Sunday 30 April 2023

శ్రీదత్త పురాణము (124)

 



మనస్సుకి నచ్చిన ఆ సుందరాంగితో పేరుకి తగిన ఆ సుశీలతో కలిసి హాయిగా గాంధర్వవేదం పాడుకుంటూ కాలానుగుణంగా అభిరుచికి అనుగుణంగా సుఖసంతోషాలు అనుభవిస్తున్నాడు. వాటి అంచులు రుచి చూస్తున్నాడు. సంవత్సరాలు రోజులుగా దొర్లిపోతున్నాయి. చివరకు కాలధర్మం చెందారు. కానీ తాము ఉపాసించిన గాంధర్వ కామశాస్త్రాల మహిమ వల్ల అతడు గంధర్వుడుగా ఆమె గంధర్వ కన్యగా గంధర్వ లోకంలో పునర్జన్మలు పొందారు. అక్కడా దంపతులయ్యారు. ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్లుగా భోగాలు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఒకనాడు కైలాసానికి దగ్గరలో వున్న ఉద్యానవనంలో వీరికి పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ కనిపించారు. దంపతులిద్దరూ సాష్టాంగపడ్డారు. నాదవేత్త అయిన గంధర్వుడు మంజుల స్వరం విప్పి మెల్లగా ఆదిదంపతులపై స్తుతిగీతం అందుకున్నాడు. గంధర్వసుందరి వీణ మీటినట్లుగా గొంతు కలిపింది. పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో సంతోషించారు. నాదజ్ఞుడైన శివుడైతే మరింత ప్రసన్నుడై ఆనందంతో ఇంతటి ఉత్తమగీతాన్ని సంగీతాన్ని నేనెప్పుడు వినలేదు. గంధర్వుడా నువ్వు ధన్యుడవు, కృతకృత్యుడవు. నువ్వూ, నీ భార్యా ఇంద్రలోకం వెళ్ళండి ఇది నా ఆజ్ఞ అని వరమిచ్చాడు. గంధర్వ దంపతులు ఆనందంతో మరింతగా స్తుతించారు. ఇంతలో ఒక దివ్య విమానం వచ్చి వీరి దగ్గర నిలిచింది. దాన్ని ఎక్కి గంధర్వ దంపతులు (సుశీలా విశాలాక్షులు) ఇంద్రలోకం చేరుకొన్నారు. అక్కడ నందనవన సీమలలో ఇంద్రాది దేవతలను తమ తమ దివ్యగాన మాధుర్యంతో రంజింపచేస్తూ తాము రంజిల్లుతున్నారు. ఇలా వుండగా ఒక రోజున దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళవలసి వచ్చింది. సరస్వతీ చతుర్ముఖుల సమక్షంలో పేరోలగం సాగుతోంది. ఇంద్రుడు ప్రత్యేకంగా ఈ నవదంపతులను (సుశీలా విశాలాక్షులు) తీసుకెళ్ళాడు. ఆ మహోత్సవంలో అప్సరసలు అందరూ ఆడారు పాడారు. వీణా వేణు మృదంగాలు శృతిపేయంగా వినిపిస్తున్నాయి. దేవగాయకులు దివ్యగానామృతాన్ని పంచుతున్నారు. బ్రహ్మనుగ్రహం కోసం వీణాపాణి మెప్పు కోసం ఎవరిమటుకు వారే తమ ప్రతిభావ్యుత్పత్తులను అపరిమితంగా ప్రదర్శిస్తున్నారు. ఆ సందర్భంలో దేవేంద్రుడు ఈ దంపతుల గాంధర్వ విద్య గురించి విరించికి సూచించాడు. గళం విప్పండి అని వీరికి కనుసైగ చేశారు. తక్కినవారి సంగీత నృత్యాలను చేతిసంజ్ఞతో నిలుపుదల చేశారు. అప్పుడు సుశీల, విశాలాక్ష దంపతులు గొంతు సవరించారు. నారదతుంబురలకు సైతం అన్నప్పుడే లభించని సువర్ణావకాశం తమకు లభించటంతో ఇద్దరూ మైమరచి తమ గాన కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. విభిన్నస్థాయిలలో వివిధ రాగాలను యథాశాస్త్రంగా ఆలపించారు. వాణీ చతుర్ముఖులను స్తుతించే కీర్తనలు గానం చేశారు. సంగీత సరస్వతి తానై ఎంతగా సంబరపడిందో ఆ సంతోషాన్ని ప్రకటించటానికి ఆ వాగ్దేవతకు కూడా మాటలు చాలలేదు. బ్రహ్మదేవుడు ఆనందంతో ఆదరంతో పులకించిపోయాడు. ఎనిమిది కన్నుల నుంచీ ఆనందాశ్రువులు జాలువారాయి. చాలాసేపటికి తేరుకున్నాడు. విశాలాక్షా! నువ్వు నాదబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నావు. ఇదిగో నీకు ప్రజాపతి పదవి ఇస్తున్నాను. ఇక నుంచి మీ నివాసం ఇక్కడే, ఈ సత్యలోకంలోనే, మాతో పాటే ఆనందించండి. వేదగోచరమైన బ్రహ్మతత్వాన్ని నీకు నేను ఉపదేశిస్తాను అని అనుగ్రహించి అవ్యయమూ, సచ్చిదానందమూ అయిన పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశించాడు. ఇంద్రా! ఇతివృత్తం (యథార్థంగా జరిగిన కథ) విన్నావుగా. ఇప్పుడేమంటావ్! కామగాంధర్వశాస్త్రాలు అంతర్భహిర శుద్ధిని కలిగిస్తాయని ఒప్పుకుంటావా?

Saturday 29 April 2023

శ్రీదత్త పురాణము (123)

 


లలిత కళాశాస్త్రం - కామశాస్త్రం


ఇంద్రా మాహిష్మతీ నగరంలో విశాలాక్షుడు అనే బ్రాహ్మణ యువకుడు వుండేవాడు. పేరుకు తగ్గట్లే పెద్ద పెద్ద కన్నులతో కోటేరులాంటి ముక్కుతో బంగారు రంగు వంటి దేహంతో ఆకట్టుకొనే ముఖవర్చస్సుతో మరొక మన్మధుడిలా వుండేవాడు. ఆ అందానికి తోడు మంచి మాట నేర్పరితనమూ వుంది. చక్కగా పాడేవాడు, అడేవాడు, కవిత్వం చెబుతాడు. అన్నింటిని మించి ఇతడు కామశాస్త్రంలో ఆరితేరిన దిట్ట. ఉత్తమ లక్షణాలు కలిగిన కన్యను వరించాలనే తపనతో తానే స్వయంగా కన్యను అన్వేషిస్తూ దేశదేశాలు తిరుగువారంభించాడు. ఒకానొక దేశంలో రాజకుమారి సర్వాంగ సుందరి అని తెలుసుకుని అక్కడకు వెళ్ళి రాజుగారికి తనని తాను పరిచయం చేసుకొని, తను కన్య లక్షణాలు చూసి వరుడి వివరాలు చెప్పే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. రాజు అంతఃపురంలోకి తీసికెళ్ళి తన కూతురైన సుశీలను చూపించాడు. విశాలాక్షుని సౌందర్యానికి ఆకర్షితురాలైన రాకుమారి అతడినే వివాహమాడతానని తల్లిదండ్రులకు ఆ క్షణంలోనే తేల్చి చెప్పేసి వెంటనే విశాలాక్షునికి శీతలోపచారాలు చేసింది. అతడు తేరుకున్నాడు. రాజు ఇద్దరికి ఓ సుముహూర్తాన ఘనంగా వివాహం జరిపాడు. బంగారు దివ్యాభరణాలు, దాసదాసీ జనం, అన్నీ సమృద్ధిగా బహూకరించి రాజు చివరకు తన రాజ్యంలో కొంతభాగాన్ని కూడా అల్లుడైన విశాలాక్షుడికి ధారపోశాడు.


సౌందర్యంలో అనురాగంలో పరస్పరం ఒకరినొకరు పుణికిపుచ్చుకొన్న సుశీలా విశాలాక్షి దంపతులు రాజభవనంలో హంస తూలికా తల్పాల మీదా, సరోవరాలలో, ఉద్యానవనాల్లో, కేళీ విలాసంతో హయిగా దాంపత్యసుఖాలు అనుభవిస్తున్నారు. కామశాస్త్రకుశలుడు అయిన విశాలాక్షుడు పొందుతున్న ఆనందానికి అవధులు లేవు. మానుషానందం - రాజానందం - సార్వభౌమానందం - దేవేంద్రానందం - చివరికి బ్రహ్మానందం కూడా అతడు పొందే ఆనందానికి సాటి రావటం లేదు. సత్యమూ, నిత్యమూ, అవాఙ్మనసగోచరమూ అయిన ఆనందానుభూతిని పొందుతున్నాడు. అలాంటి ఆనందానుభూతినే రాకుమారి సుశీలకూ అందిస్తున్నాడు. ఎలాగైనా మరోప్రాణికి సంతోషం - ఆనందం కలిగించాలట. ఇది బుద్ధిమంతుల లక్షణం అట. ఇంతకుమించిన ఈశ్వరార్చన లేదట.


అలాగని ఇంతటితో సంతృప్తి చెందలేదు ఈ విశాలాక్షుడు. ఆ సౌందర్యరాశితో కలిసి యధాశాస్త్రంగా ధర్మ అర్ధ కామ పురుషార్ధాలను మూడింటినీ పుష్కలంగా పండించుకుంటున్నాడు. ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చేసి కృతకృత్యుడయ్యాడు. ధనలోభం లేకుండా యజ్ఞయాగాలు చేసాడు. దానధర్మాలు చేసాడు. చిన్నపాపంగాని, కొంచెం దుఃఖంగాని అతడు చేయలేదు పొందలేదు. ఆపదలే అతడు వినలేదు.


Friday 28 April 2023

శ్రీదత్త పురాణము (122)

 


ఇంద్రుడి ప్రశ్నలోని ఆందోళనను గుర్తించాడు దేవగురువు. స్థిమితంగా సమాధానం ఇలా చెప్పాడు. ఇంద్రా ఇందులో వున్న తత్వరహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు. సరే చెబుతాను విను. నేను రచించి శిష్యులకు బోధిస్తున్న ఈ శాస్త్రాలన్నీ తత్వరహస్యాలే. తత్వోపదేశాలే. పారంపర్యంగా చివరికి తత్వప్రాప్తికి కావలసిన చిత్తశుద్ధిని ఇవి కలిగిస్తాయి. ఈ విషయాల్ని తెలియచెప్పే ఏడు ఉదాహరణల్ని నీకు చెబుతాను శ్రద్ధగా విను. అంతా నీకే తెలుస్తుంది. అప్పుడు నీ అభిప్రాయం చెబుదువుగాని.

అనగనగా కాంపిల్య నగరం అనే పట్టణం వుండేది. ఆ నగరంలో నిధిజ్ఞుడు అనే శిల్పశాస్త్రపండితుడు వుండేవాడు. అతను శిల్పశాస్త్రంలోనే కాక వాస్తుజ్యోతిష్య శాస్త్రములతో కూడా విశేష ప్రతిభ కలిగినవాడు పైగా నీతిమంతుడు. మంచి, చెడు విచక్షణా జ్ఞానం కలవాడు. ఆ నగరంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా ఇతడినే పిలుస్తారు. దానితో ధనం బాగా సంపాదించాడు. ఇతడిని ఆశ్రయించి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానము లేదు. వాళ్ళు విధిజ్ఞుడుతో వుంటూ అతను చెప్పింది చేస్తూ వేతనాలతో బ్రతుకులు గడుపుతున్నారు. విధిజ్ఞుడు మాత్రం తనకున్న విద్యను ఉపయోగించి బాగా పుష్కలంగా ధనం సంపాదించాడు. ఆ ధనంతో దానధర్మాలు, శ్రాద్ధవిధులు, దేవతా పూజలు ఘనంగా జరిపించేవాడు. అందువల్ల రాజ్యంలో అందరికీ ఆప్తుడయ్యాడు. ఇష్టుడయ్యాడు. కీర్తిప్రతిష్టలు పెరిగాయి. అవి ఇరుగు పొరుగు రాజ్యాలకు కూడా వ్యాపించాయి. దానితో పెద్ద పెద్ద ధనవంతులకూ, మంత్రులకూ, రాజవంశీకులందరుకూ తలలో నాలిక అయ్యాడు. ఇతర దేశాల రాజులు కూడ విదిజ్ఞుడ్ని పిలిపించి గౌరవించి భవనాలు, దేవాలయాలు, తటాకములు నిర్మింపజేసుకుని పుష్కలంగా బహుమతులు ఇచ్చి సాగనంపుతుండేవారు. ఆ ధనంతో విదిజ్ఞుడు ఇంకా ఇంకా దానధర్మాలు ఆచరించాడు. ఇలా వాస్తుశాస్త్రంతో, శిల్పాశాస్త్రంతో, జ్యోతిష్యంతో ధర్మబద్ధంగా ధనాన్ని కీర్తిని గడించి కొంతకాలానికి అతడు స్వర్గస్తుడయ్యాడు. దేవలోకంలో అతడు ఆచరించిన పుణ్యఫలాల ఫలితంగా చాలాకాలం స్వర్గసుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత కాంపిల్య నగరానికి రాజుగా జన్మించాడు. రాజధనంతో యజ్ఞయాగాదులు అసంఖ్యాకంగా చేసి ధర్మబద్ధమైన పాలనతో ప్రజలను రంజింపచేసి దేవాలయ ఆరామ కూప వాపీ తటాకాదులు ఎన్నెన్నో నిర్మింపచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకొని కొంతకాలానికి స్వర్గస్థుడయ్యాడు. చేసిన పుణ్యాలకు ఫలంగా స్వర్గభోగాలు అనుభవించి మళ్ళీ భూలోకంలో ఈసారి బ్రాహ్మణుడుగా జన్మించాడు. బ్రహ్మచర్యంతో సర్వశాస్త్రాలు అభ్యసించాడు. గృహస్థాశ్రమంలో వేదాంతశీలుడై నిరంతర ధ్యాననిష్టతో గొప్ప గొప్ప వ్రతాలు, పూజలు చేసి చివరకు యోగవిధులకు వంద్యుడైన యోగి అయ్యాడు. వానప్రస్థం స్వీకరించాడు. పరిపక్వత సాధించాడు. చివరికి నాల్గవదైన సన్యాసాశ్రమం కూడా స్వీకరించాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది జీవన్ముక్తుడై చివరకు విదేహ కైవల్యం పొందాడు. ఇంద్రా విన్నావుగదా వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిష్యం ఆయా శాస్త్రాల ప్రావీణ్యం విధిజ్ఞుడికి క్రమంగా ముక్తికి సాధనమయ్యింది. మరొక ఉదాహరణ చెబుతామ అలకించు అన్నాడు బృహస్పతి.

Thursday 27 April 2023

శ్రీదత్త పురాణము (121)

 


గురుదేవా, నాకు కలిగిన సందేహాలే కార్తవీర్యుడికీ కలిగాయి. వీటికి దత్తస్వామి ఏమి సమాధానం చెప్పారో తెలుసుకోవాలని మనస్సు ఉబలాటపడుతోంది. తరువాత కథను సెలవియ్యండి అని దీపకుడు తొందర చేసాడు. వేదధర్ముడు ఇలా చెప్తున్నాడు.


కార్తవీర్యార్జునుడు అడిగిన సందేహాలకు అక్కడ సమావేశమైన మునులందరూ వింటూ వుండగా దత్తస్వామి ఇలా సమాధానం చెప్పాడు. కార్తవీర్యా! నీ విజ్ఞాపనం- నీ వాంఛితం నీ ప్రశ్నలు నాకు నచ్చాయి. నువ్వు చేసిన స్తోత్రం ఇంకా నచ్చింది. సమాధినిష్టలో వున్నా దివ్యశక్తితో అంతాచూసాను. ముందే గ్రహించాను. నీ విజ్ఞాపనలు అన్నింటికీ సమగ్రంగా సమాధానం చెబుతాను, ముక్తిని అందిస్తాను. మహా బాహా! బాధపడకు దుఃఖం విడిచిపెట్టు. నువ్వు నన్ను వశపరుచుకున్నావు. నా భక్తుడికి ఈ లోకంలో ఏదీ దుర్లభం అంటూ వుండదు. నువ్వు చేసిన స్తోత్రము అతి పురాతనమైనది. నా తత్వమూ రహస్యమూ అన్నింటినీ అందులో దాచి వుంచాను. నీ ముఖతః అది ఇప్పుడు లోకానికి వెల్లడి అయ్యేలా చేసాను. లోకోపకారం కోసం ఇలా చేసాను. దీన్ని ప్రాతఃకాలంలో పఠించిన వారు, నాకు అత్యంత ప్రీతిపాత్రులవుతారు.


వేదశాస్త్రాలలో పరస్పర వైరుధ్యాలు వున్నాయని బుద్ధిమంతుడవై చాలా మంచి ప్రశ్న వేశావు, అది కేవలం బుద్ధిహీనుల ఆక్షేపణ మాత్రమే. ముందు నీ సందేహాల్ని తొలగించి ఆ తర్వాత సప్రమాణంగా మోక్ష విద్య తెలుపుతాను. ఎందుకంటే సందేహాలు తొలగనిదే ఏది చెప్పినా నిరర్ధకం. ఈ సందర్భంగా నీకొక గాధ చెబుతాను. దీన్ని పూర్వ కాలంలో దేవగురువైన బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. ఇందులో నీ సందేహాలకు సమాధానాలుగా ఏడు ఉదాహరణలు దొరుకుతాయి.


ఇంద్ర - బృహస్పతి సంవాదం - సప్తోదాహరణలు - వాస్తుశాస్త్రం - శిల్పశాస్త్రం జ్యోతిష్యం -


ఒకానొకప్పుడు దేవగురువైన బృహస్పతి తన మనస్సులో ఏదో వుంచుకొని బహుశా రాక్షసుల్ని సమ్మోహపరచటానికి కావచ్చు కామశాస్త్రం- దండనీతి శాస్త్రం, వాస్తుశాస్త్రం- శిల్పశాస్త్రం- సమగ్రంగా రచించి యోగ్యులు, బుద్ధిమంతులూ అయిన శిష్యులకి స్వయంగా బోధించటం ప్రారంభించాడు. ఇంద్రుడు ఇది గమనించి ఒకనాడు బృహస్పతి ఇంటికి వచ్చి పాదాభివందనం చేసి గురుదేవా తమరు ఏమీ అనుకోనంటే నాదో సందేహం అంటూ మొదలు పెట్టాడు. గురువర్యా! ఆత్మతత్వ విచక్షణా! లౌకిక సాధారణ పండితుల్లా సర్వజ్ఞులైన మీరు కూడా ఇలా చెయ్యడం భావ్యమా? తత్వబాహ్యాలైన ఈ శాస్త్రాలను ఎందుకు రచించారు? మానవుల్ని ఇంకా సమ్మోహనపరచటానికి, విషయవాంఛల్లో ముంచటానికి తప్ప ఇవి ఇక ఎందుకు ఉపకరిస్తాయి? జీవి అసలు పుట్టుకతోనే రాగలంపటుడు అవుతున్నాడు. ఇది తెలిసిన పండితుడు- శాస్త్రకర్త - ఏమి చెయ్యాలి? ఉద్ధరించాలా లేక గ్రుడ్డివాణ్ణి నూతిలోకి నెట్టేసినట్టుగా ఇంకా చెడగొట్టాలా? గురుదేవా ఏ ఫలాన్ని ఆశించి తమరు ఈ పనిచేసారో గానీ నాకు మాత్రం ఉచితంగా తోచటం లేదు. మరి ఇందులో ఇంకా ఏదైన పరమార్థం, మహారహస్యం ఉంటే, అది నేను తెలుసుకోదగినది అయితే దయ చేసి వివరించండి అన్నాడు ఇంద్రుడు.


Wednesday 26 April 2023

శ్రీదత్త పురాణము (120)

 


స్వామీ నన్ను చాలాకాలంగా వేధిస్తున్న సంశయాలు కొన్ని ఉన్నాయి. వాటిని మీ ముందు ఉంచుతాను. అవి తొలగించి నాలో జ్ఞానకాంతులు నింపండి. సత్తూ, అసత్తూ, స్థూలమూ, సూక్ష్మము, కార్యము, కారణమూ, వ్యక్తమూ అవ్యక్తమూ- సమస్తము పరబ్రహ్మవైన నువ్వే కదా! అద్వితీయమూ, అవ్యయము, స్వయంప్రకాశమానమూ అయిన పరబ్రహ్మంలో నశ్వరమూ మాయా కల్పితమూ అనిత్యమూ అయిన ఈ విశ్వభ్రాంతి వల్ల అద్దంలో ప్రతిబింబంగా కనిపిస్తుంది అని వేదాంతులు అంటున్నారు. రజ్జు సర్పభ్రాంతి- శుక్తి రజతభ్రాంతి- ఇలాంటివి ఉదాహరణులుగా చూపిస్తున్నారు. మరికొందరు ఇదే వేదాన్ని ప్రమాణంగా చూపుతూ జగత్తు మిధ్య అయితే ఇంతకాలం స్పుటంగా కంటికి కనిపిస్తుందా? దీనికి బోధన కూడా లక్ష్యం కాదు. దీనికి ఆది ఎక్కడ? అంతమెక్కడ? ఒక్కటే ప్రవాహం అని వాదిస్తున్నారు. అది అద్వైతమూ ఇది ద్వైతము అంటున్నారు. ఇక మీమాంసకులు ధర్మమే పరమనీ జగత్తు నిత్యమూ సనాతనమూ అని శ్రుతుల్ని ప్రమాణంగా చూపించి మరి ప్రతిపాదిస్తున్నారు. సాంఖ్యులు సృష్టికి "ప్రధానం" కారణం అంటున్నారు. పురుషుడు నిమిత్తమాత్రడంటున్నారు. యోగులూ ఇదే నిజమని అంగీకరిస్తున్నారు. తార్కికుడు ప్రపంచాన్ని నిత్యమంటున్నారు. ఇవన్నీ వేదోక్తులు ప్రమాణంగా చూపుతున్న సిద్దాంతాలే. వాదాలే. వేదప్రామాణ్యాన్ని అంగీకరించని బుద్ధిమంతులు కొందరు వున్నారు. వీళ్ళల్లో కొందరు ప్రపంచాన్ని క్షణికం అంటున్నారు. ఇన్ని రకాల వాదాలు, భేదాలు ప్రపంచంలో కన్పిస్తూ, విన్పిస్తూ వుంటే వీటిలో దేన్నీ ప్రామాణికంగా స్వీకరించాలి అనేది ముముక్షువులకు పెద్ద సందేహం అవుతోంది. దేన్ని అనుసరిస్తే ఏ ప్రమాదం వచ్చిపడుతుందో ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రుతి, స్మృతి, పురాణేతి ఆగమశాస్త్రాలకు సమన్వయం కుదిర్చి పరస్పర వైరుద్ధ్యం తొలగించి ఏకవాక్యం బోధించగల గురుస్వామివి నువ్వే కాబట్టి ఈ సంశయం తీర్చి పరమపదమునకు దారి చూపించవలసిందిగా కోరుతున్నాను. ఏది మాకు ఆచరింపదగినదో ఏది వదిలెయ్యవలసినదో తేల్చి చెప్పప్రార్థన. ఇలాగే ఆచారాలలో కూడా తేడాలు వున్నాయి. సదాచారాలు ఏమిటో అనాచారాలు ఏమిటో తెలియక కొట్టుకుంటున్నాం. నువ్వు సర్వాచారనిధివని సర్వాచార ప్రవర్తకుడవనీ పండితులు చెబుతున్నారు. బహిర్ముఖంగా నవ్వు అనాచారుడువని కొందరు అంటున్నారు. ఇంతకీ నువ్వు ఆచారలభ్యుడవా? లేక అనాచారలభ్యుడవా? పనిలో పనిగా ఈ సంశయాన్ని కూడా తీర్చుభగవాన్! త్రిమూర్తులూ, పంచభూతాలూ సకల దేవతలు నువ్వేనని భుక్తి ముక్తి ఫలప్రదాతవైన నిన్ను బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు, ప్రజాపతులూ, మునీంద్రులూ ధ్యానిస్తూ వుంటారని మహర్షులు చెప్పగా విన్నాను. అటువంటి నువ్వు ఇలా రోజుల తరబడి ధ్యాననిష్టలో కూర్చుంటున్నావు. నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నట్టు? అందరికీ ధ్యేయుడవైన నీకు వేరే ధ్యేయం ఉన్నదా? ఉంటే అదేమిటి?


ఈ సంశయాలు తొలగించమని అడగడం తప్ప నాకు ఇంక ఏ కోరికా లేదు. నీ దయ వల్ల సకల శత్రువులనూ జయంచి సప్తద్వీపాలతో అలరారే వసుంధరను ఏకచ్చాత్రిధిపత్యంగా పరిపాలించాను. నీ కుపావలేశంతో యముణ్ని కూడా ఎదిరించగలను. సకల రాజభోగాలు తనివి తీరా అనుభవించాను. ఇక నాకు ఏమీ వద్దు. తురీయ పురుషార్ధాన్ని అందుకునే శక్తి ప్రసాదించు ముక్తిని అనుగ్రహించు. ఇలా కార్తవీర్యార్జునుడు వినయవిధేయులతో అర్ధించాడు అని చెప్పి వేదధర్ముడు ఒక్క నిముషం ఆగాడు.


Tuesday 25 April 2023

శ్రీదత్త పురాణము (119)

 


దేవా! మహాదేవా! యోగవిద్యా గురూ! ఆధ్యాత్మదర్శనా! అత్రివంశ ప్రకాశకా! జయము జయము - అని స్తుతించి తిరిగి తిరిగి నమస్కరిస్తూ అందరూ వచ్చినట్లే ఆకాశమార్గంలో తిరిగిపోయారు. ఆ వెంటనే సహ్యాద్రి ప్రాంతంలో ఆశ్రమాలలో నివాసం వుంటున్న వానప్రస్థులూ, సన్యాసులూ, వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు ఎవరికి వారు. వచ్చి దత్తాత్రేయుడికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి వేదమంత్రాలతో, శ్లోకాలతో స్తుతించి వెళ్ళిపోయారు.


తూర్పు దిక్కున ఎరుపురేకలు కనిపించాయి. కాసేపటికి అవి తెల్లదనం సంతరించుకున్నాయి. అప్పుడు దత్తాత్రేయుడు ధ్యాననిష్టను క్రమక్రమంగా సడలించాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు. పద్మాసనం నుండి లేచాడు. నైఋతి దిక్కుగా నడిచాడు. శాంతతపుడు అనే శిష్యుడు అందించిన మట్టితో నీళ్ళతో కాలకృత్యాలు తీర్చుకున్నాడు. తిరిగి వచ్చాడు. సత్యవాక్కు అనే ముని అందించిన గోమయి - మృత్ - కుశ - భస్మవల్కలాలను తీసికొని వెంటరాగా దత్తస్వామి అక్కడికి చేరువలోనే నదీతీరానికి వెళ్ళి నియమపూర్వకంగా స్నానం చేశాడు. దేవ పితృఋషి తర్పణాలు వదిలిపెట్టాడు. ఉదయిస్తున్న సూర్యభగవానున్ని విధి విధానంలో ఉపాసించాడు. అహ్నికాలు నిర్వర్తించాడు. అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. కోల్హాపుర లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి భిక్ష స్వీకరించి క్షణకాలంలో మళ్ళీ సహ్యాద్రి పర్వత ఆశ్రమానికి చేరుకున్నాడు. పర్ణశాల ముందు ఎప్పటిలాగే గున్నమావి చెట్టు నీడలో మట్టితిన్నెపై కూర్చున్నాడు.


చుట్టుప్రక్కల ఆశ్రమాల నుండి మునులూ యోగులు వివిధ ఆశ్రమాలవారు వచ్చి దత్తస్వామికి నమస్కరించి తిన్నె చుట్టూ అర్ధచంద్ర వలయాకారంలో కూర్చున్నారు. నోరువిప్పి ఏది పలికితే అది విని తరిద్దామని ఆశగా ఎదురుచూస్తున్నారు. అల్లంత దూరాన కార్తవీర్యార్జునుడు నిలబడి వున్నాడు. శిరస్సుపై రెండు చేతులు వుంచి అంజలి ఘటిస్తూ స్వామివైపు చూస్తున్నాడు. అతడిని ఏదో భయం ఆవరించింది. చిన్నగా వణుకుతున్నాడు. ఇది గమనించిన శాంతతపుడు అనే శిష్యుడు దత్తస్వామికి నివేదించాడు. దత్తస్వామి కార్తవీర్యార్జునుని వైపు ప్రసన్నంగా దృష్టి సారించి చిరునవ్వులు చిందిస్తూ నాయనా కార్తవీర్యా! ఎందుకు భయం? ఎందుకు ఆ వణుకు? ఎందుకు దుఃఖం? ఇలారా దగ్గరగా కూర్చో నీ దుఃఖమూ భయమూ భిన్నతా అన్నీ తొలగిపోతాయి. నువ్వు కోరుకుంటున్న చిత్తశాంతి లభిస్తుంది. రా ఇలా రా అని ఆప్యాయంగా పిలిచాడు. కార్తవీర్యుడుకి ధైర్యం వచ్చింది. అప్రయత్నంగా కన్నులు వరదలు కట్టాయి. తల్లి పిలుస్తుంటే ఒడిలోకి పరుగుతీస్తున్న పిల్లవాడిలాగా దగ్గరకు చేరి సాష్టాంగపడి దగ్గరగా మౌనంగా కూర్చున్నాడు. దత్తస్వామి అతడి ఆర్తినీ ఆవేదననూ గుర్తించాడు. నాయనా భయపడకు. దిగులు చెందకు నీకేమికావాలో అడుగు చెబుతాను. నీ అజ్ఞానం తొలగిస్తాను. దుఃఖం పోగొడ్తాను. నువ్వు నాకు పరమభక్తుడివి. అనన్య సేవలు చేసిన వాడివి. నాకు ఆప్తుడవి. నువ్వు కోరితే చెప్పరానిదంటూ ఏదీ లేదు. ఏది అడుగదలచుకొన్నావో అడుగు సమాధానం చెబుతాను. సంశయాలు తీరుస్తాను. గురువు అంటేనే ఇదికదా! సందేహించక అడుగు. దత్తస్వామి ఇలా ప్రేమగా చనువిచ్చి ప్రోత్సహించేసరికి కార్తవీర్యార్జునుడు తేరుకొని ఇలా అడిగాడు.


Monday 24 April 2023

శ్రీదత్త పురాణము (118)

 


నిర్గుణ పరబ్రహ్మవైన నిన్ను చెప్పేటప్పుడు కన్నులుండవు అయినా చూస్తుంది. చెవులుండవు అయినా వింటుంది. అని వేదాంతులు చెప్తుంటారు. ఇప్పుడేమో లీలా స్వీకృత శరీరుడవై దత్తాత్రేయుడుగా మా ముందు నిలిచావు. చూసే కళ్ళూ, వినే చెవులూ మాట్లాడే నోరూ అన్నీ వున్నాయి. మరినన్ను కరుణించెను అంటే ఎలా? దత్తస్వామీ మీ పాద పద్మాలు వలచి వచ్చిన తుమ్మెదను నేను. వీటిని విడచి వెళ్ళను. వెళ్ళలేను. నీ కన్నులతో ఒక్కసారి చూసి నా హృదయానికి ఆనందాన్ని కలిగించు దయాంబురాశీ నీవే తప్ప వేరుదిక్కులేదు. అనన్య శరణుణ్ని. నీ పాదసేవ తప్ప నాకు వేరే విధీ, కర్తవ్యమూ లేదు. ఈ భవసాగరం నుండి కడతేర్చు. నామరూప రహితుడవైన నువ్వు అవతారాలు ధరించేది ఇందుకేనటగదా. నన్ను ఉద్ధరించు. పుండరీకాక్షా! నమస్తే! పురుషోత్తమా! నమస్తే! విశ్వవంద్య, పదాబ్జా నమస్తే! యోగివరా! వాసుదేవా! సూక్ష్మరూపా! సర్వాధ్యక్షా! నమస్తే నమస్తే నమస్తే! ఈ పాప సముద్రం నుండి కాపాడు. వాక్కులకే కాదు మనస్సుకు కూడా అందనివాడా! భక్త హృదయనివాసా! పంకజనాభా, పంకజ మాలికా ధారీ - పంకజనేత్రా - పంకజాంఘ్రీ నమస్తే! ఆనంద స్వరూపా కరుణించు. పరమేశ్వరా దయచూపించు. ఆది- వ్యాధులనే విషసర్పాలు నన్ను కాటువేసాయి ప్రభూ నన్ను ఉద్ధరించు.


సాయంకాలం అయ్యింది కార్తవీర్యార్జునుడు ఇలా ఎంత స్తుతించినా ఆడినా, పాడినా, దత్తస్వామి ధ్యాననిష్ట నుండి కన్నులు తెరచిచూడలేదు. ఖిన్నుడై అర్జునుడు అలాగే అలసి సొలసి నమస్కరించి నిలబడ్డాడు.


వేదధర్ముడు చెబుతూంటే శ్రద్ధగా వింటున్న దీపకుడికి సహజంగానే మరో సందేహం వచ్చింది. తనకిష్టుడైన కార్యవీర్యార్జునుడు అంతగా స్తుతిస్తే దత్తస్వామి ఎందుకు కన్నులు తెరువలేదు? అసలు తెరిచాడా లేదా? ఎప్పుడు తెరిచాడు? ఏమి అన్నాడు? ఇవన్నీ మనస్సులో కుతూహలం రేకెత్తించాయి. అనంతర కథను త్వరగా చెప్పమని అభ్యర్థించాడు వేదధర్ముడు ఇలా చెప్తున్నాడు. నాయనా దీపకా విను.


కార్తవీర్యార్జునుడు అలా స్తుతించి, స్తుతించి స్వామి ఎదుట తలవంచుకొని అంజలి ఘటించి నిలబడ్డాడు. రాత్రి గడుస్తోంది. మరొక జాములో తెల్లవారుతుంది అనగా దివ్య విమానముల నుండి సిద్ధపురుషులు అన్ని దిక్కుల నుండి అక్కడకు వచ్చి నేల మీద దిగి దత్తస్వామికి సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్తోత్రాలు మౌనంగా జపించి దగ్గరలో మౌనంగా నిలబడి వున్న కార్తవీర్యార్జునుడ్ని ఓరకంట చూసి తిరిగి స్వామికి పదే పదే నమస్కరిస్తూ తమ తమ దివ్య విమానాలు ఎక్కి తేజస్సుతో దశదిశలా ప్రకాశింపజేస్తూ వెళ్ళిపోయారు. ఆ వెంటనే పది దిక్కుల నుండి యోగీశ్వరులు వచ్చారు. సహ్యాద్రి గుహల్లోనే ఉంటున్న కొందరు యోగులూ జత కలిసి అందరూ స్వామి పాదాలకు సాగిలపడ్డారు. చేతులు చాచి నమస్కరించారు.


Sunday 23 April 2023

శ్రీదత్త పురాణము (117)

 


పరాత్పరా నిజంగా నేను మందబుద్ధిని. రాజభోగాలలో తల వరకు మునిగాను. అవి నశ్వరాలని దుఃఖహేతువులని గ్రహించలేకపోయాను. ఇప్పటికి కళ్ళు తెరిచాను. నాకు ఈ రాజ్యాలు వద్దు, భోగాలు వద్దు. నీ పాద రేణువుననుగ్రహించు. సిద్ధులైనవారు ఈ జగత్తు మిధ్య అంటారు. మనోభ్రమ వల్ల సత్యంలాగా కనబడుతుంది అంటారు. నిజంగా ఇదంతా వట్టి మిధ్యే అయితే ఇది ఇంత ఖచ్ఛితంగా సత్యంలాగా కన్పించటం సంభవమేనా? నిన్ను శరణు పొందాను. నా సందేహాన్ని తీర్చి అచ్చమైన తెలివిని కలిగించి ధన్యున్ని చెయ్యి - భయనివారకా! ఈ సంసారం అనే మొసలికి భయపడినంతగా నేను మరి ఇంక ఏ శత్రువుకూ, ఏ భూతానికీ, ఆఖరికి మృతువుకు కూడా భయపడను. అందుకే రాజ్యవైభవాలన్నీ వదిలేసి నీ చరణ సన్నిధికి వచ్చాను. నీ పాదాల చెంత శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. నా భవభయం తొలగించు, సత్యము, శాశ్వతమూ అయిన సుఖం కలిగించు. తాపత్రయంలో మాడిపోతున్న నాకు నీ అనుృతమయమైన వాక్కులతో ఉపశమనం కలిగించి, సేద తీర్చు. విశ్వాత్మా, విశ్వేశా, నీపాదాలకు నమస్సులు యోగమార్గానుకూలురు కర్మబంధాలు తెంచుకుని యోగసిద్ధిలో ఏ పరతత్వాన్ని చూస్తున్నారో అది నువ్వే. అలాంటి నీపాదాలకు వందనములు, ఇంద్రియాలను తృప్తిపరచటం కోసం సుఖానుభూతితో పాపజలంలోపడ్డాను. ఎన్నో ఏళ్ళు గతించాయి. ఒడ్డూ దారి కనిపించటం లేదు.


ఈ మనస్సుకి ఎన్నటికీ ఏవగింపు కలగడం లేదు. ఇదేమి దురదృష్టమో మహారాక్షసులు చివరికి పశుపక్ష్యాదులు కూడా సత్సాంగత్యం వల్ల ఆత్మజ్ఞానం పొంది సంసార సముద్రాన్ని దాటగలిగారు. నేనో? క్షత్రియవంశంలో పుట్టి ఎంతోకాలం నీ సేవజేసి, రాజభోగాల లంపటంలో పడి మరింత ఇరుక్కున్నానే తప్ప కాసింతయినా బంధ విముక్తుణ్ని కాలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. రాజ్యసంపదలలో పిచ్చివాళ్ళయి మిధ్యావిలాసాల్లో మిధ్యాసుఖాల్లో తగుల్కొన్నాను. ఎట్టెదుట కాపువేసి వున్న మృత్యువును పసిగట్టలేకపోయాను. నాకన్నా మందమతి ఇంకెవరైనా వుంటారా? నువ్వే జాలిపడి కరుణించాలి. నీ అనుగ్రహాన్ని నా మీద పూర్తిగా ప్రసరింపజెయ్యాలి. అది ఒక్కటి తప్ప నేను ఇంకేమీ కోరను. నాకు శాంతిని ప్రసాదించే మార్గం ఇదొక్కటే. సకల సృష్టికీ నువ్వు సౌర్వభౌముణ్ని చేస్తానన్నా ఇంద్ర పదవి కట్టబెడతానన్నా చివరకు పరమేష్టిని చేస్తానన్నా నాకు వద్దు. వాటిలో సుఖం లేదని తెలిసిపోయింది.


ఆర్తి హరా! జగదీశ్వరా! నీ ఉపదేశమనే కొడవలితో నాలోని అహంకార గ్రంథిని మొదలంటా నరుకు. విశుద్ధ విజ్ఞానఘనా! సదానందా! లీలావిగ్రహ శరీరా! పురాణ పురుషా! నమోనమః నమోనమః పద్మనాభా! అజ్ఞానంలో పడి నీ పాదపద్మాలను సేవించని వాళ్ళని సైతం ఉద్ధరించటానికి అవతరించిన దయామయుడవు అని పెద్దలు చెబుతున్నారు. అలాంటిది నీ పాదధూళిని శిరసా వహించిన నాబోటి వారికి నీ దయ అనుభవంలోకి రాకపోవటం, ఇంకా భవరోగులమై బాధపడటం వింతగా ఉంది. అనసూయా అత్రి మహర్షుల తపస్సుకి మెచ్చి వారికి పుత్రుడుగా నిన్ను నువ్వు దత్తం చేసుకున్నావు. అలా దత్తదేవుడవయ్యావు, అంతటి దయాళుడవూ అంతటిదాతవూ ఎందుకో మరి నా మొర ఆలకించటం లేదు.


Saturday 22 April 2023

శ్రీదత్త పురాణము (116)

 


కార్తవీర్య కృత దత్తస్తుతి


దేవాది దేవా! మహానుభావా! నువ్వు అనంతుడివి స్వయంప్రకాశకుడివి! నీలో స్వప్నతుల్యమైన ఈ జగత్తు మాయవల్ల వాస్తవంగా కనిపిస్తుంది. ఈ సృష్టి అంతా నీకు మనసా కల్పితం. ఒక్కటే చైతన్యం మాయాగుణం కారణంగా అనేక రూపాలతో భాసిస్తుంది. లేనిది ఉన్నట్లుగా అది అలా కనిపించటానికి ఆధారమైన నీకు ఇదే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పరమాత్ముడవైన నీకు జాగ్రత్, స్వప్న, సుషుప్త్యాది అవస్థలన్నీ మాయా కల్పితాలు. ఇది తెలుసుకున్న జ్ఞానులు (అనుమాణ ప్రమాణం) గురూపదేశం అనే రెండంచుల జ్ఞానఖడ్గంతో హృదయంలోని అహంకార గ్రంధిని ఛేదించుకుని అఖిలగురుడవైన నిన్ను శరణు శరణు అంటున్నారు. విశ్వేశా! శరణన్నవారి భవరోగ దుఃఖాలను తొలగించి జ్ఞానకాంతుల్ని వెలిగించి ముక్తుల్ని చేసే గురుత్తముడవి నీవు, త్రిగుణమాయానియామకుడవు గోవిందా, అచ్యుతా, ఆజా, సదేశా, నీకేదే నా కోటి నమస్కారములు. నీవు నిత్య ముక్తుడవు పరిశుద్ధుడవు. విబుద్ధుడవు, ఈశుడవు, సర్వదేవ రక్షకుడవు అనన్య సిద్ధుడవు అటువంటి నిన్ను దేహేంద్రియాది స్వరూపుణ్ని నేను ఇదే శరణు కోరుతున్నాను.


సచ్చిదానందా పురాణ పురుషా, నారాయణా - జగత్కారణకారణా పురుషోత్తమా ఈ సంసారబిలంలో పడ్డాను నేను. ఇక్కడ ఏదో గొప్ప సుఖం ఉంది. అనుభవిద్దామని సంబరపడుతూ వచ్చిపడ్డాను. కాలం నన్ను కాటు వేసింది. ఇప్పుడు అలమటిస్తున్నాను. దయాళూ నిర్వాణానుభవ మహానందాన్ని అందించే నీ బోధామృత వాగ్బిందువుల్ని నా మీద జల్లి నా ఆర్తిని దుఃఖాన్ని తొలగించు. మాయామయుడవై ఈ విశ్వాన్ని సృష్టిస్తావు పోషిస్తావు లయిస్తావు. అంతా నీ ఇచ్ఛాశక్తితోనే జరుగుతుంది. దాన్ని బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరు అంటే మానవమాత్రులం మేము తెలుసుకోగలమా? భావపరంపర యాత్రలో చిక్కుకుని జనన మరణాల కోరల్లో నలిగిపోతూ తాపత్రయాలలో మాడిపోతూ పరితపిస్తున్న నాకు-స్వామి-నీపాద పద్మాలే దిక్కు- నీ వాక్కే ఉపశమనం మరొక దిక్కులేదు. విశ్వరూపా మహామునులకు కూడా అందని భక్తియోగాన్ని వైరాగ్యాన్ని విశుద్ధ విమల విజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. అఖిల దుఃఖాలకు మూలబీజం అహంకారం, మమకారం. వీటిని తొలగించు వైకుంఠధామా! నువ్వు దత్తాత్రేయుడుగా అవతారం ధరించింది యోగప్రచారానికే జ్ఞానప్రసారానికే అంటారే మరినువ్వే కరుణించకపోతే ఇక నాబోటి వారికి దిక్కెవరు తండ్రీ.


అన్ని అనర్ధాలకు నిలయం ఈ శరీరం. ఇందులో పడి కొట్టుమిట్టాడుతున్న జీవుల్ని ఉద్దరించటం కోసం నువ్వు ఎన్నో అవతారాలు ఎత్తుతుంటావట. సత్వగుణంతో దేవతల్ని రజోగుణంతో పాలకుల్ని తమోగుణంతో భూతాదుల్ని కల్పించి గుణాలన్నింటికి నువ్వే నియతంగా నిలబడి తర్వాత నువ్వే అతీతంగా నిలుస్తావట. ఆదిపురుషా! జగదీశా! నిన్ను తెలుసుకోవటం నాబోటి మందబుద్ధులకు సాధ్యమా? సక్రమంగా నిన్ను సేవిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తావట. నిష్కామంగా నీ పాదుకలు నిత్యం పూజిస్తే చాలు అనశ్వరమైన బ్రహ్మపదాన్నే అనుగ్రహిస్తావట.


Friday 21 April 2023

శ్రీదత్త పురాణము (115)

 


శౌనకాదిమునులారా! గురుసేవాపరాయణుడూ, ఉత్తమభక్తుడూ అయిన శిష్యుడు దీపకుడు. వేదధర్ములవారికి పాదాభివందనం చేసి ఏమి అడిగాడో దానికి ఆ గురువుగారు ఏమి చెప్పారో కలికి బ్రహ్మ స్వయంగా వినిపించాడు. దాన్ని మీకు నేను వినిపిస్తాను అంటూ సూతమహర్షి ఇలా చెప్తున్నాడు.


గురుదేవా! చిదానందమహోదది అయిన శ్రీమన్నారాయణుడి లీలావతార చరిత్రను ఇంకా సవిస్తరంగా వినాలని నా మనస్సు కుతూహలపడుతోంది. శ్రుతి, స్మృతి, పురాణాల్లో మహర్షులచేత కీర్తింపబడిన ఆ రహస్యాలను శ్రద్ధతో వింటున్న నాకు దయచేసి ఎరుకపర్చండి. పువ్వుల నుండి మకరందాన్ని తుమ్మెదలు బొట్టుబొట్టుగా స్వీకరించి పొట్టనింపుకున్నట్లు దత్తమహిమలు సేకరించి నా గుండెలు నింపండి. ఈ దత్తమహిమలు విన్నవాడెవడూ గర్భావాసక్లేశాన్ని పొందడుగాక పొందడు.


దీపకుడి అభ్యర్థనకు మరింత సంబరపడ్డాడు వేదధర్ముడు. బిడ్డా దీపకా సమస్త పురాణాల సారాన్ని బొట్టు బొట్టుగా స్వీకరించి దత్తకథగా నీకు మొత్తం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించు.


యోగులకు పరమగురువూ, జ్ఞానవిజ్ఞానాల పెన్నిధీ, విశ్వవంద్య పదాంభోజుడూ, జగదీశ్వరుడూ, అత్యంత సుందరమైన పురుషశరీరం ధరించినవాడూ అయిన శ్రీ దత్తాత్రేయుడు ఒకానొక శుభవేళ సహ్యపర్వత ప్రాంతంలో పద్మాసనం వేసుకొని ధ్యాననిమగ్నుడై నిశ్చలంగా నిష్టగా కూర్చుని వున్నాడు. ఈ దత్తదేవుడ్ని దర్శించాలనే కోరిక కలిగి మాహిష్మతీపురం అధిపతి, కృతవీర్యుని కుమారుడు, యోగవిద్యాప్రవీణుడు, సహస్ర బాహువులు కలవాడు, మహాతేజస్వీ అయిన కార్తవీర్యార్జునుడు ధనుర్ధారియై మరొక దేవేంద్రుడిలా సహ్యాద్రికి వచ్చాడు.


అనేకరకాలైన అమృతమయమైన ఫలవృక్షములతో అద్భుత సువాసనలు అందిస్తున్న అనేకానేక పుష్పజాతులు విరబూసి నందనవనంలా వున్నది ఆ ప్రాంతం అంతా. అక్కడే ఒక పర్ణశాల గుమ్మం ముందు శుభప్రదంగా నిలువెల్లా చిగురించి గుబురుగా ఎదిగిన గున్నమావిచెట్టు మొదట పద్మాసనం వేసుకుని చిన్ముద్రలు ధరించి కన్నులు మూసుకొని నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్న దత్తాత్రేయస్వామిని దర్శించి దత్తపాదస్పర్శతో పునీతం అయిన ప్రాంతం కాబట్టి భూమికి నమస్కరించి ఆనందంతో, ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో, ఒక్క ఉదుటున సాష్టాంగపడ్డాడు. చాలాసేపు అలాగే వుండి మాటిమాటికి తలపైకెత్తి చూసాడు. ఆనందంతో మరల మరల నమస్కరించాడు. దత్తస్వామి ధ్యాననిష్టలోనే వున్నాడు. కార్తవీర్యార్జునుడు తన వెయ్యి చేతులను సంకల్పించి రప్పించి వెయ్యిచేతులతో రకరకాల వాయిద్యాలను మోగిస్తూ ఆడుతూ పాడుతూ దత్తస్వామిని సేవించాడు. ప్రొద్దుగూకింది. రాత్రి గడిచింది. తెల్లవారింది. అతడి నృత్యగీతసేన కొనసాగుతూనే వుంది. కానీ జగత్పతి మాత్రం ధ్యానం వదలేదు. కన్నులు తెరుచుకోలేదు. అప్పుడు భక్తిరసం ఉట్టిపడుతుండగా కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని అపూర్వంగా ఇలా స్తుతించాడు.


Thursday 20 April 2023

శ్రీదత్త పురాణము (114)

 


సకల భువనాలకు ఆశ్రయుడైన పరమాత్మ లీలావిగ్రహ శరీరుడై దత్తాత్రేయుడుగా అవతరించి లోకానికి సదాచారం నేర్పటం కోసం తానుగా (శేచాచార) ఆచారవిధుల్ని పాటించాడు. స్నానసంధ్యలూ, దానధర్మాలు, భిక్షాటనం, ఉపవాసం, యోగాభ్యాసం, వనవాసం, గుహానివాసం, అశ్వత్థవృక్ష ఛాయానివాసం, ఆశ్రమవాసం, గ్రామపర్యటనలు, నగర పర్యటనలు, ధ్యాన పరత్వం, మౌనస్వీకారం, దివ్యాంబరధారణ, దిగంబరస్థితి, నానాలంకార ధారణ, వీరలంకార స్థితి, రధ - గజ - తురంగ యానం - పాదయాత్ర అన్నింటినీ ఆచరించాడు. ఈ లోకాన్ని ఒక్కొక్కప్పుడు ప్రశంసించాడు. ఒక్కొక్కప్పుడు కర్మ నిర్మితంగదా, అని విమర్శించాడు, నిందించాడు. ఒకప్పుడు దివ్యాంగనారతుడయ్యాడు. మరొకప్పుడు నిరక్తుడయ్యాడు, మద్యమాంసప్రియుడుగా ఒకప్పుడు, శుద్ధ సత్వనిధిగా మరొకప్పుడు, శివలింగార్చనాపరుడుగా హరిసేవాపరాయణుగా మరొకప్పుడు, శక్తినిష్టుడుగా ఒకప్పుడూ, గణపతి ఉపాసకుడుగా ఒకప్పుడు, సౌరసాంప్రదాయిగా, హయగ్రీవోపాసకుడుగా, శివలింగ ప్రతిష్టాపనకర్తగా, కాశీలో పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తూ ఒకప్పుడూ - ఇలా లోకానికి విభిన్న దేవతామూర్తుల ఉపాసనా విధానాన్ని స్వయంగా ఉపదేశించాడు.


దత్తాత్రేయుడు ఒకానొకప్పుడు కాశీలో విశ్వేశ్వరుడికి దక్షిణంగా, త్రిపురాంతకలింగానికి పశ్చిమంగా, తానొక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దానికి ఎదురుగా కూర్చుని యోగనిష్టతో శివధ్యానం చేసాడు. అది ఇప్పటికీ చాలా పవిత్రమైన చోటు. దీన్నే "దత్తాత్రేయతీర్థము" అంటారు. అక్కడ స్నానం చేసినా, ధ్యానం చేసినా, భక్తుల సంసార రోగ సంబంధ దుఃఖాలన్నీ క్షణంలో తొలగిస్తానని దత్తాత్రేయుడే స్వయంగా ప్రకటించాడు. అక్కడ దత్త ప్రతిష్ఠితా లింగం సకల శ్రేయస్సులు నేటికీ అందిస్తుంది. వేదధర్ముడు దీపకునికి చెబుతున్నట్టుగా బ్రహ్మదేవుడు కలికి చెబుతున్న దత్తమహిమలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు గదా అని సూతమహర్షి శౌనకాదిమునులను ఒకసారి హెచ్చరించి అందరూ శ్రద్ధతో వింటున్న సంగతి గమనించి సంతృప్తి చెందాడు. 


సూతమహర్షి నీ ఋణం తీర్చుకోలేం భవరోగాలకు దివ్యఔషధం లాంటి దత్తమహిమలు చెప్తున్నావు. దీపకుడు ఆపైన గురువైన వేద ధర్ముణ్ణి ఏమి అడిగాడు? మహాతపస్వులకు సైతం ఆదర్శప్రాయుడైన వేదధర్ముడు ఏమి చెప్పాడు? అది అంతా మాకు సవిస్తరంగా తెలియజేయ్యి- లీలా మునికుమారుడైన దత్తగాధలు, చెబుతున్నవారిని వింటున్న వారినీ శుద్ధిపరుస్తాయి. మహాయోగ ఫలాలు అందిస్తాయి. వర్ణాశ్రమధర్మాలను అతిక్రమించిన వారికి సైతం పుణ్యఫలం అందిస్తాయి అంటే ఇక మనవంటివారికి ఇంకా అధిక పుణ్యఫలాన్ని అందిస్తాయి. అందుచేత సూతమహర్షి! మిగతా వివరాలన్నీ మాకు వినిపించి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అభ్యర్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్తున్నాడు.


Wednesday 19 April 2023

శ్రీదత్త పురాణము (113)

 


నాయనా వర్ణాశ్రమధర్మాలు దేవతలకు వేరు - మనుష్యులకు వేరు - పక్షులకు వేరు - జంతువులకు వేరు - సదాచార పరాయణులైన మంచివారిలో కూడా వర్ణాశ్రమాచారాలు విధులు వేరు వేరుగా వుంటాయి. పరమార్ధనిష్టతో వివృత్తికాములైన ఈ శిష్టులు చిత్తశుద్ధి కొరకు అవసరమైన సత్కర్మలు చేస్తుంటారు. వీరిలో కొందరు యోగమార్గాన్ని ఆశ్రయిస్తే కొందరు తపస్సును, కొందరు దానధర్మాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు శత్రు వినాశనం- రాజ్య సుస్థిరత - స్వర్గం - యశస్సు - భార్యాపుత్రులు - ధనం - ఇంట్లాంటివి కావాలని కోరుతూ సకాములై వేదవాద విమోహితులై యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఇన్ని భేదాల్లో ఏవి నింద్యాలు ? ఏవి శిరోధార్యాలు ? ఎవరు పండితులు? ఎవరు కారు? అన్ని మార్గాలు వేదాలను అనుసరిస్తున్నవే. వేదసమ్మతాలే. అన్నీ ప్రశస్తాలే. ఈ వేదమే పరమేశ్వరుణ్ని శుద్ధజ్ఞాన స్వరూపమని చెప్పింది. ఇలాంటి నిర్లిప్తుడు సృష్టి మొదలు నుండి కాలానుగుణంగా నింద్యకర్మలూ, ఆనింద్య కర్మలూ చేస్తూనే వున్నాడు. లీలామానుషరూపాలు అనేకం ధరించి భూమిపై అవతరించీ, అవతరించకా - దుష్టశిక్షణ శిష్ట రక్షణ అనాదిగా చేస్తున్నాడు. వీటిలో ఏది దోషమంటావు? ఏది కాదంటావు? అన్ని ధర్మాలకు మూలమైన వేదమే ప్రవృత్తి- నివృత్తి మార్గాలను రెండింటినీ సమతుల్య ప్రధానంతో ప్రబోధిస్తోంది. పరస్పర విరుద్ధాలైన ఈ రెండింటిని ఒకే కర్త ఒకేసారి అవలంభించగలడా? అవలంభించలేడు. కనుక ఇవి వేరు వేరు వ్యక్తుల కోసం అని మనం గ్రహించాలి. అధికార భేదాన్ని బట్టి ఆచారభేదము, ధర్మభేదము, మార్గభేదము ఏర్పడతాయి. అందుచేత మనం అనుకునే సదాచార - దురాచాక భేదం పరమాత్మకు వర్తించదు. ఆ పరమేశ్వరుడి పాదపద్మపరాగాన్ని శిరసావహించి, యోగాభ్యాసంతో కర్మబంధాలన్నీ వదిలించుకున్న మునీశ్వరులే దేనికీ బద్ధులు కాకుండా అన్నింటికి అతీతులై స్వేచ్ఛగా, స్వేచ్ఛాదృతశరీరులై సంచరిస్తూ వుంటే ఇక పరమాత్మకా, ఈ బంధనాలు నియమనిష్టలూనూ? అతడికి సదాచారమేమిటి? దురాచారమేమిటి? కార్యమేమిటి? ఆకార్యమేమిటి? ఏదీ లేదు.


యోగీశ్వరుడైన శ్రీహరి సర్వజగత్తుకూ సాక్షాత్తూ ఆత్మ. సర్వభూతములందు వుండువాడు. లీలా విగ్రహధారి. ఈ విజ్ఞాననిధి భూతదయతో సజ్జనులకు అభయం ఇవ్వడం కోసము ఇలా అనసూయా అత్రి దంపతులకు ముని కుమారుడై అవతరించాడు. కనుక పరమాత్మ ధర్మాతిక్రమణం చేస్తున్నాడు అనడం సాహసం వంటిదే. సర్వభక్షకుడైన అగ్నికి ఏ దోషమూ అంటనట్లే పరమాత్మకూ అంటదు. మదవతీమదరతుడై కనిపించాడని మూర్ఖత్వంతో మనమూ ఆ పనులు చేస్తే ధర్మభ్రష్టులము అవుతాము నశిస్తాము. శివుడు విషం త్రాగాడు కదా అని మనమూ త్రాగుతామా? త్రాగి బ్రతుకుతామా? అందుచేత ఈశ్వర అవతారాలు చెప్పినట్లు మనం చెయ్యాలే తప్ప వారు చేసినట్టు మనం చేయకూడదు. అహంకార మమకారాలను పూర్తిగా త్యజించిన వారికి ఇక సదాచారము దురాచారము అంటూ వుండదు. దానివల లాభంగానీ దీని వల నష్టంగానీ వుండదు. అఖిలభూతాలకూ దేవ, మానవ, తిర్యగ్జాతులకూ అందరికి కుశలప్రదుడైన పరమాత్మకు ఆచార హాని ధర్మహాని వల్ల నష్టం ఏమీ వుండదు. అన్నింటికి అతీతులు అవతార పురుషులు అంటే. కనుక నాయనా దీపకా! ఇలాంటి సందేహాలు బుర్రలోకి రానివ్వకు. తగిన శిక్షణ లేని మూఢులు వేసే ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడూ వేయకు.


Tuesday 18 April 2023

శ్రీదత్త పురాణము (112)

 


తృతీయ భాగం


దీపకుడు వేదధర్మునికి పాదాభివందనం చేసి ఇలా అడిగాడు. ఆధ్యాత్మిక జ్ఞానరాశి! గురుదేవా! నాదొక సందేహం. దేవాదిదేవుడూ జగద్విధాత అయిన పరమేశ్వరుడు అనసూయ అత్రిమహర్షులకు తనయుడుగా జన్మించి మునియై- విరాగియై అనాచారాన్ని ఎందుకు ఆశ్రయించాడు? పెద్దలు ఏది ఆచరిస్తే ఏది ఉపదేశిస్తే తక్కిన వారంతా అదే ఆచరణీయం కాబోలు అనుకుని అనుసరిస్తారు గదా!


దీపకుని సందేహ నివారణ


ఆనందకందమైన పరమాత్మ అసలు విప్రుడుగా ఎందుకు జన్మించాడు? లోకంలో బ్రాహ్మణుడు అంటే ధర్మప్రవర్తకుడూ మోక్ష మార్గోపదేశకుడు కదా! మరి బ్రాహ్మణుడుగా పుట్టి ఇలా విరుద్ధంగా ప్రవర్తించటం ఏమిటి? ఇది సత్సంప్రదాయమేనా? దయానిధీ విశ్వబంధూ ఇది నా సందేహం దయచేసి దీన్ని తొలగించు, ఆస్తకాముడూ, పరమానంద స్వరూపుడూ అయిన ఈశ్వరునికి ఏ దోషమూ అంటదన్నట్లయితే అసలు బ్రాహ్మణుడుగా పుట్టడం ఎందుకు? పుట్టినపుడు ఆ ఉపాధికి తగినట్లుగా ప్రవర్తింపక నిరంతరం స్త్రీ సంగమ సంయుక్తుడై, మద్యపానరతుడై, మదమూరి నేత్రుడై మట్టి కొట్టుకున్న దేహంతో ఆడ ఏనుగుకి లొంగిపోయిన మదమాతంగంలా ప్రవర్తించటం. అందరికీ దర్శనం అనుగ్రహించటం ఇది ఏమిటో నాకు తెలియడం లేదు. ఇది నా దృష్టికి సమంజసంగా తోచటం లేదు. ఇందులో ఏదో రహస్యం వుంటుంది. అది తెలియచేసి నా సందేహాన్ని తొలగించండి. అప్పటికిగానీ నా మనస్సు కుదుటబడదు అన్నాడు దీపకుడు.


నాయనా దీపకా నీకు కలిగిన సందేహమేనా ఇది? ఏమో ఎందుకు అడిగావో మనస్సులో పెట్టుకొని మల్లగుల్లాలు పడకుండా అడిగి మంచి పనిచేసావు. చెబుతాను విను. లోకంలో ఇలాంటి సందేహాలు లేవనెత్తేవాళ్ళు వుంటారు. అంటూ వేదధర్ముడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా చెప్తున్నాడు.


Monday 17 April 2023

శ్రీదత్త పురాణము (111)



కోరికలు వదులుకుని ఆత్మానందాన్ని అనుభవించటం చేతకాక ఈ లోకులంతా కోరికల వెంట పరుగులు తీస్తున్నారు. దుఃఖభాజనులు అవుతున్నారు. సత్యమూ, జ్ఞానమూ, అనంతమూ, జ్యోతిస్వరూపమూ, సనాతనమూ, అయిన నీ పరబ్రహ్మమైతే ఉన్నదో అదే నేను. అదే ఆత్మ. దత్తాత్రేయుడి దయవల్ల తల్లిదండ్రులు అనుగ్రహం వల్ల సోదరుడి కృషి వల్ల నేను కృతార్ధుణ్ని కాగలిగాను. నిజంగా నిస్సంశయంగా కృతార్థుణ్ని కాగలిగాను.


తండ్రీ, దత్తస్వామి అలర్కుడికి బోధించిన యోగవిద్య అంతా నీకు నేను తెలియచేశాను. దీన్ని నీవు అభ్యసించి ఆచరణలో పెడితే బ్రహ్మానంద స్థితిని పొందుతావు. ముక్తికి యోగమొక్కటే ఉత్తమమార్గం. యజ్ఞాలు, జపాలూ, తపాలు, ఇవన్నీ ఎందుకుగానీ యోగవిద్యను ఉపాసించు. జనకా దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వు అడవులకు వెళ్ళి యోగాభ్యాసం కొనసాగించి నిర్ద్వందుణ్నీ విష్పరిగ్రహుణ్నీ అయ్యి బ్రహ్మభావం పొందటానికి, ముక్తిని పొందటానికి నిర్వృతిని పొందటానికి ప్రయత్నిస్తాను.


తండ్రికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి లేచి అనుమతి తీసుకుని సుమతి అడవులకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తండ్రి ఏమి చేసాడంటే కన్నకొడుకు తనను విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడనే ఆలోచనలతో గుండెల్లో కమ్ముకున్న మమకార దుఃఖం నుండి క్షణంలో తేరుకొని కొడుకు చెప్పిన యోగవిద్యా రహస్యాలను మననం చేసుకుంటూ ఆ క్షణం నుండే యోగాభ్యాసం ప్రారంభించాడు. కొంతకాలానికి పరిణితి చెంది వానప్రస్థం స్వీకరించాడు. ఆపైన మరికొంతకాలానికి నాల్గవదైన సన్యాసాశ్రమం స్వీకరించి యోగసిద్ధి పొందాడు.


నాయనా దీపకా! విన్నావు గదా ఇది దత్తమహిమ. ప్రసక్తానుప్రసక్తంగా పితాపుత్రుల కథ. కార్తవీర్యుడి గాధ. ఆలర్కోపదేశం అన్నీ నీకు తెలిపాను. దత్త మహిమను ఎవరు ఎప్పుడు చెప్పినా, విన్నా, వారికి దత్తుడి అనుగ్రహం వల్ల సమస్తకిల్బిషాలు తొలగిపోతాయి. సంసార సంబంధమైన దుఃఖాలు నశిస్తాయి. ఐశ్వర్యాలు లభిస్తాయి. అహంకార మమకారాలు తొలగి మనస్సు తేలికపడుతుంది. ఈ జీవితం, ఈ జీవకోటి, ఏ సూత్రం మీద నడుస్తున్నాయో అవగతమవుతుంది. ఆత్మకు ధైర్యమూ, చైతన్యమూ ఏర్పడతాయి. యోగాభ్యాసం పట్ల గురికుదిరి అంతిమంగా నిర్వాణానుభూతి కలుగుతుంది- అని చెప్పి వేదధర్ముడు కాసింత విశ్రాంతి తీసుకున్నాడు అంటూ బ్రహ్మకలి పురుషునితో చెప్పాడు.

Sunday 16 April 2023

శ్రీదత్త పురాణము (110)

 


సుమతీ ఆ తర్వాత ఏమయ్యింది ? నిరక్తుడైన అలర్కుడు రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడు ? సుబాహువు మరి తన తమ్ముడ్ని ప్రశంసించలేదా ? ఇలా ప్రశ్నిస్తున్న తన తండ్రికి తరువాత కధను సుమతి ఇలా వివరించాడు. అది కూడా నీకు చెబుతాను అంటూ వేదధర్ముడు దీపకుడికి అలర్కకథను ఇలా చెప్తున్నాడు.


కాశీరాజు వీడ్కోలు చెప్పాక అలర్కుడు సుబాహువుకు పాదాభివందనం చేసాడు. అన్నా నన్ను కృతార్ఖుడ్ని చేసావు. కృతజ్ఞుణ్ని చిన్నప్పుడు అమ్మ మీ ముగ్గురికీ బ్రహ్మజ్ఞానం నూరిపోసింది. నాకు ఆ అదృష్టం లేకపోయింది. లౌకిక మార్గంలో పడి రాజ్యపాలన అంటూ జడుడ్ని అయ్యాను. నీ దయవల్ల ఇప్పటికి విముక్తుడ్ని కాగలిగాను అని ఆనందభాష్పములు రాలుస్తూ వణుకుతున్న కంఠంతో మాట్లాడుతున్న తమ్ముణ్ణి అర్ధంగా కౌగలించుకున్నాడు. సుబాహువు, తమ్ముడూ! నీ బ్రహ్మజ్ఞానం మీద నాకు నమ్మకం కుదిరింది. ఏది చెయ్యాలో అది చేసావు. కాబట్టి ఇంక నీ యిష్టం. రాజ్యమే ఏలుకుంటావో, అడవులకే వెడతావో నిర్ణయించుకో. ఇందులో నాకు కృతజ్ఞతలు చెప్పవలసింది. ఏదీ లేదు. అంతా దత్తాత్రేయుడి అనుగ్రహం. శుభమగుగాక అని ఆశీర్వదించి సుబాహువు నిర్లిప్తంగా నడిచి వెళ్ళిపోయాడు.


అలర్కుడు అంతఃపురానికి వెళ్ళి ఆ రోజే తన పెద్ద కొడుకుకి రాజ్యపట్టాభిషేకం జరిపించి పరిపాలనా బాధ్యతలు అప్పగించి తాను ధర్మపత్నీ సమేతుడై వానప్రస్థానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం యోగాభ్యాసం చేస్తూ కొంత కాలానికి నిర్ద్వంద్వుడూ, నిష్పరిగ్రహుడూ అయి యోగసిద్ధిని పొందాడు. నిర్వాణ ఫలాన్ని చవిచూసాడు. ఆ స్థితి నుండి ఈ జగత్తు అంతా తిలకించాడు. దేవ, అసుర, మానవగణాలతో పశుపక్ష్యాది జాతులతో అనేక రకములై వృక్షసంపదలతో కిటకిటలాడుతున్న జగత్తు సత్వ, రజస్తమో గుణాలనే బంధాలలోబడి కొట్టుమిట్టాడుతున్న వైనం కనిపించింది. బిడ్డలనీ, తోబుట్టులనీ, మిత్రులనీ, శత్రవులనీ, తనవారనీ, పరాయివారనీ ఏవేవో బంధాలు - సంబంధాలు కల్పించుకుంటూ తన్నులాడుకుంటున్నారు. కామక్రోదాదులకులోనై దుఃఖారులవుతున్నారు. అజ్ఞానమనే బురదగుంటలో పడిదొర్లుతున్నారు. ఉద్ధరించే దిక్కు లేక అల్లల్లాడుతున్నారు. తానొక్కడూ గట్టు మీద నిలబడి చూస్తునట్లు దర్శనం అయ్యింది. అప్పుడు అతని నోటి నుండి అప్రయత్నంగా ఇలా అన్నాడు.


ఓహో! ఒకప్పుడు నేను అనుభవించిన రాజ్యభోగాలు సుఖాలు ఇప్పటి ఈ నిర్వాణానుభవంతో పోలిస్తే అవి ఏ పాటి? యోగాన్ని మించిన పరమ సుఖం లేదు గాక లేదు. కాంతాకనకాలు వస్తు వాహనాలు - ధనధాన్యాలూ - లోకంలో ఏ ఐశ్వర్యమైనా, అది అందించే ఆనందమైనా యోగం అందించే ఆనందంలో పదహారవవంతు కూడా లోకంలోని ఏ కాదు.

Saturday 15 April 2023

శ్రీదత్త పురాణము (109)

 


మావాడికి దుఃఖం కలిగింది. అందులో నుండి వైరాగ్యం బయలుదేరింది. దత్తదేవుడి కృపవల్ల సద్గురు బోధ లభించింది. బ్రహ్మజ్ఞాని అయ్యాడు. నా కోరిక నెరవేరింది. మరింక నాకు శలవు. నువ్వు చేసిన ఉపకారానికి నేను కృతజ్ఞుణ్ణి, నిన్నొక సాధనంగా వుపయోగించుకున్నానని బాధపడకు. చిన్నబుచ్చుకోకు, ఈ రాజ్యం కూడా అందుకొని సుఖించు. మదాలస వంటి యోగమాత కడుపునబుట్టిన వాళ్ళం. ఆ తల్లిపాలు త్రాగిన వాళ్ళం. మా తమ్ముడు కూడా మా తల్లి ఉపదేశించిన బ్రహ్మమార్గంలోనే ప్రయాణించాలని మేము కోరుకోవడంలో తప్పులేదు కదా ! సమర్ధులు వుండగా అయినవాడు అసమార్గం పడితే అది ఎవరి తప్పు అవుతుంది ? లోకం మమ్మల్నే కదా ఆడిపోసుకుంటుంది.

సుబాహువు ప్రసంగంతో కాశీరాజు కలత చెందిన మనస్సుతో సాధు పుంగవా! సుబాహూ! అలర్కుడికి ఉపకారం చెయ్యాలనుకున్నావు. మరి నాకు ఉపకారం చెయ్యాలని ఎందుకు అనుకోలేదు. సజ్జనులతో కలయిక నిష్ఫలంకావడానికి వీలులేదు. సత్ఫలాన్ని అందించు, అంచేత నీ కలయికవల్ల నాకు కూడా ఉన్నతిని కలిగించు. జ్ఞానోపదేశం చేసి పుణ్యం కట్టుకో. 

కాశీపతీ ఇలా అడిగావంటేనే నీలో మార్పు తెలుస్తోంది. సంతోషం, ఆలకించు, ధర్మార్ధ కామమోక్షములని నాలుగు పురుషార్ధాలు వున్నాయి. వీటిలో మొదటి మూడింటినీ నీవు సాధించావు.

ఇప్పుడిక నాల్గవ దానికోసం ప్రయత్నించు. దాన్ని సాధించడం ఎలాగో క్లుప్తంగా చెప్తాను. సావధాన చిత్తంతో విను, విని బాగా ఆలోచించి శ్రేయస్సాధన కొరకు ప్రయత్నించు, మమ - అహమ్ అనేవి రెండూ దరిజేరకుండా చూసుకో. నేనెవడను? ఎవడి వాడను ? అని లోలోపల తర్కించుకో పరిపాలనా బాధ్యతలు అయ్యాక అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని తర్కించుకో. నీ ఆలోచల్ని అంతర్ముఖంగా ప్రయాణం చెయ్యనియ్య వ్యక్తావ్యక్తాలు తెలుసుకో అప్పుడు నేను ఏమిటో తెలుస్తుంది. అది తెలిస్తే అన్నీ తెలిసిపోతాయి. ఆత్మ కానిదాన్ని ఆత్మగా భావించడమే అజ్ఞానం. అదే విమూఢత, దీన్ని తొలగించుకుంటే చాలు. రాజా నేను సర్వగతుడ్ని అయినా నువ్వు అడిగావు కాబట్టి లోక వ్యవహారాన్ని బట్టి సంక్షేపంగా సారాంశం తెలియజేసాను. సెలవు వస్తాను అంటూ సుబాహువు బయలుదేరాడు.

కాశీపతి ఒక్కనిమిషం అంటూ అన్నదమ్ములిద్దరికీ పాదాభిషేకం చేసాడు. ఇది మీ రాజ్యం మీ యిష్టం అని తన రాజధానికి బయలుదేరాడు.

Friday 14 April 2023

శ్రీదత్త పురాణము (108)

 


ఇంతకన్నా నాకు సాధించవలసింది ఏదీ కనిపించడం లేదు. ఇప్పుడు నువ్వు నాకు శత్రువుకాదు. నేను నీకు శత్రువునీ కాదు. సుబాహువు కూడా అంతే అంతటా నేను ఆత్మనే దర్శిస్తున్నాను. అంచేత ఓరాజా నీకు యుద్ధం చెయ్యడానికి ఓ శత్రువు కావలసి వస్తే ఇంకెవరినైనా వెతుక్కో. అలర్కుడి మాటలు వింటున్న కాశీపతి ముఖం వెలవెలబోతూ వుంటే సుబాహువు ముఖం మిలమిల మెరుస్తూ వుంది. అలర్కుడ్ని ఆనందంతో కౌగిలించుకున్నాడు సుబాహువు. కాశీపతి దీనికోసమే - మా సోదరుడిలో ఈ మార్పు 

రావడం కోసమే - నేను నిన్ను శరణుకోరాను. నా కోరిక నెరవేరింది. నా పన్నాగం ఫలించింది. నేనింక బయలుదేరుతాను నీకు సుఖమగు గాక అని సుబాహువు అన్నాడు.


సుబాహూ అలర్కుడ్ని జయించి తాతతండ్రుల రాజ్యాన్ని అప్పగించమని కదా నీవు అడిగావు. ఇప్పుడు నీకు ఆ అవకాశం వచ్చింది. రాజ్యాన్ని తీసికొని భోగాలు అనుభవించు. వెళ్లిపోతానంటావేమిటి ? అని అడిగాడు కాశీపతి.


అప్పుడు సుబాహువు ఇలా అన్నాడు. రాజా ఇంత ప్రయత్నమూ నేనెందుకు చేసానో నీతో చేయించానో నువ్వు గ్రహించు, నా తమ్ముడితడు, తుచ్ఛమైన రాజ్యభోగాలలో గ్రామ్య సుఖాలలో మునిగిపోయాడు. బ్రహ్మతత్వానికి దూరమవుతున్నాడు. ఇతడ్ని దారిలోకి తీసుకురావడం ఎలాగా అని నాకు దిగులుపట్టింది. మా కన్నతల్లి మదాలస బాల్యం నుండే నాకూ నాపై వాళ్ళిద్దరికీ బ్రహ్మతత్వాన్ని జోలలుగా పాడింది. స్తన్యంనోటితో, బోధ చెవులతో త్రాగించింది. మేము ముగ్గురం అమ్మదయవల్ల బ్రహ్మజ్ఞానులమై దుఃఖ రహిత పరమానందస్థితిని అనుభవిస్తున్నాం. కడగొట్టు తమ్ముడు వీడు. ఇతడు ఒక్కడూ ఇలా ఇంద్రియ సుఖాలకు దాసుడై ఎండమావులవెంట పరుగెత్తుతున్నాడు. చిన్న నాటనే అమ్మ వీడికి ఆబోధలు చెయ్యలేదే అనే దిగులుపడ్డాను. పదిమంది మంచివారు ఒకదారిలో వెళ్తూవుండగా ఒకడు మధ్యలో దారి తప్పితే ఎలాగుంటుంది. మిగిలిన వారికి బాధగా వుండదా ? అలాంటిది సొంత తమ్ముడు భోగబంధాలలో చిక్కుకొని చెడిపోతూ వుంటే నా మనస్సు విలవిలలాడదూ? ఉద్దరించాలి అనుకున్నాను. భోగాల నుండి విరక్తికలగాలంటే దుఃఖం వల్లనే కలుగుతుంది. మరి ఆ దుఃఖం విత్తనాశనం వల్లనే కలుగుతుంది. అంచేత ఇతడి రాజ్యాన్ని కొల్లగొట్టే ఏర్పాటు నీ ద్వారా చేసాను.


Thursday 13 April 2023

శ్రీదత్త పురాణము (107)

 


మూఢులై అజ్ఞానతిమిరంతో కొట్టుమిట్టాడే జనులకు జ్ఞాన చక్షువును అందించే యోగభాస్కరా, బ్రహ్మవంశ సంభవా, మునీశ్వరా, మౌనశాలి, అనసూయా తనయ, మునిసుత, నమోస్తుతే నమోస్తుతే! స్వేచ్ఛా విహారి ! వర్ణాశ్రమ వివర్జిత ! నిజానికి నీకు ఏ రూపం లేకపోయిన బ్రాహ్మణ రూపం ధరించి కనిపించేవాడా! యోగీ ! వేద బ్రాహ్మణ రక్షక ! కైటభమర్ధనా! వైకుంఠ! వైకుంఠానికి ఈ విశ్వానికి బెడదతెచ్చే వ్యక్తులను, శక్తులను నాశనం చేసేవాడా! మురారాతి ! కేశినిఘాదనా ! కంస విధ్వంసి ! కృష్ణా ! పదేపదే నీకు శిరసువంచి అంజలి ఘటిస్తున్నాను. దేవదేవ జగత్పతి ! నీ అనుగ్రహంవల్ల కృతార్థుణ్ణి అయ్యాను, నువ్వు ఆజ్ఞాపించిన తత్వాన్ని పూర్తిగా అభ్యసిస్తాను, అని ఆనందాతిశయంతో బొంగురుపోతున్న గొంతుతో, ఒణికిపోతున్న శరీరంతో సాష్టాంగపడి ఆనందభాష్పాలతో దత్తదేవుని పాద పద్మాలు కడిగి ఆలర్క మహారాజు స్వామి వద్ద సెలవు తీసుకొని బయలుదేరాడు.


సహ్యాద్రి నుండి అలర్కుడు సరాసరి రాజధానికి వెళ్ళాడు. అక్కడ తన సోదరుడు సుబాహువూ కాశీపతి కొలువు తీరియున్నారు. అలర్కుడు ప్రవేశించి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు. రాజ్యకాముక కాశీపతీ అనుభవించు మహోర్జితమైన ఈ రాజ్యాన్ని ఇదిగో ఇప్పుడే నీకు ధారపోస్తున్నాను. స్వీకరించి ఆనందంగా అనుభవించు. లేదా సుబాహుకి అప్పగించుకో. నీ యిష్టం ఎలా కావాలంటే అలా చేసుకో, ఇదిగో తీసికో, హఠాత్తుగా అలర్కుడు ఊడిపడటం నుంచి తేరుకోని కాశీరాజు ఈ మాటలకు మరీ నివ్వెరపోయాడు, ఏమిటి ఆలర్కా ! నీవు అంటున్నది ? రాజ్యాన్ని వదిలేస్తున్నావా ? యుద్ధం మానుకున్నావా ? ఇది క్షత్రియధర్మమేనా ? నువ్వు అసలు సిసలు క్షత్రియుడివి. క్షత్రియ ధర్మాలన్నీ ఎరిగినవాడివి ఏమిటి ఈ వింత ? రాజ్యాన్ని నాకు ధారపోయడం ఏమిటి ? అమాత్యులు, సామంతులు, సేనాపతులు, అందరూ ఓడినా క్షత్రియుడన్నవాడు మరణ భయాన్ని దగ్గరికి రానీయకుండా శత్రువు మీదకు బాణాలను గురిపెడుతూ రణరంగంలో నిలబడాలే గానీ ఇదేమిటి ? ఈ రాజ్య త్యాగం నాకేమీ అర్ధంకావడం లేదు. చాలా వింతగా వుంది. యుద్ధాలు చెయ్యాలి. శత్రువులను జయించాలి. రాజ్యభోగాలను సంతృప్తిగా అనుభవించాలి. సరలోక సుఖాలకోసం మహాయజ్ఞాలు చెయ్యాలి. ఇది మన ధర్మం.

కాశీరాజు ఇంకా ఏదో మాట్లాడబోయాడు. అలర్కుడు అడ్డు తగిలాడు. కాశీనరేశా ఒకొప్పుడు నీలాగే నాకు. ఇలాంటి ఆలోచనే వుండేది, ప్రస్తుతం నా పరిస్థితి వేరు. ఆలోచనలన్నీ మారిపోయాయి. కారణం చెబుతాను విను, గడ్డిపరక ఎలా పెరుగుతుందో ఈ సృష్టిలో ప్రతీ ప్రాణీ అలాగే పెరుగుతుంది. అన్నింటిలో వుండే చితశక్తి ఒక్కటే అదే ఆత్మ అదే పరమాత్మ. అటువంటప్పుడు రాజు ఏమిటి, పేద ఏమిటి శత్రువేమిటి ? మిత్రువు ఏమిటి ? ఇన్ని భేదాలు. ఎక్కడవున్నాయి? అంతటా వున్నది నేనే. వేరేవరితో యుద్ధం చెయ్యాలి ? కాశీరాజా దత్తస్వామి నాకు ఈ జ్ఞానం ఉపదేశించారు. కనువిప్పు కలిగించారు. ఇంద్రియాలను జయించి సర్వసంగపరిత్యాగినై మనస్సును పరబ్రహ్మంలో అనుసంధానం చేస్తాను. అసలైన జయమంటే ఇదే. పరమజయం ఇది.

Wednesday 12 April 2023

శ్రీదత్త పురాణము (106)

 


యోగీశ్వరా ! ఇలా నీ సన్నిధికి నన్ను వచ్చేట్టు చేసిన సుబాహువూ కాశీనరేశ్వరుడూ నాకు నిజంగా మహోపకారులు. నీ అనుగ్రహాగ్ని జ్వాలలో నా అజ్ఞాన కిల్బిషాలన్నీ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఏనాడూ ఇంక ఏ దుఃఖమూ నన్ను ఆవరించకుండా జాగ్రత్తపడతాను. జ్ఞానదాతవైన నువ్వు అనుమతిస్తే ఇప్పుడే ఇక్కడే, ఆర్తీ - దుఃఖమూ అనే వృక్షాలకు అడవీవంటిదైన గృహస్థాశ్రమాన్ని పరిత్యజిస్తాను అంటూ అలర్కుడు దత్తస్వామికి సాష్టాంగపడ్డాడు. -


స్వామి ప్రేమగా అలర్కుణ్ని లేవనెత్తి తలపై నిమిరి రాజేంద్రా ! నీకు శుభమగుగాక, ఇంక బయలుదేరు. నువ్వు అన్నట్టే చేయి. నా మాటలన్నీ గుర్తుంచుకో. నిర్మముడవూ, నిరహంకారుడవూ అయి ముక్తికోసం ప్రయత్నించు అన్నాడు. అలర్కుడి కన్నుల్లో భాష్పాంబు కణాలు పెల్లుబికాయి. ప్రేమ విహ్వలుడై దత్తదేవుణ్ని స్తుతించాడు.


అలర్కుడు చేసిన దత్త స్తుతి


దత్తదేవా యోగవిద్యను ప్రవర్తింపజేయడం కోసమే అవతారం ధరించినవాడవు నవ్వు. స్వరూప ఆవిర్భావంతో దేహాన్ని తుచ్ఛీకరించిన వాడవు. విజ్ఞానానికి నిలయం నీవు. అధిష్టాన దేవతవు నీవు. సుర సిద్ధసాధ్య కిన్నెర కింపురుషాదులు నీ పాద పద్మాలు సేవిస్తూ ఉంటారు.


ఓ మహానుభావా ! భక్తులను అనుగ్రహించు అనోరణీయుడవు, మహతో మహీయుడవు. బ్రహ్మాండమంత విశాల దేహము నీదే. సూక్ష్మ చిత్ శక్తి నీవే. దిగంబరుడవు నీవే. విచిత్ర దివ్యాంబర ధారివి నీవే. ఇదే నీకు నా నమోవాకం. యోగీశివంద్యుడవు, యోగవిఘ్ననాశకుడవు, మహానుభావుడవు, వృద్ధుడవు, బాలుడవు, సర్వమూ నువ్వే. కాంతతో సరసములాడుతూ సశరీరంతో నున్న నవ యవ్వన యువకుడవు నీవే. నిన్నర్ధం చేసుకోవడం చాలా కష్టం. నమోనమః నమోనమః. జనన మరణ పరంపరలకు భయపడి మునులు సమాధి నిష్టతో నిన్ను ధ్యానిస్తూంటారు. మన్మధున్ని జయించిన విరాగుల మనస్సులలో నిరంతరం మెదిలే పరతత్వానివి నీవు. పదసత్తులకు అతీతమైన పరం - ఆత్మదైవానివి, నీలో లీనమైన ఈ యోగులు, విరాగులు మరికదేనినీ ఎరుగరు. వారికి నువ్వు తప్ప మరొకటిలేదు. పరము, అవ్యయము, దివ్యము విజ్ఞాన చైతన్యము అయిన బ్రహ్మతత్వానివి నీవు. స్వతఃసిద్ధము, సనాతనము అయిన సాక్షాత్తు పరంజ్యోతిని నీవు. సర్వదేవతామయుడవు. పురుషోత్తముడవు, వాచాను గోచరుడవు, నిర్గుణ పరమాత్మవు. నీకిదే నా ప్రణతి. నారాయణా ! పద్మనాభా ! జగద్రూప ! జగత్కారణ ! వాక్యశక్తి ! వాచకశక్తి ! శరణాగత వత్సల! ప్రణతరక్షక! పూర్ణ ప్రబోధా ! యోగేశ్వరా నమస్తే నమస్తే విశ్వంభర ! గరుడ కేతన గోపాలక, అజ్ఞానమనే అజగరం మింగేస్తున్న ఈ విశ్వాన్ని ఉద్ధరించు. శ్రీపతి, భూపతి వేదశాస్త్రాలకు పురుడుపోసిన వాక్పతి ! వేదాంత వేద్యా ! సర్వ ప్రమాణ గోచరా ! నమోస్తుతే!


Tuesday 11 April 2023

శ్రీదత్త పురాణము (105)

 


ఆవుదూడ కొమ్ము చూడు తొలి నాళ్ళలో చిన్న బొట్టంత (తిలకాకృతి) ఉంటుంది. దూడతోపాటు ఎదుగుతూ ఎంతెంత కొమ్ములవుతాయో, యోగి కూడా ఇలాగే తన యోగాభ్యాసంలో ఆత్మాకాశవృత్తిని క్రమంగా వృద్ధి పొందించుకోవాలి. ధృడపరుచుకోవాలి. పశుపక్షి మనుష్యాదులు తన ఆకుల్నీ కొమ్మల్ని బెరడుల్నీ కాజేస్తున్నా వృక్షం ఎలాగైతే తన ఎదుగుదలను కొసాగించి ఫలిస్తుందో అలాగే యోగికూడా తనదేహానికి కలిగే పీడనల్ని లెక్కచెయ్యకుండా సిద్ధిపర్యంతం యోగాభ్యాసాన్ని కొనసాగించాలి. నిండుగా నీటికుండను తలపై పెట్టుకొని దారిని చూసుకుంటూ ఎత్తులకు ఎక్కేవారిని చూడు. యోగి కూడా ఇలాగే ఏకాగ్ర చిత్తంతో ధారణతో ఉన్నత స్థితికి చేరుకోవాలి. అంతేగానీ కేవలం ప్రాణాయామంతో ఒరిగేది ఏమీలేదని గ్రహించు. రాత్రి గడిచి తెల్లవారుతున్న తరుణంలో సకలప్రాణి కోటికీ చలన చేష్టాది చైతన్యం కలుగుతోంది. దీని తత్త్వం ఆకళించుకొని యోగి తన మార్గంలో కృతకృత్యుడు కావాలి. అలర్కనరేంద్రా ! ఒక్కమాట చెబుతాను సారాంశంగా గుర్తుంచుకో, యోగియైనవాడు అన్ని విషయాలలోను నిర్మమంగా ఉండాలి. తానెక్కడ ఉంటే అదే గృహంగా, ఏది తింటే అదే భోజ్యంగా (ఉన్నదే ఇల్లుగా తిన్నదే తిండిగా) ఏది ఉంటే అదే ధనంగా సంబరపడాలి.


గృహస్థుడు ఆయా పనుల్ని భృత్యులతో పుత్రులతో (కరణములు) చేయించుకుంటాడు. అలాగే యోగికూడా తన బుద్ధ్యాదుల్ని కరణాలుగా (సాధనాలుగా) వినియోగించుకొని పరాన్ని సాధించుకోవాలి. ఏనాడూ ఏమరకూడదు. రాజా ! యోగవిద్యా రహస్యాలు చాలా చెప్పాను. కనువిప్పు కలిగిందా ? ఇవి నీ బుద్ధిలోకి ఇమిడాయా ?


అలర్కుడు వినయ వినమిత శిరస్కుడై - మహానుభావా ! ఎంత అదృష్టవంతుణ్ణి, సాక్షాత్తు యోగవిద్యాస్వరూపుడి నున్చి యోగవిద్యా రహస్యాలు తెలుసుకోగలిగాను. నీ అనుగ్రహానికి ఇలా నోచుకున్న నా జన్మ ధన్యం. ఇంతకీ కారణం - నాకు జరిగిన అవమానం. నాకు వచ్చిపడ్డ అపజయం. నన్నావరించిన ప్రాణాపాయభయం. కాశీ నరేశ్వరుడి సేవా బలపరాక్రమాలు నీ చరణ సన్నిధికి నన్ను తెచ్చి పడవేశాయి. అదృష్టవశాత్తు నాకు అంతటి సైన్యబలం లేకపోయింది. అదృష్టవశాత్తు నా భృత్యులంతా హతులయ్యారు. అదృష్టవశాత్తు నా కోశం తరిగిపోయింది. అదృష్టవశాత్తు నాలో నీతి మేల్కొంది. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా నేనీపాటికి కాశీరాజుతో యుద్ధం చేస్తూ ఉండేవాణ్ని. నా అదృష్టం బాగుండి ఇలా జరిగింది. సరిగ్గా తగిన సమయానికి నీ పాదయుగళం గుర్తుకి వచ్చింది. నువ్వు అనుగ్రహించావు. అదృష్టం బాగుండి నీ ప్రతిమాటా నా హృదయంలోకి ఇంకింది. నీ సాంగత్యం వల్ల నాకు జ్ఞానోదయమయ్యింది. అదృష్టం బాగుండి నువ్వు నామీద దయతలచావు. కలిసివచ్చే కాలానికి అపకారం (అనార్యం) కూడా ఉపకారమవుతుందంటే ఇదేననుకొంటాను. నాకు కలిగిన పరాజయదుఃఖం నీ సంగమం వల్ల ఇంతటి మహోపకరంగా పరిణమించింది.


Monday 10 April 2023

శ్రీదత్త పురాణము (104)

 


అలర్కనృపతీ ! యోగులకు మరణ సూచకాలైన అరిష్టాలు ఇవ్వి. వీటివల్ల కనీసం ఒక సంవత్సరం ముందుగా మరణసమయాన్ని తెలుసుకోవచ్చు. తెలుసుకొని యోగాభ్యాసాన్ని తీవ్రతరం చేస్తే ఫలం దక్కుతుంది. ఒక్కొక్క సారి యోగమధ్యంలో మరణం తప్పిపోవచ్చుకూడా. ఇంతకీ ఈ అపశకునాలు ముందుగా మృతిని తెలుపుతాయి కనుక యోగి మరణభయాన్ని జయించి దానికోసం సన్నద్ధుడై ఎదురుచూడగలగాలి. అప్పటి వరకూ ధృడచిత్తంతో రేయింబవళ్ళు యోగసాధనను కొనసాగించాలి. ఎక్కడ ఎప్పుడు అరిష్ట సూచన లభిస్తుందో అక్కడే అప్పుడే యోగసాధనను గాఢం చేసుకోవాలి. ఆత్మవంతుడై కాలాన్ని జయించాలి. గుణ వికారాలను అణచుకొని పరమాత్మలో మనస్సును లీనం చెయ్యాలి. ఆత్మపరంగా తన్మయుడై చిద్పత్తిని సైతం విడిచిపెట్టాలి. అప్పుడు అతీంద్రియము అగోచరము అబోధ్యమూ అనాఖ్యేయమూ అయిన పరమ నిర్వాణాన్ని ఆ యోగి పొందుతాడు, అనుభవిస్తాడు.


సుమతి తన తండ్రితో చెప్పిన కథను వేదధర్ముడు దీపకుడికి చెబుతున్నాడు. సంభాషణ కొనసాగింది. దత్తయోగీంద్రుడు అలర్కుడిపట్ల కరుణగలవాడై యోగ విద్యామహిమలను ఇంకా వివరించాడు.


అలర్క నరేంద్రా ! చంద్రకాంతమణి వెన్నెల సోకితేనే స్రవిస్తుంది. సూర్యకాంతమణి ఎండతాకితేనే నిప్పులు కక్కుతుంది. ఇవి రెండూ యోగికి ఉపమానాలు. యోగికి యోగం వల్లనే ముక్తి. మధ్యలో తపస్సనీ ఇంకొకటనీ దారులు మారకూడదు. చీమలు, ఎలుకలు, ముంగిసలు, బల్లులు కపింజలాలు (కముజులు) మొదలైనవి గృహస్తుల ఇళ్ళల్లో యజమానులతో సరిసమానంగా నివసిస్తుంటాయి. బుద్ధి పుట్టినప్పుడు వేరే ఇంటికి పోతుంటాయి. ఒకవేళ ఏదైనా కారణంగా యజమానుడి ఇల్లు ధ్వంసమైపోతే ఇవి ఏమీ దుఃఖించవు. హాయిగా మరొక ఇల్లు చూసుకుంటాయి. అలాగే యోగి కూడా తన శరీరంలో తానుంటూ ఎప్పుడైనా దానికి హాని సంభవిస్తే నిర్విచారంగా మరో ఉపాధికి మారగలగాలి. యోగం సిద్ధించేవరకు ఇదే వరస. ఎప్పటికి ఇది సిద్ధించేను ? అసలు సిద్ధించేనా అని బెంబేలు పడకూడదు. చెదపురుగు యోగికి చక్కని ఆదర్శం. అది ఎంత అల్పజీవి. అయితేనేమి ఆ చిన్ని ముట్టితో మట్టికణాల్ని తొలచి ఎంతెంత పుట్టలు పెడుతుందో చూసే ఉంటావుగదా ! యోగికూడా ఈ మృద్దేహికలాగానే పరిశ్రమించి క్రమక్రమంగా యోగసిద్ధిని కైవసం చేసుకోవాలి. అంతేగాని నేనేపాటి అనుకోకూడదు.


Sunday 9 April 2023

శ్రీదత్త పురాణము (103)

 


ఎలుగుబంటిని గానీ, కోతిని గానీ ఎక్కి, పాడుతూ దక్షిణ దిక్కుకి పోతున్నట్టు కలగన్న వాడికి మృత్యువు సమీపించిందని అర్ధం. ఎర్రని చీర లేదా నల్లని చీర ధరించిన ఒక స్త్రీ జుట్టు విరబోసుకొని పాడుతూ విరగబడి నవ్వుతూ తనను దక్షిణ దిశకు లాక్కుపోతున్నట్టు కలవస్తే వాడు కూడా ఆసన్నమృత్యువే. దిగంబరుడు నిలబడి పగలబడి నవ్వుతున్న క్షపణకుడు స్వప్నంలో కనిపిస్తే అది కూడా ఆసన్నమృతినే సూచిస్తుంది. బురదగుంటలో గానీ మలమూత్రరూపంలో గానీ తలమునిగేలా కూరుకుపోతున్నట్టు కలగన్నవాడు అట్టేరోజులు బ్రతుకడు, అలాగే భీకర వికృతాకారులై నల్లని పురుషులు ఆయుధాలు ధరించి వచ్చి రాళ్ళతో తనని బాదుతున్నట్టు కలగన్నవాడు కూడా అట్టే రోజులు ఉండడు.


సూర్యోదయ సమయంలో ఒక నక్క విపరీతంగా ఊళపెడుతూ ఎదురువచ్చి తనకు అపసవ్యంగా వెళ్ళినా, అన్నం కడుపునిండా తిన్నా వెంటనే మళ్ళీ ఆకలి అవుతున్నా, పంటిలో కురుపు (వ్రణదంతః) లేచినా, దీప నిర్వాణ గంధాన్ని, అన్న గంధాన్ని గుర్తించలేకపోయినా (దీపాన్ని గంధంనోవెత్తి), రాత్రిపూట ధూమవహ్ని కంటి చూపులకి తెలియకపోయినా (ధూమువహ్నిం తథావిశ), ఎదుటవారి కనుగుడ్డులో తన ప్రతిబింబం తనకు కనిపించకపోయినా ( నాత్మానం పరనేత్రస్థం వీక్షతేన సజీవతి) అర్థరాత్రి హరివిల్లు పట్టపగలు నక్షత్రాలూ కనిపించినా ఇవి సద్యోరిష్ట సూచకాలని గ్రహించు. వెంటనే మృత్యువు సంభవిస్తుంది. ఉన్నట్టుండి నిష్కారణంగా ముక్కు వంకర తిరిగినా, చెవులు ఎగుడు దిగుడులైనా, ఎడమ కన్ను ఉత్తినే నీరు కారుతున్నా, ముఖం ఎర్ర బారడం నాలుక నల్లబారడం జరిగినా ఆయుర్దాయం క్షీణించిందని తెలుసుకోవాలి. ఒంటెలుగానీ, గాడిదలు గానీ పూన్చిన బండిమీద దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్టు కలగన్నవాడికి సద్యోమృత్యువని తెలుసుకో. చెవులు రెండు మూసుకున్నప్పుడు లోపలి ఘోష వినబడకపోయినా కళ్ళతో కాంతి తరిగిపోయినా అతడూ అట్టేనాళ్ళు జీవించడు. గుంటలో తాను పడినట్టు దానిమీద ఎవరో ఏదో వేసినట్టు తాను పైకిలేచి రాలేకపోతున్నట్టు కలగన్నవాడి పని అయిపోయినట్టే. మిడిగుడ్లుపడి రెప్పవాలకపోయినా కనుగుడ్లు ఎరుపెక్కి ఆప్రయత్నంగా గిరగిర తిరుగుతున్నా అకారణంగా ముఖం ఆవిరులు కక్కుతున్నా నాభి ప్రదేశం చల్లబడినా (సుసీదా చనాభి:- శశిరచనాభి:) అతడికది చరమసమయమని తెలుసుకో, తాను నిప్పుల్లోను, నీళ్ళల్లోను పడ్డట్టూ లేచి రాలేకపోతునట్టు కలగన్నవాడికి అదే తుదిఘడియ, కోపించి భూతపిశాచాలు రేయింబవళ్ళు తనను చితకబాదుతున్నట్టు ఎవడికి అనిపిస్తుందో వాడు వారం తిరక్కుండా సెలవుపుచ్చుకుంటాడని గ్రహించు. నిర్మలమైన తెల్లని వస్త్రాన్ని ధరించినా అది ధరించినవాడి కంటికే ఎర్రగానో నల్లగానో కనిపిస్తే వాడు కొన్ని గంటల్లో హరీ అంటాడని చెప్పి వెయ్యవచ్చు. ఆకారణంగా స్వభావంలో మార్పుగానీ, ప్రకృతి విపర్యయంగానీ అరిష్ట సూచకాలు. వినయ విధేయతలతో తానింతవరకూ పూజించిన తల్లితండ్రుల్నీ, గురువుల్నీ, అత్తమామల్నీ జ్ఞానుల్నీ, విప్రుల్నీ, యోగుల్నీ అవమానించాలనే బుద్ధి తనకే పుడితే వాడు ఆసనమృత్యువే.


Saturday 8 April 2023

శ్రీదత్త పురాణము (102)

 


ఓంకారమే త్రిమూర్తులు. ఓంకారమే త్రిలోకాలు, మూడు అగ్నులు, త్రివిక్రమ పదాలు. మూడు గుణాలు, ఋగ్యజుస్సామాలు, ఇదే. దీనిలో 'అ' కారం భూర్లోకం - 'ఉ'కారం భువర్లోకం - 'మ'కారం స్వర్లోకం. అలాగే 'అ'కారం - వ్యక్తం 'ఉ'కారం అవ్యక్తం - 'మ'కారం చిచ్ఛక్తి, పై నున్న కొసరు, అర్థమాత్ర - ఇదే పరమపదం - 'అ'కారం - హ్రస్వం - 'ఉ'కారం - దీర్ఘం - 'మ'కారం - ప్లుతం పైనున్న అర్థమాత్ర వాగతీతం. ఇంతటి శక్తివంతమైన 'ఓం'కారాన్ని పరబ్రహ్మగా గుర్తించి ఉపాశించిన యోగి సంసార చక్రాన్ని వదలి బంధన త్రయాన్ని ఛేదించుకొని పరబ్రహ్మతత్వంలో లీనమవుతున్నాడు. కర్మబంధనాలు తెంచుకోలేక ఆపశకునాలతో మృత్యువు నెరిగి ప్రాణం వెళ్ళే సమయంలో ఈ ప్రణవాన్ని స్మరించిన భ్రష్టయోగి తిరిగి యోగిగా పునర్జన్మ పొందుతాడు. కనుక సిద్ధ యోగులు గాని అసిద్ధ యోగులు కానీ చివరి కాలాన్ని సూచించే అపశకునాలను (అరిష్టాలు) తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే అవసానదశను గుర్తించలేక దెబ్బతింటారు.  

అరిష్ట సూచనలు


కాబట్టి, అలర్కా ! యోగికి మరణ సూచకాలైన అరిష్టాలు (అపశకునాలు) ఏమిటో తెలియజేస్తున్నాను గ్రహించు. దేవమార్గం (భ్రూమధ్యం), ధ్రువం (నాసికాగ్రం), శుక్రం (రేతస్సు క్షీణించడం), సోమచ్చాయ (జిహ్వాగ్రం), అరుందతి (ఘటిక)- వీటిని చూడలేనివాడు సంవత్సరకాలంలో గతిస్తాడని తెలుసుకో.


(దేవమార్గమంటే కృష్ణ పక్షంలో ఆకాశాన కనిపించే గంగాప్రవాహ సదృశ దృశ్యమనీ, ధ్రువనక్షత్రం- శుక్ర గ్రహం - అరుంధతీ (సప్తర్షి మండలంలో) నక్షత్రం అనీ, సోమచ్ఛాయ అంటే చంద్రబింబంలో కనిపించే మచ్చ అనీ మరొక వ్యాఖ్య ఉంది). కిరణాలు లేని సూర్యబింబాన్ని కిరణాలున్న అగ్నినీ చూసినవాడు పదకొండు నెలల్లో మరణిస్తాడు. కలలోగానీ మెలుకవతోగానీ వెండిబంగారు రంగుల్లో మూత్ర పురీషాల్ని వదిలినవాడు పదినెలలకు వెళ్ళిపోతాడు. ప్రేతపిశాచాది గంధర్వ నగరాలనూ (ఆకాశంలో కనిపించే నగరాకార దృశ్యం = గంధర్వనగరం) బంగారు చెట్లనూ కలలోగానీ (ప్రత్యక్షంగా గానీ) దర్శించినవాడు తొమ్మిది నెలల్లో అసువులు వదులుతాడు. స్థూలదేహంవాడు హఠాత్తుగా చిక్కిపోవడం, సన్నటి మనిషి ఒక్కసారిగా లావెక్కడం- ఇలాంటి ప్రకృతి విరుద్ధాలు జరిగితే అతడు ఎనిమిది నెలలకన్నా బ్రతకడు. బురదలో గానీ, దుమ్ములోగానీ కూరుకుపోయిన తన పాదం తన చూపులకే ముక్క విరిగినట్టు కనిపిస్తే అతడు ఏడు నెలల్లో దివంగతుడవుతాడు. గ్రద్ద - పావురం - కాకి - జెముడు కాకి - మాంసం తింటున్న నల్లని పక్షి - ఇవి ఏవైనా తలమీద వాలితే వాడు ఆరు నెలలకి మించి జీవించడు. కాకులు అకారణంగా నెత్తిమీద తన్నితే వాడు అయిదునెలలకూ, తన నీడ తనకే తలకిందులుగానో, మరో రూపంగానో కనపబడితే వాడు నాలుగు నెలలకూ, మేఘాలు లేకుండా దక్షిణ దిక్కున మెరుపులు కనిపించినవాడు మూడు నెలలకూ, నెయ్యి నూనె నీరు అద్దాలలో తలలేని తన మొండెం కనిపించినవాడు ఒక్కనెలకూ, శరీరం గొర్రె వాసనగానీ, పీనుగు కంపుగానీ కొడితే వాడు పదిహేను రోజులకూ, స్నానం చేసిన వెంటనే హృత్పద్మమూ కాళ్ళు ఎండిపోవడం మంచినీళ్ళు ఎన్ని తాగినా ఇంకా దాహమవ్వడం ఇలాంటివి జరిగినవాడు పదిరోజులకీ, గాలి తగిలితే చాలు మర్మస్థానంలో మంటబుట్టేవాడూ వెన్నెల హాయిగొల్పనివాడూ నాలుగయిదు రోజులకు మరణిస్తాడని గ్రహించు.


Friday 7 April 2023

శ్రీదత్త పురాణము (102)

 


ఆచౌర్యం - బ్రహ్మచర్యం - త్యాగం - ఆలోభం- ఆహింస, అనేవి అయిదూ యోగి ఆచరించవలసిన వ్రతాలు. అక్రోధం - గురుశుశ్రూష - శౌచం - మితాహారం- నిత్యస్వాధ్యాయం అనేవి అయిదూ నిత్యం పాటించవలసిన నియమాలు.


లోకంలో జ్ఞానాలు, విజ్ఞానాలు అనేకం వున్నాయి. వాటిని అన్నింటినీ కబళించి వెయ్యాలనే అత్యాశ పనికి రాదు యోగికి. సారవంతము, శక్తి సాధనమూ, ముక్తి సాధనము అయిన జ్ఞానాన్ని మాత్రమే ఉపాసించాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా అది తెమలదు. ప్రధానమైన యోగోపాసన సాగదు.


నిస్సంగుడై ఆరిషడ్వర్గాలను జయించినవాడై మితహారుడై జితేంద్రియుడై బుద్ధి ద్వారాలను అన్నింటినీ మూసి వేసి మనస్సు ధ్యానంలో నిమగ్నం చెయ్యాలి. శూన్య ప్రదేశాలలో, గుహలలో, వనాలలో, ధ్యానం నిర్విఘ్నంగా సాగుతుంది. సమాధి స్థితి కుదురుతుంది. వాగ్దన్డం, కర్మదండం, మనోదండం అనే మూడు దండాలను నియమంగా ధరించే యతిని 'త్రిదండి' అంటారు.


ఆలర్కా! జగత్తు అంతా ఆత్మమయంగా కనిపించే యోగికి ప్రియాప్రియాలు ఉంటాయా ? రాగద్వేషాలుంటాయా? మిత్రులనీ శత్రువులనీ ఉంటారా ? అతడి బుద్ధికి బంగారపు ముద్ద అయినా మట్టిగడ్డ అయినా ఒకటే. యోగీశ్వరుడు శాశ్వతము, అవ్యయము అయిన పరాత్పర స్థానం చేరుకొని పుట్టుకలేని స్థితిని పొందుతాడు. వేదాధ్యయనంవల్ల యజ్ఞక్రియా ప్రాప్తి, దానివల్ల జాప్యం, జాప్యం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ధ్యానం, ధ్యానం వల్ల నిస్సంగత్వం, దానివల్ల నిరతిశయం, నిత్యానందస్థితి లభిస్తాయి. సమాహిత చిత్తుడూ, బ్రహ్మమయుడు, ప్రసన్నుడు, రుచి, ఏకాంత ప్రియుడు, జితేంద్రియుడు, అయిన మహామతి యోగవిద్యను ఉపాసిస్తే విముక్తి పొందుతాడు అనడంలో ఏ సందేహమూ లేదు.


యోగ మార్గాన్ని ఎంచుకున్న వారు ఓంకారాన్ని ఉపాసించి తీరాలి. విష్ణు స్వరూపుడూ, విశ్వపాద శిరోగ్రీవుడూ, విశ్వేశుడూ, విశ్వభావనుడూ, అయిన ఆ పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించగలగాలి అంటే మహా పుణ్యప్రదమైన ఓంకారాన్ని జపించాలి. ఆ ప్రణవాక్షరస్వరూపం ఏమిటో వివరిస్తాను. అకార ఉకార మకారాల కలయిక ఇది. మూడూ మూడు మాత్రలు, అటు పైన యోగులకు మాత్రమే వుంది. అదే నిర్గుణమైనది. అదే అర్థమాత్ర, గాంధారస్వర సంశ్రయంతో ఇది గాంధారి అవుతుంది. యోగీశ్వరుడు ధ్యానంలో కూర్చుని ఈ ప్రణవాన్ని జపిస్తే మూర్ధభాగంలో చీమ కదిలిన స్పర్శానుభూతి కలుగుతుంది. ఓంకారోపాసన చేసే యోగి ఓంకారమయుడు అవుతాడు. అక్షరుడవుతాడు. ఈ ప్రణవమే ధనస్సు, ఆత్మయే బాణం, లక్ష్యమేమో పరబ్రహ్మతత్వం.


Thursday 6 April 2023

శ్రీదత్త పురాణము (101)



ఇటువంటి యోగి చర్చలు ఎలా వుంటాయి చెప్పమని అలర్కుడు అడిగాడు. దానికి దత్తాత్రేయుడు అంగీకరించి ఇలా చెప్తున్నాడు. అలర్కా మానవమానాలు మానవులందర్కి ఆనందాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తాయి. యోగి విషయంలో ఇవి విపరీతం. అంటే మానంవల్ల దుఃఖం, అవమానం వల్ల ఆనందం పొందుతాడు. ఇతడికి మొదటిది విషం, రెండవది అమృతం.


ఇతడి దినచర్యకు చాలా నియమాలు వున్నాయి. చక్షుపూతమైన ప్రదేశంలోనే అడుగుపెట్టాలి. వస్త్రపూతమైన జలమే త్రాగాలి. సత్యపూతమైన వాక్కునే పలకాలి. బుద్ధి పూతమైన దానినే ధ్యానించాలి. ఆతిధ్యాలకు, శ్రాద్ధ భోజనాలకు, దేవతల ఊరేగింపులకూ, ఉత్సవాలకు, జనసమ్మర్ధం కోలాహలం ఎక్కువగా వుండే ప్రదేశాలకు యోగసిద్ధ్యర్ధి వెళ్ళరాదు. ఆ ఇంటిలో అందరి భోజనాలు అయినాక అది నిర్ధారించుకొని ప్రశాంతంగా వున్న ఇంటికి తాను వెళ్ళి భిక్ష అడగాలి. పొగలు గ్రక్కుతున్న ఇంటి నుండి గాని, బొగ్గులు గుమ్మంలో ఆరబోసిన ఇంటి నుండి గాని బిక్ష యాచించరాదు. రోజూ ఒకే ఇళ్ళకు బిక్షకు వెళ్ళరాదు. జనం తనను చూసి అవమానించే వేషధారణలో సంచరించాలి. సజ్జన ధర్మాన్ని తప్పరాదు. యాయవారుల ఇండ్లకు, గృహస్థుల ఇండ్లకు వెళ్ళి భిక్ష తీసికోవాలి. యాచకుల ఇండ్లకు ఇంకా తక్కినవారి ఇండ్లకు భిక్షకు వెళ్ళడం అంతశ్రేయస్కరం కాదు.


యోగికి బియ్యపుజావ, మజ్జిగ, పాలు, యవల జావ, పండ్లు, దుంపలు, పేలపిండి, నూకల అన్నం, ఇవి శుభం కలిగించే ఆహారాలు, యోగసిద్ధికరాలు. మౌనంగా కూర్చుని ఏకాగ్రచిత్తంతో భుజించాలి. ముందుగా కొంచెం నీళ్ళు త్రాగాలి. అటు తర్వాత పంచ ప్రాణహుతులతో భుజించాలి. అనగా ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా, సమానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, వ్యానాయస్వాహా అంటూ అయిదు మార్లు మెతుకులు గోటితో వేసుకుని ఆ తర్వాత భుజించాలి. 

చివరలో మళ్ళీ మంచి నీరు పుచ్చుకొని ఆచమించాలి. చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఓసారి హృదయంపై చేయివేసి స్పృసించాలి.


Wednesday 5 April 2023

శ్రీదత్త పురాణము (100)

 


అణిమ - అణువుకన్నా సూక్ష్మ స్థితిని పొందడాన్ని అణిమ అంటారు. 

మహిమ - సమస్త జగత్తుచేత పూజింపబడటం మహిమ

లఘిమ - తేలికగా అతి శీఘ్రంగా ప్రయాణించగలడం లఘిమ

ప్రాప్తి- తానింక పొందవలసింది ఏదీలేదు అన్నంతగా సమస్తాన్ని పొందడం ప్రాప్తి 

ప్రాకామ్యం- సనుస్త ప్రదేశాలకు తాను వ్యాపింపగలగడం- ప్రాకామ్యం 

ఈశిత్వం - తానే ఈశ్వరుడవ్వడం ఈశిత్వం 

వశిత్వం - తామ సమస్తాన్ని వశపరుచుకోగలగడం వశిత్వం

గరిమ - పరం - ఏదికోరుకోదగిన స్థానమో ఏది సమస్త ఐశ్వర్యములకు నిలయమో అదియే గరిమ - పరం 

వీటినే అష్ట సిద్ధులు అంటారు. వీటిని విడిచిపెట్టి ముందుకు సాగగలిగితేనే నిర్వాణం లభించేది. వీటిలో దేనికి లొంగిపోయినా పతనం తప్పదు.


యోగసాధనతో ముక్తి పొందడం అంటే - అపునర్భవ స్థితిని పొందడం. ఇది జనన మరణాలు లేని స్థితి. గర్భవాసం జననం వృద్ధి వార్ధక్యం కృశత్వం మృతి అనే ఆరు రకాల వికారాలు ముక్తుడికి వుండవు. పంచభూతాల సాంగత్యంతో భేదం క్లీశం దాహం ఇత్యాదులు ఇతడికి వుండవు. భోక్తకాడు, భోజ్యుడు కాడు, తనకు నిత్యసన్నిహితమైన యోగాగ్నితో సమస్త దోషాలను దగ్ధం చేసుకొని యోగి నిర్మలుడై బ్రహ్మపదార్థంలో శాశ్వతంగా కలిసిపోతాడు. వేరే ఆలోచనే వుండదు. నీరు నీటిలో కలిసినట్లు ఎన్నడూ, ఎవ్వరూ, ఎలాగూ వేరుచెయ్యడానికి వీలు లేనట్లుగా కలిసిపోతాడు. పరమాత్మతో ఆత్మ సామ్యాన్ని పొందుతాడు. దీన్నే బ్రహ్మైక్యం అంటారు. 


Tuesday 4 April 2023

శ్రీదత్త పురాణము (99)

 


పంచవేదాలలోనూ పురాణేతిహాసాదిశాస్త్రాలలోనూ ఉన్న విషయాలు సమస్తం వివిధ కళాశిల్ప రహస్యాలు యోగికి కరతలామలకములు అవుతాయి. ఆప్రయత్నంగానే స్ఫురిస్తాయి. దీనినే ప్రాతిభం అంటారు. వేలకొలదీ యోజనాల దూరంలో ఉన్నప్పటికీ మనుష్య పశుపక్ష్యాదుల స్వరాలు శబ్దాలు వాటి అర్ధాలు ఇతడికి తెలుస్తాయి. ఈ శక్తిని శ్రావణం అంటారు. దేవ, పితృ, సిద్ధ, సాధ్యాది, అష్టవిధ దేవగణాలు ఇతడికి కనిపిస్తారు. దీన్ని దైవము అంటారు. నిరాలంబంగా ఆకాశంలో మనోదోషం వల్ల పరిభ్రమింపగలుగుతాడు. ఈ శక్తిని భ్రమం అంటారు. సుడిగుండంలో నీళ్ళు తిరుగుతున్నట్లు యోగి హృదయంలో సమస్త జ్ఞానమూ సుళ్ళు తిరుగుతూ అతడిని అల్లకల్లోలం చేస్తుంది. ఈ శక్తిని ఆవర్తం అంటారు.


ఇవేకాదు. ఇంకా భయంకరమైన ఉపసర్గలు ఒక దాని వెంట ఒకటిగా జయించిన కొద్దీ వస్తూనే వుంటాయి. యోగిని ఊరిస్తూనే ఉంటాయి. వీటికి లొంగిపోక ప్రదర్శనలకు దిగక నిలువరించుకోవటం చాలా అవసరం. మనోమయమైన ఆచ్ఛాదన కప్పుకొని పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ చిత్తాన్నితత్ప్రణం చెయ్యడం ఒక్కటే వీటిని జయించే మార్గం. ఇలా విఘ్నాలను దాటుకుంటూ యోగాభ్యాసం కొనసాగించాలి.


అలర్కా! ఇప్పుడు నీవు ధారణా సప్తకం గురించి తెలుసుకోవాలి. నియమితాహారుడూ, జితేంద్రియుడు అయిన యోగి మూర్ధభాగంలో ధరిత్రిని ధారణ చెయ్యాలి, దాని సూక్ష్మత్వం పొందాలి, అనగా ధరీత్రిత్వం పొందాలి. దాని గుణమైన గంధాన్ని తానే వదలాలి. ఇలాగే వరుసగా పంచభూతాలనూ ధారణజేసి తత్తన్మయుడు అవుతూ తత్తద్గుణాలను తానుగా వదలాలి. ఆపైన తన మనోబుద్ధులను సర్వభూతా మనోబుద్ధులతో కలిపి వాటి సూక్ష్మత్వాలను విడిచిపెట్టాలి. ఇలా ఏడు వృత్తులనూ విడిచి యోగి తాను ప్రవృత్తిరహితుడై ముక్తిపొందాలి. సృష్టి అంతా ఏడు వృత్తులలోనే ఉంది కాబట్టి దీన్ని అభ్యసించిన యోగి దేవాసుర గంధర్వాదుల దేహాలలో ప్రవేశించిన సంగరహితుడుగానే ఉండగలుగుతాడు. ఇతడినే శుద్ధాత్ముడు యోగ సిద్ధుడు అంటారు. ఇతనికి అణిమాది అప్లైశ్వర్యాలూ సిద్ధిస్తాయి. ఇవి ముక్తికి సూచకాలు.


Monday 3 April 2023

శ్రీదత్త పురాణము (98)

 


ఈ విధి నిషేధాలు పాటింపకుండా ఎప్పుడుపడితే అప్పుడు ప్రాణాయామం చేస్తే బదిరత్వం, జడత్వం, ఆంధత్వము ఏర్పడే ప్రమాదం వుంది. ప్రమాదవశాత్తు ఇవి వస్తే యోగంతోనే చికిత్స చేసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే జావను గోరువెచ్చగా త్రాగి యోగానికి కూర్చోడం మంచిది. ఇలా కూర్చుని రోగశాంతికి మనస్సులో ప్రత్యేకధారణలు చెయ్యాలి. వేడి తగ్గాలంటే శీతాన్ని, శీతం తగ్గాలంటే వేడిని, కఫం తగ్గాలంటే మహాశైలాన్ని, అతిదాహం ఉపశమించాలంటే నాలుక మీద ఆమ్ర ఫలాన్ని, చెవుడు తగ్గాలంటే చెవుల్లో సుస్వర సూక్తులనూ ధారణ చెయ్యాలి. మతిమరుపు తగ్గాలంటే శిరస్సుపై చెయ్యవలసిన ప్రత్యేకధారణలు వున్నాయి. ఇవికాక ప్రకృతి శక్తుల వల్ల అనారోగ్యం కలిగితే వాటిని తగ్గించుకోడానికి యథావసరంగా పంచభూతాలను ధారణ చెయ్యాలి. ధర్మార్థ మోక్షాలకి శరీరమే ప్రధాన సాధనం కనుక యోగి తన శరీరాన్ని ధృఢంగా ఆరోగ్యంగా వుంచుకోవాలి. అభ్యాసం కొనసాగుతున్నప్పుడు కొన్ని చిత్రవిచిత్రమైన యోగసిద్ధులు కలుగుతాయి. వీటిని పరులకు చెప్పకూడదు. గర్వంగా ప్రదర్శించకూడదు. అలా చేస్తే ఆ సిద్ధులు అంతరించిపోతాయి. కాబట్టి రహస్యంగా వుంచుకోవాలి.


ఆరోగ్యం, మృదుస్వభావం, శరీరకాంతిసౌరభాలు, ప్రసన్నత, కంఠస్వర సౌమ్యత, మూత్రపురీషాల అల్పత్వం- ఇవీ యోగసిద్ధికి తొలిచిన్నెలు. ప్రజలకు తన యందు అనురాగం కలగడం, తన గుణగణాలను పరోక్షంగా కొనియాడటం, మిగతా ప్రాణికోటి తనను చూసి భయపడకపోవటం, అలాగే వాటిని చూసి తాను బెదరకపోవటం, అత్యుష్ట అతిశీతల బాధలు తనకు లేకపోవటం ఇత్యాదులు యోగసిద్ధికి లక్షణాలు.


యోగసిద్ధులు కలుగుతున్న వేళ యోగికి కామ్యకర్మల మీద మనస్సుపోతుంది. రసాయన- రసక్రియాదులపైకీ, దేవత్వ- అమరేశత్వ ప్రకటనల మీదికి, జల- అగ్ని ప్రవేశాల వైపుకీ చిత్తం పరుగులు తీస్తుంది. దీన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా నిలుపుదల చేసుకోవాలి. లేకపోతే యోగం చెడిపోతుంది.


మనస్సును బ్రహ్మ పదార్థంలో సంలగ్నం చెయ్యడం ద్వారా దాని చాంచల్యాలను అదుపు చేయవచ్చు. అలా వీటిని జయంచి యోగాభ్యాసం కొనసాగిస్తుంటే మరికొన్ని అవరోధాలు ఎదురవుతాయి. వీటినే ఉపసర్గలు అంటారు, యోగాభ్యాసానికి ఇవి కూడా అవరోధాలే. ఇవి అయిదు వున్నాయి. ప్రాతిభం - శ్రావణం - దైవం- భ్రమం - ఆవర్తం. ఈ పంచవిధోపసర్గలూ సత్వరజస్తమో గుణాల నుండి ఆవిర్భవించి యోగానికి విఘ్నం కలిగిస్తాయి.


Sunday 2 April 2023

శ్రీదత్త పురాణము (97)



ప్రాణాయామంలో పూరక, కుంభక, రేచకములని మూడు ఉపాంగాలు వున్నాయి. ఇలాంటి పన్నెండు ప్రాణాయామాలకి ఒక ధారణ అని పేరు. రెండు ధారణలు ఒక యోగం. ఈ యోగం వల్ల మానసిక కిల్బిషాలన్నీ నశిస్తాయి. స్థిరచిత్తం ఏర్పడుతుంది. ఆత్మదర్శనం అవుతుంది. ఈ అనుభవాన్ని రుచిచూసిన యోగి ప్రకృతినీ దానికన్నా వేరైన ఆత్మనూ తేలికగా గుర్తిస్తాడు. వీరు మితాహారులై నిరంతరాభ్యాసంతో క్రమక్రమంగా ఉన్నతోన్నత స్థితులను పొందగలుగుతాడు.


ప్రాణవాయువును నియమించటం ప్రాణాయామమైతే, ఇంద్రియాలు ఉపసంహరింపబడటం ప్రత్యాహారం అవుతుంది. మనస్సును నిశ్చలపరచటం "ధారణ" అంటారు. ఈ ధారణ సమయంలో మనస్సును నాభి – హృదయం - ఉరస్సు - కంఠం - ముఖం - నాశికాగ్రం- నేత్రాలు- భూ మధ్యభాగం మూర్ధం బ్రహ్మరంధ్రం ఈ భాగాలలో క్రమక్రమంగా నిలుపుకుంటూ వెళ్ళాలి. ఈ పదవస్థానంలో నిల్వడాన్నే ఆత్మైక్యం అంటారు..


ప్రాణవాయువును పూరకం చేసేటప్పుడు కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా పీల్చాలి. యంత్రనాళాల నుండి దాహార్తుడు నెమ్మదిగా జలాన్ని పీల్చినట్లు వాయువును పూరించాలి. అలాగే రేచకము కూడానూ. లేదంటే వ్యాధులు సోకే ప్రమాదముంది.


ఆకలి - అలసట - మనోవ్యాకులత - ఇవి ఉన్నప్పుడు ప్రాణాయామంగానీ యోగాభ్యాసం కాని చెయ్యరాదు. అలాగే అతివేడి వున్న సమయంలో, అతి చల్లగా వున్న సమయంలో, అతిగా వాయువు వీచే వేళ అభ్యసించరాదు. ధ్వని కాలుష్యం, చెమ్మనేల, భీకర ప్రదేశం, ఎండుటాకులు ఉన్న చోట్లా, రచ్చపట్టులు, నదీరూపాలు వున్న చోట్లా, నాలుగు కాళ్ళ క్రూరజంతువులు వుండే చోటా, పాములు మిగతా విషజీవులు సంచరించే ప్రాంతాలలో యోగానికి పనికిరాని ప్రదేశాలు. అన్నీ అనుకూలంగా చూసుకొని మనస్సులో సత్వగుణం ఉదయించినప్పుడు మాత్రమే యోగాభ్యాసం చెయ్యాలి. మలమూత్రాలు కానప్పుడు భుక్తాయాసంతో వున్నప్పుడు ఇది అస్సలు చెయ్యరాదు.


Saturday 1 April 2023

శ్రీదత్త పురాణము (96)

 


మానవునికి మచ్చిక అయిన సింహశార్దూలాలు మానవుల్ని చంపటం మానేస్తాయి. అవును కదా అలాగే ఈ స్వాధీనం అయిన ప్రాణాయామం స్వదేహాన్ని హింసించదు. పోషిస్తుంది. కిల్బిషాలను మాత్రం శోషింపజేస్తుంది.


ప్రాణాయామానికి నాలుగు దశలు వున్నాయి. అవి ధ్వస్తి - ప్రాప్తి - సంవిత్తు - ప్రసాదం అని. మొదటి దశలో వున్న మనిషికి మనస్సు కషాయపక్వంగా ఉంటుంది. ఇష్టా ఇష్టాలు పాపపుణ్యాలు మనస్సు నుండి తొలగిపోతాయి. రెండవ దశలో (ప్రాప్తి) ఉన్న ప్రాణాయామ సాధకుడు, ఐహికాముష్మిక వాంఛలను అన్నింటినీ పొందుతాడు. మూడవ దశకు చేరుకున్న సాధకునికి దివ్యదృష్టి లభిస్తుంది. దూరంగా వున్న వాటిని, కంటికి కనిపించకుండా ఉన్న వాటిని భూత, భవిష్యత్తులనూ దర్శించగలుగుతాడు. సూర్యచంద్రాదులతో సమానమైన జ్ఞానప్రభావాన్ని పొందుతాడు. ఇక నాల్గవ దశకు చేరుకున్న ప్రాణాయాముసాధకుడి మనస్సు, పంచధాతువులు, పంచేద్రియాలు, ఇంద్రియార్థాలు, అన్నీ ఎంతో ప్రసన్నమవుతాయి. అపుడు అతడు బ్రహ్మనిష్టుడై బ్రహ్మానందాన్ని పొందుతాడు.


ప్రాణాయామాన్ని అభ్యసించి క్రమక్రమంగా నాల్గువ దశకు చేరుకోవటం యోగాభ్యాసంలో మొదటి మెట్టు మాత్రమే. ఆపైన చెయ్యవలసిన యోగాభ్యాసం గురించి చెబుతాను తెలుసుకో.


ఆసనం - పద్మాసనం, అర్ధపద్మాసనం, స్వస్తి కాసనం ఈ మూడూ యోగసాధనకు అనువైనవి. వీటిలో తనకిష్టమైన ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి. వెన్నుపూసను నిటారుగా నిలబెట్టాలి. శిరస్సును సమస్థాయిలో వుంచాలి. నోరు తెరువకూడదు. దంతాలు పరస్పరం తాకకూడదు. చూపుల్ని నాసికాగ్రం మీద నిలపాలి. హృదయంలో ఓంకారాన్ని జపించాలి. తమోగుణాన్ని రజోగుణంతో, రజోగుణాన్ని సత్వగుణంతో, అణిచివెయ్యాలి. అందువల్ల నిర్మలాంతఃకరణం సిద్ధిస్తుంది. నాభి నుండి కంఠం వరకూ వాయువును పూరించాలి. మనఃప్రాణేంద్రియాలను ఆయా విషయాల నుండి లోపలికి ఉపసంహరించాలి. తాబేలు తనశిరః కర, చరణాలను దొప్పలోకి ముడుచుకున్నట్లు వీటిని ఉపసంహరించాలి. బాహ్యభ్యంతరాలను పూర్తిగా మరచిపోవాలి. దృష్టిని లోపలికి సారించాలి. తనలో తనను చూసుకోవాలి. కామాలను ప్రత్యాహరించటం కాబట్టి దీన్ని ప్రత్యాహారం అంటారు.