Wednesday 31 May 2023

శ్రీదత్త పురాణము (155)

 


(కుంభకానికి పదహారు మాత్రలు కావాలి. పూరకానికి అరవై నాలుగు మాత్రలకాలం, రేచకానికి ముప్పది రెండు మాత్రల కాలం - అన్నీ పదమంజరీ టీక) ఎడమ ముక్కుతో పూరించి కుడిముక్కుతో రేచకం చేసినట్లే కుడిముక్కుతో పూరించి ఎడమ ముక్కుతోనూ విడువవచ్చు. పూరించి లోపల కుంభించినట్లే వాయువును విడిచి పెట్టి బయట కుంభించవచ్చు. ఈ ప్రాణాయామంవల్ల పిండ (శరీర) శుద్ధి అవుతుంది. శరీరంలోని వాతపిత్తాది ప్రకోపాలు సమస్తమూ శాంతిస్తాయి. నాడీద్వారాలు అన్నీ నిర్మలినాలు అవుతాయి. క్రమాభ్యాసంలో యోగ నిరోగి అవుతాడు. ఈ ప్రాణాయామంలో సబీజమూ, నిర్భీజమూ అని రెండు విధాలున్నాయి. ప్రణవమంత్ర సహితమైతే సబీజం ప్రణవమంత్ర రహితమైతే నిర్వీజం. వీటినే సగర్భము. నిర్గర్భమూ అని కూడా అంటారు.


ప్రాణవాయువు ఇలా వశమైన తరువాత విషయ సుఖాల నుంచి ఇంద్రియాలను మనస్సుతో ప్రయత్న పూర్వకంగా ఉపసంహరించాలి. దీన్నే ప్రత్యాహారం అంటారు. 


ఇక ధారణ అంటే ఆత్మలో మనస్సుని నిలపడం. ఇది సగుణమనీ, నిర్గుణమనీ రెండు రకాలు. చెదిరిపోయే మనస్సును మాటిమాటికి ప్రయత్న పూర్వకంగా బంధించి తెచ్చి ఆత్మలో స్థిరపరచాలి. దీనికి అభ్యాసబలం చాలా కావాలి. అలా స్థిరీకరించడాన్నే ధ్యానం అంటారు. మరికొందరు ఏమన్నారంటే - పన్నెండు ప్రాణాయామాలు ఒక ప్రత్యాహారమనీ పన్నెండు ప్రత్యాహారాలు ఒక ధారణ అనీ, పన్నెండు ధారణలు ఒక ధ్యానమనీ, పన్నెండు ధ్యానాలు ఒక సవికల్ప సమాధి అని చెప్పారు.


ఈ అష్టయోగాంగాలతో మనస్సును స్థిరపరచుకొని అది మనన క్షమం అయ్యాక - పరమాత్మను గురించి వేద శాస్త్రాలు చెప్పిన మహావాక్యాల్ని ఏకార్ధ సమన్వయంతో మననం చెయ్యాలి. నిరంతర మననాన్నే పెద్దలు ధ్యానమన్నారు. సవికల్ప సమాధినే "నిధిధ్యాసము" అంటారు. విజాతీయులైన కామక్రోధాదుల్ని నిరసించి "అహంబ్రహ్మస్మి" అనే సజాతీయ భావనను నిరంతరంగా ప్రవాహ సదృశంగా సాగించవలసిన స్థితి నిధి ధ్యానం. ఇదే సవికల్ప సమాధి. ఇది అల్పయోగులకు దుర్లభం. తత్వమసి అనే మహావాక్యార్ధాన్ని షడ్విధలింగాల సహాయంతో సద్గురువు నిర్ధారించి శిష్యుడికి బోధించడం అయ్యాక దాన్ని శిష్యుడు ధారణ, చింతన, మననం, ధ్యానం వగైరాలతో వశీకరించుకున్నాక. అప్పుడు, విజాతీయులను నిరసించి "అహంబ్రహ్మస్మి" అనే సజాతీయ భావనను ప్రవాహీకరించుకునే స్థితి. ఇది అల్ప యోగులకు ఎంత దుర్లభమో ఆలోచించు. ఈ సవికల్ప సమాధిలో జ్ఞాతృత్రేయ విభాగం వుంటుంది. అవి కూడా లయమైపోయిన అవిభాజ్య పరతత్వస్థితి నిర్వికల్ప సమాధి.


Tuesday 30 May 2023

శ్రీదత్త పురాణము (154)

 


సంప్రదాయ విశుద్ధి కోసం వాటిని కూడా విశదీకరిస్తున్నాను. గ్రహించు. (అష్టాంగ యోగ ఇత్యాహుః షడంగ ఇతి చాపరే)


యమం-నియమం-ఆసనం- ప్రాణాయామం-ప్రత్యాహారం-ధారణ-ధ్యానం-ఇవి సప్తాంగాలు, అష్టమాంగం సమాధినే ఫలము అంటారు. వీటిలో మొదటి యమనియమములు రెండూ యోగులకే కాదు ఏ మార్గంలోనైనా అందరికీ సర్వసాధారణంగా ఉండవలసినవే కనుక ఆసన ప్రాణాయామం నుంచి మొదలు పెట్టి యోగానికి షడంగాలే అంటున్నారు. మరికొందరు ఆసనమూ సర్వసాధరణమే కనుక ప్రాణాయామం నుంచీ పరిగణిస్తున్నారు. సమాధిని సవికల్పమనీ నిర్వికల్పమనీ విభజిస్తున్నారు. ఇలా వీరికి పడంగాలే అవుతున్నాయి. మొదటి రెండింటినీ వదలి సమాధి ద్వైవిధ్యాన్ని అంగీకరించి సప్తాంగములతోనే అష్టాంగయోగము అన్నవారూ ఉన్నారు.


వీటిలో యమములు పది. అహింస - సత్యం- ఆస్తేయం(అచౌర్యం) - బ్రహ్మచర్యం అపరిగ్రహం- ఆస్తిక్యం- మౌనం- అభయం- అసంగం- లజ్జ. నియమాలు కూడా పది. శౌచం- ఆచమనం - స్నానం - స్వాధ్యాయం - ఇజ్వ - మదర్చనం - తపం- జపం - సంతోషం తీర్ధ సేవ- జానూరువుల మధ్య పాదతలాల్ని ప్రేవేశ పెట్టి ఋజు కాయుడై కూర్చుంటే స్వస్తికం అంటారు. ఇలాంటి ఆసనాలు అనేకం ఉన్నాయి. ఎవరికి ఏది సుఖంగా ఉంటుందో ఆ ఆసనం వేసి యోగసాధనకు కూర్చోవాలి. నిర్జనమూ, నిశ్శబ్దమూ, నిరుపద్రవమూ, సుఖప్రదమూ అయిన సమతల ప్రదేశములో దర్భాసనం పరిచి దాని మీద కృష్ణాజినం (జింక చర్మం) పరచి సమకాయ శిరోగ్రీవుడై పద్మాసనమో మరొకటో వేసి కూర్చుని యోగాభ్యాసం చెయ్యాలి.


స్థిరంగా నిశ్చలంగా పరమాత్మను ధ్యానించాలి. ముందుగా మనస్సులో ఉండే మలినాలను తొలచి వేసేందుకు ప్రాణాయామం చెయ్యాలి. దీని కోసం ఎంతశ్రమపడినా పరవాలేదు. ప్రాణవాయువును నియంత్రించ గలిగితే మనస్సును జయించినట్లే. ప్రాణమూ మనస్సూ అనేవి జోడు గిత్తల్లాంటివి. బండిని వేగంగా లాగుతుంటాయి. వీటిలో ఒక గిత్త కొమ్ములకు పగ్గంవేసి అదుపుచేస్తే రెండవగిత్త కూడా తనంతతానే అదుపు అవుతుంది. అలాగే ప్రాణవాయువుకి పగ్గం వేస్తే మనస్సూలొంగి వస్తుంది. కొందరు సత్కర్మాచరణంతో ముందుగా మనశ్శుద్ధిని సాధించి నన్ను అర్చించి అటుపైన వశ్య ప్రాణులు అవుతున్నారు. ఇలా ఏదో క్రమానమనః ప్రాణాలను వశీకరించుకొని మిగతా ధారణాది యోగాంగాలను ఆచరించాలి. ముందుగా ప్రాణాయామం చేసే పద్ధతిని భోదిస్తాను గ్రహించు. ఇందులో మూడు దశలున్నాయి. ఎడమ ముక్కుతో వాయువును పూరించి వూపిరితిత్తులలో కుంభించి కుడి ముక్కుతో బయటికి విడిచి పెట్టాలి. (రేచకం) ఒక్కొక్క దానికీ పదహారు మాత్రల కాలం తీసికోవాలి.


Monday 29 May 2023

శ్రీదత్త పురాణము (153)

 


ఇలా అల్పుడైన జీవుడూ, సర్వజ్ఞుడైన ఈశ్వరుడూ ఏకమవుతున్నారు. అంచేత తత్ =అది, త్వమ్ = నువ్వు, అసి= అయ్యున్నావు అనే మహావాక్యం కుదరుతోంది. కాబట్టి బ్రహ్మమే నువ్వు, నువ్వే బ్రహ్మము, ఇద్దరికీ భేదం లేదు. అంటే దుఃఖిత్వాన్ని పరిత్యజించి త్వమ్ పదార్థమే తత్పదార్ధమవుతుంది. నువ్వే బ్రహ్మస్వరూపుడవు అవుతావు. ఈ తత్-త్వమ్ పదార్థాలు పరస్పరం విశేషణ విశేష్యభావం పొందుతున్నాయి.


దుఃఖిత్వాన్ని పరిత్యజించి నువ్వే బ్రహ్మరూపుడవు అనే వాక్యం పరోక్ష జ్ఞానబోధకం. బ్రహ్మమే నువ్వు అనే వాక్యం అపరోక్ష (ప్రత్యక్ష) జ్ఞానబోధకం. ఈ మహావాక్యానికి ఇలా ఒక అంశాన్ని విడిచిపెట్టి మరొక అంశాన్ని విడిచిపెట్టకుండా సమన్వయించటాన్ని జహద జహల్లక్షణ అంటారు. వేదంలో జ్ఞానకాండ అనుసరించిన పద్ధతి ఇది. తక్కిన ఉపాసనకాండ, కర్మకాండల తాత్పర్యం కూడా ఇదేనని తద్ జ్ఞుల నిర్ణయం. ఇది స్థూలమంతులకు దురజ్ఞేయం. సూక్ష్మబుద్ధులకు సుఖీయం. స్మృతిశాస్త్ర పురాణాలన్నీ ఈ మహార్ధాన్ని ఇలాగే చెప్పాయి. దీన్ని గ్రహింపలేని కొందరు మూఢులు పండితమ్మన్యులై వేదాన్ని ప్రవృత్తిపరం అంటున్నారు. ఇది అసమంజసం. వేదతాత్పర్య  నిర్ణయానికి షడ్విధలింగాలు ఉన్నాయి. వాటిని చెబుతాను. తెలుసుకో.   

శాస్త్రంలో ప్రకరణాన్ని ఏ విషయంలో అరంభిస్తారో దానితోనే ముగిస్తారు. ఇది ఒక లింగం ఉపక్రమోప సంహారములంటారు. ఆగమాల్లో ఒకే విషయాన్ని పౌనఃపున్యంగా చెబుతుంటారు. దాన్ని అభ్యాసమంటారు. ఈ అంకాన్ని ఈ శాస్త్రంతోనే తెలుసుకోవాలి. ప్రమాణాంతరం లేదు అన్నట్లయితే అది అపూర్వత, అజ్ఞానాంధకారం తొలగిపోవడమనే ప్రయోజనమే ఫలం. ఇది నాల్గవలింగం. చెప్పిన దాన్ని దృఢపరచటం కోసం బహువిధాల ప్రశంసించటం అర్ధవాదం. శాస్త్రార్థవినిశ్చయంలోని తర్కాన్ని ఉపపత్తి అంటారు. ఇలా తాత్పర్య నిర్ణయానికి ఆరు లింగాలు (ప్రమాణాలు) ఉన్నాయి.


గురువు దగ్గర విన్నదాన్ని వివిధోపాయాలతో యుక్తులతో బాగా పరిచింతనం చెయ్యాలి. దీన్నే మననము అంటారు. శ్రుతానికి మననం లేకపోతే అది నిలవదు. జారిపోతుంది. మననము అనేది ఒక యోగాంగం. యోగసిద్ధిని కోరుకునే ముముక్షువులు ఈ యోగాంగాలను పాటించాలి. ఇవి ఎనిమిది అని కొందరూ ఆరు అని కొందరూ పరిగణిస్తున్నారు.


Sunday 28 May 2023

శ్రీదత్త పురాణము (152)

 


నిత్యా నిత్య వస్తు వివేకం ఫలభోగ విరక్తి శమదమాదిపట్క సంపత్తి ముముక్షుత్వం అనే సాధన చతుష్టయాన్ని సమకూర్చుకొని సద్గురువును ఆశ్రయించాలి. శ్రవణ మనన నిదిధ్యాసధారణాదుల్ని అవలంభించాలి. దయాళుడైన సద్గురువు తత్వమ్ అని వంటి తత్వ నిశ్చయకాలైన మహావాక్యాల్ని ఉపదేశిస్తాడు. వాటి అర్ధాన్ని షడ్విధలింగాలతో మనస్సులో చర్చించుకుని అవధారణ చెయ్యాలి. దీన్నే శ్రవణం అంటారు. "శ్రవణమ్ తదితి ప్రోక్త మవధారణ లక్షణమ్”. ఈ మహావాక్యాన్ని క్లుప్తంగా వివరిస్తాను విను.


తత్పదంతో పరబ్రహ్మనూ త్వమ్పదంతో పురుషుణ్ని (జీవుణ్ని) చెప్పి అసిపదంతో ఈ రెండింటి ఐక్యాన్ని బోధిస్తుంది. ఈ మహావాక్యం. తత్ అనేది పరోక్షం. త్వమ్ అనేది సన్నిహితం. “త్వమ్”ను ఉద్దేశించే తత్పదాన్ని చెప్పింది వేదం. త్వమ్పదార్ధమైన జీవుడు సంసారి. తత్పదార్ధమైన పరబ్రహ్మం సంసార విరహితం. మరి ఇవి రెండూ ఏకమవ్వడం ఎలాగ? చెబుతున్నాను విను.


దేవదత్తుడు అనే వాణ్ని ఎప్పుడో ఎక్కడో చూసావు. కొన్ని సంవత్సరాలు గడిచాక ముసలివాడైన దేవదత్తుణ్ని మరోచోట ఎక్కడో మళ్ళీ చూసావు. ప్రదేశమూ అవస్థా యౌవనమూ, ముసలితనమూ వగైరాలన్నింటినీ విడిచిపెట్టి ఆ దేవదత్తుడు ఇతడే అని గుర్తిస్తున్నావా లేదా? అలాగే ఇక్కడ తత్ త్వమ్ పదార్థాలను గుర్తించాలి.


త్వమ్ పదానికి సంసారి అనివాచార్ధం నిశ్చయమైంది. మాయావృతుడైన ఆ సంసారి కర్త- భోక్త సుఖి దుఃఖి అని చెప్పబడుతున్నాడు. నిజమాలోచిస్తే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమే సంసారి ఇది వాచ్యార్థం. ఇంక తత్పదానికి వాచ్యార్ధం సర్వజ్ఞుడైన శివుడు. అంటే మాయావృతమైన పరబ్రహ్మం సృష్ట్యాదికార్యాలు చేస్తూ ఈశ్వరుడయ్యాడు. కనుక ఒక అంశం చిద్రూప పరబ్రహ్మం. ఇది లక్ష్యార్థం. రెండవ అంశం సర్వజ్ఞ పరమేశ్వరుడు. ఇది వాచ్యార్ధం. ఇప్పుడు రెండింటిలోనూ రెండవ అంశాలుగానున్న వాచ్యార్ధాలను తొలగిస్తే రెండింటా మిగిలేది లక్ష్యార్ధమైన ఒక్క పరబ్రహ్మమే.


Saturday 27 May 2023

శ్రీదత్త పురాణము (151)

 


కొందరు అగ్ని నుండి జరిగింది అంటున్నారు. పాంచభౌతిక శరీరాలు, నరదేవాసుర జాతులూ పశుపక్ష్యాదులు తరులతా గుల్మాదులూ స్థూలసూక్ష్మ శరీరాలు ఇది అంతా ఉపక్రమపర్వం. ఇక ఉపసంహారక్రమం ఏమిటంటే-


ఏది దేని నుండి పుట్టిందో అది అందులోనే లయిస్తుంది. ఇంద్రియాలూ, తదధి దేవతలూ మనస్సు ఇవన్నీ తమకు కారణమైన అహంకారంలో లయిస్తాయి. అహంకారం మహత్తులో - మహత్తు వ్యక్త ప్రకృతిలో వ్యక్తప్రకృతి నిష్కళంకమైన అవ్యక్తపరబ్రహ్మంలో లయిస్తున్నాయి. ఈ లయాన్ని భ్రాంతులు సశేషమని సందేహిస్తున్నారు. సశేష కారణరూపమని సంభావిస్తారు. ఆత్మజ్ఞుడు మాత్రం నిస్స్వరూపమని గ్రహిస్తాడు. అన్నింటినీ తనలోనే ఆవిర్భవింపజేసుకుని పరబ్రహ్మం ఒక్కటే శాశ్వతంగా మిగిలి వెలుగుతుందని తెలుసుకుంటాడు. అంచేత నాయనా కార్తవీర్యా ఈ జగత్తులేదు. వట్టి మిథ్య. ఆత్మఒక్కటే సత్యం "జగన్మిథ్యా బ్రహ్మ సత్యమ్" మోహితుడికే జగత్తు తప్ప బోధితుడికి కేవలం ఆత్మఒక్కటే. దయానిధీ. దత్తదేవా! నీ అనుగ్రహం వల్ల కృతార్జుణ్ని అయ్యాను. బ్రహ్మతత్వం విషయమై నాకు నిశ్చయజ్ఞానం కలిగింది. సందేహాలన్నీ అంతరించాయి. ఈ ఆత్మానందాన్ని హృదయంలో రూఢపర్చుకోవాలంటే చెదిరిపోకుండా స్థిరపరచుకోవాలంటే ఉపాయం ఏమిటి? మహా యోగి! దీనవత్సలా! దయచేసి ఆ రహస్యం బోధించు అని కార్తవీర్యార్జునుడు అభ్యర్థించాడు.


అర్జునా! నీకు చిత్తశుద్ధి కలిగింది. దృఢమైన వైరాగ్యం ఏర్పడింది. నాయందు నిశ్చలమైన భక్తి కుదిరింది. అందువల్ల నేను చెప్పిన మహావాక్యాల అర్థాన్ని ఆసక్తిగా విన్నావు. అవగతం చేసుకున్నావు. దానితో తత్వజ్ఞానం కలిగింది. చితస్ధమైన ప్రపంచాస్థ అన్ని విధాల విలయమైంది. ముముక్షువు అయ్యావు. ఏకైకమూ అద్వితీయమూ అయిన ఈ మహోన్నతా భూమికకు నువ్వు చేరుకున్నావు. కనుక రాజోత్తమా నీకిప్పుడు బ్రహ్మసాక్షాత్కారం కలిగిస్తాను. దానికి కావలసిన సాధన సంపత్తిని వివరిస్తాను దత్త చిత్తుడవై ఆలకించు.


Friday 26 May 2023

శ్రీదత్త పురాణము (150)

 


ఈ జగత్తు ఇదివరకు పుట్టలేదు. ఇప్పుడు పుట్టడం లేదు. ఇక ముందు పుట్టబోదు. దీని ఉనికికి సంబంధించిన భాసమంతా మృషాభాసమే. ఇది మాయా మనోమయం (మనఃకల్పితం) ఇది అంతా భ్రమ అని తెలుసుకున్నవాడికి ఇంక ఏ సందేహం లేదు. అలాగే ఈ జగద్భ్రాంతిని తొలగించుకుంటే ఇంక సందేహాలు వుండవు. ఈ జగత్తు సత్యమే అంటున్న వారు కొందరు ఉన్నారు. మరి దాని సంగతి ఏమిటి అన్నట్లయితే అదీ చెబుతాను. తెలుసుకో ఆ మాటను నువ్వు విశ్వసించేటట్లయితే చిత్తవిశుద్ధికి కర్మలు చేయి. (నిత్యకర్మలు) నిషిద్ధాలైన కామ్యకర్మలను, కుటిల కర్మలనూ వదిలేసెయ్యి. ఈ కర్మఫలాలు అన్నింటినీ ఈశ్వరార్పణం చెయ్యి. మనస్సును భక్తితో తత్ప్రణం చెయ్యి. ప్రేమతో ఈశ్వరుణ్ని భజించు. ఆత్మవిశుద్ధి కలుగుతుంది. విశుద్ధాత్మ ఈ జగత్తు భ్రాంతి జన్యమనీ, అనిత్యమనీ, నశ్వరమనీ, మృషాకల్పితం అని గ్రహిస్తుంది. అప్పుడు విరక్తవుతుంది. బ్రహ్మ భువనపర్యంతరం సమస్త సృష్టి నశ్వరమనీ అమంగళమని గ్రహించినవాడు అతి నిర్మలుడవుతాడు. బ్రహ్మజ్ఞానానికి అధికారి అవుతాడు. దేవుడి పట్లా గురుదేవుడి పట్లా అత్యంత భక్తి కలిగిన మహాత్మునికే నేను చెబుతున్న ఈ మహా విషయాలన్నీ అవగతమవుతాయి. మనస్సు నుండి ఈ దృశ్యప్రపంచాన్ని తొలగించటం ఒక్కటే నిర్వాణనిర్వతి. అదే ముక్తి రూప ఆనందం. దీనికంతటికీ గురు అనుగ్రహం ఉండాలి. అది ఉన్నప్పుడే సత్యాసత్య - ఆత్మానాత్మ విచారణ సాగుతుంది. విచారణ వల్ల పరతత్వం ప్రకాశమవుతుంది. కార్తవీర్యవృపాలా, నువ్వు యాగయోగాది సత్కర్మలన్నీ మదర్పితంగా చేసావు. నేను సంతసించాను. అందుకని ఈ చర్య ఈ విచారణ ఇలా ఆరంభమై సాగింది. దీనితో నీ భ్రమ దృష్టి తొలగి మనస్సు నిర్మలమయ్యింది. గొప్ప వైరాగ్యం కలిగింది. ఇక ఇప్పుడు నీకు పరబ్రహ్మతత్వాన్ని ప్రత్యేకంగా ప్రభోదించటం కేవలం వృధాగా ఆయాసపడటం మాత్రమే అవుతుంది.


రాజా ఈ మొత్తం ప్రభోదానికి శాస్త్రవేత్తలు చెప్పిన ఉపక్రమోప సంహారాలు క్రోడీకరించి చెబుతాను విను. పరమాత్మ ఒక్కడే వస్తుమాత్రుడు. చిదాత్మకుడు. అతడే సత్యమూ నిత్యమూ అనాద్యవిద్య వల్ల అతడిలో జీవేశ్వర విభాగము భాసిస్తోంది. భ్రమ - మోహం మాయ - ప్రధానం - ప్రకృతి - అజ్ఞానశక్తి - అవ్యక్తం- గుణసామ్యం అనే పిలువడే భ్రాంతి వల్ల జగదాభాస కలుగుతుంది. జగన్నిత్యత్వ భ్రాంతి ఏర్పడుతుంది. జీవేశ్వర విభాగానికి కూడా ఇదే కారణం. పరమాత్మ సదానంద లక్షణుడు (స్వరూపుడు) పురుషుడు అవృతానందుడు. కనుక ఈ జగద్దర్శనం. బ్రహ్మతత్వం నుండి అవ్యక్తం - అవ్యక్తం నుండి మహత్తు - మహత్తు నుండి అహంకారం, అహంకారం నుండి భూతసూక్ష్మాలైన పంచతన్మాత్రలూ వాటి నుండి స్థూలపంచభూతాలూ ఆవిర్భవించాయి. ఆ తర్వాత ఇంద్రియాలు, తదధిష్టాన దేవతలూ మనస్సూ జనించాయి. సృష్టి అంతా జరిగింది. రాజా! ఇది మనోమూలమూ భ్రాంతి కల్పితమూ కనుక. ఈ సృష్టికి ఈ జగదావిర్భావానికి ఇదే వరుస అనే నియమం లేదు. అందువలన కొందరు ఆకాశం నుండి సృష్టి జరిగింది అంటున్నారు.


Thursday 25 May 2023

శ్రీదత్త పురాణము (149)

 



ఇదిగో ఈ ఆత్మ స్వరూపాన్నే ఆహర్నిశలూ ధ్యానిస్తుంటాను. బాలబోధ కోసం భ్రమకు కూడా బుద్ధిమంతులు శాస్త్రాలలో నామాలు కల్పించారు. వాటిని చెబుతాను - ఆలకించు. మాయ - అవిద్య - పర - దేవి - మనస్సు - అనాది - భ్రమ - త్రివిత్తు - ప్రధానం- ప్రకృతి - బ్రహ్మయోని - అవ్యయం - విభ్రమం - శక్తి - కారణం - అజ్ఞానం అధ్యాస మోహం - ప్రస్వాపం - తపస్సు - ఇవికారణా విద్య నామధేయాలు. మోహం - మహామోహం - తామిశ్రం- అంధ తామిశ్రం - అనేవి అవిద్య తాలూకు పంచపర్వాలు. ఈ అవిద్యను తొలగించే ఉపాయం జ్ఞానమూ లేక విద్య అని బుధులు చెబుతున్నారే అవి కార్యాత్మక మోహానికి నామాలు. మూలాజ్ఞానానికి రెండు శక్తులు చెబుతారు. విక్షేపము, ఆవరణము అని. అవిభాగమైన పరమానందంలో విభాగాన కల్పన చేసే శక్తికి విక్షేపము అని పేరు. లేని కర్తృత్వ భోక్తృత్యాదులను ఇది కల్పిస్తుంది. ఈశ్వరుణ్ని ఆవరించి తెలియకుండా చేసేది ఆవరణ శక్తి.


జీవేశ్వరులకు బేధం ఏమిటి అన్నావుగదా విను. ఒక్క ముక్కలో చెబుతాను. మాయను లోబరుచుకున్నవాడు ఈశ్వరుడు. మాయకు లోబడినవాడు జీవుడు. వీరిలో స్వావిర్భూతచిదానందుడు- ఈశ్వరుడు. స్వావిర్భూత దుఃఖభోజనుడు జీవుడు. హ్లాదినియైన సంవిత్తులో (జ్ఞానం) కూడి ఈశ్వరుడు సచ్చిదానందుడిగా వుంటాడు. అవిద్యాసంవృతుడై జీవుడు దుఃఖభాజనుడవుతున్నాడు.


పరబ్రహ్మమే మాయచేత జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా భాసిస్తున్నాడు. ఆ మాయను పోగొట్టడం కోసం వేదం. సృష్టి ప్రళయకల్పన చేసింది. మూఢులు దాన్నే సత్యమని అనుకుంటున్నారు. వీరి జ్ఞానాన్ని, మూఢత్వాన్ని తొలగించే విధానం ఏమిటో - విను - ఆత్మ పదార్థం ఒక్కటే - అదే నానారూపాలతో జగత్తుగా మోహితుడికి కనబడుతోంది. జ్ఞానికి అలా కనబడదు. నిద్రలో స్వప్నం వస్తుంది. అలాంటిదే ఈ జగద్దర్శనం కూడానూ.


స్వప్నంలో కోరిన కోరికలు అన్నీ తీరుతాయి. అలాగే నానావిషయగోచరం అయిన ఈ జగత్తు నిజానికి అసత్తు అయినా సత్తుగా భాసిస్తుంది. మరి దీనితత్వం తెలుసుకోవటం ఎలాగూ అంటావా, చెబుతున్నాను విను. ఏ వస్తువు పట్ల ఎవడికి మోహం వల్ల అన్యధాజ్ఞానం కలుగుతుందో దాన్ని (మోహాన్ని) తొలగిస్తే తప్ప వాడికి తత్వం బోధపడదు. అవునుగదా, శుక్తి రజతభ్రాంతి ఉంది. రజత వివేకం వల్ల భ్రాంతిని తొలగించుకుంటే శుక్తి శుక్తిగా మిగులుతుంది. ఇలాగే స్థాణుచోరభ్రాంతి, రజ్జుసర్పభ్రాంతి మొదలైనవి. చోరజ్ఞానం, సర్పజ్ఞానం వీటితో భ్రమలు తొలగి అసలు వస్తువులు కనిపిస్తాయి. ఇలా భ్రమలు తొలగటానికి వస్తువులు సిద్ధించటానికి సాధనం యాగయోగాదికం. ఇంతకన్నా ఆక్షేపించవలసింది ఏమీ లేదు.


Wednesday 24 May 2023

శ్రీదత్త పురాణము (148)

 


యోగసిద్ధి రకరకాలుగా వుంటుంది. పరిచిత్తజ్ఞత - మనోజవం - ఆకాశగమనం - ఇలా చాలా రకాల సిద్ధులు వున్నాయి. కానీ ఇవన్నీ నశ్వరాలు, శాశ్వత సిద్ధులు కావు, సత్యమూ, నిత్యమూ అవిక్రియమూ అయిన సిద్ధిని నీకు అనుగ్రహిస్తున్నాను. అనుభవంలోకి తెస్తున్నాను. అక్షయమూ, అన్యయమూ అయిన ఉత్తమోత్తమ తత్వాన్ని నా నిజ స్వరూపాన్ని నీకు బోధిస్తున్నాను. దీనితో నీవు ముక్తిని పొందుతావు. నాయనా నిజానికి బద్ధుడు, ముక్తుడూ అనే పదాలు నిరర్ధకాలు. రెండు ఎక్కడున్నాయి. ఉన్నదల్లా ఒక్కటే వస్తువు. దాన్ని చెబుతాను తెలుసుకో. ఆ ఏకైక వస్తువు నామరూపదేశకాల వివర్జితం. నిర్విశేషం. అసామాన్యం. అనిర్వాచ్యం. అకారణం. అలక్ష్యం. లక్షణాతీతం. అచింత్యం. అనికేతనం. దీనికి నామ రూపాది కల్పనచేసి ఒక అజ్ఞానంతో (భ్రమతో) శాస్త్రం తయారు చేసి ఆయావ్యక్తుల ఆత్మ లబ్ధికోసం ఆయా వ్యక్తులు బోధిస్తుంటారు. ఇందంతా కేవలం భ్రమ, మోహం, అజ్ఞానమే తప్ప అసలు వస్తువు (బ్రహ్మతత్వం) కి నామ రూపాలు లేవు. కానీ వాటిని కల్పించకపోతే ఉపదేశించడం సాధ్యం కాదు. ఉపదేశం లేకపోతే జ్ఞాన సిద్ధిలేదు. అజ్ఞానమే అవిద్య. అదే భ్రమ. అదే మోహం. దీనికే రూపంలేదు. అనాది అని దీన్ని బుధులు పలకడం బాల బుద్ధి విశుద్ధి కోసమే. నిజానికి 1. జీవుడు 2. బ్రహ్మ 3. విశుద్ధ చిత్తు 4. జీవేశభేదం 5. అవిద్య 6. ఆవిద్యా- చిత్సం యోగం అనేవి ఆరూ అనాదులు.


జగజ్జీవేశ్వర కల్పన అంతా అజ్ఞాన కల్పితమే. అవిద్యే అన్నది లేనప్పుడు ఇక జీవేశ్వర భేదం ఎక్కడుంది? బేధమే లేనప్పుడు ఇంక పరమాత్మకు దేనితో యోగం? అయితే నామ రూప కల్పన లేకుండా నిర్గుణ పరబ్రహ్మము తెలియజెప్పడం అసంభవం కనుక ఆ సౌకర్యం కోసం చేసిన కల్పన ఇదంతా. నిజానికి బ్రహ్మతత్వం అనేది సత్యం. ఈ తత్వానికే ఆత్మేశ్వరుడు, పరమాత్ముడూ, వేద్యుడూ, విష్ణువు, పదాశివుడు, చతుర్ముఖుడు, శివుడూ, అగ్ని, ఇంద్రుడు, పరముడూ, స్వరాట్టు, విరాట్టు, అక్షరుడు, ప్రాణము, ఈశానుడు, సవిత విభువు, నారాయణుడు, హృషీకేశుడు, దేవుడు, పశుపతి, మహత్తు, మహాభూతం, మహాద్యక్షుడూ, సోముడూ, భగవంతుడు, మనువు, శంభుడు, శర్వుడు, కవి, దక్షుడు, ప్రజాపతి, ప్రభువు, హరి, దాత, విధాత, గురువు, గమ్యుడు, త్రిపాత్తు, యముడు, కాలం, ఆగమకర్త, ఈడ్యుడు, జీవనం, మృత్యువు, ఆమయం, యజ్ఞం, ఇజ్య, యజుస్సు, ధర్మం, నిధానం, బీజం, అవ్యయం - ఇలా ఎన్ని నామ రూపాలని చెప్పను? మహామతీ ఈ జగత్రయంలో కనబడేదీ, వినబడేది, ఆలోచింపబడేది, జన్మించేదీ, అంతా వస్తు మాత్రమేనని (పరబ్రహ్మమేనని) తెలుసుకో. అర్జునా, యోగనిష్టలో కూర్చుని ఎవరిని ధ్యానిస్తుంటావు నువ్వు సమస్తమూ నీవే కదా? అని నన్ను అడిగావు గుర్తున్నదా? 

Tuesday 23 May 2023

శ్రీదత్త పురాణము (147)

 


ఇంత వరకు చెప్పిన వేద ధర్ముడు కొంత సమయం ఆగాడు. అపుడు దీపకుడు గురుదేవా-వేదధర్మ స్వరూపా సార్ధక నామధేయా- నీ దయవల్ల అతి పురాతనమైన ఇతి హాసాన్ని హృదయానందదాయకమైన దత్త స్వామి మహత్యాన్ని వినగలిగాను. తత్వవిశ్చయమైన ఈ ఇతిహాసం చాలా విచిత్రంగా వుంది. ఆకర్షణీయంగా కూడ వుంది. దీన్ని వింటే సాధారణమానవుడు సైతం అతి కష్టమైన పరతత్వాన్ని మెల్లమెల్లగా తెలుసుకోగలుగుతాడు. తప్పులుగా, మహాపాపాలుగా, దోషాలుగా కొందరిలో చెప్పబడుతున్న వాత్సాయన కామ సూత్రాదిశాస్త్రాలు కూడా చివరకు బ్రహ్మతత్వంలోనే లయమవుతున్నాయి- అని ఇప్పటికి తెలుసుకోగలిగాను. -


కార్తవీర్యార్జునునికి దత్తయోగీంద్రుడు చేసిన తత్వబోధను కూడా దయచేసి సవిస్తరంగా తెలియజెయ్యండి. ఆలకించి ధన్యుణ్ని అవుతాను అని దీపకుడు సవినయంగా ప్రార్ధించాడు. వేదధర్ముడు సరేనని ప్రారంభించాడు.


దత్తస్వామి కార్తవీర్యార్జునుకి చేసిన బోధ


సాష్టాంగ నమస్కారంచేసి తనకు చేరువలో నిలబడ్డ కార్తవీర్యార్జునుణ్ని తనకు దగ్గరగా కూర్చోపెట్టుకొని దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ అతనివైపు ఒకసారి చూసి ఇలా అన్నాడు. వత్సా కార్తవీర్యా! ఇంతకు ముందు నువ్వు ధర్మార్థకామాల స్వరూపాల గురించి అడిగావు వాటిని నీకు అమగ్రహించాను. ఇప్పుడు తురీయమైన పురషార్థ మోక్షం గురించి అడుగుతున్నావు. భక్త పరాధీనుణ్ని కనుక అదీ అనుగ్రహిస్తున్నాను. ఆకలిగా వున్నప్పుడే అన్నము, దాహముగా వున్నప్పుడే నీళ్ళూ, రోగం వచ్చినప్పుడు మందు, బంధనంలో వున్నప్పుడే విమోచనం, నిద్ర వస్తున్నప్పుడే శయనము, ఇలా ఏది అవసరమైనప్పుడు ఏది కోరినప్పుడు దానిని ఇవ్వాలి. అవసరం లేనప్పుడు ఇవ్వడం గాని ఒకటి.

దాహముగా వున్నప్పుడే నీళ్ళూ, రోగం వచ్చినప్పుడు మందు, బంధనంలో వున్నప్పుడే విమోచనం, నిద్ర వస్తున్నప్పుడే శయనము, ఇలా ఏది అవసరమైనప్పుడు ఏది కోరినప్పుడు దానిని ఇవ్వాలి. అవసరం లేనప్పుడు ఇవ్వడం గాని ఒకటి ఇవ్వవలసిన సమయంలో ఇంకొకటి ఇవ్వడంగానీ కోరనిది ఇవ్వడం గానీ జరిగితే వ్యర్ధమవుతాయి.


Monday 22 May 2023

శ్రీదత్త పురాణము (146)

 


కార్తవీర్యార్జునా బృహస్పతి ప్రశ్నకు ఇంద్రుడు ఏమన్నాడంటే ముందుగా అభిమానం విడిచిపెట్టి సాష్టాంగ నమస్కారం చేసాడు. ఆపై ఇలా పలికాడు. గురూత్తమా శరణు శరణు. నా అజ్ఞానాన్ని క్షమించండి. తెలియక చులకనగా మాట్లాడాను. సంగీత, నృత్య, వైద్య, తంత్రాది, సకల శాస్త్రాలు ప్రధానంగానో లేదా పరంపరగానో మూల అవిద్యా నివారకాలనీ పరమాత్మ తత్వప్రకాశకాలనీ మోహకారకాలు కాదనీ స్పష్టంగా తెలిసింది. మీరు చెప్పిన ఏడు కధలూ ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. మీరు చెప్పిన పుణ్యప్రదమైన ఈ ఇతిహాసాల్ని సమాహిత చిత్తంతో అవగాహన చేసుకున్నవారు అవిద్య కారణంగా జన్మించే మోహాన్ని విదిల్చుకొని కర్మ బంధం నుండి విముక్తులు కాగలుగుతారు - అని గురువైన బృహస్పతికి మరోసారి సాష్టాంగ నమస్కారం చేసి శచీ వల్లభుడు (ఇంద్రుడు) సెలవు తీసికొన్నాడు.


దత్తస్వామి ఇంత వరకూ చెప్పి- కార్త వీర్యార్జునా నీ సందేహాలన్నీ తొలగిపోయాయి గదా! శాస్త్రాలకు గల వైరుధ్యము అనేది పైపై చూపులకు కనిపించే అభాసమే తప్ప ఆత్మ దృష్టిలో అన్ని శాస్త్రాలు పరతత్వ ప్రతిపాదకములే. అందుచేత వృధా వాదోపవాదాలతో అహంకరించి కాలయాపన చెయ్యడం కన్నా ఏదో ఒక శాస్త్రాన్ని - ఒక దారినీ పట్టుకుని దాన్నే - నమ్ముకుని ముందుకు సాగితే అవిద్య అంతరిస్తుంది. తత్వజ్ఞానం కలుగుతుంది. గ్రహించావా? అన్నారు.


దేవదేవా - జగన్నాధా- సర్వ సందేహభేధకా నా సందేహాలన్నీ తొలగిపోయాయి. శాస్త్ర ప్రతిపాదిత విషయాలలో వైరుద్ధ్యం అనేది ఇపుడు అసలు ఎక్కడా కన్పించడంలేదు. వైరుద్ధ్యంవుందని కూడా అనిపించడం లేదు. అవి క్షుద్ర శాస్త్రాలైనా సరే శుద్ధ శాస్త్రాలైనా సరే అన్నీ ఒకే అర్ధాన్ని ఒకే పరమార్థాన్ని ఒకే పరమాత్మతత్వాన్ని భోదిస్తున్నాయి. దత్తయోగీంద్రా నీ ప్రభావం వల్ల ఇపుడు నా మనస్సు ఆత్మ బోధనలో వెంటనే సులువుగా ప్రవేశించాలని తహతహలాడుతోంది. నీ సహాయం అడుగుతున్నాను. బ్రహ్మనిష్టున్నీ-అఖిలాతీతుడ్ని-లౌకిక వ్యవహారముల నుండి విముక్తుడ్ని అయి ఈ శరీరం వున్నంతకాలం సుఖంగా కాలంగడిపే విధానం ఏమిటో దాన్ని నాకు బోధించి - శాసించి నేర్పు" అని కార్తవీర్యార్జునుడు మరో మారు దత్తయోగి పాదాలపై బడ్డాడు.


Sunday 21 May 2023

శ్రీదత్త పురాణము (145)

 


ఆ శిశుయోగి తల్లిదండ్రులు వున్నంత కాలం వారికి ప్రీతికరంగా మెలిగి ఆ పైన బంధ విముక్తుడై వూరు, ఇల్లూ, వాకిలీ అన్నింటినీ విడచి ఆత్మరతుడై ఈ భూగోళం మీదకి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇంద్రా విన్నావుగదా కధ. ఈ శిశుయోగి జ్ఞాన సుధా సముద్రుడే కాని రవ్వంత సంగభయం ఉంది. విష్ణుదత్తుడు రవ్వంత ప్రభోధం చేసేసరికి ఆ భయాన్ని వదలిపెట్టాడు.


ఇతడిలాగే లోకులు అందరూ లోపలున్న ప్రజ్ఞాఘనుడైన పరమాత్మను నిత్యమూ అనుభవిస్తూ వున్నా మోహావృతులవుతున్నారు. నేనే కర్తను, నేనే దాతను, నేనే వికర్తను, సుఖదుఃఖాలకు నేనే భోక్తము అని భావిస్తూ మూఢులై భ్రాంతులై లోపలున్న పరమాత్మను తెలుసుకో లేక పోతున్నారు. ప్రత్యక్షంగా పరమాత్మానుభూతి పొందుతూ కూడా లోపలికి దృష్టి నిలపలేక నేనెవణ్ని? ఎక్కడ ఎలా నాకు ఆత్మ జ్ఞానం లభిస్తుంది? అని అంగలారుస్తూ వృధాగా వెలుపలకు పరుగులు తీస్తున్నారు. పిల్లాడిని చంకలో పెట్టుకొని పూరంతా గాలించి ఏడుపు లంకించుకుంటున్న తల్లిలాగా ఆత్మతత్వం కోసం విలపిస్తోంది ఈ లోకం అంతా.


దేవతా విభూ! ఇంద్రా! ఇలా శాస్త్రాలన్నీ తేలికగా సుఖంగా బోధలు చేస్తూ క్రమంగా మోహాన్ని తొలగించడంలో ఉపయోగపడుతున్నాయి. ఇందులో నేను చేసిన అపూర్వ సృష్టిగాని కల్పనకానీ అణుమాత్రం కూడా లేదు. నువ్వు నీ సొంత బుద్ధితో ఆలోచించి ఇది నిజమో కాదో, మంచి అవునో కాదో తేల్చి చెప్పు. బృహస్పతి ఇలా ఏడు ఉదాహరణలు చెప్పాడని కార్త వీర్యార్జునునికి దత్తాత్రేయుడు వివరించాడు. అంతా విన్న కార్త వీర్యుడుకి చివరి అంశం సందేహం మిగిలిపోయింది. ఏడు కథలూ విన్నాక దేవేంద్రుడు ఏమన్నాడు? విభిన్న మార్గాలలో నడిచే శాస్త్రాల ఏకత్వం అంగీకరించాడా లేదా? ఇవే సందేహాలు దత్తస్వామి ముందు వుంచాడు. బృహస్పతికి ఇంద్రుడు చెప్పిన సమాధానాన్ని యధాతధంగా దత్తదేవుడు ఇలా వినిపించాడు.


Saturday 20 May 2023

శ్రీదత్త పురాణము (144)

 


బంధమోక్షాలు రెండింటికీ మనస్సే కారణం. అది విషయాసంగి అయితే బంధహేతువు. అదే నిర్విషయమైతే ముక్తి హేతువు, పరపురుషుడ్ని మరిగిన వనిత ఇంటి పనుల్లో తలవుంచి ఉన్నప్పుడు కూడా అంతరంగంలో అలనాటి సంగము రసానుభూతిని నెమరువేస్తూ జీవిస్తుందో అలాగే ధీరుడైన జ్ఞాని బహిర్ వ్యవహారాలను నిర్వహిస్తూ కూడా అంతరంగంలో శుద్ధ పరతత్వాను భూతిని పొందుతూ వుంటాడు.


బాలయోగీ! మోక్షమనేది ఎక్కడో ఆకాశం మీదనో పాతాళంలోనో భూగోళం మీదనో లేదు. మన లోనే వుంది. అహంకార రూపమైన విమోహం నశించడమే మోక్షం అంటే. ఇదేమంత కష్టంకాదు. పువ్వులు కోయడం కన్నా కన్నులు మూసుకోవడం కన్నా అహంకార పరిత్యాగం తేలిక అయిన పని. ఇందులో ఏ కొంచెం కష్టం కూడా లేదు. ఎందుకంటే ఇది మనస్సు పని కనుక. ఈ మనస్సుకు వున్న చాంచల్యం అన్నింటికీ మూలం. ఇదే ప్రపంచాకారంగా (పెద్దదిగా) అనిపిస్తుంది. విషయసుఖాల వెంట పరుగులు తీస్తుంది. వాటిని తెగ మెచ్చుకుంటుంది. అవసరమైన ద్రవ్యాదులను యాచిస్తుంది. ఆనిశ్చయంతో భ్రాంతిగా వుంటుంది. తానే మూఢంగా తయారవుతుంది. తాను కల్పించుకున్న ప్రపంచంలో తానే మునిగిపోతుంది. అపరత్వాన్ని పొందుతుంది. ఇవన్నీ దానికి స్వభావమైన చంచలశక్తి వల్ల సంభవిస్తున్న చాంచల్యాలు. కాబట్టి బుద్ధిమంతుడా, ఈ మనస్సు తత్వాన్ని గుర్తిస్తే అహంకార పరిత్యాగం ఏ మంతకష్టం కాదు. అందచేత నీవు కూడా ఈ జడత్వాన్ని విడిచిపెట్టు నిరహంకారంగా, నిర్మమంగా కర్మాచరణం చెయ్యి నువ్వు నాకు ఇష్టుడవయ్యావు. తల్లితండ్రుల్ని సంతోషపరచాలి అనే సంగతి ఆలోచించు. కొంతకాలం వాళ్ళకి ప్రీతికరంగా జీవించు. వాళ్ళు వెళ్ళిపోయాక నీ యిష్టం. అప్పుడు యధేచ్ఛగా సంచరించవచ్చు. అప్పుడు నిన్నెవరూ నిర్బంధింపరు.


విష్ణుదత్తుని ఉపదేశాన్ని శిశుయోగి అంగీకరించాడు. ఆ క్షణం మండే విత్యనై మిత్తిక కర్మలు ఆచరించడం మొదలు పెట్టాడు. స్నానసంధ్యలు ముగించివచ్చాడు. పతివ్రతా శిరోమణి సుశీలమ్మ వడ్డించిన రుచికరమైన ఆహారాన్ని మెచ్చుకుంటూ మితంగా ఆరగించాడు. దానితో అతడిలో దాగిన భయాలు అన్నీ అంతరించాయి. నిస్సంగంగా వుండవచ్చనీ వుండగలననీ ధైర్యం తెచ్చుకున్నాడు. భోజనం ముగించివచ్చిన తల్లితండ్రులు తమ బిడ్డలో వచ్చిన మార్పుని చూసి బ్రహ్మానందపడ్డారు. సుశీలా విష్ణుదత్తులకు కృతజ్ఞతగా సాగిలపడి మ్రొక్కారు.


ఏం మంత్రం వేశావో ఏం వైద్యం చేసావో కృపానిధీ క్షణంలో మా వాడికి కొత్త జీవితం ప్రసాదించావు. నీ మేలు జన్మ జన్మలకీ మరచిపోనంటూ బిడ్డను తీసికొని ఆదంపతులు సంతోషంగా వెళ్ళిపోయారు.


Friday 19 May 2023

శ్రీదత్త పురాణము (143)

 


యోగిన్ ఏమిచెయ్యను? ఎక్కడికి వెళ్ళను? ఏది స్వీకరించను? ఏది పరిత్యజించను? కల్పాంతంలో నీటితో నిండిపోయినట్లు ఈ విశ్వం ఆత్మ పదార్ధంలో నిండిపోయింది. అంతా నేనే, నేను సదానందమయుడ్ని, సోహమ్. నాకింక భోక్తవ్యమేమిటి? పరిత్యాజ్యమేమిటి? అన్నమూ నేనే మంత్రమూ నేనే మరొకటి నేనే అన్నీ నేనే. అంతా నేనే.


శిశుయోగి మాటలకు విష్ణుదత్తుడు చాలా సంబరపడ్డాడు. మృదువుగా కౌగిలించుకున్నాడు. నాయనా నిజమే. అంతా నువ్వే అన్నీ నువ్వే. విశ్వమంతా ఆత్మ పదార్ధమే. అలాంటప్పుడు కర్మను ఆచరించకపోవడం ఎంతటిదో ఆచరించడం అంతటిదే కదా! ఆచరించినందువల్ల నీకు ఏ దోషం చుట్టుకుంటుందో చెప్పు నిష్కామకర్మాచరణంతో జీవన్ముక్తుడవై సుఖంగా జీవించు. కర్మాచరణం నువ్వు చెయ్యి ఎదుటి వారికి నేర్పు. ఆదర్శప్రాయంగా నిలబడు. లోకం కోసం కొన్ని పనులు మనం చెయ్యాలి. ఇందువల్ల కర్మానుబంధం చుట్టుకోదా అని నువ్వు అడగవచ్చు. చుట్టుకోదు. ఎందుకంటే - ఏ బంధమైనా దేహాభిమానంవల్ల పుడుతుంది. దాన్ని వదలడమే కదా ముక్తి అంటే. నేను నాది అనేవి బంధ కారణాలు. నేను కాను - నాది కాదు అనేవి ముక్తి కారకాలు.


శిశు యోగీశ్వరా! స్వస్వరూపం తెలుసుకో ఇక్కడ నీకు కర్మానుబంధం లేదు. మాన అవమానాలవల్ల కలిగే - గుణదోషాలు కూడా అభిమానం వల్లనే. కనుక దేహాభిమానం వదిలేస్తే గుణమూ లేదు దోషమూలేదు. బంధమూ లేదు. ఈ అభిమానాన్ని వదలలేక కర్తృత్వాన్ని తన మీదనే వేసుకునే అహంకారికి విషయ వాసనలు సుఖ దుఃఖాదిక్రియలు తప్పవు. నిరభిమానికి ఇవి ఏవీ అంటవు. అందుచేత ఆ అహంకారాన్ని ఆ దేహాభిమానాన్ని ఒక్కదాన్ని విడిచిపెట్ట గలిగి కర్మ మార్గంలో ప్రయాణం చేసినా - ఒకవేళ అతడు మూఢుడే అయినా కర్మపాశబద్ధుడు కాదంటే ఇక నీబోటి పండితుడి సంగతి చెప్పాలా?


Thursday 18 May 2023

శ్రీదత్త పురాణము (142)

 


ఆత్మ జ్ఞానం


ప్రతిష్టానపురంలో ఒక బ్రాహ్మణుడు వున్నాడు. అతడు జ్ఞానవిజ్ఞానపారంగతుడు. ఆయనకు లేక లేక ఒక ముగ బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డడు పుట్టినప్పటి నుండీ ఏ చైతన్యమూ లేకుండా ఒక జడ పదార్థంలాగా వుంటున్నాడు. శారీరక ఎదుగుదలవుంది కానీ మానసిక చైతన్యం కనిపించడం లేదు. వీధిలోకి రాడు. ఎవరితోనూ కలవడు. ఆటపాటలు లేవు. పెడితే తింటాడు. పెట్టకపోతే పస్తుంటాడు. ఇది తినవచ్చు ఇది తినకూడదు. ఇంత తినవచ్చు ఇంత తినకూడదు అనే విచక్షణా జ్ఞానం లేదు. మలమూత్రాలకు తేడా లేదు. నిలబడివుంటే నిలబడ్డ చోట కూర్చుంటే కూర్చున్న చోటే పడుకుంటె పడుకున్న చోటే అన్నీను. ఏదో పిశాచం పట్టిన వాడిలా ఎప్పుడూ ఏకాంతాన్నే కోరుకుంటూ ఎవరితో కలవాలన్నా, పలకాలన్నా, భయపడుతూ, చదువు సంధ్యలూ లేకుండా ఇంటిలోనే పడివున్న కొడుకును చూసి ఆ దంపతులు ఎంతో కుమిలిపోతూవుండేవారు. దానధర్మాలు, తీర్ధయాత్రలు, నోములూ, జపాలూ, వ్రతాలు, గ్రహశాంతులూ అన్ని అయ్యాయి. అన్నిరకాల వైద్యాలు అయ్యాయి. సొమ్ము కరిగిపోయింది కాని కుర్రవానిలో మాత్రం మార్పులేదు. విష్ణుదత్తుడి మహిమ గురించి విని ఆదంపతులు బిడ్డను తీసుకొచ్చారు. చూపించి పరిస్థితి వివరించారు. మహానుభావా మాకు ఒక్కగానొక్క కొడుకు దయచేసి వీడ్ని మామూలు మనిషిని చెయ్యి - అని పాదాల మీద పడి ప్రార్ధించారు.


విష్ణుదత్తుడు ఆ బిడ్డడి వైపు నిశితంగా చూసాడు. విషయం అర్ధమయ్యింది. అతడిని తన దగ్గర వుంచుకొని తల్లిదండ్రుల్ని భోజనం చెయ్యమని చెప్పి లోపలకు పంపించాడు. వాళ్ళు అలా ళ్ళగానే ఆ బిడ్డడుతో విష్ణుదత్తుడు ఇలా సంభాషించాడు. 


బ్రహ్మాన్ తమరెవరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? పని ఏమిటి? ఏమి చేస్తున్నారు? హాయిగా మీ ఇంటికి మీరు వెళ్ళండి. సుఖాలు అనుభవించండి. సుఖంగా భుజించండి. ఇప్పుడు నన్ను ఏమిచెయ్యమంటారో చెప్పండి. ఈ జడ్డి తనాన్ని వదిలెయ్యండి. అని విష్ణుదత్త యోగి అనేసరికి ఆ శిశుయోగి పెదవి విప్పి ఇలా పలికాడు.


Wednesday 17 May 2023

శ్రీదత్త పురాణము (141)

 


ఇక రెండవ పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపూ సొలుపూ లేకుండా తిరిగివచ్చిన వ్యక్తి దేవత అయినా దయ్యం అయినా అవ్వాలి తప్ప మానవుడు కాడు. కాబట్టి దీనితో దొంగ ఎవరో నిశ్చయం అయ్యింది. ఇంకా ఎవరికైనా ఏమైనా సంశయాలువుంటే వాటిని తొలగించడానికి మూడో పరీక్ష ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించిన విషయం కనుక అన్ని విధాలా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి. లేకపోతే భార్యాభర్తల్ని విడదీసిన పాపము, అక్రమ సంబంధాన్ని అంగీకరించిన పాపము చుట్టుకుంటాయి. అందువలన మూడో పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాం. సిద్ధయోగులు వారంతట వారు అనుగ్రహిస్తే తప్ప ఎవరికీ కనిపించరు. అలాంటిది - అందరిని చూసి వచ్చావని గోత్రనామాలు గబగబా చెప్పినవాడు. అలవాటుపడిన అసత్యవాది అన్నమాట. మాయలూ మోసాలు చెయ్యగల ఘటికుడన్నమాట. పిశాచం ఎవడో ఇప్పుడు నిశ్చయంగా తెలిసింది కదా! దీన్ని బహిరంగంగా చెప్తే వాడు పారిపోవచ్చు లేదా తిరగబడవచ్చు లేదా ఇంకేదైనా చేయవచ్చు. నేనే గెలుస్తున్నాను అనే భ్రమలో వాడు వున్నాడు కనుక అదే వూపులో వాడిని బంధించాలి. నిజానికి బంధనమే నాలుగో పరీక్ష మనం పెట్టినవి మూడు పరీక్షలే.


ఒక అజ్ఞానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమంగా అజ్ఞానం తొలగించి, వికాసం కలిగించి, ఆవిద్యను సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతడిలో ప్రకాశింపజేసినట్లుగా మొత్తం ఈ ప్రక్రియ అంతా నడిపించాను. ఇది నీతిజ్ఞులు చెప్పిన మార్గం. దీన్ని అనుసరించి మీ అనుమానాలు తొలగించి తుది నిర్ణయం మీకే తెలిసేటట్లు చేసాను అన్నాడు.


అందరూ సంబరపడ్డారు. విష్ణుదత్తుడుకి యధోచితంగా నమస్కరించి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసికొన్నారు. అమరేంద్రా విష్ణు దత్తుడు చేసిన మరొక నిర్ణయం చెబుతాను. ఇది ఏడవ ఉదాహరణ. శ్రద్ధగా ఆలకించు. నీ సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి- అంటూ బృహస్పతి ఇంకా ఇలా చెప్తున్నాడు.


Tuesday 16 May 2023

శ్రీదత్త పురాణము (140)

 


ఇదే చివరి పరీక్ష నీ శక్తికి యుక్తికీ ఇందులో నెగ్గడమే నెగ్గడం అంటూ సన్న మూతివున్న సీసాలాంటి గాజు పాత్రను దాని మూతతీసి అందరి సమక్షంలో మధ్యలో వుంచాడు. ఇందులోకి తటాలున ప్రవేశించి చటాలున బయటకు రావాలి. ఇదే చివరి పరీక్ష ప్రయత్నించండి అన్నాడు. విష్ణుదత్తుని మాట ముగిసేలోగానే "గా" వ్యక్తి సూక్ష్మరూపం ధరించి గాజు సీసాలోకి ప్రవేశించాడు. విష్ణుదత్తుడు అప్పుడు మెరుపు వేగంతో బిరడాతో సీసా బిగించాడు. పిశాచం ఇంక బయటకు రాకుండా మంత్రం వేసాడు. సాక్షులూ, ప్రేక్షకులూ అందరూ హర్ష ధ్వానాలు చేసారు. ఇన్నేళ్ళుగా పట్టిపీడిస్తున్న పిశాచం పీడ విరగడ అయ్యిందని అందరూ హాయిగా వూపిరి పీల్చుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. సత్య కుండీలుడూ విశాలాక్షీ పరస్పరం గాఢంగా కౌగలించుకున్నారు. విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారములు చేసి ఆశీస్సులు తీసికొన్నారు.


అక్కడున్న వారిలో ఒక వ్యక్తిలేచి మహానుభావా నువ్వు దివ్యశక్తి సంపన్నుడవని మాకు తెలుసు. కేవలం అలా చూసి పత్యాసత్యాలను గ్రహించగలవు. మరి నాలుగు పరీక్షలు పెట్టావేమిటి? దయచేసి నా సందేహం తీర్చు అని అభ్యర్థించాడు.


అప్పుడు విష్ణుదత్తుడు ఇలా చెప్పాడు. మాన్యులారా. నేను సత్యమైన వ్యక్తిని గుర్తించడం కాదు. మీరు కూడా గుర్తించేటట్లు చేయాలి. విశాలాక్షి గుర్తించాలి. విశ్వసించాలి. ఇవి జరగాలి అంటే పరీక్షలు తప్పదు. అందుకే నేను మూడు పరీక్షలు పెట్టాను. ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటువుంటుంది. ఉన్న వాటిలో కొన్నింటిని మరచిపోవచ్చు. కానీ లేని వాటిని మాత్రం చెప్పలేడు. దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు కనుక ఉన్నవీ లేనివీ చెప్తాడు. ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో దాన్ని పోలిస్తే అసలురంగు తెలుస్తుంది. ఈ పరీక్షలో మనం ఖచ్చితం అయిన నిర్ధారణ చెయ్యకపోయినా యజమాని ఆచూకీ తెలుసుకోవచ్చు.


Monday 15 May 2023

శ్రీదత్త పురాణము (139)

 


మిత్రులారా వీళ్ళిద్దరూ శీలం, రూపం, వయస్సు, స్వరం, వర్గం, ఆవృతి, నామం, గోత్రం, చేష్టలు, అన్నింటిలోనూ ఒక్కటిగా వున్నారు. వీరిలో ఎవరు సత్య కుండిలులో మన ముందువున్న సమస్య. మీరందరూ అంగీకరిస్తే వీళ్ళిద్దరకూ కొన్ని పరీక్షలు పెడతాను. మీరంతా సాక్షులుగా ఉండండి. ఎవరు ఏమిటో ఇప్పుడే తేలుద్దాం - అన్నాడు. అందరూ అంగీకరించారు. వెంటనే ఇద్దరిఫాలభాగాల మీద గుర్తింపుకొరకు ఒకరినొసట “కా” అని ఇంకొకరి నొసట “గా” అని ముద్రలు వేయించాడు. ముందుగా "కా" వ్యక్తిని దగ్గరకు పిలిచి "గా" వ్యక్తిని దూరంగా పంపి మీ ఇంట్లోవున్న వస్త్రములు - ధనములు - ధాన్యములు - ఆభరణములు - వస్తువులు - అలాగే విశాలాక్షి వంటిపై నున్న పుట్టుమచ్చలూ, రోగాలు, రొష్టులూ, అలవాట్లూ అన్నీ జాబితాలాగా చెప్పమన్నాడు. వాడు చెబుతూవుంటే ఒక వ్యక్తి చేత రాయించి పక్షులవద్ద భద్రంగా వుంచాడు. అలాగే "గా" వ్యక్తిని కూడా పిలిపించి అతడితోనూ అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరిచాడు. ఆ తర్వాత విశాలాక్షిని పిలచి ఆమెతోనూ ఇంట్లో వున్న సామాగ్రి తన పుట్టుమచ్చలూ మగడి పుట్టుమచ్చలూ వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందించాడు. మూడు జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఇక ఒక నిశ్చయానికి వచ్చాడు. కానీ ఏమీ చెప్పలేదు.


చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరినీ ఒకే సారి దగ్గరకు పిలచి పంచక్రోశవిశాలమైన దివ్యక్షేత్రం ఇది. దీనికి ప్రదక్షిణ చేసి రావాలి. దారిలో ఎన్ని దేవాలయాలు వున్నాయో వాటిలో ఏ దేవతా మూర్తులు వున్నాయో ఆయా మూర్తుల లక్షణాలు ఏమిటో చెప్పాలి ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్లు - అని ప్రకటించాడు. ఇద్దరూ వెంటనే బయలు దేరారు. "గా" వ్యక్తి మాత్రం అర్థగంటలోనే తిరిగి వచ్చి అన్ని వివరాలు గడగడా చెప్పాడు. "కా" వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్ననికి అలసిసొలసి తిరిగి వచ్చాడు. మెల్లగా అన్నీ చెప్పాడు. విష్ణుదత్తుడు ఇద్దరినీ సమానశ్రద్ధతో విన్నాడు. వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్నీ రాయించారు.


ఇంకొక పరీక్ష పెట్టాడు విష్ణుదత్తుడు. ఈ సహ్యాద్రి పర్వతం మీద ప్రసిద్ధులైన సిద్ధ యోగులు కొందరు వున్నారు. వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కొని రండి ముందు వచ్చి చెప్పిన వాడు జయించినట్లు అన్నాడు. ఇద్దరూ పరుగు పరుగున బయలు దేరారు. క్షణకాలంలోనే తిరిగి వచ్చాడు “గా” వ్యక్తి సిద్ధయోగుల గోత్రనామాలన్నీ వరుసలో ఏకరువు పెట్టాడు. అది కూడా జాబితా రాయించి భద్రపరిచాడు. ప్రాద్దు గుంకింది. చీకట్లు కమ్ముకున్నాయి. తొలి జాము గడిచిపోయింది. అప్పటికి తిరిగి వచ్చాడు “కా” వ్యక్తి రొప్పుతూ రోజుతూ- పాపం పడ్తూ లేస్తూ వచ్చాడు. వస్తూనే విష్ణుదత్తుని పాదాల మీద బడ్డాడు మహానుభావా నిజం చెబుతున్నాను కొండ అంతా తిరిగి తిరిగి వచ్చాను. ఎంతో పరీక్షగా చూసాను. నా కంటికి ఏ సిద్ధయోగీ కనిపించలేదు. ఇంక నమస్కరించడం ఏమిటి? గోత్రనామాలు అడగడం ఏమిటి? కాళ్ళీడ్చుకొంటూ ఎలాగో మీ దగ్గరకు చేరుకున్నాను. ఇంక భయంలేదు. కాసిన్ని మంచి నీళ్ళు ఇప్పించండి అన్నాడు. అతడికి అవసరమైన ఉపచారములు చేయించి విష్ణుదత్తుడు ఈ సారి - గంభీరంగా కూర్చున్నాడు. ఒక్క నిముషం కళ్ళు మూసుకొని తెరిచాడు.


Sunday 14 May 2023

శ్రీదత్త పురాణము (138)

 


ఆ రాత్రి మాయా కుండిలుడు విశాలాక్షిని తనివితీరా అనుభవించాడు. ఆవిడ తట్టుకోలేక పోయింది వీడి బలం, భోగసామర్ధ్యం. అతికామం ఇంకా వివిధ లక్షణాలు వికారాలు విశాలాక్షికి అనుమానం కలిగించాయి. తన భర్తకాదు అని మనసుకి తెలుస్తోంది. కానీ రూపం చూస్తే ముమ్మూర్తులా అదే. ఎవరికి చెబితే ఎవరు నమ్ముతారు. తనలో తనే కుమిలిపోతూవుంది. వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తున్నాడు. ఏ పని మీద బయటకు కూడా వెళ్ళడం లేదు. విశాలాక్షిని వెళ్ళనివ్వడం లేదు. విశాలాక్షి అన్ని విధాలా నలిగిపోతూవుంది. రోజురోజుకీ ఆమె శరీరం కృంగి కృశించిపోతూవుంది. నెల అయ్యేసరికి ఎండు కట్టెలా తయారయ్యింది.


అదే రోజు సాయంకాలానికి కుండిలుడు తిరిగి వచ్చాడు. చిక్కిశల్యమై గుమ్మంలో నిలబడ్డ విశాలాక్షిని గుర్తుపట్టలేకపోయాడు. విశాలాక్షి మాత్రం భర్తను గుర్తు పట్టింది. ఆమెకు ఒక్క పెట్టున దుఃఖం పొంగుకొచ్చింది. గుమ్మంలోనే కుప్ప కూలింది. కుండీలుడు త్వరత్వరగా సమీపించాడు అయ్యో అయ్యో అంటూ ఆవిడ్ని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఏమి చెయ్యాలో పాలు పోవడం లేదు. అర్ఘ్యపాద్యాదులతో ఎదురువస్తుంది, స్వాగతం పలుకుతుంది అనుకున్న భార్య ఒక్క నెలలో ఇంతగా కృశించి చిక్కి శల్యమై నన్ను చూస్తూనే కుప్ప కూలిపోవడమేమిటి? కాసిన్ని మంచి నీళ్ళు తెచ్చిచల్లుదాం తేరుకుంటుంది అని లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఇంటిలో నుండి మాయా కుండీలుడు బయటకు వచ్చాడు. నువ్వెవరంటే నువ్వెవరు? నువ్వు మాయగాడివి అంటే నువ్వు మాయగాడివి నువ్వు మోసగాడివి అంటే నువ్వు మోసగాడివి అనుకున్నారు. ఇద్దరూ పరస్పరం వాగ్వివాదంతో అరుచుకుంటున్నారు. ఇరుగుపారుగు జనం పోగయ్యారు. ఎవరు నిజమైన కుండీలుడో గుర్తుపట్టలేకపోయారు. ఇంతలో విశాలాక్షికి స్పృహవచ్చింది. తలపట్టుకొని కూర్చుని ఏడుస్తుందే తప్ప తనూ గుర్తుపట్టలేకపోయింది. ఇద్దరూ ఒకే చోట ఉండే సరికి ఎవరు సత్యకుండీలుడో ఎవరు మాయా కుండీలుడో గుర్తు పట్టలేకపోయింది. తన సోదరులు తల్లితండ్రులూ ఇంకా బంధు వర్గమూ అందరినీ చుట్టు ప్రక్కల గ్రామాల నుండి రప్పించింది. అందరూ వచ్చిరి. ఏ ఒక్కరూ ఎవరు సత్యమైన కుండీలుడో పోల్చ లేకపోయారు. తేల్చలేకపోయారు.


ఇంతలో గుంపునుండి ఎవరో అన్నారు. ఇలాంటి ధర్మ సంకటాల్లో విష్ణుదత్తుణ్ణి శరణు వేడడమే తక్షణ కర్తవ్యం అనీ, ఆయనగారైతే క్షణంలో తేలుస్తారు ఈ జటిల సమస్యని అని అందరూ అవునంటే అవును అనుకున్నారు. సత్యకుండీలుడు, మాయా కుండిలుడు కూడా ఒప్పుకున్నారు. పదండి అంటే పదండి అని అందరూ త్వరత్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడి ఇంటికి చేరుకున్నారు. నమస్కరించారు. సమస్య ఏమిటో ఆయనకు వివరించారు. విశాలాక్షి మాత్రం భోరుభోరున విలపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడింది. విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇద్దరు కుండిలుల వైపుకి చూసాడు నిశితంగా. ఎవరు మాయగాడో తెలిసిపోయింది. అయితే దాన్ని జనం నమ్మేటట్లు ఆధారాలుతో నిరూపించాలి. నిర్ధారించాలి. మహిమచూపించి నిరూపిస్తే పిశాచ మాయకూ దీనికి జనం దృష్టిలో తేడావుండదు. కాబట్టి మానుషమైన ఉపాయంతోనే ఈ చిక్కు సమస్యను విడదీయాలి. ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు.


Saturday 13 May 2023

శ్రీదత్త పురాణము (137)

 


కుండిలుడు - విశాలాక్షి గాధ


ఇంద్రా ఇంక ఆరవ ఉదాహరణ కూడా ఆలకించు. సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉంది. ఆ వూళ్ళో కుండిలుడు అనే బ్రాహ్మణుడు వున్నాడు. అతని భార్య విశాలాక్షి. అప్సరసలను తలపించే సౌందర్యం. రూపానికి తగిన గుణాలు. సౌశీల్యానికి, అణుకువకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండీ ఇరుగుపొరుగు వారితో అవును అనిపించుకుంటోంది. వివాహం అయ్యి ఐదేళ్ళు గడిచినా వారికి సంతానం లేదు. ఎన్నో నోములూ వ్రతాలు చేస్తున్నారు కానీ ఇంకా భగవంతుడు వారిని అనుగ్రహించలేదు. భార్యాభర్తలు ఇద్దరూ సుఖంగా ఆన్యోన్యంగా కాలం గడుపుతున్నారు. ఇలా వుండగా ఒకనాడు కుండిలుడు పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు. వెళ్ళడానికి అక్కడ వుండి పని చూసుకొని తిరిగి రావడానికి నెల్లాళ్ళు పడుతుందని అందాకా భార్యకు ఇంట్లో కావలసిన సరుకులు సిద్ధంచేసి ఇరుగుపొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారిబత్తెం మూటగట్టుకొని ఉదయాన్నే చల్ల బాటువేళ బయలుదేరాడు.


ఆ ప్రాంతంలో ఝంటిగుడు అనే మగ పిశాచం తిరుగుతుంది అనే ప్రతీతివుంది. వాడు పూర్వ జన్మలో బహు దుష్టుడు, దుర్భలుడు, దుర్జనుడు, కామాతురుడై అర్ధాంతరంగా చచ్చాడు. పిశాచమయ్యాడు. ఎంతటి మంత్ర గాళ్ళకి వీడు లొంగడం లేదు. అందగత్తె ఒంటరిగా కనబడితే చాలు మోసంచేసి గాని, బలాత్కారం చేసిగాని అనుభవిస్తున్నాడు. వాడు తనకున్న మాయాశక్తితో ఏ రూపం కావలిస్తే ఆ రూపం ధరిస్తున్నాడు. అందుచేత వీడు చేసే మోసాలు అంతా అయ్యాక గాని బయట పడటం లేదు. ఎందరెందరో గృహిణులు వీడు చేసిన మోసానికి లోపలే కుమిలిపోతున్నారు. కొందరి సంసారాలు అయితే కూలిపోయాయి కూడా. వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి వుంచాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలావేసి కూర్చున్నాడు. అవకాశం వచ్చింది. చంకలు కొట్టుకొన్నాడు. అచ్చం ముమ్మూర్తులారూపం మార్చుకొని కుండీలుడిలా తయారయ్యి సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి తలుపుతట్టాడు. విశాలాక్షి తలుపుతీసి ఆశ్చర్యపోయింది. కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు అందించి నెలపడుతుంది అన్నారు ప్రొద్దున్నే కదా వెళ్ళారు సాయం కాలానికే తిరిగి వచ్చారు ఇదేమిటి? అంది. తాను ఎవరిని కలుసుకోడానికి బయలుదేరాడో అతడే దారిలో ఎదురయ్యాడని ఇప్పుడు కాదు నీ పని అవ్వాలంటే ఒక నెల తరువాత రమ్మన్నాడని అందుచేత అప్పుడు బయలు దేరి వెడతానని ఇప్పుడు వెనక్కి వచ్చేసాను అనీ ఏదో కధ అల్లి చెప్పాడు మాయా కుండీలుడు. పాపం విశాలాక్షి నమ్మేసింది. అదృష్టం బాగుండి ఆయనెవరో దారిలో కలిసారు కనుక సరిపోయింది లేకపోతే రానూపోనూ శ్రమ మిగిలేది పోనీలెండి. మంచిపనే జరిగింది. స్నానానికి లేవండి రెండు మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందురుగాని ప్రొద్దుట నుండి నడిచినడిచి అలిసిపోయినట్లున్నారు అంటూ వంటింట్లోకి దారితీసింది.


Friday 12 May 2023

శ్రీదత్త పురాణము (136)

 


విష్ణుదత్తుడు సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు. మళ్ళీ ఎప్పటి లాగానే తన దైనందిన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి మంచి పనులు ఇతడు ఇంకా చాలా చేసాడు. దత్తుడి అనుగ్రహం వల్ల ఇతడిలో అభిమానంగానీ అహంకారంగానీ ఏనాడూ ప్రవేశింపలేదు. మంత్రశక్తితో అద్భుతాలు చెయ్యగలిగినా అతడు అలా చెయ్యలేదు. తక్కిన శాస్త్రాల పట్ల విశ్వాసాన్ని పోగొట్టలేదు. లోకంలో స్థిరపడిన పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తింపలేదు. శాస్త్రప్రకారం ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయనీ సత్కర్మాచరణమే అన్నింటికి ఉత్తమోత్తమమనీ లోకులు గుర్తించేట్లు చేసాడే తప్ప తన మహిమను చాటుకునే ప్రయత్నం ఏమాత్రమూ చేయలేదు.


దేవేంద్రా నేను రచించి శిష్యులకు బోధిస్తున్న ఈ ఆయుర్వేద మంత్రతంత్ర శాస్త్రాలు సంగీత నృత్యాదికళలూ - ఇవన్నీ పరంపరగా దైవభక్తిని ప్రోగు చేసేవేనని అవిద్యను నశింపజేసేవేననీ ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఇవి భోగ పరాలుకావు. మోహకారకాలు కావు. ఇవి అర్ధ సంపాదన పరాలు కావు. శత్రువులను చంపడానికో, అభిచారక్రియలు (చేతబడులు) చెయ్యడానికో వశీకరణాది క్షుద్రవిద్యలు సంపాదించడానికో నేను ఈ శాస్త్రాలు లోకానికి అందించడం లేదు. వీటి పరమ ప్రయోజనం అదికాదు.


విషయలోలుడైన జనుల్ని మంచి మాటలతో మళ్ళించి తత్వనిష్టుల్ని చెయ్యడం ఒక్కటే శాస్త్రాల యొక్క చివర ఫలం. ఇలా క్రమంలో శుద్ధి పొందాక తత్వమసిలాంటి మహావాక్యాలను వారికి భోదిస్తే హృదయాల్లోకి ఎక్కుతాయి. వేదాంత భావన వారిలో స్థిరపడుతుంది. పీడాతురునికి ముందు రోగాలు నయంజేసి అటుపైన మంత్రోపదేశం చేసాడు విష్ణు దత్తయోగి. అందుకని అతడు కృతకృత్యుడు కాగలిగాడు. రోగాలు తగ్గనంత సేపూ ఎవరికీ ఏ వేదాంతమూ తలకెక్కదు. అందుచేత మూఢలోకానికి సద్గురువు అవసరం ఎంతైనావుంది. అతను క్రమక్రమంగా వారికి అంతశ్శుద్ధిని కలిగించి మహా వాక్యాలను ఉపదేశించి స్వస్వరూప పరిజ్ఞానంతో ఆనందోపలబ్ధిని ప్రసాదిస్తాడు. ఈ మార్గంలో క్షణంలో కృతకృత్యుడు కాగలుగుతాడు. ఇక్కడ మరో ఉదాహరణ చెబుతాను విను. అనగ అనగా ఒక విప్రకాంత బిడ్డడికి జ్వరం వస్తే గృహవైద్యం చేస్తుంది. కషాయం పాత్రలో పోసి ఇచ్చి తాగ మంటుంది. బతిమాలుతుంది. బెదిరిస్తుంది. భయపెడుతుంది. ఆ బిడ్డడు త్రాగడం లేదు. ససేమిరా త్రాగనని అంటున్నాడు. కటికి చేదు కషాయాన్ని ఎలా త్రాగుతాడు? అది మందు అనీ త్రాగితే జ్వరం తగ్గుతుందనీ వాడికేమి తెలుసు? చెబితే మాత్రం గ్రహించగల బుద్ధి వికాసం అతనికి లేదు. త్రాగను అంటే త్రాగను అంటున్నాడు. ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. లోపలికి వెళ్ళి ఇంత పటికబెల్లం పట్టుకొచ్చింది. కషాయం త్రాగు పటికబెల్లం పెడతానని అంది. ఆ బిడ్డడు వెంటనే త్రాగేశాడు. తల్లి ఆ తెచ్చిన పటిక బెల్లంలోనే పిసరంత పెట్టి పంపించింది. మళ్ళీ వచ్చి అడిగితే ఇంకొంచెం పెట్టింది. ఇలా కొంచెం కొంచెం పెట్టి ఆ బిడ్డడు ఆట పాటల్లో పడిపోయే సరికి పటిక బెల్లాన్ని మొత్తం దాచేసింది.


సురేశ్వరా ఈ శాస్త్రాలు ఈ కళలూ కలకండ ముక్కల్లాంటివి. తత్వోపదేశమనే కషాయాన్ని త్రాగడానికి అవి ఉపకరిస్తాయి. కైవల్యమే అసలుసిసలైన ఆరోగ్యం. అదే చివరఫలం.


Thursday 11 May 2023

శ్రీదత్త పురాణము (135)

 


దత్తస్వామి దయవల్ల నేను ఏదయినా చెయ్యగలను. కానీ చేసిన పని లోకానుగుణంగా వుండాలి. లోక విరుద్ధంగా చెయ్యడం సజ్జనపద్ధతి కాదు. అందుచేత ఈ రోగిని హఠాత్తుగా కాకుండా క్రమక్రమంగా ఆరోగ్యవంతుడ్ని చేస్తాను అని ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ ఇలా అన్నాడు. మీకు తెలియనిది కాదు. రోగాలు దుష్కర్మల ఫలాలుగా వస్తాయి. వాటిని గుర్తించి ప్రాయచ్ఛిత్తం చేసుకోవడమే సరి అయిన మందు. అసలు సిసలైన వైద్యం. అందుచేత ఇతడి కర్మవిపాకం గురించి ఆలోచించాలి. ప్రాయశ్చిత్తాలను ఇతడి భార్య ఆచరించవలసి వుంటుంది. బ్రహ్మ హత్యాపాతకం చేస్తే క్షయరోగం వస్తుందంటారు. దీనికి ప్రాయశ్చిత్తంగా పన్నెండు సంవత్సరాల వ్రతముంది. వాత గుల్యానికి ఆరేళ్ళ వ్రతం, హరిద్రోహానికి ఫలంగా జలోదరం సంక్రమిస్తుంది. ఇది చాలా కఠినమైన రోగం. దీనికీ పన్నెండేళ్ళ వ్రతమే ప్రాయశ్చిత్తం. ఇవి మూడూ ఇతన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన రోగాలు. భగంధరం దీనికి మూడేళ్ళ వ్రతం ప్రాయశ్చిత్తం. ఈ వ్రతాలన్నింటినీ ఒకేసారి ప్రారంభించవచ్చు. సగంలోకి వచ్చేసరికి రోగాలు సగం తగ్గుతాయి. పూర్తిగా వ్రతాలు సమాస్తి అయ్యేసరికి రోగాలు నయమవుతాయి.


విష్ణుదత్తుడు చెప్పిన దానికి అందరూ అంగీకరించారు. సుమేధకు సహకరిస్తామని మాట ఇచ్చారు. ఆ ఇల్లాలు వెంటనే వ్రతాచరణ మొదలు పెట్టింది. ఆ రోజే గుణం కనబడింది. మూడేళ్ళు అయ్యేసరికి పూర్తిగా భగందరం తగ్గిపోయింది. ఆరేళ్ళ అయ్యేసరికి వాతగుల్మం అంతరించిపోయింది. పన్నెండు ఏళ్లకి క్షయ జలోదరాలు పూర్తిగా ఉపశమించాయి. పీడాతురుడు కోలుకున్నాడు. ముఖంలోకి తేజస్సు కనిపించింది. విష్ణుదత్తుడు అప్పుడప్పుడు ఏవో రసగుళికలు ఇస్తూ వుండేవాడు. వాటితో జీర్ణజ్వరమూ అతిసారమూ ఉపశమించాయి. అంతా కుదుటబడిందని వార్త అందగానే విష్ణుదత్తుడు బయలుదేరి వచ్చాడు. పీడాతురుడి హృదయం మీద తన చెయ్యి అన్చి ఆనాడు దత్తస్వామి తనకు ఉపదేశించిన మహామంత్రం జపించాడు. పీడాతురుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో లేచి కూర్చున్నాడు. వారింట ధన ధాన్య సమృద్ధి ఏర్పడింది. దంపతుల మనస్సులో హరి భక్తి కుదురుకొంది. వారి బలవంతం మీద విష్ణుదత్తుడు వారింట్లో మూడు రోజులు వున్నాడు. సాటి విప్రులతో గోష్టి కార్యక్రమాలతో హాయిగా గడిపాడు. ఆ దంపతులు ఇతడ్ని కన్న తండ్రిలా చూసుకున్నారు. ఇతడూ వారిపట్ల అలాంటి ప్రేమనే చూపించాడు. మూడురోజులూ మూడు క్షణాల్లా గడిచిపోయాయి. ఆ మర్నాటి ఉదయం నూతన వస్త్రాలతో పూలదండలతో విష్ణుదత్తుడ్ని పూజించి ఆ దంపతులు ఆశీస్సులందుకొని ప్రేమగా అర్ధంగా వీడ్కోలు పలికారు.


Wednesday 10 May 2023

శ్రీదత్త పురాణము (134)

 


గోదావరీతీరంలో కుశావర్తం అనే వూరు వుంది. అది ఒక బ్రాహ్మణ అగ్రహారం, అక్కడి వారంతా వేదవేదాంగవేత్తలూ సకల శాస్త్రపారంగతులూనూ. వారి మధ్యలో పాపం ఒక నష్టజాతకుడు వున్నాడు. అతడి పేరే పీడాతురుడు. పుట్టడమే వాతగుల్మరోగంతో ఎనిమిదో ఏట క్షయరోగం ఆ పైన మూడేళ్ళకి జలోదరం మరో ఏడాదికి జీర్ణజ్వరం. వీటికి తోడు ఆరు నెలలకి అతిసారం నాలుగునెలలకి భగంధరం ఇలా నానారోగాలు అతడ్ని పట్టి పీడిస్తున్నాయి. చివరికి త్రిదోషం సంక్రమించి ఇవ్వాళో, రేపో అన్నట్లు వుంది అతని పరిస్థితి. ఇంతచేసి అతనికి ఇరవై ఏళ్లు. అతనికొక భార్య. పాపం ఆ పిల్లవయస్సు పదహారు సంవత్సరాలు. పేరు సుమేధ. పేద యింటి పిల్ల. అభం శుభం తెలియని పిల్ల. ఏడవడం తప్ప ఏమీ తెలీదు. ఆ రోగిష్టి వాడికి సకలోపచారాలు చేస్తుంది. విసుక్కోకుండా కనుక్కోకుండా శ్రద్ధగా సేవలు చేస్తోంది. ఎవరు ఏమందుచెబితే అదల్లాకొని తెచ్చి వేస్తూ వుండేది. ప్రతీ వైద్యుడికీ చూపిస్తోంది. డబ్బుకు ముందు వెనుకా చూడడం లేదు. అత్తమామలు హరియంటూ ఇచ్చి పోయిన ఆస్తి అంతా ఈ వైద్యాలకే హరించుకుపోయింది. దిక్కు తోచని పరిస్థితి. రోజు గడవని స్థితి. వూరివాళ్ళు చెయ్యగలిగినంత కాలం సహాయం చేసారు. ఇక వీడి రోగాలు తగ్గేవికావు. వీళ్ళ సంసారం బాగుపడేది లేదు అని వదిలేసారు. సరిగ్గా ఈ దశలోనే విష్ణుదత్తుడి అద్భుత మహిమ గురించి వింది ఆ లేత ఇల్లాలు. కన్న తండ్రిని తోడుతీసుకొని విష్ణు దత్తుని ఇంటికెళ్ళి వలవలా ఏడుస్తూ తన దుస్థితి అంతా చెప్పుకొని పతిభిక్ష పెట్టమని ప్రార్ధించింది. విష్ణుదత్తుడు ఓదార్పు మాటలతో ధైర్యం చెప్పాడు. తన నిత్యాగ్నిహోత్రాన్ని శిష్యునికి అప్పగించి వారి వెంట కాలినడకన కుశావర్తానికి చేరుకొని పీడాతురుణ్ని చూసాడు. ప్రాణాలు ఉగ్గబట్టి మూసిన కన్ను తెరవకుండా పడివున్నాడు. వెంటనే విష్ణుదత్తుడు ఆ వూరి వాళ్ళందర్నీ సమావేశపరిచి మీ బంధువు ఈ పీడాతురుని పరిస్థితి ఇలా వుంది. ఇప్పుడు ఏమి చెయ్యాలో దయజేసి ఆలోచించండి. అందరూ ఏమైనా చెప్పవలసింది ఉంటే నాకు తెలియజేయ్యండి అని సవినయంగా విజ్ఞప్తి చేసాడు.


విప్రోత్తమా! అన్నింటికీ నీవే ప్రమాణం. నీవు ఏది చెబితే అది. ఏది చేస్తే అది. మేమంతా ఇంతకాలమూ మా శక్తి మేరకు ఏవేవో యత్నాలు చేసాం. ఏదీ ఫలించలేదు. ఇప్పుడు నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాం అని బ్రాహ్మణులంతా ఏక కంఠంతో పలికారు. విప్రులారా ! మీరు భారమంతా నా మీద పెడుతున్నారు. నా మనసులోని మాట చెబుతున్నాను వినండి.


Tuesday 9 May 2023

శ్రీదత్త పురాణము (133)

 


పీడాతుర వృత్తాంతం


బృహస్పతి చెబుతూ వుంటే శ్రద్ధగా వింటున్న ఇంద్రుడికి ఒక సందేహం వచ్చింది. ఇన్ని దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు తన శేష జీవితాన్ని ఎలా గడిపాడు? ఆ శక్తుల్ని సద్వినియోగం చేసాడా? తెలుసుకోవాలి అనిపించింది. గురువర్యా తక్కిన ఉదాహరణల్ని తరువాత చెబుదురుగాని ముందు ఈ విష్ణుదత్తుడి కధ పూర్తి చెయ్యండి. వరాలు పొందిన తరువాత అతడి జీవితం ఎలా సాగింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది చెప్పండి - అని అడిగాడు. ఇంద్రుడి ఆంతర్యం దేవగురువుకి అర్ధం అయ్యింది. చిన్నగా నవ్వి అలాగేనంటూ ప్రారంభించాడు.


శచీవల్లభా! అత్యంత దుర్లభులైన దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు సత్వగుణ సంపన్నుడిగానే జీవితాన్ని గడిపాడు. పెద్దగా పొంగిపోలేదు. విర్రవీగలేదు. గర్వించలేదు. శాంతుడూ, దాంతుడూ, సదాచారుడూ, సుశీలుడూ, దయాళుడు గానే జీవించాడు. ఇతరుల గుణాలను మెచ్చుకుంటూ అందరికీ మిత్రుడై, కవియై, సర్వజన ప్రియుడై ఎవరికీ ఏ ద్రోహమూ చేయనివాడై మునుపటిలాగానే తన బ్రతుకేదో తాము బ్రతుకుతూ జీవితం గడుపుతున్నాడు. తన ప్రభావాన్ని దివ్యశక్తుల్ని ఎవరికీ ప్రదర్శించలేదు ప్రచారం చేసుకోలేదు. మట్టిగప్పిన మాణిక్యంలాగానే వుండిపోయాడు.


అయితేనేమి దాగుతుందా? మంచీ దాగదు, చెడూ దాగదు. అతడి ప్రభావం ఆ నోటా ఈ నోటా పడి నెమ్మదినెమ్మదిగా లోకానికి తెలిసిపోయింది. గ్రామాలు, పట్టణాలు చివరికి రాష్ట్రం అంతా వ్యాపించి మొత్తం భూగోళం అంతా తెలిసిపోయింది. విష్ణుమూర్తి మహిమలాగా విష్ణుదత్తుడి కీర్తి దశదిశలా వ్యాపించింది. ఇంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు సంగతి వస్తుంది విను.


Monday 8 May 2023

శ్రీదత్త పురాణము (132)

 


బ్రాహ్మణోత్తమా! విష్ణు దత్తా! నీకు పూర్తిగా ప్రసన్నున్ని అయ్యాను. వరం కోరుకో. నా భక్తుడవైన నీ వాంఛితం తీరుస్తాను. దివ్యమైన నా అష్టోత్తర శతనామావళిని నీవు ఈ విధంగా ప్రకాశింపజేసావు, సులభసుందరశైలిలో అందరికీ విన్నంతనే అర్ధం అయ్యే భాషలో నా తత్వాన్ని నా రహస్యాన్ని ఆవిష్కరించావు. అతి పురాతనమైన ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించిన వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగసిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు. నిజంగా పతియే దైవముగా కలది. ఈమె ప్రభావం ఎంతటిదో ఈనాడు ప్రత్యక్షంగా చూశాను. ఈమె సమస్త కళ్యాణగుణ సంపన్న. నువ్వు సర్వవిద్యానిధివి. మీ దంపతులు ఇద్దరూ ఒకరికొకరు తగినవారు. సమానశీలురు. నాకు అత్యంతమూ ఆనందదాయకులు.


దంపతులారా ! నా అనుగ్రహంవల్ల మీరు జీవితాంతమూ సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగవిద్యాతత్పరులై పరమానందాన్ని పొందండి. చివరికి పరమానంద స్వరూపమైన నాతో లీనమవ్వండి. ద్విజవర్యా! నీకొక మంత్రాన్ని - ఉపదేశిస్తాను. స్వీకరించు. దీనివల్ల నువ్వు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తే వారికల్లా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ధనధాన్య యశఃశ్రీ సమృద్దులూ పుత్రపాత్రాభివృద్ధి, వంశాభివృద్ధి ఒకటేమిటి వారు కోరుకున్నవన్నీ క్షణంలో సిద్ధిస్తాయి. ఇందులో సందేహం లేదు.


నువ్వు ఈరోజు నిర్వహించిన శ్రాద్ధవిధివల్ల నీ పితృదేవతలందరూ కర్మపాశ విముక్తులై శాశ్వతమైన బ్రహ్మలోక నివాసం పొందారు. అత్యంత దుర్లభమైన ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను.


నీ యింటి ముంగిట రావిచెట్టు మీద ఉంటున్న రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేసాడు. నేటి శ్రాద్ధవిధిలో ఉచ్ఛిష్టపాత్రాన్నాన్ని తిని అతడు ముక్తుడవుతాడు. స్వర్గలోకం చేరుకుంటాడు. ఇలా పలికి దేవదేవుడు ఆ విష్ణుదత్తుని చెవిలో దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. అతడు దాన్ని తన భార్యకు ఉపదేశించాడు. ఇద్దరూ ఏకాగ్రచిత్తంతో జపించారు. దత్తదేవుడు తన అమృత హస్తాన్ని వారి శిరస్సుల పై వుంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమైనాడు.  

సూర్యభగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడై ఆదంపతులకు దివ్య స్థితిని అనుగ్రహించాడు. కామాగమనం కలిగిన దివ్య విమానాన్ని బహుకరించాడు. తలుచుకున్న వెంటనే దర్శనం ఇస్తానని వరమూ అనుగ్రహమూ ఇచ్చాడు. దంపతులిద్దరూ సాష్టాంగపడ్డారు. కర్మసాక్షి వినువీధికి చేరుకున్నాడు. ఇలవేల్పు అగ్నిదేవుడు కూడా దంపతులకు వరాలు అనుగ్రహించాడు. అమ్మా! నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతాను. నువ్వు ఏదికోరితే అది నెరవేరుస్తాను. విష్ణుదత్తా నువ్వు నన్ను నిత్యమూ యధావిధిగా ఆరాధిస్తున్నావు కనుక నీరు కర్మ సిద్ధిని అనుగ్రహిస్తున్నాను. నువ్వు మహాతేజస్విని- అనుల్లంఘశాసకుడవీ- నిత్య సుఖినీ- పర్వదేవా సుఖ ప్రదుడవు అగుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యాగ కుండంలోకి ప్రవేశించాడు. రాక్షసుడు వచ్చి ఉచ్చిష్టాన్ని భక్తితో భుజించి రాక్షసరూపాన్ని విడిచిపెట్టి దివ్య సుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానం ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు.


Sunday 7 May 2023

శ్రీదత్త పురాణము (131)

 


విష్ణు దత్త - దత్త స్తుతి


దత్తాత్రేయం హరికృష్ణ మున్మాదం ప్రణతోస్మ్యహం 

ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరమ్ || 

పిశాచ రూపిణం విష్ణుం వందేఽహం జ్ఞాన సాగరమ్ | 

యోగినం భోగినం నగ్న మనసూయాత్మ జం కవిమ్ ॥ 

భోగ మోక్ష ప్రదం వందే సర్వదేవ స్వరూపిణమ్ । 

ఉరుక్రమం విశాలాక్షం పరమానందవిగ్రహమ్ || 

వరదం దేవదేవేశం కార్తవీర్య వరప్రదమ్ 

నానారూప ధరం హృద్యం భక్త చింతామణిం గురుమ్ ॥ 

విశ్వవింద్య పదాం భోజం యోగిహృత్ పద్మవాసినమ్ । 

ప్రణతార్తి పారం గూఢం మత్సితాచార చేష్టితమ్ ||

మితాచారం మితాహారం భక్ష్యాభక్ష్య వివర్జితమ్ । 

ప్రమాణం ప్రాణ నిలయం సర్వాధారం నతోస్మ్యహమ్ ||

సిద్ధసాధకం సంసేవ్యం కపిలం కృష్ణపింగళమ్| 

విప్రవర్యం వేదవిదం వేదవేద్యం నియత్సమమ్ || 

పరాశక్తి పదాక్లిష్టం రాజరాజ్య ప్రదం శివమ్ ।

శుభదం సుందరగ్రీవం సుశీలం శాంత విగ్రహమ్ ॥

యోగినం రామయాస్పృష్టం రామరామం రమాప్రియమ్। 

ప్రణతోస్మి మహాదేవం శరణ్యం భక్తవత్సలమ్ ॥ 

వీరంవరేణ్యం ఋషభం వృషాచారం వృషక్రియమ్ । 

అలిప్త మనఘం మేద్యమనాది మగుణం పరమ్ || 

అనేక మేక మీశాన మనంతమని కేతనమ్ | 

అధ్యక్ష మసురారాతిం శమంశాంతం సనాతనమ్ ॥ 

గుహ్యం గభీరం గహనం గుణజ్ఞం గహ్వరప్రియమ్ | 

శ్రీదం శ్రీశం శ్రీనివాసం శ్రీ వత్సాంకం పరాయణమ్ | 

శ్రీ జపంతం జపతాం వంద్యం జయంతం విజయప్రదమ్ । 

జీవనం జగతస్వేతుల జానానం (= సర్వజ్ఞమ్) జాతవేదసమ్ | 

యజ్ఞమిజ్యం యజ్ఞభుజంయజ్ఞేశం యాజకంయజుః | 

యష్టారం ఫలదంవందే సాష్టాంగం పరయాముదా ॥


Saturday 6 May 2023

శ్రీదత్త పురాణము (130)

 


ఈ ప్రార్ధనకు సంబరపడ్డాడు అంబరవిహరి. సౌమ్యుడై విప్రరూపంలో దర్శనమిచ్చాడు. సాధ్వీ ఏమి ఆజ్ఞ ? అన్నాడు. ఆబ్ధికంలో రెండవ భోక్తగా కూర్చోవాలి నాయనా - అంది. సరే అన్నాడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాద్యాదులు అందుకొని రెండో పీట మీద కూర్చున్నాడు. అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు. సాధ్వీ! విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాము. బాగుంది. మరి పితృదేవస్థానంలో కూర్చోడానికి మాకు సాటి మనిషి ఏడి? అని అడిగారు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ.


స్వామి తొందరపడకండి ఇపుడే వస్తాను అంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్ళింది. ఇలవేల్పు అగ్ని దేవుడ్ని ప్రార్ధించింది. సర్వశుచీ! సర్వభక్షకా! లే మరో రూపం ధరించు. త్వరగా రా. శ్రాద్ధభోక్తగా వచ్చి కూర్చున దత్తస్వామి నీ కోసం ఎదురు చూస్తూ వున్నాడు. తమకు సాటి వచ్చే మూడవ వాడివి నువ్వేనని భావిస్తున్నాడు. సురోత్తమా - సురవర్యా- వైశ్వానరా హవిర్భుజా అగ్నిముఖావై దేవాః అంటుంది వేదం. దేవతలకు నీవు ముఖ స్థానీయుడవు - ధూమకేతూ- గృహపతీ- కర్మాధ్యక్షా- నీకు ఇదే నమస్కరిస్తున్నాను అనుగ్రహించు.


ఆ పతివ్రత ఇలా ప్రార్ధించేసరికి ఒకానొక అగ్ని గుండం నుండి ఒక అంశతో అగ్నిదేవుడు ఆవిర్భవించాడు. మరొక అంశతో కుండంలోనే వున్నాడు. వచ్చిన అగ్ని దేవునికి కూడ అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు విష్ణుదత్తుడు. సరాసరి పీట మీదకెళ్ళి కూర్చున్నాడు. అరిటాకు సిద్దంచేసాడు విష్ణుదత్తుడు. ఆ పాతివ్రత్య మహత్మ్యాన్ని చూస్తున్న దత్తస్వామి ఆనందం పొందాడు. సూర్యాగ్నులూ దత్తదేవుడూ ఆహుతులై ఆయాస్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు. ఇంతటి ఉత్తము విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురూ శ్రాద్ధవిధి నియమాలకు అనుగుణంగా భోక్తృత్వం నెరపి సంతుష్టులై తృప్తాస్మాః అని ముక్త కంఠంతో పలికారు. విష్ణుదత్తుడి పితృపితామహ, ప్రపితామహులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు. సుశీలా విష్ణు దత్తులు సాష్టాంగపడ్డారు. లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు. అప్పుడు ఆనందంతో భక్తిశ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుడ్ని స్తుతించాడు.


Friday 5 May 2023

శ్రీదత్త పురాణము (129)

 


ఓరి మూఢుడా నన్ను ఏడిపించుకుతింటావేమిరా? నిన్ను చంపేస్తాను నీకసలు నాతో పని ఏమిటి? - అని వికృతాకారుడు కర్ణకఠోరంగా గద్దించాడు. అయినాసరే తన పని సాధించుకోవాలనే పట్టుదలతో విష్ణుదత్తుడు పాదాలు వదలలేదు. అప్పటికి స్వామి ప్రసన్నుడయ్యాడు. వికృతాకారం వదిలేసాడు. మృదువుగా శ్రావ్యంగా ఇలా అన్నాడు. విష్ణుదత్తా! ఈ వికృతాకారుడితో నీకు పని ఏమిటయ్యా? నాకోసం మూడుమార్లు వచ్చావు అన్నాడు. స్వరంలో వినిపించిన మార్ధవం మాధుర్యం విష్ణుదత్తుణ్ని పులకింపజేశాయి. వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లయ్యింది. పట్టుకున్న కాళ్ళు, నేలా రమణీయంగా మారిపోయాయి. విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరచాడు. ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచు వ్రేళ్లాడుతూ కనిపించింది. నల్ల కలువలు లాంటి పాద పద్మాలు తనచేతుల్లో వున్నాయి. ఆ పాదాలపై శిరస్సు ఆన్చి గబగబా మూడుమార్లు కళ్ళకి అద్దుకున్నాడు. లేచి నిలబడ్డాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖారవిందంతో పర్ణశాలముందు గున్నమావిచెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు దివ్యాభరణ, దివ్యాంబరములు ధరించిన వాడు, తులసీదళదామ విరాజితుడు, పుసుమాలికా సమలంకృతుడు, పారిజాత పరిమళాలు వెదజల్లుతూ దర్శనమిచ్చాడు. కనుచూపు మేరలో ఎక్కడా వెలివాడ లేదు. మాంసపు ముద్దలూ లేవు. కంటికి ఇంపుగొల్పే పచ్చని ఆశ్రమ వాతావరణం పర్ణశాలలు, కుటీరాలు. శుచియై శాంతుడై ఎట్టఎదుట ఆశీనుడైవున్న దత్తస్వామికి మళ్ళీ మళ్ళీ సాష్టాంగ దండప్రణామాలు చేసి ఆనందభాష్పములతో దోసిలి యొగ్గి ఆనందభాష్పములతో నిండిన కళ్ళను తుడుచుకొని గద్గద స్వరంతో ఇలా పలికాడు.


మహేశా! ఈ జగతీ తలంలో నేను ధన్యుణ్ని. నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. యోగి వంద్య పదార విందుడవైన నీ దర్శన భాగ్యం కలిగింది - అని మరొకసారి పాదాల మీద పడ్డాడు. విష్ణు దత్తా నాతో నీ పనేమిటో చెప్పావు కాదు అన్నాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పిన మాటల జ్ఞాపకం వచ్చాయి. అడగవలసింది ఏదో స్ఫురించింది. స్వామి ఈ రోజు మా తండ్రి గారి ఆబ్ధికం. తమరిని భోక్తగా నియంత్రించుకుంటాను. తమరు తప్పకుండా రావాలి - అన్నాడు. విష్ణుదత్తుడి అభ్యర్ధననూ స్వామి అంగీకరించారు. అలాగే తప్పక వస్తాను. నువ్వు ముందు నడువు కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీవెనుకనే నీ ఇంటికివస్తాను. నీ ప్రయత్నం సఫలం అయ్యింది కదా ఇకపద అన్నారు దత్తస్వామి.


విష్ణుదత్తుడు పరుగుపరుగున ఇంటికి చేరుకున్నాడు. పట్టరాని ఆనందంతో ఒగురుస్తూ సుశీలమ్మకు జరిగిందంతా పూసగ్రుచ్చినట్లు వివరించాడు. శ్రాద్ధవిధికి వంట సిద్ధం చెయ్యమన్నాడు. అవిడ కూడా చాలా సంబర పడింది. స్నానం చేసింది. తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోయింది. విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తున్నాడు. సరిగ్గా వంట అయ్యింది. దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమైనాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలిచ్చి లోపలికి తీసుకొచ్చాడు. మడి బట్టలు కట్టుకుని పీట మీద కూర్చున్నాడు. సుశీల అరిటాకులందించింది. సాధ్వీ! నా సహపంక్తికి మిగతా ఇద్దరూ ఏరి? నాలాటి వాళ్ళని ఎవరిని పిలిచారు? అని అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నించాడు. అప్పటికి గాని గుర్తురాలేదు, మిగతా ఇద్దరినీ పిలవలేదని. గాబరాపడకుండా, గంభీరంగా సమాధానం చెప్పింది, సుశీల. దేవదేవా నీతో సమానుడైన భోక్త ఉన్నాడు, వస్తున్నాడు అంటూ వంటింటిలోంచి పెరట్లోకి వచ్చింది. ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు ధగధగలాడుతు కనిపించాడు. సుశీల సూర్యునికి నమస్కరించి సూర్యదేవా జగదేకబంధు, సర్వాత్మకా సర్వదీపాక్షి నమోనమః. రవి ప్రభూ! అచేతనమైన ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు. సర్వదష్టపూ సర్వాత్మకుడవూ పరాత్పరుడవూ అయిన నిన్ను నీను ప్రత్యక్షంగా పిలివవలసింది ఏముంది? మాయాశక్తి సంపన్నుడైన నువ్వు ఈ వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిచ్చేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుచున్నావు..


Thursday 4 May 2023

శ్రీదత్త పురాణము (128)

 


విష్ణుదత్తుడు నమ్మలేకపోయాడు. ఇంత అనాచారుడా తన స్వామి. అబ్బే ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించడానికి ఇలా అన్నాడు అని అనుకున్నాడు. ఇలా తనలో తాను తర్కించుకుంటూ వుండగానే ఆ ఉన్మత్తుడు అలా అలా దూరమై అదృశ్యమైనాడు. రాక్షసుడు తిరిగివస్తూనే ఏమి మందమతివయ్యా విష్ణుదత్తా నీకు ముందే చెప్పాను గదా స్వామి చిత్రవిచిత్ర రూపాల్లో తిరుగుతుంటాడని మరచి పోయినట్లున్నావ్. గుర్తించలేకపోయావు బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు. పోనీలే చింతించకు. మరోసారి చూపిస్తాను అని వూరడించి వెళ్ళిపోయాడు.


మరొక రోజున మరింత హడావిడిగా వచ్చాడు రాక్షసుడు. విష్ణుదత్తా రా, రా మహాదేవుడు ఇక్కడే దగ్గర్లో సంచరిస్తున్నాడు అన్నాడు. విష్ణుదత్తుడు బయలు దేరాడు. అది స్మశానం. శ్మశానవాటికలో దుమ్ము కొట్టుకొని పోయివున్న ఒక మనిషి కనిపించాడు. అతడి చుట్టూ కుక్కలు గుమికూడి తిరుగుతూ వున్నాయి. అతడి చేతిలో కపాలం వుంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా వున్నాయి. ఎముకల్ని శరీరంనిండా ఆభరణాలుగా ధరించి వున్నాడు. స్వామికి ఇది మరొకరూపం కాబోలు అనుకొని విష్ణుదత్తుడు దగ్గరికి చేరబోయాడు. ఆ పెద్దమనిషి కస్సుమన్నాడు. అందుబాటులో వున్న పొడవాటి ఎముక ముక్కను తీసికొని విష్ణుదత్తున్ని కొట్టాడు. విష్ణుదత్తుడు భయపడిపోయాడు. కాళ్ళల్లో వణుకు బయలుదేరింది. కళ్ళు తిరిగాయి. పడిపోబోయి నిలద్రొక్కుకున్నాడు. బ్రతికుంటే బలుసాకు తినిబ్రతకొచ్చు అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించాడు. దూరం నుండి రాక్షసుడు ఇదంతా చూస్తున్నాడు. రాక్షసుడు అయ్యో ఈ వెర్రి బాపడు ఈసారి అవకాశం కూడా పోగొట్టుకున్నాడే దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం కాదు. విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకున్నాడు.


ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుణ్ణి పిలచి నీకు దత్తస్వామిని మూడు మార్లు చూపిస్తాను అని చెప్పాను గదా ఇది చివరి ప్రయత్నం నాతో రా అని తీసికెళ్ళాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరి పోసింది. ఏమైనా సరే ఈ సారి విజయం సాధించితీరాలి అని గట్టిగా చెప్పి పంపించింది. తాను దృఢంగా సంకల్పించుకున్నాడు. మూడో మారు కూడా భయపడి వెనుదిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు వుండడు. ఏమైనా ధైర్యం చెయ్యవలసిందే. స్వామి రూపం ఎంతభయంకరంగా వుండనీ జుగుప్సాకరంగా వుండనీ, నన్ను తిట్టనీ, కొట్టనీ, ఈ మారు స్వామి పాదాలు వదలనుగాక వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడి వెంటవెళ్ళాడు. గ్రామందాటారు. వెలివాడ చేరుకున్నారు. అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపించాడు. చచ్చిపోయిన గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకూ, గ్రద్ధలకూ-కుక్కలకూ, నక్కలకూ-విందులు పంచుతున్నాడు. బ్రాహ్మణోత్తమా అతడే దత్తుడు. త్వరగా వెళ్ళు వెళ్ళి కాళ్ళ మీద బడు - అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకున్నాడు. విష్ణుదత్తుడు సర్వశక్తులూ కూడ గట్టుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. గబగబా వెళ్ళి ఆ వికృతా కారుడి కాళ్ళమీద బడ్డాడు. రెండు పాదాలూ రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు కళ్ళు మూసుకొని. ఆయన ఎంత విదిలించినా వదలలేదు. మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాదినా పట్టు సడలించలేదు. తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడింది. అయినా అసహ్యించుకోలేదు. అలా పాదాలు పట్టుకొని సాష్టాంగపడ్డవాడు పడ్డట్టే ఉన్నాడు.


Wednesday 3 May 2023

శ్రీదత్త పురాణము (127)

 


వేదాంతశాస్త్రం - సదాచారం విష్ణుదత్తుడు-


సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామ మున్నది. అది చాలా ప్రసిద్ధమైన నగరం. ఆ నగరంలో విష్ణు దత్తుడు అనే బ్రాహ్మణుడు వున్నాడు. అతడు వేద శాస్త్ర పారంగతుడు. మంచి వైష్ణవుడు. అతడి ధర్మపత్ని పేరు సుశీల పేరుకు తగ్గ పతివ్రత. వీళ్ళ ఇంటి ఆవరణలో ఒక రావిచెట్టు వుంది (ఆశ్వత్థ వృక్షం) దాని మీద ఒక భయంకర రాక్షసుడు నివాసముంటున్నాడు. విష్ణుదత్తుడు రోజూ నిత్యకర్మానుష్టానాలు అన్నీ పూర్తి చేసుకొని రోజూ భోజనం చేసే ముందు భూత బలిని (వైశ్వదేవం) ఇంటి ఆవరణలో గల రావిచెట్టు క్రింద సమర్పిస్తుండేవాడు. రోజూ విష్ణుదత్తుడు వేసే భూతబలిని చెట్టుపై ఉన్న రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూవుండేవాడు. రోజూ విష్ణుదత్తుడు వేసే భూతబలి తింటున్నందువల్ల ఆ బ్రహ్మ రాక్షసునిలో తమో గుణం నశించి సాత్విక చింతన బయలు దేరింది. ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుట్టింది. ఎంతో కాలంగా తిండి పెడుతున్నాడు గదా! ఇతడికి ఏదైనా ఉపకారం చెయ్యాలనే తలంపుతో విష్ణుదత్తుడి ఎదుట ప్రసన్న రూపంతో ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు. విప్రవర్యావిష్ణుదత్తా! రోజూ నువ్వు పెడుతున్న అన్నం తింటున్నాను. సంతృప్తి చెందాను. నీకు ఏదైనా ప్రత్యుపకారం చేద్దామని అనిపించింది. ఏదైనా చెయ్యగల సమర్థుల్లే కనుక ఏం ఉపకారం చెయ్యమంటావో చెప్పు అన్నాడు. విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి రాక్షసోత్తమా, చాలాకాలంగా మాకు తీరని కోరిక ఒకటి వుండిపోయింది. దత్త స్వామి ఈ పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ వుంటారని వినడమేగాని ఎప్పుడూ వారి దర్శనం కాలేదు. దయచేసి వారి నొక్కసారి చూపించు.


అప్పుడా రాక్షసుడు చాలా మంచికోరిక కోరావు, తప్పకుండా చూపిస్తాను. అయితే ఒక్క షరతు, దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు మూడు మార్లు చూపించే ప్రయత్నం చేస్తా. ఆయన చిత్రవిచిత్ర రూపాల్లో సంచరిస్తూ వుంటారు. గుర్తించ గలిగి పట్టుకోగలిగితే నీ అదృష్టం- ఈ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరించాడు. అయితే సిద్ధంగా వుండు. స్వామివారు ఆ చుట్టు ప్రక్కలలో తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. రా, రా అన్నాడు. పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్ళాడు. మద్యమాంసాలు విక్రయించే వీధిలో ఉన్మత్తవేషంలో ఒక వ్యక్తి కనిపించాడు. తాగిన మత్తులో దుమ్ముగొట్టుకొనిపోయి పిచ్చివాని రూపంలో వున్న ఆ వ్యక్తిని చూపించి అతడే దత్తస్వామి వెళ్ళి దర్శించు అని రాక్షసుడు వెళ్ళిపోయాడు. 

Tuesday 2 May 2023

శ్రీదత్త పురాణము (126)

 


వేదశర్మ అపుకోలేని దుఃఖంతో భళ్ళుమన్నాడు. భిక్షువు పాదాల మీద పడ్డాడు. తన ఒక్కగానొక్క కొడుక్కి పట్టిన దురవస్థను చెప్పి వాడి దుఃఖాన్ని తొలగించమని అర్ధించాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. ఏడు మంత్రాలను బీజాక్షర సహితంగా ఉపదేశించాడు. నీ కొడుకుని ఏడుగురు బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు. రోజుకొక మంత్రాన్ని జపించి ఆ ఉదకాన్ని బిడ్డడి మీద జల్లు, ఒక్కొక్క రాక్షసుడూ వదిలిపోతాడు. ఒకేసారి ఏడుగురునీ వెళ్ళగొట్టడం ఏ మంత్రానికీ సాధ్యంకాదు. అదీగాక - ఒక మూఢుణ్నీ విద్వాంసుణ్ని చెయ్యాలంటే అన్ని శాస్త్రాలూ ఒకేసారి నేర్పుతామా? కొన్ని అవిద్యల్ని న్యాయశాస్త్రంతో, కొన్నింటిని మీమాంసాశాస్త్రంతో, సాంఖ్యంతో కొన్నింటిని పతంజలి యోగ విద్యతో కొన్నింటిని - ఇలా క్రమక్రమంగా అవిద్యావాసనలను పూర్తిగా తొలగించి చిత్త పరిశుద్ధి చేసి అప్పుడుగదా బ్రహ్మవిద్యను ఉపదేశించాలి. అలాగే ఈ బ్రహ్మరాక్షసుల్ని కూడా ఒక్కొక్కరుగానే వెళ్ళగొట్టాలి. ఆటుపైని నీ బిడ్డడు నీ అంతటి పండితుడూ కర్మతుడూ అవుతాడు. ఇక వెళ్ళు- అన్నాడు.


విప్రుడు పునఃపునః నమస్కరించి ఇంటి దారి పట్టాడు. ఇందాక గాడిద కళేబరం కనిపించినచోట ఇప్పుడు రక్తచందన వృక్షం కనిపించింది. తన చేతిలోని మాంసపుముద్ద రక్తచందన పుష్పమయ్యింది. భిక్షువు దత్తుడే అని ధృడమయిన నమ్మకం కలిగింది. ఇంటికి వచ్చాడు. నియమ నిష్టాగరిష్ఠుడై క్రమం తప్పకుండా రోజుకు ఒక మంత్రాన్ని తీవ్రంగా జపించాడు. మొదటి రోజున దుర్ధరుడు అనే రాక్షసుడు ఘోరంగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ రోజుతో బిడ్డడు ఏడవటం మానేశాడు. ఇలాగే ఆయా మంత్రాల తేజస్సులు తట్టుకోలేక మిగతా ఆరుగురు రాక్షసులు పరుగు పరుగున పలాయనం చిత్తగించారు. ఏడవరోజుకి సుశీలుడు తన సహజమైన రూపాన్నిపొంది రోగ విముక్తుడై హాయిగా సుఖంగా తల్లిదండ్రుల్లోకి వచ్చాడు. దేవేంద్రా విన్నావు గదా! ఇప్పుడేమంటావు. మంత్ర తంత్ర శాస్త్రాలను క్షుద్ర శాస్త్రాలంటావా! లేదా పరంపరగా ముక్తిసాధనాలు అవుతాయని ఒప్పుకుంటావా! బాగా ఆలోచించి చెప్పు, ఇప్పుడు నాలుగో నిదర్శనం కూడా చెబుతాను. అది కూడా శ్రద్ధగా విను అని బృహస్పతి ఇలా చెప్తున్నాడు.


Monday 1 May 2023

శ్రీదత్త పురాణము (125)

 


మంత్ర తంత్ర శాస్త్రాలు


శచీపతి! మరొక ఉదాహరణ చెబుతాను. ఆలకించు. వెనుకటికి విశాలనగరంలో వేదశర్మ అనే ఒక పండితుండేవాడు. శాంతి (బహిరింద్రియ నిగ్రహం) దాంతి (అంతరింద్రియ నిగ్రహం) ఉన్నవాడు. అరిషడ్వర్గాలను జయించినవాడు. వేదధర్మాలను తు.చ. తప్పకుండా పాటించేవాడు. ఇతడికి ఒక కుమారుడు కలిగాడు. సుశీలుడు అని నామకరణం చేశాడు. ఆ బిడ్డడు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలు ఏమోగానీ పుట్టినప్పటి నుంచీ ఏడుగురు బ్రహ్మరాక్షసులు అతణ్ణి ఆవరించారు. ఆ ఏడుగురు పరస్పరం కలహించుకుంటూ పరస్పరం వధించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంటే సుశీలుడు విలవిలలాడిపోతూ దారుణంగా రోదించేవాడు. ఒక్కొక్కసారి విపరీతంగా నవ్వేవాడు. గంతులు వేసేవాడు. నృత్యం చేసేవాడు. ఉన్నట్టుండి మూర్ఛపోయేవాడు. ఇతడి చేష్టలన్నీ వింతగానూ విపరీతంగానూ ఉండేవి. తినటం మొదలు పెడితే భక్ష్యాభక్ష్య వివేచన లేకుండా అమితంగా తినేవాడు. మానేస్తే ఘోరంగా పస్తులుండేవాడు. ఉన్నట్టుండి ఘోరంగా రోదించేవాడు. బాధ ఏమిటో నివారణోపాయం ఏమిటో ఏమీ తెలియక వేదశర్మ దంపతులు పడే ఆవేదనకు అంతు ఉండేదికాదు. దెయ్యాలో భూతాలో పట్టుకున్నాయని వాటిని వదిలించాలనీ ఆ పండితుడు చాలా ప్రయత్నాలు చేశాడు. హోమాలు చేశాడు. వ్రతాలు చేశాడు. నోములూ తీర్థయాత్రలూ అన్నీ అయ్యాయి. ఫలించలేదు. ఏదీ


ఒక రోజున వేదశర్మ వైశ్వదేవం ముగించుకుని అతిథి కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకానొక బిక్షువు వచ్చాడు. దుమ్ముకొట్టుకుపోయినట్టు ఒళ్ళంతా బూడిద. మాసిపోయి పీలికలుగా వేలాడుతున్న గుడ్డలు. గుప్పుమని కొడుతున్న దుర్గంధం. ఈగలూ, మసములూ ముసురుతున్నాయి. అభ్యాగతః స్వయం విష్ణుం అన్నారు గదా అని ఆ బిక్షువుకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆదరాతిశయంతో ఆతిధ్యం ఇచ్చి తాము కూడ ప్రసాదం స్వీకరించివచ్చి భిక్షువుకి వింజామర నిస్తూ కూర్చున్నాడు. ఎందుకో వేదశర్మ మనస్సులో ఈయన దత్తాత్రేయుడు కాదుకదా అనే ఆలోచన మెదిలింది. దత్తదేవుడు ఈ నగరంలోనే సంచరిస్తున్నాడనీ భిక్ష స్వీకరిస్తున్నాడని వింటున్నాను. ఈయనే దత్తదేవుడైతే అంతకన్నా కావలసింది ఏముంది? నా జన్మ తరించినట్టే అనుకున్నాడు. క్రమక్రమంగా ఆలోచన బలపడింది. దత్తాత్రేయుడే అని నిశ్చయం కలిగింది. అంతలోకి ఆ భిక్షువు నేనింక వెడతానంటూ బయలుదేరాడు. బయలు దేరడమేంటి రెండు అంగల్లో వీధిలో నిలిచాడు. వేదశర్మ అతడి వెంటబడ్డాడు. భిక్షువు-పొమ్మంటున్నా వినకుండా వెంబడించాడు. చేతికి అందిన కర్రతో రాయితో ఇటుకముక్కతో అదీ ఇదీ అని లేదు ఏది దొరికితే దానితో వేదశర్మను కొడుతున్నాడా భిక్షువు. అయినా ఇతడు వెంటబడుతూనే ఉన్నాడు. దెబ్బలు ఓర్చుకుంటున్నాడు. నెత్తురు కారుతున్నా లెక్కచేయడం లేదు. వెంట నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చచ్చిపడి ఉన్న గాడిద కళేబరం కనిపించింది. దాని శరీరం నుంచి ఇంత మాంసం ముద్ద పెకిలించి ఆ భిక్షువు వేద శర్మదోసిట్లో పడేసి "ఇంద తిను" అన్నాడు. వేదశర్మ భద్రంగా ప్రసాదంలా ఆ ముద్దను అలాగే దోసిట పట్టుకొని అతడివెంట నడిచాడు. చేరువకు రానిచ్చి భిక్షువు కాలితో ఒక్క తాపు తన్నాడు. వేద శర్మ తట్టుకొని నిలబడ్డాడు. చకచకా పరుగులాంటి నడకతో భిక్షువు వెళ్ళి వెళ్ళి ఒక కొండ గుహలో దూరాడు. వేదశర్మ కూడా ప్రవేశించాడు. అక్కడ ఒక శిలావేదిక మీద కూర్చుని ఆ భిక్షువు - ఏమయ్యా నావెంట బడ్డావు? తిట్టినా వదలవు. కొట్టినా వదలవు. నాతో ఏమిటి పని? చూస్తున్నావుగా కంపుగొడుతున్న నా రూపాన్ని, నేనేమి చెయ్యగలనని? ఏమికోరి నా వెంట బడ్డావు? రూక్షంగా ప్రశ్నించాడు.