Tuesday 15 October 2024

శ్రీ గరుడ పురాణము (300)

 


బుధాష్టమి - వ్రతం, కథ


బుధవారం, అష్టమి కలిసిన నాడు ఈ వ్రతాన్ని చేస్తారు. జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధగ్రహాన్ని పూజించాలి. తరువాత గుమ్మడికాయనూ, బియ్యాన్నీ దానమిచ్చి యథాశక్తి దక్షిణనివ్వాలి. బుధదేవుని యొక్క పూజలోవాడే బీజమంత్రం ఓం బుం బుధాయనమః. ఈ దేవ పూజానంతరం కమల గట్టాది ఆహుతులను ఈయడానికి ఓం బుం బుధాయస్వాహా అనే మంత్రాన్ని ప్రయోగించాలి. జలాశయ మధ్యాన్నే పూర్ణమండలంగా భావించుకొని అక్కడే పూజా మండలాన్ని కల్పించుకొని దాని మధ్యలో పద్మదళాన్నీ దానిపై శ్యామవర్ణుడూ ధనుర్బాణయుక్తుడూనగు బుధునీ కల్పించుకొని ఆయన అంగాలను పూజించాలి. అప్పుడు పరమపుణ్యదాయినియైన ఈ వ్రతకథను జలాశయ తీరంలో కూడా పూజచేసి కూర్చుని వినాలి.


ప్రాచీన కాలంలో పాటలీపుత్రంలో 'వీరుడు' అను పేరు గల శ్రేష్ఠ బ్రాహ్మణుడొ కాయన వుండేవాడు. ఆయన భార్య పేరు రంభ, కొడుకు పేరు కౌశికుడు, కూతురిపేరు విజయ. ఆతనికొక ఎద్దు కూడా వుండేది. దానికి ధనపాలుడని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటుండేవాడు. గ్రీష్మఋతువులో నొకనాడు కౌశికుడు ఎద్దుతో సహా గంగా స్నానానికి పోయి నదిలో నుండగా కొందరు దొంగలైన గోపాలకులు వచ్చి ఎద్దుని ధనపాలుని బలవంతంగా పట్టి బంధించి పట్టుకొనిపోయారు. కౌశికుడు దుఃఖితుడు, అన్వేషకుడునై అత్తీర ప్రాంతకాంతారంలో తిరుగసాగాడు. దైవవశాన వీరుని పత్నీ కూతురూ కూడా గంగాజలం కోసం వెళుతూ అక్కడికే చేరుకున్నారు. ఈలోగా కౌశికుడు ఆకలిదప్పులకు లోనై వనం నుండి బయటికి వచ్చి కలువకాడలు తినే ఉద్దేశ్యంతో ఒక కోనేటి వద్దకు రాగా అతని సోదరి కనిపించింది. ఇద్దరూ కాస్తముందుకి వెళ్ళేసరికి అక్కడ కొందరు దివ్య స్త్రీలు ఏదో పూజ చేసుకుంటూ దర్శనమిచ్చారు. కౌశికుడు ఆశ్చర్యపోతూనే వారి వద్దకు పోయి తనకూ తన సోదరికీ ఆహారాన్ని అర్థించాడు. వారీ బ్రాహ్మణ బాలకుని చూసి ప్రసన్నులై ఈ పదార్థాలన్నీ వ్రతానికుద్దేశింపబడినవి. మీరు కూడా మాతో పాటు ఈ బుధదేవుని వ్రతం చేయండి. మీ కోరికలు తీరుతాయి అన్నారు.


ఆ విధంగానే చేసి ప్రసాదం స్వీకరిస్తూ కౌశికుడు తన ఎద్దునీ విజయకి మంచి భర్తనీ కోరుకుని వెనుకకు మరలగా ఎద్దు ఎక్కడినుండో వచ్చి కౌశికుని ఎదుట నిలబడింది. దివ్య స్త్రీలు వారిని దీవిస్తూ అంతర్ధానం చెందారు.


వీరునికి మొదటినుండీ తన కూతుర్ని పరమ ధర్మపరుడైన వానికి, యమధర్మ రాజంత వానికి, ఇచ్చి పెళ్ళి చెయ్యాలని వుండేది. పాపమతడా కోరిక తీరకుండానే మరణించాడు. తరువాత కౌశికుడు విద్యలోనూ వీరత్వంలోనూ సర్వసమర్థుడై రాజ్య ప్రాప్తి కోసం మరల బుధాష్టమి వ్రతాన్ని గావించాడు. దైవమనుకూలించడంతో అచిరకాలంలోనే అయోధ్య సామ్రాజ్యంలో గల విశాల రాజ్యానికి రాజయ్యాడు.


తన తండ్రి కోరికనే తానూ కోరికొని మరల బుధాష్టమి వ్రతాన్ని చేశాడు. వ్రత ప్రభావం వల్ల యమధర్మరాజే స్వయంగా దిగివచ్చి విజయను వివాహం చేసుకొని ఆమెతో 'దేవీ నీవు నా గృహస్వామినివై నన్ననుగ్రహించు' అని ఆహ్వానించాడు. అద్భుతమైన ఆయన గృహంలో ఒక గదికి మాత్రం ఎప్పుడూ తాళం వేసి వుంటుంది. ఆ గది జోలికి పోవద్దని ఆయన చెప్పాడు కూడ. అయినా ఒకనాడేమీ తోచక స్త్రీ సహజమైన చాపల్యంతో విజయ ఆ గది తాళాలను తీసి తలుపు తెరిచి లోనికి చూచింది. వెంటనే ఆ లోపలి దృశ్యం కనబడి ఆమెకు తట్టుకోలేనంత దుఃఖం వచ్చింది. ఆ గదిలో ఆమె తల్లి యమపాశబద్ధురాలై నానాహింసలనూ అనుభవిస్తూ గోచరించింది. ఆమెకు కౌశికుడు తనకు బోధించిన ముక్తి ప్రదాయకమైన బుధాష్టమి వ్రతం గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె అనితర సాధ్యమైన భక్తి శ్రద్ధలతో బుధాష్టమి వ్రతాన్ని చేసింది. ఆ వ్రతఫలం వల్ల ఆమె తల్లి పాశమునుండి విడివడి దేవలోకం వైపు సాగిపోయింది.


అష్టమి తిథినాడు పగలు వ్రతం చేసి రాత్రి నక్తవ్రత నియమం పాటించి భోంచేస్తూ ఇలా ఒక యేడాది పాటు అన్ని అష్టమి దినాలలోనూ వ్రతం చేసి చివర గోదానం చేస్తే ఆ వ్రతి ఇంద్రపదానికర్హుడౌతాడు. ఈ వ్రతానికి సద్గతి వ్రతమని పేరు. పుష్య శుక్లాష్టమి నాడు చేసే వ్రతానికి మహారుద్రవ్రతమని పేరు.


ఒక నెలలో రెండు అష్టములూ బుధవారాలనాడే పడితే ఆ వ్రతికిక ఎదురేలేదు. అతని సంపత్తి ఏనాటికీ తగ్గదు. ముక్తిని కోరేవారు ఈ వ్రతం చేస్తూ పిడికిలి బిగించి రెండు వేళ్ళను విడదీసి, మిగిలిన పిడికిలితో ఎనిమిది మార్లుబియ్యాన్ని తీసి గిన్నెలో వేసి ఆ ద్రవ్యంతోనే సొజ్జి లేదా జావను వండుకొని తినాలి. వ్రతసమాప్తి సమయంలో దానితో పాటు చింతపండునూ, కరేలువను ఆకు కూరను మామిడాకుల దోనెలో పెట్టుకొని తిని వ్రత కథను శ్రద్దగా విన్నవారి కన్ని కోరికలూ తీరతాయి. (అధ్యాయం -132)

Monday 14 October 2024

శ్రీ గరుడ పురాణము (299)

 


తరువాత మహాలక్ష్మికీ, వసుదేవునికీ, నందబలరామ యశోదలకూ అర్ఘ్యమివ్వాలి. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థించాలి.


అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం ॥

వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం |


వరాహంపుండరీకాక్షం నృసింహం దైత్య సూదనం ॥

దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం |


గోవింద మచ్యుతం దేవమనంతమప రాజితం ॥

అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంత కారణం |


అనాది నిధనం విష్ణుం త్రిలోకేశంత్రివిక్రమం ॥

నారాయణం చతుర్భాహుం శంఖ చక్ర గదాధరం |


పీతాంబర ధరం దివ్యం వనమాలావిభూషితం ॥

శ్రీ వత్సాంకం జగద్ధామం శ్రీ పతిం శ్రీధరం హరిం | 


యేదేవం దేవకీ దేవీ వసుదేవాదజీ జనత్ ॥

భౌమస్య బ్రాహ్మణో గుప్త్య తస్మై బ్రహ్మాత్మనే నమః॥ (131/10-16)


ఈ ప్రకారంగా శ్రీకృష్ణభగవానుని అనేక నామ సంకీర్తన చేసి మరల సద్గతికై ఇలా ప్రార్ధించాలి.


త్రాహిమాం దేవ దేవేశ హరే సంసార సాగరాత్ | 

త్రాహి మాం సర్వపాపఘ్న దుఃఖశోకార్ణవాత్ ప్రభో ॥


దేవకీ నందన శ్రీశ హరే సంసార సాగరాత్ | 

దుర్వృత్తాం స్త్రాయసే విష్ణో యే స్మరంతి సకృత్సకృత్ ॥


సోఽహం దేవాతి దుర్వృత్త స్త్రాహి మాం శోక సాగరాత్ ।

పుష్కరాక్ష నిమగ్నో హం మహత్యజ్ఞాన సాగరే ॥ 


త్రాహి మాం దేవ దేవేశ త్వామృతేఽన్యో న రక్షితా |

స్వ జన్మవాసుదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ॥


జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయనమో నమః । 

శాంతి రస్తు శివంచాస్తు ధన విఖ్యాతి రాజ్య భాక్॥ (ఆచార.. 131/17-21)


ఈ ప్రార్థనలో వేడుకొన్నవన్నీ అనగా, అశాంతినుండి రక్షణ, దురాచారం నుండి విడుదల, అజ్ఞాన నాశనం, శాంతి, శుభం, ధనం, విఖ్యాతి, అధికారం ఇవన్నీ ఈ వ్రతం చేసినవారికి లభిస్తాయి.

(అధ్యాయం -131)

Tuesday 24 September 2024

శ్రీ గరుడ పురాణము (298)

 


దూర్వాష్టమి, శ్రీకృష్ణాష్టమి


భాద్రపద శుద్ధ అష్టమినాడు దూర్వాష్టమి వ్రతాన్ని చేయాలి. దూర్వ యనగా గరిక. ఆ రోజు ఉపవాసం చేసి గౌరీ, గణేశ, శివ ప్రతిరూపాలను గరికెతోనూ ఆపై ఫల పుష్పాదులతోనూ పూజించాలి. ప్రతి పూజాద్రవ్యాన్నీ శంభవేనమః, శివాయనమః అంటూ శివునిపై వేయాలి. దూర్వను కూడా ఇలా ప్రార్థించాలి.


త్వందూర్వేఽమృతజన్మాసి వందితా చ సురాసురైః | 

సౌభాగ్యం సంతతిం కృత్వా సర్వకార్య కరీభవ ॥ 

యథాశాఖా ప్రశాఖాభిర్విస్తు తాసి మహీతలే । 

తథా మమాపి సంతానం దేహి త్వమజరామరే ॥


ఈ దూర్వాష్టమి వ్రతాన్ని చేసిన వారికి సర్వస్వ ప్రదానాన్ని దేవతలు చేస్తారు. ఈ వ్రతం చేసి అగ్ని పక్వం కాని భోజనం చేసేవారు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తులౌతారు.


శ్రీకృష్ణాష్టమి భాద్రపద కృష్ణ అష్టమి నాడు జరపబడుతుంది. ఆ రోజు అర్ధరాత్రి రోహిణినక్షత్రంలో ఆ యుగపురుషునిగా భగవానుడైన శ్రీహరి పుడమిపై నవతరించాడు. సప్తమితో కలిసిన ఈ అష్టమి కూడా వ్రతయోగ్యమే. ఈనాడు కృష్ణుని పూజించిన వారికి మూడు జన్మల పాపాలు నశిస్తాయి. ముందుగా 


ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ | 

యోగ సంభవాయ గోవిందాయ నమోనమః ॥


అనే మంత్రంతో యోగేశ్వరుడూ యోగీశ్వరుడునైన శ్రీకృష్ణుని ధ్యానించి ఈ క్రింది మంత్రంతో ఆయన ప్రతిమకు స్నానం చేయించాలి.


ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః । అనంతరం ఈ మంత్రంతో ఆయనను పూజించాలి.


ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే 

విశ్వ సంభవాయ గోవిందాయ నమో నమః । 


పిమ్మట ఈ మంత్రంతో స్వామిని శయనింపజేయాలి.


ఓం సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే

సర్వసంభవాయ గోవిందాయ నమోనమః ।


ఒక స్థండిలం (వేది) పై చంద్రునీ, రోహిణీనీ శ్రీకృష్ణభగవానునీ ఉంచి పూజించాలి. పుష్ప, జల, చందనయుక్త జలాన్ని ఒక శంఖంలో తీసి పట్టుకొని మోకాళ్ళపై కూర్చుని క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రునికి అర్ఘ్యమివ్వాలి.


క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ |

గృహాణార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ ॥


(ఆచార .. 131/8,9)

Monday 23 September 2024

శ్రీ గరుడ పురాణము (297)

 


షష్ఠి, సప్తమి వ్రతాలు


భాద్రపద షష్ఠినాడు కార్తికేయుని పూజించాలి. ఈ పూజలో చేసే స్నానాది పవిత్ర కృత్యాలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ప్రతి షష్ఠినాడుపవాసం చేసి సప్తమి నాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ముందుగా ఓం ఖఖోల్కాయనమః అనే మంత్రంతో సూర్యుని పూజించాలి. అష్టమినాడు మిరియాలతో భోజనం చేసి పారణ చేయాలి. (సప్తమి నాటి భోజనం సంగతి ఇక్కడ చెప్పబడలేదు. గాని కొన్ని ప్రాంతాల్లో ఆరోజు 'చప్పిడి' చేస్తారు. అనగా ఉప్పుకారములు లేని భోజనం చేస్తారు - అను) మిరియాన్ని ‘మరిచ’ అంటారు. కాబట్టి ఈ సప్తమి వ్రతానికి మరిచ సప్తమివ్రతమనే పేరుంది. ఈ వ్రతం చేసిన వారికి దూరమైన ప్రియజనులు దగ్గరౌతారు. ఇక ఎడబాటన్నది వుండదు. ఈ రోజు సంయమనాన్ని పాటిస్తూ స్నానాదికములను చేసి మార్తండః ప్రీయతాం అంటూ యథావిధి సూర్యుని పూజించి, అదే వాక్యాన్ని పలుకుతూ బ్రాహ్మణులకు ఖర్జూరం, నారికేళం, గజనిమ్మ మున్నగు పండ్లను దానం చేయాలి. ప్రతి కూడా ఆ రాత్రికి వాటినే తిని శయనించాలి. ఈ వ్రతాన్ని ఫల సప్తమీ వ్రతమని ఇందువల్లనే అంటారు. 


సప్తమి నాడు సూర్యదేవుని పూజించిన తరువాత బ్రాహ్మణునికి పాయసంతో భోజనం పెట్టి దక్షిణనిచ్చి వ్రతి స్వయంగా పాలను త్రాగి వ్రతాన్ని ముగిస్తే పుణ్యప్రదుడౌతాడు. కోరికని బట్టి ఆహారముండే వ్రతమిది. ధన- పుత్ర లాభం కావలసినవారు ఓదన, భక్ష్యాదులను తీసుకోరాదు. దీనిని అనౌదక సప్తమీ వ్రతమంటారు.


అలాగే విజయాన్ని కోరుకునేవారు వాయు భక్షణ మాత్రమే చేయాలి. దానిని విజయ సప్తమి వ్రతమంటారు. మధు, మైధునాదులనూ, ఉడద, యవ, తిలాదులనూ, తైలమర్దన, అంజనాదులనూ ఇతర సర్వభోగాలనూ పరిత్యజించి చేస్తేనే ఈ వ్రతం పూర్తి ఫలితాన్నిస్తుంది.


(అధ్యాయం -130)

Sunday 22 September 2024

శ్రీ గరుడ పురాణము (296)

 


ఆవాహన తరువాత ఒక ప్రత్యేక గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అంగుష్ఠాదిన్యాసం చేయాలి. ఇలా:


ఓం మహా కర్ణాయ విద్మహే

వక్రతుండాయ ధీమహి

తన్నో దంతిః ప్రచోదయాత్!


కరన్యాసం కడముట్టినాక ఈ మంత్రాన్నే పరిస్తూ తిలాదులతో వినాయకుని పూజించి వాటినే ఆహుతులుగా ఇవ్వాలి. గణాలను కూడా స్మరిస్తూ 

గణపతయేనమః ఓం కూష్మాండకాయనమః అంటూ పూజించాలి. ఇదేవిధంగా ఇతర గణాలను పూజిస్తూ 'స్వాహా'ను చేర్చి ఆహుతులిలా ఇవ్వాలి.


ఓం నమ అమోఘోల్కాయ స్వాహా

ఓం నమః ఏకదంతాయ స్వాహా

ఓం నమస్ త్రిపురాంతక రూపాయ స్వాహా

ఓం నమశ్శ్యామదంతాయ స్వాహా

ఓం నమో వికారలా స్యాయ స్వాహా

ఓం నమ ఆహవేషాయ స్వాహా

ఓం నమః పద్మ దంష్టాయ స్వాహా ।


అనంతరం ప్రతి గణదేవునికి ముద్రలను ప్రదర్శించి, నృత్యం చేసి, చప్పట్లు కొట్టి, హాస్య ప్రసంగాలను చేయాలి. ఇలా చేసిన వారికి సకల సౌభాగ్యాలూ కలుగుతాయి.


మార్గశిరశుద్ధ చవితినాడు దేవగణముల వారిని పూజించాలి. సోమవారము, చవితిరోజులలో ఉపవాసముండి గణపతి దేవుని పూజించి ఆయనను జప, హవన, స్మరణల ద్వారా ప్రసన్నం చేసుకోగలిగినవారికి విద్య, స్వర్గం, మోక్షం లభిస్తాయి.


ప్రతి శుద్ధ చవితినాడు చక్కెర లడ్లతో, కుడుములతో విఘ్నేశ్వరుని పూజించేవారికి సర్వకామనలూ సిద్ధిస్తాయి, సర్వసౌభాగ్యాలూ అబ్బుతాయి. దమనకాలతో ఇదే విధంగా పూజించేవారికి పుత్ర ప్రాప్తి కలుగుతుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో శుద్ధ చవితిని దమనా అని కూడా అంటారు.


ఓం గణపతయేనమః ఈ మంత్రంతో గణపతిని పూజించాలి. ఏ మాసపు శుద్ధచవితి నాడైనా గణపతిని పూజించి హోమ, జప, స్మరణములను చేస్తే అన్ని విఘ్నాలూ నశించి అన్ని కోరికలూ తీరతాయి. గణపతికి గల విభిన్న నామాలను జపిస్తూ గాని స్మరిస్తూ గాని ఆ ఆద్యదేవుని పూజిస్తే సద్గతి ప్రాప్తిస్తుంది. ప్రతి ఈ లోకంలో నున్నంతకాలం సమస్త సుఖాలనూ అనుభవిస్తాడు. అంతలో స్వర్గాన్నీ మోక్షాన్నీ పొందుతాడు.


వినాయకుని పన్నెండు నామములూ ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి.


గణపూజ్యో వక్రతుండ ఏకదంష్ట్రీ త్రియంబకః | 

నీలగ్రీవో లంబోదరో వికటో విఘ్న రాజకః ॥


ధూమ్రవర్లో భాలచంద్రో దశమస్తు వినాయకః | 

గణపతి ర్హస్తిముఖో ద్వాదశారే యజేద్గణం ॥


(ఆచార ... 129/25,26)


ఒక్కొక్క నామాన్నే జపిస్తూ ఒక్కొక్క చవితి నాడూ యథావిధిగా పూజ చేసి అలా ఒక ఏడాది చేసినవారికి అభీష్ట సిద్ది కలుగుతుంది.


ఇక పంచమి నాడు నాగులను పూజించాలి. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తిక మాసాలలో శుక్ల పంచమి తిథుల్లో వాసుకి, తక్షక, కాళియ, మణిభద్రక, ఐరావత, ధృతరాష్ట్ర, కర్కోటక, ధనుంజయ నామకులైన ఎనమండుగురు నాగరాజు లనూ పూజించాలి. వీరికి నేతితో స్నానం చేయించి పూజ చేయాలి. ఈ నాగాధీశులు తమ భక్తులకు ఆయురారోగ్యాలనూ, స్వర్గలోక నివాసాన్నీ ప్రసాదించగలరు. అనంతుడు, వాసుకి, శంఖుడు, పద్ముడు, కంబలుడు, కర్కోటకుడు, ధృతరాష్ట్రుడు, శంఖకుడు, కాళియుడు, తక్షకుడు, పింగళుడు - ఈ పన్నిద్దరు నాగులనూ ఇదే క్రమంలో నెలకొకరిని పూజించాలి. భాద్రపద శుద్ధపంచమి నాడు ఎనమండుగురు నాగులనూ ఒకేసారి పూజించాలి. నాగరాజులు స్వర్గాన్నీ మోక్షాన్నీ ప్రసాదించగలరు.


శ్రావణశుద్ధ పంచమినాడు ద్వారానికి రెండువైపులా ఈ నాగుల చిత్రపటాలను పెట్టి పూజించాలి. నైవేద్యంగా పాలనూ నేతినీ వుంచాలి. ఈ పూజవల్ల విషదోషాలా యింటి కంటవు. పాము కాటు ఆ ఇంటివారినేమీ చేయలేదు. అందుకే ఈ పంచమిని దంష్ట్రో ద్వార పంచమి అంటారు.


(అధ్యాయం -129)

Saturday 21 September 2024

శ్రీ గరుడ పురాణము (295)



మాఘశుద్ధ చతుర్థినాడు ఆహారమేమీ తీసుకోకుండా బ్రాహ్మణునికి తిలాదానం చేసి వ్రతి తిలలను నీటిని ఆహారంగా భావించి ప్రాశ్న చేయాలి. ఈ విధంగా ప్రతినెలా రెండేళ్ళపాటు చేసి ప్రత సమాప్తిని గావించాలి. ఇలా చేసిన వారికి జీవితంలో ఏ విఘ్నాలూ కలగవు. ప్రతి చవితి నాడూ గణపతిని యథావిధిగా పూజించాలి. ఈ పూజలో మూలమంత్రమైన ఓం గః స్వాహా ను వీలైనన్ని మార్లు పఠిస్తూ ఈ క్రింద పేర్కొన్న విధంగా అంగన్యాస పూజనూ చేయాలి.


ఓం గ్లౌం గ్లాం హృదయాయనమః అంటూ కుడిచేతి అయిదు వేళ్ళతోనూ గుండెను ముట్టుకోవాలి.


ఓం గాం గీం గూం శిరసే స్వాహా అంటూ తలనూ


ఓం హ్రూం హ్రీం హ్రీం శిఖాయై వషట్ అంటూ పిలకనూ 


ఓం గూం కవచాయ వర్మణే హుం అంటూ కుడి వ్రేళ్ళతో ఎడమభుజాన్నీ ఎడమ చేతి వ్రేళ్ళతో కుడిభుజాన్నీ స్పృశించాలి.


ఇంకా ఓం గౌం నేత్ర త్రయాయ వౌషట్ అంటూ కుడిచేతి వ్రేళ్ళ కొనలతో రెండు కనులనూ, లలాట మధ్య భాగాన్నీ స్పృశించాలి.


చివరగా ఓం గౌం అస్త్రాయ ఫట్ అనే మంత్రవాక్యముతో కుడిచేతిని తలపైకి లేపి ఎడమవైపు నుండి తలవెనుకకు గొనిపోయి కుడివైపు నుండి ముందుకి తీసుకువచ్చి, చూపుడు, మధ్యము వ్రేళ్ళతో ఎడమ అరచేతిని చప్పట్లు కొట్టినట్టు చరచాలి.


ఆవాహనాదులలో ఈ క్రింది మంత్రాలను పఠించాలి.


ఆగచ్చోల్యాయ గంధోలు పుష్పాల్కో ధూపకోల్యకః |

దీపోల్కాయ మహోల్కాయ బలిశ్చాథ విస (మా)ర్జనం ||


పూజాద్రవ్యాలన్నిటినీ తేజః స్వరూపాలుగా భావించి సాధకుడు పెట్టి వెలిగించిన దీపానికి మరింతకాంతిని ప్రసాదించి వ్రతాంతం దాకా నిలబెట్టుమని చేసినప్రార్ధన ఇది.


Friday 20 September 2024

శ్రీ గరుడ పురాణము (294)

 


పాడ్యమి నుండి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు


వ్యాసమహర్షీ! ఇప్పుడు నేను ప్రతిపదాది తిథుల వ్రణాలను ఉపదేశిస్తాను. ప్రతిపదా అనగా పాడ్యమి తిథి నాడు చేయవలసిన ఒక విశేషవ్రతం పేరు శిఖి వ్రతం. ఈ ప్రతాన్నాదరించిన వారికి వైశ్వానరపదం సిద్ధిస్తుంది. పాడ్యమి నాడు ఏకభుక్తవ్రతం. అనగా పగటిపూట ఒకేమారు భోజనం చేసి వుండిపోవాలి. వ్రతం చివర్లో కపిల గోవును దానమివ్వాలి. చైత్రమాసారంభంలో విధిపూర్వకంగా గంధ, సుందరపుష్ప, మాలాదులతో బ్రహ్మను పూజించి హవనం చేసినవారు అభీష్ట ఫలప్రాప్తి నందగలరు. కార్తిక శుద్ధ అష్టమినాడు పూలను వాటి మాలలనూ దానం చేయాలి. ఇలా ఏడాదిపొడవునా చేసిన వారికి రూప సౌందర్యం లభిస్తుంది.


శ్రావణ కృష్ణ తదియనాడు లక్ష్మీ, శ్రీధర విష్ణుల మూర్తులను బాగా అలంకరించబడిన శయ్య పై స్థాపించి పూజించి రకరకాల పండ్లను నివేదించి ఆ శయ్యాదులను బ్రాహ్మణునికి దానం చేసి ఈ విధంగా ప్రార్ధించాలి. శ్రీధరాయనమః శ్రియైనమః. ఈ తదియనాడే ఉమామహేశ్వరులనూ, అగ్నినీ కూడా పూజించాలి. ఈ దేవతలందరికీ హవిష్యాన్నీ, తన కిష్టమైన పదార్థాలనూ, తెల్లకమలాల (దమనకాల) నూ నివేదించాలి.


ఫాల్గునాది తదియల వ్రతంలో వ్రతి ఉప్పు తినరాదు. వ్రతాంతమున బ్రాహ్మణుని ఆయన పత్నితో సహా పూజించి అన్న, శయ్యా, పాత్రాది ఉపస్కరయుక్తమైన ఇంటిని దానం చేసి భవానీ ప్రియతాం అనాలి. ఇలా చేసిన వారికి దేహాంతం లో భవానీలోకం ప్రాప్తిస్తుంది. ఈ లోకంలో కూడా సర్వసుఖాలూ లభిస్తాయి.


మార్గశిర తదియనుండి క్రమంగా తిథి నాటి కొకరుగా గౌరి, కాళి, ఉమ, భద్ర, దుర్గ, కాంతి, సరస్వతి, మంగళ, వైష్ణవి, లక్ష్మి, శివా, నారాయణి దేవీ స్వరూపాలను పూజించాలి. దీనివల్ల ప్రియజన వియోగాది కష్టాలు కలగకుండా వుంటాయి.