Tuesday 15 January 2013

కుంభమేళ

ఓం
జై గంగా మాతా

సనాతన ధర్మం(హిందూ ధర్మం), భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధన విశిష్టవంతమైన అంశం. అందులో భాగంగా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమం, త్రివేణీ సంగమంగా పిలువబడే ప్రయాగ(అల్లహాబాదు)లో కుంభమేళ జరుగుతున్నది.కుంభమేళకున్న పురాణ ప్రాశస్త్యం ఏమిటి?

(క్లుప్తంగా వివరిస్తున్నా)పూరాణాల ప్రకారం పూర్వం దేవతలు, దానవులు అమృతం కోసం మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలసముద్రాన్ని చిలికారు. శ్రీ కూర్మ రూపం(తాబేలు)లో శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని తన వీపు పై మొయగా, వాసూకిని తాడుగా చేసి, దాని తలను రాక్షసులు, తోకను దేవతలు పట్టుకుని చిలుకగా, అందులో నుండి ఐరావతం, ఉచ్చైశ్రవం(గుర్రం),జ్యేష్ఠా దేవి, లక్ష్మీ దేవి, హాలహలం మొదలైనవి ఉద్భవించిన తరువాత అమృతం బయటకు వచ్చింది. అమృతం కోసం దేవదానవులు కొట్టుకోసాగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి, రాక్షసులను దారి మళ్ళించి అమృతబాంఢాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు. అది గమనించిన రాక్షసులు గరుత్మంతుడు మీద యుద్ధం చేయడం, ఆ సమయంలో ఆ అమృత కలశంలో నుంచి నాలుగు అమృత బిందువులు నాలుగు ప్రదేశాల్లో పడడం జరిగింది. ఒక్కొక్క బిందువు 12 సంవత్సరాల తేడాతో అల్లహాబాదు(ఉత్తర ప్రదేశ్), నాసిక్(మహారాష్ట్ర), హరిద్వార్( ఉత్తర ప్రదేశ్), ఉజ్జైని(మధ్య ప్రదేశ్)లో పాడడం వలన ప్రతి 12 ఏళ్ళకు ఒకమారు ఈ ప్రదేశాల్లో ఉన్న నదుల్లో కుంభమేళ ఉత్సవం నిర్వహిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం కూడా కుంభమేళ గురించి ప్రస్తావించింది.గురువు మేష రాశిలోనికి, సూర్య చంద్రులు మకర రాశిలోనికి ప్రవేశించిన సమయంలో ప్రయాగలో కుంభమేళ నిర్వహిస్తారు.

జై గంగా మాతా
ఓం శాంతిః శాంతిః శాంతిః                  

No comments:

Post a Comment