Friday 1 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 118 వ భాగం



నాల్గు ఆశ్రమాలలోను చివరిది సన్న్యాసము, దానికీ నియమ నిబంధనలుంటాయి. శుకుడు దానికి అతీతుడు. అట్టివారిని ''అత్యాశ్రమి' అంటారు. అంటే వర్ణాలు లేవు, ఆశ్రమాలు లేవన్నమాట.


గురు పరంపరలో దక్షిణామూర్తి తరువాత దత్తాత్రేయుడు. తరువాత విష్ణువు, బ్రహ్మలు, త్రిమూర్తులలో ఉన్న శివుణ్ణి పేర్కొనలేదు. అతడు దక్షిణామూర్తియే కదా! మధ్యమ మణిలా శంకరులు ఈ గురుపరంపరలో ప్రకాశిస్తున్నారు.


శుకుని మాదిరిగానే దత్తాత్రేయుడు కూడా అతివర్ణాశ్రమి. త్రిమూర్తులు కలిగిన రూపంతో ఉన్నా అవధూత సన్యాసిలా నిరంతరం తిరుగుతూ ఉంటాడు. సన్న్యాసి అంటే సన్న్యాసాశ్రమం స్వీకరించాడని భావించకండి. సన్న్యాసి మాదిరిగా అన్నిటినీ విడిచి పెట్టాడనే అర్థంలో వాడాను. అతనిదీ ముండిత శిరస్సు కాదు. కాషాయ వస్త్రాలు లేవు. జటలతో, దిగంబరంగా ఉంటాడు.


అతి వర్ణాశ్రమి, ఫలానా రూపంలో ఉండాలని లేదు. రాజులా ఉండవచ్చు. ఒకచోట ఏమీ చేయకుండా ఉండవచ్చు. కాని దత్తుడు, శుకుడు అట్టివారు కాక అన్నిటినీ విడిచిన సన్న్యాసులుగా ఉంటారు.


సనక, సనందన, సనాతన, సనత్కుమారులని నల్గురు సోదరులు, జ్ఞానాచార్యులు, విష్ణువు యొక్క 24 అవతారాలలో వీరు కూడా ఉన్నారు. ఈ నలుగురు కలిసినది విష్ణువు కుమారావతారం. ఈ నలుగురులో సనత్కుమారుడున్నాడు కనుక అట్లా అన్నారు. బ్రహ్మకు, ముందు పుట్టిన మానస పుత్రులు వీరే. అందువల్ల వీరు బ్రహ్మకుమారులు. అంతేకాకుండా జీవితాంతమూ వీరు కుమారులుగానే ఉంటారు. దక్షిణామూర్తి, శుకుడు నిత్య యౌవనంలో ఉంటారు. పై సనకాదులకు యౌవనావస్థ లేదు. వారు నిత్య మునివృత్తి మార్గంలో ఉంటారు. జ్ఞానాన్ని పంచిపెట్టారు. మేము, మా మఠాలలో వ్యాసపూజ తరువాత వీరిని కొలుస్తాం. సనత్సుజాతునితో కలిపి వీరైదుగురు.

No comments:

Post a Comment