Thursday 1 June 2023

శ్రీదత్త పురాణము (156)

 




సోహమ్ అనే అఖండార్థ దృఢ మనోవృత్తిలో సదా తన చైతన్యం వ్యాపించి వుంటుంది. అహంబ్రహ్మ- బ్రహ్మైవాహమ్ అనే వృత్తి తాలూకు ప్రవాహ దృఢత్వంలో చిత్తు ప్రతిబింబితమవుతుంది. సూర్యకాంతమణి యోగంతో దూదిలో అగ్ని రగుల్కొన్నట్లుగా చిత్ప్రతిబింబం తరుక్కుమంటుంది. విచక్షుణులైన విద్వాంసులకే ఇది సుకేయం. ఆ ప్రతిబింబంతో వ్యాప్తమైన ఈ మనోవృత్తి నిర్వికల్ప పరబ్రహ్మాన్ని చూపించి తానూ నశిస్తుంది.

అంటే ఈ వృత్తికి ప్రయోజనం తమోనాశకు తప్ప స్వప్రకాశ విషయీకరణంకాదు. తమోనాశంతో వృత్తి నాశమూ అవుతుంది. వృత్తి అనే ఉపాధి నాశనమవ్వడంతోనే చిత్ప్రతి బింబం చిత్తు అయిపోతుంది. అప్పుడు అది ఒక్కటే భాసిస్తుంది. కాంతిమంతమైన ఆ పరమానంద స్థితి వర్ణనాతీతం. అది మనో వాక్కులకు అందదు.

దీన్ని ఒక చిత్త వృత్తి అనీ మనస్సుతోనే దర్శించగలమని చెప్పడం దాని సంగతి అస్సలు తెలియని వారికి ఏదో కొంత తెలియచెప్పే ప్రయత్నమే తప్ప నిజానికి ఆ పరమానంద స్థితి మనస్సుకు అందుతుందా, వాక్కులకి అందుతుందా? స్వప్రకాశమూ నిత్యమూ అయిన ఆ పరంజ్యోతి వాజ్ఞ్మనస్సులకు ఆవలిది. అందనిది "యతో వాచో నివర్తంతే ఆప్రాప్యమనసా సహ- అని ప్రతి కీర్తించింది దీనినే. అయితే అజ్ఞానంతో అజ్ఞానాన్ని పోగొట్టినట్లు ఈ చిత్త వృత్తి అనేది దారి చూపించడానికి పనికి వస్తుంది. బ్రహ్మతత్వాన్ని గూర్చిన అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే ఈ వృత్తి వ్యాప్యత్వం అవసరమవుతుంది. సాధకుడు ఆ దారిన పోగా పోగా బ్రహ్మసాక్షాత్కారం అవుతుంది. ఆ దర్శనం అయ్యేంత వరకూ ఈ వృత్తి వుండాలి. అటు తర్వాత ఉండకూడదు. ఈ వృత్తిలో స్వభావ సిద్ధంగానే జ్ఞాతృక్షేయ విభాగం ఉంటుంది. కాబట్టే దీన్ని సవికల్ప సమాధి అనడం వృత్తి కూడా లయమైపోతే అదే నిర్వికల్ప సమాది. ఇందులో పరతత్వం అవిభాజ్యంగా (జ్ఞాతృజ్ఞేయవిభాగరహితంగా) అనుభూతమవుతుంది.

కార్తవీర్యార్జునా ! నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న యోగికి కొన్ని విఘ్నాలు (ఆటంకాలు) వచ్చిపడుతూ వుంటాయి. అవే అణిమాది - ఆష్ట సిద్ధులు, యోగి వాటిని ఆశించాడో ఇంక భ్రష్టుడయ్యాడన్న మాటే, ఆ సిద్ధులు కూడా నశ్వరములు అని గుర్తించి వాటి జోలికి పోకుండా విరమించుకోవాలి.

No comments:

Post a Comment