Wednesday 31 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 177వ భాగం



"ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ధ్ర 

దృష్ట్యాత్రి విష్టపపదం సులభం భజంతే 

దృష్టిః ప్రహృష్ట కమలో దరదీప్తి రిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః"


ఇందు ఇష్టిని అనగా యజ్ఞ కర్మను చేసి స్వర్గమనే ఫలాన్ని లక్ష్మి యొక్క కటాక్షం వల్లనే పొందుతున్నారు. కర్మ తనంతట తాను ఫలం ఇస్తుందన్నవారికి అట్లా కాదని, అమ్మవారి శక్తి వల్లనే అట్టి ఫలాన్ని పొందుతున్నారని చెప్పారు. తరువాత శ్లోకంలో అందరు దేవతలు, ఒకే ఒక పరమాత్మ స్వరూపాలని చెప్పారు.


"గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి

శాకంభరీతి శశిశేఖరవల్లభేతి

స్పష్టస్థితి ప్రలయకేళిషు సంస్థితాయై 

తస్యై నమస్త్రి భువనైక గురోస్తరుణ్యై"


ఇందులో ఒకే పరమాత్మ త్రిమూర్తులుగా ఉన్నాడని, సృష్టి, స్థితి, సంహారాలను వారు చేస్తున్నారని వారిట్టి పనులు చేసేటపుడు వారలకు శక్తిగా ఈమె ఉంటోందని అన్నారు.


నాల్గు శక్తులు, ముగ్గురికి ఉండడమేమిటి? గీర్దేవత యనగా సరస్వతి - బ్రహ్మ యొక్క శక్తి, గరుడధ్వజుడైన విష్ణువునకు మహాలక్ష్మి, రుద్రునకు శాకంభరి, శశి శేఖరవల్లభ అనే ఇద్దరూ భార్యలు. 


శాకంభరిని గురించి దేవీపురాణం చెప్పింది. కఱవుకాటకాలలో శాకములను తన ఒంటి పై పండించి ప్రజలనాదుకునేది. అందువల్ల ఆమె శాకంభరి. శివుని శక్తి.


Tuesday 30 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 176వ భాగం



నోటితో తినడం అంటే కర్మానుభవాన్ని సూచిస్తుంది. కర్మ అనుకూలంగా లేనపుడు డబ్బు ఎట్లా వస్తుంది? కనుక అమ్మవారు కర్మయనే చిట్టావర్ణాలను చూడకుండా చాతకపక్షి నోటిలో వాన చినుకు పడేటట్లుగా కనకవర్షాన్ని కురిపించమంటున్నాడు. చిన్న చాతక పక్షి, ఆకలికి తట్టుకోలేదు. అట్లా వీరిని పోల్చారు. ఆవిడ అమ్మవారు, ఇది విహంగ శిశువు సరిపోయింది.


చాతక పక్షి ఆహారం కోసమే బాధపడుతుంది. కాని ఈ దంపతులనే పక్షులకు ఇల్లు, డబ్బు, వస్త్రాలు, మొదలైనవి అన్నీ కావాలి. కనుక వీరి గత జన్మ పాపాలను పోగొట్టి వీరిని కటాక్షింపుమమ్మా అని అడిగారు.


డబ్బునే ఎందుకడిగారు? భజగోవింద స్తోత్రంలో అర్థమనర్ధం అన్నారు. అయితే ఈ డబ్బును పరిమితంగా తెలివిగా వాడి, సత్కర్మలకుపయోగిస్తే ఇదీ ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. అన్ని స్తోత్రాలను ఈ లక్ష్యాన్నే దృష్టిలో పెట్టుకొని వ్రాసేరు. అన్నపూర్ణేశ్వరిస్తోత్రంలో భిక్షాం దేహి అంటూ చివరగా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు. భక్తుల దారిద్ర్యాన్ని ప్రస్తావిస్తూ అట్టి దారిద్య్రంతో బాటు కర్మనుండి విముక్తి చేయమని ప్రార్థించారు.


కనకధారాస్తవం ఒక పాఠంలో 18 శ్లోకాలున్నాయి. కొన్నింటిలో 20-21 శ్లోకాలున్నాయి. ఈ శ్లోకంలోనే డబ్బును గురించి అడిగినట్లుంది. తరువాతి శ్లోకంలోనూ "ఇష్టాం పుష్టిం కృషీష్ట మమ" అని డబ్బును గురించి అడిగారు. మిగతా స్తోత్రం అంతా అయ్యవారిని, అమ్మవారిని అనుగ్రహం చూపించవలసిందిగా ఉంది. ఆయన నల్లని మేఘం ఐతే అతని వక్షఃస్థలంపై మెరుపుతీగలా ఉండే పరాశక్తిని స్తోత్రం చేసినట్లే ఉండి డబ్బు గురించి అడిగినట్లుంటుంది. తానెందుకు ఈ స్తోత్రం చేయవలసి వచ్చిందో కేవలం సూచనగా ఉంటుంది.


పై శ్లోకంలో కర్మను భక్తితో ముడిపెట్టారు. కర్మ తనంతట తాను ఫలాన్నియ్యదని, ఫలదాత ఈశ్వరుడని బోధిస్తున్నారు. కర్మనుండి భక్తికి మళ్ళిస్తున్నారు. ఇక భక్తి మార్గంలో ఉన్నవారికి నా దేవుడు, నీ దేవుడనే భేదభావం ఉండకూడదని నీ ఇష్టమూర్తిని మాత్రం కొలువుమని, అందరు దేవతలూ పరమాత్మ స్వరూపులుగానే చూడుమని హెచ్చరిక చేస్తున్నారు. అనగా భక్తి మార్గం నుండి జ్ఞానమార్గానికి మళ్ళిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ తరువాతి శ్లోకాన్ని చెబుతున్నారు.


Monday 29 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 175 వ భాగం



"దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం 

అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే 

దుష్కర్మ సుర్మమపనీయ చిరాయ దూరం 

నారాయణ ప్రణయినీ నయనాం బువహః'


కర్మ బాగా పేరుకొని పోయినప్పుడు, అమ్మవారి కటాక్షం మరొకవైపున ఉంటుంది. అయితే ఏమిటి? వర్షించే మేఘం, ఏ అండమాన్ అంత దూరంగా ఉండవచ్చు. కాని ఋతువులలో వీచే గాలులు వాటిని ఇక్కడకు తీసుకొని రావాలి కదా! అమ్మవారి దయ, అట్టి అనుకూల పవనమన్నమాట. ఆ గాలి, కటాక్షమనే వర్షాన్ని, వీరు చెడ్డకర్మలు చేసినా కురిపించుగాక. దయాపాత్రుని కానివానిపై కూడా దయ, అనుగ్రహాన్ని చూపించవచ్చు. ఆపైన గాలి, మేఘం, ప్రాణుల అర్హతలను పరికిస్తాయా?


'ద్రవిణ' అనే మాటకు సంపదయనే కాదు, బంగారమనీ అర్ధం ఉంది. ఈ ద్రవిణధారయే కనకధార స్తోత్రానికి ఆ పేరే ఉంది.


తనకోసమా డబ్బు? పాపం, ఈ చాతక శిశువుపై దయ చూపింపుమని. కనుక ఇది అలసి సొలసి యుంది.


కవిత్వంలో చకోరమని, చాతకమనే పక్షులున్నాయి. ఇవి నేడు కనబడవు. చకోర పక్షి, వెన్నెలనే ఆహారంగా గ్రహిస్తుందట.


సౌందర్యలహరిలో (63 శ్లోకం) అమ్మవారి మందహాసం నుండి వెన్నెల కిరణాలు వస్తున్నాయని; చకోర పక్షులు త్రాగగా అవి వెట్టి తీపిగా ఉండడం వల్ల నాల్క మొద్దు పడిందని అందువల్ల పుల్లని వస్తువుల కోసం చూడగా చంద్రుని నుండి వచ్చే వెన్నెలయనే అమృతాన్ని అన్నపు గంజియనే భ్రాంతితో ప్రతిరాత్రి తాగుతున్నాయని చమత్కరించారు. అయితే చాతక పక్షికి కంఠంలో చిల్లుంటుంది. ఇది ముక్కుతో తినదు. తింటే ఆ చిల్లునుండి బైటకి వచ్చేస్తుంది. ఆహారం తన ముక్కుతో కంఠ రంధ్రంలోకి ప్రవేశపెట్టలేదు. ఆ రంధ్రంలో పడే వర్షపు చినుకులు ఆ పక్షికి ఆహారం. వర్షం లేకపోతే ఆకలితో ఉంటుంది.


Sunday 28 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 174 వ భాగం



కనకధారాస్తవం


ఒక ద్వాదశినాడు 'భవతి భిక్షాందేహి' అని ఒక ఇంటి ముంగిట శంకరులు నిలబడ్డారు. ఆ ఇంటి యజమాని దరిద్రుడని తెలిసి వారిని అనుగ్రహించడానికి భిక్షనడిగి అనుగ్రహ భిక్ష పెట్టారన్నమాట. శంకరులు వెళ్ళినపుడు ఇంటి యజమాని లేదు. కాని గృహిణి యుంది. బ్రహ్మచారికి ఈయడానికి తనదగ్గర ఏమీలేదు. కాని బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందేవానికి ఎంతో కొంత ఇస్తే పుణ్యం దక్కుతుందని భావించింది. ఇంటిని గాలించింది. ఒక ఎండిపోయిన ఉసిరికాయ కనబడింది. ద్వాదశినాడు, ఉసరిక తినాలి కనుక ఆ యజమాని దాచి యుంటాడు.


దానినే భిక్షా పాత్రలో వేసింది. వెంటనే శంకరులు కనకధారాస్తవం చేసారు. భాగ్యంతో వారిని అనుగ్రహించుమమ్మా అని అమ్మవారిని ప్రార్ధించారు. ఇదే వారి మొదటి స్తోత్రం. అపుడు అశరీరవాణి 'ఇది వీరి పూర్వ జన్మ పాపఫలం' అని చెప్పింది.


అమ్మా! వీరెన్ని దుష్కర్మలు చేసినా వీరిపట్ల దయ చూపించుమమ్మా అని ఎట్లా ప్రార్ధించారో చూడండి.


నీ దృష్టియనే మేఘం, దయావాయువుచే ప్రేరేపించబడినదై ఎంతోకాలంగా ఉన్న దుష్కర్మలనే తాపాన్ని తొలగించి, దరిద్ర శిశువుననే చాతక పక్షిపై ధనమనే వర్షాన్ని కురిపింపుమమ్మా అన్నారు. (కేరళలో వైశాఖమాసంలో కూడా నైఋతి పవనాలు వీచి చల్లని మేఘాలను సృష్టిస్తాయి.


Saturday 27 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 173 వ భాగం


శంకరులు అన్ని శాస్త్రాలూ చదివి ఏ సుఖం పొందారో అదంతా అద్వైత జ్ఞానంలోనే ఇమిడి యుందని దీనివల్ల అనంత సుఖం వస్తోందని:

"కూపే యోఽర్ధః సతీర్థే సుపయసి విదధే హంత నాంతర్ భవే త్ కిం?" అని ప్రశ్నార్థకంగా చెప్పారు. నూతి నీటివల్ల పొందే ప్రయోజనం, నదిలోని నీటివల్ల పొందడం లేదా అని ప్రశ్నించారు.


ఎన్ని శాస్త్రాలు చదివినా అద్వైత జ్ఞానం వల్ల పొందినంత సుఖాన్ని వాటివల్ల పొందలేకపోయారు. నది నీటివల్ల పొందే ఆనందంతో పోలిస్తే నూతినీరు, అంత సుఖాన్ని ఇయ్యడం లేదని వారి భావన. నూతినీటిని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అట్లా నది నీటిని చేయనవసరం లేదు. రెంటిలోనూ నీరు ఉండవచ్చు.


కర్మకాండల వల్ల పొందే సుఖం కొద్దిగా ఉంటుందని, జ్ఞాన కాండం వల్ల సుఖం నది నీరు వంటిదని అర్థం. జ్ఞాన కాండ వల్ల ఎక్కువ సుఖాన్ని పొందవచ్చు. దీని తాత్పర్యం ఏమిటంటే అద్వైతం, అఖండ నది వంటిదని, అన్ని శాస్త్రాలు నుయ్యి, చెఱువు వంటివని, ఈ నీటివల్ల ఏ సుఖము పొందుతున్నావో అన్ని సుఖాలు అద్వైతమనే నదిలో మునిగినప్పుడు కలుగుతాయని అర్థం. ఈ శంకర విజయ శ్లోకం పై గీతాశ్లోకాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాసినట్లుంది.


(గంగా తీరంలో ఉండేవారు నూతిని ఉపేక్షించినట్లు జ్ఞానం లభిస్తూ ఉంటే కర్మకాండలను ఆశిస్తాడా? అని కొందరన్నారు. అనాయాసంగా నదిలో నీరు లభిస్తూ ఉండగా నూతి గురించి విచారించనట్లు జ్ఞానం కలిగినవారికి ఈ కర్మ కాండల వల్ల ప్రయోజనం లేదని కొందరన్నారు. నుయ్యి, స్నాన "పానాదులకు ఎంత ఉపయోగిస్తుందో పెద్ద చెఱువు కూడా అంతే ఉపయోగిస్తుందని అట్లాగే వేదాల వల్ల ఏ ప్రయోజనం ఉందో అంత ఉపయోగం జ్ఞానులకు జ్ఞానం వల్ల కల్గుతోందని కొందరన్నారు.


బావుల వల్ల స్నానపానాది ప్రయోజనం ఎంత మాత్రం కలుగుతుందో నదులవల్ల కలుగు అనంత ప్రయోజనాలలో అంతర్ధానం చెందినట్లుగా కర్మానుష్టానం వల్ల వచ్చే ఫలం, జ్ఞానికి కలిగే మోక్షరూప ఫలంతో అంతర్భావం చెందుతుందని పూర్వ వ్యాఖ్యాతలున్నారు- అనువక్త)


Friday 26 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 172 వ భాగం



వీరి గ్రంథాలను, అందు పేర్కొన్న పంక్తులను పరిశీలించగా ఈ శ్లోకం అతిశయోక్తి అనిపించదు.

ప్రపంచంలో ఏ మతం వారైనా తత్త్వం తెలిసికోవడం కోసం గ్రంధాలను నేటికీ పరిశీలిస్తూ ఉంటారు. వారు సర్వజ్ఞులు కనుకనే, మిగతా శాస్త్రాలను ఖండించి అద్వైతాన్ని స్థాపించగలిగారు. ఇదంతా "అమల అద్వైత సుఖం" కోసమే. అనగా మచ్చలేని కోరికలేని దానికోసమే. ఈశ్వరుడూ, నేనూ ఒకటని అనినపుడు మనస్సెక్కుడుంది? చివరి పంక్తిలో అన్ని సిద్ధాంతాల వల్ల పొందదగిన సుఖం అంతా అద్వైతంలోనే ఉందని ఉంది.

ఈ శ్లోకాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి?

గీతలో ఒక క్లిష్టమైన శ్లోకం ఉంది. దీనినర్ధం చేసుకోవడం కష్టం. కృష్ణుడు, అర్జునునకు జ్ఞానయోగాన్ని చెబుతూ నశించనది ఆత్మయే యని దానితో సంబంధం దృఢ సంకల్పంతో పెట్టుకోవాలని, లేకపోతే మీమాంసకులు చెప్పిన కర్మకాండలలో మునిగిపోతావని అపుడు మనస్సు నిశ్చలంగా ఉండదని అన్నాడు. ఇక్కడ వేదాంతం నుండి కర్మకాండ వేరు చేయబడింది. వేదం కర్మకాండలను చెబుతూ వాటివల్ల సత్త్వ, రజస్తమో గుణాలతో ఉంటావని, కాని త్రిగుణాతీతమైన ఆత్మను పట్టుకోవాలని అంటూ ఈ దిగువ శ్లోకాన్ని చెప్పింది. 

"యావానర్ధ ఉదపానే సర్వతః సంపుతోదకే 

తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః" (11-46)

అనగా అంతటా నీటి వెల్లువయున్నా, నుయ్యి, చెఱువు వంటి జలాశయాల వల్ల ఏ ప్రయోజనమో సిద్ధిస్తుందో అనగా స్నానపానాదులు సిద్ధిస్తున్నాయో. అట్లాగే బ్రాహ్మణునకు సర్వవేదాల ప్రయోజనమూ అంతే.

అయితే ఈ శ్లోకం అర్ధం కావడం లేదు. చిన్న నీటి యూటవల్ల ఏ ప్రయోజనమో పెద్ద చెఱువు వల్ల అంతే ప్రయోజనం అనేది అర్ధమౌతోంది. కాని జ్ఞానం కలిగిన బ్రాహ్మణునకు అన్ని వేదాలూ అంతే అనినపుడు అర్థం కావటం లేదు. శంకర విజయంలోని ఒక శ్లోకాన్ని చూసినపుడు అర్ధమైంది.


Thursday 25 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 171 వ భాగం



కేవలం దివ్యశక్తి ప్రదర్శనమైతే వారెట్లా సంఘంలో కలిసి మెలిసి యుండగలరు?  అనగా కొంత దూరంగా ఉంటూ దగ్గరగా ఉంటారన్నమాట.


ప్రపంచంలో పరిస్థితులు క్షీణిస్తున్నప్పుడు శంకర, జ్ఞాన సంబంధులు వాటిని వీలైనంత వేగంతో సరిజేద్దామనుకున్నారు. శంకరులు తమ 32 ఏళ్ళ జీవిత కాలంలోనే యావద్దేశంలో పునర్జీవనం తీసుకొని వస్తే జ్ఞాన సంబంధులు బ్రతికిన 16 సంవత్సరాలలోనే తమిళ దేశంలో అలౌకిక కృత్యాలు చేసారు. ఇది బాల్యంనుంచి వారికి ఉన్న మేధస్సు, విషయ జ్ఞానం వల్ల జరిగింది.


ఇట్లా ఉపనయనం, గురుకుల వాసం జరిగి ఎనిమిదవయేటనే సమస్త శాస్త్రాలను శంకరులు కరతలామలకం చేసుకున్నారు. ఇదంతా లోక మర్యాద కోసం వారు తలుచుకుంటే ఇంకా ముందే చదువు ముగింపగలరు.


అట్టి అలౌకిక వ్యక్తియే రాజచూడామణి దీక్షితుడు. ఇతడు అప్పయ్య దీక్షితుల బావమఱది. ఉపనయనానికి ముందే అన్నీ వీరికి వశమయ్యాయట. కమలినీ కలహంసం అనే వీరు వ్రాసిన నాటకంలో బ్రహ్మగారి భార్యయైన గాయత్రి, నన్ను సమీపించకముందే, అతని మరొక భార్యయైన సరస్వతి, నా దగ్గరకు వచ్చిందని స్పష్టంగా వ్రాసుకొన్నాడు.

కనీస కాలంలో ఉపనయనం మీ బిడ్డలకు చేయలేకపోతే శంకరుల చరిత్ర చదివి ఏం లాభం?


శంకరులు అనేక శాస్త్రాలను చదివినట్లు వీరి చరిత్రలో ఉంది. "అన్వీక్ష క్యైక్లి" శ్లోకంలో పరిపాలనకు సంబంధించిన 'అన్వీక్షకి' శాస్త్రం చూడడంతోనే వశమైందని, సాంఖ్య శాస్త్రాన్ని మీమాంసను అవలోకనం చేసారని; "పేతం పాతం జలాంఛః" అనగా పతంజలి యోగశాస్త్రాన్ని త్రాగారని; ఆంజనేయుడు సముద్రాన్ని దాటినట్లు కుమారిలుని శాస్త్రాన్ని అనగా మీమాంసను దాటారని వ్రాయబడింది.


ఆన్వీక్షక్యైక్షి, తంత్రే పరిచితి రతులా కాపిలే కాపిలేయే

పీతం పాతం జలాంభః పరమపి విదితం భాట్ట ఘట్టార్ధ తత్త్వం

యత్ సౌఖ్యం సదస్యాంతర్భవత్ అమలాద్వైత విద్యా సుఖేజిఽస్మిన్


Wednesday 24 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 170 వ భాగం



నిత్య కర్మల వల్ల ఆత్మశక్తి వృద్ధి పొందుతుంది. సత్యం పలకడం వల్ల లాభం కనిపిస్తోందా? అసత్యం పలకడం వల్ల లాభాలు కన్పిస్తున్నాయి. అయితే సత్యాన్నే ఎందుకు పలకాలన్నారు? పాపభూయిష్టుడవుతున్నావు కనుక కూడదన్నారు. అట్లాగే నిత్య కర్మల విషయంలోనూ, నిత్య కర్మల వల్ల (సంధ్యావందనం మొదలైనవి) ఆత్మశుద్ధి ఏర్పడుతుంది. దాని ఫలాన్ని చూడలేం. ప్రత్యక్షఫలం అంటూ కనబడదు. ఒక కోరికతో చేసేవాటిని కామ్య* కర్మలని అంటారు. 'దశరథుడు, పుత్రుని కోసం పుత్రకామేష్టి చేసాడు. వాటిని విధిగా చేయాలని లేదు. నిత్య కర్మల వల్ల ఫలం ప్రత్యక్షంగా కనబడక పోయినా, చేయకపోతే పాపమన్నారు.


ఉపనయనం సకాలంలో చేయలేకపోతే 16 సంవత్సరాల వరకూ చేయవచ్చని అన్నారు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు 11 నుండి 22 వరకు; వైశ్యులకు 12 నుండి 24 వరకు ఉపనయనం చెయ్యవచ్చని ఉంది. అంతకంటే మించకూడదు. ఈనాడు దీనిని గుర్తించకపోవడం దురదృష్టకరం.


కామం, మనస్సులో చొరబడని కాలంలోనే రోజూ వేయిసార్లు గాయత్రిని చేస్తే చిత్తశుద్ధి ఏర్పడి, తద్వారా లోక కల్యాణము జరుగుతుంది. అట్టిది సకాలంలో చేయకపోతే తండ్రికి పాపం చుట్టుకోదా? 8 నుండి 16 వరకూ ఉన్నదానిని గౌణకాలం అంటారు. 7వ ఏట చేయడం ముఖ్య కాలం అంటారు. గౌణకాలం కూడా దాటితే వ్రాత్యుడని అన్నారు. అనగా జాతినుండి వెలివేయదగినవాడని ఘాటుగా చెప్పారు.


ఉద్యోగానికి వయః పరిమితి దాటకూడదంటే దొంగ సర్టిఫికెట్లు పుట్టించైనా తొందర పడుతున్నాం కదా! అట్లా ఉంటే నిత్య కర్మల విషయంలో జాగరూకత ఉండవద్దా?


అందువల్ల పూర్వులు కామ్యోపనయనాన్ని ఐదవ యేటనే చేయవచ్చని అన్నారు. "బ్రహ్మవర్చస్య కామః పంచమే" అని స్మృతి వాక్యం. మామూలు చేసే కామ్య కర్మ కాదది. బ్రహ్మ వర్చస్సును కోరి చేసేది.


అట్టివాడు, అధర్మకృత్యాలు చేయడానికే ముందుకు రాదు. గాయత్రి, అట్టివాని బుద్ధిని బాగా పదును పెడుతుంది. శంకరుల వంటి వారికి దివ్య శక్తులున్నా చీటికీ, మాటికీ చూపించరు. అవసరం వచ్చినపుడు చూపిస్తారు. మామూలు వ్యక్తుల లాగానే కన్పిస్తారు.


Tuesday 23 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 169 వ భాగం



హాలుడు - పూర్ణవర్మ

గురురత్నమాలలో హాలునిచే పోషింపబడిన కుమారిలుడు, కాశిని విడిచి పెట్టాడని యుంది. శాతవాహన చక్రవర్తియైన హాలుడు క్రీ.శ. 1వ శతాబ్ది యని చారిత్రకులు నిర్ణయం. కాని కె.జి నటేశ అయ్యర్ 'జిజ్ఞాస' అనే పత్రికలో కలియుగం ప్రారంభమైన తరువాత 74వ రాజు హాలుడని నిర్ణయించారు. పురాణాల లెక్కల ప్రకారం ఇది శంకరుల కాలమౌతోంది. కలి తరువాత 2600 సంవత్సరాలు.

ఆపైన వాయుపురాణంలో "తతః సంవత్సరం పూర్ణో హాలో రాజా భవిష్యతి" అనగా పూర్ణుడనే పిలువబడే హాలుడు రాజు కాబోతున్నాడని అర్థం. 

శంకరులు, సూత్ర భాష్యంలో పూర్ణవర్మ ప్రస్తావన తీసుకొని వచ్చారు కదా! యజ్ఞదత్త, దేవదత్త వంటి పేరే ఆదియని లోగడ చెప్పాను. తరువాత పరిశోధనల వల్ల పూర్ణవర్మయే హాలుడని తెలియవచ్చింది. పురాణాల లెక్కల ప్రకారం అతని కాలం క్రీ.పూ. 500. మనమూ అట్లాగే అంటున్నాం.

అసాధారణ బాలుడు

పుట్టుకనుండి తన అసాధారణత్వాన్ని చూపించారు శంకరులు. మూడవ యేట లోపుగా ప్రాంతీయ భాషలో, ఐదవ యేడు పూర్తి అయ్యేటప్పటికి సంస్కృతంలో ప్రావీణ్యం చూపించారు. వారి ప్రాంతీయ భాష తమిళం అయి యుంటుంది. మూడవ యేటనే జ్ఞాన సంబంధులు తేవారాన్ని కీర్తించారు. ఇవన్నీ కాకమ్మ కథలని అనుకుంటాం. కాని ఈనాటికీ అట్టి బాలమేధావుల గురించి పత్రికలలో చదువుతున్నాం. గత జన్మ సంస్కారాలు, ఒక్కమాటుగా, పొటమరించాయని చెప్పడం కంటె సమాధానం ఏం చెప్పగలం? గత జన్మల గురించి బౌద్ధ జైనులూ నమ్ముతారు. అయితే శంకరుల గురించి, సంబంధుల గురించి గత జన్మలున్నాయని చెప్పకూడదు. వారు అవతార మూర్తులే.

చిన్ననాటనే ఉపనయనం

ఐదవ యేటనే ఉపనయనం జరిగింది. జ్ఞాన సంబంధులు మూడవ యేటనే తేవారాన్ని కీర్తించారని, తీర్ధ యాత్రలు ముగించుకొన్న తరువాత వారికి ఉపనయనం జరిగిందని పెరియ పురాణంలో ఉంది. పుట్టిన తరువాత ఏడవ యేటనే ఉపనయనం జరగాలి. బ్రహ్మ వర్చస్సును కోరుకొనేవారికి ఐదవ యేట చేయవచ్చని శాస్త్రాలన్నాయి.

Monday 22 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 168 వ భాగం



ద్వారకా మఠంలో నున్న గురుపరంపరలో క్రీ.పూ. 509 కాలానికి వారి లెక్కలు ఇంచుమించు సరిపోతున్నాయి. కంచి, ద్వారక, పూరి మఠాల లెక్కలు క్రీ.పూ. 500 సంవత్సరాల దరిదాపులో ఉన్నాయి. థియోసఫిస్టు అనే పత్రికలో పాశ్చాత్యులచే కూడా పొగడబడిన సుబ్రహ్మణ్య అయ్యర్ ద్వారకా మఠపు లెక్కల ప్రకారం శంకరులు క్రీ.పూ. 600-500 కాలానికి చెందిన వారని అన్నారు.


ఇంద్రాంశతో సుధన్వుడనే రాజు పుట్టాడని చెప్పాను. శంకరులతో అతడు మాట్లాడినట్లు తమ దగ్గర తామ్ర శాసనముందని ద్వారకా మఠం వారన్నారు. అది ప్రకటింపబడింది కూడా.


బద్రీనాథ్ జ్యోతిర్మఠం వారు మఠానుశాసనం (1946) ప్రకటించారు. వీరు శంకరుల కాలం క్రీ.పూ. 509 అనే నిర్ణయించారు.


ఇట్లా అనేక మఠాలు, ఏకాభిప్రాయంతో ఉండగా ఇదంతా తప్పనడం నేటి చారిత్రకుల మాటలకే పట్టం గట్టడం, దీనినే ప్రచారం చేయడం బాగుందా?


నేపాల్ రాజవంశావళిలో శంకరులు, నేపాల్ వెళ్ళినట్లు, వృషదేవవర్మ అపుడు పాలిస్తున్నట్లు కలి ప్రారంభించిన 2600 సంవత్సరాలకు అతడున్నట్లుంది. అనగా క్రీ.పూ. 5వ శతాబ్దమే కదా!


జైనుల గ్రంథాలలో శంకరులను ఖండించినా, వీరిని శివునిగా పేర్కొన్నారు. ఇది శివావతారాన్ని తెలుపుతోంది. ఇక శంకరులు సిద్ధి పొందిన సంవత్సరం కూడా ఉంది. "ఋషి: బాణాః తథా భూమి మర్త్యాక్షా" అని. ఋషి-7, బాణం-5, భూమి-1; మర్త్యాక్షం-2. అనగా 7512. త్రిప్పితే 2157. వారి జైన యుధిష్ఠిరంతో పోలిస్తే, కలిలో 2625; అనగా క్రీ.పూ. 477లో శంకరులు సిద్ధిని పొందారు. తామ్రాక్ష సంవత్సరంలో సిద్ధియని యుంది. అనగా రక్తాక్షి సంవత్సరమే.


Sunday 21 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 167 వ భాగం



అట్లాగే అభినవ శంకరులు కూడా. కంచి మఠంలో వీరు 38వ పీఠాధిపతి, వీరి జీవితం గురించి శంకరేంద్ర విలాసం, సద్గురు సంతాన పరిమళం గ్రంథాలలో చూడవచ్చు. శంకరుల తరువాత 1300 సంవత్సరాలకు వచ్చి శంకరులు చేసిన అవైదిక మత నిర్మూలనం వీరూ చేసారు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. వీరితర దేశాలకు వెళ్ళినట్లు కూడా ఉంది. చీనా, తుర్కిస్థాన్, బాహ్లిక (ఆఫ్ఘనిస్తాన్లో ఒక భాగం) రాజ్యాలకు వెళ్ళినట్లు, గుణరత్నమాల అనే గ్రంథం చెబుతోంది. ఆ దేశాలవారు, వీరిని తమ గురువులుగా కీర్తించారని ఉంది.


"చీన తురుష్క - బాహ్లికాత్యైః స్వరూపాచార్య తయాస్తుతం (శ్లో. 66)


శంకరులతో సమానమైన వారిని ఆదిశంకరులుగా భావించి లోగడ పేర్కొన్న 'నిధి నాగ' శ్లోకాన్ని ఆది శంకరులకు ఆపాదించారు. ఈ శ్లోకంలో పేర్కొనబడిన శంకరులు, అభినవ శంకరులే. చాలామంది ఎనిమిదవ శతాబ్దానికి చెందినవారు, ఆది శంకరులని భ్రాంతి పడడానికి కారణమైంది.


ఆది శంకరులు పుట్టినది, వైశాఖ మాసం, శుక్ల పక్షంలో, ఆది శంకరులు నందన నామ వత్సరంలో పంచమినాడు పుట్టగా వీరు విభవనామ సంవత్సర దశమినాడు పుట్టినట్లుంది. మరి ఇద్దరూ వేర్వేరు వ్యక్తులే కదా!


ఇట్లా వీరిద్దరూ ఒక్కరేయని భ్రాంతి పడ్డారు. కాంబోడియా శాసనంలో ఇంద్రవర్మ యొక్క గురువైన శివసోముని యొక్క గురువు శంకరులని యుండగా, శంకర విజయాలలో శంకరుల శిష్యుడు శివసోముడని ఎక్కడా లేదు. అయినా భ్రాంతి పడి వీరిని వారుగా భావించి యుంటారు.


కొంతమంది క్రీ.పూ. 44-12 అని అన్నారు. టి. ఎస్ నారాయణ శాస్త్రిగారు. జైనుల లెక్కలను బట్టి వారి యుధిష్టిర శకకాలాన్ని బట్టి అట్లా అన్నారు.

Saturday 20 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 166 వ భాగం



ఇక శివభుజంగ స్తోత్రంలో సుతాద్రోహి అనే మాట వస్తుంది. అది కూడా వేరే శంకర నామ ధేయులు వ్రాసియుంటారు. 


ఇక పూర్ణ వర్మ గురించి దానిని బట్టి కాలాన్ని చెప్పలేం. మనం ఏ వెంకయ్యో, పుల్లయ్యో అన్నట్లు; ఆంగ్లేయులు టామ్, డిక్, హ్యారీ అన్నట్లు ఏదో రాజునకు ఏదో పేరుంచాలి కనుక అట్లా పేరు వ్రాసేరని ఊహించవచ్చు. భాష్యాలలోనే యజ్ఞదత్త, దేవదత్త అనే పేర్లు వస్తాయి. అట్లా వారున్నారని కాదు. ఏదో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పడం కోసం అట్లా సంస్కృత సాహిత్యంలో పేర్లుంటాయి. అట్లాగే పూర్ణ వర్మ అని యంటారు. సత్ ని పూర్ణంగా, అసత్ ని శూన్యంగా చెప్పడం కోసం గొడ్రాలు కొడుకని చెప్పి యుంటారు.


మగధరాజు పూర్ణవర్మ మరల బోధివృక్షాన్ని నాటాడని పేర్కొన్నాను కదా! అనగా ఫాహియాన్ పేర్కొన్నవాడు బౌద్ధుడు. అట్టి బౌద్ధ దృష్టాంతాన్ని శంకరులు చెప్పాలా? చెప్పి యుంటారా? ఆ చిన్న రాజును గురించి ప్రస్తావిస్తారా? శూన్యవాదిని పూర్ణవర్మ చేయడమా? (అని నవ్వుతూ అన్నారు.)


అభినవ శంకరులు


కాంబోడియా శాసనంలో భగవత్ శంకర అని యుంది కనుక వారు ఆదిశంకరులే కావాలి. శాసన కాలం క్రీ.శ. 8వ శతాబ్దమని తెలుస్తోంది. 


దీనికేమి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. శంకరుల తరువాత అనేకులు పీఠాలను అధిరోహించారు. మహమ్మదీయులను దండయాత్రల నుండి హిందూ మతాన్ని రక్షించిన విద్యారణ్య స్వామి అట్టివారే, ద్వైత సిద్ధాంతం నుండి, వీరశైవం నుండి వచ్చే దాడుల నెదుర్కున్నారు. వారు విజయనగర సామ్రాజ్య కారకులు.


Friday 19 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 165 వ భాగం



జైనులు కూడా జైన మత వ్యాప్తి చేసిన వర్ధమాన మహావీరుణ్ణి 24వ తీర్ధంకరునిగా పేర్కొన్నారు. మా మాతం, అనాదియని వారు అంటారు. జైన మత స్థాపకుడు క్రీ. పూ. 9వ శతాబ్దానికి చెందినవాడని అన్నారు.


ఇక బ్రహ్మ సూత్రాలలో బౌద్ధం ఖండింపబడింది. కనుక, గీత బ్రహ్మ సూత్రాలూ బుద్ధుని తరువాత వచ్చాయనడం సబబు కాదు. ఎందరో బుద్ధులున్నారని బౌద్ధులే అన్నారు. వారి సిద్ధాంతాన్ని ఖండించాడు వ్యాసుడు.


వ్యాసుడు గాని, కృష్ణుడు గాని, గౌతమ బుద్ధుని తరువాత వచ్చారనడం సబబు కాదు.


ఇక క్రీస్తు శకారంభంలో కనిష్కుడున్నాడని అతని కాలంలో హీనయానం, మహాయానంగా బౌద్ధం చీలిందని అందువల్ల దాని తరువాత శంకరుల జన్మమని అనడం కుదరదు. అంతకుముందు నుండే ఈ సిద్ధాంతాలున్నాయని చెప్పాను.


ఇక ఏడవ శతాబ్దానికి చెందిన జ్ఞాన సంబంధుణ్ణి ద్రవిడ శిశువని శంకరులు, సౌందర్యలహరిలో పేర్కొన్నారని అనడం సబబు కాదు. సౌందర్యలహరీ వ్యాఖ్యానాలలో ఆ ద్రవిడ శిశువు, శంకరులే అని వ్రాసేరు. శంకరులే పాలను అమ్మవారికి నివేదించారని అన్నారు.


ఏడవ శతాబ్దానికి చెందిన సిరు తొండ నాయనార్ ని సుతాద్రోహిగా వీరి సోత్రాలలో పేర్కొన్నారని అంటారు. కొన్ని స్తోత్రాలు వీరి పేరున ఉన్నా, అన్నీ వీరు వ్రాయలేదు. సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, కనకధారాస్తవం వంటి వాటినే వీరు వ్రాశారు. ఎందుకన్నీ వ్రాయలేదో చెబుతాను చూడండి. దేవీ అపరాధ స్తోత్రంలో చెడ్డ కొడుకు పుట్టవచ్చుగాని, చెడ్డ తల్లి పుట్టరమ్మా "కుపుత్రో జాయేత, కుమాతా నభవతి" అని వ్రాసి 85 సంవత్సరాలున్న నేను, ఎక్కడ శరణు జొచ్చుతానమ్మా అని వ్రాసినట్లుంది. 32 సంవత్సరాలు బ్రతికిన శంకరులిట్లా వ్రాస్తారా? శంకర మఠాలలో చాలామంది శంకరాచార్యులున్నారు. అందొకరు వ్రాసి యుంటారు.


Thursday 18 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 164 వ భాగం



మొదటి చంద్రగుప్తుడు కొడుకైన సముద్ర గుప్తుని కాలంలో ఆ రాయబారి వచ్చాడు. అతడు పేర్కొన్నది సాంద్రకోటస్, సముద్ర గుప్తుని మొదటి అక్షరం 'స' సరిపోతోంది కదా, సముద్ర శబ్దం జనుల నోళ్ళల్లో బడి సంద్రం కాగా దానిని విని సంద్రకోటస్ గా పేర్కొన్నాడని ఎందుకూహించకూడదు?  

ఇట్లా వేయి సంవత్సరాలు వెనుకకు వెళ్ళితే శంకరులు క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన బుద్దుని కాలం, ఇంకా వేయి సంవత్సరాలు వెనుకకు వెళ్ళగా, అప్పుడు బౌద్ద మత ప్రభావాన్ని శంకరులు ఎదుర్కొనడం కుదురుతుంది. అపుడు బుద్ధునికి శంకరులు సమకాలికులు కారు కదా!


పురాణాల ప్రకారం క్రీ.పూ. 1500 సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యం స్థాపింపబడింది. దీనికి ముందు బింబిసారుడు, తరువాత అతని కొడుకు అజాత శత్రువు, అతని తరువాత ముగ్గురు రాజులు పాలించారు. తరువాత మహా పద్మనందుడు వచ్చాడు. తరువాత మౌర్యచంద్ర గుప్తుని రాక, చంద్రగుప్త మౌర్యునికి మూడు వందల సంవత్సరాల ముందు బింబిసారుడున్నట్లు పురాణాలంటున్నాయి. అనగా క్రీ.పూ. 1800 నుండి 1700 వరకూ బుద్ధుడున్నాడు. కనుక శంకరుల అవతారం క్రీ.పూ. 509 సరిపోతుంది.


ఇక కాళిదాసు కాలం గురించి వ్రాస్తూ కొన్ని వందల పుస్తకాలను చూసి, విద్యా వాచస్పతియైన కొల్హాపూర్ నకు చెందిన అప్పాశాస్త్రిగారు కాళిదాసు కాలం క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందినదని, ఆ శతాబ్దం మధ్యలో కుమారిల భట్టు కాలమని, ఆ శతాబ్ది చివరలో శంకరుల కాలమని నిర్ధారించారు. జైన గ్రంథాలను కూడా వారు పరిశీలించారు.


అయితే క్రీ.శ. 2,6 శతాబ్దాలలో పుట్టిన బౌద్ధుల వాదులను శంకరులెట్లా ఖండించారని అడగవచ్చు. వారి పేర్లను పేర్కొనలేదు. బౌద్ధంలో చాలాకాలం నుండి వస్తున్న సిద్ధాంతాలనే ఖండించారని గుర్తించండి.


శంకరులు తన పూర్వమున్న అద్వైతాన్నే తిరిగి ప్రతిష్ఠించారు కాని లేని దానిని క్రొత్తగా కనుగొన్నట్లు వ్రాయలేదు.


అసలు గౌతమ బుద్ధుణ్ణి 24వ బుద్ధుడని బౌద్ధ గ్రంథాలంటున్నాయి. కనుక ఇతని ముందు 23 బుద్దులున్నట్లే కదా. అందుకనే రామాయణంలో బౌద్ధాన్ని ఖండించినా అది కేవలం గౌతమ బుద్ధుని సిద్ధాంతం కాదని అంతకుముందున్న దానినే అని భావించవచ్చు. జాబాలి యొక్క అవైదిక సిద్ధాంతాన్ని అట్లా ఖండించాడు. ఇట్టివారిని ప్రోత్సహించకూడదని వీరిని దొంగలను శిక్షించినరీతిలో శిక్షించాలని అన్నాడు. గౌతమ బుద్ధుడు చెప్పిన సదాచారం ధ్యానం, ఇంద్రియ నిగ్రహం వంటి సిద్ధాంతం చార్వాకం కాదు. ఇది పచ్చి భౌతిక వాదం. కాబట్టి దీనిని ఖండించాడు.


Wednesday 17 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 163 వ భాగం



ఇతడు సాండ్రకేటస్ పాటలీపుత్రాన్ని పరిపాలిస్తున్నట్లు వ్రాసేడు. అతడే మౌర్య చంద్రగుప్తుడని చరిత్రకారులు నిర్ధారణకు వచ్చారు.


కేవలం చంద్ర గుప్తుడని పేర్కొన్నాడే కాని, చంద్రగుప్తమౌర్యుడని పేర్కొనలేదు. ముందు నంద సామ్రాజ్యం ఉందనీ చెప్పలేదు. బిందుసారుడు, ఇతని కొడుకనీ చెప్పలేదు.


కనుక ఇతడు గుప్త సామ్రాజ్యపతియైన చంద్రగుప్తుడని ఎందుకు చెప్పకూడదు? గుప్త సామ్రాజ్యంలో ఇద్దరు చంద్రగుప్తులున్నారు. అందొకడు కాకూడదా? గుప్తులు పాటలీ పుత్రాన్ని పాలించారు కదా!


మన పురాణాలను, రాజ తరంగిణిని, నేపాలు రాజుల కథలను పరిశీలిస్తే అతడు మౌర్య చంద్ర గుప్తుడు కాదని తెలుస్తుంది. మనవాళ్ళ లెక్కల ప్రకారం క్రీ.పూ. 1500లో మౌర్య చంద్రగుప్తుడున్నాడు. ఇట్లా చరిత్ర 1200 సంవత్సరాలు వెనుకకు వెడుతుంది. అట్లాగే శంకరుల కాలమూ 1300 సంవత్సరాలు వెనుకకు వెడుతుంది.


విష్ణు పురాణంలో పరీక్షిత్తు పాలించిన వెనుక మహాపద్మనందుడు పాలించినట్లుంది. తరువాత చంద్ర గుప్తు మౌర్యుడు వస్తాడు. నందరాజ్యం క్రీ.పూ. 1600 సంవత్సరంలో, కాని చంద్రగుప్త మౌర్యుడు, క్రీ.పూ. 400 అని చరిత్రకారులు నిర్ధారణకు వచ్చారు. రెండవ చంద్రగుప్తుడు క్రీ.త. 5వ శతాబ్దమని అన్నారు. దానితో తేడా వచ్చింది.


వారితో వివాదపడనవసరం లేదు. లోతుగా పరిశోధన జరగాలంటున్నా పురాణాలను, మిగిలిన చారిత్రక గ్రంథాలను విజయవాడకు చెందిన శ్రీ కోట వెంకటాచలంగారు పరిశీలించి మెగస్థనీస్ వచ్చింది గుప్తరాజుల కాలంలోనే అని, మౌర్య చంద్రగుప్తుని కాలంలో కాదని నిర్ధారించారు. (వివరాలకు వారి కలిశక విజ్ఞానం చూడండి) వారు తరువాత అద్వైత సన్న్యాసి అయ్యారు. అట్లాగే కె.జి. నటేశ అయ్యర్ కూడా వేంకటాచలంగారి మార్గంలోనే పరిశోధించారు. వాటిని చూడండి.


Tuesday 16 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 162 వ భాగం



మన పురాణాలలో ఇచ్చిన రాజులు, వారి కాలం పుక్కిటి పురాణం క్రింద జమకట్టారు. ఇట్టి భావాలనే చరిత్ర పుస్తకాలలో వ్రాసి వ్యాప్తి చేసారు. చిన్నప్పటి నుండీ ఈ నాగరికత పై చిన్నచూపు చూడడం మొదలు పెట్టారు.


పురాణాలలో రాజులు, వారి కాలాలు స్పష్టంగా ఉన్నాయి. ఈనాటి ముద్రణ సౌకర్యం ఆనాడు లేదు కనుక వ్రాతలలో కొన్ని పొరపాట్లు దొర్లి యుండవచ్చు. తులనాత్మక పరిశీలన చేసి అన్ని పాఠాలను పరిశీలించి ఒక నిర్ధారణకు రావచ్చు. సత్యాన్ని మనకు మనమే నిర్ధారణ చేసుకోగలం.


పురాణాలలో రాజవంశాలు పేర్కొనబడ్డాయి. ఇవి కాక కల్హణుడనే కాశ్మీర పండితుడు వేయి సంవత్సరాల వెనుక రాజ తరంగిణిని వ్రాసేడు. అందనేక రాజుల కథలున్నాయి. పురాణాల విషయాలు, ఇందు చెప్పినవి చూస్తే చాలా పోలికలున్నాయి. అట్లాగే నేపాల్ వంశ చరిత్ర ఉంది. ఇందు భారత కాలంనుండి వచ్చిన రాజవంశాలున్నాయి. పండిత భగవాన్ లాల్ ఇంద్రాజీ, ఒక బౌద్ధ భిక్షువునుండి ఈ గ్రంథాన్ని సంపాదించి ప్రచురించాడు. దీనికీ పురాణాల వివరాలకూ సంబంధం కన్పిస్తోంది. లంకలో మహావంశం అనే గ్రంథం ఉంది. 1500 సంవత్సరాల వెనుక నాటిదని ఆ దేశంలో బౌద్ధమత చరిత్రను చెబుతోంది. ఇట్లా అన్ని గ్రంథాలను పరిశీలిస్తే, ఎన్నో చారిత్రక విషయాలు తెలుస్తాయి. ప్రతి దానినీ కాకమ్మ కథగా కొట్టిపారవేయవలసిన అవసరం లేదు.


చరిత్రకారులు, ఎక్కడ తప్పటడుగుగు వేసారో చూడండి.


అలెగ్జాండర్ సైన్యాధిపతి, సెల్యూకస్, అతని తరువాత గ్రీసు దేశపు రాజయ్యాడు. అతడు మన మగధరాజు చేతిలో ఓడిపోయాడు. సంధి చేసుకున్నాడు. సెల్యూకస్, మొగస్థనీస్ అనే రాయబారిని పాటలీపుత్రానికి పంపాడు. ఈ రాయబారి తాను భారతదేశంలో చూసిన విషయాలను వ్రాసేడు.


Monday 15 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 161 వ భాగం



పాశ్చాత్య చరిత్రకారుల లక్ష్యం మనను కించపరచడమే


పాశ్చాత్య చరిత్రకారులు మన కాలగణనను చెత్తబుట్టలో వేస్తారు. మన సంకల్పంలో, ఏ కల్పంలో, ఏ మన్వంతరంలో, ఏ యుగంలో, ఏ సంవత్సరంలో, ఏ రోజులో ఆ వేళ ఉన్నామో చెప్పుకుంటాం.


అనాది నుండి ఈ సంస్కృతి సాగుతోంది. పాశ్చాత్యులు రెండువేల సంవత్సరాల నుండి కన్ను తెరిచారు. ఇదంతా క్రీస్తు తరువాతనే, వారి భౌతిక విజ్ఞాన శాస్త్ర ప్రగతిని కాదనం, కించపరచడం లేదు. అయితే తమకంటే పూర్వమే గొప్ప నాగరికతలున్నాయని వారంగీకరించకపోవడం వల్ల చరిత్రలోని లెక్కలు తారుమారయ్యాయి. ఇంకా మనం వర్ణ భేదాలతో కొట్టుకుంటున్నామని, అనాగరికులమని వారిలో ఒక దృఢ భావన ఏర్పడి వీరికి చరిత్ర పాఠాలు చెప్పాలనుకున్నారు. భారతీయ పూర్వపుటౌన్నత్యాన్ని జీర్ణించుకోలేక పోయారు. కాలాన్ని ఎంత తక్కువగా కుదించి చూపితే అదే మేలని భావించారు. మన శాస్త్రాలు, వేదాలు, కళలు, విద్యలను గుర్తించలేదు. మన విద్యల పట్ల ఏవగింపు కలిగేటట్లుగా పథకాలు పన్నారు. ఆర్యద్రావిడ భేదాలను కల్పించారు.


ఎట్లా మనలో ఏవగింపు కల్గించాలి? వర్ణాశ్రమాలను, వేదాన్ని కాదనిన బుద్ధుణ్ణి కీర్తించి భారతీయ చరిత్ర అంతా ఇతనితోనే ఆరంభమైనదని చిత్రీకరించారు. రాముడు, కృష్ణుడు మొదలైనవారు ఏవో కథలలో నాయకులని, చారిత్రక వ్యక్తులు కారని నమ్మబలికారు. ఇక అద్వైతం కూడా, బౌద్ధం నుండే వచ్చిందని, శయనిస్తున్నట్లున్న విష్ణు విగ్రహం కూడా బుద్ధుని మహా నిర్వాణంలో ఉన్న శిల్పం మాదిరిగానే ఉంటుందని ప్రచారం చేసారు.


వేదాలు, మహా అయితే బుద్ధునికి ముందు ఏ ఐదు వందల సంవత్సరాలనుండో వచ్చాయని, దానికంటే ముందు హరప్పా నాగరికత యుండేదని, అది ద్రావిడ నాగరికతయై యుంటుందని, హరప్పాలోని వారిని తరిమివేసి ద్రావిడ సంస్కృతినుండి నేర్చుకుని వైదిక నాగరికత వచ్చిందని వ్రాసేరు.


Sunday 14 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 160 వ భాగం



ఇక చండికేశ్వరుడు పితృద్రోహి. అతడు కుండల కొద్దీ పాలను శివలింగంపై అభిషేకిస్తూ ఉండేవాడు. తండ్రి వచ్చి ఆ పాల చెంబును కాలితో తన్నాడు. వెంటనే చండికేశ్వరుడు తండ్రి కాళ్లను నరికి వేసాడు. ఇక నుండి నేను నీకు తండ్రినని శంకరుడన్నాడు. అంతకుపూర్వం అతని పేరు విచార శర్మ. తరువాత చండికేశ్వరుడయ్యాడు. శివుని పంచమూర్తులలో అనగా శివుడు, అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, చండీశ్వరులలో ఒకటి అయ్యాడు. ఇది ఏనాటి కథయో?


పైవారిలో చిరుతొండ నాయనార్ చారిత్రక వ్యక్తి. ఏడవ శతాబ్దానికి చెందినవాడు. ఇతణ్ణి శంకరులు ప్రశంసించారు కనుక ఇతని తరువాతనే శంకరులుండాలని చారిత్రకులు వాదన.


చారిత్రకులెత్తి చూపినవి:


సూత్రభాష్యంలో శంకరులు, సత్ నకు అసత్ నకు సంబంధం ఉండదని చెబుతూ పూర్ణవర్మ పట్టాభిషేకానికి ముందు గొడ్రాలి కొడుకు రాజుగా నున్నాడనుట అసంగతమనే అభిప్రాయంలో వాడారు. ఈ పూర్ణ వర్మ ఎవడు? ఇద్దరా పేర్లతోనున్నారు. జావా ద్వీపంలో నాల్గవ శతాబ్దానికి చెందిన పూర్ణవర్మ ఒకడు. శంకరులు పేర్కొన్న రాజు మగధను పాలించిన పూర్ణవర్మ అయి యుంటాడని అన్నారు. హ్యూయాన్ త్సాంగ్ అనే యాత్రికుడు ఏడవ శతాబ్దంలో మనదేశం వచ్చి మగధను పూర్ణవర్మ పరిపాలిస్తున్నాడని వ్రాసేడు.


బౌద్ధ మతానికి విరోధియైన శశాంకుడు గయలోని బోధి వృక్షాన్ని నరికాడని, పూర్ణవర్మ దానిని మరల ప్రతిష్ఠించాడని కథ. ఇతణ్ణి శంకరులు పేర్కొన్నారు కనుక ఏడవ శతాబ్దం తరువాత శంకరులు కాలమని చరిత్రకారుల వాదన.


అయితే చాలా కాలం వెనుకనే బౌద్ధం, హైందవ మతం మిగతా దేశాలలో వ్యాపించాయి. కాంబోడియా (కాంభోజ) లో ఒక శాసనంలో ఇంద్రవర్మ ప్రస్తానవ ఉంది. అతని గురువు, శివసోముడు. అతడు భగవత్ శంకరులనుండి శాస్త్రాలను నేర్చుకున్నట్లుంది. "యేనాధీతాని శాస్త్రాణి శంకరాహ్వయతః" వారు శంకరులే అని చారిత్రకులున్నారు. ఇంద్రవర్మ కాలం తొమ్మిదవ శతాబ్దానికి చెందింది. అతని గురువు 30 లేక 40 సంవత్సరాల పెద్దవాడై యుంటాడు. కనుక శంకరుల సమకాలికుడే కనుక శంకరులు 788-820కి చెందినవారని తీర్పునిచ్చారు.


15 ఆగష్టు 2022, సోమవారం, శ్రావణ బహుళ చవితి, మహాసంకష్టహర చతుర్థీ.

15 ఆగష్టు 2022, సోమవారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.23 నిమి||

మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది

https://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

సంకటహర చవితి గురించి బ్రహ్మశ్రీ నండూరి శ్రీనివాస్ గారి వీడియో


శ్రావణ మాసంలో వచ్చిన దీనికి హేరంబ సంకష్టహర చతుర్థి అని పేరు. కష్టాలను తీర్చేవాడు, ఎవ్వరూ లేరు అనుకున్న వారికి నేను తోడున్నాను అని చెప్పేవాడు హేరంబుడు.

Saturday 13 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 159 వ భాగం



శంకరుల స్తోత్రాలలో కాలనిర్ణయం


శంకరులు, సౌందర్యలహరిలో, అమ్మా! నీవు దయతో ద్రవిడ శిశువునకు పాలనీయడంచే అతడు మహాకవి అయ్యాడని ఉంది. అతడే జ్ఞాన సంబంధుడు. అతడు క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందినవాడు. అప్పర్, మహేంద్రవర్మ అనే పల్లవరాజును జైన మతం నుండి వైదిక మతానికి మార్చినవాడు, జ్ఞానసంబంధుడు. మారవర్మన్ అరికేసరి అనే పాండ్యరాజును జైనాన్నుండి మార్చినవాడు. ఈ రాజు ఏడవ శతాబ్దంలో పాలించాడు కనుక సంబంధుడు ఏడవ శతాబ్దంలో ఉన్నాడు. అతణ్ణి శంకరులు పేర్కొన్నారు కనుక తరువాతి వారే అవుతారు. అప్పర్, జ్ఞాన సంబంధులు, సమకాలికులు.


మహేంద్రవర్మ తరువాత నరసింహ వర్మ వచ్చాడు. బ్రాహ్మణుడైన పరంజోతి అనే సైన్యాధిపతి, శివ భక్తుడై చిరుతొండ నాయనార్ గా  ప్రసిద్ధి పొందాడు. ఇతడే వాతాపిపై ఏడవ శతాబ్దంలో దండెత్తి చాళుక్య రాజును ఓడించాడు.


ఇతని ప్రస్తావన శంకరుల శివభుజంగ స్తోత్రంలో ఉంది. అందు భార్యకు, తనయునకు, తండ్రికి ద్రోహం చేసిన వారి మాదిరిగా నేను చేయలేదు. అట్టి ద్రోహం చేసినవారిని రక్షించావని శివుణ్ణి నిందాస్తుతిని చేసారు.


చిరు తొండనంబి కథ ప్రసిద్ధమైనది. బ్రతికియున్న కొడుకును చంపి ఆ మాంసాన్ని వండి వడ్డించిన కథ అందరికీ తెలిసిందే. అనగా సుతాద్రోహి అయ్యాడు. ఈశ్వరుడు, శివభక్తునిగా వచ్చి 'ఇయర్ పగైనాయనార్' అనే భక్తుడి భార్యనే అడిగాడు. అట్టివాడు కాంతాద్రోహి.


Friday 12 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 158 వ భాగం



నిధి నాగేభ వహ్ని అట్టే అని ఉంది. నిధి-9; నాగ-8; ఇభ=8; వహ్ని-3; అనగా 9883. త్రిప్పితే 3889. కలి 3102 ఆరంభం కదా. అందు 3889 తీసివేస్తే క్రీస్తు తరువాత 787-788.


కారణాలిట్లా చెప్పారు. శంకరుల రచనలలో ఇతర సిద్ధాంత ప్రవర్తకులను తడమడం ఉంది. క్రీ.పూ. 560 నుండి 480 వరకు బుద్ధుడు కాలమని అన్నారు. అటువంటప్పుడు శంకరుల కాలమూ అదే అవుతోంది కదా. బౌద్ధ మతాన్ని చాలామంది రాజులు పోషించినట్లుంది. అటువంటప్పుడు శంకరుల కాలంలో బౌద్ధం క్షీణించిందనే మాట ఎట్లా కుదురుతుంది? కనుక గౌతముని కాలంలో శంకరులున్నారనుట అసంగతమని చారిత్రక వేత్తలంటారు.  


దాని తరువాతే కాళిదాసు కాలమని; క్రీ.పూ. 600 కాని 500 కాని శంకరుల కాలం కాదని చారిత్రకులంటారు.


శంకరులు భాష్యంలో బౌద్ధమత సిద్ధాంతాలు


వైభాషికమని, సౌంతాంత్రికమని, యోగాచారమని, విజ్ఞాన వాదమని ప్రధాన బౌద్ధ సిద్ధాంతాలు. వైభాషికాన్ని, దిజ్నాగుడు, యోగాచార, విజ్ఞాన వాదాలను నాల్గవ శతాబ్దికి చెందిన అసంగుడు, వసుబంధుడు లేవదీసారు. మాధ్యమిక లేదా శూన్య వాదాలను బలపరచినవాడు నాగార్జునుడు. ఇతడు క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందినవాడు. 2,4, 6 శతాబ్దాలకు చెందిన బౌద్ధ సిద్ధాంతాలను శంకరులు ఖండించగా వీరు క్రీస్తు పూర్వం ఎట్లా ఉంటారని చారిత్రకులు ప్రశ్నిస్తున్నారు.


కనిష్కుని కాలంలో బౌద్ధం హీన యానమని, మహాయానమని రెండుగా చీలిందని అందు మహాయానాన్ని గురించి శంకరుల శిష్యుడు, పద్మపాదుడు తన పంచపాదికలో పేర్కొన్నాడని కనిష్కుడు క్రీ. శ. చెందినవాడు కావడం వల్ల కనుక శంకరులెట్లా క్రీస్తు పూర్వానికి చెందినవారౌతారని ప్రశ్నిస్తున్నారు.


Thursday 11 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 157 వ భాగం



సంధ్యాకాలంలో మద్దిచెట్టు పుష్పాలతో వినిపిస్తుంది. శివుడపుడు నాట్యం చేస్తాడు. ఆ పూలు, ఆ చెట్టును అలంకరించడమే కాకుండా శ్రుతి శిరస్సులను (ఉపనిషత్తులు) అలంకరిస్తాయి. అనగా తలపైన, చెవులలోను అలంకరింపబడతాయి. శివుడు శ్రుతి శిరస్సులతో ఉంటాడు. ఆ చెట్టు తుమ్మెదలతో ఉండగా శివుడు భ్రమరాంబికతో ఉంటాడు. చెట్టు మంచి వాసనతో ఉండగా శివుడు మంచి వాసన (భావన)తో ఉంటాడు. దాని పూలు మహాభోగులకు అలంకారంగా ఉండగా శివుడు భోగీంద్రుడై వాసుకి ఆభరణంగా కల్గియుంటాడు. వీటి పూలు అన్ని పూలకంటే పూజ్యములు కాగా శివుడు మంచివారిచే, దేవతలచే పూజింపబడేవాడై యుంటాడు. ఇది సుగంధ గుణాన్ని బట్టి కనుగొనబడితే శివుడు మంచి గుణాలను బట్టి వ్యక్తమౌతూ ఉంటాడు. గుణానికి దారమని, గుణమని అర్ధం. పువ్వులను దారాలతో గ్రుచ్చుతాం. అతడుత్తమ గుణాలతో ఉంటాడనీ అర్థం. మద్దిచెట్టును మల్లెతీగ చుట్టుకొని యుండగా, శివుడు, అమ్మవారిచే ఆలింగనం చేసికొనబడియుంటాడు. వసంతంలో మల్లెలు, మామిడి పండ్లు వస్తాయి. శంకరులు మల్లెలా, జ్ఞాన రసంతో కూడిన మామిడి పండులా ఉంటారు. అదే అద్వైత రసం.


శంకరుల కాలం


వీరు సిద్ధి పొందిన సంవత్సరానికి చెందిన శ్లోకాన్ని లోగడ పేర్కొన్నాను. ఆ పుస్తకంలోని ప్రాచీన శంకర విజయ శ్లోకంలో అవతార సంవత్సరం చెప్పబడింది. అందు, అనల సేవధి భావనేత్రే అని ఉంది. అనగా 3-9-5-2-3952. కటపయాది సూత్రంచే త్రిప్పితే 2593. కలిశకం క్రీస్తుపూర్వం 3102లో ఆరంభం. అందు 2593 తీసివేయగా క్రీ.పూ. 509 అయింది.


అయితే దీనికి విరుద్ధంగా పాశ్చాత్య పరిశోధకులు క్రీ.శ. 788-820 అన్నారు. అంటే నేను చెప్పినదానికి దీనికీ 1300 సంవత్సరాలు తేడా ఉంది. వీరెట్లా నిర్ణయించారంటే మరొక శ్లోకాన్ని ప్రమాణంగా స్వీకరించారు ఈ శ్లోకంలో.


Wednesday 10 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 156 వ భాగం



శ్రీశైలం - అర్జున క్షేత్రం


పరమేశ్వరునకు, మల్లెకూ సంబంధం ఉంది. మల్లె మాదిరిగా ఇతడు తెలుపు ఈయనకు మల్లికార్జునుడనే పేరు ఉంది. ఇక శంకరులకు శ్రీశైలంతో సంబంధం ఉంది. వీరి శివానందలహరిలో 50,51 శ్లోకాలలో వీరు వ్రాసిన యోగతారావళిలోనూ శ్రీశైల మల్లికార్జున ప్రస్తావన వస్తుంది. ఉంది. లతలు పెనవేసుకొని యుండగా, నా చెవులలో పక్షులు గూళ్ళు కట్టుకొని యుండగా కదలని, మెదలని స్థితిలో శ్రీశైల గుహలలో ఎప్పుడుంటానో కదా అని అన్నారు.


మల్లె తీగ, మద్ది చెట్టును చుట్టుకొని యుండడం వల్ల మల్లికార్జునమైంది. అంబిక తీగయై, స్థాణువైన శివుణ్ణి చుట్టుకొని యుంటుంది. ఆమె మనలో జ్ఞానశక్తియే. అది ఆత్మతత్త్వమైన శివుణ్ణి, చుట్టి యుండాలి. మద్ది తెలుపు, శివుడూ తెలుపే.


అర్జున వృక్షం శివం కాగా, అమ్మవారు మల్లెతీగ. మరొకవిధంగా చెప్పవచ్చు. మల్లెతీగలో నున్న పువ్వు, శివుడు కాగా, మకరందం ఆస్వాదించే తుమ్మెదయే అమ్మవారు. శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబిక. శివానందలహరిలో ఆచార్యులు:


సంధ్యారంభవిజృంభితం శ్రుతి శిరః స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసకృత్ సద్వాసనా శోభితం


భోగీంంద్రా భరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేపే శ్రీ గిరిమల్లి కార్జున మహాలింగం శివాఽఽలింగితం 


ఈ శ్లోకానికి రెండర్థాలున్నాయి. ఒకటి మల్లెకు, రెండవది శివునకు చెందినదిగా ఉంటుంది.


Tuesday 9 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 155 వ భాగం



మల్లెపువ్వులున్న ఋతువులో, మాసంలో వీరి అవతారం కనుక శుద్ధ సత్త్వాన్ని, చల్లదనాన్ని సూచిస్తుంది. ఈ మల్లెకు వీరి మాటలకూ ఉన్న సంబంధాన్ని చెబుతా, మఠంలో శ్రీముఖం ఇచ్చేటపుడు శంకరుల వాక్కును ఇట్లా పోలుస్తారు:


అతలిత సుధారస మాధుర్య కమలాసనకామినీ 

ధమ్మిల్ల సంపుల్ల మల్లికా మాలికా నిష్యంద మకరంద 

ఝరీ సౌవస్తిక వాఙ్నగుంభ విజృంభణానంత తుందిలిత మనీషి మండలానాం 


అనగా సరస్వతీ దేవి, పద్యంపై అధివసించి యుండి కొప్పులో మల్లెపూవులను తురుముకొంది. శంకరులు అమృత రసంతో కూడిన వాక్కులనందిస్తూ ఉంటే విద్వాంసులు సంతోషిస్తున్నారు. ఆ మల్లె పూవులనుండి వచ్చు మకరందం కూడా వీరి వాక్కులతో సాటిరాదని అర్ధం.


శంకరులు, సరస్వతితో వాదించి ఓడించి వారి సర్వజ్ఞత్వాన్ని చాటారు. సరస్వతిని శృంగేరిలో శారదాపీఠంలో ప్రతిష్టించారు. సన్న్యాసులు పది నామాలతో వ్యవహరింపబడుతూ ఉంటారు. దానిలో భారతి నామం, శృంగేరీ సన్న్యాసులకుండగా, కంచిలో సరస్వతి పేరుంటుంది. సరస్వతి సన్న్యాసులలో రెండు సంప్రదాయాలున్నాయి. ఆనంద సరస్వతి, ఇంద్ర సరస్వతీయని, కంచిలో ఇంద్ర సరస్వతులుంటారు. శృంగేరీ పీఠాన్ని శారదా పీఠమంటారు. కంచి మఠాన్ని శారదా మఠమంటారు. సరస్వతి, మల్లెలా స్వచ్ఛమైనది. అందలి మకరందం కంటె శంకరుల వాక్కులో మాధుర్యం ఉంటుంది. కనుక వీరు వైశాఖ మాసంలో పుట్టడమూ సబబే.


Monday 8 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 154 వ భాగం



వారి అవతార దివసాన్ని చూసి పేరు పెట్టారని గమనించండి. వైశాఖ శుద్ధ పంచమినాడు ఐదవ తిథి, ఒకటవ పక్షం, రెండవ మాసం. శ అంటే 5. అంటే ఒకటి ర అంటే 2. దీనిని తిరుగవేయండి. రెండవ మాసం, మొదటి పక్షం, ఐదవ తిథి కావడంచే శంకర అనే పేరు వస్తుంది. భగవంతుడనే కాకుండా పుట్టిన మాసం, తిథి, పక్షాన్ని బట్టి శంకర పదం ఉంచారు.


ఆంగ్లంలోనూ ఈ పద్ధతియుంది. దీనిని వీరు Chronogram అంటారు. రోమన్ అంకె 1 ఒకటవుతుంది. V=5; X=10 అవుతాయి.  


శంకరులు ఎంత కాలం బ్రతికారన్నది కూడా ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. ఫలే స్వస్మిన్ స్వాయుషి అని ఉంది. ఫ అనగా 2; ల అనగా 3. ఫల అనగా 23. త్రిప్పితే 32 సంవత్సరాలు. ఇప్పటికి 2500 సంవత్సరాల పూర్వం వారున్నారని తేలింది.


వసంత ఋతువు - వైశాఖ మాసం


మాసానికి, మల్లెకు, శారదకు, శంకరులకు గల సంబంధాన్ని చెబుతా. వైశాఖ మాసంలో పుట్టారు. విశాఖ యనగా కొమ్మలు లేనిది. లతకు కొమ్మలుండవు. దీనిని మాధవ మాసం అంటారు. చైత్రాన్ని మధువని అంటారు. మాధవి యనగా మల్లె. దీనికి కొమ్మలుండవు కనుక రెండు మాసాల పేర్లు దీనికి చెందినది. వసంతం నుండి వాసంతి వచ్చింది. మల్లెకు వాసంతి యని కూడా పేరు.


Sunday 7 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 153వ భాగం



ఉదాహరణకు 'జయ'ను చూడండి:


'జ' అనగా 8; 'య' అనగా 1, జయ-81. దానిని పై సూత్రం వల్ల త్రిప్పితే 18 అయింది.


గీతలో ధ్యానానికి చైలాజినకుశోత్తరం అని యుంది. చైలం =బట్టి, అజినం చర్మం, కుశ=దర్భలు. ధ్యానానికి ముందు నేలపై బట్టను వేసి దాని పై చర్మం ఉంది దానిపై దర్భలని చెప్పకూడదు. దానిని తలక్రిందులుగా చేయాలి. ముందు దర్భ, దానిపై చర్మం, దానిపై బట్టయని అర్థం చేసుకున్నట్లే పైన కూడా.


కటపయాదితో సిద్ధిని పొందిన సంవత్సరం


పుణ్యశ్లోక మంజరి అనే గ్రంథంలో 55వ పీఠాధిపతివరకు ఉన్న వారి పేర్లు, స్థలము, ఎక్కడ సిద్ధి పొందినవి మొదలైన వివరాలున్నాయి. తరువాత వచ్చినవారు అనుబంధాన్ని చేర్చారు. ఇట్లా 60వ పీఠాధిపతి వరకూ ఉన్నాయి. శ్లోకం'శర చరా అని ఉంది.


ఫలే స్వస్మిన్ స్వాయుష్ శరచరాబ్దేఽ సకలేః

విలీయే రక్తాక్షిన్ యతివృష సిద్ధై కాదశిపరే


ముందుగా వీరెప్పుడు సిద్దిని పొందారో వివరిస్తారు. శరచరాబ్దంలో 


అనగా రక్తాక్షి సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు సిద్ధిని పొందారు. 'శ' వర్ణం ఐదును సూచిస్తే 'ర' రెండును చెబుతుంది. 'కాదినవ' అనే సూత్రం ప్రకారం 'చ' ఆరును చెప్పగా 'ర' రెండును చెబుతుంది. దీనిని తల్లక్రిందులు చేస్తే 2625 అయింది. అనగా కలియుగం ఆరంభమైన వెనుక 2625 సంవత్సరంలో సిద్ధిని పొందారు. అంటే కలిలో క్రీ.పూ.477. వారు 32 సంవత్సరాలు బ్రతికారు. దానికి 32ను కలిపితే క్రీ.పూ. 509 అయింది. అది నందననామ సంవత్సరం. 


Saturday 6 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 152 వ భాగం



నామకరణం


శిశువు పుట్టీ పుట్టగానే చేసే సంస్కారం పేరు జాతకర్మ. తరువాత 11వ రోజున నామకరణం జరుపుతారు.


వీరికి శంకరులని నామకరణం చేసారు. శంకరుని అనుగ్రహం వల్ల పుట్టాడు గనుక బాగానే ఉంది. శంకరునకు అనేక నామాలున్నాయి. దీనినే ఎందుకు పెట్టినట్లు? శంభువు, నిష్క్రియుడు. శంకరులనగా లోకానికి మంచి చేసేవారని చెప్పాను. కనుక ఇది సార్ధకం.


ఏ కారణం లేకుండా దీనినుంచలేదు. పుట్టిన నెల, పక్షం, తిథికి అనుగుణంగా ఈ పేరుంది. ఇదీ విశేషం.


కటపయాది సంఖ్య


గణితానికి సంబధించిన కొన్ని సంకేతాలు తెలిస్తే ఏ సంవత్సరంలో పుట్టారో ఇట్టే మనకవగతమౌతుంది.


అంకెలను, అక్షర సంకేతాలతో చెప్పేవారు 'కాదినవ బాదినవ-పాది - పంచ - యాద్యష్టా' అని ఇట్లా గుర్తులున్నాయి. అంటే క మొదలు ఝ వరకూ తొమ్మిది అక్షరాలు, వరుసగా ఒకటినుండి తొమ్మిది వరకూ ఉండే అంకెలను గుర్తు చేస్తాయి. అట్లాగే ట మొదలు ధ వరకు ఉండే అక్షరాలు ఒకటినుండి తొమ్మిది వరకూ ఉండే అంకెలను గుర్తు చేస్తాయి. ప నుండి మ వరకూ ఉండే అక్షరాలు ఒకటి మొదలు ఐదు వరకూ ఉండే అంకెలను సూచిస్తాయి. య నుండి హ వరకు ఉండే అక్షరాలు ఒకటి మొదలు ఎనిమిది వరకూ ఉండే అంకెలను సూచిస్తాయి. అచ్చులు ఒక్కటే ఉంటే సున్నాలను సూచిస్తాయి. ఈ అంకెల్ని కుడినుండి ఎడమకు లెక్కించాలి. అనగా ఎడమవైపున ఉండేది ఒకట్ల స్థానమౌతుంది.


Friday 5 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 151 వ భాగం



ఈ ఉత్సవంలో శంకరుల ఉత్సవమూర్తిని ఊరేగిస్తూ గాయత్రీ మండపం దగ్గరకు తీసుకొని వచ్చి ప్రతిరోజూ సౌందర్య లహరిలోని పది శ్లోకాలను పఠిస్తారు. చివరి రోజున ఒక ప్రత్యేకత యుంది. ఇక్కడ శుక్రవారమంటపం ఉంది. మామూలు ఉత్సవాలలో అమ్మవారిని ఈ మంటపం పై అధివసింపచేస్తారు. శంకర జయంతి ఉత్సవాలలో చివరి రోజున అమ్మవారు శంకరుల ఉత్సవమూర్తులను రెండింటినీ ఇక్కడ కూర్చుండబెట్టి చివరి పది శ్లోకాలను చదువుతారు. అమ్మవారి ప్రసాదం, వస్త్రం, శంకరులకు నివేదిస్తారు. ఇట్లా అన్నిచోట్ల జరగాలని నా ఆకాంక్ష.


మనస్సునర్పించుట మౌన ధ్యానం-


శంకర జయంతికి డబ్బు ఖర్చు పెట్టుట కంటె వారికి శరణాగతి పొందుటయే సరియైన పూజ, మనస్సు సమర్పించుటయే ముఖ్యం.


భగవంతుని పూజించుట కంటె శంకరులను స్మర్శిస్తేనే శాంతి కలుగుతుంది. మన కర్మానుసారంగా శిక్షించే వాడు శంకరుడు. కాని శంకరులు మనకు మంచిని చేస్తారు.


ఎట్లా వారిపై మనస్సును నిలపాలి? 'హరహర శంకర, జయ జయ 'శంకర' అంటే చాలు. హర హర నామమే అన్నిటినీ హరిస్తుందని జ్ఞాన సంబంధులనలేదా? శంకరులు దిగ్విజయం చేసారు కనుక జయ జయ శంకరను కలుపుదాం.


అనవసరమైన వివాదాలతో కాలం గడుపుతారేమిటి? శంభుని తలుచుకొని పరమానందం పొందండని వీరనలేదా?


"వృథాకంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్బుజ పరమసౌఖ్యం ప్రజ సుధీః"


Thursday 4 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 152 వ భాగం



వారు స్థాపించిన మఠమే వారి భౌతికరూపం. రామానుజులు మఠాలను స్థాపించలేదు. అట్లాగే ఏ వైష్ణవ ఆచార్యుడూ స్థాపించలేదు. కాని వారి మూర్తులు విష్ణ్వాలయాలలో ఉంటాయి. కాబట్టి మఠాలలో శంకర జయంతి ఘనంగా జరుపుకోవాలి.


కామాక్షి ఆలయంలో శంకర జయంతి 


కామాక్షి ఆలయానికి, మఠానికి శంకరుల జీవితానికి దగ్గర సంబంధం ఉండడం వల్ల ఆలయంలో వీరి మూర్తి గంభీరంగా ఉంటుంది. వీరికి ఇక్కడ మూలవిగ్రహము, ఉత్సవమూర్తులతో కూడిన ప్రత్యేక సన్నిధియుంది.


జయంతిని గర్భోత్సవంగా జన్మోత్సవంగా జరుపుతారు. జయంతి ముందు పదిరోజులు నుండి గర్భోత్సవం ఉంటుంది. జయంతితో ముగుస్తుంది. గర్భంలో ప్రాణి నవమాసాలూ ఉంటాడు. ఇక జయంతి నుండి పదిరోజుల వరకూ జరుపబడేది జన్మోత్సవం. పుణ్యాహవాచనంతో ముగుస్తుంది. గర్భోత్సవం, కృష్ణపక్షంలో ఆరంభింపబడి వైశాఖ శుద్ధ పంచమితో ముగుస్తుంది.


కామాక్షి ఆలయంలో జన్మోత్సవమే ఉంటుంది. పూర్ణిమతో అంతం. దీనిని దేవాలయమే నిర్వహిస్తుంది. ఇతరుల విరాళాలతో కాదు.


Wednesday 3 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 151 వ భాగం



కంచితో ప్రత్యేక సంబంధం


కంచి ప్రాంతంలో ఆచార్యుల విగ్రహాలు చాలాచోట్ల ఉన్నాయి. కామాక్షి ఆలయంలో వీరి మూర్తి ఉంది. అట్లాగే ఏకామ్రనాథుడు, వైకుంఠ పెరుమాళ్, వరదరాజు ఆలయాలలో వీరి మూర్తి ఉంది. ముఖ్యంగా తాయారు సన్నిధికి వెళ్ళే మార్గంలో వ్యాసునితో కూడిన శంకర విగ్రహం, అక్కడ వ్యాసుడు, అద్వైతమే సత్యమని వేలెత్తి చూపిస్తున్నట్లున్న విగ్రహం, ఒక స్తంభంపై మలచబడింది.


కామాక్షి అమ్మవారు ఉగ్రమూర్తిగా ఉండగా శంకరులు ఆమెను సౌమ్యమూర్తిగా తీర్చిదిద్దారు కనుక, అమ్మవారితో శంకరులకు ప్రత్యేక సంబంధం ఏర్పడింది. దీనికి అనుగుణంగా తపః కామాక్షి విగ్రహాలు ఏ విధమైన భంగిమలలో ఉంటాయో అదేవిధమైన ముద్రలు భంగిమలతో ఆచార్యులవారి విగ్రహాలు కొన్ని గుళ్ళల్లో చూపబడినాయి.


శంకరులు శిష్యచతుష్టయంతో ఉన్నట్లు ప్రసిద్ధియైనా కంచిలో ఆచార్యులవారి నివాసాన్ని తెలిపే పుస్తకాలు, అర్గురు శిష్యుల గురించి చెబుతాయి. ఆచార్యులవారి ఆదేశంతో షణ్మతములను స్థాపించిన ఆర్గురు శిష్యులు, తమ తుది సంవత్సరములలో ఆచార్యులవారు కాంచీపురంలో విడిది చేసి ఉండగా వచ్చి వారికి నివేదించారని ఆ పుస్తకాలు చెబుతాయి. దీనికి తగినట్లుగా కామాక్షి దేవాలయంలోని ఆదిశంకర మూర్తి పీఠంపై నల్గురు శిష్యులకు బదులుగా ఆరుగురు శిష్యులను చూడవచ్చు. కంచి మఠం పూజాగృహంలో కూడా రెండు ప్రక్కలా ముగ్గురేసి శిష్యులున్న ఆచార్యుల వారి మూర్తి ఉన్నది.


కంచి చుట్టుపక్కల చెన్నైవరకు అక్కడక్కడ వీరి మూర్తులున్నాయి. అంత్య సమయంలో వీరు కంచిలో ఉండడం వల్ల అట్లా మూర్తి ప్రతిష్టాపన జరిగియుండవచ్చు.


Tuesday 2 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 150 వ భాగం



మనకెన్నో పవిత్ర దివసాలున్నాయి. అన్నిటికంటె శంకర జయంతినే బాగా ఎందుకు జరుపుకోవాలి?


శంకరులు పుట్టిన తరువాతనే ఆ పవిత్ర దివసాల ప్రాముఖ్యాన్ని గుర్తించాం. ఎందుకంటారా? వేద, శాస్త్ర, పురాణ, శాస్త్రాల పునరుద్ధరణ ఇప్పటినుండే జరిగింది కనుక.


బౌద్ధం, జైనం, మీమాంసమతం విజృంభించి యుంటే శివరాత్రి వంటివాటిని ఎవరు జరుపుకుంటారు? శంకర జయంతి వల్లనే ఆ పండుగలను, జయంతులను జరుపుకుంటున్నాం. జయ జయ శంకర అంటూ జరపండి.


ఘనంగా జరపండి


శంకర జయంతి లేకపోతే రామనవమి, కృష్ణాష్టమి ఉండేవా! మన శ్రేయస్సుకై జరపండి. కృతజ్ఞత మనకుండాలి. ఏదో మ్రొక్కుబడిగా కాదు. దీని విశిష్టతను గుర్తించి జరపండి.


వైష్ణవాలయాలలో ఆళ్వార్లు, రామానుజులు, వేదాంత దేశికుల మూర్తులుంటాయి. అట్లాగే శివాలయాలలో నాయనార్ల విగ్రహాలుంటాయి. వారి జయంతులను వారు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. శంకరులు శైవులూ కాదు, వైష్ణవులూ కాదు. స్మార్త సంప్రదాయానికి చెందినవారు, అన్ని సంప్రదాయాలను గౌరవిస్తారు కనుక వీరికి ప్రత్యేకంగా విగ్రహం అంటూ ఉండదు. వీరు యంత్ర ప్రతిష్టాపన చేసిన ఆలయాలలో అక్కడక్కడ వీరి విగ్రహముంటుంది.

Monday 1 August 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 149 వ భాగం



కేరళ, ఆయుర్వేదానికి ప్రసిద్ధి. నేయి ఎంత ప్రాతదైతే దీని గుణం అంత ఎక్కువగా ఉంటుందని, వైద్యులు దానిని తీసుకొని వెడుతూ ఉంటారు. మండలం (40) రోజులు దీక్షతో ఈ పుణ్యదంపతులు సంతానానికై స్వామి సన్నిధిలోనే ఉన్నారు.


వర ప్రదానం


స్వామి ప్రత్యక్షమయ్యాడు. దీర్ఘాయుర్దాయం కలిగిన వందమంది మూర్ఖులు కావాలా? అల్పాయుష్కుడూ, సర్వజ్ఞుడూ అయిన ఒక్క పుత్రుడు కావాలా అని అడిగాడు.


శివగురువు భార్య నడుగుతానన్నాడు. తనకూ అట్టి కల వచ్చిందని ఆర్యాంబ చెప్పింది. స్వామిని మీ ఇష్టం వచ్చినట్లు చేయమన్నారు. నేనే అవతరిస్తాను. అయితే ఎనిమిది సంవత్సరాలే ఈ భూమిపై ఉంటా అన్నారు స్వామి. ఆమె గర్భంలో ఒక దివ్య తేజస్సు అవతరించింది.


జయంతి గొప్పదనం


నందన నామ సంవత్సరంలో వైశాఖ మాసంలో శుద్ధ పంచమినాడు, అభిజిల్లగ్నంలో (మధ్యాహ్నం) ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో, ఉండి అర్ధా నక్షత్రం ఉండగా శంకరులవతరించారు. కొందరు అవతరించినది పునర్వసువని అంటారు. ఆ పంచమినాడొకప్పుడు ఆరుద్ర వస్తుంది. ఒక్కొక్కప్పుడు పునర్వసూ ఉంటుంది.