాధ్యమయ్యింది ? దయజేసి ఇది తెలియజెప్పి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడ్డాడు.

Tuesday 17 January 2023

శ్రీదత్త పురాణము (22)



ప్రహ్లాదా ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి మరియు అజగరం ఒకటి నాకు గురువులు. ఎలాగంటే చెబుతాను విను. తేనెటీగలు అష్టకష్టాలుపడి తేనెను సమకూరుస్తాయి పట్టులో. లోభంతో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి పొగపెట్టి ఆ తేనేటీగల్ని చంపి పారద్రోలి ఆ తేనె కాస్తా అపహరించుకుపోతాడు. తేనెటీగలకు మిగిలింది ఏమిటి చెప్పు. అలాగే మానవులు ధనం కూడబెడతారు. చివరకు దాని వలనే నశిస్తారు. అందువల్ల తేనెటీగల్ని చూచి వైరాగ్యం నేర్చుకొన్నాను. ఇంకొకటి మహాసర్పం (కొండ చిలువ) వుంది చూచావా అది కదలదు మెదలదు అందుబాటులో ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తనకై తను సొంతంగా ప్రయత్నం చేయదు. ఏ తిండీ దొరక్కపోతే హాయిగా కడుపులో కాళ్ళుపెట్టుకుని పడి వుంటుంది. ఎన్నాళ్ళయినా ఈ అజగరము ఇలాగే పస్తులుంటుంది. ఈ అజగరాన్ని చూచి సంతుష్టిని నేర్చుకొన్నాను. లేదని ఎవరిని అడగను. రాదని దుఃఖపడను. ఎవరు పిలిచినా ఆ అనను. ఏది ఇచ్చినా వద్దు అనను. నాకు సుఖము లేదు దుఃఖము లేదు. విలువైన పట్టుబట్టలు కట్టినా, గుడ్డపీలకలే ధరించినా, అసలు ధరించకపోయినా నా మనస్సుకి తేడా లేదు. పల్లకీ ప్రయాణాలు, కాలినడకలు నాకు ఒక్కటే. కర్పూరచందనములు రాసుకున్నా దుమ్ముధూళిలో వున్నా నాకు ఒక్కటే. హంసతూలికా తల్పాల మీద పడుకున్నా పట్టు పరుపులపై వున్నా, బండరాతిపై వున్నా, అవమానించినా, ఇచ్చినది తీపిదైనా చేదుదైనా ఒకేలాగ ఆదరిస్తాను. సగుణమైనా నిర్గుణమైనా, అధికమైనా అల్పమైనా నాకు ఒక్కటే. నాది సర్వసమదృష్టి, దీని వల్ల సుఖదుఃఖాల భేదాన్ని చిత్తవృత్తిలో అయింపజెయ్యగలిగాను. చిత్తవృత్తిని మనస్సులో, మనస్సు అహంకారములో, అహంకారాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపజేసాను. స్వానుభవంతో ఆత్మస్థితిలో ఏకనిష్ఠలో వుంటున్నాను.


ప్రహ్లాదా! నీవు యోగ్యుడవు కనుక అతిగుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేశాను. ఇది చాలా మందికి లోక విరోధంగా శాస్త్రనిర్ధుంగా కనిపిస్తుంది. కానీ నీవు అర్ధం చేసుకోగలవు. ఆ సామర్థ్యం నీకువుంది, అని గ్రహించాను. కనుక చెప్పాను అని ముగించాడు. ఆ అజగర ప్రవృత్తిలోవున్న మహర్షి. ప్రహ్లాదుడు అమితానందంలో ఆ మహానుభావున్ని సేవించి అర్చించి పూజించి సంపూర్ణ అనుగ్రహం పొంది వీడ్కోలు తీసుకొన్నాడు.


ధర్మరాజా ప్రహ్లాద, అజగరుల వృత్తాతం విన్నావు కదా దీనిలో అంతర్యం నీవు గ్రహించు అంటూ ముగించాడు నారదుడు. నాయనా దీపకా! విన్నావు కదా! యోగ విద్యా విశారదుడు అయిన దత్త యోగి యొక్క సిద్ధావస్థ ఇది అని వేదదర్ముడు చెప్పాడు. దీపకుడు ఆశ్చర్యంలో గురుదేవా చాలా శ్రద్ధగా విన్నాను. ఈ కధలో దత్తదేవుని ప్రస్తావన ఎక్కడా మీరు చెప్పలేదు. మరి మీరు ఇది దత్తుని సిద్ధావస్థ అంటున్నారు. ఇదేమిటో నాకు అర్ధం కాలేదు. వివరించండి అని దీపకుడు సవినయంగా వేడుకున్నాడు.

Monday 16 January 2023

శ్రీదత్త పురాణము (21)



మహానుభావా! ఏమిటి మీరు ఇలా నేలపై పడి వున్నారు. శరీరం అంతా దుమ్ముతో కప్పిపోయి వుంది. అంటే మీరు చాలాకాలంగా ఇలా నిశ్చేష్టులై వున్నారన్నమాట ఇది ఏమైనా వ్రతమా, నియమమా? చాలా చిత్రంగా వుంది. లోకంలో ఏ ప్రయత్నము చేయకుండా మనిషికి ధనం లభించదు. ధనం లేకపోతే భోగాలు లేవు. అవి లేకపోతే శరీరం సముజ్వలంగా నిలచియుండదు. ఇవన్నీ వదలి మీరిలా రోజుల తరబడి నేల మీద పడి నిద్రపోతున్నారు. అయినా మీ దేహం సముజ్వలంగా ప్రకాశిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరం. దయచేసి మీ వింత పద్ధతికి కారణమేమిటో తెలియచెప్పండి. ఎందుకిలా పడి వున్నారో చెప్పండి అన్నాడు.


ప్రహ్లాదా! నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా? నీవు శ్రీవారిని మెప్పించిన భక్తుడవు, తత్వవేత్తలలో అగ్రగణ్యుడవు. సత్ప్రవర్తనములో నీకు నీవే సాటి. ప్రవృత్తి నివృత్తి ఫలములను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలవాడివి. అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయటం నాకు ఆశ్చర్యంగా వుంది. అయినా అడిగావు కాబట్టి చెప్పుతాను దీని వల్ల నీకూ నాకూ ఆత్మశుద్ధి కలుగుతుంది ఆలకించు.


కర్మలు ఆచరిస్తూ వాటి వల్ల కలిగే జన్మల ఫలాలు చూస్తూ ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగిపోయాను. ఇప్పుడు మానవజన్మ ఎత్తాను. ఇది స్వర్గమోక్షాలకు ద్వారసీను. ఇక్కడ పాపకర్మలు ఆచరిస్తే జంతుజన్మ లభిస్తుంది. పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవటానికి, సుఖాలు పొందటానికి మనుజులు ఏవేవో కర్మలు చేస్తుంటారు. వాటితో లభించే అనుకూల వ్యతిరేక ఫలాలను పొందుతూ వుంటారు. అసలు ఫలానుభవమే వద్దని అనుకున్నవాడు అసలు కర్మలని ఆచరించవలసిన పని ఏముంది. సుఖం ఆత్మస్వరూపం. భోగాలు అనేవి కల్పితములు, ఆశాశ్వతములు. ఈ జ్ఞానం కలిగిన తరువాత నేను ఇంక కర్మలు ఎందుకు ఆచరించాలి. అందువలన నిశ్చేష్టుడనై, నిష్ప్రయత్నుడనై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ద ఫలములను అనుభవిస్తూ ఇక్కడ పరుండి నిద్రిస్తున్నాను. ఈ రహస్యం తెలుసుకోలేనివాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడిన సరోవరంలా ఉన్న సుఖరూప పురుషార్ధాన్ని అందుకోలేక దాహార్తుడై ఎండమావుల వెంట పరుగెత్తుతున్న వానివలె వున్నాడు. కర్మాచరణ వలలో చిక్కి జన్మపరంపరల వలయంలో సుడిగుండంలో తిరుగుతూ వున్నాడు. మోహం యొక్క మహిమ అటువంటిది.


ప్రహ్లాదా! ధనం వల్ల సుఖం కలుగుతుంది అన్నావు గదా అది వట్టి భ్రమ మాత్రమే. దుఃఖమే తప్ప దాని వల్ల సుఖం లేదు. సంపాదనలో దుఃఖం, దాన్ని కాపాడుకోవటంలో దుఃఖం. రాజ, చోర, శత్రు, పుత్ర, మిత్ర, కళత్ర యాచకాదులు అపహరించుకు పోతారేమోనన్న దుఃఖం అనుక్షణమూ భయపడటమే. ధనికులకు నిద్రాహారములు వుండవు. పైగా ఎవరైన ఏ రకంగానైనా ఏ మూల నున్డైనా వచ్చి అపహరిస్తారేమోనని నిరంతరం భయపడుతూ వుంటారు. పైగా దీనికి తోడు వీరికి పక్కనే వుంటుంది అరిషడ్వర్గం సంతానంగా. అంచేత ధనం మీద, దాని మూలమైన భోగముల మీద అనురాగాన్ని వదలివెయ్యటం ఉత్తమం.


Sunday 15 January 2023

శ్రీదత్త పురాణము (20)



అత్రి మునీంద్రా! నీ సంకల్పం గొప్పది. తపస్సు గొప్పది. నిరాకారము, నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించినా సాకారులమూ సగుణలమూ అయి మేము ముగ్గురము ధ్యానించిన నువ్వు త్రిగుణాత్మకుడవు కనుక ఇలా దర్శనమిచ్చాము. నీ కోరిక నెరవేరుతుంది. మా అంశలతో నీకు ముగ్గురు కుమారులు జన్మిస్తారు. దివ్యతేజస్వులై జగతిలో ప్రకాశిస్తారు. నీ యశస్సులు దశదిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి. తీవ్ర తపస్సును విరమించు. శుభం కల్గుతుంది అని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. 


అటుపైన బ్రహ్మాంశ వల్ల చంద్రుడు, విష్ణాంశ వల్ల దత్తుడు, శివాంశ వల్ల దూర్వాసుడు, అనసూయాత్రి దంపతులకు జన్మించారు. ఇది మైత్రేయుడు విదురునకు చెప్పిన దత్త జన్మవృత్తాంతం. నాయనా దీపకా దత్త జన్మ వృత్తాంతం విన్నావు గదా! ఇక దత్తదేవుని యొక్క యోగ విద్య తెలియచెప్తాను శ్రద్ధగా విను అన్నాడు వేదధర్ముడు.


బ్రహ్మర్షి వారదుడు ముల్లోకాలలో తిరుగుతూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు. ధర్మరాజు ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి రాజమందిరంలోనికి తీసుకువచ్చాడు. తన సోదరులు నలుగురిని సమావేశపరచాడు. ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. అందరూ నారదునకు నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలయ్యాయి. ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైన వృత్తాంతం చెప్పమని ధర్మప్రబోధం చేయమని అభ్యర్థించాడు. అన్ని ధర్మప్రభోదాలు తెలిసిన నీకు భగవానుడైన శ్రీకృష్ణుడే అండగా ఉండగా చెప్పవలసినవి ఏమున్నాయి. అయినా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతం చెప్తాను. పూర్వం ప్రహ్లాదుడు అడిగితే ఆజగరుడు చెప్పిన విశేషాలు ఉన్నాయి. అవి చెబుతాను వినండి అని చెప్పటం మొదలు పెట్టాడు.


ప్రహ్లాదుడు - అజగరుడు సంవాదం


లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధుసజ్జన బృందంతో బయలుదేరాడు. భూగోళం అంతా సంచరిస్తూ వింతలూ విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వతప్రాంతం చేరుకున్నారు. అక్కడ కావేరీ నదిలో స్నానసంధ్యలు గావించి నదీతీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంతదూరాన నేల మీద పడుకొని ఉన్న ఒక మహర్షిని చూచారు. ఆ మహర్షి శరీరం దుమ్ముకొట్టుకునిపోయి వుంది. కాని శరీరం నుంచి దివ్యతపః కిరణములు పెల్లుబుకుతున్నాయి. ఎవరీ మహర్షి? ఎందుకు ఇలా నేల మీద పడివున్నాడు. ఉలుకు పలుకూ లేదు. కదలిక మెదలికాలేవు. సమీపంలో ఆశ్రమంకానీ కుటీరంగాని లేదు. ఇది ఏమైనావ్రతమా? నియమమా? లేదా ఇంకేదైనా వుందా? తెలుసుకుందామని ఆ మహర్షి పాదముల చెంత కూర్చున్నాడు. పాదములకు శిరస్సు ఆన్చి నమస్కరించాడు. మృదువుగా ఆ పాదములను తన ఒడిలోకి తీసుకుని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావా! అని భయం భయంగా పలకరించాడు. ఆయన మెల్ల మెల్లగా కన్నులు తెరిచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లు చూచాడు. ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకుని ఇలా అడిగాడు.


Saturday 14 January 2023

శ్రీదత్త పురాణము (19)

 


విదుర మైత్రేయ సంభాషణ


శౌనకాది మునులారా వింటున్నారు కదా ! మీకు కలిగిన సందేహాలే విదురుడికి వచ్చాయి. మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆయన చెబుతున్నట్టుగా బ్రహ్మ కలికి చెప్తున్నాడు. ఇవి విన్నవారిని చెప్పిన వారిని ముక్తుల్ని చేసే దత్త లీలలు. ఇవి అతి పురాతన గాధలు. దీపక వేదధర్ముల సంభాషణగా చెబుతాను వినండి, అన్నాడు సూతుడు.


స్వయంభువ మనువుకి ఇల్లాలు శతరూప. ఆ దంపతులకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు జన్మించారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, కొడుకుల పేర్లు, ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనేవి కూతుళ్ళు పేర్లు. వీరిలో ఆకూతిని ఋచి మహర్షికి, దేవహుతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహాలు చేసారు. వీరిలో దేవహుతికి తొమ్మిది నుంది అమ్మాయిలు, ఒక అబ్బాయి జన్మించారు. అబ్బాయి పేరు కపిలుడు. వాసుదేవుడే కపిలుడుగా జన్మించాడు. తొమ్మిది మంది కన్యలు సౌందర్యరాశులు. బ్రహ్మపుత్రులు తొమ్మిదిమంది వీరిని వివాహం చేసుకొన్నారు. అనసూయను అత్రి, అరుంధతిని వశిష్టుడు, శాంతిని అధర్వుడు, కళను మరీచి, శ్రద్ధను అంగీరసుడు, హవిర్భువను పులస్త్యుడు, గతిని పులహుడు, క్రియను క్రతుడు, ఖ్యాతిని భృగువు వివాహం చేసుకున్నారు. వీరిలో అనసూయాత్రికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు వరుసగా చంద్ర, దత్త, దుర్వాసులుగా జన్మించారు. సృష్టి, స్థితి, లయ కారకులు ఇలా జన్మించటానికి బలమైన కారణం ఉంది. చెప్తాను వినమని మైత్రేయుడు చెప్తున్నాడు. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు.


విదురా! ఒకానొక కల్పారంభము నందు చతుర్ముఖుడు పునఃసృష్టి చేయబోతు అత్రి మహర్షి సహాయం అడిగాడు. అంగీకరించటం కోసం అనసూయాసహితుడై ఋక్షాద్రి పర్వతం మీద తపస్సుకి కూర్చున్నాడు. యోగ పరిణితుడు కనుక నిరాహారుడై మనస్సును నిశ్చలపరచి వాయుభక్షణ చేస్తూ ఒంటికాలి మీద నిలబడి వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఎండలు, వానలు, ఏ ఋతువులు ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. నూరు సంవత్సరాలు గడిచేసరికి అత్రి శిరోభాగం నుంచి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. అవి ముల్లోకాలకు వ్యాపించాయి. దీన్ని గమనించిన త్రిమూర్తులు తమ తమ దేవేరులతో వాహనరూఢులై అష్టదికల్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వర ఋషీశ్వరులు వెంటరాగా, అత్రి ఎదుట నిలిచినారు. ఎట్టెదుట త్రిమూర్తులు సకల దేవతలు, సకల మునులు, అత్రికి కనిపించారు. వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుత్మంతునిపై లక్ష్మీనారాయణులు, హంస వాహనంపై వాణీ చతుర్ముఖులు, తమ తమ దివ్యాయుధాలతో, దివ్యాభరణములతో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్నారు. ఇంద్రాది దిక్పాలకులు పరివేష్టించియున్నారు. ఋషులు మునులు వేదమంత్రాలతో త్రిమూర్తులను స్తుతిస్తున్నారు. అప్పుడు అత్రి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా పుత్రార్థినై, నేను ఒకే ఒక్క దివ్య మహస్సును ధ్యానిస్తున్నాను. మీరు ముగ్గురుగా దర్శనమిచ్చారు. మీకు ఇవే నా సాష్టాంగ నమస్కారములు అన్నాడు.


Friday 13 January 2023

శ్రీదత్త పురాణము (18)


నాయనా దత్తాత్రేయస్వామి వారు పరస్పర విరుద్ధరూపాలలో తిరుగుతుంటారు. భక్తులను కఠినంగా పరీక్షిస్తుంటారు. ఒక్కోసారి జటామండలధారిగా మరుక్షణంలో ముండిత శిరస్కుడుగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతాంబరుడుగా, పీతాంబరుడిగా, కనిపిస్తారు. ఒక్కోసారి మహా విద్వాంసుడిగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడిగా, మదమత్తుడిగా, కనిపిస్తారు. ఒకోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. ఒకోసారి మహైశ్వర్య సంపన్నుడిగా కనిపిస్తారు. నిజమైన రూపం ఏది అనేది ఎవ్వరికీ తెలియదు. అంతుపట్టని రహస్యం, హర, హరి, హిరణ్యగర్భులుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడవుతాడు. గంగలో స్నానం చేసి, కొల్హాపురిలో బిక్షచేసి, సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటారు.


త్రికరణశుద్ధిగా స్మరిస్తే భక్తులకు కనిపిస్తారు. స్మతృగామి అనేది ఈ స్వామికి గొప్ప బిరుదు. అంగన్యాస, కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానమున్నది. దీనినే దత్త కవచము అంటారు. భక్తుడు దత్తనామాలను జపిస్తూ, శిరస్సు మొదలుకొని, కాలివేళ్ళ కొసల వరకు, ఒక్కొక్క అంగాన్ని తాకాలి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలలో, మనోబుద్ధి చిత్త అహంకారాలలో దత్తనామాలను విక్షేపించాలి. దత్త కవచధారులకు ఏ రంగములోను ఆపజయముండదు. శతృభయాలు, దుష్టపీడలు, గ్రహబాధలు, భూతప్రేత పిశాచాల హింసలు దరిదాపులకు కూడా రావు. భక్త రక్షణలో ఇది వజ్రకవచం. దీనితోపాటు దత్త మంత్రాన్ని సద్గురువు ద్వారా ఉపదేశం పొందితే చెప్పదగింది ఏమిలేదు. దత్తమంత్ర దీక్షను పొందిన వారికి చతుర్విధ పురుషార్ధాలు లభించినట్లే. ఇంతగా జపించలేనివారు దత్త నామాన్ని రోజుకు కనీసం 10 సార్లయినా స్మరించాలి.


స్మరించే ముందు దత్త స్వామిని హృదయంలో నిలుపుకోవాలి. పీతాంబరధారి, భస్మోద్ధూళిత దేవుడు, సువర్ణవర్ణుడు, విద్యుత్కాంతి కల్గిన జడలు కలవాడుగా దత్తస్వామిని ధ్యానించి నమస్కరించాలి.


నాయనా దీపకా దత్తస్వామి అవతారగాధ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు. అత్రిపుత్రుడు కనుక, ఆత్రేయుడు. అనసూయాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంతతానుగా దత్తమయ్యాడు. కనుకనే దత్తాత్రేయుడయ్యాడు. తన భక్తులైన యదు, కార్తవీర్యార్జున, ప్రహ్లాద, అలర్కుడు, వీరికి బ్రహ్మఙ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేసాడు. ఈ దత్త లీలలన్నీ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఆ వివరాలు చెప్తాను శ్రద్ధగా విను.


Thursday 12 January 2023

శ్రీదత్త పురాణము (17)



వేద ధర్ముడు చెప్పిన దత్త చరిత్ర


దీపకా నీ సంస్కారం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. దత్త చరిత్రము వినాలని కోరిక కలగడం గొప్ప విశేషం తప్పకుండా చెప్తాను. ఈ రూపంగా ఆ దత్తదేవున్ని స్మరించుకొనే భాగ్యం నాకు కల్గించావు. ఈ సద్గురు దేవుని యొక్క కథ అత్యద్భుతం. చెప్పినవారు, విన్నవారు ధన్యులవుతారు. సర్వపాపాలు నశిస్తాయి. సర్వమంగళాలు లభిస్తాయి. కానీ ఆయన లీలలు అన్నీ చెప్పడం ఎవ్వరి తరమూ కాదు, ఆ పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహించిన మేరకు రూపాలు, నామాలు, మహిమలు, భక్తుల గాథలు, అన్నీ చెప్తాను ముందుగా అష్టోత్తర శతనామావళితో దత్తాత్రేయుణ్ని మన మనోమందిరములలో పూజిద్దాం. నమస్కార ప్రియుడు స్వామి, స్మరణ మాత్ర సంతుష్టుడు స్వామి. ఓం శ్రీం హ్రీం ద్రాం బీజంతో చివరిగా దత్త నామాన్ని ఉచ్చరించి నమః అని అంటే చాలు. స్వామి సంబరపడి కరుణామృత వృష్టి కురిపిస్తాడు.


ఓం శ్రీం హ్రీం దత్తాయనమః, ఓం దేవదత్తాయనమః, ఓం బ్రహ్మదత్తాయనమః, ఓం విష్ణుదత్తాయనమః, ఓం శివదత్తాయనమః, ఓం అత్రి దత్తాయనమః, ఓం ఆత్రేయాయనమః, ఓం అత్రివరదాయనమః, ఓం అనసూయాయనమః, ఓం అనసూయ సూనవేనమః, ఓం అవధూతాయనమః, ఓం ధర్మాయనమః, ఓం ధర్మపరాయణాయనమః, ఓం ధర్మపతయేనమః, ఓం సిద్ధాయనమః, ఓం సిద్ధిదాయననుః, ఓం సిద్ధి పతయేనమః, ఓం సిద్ధిసేవితాయనమః, ఓం గురవేనమః, ఓం గురుగమ్యాయనమః, ఓం గురోర్గురుతరాయనమః, ఓం గరిష్టాయనమః, ఓం వరిష్ఠాయనమః, ఓం మహిష్టాయనమః, ఓం మహాత్మనేనమః (25), ఓం యోగాయనమః, ఓం యోగపతయేననుః, ఓం యోగీశాయనమః, ఓం యోగాధీశాయనమః, ఓం యోగపరాయణాయననుః, ఓం యోగిధ్యేయాంధ్రి పంకజాయనమః, ఓం దిగంబరాయనమః, ఓం దివ్యాంబరాయనమః, ఓం పీతాంబరాయ నమః, ఓం శ్వేతాంబరాయ నమః, ఓం చిత్రాంబరాయనమః, ఓం బాలాయనమః, ఓం బాలవీర్యాయనముః, ఓం కుమారాయనమః, ఓం కిశోరాయనమః, ఓం కందర్ప మోహనాయనమః, ఓం అర్ధాంగలింగితాంగనాయనమః, ఓం సురాగాయనమః, ఓం విరాగాయనమః, ఓం వీతరాగాయనమః, ఓం అమృతవర్షిణేనమః, ఓం ఉగ్రాయనమః, ఓం అనుగ్రహరూపాయనమః (50), ఓం స్థవిరాయనమః, ఓం స్థవీయసేనమః, ఓం ఊర్ధ్వరేతసేనమః, ఓం ఏకవక్ర్తాయనమః, ఓం అనేక వక్ర్తాయనముః, ఓం ద్వినేత్రాయనమః, ఓం త్రినేత్రాయనమః, ఓం ద్విభుజాయనమః, ఓం షడ్భుజాయనమః, ఓం అక్షమాలినేనమః, ఓం శంఖినేనమః, ఓం గదినేనమః, ఓం మునయే నమః, ఓం మాలినే నమః, ఓం విరూపాయ నమః, ఓం స్వరూపాయ నమః, ఓం సహస్రశిరసేననుః, ఓం సహస్రాక్షాయనమః ఓం సహస్రబాహవేనమః (75), ఓం సహస్రాయుధాయనమః, ఓం సహస్రపాదాయనమః, ఓం సహస్ర పద్మార్చితాయనమః, ఓం పద్మపాదాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం పద్మమాలినే నమః, ఓం పద్మగర్భారుణాక్షాయనమః, ఓం పద్మకింజల్క వర్చసేనమః, ఓం జ్ఞానినేనమః ఓం జ్ఞాన గమ్యాయనమః, ఓం ధ్యాననిష్టాయనమః, ఓం ధ్యానస్థిమితమూర్తయేనమః, ఓం ధూళిధూసరితాంగాయనమః, ఓం చందనలిప్తమూర్తయేనమః, ఓం భస్మోద్ధూళితదేహాయనమః, ఓం దివ్యగంధానులేపినేనమః, ఓం ప్రసన్నాయనమః, ఓం ప్రమత్తాయనమః, ఓం ప్రకృష్టార్ధ ప్రదాయనమః, ఓం వరీయసేనమః, ఓం బ్రహ్మణేనమః, (100), ఓం బ్రహ్మరూపాయనమః, ఓం విష్ణవేనమః, ఓం విశ్వరూపిణే నమః, ఓం శంకరాయనమః, ఓం ఆత్మనేనమః, ఓం అంతరాత్మనేనమః ఓం పరమాత్మనేనమః (108) నాయనా దీపకా దత్త దయవల్ల నా దివ్య దృష్టికి గోచరించిన అష్టోత్తర శతనామావళి ఇది. స్వామి అనంతనామధేయుడు. అనంతరూపములు కలిగినవాడు. ఈ శతనామావళిని భక్తి శ్రద్ధలతో మూడు కాలాలలో జపించేవాడికి అష్ట అయిశ్వర్యములు లభిస్తాయి. ఆది వ్యాధులు తొలగుతాయి. కన్యలకు తగిన వరుడు లభిస్తాడు. ఇది సకల సిద్ధిప్రదం.


Wednesday 11 January 2023

శ్రీదత్త పురాణము (16)



కాశీకి వచ్చిన ఏ ప్రాణికోటినయినా తరింప చేస్తాడు విశ్వనాధుడు. ఈ భూగోళంలో కాశీని మించిన క్షేత్రం లేదు. విశ్వనాధున్ని మించిన దైవంలేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీ వాసము కొంగు బంగారం, మహా ప్రళయములో కూడా నశింపక నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశి. యమ నియమాలతో అంతరేంద్రియ బహిరింద్రియాలను బంధించి విశ్వనాధుని పాదాలను ఆశ్రయించిన వారు జీవన్ముక్తులవుతారు. కాశీలో నివశిస్తూ గంగానది, కాలభైరవుడు, దుండి విఘ్నేశ్వరుడు, దండపాణి, విశాలాక్షి, విశ్వనాధుడు, ఆరుగురిని సేవించే వారిని షడంగయోగులు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమ - నియమ - ప్రాణాయామ - ఆసన - ప్రత్యాహార - ధ్యాన - ధారణ - సమాధులను అవలంభించే, అష్టాంగ యోగులుకున్నా వీరు పుణ్యాత్ములు. కాబట్టి దీపకా మనం కాశీలోనే ఉండిపోదాం. 21 సంవత్సరములు, విసుగు విరామం లేకుండా, నిద్రహారాలకు దూరమై నాకు సేవలు చేసావు. నా అంతరంగము ఆనందమయమయ్యింది. సాక్షాత్తు విశ్వనాధుడు, నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నా నిశ్చల గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు. అలాంటి నీకు ఇవ్వదగింది చెప్పదగింది ఏమున్నది అని ఆనందంతో, సంతోషంతో పలికాడు వేదధర్ముడు.


దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి, కన్నీరు కారుస్తూ, మహాతపస్వి, బ్రహ్మతేజస్వీ అయిన మీ అనుగ్రహానికి పాత్రుడునయ్యాను నాకు అన్నీ లభించినట్లే. అణిమాది సిద్దులు - చతుర్విధ పురుషార్ధాలు మీ సేవతోనే దొరికాయి. నాకు మీ పాద సేవకన్నా ఇవి అన్నీ ఎక్కువ అనిపించడం లేదు. నిన్ను సేవించడం తప్ప ఇహపరాలలో నేను కోరదగింది ఏమీ లేదు. నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మరిక దేని జోలికి పోవడం లేదు. ఇది సత్యం. అయినా ప్రసన్నుడపై ఉన్నావు కనుక చాలా కాలంగా నా మనస్సుతో ఉండిపోయిన కోరిక ఒకటి ఉంది. ఇంతకు ముందు ఒకసారి అడిగితే తరువాత చూద్దాం అన్నారు. అప్పటి నుండి ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక దత్తాత్రేయుడి చరిత్రను మీ ముఖతః వినాలని నా కోరిక. గురుదేవ దత్తుడు ఎవరు ? ఎవరి అవతారం? ఆయన రూపం, ఆయన చరిత్ర, ఆయన మహిమ ఆయన్ను ఉపాసించవలసిన విధానం, ఉపాసించి తరించిన భక్తుల కథలు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఆయన దయలేనిదే యోగసిద్ధులు కలగవు అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకి అతీతుడు అంటారు. అనసూయ, అత్రి మహామునుల బిడ్డడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడంటారు. చిత్ర విచిత్రమయిన లీలలు చేస్తారు అంటారు. జ్ఞానము యొక్క పరిపూర్ణ రూపమే ఆయనంటారు. దయచేసి వీటిని వివరంగా తెలియచెప్తే, అదే వరంగా ఆనందిస్తాను. అన్నాడు దీపకుడు.

Tuesday 10 January 2023

శ్రీదత్త పురాణము (15)



శ్రీమన్నారాయణుడు కళ్ళల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి. నాయనా గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుంది. ఉదరపోషణకు అవసరమయిన లౌకిక విద్యలు నేర్పిన వాడు సాధారణ గురువు. ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతనికంటే ఘనుడు. వేదశాస్త్రాలను బోధించేవాడు అతనికంటే ఘనుడు. వేదార్ధ బోధకుడు అధికుడు. బ్రహ్మవిద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు. అతడు నాకు అభిన్నుడే. అరిషడ్వర్గాలలో చిక్కుకొని అల్లకల్లోలమవుతున్న శిష్యుని మనస్సుకు పురాణేతి శాస్త్రాల ప్రబోధంతో ఊరడింపు కలిగించి ధర్మపథంలో నడిపించే గురువే ప్రత్యక్షదైవం. అతన్ని మనోవాక్కాయ కర్మలతో సేవించడానికి మించిన పురుషార్ధం లేదు. అదియే భుక్తి, ముక్తి ప్రదం. ఈ తత్వం నీవు తెలుసుకొని గురుసేవలో ఉన్నావు. అందువల్లనే దర్శనం ఇచ్చాను. సద్గురువులను సేవించే సచ్చిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకలశుభాలు కలుగుగాక! అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు.


కుటీరంలోని వేదధర్మునకు మెలుకువ వచ్చింది. దీపకున్ని పిలిచి నాయనా దీపకా ఎవరు వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగిన వృత్తాంతం చెప్పాడు. వేదధర్ముడు ముఖంలో ఆనందం, కన్నుల్లో వాత్సల్యం తళుక్కున మెరిశాయి.


ధృడ చిత్తంతో, స్థిరసంకల్పంతో దీపకుడు సేవలు జేస్తు ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముని పాపాలు నశించాయి. కుష్టురోగము, అంధత్వము అన్నీ ఎవరో తీసివేసినట్టుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడిన అగ్నికణంలా ప్రకాశిస్తున్నాడు. దీపకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గురుదేవా అంటూ వేదధర్ముడు పాదాలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.


నాయనా దీపకా నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితాలయిన నా పాపకర్మలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే, నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవనిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి. ఇకనుంచి గురుశుశ్రూష విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటుంది లోకం. కాశీ విశ్వనాధుని దయవల్ల ప్రారబ్ధకర్మేకాదు మొత్తం భవసాగరాన్నే దాటాము.


Monday 9 January 2023

శ్రీదత్త పురాణము (14)



ఒకరోజు తెల్లవారుఝామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యధావిధిగా గురువువారి శరీరాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన గంగాజలాన్ని కడవకెత్తుకుని గురువుగారు లేచారేమోననుకొని వడివడిగా కుటీరంలోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీవిశ్వనాధుడు దర్శనమిచ్చాడు. నువ్వుచేస్తున్న గురుసేవకు ధర్మనిష్టకూ సంతసించాను ఏదైనా వరం కోరుకో అన్నాడు విశ్వనాధుడు. దీపకుడు సంభ్రమాశ్చర్యములతో సాష్టాంగపడి విశ్వనాధుని సేవించి స్తుతించాడు. బ్రహ్మర్షులకు కూడా దక్కని నీ దర్శన భాగ్యం దక్కింది, నాకు వరంకూడా ఇస్తానంటున్నావు. ఆనందపారవశ్యంలో వున్నాను. ఏమని అడగాలో కూడా తెలియడం లేదు. ఓ నిమిషం ఆగు కుటీరంలోకి వెళ్ళి గురువుగార్ని అడిగివస్తాను, అంటూ కుటీరంలోకి ప్రవేశించాడు. గురుదేవా ! శివుడు ప్రత్యక్షమైనాడు. వరం కూడా ఇస్తానంటున్నాడు. గురుశుశ్రూషకు సంతోషించాడట. మీరు అనుమతి ఇస్తే మీ కుష్టత్వము, అంధత్వము అన్నీ పోయేటట్లుగా వరం అడుగుతాను అడగమంటారా అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో నాయనా దీపకా శివుడంతటివాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగడానికి నీకు ఇంకేమీ దొరకలేదా ఐహిక విషయములా అడగవలసింది. పైగా నారోగం పాప ఫలం అనీ, అనుభవించడం తప్ప వేరొక గత్యంతరం లేదని ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు. 


వేదధర్ముడి మాటల్లో విసుగుని గుర్తించాడు దీపకుడు. కుటీరం వెలుపలికివచ్చి శివునికి నమస్కరించి అష్టమూర్తి నీ వాత్సల్యానికి ధన్యవాదములు. నిన్నిప్పుడు అడగదగింది నాకు ఏదీ కనిపించడంలేదు క్షమించు అన్నాడు. అదేమిటి నాయనా అడగదగిందే కన్పించడం లేదా మీ గురువు ఆరోగ్యం సరిచేయమని కోరవచ్చు కదా! అంటూ శివుడు ప్రోత్సహించాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటివరం అడిగేందుకు గురువు అనుమతిలేదు. సెలవు ఇప్పించు గురువు గార్కి సేవజేసుకోవాలి అని రివ్వున కుటీరంలోకి వెళ్ళి గురుసేవలో నిమగ్నమయ్యాడు. శివుడు అంతర్దానం చెంది తన ఆస్థానమంటపంలో ఆ సాయంకాలం కొలువు తీరి వుండగా సకల దేవతల సమక్షంలో అందరూ వింటూవుండగా శ్రీమన్నారాయణునితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడంటే దీపకుడే భవధ్వాంతనాశకుడు. నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు.


శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాడే దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపకా నీ గురుసేవా పరాయణత్వం నన్ను ఆనందపరవశుల్ని చేసింది. నీ యిష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు.


దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేసాడు. అనేకానేక స్తోత్రములతో స్తుతించాడు. నారాయణా! వాసుదేవా! గురుసేవ అనేది హరిహరులను ఇద్దరినీ ఇంతగా ఆనందపరుస్తుందని తెలియదు. నా ధర్మంగానే నేను సేవజేస్తున్నాను. దిక్పాలకులకైనా అనుగ్రహించని దివ్య దర్శనం నాకు ప్రాప్తింపజేసారు. ఇది మీ కరుణకి సంకేతం. నాకు గురువే దైవం, జపము, తపము, తీర్థము, క్షేత్రము సర్వస్వమూ నాకు గురువే. వేదశాస్త్రాలు బోధించి, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, పరతత్వాన్ని తెలియపరచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్షదైవం. అనన్య చిత్తంతో గురుసేవ చేస్తున్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలముంటే అది మోక్షమే తప్ప కోరదగింది ఏమీలేదు. అయినా కరుణామూర్తివై వచ్చి ఏదైనా కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యేట్టు అనుగ్రహం ప్రసాదించు. నాకు తెలియని గురుమహిను ఏమైనా ఉంటే చెప్పు. ఇదే నిన్ను కోరే వరం.


Sunday 8 January 2023

శ్రీదత్త పురాణము (13)



నాయనా దీపకా నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు కనుకనే నేను నిన్ను అడిగాను. కాని కాశిలో పాప ఫలాన్ని అనుసరించి నేను కుష్టు రోగపీడితున్ని కాబోతున్నాను. కుంటితనము, గ్రుడ్డితనము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఇరువది ఒక్క సంవత్సరముల పాటు అనుభవించవలసినవి. ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరములు సేవ చెయ్యాలి అన్నాడు. అప్పుడు దీపకుడు గురూత్తమా ! తప్పకుండా చేస్తాను. కాని నాదొక సందేహం ఆ పాపాన్ని మీరే అనుభవించాలా?


నాకు సంక్రమింప జేయండి అది నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు వేదధర్ముడు నాయనా ఎవరి పాపాలు వారు అనుభవించవలసినదే. పాప ఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యునకో, పుత్రునికో, లేదా ఇంకొకరికో పులముదామని అనుకొంటే అంటుకోవు కనుక నా పాప ఫలాలు నేను అనుభవిస్తాను.


అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు. కుష్టురోగికి సేవలు చేయడమంటే అది అనుభవించడంకన్నా కష్టం. దానికి నవ్వు అంగీకరించావు. పద వెంటనే కాశీకి చేరుకుందాం అని త్వరత్వరగా ఇద్దరూ మనోవేగంతో కాశి చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసారు. డుండి గణపతిని కాలభైరవుణ్ని అర్చించారు. అన్నపూర్ణ విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శించారు. ఉత్తర దిక్కుగా ఒక కంబలాశ్వతరు సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముప్పొద్దులా గంగాస్నానం, విశ్వనాధుని దర్శనం, చేసుకున్న తరువాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి. క్షణంలో కాళ్ళు చేతులు తిమ్మిరులెక్కాయి. పొక్కులు చితికి చీము, నెత్తురు కారసాగాయి. చూస్తూవుండగానే శరీరం అంతా పొడలుతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్ళు వంకరలు తిరిగాయి. కుష్టు తనము, కుంటి తనము, గ్రుడ్డి తనము ఒక్కసారిగా వేదధర్ముణ్ని ముంచెత్తాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. నిలబడలేక పోతున్నాడు, కూర్చో లేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అసలు కదలలేని స్థితి వచ్చింది. అన్నీ మంచంలోనే. భరించలేని దుర్వాసన, దీనికి తోడు కాశీలోని ఈగలన్నీ అతన్ని చుట్టు ముట్టాయి. రోగ బాధతో వికృతంగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా త్రిప్పి కనిపించని కన్నులతో దీపకా, దీపకా అని అరుస్తున్నాడు. దీపకుడు మాత్రం నిమిషం నీమారకుండా సకలసేవలూ చేస్తున్నాడు. పసి బిడ్డను కన్నతల్లిలా చూస్తున్నాడు. ఎంత దుర్గంధం అయినా ముఖం త్రిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు వున్న ప్రదేశాన్ని ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోలుతూ సేవచేస్తున్నాడు. గురువుగార్కి కొద్దిగా కునుకుపట్టిన సమయంలో గబాగబా నాలుగిళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తున్నాడు. కుష్టురోగికి కోపమెక్కువ అన్నారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ని తిట్టిపోస్తున్నాడు. ఈపాటి చెయ్యిలేనివాడివి ఎందుకొచ్చావని దెప్పిపొడుస్తున్నాడు. ఒకరకంగా కాదు, నానా దుర్భాషలు ఆడుతున్నాడు. మరుక్షణంలోనే మళ్ళీ సౌమ్యుడౌతున్నాడు. నాయనా దీపకా, తండ్రి దీపకా అని బుజ్జగిస్తున్నాడు. నిన్ను బాధపెడుతున్నానురా అని విలపిస్తున్నాడు. మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు. దీపకుడు మాత్రం అన్నింటికి ఓర్చుకుని చెరగని చిరునవ్వుతో, నిగ్రహంతో, సేవజేస్తున్నాడు. గురువులోనే విశ్వనాధున్ని, కాశీలోని దేవతలందర్ని గురువులోనే చూస్తూ సేవిస్తున్నాడు. తగినంత దొరక్క దొరికింది గురువుకీ సరిపోక పస్తులుంటూ సేవించుకొంటున్నాడు. ఏ నిమిషాన గురువు గారికి ఏ అవసరముంటుందోనని మంచం ప్రక్కనే వుండి రేయింబవళ్ళు మెలకువగా కూర్చుంటున్నాడు. కాశికి వచ్చింది మొదలు కంటినిండా నిద్రపోయిన రోజులేదు. కడుపునిండా తిన్న రోజులేదు. అయినా గురుసేవ చేస్తున్నావనే తృప్తి అతన్ని నిలబెడుతోంది. లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తోంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి.


Saturday 7 January 2023

శ్రీదత్త పురాణము (12)



శౌనకాది మునులారా! బ్రహ్మదేవుడు కలికి చెప్పిన గురుశిష్యుల సంభాషణ ఇది. గురు శిష్యుల లక్షణాలు గుణగణాలు తెలిసాయి కదా! గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు అని గురుభక్తి గురుసేవయే భుక్తిముక్తిదాయకం అని పురాణములు బోధిస్తున్నాయి. అటువంటి గురు దత్తాత్రేయుడి చరిత్రను వినాలని అనుకోవటం మీ పూర్వపుణ్య విశేషం. చెబుతాను వినండి అని సూత మహర్షి అన్నాడు.


అప్పుడు మునులంతా ఇలా అన్నారు. మహర్షీ గురు శిష్యుల లక్షణాలు అద్భుతంగా చెప్పావు, ధన్యవాదాలు. దత్త చరిత్ర వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతుంది. కానీ దీపక వేదధర్ముల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. దీపకుడు తన దీక్షను నెరవేర్చుకొన్నాడా ? జీవితాంతం బ్రహ్మచారిగానే వుండి గురుసేవలో తరించాడా? కష్టాలు ఎదురైనాయా ? చివరికి అతనికి దక్కిన గురుఫలం ఎలాంటిది ? గురువు ఎలా అనుగ్రహించాడు ? ఇవన్నీ మాకున్న సందేహాలు అని అడిగారు.


అప్పుడు సూతమహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా చెప్పాడు. గురుశుశ్రూష తప్ప వేరొక ధ్యాసలేని దీపకుడ్ని ఒకరోజు వేద ధర్ముడు దగ్గరకి పిలచి నాయనా నీ సేవలకు ఆనందంగా వుంది. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే. నాకొక అవసరం వుంది ముందు విను తరువాత సమాధానం చెబుదువు గాని తొందరలేదు అని నాయనా, దీపకా, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి. అవి పూర్వజన్మ సంచితములు. తపస్సులతో కొంతరవకు నశింపజేసుకొన్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి నశింపజేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశికి వెడదామని అనుకొంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహా మహా పాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తములతో నశింపజేసుకోవచ్చు. పుణ్య ఫలాల మాదిరిగానే పాప ఫలాలు ఎక్కడికిపోవు. కర్త - అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా, కనుక్కోకుండా, సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనస్సుకి నీవు కనిపించావు నేను నిర్ణయిస్తే నీవు కాదనవని తెలుసు. కాని ఇది ఒకటి రెండు రోజులు కాదు ధృఢదీక్ష వుండాలి. అంకిత భావం వుండాలి. అన్యచింతలు దగ్గరికి రానివ్వని నిగ్రహం వుండాలి. అదీగాక నీవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయస్సులో వున్నావు విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు నీ మనస్సు ఏమంటుందో తొందరలేదు ఆలోచించుకొని చెప్పు అన్నాడు.


అప్పుడు దీపకుడు గురుదేవా ! మీరింతగా చెప్పాలా నేను మీ సేవకే అంకితమైనాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం, నా దీక్ష, మనస్సులో కూడా నన్ను శంకించకండి. కాశిలో వుండి మీ సేవ చేసుకొనే భాగ్యం ప్రసాదించండి అన్నాడు.


Friday 6 January 2023

శ్రీదత్త పురాణము (11)



ఈ దేహము ఒక నౌకతో సమానం. సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది. దీన్ని సరియైన దారిలో పెట్టి గట్టుకి చేర్పించే వాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రధమ కర్తవ్యం, బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి. తపోనిష్టకావాలి. అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహం వుండాలి. వేదవేదాంగ పరిజ్ఞానం వుండాలి. వీటి అన్నింటికి మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే.


మానవరూపంలో అవతరించిన నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు. శ్రీరాముడు వశిష్ట విశ్వామిత్రులను గురువులుగా సేవించాడు. శ్రీకృష్ణుడు, సుదాముడు మొదలగు మిత్రులతో కలసి సాందీప మహర్షి వద్ద గురుసేవలు చేసి వేద విద్యలు అభ్యసించాడు. గురుకులవాసం చేసాడు. సహాధ్యాయులతో కలసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన సమిధలు, పండ్లు మొదలగునవి సేకరించి తెచ్చాడు. ఆ సమయంలో కష్టాలు అనుభవించాడు. గురువుల అనుగ్రహాన్ని పొందారు. శ్రీకృష్ణుడ్ని జగద్గురువుగా పరబ్రహ్మముగా గుర్తించిన తరువాత సహధ్యాయులు, గురువులు తమతమ భాగ్యానికి ఆనందించారు. లీలానాటక సూత్రధారి అని పొగిడారు. గురుశుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంక ఏ ధర్మాచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు. కనుక నాయనా దీపకా ! గురుమహిమ వర్ణనాతీతం. గురుప్రసాదం సకలార్ధ సాధకం.


ఇంక శిష్యుని గురించి చెబుతాను విను. మంచి మాటలతో గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు. భోగమోక్ష విషయంగా మంచి రెండు రకాలు. (గురువులో లేశ మాత్రమైన ఏమైనా లోపాలు వుంటే, దోషాలు, బలహీనతలు ఉంటే వాటిని పదిమందికి టముకు వేసి ప్రచారము చెయ్యకుండా కప్పివుంచేవాడు ఛాత్రుడు. నీడలాగ గురువెంటవుండి విద్యనభ్యసిస్తూ సేవిస్తూ జీవించేవాడు అంతేవాసి. ఇలాగ శిష్యులలో బేధాలు వున్నాయి) శిష్యునికి ఏది హితమని భావిస్తాడో దాన్నే గురువు బోధిస్తాడు. మారుమాట్లాడకుండా శిష్యుడు శిరసావహించాలి. ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో ముక్తిని ప్రసాదించేది, హితమంటే. ఒక్కొక్కప్పుడు గురువు చెప్పింది ఇహలోకంలో కష్టంగావచ్చు. అయినా శిష్యుడు కాదు ఆనకూడదు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణం అయిన సాధన సంపత్తిని నేర్పిస్తాడు. నిత్యానిత్యవస్తు వివేకం కలిగిస్తాడు. భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని కర్తవ్యం. తత్వజ్ఞానం ఉపదేశం పొందడానికి అర్హుడు వాడే. అనంతకాలంలో తానూ గురు పదవిని అధిష్టిస్తాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురుఋణ విముక్తుడవుతాడు. పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే వుంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు ఇలా గురుశిష్య సందేహాలు తీర్చుకొని ప్రశాంత చిత్తంతో గురువుకు సాష్టాంగ నమస్కారము చేసాడు.


Thursday 5 January 2023

శ్రీదత్త పురాణము (10)

 


దీప వృత్తాంతం


అంగీరసుడు అనే బ్రహర్షి వుండేవాడు. ఆయన గోదావరీ తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకొనేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ మునులతో శిష్యులతో కళకళలాడుతూ వుండేది. ఎక్కడెక్కడ నుండో మునులు, ఋషులు వచ్చి అంగీరసుడ్ని అడిగి తమతమ సందేహాలు తీర్చుకుంటూ వుండేవారు. యోగరహస్యాలు తెలుసుకుంటూ వుండే వారు. ఎందరు వచ్చినా ఆ ఆశ్రమంలో కందమూల ఫలాలు కాని, పుష్పాలకు గాని లోటు ఉండేదికాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు, ఆయన పైలుని కుమారుడు. శిష్యబృందంతో వచ్చి ఆంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటూవున్నాడు. ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోను, గుణంలోనూ, వివయంలోనూ, విధేయతలలోనూ, నిష్టలోన చెప్పుకోదగిన వ్యక్తి, వేద వేదాంగాలు అభ్యసించాడు. అయినా గృహస్థాశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం వుండి గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. గురువుగారు సరేనని అంగీకరించాడు. దీపకుడు పరమానందభరితుడై గురుసేవలో కాలం గడుపుతున్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఇలా అన్నాడు. గురుదేవా ! నాదొక చిన్న సందేహం. అడగమంటే అడుగుతాను అన్నాడు. వేదధర్ముడు అడగమన్నాడు. అప్పుడు దీపకుడు గురుదేవుని పాదాలు నొక్కుతూ గురుశిష్య పదాలకు సమగ్రంగా అర్ధం వివరించండి అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్పుతున్నాడు.


నాయనా లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే ! ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధించేవాడు గురువే !


జీవితంలో మనిషికి చాలా మంది గురువులు వుంటారు. వారిలో ఉత్తములు ఉంటారు. మొట్టమొదట కన్నతల్లి గురువు. ఆ తరువాత, తండ్రి మరొక గురువు, ఇంటికి పెద్దవాడు గురువే. మేనమామ, పిల్లనిచ్చిన అత్తమామలు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు వీరంతా మన్చి చెప్తారు కనుక గురువులే ! ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్నతండ్రి గురువే ! వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుత్వం రెట్టింపు అవుతుంది. వేరొకరెవరైనా వేదాలు శాస్త్రాలు నేర్పితే అతడు ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యలు నేర్పిన వారెవరైనా గురువులుగానే పరిగణింపబడతారు. సంసార సాగరాన్ని తరించడానికి జనన మరణాల చక్రం నుండి బయటపడటానికి ఏకైక మార్గం అయిన బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించేవాడు పరమగురువు. అతడే పరతత్వం ! అతడే త్రిమూర్తి స్వరూపం ! అతడే సకల దేవతా స్వరూపం ! మానవ రూపంలో వున్నాడని అనుమానించవలసిన అవసరం లేదు. బ్రహ్మజ్ఞానంతో నిన్ను బ్రహ్మమును చేసే పరబ్రహ్మనుతడే. వీరు కాక రకరకాల దేవతా ఉపాసనలు, మంత్రాలు, వ్రతాలు, ఉపదేశించే గురువులు చాలామంది వుంటారు. దీక్షలు ఇచ్చే గురువులు వుంటారు. ఆచార్యులు వుంటారు. గురికుదుర్చుకొని శ్రద్ధతో గురుసేవ చెయ్యాలి. ఇహ పరాలలో శ్రేయస్సుని కలిగించేవాడు గురువు. సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ లేదు.


Wednesday 4 January 2023

శ్రీదత్త పురాణము (9)



బ్రహ్మదేవా! గురువు అంత గొప్పవాడా? గురు శబ్దానికి అర్ధం ఏమిటి ? గురువంటే ఎవరు ? ఎలాంటివాడు.


గురువు ? ఎవరికి గురువు ? గురు స్వరూపం తెలియపరచి నన్ను కృతార్ధుణ్ని చేయమని కలిపురుషుడు అభ్యర్ధించాడు. కలిపురుషా ! నీ సందేహం తీర్చడం నా ధర్మం. గురు శబ్దంలో ఉకారం అచ్చు. అది ద్విరుక్తమయ్యింది. గకార రేఫలు రెండూ హల్లులు. వీటిలో గకారం సర్వసిద్ధి ప్రదం. రకారం సర్వ పాపనాశకం. ఉకారం అవ్యక్త అచింత్య విష్ణు తత్వానికి వాచకం. అందుకే రెండు హల్లులకు ప్రాణమయ్యింది.


అచ్చునే ప్రాణమంటారు. దాని వల్లనే హల్లులు ప్రాణులు అవుతున్నాయి. ఇంకా వీటిలో వర్ణాదిదేవతలు వున్నారు.


గకారానికి గణపతి, రకారానికి అగ్ని, ఉకారానికి విష్ణువు అధి దేవతలు. ఈ రకంగా గురు శబ్దమే మంత్రంతో సమానం. ఇది చతుర్విధ పురుషార్ధాలకు సాధనం. తల్లి, తండ్రి, పరాత్పరుడూ గురువే. శిష్యుడు మీద శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు. గురువుకే కోసం వస్తే శివుడు కూడా వాణ్ని ఏమీ చేయలేదు. గురువే పరతత్వం. అందుకే గురువును ఆశ్రయించాలి అంటున్నాయి వేదాలు, పురాణాలు. శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడైనా గురుభక్తినే కోరుకుంటారు ఉత్తమ వైష్ణవ భక్తులు. గురువు ప్రసన్నుడైతే నారాయణుడు ప్రసన్నం అయినట్లే. సకల పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించిన ఫలం దక్కుతుంది. సకల వ్రతాలు, తపస్సు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. శాస్త్ర పరిజ్ఞానం ధర్మాధర్మ వివేకం, భక్తి జ్ఞానవైరాగ్యాలు, సదాచారం సమస్తము గురుసేవ చేతనే లభిస్తుంది. నాయనా కలీ! ఒక్క మాటలో చెప్పాలంటే గురుమహిమ వర్ణనాతీతం. అంతట కలి, విధాతా! ఇక్కడ నాడొక ధర్మసందేహం ఉన్నది. మానవ మాత్రుడైన గురువుకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది. సకల దేవతా స్వరూపుడంటున్నావు, సర్వజ్ఞుడంటున్నావు ఇదెలా సాధ్యం అయింది? అని అడిగాడు. 


కలీ! మంచి సందేహం వచ్చింది. చెపుతున్నాను విను, గురువు లేకపోతే ఎవరికైనా శాస్త్ర పరిజ్ఞానం వుంటుందా? శాస్త్రాలు తెలియకపోతే ధర్మ స్వరూపం తెలుస్తుందా? ఇది తెలియనివాడు నీ బారి నుండి తప్పించుకోగలడా? కీలకం అంతా ఇక్కడే వుంది.


గురుమహిమను తెలియజెప్పే పురాణ గాధ ఉంది. చెబుతాను. ఆలకించు. నీ సందేహాలు అన్నీ తీరుతాయి అన్నాడు బ్రహ్మ.


Tuesday 3 January 2023

శ్రీదత్త పురాణము (8)



కలి - బ్రహ్మ సంవాదం


పద్మ కల్పానికి ఆరంభంలో నారాయణుని నాభి నుండి కమలము ఉద్భవించి అందుండి బ్రహ్మ ఉద్భవించి పద్మాసనంలో కూర్చుని సకల చరాచర జగత్తును సృష్టించనారంభించినాడు. భూలోకంలో మానవులను సృష్టించాడు. వారికి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచి వాటిని అమలు చేయడానికి మనువులను సృష్టించాడు. కాలాన్ని యుగాలుగా ఏర్పరచాడు. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలను యుగాధిపతులుగా మనువులను ఏర్పరచాడు. ధర్మ రక్షణ భారాన్ని మనువులకు అప్పగించాడు. మొదటి ముగ్గురూ తమతమ విధి నిర్వహణకోసం బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి బయలుదేరారు. పిశాచ రూపుడు, కలహ శీలుడు అయిన కలి పురుషుడు మాత్రం దిగంబర రూపంలో గంతులువేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఒక చేత్తో మర్మాంగాన్ని, మరొక చేత్తో నాలుకను పట్టుకొని నిలబడ్డాడు.


విధాతా! సకల పాపాలకు ధర్మాలకు వినాశకుడిగా నన్ను రూపొందించావు. భూలోకంలో శత్రువులు నాకు చాలామంది వున్నారు. పుణ్యకార్యాలు ఆచరించే వారంతా శత్రువులే. శివనామం, హరినామం, గంగాస్నానం, దానం, సత్సంగం, పుణ్యక్షేత్ర సందర్శనం ఇవి ఆచరించే వారంతా నాకు శత్రువులే. వీటిని ఆచరించటం నాకు నచ్చటం లేదు. నాకు ఇలాంటి పాపకార్యాలు విధించావేమిటి ? అంటూ కలిపురుషుడు విలపించాడు.


అప్పుడు బ్రహ్మ నాయనా! కలిపురుషా! నీ విధులు నీవు నిర్వర్తించు. ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్న నీ శత్రువర్గాన్ని నీవు ఏమీ చేయలేవు. వ్యసనాలకు, అరిషడ్ వర్గాలకు, డాంభికులకు, ఆసత్య, అనాచారాలకు దాసులైన వారే నీ శిష్యులు. వారిని ఆక్రమించి శిక్షించడం నీ విధి. నీ బాధల నుండి తప్పించుకోవాలంటే జనులకు రెండు మార్గాలు వున్నాయి. ఒకటి పురాణ పఠనం, శ్రవణం. రెండు గురుసేవ. ఇవి చేసే వారిని నీవు హింసించలేవు. వారి దరిదాపులకు కూడా నీవు వెళ్ళలేవు. పురాణాలు వినిపించేవారు గురువులే! గురు సేవ చేసుకునే వారికి నీ బాధవుండదు. పూర్వ జన్మ సుకృతం వల్లనే ఉత్తమ గురువు లభ్యమవుతాడు. గురువు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు. శాస్త్రజ్ఞానం ఉంటేగానీ ధర్మాధర్మ వివేకం అబ్బదు. అది అబ్బకపోతే తత్వం తెలియదు. తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం కలుగదు. ఆత్మజ్ఞానం కలుగకపోతే ముక్తి లభించదు. కావున ముక్తి మూలం గురువే పురాకృత పుణ్యం లేని వారికి గురువు లభించడు. వారంతా నీకు చిక్కుతారు. ఇందులో మప్పు విచారపడవలసింది ఏమిలేదు. నీ ధర్మం నీవు ఆచరించు అని బ్రహ్మ కలిపురుషుడిని బుజ్జగించాడు.  


Monday 2 January 2023

శ్రీదత్త పురాణము (7)



నాయనా, నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను. ఏమి కావాలో కోరుకో మృదుమధుర స్వరంతో పలికారు. ఆనందపారవశ్యంలో మునిగిన సూతుడు నోరు మెదపలేకపోయాడు. నాయనా నీ అభీష్టం నెరవేరుతుంది ఈ శౌనకాది మునులకు నా మహిమలు వినిపించు. నీకు అంతా కరతలామలకమవుతుంది. నీవు పరమ పదానికి చేరుకుంటావు అని వరముననుగ్రహించి దత్తదేవుడు అంతర్థానం చెందాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకుని ఆనంద భాష్పములతో నింపిన కన్నులు తుడుచుకొన్నాడు.


మునీంద్రులారా! దత్తదేవుడు అనుగ్రహించాడు. మీరడిగిన దత్త చరిత్రను వినిపిస్తాను. ఇది గురుశిష్య సంవాదంగా వుంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభీష్టప్రదం. దీన్ని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంపత్కరం. విద్యాప్రదాయకం, జ్ఞానప్రదం. సకలప్రదేశాలలో సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించినా దత్తుని ధ్యానించినవారికి విజయమే తప్ప అపజయమంటూ వుండదు. ఇది సకల బంధవిమోచకం. ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని గాని లేదా ఒక భాగాన్ని గాని పఠిస్తూ దత్తుని స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు.


దత్త నామాన్ని జపించినవారికి ఆ యోగీంద్రుని దయవల్ల ముక్తిని పొంది తీరుతారు. అలకించండి. సూత మహర్షీ! మరి గురుశిష్య సంవాదమన్నావు గదా అసలు గురువంటే ఎవరు ? శిష్యుడంటే ఎవరు ? వీరి లక్షణాలేమిటి ? వీరిలో శ్రేణులు ఏమైన వున్నాయా ? ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అడిగారు.


మునీంద్రులారా ! మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణ గాధ తెలుపుతాను దీనికి బ్రహ్మ - కలి సంవాదమని పేరు. ముందుగా అది వినిపిస్తాను, వినండి అని సూతుడు ప్రారంభించాడు.


Sunday 1 January 2023

శ్రీదత్త పురాణము (6)



మునులంతా ఇలా అడిగే సరికి సూతుడు సంబరపడ్డాడు. వారితో ఇలా అన్నాడు. మునులారా! అందరికి వందనములు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్త మహిమలను వినాలనుకోవటం గొప్ప విశేషం. పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు. నన్ను కూడా కృతార్థుడిని చేస్తున్నారు. నా జన్మ కూడా చరితార్థమవుతుంది. మీరు బ్రహ్మనిష్టులు, తపోధనులు, మీసాంగత్యం లభించడం వల్ల నా జన్మ ధన్యమయ్యింది..


భగవదనుగ్రహం వల్ల గురుకటాక్షం వల్ల నా శక్తిమేరకు దత్తాత్రేయ చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకొని కన్నులు మూసుకొని ధ్యానసమాధిలోకి జారుకున్నాడు. వాణీ చతుర్ముఖులను, గౌరీశంకరులను, లక్ష్మీవాసుదేవులను స్మరించాడు. గజాననుడ్ని స్మరించాడు. అష్టదిక్పాలకుల్ని అఖిలదేవతలని, సమస్త ముని జనవందితులని తలుచుకుని నమస్కరించాడు. యోగమార్గంలో సకలేంద్రియాలను ఏకాగ్రపరచి హృదయపద్మంలో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు.


త్రిమూర్తి స్వరూపా | త్రివర్ణించితా ! వేదవేద్యా! విశ్వవంద్యా ! విశ్వరూపా! ఒకప్పుడు గరుత్మంతునిపై వుంటావు. ఒకప్పుడు పులితోలు ధరిస్తావు. ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు. మరొకప్పుడు శ్వేతవస్త్రం ధరిస్తావు. ఒకప్పుడు సర్ప యజ్ఞోపవీతం ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురం లక్ష్మీ వద్ద బిక్షతీసికొని సహ్యాద్రిపై సంచరిస్తావు.


మూడు యుగాలలోను అవతారాలను ధరించినవాడా ! శ్రీహరీ! నమోనమః


ఒకప్పుడు బాలుడుగా దర్శనమిస్తావు. ఒక్కొక్కసారి యువకుడిగా వృద్ధుడిగా దర్శనమిస్తావు. ఒక్కొక్కవేళ జటాధారిగా, ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడిగా వుంటావు. ఒక్కో ముహూర్తాన దివ్య మాలికా దివ్యాభరణ, దివ్యవస్త్రములను ధరించి దివ్యసుందర విగ్రహుడపై కనిపిస్తావు. ఒక్కోసమయంలో మదోన్మత్త చిత్తుడుగా మదిరతో మగువతో గోష్టి జరుపుతూ వుంటావు. ఒక్కోసారి దిగంబరుడవై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు. విభూతి పులుముకుంటూ కనిపిస్తావు, అనంత నామా! దత్తప్రభూ! నీకు నమోవాకములు. పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జునున్ని వేయిబాహువులుతో మహావీరుణ్ని చేసి, వేల సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి, సేవలు అందుకున్న ఘనత నీదే, నీకు ప్రణామములు. ప్రహ్లాదుడి భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వరా ! దిగంబర స్వరూపంతో వున్న నిన్ను సేవించిన యదుమహారాజుకీ, అలర్క మహారాజుకీ జ్ఞానోపదేశం జేసిన సద్గురూ! నీకు నమోవాకములు. యోగవిద్యా స్వరూపా! మహామాయా ! తేజస్వులలో తేజస్సు నీవు, బుద్ధిమంతులలో బుద్ధిని నీవు, బలవంతులలో బలంనీవు, విద్యావంతులలో విద్యవు నీవు, శాంతి, క్షాంతి, దయ, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే, భూత, భవిష్యత్, వర్తమానాలు నీవే, సర్వవ్యాకరణ స్వరూపుడవు నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది లేదు. నువ్వుకానిది లేదు. సర్వాత్మకా ! సర్వాంతర్యామా నీకివే నా నమస్సులు, వామనుడవై బలిని మూడడుగుల నేల దానమడిగావు. త్రివిక్రముడవై విజృంభించావు. ఆకాశంలోని సూర్యచంద్ర గోళాలు గొడుగులై, శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటిసూత్రమై అందెల మువ్వలై, నీ పాదాలకింద జారిపోయాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాద పద్మాలను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు. నీకాలిగోరు తగిలి బ్రహ్మాండం బ్రద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది. అది భూమిపై అవతరించి గంగానదియై తనలో మునిగిన సకల జీవులకూ జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తోంది. విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలు అందుకుంటోంది. సచ్చిదానంద స్వరూపా నీ అవతార లీలలు అచింత్యాలు, అప్రమేయాలు, ఆగమ్యగోచరములు. బ్రహ్మర్షులకే అంతుబట్టవు, దత్తా శరణు శరణు, ఇలా ధ్యానించిన సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చిందుతున్న ముఖ పద్మం. శిరస్సుపై పింగళ జటాజూటం, సూర్యచంద్రులు నేత్రాలుగా, కటియందు పీతాంబరం. ఆరుచేతులతో కరుణార్ద్ర హృదయుడు తనను స్మరించే వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే స్వామి ప్రత్యక్షమయ్యాడు.