Wednesday 31 January 2024

శ్రీ గరుడ పురాణము (76)

 


అపుడు కూర్మ, అనంత, పృథ్వీ దేవతలను పూజించి ఆగ్నేయంలోధర్మునీ, నైరృత్యంలో జ్ఞానాన్నీ, వాయవ్యంలో వైరాగ్యాన్నీ, ఈశాన్యంలో ఐశ్వర్యాన్నీ పూజించాలి. ఆ తరువాత క్రమంగా పూర్వాది దిశల్లో అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కూడా అర్చించాలి. మండలమధ్యంలో సత్త్వ రజస్తమోగుణాలనూ, అక్కడే కంద(*కందగడ్డ, హారతి కర్పూరం అనే అర్థాలున్నాయి.), నాళ, పద్మాలనూ విధ్యుక్తంగా పూజించాలి. అక్కడే అర్క, సోమ, అగ్ని మండలాలను కూడా పూజించాలి.


విమలాది శక్తులు తొమ్మిదింటినీ తూర్పుతో మొదలుపెట్టి క్రమంగా అన్ని దిక్కుల్లో వారి వారి మంత్రాలతో (శ్రీధర పూజానావిధిలో వలెనే) పూజించాలి.


తరువాత ఒక మంగళమయ ఆసనాన్ని స్నాన, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులతో పూజించి దేవాధిదేవుడు, భగవానుడునైన హయగ్రీవుని ఆవాహనం చేసి న్యాసం కూడా చేయాలి. ధ్యానం చేసుకొని శంఖచక్రాది మంగళముద్రలను ప్రదర్శించాలి. తరువాత పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నానాలను ప్రదానం చేయాలి. వస్త్రప్రదానం ఆచమనానికి ముందు చేయాలి. సుందరయజ్ఞోపవీతాన్నివ్వాలి. తరువాత భైరవదేవుని మూలమంత్రంతో ఆహ్వానించి పాద్యాదులను సమర్పించి విధివత్తుగా పూజించాలి.


తరువాత శుభదాయినీ, ఐశ్వర్యప్రదాత్రీయైన లక్ష్మీదేవిని పూజించాలి.


తరువాత నలుదిక్కులలో ఇలా


తూర్పులో ఓం శంఖాయ నమః


దక్షిణంలో ఓం పద్మాయ నమః


పడమట ఓం చక్రాయ నమః


ఉత్తరంలో ఓం గదాయై నమః 


అని ఉచ్చరిస్తూ ఆయా వస్తువులను అర్చించాలి. తరువాత అదే దిక్ క్రమంలో 

ఓం ఖడ్గాయ నమః, ఓం ముసలాయ నమః, ఓం పాశాయ నమః, ఓం అంకుశాయ నమః అనే మంత్రాలతో ఆయా ఆయుధాలనీ వాటి మధ్యలో ఓం సశరాయ ధనుషే నమః అనే మంత్రంలో విల్లమ్ములనూ స్థాపించి పూజించాలి. అదే క్రమంలో ఓంకారమును, యను, నమఃను పెట్టి శ్రీవత్స, కౌస్తుభ, వనమాలా(యై) పీతాంబరాలనూ పూజించి మరల శంఖాదిధారియైన హయగ్రీవస్వామిని అర్చించాలి.


Tuesday 30 January 2024

శ్రీ గరుడ పురాణము (75)

 


హయగ్రీవ పూజనావిధి


సూతుడు శౌనకాది మహామునులకు విష్ణువు శివునికీ ఇతర దేవతలకూ ఉపదేశించిన హయగ్రీవపూజను ఇలా వినిపించసాగాడు.


"హయగ్రీవ పూజకు మూలమంత్రం పరమ పుణ్యాశాలి, సకల విద్యలనూ ప్రసాదించేది. ఓంకార యుక్తం. అది ఇది :


ఓం సౌం క్షౌం శిరసే నమః


ముందుగా ఎప్పటి వలెనే మంత్రాలతో అంగన్యాసం కరన్యాసం చేయాలి. (ఈ మంత్రాలిది వఱకే ఇవ్వబడ్డాయి. అయినా (అనుబంధం- 5లో చూడవచ్చు).


హయగ్రీవుడు శంఖం వలె, కుంద పుష్పం వలె, చంద్రుని వలె శ్వేతవర్ణుడు. ఆయన దేహకాంతి కమలనాళతంతు, రజత ధాతుకాంతితో సమానంగా ప్రకాశిస్తుంటుంది. నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా పద్మాలు ఆవు పాలలాగ, కోటి సూర్యప్రభలను విరజిమ్ముతుంటాయి. ఈ సర్వవ్యాపియైన దేవత ముకుట, కుండల, వనమాలా సుశోభితుడై సుదర్శనయుక్తుడై, సుందరదరహాసవ్యాపిత కపోలాలను కలిగి పీతాంబరధారియై మంగళ స్వరూపుడై వుంటాడు.


ఈ స్వామిని, అన్ని దేవతలనూ తనలోనే కలిగిన ఈ విరాట్ దేవుని సాధకుడు తన మనసులో భావించుకొని అంగమంత్రాలతో మూలమంత్రంతో న్యాసం చేయాలి. తరువాత మూలమంత్రంతోనే శంఖ, పద్మాదుల మంగళమయ ముద్రలను ప్రదర్శించాలి. తరువాత హయగ్రీవాసనానికి దగ్గరలో వున్న ఇతర దేవతలను ఆవాహన చేయాలి. ఈ మంత్రంతో :


ఓం హయ గ్రీవాసనస్య ఆగచ్ఛత చ దేవతాః |


తరువాత ఒక స్వస్తిక లేదా సర్వతోభద్ర మండలంలో ఆ దేవతలను పూజించి ద్వారంలో ధాతనూ విధాతనూ పూజించాలి. తదనంతరం సమస్త పరివారాయ అచ్యుతాయ నమః అనే మంత్రంతో మండల మధ్యంలో విష్ణు భగవానుని పూజించి ద్వారమందు గంగ, మహాదేవిలను, శంఖ, పద్మ, నామక నిధులనూ, అగ్రభాగంలో గరుడునీ, మధ్యభాగంలో ఆధారశక్తినీ పూజించాలి. (ఈ మంత్రాలన్నీ ఇదివఱకే చెప్పబడ్డాయి)


Monday 29 January 2024

శ్రీ గరుడ పురాణము (74)

 


ఈ విధంగా సమస్త కష్టాలనూ దూరం చేసే దేవేశుడైన వాసుదేవ భగవానుని స్తుతించాలి. ఇతర వైదిక స్తుతులతో కూడా విష్ణు దేవుని హృదయంలో భావిస్తూ స్తుతించ వచ్చును. తరువాత విసర్జన చేసి మందిరంలో నుండి బయటికి రావాలి. ఈ పంచతత్త్వ యుక్తమైన విష్ణు పూజ సంపూర్ణకామనలను నెరవేర్చే వాసుదేవుని పూజలలో సర్వశ్రేష్ఠంగా వ్యవహరింపబడుతోంది.


నీలలోహిత శివ మహాదేవా! ఈ పూజనొక్క మారు చేసినా మనిషి కృతకృత్యుడవుతాడు. దీనిని చదివినవారూ, విన్నవారూ, ఇతరులకు వినిపించినవారూ దేహాంతంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు".


(అధ్యాయం - 32)


సుదర్శన చక్ర పూజా విధి


సూతుడు శౌనకాది మహామునులకు శివుడు విష్ణువుతో ఇలా అన్నాడని చెప్పసాగాడు. “ఓ శంఖ గదాధరా! గ్రహదోషాలూ, రోగాదులూ, సర్వకష్టాలూ వినష్టములవ్వాలంటే ఏ పూజను చేయాలి?"


"పరమశివా! నీవడిగిన దానికి సమాధానం సుదర్శన పూజ. ఈ పూజకి ముందు సాధకుడు స్నానం చేసి హరిని పూజించాలి. తరువాత తన నిర్మల హృదయ కమలంలో ఆ సుదర్శనాయుధుని నిలుపుకొని ధ్యానించాలి. ఆ తరువాత ఒక మండలాన్ని నిర్మించి అందులో శంఖ, చక్ర, గదా పద్మ భూషణుడైన కిరీటి, భగవానుడైన విష్ణుదేవుని ఆవాహన చేసి గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాది వివిధోపచారాలతో పూజించాలి.


పూజ చివరల్లో మూలమంత్రాన్ని నూటయెనిమిది మార్లు జపించాలి. హే రుద్రదేవా! మూలమంత్రమిదివఱకే చెప్పబడింది కదా! ఆ మంత్ర జపం తరువాత సర్వవ్యాధి దోష, కష్ట వినష్టకమైన ఈ సుదర్శన స్తుతిని శ్రద్ధగా పఠించాలి :


నమః సుదర్శనాయైవ సహస్రాదిత్యవర్చసే ॥

జ్వాలా మాలా ప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే । 

సర్వదుష్టవినాశాయ సర్వపాతక మర్దినే ॥ 

సుచక్రాయ విచక్రాయ సర్వమంత్ర విభేదినే 

ప్రసవిత్రే జగద్ధాత్రే జగద్విధ్వంసినే నమః । 

పాలనార్థాయలోకానాందుష్టాసుర వినాశినే । 

ఉగ్రాయ చైవ సౌమ్యాయ చండాయచ నమోనమః ॥ 

నమశ్చక్షుః స్వరూపాయ సంసార భయభేదినే । 

మాయా పంజర భేత్రేచ శివాయచ నమోనమః ॥ 

గ్రహాతిగ్రహరూపాయ గ్రహాణాం పతయే నమః 

కాలాయ మృత్యవేచైవ భీమాయ చ నమో నమః | 

భక్తానుగ్రహదాత్రే చ భక్త గోప్తే నమో నమః ॥ 

విష్ణురూపాయ శాంతాయ చాయు ధానాంధరాయచ ॥

విష్ణుశస్త్రాయ చక్రాయ నమోభూయోనమోనమః ॥


ఈ స్తోత్రాన్ని వేరేగా చదివినా వచ్చే ఫలం ఇలా వుంటుంది.


ఇతిస్తోత్రం మహత్పుణ్యం 

చక్రస్య తవ కీర్తితం ॥ 

యః పఠేత్ పరయాభక్త్యా 

విష్ణులోకం సగచ్ఛతి | 

చక్రపూజా విధింయశ్చ 

పఠేద్రుద్ర జితేంద్రియః । 

సపాపం భస్మసాత్కృత్వా 

విష్ణులోకాయ కల్పతే ॥ (ఆచార 33/7-16)


ఈ విధంగా ఇది విష్ణులోక ప్రాపకం.


Sunday 28 January 2024

శ్రీ గరుడ పురాణము (73)

 


శ్రీ వాసుదేవకృష్ణుడే ఈ జగత్తుకి స్వామి. పీతాంబర విభూషితుడు, సహస్ర సూర్య సమాన తేజఃసంన్నుడు, దేదీప్యమాన మకరాకృతిలో నున్న కుండల సుశోభితుడునగు ఆ శ్రీకృష్ణ భగవానుని ముందుగా ప్రతి హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి. తరువాత సంకర్షణ భగవానుని అనగా బలరామదేవుని, ఆపై యథాక్రమంగా ప్రద్యుమ్న, అనిరుద్ధ, శ్రీమన్నారాయణులను ధ్యానించాలి. పిమ్మట ఆ దేవాధిదేవుని నుండి జనించిన ఇంద్రాది దేవతలను కూడా ధ్యానించాలి. మూలమంత్రం ద్వారా రెండు చేతులతో వ్యాపక రూపంలో కరన్యాసం అనంతరం అంగన్యాస మంత్రాలతో అంగన్యాసం నెరవేర్చి సర్వదేవతలనూ పూజించాలి. ఆ న్యాస మంత్రాలనూ, పూజా మంత్రాలనూ వినిపిస్తాను, వినండి:  తరువాత ఓం పద్మాయ నమః అంటూ స్వస్తిక, సర్వతోభద్రాది మండలాలను నిర్మించి ఆ మండలంలో ఇవే మంత్రాలతో దేవతలందరినీ పూజించాలి.


మూలమంత్రాలతో పాద్యాది నివేదనాన్ని గావించి స్నాన, వస్త్ర, ఆచమన, గంధ పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులనర్పించి, ఈ దేవతలకు నమస్కార ప్రదక్షిణలను గావించిన పిమ్మట యధాశక్తి పలుమార్లు మూలమంత్రాన్ని జపించి దాని ఫలాన్ని శ్రీకృష్ణ వాసుదేవ ప్రభునికి అర్పించాలి.


తరువాత వాసుదేవునికి నమస్కరిస్తూ ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి.


ఓం నమో వాసుదేవాయ నమః, సంకర్షణాయ చ ॥


ప్రద్యుమ్నాయాది దేవాయానిరుద్ధాయ నమోనమః


నమో నారాయణాయైవ నరాణాం పతయే నమః ||


నరపూజ్యాయ కీర్త్యాయ స్తుత్యాయ వరదాయచ ||


అనాదినిధనాయై వ పురాణాయ నమోనమః ||


సృష్టి సంహారక కర్తేచ బ్రహ్మణః పతయే నమః ||


నమో వైవేద వేద్యాయ శంఖచక్రధరాయ చ ||


కలి కల్మష హర్తేచ సురేశాయ నమోనమః ||


సంసార వృక్ష చ్ఛేత్రేచ మాయా భేత్రే నమో నమః ||


బహురూపాయ తీర్థాయ త్రిగుణాయ గుణాయచ |


బ్రహ్మవిష్ణ్వీశరూపాయ మోక్షదాయ నమో నమః ॥ 


మోక్షద్వారాయ ధర్మాయ నిర్వాణాయ నమోనమః ।


సర్వకామ ప్రదాయైవ పరబ్రహ్మ స్వరూపిణే ॥


సంసార సాగరే ఘోరే నిమగ్నం మాం సముద్ధర |


త్వదన్యోనాస్తి దేవేశ నాస్తిత్రాతా జగత్ప్రభో ॥


త్వామేవ సర్వగం విష్ణుం గతోఽహం శరణం తతః |


జ్ఞానదీప ప్రదానేన తమోముక్తం ప్రకాశయ ॥ (ఆచార 32/30-37)


Friday 26 January 2024

శ్రీ గరుడ పురాణము (72)

 


పంచతత్త్వార్చన - విధి


'హే పరమాత్మా! తెలుసుకున్నంత మాత్రాననే సాధకునికి పరమపదాన్ని ప్రాప్తింప చేసే సారతత్త్వంలో భాగమైన పంచతత్త్వార్చన ఒకటున్నదని విన్నాను. మాపై దయ వుంచి దానినుపదేశించండి' అని కోరాడు శివుడు.


లోక కల్యాణం కోసం శంకరభగవానుని ఆరాటాన్ని అర్థం చేసుకున్న ఆదిదేవుడు ఆనందభరితుడై ఇలా చెప్పసాగాడు.


'సువ్రతుడవైన శంకరదేవా! మీకా పంచతత్త్వ పూజావిధిని తప్పక వినిపిస్తాను. ఎందుకంటే ఇది దివ్యం, మంగళస్వరూపం, కల్యాణకారి, రహస్యపూర్ణం, శ్రేష్ఠం, అభీష్ట సిద్ధిప్రదం, కలిదోష వినాశకం, పరమపవిత్రం.


హే సదాశివా! పరమాత్మయు, వాసుదేవుడునైన శ్రీహరి అవినాశి, శాంతుడు, సత్త్వస్వరూపుడు, ధ్రువుడు (నిత్యుడు, అచలుడు అని అర్ధము), శుద్ధుడు, సర్వవ్యాపి, నిరంజనుడు. ఆ విష్ణుదేవుడే తన స్వీయమాయ యొక్క ప్రభావం ద్వారా అయిదు ప్రకారాలుగా కనిపిస్తున్నాడు. ఈ ప్రకారాలు అయిదు రూపాలుగా, తత్త్వముగా పూజింపబడుతున్నాయి. విష్ణువు యొక్క పంచరూపాల వాచక మంత్రాలు వారి పేర్లతోనే ఇలా వుంటాయి.


ఓం అం వాసుదేవాయ నమః, 

ఓం ఆం సంకర్షణాయ నమః, 

ఓం అం ప్రద్యుమ్నాయ నమః, 

ఓం అః అనిరుద్ధాయ నమః, 

ఓంఓం నారాయణాయ నమః ।


సర్వపాతకాలనూ, మహాపాతకాలనూ నశింపజేసి పుణ్యాన్ని ప్రదానం చేసి, సర్వ రోగాలనూ దూరం చేసే, అయిదుగురు మహా దైవతముల వాచకాలే ఈ పంచమంత్రాలు.


ఈ పంచదేవ పూజకై సాధకుడు ముందుగా స్నానం చేసి విధివత్తుగా సంధ్యవార్చి మరల కాలుసేతులు కడుగుకొని పూజామందిరలో ప్రవేశించి ఆచమనం చేసి తమ మనసుకు నచ్చిన ఆసనాన్ని వేసుకొని స్థిరంగా కూర్చుని అం క్షౌం రం అనే మంత్రాలనుచ్చరిస్తూ శోషణాది క్రియలను చేయాలి. అనగా శరీరాన్ని పొడిగా చేసుకోవాలి.


Thursday 25 January 2024

శ్రీ గరుడ పురాణము (71)

 


మరల శ్రీధర దేవుని ఇలా అంటూ ఆవాహన చేసి పూజ చేయాలి.

ఓం హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః ఆగచ్ఛ |

ఈ పూజానంతరము లక్ష్మీదేవిని ఓం శ్రియై నమః అంటూ పూజించాలి. ఆ తరువాత

ఈ క్రింది మంత్రాలతో షడంగ న్యాసం చేయాలి.

ఓం శ్రాం హృదయాయ నమః,

ఓం శ్రీం శిరసే నమః,

ఓం శ్రూం శిఖాయై నమః,

ఓం శ్రైం కవచాయ నమః,

ఓం శ్రౌం నేత్రత్రయాయ నమః,

ఓం శ్రః అస్త్రాయ నమః' అనంతరము స్వామివారి ఆయుధాలనూ ఆభరణాలనూ అవరోధ వ్రాతము (పరివారము) నూ ఈ మంత్రాలతో అర్చించాలి.

ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః,

ఓం చక్రాయ నమః, ఓం గదాయై నమః,

ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః,

ఓం వనమాలాయై నమః, ఓం పీతాంబరాయ నమః,

ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః,

ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః,

ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః,

ఓం నిరృతయే నమః, ఓం వరుణాయ నమః,

ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః,
విష్ణవే దేవ దేవాయ నమో వైప్రభవిష్ణవే ॥ 
విష్ణవే వాసుదేవాయ నమః స్థితి కరాయచ | 
గ్రసిష్ణవే నమశ్చైవ నమః ప్రళయశాయినే । 
దేవానాం ప్రభవే చైవ యజ్ఞానాం ప్రభవే నమః | 
మునీనాం ప్రభవే నిత్యం యక్షాణాం ప్రభవిష్ణవే ॥ 
జిష్ణవే సర్వ దేవానాం సర్వగాయ మహాత్మనే । 
బ్రహ్మేంద్ర రుద్ర వంద్యాయ సర్వేశాయ నమోనమః || 
సర్వలోక హితార్థాయ లోకాధ్యక్షాయవై నమః । 
సర్వగోప్తే సర్వకర్తే సర్వదుష్ట వినాశినే ॥ 
వరప్రదాయ శాంతాయ వరేణ్యాయ నమోనమః | 
శరణ్యాయ సురూపాయ ధర్మకామార్థదాయినే ॥ (ఆచార31/24-29)

శంకరదేవా! ఏ విధంగా బ్రహ్మ స్వరూపుడు, అవ్యయుడు, పరాత్పరుడునైన విష్ణుభగవానుని స్తుతించి సాధకుడు తన హృదయంలో ఆయనను చూడగలిగి ధ్యానించాలి. తరువాత మూలమంత్ర జపాన్ని చేస్తూ ధ్యానించాలి. ఈ రకంగా చేయగలిగిన వానికి విష్ణువు వశుడౌతాడు. హే రుద్రదేవా! ఈ విధంగా ఒక రహస్య పూర్ణ పరమగుహ్య, భుక్తి ముక్తి ప్రద, విష్ణు ఉత్తమ (వైష్ణవోత్తమ) పూజా విధానాన్ని మీరు నాచే పలికించారు. విద్వాంసుడైన పురుషుడీ పూజను పఠించగానే విష్ణుభక్తశ్రేష్ఠుడై వెలుగొందుతాడు. దీనిని విన్నవారు, చెప్పినవారు విష్ణులోక ప్రాప్తి నొందుతారు. (అధ్యాయాలు 28-31)

Wednesday 24 January 2024

శ్రీ గరుడ పురాణము (70)

 


మహర్షులారా! ఇపుడు శ్రీధరభగవానుని అనగా విష్ణుదేవుని మంగళమయమైన పూజా విధానాన్ని వర్ణిస్తాను. సాధకుడు ముందుగా ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసమును చేయాలి. 

ఓం శ్రాం హృదయాయ నమః, 

ఓం శ్రీం శిరసే స్వాహా, 

ఓం శ్రూం శిఖాయై వషట్, 

ఓం శైం కవచాయ హుం, 

ఓం శ్రౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం శ్రః అస్త్రాయ ఫట్.


అనంతరం శంఖ, చక్ర, గదాది స్వరూపిణీ ముద్రలను ప్రదర్శించి వాటిని ధరించి యున్న ఆత్మస్వరూపుడైన శ్రీధర భగవానుని ఇందాకటి మంత్రంతో ధ్యానించాలి. స్వస్తిక లేదా సర్వతో భద్రమండలాన్ని సిద్ధం చేసి శ్రీ భగవానుని ఆసనాన్ని పూజించి ఆ స్వామిని 

ఓం శ్రీధరాసన దేవతా ఆగచ్ఛత 

అని ఆవాహనం చేయాలి.


ఈ క్రింది మంత్రాలతో ఆసన పూజ చేయాలి.


ఓం సమస్త పరివారాయాచ్యుతా సనాయ నమః ఆపై


ఓం ధాత్రే నమః, 

ఓం విధాత్రే నమః లతో మొదలెట్టి ధాతా, విధాతా గంగాది దేవతలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి.


ఓం గంగాయై నమః, ఓం యమునాయై నమః, ఓం ఆధార శక్ష్యై నమః, ఓం కూర్మాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం పృథివ్యై నమః, ఓం ధర్మాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం అజ్ఞానాయ నమః, ఓం అవైరాగ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః, ఓం కందాయ నమః, ఓం నాలాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం విమలాయై నమః, 

ఓం ఉత్కర్షిణ్యై నమః, ఓం జ్ఞానాయై నమః, ఓం క్రియాయై నమః, ఓం యోగాయై నమః, ఓం ప్రహ్వ్యై నమః, ఓం సత్యాయై నమః, ఓం ఈశానాయై నమః, ఓం అనుగ్రహాయై నమః,


Tuesday 23 January 2024

శ్రీ గరుడ పురాణము (69)

 


శ్రీ గోపాలదేవుని పూజ-శ్రీధరపూజ త్రైలోక్యమోహన మంత్రం


ఋషులారా! నేనిపుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములు గోపాల, శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొఱకొక మండలాన్నేర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగాయమునలనూ, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత, విధాతలనూ పూజించాలి. తరువాత లక్ష్మి, శంఖం, పద్మనిధి, శారంగధనువు, శరభాలను పూజించాలి. ఆ తరువాత తూర్పు దెసలో భద్ర, సుభద్రలకూ, దక్షిణ దిశలో చండ ప్రచండులకూ, పడమటి దిక్కున బల, ప్రబలులకూ, ఉత్తరం వైపున జయ విజయులకూ పూజలు చేయాలి. పిమ్మట నాలుగు ద్వారాలలో క్రమంగా లక్ష్మి, గణపతి, దుర్గ, సరస్వతమ్మలను పూజించాలి.


మండలం ఆగ్నేయాది కోణాల్లో పరమ భాగవతోత్తముడైన నారదునీ, సిద్ధులనూ, గురుగ్రహాన్నీ, నలకూబరునీ స్థాపించి పూజించాలి. తూర్పు వైపు విష్ణువునీ విష్ణుశక్తినీ అర్చించాలి. మండలంలో విష్ణు పరివారాన్ని స్థాపించి పూజించాలి. మండలమధ్యంలో శక్తి కూర్మ, అనంత, పృథ్వి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య మూర్తులకు ఆగ్నేయాది కోణాల్లో పూజలు చేయాలి. వాయవ్య కోణంలోనూ ఉత్తర దిశలోనూ ప్రకాశ, ఐశ్వర్యాలను పూజించాలి.


'గోపీజన వల్లభాయ స్వాహా' ఇది గోపాల మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ మండలంలో తూర్పుతో మొదలెట్టి క్రమంగా ఎనిమిది వైపులా కృష్ణపత్నులైన సుశీల, జాంబతి, రుక్మిణి, సత్యభామ, సునంద, నాగ్నజితి, లక్షణ, మిత్రవిందలను స్థాపించి ఆ తరువాత వారిని పూజించాలి. వెంటనే శ్రీ గోపాలదేవుని శంఖ, చక్ర, గద, పద్మ, ముసల, ఖడ్గ, పాశ, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, ముకుట, వనమాలాది చిహ్నాలను పూజించాలి. పిమ్మట ఇంద్రాది ధ్వజపాలక దిక్పాలకునూ, విష్వక్సేనునీ, లక్ష్మీసహిత శ్రీకృష్ణ భగవానునీ అర్చించాలి.


గోపీ జన వల్లభమంత్రాన్ని జపించి, ధ్యానించి, సాంగోపాంగంగా ఆయన పూజను పై విధంగా చేసేవారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.


త్రైలోక్యమోహన శ్రీధరీయ మంత్రం :


ఓం శ్రీం (లేదా శ్రీః) శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః । క్లీం పురుషోత్తమాయ త్రైలోక్య మోహనాయ నమః । ఓం విష్ణవే త్రైలోక్య మోహనాయ నమః । ఓం శ్రీం హ్రీం క్లీం త్రైలోక్యమోహనాయ విష్ణవే నమః ।


ఈ మంత్రం సమస్త ప్రయోజనాలనూ సంపూర్ణంగా కలిగిస్తుంది.


Monday 22 January 2024

శ్రీ గరుడ పురాణము (68)

 


విషదూరక మంత్రం


ఋషులారా! ఇపుడు మీకు సర్పాది విషజంతువుల వల్ల కలిగే కష్టాలను తొలగించే మంత్రాన్నుపదేశిస్తాను వినండి.


'ఓం కణిచికీణి కక్వాణీ చర్వాణీ 

భూతహరిణి ఫణి విషిణి విరథ 

నారాయణి ఉమే దహదహ హస్తే 

చండేరౌద్రే మాహేశ్వరి మహాముఖి 

జ్వాలాముఖి శంకుకర్ణి శుకముండే 

శత్రుం హనహన సర్వనాశిని స్వేదయ 

సర్వాంగశోణితం తన్నిరీక్షసి మనసాదేవి 

సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య 

హృదయే జాతా రుద్రస్య హృదయే స్థితా । 

రుద్రో రౌద్రేణ రూపేణ త్వం దేవి రక్ష రక్ష 

మాం హ్రూం మాం హ్రూం ఫ ఫ ఫ ఠఠ 

స్కందమేఖలా బాలగ్రహ శత్రు విషహారీ 

ఓం శాలే మాలే హర హర విషోంకార 

రహి విషవేగే హాంహాం శవరిహుం 

శవరి ఆ కౌలవేగేశే సర్వే వించమేఘమాలే 

సర్వనాగాది విషహరణం !”


ఈ మంత్రాన్ని ప్రయోగిస్తున్నపుడు దీని భావాన్నే మనసు నిండా అమ్మ స్వరూపంతో సహా నిలుపుకుంటూ వుండాలి. దీని భావం ఇది :


'అమ్మా ఉమాదేవీ! నీవు రుద్రుని హృదయం నుండి పుట్టి అక్కడే నివసించగలిగిన పరాశక్తివి. నీది రౌద్రరూపము. నీ ముఖం జ్వాల వలె జాజ్వల్యమానం. నీ కటికి వున్న ఘంటికారవం దుష్టశక్తుల పాలిటి శరాఘాతం. అందుకే దానిని క్షుద్ర ఘంటిక అంటారు. నీవు భూతప్రియవైనా విషసర్పాలకే విషరూపిణివి. విరథనారాయణిగా, శుక్రముండగా పిలువబడే నీవు దుష్టశక్తుల పాలిటి విశాల, భయంకరముఖివి; ప్రచండ స్వభావురాలివి. నీ చెవి కుండల శంకువుల కాంతులే వాటిని నయన విహీనులను గావిస్తాయి. చేతి నుండి జ్వలన శక్తిని పుట్టించి మా శత్రువులను కాల్చివేయి. కాల్చివేయి. విషనాశినివైన ఓ దేవీ! ఈ నరుని (లేదా నారి)లో వ్యాపించిన విషప్రభావాన్ని నశింపజేయి. ఆ విష జంతువును సమ్మోహితంగా గావించు, సమ్మోహితం గావించు. దేవీ మమ్ము రక్షించు, రక్షించు' అనుకుంటూ మంత్రాన్ని మరల చదివి దేవిని మరల ప్రార్ధించి హ్రూం మాం హ్రూం ఫఫఫఠఠ అనే బీజాక్షరాలను పలుకుతుండాలి. తరువాత హాంహాం శవరిహుం అని కూడా ఉచ్చరిస్తూ రోగి శరీరాన్ని స్పృజించాలి. ఇలా రోగికి స్పృహవచ్చేదాకా మంత్ర పఠన, భావచింతన, బీజాక్షరోచ్చాటన, శవర్యుచ్చారణ చేస్తుండాలి. (అధ్యాయం - 27)


Friday 19 January 2024

శ్రీ గరుడ పురాణము (67)

 

త్రిపురాదేవి గణేశాదుల పూజ


ఋషులారా! ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికీ, మూర్తికీ పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరల న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి.


ఓం గాం హృదయాయ నమః, 

ఓం గీం శిరసే స్వాహా,

ఓం గూం శిఖాయై వషట్, 

ఓం గైం కవచాయ హుం, 

ఓం గౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం గః అస్త్రాయ ఫట్ |


తరువాత సాధకుడు. ఓం దుర్గాయాః పాదుకాభ్యాం నమః అంటూ దుర్గమ్మ యొక్కయూ, ఓం గురుపాదుకాభ్యాం నమః అంటూ గురువు గారి యొక్కయు పాదుకలకు నమస్కారం చేసి త్రిపురాదేవికీ, ఆమె ఆసనానికి నమస్కారం చేసి 'ఓం హ్రీం దుర్గే రక్షిణి' అనే మంత్రంతో హృదయాదిన్యాసాన్ని గావించి మరల ఇదే మంత్రంతో రుద్రచండ, ప్రచండ దుర్గ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, చండిక, దుర్గ అనే తొమ్మిది శక్తులనూ పూజించాలి. తరువాత వజ్ర, ఖడ్గాది ముద్రలను ప్రదర్శించి దేవికి ఆగ్నేయంలో సదాశివాది దేవతలకు పూజ చేయాలి. దానికై సాధకుడు ముందుగా ఓం సదాశివ మహాప్రేత పద్మాసనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి ఆ తరువాత ఓం ఐం క్లీం (హ్రీం) సౌంత్రిపురాయై నమః అనే మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారం చేయాలి.


తరువాత త్రిపురాదేవి యొక్క ఆసనానికీ (పద్మానికి), మూర్తికీ, హృదయాది అంగాలకీ నమస్కారం చేసి ఆ పద్మపీఠం పై మాహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారిహి, ఇంద్రాణి, చాముండ, చండిక అను ఎనమండుగురు దేవతలనూ పూజించాలి. పిమ్మట ఎనమండుగురు భైరవులనూ అర్చించాలి. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి అనువారలు అష్టభైరవులు, భైరవ పూజానంతరము రతి, ప్రీతి, కామదేవ, పంచబాణ, యోగిని, బటుక, దుర్గ, విఘ్నరాజాదులనూ, గురువునూ, క్షేత్రపాల దేవతలనూ పూజించాలి.


సాధకుడిపుడు ఒక పంచగర్భ మండలాన్నిగానీ త్రికోణ పీఠాన్నిగానీ వేసి దానిపై శుక్లవర్ణ సుశోభితా, వరదాయినీ, వీణాపుస్తక ధారిణీ, అక్షమాల, అభయముద్ర హస్తాలంకృతా యగు సరస్వతీ దేవి మూర్తిని స్థాతిపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీ దేవి మంత్రాన్ని లక్షమార్లు జపించాలి. హవనం కూడా చేయాలి. అపుడా తల్లి సాధకునికి సిద్ధిధాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు.


(అధ్యాయాలు 24-26)



Thursday 18 January 2024

శ్రీ గరుడ పురాణము (66)

 


తరువాత దిక్పాలకులనూ, వారి మధ్యలో చండేశ్వరీ దేవిని పూజించాలి.


చివర మరల శివుని ఇలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి.

గుహ్యాతిగుహ్యగోప్తాత్వం 

గృహాణా స్మత్కృతం జపం | 

సిద్ధిర్భవతు మేదేవ త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః || 

యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం | 

తన్మే శివ పదస్థస్య రుద్ర క్షపయ శంకరః ॥ 

శివోదాతా శివోభోక్తా శివః సర్వమిదంజగత్ | 

శివోజయతి సర్వత్రయః శివః సోఽహమేవచ ॥ 

యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ | 

త్వం త్రాతా విశ్వనేతాచనాన్యో నాథోస్తి మే శివ ॥ (ఆచార కాండం 23/26-29)


'హే ప్రభో! నీవు గుహ్యాతిగుహ్యమైన తత్త్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు. నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృపవల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా వుండేలా వరమియ్యి. రుద్రదేవా! శంకరా! నా పాపాలను నశింపజెయ్యి. పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్నీ వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు. సర్వభర్తవు. నా భవిష్యత్కర్మలన్నీ నీ వైపే పయనించే లాగ నన్ను దీవించు. రక్షకుడవు నీవే. విశ్వనాయకుడవు నీవే. హే పరమశివా! నాకు వేరే దిక్కు గాని దైవంగాని లేదు' అని ఈ స్తుతి సారము.


ఈ రకంగా శివోపాసనచేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాతపడడు. అతి శోతోష్టాలకూ అతీతుడవుతాడు.


భగవానుడైన సదాశివుని మంగళమయధ్యాన స్వరూపాన్ని (అనుబంధం-3లో చూడండి.)


Wednesday 17 January 2024

శ్రీ గరుడ పురాణము (65)

 


తరువాత పద్మమధ్యంలో నున్న శక్తి అనంతదేవులనూ, పద్మ పూర్వ దళంలో ధర్మాన్నీ, దక్షిణంలో జ్ఞానాన్నీ, పశ్చిమంలో వైరాగ్యాన్నీ, ఉత్తరంలో ఐశ్వర్యాన్నీ, ఆగ్నేయంలో అధర్మాన్నీ, నైరృత్యంలో అజ్ఞానాన్నీ, వాయవ్యంలో అవైరాగ్యాన్నీ, ఈశాన్యంలో అనైశ్వర్యాన్నీ పద్మకర్ణికపై వామా, జ్యేష్ఠాశక్తులనూ మరల తూర్పుతో మొదలుపెట్టి రౌద్రీ, కాలీ, శివా, అసితాది శక్తులనూ పూజించాలి.


తరువాత శివుని కెదురుగా నున్న పీఠంపై ప్రతిష్టింపబడిన కలవికరిణీ, బలవికరిణీ, బలప్రమథినీ, సర్వభూతదమనీ, మనోన్మనీ అనే మహాశక్తులను ఈ దిగువ నీయబడిన మంత్రాలతో పూజించాలి.


ఓం హౌం కలవికరిణ్యై నమః,

ఓం హౌం, బలవికరిణ్యై నమః,

ఓం హౌం బల ప్రమథిన్యై నమః,

ఓం సర్వభూత దమన్యై నమః,

ఓం మనోన్మన్యై నమః ।


తరువాత సాధకుడు ఒక ఆసనం పైకి శివునాహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివునుద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలను చూపించి అర్ఘ్య, పాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి- మంథనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, 'చరు (చరు' అనగా హోమయోగ్యమైన, పక్వం చేయబడిన అన్నము.) నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యానంతరము ఆచమనం చేసి ముఖశుద్ధికై (ముఖమనగా నోరు) తాంబూలము, కరోద్వర్తనం, ఛత్రం, చామరం యజ్ఞోపవీతం, ప్రదానం చేసి పరమీకరణ (పరమీకరణమనగా అర్చనీయదేవునిలో సర్వోత్కృష్టత యను భావము గట్టి పఱచుట) చేయాలి.


పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే 'షడంగ పూజ' అని వ్యవహరిస్తారు.


Tuesday 16 January 2024

శ్రీ గరుడ పురాణము (64)

 


అంగన్యాసానంతరము సాధకుడు ఈ దిగువ నీయబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు 'మానసీపూజ'ను సంపన్నం గావించాలి.


ఓం సః సూర్యాయ నమః

ఓం సోం సోమాయ నమః

ఓం మం మంగలాయ నమః

ఓం బుం బుధాయ నమః

ఓం బృం బృహస్పతయే నమః,

ఓం భం భార్గవాయ నమః, 

ఓం శం శనైశ్చరాయ నమః,

ఓం రం రాహవే నమః,

ఓం కం కేతవే నమః,

ఓం తేజశ్చండాయ నమః ।


ఈ విధంగా సూర్య దేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ క్రింది మంత్రాలతో చిటికెన వ్రేలితో మొదలెట్టి అన్ని వేళ్ళతో కరన్యాస, అంగన్యాసాలను చేయాలి.


ఓం హం హృదయాయ నమః,

ఓం హీం శిరసే స్వాహా, 

ఓం హూం శిఖాయై వౌషట్,

ఓం హైం కవచాయ హుం,

ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్,

ఓం హః అస్త్రాయ ఫట్ |


తరువాత భూతశుద్ధి గావించి మరల న్యాసం చేయాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై జల్లుకోవాలి. తరువాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. 'ఓం హౌం శివాయ నమః' అనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగ, యమున, సరస్వతి, శ్రీవత్స, వాస్తుదేవత, బ్రహ్మ, గణపతిలనూ తదుపరి తన గురుదేవునీ సాధకుడు అర్చించాలి.


Monday 15 January 2024

శ్రీ గరుడ పురాణము (63)

 


తరువాత దండీ, పింగళాది భూత నాయకులను ఓం దండినే నమః, ఓం పింగలాయ నమః మున్నగు మంత్రాల ద్వారానూ, అనంతరం ఆగ్నేయాది కోణాలలో ఓం విమలాయై నమః, ఓం ఈశానాయై నమః అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారానూ స్థాపించి, స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలూ ప్రాప్తిస్తాయి.


మహాశక్తులను బీజమంత్ర యుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి.


ఓం రాం పద్మాయై నమః   ఆగ్నేయం

ఓం రీం దీప్తాయై నమః   నైరృత్యం

ఓం రూం సూక్ష్మాయై నమః  వాయవ్యం

ఓం రేం జయాయై నమః   ఈశాన్యం

ఓం రైం భద్రాయై నమః   తూర్పు

ఓం రోం విభూత్యై నమః   దక్షిణం

ఓం రౌం విమలాయై నమః    పశ్చిమం

ఓం రం అమోఘికాయై నమః   ఉత్తరం

ఓం రం విద్యుతాయై నమః   ఉత్తరం

ఓం రం సర్వతోముఖ్యై నమః   మండలమధ్యం


తరువాత శివస్వరూపమున్న సూర్య ప్రతిమను సూర్యాసనంపై స్థాపించి హ్రాం హ్రూం (లేదా హ్రీం)సః అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి క్రింది మంత్రాలతో న్యాసం చేయాలి.


'ఓం ఆం హృదర్కాయ నమః '

'ఓం భూర్భువః స్వః శిరసే స్వాహా'

'ఓం భూర్భువః స్వః శిఖాయై వౌషట్'

'ఓం హ్రం జ్వాలిన్యై నమః '

'ఓం హ్రుం కవచాయ హుం'

'ఓం హ్రూం అస్త్రాయ ఫట్'

'ఓం హ్రం ఫట్ రాజ్ఞ్యై నమః '

'ఓం హ్రం ఫట్ దీక్షితాయై నమః '


Sunday 14 January 2024

శ్రీ గరుడ పురాణము (62)

 


తరువాత కమలాంకిత గర్భయైన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్ని కోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్ని కుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తరువాత మండలంలోనున్న కమల కర్ణికపై సదాశివునికీ దిశలలో అస్త్రాలకీ పూజచేయాలి. అంతట పంచతత్త్వాలలో నుండు పృథ్వీ, జల తత్త్వ శక్తులకు విడివిడిగా వంద వంద ఆహుతులను అయిదేసిమార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారియైన శివుని ధ్యానించాలి.


అనంతరం ప్రాయశ్చిత్తశుద్ధికై ఎనిమిదిమార్లు ఆహుతులివ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన 'హుంఫట్' అనే మంత్రంతో అర్పించడం శ్రేష్ఠం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు.


శివుని యొక్క విశేషపూజలో సాధకుడు మొదట


ఓం హాం ఆత్మ తత్త్వాయ స్వాహా


ఓం హీం విద్యాతత్త్వాయ స్వాహా


ఓం హూం శివతత్త్వాయ స్వాహా


అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి.


'ఓం హాం ప్రపితా మహేభ్యః స్వధా,


'ఓం హాం మాతా మహేభ్యః స్వధా'


ఓం హాం నమః సర్వ మాతృభ్యః స్వధా'


ఇలాగే తన పితరులందరికీ తర్పణాలిచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన, మార్జనలనాచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి.


'ఓం హాం తన్మహేశాయ విద్మహే,


వాగ్విశుద్ధాయ ధీమహి 

తన్నోరుద్రః ప్రచోదయాత్ |'


(అనుబంధం - 2 చూడండి)


పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి.


ఓం హాం హీం హూం హైం హౌం హః

శివ సూర్యాయ నమః |


ఓం హం ఖఖోల్కాయ సూర్యమూర్తయే నమః ।

ఓం హ్రాం హ్రీం సః సూర్యాయ నమః ।


ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి, సూర్య మంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి.


Saturday 13 January 2024

శ్రీ గరుడ పురాణము (61)

 


ఈ కళలను కూడ ఓం, నమః ఆదులను చేర్చి పూజించాక శివుని నాలుగవ వక్త్ర రూపమైన తత్పురుషుని ఓం హైం తత్పురుషాయ నమః అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు అయిదు. అవి నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని ఓం హౌం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు ఆరు. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలనూ 'ఓం, షష్ఠి, నమః' లను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమౌతుంది.


ఋషులారా! ఇపుడు శివార్చన విధిని వినిపిస్తాను. పన్నెండంగుళాల మేర శివమూర్తిని, బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా వుండాలి. శివుని ముఖం వైపు అయిదు బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి ఆరవబిందువూ విసర్గ వుండాలి. అది అస్త్ర (హస్తన్యాస)ము. దానితో బాటు 'హౌం' అనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం. సంపూర్ణార్థ ప్రదాయకం. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ద్వ భాగం నుండి చరణ పర్యంతమూ చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి.


అపుడు అస్త్రమంత్రం ఓం ఫట్ నుచ్చరిస్తూ కుడి పిడికిలితో స్పర్శ, శోధనలను గావించాలి. తరువాత చిటికెన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి.


ఇక బాహ్యపూజ, మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా అందులోని మధ్యభాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్య, స్నానములను అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలను గావించాలి. తరువాత అగ్నిలో ఆహుతులనివ్వాలి. అదెలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి వుంచడానికి ముందే 'ఓం ఫట్' అనే అస్త్ర మంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై 'ఓం హూం' అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి. అనగా నీళ్ళు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపియైన తేజాన్నీ అగ్నినీ విన్యాసం చేయాలి. (అంటే వుంచాలి) ఈ అగ్నిలో నిష్కకృతి-సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలనూ చేసుకోవాలి. అన్నిటి తరువాత సమస్త ఆంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులివ్వాలి.


Friday 12 January 2024

శ్రీ గరుడ పురాణము (60)

 


పంచవక్త్ర పూజనం - శివార్చన విధి

ఋషులారా! ఇపుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తినీ ముక్తినీ ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి.

'ఓం భూర్విష్ణవే ఆది భూతాయ సర్వాధారయ మూర్తయే స్వాహా'

తరువాత సద్యోజాత విశేషణధారియైన పరమాత్మ కళను ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి.

'ఓం హాం సద్యోజాతాయ నమః'

ఈ సద్యోజాత శక్తిలో ఎనిమిది కళలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ, స్థితి. వీటన్నిటినీ, ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో 'నమః' ను చేర్చి పూజించాలి. (ఉదా॥ సిద్ధిని 'ఓం సిద్ద్యై నమః' అనే మంత్రంతో పూజించాలి.)

తరువాత సాధకుడు

ఓం హీం వామదేవాయ నమః

(కొన్నిచోట్ల హ్రీంకి బదులు హీం వుంది)

అంటూ వామదేవుని పూజించాలి. ఈ శివ స్వరూపానికి పదమూడు కళలు. అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి.

అలాగే అఘోర స్వామికీ ఒక మంత్రమూ ఎనిమిది కళలూ వుంటాయి. (ఎందుచేతనో గాని మంత్రమూ బీజాక్షరమూ చెప్పబడలేదు) ఆ కళలు ఇవి : మనోన్మనీ, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర.

Thursday 11 January 2024

శ్రీ గరుడ పురాణము (59)

 


'ఓం హ్రాం సదాశివాయనమః అనే మంత్రాన్ని జపిస్తూ చూపుడు వేలు, చిటికెన వేలు వాడుతూ అనార్ పుష్పం వలె కాంతులు వెదజల్లు ఒక పిండమును నిర్మించాలి. దానిని చూడగానే దుష్టజనులు, దుష్టమేఘాలు, విషాలు, రాక్షసులు, డాకిన్యాదులు భయపడి పారిపోతాయి.


'ఓం హ్రీం గణేశాయ నమః ।

ఓం హ్రీం స్తంభనాది చక్రాయ నమః ।

ఓం ఐం బ్రాహ్మ్యై త్రైలోక్య డామరాయ నమః |


(డామరాయ)


- ఈ మంత్ర సంగ్రహాన్ని 'భైరవ పిండ' మంటారు. ఇది విషాన్నీ, పాపిష్టి గ్రహాల దుష్ట ప్రభావాన్నీ సమాప్తం చేయడంలో కడు సమర్థము. ఇది సాధకుని కార్యక్షేత్ర రక్షణనీ, భూత-రాక్షసాది గణాల ఉపద్రశక్తుల నుండి రక్షణనీ కల్పించగలదు.


'ఓం నమః' అంటూ సాధకుడు తన చేతిలోనే ఇంద్ర వజ్రాయుధాన్ని భావించుకొని 

ధ్యానం చేయడాన్ని 'వజ్రముద్ర' అంటారు. ఇది విష, శత్రు, భూతగణాలను నశింపజేయగలదు. 'ఓం క్షుం (లేదా క్ష) నమః' అనే మంత్రాన్ని జపిస్తూ ఎడమ చేతిలో పాశాన్ని భావించుకొని స్మరణ చేసినా అదే ఫలముంటుంది. ఓం హ్రాం (లేదా హోం) నమః అనే మంత్రోచ్ఛాటన వల్ల ఉపద్రవకారకులైన మేఘ, పాప గ్రహాల ప్రభావం నశిస్తుంది. ఓం క్ష (క్ష్మ) నమః అనే మంత్రంతో కాలభైరవుని ధ్యానిస్తే కూడా అదే ఫలితముంటుంది.


'ఓం లసద్ ద్విజిహ్వాక్ష స్వాహా' అనే మంత్రాన్నుచ్చరిస్తూ దైవ ధ్యానం చేయడం వల్ల పంట పొలాలు గ్రహ, భూత, విష, పక్షి పీడల నుండి రక్షింపబడతాయి.


ఓం క్ష్వ (క్ణం) నమః అనే మంత్రాన్ని నగారాపై ఎఱ్ఱని సిరాతో రాసి చదువుతూ కర్రతో కొడితే ఆ శబ్దాలను వినగానే పాప గ్రహాది ఉపద్రవకారక తత్త్వాలన్నీ భయభీతాలై పారిపోతాయి. 


(అధ్యాయాలు 19, 20)


Wednesday 10 January 2024

శ్రీ గరుడ పురాణము (58)

 


ఓం హ్రీం అః ను ఉచ్ఛరిస్తూ హృదయ లలాటాదులలో విన్యాసం చేసే సాధకుడికి సర్పాలు వశీభూతాలవుతాయి. ఈ మంత్రాన్ని విధ్యుక్తముగా పదిహేను వేలమార్లు జపించిన వారు గరుడుని వలె సర్వగామి, కవి, విద్వాన్, వేదవిదులు కాగలరు. దీర్ఘాయువులూకాగలరు. ఋషులారా! బలవంతులైన శత్రువులపై విజయ సాధకమైన మంత్రమొకటుంది. ఆ మంత్ర జప విధానాన్ని శివుడుపదేశించాడు. ఇది గోపనీయమైనా మీకు వినిపిస్తాను.


దీనితో అభిమంత్రితాలైన ఆయుధాలకు అపజయమనేది వుండదు.


ఈ మంత్రం ద్వారా ఉద్ధరింపబడదలచుకొన్నవారు కమలపత్రంపై అష్టవర్గాలను నిర్మించి వాటిపై తూర్పుతో మొదలెట్టి ఈశాన్యం దాకా వరుసగా ఓం హ్రీం హ్రీం అనే బీజమంత్రాలను వ్రాసుకుంటూ పోవాలి. ఓం కారం బ్రహ్మబీజమైతే శివకేశవ బీజం హ్రీంకారం. త్రిశూలమును గీసి దాని మూడు తలలపై హ్రీం కారాన్ని లిఖించాలి.


సాధకుడు త్రిశూలాన్ని ధరించి దానిని ఆకాశం వైపు గిరగిరా త్రిప్పగానే సర్పదుష్ట శక్తులు భయపడి పారిపోతాయి. సాధకుడు ధనుర్ధారియై ఆకాశంవైపు నారి సారించి ఈ మంత్రాన్ని మననం చేయగానే దుష్ట విషసర్పాలూ, కుత్సిత గ్రహాలూ, వినాశకర మేఘాలూ, రాక్షసశక్తులూ భయపడి పారిపోతాయి. ఆ ధనుస్సు ధూమ్రవర్ణంలో వుండాలి.


ఈ మంత్రం ముల్లోకాలనూ రక్షించగల సామర్థ్యం గలది. ఇక మృత్యులోకం సంగతి చెప్పనక్కర లేదు కదా!


ఓం జూం సూం హూం ఫట్ అనేది మరొక మంత్రం. సాధకుడు ఎనిమిది కాచు కర్రలను దీనితో అభిమంత్రించి ఎనిమిది దిక్కులలో పాతి వుంచితే ఆ కీలాంకిత క్షేత్రంలో పిడుగుపడకుండా, విద్యుజ్ఞ్వాలలు రగలకుండా ఆ భూమి రక్షింపబడుతుంది. ఇదీ గరుత్మంతుని మంత్రమే. రాత్రి ఎక్కడైనా ఈ మంత్రంతో ఎనిమిది కర్రలను ఇరువది యొక్క మార్లు అభిమంత్రించి ఎనిమిది దిక్కుల్లో పాతి వుంచితే ఆ మధ్య భాగంలో వున్న వారికి సర్వోపద్రవముల నుండీ రక్షణ లభిస్తుంది.


Tuesday 9 January 2024

శ్రీ గరుడ పురాణము (57)

 


మరొక సాధన ఇది. సాధకుడు తన రెండు పాదాగ్రాలలోనూ 'అ ఆ'లనూ, (చీలమండల్లో) గుల్ఫాలలో 'ఇఈ'లనూ, జానువులలో 'ఉఊ'లనూ, కటిలో 'ఏఐ'లనూ, నాభిలో 'ఓ'నూ, ఛాతీ పై 'ఔ'నీ, ముఖంలో 'అం'నీ, మస్తకంలో 'అః' నూ స్థాపించుకొని 'ఓం హంసః' అను బీజమంత్రసహితంగా న్యాసం చేసుకొని నిత్యం జప పూజనాలనూ చేస్తూ వుంటే అతనికి సర్పవిషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది.


సాధకుడు 'నేను స్వయంగా గరుత్మంతుడను' అను భావనతో ధ్యానంలోకి వెడలి పోయి ఈ మంత్రసాధనను చేయాలి. విషానికి వ్యతిరేకంగా ప్రయోగం చేస్తున్నంత సేపూ అతనిలో 'తాను గరుడుడను' అనే ధ్యాసయే వుండాలి. 'హం' అనే బీజాక్షరం శరీరంలో ప్రవేశించిన విషాదులను హరించే శక్తినికలిగి వుంటుంది. 'హంసః' మంత్రాన్నిఎడమచేతిలో న్యాసం చేసుకొనియున్న సాధకుడు ధ్యాన, పూజన, నిత్య జప శక్తుల సహాయంతో విషాన్ని విరిచివేయడానికి సమర్థుడవుతాడు. ఎందుకంటే ఈ మంత్రం విషధర నాగుల నాసికా భాగాన్నీ, శ్వాస నాళికనీ అదుపు చేసే శక్తినీ, సంపూర్ణ సామర్థ్యాన్నీ కలిగి వుంటుంది. ఈ మంత్రం బాధిత శరీరంలోకీ మాంసంలోకి దూసుకొని పోయి సర్ప విషాన్ని నశింపజేస్తుంది.


పాము కాటుచే మూర్ఛితుడైన ప్రాణి శరీరంపై 'ఓం హంసః' మంత్రాన్ని న్యాసం చేసి భగవంతుడైన నీలకంఠస్వామినీ ఇతరదేవతలనీ కూడా ధ్యానించాలి. దీని వల్ల మంత్రానికి వాయుశక్తి తోడై శీఘ్రంగా సంపూర్ణంగా విషాన్ని హరించగలదు.


ప్రత్యంగిరా జడాన్ని బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టి పిండితే, రోగి నోటిలోకి, పిండితే విష ప్రభావం తగ్గుతుంది. పునర్నవ (గలిజేరు చెట్టు), ప్రియంగు (పిప్పలి), వక్త్రజ (బ్రాహ్మి) (బారంగి), శ్వేత బృహతి (తెల్లవాకుడు లేదా ములక), కూష్మాండ (గుమ్మడి), అపరాజిత జడం (తక్కిలి), గేరు (ఎఱ్ఱచెట్టు), కమల గట్టఫలం వీటన్నిటినీ నీటిలో వేసి బాగా పిండి నేతితో కలిపి ఒక లేపనాన్ని తయారు చేసి దానిని పాము కాటు బాధితుని శరీరంపై పూస్తే విషం ప్రభావం తగ్గుతుంది. పాము కాటేయగానే ఆ వ్యక్తి చేత వేడి నేతిని త్రాగిస్తే విషప్రభావం మందగిస్తుంది. అలాగే శిరీష వృక్ష పంచాంగాలను (ఆకు, పువ్వు, పండు, వేరు, బెరడు) (ముల్లంగి వంటి దుంప) గాజరబీజాలతో కలిపి నూరి కషాయం చేసి కొంత త్రాగించి, కొంత శరీరానికి పూస్తే సర్పదష్టులకు విషము నుండి విడుదల లభించవచ్చు.


Monday 8 January 2024

శ్రీ గరుడ పురాణము (56)

 


రాత్రి, పగళ్ళ గణన ముప్పది- ముప్పది ఘటికలలో వుంటుంది. ఈ లెక్కను అనుసరించి నిర్మింపబడిన కాలచక్రములో చంద్రుడు పాడ్యమినాడు కాళ్ళ బొటన వ్రేళ్ళలోనూ, విదియనాడు కాళ్ళపైనా, తదియనాడు మోకాళ్ళలోనూ, చవితినాడు వాటికి పైనా, పంచమినాడు తొడల మధ్యలోనూ, షష్ఠినాట నాభిలోనూ, సప్తమినాడు ఛాతీపైనా, అష్టమినాడు స్తనాలలోనూ, నవమినాడు గొంతుపైనా, దశమినాడు ముక్కుపైనా, ఏకాదశినాడు కన్నులలోనూ, ద్వాదశినాడు చెవుల వద్దనూ, త్రయోదశినాడు కనుబొమ్మల మధ్యలోనూ, చతుర్దశినాడు కణతలపైనా, పున్నమి అమావాస్యలలో మస్తకంపైననూ మానవులలో నివాసముంటాడు. చంద్రుడున్న చోట ప్రాణి అంగంపై పాము కాటేసినా ఆ ప్రాణిని బ్రతికించవచ్చును. మూర్ఛ నుండి మెలకువ రావడం ఆలస్యం కావచ్చు కానీ సాధకుడు శరీర మర్దన ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు.


ఓం హంసంః అనే నిర్మల స్పటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమ మంత్రం. విషరూపంలో నున్న పాపాన్ని నశింపజేసే శక్తి గల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి. ఇందులో నాలుగు ప్రకారాలున్నాయి. మొదటిది బీజబిందువుతో, రెండవది అయిదు స్వరాలతో, మూడవది ఆరు స్వరాలతో, నాలుగవది విసర్గతో కూడి వుంటాయి.


ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు లోకాలను సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురుకులేస్వాహా అనే మంత్రాన్ని ప్రసాదించాడు. ఈ మహా మంత్ర ద్రష్ట గరుత్మంతుడే. సర్పవిషాలను విరిచి ప్రాణులను కాపాడదలచుకున్న సాధకుడు ముఖంలో 'ఓం'నూ కంఠంలో 'కురు'ను ఇరుగుల్ఫాలలో 'కులే'నీ రెండు పాదాలపై 'స్వాహా' మంత్రాన్నీ శాశ్వతంగా న్యాసం చేయించుకొని వుండాలి. పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల వ్రాయించిన గృహాలలో పాములు నిలువలేవు. ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో వేయిమార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి సర్పభయముండదు. అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచదార పలుకులను విరజిల్లిన ఇంటిలో పాములు నిలవలేవు. దేవతలూ, అసురులూ ఈ మంత్రాన్ని ఏడు లక్షల మార్లు జపించి మంత్రసిద్ధులైనారు.


ఒక అష్టదళపద్మాన్ని చిత్రించి ఓం సువర్ణరేఖే కుక్కుట విగ్రహరూపిణి స్వాహా అనే మంత్రములోని రెండేసి అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి. ఆ తరువాత ఓం పక్షి స్వాహా అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాముకుట్టిన వానికి స్నానం చేయిస్తే విషం దూరమౌతుంది.


ఓం పక్షి స్వాహా అనేది కూడా సాధకుల పాలిటి కల్పవృక్షము. ఈ మంత్రం ద్వారా బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా కరన్యాసమూ, ముఖ, హృదయ, లింగ, పాదభాగాలపై అంగన్యాసమూ చేసియున్న వ్యక్తి యొక్క నీడనైనా, కలలో కూడా తాకడానికి పాములు భయపడతాయి. ఈ మంత్రాన్ని ఒక లక్షమార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాము కాటుకు గురైన వ్యక్తిని తేరిపార చూస్తే చాలు; ఆ వ్యక్తిలోని కెక్కిన విషం దిగిపోతుంది.


'ఓం హ్రీం హౌం హ్రీం భి (భీ) రుండాయై స్వాహా'- ఈ మంత్ర సాధకుడు దీనిని సర్పదష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విషప్రభావం క్షీణిస్తుంది.


Sunday 7 January 2024

శ్రీ గరుడ పురాణము (55)

 


ప్రాణేశ్వరీ విద్య


(సర్పవిష, దుష్ట ఉపద్రవ హరం)


సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది.


"ఋషులారా! ఇపుడు మీకు పరమ శివుని ద్వారా గరుత్మంతుని కుపదేశింపడిన ప్రాణేశ్వర మహా మంత్రాన్ని విన్నవిస్తాను. ఐతే, దానికి ముందు ఏయే స్థానాల్లో, సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం.


శ్మశానం, పుట్ట, పర్వతం, నుయ్యి, చెట్టు తొఱ్ఱ- వీటిలో నివసించే పాము కాటువేసినపుడు ఆపేసిన చోట మూడు ప్రచ్ఛన్నరేఖలు ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడిన ప్రాణులు మిగలరు. మూల, ఆశ్లేష, మఘ మరియు షష్టి రోజున, కర్కాటక, మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైనవారు బ్రతకరు. కటి, కణత, సంధిభాగాలు, ముఖము, గొంతుల పై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకడం జరగదు. (అనుబంధం –1 చూడండి). దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధయామ భాగం సూర్యునిచే భోగింపబడుతుంది. ఆ దివాకర భోగం తరువాత గణనాక్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం వుంటుంది. అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాల చక్రాధారంగా గ్రహాలను కాలసర్పాలను ఈ విధంగా జోడించారు.


శేషుడు - సూర్యుడు, వాసుకి చంద్రుడు, తక్షకుడు -మంగళుడు, కర్కోటకుడు - బుధుడు, పద్ముడు - గురుడు, మహాపద్ముడు-శుక్రుడు, శంఖుడు -శని, కులికుడు - రాహువు.


రాత్రయినా పగలైనా బృహస్పతి (గురుడు) భోగకాలం వచ్చినపుడు సర్పాలు దేవతలనైనా అంతం చేయగలవు. కాబట్టి ఈ కాలంలో పాముకాటుకి విరుగుడు లేదు, చావు తప్పదు. పగలు శని భోగమూ అంతే.


Saturday 6 January 2024

శ్రీ గరుడ పురాణము (55)

 


ఋషులారా! ఈ సందర్భంలోనే పరమాత్మ షడంగ పూజనుపదేశించాడు. అది ఇలా వుంటుంది.


సాధకుడు ప్రారంభంలో దేవునికి అర్ఘ్యమిచ్చే పాత్రను పూజించి అస్త్ర మంత్రాన్నుచ్చరించాలి. అనగా కుడిచేతితో ఎడమచేతి పై శబ్దంచేస్తూ 'ఫట్' అనే మంత్రాన్ని చదవాలి.


తరువాత కవచమంత్రం (హుం) తో శోధనచేసి అమృతకరణ క్రియను పూర్తి చేయాలి. అప్పుడు ఆధారశక్తి మున్నగువాటిని పూజించి ప్రాణాయామం, ఆసనోపవేశనం, దేహశుద్ధి కావించి అమృతేశ భగవానుని ధ్యానించాలి. తరువాత తన ఆత్మను దేవ స్వరూపంగా స్వీకరిస్తూ (అహం బ్రహ్మాస్మి అని మననం చేసుకుంటూ) అంగన్యాస, కరన్యాసం చేసి సాధకుడు తన హృదయ కమలస్థితుడైన జ్యోతిర్మయ ఆత్మదేవుని పూజించాలి. (అంటే కన్నులు సగం మూసి అమృతేశ మంత్రాన్ని పఠిస్తూ తన బొమముడిలోనే జ్యోతిశ్చక్రాన్ని చూడగలగాలి).


అనంతరం దేవునిమూర్తిపైగాని, యజ్ఞ వేదిపై చిత్రింపబడిన దేవునికి గాని సుందరపుష్పాలను సమర్పించాలి. ఆధారశక్తిని పూజించడం ద్వారా ద్వారం వద్దనుండు దేవతలు ఆవాహన చేయబడి పూజింపబడాలి. అందుకే ముందుగా ఆధారశక్తి పూజన ముంటుంది. ఆ పై దేవప్రతిష్ఠా, పరివార సమేతంగా ఆ దేవుని ఆరాధించడం జరుగుతాయి. పరివారంతో బాటు ఆయుధాలనూ, ధర్మాన్నీ కూడా పూజిస్తే దేవతలు సంతోషిస్తారు. ఇంద్రాదిదేవతలనూ వేదాలనూ ఏ వ్రతంలో పూజించినా భుక్తి, ముక్తి లభిస్తాయి. కాబట్టి ఈ షడంగ పూజను విద్వాంసులు విధించారు.


దేవమండలాన్ని పూజించడానికి ముందే మాతృక, గణదేవత, నంది, గంగలనూ దేవస్థానం కుడిభాగంలో మహాకాలునీ, యముననూ పూజించాలి. పూజలో ప్రతిదశలోనూ ఓం అమృతేశ్వర భైరవాయ నమః, ఓం జుం హం సః సూర్యాయ నమః అంటూనే వుండాలి.


అలాగే శివ, కృష్ణ, బ్రహ్మ, చండిక, సరస్వతి, మహాలక్ష్మి దైవతాలను కూడా వారి నామాలకు ముందు 'ఓం' కారమును, చివర నమః ను(దానికి ముందు 'య' లేక 'యై') నూ పెట్టి పూజించాలి.


(అధ్యాయం - 18)


Friday 5 January 2024

శ్రీ గరుడ పురాణము (54)

 


మృత్యుంజయ మంత్ర జప మహిమ


సూతమహర్షి శౌనకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది.


“మునులారా! గరుత్మంతుడు కశ్యప మహర్షికుపదేశించిన మృత్యుంజయ మంత్రాదిక విషయాలను వినండి. ఇవి సాధకుని గొప్పగా ఉద్దరిస్తాయి. పుణ్యప్రదానం చేస్తాయి. ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ వున్నదని విజ్ఞులు చెప్తారు.


'ఓం జుం సః' అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇది మృత్యువునూ దారిద్ర్యాన్నీ మర్దించే మంత్రం. శివ, విష్ణు, సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులౌతారు. 'ఓం జుం సః' అనే ఈ మహామంత్రాన్ని అమృతేశ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ మంత్రాన్ని జపించేవారి పాపాలన్నీ నశిస్తాయి. మృత్యువు వలె బాధించు కష్టాలన్నీ దూరమవుతాయి.


ఈ మంత్రాన్ని నూరుమార్లు అనితర ధ్యాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం, యజ్ఞఫలం, తీర్థ స్నాన దాన పుణ్యం లభిస్తాయి. మూడు సంధ్యలలోనూ నూట యెనిమిదేసి మార్లు ఈ మంత్రాన్ని జపించేవారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యువు దూరంగానే వుంటుంది. కఠినాతికఠినములైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది.


భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చుని వుంటాడు. ఆయన చతుర్భుజుడు ఒక చేతిని అభయముద్రలో మరొక చేతిని వరద ముద్రలో వుంచి మిగతా రెండు చేతులలో అమృత భాండాన్ని పెట్టుకొని నిత్యం మనను శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా, సర్వసన్నద్ధుడై వుంటాడు ఈ అమృతేశ్వర దేవుడు. ఆయన వామాంకస్థితయై అమృతభాషిణి అమృతాదేవి నిత్యమూ కొలువుంటుంది. ఆమెను ధ్యానించాలి. ఆమె ఒక చేతిలో కలశాన్నీ మరొక చేతిలో కమలాన్నీ ధరించి వుంటుంది. కలశం కుడిచేతిలో వుండాలి.


ఓం జుం సః అనే ఈ మంత్రం పరమశక్తిప్రదాయకం, అతులిత శాంతిదాయకం కూడ. అమృతాదేవీ సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహా మంత్రాన్ని మూడు సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి ఎనిమిదివేల మార్లు ఒక నెలదాకా చేయగలిగిన వారికి జర, మృత్యు, మహావ్యాధి బాధలుండవు. శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు. మహాశాంతినీ పొందగలుగుతారు.


అమృతేశ్వర భగవానుని పూజలో కూడా ఆవాహన, స్థాపన, రోదన (ప్రతిష్ఠ), సన్నిధానం, నివేశనం, పాద్యం, ఆచమన, స్నానం, అర్ఘ్యం, మాల, అనులేపనం, దీపము, వస్త్రం, ఆభూషణాలు, నైవేద్యం, పానం, వీవనలు, ముద్రాప్రదర్శన, మంత్రజపం, ధ్యానం, దక్షిణ, ఆహుతి, స్తుతి, వాద్య గీత నృత్యాలు, న్యాసయోగ ప్రదక్షిణలు, సాష్టాంగ ప్రణతి, మంత్ర శయ్య, వందనాది ఉపచారాలన్నీ వుంటాయి. పూజానంతరము దీక్షా విసర్జన చేయాలి.


Thursday 4 January 2024

శ్రీ గరుడ పురాణము (53)

 


ఆవాహన తరువాత


ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్ర కిరణాయ గచ్ఛసుఖం పునరాగమనాయ అనే మంత్రాలతో విసర్జనం చేయాలి".

హరి ఇంకా ఇలా చెప్పాడు, “రుద్ర దేవా! సూర్య పూజన విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను. ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను.


సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అష్టదళకమలాన్ని నిర్మించాలి. అపుడు సూర్యదేవుని ఆవాహనం చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమలదళాల మధ్యలో ఖఖోల్కభగవానుడైన సూర్యయంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి.


ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సునీ, నైరృత్యంలో శిఖనీ విన్యాసం చెయ్యాలి (అంటే పెట్టాలి). మరల ఏకాగ్రచిత్తంతో తూర్పు వైపు ధర్మాన్నీ, వాయవ్యంలో నేత్రాలనూ, పశ్చిమ దిశలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలనూ వుంచాలి.


మరల ఈశాన్యంలో చంద్రునీ, తూర్పున మంగళునీ, ఆగ్నేయంలో బుధునీ, దక్షిణ దిశలో బృహస్పతినీ, నైరృతిలో శుక్రునీ, పడమటి దెసలో శనినీ, వ్యాయవ్యంలో కేతువునీ, ఉత్తర దిక్కులో రాహువునీ స్థాపించి పూజించాలి.


ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాతా, వివస్వాన్, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణు- అను సూర్యుని పన్నెండు రూపాలనూ రెండవ వరుసలో పెట్టి పూజించాలి.


తరువాత పూర్వాది దిశలలో నున్న ఇంద్రాదులను అర్చించి, జయా, విజయా, జయంతి, అపరాజిత అను శక్తులనూ వాసుకి, శేషాదినాగులనూ కూడా పూజించాలి. ఇది సూర్య పూజావిధానం.”


(అధ్యాయాలు - 16,17)


Wednesday 3 January 2024

శ్రీ గరుడ పురాణము (52)

 

సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ మంత్రాలను జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి.


ఓం ఆదిత్యాయ విద్మహే, విశ్వభావాయ ధీమహి, తన్నః సూర్యః ప్రచోదయాత్ ॥


తరువాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతులనూహించుకొని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి.


ఓం ధర్మాత్మనే నమః, తూర్పు 

ఓం యమాయ నమః, దక్షిణం 

ఓం దండనాయకాయ నమః, పశ్చిమం 

ఓం దైవతాయ నమః, ఉత్తరం

ఓం శ్యామపింగలాయ నమః, ఈశాన్యం 

ఓం దీక్షితాయ నమః, అగ్ని కోణం 

ఓం వజ్రపాణయే నమః, నైరృత్యం 

ఓం భూర్భువః స్వః నమః, వాయుకోణం

మహేశా! ఆ తరువాత సాధకుడు చంద్రాదిగ్రహాలను కూడా తూర్పు దిక్కుతో మొదలు పెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ క్రింది మంత్రాలు చదువుతూ నమస్కారసహితంగా పూజించాలి.


ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః ।

ఓం అంగారకాయ క్షితిసుతాయ నమః | 

ఓం బుధాయ సోమ సుతాయ నమః |

ఓం వాగీశ్వరాయ సర్వవిద్యాధిపతయే నమః ।

ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః ।

ఓం శనైశ్చరాయ సూర్యాత్మ జాయ నమః ।

ఓం రాహవే నమః |

ఓం కేతవే నమః |


అనంతరం ఈ క్రింది మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రదానానికై ఆవాహన చేయాలి.


ఓం అనూరుకాయ నమః ।

ఓం ప్రమథనాథాయ నమః |

ఓం బుధాయ నమః ।


'ఓం భగవన్నపరిమితమయూఖమాలిన్ సకల జగత్పతే సప్తాశ్వవాహన చతుర్భుజ పరమసిద్ధి ప్రద విస్ఫులింగ పింగలతత్ ఏహ్యేహి ఇదమర్ఘ్యం మమ శిరసిగతం గృహ్ణ గృహ్ణ గృహ్ణ తేజోగ్రరూపం అనగ్న జ్వలజ్వల ఠఠ నమః'


Tuesday 2 January 2024

శ్రీ గరుడ పురాణము (51)

 


విష్ణుధ్యానం - సూర్యార్చన


“శంఖ చక్రగదాధారీ! భగవాన్ శ్రీహరీ! మేమంతా దేవదేవేశ్వరుడు, శుద్ధ రూపుడు, పరమాత్మయగు విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానాన్ని పొందియున్నాము. విష్ణు సహస్రనామాలను విని పరమానందభరితులమైనాము. విష్ణు ధ్యానవర్ణనను విని ధన్యులము కాగోరుచున్నాము” అన్నాడు కాలకంఠుడు.


చెప్పసాగాడు ఖగవాహనుడు.


“జ్ఞానరూపుడు, అనంతుడు సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడునగు హరియే సర్వ దుఃఖాలనూ హరిస్తాడు. ఆయన అవినాశి, సర్వత్రగామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ. సంపూర్ణ సంసారానికి మూలకారణం, సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు ఆయనే సంపూర్ణ జగత్తుకు ఆధారం అయనే అయినా, స్వయంగా నిరాధారుడు.



పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులకు అతీతుడు, నిర్ముక్తుడు. ముక్తయోగులకు ధ్యేయమైనవాడు. మీరడిగిన ధ్యాన వర్ణనను సూర్యపూజతో మొదలు పెడతాను. ఒకప్పుడిది భృగుమహర్షికి బోధింపబడింది.


ఓం ఖఖోల్కాయ నమః - ఇది 


సూర్య భగవానుని మూలమంత్రం. సాధకునికి భోగాన్నీ మోక్షాన్నీ ప్రసాదించే మంత్రమిది. సూర్యదేవుని ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయనను పూజించాలి.


ఓం ఖఖోల్కాయ త్రిదశాయ నమః ।

ఓం విచిఠఠ శిరసే నమః । 

ఓం జ్ఞానినేఠఠ శిఖాయై నమః ।

ఓం సహస్రరశ్మయేఠఠ కవచాయ నమః |

ఓం సర్వతేజోధిఽపతయే ఠఠ అస్త్రాయ నమః |

ఓం జ్వల జ్వల ప్రజ్వలప్రజ్వల ఠఠ నమః | 


సాధకుని యొక్క సర్వపాపాలనూ నశింపజేసే ఈ సూర్యమంత్రాలను అగ్నిప్రాకార మంత్రాలని కూడా అంటారు.


Monday 1 January 2024

శ్రీ గరుడ పురాణము (50)

 


(గరుడ పురాణాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామం)


ఇంద్రాత్మా చైవ బ్రహ్మాత్మా రుద్రాత్మా చ మనోస్తథా | 

దక్షప్రజాపతేరాత్మా సత్యాత్మా పరమస్తథా ||


ఈశాత్మా పరమాత్మాచ రౌద్రాత్మామోక్ష విద్యతిః | 

యత్నవాంశ్చయత్నశ్చర్మీ తథా ఖడ్గ మురాంతకః ||


హ్రీప్రవర్తన శీలశ్చయతీనాంచ హితే రతః |

యతిరూపీ చ యోగీచయోగిధ్యేయో హరిఃశితి ||


సంవిన్మేధాచ కాలశ్చ ఊష్మావర్షామతిస్తథా | 

సంవత్సరో మోక్షకారో మోహప్రధ్వంసక స్తథా ॥


మోహకర్తాచ దుష్టానాం మాండవ్యో వడవాముఖః |

సంవర్తః కాలకర్తాచ గౌతమో భృగురంగిరాః ||


అత్రిర్వసిష్ఠః పులహః పులస్త్యః కుత్స ఏవచ |

యాజ్ఞవల్క్యో దేవలశ్చవ్యాస శ్చైవ పరాశరః ||


శర్మదశ్చైవ గాంగేయో హృషీకేశో బృహచ్ఛవాః |

కేశవః క్లేశహంతాచ సుకర్ణః కర్ణవర్ణితః ||


నారాయణో మహాభాగః ప్రాణస్య పతిరేవచ | 

అపానస్య పతిశ్చైవ వ్యానస్య పతిరేవచ ||


ఉదానస్య పతిః శ్రేష్ఠః సమానస్య పతిస్తథా |

శబ్దశ్య చ పతిః శ్రేష్ఠః స్పర్శశ్చ పతిరేవచ ||


పరమశివా! దేవతలారా! ఇపుడు నేనుపదేశించిన ఈ విష్ణు సహస్రం సర్వపాప వినాశకుడు, జగదీశ్వరుడు, దేవాధిదేవుడునగు విష్ణుదేవునికి ప్రీతి పాత్రము. దీనిని పఠించిన బ్రాహ్మణునికి విష్ణు స్వరూపం లభిస్తుంది. అలాగే క్షత్రియునికి విజయమూ, వైశ్యునికి ధన, సుఖాలూ, శూద్రునికి విష్ణుభక్తీ ప్రాప్తిస్తాయి" అని బోధించాడు శ్రీ మహా విష్ణువు.


(అధ్యాయం -15)