Thursday, 13 February 2025

శ్రీ గరుడ పురాణము (346)

 


స్థూలంగా అతిసారం రెండు విధాలు. అవి సామ(చీముగలవి) నిరామ (చీము లేనివి) మొదటిరకంలో కంపు దారుణంగా వుంటుంది. మలంద్వారం వాచిపోయి విసర్జకాన్ని అడ్డుతుంటుంది. చొంగ కారుతుంటుంది. (నోరు) నిరామ రకంలో దీనికి వ్యతిరేక లక్షణాలుంటాయి.


అతిసారను సకాలంలో నిరోధించకుంటే అది ప్రమాదించి, ముదిరి గ్రహణి అవుతుంది. వాతజగ్రహణి వచ్చినవారికి గుండెదడ, ప్లీహవాపు, మొలలు, కామెర్లు, మతిపోవుట, శబ్దంతో నిర్గమించే ఆవిరుల జిగట, గట్టి, పొడి మలం, వెక్కిళ్ళు, ఊపిరందక పోవుట, తఱచు విరేచనమగుట అను లక్షణాలు కనిపిస్తాయి.


పిత్తజ గ్రహణిలో విరేచనం పసుపు పచ్చగా లేదా నీలం కలిసిన పసుపు రంగులో, పలచగా వుంటుంది. ఆమ్లపు పొక్కులు, గుండె, గొంతుల్లో మంటలు, అన్నద్వేషం, బాగా దప్పిక వుంటాయి.


కఫం ప్రకోపించడం వల్ల వచ్చే గ్రహణిలో అరుగుదల సమస్యా, మలం పోయినపుడు నొప్పి, వాంతులు, అన్నంగాని మరే ఆహారం గాని సహించకపోవడం, నోటిమంట మాటిమాటికి ఉమ్ముఊరడం, దగ్గు, చిరాకు, పడిశం, గుండె బరువు, కడుపుబ్బు, తీపిత్రేన్పు, బద్ధకం, రోమాంచము అనే లక్షణాలుంటాయి. ఇంకా, సన్నిపాత గ్రహణిలో, మలం చిక్కగా, ముక్కలుగా పడుట, మనిషి దుక్కగా వున్నా బలహీనంగానే కనబడుట కూడా జరుగుతాయి.


గ్రహణిని కుదుర్చుట అసాధ్యము తచ్ఛాంతిని చేయవచ్చు.


(అధ్యాయం -157)



మూత్ర ఘాత నిదానం


సుశ్రూతా! వస్తి, వస్తిశిరం, మేడ్రం, కటి, వృషణములు, గుదము ఈ ఆరు శరీరభాగాలూ ఒకదానికొకటి సంబంధితములై, ముడివడియుంటాయి. మూత్రకోశం క్రిందికి వంగి వున్నా ఎపుడూ నిండుగానే వుంటుంది. దానిలోకి ఎన్నో చిన్న చిన్న నాళాలు ద్రవాలను తెచ్చి నిరంతరం ఒంపుతునే వుంటాయి. ఈ ద్రవాలలో త్రిదోషాలు ప్రవేశిస్తే ఇరవై రకాల రోగాలొస్తాయి.


మూత్రఘాతం (మూత్రం తొక్కిపట్టబడుట) మధుమేహం పైన చెప్ప ఆరు విశిష్ట భాగాలలో దేనికి సోకినా అన్నీ చెడతాయి. వాతరోగమైతే మూత్రం తక్కువగా వస్తుంది గాని పోస్తున్నంతసేపూ లింగభాగం నొప్పెడుతునే వుంటుంది. పిత్త దోషమైతే పచ్చగా వచ్చే మూత్రం లింగనాళాన్ని మండిస్తుంది. పోస్తున్నంతసేపూ మంటగానే వుంటుంది. కఫప్రకోపంలో మూత్రం ఎఱ్ఱగా వుంటుంది. లింగం బరువెక్కినట్టుంటుంది. వాపు వుంటుంది.


త్రిదోషాలూ కలిపి వుంటే మూత్రం మెరుపుతో కూడిన పసుపు రంగులో జారుతుంది. వాయువు మూత్రకోశ ద్వారాన్ని తిప్పి వైచి ఎండిపోయేలా చేస్తుంది. పిత్త, కఫాలూ, వీర్యమూ మూత్రంతో కలిసి ఒక గట్టి ముద్దలాగ ఏర్పడతాయి. ఇది గోరోచనంలా వుంటుంది.


అశ్శరీ లేదా గోరోజనమను పేరు గల భయంకర రోగంలో కఫ ప్రకోపానిదే ప్రధానపాత్ర. మొదట్లో కనిపించే లక్షణాలు మూత్రకోశం వాపు, ఆ ప్రాంతమంతటా భరింపలేనినొప్పి.


మూత్రం దానికోశంలోనే నిరోధింపబడడంతో మూత్ర విసర్జనం యాతన పూరితమవుతుంది. జ్వరం, ఆహారం పట్ల విరక్తి కలుగుతాయి. బొడ్డు భాగంలో వెనుకవైపూ మూత్రాశయంలోనూ నొప్పులు పెరుగుతాయి. మూత్రం పడినపుడు స్వచ్ఛంగా ముత్యం రంగులోనే వుంటుంది. కాని గొప్ప నొప్పి పుడుతుంది. ఎప్పటికీ రావటం లేదని బలవంతాన పోస్తే రక్తం, మాంసం బయటికి వచ్చి మరీ ఎక్కువ నొప్పి వస్తుంది. వాతజదోషం వుంటే రోగి పళ్ళు పటపట కొరుకుతుంటాడు, కుదుపుకీ లోనౌతాడు. మూత్రం తఱచుగా చుక్కలు చుక్కలుగా పడుతుంది. మలం వాయు సహితమై పడుతుంటుంది. పిత్తదోషం వల్ల మూత్రాశయంలో మంట పుడుతున్నట్లుంటుంది. ఉడకబెడుతున్నట్లు వేడిగా వుంటుంది.

No comments:

Post a Comment