Monday 31 January 2022

శ్రీ హనుమద్భాగవతము (146)



శ్లో || సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః |

ఆప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్ల భఃః


(వా.రా. 1-16–21)


'రాజా! ఎల్లప్పుడు ప్రియమును గొల్పుమాటలను పల్కు వారు సులభముగా లభించెదరు; కాని వినుటకు ప్రియము లై నను పరిణామములో హితకరము లైన వచనములను పలుకు నా వారు, వినువారు కూడ దుర్లభులే'యని తెలిసికొనుము.

"అగ్రజా! నీవు నాకు పితృసమానుడవు. నీ పాద ప్రహారమునకు, కటుభాషణములకు నేను చింతించుటలేదు. కానీ నీవు నీ వినాశమును స్వయముగానే ఆహ్వానించుచున్న వాడవని నేను వ్యాకులము చెందుచున్నాను. నీవు నీ సభాసదులు కాలమునకు వశులైతిరి. కావుననే మీరు విపరీతముగా ఆలోచించుచున్నారు. నిర్ణయములను తీసికొనుచున్నారు. నీవు నీ పుత్రులు, సైన్యము, రాక్షసవంశము శ్రీ రామచంద్రునిచే సంహరింపబడుట నేను చూడలేను. ఈ కారణమువలననే శ్రీ రఘువీరుని శరణు వేడుటకు పోవుచున్నాను.”


విభీషణుడిట్లు పల్కి మంత్రులతో గూడినవాడై శ్రీరామచంద్రుని శరణువేడుటకు ఆకాశమార్గమున బయలుదేరెను, హృదయము ఆనందపుటలు ఉప్పొంగుచుండెను. శ్రీరామచంద్రుని దివ్యమంగళ విగ్రహమును దర్శింపవలెననియు, ఆయన చరణారవిందములను శరణు పొందవలెననియు విభీషణుని మనస్సు ఆతురత చెందుచుండెను. అతడు తానిట్లా ఆలోచించుకొనుచుండెను. “ఆహా! నా అనేక జన్మముల పుణ్యము నేడు ఫలించబోవుచున్నది. దేవతలు, మహర్షులు జన్మజన్మముల పర్యంతము తపమొనరించినను అ భక్తసుఖదాయకుని చరణారవిందములను పొందలేరు. పరమప్రభువగు శ్రీ రామ చంద్రుని అరుణారుణ చరణారవిందములను నేడు నేను దర్శింప గల్గెదను. ఎవ్వని చరణ కమలముల సంస్పర్శనముచే పాషాణమైన గౌతమునిపత్నియైన అహల్య స్వస్వరూపమును పొంది సంసారమును తరించెనో, ఎవని అరుణ చరణములను భగవతియైన సీతా దేవి తన హృదయమున ధరించియుండెనో, కర్పూర గౌరాంగుడైన శ్రీమహా దేవుడు తన హృదయాంతరంగములో సదా ధ్యానించుచుండునో, లోకపావనములైన ఎవని పాదుకలను భాగ్యవంతుడైన భరతుడు శ్రద్ధాభక్తులతో నిరంతరము పూజించుచుండెనో, అధముడను రాక్షసుడనునైన నేను శ్రీ రామచంద్రుని ఆ దివ్యచరణములను దర్శించు భాగ్యమును పొందబోవుచున్నాను.

Sunday 30 January 2022

శ్రీ హనుమద్భాగవతము (145)



నేను మరల నీకు నమస్కరించుచున్నవాడనై విన్నవించుకొనుచున్నాను. “శ్రీ రామచంద్రుడు ధర్మాత్ముడు, సత్యపరాక్రముడు. నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తుగాని, మహాపాశ్వమహోదరకుంభ నికుంభాతి కాయాది రాక్షసవీరులైన గాని, తుదకు నీవైనకాని సమరాంగణములో శ్రీరామచంద్రుని ఎదుట ఒక్క క్షణమైనను నిలువజాలరు; కావున ఆయనతో శత్రుత్వము వహించుట నీకు ఉచితము కాదు. అమోఘములు, అప్రతిహతములైన ఆ కోసలేంద్రుని శరములను స్మరించి జనక రాజకుమారియైన సీతను ఆయనకు సమర్పించి క్షమింపుమని ప్రార్థించుటలో నీకు శుభము కల్గును.


విభీషణుడు పల్కిన హితవచనముల ఆలకింపగానే రావణుడు మిగుల కోపించెను. క్రోధముతో కంపించుచు ఇట్లు పలికెను. “అసురకులమునకు కళంకమైనవాడా! నేను అనుగ్రహించిన భోగ భాగ్యములచే శరీరమును బాగుగా పెంచిన వాడవైన నీవు నేడు నా ఎదుటనే శత్రువులను పొగడుచుంటివి. శత్రువుల ఎదుటనే అవమానము చెందుచుండగా చూడవలెనని నీవు ఆకాంక్షించుచున్నావు కాబోలు. అది అసంభవము. నా భయము వలన ముల్లోకములు కంపించును. కాని నీవు నన్నొక సామాన్యమానవుని ఎదుట భయపెట్టుటకు ప్రయత్నించుచున్నావు. ధిక్కారము, ధిక్కారము! నీవు దప్ప అన్యులెవ్వరైనను ఇట్లు పలికినచో వెంటనే అసువులు బాసియుండెడివారు”.


కోపోద్దీపిత మానసుడై రావణుడు విభీషణుని కాలితో తన్ని ‘ధూర్తుడా! పొమ్ము! ఆ వనవాసియైన మానవునితో చేతులుగలుపు'మని తిరస్కారముగా పలికెను.


దశకంఠుడు పల్కిన కటు వచనములను ఆలకించి వాని పాదప్రహారమును సహితము సహించి బుద్ధిమంతుడు, మహా బలవంతుడునైన విభీషణుడు అగ్రజుని చరణములకు నమస్కరించి, తన నలుగురు మంత్రులను తోడ్కొని, గదాధారియై ఆకాశమునకు ఎగిసినవాడై రావణునితో ఇట్లు పల్కెను.

Saturday 29 January 2022

శ్రీ హనుమద్భాగవతము (144)



విభీషణుడు అమితమైన ఆదరముతో రావణునకు ఇట్లు నివేదించడం ఆరంభించెను. “మహా మతిమంతుడా! పులస్త్య మహర్షి తన శిష్యునితో నీ కొక సందేశమును పంపెను. నీవు అహంకారమును విడచి సీతను ప్రభువుల ప్రభువైన శ్రీ రామచంద్రునకు సవినయముగా సమర్పించి ఆ దేవాది దేవుని శరణు వేడుము. నా ఉద్దేశ్యములో నీవట్లు ఒనరించినచో నీకు, నాకు, మన వంశమునకు, లంకా నివాసులకు శుభము కల్గును.”


విభీషణుడు పల్కిన అక్షరసత్యమైన ఆలోచనను ఆలకింపగానే మాల్యవంతుడనే మంత్రి ప్రసన్నుడయ్యెను; అతడు దశగ్రీవునితో నమ్రతాపూర్వకముగా ఇట్లు పల్కెను. "స్వామీ! నీ కనిష్ఠ సోదరుడు, పరమనీతినిపుణుడైన విభీషణుడు ఉచితమైన వాక్యములను పల్కెను. వీని ఆలోచనను మన్నించుటచే నీకు మంగళమగును.”


కాని కాలప్రేరితుడై ఉన్న దశాననునకు వారు పల్కిన హితవచనములు అప్రియములయ్యెను. అతడు కోపముతో పండ్లుకొఱకుచు ఇట్లు పల్కెను. “అసురులారా! శత్రువులను ప్రశంసించుచున్న ఈ ఇర్వురు మూఢులను ఈ సభ నుండి బయటకు నెట్టుడు.”


రావణుని అజ్ఞ ఆలకింపగానే వాని తాత యైన మాల్యవంతుడు సభను వీడిపోయెను. తన సోదరుని శుభమును కాంక్షించిన విభీషణుడు మరల వినయపూర్వకముగా ఇట్లు పలుకనారంభించెను. “దైత్యకులావతంసా! నీవు కృపాపూర్వకముగానే పల్కిన హితవచనములను అలకింపుము. విదేహరాజకుమారియైన సీతా దేవి లంకను ప్రవేశించిన సమయములో అనేక దుశ్శకునములు సంభవించుట నీవు ప్రత్యక్షముగా చూచితివి. అపుడే ఆ దుశ్శకునములను గుఱించి వివరించుటకు మంత్రులు సంకోచించిరి. 

Thursday 27 January 2022

శ్రీ హనుమద్భాగవతము (143)



రావణుని శిరముపై మృత్యువు నృత్యమొనరించుచుండెను. వానికి ముఖ ప్రీతికరములైన ఈ అసత్య వాక్యములు సత్యములుగా గోచరిం చెను; కాని అదే సమయములో నీతి కుశలుడు, రావణశుభచింతకుడు వాని తమ్ముడైన విభీషణుడు అన్నగారి చరణకమలములకు నమస్కరించి వినయ పూర్వకముగా ఇట్లు పల్కెను. "అగ్రజా! నీవు బుద్ధిమంతుడవు, విద్వాంసుడవు, సకలనీతిరహస్యములు నెఱిగినవాడవు, సావధానుడవై ఒకింత ఆలోచింపుము. ఈ సభాసదులందఱు సత్యముగా హితమును ఆలోచింపక నిన్ను సంతుష్టునిగా చేయుటకు ఇట్ల అసత్యప్రలాపములను ఒనరించుచున్నారు. శ్రీరామచంద్రుని దూతయైన ఒక్క వానరుడు దుర్లంఘ్యమగు లంకానగరమును ప్రవేశించి ప్రమదావన సహితముగా లంక నంతయు నష్ట భ్రష్టం ఒనరించెను. సైన్యస్థావరములను, వాహనములను, మహత్వపూర్ణములైన రహస్య ప్రదేశములను తగులబెట్టుటయేగాక అతడు అసంఖ్యాకులైన రాక్షసవీరులతో పాటు మన వీరకుమారుని కూడా సంహరించెను. అన్నా ! అంతటి వానరవీరులు కోటానుకోట్లుగా వచ్చినచో ఇక ఏమి సంభవించగలదో ఊహించుకొనుము. మన లంకానగరమంతా అనాథవలె అగ్నిజ్వాలలలో మండుచున్న సమయమున యీ బీరములు పల్కు వీరులందరు ఎచటకు పోయిరి ?


“రాక్షసేశ్వరా ! శ్రీరామచంద్రుడు ఒక సాధారణ మనుష్యుడనుకొంటివా? కాదు. ఆయన సాత్తుగా అవ్యక్తాత్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు, ధర్మపత్ని యగు సీతా దేవి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి. సీత ఈ లంకానగరమునకు యమపాశమువలె అఱుదెంచినది. కావున శ్రీరామచంద్రుని ధనువు నుండి తీక్షణములు కాలరూపములైన శరములు బయల్వెడలక మునుపే సమర ప్రియులు, నఖదంష్ట్రాయుధ విశారదులైన భల్లూక వానర వీర సమూములు లంకను ముట్టడించి నష్ట భష్ట మొనరింపక ముందే మేల్కొనుము. అసంఖ్యాకములైన రత్న రాసులతో మునుపే మిథిలా రాజకుమారిని శ్రీరామచంద్రునకు భక్తితో సమర్పింపుము. లేనిచో స్వయముగా కాలకంఠుడైన శంకరుడు యముడు మొదలగు వారందఱు నిన్ను రక్షించుచు సురపతి, పాతాళ లోకమును ప్రవేశించినను శ్రీరామచంద్రుని అమోఘమగు బాణము నుండి నిన్ను రక్షింపలేరు.”         


Wednesday 26 January 2022

శ్రీ హనుమద్భాగవతము (142)



విశాలమైన రామదండు విశ్రాంతిని కూడా తీసుకొనక రేయింబవళ్ళు పయనించుచుండెను, వారందఱు శ్రీరాఘవేంద్రునితో మధ్యాచలమును, సహ్యాద్రిని, మనోహరములైన అరణ్యములను తరించుచు మార్గములో నేత్రానందకరములైన దృశ్యములను గాంచుచు తుదకు విశాలసాగరతటమును చేరిరి. ఆ ప్రదేశమందు వానర భల్లూక వీరులు అత్యధిక ప్రసన్నులై 'జయ శ్రీసీతారాం’ 'జయ శ్రీలక్ష్మణరాం' అనుచు గర్జించిరి.


కోటానుకోట్ల వానరభల్లూకవీరుల గర్జనముల ఎదుట సముద్రుని భయంకర గర్జనము ప్రభావహీనమయ్యెను. 


విభీషణునిపై అనుగ్రహము చూపుట 


మహావీరులైన వానర భల్లూక యోధులతో శ్రీ రామచంద్రుడు దక్షిణ సముద్ర తటమును చేరెను. ఈ సమాచారం అందగానే లంకానగరములో వ్యాకులత్వము వ్యాపించెను. రాక్షసులు, రాక్షస స్త్రీలు, మిగులు చింతితులై పరస్పరమిట్లు పలుకనారంభించిరి. ఒకే ఒక వానరుడు సమస్త లంకా నగరమునకు నిప్పు పెట్టి భయంకరమైన నష్టమును కలుగ జేసెను. ఇపుడు కోటానుకోట్ల వానరవీరులచే ఈ దేశమునకు ఎట్టి దుర్దశ పట్టునోకదా! తుదకు దశకంఠుడు కూడ భయము చెందెను. వాని మనస్సు వ్యాకులమయ్యెను; కాని తన మనోభావములను లోననే ఉంచుకొని పైకి గంభీరముగా నుండెను. సభాభవనములో అతడు రాక్షసవీరులను ఉద్దేశించి ఇట్లు పలికెను. “వీర యోధులారా! వానరసైన్యములను తోడ్కొని దశరథకుమారులైన శ్రీరామలక్ష్మణులు లంకను ముట్టడించుటకు సముద్రమునకు ఆవలి తటమును చేరిరి. కావున తుచ్చులైన ఆ వానరుల కెట్టి దండనము విధింపవలెనో యోచించి నిర్ణయించుడు”.


రాక్షసాధిపతి పల్కిన వచనములను ఆలకించి ముఖ ప్రీతి కొఱకై సభాసదులందఱు అతని దుర్జయత్వమును, పరాక్రమమును, బలమును, శక్తియుక్తులను ప్రశంసించడ, ఆరంభించిరి. ప్రహస్తుడు, దుర్ముఖుడు, వజ్రదంష్ట్రుడు, ఇంద్రజిత్తు, మహా పార్శ్యుడు, మహోదరుడు, కుంభుడు, అతికాయుడు, కుంభకర్ణుని కుమారుడైన నికుంభుడు మొదలగు రాక్షసవీరులందఱు రావణునకు నమస్కరించి వాని శౌర్యపరాక్రమములను పొగుడుచు నిట్లుపల్కిరి. 'రాజా! క్షుధార్తులమైన మాకు ప్రియహారమైన నరవానరులు కాలప్రేరణముచే స్వయముగా మన సమ్ముఖమునకు వచ్చుట మా భాగ్యము. పవనపుత్రుడు మేమందఱము అసావధానులమైయున్న సమయములో మా ఉదారతను ఆసరాగా తీసికొని లంకానగరమునకు-నష్టమును కలిగించి వెడలిపోయెను. సమరాంగణములో మీ ధనువునుండి బయల్వెడలు రెండునాల్కలు గలిగిన సర్పసమానములు, తీక్షములు, విషయుక్తములైన శరపరంపరలను దశరథరాజు కుమారులు చూచియుండలేదు. ఆ కారణమువలననే ప్రజ్వలిత దీపము పైబడి మరణించు పతంగములవలె ఈ ప్రదేశమునకు వచ్చుటకు ప్రయత్నించుచున్నారు. విచారించవలసినదేదీ లేదు. మీరు మాకు అనుజ్ఞను ప్రసాదింపుడు. ఈ క్షణముననే మేము సముద్రమునకు ఆవలి తటమును చేరి క్షుద్రవానరులను వెదకి వెదకి సంహరించెదము.


Tuesday 25 January 2022

శ్రీ హనుమద్భాగవతము (141)



ఆ క్షణమందే సుగ్రీవుడు వానర భల్లూక వీరులను రణరంగమునకు తరలింపవలసినదిగా వానరసైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. ఆ వీరులందరి మనస్సులలో లంకానగరమును ధ్వంసమొనరింపవలెననెడి ఉత్సాహము నిండెను. వారందఱు ముక్త కంఠముతో శ్రీ సీతారామచంద్రులకు జయమగుగాక! శ్రీలక్ష్మణ సహితుడైన శ్రీరామచంద్రునకు జయమగుగాక! అనుచు జయజయారవములను ఒనరించిరి. సుగ్రీవాజ్ఞచే కోటానుకోట్ల వానరవీరులు, అసంఖ్యాకులైన భల్లూక వీరులు గుమిగూడిరి. వారి హృదయములలో ఆనందము, విజయోత్సాహము పరవళ్ళు త్రొక్కుచుండెను. ఆ అపారమైన విశాలసైన్య మధ్య భాగములో జటాజూటధారియైన శ్రీరామచంద్రుడు ధనుర్భాణధారియై భాగ్యవంతుడైన శ్రీ ఆంజనేయుని భుజస్కంధమును అధిష్ఠించెను. శ్రీ రామానుజుడు అంగదుని భుజముపై ఆసీనుడయ్యెను. సుగ్రీవుడు ఆ అన్నదమ్ముల వెంట నడిచెను. గజుడు, గవాక్షడు, మైందుడు, ద్వివిదుడు, నీలుడు, నలుడు, సుషేణుకు, మహావీరుడైన జాంబవంతుడు మొదలైన సేనాధిపతులందఱు ఆ మహా సైనిక వాహినిని నాల్గు వైపులనుండి సావధానులై నడుపుచున్నారు. చంచలురైన వానర వీరులు సుగ్రీవాజ్ఞచే అనుశాశితులై సైన్యాధిపతుల ఆదేశములను పాటించుచు, ఎగురుచు, దుముకుచు, గర్జించుచు, మార్గమధ్యములో మధురఫలములను ఆరగించుచు దక్షిణదిశగా బయలు దేరిరి.


ఆహా! ఆ వానర వీరుల సౌభాగ్యమేమని పొగడగలము. సురముని దుర్లభుడు, సవస్తసృష్టికి స్వామి దయాధాముడైన శ్రీరామచంద్రుని కార్యమును నిర్వర్తించుటకు వారందఱు ఆనందమగ్నులై ప్రయాణమును సాగించుచుండిరి. వారి సౌభాగ్యమును గాంచి ఇంద్రాది దేవతలందఱు మనస్సునందే ఆ వానర భల్లూక వీరులను ప్రశంసింప సాగిరి. భగవంతుడైన శ్రీరామచంద్రుడు ప్రసన్న హృదయాంతరంగుడై బయలు దేరగానే సీతాదేవి వామనేత్రము, భుజము అదర అరంభించెను. అదే సమయములో లంకానగరమందు అనేకములైన అపశకునములు ప్రారంభమయ్యెను. ఆ దుశ్శకునములను గాంచినవారై అసురులఁదఱు చింతామగ్నులైరి.          


Monday 24 January 2022

శ్రీ హనుమద్భాగవతము (140)



దుఃఖశమనుడు, మహావీరుడు నగు శ్రీ ఆంజనేయుడు విషయములను అన్నిటిని విన్నవించి నవనీరద సుందరుడైన శ్రీరామచంద్రుని ముఖారవిందమును రెప్ప వేయక చూచుచుండెను. రుద్రావతారుని వచనములును ఆలకించి ప్రభువు అత్యంత ప్రసన్నుడై ఇట్లు పల్కెను.


శ్లో॥ కార్యం కృతం హనుమతా దేవైరపి సుదుష్కరమ్ | 

మనసాపి యదన్యేన స్మర్తుం శక్యం న భూతలే ||

శతయోజనవిస్తీర్ణం లంఘయేత్క : పయోనిధిమ్ | 

లంకాంచ రాక్షసైర్గుప్తాం కోవా ధర్షయితుం క్షమః || 

భృత్యకార్యం హనుమతా కృతసర్వమ శేషతః | 

సుగ్రీవస్యేదృషో లోకే న భూతో న భవిష్యతి ||

అహం చ రఘువంశశ్చ లక్ష్మణశ్చ కపీశ్వరః | 

జానక్యా దర్శనేనాద్య రక్షితాః తాః స్మోహనూమతా || ( ఆ.రా. 6.1.2 5 )


శ్రీ ఆంజనేయుడు ఒనరించిన ఈ కార్యము దేవతలకైనా అత్యంతకఠినము. ఈ పృథ్వీతలముపై ఆ విషయమును ఎవ్వరైనను మనస్సులో స్మరింపనైనను స్మరింపజాలరు. శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి రాక్షసులచే సురక్షితమైన లంకాపురమును ధ్వంసమొనరించుటలో మఱియొకరెట్లు సమర్థులు కాగలరు. శ్రీ ఆంజనేయుడు సేవక ధర్మమును బాగుగా పూర్తి చేసెను. ఈ సంఘటన వెనుక జరుగలేదు, ముందు జరుగబోదు. ఈ పవనాత్మజుడు సీతాదేవిని కనుగొని నేడు నన్ను, లక్ష్మణుని, రఘువంశమును, సుగ్రీవాదులను అందఱిని రక్షించినాడు.


తదనంతరము సీతాపతియైన శ్రీరాముడు కిష్కిందాధిపతియైన సుగ్రీవునితో ఇట్లు పలికెను. “మిత్రమా! సుగ్రీవా! ఈ సమయములో విజయమను ముహూర్తము జరుగుచున్నది. ఈ క్షణమే సమస్త వానరసైన్యమును లంకా నగరమును ముట్టడించుటకు బయలు దేరవలసినదిగా ఆ దేశమిమ్ము. ఈ ముహూర్తములో జైత్రయాత్రకు బయలుదేరి నేను అసురసహితముగా దుర్జయుడైన దశాననుని సంహరించి సీతా దేవిని రక్షించెదను.


Sunday 23 January 2022

శ్రీ హనుమద్భాగవతము (139)



శ్రీహనుమంతుడు ఇంకా ఇట్లు పలుక ఆరంభించెను "కరుణామయుడవగు స్వామి! నేను త్రికూటపర్వతము పై నిర్మింపబడిన లంకానగరమును పరికించితిని. ఆ నగరమునకు నాల్గు దిక్కులలోను దీర్ఘ విశాలమైన ద్వారములు గలవు. ఆ ద్వారములు అత్యంత బలిష్ఠములైన తలుపులతో మూయబడి యుండెను. ఆ ద్వారములపై అనేకశక్తి సంపన్నములైన యంత్రములు అమర్చబడియున్నవి. అవి శత్రుసైన్యముల పై శతఘ్నులను, సహస్రఘ్నులను కురిపించుటలో సమర్థవంతములు. ఆ ద్వారములను దాటి లంకానగరమును ప్రవేశించుట అత్యంతకఠినము. లంకానగరమునకు నాల్గు వైపులు బంగారముచే నిర్మింపబడిన ఎత్తైన ప్రాకారము కలదు. ఆ గోడలను ఛేదించుట అత్యంతదుష్కరము. వాటిపై మణులు, మాణిక్యములు, రత్నములు, ముత్యములు పొదగబడియుండెను. ఆ దుర్గమనకు నాల్గు వైపుల మొసళ్ళచే నిండిన అగాధమగు అగడ్త గలదు. లంకానగరమును ముట్టడించుటకు మార్గము లేదు. సుదృఢములైన కోటగోడలు కలవు. పర్వతములు, వనములు లంకానగరము చుట్టును శోభించుచు ఆ నగరమునకు ప్రకృతిసహజమైన రక్షణను కల్పించెను. లంక విస్తృతమైన సముద్రమునకు ఆవల దక్షిణదిశగా ఉన్నది. జలయానముపైనైనను లంకను చేరుట కఠినమగును.


లంకానగర పూర్వద్వారముపై ప్రచండవీరులైన వేలకొలది రాక్షసయోధులు కావుండిరి. దక్షిణద్వారము చెంత అహర్నిశములు చతురంగబలములతో లక్షలకొలదిగా అసుర యోధులు యుద్ధమునకు సన్నద్ధులైయుందురు. ఉత్తరద్వారము చెంత కోటానుకోట్ల రక్కసవీరులున్నారు. మధ్య భాగములో యద్ధశిబిరములందు సహస్రాధికములుగు దుర్జయులైన నిశాచర వీరులు అప్రమత్తులై యున్నారు. కుంజరయూధములతో, అశ్వసమూహములతో, శతఘ్ని మున్నగు యంత్రములతో, అగడ్తలతో, దీర్ఘ ప్రాకారములతో, రావణుని లంకానగరము సురక్షితముగా ఉండెను; కాని శ్రీ రామభద్రా! నీ కృపా విశేషముచే నేను ఆ రక్షణవ్యవస్థనంతటిని ఛిన్నాభిన్నం చేసితిని. ద్వారములను విరుగగొట్టితిని; ప్రాకారములను పడద్రోసితిని; అగడ్తలను పూడ్చితిని; శతఘ్నులు, సహస్రఘ్నులు మొదలగు యంత్రములను భగ్నం ఒనరించితిని. దేవాదిదేవా! నీ కృపా పాత్రుడనై నేను రావణునకు గల సమస్తసైన్యములో నాల్గవ వంతును మడియించితిని. అదియిది యననేల? లంకానగరమును అంతటిని దహనం ఒనరించితిని. రావణుని నగర వాసులననేల ? సైనికులననేల? తుదకు వాని మనసులో కూడా నీవంటే భయము కల్గునట్లు చేసితిని. అసురుల మనోబలము సమాప్తమయ్యెను. శ్రీరామప్రభూ! ఇక ఆలస్యం ఒనరింపక శత్రువును ముట్టడించుటయే ఉచితమగును.


Saturday 22 January 2022

శ్రీ హనుమద్భాగవతము (138)



ఇట్లు పల్కి సీతాదేవి దుఃఖింప ఆరంభించెను. ఆమె వానరరాజైన సుగ్రీవుని, యువరాజగు అంగదుడు, మతిమంతుడైన జాంబవంతుడు మొదలగు వానరవీరులందఱను ఆశీర్వదించుచు శీఘ్రమే లంకకువచ్చి రాసులను సంహరింపవలసినదిగా ప్రార్ధించినది. 


శ్రీ వాయునందనుని వలన భగవతియైన జానకి యొక్క సమాచారం విని శ్రీ రామచంద్రుడు ఎంతో కలత చెందెను. లక్ష్మణుని నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహింప ఆరంభించెను, వానర భల్లూక వీరులందఱు శోకముచే సజలనయనులైరి. కాని శ్రీ ఆంజనేయుడు మాత్రము ధైర్యముగా ఇట్లు పలుకుచుండెను. “తల్లి ఆజ్ఞను పొందినవాడనై అశోక వనమునందు గల మధుర ఫలములను ఆరగించితిని, రావణుని కలిసికొనవలెననెడి సంకల్పము కలిగినవాడనై నేను అతిసుందరమైన వాని అశోక వనమును విధ్వంసమొనరించితిని. రావణునికుమారుడైన అక్షయునితో పాటు అసంఖ్యాకులైన అసులవీరులను సంహరించితిని, తదనంతరము రావణకుమారుడైన ఇంద్రజిత్తు బ్రహ్మా స్త్రమును ప్రయోగించి నన్ను రావణునిసభకు తోడ్కొని పోయెను. అచ్చోట దుష్టుడైన ఆ రావణుడు నా వాలమునకు నిప్పుపెట్టవలసినదిగా ఆజ్ఞాపించినాడు. దేవాదిదేవా! నీకృప వలన నేను లంకానగరమును దగ్ధమొనరించితిని.


భగవంతుడైన శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, వానరరాజైన సుగ్రీవుడు, మహామతిమంతుడైన జాంబవంతుడు, అంగదుడు, ద్వివిదుడు, మైందుడు, నలుడు, నీలుడు మొదలగు వానరశ్రేష్ఠులందఱు లంకానగరములో జరిగిన సంఘటనలను శ్రద్ధగా ఆలకించుచుండిరి. శ్రీహనుమంతుడు శ్రీ రాఘవేంద్రుని చరణారవిందములపై పడినవాడై “ప్రభూ! ఈ కార్యములను అన్నింటిని నేనొనరింపలేదు. అంతర్యామివి, నా ప్రభుడవైన నీవు నాలో నుండి నీ శక్తిచే ఈ కార్యములను చేయించితి" వని సవినయముగా మనవి చేసికొనెను.”


Friday 21 January 2022

శ్రీ హనుమద్భాగవతము (137)



నేను పలికిన మధుర లీలా కథామృతమును గ్రోలినదై ఆమె ‘అమృతతుల్యమైన ఈ దివ్యలీలలను నాకు వినిపించిన ఉత్తముడు నా ఎదుటకు ఎందులకు రాలేదు'? అని పలికెను.


నేను వృక్షమునుండి దిగిన వాడనై ఆమె చరణారవిందములకు ప్రణామములను అర్పించితిని. వానరరూపుడనగు నన్ను గాంచి మొదట జానకీ దేవి అనుమానించినది. కాని నేను క్రమముగ అన్ని విషయములను ఆమెకు విన్నవించితిని. తదనంతరము నీ ముద్రికను ఆమెకు ఇచ్చితిని. అప్పుడు జానకి నన్ను విశ్వసించినది.


క్రూరుడైన రావణుని రాజ్యములో భయంకరులైన రాక్షస స్త్రీల నడుమ అత్యంతకష్టములను అనుభవించుచు నీ వియోగ దుఃఖముతో జీవితమును గడుపుచున్న ఆ తల్లి పుత్రుడనైన నన్ను చూడగానే పొంగివచ్చు దుఃఖమును ఆపుకొన లేకపోయినది. ఆమె 'కుమారా! నేనెట్లు అహర్నిశములు క్రూరులైన ఈ రాక్షసస్త్రీలచే కష్టములను అనుభవించుచున్నానో చూచితివి కదా! ఈ విషయమును వెంటనే నా ప్రాణనాథునకు నివేదింపు’ మని పలికినది. నేను అనేక విధముల అమ్మకు ధైర్యమును చెప్పి, ఊరడించి ఇట్లు పల్కితిని. “జననీ! నా ప్రభువును నేను చేరుటయే ఆలస్యము. అమితశక్తి సంపన్నుడగు రాఘవేంద్రుడు నీ సమాచారమును ఆలకింపగానే లంకకు వచ్చి అసురు వంశమును విధ్వంసమొనరింపగలడు.


దుఃఖించుచు అత్యంతకరుణతో నీవు శీఘ్రముగా రావలయునని ప్రార్థించుచు లక్ష్మణు కిట్లు సందేశమిచ్చినది. “లక్ష్మణా! నిన్ను నేను అజ్ఞానవశమున కఠోరవచనములను పల్కి బాధించితిని. అందులకు నన్ను క్షమింపుము. శీఘ్రమే శ్రీరఘునాయకునితో కలసివచ్చినవాడవై నన్ను రక్షింపుము, లేనిచో ఒక మాసము తరువాత నేను జీవించియుండను,”

Thursday 20 January 2022

శ్రీ హనుమద్భాగవతము (136)



లంకాయాత్రను గూర్చి వివరించుట 


త్రైలోక్యమోహనమైన శ్రీరామచంద్రుని ముఖారవిందమును అవలోకించుచు వినీతాత్ముడైన పవనకుమారుడు చేతులు జోడించి ఇట్లు పలికెను. “ప్రభూ! నేను పశుసమానుడను, అంతియేకాదు చంచలుడైన తుచ్ఛవానరుడను. నా విద్య, బుద్ధి, శక్త్యాదులేపాటివి? కాని నీ అనుగ్రహముచే దూది యైనా బడబాగ్నిని సహితము చల్లార్పగలదు. నీ ఆదేశానుసారముగా కిష్కింధాధిపతి ఇచ్చిన ఆజ్ఞను శిరసా వహించి సీతాదేవిని వెదకుటకు బయలు దేరితిని. అందఱు చూచుచుండగానే గగనమార్గమునకు ఎగిరి విశాలమైన సాగరమును దాటి లంకానగరము చేరితిని. రాక్షసుల దృక్కుల నుండి తప్పుకొనుటకు సూక్ష్మశరీరమును ధరించిన వాడనై సీతామాతను దశకంఠునకు ప్రియమైన అశోకవనములో అశోవృక్షము క్రింద శోకమగ్నురాలైయున్న తల్లిని దర్శించి విగత ధైర్యుడనైతిని. నేను వృక్షముపై కొమ్మలలో దాగి యుండగా క్రూరుడైన రావణుడు ఆ ప్రదేశమునకు వచ్చాడు. వియోగినియైన సీతా దేవిని వశపరచుకొనుటకు అతడు అనేక విధముల ఆమెను భయపెట్టెను, బెదిరించెను. కాని ఆమె వానిని ఒక కుక్కగా తలంచి నిరసించెను. అపుడా అధముడైన రాక్షసుడు ఆమెను చంపుటకు ఉద్యుక్తుడయ్యెను. పట్టపురాణియైన మండోదరి వానిని శాంతింపజేయగా ఒక మాసము గడువును విధించి అతడు వెడలిపోయెను. కాపుగా నున్న రాక్షస స్త్రీలు కూడా జనక రాజకుమారిని అనేక విధముల భయపెట్టిరి. వారందఱు వెడలిన పిమ్మట సీతా దేవి అసహ్యమైన వియోగ దుఃఖమును భరింపలేక ప్రాణములను త్యజించుట కుద్యుక్తురాలయ్యెను.    

ఆసమయమున నేను వృక్షముపై కొమ్మలలో దాగిన వాడనై నీ పావన చరితమును గానం ఒనరింపసాగితిని. నీ పుట్టుక మొదలుకొని దండ కారణ్యమునకు వెడలుట, సీతాపహరణము, సుగ్రీవునితో స్నేహము, వాలిని వధించుట, కిష్కింధాధిపతియైన సుగ్రీవుడు ఆమెను వెదకుటకు వానరులను నలుదిశలకు పంపుట, నేను కూడ శ్రీరామ కార్యార్థమై వెడలుట మొదలగు సంఘటనలను అన్నింటిని వర్ణించినవాడనై ' అమ్మా! నీదర్శనమును పొంది కృతారుడనైతినీ అని అంటిని.

Wednesday 19 January 2022

శ్రీ హనుమద్భాగవతము (135)



శ్రీ ఆంజనేయుని ద్వారమున తన ప్రాణ ప్రియురాలైన సీతా దేవి యొక్క సమాచారమును తెలిసికొని అత్యంత ప్రసన్నుడై ప్రభువిట్లు పలికెను. ఆంజనేయా! ఈ కార్యము దేవతలకు కూడా దుష్కరమైనది. నీవు ఒనరించిన ఈ మహోపకారమునకు నేనేమి ప్రత్యుపకారం ఒనరింపగలను? కుమారా! నేనెంతగానో ఆలోచించుకొని నీ ఋణమును ఎప్పటికిని తీర్చలేనని నిర్ణయించుకొంటిని.


ఇట్లుపల్కి కరుణావతారుడు, మహా ప్రభువైన శ్రీరామచంద్రుడు శ్రీ ఆంజనేయుని గాఢాలింగనం ఒనర్చుకొనుచు ఇట్లు పలికెను.


శ్లో || పరిరమ్భోహి మే లోకే దుర్లభః పరమాత్మనః |

అతస్త్వం మమ భక్తోసి ప్రియోసి హరిపుంగవ ||

(ఆ. రా. 5-5-63 )


పరమాత్ముడనైన నా ఆలింగనము లభించుట ఈ విశ్వములో అత్యంత దుర్లభము. వానరశ్రేష్ఠుడా ! నీకు ఈ సౌభాగ్యము సంప్రాప్తమయ్యెను. కావున నీవు నాకు పరమ భక్తుడవు, అత్యంతప్రియతముడవు నైతిని.


పరిపూర్ణ భగవంతుడైన శ్రీరామచంద్రుని అనన్యభక్తుడైన శ్రీమహా దేవాత్మజుని ఒక్కగానొక్క కోరిక పరిపూర్ణమయ్యెను.  ఆయన ఈ వానర శరీరమును ధరించుటలో గల ఉద్దేశ్యము సఫలీకృతమయ్యెను, ఆయన పులకితగాత్రుడై శ్రీరామచంద్రునకు అనేక ప్రణామములను అర్పించుచు ఆనంద మగ్నుడై సాశ్రుపూర్ణ నయనములతో ప్రభువు చరణకమలములను కడిగి ‘ దేవాది దేవా!' నన్ను రక్షింపుము. కరుణింపుమని ప్రార్థించెను. భక్తవత్సలుడైన ప్రభువు శ్రీ ఆంజనేయునిట్లు ప్రశ్నించెను. “కుమారా! ఈవిశాలమైన సముద్రమును ఎట్లు లంఘించి లంకను చేరితివి? లంకలో సీతాదేవి నెట్లు కనుగొంటివి? ఆమె ఎట్టి సందేశమును పంపినది? లంకాధిపతియైన రావణుని శక్తియుక్తులేపాటివి. ఈ విషయములను అన్నింటీని సవిస్తరముగా చెప్పు.


Tuesday 18 January 2022

శ్రీ హనుమద్భాగవతము (134)



ఆయన ఆ దుఃఖమును దిగమ్రింగుకొంటూ సీతాదేవి పంపిన సందేశాన్ని ఇట్లా పలుకనారభించెను. "జగన్నాథ! సీతాసాధ్వీ అధిక దుఃఖముతో దినములను గడుపుచున్నది. ఆమెను దశాననుడు అశోక వాటికలో బంధించెను. క్రూరులైన రాక్షస స్త్రీలు రేయింబవళ్ళు కాపలాయున్నారు. ఆమె ఒకమాసిన చీరను గట్టుకొనియున్నది. ఆమె సుదీర్ఘ కేశములు జడలుగట్టినవి. సతతము నీ ధ్యానములోనే ఆమె కాలము గడుపుచున్నది. ఆమె పృథ్విపై శయనించుచున్నది. ఆహారమును, జలములను, విసర్జించిన కారణమున ఆమె మిగులు కృశించెను. శోకముతో ‘రామా! రామా!” అంటూ జపించుచున్నది. నీ యందుగల ఆనన్యభక్తితో ప్రేరితురాలై దుస్సహములగు కష్టములను అనుభవించుచు కఠోర తపమొనరించుచున్న తల్లిని నేను గాంచితిని. రఘునాయకా ! నేను మరలివచ్చుచున్నపుడు అమ్మ నాకు చూడామణిని ప్రసాదించి నీకు గుర్తుగా చూపుమని పలికినది. చిత్రకూటములో సంభవించిన కాకిరూపుడైన జయంతుని వృత్తాంతమును నీకు జ్ఞాపకము చేయవలసినదిగా పలుకుచు, స్వామీ! అంతటి మహత్తరమైన శక్తిసంపన్నుడవైన నీవు కూడ మౌనము నేల వహించితివి? నా అపరాధముల నన్నింటిని క్షమించి నన్నుద్ధరింపుమని అమ్మ నీతో విన్నవింపవలసినదిగా పలికినది. 


శ్రీ ఆంజనేయుని వచనములను ఆలకింపగానే శ్రీరామ చంద్రుని హృదయము దుఃఖముతో నిండిపోయెను, పద్మముల వంటి ఆయన నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహింప ఆరంభించెను. సీతాదేవి పంపిన చూడామణిని తన హృదయమునకు హత్తుకొని శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో ఇట్లు పల్కెను. మిత్రమా ! ఈ చూడామణిని గాంచగానే నా హృదయము ద్రవించినది. దేవతలచే పూజింపబడు ఈ దివ్య మణి జలముల నుండి ఉద్భవించినది. నా మామగారైన జనక మహారాజు చేసిన యజ్ఞమునకు ప్రసన్నుడై సురేంద్రుడు ఈ దివ్య మణిని ఆయనకు ఒసంగెను. మా వివాహసమయములో నీ దివ్యమణిని జనకమహారాజు సీతకు ఒసంగెను. ఆమె శిరస్సుపై ఈ మణి సదా ప్రకాశించుండును. 


దోహ || సును కపి తోహి సమాన ఉపకారీ | 

నహి కోఉ సురనరముని తను ధారీ ||

ప్రతి ఉపకార కరౌ కా తోరా | 

సనముఖ హోఇ న సళత మన మోరా ||

సును సుత తోహి ఊరిన మై నాహి | 

దేఖే ఉకరి విచార మన మాహీ |


(మానస 5-31-3-4)


Monday 17 January 2022

శ్రీ హనుమద్భాగవతము (133)



అంగదాది వీరులందరు శ్రీరఘునాయకుని చూసి హర్టోల్లాస పూర్వకముగా ఆకాశమునుండి భూమిపైకి దిగిరి. వానర వీరులందఱు శ్రీరామ లక్ష్మణుల చరణారవిందములకు, సుగ్రీవునకు ప్రణామములు అర్పించిరి. చూచితిని సీతా దేవిని అంటూ శ్రీపవనకుమారుడు త్రిభువన పావనములైన శ్రీరామచంద్రుని చరణకమలములపై బడెను. ప్రభు దర్శనముచే ఆయన ఆనందమునకు అవధులు లేకపోయెను. స్వామి! జానకీ దేవి కఠోరమైన పాతివ్రత్య నియమములను ఆచరించుచు సదా నిన్నే స్మరించుచు సశరీరముతో కుశలముగా ఉందని శ్రీ ఆంజనేయుడు పలికెను.


జగజ్జననియగు జానకిని చూడగానే శ్రీ ఆంజనేయుడు పలికిన మధుర వచనములను ఆలకింపగానే శ్రీరామ లక్ష్మణ సుగ్రీవుల ఆనందమునకు అంతు లేకపోయెను. శ్రీరాము ప్రభువు అతిశయమైన ప్రీతితో అత్యంతాదరముతో శ్రీ అంజనేయుని చూచెను. శ్రీ ఆంజనేయుడు ప్రభువు యొక్క చరణారవిందములకు మాటిమాటికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి సుమిత్రానందనునకు, సుగ్రీవునకు నమస్కరించి ముకుళిత హస్తములతో శ్రీరామచంద్రుని దివ్యముఖారవిందమును తదేకదృష్టితో వీక్షించుచుండెను.


భగవంతుడైన రాముడు శ్రీ ఆంజనేయుని ఇట్లు ప్రశ్నించెను. “వాయునందనా! సీతా దేవి ఎక్కడ? ఆమె ట్లుండెను ? నా ఎడల ఆమె ఎట్టిభావము కలిగియుండెను. విదేహకుమారియైన సీతయొక్క సమాచారమునంతటిని చెప్పుము. శ్రీ పవనకుమారుడు మొదట దక్షిణ దిశ చూచినవాడై సీతకు శ్రద్ధాపూర్వకముగా సమస్కరించెను. తదనంతరం ఆయన నమ్రతతో ఇట్లు నివేదించెను, కరుణామయుడవైన ప్రభూ! నూఱు యోజనములు విస్తరించియున్న సముద్రమునకు ఆవలి తటముపై దశకంఠుని లంకానగరము కలదు. ఆ రాక్షసుల నగరములో అశోక వాటికలో అశోక వృక్షము చెంత అధిక దుఃఖమును అనుభవించుచు నిరంతరము నిన్నే స్మరించుచున్న సీతను గాంచితిని. ప్రభూ! జలహీనమైన మీనమువలె నీ వియోగముచే విలపించుచున్న ఆమె దుఃఖాతిశయమును చెప్పకుండుటయే మంచిది.


శ్రీ ఆంజనేయని వచనములను ఆలకింపగనే శ్రీరామ చంద్రుడు ధైర్యమును కోల్పోయెను. ఆయన నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహింపనారంభించెను. శ్రీ పవనకుమారుని నేత్రములు కూడ అశ్రుపూరితములయ్యెను. 

Sunday 16 January 2022

శ్రీ హనుమద్భాగవతము (132)



శ్రీ రామలక్ష్మణుల ముఖములపై తాండవించూ ప్రసన్నతను గాంచి వానరేశ్వరుడైన సుగ్రీవుడు కూడా ఆనందమగ్నుడయ్యెను.


శ్రీహనుమంతుని అదృష్టము


మహాబలవంతుడైన దధిముఖునిద్వారా సుగ్రీవాజ్ఞను ఆలకింపగానే మహామతిమంతుడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, శివావతారుడైన శ్రీ ఆంజనేయుడు మొదలైన వారందఱు విశాలమైన వానర సమూహముతో ఆకాశమునకు ఎగురుతూ బయలు దేరిరి. ప్రస్రవణగిరిపై శ్రీ రామ చంద్రుని సుందరమైన పర్ణ కుటీరము కలదు. ఆ సమయములో పర్ణ కుటీరమునకు ముందున్న స్ఫటిక శిలపై రామానుజునితో పాటు శ్రీరాముడు ఆసీనుడై యుండెను. సమీపముననే వానర సుగ్రీవులు కూర్చొనియుండిరి.


ప్రసన్నులైన వానరులతో ఆకాశమార్గమునుండి వచ్చుచున్న అంగదుని గాంచి వానరేశ్వరుడైన సుగ్రీవుడు కమల నయనుడైన శ్రీ రాఘవేంద్రునితో నిట్లు పల్కెను “ప్రభూ! ధైర్యమును వహింపుడు, నిస్సందేహముగా శ్రీ పవనాత్మజుడు సీతను కనుగొనియే యుండును. లేనిచో నిర్ణయించిన గడువు సమాప్తముకాగా యువరాజైన అంగదుడు, వానరులు ఇంత ప్రసన్నులుగా తిరిగిరారు.


శ్లో||


న హన్యః కర్మణో హేతుః సాధనే ఒస్స హనూమతః 

హనూమతీహ సిద్ధిశ్చ మతిశ్చ మతిసత్తమః| 

వ్యవసాయశ్చ శౌర్యం చ శ్రుతం చాపి ప్రతిష్ఠితమ్ || (వాల్మీకి రామాయణం 5_64_88_84)


మతిసత్తమా! ఈ కార్యము నెరవేరుటలో శ్రీ ఆంజనేయుడు దప్ప అన్యులు కారణం అనుకుంట అసంభవము, వానరశిరోమణియైన శ్రీ ఆంజనేయునిలోనే కార్యసిద్ధికి తగు శక్తి, బుద్ధులు కలవు. ఆయనలోనే ఉద్యోగము, పరాక్రమము, శాస్త్రజ్ఞానము ప్రతిష్ఠితము లైయున్నవి.


ఈ ప్రకారముగా వానరేశ్వరుడైన సుగ్రీవుడు బుద్ధి మంతులలో అగ్రగణ్యుడైన శ్రీరఘునందనుని ఊరడించుచుండగా శ్రీ ఆంజనేయుని అంగదుని ముందుంచుకొని హర్షాతిరేకముచే సింహనాదములను ఒనరించుచు వానరవీరులు వారి చెంతకు వచ్చిరి. వానర వీరులను గాంచగానే సుగ్రీవుడు ప్రసన్నుడై తన వాలమును పై కెత్తెను.


Friday 14 January 2022

శ్రీ హనుమద్భాగవతము (131)



దధిముఖుడు మొదలగు వనరక్షకులు ఆ మహావీరులను అడ్డగించారు. యువరాజైన అంగదుని యొక్క శ్రీరామభక్తుడైన ఆంజనేయుని యొక్క అండ చూచుకొని మధువును త్రాగి మత్తులైన ఆ వానర వీరులు వనరక్షకులను తిరస్కరించి వారిని మోద ఆరంభించారు.


వివశుడైన దధిముఖుడు వానరేశ్వరుడైన సుగ్రీవుని చెంతకు చేరి ఇట్లు నివేదించాడు. రాజా ! నీవుచిరకాలము నుండి రక్షించుకొనుచున్న సుందరమైన మధువనమును హనుమద అంగదాదుల ప్రోద్బలముచే వానరులు నష్టం మొనరించారు. అంతేగాక వారు వనరక్షకులమైన మమ్ము కొట్టిరి. 



సుగ్రీవుని ఆనందమునకు అంతు లేకపోయెను. దధిముఖునితో ఇట్లు పలికెను. “మామా! నిశ్చయముగా శ్రీ ఆంజనేయుడు జానకిని దర్శించియే యుండును, లేనిచో మధు వనమును సమీపించు సాహసము వారికెక్కడిది? యువరాజు అట్టి అనుజ్ఞని ఇవ్వజాలడు. నీవు వారిని క్షమింపుము.”


అప్పుడు భగవానుడైన శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో "రాజా! నీవు సీతాసంబంధమైన మాటలేల పలుకుచున్నా”వని అనెను. అందులకు సుగ్రీవుడు వినయ పూర్వకముగా ప్రభూ! శ్రీహనుమంతుడు సీతను దర్శించినట్లుగా తోచుచున్నది. లేనిచో మధువనమున ప్రవేశించి దానిని నష్ట మొనరించుటకు వానరులు సాహసింపజాలరు” అని విన్నవించెను. ఈ శుభ సమాచారముచే శ్రీరామచంద్రుని హృదయం ఆనందముతో ఉప్పొంగెను, సుగ్రీవుడు దధిముఖుని “మామా! నీవు తక్షణమే వెళ్ళి ఆ వానరశ్రేష్ఠులను సీతా దేవి యొక్క శుభ సమాచారమును ప్రభువునకు యథాశీఘ్రముగా విన్నవించుటకు రావలసినదిగా తెలుపు"మని ఆజ్ఞాపించెను. దధిముఖుడు "వెడలి పోయెను.


Thursday 13 January 2022

శ్రీ హనుమద్భాగవతము (130)



తదనంతరము అంగదజాంబవంతాదులను పరామర్శించి శ్రీ ఆంజనేయుడు వాసర భల్లూక సముదాయములను వెంట నిడుకొని శ్రీరామచంద్రునకు సుఖదాయకమైన ఈ సమాచారమును వినిపించుటకు వానరరాజైన సుగ్రీవుని చెంతకు బయలు దేరెను. శ్రీ ఆంజనేయుడు ముందు నడుచుచుండగా హర్షహృదయులై వానర భల్లూకములు ఎగురుచు, దుముకుచు ఆయనను అనుసరించిరి. ఆ సమయములో సిద్ధులు, సాధ్యులు మొదలగు వారందఱు వేదశాలి, మహాబలవంతుడు, బుద్ధి మంతుడునైన పవనాత్మజుని సజల నయనములతో దర్శించుచు అనేకవిధముల ప్రశంసింప దొడంగిరి.


ఆకాశములోనికి దుముకుచు, నెగురుచు హరషోన్మత్తులైన వానర భల్లూక వీరులు నందనవనమువలె భాసించు మనోహరమైన మధువనమును సమీపించిరి. కిష్కింధాధిపతియైన సుగ్రీవుడు మధువన రక్షణార్థమై తన మేనమామ, మహా బలవంతుడైన దధిముఖుడనే వాసర శ్రేష్ఠుని నియోగించెను. మనోహరమైన ఆ వనమును గాంచగనే వానర భల్లూకములకు మధువును ఆస్వాదింపవలెనని, ఫలములను ఆరగింపవలెనని కోరిక జనియించెను. వారు యువరాజైన అంగదుని అనుమతిని అడిగిరి, జాంబవంతుని, మహావీరుడైన శ్రీహనుమంతుని సంప్రదించి యువరాజు వారి కోరికను మన్నించెను. ప్రసన్నులైన కామ్రవర్ణముగల వానర భల్లూక వీరులందఱు మధువనమును ప్రవేశించి మధువును త్రాగుచు మధురఫలములను ఆరగుస్తూ ఎగురసాగారు. వానరులు మధువును త్రాగి మత్తులైరి. సీతా దేవి యొక్క సమాచారము తెలిసికొని ప్రసన్నులై మధువును త్రాగి మత్తులైన వానరులస్థితి విచిత్రముగా నుండెను. ఆనందమగ్నులై కొందఱు పాడుచున్నారు, కొందఱు నవ్వుచున్నారు, నృత్య మొనరించుచున్నారు, కొందఱు ఆకాశమునకు ఎగురుతూ దూకుచున్నారు, కొందఱు వాచాలురై పలుకుచున్నారు, కొందఱు మధువును త్రాగి మిగిలిన దానిని ఒలకబోయుచున్నారు. కొందఱు ఫలభరితములైన వృక్షశాఖలను త్రుంచుచున్నారు. ఉద్దండులైన మఱికొందఱు మదమత్తులై వృక్షములను పెకిలింప ఆరంభించారు. ఇట్లు అత్యంత రమణీయమైన మధువనమంతా నష్ట భ్రష్టమయ్యింది.

Wednesday 12 January 2022

శ్రీ హనుమద్భాగవతము (129)



నేను సీతా దేవి చరణారవిందములను దర్శించి, స్పృశించి ధన్యుడనైతినని శ్రీహనుమంతుడు పలుకగా జాంబవంతుడు ఆ మహాభక్తుని ప్రేమతో ఆలింగనం ఒనరించుకొనెను. ఆ భల్లూక వీరుడు గద్గద స్వరముతో 'పవనకుమారా ! నీవు మా అందఱి ప్రాణములను రక్షించితివని కొనియాడెను. సీతా దేవి సురక్షితముగా ఉందనే విషయము తెలుపగానే వానర భల్లూక వీరులందఱు కిలకిలారవములు ఒనరించుచు ఎగురడం ఆరంభించిరి. హర్షాతిరేకముచే వానరులందఱు తమ వాలమును పైకె కెత్తినవారై నృత్యం ఒనరించారు. కొందఱు బలిష్ఠములు దీర్ఘములు నైన తమ వాలములను గిరగిరద్రిప్పిరి. మఱికొందరు శ్రీ ఆంజనేయుని వాలమును ముద్దాడ ఆరంభించిరి; కొందఱు ఆయన ఆరగింపవలసినదిగా సమ్ముఖమున కందమూలఫలములను ఉంచి ప్రార్థిం౦చిరి. మఱికొందఱు తదితరములగు సేవలను ఒనరింపసాగిరి. ఈశ్వరనందనుడు కొందఱి చరణములకు ప్రణామములను అర్పించెను. మఱికొందరిని ఆలింగనం ఒనరించుకొనెను, పిన్న వయస్కుల శిరముపై దక్షిణహస్తము నుంచి ఆశీర్వదించెను. మఱికొందరిని వీపు పై నిమిరి ప్రశంసించెను. సర్వసమర్ధుడగు ఆ రుద్రాంశుడు కొలదిక్షణములలోనే సకల వానర భల్లూక వీరులను కలుసుకున్నాడు. శోకహరుడైన శ్రీకపిసత్తముడు సీతను దర్శించిన విధానమును, రావణునకు చేసిన ఉపదేశమును, లంకా దహన కార్యక్రమమును యువరాజైన అంగదునకు వివరించెను. శ్రీ రామభక్తుడైన అంగదుడు పరమానంద భరితుడై శ్రీ ఆంజనేయునితో


శ్లో॥ సత్తే వీర్యే న తే కశ్చిత్ సమో వానర విద్య తే ॥ 

యదవప్లుత్య విస్తీర్ణం సాగరం పునరాగతః | 

జీవితస్య ప్రదాతా న స్త్వమేకో వానరోత్తమ ||

త్వత్ప్రసాదాత్ సమేష్యామః సిద్ధార్థ రాఘవేణ హ | 

అహో స్వామిని భక్తిరహో వీర్యమహో ధృతిః ||


(వాల్మీకి రామాయణము 5_57_45_4)


వానర శేషా ! బలపరాక్రమములలో నీతో సమానమైన మరియొకరు లేరు. నీవీ విశాలమైన సముద్రమును దాటి ఆవలి ఒడ్డు చేరి మరలివచ్చితివి. కపిశిరోమణీ ! మా అందఱికి జీవనదాతవు నీ వొక్కడవే. నీ అనుగ్రహ విశేషము చేతనే మేమందఱము సఫలమనోరథులమై శ్రీ రామచంద్రుని దర్శింప బోవుచున్నాము. పరమప్రభువైన శ్రీరఘునాయకుని ఎడల నీ భక్తి అద్భుతము. నీ పరాక్రమము, నీ ధైర్యము ఆశ్చర్య జనకములు.


నీవు మహాసాధ్వియైన సీతాదేవి దర్శనమును బొందు అత్యంతము సౌభాగ్యకరమైన విషయము, సుఖప్రదమైన సమాచారముచే శ్రీరామచంద్రుని శోకమంతయు నశించును.


Tuesday 11 January 2022

శ్రీ హనుమద్భాగవతము (128)



వయోవృద్ధుడైన శ్రీ మహర్షి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చాడు. “ఆంజనేయా! భగవంతుడైన శ్రీ రామచంద్రుడు  అనేక పర్యాయము లీ భూమి పై అవతరించాడు. ప్రతి అవతారమందు సీతాపహరణము జరుగుతూనే ఉంది. సీతను అన్వేషించుటకు హనుమంతుడు పంపబడుతుంటాడు. ఆయన సీతను దర్శించి మరలివస్తూ నా వద్దనుంచిన ముద్రికలను వానరములు నా కమండలములో పడవేసినాయి. వీనిలో నీ ముద్రికను వెతుక్కో.


శ్రీ హనుమంతునిలో ఉద్భవించిన గర్వాంకురము ఆ మూలాగ్రముగా నశించెను. ఆశ్చర్యచకితుడై ఆయన మహర్షిని పూతచరితా! నేటివరకు శ్రీరామచంద్రుడెన్ని అవతారములను ధరించెను అని ప్రశ్నించెను. అందులకు మహర్షి కమండలములోని ముద్రికలను లెక్కింపవలసినదిగా పల్కెను. శ్రీ హనుమంతుడు తన దోసిళ్ళతో శ్రీరామ ముద్రికలను కమండలము నుండి తీయడం ఆరంభించెను. వాని కంతులేదు, అవి అసంఖ్యాకములు. శ్రీహనుమంతుడు ఆ మహర్షి చరణారవిందములకు నమస్కరించి ఇట్లా ఆలోచించెను. భగవంతుడైన శ్రీ రామచంద్రుని గుణములకు, శక్తులకు అంతము లేదు. ఆయన అవతారములకు కూడా లెక్కలేదు. నాకు పూర్వము కూడా జగత్ప్రభువైన శ్రీ రామచంద్రుని ఆజ్ఞానుసారముగా బయలు దేరి ఎందఱో ఆంజనేయులు సీతాన్వేషణార్థమై శ్రీరామకార్యమును సాధించిరి. వారిలో నేనెంతటివాడను.


అభిమానము నశించినంతనె శ్రీ ఆంజనేయుడు శ్రీసీతారామచంద్రుల చరణారవిందములకు అనేక పర్యాయములు ప్రణామములను ఆచరించెను. తదనంతరం ఆ గిరిశృంగము నుండి సముద్రతటము జేరెను. శ్రీ ఆంజనేయుడు ప్రకాశించు సూర్యునివలె వచ్చుచుండుట గాంచిన వానరులందఱు జయజయ ధ్వానములను ఒనరిస్తూ ఆయన చుట్టూ జేరాడు.


Monday 10 January 2022

శ్రీ హనుమద్భాగవతము (127)



ఉత్తరదిశయందుగల సముద్రతటముపై శ్రీ ఆంజనేయుడు దిగెను. ఆ ప్రదేశములో భగవంతుని భజించుచున్న ఒక ముని వర్యుని గాంచెను. శ్రీహనుమంతుడు విరక్తుడగు మహర్షితో ఇట్లుపల్కెను. "మునివరా! నేను శ్రీరామ చంద్రుని ఆదేశానుసారముగా ఆయన ప్రాణాధికురాలైన జనక రాజనందిని వార్తను తెలుసుకున్ని సముద్రమును దాటి వచ్చుచున్నాను. దప్పికచే వ్యాకులుడనగుచున్నాను. దయతో నాకు జలాశయమును చూపించుము”.


తపస్వియైన ఆ ముని జపం ఒనరించుచు తన చూపుడు వ్రేలితో ఒక జలాశయమును చూపెను. శ్రీహనుమంతుడు ఆ మహర్షికి తన లంకాయాత్రా విశేషములను చెప్పుచు తానొనరించిన ఘనకార్యములకు తనలో తాను కించిద్గర్వమును పొందెను. సర్వవ్యాపకుడైన భగవంతునకు ఆ విషయము విదితమేగదా! భగవంతుడు భక్తగర్వాపహారి. ఆయన ఆదర్శ సేవకుడైన శ్రీహనుమంతుని హృదయములో సూక్ష్మాతి సూక్ష్మముగానైనా గర్వభావము స్ఫురించుటం ఎట్లా సహించగలడు? తత్ క్షణమే ఆ గర్వభావమును తొలగించుటకు ఆయన ఒక దివ్యలీలను రచించాడు.


శ్రీ పవనాత్మజుడు చూడామణిముద్రికలను, విధాత ఒసంగిన పత్రమును జపం ఒనరించుచున్న ఆ ముని సమీపమున నుంచి తన దప్పికను చల్లార్చుకొనుటకు జలాశయము చెంతకు వెళ్ళెను. అదే సమయములో ఒక చిన్న వానరము ఎగురుతూ వచ్చి శ్రీరామనామాంకితమైన ముద్రికను మహర్షి కమండలములో పడవేసి వెడలిపోయెను.


జలములను త్రాగి శ్రీహనుమంతుడు తిరిగివచ్చాడు. చూడామణి పత్రములతో ముద్రికను కనుగొన లేక ముద్రిక ఏమైనదని మహర్షిని ప్రశ్నించెను.

ఆ మహర్షి కమండలము వైపు చూపెను. శ్రీహనుమంతుడు ఆ కమండలములో హస్తము నుంచి ముద్రికకై వెదకగా శ్రీరామనామాంకితముద్రికలు వందలకొలది ఉన్నాయి. మరల పవనాత్మజుడు కమండలములో చేయి నుంచగా వేలకొలదిగా శ్రీరామాంకితముద్రికలు బయల్వెడలేను.  ఎన్ని పర్యాయములు తీసినా అవి అసంఖ్యాకముగా బయటపడుతున్నాయి. అంగుళీయకములలో తాను తెచ్చిన ముద్రికను హనుమంతుడు గుర్తింపలేకపోయాడు. మహావీరుడు, అంజనీనందనుడునైన హనుమంతుడు పరమాశ్చర్యమును పొందాడు. చకితుడైన శ్రీపవనాత్మజుడు ఆ మహర్షిని ఇట్లు ప్రశ్నించెను.  మునీశ్వరా! అసంఖ్యాకములైన ఈ ముద్రిక లెచటి నుండి వచ్చినవి? వీనిలో నే తెచ్చిన ముద్రిక యేది?

Sunday 9 January 2022

శ్రీ హనుమద్భాగవతము (126)



దశకంఠుని బంగారులంకకు నిప్పుపెట్టి శ్రీ కేసరీనందనుడు జగజ్జనని యైన జానకి సమీపమునకు పోయేను. ఆయన తల్లి చరణారవిందములకు ప్రణామములు ఆచరించి ఇట్లు ప్రార్థించెను. “తల్లీ ! నీవు నా భుజస్కంధములపై కూర్చుండుము. క్షణమే నిన్ను సముద్రము దాటించి శ్రీరామచంద్రుని చెంతకు చేర్చగలను”.


అందులకు వైదేహి ఇట్లు ఉత్తరం ఇచ్చింది. "కుమారా ! అప్రమేయుడు, శూరుడు, వీరుడైన నా ప్రాణ నాథునకు అన్యులు నన్ను చెరనుండి విడిపించుట స్వప్నమందైనను సమ్మతము కాజాలదు. రావణుని వధ, నా బంధవిమోచనము నా ప్రాణనాథుని కరకమలములచే జరుగుట నాకూ, ఆయనకు శోభాకరము. అందువలన నీ స్వామియొక్క కీర్తి దశదిశల వ్యాపించును. నీవు చూడామణిని, శ్రీరామ నామాంకితమునైన ముద్రికను తీసికుని వెళ్ళి ప్రభువున కిమ్ము, క్షణమైనను విలంబనం ఒనరింపక వెంటనే నన్నుద్ధరించుటకు రావలసినదిగా ప్రభువును ప్రార్థింపుము.


ఆంజనేయుడు తల్లి నుండి చూడామణిని, శ్రీరామ ముద్రికను అత్యంతాదర పూర్వకముగా తీసుకుని పరమపావనమైన సీతా దేవి పాదపద్మములకు నమస్కరించి బయలు దేరెను. ఆ మహావీరుడు సముద్రతటము నందున్న గిరిశిఖరమును అధిరోహించి ఆకాశమునకు ఎగిరాడు. పర్వతం ఆయన వేగమును సహించలేక చూర్ణమయ్యింది. ఆ సమయములో లోకపితామహుడైన బ్రహ్మ దేవుడు లంకాదహన కార్యక్రమమును గూర్చి విస్తృతవర్ణనము గల ఒక పత్రమును శ్రీ రామచంద్రునకు చేర్చవలసినదిగా శ్రీహనుమంతునకు ఇచ్చాడు. శ్రీ రామ దూత చతురాసనుని పత్రమును, జానకి ఒసంగిన చూడామణి ముద్రికలను తీసుకొని భయంకరమైన సింహనాదం చేస్తున్నవాడై ఆకాశమార్గమున సముద్రమును దాటెను.


Saturday 8 January 2022

శ్రీ హనుమద్భాగవతము (125)



సముద్రమధ్యమున నున్న పర్వతరాజగు సునాభుని (అనగా మైనాకుని) స్పృశించినవాడై అత్యంత వేగశాలియైన పవనకుమారుడు ధనుస్సు నుండి వదలిన బాణమువలె సముద్రమునకు ఆవలనున్న తటమును చేరెను. మహేంద్ర పర్వతమును గాంచగానే శ్రీ ఆంజనేయుడు గంభీరమైన స్వరముతో అనేక పర్యాయములు గర్జించెను.


సముద్రమున కావలి ఒడ్డునకు చేరుట


లంకాదాహకుడైన శ్రీకపీశ్వరుని సింహనాదమును ఆలకించి సముద్రమునకు ఆవలి తటమునందున్న కోటాను కోట్ల వానర భల్లూక వీరులు సంతోషముతో కిలకిలారవముల నొనరించుచు, ఎగురుచు నృత్యమొనరించిరి. శ్రీ హనుమంతుడు సీతా దేవిని దర్శించి తిరిగి వచ్చుచున్నాడని వారికి విశ్వాసము కలిగింది. శూరులు, వీరులు, మహాబలవంతులైన వానర భల్లూకములు ఉత్తరతటముపై నిలువబడి కందర్ప కోటి లావణ్యసుందరాకారుడైన శ్రీరామదూతయైన శ్రీ ఆంజనేయుని రాకకై కండ్లు తెరచుకొని నిరీక్షింపసాగారు. కపి శ్రేష్ఠుడు, శ్రీమారుతాత్మజుడైన శ్రీ ఆంజనేయుని సింహ నాదమును గుర్తించినవారై ఆయనను దర్శింపవలెనని ఆ వానర భల్లూక వీరులు గిరుల నెక్కిరి; కొందఱు ఆకాశమునకు ఎగిరారు. అదే సమయమందు వేగవంతుడు, బృహత్కాయుడైన ఆంజనేయుడు మహేంద్రగిరి శిఖరముపై దిగాడు. 


గోద్విజులకు హితమును ఒనరించువాడు, పరమప్రభువు, పాపతాపములను నివారించువాడైన భగవంతుడు ధర్మ సంస్థాపనార్థము ధర్మాభ్యుదయముకొఱకు ప్రతియుగము నందు అవతరించును. మధురములు, శుభప్రదములైన ఆ ప్రభుని లీలలు పరమాశ్చర్యకరములు. తన నుండి దూరముగా పోయిన జీవులను తన చెంతకు చేర్చుకొనుటకై భగవంతుడిట్టి అద్భుత లీలలను ఒనరించును. ఆనంద రామాయణములో ఒక కల్పములో భగవానుడైన శ్రీరామచంద్రుని అవతారలీలలు వర్ణింపబడెను. ఆ రామాయణ మందు పవన కుమారుని అద్భుత పావనకథ కలదు. అది సంక్షేపముగా ఇట్లున్నది.


Friday 7 January 2022

శ్రీ హనుమద్భాగవతము (124)



సీతాదేవి నేత్రములు మరల అశ్రుపూరితములయ్యెను. కండ్లను తుడుచుకొనుచు ఆమె "కుమారా! హనుమాన్ ! వెంటనే వెళ్ళుము. ప్రభువును తోడ్కొని శీఘ్రముగా తిరిగి రమ్ము. విలంబనం ఒనరింపకుము. నీకు శుభమగుగాక!” అని పల్కెను.


సృష్టిస్థితిసంహార కారిణియైన సీతా దేవివలన ఆశీర్వాదము పొంది, శ్రీరామచంద్రుని చరణారవిందములను మనస్సునందు స్మరించుకొనుచు శ్రీహనుమంతుడు ఎగిరి అరిష్టగిరి పైకి విశాల శైలము పై నిలువబడి వాయునందనుడు, కపి నైన శ్రీహనుమంతుడు తన శరీరమును పెంచెను. ఆయన దక్షిణమునుండి 'సముద్రమును' దాటుటకు వేగముగా ఆకాశమునకు ఎగిరెను. ముప్పది యోజనముల ఎత్తు, పదియోజనముల వెడల్పు కలిగిన శోభాయుతమైన ఆ మహీధరము శ్రీ ఆంజనేయుని పదఘట్టనముచే వృక్ష శిఖర సహితముగా భూమిలోనికి క్రుంగిపోయెను.


అరిష్టగిరినుండి గగనతలమునకు ఎగిరినవాడై మహాబలవంతుడు, వజ్రాంగుడునై శ్రీహనుమంతుడు భయంకరముగా గర్జించెను. ఆ భీషణ గర్జనమునకు దిశలు కంపించెను. ఆకాశము విదీర్ఘమయ్యెను; మేఘములు అటునిటు చెదరిపోయెను. సముద్రతరంగములు ఆకాశమునకు లేచెను. గిరిశృంగములు భగ్నమై దొర్ల దొడంగెను. అది ఇది అననేల! లంకానగర మంతా కదలిపోయెను. భూకంపము వచ్చినదా అని అసురులు ఎక్కడివారక్కడనే ఉండి కంపింప దొడంగిరి. గర్భవతులైన రాక్షసస్త్రీలకు గర్భపాతమయ్యెను. సభలో సభాసదుల మధ్యలో సింహాసనమును అధిష్ఠించి ఉన్న దశకంఠుడు ఆ తాకిడికి సింహాసనము పై నుండి క్రిందపడెను. రత్నమయమైన వాని కిరీటము శిరమునుండి జారిపడెను. ఇట్లా అనేకములైన అపశకునములను గాంచి అసురులు రాబోవు వినాశనమును చర్చించుకొనుచుండిరి. అందఱియందు భయము, ఉదాసీనత వ్యాపించెను.


Thursday 6 January 2022

శ్రీ హనుమద్భాగవతము (123)



తల్లి యొక్క ఈ దయనీయమైన పరిస్థితిని గాంచగనే మహావీరుడైన హనుమంతుని ధైర్యము సహితము సన్నగిల్లెను. దుఃఖము పెల్లంబుగా ఆయన వెక్కి వెక్కి ఏడ్వ నారంభించెను. ఎంతో కష్టముతో తన్నుతాను సంబాళించు కొని ఇట్లుపల్కెను. "అమ్మా! నీవు ధైర్యమును వహింపుము. నేను ఆవలకు చేరగానే నిన్నుద్ధరించుటకు ప్రభువు బయలు దేరి రాగలడు.” కొంచెమాగి ధైర్యముతో శ్రీహనుమంతుడిట్లా పల్కెను. “జననీ! శ్రీ రామచంద్రుడు నీకొఱకై ముద్రికను పంపినట్లుగా నీవు కూడా ఒక చిహ్నము నిమ్ము. దానిని నేను ప్రభువునకు చూపింపగలిగెదను.”


సీతా దేవి తన కేశపాశమునుండి చూడామణిని బయటకు తీసి శ్రీపవనాత్మజునకు ఇచ్చుచు ఇట్లు పల్కెను. “వత్సా! ఈ చూడామణిని గాంచగనే ఆర్యపుత్రుడు లక్ష్మణుడు, నిన్ను విశ్వసింపగలరు. నిన్ను విశ్వసించుటకు నీకొక రహస్యమును చెప్పెదను. దానిని నా ప్రాణనాథునకు నివేదింపుము. ఇది చిత్ర కూట పర్వతముపై జరిగిన సంఘటన. ఒక దినమున నా జీవన సర్వస్వమైన శ్రీ రామభద్రుడు నా ఒడిలో శిరమును ఉంచి నిద్రించుచుండెను. ఆ సమయములో ఇంద్రకుమారుడైన జయంతుడు వాయసం (కాకి) వేషమును ధరించి మాంసలోభియై ఎఱ్ఱని నా కాలి వేళ్ళను తన తీక్షమైన ముక్కుతో పొడవటం ఆరంభించెను. ప్రభువునకు నిద్రాభంగము కాగా జరిగినది గాంచి ఎదురుగా నున్న రక్తసిక్తముఖముగల వాయసమును చూసి కోపించినవాడై ఒక తృణమును తీసికొని దివ్యాస్త్రముగా జయంతునిపై ప్రయోగించెను. కాకరూపమున నున్న జయంతుడు భయమునొంది పలాయనము చిత్తగించెను. దివ్యాస్త్రము వానిని వెంటాడెను. జయంతుడు బ్రహ్మాది దేవతలను శరణువేడగా ఆ శ్రీరామచంద్రునకు వ్యతిరేకముగా వారు ఆశ్రయమును ఈయలేమన్నారు. తుదకు 'రక్షింపుము, నా అపరాధమును క్షమింపు'మనుచు ప్రభువు చరణములను ఆశ్రయించెను. ఆ అస్త్రం అమోఘము; అందువలన జయంతుడు తన ఎడమ కంటిని సమర్పించి ప్రాణములను రక్షించుకొన్నాడు. శరణాగత వత్సలుడైన ప్రభువును అనేక విధముల ప్రార్థించినవాడై నిజ ధామమున కేగెను. కుమారా! అచింత్యమగు శక్తి సంపన్నుడైన ప్రభువును శీఘ్రమే రావలసినదిగా పార్థింపుము.


శ్రీ ఆంజనేయుడు సీతా దేవి చరణారవిందముల పై శిరము నుంచి “తల్లీ! నా కనుజ్ఞని”మ్మని ప్రార్థించెను.


Wednesday 5 January 2022

శ్రీ హనుమద్భాగవతము (122)



వినయపూర్వకముగా శ్రీహనుమంతుడి ఇట్లు పల్కెను. "జననీ! ఈ వాసర భల్లూకముల శక్తి ఏపాటిది? వీరు ఒక చెట్టు కొమ్మనుండి మరియొక కొమ్మపైకి గెంతగలరు; కాని పరమ ప్రభువైన శ్రీరామచంద్రుని దివ్యశక్తినలన సర్వము సంభవమగును. ఆయన దయ గల్గినచో ఒక క్షుద్ర సర్పమైనను మహా బలవంతుడైన గరుత్మంతుని సహితము మ్రింగివేయగలదు. అవిటివాడు ఆకాశమునంటు పర్వతమునైనను దాటుటకు సమర్థుడగును. అవాఙమానసగోచరుడును, అచింత్యుడును అయిన శ్రీరామచంద్రుని దర్శించగానే సముద్రుడే స్వయముగా మార్గమును ఈయగలడు. సముద్రుడు మార్గమును ఇవ్వక విలంబమొనరించినచో వానిని శుష్కింపజేయుటకు సుమిత్రానందనుని బాణమొకటి చాలును. ఇక వానరేశ్వరుడైన సుగ్రీవుడు కోట్లకొలది వానర భల్లూక యోధులతో కదలివచ్చును. మహాశక్తి సంపన్నుడైన కపీశ్వరుడు శ్రీ రామచంద్రుని ఆజ్ఞా పరిపాలకుడు. ఆ ప్రభువు నిన్నుద్ధరించెదనని ప్రతిజ్ఞబూనెను. శ్రీరామచంద్రుని చెంత సకలసాధనములు కలవు. నీవు ధైర్యమును వహింపుము. నా ప్రభువు వెంటనే ఈ ప్రదేశమున కేతెంచి నిన్నుద్ధరింపగలడు. శ్రీ అంజనీనందనుని సమాధానమును విని సీతా దేవి ప్రసన్నురాలయ్యెను. ఆమె గద్గదమగు కంఠముతో ఇట్లు పల్కెను. “కుమారా! నాథుని చరణార విందములకు నా ప్రణామములను నివేదింపుము. దయనీయమైన నాస్థితిని ఆయనకు విన్నవింపుము. వెంటనే నన్నుద్ధరించుటకు రావలసినదిగా అంజలి ఘటించి ప్రార్థింపుము. నేను ప్రతి క్షణము శ్రీరామచంద్రుని నిరీక్షణములోనే జీవించుచుంటిని. రావణుడు పెట్టిన గడువు సమాప్తమైన మరుక్షణము ప్రాణము లాగవు. 


సీతా దేవి నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహించు చుండెను. ఆమె వానిని తుడిచివేయుచు ధైర్యపూర్వకముగా తన ప్రాణనాథునకు సందేశము నిచ్చుచు మధ్యలో ఇట్లు పల్కెను. “కుమారా ! స్నేహపాత్రుడైన నా మరిదితో నన్ను క్షమింపవలసినదిగా చెప్పు. నా ఆశీర్వచనమును అతనికి అందింపుము. వానరరాజగు సుగ్రీవునకు, జాంబవంతునకు, యువరాజైన అంగదుడు మొదలగు వారికి నా ఆశీస్సులను అందింపుము. నేను మీతో గలసి వచ్చుచున్న శ్రీ రామ చంద్రునికొఱకై అనుక్షణము నిరీక్షించుచుంటినని పలుకుము.' ఇట్లు పల్కి అరవిందలోచనయైన సీత దుఃఖముచే పమిట చెంగుతో ముఖమును గప్పుకొనెను.


Tuesday 4 January 2022

శ్రీ హనుమద్భాగవతము (122)



రచన - శ్రీ మట్టుపల్లి శివ సుబ్బరాయ గుప్త

వైదేహి నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహించాయి. ఆమె ఎంతో బాధతో ఇట్లు పల్కెను. “కుమారా! నీ ఆగమనముచే నాకొకింత ఆధారము దొరికింది. నీవు కూడా ప్రయాణమగుచున్నావు. నీవు మరలిపోయిన పిమ్మట నాకిక ఆ దుఃఖపు దినములు, రాత్రులు సంప్రాప్తించును. వత్సా! నీవు ఒకింత డస్సినచో ఈ ప్రదేశమందు ఏదో ఒక స్థావరమందు దాగి విశ్రాంతి తీసుకో. నేడు విశ్రమించి రేపు పొమ్ము”.


అత్యంత శ్రద్ధాభక్తులతో పవనాత్మజుడిట్లు నివేదించెను. తల్లీ ! ప్రభువు కార్యము పరిపూర్ణము కాకుండా నాకు విశ్రాంతి ఎక్కడ? నీ అమోఘమైన ఆశీర్వాదము నాకు కలదు. నేను ఏ వేగముచే ఇచ్చటకు వచ్చితినో, అదే వేగముతో సముద్రమును దాటి ఆవలి ఒడ్డును చేరుతాను. అచ్చోట కోటానుకోట్ల వానర భల్లూక వీరులు నా కొఱకై నిరీక్షీంచుచున్నారు. నీ శుభ సమాచారమును ఆలకింపగానే వారికి ప్రాణములు తిరిగివచ్చును. తదుపరి వానర సైన్యముతో ప్రభువు ఈ ప్రదేశమునకు రాగలడు. మీరిర్వురు దివ్యసింహాసనము పై అధిష్ఠించి ఉండగా దర్శించి మా జన్మములను చరితార్థం ఒనరించుకొనగలము.


సీతా దేవి ఆప్యాయతతో ఇట్లు పలికెను. “కుమారా! నా మనస్సులో ఒక సందేహము ఇప్పటివరకు తొలగిపోలేదు. ఈవిశాల సాగరమును దాటగల సమర్థులు ఈ విశ్వములో ముగ్గురకు కలదు. నీకు, గరుత్మంతునకు, వాయు దేవునకు. ఇక వానర భల్లూకముల సహాయమున్నను మహాబలశాలియగు సుగ్రీవుడు ఈ దుర్లంఘ్యమైన మహాసముద్రమును ఎట్లు దాటగలదు? ఆ విశాల సైన్యముతోను శ్రీరామానుజునితోను శ్రీరాముడు ఎట్లా ఈ దారికి రాగలడు ? 


Monday 3 January 2022

శ్రీ హనుమద్భాగవతము (121)



సీతాదేవికడ సెలవు తీసుకొనుట


హర్షాతిరేకముచే శ్రీహనుమంతుని నోటినుండి జయ జయ శ్రీసీతారాం' అను జయధ్వని బయల్వెడలుచుండెను. ఆయన తీవ్రగతితో పరుగుపరుగున జానకిని దర్శించుటకు బయలు దేరెను. శ్రీ ఆంజనేయుడు కుశలమేనా ? అనే చింతతో జానకి కూర్చొని ఉండెను. శ్రీపవనకుమారుడు పరుగు పరుగున ఆ ప్రదేశమునకు జేరి “అమ్మా! అమ్మా” అంటూ సీతా దేవిచరణకమలములపై తన శిరము నుంచెను. తల్లి హృదయము నుండి వాత్సల్యరసము పొంగి ఆమె నేత్రములు సజలములయ్యెను. ఆమె పరమభాగ్యవంతుడైన శ్రీ ఆంజనేయుని శిరముపై తన అభయ కరారవిందము నుంచెను.


అత్యంత స్నేహముతో సీతాదేవి ఇట్లా ప్రశ్నించింది. "కుమారా ! నీవు కుశలముగా నుండుట గాంచి వ్యాకులమవుచున్న నా మనస్సు శాంతించినది. నీ అవయవములు దగ్ధము కాలేదా! శ్రీపవనాత్మజుడు తల్లి యొక్క సహజ స్నేహమును పొంది పులకితుడై ఇట్లు పల్కెను. “జననీ! పరమపావనము, అభయప్రదమైన నీ కరకమలము నా శిరముపై నుండగా ఈ త్రిభువనములలో నా కెట్టిహానియు సంభవించునా? నీ కరుణ వలననే నీ లంకానగరమునకు వచ్చిన కార్యము సిద్ధించినది. నేను నీ దివ్యపాదారవిందములను దర్శించితిని. లంకానగర రహస్యములను గ్రహించితిని; రాక్షసుల శక్తియుక్తులు నాకు అవగతమయ్యింది. లంక యందు గల కీలక ప్రదేశములను బాగుగా పరికించాను. అమ్మా! నీ విక కృపతో నాకు అనుజ్ఞను ప్రసాదింపుము. నేనీ క్షణమందే ప్రభువు యొక్క చరణముల చెంతకు చేరుకొని నీ సందేశమును వినిపించెదను. సర్వసమర్థుడు, కరుణానిధానుడైన ప్రభువు శీఘ్రముగా లంకను ప్రవేశించి క్రూరులైన ఈ అసురులను సంహరింపగలడు."".


Sunday 2 January 2022

శ్రీ హనుమద్భాగవతము (120)



సువర్ణమయమైన లంక భగభగమండుచుండెను. లంకానగర వాసులు ఆక్రందనలను ఒనరించుచుండిరి; కాని వారలను రక్షించువారెవ్వరు లేకపోయిరి. మండోదరి మొదలైన రాణులు రోదించుచు పరస్పరమిట్లు పల్కిరి.  "జానకీ దేవిని శ్రీరాముని చెంతకు పంపమని, ఆయనతో వైరము వలదని, మేమెన్ని పర్యాయములో రావణుని ప్రార్థించితిమి. కాని అహంకారవశుడై ఆతడు మా మొరలను ఆలకింపలేదు. ఇపుడాతని బలము, సైన్యము, ప్రతాపము ఏమైనవి? ఒక దొంగ వలె ముఖమును దాచుకొని మూల కూర్చుండెను. ఇక మమ్ముల రక్షించువారెవ్వరు? ఈ ప్రకారముగా బాలకులు, వృద్ధులు, స్త్రీపురుషులెచ్చటి వారచ్చట విలపింప నారంభించిరి. ఈ లంకాదహన కాండలో అనేక భవనములు, రాక్షససమూహములు గజతురగరథాదులు, పశుపక్షి వృక్షాదులు మాడి మసియయ్యేను, మిగిలినవారు దీనులై గోడుగోడున విలపింప సాగిరి.


లంకను తగుల పెట్టుచు మహాపరాక్రమవంతుడైన శ్రీ హనుమంతుడు తన మనస్సులో పరమప్రభువైన శ్రీరామచంద్రునే స్మరించుచుండెను. మర్కటాధీశ్వరుడు ఒనరించుచున్న ఈ అద్భుతము, అప్రమేయమైన లంకాదహన కార్యక్రమమును గాంచి దేవతలు, మహర్షులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు మొదలైన ప్రాణులందరు అత్యంత ప్రసన్నులైయ్యారు. దేవతలు శ్రీహనుమంతుని అనేక విధాల స్తుతించారు.


లంకాధిపతియైన రావణుడు సూర్యకుమారుడైన శనైశ్చరుని బాధించాడు. ఆ కారాగారము శ్రీహనుమదీశ్వరుని పదఘట్టమునకు శిధిలము కాగా హనుమ శనైశ్చరుని దర్శించి రావణుడు ఒనరించిన దుష్కృత్యములను చెప్పాడు. అప్పుడు శనైశ్చరుడు ముక్తిదాతయైన శ్రీహనుమంతుని ప్రార్థించి లంకకు సర్వనాశనము దాపురించినదని పలికి భస్మముకాగా మిగిలిన లంకానగరముపై తన దృక్కులను సారించాడు. ఆ దృష్టి పాతముచే ఒక్క విభీషణుని గృహము దప్ప మిగిలిన లంక అంతా భస్మమయ్యింది.


లంకానగరములో గల సైనిక కేంద్రములు, యుద్ధోపకరణములు నశించుటను, చావగా మిగిలిన అసురులు ఆక్రందనముల ఒనరించుటను, అతులిత బలధాముడైన శ్రీ పవన కుమారుడు చూసాడు. అపుడు ఆయనకు సీతాదేవి జ్ఞప్తికి వచ్చింది. విభీషణుని గృహము దప్ప లంక అంతా భస్మమయ్యింది; కాని జానకి ఎట్లున్నదో అని విచారించాడు. ఇట్లు చింతించి శ్రీహనుమంతుడు విశాలసముద్రమును చేరి తన వాలమును ఆవరించియున్న మంటలను ఆర్పుకొనుచుండెను. అపుడు మహాత్ములైన చారణులు ఇట్లు పలికారు. పవనకుమారుడైన శ్రీహనుమంతుడు స్వర్ణమయమైన లంకకు నిప్పుబెట్టి గొప్ప దుస్సాహసమైన కార్యమును చేసెను. గృహములను వీడి పారిపోయిన రాక్షసులు, స్త్రీలు, బాలకులు, వృద్ధులు దుఃఖించుచు లంకానగరమును వీడారు. లంకానగరమంతా అగ్నిజ్వాలలో బడి భస్మమయ్యింది. కాని శ్రీరామచంద్రుడు అర్ధాంగియైన సీత సురక్షితముగా నుండుట పరమాశ్చర్యకరమైన విషయము. చారణులు పల్కిన ఈ మధుర వచనములు ఆలకింపగానే శ్రీహనుమంతుని హృదయావేదనము దూరమయ్యింది.


Saturday 1 January 2022

శ్రీ హనుమద్భాగవతము (119)



చివరకు రావణుకు మేఘములను లంకానగరముపై వర్షింపవలసినదిగా ఆజ్ఞాపించాడు. మేఘములు గుంపులు గుంపులుగా వెడలి మండుచున్న లంక పై జేరి ఘోరముగా వర్షింపనారంభించెను, కాని శ్రీహనుమంతుడు రగిల్చిన అగ్ని జ్వాలలా వర్షముచే మరింతగా ప్రజ్వరిల్ల నారంభించెను. జలధారలు ఘృతమువలె ఆ అగ్నికి సహాయమొనరించెను.


విచిత్రమైనదశ. మేఘము లెంతగ వర్షించినా ఈ విపరీతమైన పరిణామమును గాంచి అవి శుష్కములై ఇట్లు ఆక్రందనలు చేయుట ఆరంభించెను.


దోహా 

ఇహా జ్వాల జరే జాత

సూఖే సకుచాత సబ, కహత పుకార హై| 

జుగ షట భాను దేఖే, ప్రళయ కృసాను దేఖే. 

శేషముఖ అనల విలోక బార బార హై

‘తులసీ' సున్యో న కాన సలిలు సర్పీ సమాన, 

అతి అచిరిజు కియో కేసరీకుమార హై| 

బారిద బచన సుని ధున సాస సచివణ  

క హై దససీస! ‘ఈస బామతా వికార హై'॥


(కవితావళి 5–20)


మేము ద్వాదశసూర్యులను చూచితిమి, ప్రళయాగ్నిని దర్శించితిమి. ఎన్నో పర్యాయములు ఆదిశేషుని ముఖమునుండి బయలెవెడలు జ్వాలలను కూడా గాంచితిమి. కాని జలములు ఘృతమువలె పరిణామము చెంది అగ్నిని ప్రజ్వరిల్ల జేయుట మెపుడును గాంచలేదు, వినలేదు. ఆశ్చర్యకరమైన విషయమును శ్రీ కేసరీనందనుడు మాత్రమే చేసి చూపించెను.


మేఘములు వచనములను ఆలకించి రావణుని మంత్రులు తలలు త్రిప్పినవారై అతనితో ఇట్లు పలికారు. ఇది అంతయూ ఈశ్వరుని ఎడల ప్రతికూలతకు ఫలము.