Sunday 31 October 2021

శ్రీ హనుమద్భాగవతము (63)



సర్వశక్తి సంపన్నుడైన రఘునాథుడు సుగ్రీవునితో ! నా కార్యము గురించి నీకు తెలుసు. ఉచితమని భావిస్తే శీఘ్రముగా వీరిని సీతాన్వేషణమునకై పంపుమని పలికాడు.


సావధానముగా అంతటా తిరుగుతూ సీతా దేవి జాడను తెలుసుకొనవలసినదని యూథపతులకు అందఱకి ఆజ్ఞ ఇస్తూ సుగ్రీవుడిట్లు పలికాడు -- 


విచిన్వంతు ప్రయత్నేన భవంతో జానకీం శుభామ్ | 

మాసాదర్వాజ్ నివరధ్వం మచ్ఛాసనపురస్సరాః || 

సీతామదృష్ట్వా యది వో మాసాదూర్ధ్వం దినం భవేత్ | 

తదా ప్రాణాంతికం దండం మత్తః ప్రాప్స్యథ వానరాః ||


(ఆ రా. 4–8–25,28)


నా ఆజ్ఞ అనుసరించి మీరందఱు ఎంతో ప్రయత్నముతో జానకీ దేవిని అన్వేషించండి, ఒక మాసములోపల తిరిగి రండి. సీతాదేవిని చూడకుండా మాసముకంటే అధికముగా ఒక్క రోజు గడిచినా నా చేతులో మీకు ప్రాణదండన తప్పదు”.  


ఇట్లు సుగ్రీవుడు సీతా దేవిజాడను తెలుసుకొనుటకై వానర యూథపతులను, భల్లూక యూథపతులను కఠినముగా శాసించాడు. అతడు సర్వదిక్కులకు ఎందరినో వానరులను "పంపి దక్షిణదిక్కునకు గొప్ప ప్రయత్నముతో మహాబలుడు యువరాజైన అంగదుడు, జాంబవంతుడు, హనుమానుడు, నలుడు, సుషేణుడు, శరభుడు, మైందుడు, ద్వివిదుడు మొదలైన వారిని పంపాడు. అప్పుడు అతను వీరవరుడగు హనుమానుని ప్రశంసిస్తూ ఇట్లా పలికాడు.


"కపి శ్రేష్టా ! పృథివిలోగాని, అంతరిక్షమునందుగాని, ఆకాశమునందు గాని, దేవలోకమునందు గాని, జలమునందు గానీ నీగతికి అవరోధమున్నట్లు నాకెక్కడా కనపడలేదు. అసుర గంధర్వ నాగ మనుష్య దేవ సముద్ర పర్వత సహితముగా సర్వలోకముల గుఱించి నీకు తెలుసు. వీరుడా! అంతట అబాధిత మగు గతి, వేగము, తేజస్సు, స్ఫూర్తి అనే గుణములన్నీ మహాపరాక్రమవంతుడైన నీ తండ్రియైన వాయు దేవునిలో ఉన్నట్లు నీలో ఉన్నవి. ఈ భూమండలమున ఏ ప్రాణియు నీ తేజస్సుతో సరిపోయినట్టిది లేదు. అందువలన సీతా దేవి లభించునట్టి ఉపాయమును నీవే ఆలోచించు. హనుమానుడా! నీవు నీతిశాస్త్ర నిపుణుడవు. నీ ఒక్కని యందే బలము, బుద్ధి, పరాక్రమము, దేశకాలనుసరణము, నీతియుక్తమైన నడవడి ఒక్క మారే కనబడుతుంది.”

( న భూమా నాంతరిక్షేవా నాంబరే నామరాలయే | 
నాప్సు నా గతిభంగం పశ్యామి హరిపుంగవ ||
సాసురాః సహగంధర్వాః సనాగనర దేవతాః | 
విదితాః సర్వలోకాస్తే ససాగరధరాధరాః || 
గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవం చ మహాకపే | 
చితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః || 
తేజసా వాపి తే భూతం న సమం భువి విద్యతే | 
తన్మయా, లభ్యతే సీతా తత్త్వమేవాను చింతయ ||
త్వయ్యేవ హనుమన్న స్తి బలం వృద్ధిః పరాక్రమః | 
దేశాకాలాను వృత్తిశ్చ నయశ్చ నయపండిత || 
(వా. రా. 4-44-3, 7)

Saturday 30 October 2021

శ్రీ హనుమద్భాగవతము (62)



'అవును, తప్పక వెళదామూ అని పలికి సుగ్రీవుడు అర్ఘ్యపాద్యాదులచే లక్ష్మణుని పూజించి ఆయనతో పాటు తాను ఉత్తమమైన రథముపై కూర్చున్నాడు. సుగ్రీవునితో పాటు అంగదుడు, నీలుడు, ఆంజనేయుడు మొదలైఅన ప్రధానులైన వానరులు కూడా శ్రీ రాముని దగ్గరకు వెళ్ళారు. అప్పుడు భేరీ మృదంగాది నానా విధములైన వాద్యములు మ్రోగసాగాయి.


సీతాన్వేషణార్థమై పయనమగుట


మృగచర్మము చేత, జటామకుటము చేత శోభిల్లువాడు నీలమేఘశ్యాముడు అయిన శ్రీరాముడు గుహద్వారము దగ్గర ఒక శిలా ఖండముపై కూర్చుని ఉదాసీనమైన మనస్సుతో పక్షులను చూస్తున్నాడు. దూరము నుండి శాంతమూర్తియైన శ్రీరాముడు కనబడగానే సుగ్రీవుడు, లక్ష్మణుడు రథమునుండి దిగారు, సుగ్రీవుడు వేగముగా శ్రీ రాముని వద్దకు వెళ్ళి అజ్ఞానుడైన బాలులు వలె ఆయన పాదపద్మముల పై ప్డి ఏడ్వసాగాడు. దయామూర్తి యైన శ్రీరాముడు వెంటనే అతనిని లేవనెత్తి ఆలింగనము చేసుకుని, సమీపమున కూర్చుండ బెట్టుకుని ప్రేమ పూర్వకంగా అతని యోగక్షేమములల్ను అడగసాగాడు.


సుగ్రీవుడు చేతులజోడించి ఎంతో వినయముతో పలికాడు. 'ప్రభూ ! నా దోషమేమీలేదు. నీ మాయ

చాలా ప్రబలమైనది. నీ దయ ఉంటేగాని దీనిని దాటలేము. నేను భోగాసక్తుడైన పామరపశువును. నా పై దయ చూపు.


కరుణామయుడైన శ్రీరాముడు సుగ్రీవుని శిరమును తన కరకమలముతో నిమురసాగాడు. అప్పుడు అసంఖ్యాకులైన వానర భల్లూక వీరులు అచటికి రాసాగారు.


వారిని చూసి సుగ్రీవుడు శ్రీ రామునితో ఇట్లు పలికాడు. "ప్రభూ! ఈ వానరులు, భల్లూకవీరులు నీ ఆజ్ఞను పాలిస్తారు. ఫలమూలాదులను భక్షిస్తారు. ఈతడు భల్లూకములకు అధిపతియైన జాంబవంతుడు, మహాయోధుడు, బుద్ధి మంతుడు. ఇతడొక కోటిమంది వానరులకు అధిపతి. మంత్రులలో శ్రేష్ఠుడు. ఇంతేకాక నలుడు, నీలుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, శరభుడు, మైందుడు, గజుడు, పనసుడు, బలీముఖుడు, దధిముఖుడు, సుషేణుడు, తారుడు, మహాబలుడు పరమధీరుడు హనుమంతుని తండ్రియైన కేసరి వీరందఱు ప్రధానయూథపతులు. వీరి ఆధీనంలో పర్వతములతో సమానమైన విశాలకాయములు కలిగిన వానర వీరులు కోట్లగొలదిగా ఉన్నారు. మీరు వీరిని ఇష్టానుసారముగా ఆజ్ఞాపింపవచ్చును.


Friday 29 October 2021

శ్రీ హనుమద్భాగవతము (61)



అంతఃపురమున భయపడుతున్న సుగ్రీవుడు తన భార్య యైన రుమతో కలిసిలక్ష్మణుని చరణములకు నమస్కరించాడు, అచట కూడా క్రుద్ధుడై యున్న లక్ష్మణునితో నీతివేత్తయైన సమీరకుమారుడు ఇట్లు పలికాడు.


త్వత్తో ఒధికతరో రామే భక్తోఽయం వానరాధిపః || 

రామ కార్యార్థమనిశం జగత విస్మృతః | 

ఆగతాః పరితః పశ్య వానరాః కోటిశః ప్రభో || 

గమిష్యంత్యచి రేణైవ సీతాయాః పరిమార్గణమ్ | 

సాధయిష్యతి సుగ్రీవో రామకార్యమశేషతః ||


(వా. రా. 4-5-54, 56) 


'మహారాజా ! ఈ వానర రాజు శ్రీరామచంద్రునకు నీ కంటెను గొప్ప భక్తుడై ఉన్నాడు. శ్రీరామకార్యార్థమై ఆయన రేయింబవళ్లు మేలుకొని ఉంటున్నాడు. ఆయన దానినేమాత్రము మఱచియుండలేదు. ప్రభూ! చూడుము కోట్లకొలదిగా ఉన్నఈ వానరులు దీనికోసమే అన్ని వైపుల నుండి వచ్చుచున్నారు. వీరందఱు శీగ్రముగా సీతాన్వేషణకై వెళతారు. మహారాజైన సుగ్రీవుడు శ్రీరామచంద్రుని సర్వకార్యమును చక్కగా నెరవేర్చగలడు !


అనంతరము వానరరాజైన సుగ్రీవుడు లక్ష్మణుని చరణములకు నమస్కరించి వినయముగా ఇట్లా పలికాడు - 'ప్రభూ ! నేను శ్రీరామచంద్రుని దాసుడను. ఆయనయే నా ప్రాణములను కాపాడినాడు. ఈ ధనము, వైభవము, రాజ్యాదులు సర్వము ఆయన ఇచ్చినవే. ఆయన స్వయముగా త్రిభువనములను జయించగలడు. నేనాయన కార్యమునకు సహాయక మాత్రుడనవుతాను. విషయలోలుడను, పామరుడను అయిన నేను పూర్తిగా మీ వాడనే. అందువలన నీవు నా అపరాధ ములను క్షమించు.


సుగ్రీవుని ప్రార్థన వినినంతనే సుమిత్రానందనుడు అతని భుజములను పట్టుకొని హృదయమునకు హత్తుకొని, ప్రేమ పూర్వకముగా అతనితో నిట్లుపలికెను 'మహాభాగా ! నేను కూడా ప్రణయ కోపవశములో ఏవియో మాటలను పలికాను. వాటిని గూర్చి నీవు ఆలోచించవలదు. శ్రీరాముడు అరణ్యమున ఒంటగా ఉన్నాడు. సీతాదేవి వియోగముచే వ్యాకులుడై ఉన్నాడు. అందువలన ఇప్పుడు ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి.

Thursday 28 October 2021

శ్రీ హనుమద్భాగవతము (60)



నగరవాసులందఱు ఎంతో కలత చెందుట చూసి యువరాజైన అంగదుడు లక్ష్మణుని దగ్గరకు వెళ్ళి ఆదర పూర్వకముగా చరణములకు నమస్కరించాడు. అతనిని చూడగానే భ్రాతృభక్తుడైన లక్ష్మణుని కోపము శాంతించింది. ఆయన యువరాజును హృదయమునకు హత్తుకొని ‘వత్సా! నీవు త్వరగా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళి శ్రీ రాముడు నీపై కోపము పూనియున్నాడు, ఆయన పంపగా నేనిచటకు వచ్చిచ్చానని అని ఆయనతో చెప్పు' అని పలికాడు.


‘చాలమంచి’దని పలికి అంగదుడు వినయపూర్వకముగా చేతులను జోడించి లక్ష్మణుని దగ్గర సెలవు తీసుకుని సుగ్రీవుని వద్దకు వెళ్ళాడు. అంగదుని వలన లక్ష్మణుడు పలికిన క్రోధ పూర్ణములైన మాటలను వినినంతనె సుగ్రీవుడు భయాక్రాంతుడయ్యాడు. వెంటనే అతడు లక్ష్మణుని అనుకూలునిగా చేసుకొనుటకు పవన కుమారుని పంపాడు.


హనుమానుడు లక్ష్మణుని సమీపించి ఆయన చరణములకు భక్తి పూర్వకముగా ప్రణమిల్లి వినయముతో ఇట్లా పలికాడు.


ఏహి వీర మహాభాగ భవద్గృహమశంకితమ్ | 

ప్రవిశ్య రాజదారాదీన్ దృష్ట్వా సుగ్రీవమేవ చ | 

యదాజ్ఞాపయసే పశ్చాత్ తత్సర్వం కరవాణి భోః | (4-5-37, 38)


మహాభాగా! వీరశ్రేష్ఠా! ఎలాంటి సందేహం లేకుండా రండి. ఈ ఇల్లు నీది. లోనికి దయచేసి రాజమహిషులను, మహారాజైన సుగ్రీవుని కలవండి. పిమ్మట నీ ఆజ్ఞనను అనుసరించి మెలుగుతాము.


హనుమానుడు ఎంతో భక్తితో లక్ష్మణుని కరకమలములను ప్ట్టుకొని నగరము గుండా రాజభవనమునకు తీసుకుని వెళ్ళాడు. మధుర భాషిణి యైన తార లక్ష్మణునకు స్వాగతమిస్తూ ‘మీ కార్యమును గూర్చియే సుగ్రీవుడాలోచించుచున్నాడు. దయ యుంచి మీరు అంతఃపురములోనికి వచ్చి ఆయనకు ఆభయమీయండని' పలికింది.

Wednesday 27 October 2021

శ్రీ హనుమద్భాగవతము (59)



ధనుర్బాణములను తీసుకుని సుగ్రీవవధకై బయలు దేరిన లక్ష్మణుని చూసి ధీరుడు, గంభీరుడు, పురుషోత్తముడు అయిన శ్రీరాముడు సోదరునకు నచ్చజెప్పుచు ఇట్లు పలికాడు - 'లక్ష్మణా ! నీ వంటి ఉత్తమవీరుడు మిత్రవధవంటి నిషిద్ధకర్మ చేయుట ఉచితముగాదు. ఉత్తమమైన వివేకముద్వారా తన క్రోధమును చంపుకున్న వీరుడు సర్వపురుషులలోను శ్రేష్ఠుడని చెప్పబడతాడు. 

కోపమార్యేణ యో హంతి స వీరః పురుషోత్తమః || (వా.రా. 4-81-8) 


నాయనా! సుగ్రీవుడు నాకు మిత్రుడు. అతనిని నీవు చంపకూడదు. అక్కడకు వెళ్ళి 'వాలివలె నీవు కూడా చంపబడుదువూ అని మాత్రము పలికి అతనిని భయపెట్టవలసినది. 'శీఘ్రముగా దానికి సమాధానము తీసుకునిరా.


న హంతవ్య స్త్వయా వత్స సుగ్రీవో మే ప్రియః స్సభా 

కింతు భీషయసుగ్రీవం వాలివత్వం హనిష్యసే 

ఇత్యుక్త్వా శీఘ్రమాదాయ సుగ్రీవం ప్రతిభాషితమ్||


(వా. రా. 4–5–18,14)


అలాగే అని ఇక్ష్వాకు కులసింహుడు వీరవరుడైన సుమిత్రానందనుడు శ్రీరాముని చరణములకు నమస్కరించి, భయంకరమైన తన ధనుర్బాణములను తీసుకుని కిష్కంధకు వెళ్ళాడు. అపుడు క్రోధమువలన అతని ఆకారము ఎంతో భయావహముగా ఉండింది. అతని అధరము వణకుచుండింది. అత్యధికమైన కోపముతో అతడు మార్గములో గల వృక్షములను పడగొట్టుతూ, పర్వతశిఖరములను దూరముగా విసరుతూ వెళుతున్నాడు. ఆ సమయమున అతడు ప్రలయంకరుని వలె కనబడుతున్నాడు.


కిష్కంధ దగ్గరకు వెళ్ళి లక్ష్మణుడు తన వింటినారిని భయము గొల్పునట్లుగా మ్రోగించెను. ఆ సమయమున కొందఱు సామాన్యవానరులు కోటగోడపై నుండు రాళ్ళను చెట్లను దీని కొని హర్ష ధ్వానముల చేయసాగారు. ఇది చూచినంతనే లక్ష్మణుని క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది. ప్రళయాగ్నివలె నున్న లక్ష్మణుడు విశాలమైన తన ధనుస్సుపై భయానకమైన బాణమును ఎక్కుపెట్టాడు. వెంటనే కిష్కింధలోని వానరవీరులందరు వణకి పోయారు. లక్ష్మణుడు సమూలముగా కిష్కింధను నాశము చేయటకు సిద్ధపడ్డాడు.

Tuesday 26 October 2021

శ్రీ హనుమద్భాగవతము (58)



ఇక అచట వర్ష ఋతువు పిమ్మట శరదృతువు వచ్చెను. సుగ్రీవుడు నిశ్చింతునిగా, నిష్రియునిగా ఉండుట చూసి భగవానుడైన శ్రీరాముడు కలత చెంది తన సోదరునితో ఇట్లా పలికాడు. ‘లక్ష్మణా ! వానరరాజైన సుగ్రీవుడు సీతాన్వేషణమునకు గడువును నిర్ణయించినాడు. కాని తన స్వార్థము నెరవేరిన పిమ్మట దుష్టబుద్ధియైన ఆ వానరుడు నన్ను ఉపేక్షించాడు. నన్ను అతడు రాజ్యభ్రష్టునిగా, దీనునిగా, అనాథునిగను, శరణాగతునిగా భావించి తిరస్కరించుచున్నాడు. అందువలన నీవక్కడికి వెళ్ళి స్పష్టముగా పలుకు – ‘బలపరాక్రమ సంపన్నులు, ఉపకారము చేయునట్టి వారు కార్యార్థులైన పురుషులకు ప్రతిజ్ఞాపూర్వకముగా ఆశను క్లుగజేసి తరువాత దానిని భగ్నము చేయువాడు ప్రపంచంలోనున్న మనుషులందరిలో నీచుడు, తన నోటి ద్వారా ప్రతిజ్ఞారూపంగా వెలువడిన మాటలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. ఎలా ఉన్నా ఆ వాక్కులు తప్పక నెఱవేర్చదగినవని భావించి సత్యాన్ని కాపాడే ఉద్దేశ్యంతో వాటిని పాటించే వీరుడు మనుష్యులలో శ్రేష్ఠునిగా చెప్పబడుతున్నాడు.

లక్ష్మణా ! ఆ దురాత్మునితో ఇంకను నిట్లు పలుకుము ‘నా బాణముచే జంపబడిన వాలి యే మార్గమున వెడలినాడో ఆ మార్గ మింకను మూతబడలేదు. అపుడు నేను నాలి నొక్కనినే చంపితిని. కాని యిపుడు నీవు నీ ప్రతిజ్ఞను నెఱ వెర్చనిచో బంధువులతో గూడ నిన్ను మృత్యువాతబడ వేయుదును'అని శ్రీరాముడు మిగుల బాధతో తనసోదరునితో బలి


* అర్థినాముపపన్నానాం పూర్వం చాప్యుపకారిణామ్ | 

ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః || 

శుభం వా యది వా పాపం యో హ వాక్యముదీరితమ్ | 

సత్యేన ప్రతిగృహ్ణాతి స వీరః పురుషోత్తమః || (వా. రా: 4.80–71,27)  


శ్రీ రాముని వాక్కులను వినినంతనే సుమిత్రానందనుడు రోష పూర్ణుడయ్యాడు, అతడు అన్నపాదములకు నమస్కరించి ఇట్లు పలికాడు - ‘విషయభోగాసక్తుడు, బుద్ధిహీనుడైన వానరుడు అగ్నిసాక్షిగా స్నేహముజేసినాడు; కాని తనపని నెఱవేరిన పిమ్మట అతని అభిప్రాయము మారినది. అసత్యవాదియైన సుగ్రీవుని ఇప్పుడే చంపి అంగదునకు రాజ్యపట్టాభిషేకము చేస్తాను. అతడే రాజై వానరవీరుల ద్వారా సీతా దేవి జాడను తెలిసికొనగలడు.'

Monday 25 October 2021

శ్రీ హనుమద్భాగవతము (57)



రాజ్యం ప్రాప్తం యశశ్చైవ కౌలీ శ్రీరభవర్ధితా

మిత్రాణాం సంగ్రహః శేష సద్భవాన్ కర్తుమర్హతి

తద్భవాన్ వృత్త సంపన్నః స్థితః పధి నిరత్యయే| 

మిత్రార్థమఖనీతార్థం యధావత్ కర్తుమర్హతి || 

తదిదం మిత్రకార్యం నః కాలాతీతమరిందమ | 

క్రియతాం రాఘవ స్యైతత్ వైదేహ్యాః పరిమార్గణమ్ || 

న చ కాలమతీతం తే నివేదయతి కాలవిత్ | 

త్వరమాణో2పి స 'ప్రాజ్ఞ స్తవరాజన్ వశానుగః || 

న హి తావత్ భవేత్కాలో వ్యతీతశ్చోదనాదృతే | 

చోదితస్య హి కార్యస్య భవేత్కా-లవ్యతిక్రమః || 

శక్తిమానితి విశ్రాంతో వానరర్క్ష గణేశ్వరః |

కర్తుం దాశరధేః ప్రీతిమాజ్ఞాయాం కిం ను సజ్జ సే ||

ప్రాణత్యాగవిశం కేన కృతం తేన మహత్రియమ్ | 

తస్య మార్గామ వైదేహీం పృథివ్యామపి చాంబరే || 

దేవదానవగంధర్వా అసురాః సమరుద్గణాః | 

న చ యక్షాభయం తస్య కుర్యుః కిమివ రాక్షసాః || 

త దేవం శక్తియు క్తస్య పూర్వం ప్రతికృతస్థథా | 

రామస్యార్హసి పింగేశ కర్తుం సర్వాత్మనాప్రియమ్ || 


(వా. రా. 4-29-9-9-12,15,16,19,21 23-25


రాజా ! నీవు ! రాజ్యమును, యశస్సును పొందావు. వంశపారంపర్యముగా వచ్చిన లక్ష్మీని వృద్ధిపఱచావు. కాని ఇంకా మిత్రులకు చేయవలసిన కార్యము మిగిలియున్నది, దానిని ఇప్పుడు నీవు నెరవేర్చవలెను. నీవు సదాచార సంపన్నము, నిత్యము, సనాతనము అయిన ధర్మమార్గమున నిలచియున్నావు. అందువలన మిత్రకార్యమును చక్కపెట్టుట్టకు నీవొనర్చిన ప్రతిజ్ఞను తగినట్లు నెరవేర్చు. శత్రుదమనుడా! శ్రీ రాముడు మనకు పరమమిత్రుడు, ఆయనకు చేయవలసిన కార్య సమయము గడచిపోవుచున్నది. అందువలన సీతా దేవికై వెదకుట ఆరంభించాలి. రాజా! పరమబుద్ధిమంతుడైన శ్రీరాముడు కాలవేత్త. కార్యసిద్ధికై నీవు త్వరపడిన ఆయన నీకు పశుడైయుంటాడు. కాలము గడస్తున్నదని సంకోచము వలన ఆయన నీతో చెప్పడు. కనుక శ్రీరాముడు చెప్పక ముందు మనము పనిని మొదలుపెడితే సమయము గడచినట్లు ఆయన భావింపడు. కాని ఆయన దీనికై ప్రేరణ కలిగించినచో మనము సమయమును గడిపామనీ, ఆలస్యం చేశావని ఆయన కార్యమున లోకమున వెల్లడి కాగలదు. వానర భల్లూకములకు ప్రభువైన సుగ్రీవా! నీవు శక్తిమంతుడవు, పరాక్రమవంతుడవు. అయినా దశరథనందనుడైన శ్రీ రామునకు ఇష్టమైన కార్యమును ఒనర్చుటకు వానరులను ఆజ్ఞాపించుటకు ఎందుకు ఆలస్యము చేయుచున్నావు? నీకై శ్రీ రాముడు వాలి ప్రాణములను తీయుటకు కూడా సందేహింపలేదు. 


ఆయన నీకు ఎంతో ఇష్టమైన కార్యము చేసాడు. అందువలన మనమి ఇప్పుడు ఆయన భార్య యైన సీతాదేవికై భూమ్యాకాశముల రెండింటి యందును వెతుకు. దేవతలు, దానవులు, గంధర్వులు, అసురులు, మరుద్గణములు, యక్షులు మున్నగు వారెవ్వరూ శ్రీ రామునకు భయమును కలిగించలేరు. ఇక రాక్షసుల విషయమై చెప్పేదేమి! వానరరాజా! ఇట్టి శక్తిశాలీ, మొదటనే ఉపకారము చేయువాడైన శ్రీరామునకు ఇష్టమైన కార్యమును నీవు నీ శక్తియుక్తులను వినియోగించి చెయ్యి. 


శ్రీరాముని కార్యమున ఆలస్యము జరిగినందులకు స్వగుణసంపన్నుడైన సుగ్రీవుడు భయగ్రస్తుడయ్యాడు. ఆయన ఎల్లప్పుడూ హనుమానుని సలహాలను గౌరవించుచుండేవాడు. ప్రేమపూర్వకముగా కర్తవ్యమును గురించి తెలియ జేసినందులకు సుగ్రీవుడు చాలా సంతోషించి వెంటనే నీలుడనే వానర వీరుని ఇట్లా ఆజ్ఞాపించాడు – ‘నీవు పదిహేను దినముల లోపల ఆ ఉద్యోగులను, శీఘ్రగాములైన యూథపతులను వీర సైనికులను నా సమీపమునకు పంపుటకు ప్రయత్నించు. ఈ గడువు లోపల ఇచటికి చేరని వానర వీరులు తమ ప్రాణములపై ఆశ వదలుకొనవలసివస్తుంది. ఇది నా ధృడనిశ్చయము'.


Sunday 24 October 2021

శ్రీ హనుమద్భాగవతము (56)



హనుమంతుడు సుగ్రీవునకు హితము చెప్పుట 


శ్రీరాముడు భార్యయైన సీతాదేవిని గూర్చి చింతిస్తూ సోదరుడైన లక్ష్మణునితో కలసి ప్రస్రవణగిరిపై వర్షాకాలమును గడుపుచున్నాడు. కపిరాజగు సుగ్రీవుడు సంపదను, రాజ్యమును తన భార్యయగు రుమను, అనింద్యసుందరి యైన తారను పొంది సుఖముగా ఉన్నాడు. అతడు ఏ విధమగాను చింత లేనివాడై రాజ్యభోగములను అనుభవించుచున్నాడు. తనకు పరమ హీతైషషీ, సోదరసహితుడైన శ్రీరాముని మైత్రిని, ఆయన ఉపకారమును, ఆయనకు తాను చేయవలసిన కార్యమును పూర్తిగా మరచి సుగ్రీవుడు రాజ్యసుఖములలో మగ్నుడైపోయాడు, కాని పవనపుత్రుడైన హనుమానుడు శాస్త్రసిద్ధాంతములను చక్కగా ఎఱిగినవాడు. కర్తవ్యాకర్తవ్య జ్ఞానము కూడా చక్కగా గలవాడు, సంభాషణ కళాచతురుడైన హనుమంతుడు ఎల్లప్పుడూ సావధానముగా ఉండే మంత్రియై ఉన్నాడు.

'ఆయన ఎల్లప్పుడు శ్రీరాముని ధ్యానమున మగ్నుడై ఉన్నాడు, జగన్మాతయైన సీతా దేవియొక్క జాడను తెలిసుకొనుటకు ఆయన ఎంతో వ్యగ్రుడైయ్యాడు. 


ఆకాశము స్వచ్ఛముగా, నదులలోని నీరు నిర్మలముగా, మార్గములు యాత్రకు యోగ్యములుగా ఉన్నట్లు హనుమంతుడు తెలిసికొన్నాడు. కాని వానర రాజైన సుగ్రీవుడు తన ప్రయోజనము నెఱువేరిన పిమ్మట ధర్మార్థ సంగ్రహమున సుదాసీనుడయ్యాడు, అభిలషితములగు మనోరథములను పొంది స్వేచ్ఛాచారియయ్యాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుని దగ్గఱకు వెళ్ళి సత్యము, ప్రియము, హితము అయిన వాక్కులను ఇట్లు పలికాడు.  


Saturday 23 October 2021

శ్రీ హనుమద్భాగవతము (55)



అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్త్రియా ! 

ఆయత్యాం చ విధేయాని సమర్థాన్యస్య చింతీయ ॥ (వా. రా. 4-21-4)


“నీ పుత్రుడు అంగదుడు జీవించియున్నాడు. ఇపుడు నీవు ఇతనిని చూసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో ఇతని ఉన్నతికి సాధకములైన శ్రేష్ఠకర్మలను గూర్చి ఆలోచించు”. 


వాలికి అంత్యసంస్కారము జరిగినది. లక్ష్మణుడు కపిరాజైన సుగ్రీవుని కిష్కింధాధిపతిగా చేసాడు. విధివిధానముగా పట్టాభిషేకము జరిగినది. వాలి పుత్రుడైన అంగదుడు యువరాజయ్యాడు. సుగ్రీవునకు సంపద, రాజ్యము, భార్య మున్నగు అభీష్టవస్తువులన్నియు లభించాయి. సర్వులకు శరణ్యుడగు శ్రీరాముని కృపయున్న మానవునకు లోకమున లభించనిది ఏమి ఉంటుంది?


సుగ్రీవుడు కిష్కింధలో నివసింపసాగాడు. కాని పిత్రాజ్ఞపై ఆదరము గలవాడుగుటచే శ్రీ రాముడు నగరములోనికి ప్రవేశించలేదు. ఆయన మాసచతుష్టయమును గడుపుట కోసం ప్రస్రవణ పర్వతమునకు వెళ్ళాడు.


ఆంజనేయుడు ప్రతిక్షణము తనకు ఆరాధ్యుడైన శ్రీ రాముని చరణముల దగ్గరనుండుటకు కభిలషించుచుండేవాడు. కాని సుగ్రీవుడిప్పుడిప్పుడే రాజపదవిని అధిష్టించి ఉండుటచేత కార్య నిర్వహణార్థమై నిపుణుడగు ఒక మంత్రి అతనికి అవసరమై యున్నాడు. ఆ కారణముచే లోకోపకారియైన శ్రీ రాముడు సుగ్రీవునకు సహాయపడవలసినదిగా హనుమాను ఆజ్ఞాపించెను. ప్రభువు ఆజ్ఞ హనుమానునకు శిరోధార్యమయ్యింది. అతడు కిష్కంధలో సుగ్రీవుని దగ్గరే ఉండసాగాడు.


Friday 22 October 2021

శ్రీ హనుమద్భాగవతము (54)



ఆంజనేయుడు రామలక్ష్మణసహితుడై సుగ్రీవుని దగ్గరకు చేరింది. సుగ్రీవుడు పరమతేజస్వులైన ఆ కుమారులిరువురకు నమస్కరించాడు. హనుమానుడు సుగ్రీవుని శ్రీరామునకు పరిచయము చేసాడు. అనంతరం అతడు ప్రజ్వరిల్లునట్టి అగ్నిని సాక్షిగా ఉంచి ధర్మవత్సలుడైన శ్రీరామునకు సుగ్రీవునకు మిత్రత్వమును కూర్చాడు. భగవానుడగు శ్రీరాముడు, వానర రాజైన సుగ్రీవుడు ఇరువురు చాలా ప్రసన్నులయ్యారు. పిమ్మట ఆకులు పూలు ఎక్కువగా గల కొమ్మ నొకదానిని బఱచి దానిపై ఎంతో ఆదరముగా శ్రీరాముని కూర్చుండబెట్టి తాను కూడా ఆయనతో పాటు కూర్చున్నాడు. హనుమంతుడు పుష్పించిన మంచి గంధపుచెట్టు కొమ్మను ఒకదానిని విఱచి దానిపై లక్ష్మణుని కూర్చుండబెట్టాడు.


అధికసంతుష్టుడైన సుగ్రీవుడు మృదుమధురములైన వాక్కులతో తన కథను వినిపించుచు శ్రీరామచంద్రునితో - రఘునందనా ! ప్రాణప్రియమైన ' నా భార్యను హరించి వాలి క్రూరముగా నన్ను వెడలగొట్టినాడు. నేను వానికి భయపడి ఈ పర్వతముపై నివసించుచున్నాను. నాకు శరణు నిమ్ము.'నన్ను నిర్భయునిగా చెయ్యీ.


శ్రీరాముడిట్లు పలికాడు- 'మిత్రుడా! సుగ్రీవుడా! నేను వాలిని ఒకేఒక బాణముతో సంహరిస్తాను, విశ్వసించు. అమోఘమైన నా బాణముచే అతని ప్రాణములు రక్షించబడుట అసంభవము. 


నిఖిలలోక పావనుడగు శ్రీ రాముని బాణముచే వాలి హతుడయ్యాడు. త్రైలోక్యరక్షకుడైన శ్రీరాముని ఎదుట అతడు తన భౌతికశరీరమును విడిచాడు. భర్త మరణవార్తను విని వాలి భార్యయైన తార ఇచటికి వచ్చి దీనముగా ఏడ్వసాగినది. అపుడు తారను ఓదార్చుతూ పరమవీతరాగుడైన హనుమానుడిట్లా పలికాడు.


గుణదోషకృతం జంతుః స్వకర్మఫల హేతుకమ్ | 

అవ్యగ్ర స్తద వాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభమ్! 

శోచ్యాశోచసి కం శోచ్యం దీనం దీనానుకంపసే |

కశ్చ కస్యానుశోచ్యోఒస్తి దే హేఒస్మిన్ బుద్బుదోపమే | 

జానాస్య నియతామేవం భూతానామాగతీం గతిమ్ | 

తస్మాచ్ఛుభం హి కర్తవ్యం పండితే నేహ లౌకికమ్|| (వా. రా. 4-21-2,3,5)


"దేవీ! జీవుని గుణబుద్దుల చేత లేదా దోషబుద్ధి చేత చేయబడిన కర్మలే సుఖదుఃఖ రూపఫలమును పొందుతాయి. పరలోకమునకు వెళ్ళి ప్రతిజీవుడు శాంతభావముతో నుండి తన శుభాశుభ కర్మ ఫలమును అంతటిని అనుభవిస్తాను. నీవు శోచనీయవు, అట్లుండగా నీవు మఱియొక శోచనీయుని చూసి దుఃఖింపనేల? నీవు స్వయముగా దీనురాలవై ఉండి మఱియొక దీనునిపై కరుణ చూపనేల? నీటి బుడగవంటి ఈ శరీరమున నుండి ఏ జీవుడు మఱియొక జీవుని కొఱకు దుఃఖంచును ?


దేవీ! నీవు విదుషీమణివి. అందువలన ప్రాణుల జనన మరణములకొక నిర్ణీతమైన సమయము లేదని నీకు తెలుస్తుంది. కనుక శుభకర్మము చేయవలెను. దుఃఖంచుట మొదలైన లౌకిక కర్మలను చేయరాదు”


Thursday 21 October 2021

శ్రీ హనుమద్భాగవతము (53)



కరుణామయుడైన శ్రీ రాముడు తనకు అనన్యభక్తుడైన హనుమంతుని సహజవానరరూపాన్ని చూసాడు. వెంటనే ఆయన సమీరకుమారుని లేవనెత్తి తన బాహువులతో గట్టిగా హృదయమునకు హత్తుకొన్నాడు. ఆ సమయమున వారిరువురిదశ చాల అద్భుతముగ ఉండింది. ప్రేమమూర్తియు, భక్తవత్సలుడైన శ్రీరాముడు తన అభయహస్తముతో హనుమానుని శిరస్సును నిమురుచున్నాడు. హనుమంతుడు శిశువు వలె మహాప్రభువు హృదయానికి హత్తుకొని రోదిస్తున్నాడు. అతని కంఠము రుద్ధమైపోయింది. 


తన ప్రభువైన శ్రీరామునకు తనపై ప్రేమ ఉన్నదన్న విశ్వాసమేర్పడిన తరువాత హనుమంతుడు లక్ష్మణుని చరణములకు నమస్కరించాడు. సుమిత్రానందనుడు కూడా అతనిని వెంటనే లేవనెత్తి హృదయమునకు హత్తుకొన్నాను. అనంతరము హనుమంతుడు శ్రీరామునకు సుగ్రీవుని వృత్తాంతమును అంతటిని వివరించాడు. నీతినిపుణుడైన పవనకుమారుడు శ్రీ రాముని ముఖారవిందమును నిర్నిమేషదృష్టితో చూస్తూ వినయయుక్తములైన వాక్కులను ఇట్లు పలికాడు - 'దేవా! తన జ్యేష్ఠ సోదరుడైన వాలి భయముతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతముపై నివసించుచున్నాడు. ఇతడు రాజ్యబహిష్కృతుడు, భార్యావియోగముచే ఎంతో దుఃఖితుడైయున్నాడు. అడవులలోను, కొండలలోనూ చాలా కష్టముతో గాలమును గడపుచున్నాడు. మీరు కూడా ఇదియే స్థితిలో ఉన్నారు. ఇపుడు సుగ్రీవునకు సమర్థుడైన స్నేహితుడు అవసరమైయున్నాడు. నీవీయనతో స్నేహము చేసికొఒంటే, ఈ సుగ్రీవునకు ఎంతో సంతోషము కలుగుతుంది. ఆయనకు తన రాజ్యము భార్య మఱల లభించినచో అతడు సీతాన్వేషణమునందు విశేషముగా సహాయపడగలడు. అందువలన నీవు సుగ్రీవుని ఆత్మీయునిగా చేసికొనవలసినదిగా నేను ప్రార్థించుచున్నాను.  


శ్రీరాముని అంగీకారము లభించినంతనే పవనకుమారుడు రామలక్ష్మణులను ఇరువురిని తన భుజములపై కూర్చుండబెట్టుకొని ఋష్యమూక పర్వతముపైకి వెళ్ళాను. శ్రీరామ లక్ష్మణసహితుడై తన వైపు వచ్చు హనుమంతుని చూడగా సుగ్రీవునకు అథిక సంతోషము కలిగింది.

Wednesday 20 October 2021

శ్రీ హనుమద్భాగవతము (52)



ఆంజనేయుని అశ్రుప్రవాహమునకు విరామము లేకపోయింది, కంఠము గద్గదమయ్యింది. ఎట్లో ధైర్యము వహించి, చేతుల జోడించి ఇట్లా ప్రార్థించాడు. 'దయోనిధివైన ప్రభూ! పామరుడైన నేను నిన్ను గుర్తింపలేకపోయాను; ఇది స్వాభావికమైన విషయము, కాని నీవు అజ్ఞునివలె ఇట్లా ప్రశ్నించితివేమి? నీవు నన్ను మరచితివా? మూడులోకములకు రక్షకములైన నీ చరణకమలములు తప్ప నాకింకొక ఆధార మేమి ఉన్నది. దయానిధీ ! నాపై దయచూపు, నన్ను నీవానినిగా చేసుకొనుము'


నిజంగా లోకత్రయ పవిత్రుడైన శ్రీ రాముడు దయా నిధియే. మిక్కిలి పవిత్రములైన ఆయన పాదపద్మముల పరాగముచే కరుణావారిధి ప్రతిక్షణము ఉప్పుంగుతునే ఉంటుంది. కాని అతనికి మోసమన్న గిట్టదు. ఆవరణముచే అతని దర్శనము సంభవముకాదు. పరమోదారుడగు సీతావల్లభుడు ఎల్లపుడు నిష్కపటునిగాను, సరళహృదయునిగాను కనిపిస్తాడు. పవనకుమారుడు బ్రాహ్మణ వేషమున వచ్చినాడు, ఆయన తన వాస్తవిక స్వరూపమును కప్పివేసినాడు. అందువలన కమలనయనుడైన శ్రీరాముడు ఆయనవైపు కనులార్పకుండగా చూస్తూ పూర్తిగా మౌనముగా ఉన్నాడు.


మారుతాత్మజుని అధైర్యము పెరుగుచుండెను. వ్యాకుల చిత్తుడై రోదిస్తూ అతడిట్లా ప్రార్థింపసాగాడు - ప్రభూ! నేను మోహగ్రస్తుడను, అజ్ఞానాంధకారంలో పడియున్న వాడను, కుటిలహృదయుడను, పైగా నీవు నన్ను విస్మరించావు. ఇక నా స్థితి ఏమని చెప్పను? దయామయా! నాపై ఇక దయజూపు -


ఏకు మైఁ మంద మోహబస కుటిల హృదయ అగ్యాన\ |

పుని ప్రభు మోహి బిసారే ఉ దీనబంధు భగవాన ॥


( రామచరితమానసము 4-2 )


ప్రభువు ఎదుట అశాంతచిత్తముతో ప్ర్రార్థించు హనుమంతుడు తన్ను తాను మఱచిపోయాడు. అతనికి తాను ధరించిన వేషమును గూర్చిన జ్ఞానము కూడా లేకపోయింది. అతని బ్రాహ్మణ వేషము తొలగిపోయింది - అతడపుడు వాస్తవమైన తన వానర రూపముతో ప్రభువు చరణములపై బడి రోదిస్తూ ప్రార్థించుచున్నాడు.


Tuesday 19 October 2021

శ్రీ హనుమద్భాగవతము (51)



‘నేను మీ తేజస్సును స్వరూపమును చూసి చకితుడనగుచున్నాను. సామాన్య రాజకుమారులింతటి తేజస్సు కలిగి ఉండరు. లోకోత్తర తేజోమయ పురుషులైన మీరెవరు? మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరైనా ఒకరా? లేక నరనారాయణులా? లేక సర్వసృష్టికి ప్రభువైన పరబ్రహ్మ పరమాత్మ భూభారహరణార్థమై యుగళరూపమున అవతరించి నన్ను ధన్యునిగా జేయుటకు ఇక్కడకు వచ్చినాడా ?


సంభాషణచతురుడైన హనుమంతుడు ఇట్లా పలికి ఊరుకున్నమీదట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లా పలికాడు. లక్ష్మణా ! ఇతని పాండిత్యపూర్ణమైన స్పష్టోచ్చారణమువలన ఇతడు వ్యాకరణశాస్త్ర పారంగతుడైనట్లు, వేదాధ్యయన సంపన్నుడై నట్లు తెలుస్తోంది. నిజంగా ఇతడు సర్వ శాస్త్రజ్ఞాన సంపన్నుడే; ఎందుకనగా, ఇతడు సంస్కార (వ్యాకరణ నియమానుకూలమగు శుద్ధవాణిని 'సంస్కార సంపన్న'మందురు), క్రమసంపన్నము (శబ్దోచ్చారణకు సంబంధించిన శాస్త్రీయపరిపాటిని 'క్రమం అంటారు), అద్భుతము, అవిలంబితము (ధారాప్రవాహరూపముతో మాటలాడుట 'అవిలంబితం' అనబడుతుంది), హృదయానందకరము, కల్యాణమయము అయిన వాక్కును పలుకుతున్నాడు. హృదయము, కంఠము, మూర్ధము ఈ మూడుస్థానముల ద్వారమున స్పష్టరూపముగా అభివ్యక్తమవుతున్న ఇతని ఈ విచిత్ర వాక్కును వింటే ఎవరి చిత్తము ప్రసన్నముగాదు? వధించుటకు ఖడ్గము నెత్తిన శత్రువు హృదయము గూడ ఇతని అద్భుత వాక్కుచే మారిపోగలదు. 


సంస్కారక్రమ సంపన్నామద్భుతామవిలంబితామ్ | 

ఉచ్చారవతి కల్యాణీం వాచం హృదయహర్షిణీమ్ ॥ 

ఆనయా చిత్రయా వాచా త్రిస్థానవ్యంజనస్థయా | 

కస్య నారాధ్యతే చిత్తముద్యతా సేరరేరపి. || ( వా,రా. 4.8–82,88 ) 


నీవు ఇతనితో మాట్లాడు.


అన్న గారి ఆదేశమును సుమిత్రానందనుడు బ్రాహ్మణ వేషధారియైన పవనకుమారునితో ఇట్లా పలికాడు " "బ్రాహ్మణుడా ! మేమిరువురము ధర్మాత్ముడు, విఖ్యాతుడు, అయోధ్యాధిపతియు అయిన దశరధుని కుమారులము. ఈయన నా అన్న, పేరు శ్రీరాముడు, నా పేరు లక్ష్మణుడు. తండ్రిగారి ఆజ్ఞను అనుసరించి పదునాలుగు సంవత్సరములు అరణ్య వాసము చేయ వచ్చాము. ఇచట పంచవటిలో ఈయన భార్యయౌన సీతా దేవిని రాక్షసుడెవడో మోసముతో హరించినాడు. మేమీ గహనారణ్యములో ఆమెను వెదకుతూ తిరుగుతున్నాము. మీరెవరో దయ యుంచి చెప్పండి” .


పవనకుమారుడు సుమిత్రానందనుడు చెప్పు యుగళ రూపములను గురించి తెలుసుకొనుచున్నాడు. కాని అతని మనస్సు జటాజాలశోభితము, నవనీరదశరీరము గల శ్రీ రాముని ముఖారవిందముపై లగ్నమైయుండెను. భువనమోహనరూపము వాని రోమరోమమున ప్రవేశించుచున్నట్లుండెను. అతని నేత్రముల నుండి భాష్పములు ప్రవహించుచున్నాయి, శరీరము పులకరిస్తోంది. ప్రభువును గూర్చి విన్నపిమ్మట అతనికి తన స్మృతి కూడా లేకపోయింది. అతడు త్రైలోక్యదుర్లభములు, పవిత్రములు అయిన శ్రీరాముని పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము చేసాడు. వ్యాకులుడై ప్రేమాశ్రువులతో భవాబ్ధిపోతములు, పద్మారుణములు అయిన చరణములను ప్రక్షాళనము చేయసాగాడు.

Monday 18 October 2021

శ్రీ హనుమద్భాగవతము (50)



వ్యాకులుడై సుగ్రీవుడు హనుమంతునితో ఇట్లా పలికాడు. వ్యాకులుడై సుగ్రీవుడు హనుమంతునితో ఇట్లా పలికాడు. 'ఈ వీరులను ఇరువురిని చూసినంతనే నా మనస్సు భీతి చెందుతున్నది. ప్రాణశత్రువైన వాలి నన్ను చంపుటకు వీరిని పంపి ఉండవచ్చు, రాజులకు మిత్రులెందఱో ఉంటారు.


అందువలన వీరిని నమ్మరాదు. గూఢవేషమున సంచరిస్తూ శత్రువులను జాగ్రత్తగా గమనించాలి. ఏలయనగా, వారు ఇతరులకు తమపై విశ్వాసమును కలిగిస్తారు. కాని వారెవరిని విశ్వసించరు. సమయము వచ్చినప్పుడు ఆ నమ్మినవారిపై దెబ్బదీస్తారు. 


ఆరయశ్చ మనుష్యేణ విజ్ఞేయాళ్ఛద్మచారిణః |  

విశ్వస్తానామవిశ్వస్తాశ్ఛిద్రేషు ప్రహర న్త్యపి ॥ ( వా.రా. 4.2.22 )  


వాలి దీనిలో చాలా సమర్థుడు. అందువలన కపిశ్రేష్ఠా ! నీవు సామాన్య వ్యక్తి వలె వారి దగ్గరకు వెళ్ళి వారిని గుఱించి, వారి మనోభావములను గుఱించి తెలిసికొనుము. వీరు వాలిచే పంపబడినవారైతే నీవక్కడ నుండియే సూచన చేయ్యి. నేను మంత్రులతో గూడి ఈ పర్వతమును విడచి మఱియెచ్చటికైనా శీఘ్రముగా వెళ్ళి తలదాచుకొంటాను.


తనకు ప్రాణప్రియులు, మహాధనుర్ధారులు, శ్యామగౌర వర్ణులైన శ్రీరామలక్ష్మణులను పవనకుమారుడు గుర్తింపక పోవుచుండెను. కాని ఆయన దక్షిణ పార్శ్వము అదరుచుండెను, నేత్రములనుండి ప్రేమాశ్రువులు ప్రవహించుచున్నాయి. హృదయము మాటిమాటికి ఆయన వైపునకు ఆకృష్టమవుతోంది.


వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుని ఉద్దేశ్యము ఎఱింగి పవన కుమారుడు ఋష్యమూక పర్వతమునుండి ఎగురుతూ వెళ్ళాడు. త్రోవలో అతడు బ్రాహ్మణ వేషమును ధరించాడును. అభూత పూర్వము, అశ్రుత పూర్వము అయిన సౌందర్యముతో గూడిన శ్రీరామలక్ష్మణులను దర్శించినంతనే హనుమంతునికు ఒక విచిత్రమైన పరిస్థితి కలిగింది. ఆయన శిరము వారి చరణముల మీదకు వంగింది. పిమ్మట ఆయన చేతులు జోడించి మనస్సునకు ఎంతో సంతోషమును గలుగజేసే వాక్కులను ఇట్లు పలికాడు- వీరవరులారా ! శ్యామగౌరవర్ణులుగాను, మిక్కిలి సుందరముగాను ఉన్న మీరెవరు ? నిజంగా మీరు వీరపుంగవులైతే క్షత్రియ కుమారులేనా? కాని మీరు ఎంతో కోమలముగా నున్నారు. ఈ ప్రదేశము పర్వతమయమును, మహారణ్యమును, మహాభయంకరమునై యున్నది. అంతటా వ్యాఘ్రాది కూరమృగములు సంచరించుచున్నవి. త్రోవ రాళ్ళతోను, ముళ్ళతోను నిండి ఉన్నది. మీకిది సంచరింపదగిన భూమికాదు. అయినా మీరెదుకు ఈ నిర్జన వనములో సంచరించుచున్నారు!.


Sunday 17 October 2021

శ్రీ హనుమద్భాగవతము (49)



ఆరాధ్యుడగు శ్రీరామునిపాదపద్మములయందు


తండ్రి ఆజ్ఞను పాలించుటకై శ్రీరాముడు తన సహ ధర్మచారిణి అయిన జనక నందినిని, అనుజుడగు లక్ష్మణుని వెంటనిడుకొని వనమునకు వెళ్ళాడు. ఆయన చిత్రకూటము లోనూ, దండకారణ్యములోనూ పదుమూడు సంవత్సరముల వఱకు ఋషులను సర్వప్రాణులను ధన్యులుగా చేస్తూ సంచరించుచుండేవాడు. అసురులెక్కడైనా తాపసులకు బాధను కలుగజేస్తునారనే వార్తను విన్న వెంటనే శ్రీరాముడు వారిని అచట సంహరించి మునుల ప్రాణములను కాపాడేవాడు.


పదునాల్గవసంవత్సరములో సీతారామలక్ష్మణులు పంచవటిలో సుందరమైన ఒక పర్ణ కుటీరమును నిర్మించుకొని దానిలో నివసింపసాగారు. ఒక దినమున లంకాధిపతియైన రావణుని ప్రేరణనను అనుసరించి మారీచుడు బంగారు లేడియై వారి కుటీరము దగ్గరకు తిరగజొచ్చాడు. సీతా దేవి ఆ అద్భుత మృగమును చూసి ముగ్ధురాలై దానిని తెచ్చి ఇవ్వమని శ్రీరాముని ప్ర్రార్థించినది. శ్రీరాముడు బంగారు లేడి వెంట పరుగెత్తాడు, ఆ సమయములో రావణుడు సీతాదేవిని మోసముతో హరించి లంకలో అశోకవనములో ఉంచాడు.


శ్రీరాముడు లక్ష్మణునితో కలసి జానకిని వెదకుతూ, ఆయా ప్రాంతములలో గల విరాధక బంధాది రాక్షసులను వధిస్తూ ఋష్యమూక పర్వతము వైపునకు వెళ్ళాడు.


సుగ్రీవుడు వాలి భయమువలన ఎల్లపుడు శంకాకులిత స్వాంతుడై ఉండేవాడు. అతడు మంత్రులతో కలిసి పర్వత శిఖరముపై నుండి ఆజానుబాహులు, ధనుర్ధారులు, విశాల నేత్రులు, దేవకుమారులవలె తేజస్సుగలవారు అయిన ఆ ఇరువురు సోదరులను చూసినంతనే భయముచే వణకసాగాడు.

Saturday 16 October 2021

శ్రీ హనుమద్భాగవతము (48)



తన శరీరముపై బడిన రక్త బిందువులను జూసి మహాముని ఆలోచనామగ్నుడయ్యాడు. కారణమును అన్వేషింపగా పర్వతాకారంలోనున్న మహిషకళేబరము కనబడింది. తన తపోబలముచే మహర్షి ఈ దుష్ట కార్యమును ఎవరు చేసిరో తెలిసికొన్నాడు. వెంటనే ఆయన వాలిని 'అతడు ఈ ఆశ్రమము లోనికి ప్రవేశించినచో అతని తల ముక్కలు ముక్కలు కాగల'దని శపించాడు.


హనుమంతుడు భయపడు సుగ్రీవునితో ఇట్లా పలికాడు. రాజా! మతంగ మహామునిచే వాలికి ఈయబడిన శాపము నాకిపుడు జ్ఞప్తికివచ్చినది. కుపితుడై మహాముని వాలిని ఇట్లు శపించెను.


.....హ్యస్మిన్నాశ్రమమండలే | 

ప్రవిశేద్యది వై వాలీ మూర్ధాస్య శతధా భవేత్ | 

తత్ర వాసః సుభోఒస్మాకం నిరుద్విగ్నోభవిష్యతి | (వా. రా. 4.46.22,23)


"వాలి ఈ ఆశ్రమములోనికి ప్రవేశిస్తే అతని శిరస్సు నూఱువక్కలు అవుతుంది. అందువలన అచటకు వెళ్ళి నివసించటం మనకు ఎంతో శ్రేయస్కరము, ఎట్టి భయము ఉండదు”

వెంటనే సుగ్రీవుడు తనముఖ్యసచిడైన హనుమంతుడు చెప్పిన దానిననుసరించి ఋష్యమూక పర్వతముపై గల మతంగమహాముని ఆశ్రమమునకు వెళ్ళాడు. మహర్షి శాప భయముచే వాలి అచటికి పోజాలకపోయాడు. చేయునది లేక తిరిగి వెళ్ళాడు. 

రాజనీతివిశారదుడైన వాలి పవనకుమారుని ఎంతో గౌరవముతో తన దగ్గఱ ఉంచుకొనదలచుచుండేవాడు, కాని ఆంజనేయుడు సుగ్రీవుని క్షేమమును కోరుచుండేవాడు. సుఖముగా ఉన్నప్పుడు అందఱు చుట్టిముట్టి ఉంటారు. కాని ఆపద వచ్చినపుడు వారు విడచిపోవుదురు, నిమైన మిత్రులు సేవకులె ఆపద సమయంలో ప్రేమతోను భక్తి తోను సహాయపడతారు.


అంజనానందనుడు 'సుఖసమయమున సుగ్రీవునితో కలిసి ఉన్నాడి, ఆపత్కాలమున అతడు సుగ్రీవుని ఎలా విడచివస్తాడు? అతడెల్లపుడు సుగ్రీవునితో నుండి అతని బాగోగులను పరిశీలించుచుండేవాడు. చక్కగ పరామర్శించి, అతనికి ధైర్యము చెప్పుచుండేవాడు. హనుమంతుని ఓదార్పుతో సుగ్రీవుడు కష్టకాలమునందు కూడా సుఖమునే అనుభవించుచుండేవాడు. పవనకుమారుడు తనకు మంత్రియే కాదు, సాటిలేని మిత్రుడు, సోదరతుల్యుడునై ఉన్నాడు..


సర్వస్వము లాగుకొని వాలిచే బహిష్కృతుడైనా సుగ్రీవుడు తన ప్రియసచివుడైన హనుమంతుని వలన ఋష్యమూకపర్వతముపై రాజువలె సుఖముగా కాలము గడుపుచున్నాడు.


ఋష్యమూక పర్వతముమీదకు స్వయముగా రాజాలకుండేవాడు. శాపము వలన వాలి స్వయంగా రాలేకపోయేవాడు. అందువలన అతడు తన వారిని పంపి సుగ్రీవుని చంపే ప్రయత్నం చేసేవాడు. ఈ విషయము సుగ్రీవునకు చక్కగా తెలుస్తుంది కాని అతడు హనుమంతుని శక్తిని పరాక్రమమును, విలక్షణబుద్ధిని గట్టిగా నమ్మి ఉండుటచే నిశ్చింతగా ఉండేవాడు. మహావీరుడైన హనుమానుడు సుగ్రీవుని ఆజ్ఞాపాలనమున ఎప్పుడును తత్పరుడై ఉండేవాడు. సర్వగుణసంపన్నుడైన పవనకుమారుడు తనకు పుత్రునిగానూ, సచివునిగానూ లభించినందులకు సుగ్రీవుడు తన అదృష్టమును ఎల్లప్పుడూ పొగడుకొంటూ ఉండేవాడు.


Friday 15 October 2021

దుర్గామాతను పూజించిన శ్రీ రాముడు.



ఈ కథ కలకత్తా వైపు ప్రాచుర్యంలో వుంది. దీన్ని అకాల బోధన్ అంటారు. అకాల అంటే కాలం గాని కాలంలో. బోధన్ అంటే పూజించడం/ ఆవాహన చేయటం. సాధారణంగా అమ్మవారిని వసంత ఋతువులో పూజిస్తారు. అయితే రాముడు కాలం కాని కాలంలో పూజించినందు వలన ఈ పేరు వచ్చిందట.


రావణుని మీద యుద్ధం ప్రకటించే ముందు శ్రీ రాముడు దుర్గామాత అనుగ్రహం పొందాలనుకున్నాడు. అమ్మవారిని 108 నీలి పద్మాలతో పూజిస్తే ప్రసన్నమవుతుందని తెలుసుకుని పద్మాలు సేకరించాడు. పూజ ముగిసే సమయానికి అందులో ఒక పుష్పం తగ్గిందని తెలుసుకుని, తన నేత్రాలు నీలిపద్మాల వలె ఉంటాయని అందరూ అంటారు కనుక తన కళ్ళనే అర్పిద్దామని బాణాన్ని కంటి దగ్గర పెట్టగానే దుర్గమ్మ ప్రత్యక్షమైంది. రావణుడు మట్టి కరుస్తాడని చెప్పి, అభయమిచ్చింది. ఆ తర్వాత రావణ వధ జరగడం, సీతమ్మతో కలిసి అయోధ్య చేరడం మనకు తెలిసినదే. అలా శ్రీ రామచంద్రుడు దుర్గామాతను ఆరాధించాడు.


శ్రీ రాముని చేత పూజలందుకున్న వినాయకుడు తమిళనాడులోని ఉప్పూర్‌లో, రామ ప్రతిష్టితమైన నవగ్రహాలు రామేశ్వరం దగ్గరలో నవపాషాణంలో ఉన్నారు. ముందుగా విఘ్ననివారణ కోసం శ్రీ మహగణపతిని పూజించి, ఆ తర్వాత కార్యసిద్ధి కోసం నవగ్రహాలను కూడా పూజించాడు. అలాగే రావణ వధానంతరం రామేశ్వరంలో సీతమ్మ ఇసుకతో లింగం చేయగా రాముడు పూజించాడు. అది ఇప్పటికీ రామేశ్వరంలో ఉంది. 


అందుకే మనమంతా ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతిని పూజించి, నవగ్రహాలను స్మరించి, మిగితా దేవతలను ఆరాధించి అప్పుడు ప్రారంభిస్తాము. 


శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తే లోకులు అది పాటిస్తారు. మనందరికి సరైన మార్గం చెప్పుటకు శ్రీరాముడు ఈ విధంగా అర్చించాడు. మనం కూడా భగవదారాధనలో శ్రీ రాముని మార్గంలో నడవాలి. అహంభావనను విడిచి సర్వదేవతలను సమభావంతో ఆరాధించాలి.

 

జయ శ్రీ రామ

Thursday 14 October 2021

యాదేవీ సర్వభూతేషు (4)



'అపరాజిత స్తోత్రానికి అర్ధం తెలుసుకున్నాం గదా. అందులోనే ఋషులు మనకు సులభోపాయాలు ఎన్నో చెప్పారు . ప్రతి విశేషణానికి ముందు 'యాదేవీ సర్వభూతేషు ______ రూపేణా సంస్థితా' అన్నారు. ఇంతకీ ఈ యాదేవీ అంటే ఏమిటి ? ఏ దేవి అయితే సర్వభూతములయందూ ఈ ఈ విభూతులుగా వ్యక్తమవుతుందో ఆ దేవికి ముమ్మారు నమస్కారములు అన్నారు. ఋషి దేన్నీ వదల్లేదు. సర్వభూతములు అన్నారు, అంటే పిపీలికాది బ్రహ్మపర్యంతం (చిన్న విత్తనం నుంచి బ్రహ్మదేవుని వరకు) అఖిల లోకాల్లో, అనేకరూపాల్లో వ్యక్తమవుతున్న అమ్మవారి విశ్వరూపం చూపెట్టారు. అంటే మనం భగవతి ఉపాసన చేయాలంటే అమ్మవారిని అన్నిటియందు చూడటం నేర్చుకోవాలి.


స్త్రీలోనే అమ్మవారిని చూడాలని కూడా వారు అనలేదు. సర్వభూతాల్లో చూడాలి అన్నారు. అంటే ఎవరిని అల్పంగా చూడరాదు, అవమానించకూడదు. అది జంతువైనా , మొక్కైనా ఏదైనా. ఇక ప్రత్యేకించి స్త్రీల గురించి చెప్పనవసరం లేదు. 


కులమతలింగ బేధాలను మనం దాటి అంతటా భగవతి చూడగలిగితేనే అది నిజమైన శ్రీవిద్యోపాసన. నిజమైన శ్రీవిద్యోపాసకుడు దేన్నీ అల్పంగా భావించడు. ఎందుకంటే అనేక రూపాల్లో అమ్మ అతని వద్దకు నిత్యం వస్తూ ఉంటుందని భావన చేస్తాడు. 


ఇక్కడ కేవలం జీవుల గురించి మాత్రమే చెప్పలేదు. కార్యకలాపాల గురించి కూడా చెప్పారు చూడండి - నిద్ర, ఆకలి, దాహం, మతిమరుపు వంటి వాటిల్లో కూడా అమ్మవారిని చూడమన్నారు. అది కదా నిజమైన ఉపాసన అంటే. మనం యజ్ఞాలు చేయక్కర్లేదు, జపాలు చేయక్కర్లేదు. చండీ సప్తశతిలో చెప్పినట్లు అమ్మవారిని సమస్త కార్యకలాపాల్లో, విశ్వమంతటా దర్శించగలిగితే చాలు. అంటే ఇక్కడ చండి హోమాలను, జపాలను తక్కువ చెయ్యట్లేదు. కానీ సాటిజీవుల పట్ల ప్రేమను చూపలేనప్పుడు, తన తోటి మానవులను గౌరవించలేనప్పుడు భగవతి ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేకించి కర్మలు చేయుట ఎందుకు? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేవాళ్ళు, తల్లిదండ్రులను, కట్టుకున్న ఇల్లాలిని గౌరవించని వాళ్ళు, స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాళ్ళు భగవతి ఉపాసన చేస్తున్నామని చెప్పుకోవటమంటే అది శుద్ధ అబద్ధమే. నిజమైన దేవి ఉపాసకుడు తాను ఎవరిని దూషించడు, తన వాళ్ళు దూషిస్తే చూస్తూ ఊరుకోడు.    


అదే ఈ స్తోత్రం చెబుతోంది. నిత్యజీవితంలో సర్వావస్థల్లో భగవతిని చూడు. అన్నిటియందు అమ్మవారిని భావన చేసినవాడికి అపజయం ఉండదు. అతడిని భగవతి తనతో సమానంగా చూస్తుంది. కనుక దేవతలు, ప్రకృతి అతనికి అన్ని విజయాలనే ఇస్తాయి (వారి ద్వారా అపరాజిత దేవి అతడిని అపరాజితుడిని చేస్తున్నది). 


ఓం శ్రీ మాత్రే నమః 

Wednesday 13 October 2021

యా దేవీ సర్వభూతేషు (3)



యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!! 


ఏ దేవి అయితే సర్వజీవుల యందు విష్ణుమాయ రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు చైతన్యం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు బుద్ధిరూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు నిద్ర రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు ఆకలి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు జీవాత్మ రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు శక్తి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు దాహం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు ఓర్పు/ సహనం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు మూలప్రకృతి తత్త్వంగా (సర్వజీవుల పుట్టుకకు కారణం) ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.



యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!! 


ఏ దేవి అయితే సర్వజీవుల యందు సిగ్గు రూపంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు శాంతి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు శ్రద్ధ (భగవంతుని యందు విశ్వాసము, ధర్మం మరియు శాస్త్రము చెప్పేదే సత్యము అనే భావనను శ్రద్ధ అంటారు) రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు ప్రేమ మరియు సౌందర్యంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు సద్గుణములు/ అదృష్టము/ ఐశ్వర్యం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు క్రియాశీలత్వంగా/ చురుకుదనము/ స్వధర్మము రూపంగా వ్యక్తమవుతున్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు జ్ఞాపకశక్తిగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు దయా గుణంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు సంతృప్తి భావనగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు మాతృస్వరూపంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఏ దేవి అయితే సర్వజీవుల యందు (మతి)మరపు/ మోహము/ భ్రమ రూపంలో వ్యక్తమవుతున్నదో, ఆ తల్లకి నమస్కారములు.


ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా!

భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దైవ్యై నమో నమః!!


అఖిల లోకాల యందున్న జీవుల ఇంద్రియాలకు అదిష్ఠాన దేవతయై, సర్వజీవులయందు సర్వత్రా వ్యాపించి ఉన్న భగవతికి నమస్కారములు.


చిత్తిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితాం జగత్!

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!


ఈ జగత్తంతా వ్యాపించి, చిత్శక్తి (చైతన్యం) రూపంలో అన్నింటియందూ ఉన్నదో, ఆ తల్లికి ముమ్మారు నమస్కారములు.

Tuesday 12 October 2021

యా దేవీ సర్వభూతేషు (2)

 


మంత్రోపదేశం కావాలని, అమ్మవారిని ఉపాసన అంటే తమకు ఎంతో ఇష్టమని అనేకులు గురువు కోసం అన్వేషిస్తుంటారు. అమ్మవారిని సులభంగా ఉపాసించే పద్ధతులను ఋషులు దేవీ మహాత్యంలోని చండీ సప్తశక్తిలో చెప్పకనే చెప్పారు. అందులోని 'అపరాజితా స్తోత్రం' లోని రెండు పంక్తులు చూడండి.


యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై  నమస్తస్యై నమో నమ: || 


సర్వజీవులయందూ ఆకలి రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారములు.


యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: || 


సర్వజీవులయందూ దాహం రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారములు.


జీవులలో ఆకలి, దాహార్తి రూపంలో వ్యక్తమయ్యేది కూడా అమ్మవారే అంటున్నారు. ఇదే మనకు భగవద్గీత, శివగీత, గణేశగీతలలో కనిపిస్తుంది. గీతలో భగవానుడు 'అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశిత్రః' అంటాడు. వైశ్వానరుడు అంటే ఆహారన్ని జీర్ణం చేసే అగ్ని, సైన్స్ పరిభాషలో హైడ్రో క్లోరిక్ యాసిడ్. 


ఆకలితో ఉన్నవాడికి పట్టేడన్నం పెట్టి అతని కడుపు నింపితే అది అమ్మవారి అర్చన. దాహంతో ఉన్నవాడి దాహం తీరిస్తే అది కూడా అమ్మావారికి చేసే అర్చనయే. భగవతికి ఏ పువ్వులంటే ఇష్టం, ఏ నివేదన అంటే ఇష్టం అని అడుగుతారు. ఆకలి మరియు దప్పికతోనున్న జీవులకు ఆహారం మరియు నీరు అందిస్తే దేవి భగవతి సంతసిస్తుందని దేవీ మహాత్యం చెబుతోంది. ఇంతకంటే సులభమైన పని ఏముంది ?


కాకపోతే వాళ్ళు నిస్సహాయులనే భావనతో లేదా నేను ఇస్తున్నాననే భావన ఇక్కడ పనికిరాదు. జీవులయందున్న భగవతిని ఆహారం మరియు నీరు ద్వారా పూజిస్తున్నానే భావన రావాలి. ప్రతిఫలం ఆశించకుండా, నిష్కామంగా, పవిత్రభావనతో చేయాలి. సెల్ఫీలు తీసుకుని పెట్టడమంటే ప్రదర్శనయే అవుతుంది. నువ్వు ఇలా జీవుల ఆకలిదప్పికలు తీర్చుతున్నావనే విషయం నీకు, పరమేశ్వరికి తప్ప ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. అలా చేసిందే నిజమైన ఉపాసన. మిగితాదంతా బాహ్యప్రదర్శనయే. 


ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మగారు చేసింది కూడా ఒక రకమైన దేవీ ఉపాసనయే. అమ్మవారి పారాయణలు చేసినప్పుడు ఏదో ఒక రూపంలో అమ్మ ఆ భక్తుని దగ్గఱకు వస్తూ ఉంటుందని, అందుకే దేవీ ఉపాసకులు నిత్యం అన్నదానం వంటివి చేస్తూ ఉండాలని శ్రీ విద్యలో చెబుతారు. మంత్రం జపిస్తేనే ఉపాసన కాదు, సర్వజీవులలో వ్యక్తమవుతున్న శక్తిని తగిన విధంగా అర్చించడం కూడా ఉపాసనయే.


ఓం శ్రీ మాత్రే నమః     

Monday 11 October 2021

శ్రీ హనుమద్భాగవతము (47)



అతని గర్జనమును విని పరాక్రమ శ్రేష్ఠుడైన వాలి కోపముతో బయటకు వచ్చాడు. అపుడు అతని కంఠము ఇంద్ర ప్రదత్తము, విజయప్రదాయిని యగు సువర్ణ మాలతో శోభిల్లుచుండేది. దుందుభిని చూసిన్నంతనే అతనితో యుద్ధము చేయుటకు వాలి సంసిద్ధుడయ్యాడు. దుందుభి తన కొమ్ములతో పొడుచుటకై ఎంతో వేగముగా వాలిపైకి దూకాడు. వెంటనే వాలి వాని రెండుకొమ్ములను గట్టిగా పట్టుకొని నలువైపుల వానిని త్రిప్పసాగాడు.

అప్పుడు వాలి రూపము క్రోధముతో భయంకరముగా ఉండేది. అతడు మాటిమాటికి గట్టిగా గర్జించుచుండేవాడు. ఇట్లతడు మొదట పర్వతాకారుడైన రాక్షసుని నలువైపుల త్రిప్పి బలముగా నేలపైగొట్టాడు. దుందుభి రెండు చెవులనుండి రక్త ధారలు ప్రవహింపసాగాడు.


అమితశక్తి శాలియైన దుందుభి లేచి వెంటనే మరల వాలిని ఎదుర్కొన్నాడు. వారిరువురు ఘోరముగా పోరాడసాగారు. వారొకరినొకరు చంపుకొన చూచుచుండేవారు. దుందుభి త నగిట్టలను, కొమ్ములతోను వాలిని ఎదుర్కొనుచుండేవాడు. వాలి పిడికిలి పోటులతోను, కాలితన్నులతోను, రాళ్ళతోను, వృక్షములతోను దుందుభిని కొట్టుచుండేవాడు.


వీరవరుడైన వాలి ద్బెబలచే దుందుభి బలము క్షీణింపసాగింది. చివరకు అతడు దుర్దమనీయుడైన ఆ దానవుని పైకెత్తిన సంపూర్ణశక్తితో నేలపై గొట్టాడు, దూమికి అతనిపైన తన కూర్చున్నాడు. సాటి లేని వాలి బరువును వాడు మోయలేకపోయాడు. అతని అవయవముల నుండి రక్తము ప్రవహింప సాగింది. వెంటనే వాడు నేలపై కూలి ప్ర్రాణములను విడిచాడు.


దుందుభి మరణానంతరము వాలి మిక్కిలి కోపముతో వాని శవమును ఒక యోజనము దూరము విసిరాడు. అది మతంగముని ఆశ్రమమున పడ్డాడు. వేగముగా విసరుటచే చనిపోయిన ఆ అసురుని శరీరము నుండి ప్రవహించిన రక్త బిందువులు కొన్ని మహాముని శరీరముపై బడ్డాయి.


శ్రీ హనుమద్భాగవతము (46)



స్వార్థపరుడైన నా ఈ సోదరుడు నా భార్యను, రాజ్యాన్ని పొందదలచి బిలద్వారమును బండరాతితో కప్పివేసినాడు, దానివలన నేను బయటకు రాలేక లోపలే మరణిస్తానని అతని ఊహయై ఉండవచ్చూ అనే ఆలోచన మనస్సు లోనికి వచ్చిన వెంటనే నేయి పోయగానే భగ్గుమని లేచే అగ్నివలె వాలి క్రోధోన్మత్తుడయ్యాడు.


క్రోధారుణలోచనుడైన తన అన్నను చూసినంతనే సుగ్రీవుడు అతని రాజ్యాన్ని అతనికిచ్చి వేసి, నిజం చెప్పే ప్రయత్నం చేసాడు, కాని ‘మహాక్రుద్ధుడైన వాలి సుగ్రీవునకు బద్ధశత్రువయ్యాడు. అతడు రాజ్యముతో పాటు సుగ్రీవుని భార్యయైన రుమను కూడా లాగుకొని, సుగ్రీవుని వధింపదలంచాడు. సుగ్రీవుడు ప్ర్రాణరక్షణార్థమై మంత్రులతో క్లసి పాఱిపోయాడు.


భయకంపితుడైన సుగ్రీవుడు పరుగెత్తుచున్నాడూ. వాలి అతనిని చంపదలచి వెంటబడ్డాడు. నదులను, నదములను, వనములను, పర్వతములను, సముద్రములను, నగరములను దాటుతూ సుగ్రీవుడు పరిగెడుతున్నాడు. ఎక్కడా కూడా ఒక్క రోజైన నిలబడటానికి అతనికి ధరియం లేకపోయింది. వాలి ప్రాణఘాతకుడైన శతృవు వలె వెంబడిస్తున్నాడు.

అట్లా పరుగెడుతూ సుగ్రీవుడు హిమాలయమును, మేరువును, ఉత్తరసముద్రమును సమీపించాడు. అయినా వాలి అతనిని విడువలేదు. సుగ్రీవునకు ఎవ్వరూ అభయమిచ్చేవారు కనబడకపోయారు. అప్పుడు అతని వెంట నిరంతరము నీడవలె ఉన్నవాడు జ్ఞానులలో శ్రేష్ఠుడైన హనుమంతునకు దుందుభివధను గూర్చిన ఘటన జ్ఞాపకమునకు వచ్చింది.


మహిష వేషములో ఉండే దుందుభి అనే దైత్యుడు వేయి ఏనుగుల బలముగలవాడు. తాను గొప్పశక్తివంతుడననే గర్వము అతనికి ఎక్కువగా ఉండేది. ఒకనాటివిషయము, దుందుభి సముద్రుని, హిమవంతుని తిరస్కరించి గర్జిస్తూ వీరశిరోమణియైన వాలితో యుద్ధము చేయుటకు కిష్కింధా పురపుపొలిమేరలలోనికి వచ్చి బిగ్గరగా దుందుభి ధ్వనివలె గర్జింపసాగాడు. దుందుభి తన గిట్టలతో భూమిని త్రవ్వుతూ, వృక్షములను నాశము చేస్తూ, పురద్వారమును కొమ్ములతో విరుగగొట్ట యత్నిస్తూ యుద్ధమునకు ఆహ్వానించసాగాడు.

Sunday 10 October 2021

యాదేవి సర్వభూతేషు (1)



దేవి ఉపాసనను నిత్యజీవితంలో ఎలా ఉపాసించవచ్చో తెలుసుకుందాము.


యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


సర్వ జీవులలోనూ, సర్వత్రా శక్తి రూపంలో ఉన్న తల్లికి నమస్కారాలు. ఈ విశ్వమంతా శక్తి వ్యాపించి ఉంది. అది అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది.


యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


సర్వ జీవులలోనూ బుద్ధి రూపంలో ఉన్న తల్లికి నమస్కారాలు.


మనం చాలా సందర్భాల్లో బేరాలు చేస్తాము. ఒక పని చేయించుకున్నప్పుడు ఆ పనికి తగిన మూల్యము చెల్లించము. ఎవరైనా ఏదైనా చిన్న వడ్రంగి పని చేసినా, కూలి పని చేసినా, దానికి కొందరు తగినంత డబ్బు ఇవ్వరు. అంతెందుకు ఇంతే తీసుకోవచ్చు గదా అనేవారు ఎందరో ఉన్నారు. పని చేయించుకున్న తర్వాత కూడా జీతం ఇవ్వని యజమానులు ఎందరినో నేను చూసాను. రెండు నెలలు, మూడు నెలల జీతం తమ దగ్గరే అట్టి పెట్టుకునే యజమానులు/ సంస్థలు సైతం ఉన్నాయి. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నాడంటే అతనిలో శక్తి రూపంలో ఆ అమ్మవారు వ్యక్తమైంది. అతను చేసిన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని వెంటనే ఇవ్వడమే శక్తిని ఉపాసించడం. ప్రతిఫలం ఇవ్వకుండా జాప్యం చేయడం, లేదా తగినంత ప్రతిఫలం ఇవ్వకపోవడం అమ్మవారిని అవమానిచడం.


ఒక వస్తువు కొన్నప్పుడు కూడా బేరం చేస్తారు. ఏ వస్తువును తయారు చేయాలన్నా, దానికి బుద్ధి బలం అవసరం. బుద్ధి అంటే కూడా అమ్మవారే. కనుక ఒక వస్తువుకు తక్కువ విలువ కట్టడం (బేరమాడటం) అమ్మవారిని అవమానించడం.


ఓం శ్రీ మాత్రే నమః

దుష్టులపై కూడా సద్గరుని అనుగ్రహం‌ - తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవితంలోని సంఘటన



బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. మన తెలుగు నేలన ఈ మధ్యకాలంలో నడయాడిన గొప్ప బాల ఉపాసకుల లో తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అగ్రగణ్యులు... వారి జీవితంలోని ఒక సంఘటన.


*దుష్టులపై కూడా సద్గరుని అనుగ్రహం‌*


*దొంగలు దొరలయ్యారు*


ఒకసారి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కొన్ని రోజులు ఖాజీపాలెంలో రాత్రి వేళ పురాణమును చెప్పి ప్రతిరోజూ అర్థరాత్రి సమయాన కాలినడకన చందోలు చేరుతుండేవారు.


అది అడవి మార్గం. ఆ మార్గంలో దోపిడిదొంగలు అధికం. అనుకున్నట్లే శాస్త్రిగారిని దొంగలు వెంబడించసాగారు. శాస్త్రిగారు ముందు నడుస్తుంటే, దొంగలు వెనుక కర్రలతో పరుగులు పెడుతూ ఉన్నారు. ఆయన నడక మాములుగా ఉంటే, ఆయనను దోచుకునేందుకు సిద్దమైన దొంగలు పరుగెడుత్తుతూనే ఉన్నారు. కానీ ఆయనను అందుకోలేక పోతున్నారు.


చివరకు ఒకచోట శాస్త్రిగారు ఆగి వెనుదిరిగి " ఎవరు మీరు?" అని ప్రశ్నించారు.


వెంటనే వారందరూ కర్రలు క్రింద పడేసి నేలమీద సాగిలాపడి, లెంపలు వేసుకుంటూ "అయ్యా! మీ ఒంటిపై తళతళలాడుతున్న ఆభరణాలు దోచుకుందామని దుర్బుద్ధితో వెంబడించాము. మేము దొంగలం. కానీ అదేమి చిత్తమో, మీ మహిమోగానీ, ఏ అడుగుకు ఆ అడుగులో మిమ్ము దోచుకుందామని మైలుదూరము పైగా వెంబడించాము. మిమ్మల్ని కేకలు వేసి భయపెట్టేందుకు మాకు మాట పెగల్లేదు. చేతుల్లో ఉన్న కర్రలు, కత్తులతో మీపై దాడి చేద్దామంటే చేతులు రావు. అసలు ఏమీ తోచకుండానే ఇంత వరకు వెంబడించాము. తమరు దయతలచి క్షమిస్తే మా దారి మేము పోతాము" అని దీనంగా పలికారు.


"మీరు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా గౌరవముగా జీవిస్తే నాకు సంతోషంగా ఉంటుంది" అని పలికారు శాస్త్రిగారు.


అంతట ఆ దొంగలు " దొరవారూ! మీ ఆన మేరకు మేమందరం నేటితో ఈ నీచవృత్తి వదిలేస్తాము. మా చుట్టుప్రక్కల గల దారిదోపిడీగాండ్లందరినీ హెచ్చరిస్తాము. మిమ్మల్ని కన్నెత్తి చూచేవాడుండడు. ప్రొద్దుపోయింది. పోయి రండి" అని గౌరవముగా వంగి నమస్కారాలు చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ దోపిడీ దొంగలు.


ఆ దొంగలు దోపిడీలు మానుకొని పనులు చేసుకుని జీవించసాగారు.


*సద్గురు కృప మాసపత్రిక నుంచి*


*2018 మే సంచిక*

Saturday 9 October 2021

శ్రీ హనుమద్భాగవతము (46)



స్వార్థపరుడైన నా ఈ సోదరుడు నా భార్యను, రాజ్యాన్ని పొందదలచి బిలద్వారమును బండరాతితో కప్పివేసినాడు, దానివలన నేను బయటకు రాలేక లోపలే మరణిస్తానని అతని ఊహయై ఉండవచ్చూ అనే ఆలోచన మనస్సు లోనికి వచ్చిన వెంటనే నేయి పోయగానే భగ్గుమని లేచే అగ్నివలె వాలి క్రోధోన్మత్తుడయ్యాడు.


క్రోధారుణలోచనుడైన తన అన్నను చూసినంతనే సుగ్రీవుడు అతని రాజ్యాన్ని అతనికిచ్చి వేసి, నిజం చెప్పే ప్రయత్నం చేసాడు, కాని ‘మహాక్రుద్ధుడైన వాలి సుగ్రీవునకు బద్ధశత్రువయ్యాడు. అతడు రాజ్యముతో పాటు సుగ్రీవుని భార్యయైన రుమను కూడా లాగుకొని, సుగ్రీవుని వధింపదలంచాడు. సుగ్రీవుడు ప్ర్రాణరక్షణార్థమై మంత్రులతో క్లసి పాఱిపోయాడు.


భయకంపితుడైన సుగ్రీవుడు పరుగెత్తుచున్నాడూ. వాలి అతనిని చంపదలచి వెంటబడ్డాడు. నదులను, నదములను, వనములను, పర్వతములను, సముద్రములను, నగరములను దాటుతూ సుగ్రీవుడు పరిగెడుతున్నాడు. ఎక్కడా కూడా ఒక్క రోజైన నిలబడటానికి అతనికి ధరియం లేకపోయింది. వాలి ప్రాణఘాతకుడైన శతృవు వలె వెంబడిస్తున్నాడు.

అట్లా పరుగెడుతూ సుగ్రీవుడు హిమాలయమును, మేరువును, ఉత్తరసముద్రమును సమీపించాడు. అయినా వాలి అతనిని విడువలేదు. సుగ్రీవునకు ఎవ్వరూ అభయమిచ్చేవారు కనబడకపోయారు. అప్పుడు అతని వెంట నిరంతరము నీడవలె ఉన్నవాడు జ్ఞానులలో శ్రేష్ఠుడైన హనుమంతునకు దుందుభివధను గూర్చిన ఘటన జ్ఞాపకమునకు వచ్చింది.


మహిష వేషములో ఉండే దుందుభి అనే దైత్యుడు వేయి ఏనుగుల బలముగలవాడు. తాను గొప్పశక్తివంతుడననే గర్వము అతనికి ఎక్కువగా ఉండేది. ఒకనాటివిషయము, దుందుభి సముద్రుని, హిమవంతుని తిరస్కరించి గర్జిస్తూ వీరశిరోమణియైన వాలితో యుద్ధము చేయుటకు కిష్కింధా పురపుపొలిమేరలలోనికి వచ్చి బిగ్గరగా దుందుభి ధ్వనివలె గర్జింపసాగాడు. దుందుభి తన గిట్టలతో భూమిని త్రవ్వుతూ, వృక్షములను నాశము చేస్తూ, పురద్వారమును కొమ్ములతో విరుగగొట్ట యత్నిస్తూ యుద్ధమునకు ఆహ్వానించసాగాడు.

Wednesday 6 October 2021

శ్రీ హనుమద్భాగవతము (45)



వాలి సోదరుడైన సుగ్రీవుని పదిహేను దినముల వఱకు బిల ద్వారము దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కాని సుగ్రీవుడు ఒక మాసము వఱకు అచట చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ద్వారము నుండి అతనికి రాక్షసుల కోలాహలము వినబడసాగినది. కాని వాలిశబ్ద మేదీ వినబడలేదు. అతడు తన అన్నను గూర్చి ఆలోచింపసాగాడు. ఇంతలో అతని ఎదుట గుహ నుండి నురుగుతో కూడిన రక్తము ప్రవహింపసాగింది. భ్రాతృస్నేహమువలన సుగ్రీవుడు వ్యాకులుడయ్యెను. అన్న విషయమై అతనికి సందేహ ముత్పన్నమయ్యింది.


ఎంత ప్రయత్నించినా అతని వాలి జాడ తెలియలేదు. ‘ఈ విశాలబిలంలో అసురులందఱూ క్లసి నా సోదరుని చంపి ఉండవచ్చు, వారు బయటకు వచ్చి నన్ను కూడా చంపవచ్చు' అని సుగ్రీవుడు తలచాడు.


మిక్కిలి దుఃఖితుడై అతడు తన రక్షణకై ఒక పెద్ద బండరాతిని బిలద్వారానికి అడ్డముగా ఉంచి, విచారవదనుడై వాలికి జలాంజలి వదలి కిష్కింధకు వెల్లాడు.


సుగ్రీవుడు తన అన్న మరణమును గుప్తముగా ఉంచాలని తలచాడు, కాని చతురులైన మంత్రులు యువ రాజైన అంగదుడు చిన్న వాడుగా ఉండుటవలన సుగ్రీవునే రాజుగా చేశారు. అప్పటినుండి అతడు నీతిపూర్వకముగా రాజ్యాధికారమును నిర్వహింపసాగాడు.


అచట వీరవరుడైన వాలి రాక్షసుల నందఱనీ సంహరించి రాజధానికి మరలాడు. సుగ్రీవుడు తనకు బదులుగా రాజ సింహాసనమును అధిష్ఠించియుండటం చూసి వాలి మిక్కిలి క్రుద్ధుడయ్యాడు.


శ్రీ హనుమద్భాగవతము (44)



వీరవరులగు వాలి సుగ్రీవుల పరస్పర ప్రేమ వృత్తాంతము అంతట ప్రసిద్ధి చెందియుండేది. వారిరువురు ఎంతో సుఖముగా జీవితమును గడుపేవారు. దైవనిర్ణయము అనుల్లంఘనీయము గదా! వారిరువురూ తమ సహజప్రేమను మరచి ఒకరినొకరు చంపుకొను స్థితికి దైవము వారిని తీసుకుని వెళ్ళింది. దాని వలన వారు పరస్పరము రక్త పిపాసులైయ్యారు.


అపుడు మయునిపుత్రుడైన 'మాయావి' యను దానవుడు గర్వముచే ఉన్మత్తుడై తనతో సాటివచ్చే వీరుని సాటివచ్చువీరుని (ప్రతిభటుని) వెదకుచు తిరుగుచుండేవాడు. ఒక నాటి విషయం. అర్థరాత్రి సమయంలో బలవంతుడైన ఆ అసురుడు కిష్కింధా పురపు పొలిమేరలలోనికి వచ్చి వాలిని సవాలు చేస్తూ భయంకరంగా గర్జిస్తున్నాడు.


పరాక్రమశాలి యైన వాలి శత్రువు పిలుపును వినినంతనె వానిని చంపుటకు ఎల్లప్పుడును సిద్ధముగానే ఉంటాడు. ఆయన గాఢనిద్రలో ఉన్నాడు. అయినా అసురుని సవాలు వినబడినంతనె ప్రక్కనుండి లేచి వెంటనే పరుగెత్తాడు. శత్రువు ఎదుటకు వెళుతున్న అన్నను చూసి సుగ్రీవుడు కూడా ఆయన వెంట వెళ్ళాడు. అలా వాలిసుగ్రీవులిరువురూ రావడం చూసి మాయావి భీతి చెంది వేగంగా పరుగెత్తాడు. సోదరులిరువురు వానిని వెంబడించారు.


చాలా దూరము వెళ్ళిన పిమ్మట గడ్డిగాదముతో గప్పబడి ఉన్న ఒక విశాలబిలాన్ని అతడు చూసీ, వెంటనే దానిలో ప్రవేశించాడు. క్రోధోన్మత్తుడైన వాలి సుగ్రీవుని ఆ బిలద్వారము దగ్గర సావధానముగా ఉండమని చెప్పి తాను లోనికి ప్రవేశించాడు.

Monday 4 October 2021

మాసికాలు, పిండ ప్రదానాల రహస్యాలు



చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? 


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. 


ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుణ్ణి దేవతలు, మహర్షులు “మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?”అని అడగగా బ్రహ్మ “దేహం”, “దేహి”గురించి ఇలా చెప్పాడు.


 “మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.”

”ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది”

”ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి.”


”ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.”


నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.


కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.

యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.


ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.


దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.


అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.


సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.


దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.


వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నారు.

దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు)

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.

ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.

ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.

తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.


నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.

ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది. 

కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.

ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.

సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.

కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న విశేషాలు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 

నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.*

వాటిని కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం “పిండదానాలు చేయండి”అని మాత్రమే చెబుతారు. తమ పెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం  వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

Sunday 3 October 2021

వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం



వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం


అనాదిగా కుటుంబంలోని పెద్దలు పాటిస్తూ వస్తున్న ఆచారాలను ఖచ్చితంగా కొనసాగించాలి. కుటుంబ పెద్దలు కులదేవత (ఇంటిదేవుడు అని కూడా వ్యవహరిస్తారు) గా తరతరాలు ఎవరిని పూజిస్తూ వస్తున్నారో వారిని తప్పక అర్చించాలి. వారు ఆరాధించిన పద్ధతిలోనే పూజించాలి. అందులో మార్పులు చేయడం గానీ, వదిలేయ్యడం గానీ చేయగూడదు. ఒకవేళ కులదేవత తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఆరాధన పద్ధతిని తర్వాతి తరాలకు అందించాలి. అలాగే గ్రామదేవత యొక్క ఆరాధన కూడా. తరతరాలుగా మన పెద్దలు కొనసాగిస్తూ వస్తున్న ఆచారాలను విడిచిపెడితే వారి కోపానికి గురికావల్సి వస్తుంది, పితృశాపం తలుగుతుంది.


మతం మారితే మొత్తం వంశాచారం నాశనమవుతుంది. అది ఒక్కటే కాదు, కొత్తగా పుట్టుకొచ్చిన గురువులు చెప్పిన మాటలు విని, ఈ ఆచారాలు ఆరాధన పద్ధతులెందుకు? ఇవన్నీ అవసరం లేదు, ధ్యానం చేస్తే చాలు, బాహ్యంలో దీపం వెలిగించుట ఎందుకు? లోపల దీపం వెలిగించాలిగానీ ... లాంటి పిచ్చి మాటలను పట్టుకుని మీ పూర్వీకులు పాటిస్తూ వస్తున్న ఆచారాలను వదిలిపెడితే ఆ వంశం నశిస్తుంది. ఇక మన ధర్మంలోనే అనేక సంప్రదాయాలు. కొందరు శివుడిని పూజించరు, కొందరు విష్ణువును పూజించరు. కొత్తగా ఆ సంప్రదాయాల్లో చేరి మీ కులదేవతను విడిచిపెడితే, మీరు ఇప్పుడు పూజించే దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడు. మీ వంశాన్ని ఏ గురువులు కాపాడలేరు. అనేక కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. 


నేను చాలామందిని చూసాను. ఇలవేల్పు విష్ణువు ఉంటాడు, కానీ ఇష్టదైవం శివుడు. శివుడిని పూజించవద్దు అనలేదు గానీ ఇలవేల్పును కూడా ఆరాధించాలి. కానీ ఆరాధించరు. అదేమిటంటే శివుడే చూసుకుంటాడు అంటారు. కులదైవం శివుడుగా గలిగిన విష్ణుభక్తులు కూడా ఇలాగే అంటారు. నాకు ఇష్టంలేదు అంటారు. నారాయణుడే కాపాడతారు అంటారు. మరి కష్టాలు వచ్చినా, కులదేవతను విడిచిపెట్టినందుకు మీ ఇష్టదేవతయే కష్టం కలిగించిందని అంగీకరించే ధైర్యం మీకుందా?

బహుసా మీ వంశస్థులంతా ఆ దేవతను పూజిస్తామని మీ పూర్వీకులు ప్రమాణం చేశారేమో ! లేదా ఎప్పుడైనా ఆపదలో ఆ దేవత మీ వంశాన్ని కాపాడిందేమో లేదా కాపాడుతానని ప్రమాణం చేసిందో! 

పూర్వీకులు ఏర్పరిచిన వంశాచారాన్ని పాటించమని చెప్పేవారే, మీతో పాటింపజేసేవారే నిజమైన గురువులు. ఇవన్నీ అక్కర్లేదని చెప్పేవారు అసలు గురువులు కానేకారు.

Saturday 2 October 2021

శ్రీ హనుమద్భాగవతము (43)



మంత్రులు తండ్రి మరణానంతరము జ్యేష్ఠుడగుట వలన వాలిని వానర రాజ్యమునకు రాజుగా జేసిరి. అతడు సర్వవానర జాతికి మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యెను. అంతేకాక తన ప్రజలను అతడు పుత్రరూపముగా ప్రేమించుచుండెవాడు. ఇట్లా వాలి విశాలమగు కిష్కింధా రాజ్యమును పాలించుచుండగా సుగ్రీవుడు శ్రద్ధాసక్తులతోను వినయవిధేయతలతోను దాసునివలె తన అన్నను సేవించుచుండెవాడు.


వానరరాజైన కేసరి అంజనా దేవి ఇరువురు తమ పుత్రుడైన హనుమానుని వైరాగ్యమును, ఏకాంత ప్రియత్వమును చూసి మిక్కిలిగా చింతిఁపసాగారు. కేసరి వానరయూథపతి, ఋక్ష రాజునకు పరమమిత్రుడై ఉన్నవాడు, అందువలన అతడు హనుమంతుని రాజనీతికోవిదునిగా చేయదలచి పంపాపురానికి పంప నిశ్చయించుకున్నారు. మాతాపితృభక్తుడైన హనుమంతుడు తల్లిదండ్రుల ఆదేశముననుసరించి వారి చరణములకు నమస్కరించి ఆశీస్సుల పొంది పంపాపురమునకు ప్రయాణ మయ్యాడు.


పవనకుమారుడు పంపానగరమునకు వచ్చుచున్నాడనే వార్త వినినంతనె సుగ్రీవుడు ఎదురేగి అతనికి స్వాగతమిచ్చాడు. దేవదుర్లభములైన అతని గుణములు తెలుసుకుని ఉండుటచే వాలి కూడా అతనిని ఎక్కువగా గౌరవించి ఆదరముతో తన దగ్గర ఉంచుకొన్నాడు. హనుమంతుడు విద్వాంసుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, సదాచారపరాయణుడు, సరళత్వము మూర్తీభవించినవాడు, అందువలన వాలి వానిని తన కాంతరంగికునిగా చేసుకున్నాడు. కాని విద్యావారిధియైన కేసరీనందనుడు తన గురు దక్షిణ విషయము ఎప్పుడూ మరువలేదు. అందువలన ఆయన సుగ్రీవునకు అభిన్నమిత్రుడయ్యాడు. సుగ్రీవునకు కూడా ఇతనిపై అతీశయమైన ప్రేమయుండెను.


వజ్రకాయుడైన హనుమంతుడు పంపాపురమునకు వెళ్ళినప్పుడు ఆ పురమునకు నలువైపుల రాక్షసరాజ్యములు ఉన్నాయి. ఒక వైపున శక్తిశాలురైన ఖరదూషణాదుల రాజ్యము, రెండవవైపు దేవద్విజద్రోహియైన రావణుని నిష్కంటక రాజ్యము ఉండేది. వానర రాజైన వాలి సాటిలేని వీరుడు, యోధుడు. అందువలన అసురులందఱు అతనిని చూసి భయపడుచుండేవారు. వారు అతని రాజ్యమున అల్లకల్లోల సృష్టించుటకు సాహసింప లేక పోవుచున్నారు. కాని రాక్షసుల దౌష్ట్యమును ఎఱిగి ఉన్న వాడగుటచే వాలి నిశ్చింతగా దుష్టశిక్షణకై ఎక్కడికిని దూరము వెడలెడివాడు కాడు. హనుమంతుడు పంపాపురమునకు వచ్చిన పిమ్మట అతని చింత దాదాపుగా దూరమయ్యింది. అంజనా దేవి అలౌకికుడైన తన పుత్రునకు రాక్షసులను గూర్చిన కథల నెన్నింటినో చెప్పినది. అందువలన బాల్యము నుండియే హనుమంతునకు రాక్షసులన్న కోపము ఎక్కువగా ఉండేది. అతని దృష్టిలో బడిన ఏ రాక్షసుడు కూడా క్షేమముగా బ్రతికి బయటపడుట అసంభవమే. ఆయన వెదకి వెదకి రాక్షసుల ప్రాణములను తీయు చుండేవాడు. అతని పేరు చెప్పినంతనే రాక్షసులు వణకిపోవుచుండేవారు. హనుమంతుని సరళత్వమును, సాధుత్వమును, సాటిలేనివాని వీరత్వమును, ధైర్యమును, పరాక్రమమును చూసి వాలి చకితుడగుచుండేవాడు.