Monday 31 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 237 వ భాగం



పృథ్వీరుణ్ణి శృంగేరీ పీఠాధిపతిగా చేసారని జర్మనీకి చెందిన పుస్తకాల పట్టికలో "శృంగేరీ పృథ్వీ ధరాచార్య" అని ఉంది. ఇతణ్ణి పృథ్వీధర భారతియని కూడా అంటారు. శృంగేరిలోనున్నవారికి, భారతీయని చివర ఉంటుంది. తీర్ధ సంప్రదాయం వారూ ఇందున్నారు.


దిగ్విజయం భారతీయ సమైక్యం


ఆరువేల మంది శిష్యులతో ఆసేతు హిమాచలం పర్యటించి 56 దేశాలలో ఉన్న విమతాలను ఖండించి వేదధర్మాన్ని ప్రతిష్టించారు. ఎవరినీ హింసించి కాదు. వారు జయశాలి.


72 మతాలున్నాయంటే ప్రజలు 72 వర్గాలుగా చీలిపోయారన్నమాట. వీరినందరినీ సనాతన ధర్మంవైపు మళ్ళించారు. దానిని పూర్తిగా నిర్వహించినవారు శంకరులు. ఇదంతా ఏ రాజుల యొక్క అండదండలు లేకుండా నిర్వర్తించగలిగారు. దీనినందరూ ప్రశంసిస్తున్నారు. ఆధునిక భావాలు కలిగిన నెహ్రూగారు. ఆయన వ్రాసిన Glimpses of world History' లో "I have spoken about Kings and Royal Dynasties. But more than all these Kings and Emperors this young man from the south did more for national life. What is surprising in this is that without givivng room to emotions, intellectually he attracted even the ordinary people and not Brahmins or scholars"


నెహ్రూగారు చెప్పినది ముమ్మాటికీ సత్యమే. ప్రేమతో బుద్ధుడు ప్రజలను ఆకట్టుకుంటే బుద్ధితో వీరాపని చెప్పారు. తత్త్వం గురించి చెప్పేటపుడు భావావేశాలకు లోనుగాక శ్రుతి, యుక్తి, అనుభవాన్ని జోడించి ఒప్పించారు. ఆలయ పునరుద్ధరణ, పూజా పద్ధతులు, భక్తి స్తోత్రాల రచన - ఇదంతా ప్రేమతోనే చేసారు. ఇక్కడ భావాలకు ప్రాధాన్యం. భక్త్యావేశంతోనే వ్రాసేరు.


Sunday 30 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 236 వ భాగం



వంద సంవత్సరాల Aufrecht వెనుక అనే దొర మా మఠ తాళపత్ర పట్టికను తయారు చేసాడు. అట్లాగే జర్మనీలో ఉన్నవాటికీ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నవాటికీ పట్టికలు తయారయ్యాయి. జర్మనీలో ఉన్న విశ్వవిద్యాలయ గ్రంథాలలో 'గురు పాదాది నమస్కారం' అనే గ్రంథం ఉంది. అందు పృధ్వీధరుని పేరుంది. శంకరుల శిష్యులతో బాటు ఇతని పేరూ ఉంది.


ఇంకా మరేదైనా పుస్తకం వ్రాసాడో లేదో తెలియదు. పై పట్టికనుండి 'ద్వాదశ మహావాక్య వివరణం' అనే తాళపత్ర ప్రతి ఉన్నట్లు తెలిసింది. దానిని వైకుంఠ పురి వ్రాసేడు.


దీనిని బట్టి శంకరులు, దశ నామి సన్న్యాసి పద్ధతిని ప్రవేశ పెట్టారని, సన్యాసి పేరు చివర, దశనామి నామాలలో ఒకటి ఉందని తెలుస్తోంది. తీర్థ - ఆశ్రమ - వన - అరణ్య - గిరి - పర్వత - సాగర - సరస్వతి - భారతి - పురి అనేవి దశనామి సంప్రదాయాలు. వీరందరూ పృథ్వీధరుని శిష్యులే అని యుంది.


"పృధ్వీదరాచార్యః తస్యాపి శిష్యాదశ" 


వీరిని ఒక క్రమపద్ధతిలో పెట్టాడంటే అర్ధమేమిటి? శంకరుల మనోగతానికి అనుగుణంగా వీరిని పరివిధాలుగా విభజించి కొన్ని సంప్రదాయాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సిద్ధాంతం ఒక్కటైనా బాహ్య నియమాలలో కొద్దిగా భేదం ఉంటుంది. ఇందు కొందరు తెల్లని బట్టలు కట్టుకుంటారు. దండానికి వస్త్రానికి ఎట్లా ముడి వేయాలనే నియమాల వంటివి యుంటాయి.


ఈనాటికీ, అట్టి కట్టుబాట్లున్నాయంటే వీరి సంఘటనాశక్తి, కార్య నిర్వహణ సామర్ధ్యం గొప్పదనే కదా.


Saturday 29 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 235 వ భాగం



శంకరులు సిద్ధి పొందడానికి ముందుగా సురేశ్వరుల పర్యవేక్షణలో ఇతడు కంచి మఠాన్ని అధిరోహించాడు. అందువల్ల సురేశ్వరులను గురువుగా భావించి ఆయనను 'దేవేశ్వరుడని' ఇతడు కీర్తించాడు. 


ఈయన సన్యాసనామం సర్వజ్ఞాత్ముడు ఇతడు సంక్షేప శారీరకాన్ని వ్రాసేడు. ఇది శంకరుల శారీరక భాష్యాన్ని ఆధారంగా చేసుకుని వ్రాసినది. పేరులో సంక్షేపం (చిన్నది) అని యున్నా వేయి శ్లోకాలతో ఉంటుంది. శ్లోక రూపంలో అద్వైతం గురించి చాలా తక్కువ పుస్తకాలున్నాయి. ఇతడేకాదు, విద్యారణ్య స్వామివారొక అద్వైత గ్రంథాన్ని వ్రాసారు.


పంచ ప్రక్రియయనే అద్వైత గ్రంథాన్ని కూడా రచించాడు. మీమాంసపై ప్రమాణ లక్షణాన్ని వ్రాసేడు. వ్యాస పూజలో ఇతణ్ణి కొలుస్తారు. వ్యాస పూజలో 30 మంది ఆచార్యులను కొలుస్తారు. అవి ఆరు పంచకాలుగా ఉంటాయి. ద్రవిడ పంచకంలో ఇతని పేరుంటుంది. ఈయనను సంక్షేప శారీరకాచార్యుడని సర్వజ్ఞాత్మముని అని కూడా కొలుస్తారు.


పృథ్వీధరాచార్యుడు, శంకరుల కంటే పెద్ద. శంకరుల ముందే చాలామంది సూత్రభాష్యాలు వ్రాసేరు. అవి అద్వైతానికి భిన్నంగా ఉంటాయి. ఈయన వ్రాసిన భాష్యానికి పృధ్వీధర భాష్యమంటారు. పృధ్వీధరుని భాష్యం, అభినవగుప్తుని భాష్యంతో కలిపి 99 మంది భాష్యాలను ఆచార్యులు ఖండించారని తత్త్వ చంద్రికలో ఉంది. ఇందు పృథ్వీధరుణ్ణి పేర్కొనడం వల్ల ఈయన ఉన్నతస్థానం తెలుస్తోంది. తంత్రాలోకం, అలంకారశాస్త్ర వ్యాఖ్యానం వ్రాసిన అభినవగుప్తుడు గీతాభాష్యాన్ని కూడా వ్రాసాడు.


పృథ్వీధరుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. శిష్యుడయ్యాడు.


Friday 28 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 234 వ భాగం



"ద్రుతమేవ విధేహి కృపాం సహజాం"

"భవశంకర దేశిక మే శరణం" అని కాళ్ళమీద పడ్డాడు. శిష్యులందరూ ఈ దృశ్యాన్ని చూసి ఆనందాశ్చర్యాలను ప్రకటించి యుంటారు, ఆనందాశ్రువులను రాల్చి యుంటారు. ఎందుకంటే ఇవి ఇతని పట్ల దయతో కూడినవి. ఇన్నాళ్ళూ ఇతణ్ణి మూర్ఖుడని భావించాం. ఎంత పొరపాటు జరిగిందని బాధపడి యుంటారు. ఇతడు "ప్రతిసార సముద్ధరణం" అనే గ్రంథాన్ని వ్రాసాడని అంటారు. అదీ తోటక ఛందస్సుతో ఉంటుంది. ఇతణ్ణి జ్యోతిర్మఠానికి అధిపతిని చేసారు.


మరో ఇద్దరు శిష్యులు


వీరికి పై నల్గురే కాకుండా ఇంకా శిష్యరత్నాలున్నారు. అందిద్దర్ని పేర్కొంటాను. వారూ సురేశ్వరుని మాదిరిగానే వాదించి ఓడింపబడ్డవారే. తరువాత శిష్యులైనారు. అందొకరు శంకరుల కంటే పెద్ద కూడా. అతని పేరు పృథ్వీధరుడు. మరొకడు శంకరులకంటే చిన్నవాడు, సర్వజ్ఞాత్ముడు.


కంచిలో పీఠాన్ని ఆరోహించిన వెనుక చాలామంది శంకరులతో వాదాలు చేసారు. తామ్రపర్ణీనదీతీరం నుండి ఒక తండ్రి, ఏడేళ్ళ కొడుకు వచ్చారు. ఆ పిల్లవాని పేరు మహాదేవుడు. ఇతని తండ్రి పెద్ద మీమాంసకుడు. ఆయన బౌద్ధ జైనులతో వాదించినపుడు ఈ పిల్లవాడూ పాల్గొంటూ ఉండేవాడు. తండ్రి, శంకరులతో వాదించి ఓడిపోయినపుడు ఈ పిల్లవాడు నాల్గు రోజులపాటు శంకరులతో వాదించి చివరగా ఓడిపోయాడు.


వీరిచే ఓడింపబడ్డానని కుఱ్ఱవాడు కలత పడలేదు సరికదా, వీరిపట్ల భక్తితో ఉన్నాడు. సన్న్యాస దీక్ష నిమ్మని అడుగగా శంకరులు ఇచ్చారు.


Thursday 27 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 233 వ భాగం



"అహిమాంశురివ అత్ర విభాసి గురో"


అవి అన్నీ తిరుగుతూ ఉన్నట్లు కన్పిస్తాయి. కాని తిరగకపోయినా నక్షత్ర వీధి సంచారం ఉంటుంది.


మరొక సంగతి గుర్తుకు వస్తోంది. అగస్త్యోదయం కాగా మురికి నీటిలో మురికి అంతా పోతుంది. తేటగా నీళ్ళుంటాయి. అట్లాగే శంకరులనే సూర్యులుదయించగా మురికి బట్టిన బుద్ధులు కలవారికి తేటదనం వస్తుంది. చివరి శ్లోకంలో నేను మూర్ఖుణ్ణి. నాకేమి తెలుసునని మిమ్ము గానం చేస్తున్నా? 64 కళలు తెలిసిన సర్వజ్ఞులు మీరు "విదితా సమయా విశదైకకలా" ఎంత విద్వాంసుడైనా సమగ్రంగా సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం.


సర్వజ్ఞులైన ఆచార్యులు సర్వజ్ఞుడైన శంకరునితో "నాకేం తెలుసు? స్మృతులా? శాస్త్రాలా? వైద్యమా? కవిత్వమా? సంగీతమా? పురాణమా? శాస్త్రమా? ఏమీ తెలియకుండా నేను పశువులా ఉన్నానని, నీవు పశుపతివని, అందువల్ల నాపై దయ చూపించుమని అన్నారు. ఇదంతా నిజరూపాన్ని కప్పి పుచ్చి మనలను మోసం చేయడం కాదా!


అందుకే చివరి శ్లోకంలో నా బుద్ధితో మిమ్ము సంతృప్తి పరచలేను.


డబ్బిచ్చి సంతృప్తి పరచలేను. 

"న కించన కాంచన మస్తి గురో" అయినా మీనుండి వచ్చిన అనుగ్రహమే నన్ను రక్షిస్తుంది. అన్ని వేళలా దానిని నాకిత్తురుగాక.


Wednesday 26 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 232 వ భాగం



ఇంతలో తోటకుడు, నృత్యం చేస్తూ, శంకరులపై స్తోత్రం చేస్తూ వచ్చాడు. అప్రయత్నంగానే అతని నోటివెంట శ్లోకాలు వచ్చాయి. అవి తోటక ఛందస్సులో ఉన్నాయి. అవి ఎనిమిది శ్లోకాలు. దానినే తోటకాష్టకమని అంటారు. అందువల్ల ఇతడు తోటకాచార్యుడయ్యాడు.


అందొక శ్లోకాన్ని పేర్కొంటా. ఇతడు చెప్పినదాని కంటె ప్రత్యేకంగా నేను చెప్పేదేమీ లేదు. ఈ మధుర శ్లోకాన్ని అందరూ ఆస్వాదింతురుగాక. ఇది భక్తితో కూడినది, మనోల్లాసాన్ని కల్గిస్తుంది.


"జగతీమవతుం కలితా కృతయో 

విచరంతి మహామహసః ఛలతః 

అహిమాం శురివాత్ర విభాసి గురో 

భవ శంకరదేశిక మే శరణం"


మహామహన్ అనగా పెద్ద జ్యోతి, అది అందరినీ అనుగ్రహిస్తుంది. చెడ్డ దారిలో జనులు వెళ్ళకుండా అట్టి జ్యోతిస్సులు మానవాకారం ధరించి యుంటాయి. కనుక మహాన్. ఛలతః = ఒక మిషతో నిజరూపాన్ని కప్పుకొని వస్తారు. అట్టివారు మానవాకారంలో రావడం మనలను మోసగించడం కాదా? అసలు వారికీ వేషంతో పనేమి? తీర్ధయాత్రలవల్ల వారికేమి లాభం? అయినా చేస్తారు. ఇదంతా ప్రజలకు మోసంగా కనబడడం లేదా?


వారు నక్షత్రాలు, గ్రహాలూ తిరుగుతున్నట్లుగా తిరుగుతూ ఉంటారు. అయితే సూర్యుడుదయిస్తే నక్షత్రాల కాంతి వెలవెలబోవడం లేదా? అట్లా వెలవెల పోకుండా వెలిగే వాటిల్లో మీరు సూర్యుని వంటివారని పొగడ్త. 


Tuesday 25 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 231 వ భాగం



తోటకుడు గురుభక్తి


భావాద్వైతం కాని, క్రియాద్వైతం కాదని శంకరులన్నారు. అయితే ప్రతిదానిపట్లా భావాద్వైతం కుదరదు. ఎక్కడ? "అద్వైతం త్రిములోకేషు" అని ఉంది. మూడు భువనాలలోనూ భావాద్వైతం ఉండాలి. అయితే గురువు పట్ల మాత్రం తానూ, గురువూ ఒకటని భావించకూడదు.


"నాద్వైతం గురుణా సహ" (న+అద్వైతం=నాద్వైతం)


తానూ, భగవానుడూ ఒక్కటే అనుకోవచ్చు. అంతేనే కాని, నేనూ, గురువూ ఒకటని భావించకూడదు. గురువుని తనకంటే భిన్నంగా, గొప్పగా చూడాలి. గురువుతో ఇట్లా అనాలని అమ్మవారే చెప్పింది. మీరు వేరు, నేను వేరు, మీరు పాలకులు, నేను సేవకుణ్ణి, మీరు సముద్రం- నేనొక నీటి బిందువును అని అతణ్ణి సేవించాలని ఉంది.


తోటకునికి తల్లిదండ్రులు ఆ పేరు పెట్టలేదు. ఇతని అసలు పేరు ఆనందగిరి. పైకి మూర్ఖునిలా కనబడేవాడు. శంకరుల చుట్టూ ఆరువేల మంది శిష్యులుండేవారు. వారికి పాఠాలను చెబుతూ ఉండేవారు. శిష్యులు చాలా తెలివైనవారు. ఆచార్యులు చెప్పింది శ్రద్ధగా విని అపుడపుడు సందేహ నివృత్తి చేసుకునేవారు. ఇతడేనాడూ గురువుని సందేహాలు అడుగలేదు. అందుచేత ఇతనిని మందబుద్ధిగా మిగతా శిష్యులు భావించారు. ఒకనాడు ఇతడు పాఠానికి రావడం ఆలస్యమైంది. శంకరులు ఏడితడని ప్రశ్నించారు. అతని కోసం వేచియుండడం దండుగని, వచ్చినా, రాకపోయినా ఒక్కటే అని మిగిలిన శిష్యులు అన్నారు.


శిష్యులలో గర్వం పనికిరాదని, వారికొక గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఆపైన ఇతనిపై వారికొక అపారమైన దయ యుండేది.


Monday 24 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 230 వ భాగం



ఆ పిల్లవాడితో నీ పేరేమిటని ఎక్కడ ఉంటున్నావని అడిగారు శంకరులు. సంవత్సరాలు తరబడి నోరు విప్పనివాడు, "అంతా ఒక్కటైనపుడు ఎవరని చెప్పను? అంతా కలయై యుండగా ఒక ప్రదేశాన్ని ఎట్లా పేర్కొనగలను? కలనుండి మెలకువ వచ్చిన తరువాత కలలో చూసిన ఏ ప్రదేశాన్ని పేర్కొనాలి? అంటూ ఒక శ్లోకరూపంలో "నేను మానవుడుగాను, యక్షుణ్ణిగాను, నాల్గు వర్ణాలలో దేనికీ చెందను. నాల్గు ఆశ్రమాలలో చేరను. నేను నిజబోధ రూపుణ్ణి అనగా ఆత్మజ్ఞాన స్వరూపాన్ని" అని సమాధానం ఇచ్చాడు.


తండ్రి, తన పిల్లవాడు మాట్లాడుతున్నాడని సంతోషించి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటి దగ్గర మళ్ళీ మాట్లాడడం మానేసి ఉన్నాడు. మరల పూర్వధోరణిలో ఇతడుండడాన్ని గమనించి అయ్యా! ఇతడు నా కొడుకు కాదు, మీవాడే అని శంకరులకు అప్పగించాడు. ఇతనికి హస్తామలకుడని శంకరులు నామ కరణం చేశారు.


ఏదైనా పెద్ద పండును చేతిలో పెడితే దాని సమగ్ర స్వరూపం కనబడకపోవచ్చు గాని, ఒక ఉసిరికను పెడితే స్పష్టంగా దాని సమగ్ర స్వరూపాన్ని చూడగలం. గుండ్రంగా ఉంటుంది. నిమ్మకాయ కంటె స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా, సమగ్రంగా తెలిసికొన్నదానిని హస్తామలకంలా ఉంది అని అంటాం. ఆత్మ స్వరూపాన్ని సమగ్రంగా అర్థం చేసుకొన్నవాడని ఆ పేరు పెట్టారు. ఇతడి శ్లోకాలపై గురువులే భాష్యం వ్రాసేరు.


పూరీ జగన్నాథ క్షేత్రంలో ఉన్న మఠంలో పీఠాధిపతిగా ఉంచారు. ద్వారకలో ఉంచారని కొందరి అభిప్రాయం.


Sunday 23 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 229 వ భాగం


హస్తామలకుడు మౌన జ్ఞాని


శంకరుల ముఖ్య శిష్యులలో హస్తామలకుడొకడు. శిష్యుడని విడిగా చూడడం సబబు కాదు. శంకరులను, శిష్యులను విడదీయడమా? వారు నల్గురు శిష్యులతో అవతరించారని ఉంది కదా! కాని గురు శిష్య సంబంధం ఉంటుంది కనుక విడివిడిగా వీరిని గురించి ముచ్చటించుకుంటున్నాం. శంకరులు యాత్ర చేస్తూ ఉన్న సమయంలో పశ్చిమ తీరానికి చెందిన శ్రీబలిలో ఇతట్టి చూసారు. వయస్సు వచ్చినా ఎట్టి జ్ఞానమూ అబ్బలేదు.


చెవిటి, మూగ బాలునిగా ఉండేవాడు. తండ్రి, ఇతణ్ణి తీర్చి దిద్దండని శంకరులను వేడుకున్నాడు. ఇతణ్ణి జడుడని అన్నాడు. బ్రహ్మ జ్ఞాని కూడా జడునిగానే యుంటాడు. కాని ఇతణ్ణి జ్ఞానిగా శంకరులు గుర్తించారు.


గొప్ప జ్ఞానికి, గొప్ప అజ్ఞానికి భేదం తెలియదు. అజ్ఞానికి బుద్ధి పని చేయదు. ఒక మూర్ఖునిలా ఉంటాడు. కొందరు సాధువులు కూడా ఉంటారు. జ్ఞాని కూడా ఒక్కొక్కప్పుడు గెంతుతాడు, చప్పట్లు కొడతాడు. ఒకనికి బుద్ధి పనిచేసినా నాస్తికుడై యుంటాడు. అతడొక రకం అజ్ఞాని. తిరువణ్ణామలైలో శేషాద్రిస్వామియనే జ్ఞాని యుండేవాడు. అతడు వచ్చేవారిపై రాళ్ళు విసిరేవాడు. - దీనిని ఆశీర్వచనంగా జనులు భావించేవారు, బుద్ధిలేనివాడొకడుండగా, బుద్ధిని అణచినవాడొకడు, గెంటివేసిన వాడొకడుంటారు.  


కాని పిచ్చివాళ్ళకు, మూర్ఖులకు మానిసిక క్షోభ ఉంటుంది. కాని జడునిగా కన్పించే జ్ఞానికి చిత్తశాంతి యుంటుంది. ఎప్పుడూ ఆనందంతో ఉంటాడు. ఇక నాస్తికుడైన అజ్ఞానికి మనమేదైనా హాని తలబెడితే నూరు రెట్లు మనకు హాని చేస్తాడు. కాని జ్ఞానిని, వాతలు పెట్టినా చిరునవ్వుతో మనలనాశీర్వదిస్తాడు. హానిలోనూ ఆనందాన్ని ప్రకటిస్తాడు. అతడు పిచ్చివానిగా, జడునిగా, మూర్ఖునిగా, నాస్తికునిగా పైకి కన్పిస్తాడు.


Friday 21 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 228 వ భాగం



పద్మపాదుని పంచపాదిక


ఇతడు శంకరుల శారీరక భాష్యంపై వివరిస్తూ పంచపాదికను వ్రాసి తీర్థయాత్రలు చేస్తూ రామేశ్వరానికి చేరుకున్నారు. తనతో బాటు తన గ్రంథాన్ని తీసుకొని వెళ్ళాడు. యాత్రలో జంబుకేశ్వరంలో అతని మేనమామ ఇంట్లో బస చేసాడు. అక్కడ పుస్తకాన్నుంచి తిరిగి వచ్చేటపుడు తీసుకుందామని భావించాడు. ఇతడు లేనపుడు ఇతని మేనమామ ఈ గ్రంథాన్ని చదివి, తాను గొప్ప మీమాంసకుడవడం వల్ల తన సిద్ధాంతానికి ఈ పుస్తకం చేటు తీసుకొని వస్తుందని తనకున్న రెండు ఇండ్లల్లోని పాడైపోయిన ఇంటిలో దీనినుంచి ఇంటిని తగులబెట్టాడు. (తిరిగి వచ్చి మరల వ్రాయకుండా ఉండడం కోసం మేనమామ ఇతనికి విషం ఇచ్చాడనే కథ కూడా కొన్ని శంకర విజయాలలో ఉంది.)


పద్మపాదుడు తిరిగి వచ్చాడు. తీరా చూస్తే పుస్తకం కాలిపోయింది. '


ఇదంతా సురేశ్వరులను శంకించడం వల్ల శంకరులీ శిక్షను వేసారేమో! జరిగిన కథను శంకరులకు నివేదించాడు.


నీవింతవరకూ మొదటి అధ్యాయంలోని నాల్గు భాగాలను, రెండవ అధ్యాయంలోని మొదటి భాగాన్ని వినిపించావు. అది నాకు గుర్తుంది. తిరిగి వ్రాసుకో, దీనినే ప్రచారం చేయమని అన్నారు. విన్నదంతా తిరిగి చెప్పారు. వారి స్మరణ శక్తి ఎట్టిదో కదా!


సూత్రభాష్యం యొక్క మొదటి ఐదు భాగాలకు ఇది భాష్యం కనుక దీనికి పంచపాదిక అనే మాట వచ్చింది. బ్రహ్మ సూత్రాలలో మొదటి అధ్యాయానికి చెందిన నాల్గు సూత్రాలకే ఇతని వ్యాఖ్యానం మిగిలింది.


ఇతణ్ణి పీఠాధిపతిగా నియమించి యుంటారు. కొందరు ద్వారక మఠానికని, మరికొందరు పూరీ జగన్నాథ మఠానికని అనగా, మార్కండేయ సంహితలో ఆనందగిరీయంలో శృంగేరి మఠానికి ఆచార్యునిగా నియమించినట్లుంది.


Thursday 20 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 227 వ భాగం



కొంతకాలం తరువాత వీరు శంకరులను సమీపించి అయ్యా! మీకు గురుదక్షిణ ఈయాలనుకుంటున్నానంటూ ఒక తాళపత్ర సంపుటిని వీరి ముందుంచారు. అదే నైష్కర్మ సిద్ధియనే గ్రంథం అది నిష్క్రియత్వాన్ని చెప్పే గ్రంథం, అనగా మోక్షాన్ని చెప్పేది. శంకరుల సంకల్పం వీరిలో ప్రవేశించి వ్రాయించి ఉండవచ్చు.


సురేశ్వరులకు ఆ విధంగా ఆటంకం వచ్చి శారీరక సూత్రాల వార్షికం వ్రాసి యుండకపోవచ్చు. కాని శంకరులు రెండు ఉపనిషత్ భాష్యాలకు వార్షికం వ్రాసేరు. తైత్తిరీయము అనేది; కృష్ణ యజుర్వేదానికి చెందింది. బృహదారణ్యకం శుక్ల యజుర్వేదానికి చెందింది. దక్షిణాదిన ఎక్కువగా కృష్ణయజుర్వేదం ఉత్తరాది శుక్ల యజుర్వేదం వాడుకలో ఉన్నాయి. శంకరుల దక్షిణామూర్తి శ్లోకాలపైన మానసోల్లాసం వ్రాసేరు.


కంచి, శృంగేరి, ద్వారక మఠాలవారు సురేశ్వరులను ఆచార్య పరంపరలో చేర్చారు. సురేశ్వరులకు పీఠాధిపత్యానికి అర్హత ఉన్నా, సర్వజ్~ణాత్ముడనే బ్రహ్మచారి, శాస్త్ర సంబంధ విషయాలను చూస్తూ ఉండేవాడు. సురేశ్వరులు సిద్ధి పొందిన తరువాత ఇతడు పీఠాధిపతి అయ్యాడు.


సురేశ్వరులను అన్ని మఠాలకు ప్రధాన వ్యక్తిగా, పర్యవేక్షకునిగా నియమించి ఉంటారు.


ఎందుకిట్లా వీరికి ప్రాధాన్యం ఇచ్చి యుంటారు? పూర్వాశ్రమంలో గొప్ప మీమాంసకులు, వయస్సులో, విద్యలో అందరికంటే పెద్దవారు సంపదనంతటినీ త్యాగం చేసి వచ్చినవారు. కనుక వారికి తగిన స్థానం ఈయాలని పై మూడు మఠాలపై పర్యవేక్షణ చేసే బాధ్యతను వీరికి అప్పగించి యుంటారు. వారి తరపున బ్రహ్మచారిని నియమించి యుండవచ్చు. 


మఠాధిపతికి కొన్ని లౌకిక కార్యకలాపాలు ఉంటాయి. అంటే నిత్య కృత్యంలో కార్యకలాపాలు జరగాలి, వాటిని చూసే సురేశ్వరులకు బాధ్యత అట్లా ఉంచగా, వైదిక కార్యకలాపాలకు బ్రహ్మచారియై వచ్చిన సర్వజ్ఞాత్మునకు పీఠాధితిపత్యాన్ని ఇచ్చి యుంటారు. బ్రహ్మచారియై తరువాత సన్న్యాసించిన వ్యక్తిపై ఎక్కువ పూజ్యభావంతో జనులు చూస్తారు.


కంచిలో ఒక వీధికి మండన మిశ్ర అగ్రహారం అనే నామం ఉంది. వీరికి ఆశ్రమ స్వీకారానికి ముందు జరిగియుంటుంది. మాహిష్మతి నుండి రెండు వందల బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడకు వచ్చాయని యుంటారు.


Wednesday 19 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 226 వ భాగం



ఐదు ప్రధాన మఠాలను, ఇంకా చిన్న మఠాలను శంకరులు స్థాపించారని ఉన్నా రామేశ్వరంలో ప్రధాన మఠాన్ని స్థాపించకుండా చిన్న మఠాన్ని స్ధాపించారు. మహమ్మదీయుల దండయాత్రలో చిన్నమఠాలు ధ్వంసమైపోయాయి. ప్రధాన మఠాలకు వీరి తాకిడియున్నా అవి పూర్తిగా అదృశ్యం కాలేదు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించారు. లేదా ఆ మఠాలను కొంతకాలం మూసి యుండవచ్చు. మన కంచి మఠాన్ని ఉడయార్ పాలయానికి, తరువాత కుంభకోణానికి మార్చారు. జోషీ మఠాన్ని (బదరి) కూడా కొంతకాలం మూసియుంచి తరువాత తెరిచారు.


రామేశ్వరంలో ప్రధాన మఠమే కనుక ఉంటే అది కనుమరుగైన పరిస్థితి యుండేది కాదు. అందువల్ల శృంగేరిలోనిదే ప్రధాన మఠంగా పరిగణింప బడింది. అయితే దీనిని తమ యూహ ప్రకారం ఏర్పాటు చేయలేదు. అదంతా దైవికంగా జరిగింది. విద్యా దేవతయే ఇక్కడ మఠాన్ని నెలకొల్పునట్లు చేసింది. ఈ మఠానికి ప్రత్యేక క్షేత్రం, రామక్షేత్రం అనగా 

రామేశ్వరమే. కంచి ప్రపంచానికి నాభి వంటిది కనుక అక్కడొక మఠాన్ని స్థాపించారు. ఇవి ప్రధానమైనవి. శారదా సంకల్పానుగుణంగా శారదా మఠం ఏర్పడింది.


సురేశ్వరుల ప్రత్యేక వ్యక్తిత్వం


మానవ స్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. శంకరుల శిష్యులు, సురేశ్వరునే శంకించారు. శంకరుల శారీరక భాష్యానికి వివరణ వ్రాసే సురేశ్వరులు గురించి శంకరులతో శిష్యులు "అతడు పూర్వాశ్రమంలో గొప్ప మీమాంసకుడు కదా, మీ చేత ఓడింపబడ్డాడు. తప్పనిసరై మీకు శిష్యుడు కావలసి వచ్చింది. అతడు, అద్వైత వేదాంతాన్ని హృదయ పూర్వకంగా తమ రచనలలో ప్రతిపాదిస్తాడంటారా? మీ మాదిరిగా బ్రహ్మచర్యం నుండి ఆశ్రమ స్వీకారం చేయలేదు కదా. అతనికి తత్త్వం ఒంటబట్టిందా? సిద్ధాంతానికి చేటు తీసుకొని వస్తాడేమో!" అని గొణిగి యుంటారు. సురేశ్వరులు వీరి హావభావాలను చూసి వ్రాయడానికి పూనుకోలేదు.


Tuesday 18 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 225 వ భాగం



శృంగేరి యొక్క గొప్పదనం


ప్రయాణం సాగిస్తూ తుంగభద్రా నదీతీరంలోని శృంగేరికి చేరుకున్నారు. అక్కడ ప్రసవించే కప్ప పై ఎండ తగలకుండా ఉండడం కోసం పాము పడగనెత్తిన దృశ్యాన్ని చూసారు. పాముకి, కప్పకు సహజ వైరం. కాని ఇక్కడ రక్షిస్తోందేమిటి? ఇది పరమసాత్వికమైన, మహనీయమైన స్థలమని భావించారు. ఇంతలో అందెల చప్పుడు వినబడడం లేదు. శంకరులు వెనుదిరిగి చూసారు.


అక్కడ ఇసుక తిన్నెలలో సరస్వతి పాదాలు చిక్కుకోవడంచే అందెల చప్పుడు వినబడలేదు. ఏది జరిగినా మన మంచికోసమే అంటూ అక్కడే శారదా పీఠాన్ని స్థాపించారు.


వారక్కడ చాలాకాలముండి అమ్మవారిని అర్చించారు. మొదటి 16 సంవత్సరాల వయస్సులో గ్రంథాలన్నిటినీ వ్రాసేరు. మిగిలిన 16 సంవత్సరాలలో దేశాన్ని ముమ్మారు పర్యటించి అనేక ఘన కార్యాలు చేసారు. చాలాకాలం శృంగేరిలోనున్నట్లు శంకర విజయం చెబుతోంది.


శృంగేరీ మఠ ప్రత్యేకత


మిగిలిన మఠాలు, తామెక్కడ స్థాపించాలో ఊహించి ఏర్పాటు చేయబడినవి. భారతదేశంలో నాల్గు మూలలా నాల్గు క్షేత్రాలున్నాయి. వీటిని 'చార్ధామ్' అంటారు. ఉత్తరంలో బద్రీనాథ్, పడమర తీరాన ద్వారకానాథం (సోమనాథం); తూర్పున పూరీలో జగన్నాథం, దక్షిణాన రామనాథం (రామేశ్వరం) వీటిల్లో బదరి, ద్వారక, పూరీ క్షేత్రాలలో మూడు ప్రధాన మఠాలను స్థాపించారు.


Monday 17 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 224 వ భాగం



తన భర్త ఓడిపోయాడని ప్రత్యక్షంగా చెప్పకుండా ఇద్దరూ నా భిక్షను స్వీకరించండని గడుసుగా చెప్పింది. ఇద్దరికీ నమస్కరించింది.


భోజనానికి రండని గృహస్థు ఇతరులను పిలవకూడదు. వైశ్వదేవానికో, లేదా దేవతార్చనకో దయ చేయండని అనాలి. మండనుడు ఓడినట్లు సున్నితంగా చెప్పినట్లైంది.


ఏ భార్యయైన తన భర్త, సన్న్యాసం పుచ్చుకుంటున్నాడంటే సహించగలదా? కాని సరసవాణి, ఇంత వరకు యజ్ఞ పత్నిగా ఉంది. ఆమెకు అలౌకిక శక్తి యుంది. కనుకనే 21 రోజులు, పూలమాల వాడిపోకుండా ఉండగలిగి ఉంది. ఆమె ఉభయ భారతిగా ఇప్పుడు ప్రసిద్ధిని పొందింది. ఆమె సరస్వతి యొక్క అవతారమే కదా!


మండనుడు సన్న్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులైనారు. బ్రహ్మలోకానికి, తిరిగి సరసవాణి వెళ్ళాలనుకుంది.


ఇట్లా వెళ్ళిపోతే ఎలా అమ్మా! నీవిక్కడే ఉండి అందరికీ జ్ఞానాన్ని, బుద్ధిని కలిగించాలని నవదుర్గా మంత్రంలో ఆమెను శంకరులు బంధించారు. ఆ మంత్రానికి లొంగినట్లు కనబడింది. అట్లా భక్తి ప్రేమ పాశాలతో శంకరులామెను బంధించగలిగారు.


అయితే నన్నిక్కడ ప్రతిష్ఠించవద్దని, నీవు దేశం తిరుగుతూ ఉండమని, వెనుదిరిగి చూడవద్దని చూస్తే అక్కడే ఉండిపోతానని ఆమె అనడం, శారదా పీఠాన్ని శంకరులేర్పాటు చేయడం మొదలైన కథ మనకు తెలిసిందే అయినా చెబుతున్నాను. వెను దిరిగి చూడకుండా నడుస్తున్నారు. ఆమె అందెల గలగల, వినబడుతూనే ఉంది.


Sunday 16 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 223 వ భాగం



ఇక వాదానికి కూర్చున్నారు. మధ్యవర్తి ఉండాలి కాబట్టి ఇతని భార్యయైన సరసవాణియే మధ్యవర్తినిగా ఉంచారు. మండనుడు, బ్రహ్మయని, ఆమె సరస్వతీయని శంకరులకు తెలుసు. కనుక సరస్వతి మాట శిరోధార్యమే. తన భర్త ఓడిపోయాడన్నా తనకి ఇబ్బందియే, సన్న్యాసి గెలిచాడని గట్టిగా చెప్పగలదా? వారిద్దరి మెడలలో పూలమాలికలను వేసి ఏది వాడిపోతే అతడోడినట్లని నిర్ణయించింది.  

శంకరులు ఓడిపోతే మరల గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని, మండనుడు ఓడిపోతే సన్యాసం పుచ్చుకోవాలని నియమం పెట్టుకున్నారు. వాదం మొదలైంది. రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా 21 రోజులు చర్చ జరిగింది.


శంకరులు అద్వైతాన్ని ప్రతిపాదించారు. కొన్ని వేద మంత్రాలను ఆధారంగా వీరిని ఖండించడం సబబు కాదు. ఎవడగ్నులను ఆరాధించకుండా ఉంటాదో అతనికి వీరహత్యాదోషం వస్తుందనే తైత్తిరీయ మంత్రాన్ని వీరిపట్ల అన్వయించకూడదు. ఎవడు వైదిక కర్మలను విడిచిపెట్టాడో అట్టివానికి ఆ మంత్రం అన్వయిస్తుంది. అట్టివారిని కర్తవ్యోన్ముఖ్యులను చేయడం కోసం అట్టి మంత్రాలున్నాయి. ఇక నివృత్తి మార్గంలో శంకరులు ఉన్నారు. బాహ్యమైన అగ్నిని విడిచి జ్ఞానాగ్నితో నిరంతరం వెలుగొందుతూ ఉన్నారు. ఒక పచ్చి కాయ, పండు కావడం రంగు రుచి మారడం జరిగి పక్వమైన తరువాత క్రిందబడితే మరల చెట్టునకు తగిలిస్తారా? అదేవిధంగా, జ్ఞానం పండేదాకా కర్మలు చేస్తూ ఉండవలసిందే. పండు పక్వానికి (పూర్తిజ్ఞానం) వచ్చిన తరువాత కర్మలు తమంత తామే తొలగిపోతాయి. ఇట్టి జ్ఞానం కలిగినవారు అన్నిటినీ సమంగా చూడగలరు. ప్రేమతో చూస్తారు. తరువాత నిష్క్రియులై యుంటారు. సర్వభూతములు, తననుండి భయం లేకుండా ఉండుగాక అని వారు ప్రైష మంత్రాన్ని పలికినవారు కదా.


మండునుడు అద్వైతాన్ని పూర్తిగా అంగీకరించాడు. ఇతని మెడలో పూలమాల వాడిపోయింది. ఇక ఇతనిలో సగభాగమైన ఆమె ఊరుకొంటుందా? ఆమె కూడా అంగీకరించింది. తల ఒగ్గింది. ఆమె అంగీకరించడం ఎటువంటి దంటే వసిష్ఠుడు తనను బ్రహ్మర్షియని పిలవాలని విశ్వామిత్రుడన్నట్లుగా భావించాలి.


శంకరులు, సర్వజ్ఞ పీఠారోహణం చేసినపుడు సరస్వతి ప్రత్యక్షమై వీరిని సర్వజ్ఞులని చెప్పినట్లున్న కథ కూడా ఉంది.


Saturday 15 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 222 వ భాగం



ఇతనికి ఉపదేశించాలని శంకరులు వెళ్ళారు. ఆనాటి కాలంలో కల్లుగీత గీసేవారికి ఒక విద్య తెలుసు. కొబ్బరి చెట్టు మొదట్లో ఒక మంత్రం చదివితే వెంటనే చెట్టు నేలకొరిగేదట. కొబ్బరికాయలను, కల్లును అట్లా సులభంగా తీసుకునేవారు. మరొక మంత్రం చదివితే లేచి నిలబడేదట.


మండనుల ఇంట్లో కొబ్బరి చెట్టు ఒకటుండేదని, ఆ వీధిలో పోతున్న కల్లుగీత గీసేవాడిని తనకా విద్య నేర్పమని అడిగారని, దానినతడు నేర్పాడని, మండన మిశ్రుల ఇంట్లో వాలేరని ఒక కథ ప్రచారంలో ఉంది. యోగశక్తి ద్వారా ప్రవేశించారని మరొక కథ.


శ్రాద్ధంలో భోక్తలుగా జైమిని మహర్షి, వ్యాసాచార్యులున్నారు. పరీక్షిత్తు ఎంత జాగరూకత వహించినా తక్షకుడు నిమ్మకాయలో దూరలేదా? అట్లాగే శంకరులూ ప్రవేశించారు. తక్షకుడు విషం కక్కడానికి వెడితే, శంకరులు అమృతాన్ని పంచడం కోసం వెళ్ళారు.


ఓ సన్యాసీ ఎక్కణ్ణుంచి వచ్చావని శ్లేషతో కూడిన ప్రశ్నలు, శంకరుల సమాధానాలు అయ్యాయి. శ్రాద్ధంలో విష్ణుస్థానంలో సన్న్యాసిని నియమించవచ్చని జైమిని, వ్యాసులన్నారు. భిక్ష స్వీకరింపుమని మండనుడు అన్నాడు.


నేను కేవలం భిక్ష కోసం రాలేదు. నాకు కావలసింది వాద భిక్ష, కుమారిలుడు పంపగా వచ్చానన్నారు. ముందీ భిక్షను గ్రహించండని తరువాత వాద భిక్షయని అన్నాడు మండనుడు.

Friday 14 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 221 వ భాగం



సరియైన జ్ఞానాన్ని 'ప్రమ' అని అంటారు. తప్పైన జ్ఞానాన్ని 'భ్రమ' అని అంటారు. భ్రమ తప్పైనా ఆ సమయంలో అది నిజమే అనిపిస్తుంది. ప్రమాణంగా కన్పిస్తుంది. కాని ఆలోచిస్తే అది భ్రమ అని తెలిసి అప్రమాణమై పోతుంది.


ఒక వస్తువు కనబడితే ఇది తప్పా? లేక ఒప్పా అని తెలుస్తుంది. రెండు భిన్న వస్తువులను చూసినపుడు అది వేరు, ఇది వేరని మొదట కలుగుతుంది. వెంటనే అది నిజం అనే మరొక జ్ఞానం కలుగుతోంది. ఒక చెట్టును చూసాం. ఇది చెట్టే, నిజం అనే రెండవ జ్ఞానం కల్గుతోంది. ఈ రెండవ జ్ఞానానికి చెట్టును చూడడం కారణమా? లేక మరొక దానివల్ల ఇది కల్గుతోందా? చెట్టును చూడడమే రెండవ జ్ఞానానికి కారణమనేవారు స్వతః ప్రమాణవాదులు, అట్లా కాదు. వేరొక దాని వల్ల ఈ రెండవ జ్ఞానం ఏర్పడుతుందని చెప్పేవారు. పరతః ప్రమాణవాదులని సారాంశం.


(ఒక జ్ఞానం యొక్క యథార్ధాన్ని రుజువు పరచడానికి పర ప్రమాణం కావలసి వస్తుందని ఇది అంతు పట్టదని మీమాంసకులు లేవనెత్తి వేదం యొక్క ప్రామాణాన్ని సాధించడం కోసం ఈ చర్చ సాగింది. శబ్దం, స్వతః ప్రమాణమైతే శబ్ద రూపమైన వేదం యొక్క ప్రామాణికతను ప్రశ్నింపతగదని; శబ్దం పరతః ప్రమాణమైతే వేదాలయొక్క ప్రామాణ్యాన్ని సాధించడం కోసం ఈశ్వరుడు వీటి కర్తయని చెప్పాలని, రెండు వాదాలు. మొదట దీనిని స్థాపించినవారు మీమాంసకులు. వేదం తనంతట తానే ప్రమాణమనేవారు. ఈశ్వరుడు కర్త అవడం వల్ల ఇవి ప్రమాణములని చెప్పేది నైయీయికమతం - అనువక్త)


మండనులను, సరసవాణిని ఓడించుట


కుమారిలుడు ప్రతివాదులను గౌరవించునట్లుగా మండనుడు స్వాగతం పలుకలేదు. అసలు సన్న్యాసులంటే ఇష్టపడడు. వారు వేద కర్మలను విడిచారని కోపం. వీరిని చూడడమే పాపమని భావించేవాడు. పిలువకుండా శంకరులు అతని ఇంటికి వెళ్ళారు. ఆనాడతని ఇంట్లో శ్రాద్ధకర్మ, ఆనాడు సన్యాసులను చూడడం మహాపాపమని భావించాడు. ఇంటి తలుపులు మూసేసి యున్నాయి.


Thursday 13 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 220 వ భాగం



మండన మిశ్రుల ప్రాంతం- పండితుల నిలయం


కర్మ మార్గంలో బద్ధులైన వారిని ఉద్దరించడం కోసం, దయతో వారితో వాదించడం కోసం శంకరులు బయలుదేరారు. మాహిష్మతీ నగరంలో మండనమిత్రుల ఇంటిని వెదుకుతూ ఉండగా కొంతమంది స్త్రీలు నీళ్ళ బిందెలతో కనబడ్డారు. మండనుల ఇల్లు ఎక్కడ? అనగా వారు శ్లోకరూపంలో సమాధానం ఇచ్చారు:


"స్వతః ప్రమాణం పరతః ప్రమాణం

కీరాంగనా యత్ర గిరం గిరంతి

ద్వారస్థ నీడాంతర సంనిరుద్దా

జానీ హి తన్మండన పండి తౌకః" 


అనగా ఏ ఇంటి ద్వారంలో పంజరాలలో నున్న చిలుకలు, వేదం స్వతః ప్రమాణమా? పరతః ప్రమాణమా అని వాదిస్తూ ఉంటాయో అదే వారిల్లని సమాధానం చెప్పారు. చూసారా? న్యాయ మీమాంసపరిచయం స్త్రీలకు, తుదకు పక్షులకు కూడా ఆనాడుండేదని తెలియడం లేదా? 


ఇది ఆనంద గిరియంలో ఉన్న శ్లోకం. స్వతః ప్రామాణ్యవాదం, పరతః ప్రామాణ్యవాదం అని ప్రామాణ్య వాదం రెండు రకాలుగా ఉంటుంది.


ఒక వస్తువును చూస్తే మనకు కలిగిన జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సరియైనదని, రెండవది కాదని తెలుస్తుంది. ఒక తగరపు చిప్పపై సూర్యకాంతి పడిందనుకోండి. అది వెండిలా కనిపిస్తుంది. కాని అది తగరపు చిప్పయని తెలుసు. మన బుద్ధి, ముందు వెండిదని చెప్పినా అట్టి బుద్ధి ప్రమాణం కాదని తెలుస్తుంది. వెండి పాత్ర, వెండి పాత్రయే. తగరపు చిప్ప, తగరపు చిప్పయే అని తెలిసి కొనుట ప్రమాణమవుతుంది.


Wednesday 12 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 219 వ భాగం



కుమారిలుడు శాంతించాడు. వీరి మాటలు, వీరి దర్శనం వల్ల, అతని తాపం తగ్గింది. అప్పర్ స్వామిని ఒక సున్నపు బట్టీలో శత్రువులు తోసివేస్తే ఈశ్వర పాదాలను ఆశ్రయించిన నాకు చల్లగా ఉందని అనలేదా? ఆ పాదాలే శంకరుల పాదాలు.


నేనెందుకు జ్ఞానమార్గాన్ని ఖండించానో మీకు తెలుసు. కర్మలను తుంగలో త్రొక్కిన బౌద్ధుల నెదిరించడం కోసం, కర్మ మార్గానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాను. నేనీ ప్రాయశ్చిత్త కర్మ చేసుకునేటపుడు, ఫలదాతయైన శంకరుడే వచ్చాడని భావిస్తున్నా. అయితే నా శిష్యుడు మీమాంసను బాగా వ్యాప్తి చేసి యజ్ఞ యాగాలను చేసినవాడు, మాహిష్మతీ నగరంలో ఉన్నాడు. అతణ్ణి నివృత్తి మార్గంలో త్రిప్పగలిగితే దిగ్విజయయాత్ర సఫలమౌతుందని కుమారిలుడన్నారు.


(హస్తినా పూర్ దగ్గరగా నున్న విద్యాలయంలో మండనుడున్నాడని కొందరు, మరొక చోటని కొందరు చెబుతారు. ఇతని శిష్యుడని కొందరు, బావ మఱది అని కొందరు వ్రాసేరు. వాటికేమి గాని, అందరూ అతడు మీమాంసకుడని అన్నారు అనువక్త).


సీతాదేవి ఆశీస్సులవల్ల హనుమంతుని తోకకు నిప్పంటించినా ఎట్లా చల్లగా ఉందో, శంకరుల సమక్షంలో కుమారిలుడంత చల్లదనాన్ని పొందాడు. అగ్ని రూపుడైన ఎవడు పరమశివుని నేత్రాగ్నినుండి సుబ్రహ్మణ్యుడై కుమారిలుడుగా అవతరించాడో, ఆ అవతారం ఆ అగ్నిలోనే లీనమై పోయింది. ధర్మశాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చూపించాడు. అట్టివారే మన మతానికి పునాదులని మరువకండి.


Tuesday 11 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 218 వ భాగం



'స్వకర్మణా తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః" (18-46) 


ఇది చిన్న స్థాయిలో ఒక సిద్ధి వంటిది. ఇక కర్మలను విడిచి జ్ఞాన విచారంలో గట్టిగా అడుగిడినపుడు అది మహాసిద్ధి మోక్షం ప్రాప్తిస్తుంది.


'నైష్కర్మ్య సిద్ధిం పరమం సన్న్యాసేన అధిగచ్ఛతి" (18-49) 


నైపుర్ణ్య సిద్ధియే పరమసిద్ధి. అది సన్న్యాసియైన వెనుక సిద్ధిస్తుందని అన్నాడు. కనుక పరిపక్వమనస్సు లేనివారు కర్మలను చేయాలన్నాడు. అదైనా శాస్త్రం ప్రకారం అన్నాడు. అంతేనే కాని కర్మలను చేయడమే అంతిమ లక్ష్యమని చెప్పలేదు. చిట్టచివరి దశలోనే అన్ని కర్మలనూ విడిచిపెట్టుట:


"ఆరురుక్షో మునేర్యోగం కర్మకారణ ముచ్యతే

యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే (6-3)


అన్ని కర్మలు, బ్రహ్మజ్ఞానికి సాధనంగా ఉండి అందులో లీనమై పోతాయి. 


"సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే" (4-33) 


జ్ఞానికి కర్మతో పని లేదు. 


"తస్య కర్మన విద్యతే" (3-17) అని సారాంశం గీతాచార్యుడందించాడు.


ఇట్లా కుమారిలునకు శంకరులు బోధ చేసారు. ఉపనిషత్తులలో కర్మయోగం ఉన్నా అదే అంతిమ లక్ష్యం కాదని అన్నారు. ఈశావాస్యం ఆరంభ మంత్రంలో జీవించిన వంద సంవత్సరాలు కర్మలు చేస్తూ ఉండాలని ఉంది. "జిజీవిషేత్" అని కూడా ఉంది. అంటే ప్రాపంచిక జీవితం కావాలనుకున్న వానికని అర్ధం. అంతేనే కాని నివృత్తి మార్గంలో ఉన్నవానికని కాదు. దీనితో శంకరులు ఏకీభవించారు. దీని వెనుక మంత్రంలో ఆత్మను, తెలుసుకొనలేనివాడు, అనగా జ్ఞాన మార్గాన్ని గుర్తించనివాడు, ఆత్మహత్య చేసుకున్నవానితో సమానమని ఉంది. తరువాత ఆత్మ గురించి అద్వైత ధోరణిలో వివరింప బడింది. కనుక జ్ఞాన మార్గానికి ముందు అనగా ప్రాథమిక దశలో కర్మమార్గం ఉంది.


కుమారిలునకు ఈ విధంగా శంకరులు ఉపదేశించారు. క్రియలలో మునిగినా, తన నిష్క్రియత్వ లక్ష్యాన్ని శాంత స్థితిని మరిచిపోలేదు. అది పనిచేస్తూ చేయని స్థితి. అది ఎట్టిదో వారి నడవడికవల్ల తెలుస్తుంది.


Monday 10 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 217 వ భాగం



"కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసాస్మరన్

ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే" (3-6)


కనుక అర్జునా! ప్రస్తుతం నీవు భ్రాంతిలో పడి యుద్ధ ధర్మం చేయనంటే, నీ సహజ గుణాలు నీ అదుపు లేకుండా నిన్ను కర్మవైపు లాగుతూ ఉంటాయి:


"స్వభావ జేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా 

కర్తుం నేచ్చసి యత్ మోహాత్ కరిష్యతి అవశోఽపితత్ (18-60)


అందువల్ల ప్రస్తుత దశలో కర్మలను విడిచిపెట్టకు. అయితే ఆ కర్మలను నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. శాస్త్ర ప్రకారం చేయాలి సుమా! ఏది చేయాలో శాస్త్రం చెబుతుంది:


"తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే" (16-24) 


నేను నీతో చెప్పేదేమంటే సంగ బుద్ధి లేకుండా ఫలాన్ని నాకర్పించు.


"తతః కురుష్వ మదర్పణం" (9-27) 


ఇట్లా చేస్తూ ఉంటే ఒకనాటికి పాపం నిన్ను అంటకుండా ఉంటుంది. తామరాకుపై నీటి బొట్టులా ఉండగలవు.


"లిప్యంతే నస పాపిన పద్మపత్రమి వాంభసా (5-10) 


ఇట్లా శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తి చేస్తూ ఉంటే అతనికి యోగ్యత లభిస్తుంది. జ్ఞానమార్గంలోకి అపుడు వెళ్ళగలదు. 


Sunday 9 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 216 వ భాగం



ఆ అద్వైత జ్ఞానం వచ్చే వరకూ భక్తితో ఉండాలని, ప్రేమ కలిగియుండాలని చివరకు ఇద్దరూ (జీవాత్మ పరమాత్మలు) ఒక్కటే అనే జ్ఞానం వస్తుందని వీరంటారు. మీమాంసలో ప్రేమతో కూడిన భక్తి లేకపోవడం ఒక లోపం. శరీరంతో పనులు చేస్తూ ప్రేమతో కూడిన మనస్సుంటే, చివరకు ఆ మనస్సే మటుమాయమై శాంతంతో కూడినపుడు ఆత్మ సాక్షాత్కారమని ఇట్లా సమగ్ర ప్రణాళికను అందించింది వేదాంతం. అదేమీ లేకుండా వట్టి కర్మలు చేసి ఏం ప్రయోజనం? జీవునకు పరిపూర్ణ తృప్తి ఎట్లా వస్తుంది?


కర్మ భక్తులతో స్వామిని ఆరాధించాలి. ఈ ప్రపంచాన్ని అతని స్వరూపంగా భావించాలి. సంఘానికి మేలు చేయాలి. ఇదంతా ఇతరుల కోసం చేస్తున్నామనే భావన పోయి ఆత్మోద్ధరణకై చేస్తున్నామనే భావన రావాలి. ఆ స్థితిలో నిష్క్రియత్వం. ఇది అభ్యాసం వల్ల గాని పట్టుబడదు. ఎంతవరకూ శరీరం, మనస్సు ఉందో అంతవరకూ జనన మరణాలు తప్పవు, ఆకారం, భావం లేనపుడు కర్మ ఏమిటి? ఫలాలేమిటి? సంసారంతో సంబంధమేమిటనే స్థితి ఏర్పడుతుంది. శాశ్వత సుఖం, మన లక్ష్యమని భావించవద్దా? కర్మలతో నిరంతరం మునిగిపోవడం చిత్తాందోళనలతో జీవితాన్ని చివరి కంటా గడపడమా? అని వేదాంతులు ప్రశ్నిస్తారు.


"మాతే సంగోస్తు అకర్మణీ" (2-47) అనగా కర్మలను చేయకపోవడంతో అనగా కర్మత్యాగంలో పట్టుదల వద్దు. ఇది ప్రాథమిక దశలో నున్న సాధకుణ్ణి ఉద్దేశించింది. అతడు పుట్టినప్పటి నుండి గిట్టేవరకూ భౌతిక సుఖాల కోసం చేస్తూనే ఉంటాడు. అట్టివానిని వెంటనే కర్మలు వద్దని చెబితే సాధ్యమా?


నేనన్నీ మానేస్తాను. జ్ఞానినౌతానంటే అది సాధ్యం కాదు. దానికి తగినంత బలం లేదు. ఎంతవరకూ దేహంతో సంబంధం ఉంటుందో అంతవరకూ పని చేయకుండా ఉండలేరని చెప్పింది గీత "నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణి అశేషతః" (18-11) శరీరం పనిచేస్తూ ఉండకపోయినా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. కనుక ఇంద్రియాలకు సుఖం ఉంటుంది. ఆ మనస్సు అణగలేదు. పైకి మాత్రం జ్ఞానిలా ఉంటూ లోలోపల మనస్సు, ఇంద్రియాల వెంట తిరుగుతూ ఉంటే ఇంతకంటె కపటి మరొకడు ఉంటాడా? అని గీత ప్రశ్నించింది.


Saturday 8 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 215 వ భాగం



శంకరుల ఉపదేశ సారాంశం: 


వేదాలలో చెప్పిన కర్మలను అనుసరించవలసిందే. దేనికోసం! చిత్తశుద్ధి కోసం. కేవలం అనుష్ఠానమే లక్ష్యమని మీమాంసకులంటారు. వారు పొందే స్వర్గాది సుఖాలు కూడా నిత్యం కావని, ఆత్మను తెలిసికోవడమే అంతిమ లక్ష్యమని శంకరులున్నారు.


వేదంలో చెప్పిన కర్మకాండకే మీమాంసకులు ప్రాధాన్యం ఇచ్చారుగాని అందలి జ్ఞాన కాండను తడమరు. అయితే అది ఎందుకుందని వారిని ప్రశ్నిస్తే వాటిని అర్ధవాదాలంటారు. అనగా వేదంలోని విధి నిషేధ వాక్యాలను బలపరచి బోధించడానికి నిందా రూపంలో గాని స్తుతి రూపంలోగాని చేసే వివరణ, అర్ధవాదం. అనగా స్తుతిగాని, నిందగాని యోజనంగాగల లౌకిక వాక్యం. జ్ఞాన కాండ గురించి వీరేమంటారంటే నీవు దేవుడవవుతావని, కర్మలను ప్రోత్సహించినట్లే ఆ మాటలుంటాయని అర్ధం చెబుతారు.


శంకరుల ఉపదేశ సారాంశం: శంకరులు కర్మలను కర్మల కొరకే చేయడం లేదని, స్వర్గాది సుఖాల కోసం చేస్తున్నారని అన్నారు. కర్మకాండ ఇది చేయి ఇవి చేయి అని అంటే, ఏది చేయకూడదో అది వద్దని జ్ఞానకాండ చెబుతోంది. వేదంలో సత్యం పలుకుమని విధి వాక్యం ఎట్లా ఉందో పరదార సంగమం వద్దనీ ఉంది. చేయకూడని వాటిని ఎట్లా చేయకుండా ఉంటున్నామో అనగా అక్కడ నిష్క్రియత్వం ఎట్లా ఉందో అట్లాగే చివరి దశలో అనగా జ్ఞాన దశలో నిష్క్రియంగా ఉండడమే అద్వైతలక్ష్యమని శంకరులన్నారు. ఆత్మ సుఖం కోసం అన్నిటినీ విడిచి పెట్టాలని వీరంటారు. అటువంటప్పుడు జ్ఞానకాండ, ఎట్లా అర్ధవాదమౌతుంది? కర్మవల్ల వచ్చే ఫలాన్ని, జ్ఞానం వల్ల వచ్చే ఫలాన్ని బేరీజు వేసుకోవద్దా? కర్మల వల్ల వచ్చే సుఖం తాత్కాలికం. జ్ఞానం వల్ల ఆత్మానందం కల్గుతుంది. అది శాశ్వతం. ముందుగా కర్మలను చిత్తశుద్ధికై చేయాలి. ఇది చిక్కిన తరువాత వాటిని విసర్జించాలని వేదాంతులంటారు.


ఆపైన మీమాంసకులు కర్మయే ఫలమిస్తుందని, దేవునితో నిమిత్తం లేదని అంటారు. ఈ సమస్త ప్రపంచం ఒక నియతితో సాగుతోందని, దీనిని నడిపేవాడున్నాడని, కర్మలకు తగిన ఫలమిస్తాడని వేదాంతులంటారు. కర్మ ఫలాలనాశించకుండా కర్మలను చేయాలని, ఫలాలను స్వామికి అర్పించాలని, చిత్తశుద్ధిని ప్రసాదింపుమని ప్రార్ధించాలని వేదాంతులంటారు.


Friday 7 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 214 వ భాగం



"పతన్ పతన్ సౌధత లాన్యరో రుహం

యది ప్రమాణం ప్రుతయో భవంతి 

జీవేయేమస్మిన్ పతితో సమస్ధలే 

మజ్జీవనే తచ్ఛృతి మాన్యతా గతిః"


అంత ఎత్తునుండి కింద పడినపుడు బ్రతికాడు కానీ కంటికి గాయం అయింది. ఎందుకిట్లో జరిగిందని కోపగించాడట. వేదాలే ప్రమాణమైతే అని శంకించావు. కిందపడి చనిపోలేదు. కాని కంటికి గాయం అయింది. నీలో సందేహం ఉంది కనుక ఇట్లా జరిగిందని అశరీరవాణి వినబడిందట.


విద్యాశాలలో తాను బౌద్ధుడనని గురువులను నమ్మించి మోసం చేసానని, అనగా గురు ద్రోహం చేసానని, దానికి తగిన ప్రాయశ్చిత్తం మండుతున్న ఊకలో పడి మరణించడమే మేలనుకొని అట్లా చేస్తున్న సమయంలో శంకరులు వెళ్ళారు. 


వీరి దర్శనం వల్ల ఆ మంటలో చల్లదనం అలముకుంది. అంతేకాదు వీరు జ్ఞానామృతాన్ని పంచి పెట్టారు, వెదజల్లారు కూడా. 


Thursday 6 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 213 వ భాగం



శంకరులు చూసినది, మనస్సును పోగొట్టుకొన్న రాగద్వేషాలు లేని అసాధారణ పంచముణ్ణి. కాబట్టి అట్టివానిని గురువని కీర్తించారు. జాతి భేదాన్ని వద్దని శంకరులు, ఈ మనీషా పంచకంలో ప్రవచించారని అనడం సాహసం.


విశ్వనాథుని లీల


ఇక పంచముడంతర్ధానమై విశ్వనాథుడు సాక్షాత్కరించాడు. ఆచార్యులను పరీక్షించడం కోసం శంకరుడట్లా వేషం వేసుకొని వచ్చాడు. శంకరులు జ్ఞానియైనా, ఇతరులకు ఆదర్శంగా ఉండడం కోసం కొన్ని ఆచారాలను పాటించాలని, ప్రపంచ వాసనల కతీతంగా ఉన్నవారి పట్ల వినయంతో ఉండాలని, తామాచార్యులమని భావించకూడదని, అటువంటి వారికి శిష్యులుగా భావించాలని తెలివిడి చేయడం కోసం అట్లా వచ్చాడు. ఆచార్యులు శంకరుణ్ణి స్తోత్రాలతో పూజించారు. ఆచార్యులను దీవించి శంకరుడు అదృశ్యుడయ్యాడు.


కుమారిల భట్టు వృత్తాంతము 


దిగ్విజయం చేయవలసినదిగా వ్యాసుడే శంకరులతో అన్నాడు. నివృత్తి మార్గంలో నున్న శంకరులు ప్రవృత్తి మార్గంలో ఉన్న కుమారిలుని ప్రదేశానికి వెళ్ళారు. ఆనందగిరీయంలో కుమారిలుడు అపుడు ప్రయాగలో ఉన్నాడు. అది రుద్రపురం అని యుంది.


కుమారిలుడు, అద్వైత వేదాంతాన్ని అంగీకరిస్తే తన అవతార ప్రయోజనం సిద్ధించినట్లే. కానీ అతడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడని విని వెళ్ళారు.


కుమారిలుడు బౌద్ధాన్ని ఖండించడం కోసం, వైదికునిగా వెడితే వారంగీకరించరని తాను బౌద్ధుడనని, తత్త్వం తెలిసికోవాలని బౌద్ధ విహార కేంద్రంలో ప్రవేశించాడు. అయితే అతడు వైదిక కర్మానుష్టానాలను రహస్యంగా చేస్తూ ఉండేవాడు. దీనిని బౌద్దులు పసిగట్టారు. ఇతణ్ణి భవనంలోని ఏడవ అంతస్తు నుండి త్రోసివేసారు. వేదాలే ప్రమాణమైతే తాను సురక్షితంగా బయట పదాలని అన్నారు.


Wednesday 5 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 212 వ భాగం



ఇతర దేశాలలో మన వంటి వర్ణ విభజన లేకపోవచ్చు. అయితే వారిలో ఐకమత్యం ఉందని చెప్పగలరా? సమానత్వం పేరు పెట్టినదగ్గరనుండి పరస్పర కలహాలు వస్తున్నాయి. సమానత్వం పేరుతో ఉద్యమాలున్నా పోటీ మనస్తత్వం ప్రబలిపోయి సంఘర్షణలకు దారితీస్తోంది.


వర్ణ విభజన యొక్క మౌలిక తత్త్వం పోయి గందరగోళ పరిస్థితులేర్పడినపుడు మరల దానిని శంకరులు పునరుద్ధరించారు. వాటి గోడలను బ్రద్దలు కొట్టాలని అనలేదు. ఈ మాటలు చెబితే ఇవి మీకు రుచింపకపోవచ్చు. బుద్ధుడు, గాంధీ మాదిరిగా చెబితే వారికీ బహుళ ప్రచారం లభించి యుండేది. అబ్బి పొగడ్తలను, ప్రచారాన్ని వారాశించలేదు.


శంకరులు చెప్పినదేమిటి? జ్ఞానావస్థలో ఉన్నవారికి అంతా సమానంగా కన్పిస్తుందని అన్నారు. జ్ఞానికి జాతి లేదు, ఎక్కువ తక్కువలు లేవు. తల్లి, తల్లి కాదు, తండ్రి తండ్రి కాదని చివరి దశలో నున్నవానికి వేదం చెప్పింది. ఫలానా కోరిక లేనివానికి దేనిని పడితే దానిని తినవచ్చని చెప్పింది. ఆ జ్ఞాని స్థితి ఎక్కడ? మనమెక్కడ? నూటికి 99 పాళ్ళు, అందరూ రాగద్వేషాలతో కూడి యున్నవారే. 


అందరి కార్యక్రమాలూ ఒకటని గీత చెప్పలేదు. నీవు క్షత్రియుడివి, నీ ధర్మం నీవు నిర్వర్తించమని ఎందుకన్నాడు? జాతి భేదం లేకపోతే ఇట్లా అంటాడా? మనం, ద్వంద్వ ప్రపంచంలో ఉన్నాం. ఇది నడవాలంటే ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించవలసిందే. అద్వైతానుభవాన్ని నిత్య వ్యవహారంలో చూపిస్తే ఎలా?


తామనుకొన్నవి శాస్త్రాలలో ఉన్నాయని, ఆధునికులు నిర్ణయానికి వస్తారు. ఏ సందర్భంలో అవి చెప్పబడ్డాయో అని విచారణ చేయరు.


ఆ పంచముడు, మామూలు వాడైతే శంకరులు ఇట్లా సమాధానం చెప్పి యుండేవారు. "నీవన్నట్లు రెండు శరీరాలు రక్త మాంసమయములే. లోనున్న చైతన్యమూ ఒక్కటే. అయితే లోనున్న దానిని చూడగలుగుతున్నావా? చూడలేవు. ఎందుకు చూడలేవు? గత జన్మ సంస్కారాలు చూడలేకుండా చేస్తున్నాయి. సంస్కారాలకనుగుణంగా జన్మనెత్తుతున్నావు. వచ్చిన జన్మకు అనుగుణంగా ప్రవర్తించి పాపాలను పోగొట్టుకో. నీవు చూడలేనట్లే అందరూ చూడలేకపోతున్నారు. వారి వారి కర్మలను చేస్తూ చిత్త శుద్ధిని పొందగలిగితే చూస్తారు. మానసికంగా అందరూ ఒక్కటే అని భావించాలి గాని, భౌతిక వ్యవహారాలలో భేదాలు తప్పవు. సంఘం సరిగా సాగాలంటే భిన్న భిన్న కార్యకలాపాలలో ఎవరి పాత్రను వారు నిర్వహించవలసిందే. అందరి శరీరాలలోనూ చైతన్యం ఒకటైనా సంఘం యొక్క మంచి కోసం మంత్రానుష్టానం చేయాలంటే మిగిలిన వారికంటే బ్రాహ్మణులు తప్పక ఆచారాలు పాటించ వలసినదే. అట్టివారు దూరంగా ఉన్నా తప్పు లేదు, మనస్సు నణిగినవాని దృష్టిలో మాత్రం అంతా ఒకటంటే చెల్లుతుంది.


Tuesday 4 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 211 వ భాగం



ఇంద్రునికు అట్టి అనుభూతి లేదు. రెండవ వాక్యంలో జ్ఞానిని మునిగా పేర్కొన్నారు. ఇంద్రుని ఆనందాన్ని ముందుగా, జ్ఞాని ఆనందాన్ని తరువాత పేర్కొన్నారు. ఇంద్రాది దేవతలు బుద్ధితో ఆనందాన్ని అనుభవిస్తే జ్ఞాని యొక్క బుద్ధి, శాశ్వతానందంలో మునిగిపోయి ఉంటుంది. బుద్ధి లీనమై పోతుంది.


ఎంతవరకూ, ఇంకొకదానిని తెలిసికొంటుందో, తెలిసికొనేది వేరు, తెలియబడేది వేరనే విభజన ఉందనే యుంటుంది. ఇది ద్వైతం. బుద్ధి లేకపోతే దేనితో తెలిసికోవడం? బుద్ధి కనుమరుగైతే ఉండేది ఆత్మయే కదా! దానికి రెండంటూ లేదు. కనుక బ్రహ్మవిత్ అవుతాడు. బ్రహ్మవిత్ కూడా కాదు బ్రహ్మమే అవుతాడు.


"బ్రహ్మైవ న బ్రహ్మవిత్"


అట్టి బ్రహ్మ స్వరూపమే నా గురువని శంకరులన్నారు. అట్టివానికి బ్రహ్మ కూడా శిష్యుడై యుంటాడని అన్నారు. అట్టివారిని జాతి, వర్గ, స్థాయి, వయస్సులనే కొలబద్దలతో లెక్కపెట్టరాదని సిద్ధాంతం.


సమదృష్టి వేరు, సాంఘిక సమానత్వం వేరు


ఈ సంఘటనకు ఆధునిక సంస్కర్తలు మరొక విధంగా అర్ధం చెబుతారు. శంకరులు వర్ణాశ్రమ విభజన వద్దు అన్నారని అర్ధం తీస్తారు. వారి రచనలను చదవితే వీరు చెప్పినది తప్పనిపిస్తుంది. ఈ సంస్కర్తలకు వర్ణాశ్రమ విభజన తప్పనిపిస్తే వారు చెప్పవచ్చు గాని ఈ కథతో ముడిపెట్టడం అన్యాయం. పూర్వులు దేనిని సమత్వమన్నారు? అందరిపట్ల ఎక్కువ తక్కువలు చూడకుండా ప్రేమను పంచి పెట్టాలన్నారు. వర్ణాశ్రమాలు వద్దని, వివిధ ప్రజలు వివిధ వృత్తులను చేసుకోనవసరం లేదని చెప్పలేదు. మామూలు నడవడికలోనే భేదాలను పాటిస్తాం. వండే పదార్థాన్ని కార్య క్రమానికి అనుగుణంగా తీర్చి దిద్దుతారు. జ్వరంతో బాధపడే వానికి వేడినీళ్ళు ఇయ్యాలి. అన్నాశయ సంబంధమైన రోగంతో బాధపడేవానికి చన్నీళ్ళు ఇయ్యాలి. పూజకు విడిగా నీరు, అసలు పప్పు ఉడకడానికే ప్రత్యేకమైన నీటిని వాడతారు. స్నానానికి, బట్టలుతకడానికి నీరు వేరుగా ఉంటుంది. ఇట్లా ప్రతి వ్యవహారంలోనూ విభజనను పాటిస్తాం.

Monday 3 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 210 వ భాగం

 


వాది ప్రతివాదులు కలహించుకుంటూ ఉంటారు. కాని సాక్షి మాత్రం చూస్తూ ఉంటాడు. అట్లా ఇంద్రియాలు, మనసు సంఘర్షణ పడుతున్నా నేను మాత్రం సాక్షిని, చైతన్యాన్ని, ఆత్మయే నేను. మిగతాదంతా బాహ్యమైనది. ఇంద్రియాలు, అంతఃకరణలు చూడబడేవి. చూచేది ఆత్మయే. ఆ ఆత్మయే నేను. ఇది మొదటి శ్లోకం. ఇక చివరి దానిని చెబుతాను.


యత్ సౌఖ్యాంబుధి లేక లేక ఇమేశ క్రాదయోనిర్వృతా

యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్హృతః

యస్మిన్నిత్య సుధాంబుధౌ గలితధీః బ్రహ్మైవన బ్రహ్మవిత్

యః కశ్చిత్ స సురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ


ఏ సుఖ సముద్ర కణలేశాన్ని పొంది ఇంద్రాది దేవతలు, ఆనందంలో మునిగిపోయారో, ప్రశాంతచిత్తుడైన ముని, తన చిత్తంలో దేనిని పొంది ఆనందిస్తున్నాదో, ఆ నిత్య అమృత సముద్రంలో ఎవని చిత్తం కరిగి పోయిందో అతడు బ్రహ్మవేత్తే కాదు, బ్రహ్మమే. అట్టి మహాత్ముని పాదాలకు ఇంద్రుడు కూడా నమస్కరిస్తున్నాడని నా నిశ్చితాభిప్రాయం.


పంచముడు ఆనందాంబుధి యన్నాడు. శంకరులు సుధాంబుధియన్నారు. గురువు చెప్పినది శిష్యుడనాలి కదా! అతని మాటలనే ఉట్టంకించారు. ఇంద్ర భోగాలు కూడా ఆనంద సముద్రంలో ఒక కణం వంటివి. లేశమనే మాటలతో దానిని సూచించారు.


లలిత సహస్ర నామాలలో అమ్మవారు "స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః" అనగా బ్రహ్మాదిల దేవత ఆనందం, ఆమె ఆత్మానందంలో ఒక చుక్క వంటిదే.

Sunday 2 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 209 వ భాగం



ఆ చండాలుడు, రెండు రకాల వాదాలను పేర్కొన్నాడు. 'కింగంగాంబుని' అనినపుడు, ప్రతిబింబవాదాన్ని పేర్కొన్నాడు. గంగ నీటిలో, చండాలవాటిక నీటిలో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు కదా! రెండు ప్రతిబింబాలలోనూ తేడా ఉందా? తరువాత అవచ్ఛిన్న వాదాన్ని పేర్కొన్నాడు. రాజుగారి బంగారు కలశంలోనూ ఆకాశముంది. మా మట్టికుండలోనూ ఆకాశముంది. ఈ రెంటి ఆకాశాలకు తేడా ఉందా? బ్రాహ్మణ శరీరమైనా, చందాల శరీరమైనా కుండవంటిదే. లోనున్న ఆత్మకాశానికి తేడా ఉందా? రెండు శరీరాలు నీటి చుక్కలు వంటివే. రెంటిలోనూ ఆత్మ సూర్యుడొకడే.


లోనున్నది జ్ఞాన సముద్రమే సహజానంద అవబోధఅంబుధి. అది తరంగాలు లేని సముద్రం. సంసార సముద్రం తరంగాలతో ఉంటుంది. జ్ఞాన సముద్రానికి అవి ఉండవు. ఇది అంతటా వ్యాపించింది. దీనిపై మామూలు గాలి, తన ప్రభావాన్ని చూపదు. మామూలు సముద్రం, నీళ్ళతో, ఉప్పుతో ఉంటుంది. ఆత్మ సముద్రంలో జ్ఞానానందాలే ఉంటాయి. జ్ఞానమే ఆనందం ఆనందమే జ్ఞానమని అర్థం చేసుకోవాలి. ఇది వ్యాపించని చోటుండదు. కాని మామూలు సముద్రం అట్లా కాదు. ఇది అందరిలోనూ ఉంది. బాహ్య భేదాన్ని చూడమని నీ వేదాంతం చెప్పిందా? అని అడిగాడు. ఓహో! నీవు బ్రహ్మవేత్తవు. ఇట్టివారు ఎవరైనా మా గురువులే, నీ జ్ఞాన స్థాయిని తెలిసికోలేక ఆచారం ప్రకారం తొలగుమని అన్నా. నేను నీకు నమస్కరిస్తున్నా అని ఐదు శ్లోకాలు చెప్పారు. శంకరులు. దీనినే మనీషా పంచకమంటారు.


"జాగ్రత్ స్వప్న సుమస్తిమ స్ఫుటతరా సంవిత్ ఉజ్జృంభతే

యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ

సైవాహం నచ దృశ్య వస్త్వితి దృఢప్రజ్ఞాఽపి యస్యాస్తిచేత్

చండాలోఽస్తు సతుద్విజోజస్తు గురురిత్యేషా మనీషామమ" 


జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం అత్యంత స్పుటంగా ప్రకాశిస్తూ ఉందో, పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ ఏది ఓతప్రోతంగా (పడుగు పేకలుగా) అన్ని శరీరాలలోనూ వ్యాపించి సాక్షిగా ఉందో, నేనా చైతన్య స్వరూపాన్ని, నేను జడదృశ్యాన్ని కాను అని ఎవనికి గట్టి జ్ఞానం కలుగుతుందో, అతడు చండాలుడే అవుగాక, ద్విజుడే అగుగాక, అతడు నాకు గురువు. ఇది నిశ్చయం.


Saturday 1 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 208 వ భాగం



పద్మపాదులు, శంకరుల సూత్రభాష్యంలో ఐదు అధికరణాలకు భాష్యం వ్రాసేదని, అది పంచపాదిక యని చదువుకున్నాం. ప్రకాశాత్ముడు, పంచపాదికపై వివరణ వ్రాసేడు. దీనిని వివరణ ప్రస్థానమంటారు. వాచస్పతి మిత్రులు, సూత్ర భాష్యంపై భామతి యనే పేరుతో భాష్యం వ్రాసేరు. ఇందు చెప్పబడిన వాటిని భామతి ప్రస్థానమంటారు.


వివరణ పద్ధతిని ప్రతిబింబవాదమని; భామతి సిద్ధాంతాన్ని అవచ్చేద వాదమని అంటారు. ఈ రెండూ పరమాత్మకు, మనకు భేదం లేదని చెప్పేవే.  

నేలపై కొన్ని నీళ్ళను చల్లామనుకోండి. అనేక జలకణాలు నేలపై ఉంటాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. అన్నిటిలోనూ ఆకాశంలోని ఒక్క సూర్యుడూ వీటిల్లో చిన్నవాడుగా, పెద్దవాడుగా ప్రతిబింబిస్తూ ఉంటాడు. నీటికణాలు నేలలో ఇంకిపోతే ప్రతిబింబాలుండవు. అవిద్య నీటి వంటిది. అట్లా పరమాత్మ జీవుల అంతఃకరణాలలో లేదా మనస్సులలో ప్రతిబింబిస్తాడు, జీవాన్నిస్తాడు. ఇక అంతఃకరణం పోతే ప్రతిబింబం ఉండదు. బింబం ఒక్కటే ఉంటుంది. బింబమైన పరమాత్మ, రెండు లేనిదై ప్రకాశిస్తుంది. దీనిని బింబ ప్రతిబింబ వాదనుంటారు.


ఇక అవచ్చిన్నవాదం. ఆకాశం అంతటా ఉంది. దీనిని మహాకాశం అంటారు. కుండలోని ఆకాశాన్ని ఘటాకాశమంటారు. కుండ ఉన్నంత వరకూ ఘటాకాశముంటుంది. అది పగిలిపోతే మహాకాశమే ఉంటుంది. ఘటం పగిలినపుడు ఘటాకాశం మహాకాశం ఒక్కటైనట్లుగా మనస్సు నశిస్తే ఒక్క పరమాత్మయే యుంటాడు. కుండలో ఉన్నది చిన్న ఆకాశంగా, బయట ఉన్నది పెద్దదిగా కన్పిస్తుంది. కుండలు, మహాకాశాన్ని పంచుకున్నట్లుగా ఉంటాయి. ఇది అవచ్ఛిన్న వాదం.


మరొక ఉదాహరణ చూపిస్తారు. ఒక కుండను నీటిలో ముంచాం. అది నీటితో నిండింది. అందులోనున్నది, నూతిలో నున్నది నీరే. కాని కుండ ఒక హద్దును సృష్టిస్తూ, కుండలో నున్న నీటిని నూతిలో నున్న నీటిని వేరు వేరుగా చూపిస్తోంది. పెద్ద కుండలో ఎక్కువ నీరు, చిన్న కుండలో తక్కువ నీరు ఉన్నట్లు కన్పింప చేసినట్లు ఒకే పరమాత్మ, జీవుల యొక్క అంతః కరణాలను బట్టి భిన్న భిన్నంగా కన్పిస్తాడు.  


వీరి వాదాలతో మనకు పనిలేదు. నీళ్ళ చుక్కలను తొలగిస్తే ఉన్నది ఒక్క సూర్యుడే. మాయవల్ల ఏర్పడిన జీవాత్మ భావాన్ని తొలగిస్తే మనమూ, పరమాత్మ ఒకటౌతాము. ఇది ప్రతిబింబవాదం వారనేది. ఇక కుండ పగిలితే మహాకాశమైనట్లని అవచ్ఛిన్నవాదం వారంటారు.


శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 207 వ భాగం



"విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః


పండితుడు, అందరి పట్లా సమభావంతో ఉంటాడు. అంతా బ్రహ్మమనినప్పుడు, మరొకవిధంగా వర్తించదు. జంతువులును తీసుకుంటే ఆవు, ఏనుగు, ఎక్కువస్థాయిలో ఉన్నాయని కుక్క అధమ జంతువుని భావిస్తాం. మానవులలో బ్రాహ్మణుని ఉత్తమునిగా భావిస్తారు. చండాలుణ్ణి నీచుడని భావిస్తారు.


జంతువులకంటే మానవులుత్తములని భావిస్తారు. కాని జ్ఞానికి, ఇట్టి ఎక్కువ తక్కువలుండవు. జంతువులను, మానవులను విడివిడిగా చూడదు. అన్ని ప్రాణులను ఒకటిగానే భావిస్తాడు.


ఇట్టి సమదృష్టి కలిగియుండాలని బోధించే అద్వైత స్థాపనాచార్యుడు. నన్ను పొమ్మనడం ఏమిటని ప్రశ్న


"ఏదో బాధపడి నన్ను వాదంలోకి దింపుతున్నాడా? అందువల్ల శాస్త్ర నియమాలను చెప్పినా అతడు వినే పరిస్థితిలో లేదు. అతడు తొలగకపోతే మనమే తొలగాలి. అయితే అతడేదో బాధపడి మాట్లాడడం లేదు. వేదాంత సత్యాలను చెబుతున్నాడు. కనుక అతడు చెప్పేది వినాలని" భావించారు శంకరులు.


చండాలుడు ఇంకా ఇలా అన్నాడు:


కింగంగాబుని బింబితోఽంబరమణౌ చండాలవాటీ పయః

పూరే చాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోర్వాంబరే

ప్రత్యగస్తుని విస్తరంగసహజానం దావబోధాంబుధౌ

విప్రొ@యం శ్వపచో@య మిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః"


తా: గంగాజలంలో, చండాల వాటికలో నున్న జలాశయంలోనూ ప్రతిబింబించిన సూర్యునిలో ఏమైనా భేదం ఉంటుందా? ఎట్టి తరంగాలు లేని సహజానంద బోధ సముద్రమగు ఆత్మలో ఇతడు చండాలుడు, ఇతడు బ్రాహ్మణుదనే భేదం అనే భ్రమ నీకు ఎట్లా కలిగింది?


శంకరులు తరువాత అద్వైతంలో రెండు భేదాలు కన్పిస్తాయి. లక్ష్యంలో తేడా యుండదు. పరమాత్మ జీవాత్మగా ఎట్లా కన్పిస్తున్నాడు? రెండు సిద్ధాంతాలూ అవిద్యయే కారణమంటాయి. అయినా భిన్నంగా చెబుతాయి.