Sunday 13 August 2017

హిందూ ధర్మం - 249 (14 లోకాలు- Scientific analysis)



మనకు ఈ లోకం ఒక్కటే కనిపిస్తోంది. కానీ అనేక లోకాలు ఉన్నాయని శ్రీ మద్భాగవతం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల్లో ఋషులు అనేక లోకాలకు ప్రయాణం చేశారని ఉంది. అంటే అది లోకాంతరప్రయాణం. ఇప్పటి శాస్త్రవేత్తలు చేస్తున్న గ్రహాంతర ప్రయాణం మాత్రమే..... మరి మనకు ఆ లోకాలు కనిపించవెందుకు? ఆ లోకవాసులు మనకు ఎందుకు కనిపించరు? ఆ లోకాలు ఉన్న చోటకు రాకెట్‌లు వెళ్ళలేవా? ..... ఆ లోకాలు మామూలు నేత్రాలకు, సాధరణ బుద్ధికి అందే స్థాయిలో లేవని, వాటిని చూడటానికి అతీయింద్రియ దృష్టి కావాలని ధర్మం చెబుతుంది..... కళ్ళకు కనిపించవు కనుక ఇదంతా అసత్యమని, ఏదో కల్పించి చెబుతున్నారని, ఇదంతా సైన్స్‌కు విరుద్ధమని, కళ్ళకు కనిపించేదే నమ్మమని మనదేశంలో ఉన్న కొందరు హేతువాదులు (ఆ ముసుగు వేసుకున్న హైందవద్వేషులు) వాదిస్తారు. కానీ వారికి, హిందువులకు సమాధానం క్వాంటం ఫిజిక్స్‌లో ఉంది.

ధర్మాన్ని అనుసరించి విశ్వం బహు మితీయంగా (Multi dimensional) అయినది. అందులో ప్రతి లోకం, ఒకదానితో ఒకటి మరియు పరమాత్మతోనూ పరస్పరం అల్లుకుని (Interwoven) ఉంటాయి. ఇదే సిద్ధాంతాన్ని క్వాంటం ఫిజిక్స్ ప్రతిపాదిస్తుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం కూడా ఈ విశ్వంలో అనేక ప్రపంచాలు, లోకాలు ఉన్నాయి. అవి కళ్ళకు కనిపించనప్పటికీ, వాటికి అస్థిత్వం ఉందని క్వాంటం ఫిజిక్స్ శాస్త్రవేత్తలు నమ్ముతారు. నిజానికి క్వాంటం ఫిజిక్స్ అధ్యాపకులు వేదాంతాన్ని, సనాతన ధర్మాన్ని చాలా బాగా మెచ్చుకుంటారు. విద్యార్ధులకు క్వాంటం ఫిజిక్స్ పాఠాలు భోదిస్తుంటే, అద్వైతం భోదించినట్లుగానే ఉంటుందని హాన్స్ పీటర్ డర్ గారు చెప్పిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.

క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాన్ని అనుసరించి - మొత్తం ఈ విశ్వంలో 10 పరిమాణాలు (Dimensions) ఉన్నాయని అనుకుంటున్నారు, పరిశోధనలు అవి పెరగవచ్చు కూడా. వాటికి సంబంధించిన ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో సూపర్ స్ట్రింగ్” సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది. యజుర్వేదంలోని రుద్రం 11 పరిమాణాల (11 Dimensions) గురించి చెబుతుంది.

1-Dimension  పొడవు (length)
2-D ఎత్తు (height )
3-D లోతు (depth )

మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచం, చూస్తున్న జగత్తు, నక్షత్రాలు, గోళాలు, ఉల్కలు, అంతరిక్షం ...... దృశ్యమానమైన ఈ జగత్తంతా 3D. అయినా మనం 3-D సినిమా చూడాలంటే, ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకోనిదే కుదరదు.

4-D time, ఒక వస్తువు ఎంత సేపు ఒక స్థానం లో ఉండగలిగిందో చెప్పే పరిణామం ఇది. 3 పరిణామాలతో పాటు, కాలంలో ఒక వస్తువుకు స్థానం ఎక్కడో తెలుసుకుంటేనే, బ్రహ్మాండంలో దాని స్థానాన్ని గుర్తించవచ్చు. ఇక్కడ Space ఉండదు. ఉన్నదంతా కాలమే (Only time).

చనిపోయిన తర్వాతా చాలా వరకు జీవులు 4-D లోకే వెళతారు. అందుకే వారు మనకు కనిపించరు. అంటే మరణం తర్వాత ఆత్మ, ఈ పాంచభౌతికమైన, దేశకాలాల (Time and Space) కు లోబడిన పరిమాణం (Dimension) నుంచి భిన్నమైన పరిమాణంలోకి ప్రయాణిస్తుంది. కానీ ఈ క్షేత్రంలో ఉన్నవారు, క్రింది Dimension  లో ఉన్నవారిని చూడగలరు, వారి మాటలు వినగలరు. అందుకే జీవుడు (ఆత్మ) మరణానంతరం ఈ 4-D లోకి ప్రవేశించినా, అది ఎరుగక, తన వారి కోసం ఏడుస్తుంది. వారికి ఏదేదో చెబుతుంది. కానీ వినేవారు ఉండరు. ఆ తర్వాత క్రమంగా ఇది పాపపుణ్యాలను బట్టి నరకానికి లేదా స్వర్గానికి ప్రయాణిస్తుంది. సనాతన హిందూ ధర్మంలో మరణం తర్వాత చేసే అపరకర్మలన్నీ ఈ Dimension లో ఉన్న జీవుడిని ఉద్దేశించి చేసేవే. కానీ ఇంతకముందు చెప్పుకున్నట్లు, విశ్వంలో అన్నీ పరస్పరం అల్లుకుని ఉన్న కారణం చేత, ఇక్కడ (3-D) చదివే వేదమంత్రాల శక్తి వలన ఆ జీవుడికి మార్గం దొరికి అది ఉన్నత లోకాలకు పయనిస్తుంది.

5-D Possible Worlds: మనకన్నా కొంత విభిన్నమైన ప్రపంచం. ఈ 5-D నుంచి చూసినప్పుడు, మనకంటే భిన్నమైన లోకాలను చూసే అవకాశం ఉంటుంది. వాటికి మనలోకానికి మధ్య ఉండే సామ్యాలను, వ్యత్యాసాలను గుర్తించే అవకాశం కలుగుతుంది. అక్కడి కాలం ఇక్కడి కాలానికి భిన్నంగా నడుస్తూ ఉండవచ్చు. అక్కడి కాలగతి (కాలం యొక్క వేగం) దీనికంటే తక్కువ ఉండవచ్చు. వారు మనకంటే ముందు నుంచి జీవిస్తూ ఉండవచ్చని క్వాంటం సిద్ధాంతం చెబుతుంది. అంటే యమలోకం, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు మొదలైన ఊర్ధ్వలోకవాసుల నివాసాలు ఇక్కడే ఉండి ఉండవచ్చు. అందుకే పితృదేవతల కాలానికి, దేవతల కాలానికి, మనుష్యుల కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే మానవ లోకంలో 30 రోజులు పితృదేవతలకు ఒక రోజుతో సమానం. మానవుల 1 సంవత్సరం దేవతలకు 1 రోజుతో సమానం. (వీటి గురించి గతభాగాల్లో చెప్పడం జరిగింది).

6-D A Plane of All Possible Worlds With the Same Start Conditions; విభిన్నమైన విశ్వాలు (లోకాలు) అన్నీ ఒకే సమతలం (Plane) లో ఒకే సమయానికి ప్రారంభం అవ్వడం (బిగ్ బాంగ్ లాంటిది) ఇక్కడి నుంచి చూడవచ్చు. ఎవరైతే ఈ 5-D మరియు 6-D మీద పట్టు సాధిస్తారో, వారు కాలంలో ముందుకు, లేదా వెనక్కు వెళ్ళగలరు. కాలంలో వెనక్కు ప్రయాణించి గతంలోకి వెళ్ళగరు, అలాగే ముందుకు ప్రయాణించి, భవిష్యత్తును దర్శించగలరు.

దేవలోకం అనగా స్వర్గం మొదలైనవి ఇతర లోకాల స్థానం ఇదే కావచ్చు. అందుకే దేవతలు తమ దివ్యదృష్టితో గతాన్ని, భవిష్యత్తును దర్శించగలరని ధర్మం చెబుతుంది. మానవలోకంలో నివసిస్తూనే, మన మధ్య ఉంటూనే, సాధన ద్వారా సిద్ధి పొందిన యోగులు ఈ పరిణామాన్ని చూడగలరు. అందుకే వారు కూడా పితృదేవతలను, దేవతలను చూడగలరు. వ్యక్తిని చూసి, అతడి గత జన్మ, రాబోవు జన్మలు చెప్పగలరు. అంటే సనాతనధర్మంలో చెప్పబడిన ఆధ్యాత్మిక సాధన వ్యక్తిని భౌతికమైన 3-D ప్రపంచం నుంచి ఇంకా పై స్థాయికి తీసుకువెళుతునందని స్పష్టమవుతోంది.

(వివరణ ఇంకా పూర్తికాలేదు)
To be continued ...............

3 comments:

  1. అద్భుతమైన వివరణ...!!

    మీతో మాట్లాడాలి..! అని ఉంది, దయచేసి మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు!!
    అప్పలరాజు, శివశక్తి (భారతీయ సాంస్కృతిక సేవ వేదిక)

    ReplyDelete
  2. అద్భుతమైన వివరణ...!!

    మీతో మాట్లాడాలి..! అని ఉంది, దయచేసి మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు!!
    అప్పలరాజు, శివశక్తి (భారతీయ సాంస్కృతిక సేవ వేదిక)

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా..... నాకు కూడా శివశక్తి సభ్యులు తెలుసు, విశ్వశాంతి కిరణ్, కరుణాకర్, సతీష్ కుమార్ గార్లు పరిచయమండి. నేనే ఒకటి రెండు రోజుల్లో మీకు మెసెజ్ చేస్తాను.

      Delete