Sunday 31 July 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 148 వ భాగం



త్రిచూర్ ప్రశస్తి


త్రిచూర్ ఆలయానికి వెళ్ళి నియమ నిష్ఠతో స్వామిని అర్చించారు. ఆ క్షేత్రాన్ని వృషాచలమంటారు. అందలి నంది ఎత్తుగా ఉంటుంది. ఒక మూల గుండ్రంగా ఎత్తైన పర్వతం. ఆలయంలో టేకు చెట్లుండడం వల్ల టేక్కంగాడని అంటారు.


స్వామి పేరు వడక్కునాథుడు. స్వామి సన్నిధిని శ్రీ కోవిల్ అంటారు. ఆలయం గుండ్రంగా ఉంటుంది. ఆలయంలోనే శంకర నారాయణ, రామాలయాలున్నాయి. విష్ణ్వాలయాలు శివాలయంలో ఉండడం కేరళలో ప్రత్యేకత. ఇక్కడ నృత్య నాటకాలకు ప్రత్యేక మంటపాలున్నాయి. వాటిని కూతాంబళం అంటారు.


త్రిచూర్ లో ఏనుగుల ఉత్సవం (త్రిచూర్ పేరం) పేర్కొనదగింది. అలంకరించిన ఏనుగులు బారులు తీరి యుంటాయి. అయితే వీటిపై వృషాచల మూర్తిని ఊరేగించరు. చుట్టు ప్రక్కలనున్న అమ్మవారి ఉత్సవమూర్తులను వీటిపై ఉంచి తీసుకొని వస్తారు. ఇక్కడ స్వామిని దర్శించుకొని ఉత్సవ ప్రాంతానికి చేరుకుంటాయి. శివరాత్రి ఉత్సవం బాగా ఘనంగా జరుగుతుంది. అయినా స్వామి ఉత్సవమూర్తిగా ఊరేగడు.


ఇందలి పూజారులు తమకు విధింపబడిన కాలంలో పూర్తిగా బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు. అది ముగిసిన తరువాత మరొకరికి ఆలయాన్ని అప్పజెప్పి బైటకు వస్తారు. అట్లా చాలా పవిత్రంగా ఉంటుంది.


ఇక్కడి లింగాన్ని ఆవునేతితో అభిషేకిస్తారు. లింగంపై వేల సంవత్సరాల నెయ్యి పేరుకుని పోయి ఉంటుంది. వేసవిలో కూడా దీపాలను వెలిగించినా ఆ నేయి కరగదు. మంచుతో కైలాసనాథుడుండగా, ఇక్కడ నేతితో మంచు ఆకారంలో కప్పబడి యుంటాడు.


No comments:

Post a Comment