Friday, 1 November 2024

శ్రీ గరుడ పురాణము (312)

 


దారిలో నొక కూడలిలో తపస్వీ, మహాత్ముడూనైన మార్కండేయ మహర్షి* కొరతవేయబడివున్నాడు (ఆ పతివ్రత పేరు సుమతి. ఆ మహామునిపేరు మిగతా అన్ని చోట్లా మాండవ్యుడనే వుంది). ఆయన శరీరంలో దిగబడిన లోహపు శంకువు వల్ల కలిగే దుస్సహవేదన తెలియకుండా సమాధిగతుడై వున్నాడు. చీకటిలో కనబడక ఈ పతివ్రత ఆయన పక్కనుండే వెళ్ళడంతో ఆమె భర్త కాలు ఆ మహర్షికి తగిలి ఆయన సమాధి భగ్నమైంది. వెంటనే భరింపరాని నొప్పి ఆయనను విహ్వలుని చేయడంతో ఇక తట్టుకోలేక తనకి తగిలిన కాలు ఎవడిదో వాడు సూర్యోదయం కాగానే మరణిస్తాడని శపించాడు. ఆ పతివ్రతకు తన భర్త సరదాగా కాలు ఊపుతూ ఉన్నాడనీ, అది ఎవరో మహానుభావునికి తగిలి శపించాడనీ తెలియగానే తన దోషం లేకుండానే తనకి వైధవ్యం కలగడం అన్యాయమనీ, కాబట్టి ఇక సూర్యుడు ఉదయించనేకూడదనీ శాసించింది. ఆమె యొక్క పాతివ్రత్యమహిమ వల్ల ఆ రాజ్యంలోనే కాక ఎక్కడా కూడా సూర్యుడుదయించలేదు. దానితో ప్రపంచం అల్లకల్లోలమైపోయింది.


భయభీతులైన దేవతలు బ్రహ్మదేవుని శరణుజొచ్చారు. ఆయన ఒక మహాపతివ్రతను శాంతింపచేసే శక్తి ఆమెకు గురుతుల్యురాలైన పరమ పతివ్రతకే వుంటుందని చెప్పి వారందరినీ పోయి అత్రి మహాముని పత్నియైన అనసూయను ప్రార్ధించుమని సూచించాడు. మహాతపస్వినియైన అనసూయ దేవతలను కరుణించి ఆ బ్రాహ్మణ పత్నిని రావించి ఆమె భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించి సూర్యుడు దయించే ఏర్పాటు చేసింది. ఇంతటి పతివ్రతే సీత కూడా.


(అధ్యాయం -142)


రామాయణకథ


రామాయణానికే సీతా చరితమనే పేరు కూడా వుంది. ఆమె చరిత్రను విన్నంత మాత్రాననే అన్ని పాపాలూ నశిస్తాయి.


భగవంతుడైన శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి మరీచి, అలా పరంపరగా కశ్యపుడు, సూర్యుడు, వైవస్వతమనువు, ఇక్ష్వాకువు ఆయన వంశంలో రఘుమహారాజు, అజమహారాజు, దశరథుడు జన్మించారని తెలుసు కదా! ఆయనకు మహా బలవంతులు పరాక్రమశాలురునైన రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నోము ఫలములై కలిగారు.


శ్రీరాముడు విష్ణువేనని చెప్తారు. హరి అవతారాలలో సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి మానవజాతికి, కుటుంబవ్యవస్థకు ప్రపంచంలోనే ఆదర్శంగా నిలచినది శ్రీరామావతారము. వసిష్ఠ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు శ్రీరాముని సర్వవిద్యా విశారదుని, సకలకళావల్లభుని గావించారు. ఆయన కన్న గొప్పవీరుడు కాని ఆయనతో సమానుడైన వీరుడు గాని చరిత్రలో లేరు.


విశ్వామిత్రుని యాగమును కాచుటలో భాగంగా శ్రీరాముడు తాటకను వధించాడు. సుబాహుని కూడా వధించాడు. మారీచుడూ అప్పుడే చావాలి కాని అలా కాకపోవడం దైవసంకల్పం. జనకునింట నున్న శివధనువును విఱచి సీతను చేపట్టి కళ్యాణ రాముడైన శ్రీరాముడు లక్ష్మణ ఊర్మిళ, భరత మాండవి, శత్రుఘ్న- శ్రుతకీర్తి జంటలతో సహా అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలలో, ప్రజలతో కలిసి కలయ దిరుగుతూ నిషాదుడైన గుహునితో కూడ స్నేహం చేసి అందరి మనసులలోనూ ఆదర్శ క్షత్రియపుత్రునిగా నిలిచాడు.

Thursday, 31 October 2024

శ్రీ గరుడ పురాణము (311)

 


భగవంతుని విభిన్న అవతారాల కథ, పతివ్రతా మహాత్మ్యం - ఆఖ్యానాలు


“వేదాది ధర్మాలను రక్షించడానికి ఆసురీధర్మాన్ని నాశనం చేయడానికీ సర్వశక్తిమంతుడైన భగవంతుడు శ్రీహరి ఎన్నో అవతారాలను ధరించి ఈ సూర్యచంద్ర వంశాల పాలన పోషణలను చేశాడు. జన్మమే లేనివాడు మనకోసం చివరికి చేపగానూ తాబేలు గానూ పుట్టవలసి వచ్చినా వెనుకాడలేదు. అని బ్రహ్మ వ్యాసమహర్షికి వివరించసాగాడని శౌనకాది మహామునులకు మహాపౌరాణికుడైన సూత మహర్షికి చెప్పసాగాడు.


"ఆ స్వామి మత్స్యావతారాన్ని ధరించి లోక కంటకుడైన హయగ్రీవుడను దైత్యుని సంహరించి వేదాలను మరల భూమి పైకి తెచ్చి మన్వాదులను రక్షించాడు. క్షీరసాగర మథన సమయంలో లోకహితాన్ని కోరి ఆదికూర్మమై మందర పర్వతాన్ని తన మూపున ధరించి భరించాడు. క్షీరసాగరం నుండి అమృతాన్ని తేవడానికీ, ప్రజారోగ్యాన్ని కాపాడడానికీ తానే స్వయంగా ధన్వంతరియై దిగివచ్చాడు. సుశ్రుతునికి అష్టాంగ పర్యంతమైన ఆయుర్వేదాన్ని కూలంకషంగా బోధించి అవతారాన్ని చాలించాడు. దేవతలను తన్ని తగలేసి అమృతభాండాన్ని ఎగరేసుకుపోయిన రాక్షసులనుండి అమృతాన్నీ, ఆ విధంగా ధర్మాన్నీ కాపాడడానికి ఆడవేషం (మోహిని) వేసి ఆటలాడడానికి కూడా సంకోచింపలేదు.


కరుణాకరుడైన శ్రీహరి వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించి అతనిచే సముద్ర పతితమైన భూమినుద్దరించాడు. నృసింహావతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. తరువాత జమదగ్ని యింట పరశురామునిగా అవతరించి మొత్తం ఆర్యావర్తాన్ని క్షత్రియమదాహంకార కబంధ హస్తాలనుండి విడిపించాడు. దీనికాయన ఇరువది యొక్క మార్లు దేశమంతటా కలయదిరిగాడు. అహంకారంతో కన్నుమిన్ను గానకుండా వరప్రసాదంతో మదమెక్కి పోయిన వేయిచేతుల కార్తవీర్యార్జునుని కూడా సంహరించి ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి అందులో మొత్తం భూమిని కశ్యప మహర్షికి దానం చేసి మహేంద్రగిరి పైకి తపస్సు చేసుకొనుటకు వెడలిపోయాడు.


తరువాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల స్వరూపంలో దశరథుని యింట శ్రీహరి అవతరించాడు.  పితృవాక్యపాలన, సత్యపరాక్రమం, దుష్టసంహారం మున్నగు ఆదర్శలక్షణాలకు ఆలవాలమైన శ్రీరాముడు మర్యాదపురుషోత్తముడెలా వుండాలో తన జీవనయానమే ఉదాహరణగా జీవించి మానవజాతికి చూపించాడు. రావణాది లోకకంటకుల నుండి జాతిని రక్షించాడు. తండ్రి మాట మేరకు పదునాలుగేండ్లు అడవులలో 

ఇడుములు పడి త్రైలోక్యపూజ్యుడై మరలి వచ్చి పట్టాభిషిక్తుడై దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, ప్రజలను, ఆనందసాగరంలో ఓలలాడించాడు. అశ్వమేధాది ఎన్నో యజ్ఞాలను చేసి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. సీతకి కూడా అంత గొప్పతనమూ ఉంది. రామకథను సీతాచరితమన్నవారూ ఉన్నారు. ఆమె అంత గొప్ప పతివ్రత.


ఇపుడు పతివ్రతామాహాత్మ్యాన్ని వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ప్రతిష్ఠాన పురంలో కౌశికుడని ఒక కుష్టు రోగియైన బ్రాహ్మణుడుండేవాడు. అతని పత్ని అతనిని దైవసమానంగా చూసుకుంటూ ప్రేమతో భక్తిగా, అతనికి సర్వోపచారాలూ చేస్తూ అతనికి ఏమాత్రమూ అసౌకర్యం కలుగకుండా సేవిస్తుండేది. అయినా అదేమి కర్మయోగాని ఆ పతి ఆమెనొక మంచి మాటైనా ఆడకపోగా ఆమెపై విసుక్కొనేవాడు, కోపించేవాడు, కోరరాని కోరికలు కోరేవాడు. ఒకనాడతడు వేశ్యా సంపర్కమును వాంఛించాడు. ఆమె బాగా చీకటి పడినాక అతనిని భుజాలపై నెత్తుకుని, తగినంత ధనాన్ని కూడా పట్టుకొని వేశ్య ఇంటివైపు పోసాగింది.

Wednesday, 30 October 2024

శ్రీ గరుడ పురాణము (310)

 


గంగ ద్వారా శంతనునికి మహాప్రతాపవంతుడు, సాక్షాత్సకల ధర్మ స్వరూపుడునగు దేవవ్రతుడు (భీష్ముడు) ఉద్భవించాడు. ఆయనే భారతదేశానికి రాజయివుంటే చరిత్ర గతి మంచి వైపు మరలివుండేది. కాని శంతనుండు చేసిన మోహజనితమైన పొరపాటు వల్ల దేశం కష్టాల పాలైంది. ఆయన సత్యవతిని పెండ్లాడడం కోసం ఈయన కఠోర బ్రహ్మచర్య దీక్షను చేపట్టాడు.


సత్యవతికి అప్పటికే పరాశర మహర్షి ద్వారా విష్ణు సమానుడైన వ్యాసమహర్షి జన్మించియున్నాడు. ఆమెకి శంతనుని ద్వారా చిత్రాంగద, విచిత్ర వీర్యులు జనించారు. వారు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల సంతానం లేకుండానే మరణించడంతో వ్యాసమహర్షి దేవర న్యాయం వల్ల సత్యవతి కోడళ్ళలో అంబికకు ధృతరాష్ట్రుడూ, అంబాలికకు పాండురాజూ జన్మించారు. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా దుర్యోధన దుశ్శాసనాది నూరుగురు కొడుకులూ, పాండురాజుకి కుంతి, మాద్రియను పత్నుల ద్వారా ధర్మరాజాది పంచపాండవులూ జనించారు. వీరికీ చాలామంది కొడుకులే పుట్టారు గానీ అంతా యుద్ధంలో పోయారు. అర్జున పుత్రుడైన అభిమన్యుని కొడుకు మాత్రమే మిగిలాడు. పరిక్షీణించిన వంశంలో నిలిచిన ఒకే ఒక్క నిసుగు కావున అతన్ని 'పరిక్షిత్' అన్నారు. అతని కొడుకు జనమేజయుడు. (అనుబంధం-11)లో చూడండి. (అధ్యాయాలు - 139,140)


భవిష్యత్తులో రాజవంశాలు


చంద్రవంశంలో జనమేజయుని వంశంలో క్రమంగా శతానీక అశ్వమేధ దత్త, అధిసోమక, కృష్ణ, అనిరుద్ధ, ఉష్ణ, చిత్రరథ, శుచిద్రథ, వృష్టిమాన్, సుషేణ, సునీథక, నృచక్షు, ముఖబాణ, మేధావి, నృపంజయ, బృహద్రథ, హరి, తిగ్మ, శతానీక, సుదానక, ఉదాన, అహ్నినర, దండపాణి, నిమిత్తక, క్షేమక, శూద్రకులు రాజ్యం చేశారు.


రుద్రదేవా! ఇక్ష్వాకు వంశీయుడైన బృహద్బలుని వంశపారంపర్య క్రమంలో బృహద్బలుడు, ఉరుక్షయ, వత్సవ్యూహ, సూర్య, సహదేవ, బృహదశ్వ, భానురథ, ప్రతీచ్య, ప్రతీతక, మనుదేవ, సునక్షత్ర, కిన్నర, అంతరిక్షక, సువర్ణ, కృతజిత్, ధార్మిక, బృహద్ భ్రాజ, కృతంజయ, ధనంజయ, సంజయ, శాక్య, శుద్ధోదన, బాహుల, సేనజిత్, క్షుద్రక, సమిత్ర, కుడవ, సుమిత్రులు రాజ్యపాలనం గావించారు.


ఇక మగధ వంశంలో క్రమంగా జరాసంధ, సహదేవ, సోమాపి, శ్రుతశ్రవ, అయుతాయు, నరమిత్ర, సుక్షత్ర, బహుకర్మక, శ్రుతంజయ, సేనజిత్, భూరి, శుచి, క్షేమ్య, సువ్రత, ధర్మ, శ్మశ్రుల, ధృఢసేన, సుమతి, సుబల, నీత, సత్యజిత్, విశ్వజిత్, ఇషుంజయులు పరిపాలకులయినారు. జరాసంధుని అసలు పేరు బృహద్రథుడు కాబట్టి వీరికి బార్హద్రథులని పేరు. వీరి తరువాత వారిలో ముందు ముందు అధర్మం, శూద్రత్వం ఎక్కువగా వుంటాయి.


సాక్షాత్తు అవ్యయుడైన నారాయణుడే స్వర్గాదిలోకాలను రచించాడు. ఆయనే మూడు పేర్లతో సృష్టి, స్థితి, లయలను గావిస్తాడు. ప్రళయం నైమిత్తికమనీ, ప్రాకృతమనీ, ఆత్యంతిక మనీ మూడు విధాలు. ప్రళయ కాలం వచ్చినపుడు భూమి నీటిలో, నీరు తేజంలో, తేజం గాలిలో, గాలి నింగిలో, నింగి అహంకారంలో, అహంకారం బుద్ధిలో, బుద్ధి జీవాత్మలో, చివరగా ఆ జీవాత్మ అవ్యక్త పరబ్రహ్మ పరమాత్మలో విలీనమైపోతాయి.


ఏకమాత్ర నిత్యుడా పరబ్రహ్మ ఒక్కడే. ఈ మహారాజులూ, సార్వభౌములూ, చక్రవర్తులూ, ఎవరూ శాశ్వతులు కాలేదు. కాలేరు. కాబట్టి మనిషి పాప కర్మకి దూరంగా అవినాశియైన ధర్మానికి దగ్గరగా జీవించాలి. పాపి సార్వభౌముడైనా హరిని చేరలేడు. పుణ్యాత్ముడు నిరుపేదయైనా హరిని చేరుకోగలడు.


(అధ్యాయం -141)

Tuesday, 29 October 2024

శ్రీ గరుడ పురాణము (309)

 


అంగుని వంశంలో అనపాన, దివిరథ, ధర్మరథ, రోమపాద, చతురంగ, పృథులాక్ష, చంప, హర్యంగ, భద్రరథ, బృహత్కర్మ, బృహద్భాను, బృహద్మన, జయద్రథ, విజయ, ధృతి, ధృతవ్రత, సత్యధర్మ, అధిరథ, కర్ణ, వృషసేనులు పుట్టారు.


రుద్రాది దేవతలారా! ఇక పురు వంశ వర్ణన వినండి.


పురువు, జనమేజయుడు, నమస్యు, అభయుడు, సుద్యు, బహుగతి, సంజాతి, వత్సజాతి, రౌద్రాశ్వుడు, ఋతేయు, రతినారుడు, ప్రతిరథుడు, మేదాతిథి, ఐనిలుడు, దుష్యంతుడు, భరతుడు (ఇతడే శకుంతల కొడుకు), వితథుడు, మన్యువు, నరుడు, సంకృతి, గర్గుడు, అమన్యువు, శిని- వీరంతా పౌరవ వంశ వర్ధనులే. (రౌద్రాశ్వునికి ఏడుగురు కొడుకులు. వారి పేర్లు ఋతేయు, స్థండిలేయు, కక్షేయు, కృతేయు, జలేయు, సంతతేయులు వీరంతా రాజశ్రేష్ఠులే)


భరతపుత్రుడైన మన్యువు వంశంలో వరుసగా మహావీర, ఉరుక్షయ, త్రయ్యారుణి, వ్యూహక్షత్ర, సుహోత్ర, రాజన్యులుద్భవించారు. హస్తి, అజమీఢ, ద్విమీఢులు, సుహోత్రనందనులు. హస్తి కొడుకు పేరు పురుమీఢుడు కాగా అజమీఢుని కొడుకు కణ్వుడు, మనుమడు మేధాతిథి. వీరి వల్లనే బ్రాహ్మణులలో కాణ్వాయన గోత్రమేర్పడింది.


అజమీఢుని మరొక పుత్రుడైన బృహదిషుని ద్వారా రాజవంశం నిలబడింది. బృహదిషుని వంశంలో క్రమంగా బృహద్దను, బృహత్కర్మ, జయద్రథ, విశ్వజిత్, సేనజిత్, రుచిరాశ్వ, పృథుసేన, పార, నృప, సృమరులు రాజులైనారు. పృథుసేనుని మరొకపుత్రుడైన సుకృతి వంశంలో కూడా క్రమంగా విభ్రాజ, అశ్వహ, బ్రహ్మదత్త, విష్వక్సేనులు కూడా రాజ్యం చేశారు.


ద్విమీఢుని వంశంలో క్రమంగా యవీనర, ధృతిమాన, సత్యధృతి, ధృఢనేమి, సుపార్శ్వ, సన్నతి, కృత, ఉగ్రాయుధ, క్షేమ్య, సుధీర, పురంజయ, విదూరథులు జనించారు.


అజమీఢునికి పత్ని నళిని ద్వారా నీలమహారాజుదయించాడు. ఆయన వంశంలో క్రమంగా శాంతి, సుశాంతి, పురు, అర్క, హర్యశ్వ, ముకులులు వర్ధిల్లారు. ముకులునికైదుగురు కొడుకులు. వారు యవీర, బృహద్భాను, కమిల్ల, సృంజయ, శరద్వానులు.


వీరిలో శరద్వానుడు బ్రాహ్మణ వృత్తి నవలంబించి పరమ వైష్ణవునిగా పేరు గాంచాడు. ఆయనకు పత్ని అహల్య ద్వారా దివోదాసుడను పుత్రుడు కలిగాడు. దివోదాసుని కొడుకు శతానందుడు. ఇతని కొడుకైన సత్యధృతి దేవకాంతయైన ఊర్వశి ద్వారా కృపాచార్యునీ, కృపినీ కన్నాడు. ఈ కృపినే భారతవీరుడు, గురుదేవుడునైన ద్రోణాచార్యుడు పెండ్లాడాడు. వారి పుత్రుడు అశ్వత్థామ.


దివోదాసుని వంశంలో వరుసగా మిత్రాయు, చ్యవన, సుదాస, సౌదాస, సహదేవ, సోమక, జహ్ను, పృషత, ద్రుపద, ధృష్టద్యుమ్న, ధృష్టకేతులు జనించారు.


అజమీఢుని పుత్రుడైన ఋక్షుని వంశంలో వరుసగా సంవరణుడు, కురు మహారాజు వర్దిల్లారు. కురురాజుకి ముగ్గురు కొడుకులు. వారు సుధను, పరీక్షిత్, జహ్నులు.


సుధనుని వంశంలో క్రమంగా సుహోత్ర చ్యవన, కృతక, ఉపరిచరవసువులు రాజులు కాగా ఉపరిచరవసువునకు బృహద్రథ, ప్రత్యగ్ర, సత్యాదిగా అనేక పుత్రులు కలిగారు.


బృహద్రథుని వంశంలో కుశాగ్ర, ఋషభ, పుష్పవాన్, సత్యహిత, సుధన్వ, జహ్నులుదయించారు. బృహద్రధుని మరొకపుత్రుడు జరాసంధుడు. అతని వంశక్రమంలో సహదేవ, సోమాపి. అతని పుత్రులైన శ్రుతవంత, భీమసేన, ఉగ్రసేన, శ్రుతసేన, జనమేజయులుద్భవించారు.


కురు మహారాజు మరొక కొడుకైన జహ్నుని నుండి క్రమంగా సురథ, విదూరథ, సార్వభౌమ, జయసేన, అవధీత, అయుతాయు, అక్రోధన, అతిథి, ఋక్ష, భీమసేన, దిలీప, ప్రతీప మహారాజులుదయించగా ఆయనకు దేవాపి, శంతను, బాహ్లికులుదయించారు. బాహ్లికుని వంశంలో క్రమంగా సోమదత్తుడు, భూరి, భూరిశ్రవసుడు, శలుడు జన్మించారు.

Monday, 28 October 2024

శ్రీ గరుడ పురాణము (308)

 


చిత్రకునికి పృథు, విపృథు, సాత్త్వత నందనుడైన అంధకునికి శుచి, భజమాన పుత్రుడైన కుకురునికి ధృష్టుడు (ధృష్టకుడు) జన్మించారు. ధృష్టుని వంశంలో క్రమంగా కాపోతరోమకుడు, విలోముడు, తుంబురుడు, దుందుభి, పునర్వసు, ఆహుకుడు జన్మించారు. ఆహుకునికి ఆహుకియను కూతురూ దేవకుడు, ఉగ్రసేనుడు అను కొడుకులు జనించగా దేవకుని కూతురుగా (వరమున) శ్రీకృష్ణపరమాత్మ కన్నతల్లి దేవకి ఆవిర్భవించింది. దేవకునికి మరొక ఆరుగురు కూతుళ్ళు కూడా కలిగారు. ఆయన తన సప్త కన్యలనూ వసుదేవునికే ఇచ్చి వివాహం చేశాడు. దేవక పుత్రుడైన సహదేవునికి దేవవాన్ ఉపదేవ నామకులైన ఇద్దరు కొడుకులు.


అంధక పుత్రుడైన భజమాను నందనుడు విదూరథుని వంశంలో క్రమంగా శూర, శమి, ప్రతిక్షత్ర, స్వయంభోజ, హృదిక, కృతవర్మాదులు జనించారు.


శూరునికైదుగురు కూతుళ్ళు కూడా పుట్టారు. వారు పృథ, శ్రుతదేవి, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి. వీరిలో పృథను కుంతి భోజకుని పెంపకానికిచ్చేశారు. అతడామెను అల్లారుముద్దుగా పెంచి పాండురాజుని కిచ్చి వివాహం చేశాడు. ఆమె పుత్రులే భారతవీరులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. తన సవతి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడ పృథయే పెంచింది. ఈమె పుత్రుడే కర్ణుడు కూడ. ఈమెను 'కుంతి' అని పిలిచేవారు.


ఈ కుంతి చెల్లెలు శ్రుతదేవి కడుపున బుట్టినవాడే దంతవక్త్రుడు. శ్రుతకీర్తి కేకయ రాజుని పెండ్లాడి సతర్దనాది అయిదుగురు కొడుకులను కన్నది. రాజాధిదేవికి విందు, అనువిందులని ఇద్దరు కొడుకులు పుట్టారు. శ్రుతశ్రువ చేది రాజైన దమఘోషుని పెండ్లాడింది. ఆమె కొడుకే శిశుపాలుడు.


వసుదేవునికి పౌరవ, మదిర, దేవకి, రోహిణి, భద్రాది భార్యలలో దేవకీ నందనుడు శ్రీకృష్ణపరమాత్మ కాగా రోహిణీపుత్రుడు బలరాముడు. బలరామునికి రేవతి ద్వారా సారణ, శఠాది పుత్రులు జనించారు. దేవకి పుత్రులైన కీర్తిమాన్, సుషేణ, ఉదార్య, భద్రసేన, ఋజుదాస, భద్రదేవులను కంసుడు చంపేశాడు. శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలమంది కొడుకులు పుట్టారు. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబులు ప్రధానులు. ప్రద్యుమ్నపత్ని కకుద్మినికి మహాపరాక్రమశాలియైన అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధునికి సుభద్రయను పేరు గల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు. అతడు అతని పుత్రుడు ప్రతి బాహువు, మనుమడు చారు (దత్తుడు) రాజ్యాలనేలారు.


యయాతి పుత్రుడైన తుర్వసుని వంశంలో వహ్ని, భర్గ, భాను, కరంధమ, మరుత్తులు జనించారు.


రుద్రదేవా! ఇక ద్రుహ్యు అను వంశములను వర్ణిస్తాను వినండి.


యయాతి పుత్రుడు ద్రుహ్యుని తరువాత అతని వంశంలో వరుసగా సేతు, ఆరద్ధ, గాంధార, ధర్మ, ఘృత, దుర్గమ, ప్రచేతులు జన్మించారు.


అనువు వంశంలో వరుసగా సభానల, కాలంజయ, సృంజయ్, పురంజయ, జనమేజయ, మహాశాల, ఉశీనర, శిబి, వృషదర్భ, మహామనోజ, తితిక్షు, రూషద్రథ, సుతపులు జన్మించారు. సుతపసుతుడైన బలి మహారాజు కైదుగురు కొడుకులు. వారే అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, పౌండ్రులు.

Saturday, 26 October 2024

శ్రీ గరుడ పురాణము (307)

 

నహుష చక్రవర్తికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వికృతి నామకులగు మరో అయిదుగురు కుమారులున్నారు. యయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు పుట్టారు. వృషపర్వపుత్రియగు శర్మిష్ఠ ద్వారా యయాతికి ద్రుహ్యు, అను, పురునామకులైన తనయులు జనించారు.


యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, రఘువులనే కొడుకులు పుట్టారు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు కాగా అతనికి హయహైహయులు జనించారు. హయునికి అనరణ్యుడూ హైహయునికి ధర్ముడూ పుట్టారు. ధర్ముని వంశక్రమంలో ధర్మనేత్రుడు, కుంతి (కుంతుడు), సాహంజుడు, మహిష్మంతుడు, భద్రశ్రేణ్యుడు, దుర్దముడు వర్ధిల్లారు.


దుర్దముని కారుగురు కొడుకులు. వారు ధనక, కృతవీర్య, జానక, కృతాగ్ని, కృతవర్మ,కృతౌజులు. వీరంతా పరమ బలశాలులే. కృతవీర్యుని కొడుకు అర్జునుడు, అతని పుత్రుడు శూరసేనుడు. కృతవీర్యునికి అర్జునుడే కాక, ఇంకా జయధ్వజ, మధు, శూర, వృషణ నామకులైన పుత్రులు జనించారు. వీరంతా గొప్ప సువ్రతులు. జయధ్వజ పుత్రుడు తాలజంఘుడు కాగా అతని తనయుడు భరతుడు. వృషణపుత్రుడు మధువు, అతని పుత్రుడు వృష్టి, ఈ వృష్టియే వృష్టి వంశానికి మూలపురుషుడు.


క్రోష్టు వంశంలో క్రమంగా విజజ్జివాన్, ఆహి, అశంకు, చిత్రరథ, శశ బిందువులు జనించారు. ఈ శశబిందునికి లక్షమంది పత్నుల ద్వారా పృథుకీర్తి, పృథుజయ, పృథుదాన, పృథుశ్రవాది పదిలక్షలమంది శ్రేష్ఠులైన పుత్రులుదయించారు. పృథుశ్రవుని పుత్రుడు, అతని కొడుకు ఉశనుడు, అతని పుత్రుడు శితగు, అతని తనయుడు శ్రీ రుక్మకవచుడు. ఇతనికి రుక్మ, పృథురుక్మ, జ్యామఘ, హరి, పాలితులనే పుత్రులు పుట్టారు. జ్యామఘుని కొడుకు పేరు విదర్భుడు.


విదర్భునికి శైబ్య అనే భార్య ద్వారా క్రథ, కౌశిక, రోమపాదులను పుత్రులు కలిగారు. రోమపాదుని కొడుకు బభ్రువు, మనుమడు ధృతి.


కౌశికుని వంశంలో ఋచి, చేది, కుంతి, వృష్టి, నివృత్తి, దశార్హ, వ్యోమ, జీమూత, వికృతి, భీమరథ, మధురథ, శకుని, కరింభ, దేవమాన్ (దేవనత) దేవక్షత్ర, మధు, కురువంశ, అను పురుహోత్ర, అంశు, సత్త్వ శ్రుత, సాత్త్వతులు రాజులైనారు.


సాత్త్వతునికి ఏడుగురు కొడుకులు. వారు భజినుడు, భజమానుడు, అంధకుడు, మహా భోజుడు, వృష్టి, దివ్యవంతుడు, దేవవృధుడు. భజమానుని కొడుకుల పేrlu నిమి, వృష్టి, అయుతాజిత్, శతజిత్, సహస్రజిత్, బభ్రు, దేవ, బృహస్పతి.


మహాభోజుని వంశంలో భోజుడు, వృష్టి, సుమిత్రుడు జనించగా సుమిత్రుని ముగ్గురు కొడుకులైన స్వధాజిత్, అనామిత్ర, అశినులలో అనమిత్రుని ముగ్గురు కొడుకులయిన నిఘ్న, ప్రసేన, శిబిలలో శిబి కొడుకు సత్యకుడు కాగా అతని కొడుకు సాత్యకి. ఇతని వంశంలో వరుసగా సంజయుడు, కులి, యుగంధరుడు జన్మించారు. వీరిని శైబేయులంటారు.


అనమిత్రునికి వృష్టి, శ్వఫల్కుడు, చిత్రకుడు అని మరో ముగ్గురు కొడుకులున్నారు. శ్వఫల్కునికి గాందినియను పత్ని ద్వారా పరమవైష్ణవోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు. ఉపమద్గుడు, దేవవంతుడు, ఉపదేవుడు అక్రూర నందనులు.

శ్రీ గరుడ పురాణము (306)

 


కుశుడు, అతిధి, నిషధుడు, నలుడు, నభస్సు (నభుడు), పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు అహీనకుడు, రురుడు, పారియాత్రుడు, దలుడు, చలుడు, ఉక్షుడు, వజ్రనాభుడు, గణుడు, ఉషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శీఘ్రుడు, మరుడు, సుశ్రుతుడు, ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుకుడు, మహావీర్యుడు, సుధృతి, ధృష్టకేతువు, హర్యశ్వుడు, మరుడు, ప్రతీంధకుడు, కృతిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహాధృతి, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, సీరధ్వజుడు.


సీరధ్వజునికి సీత యను పేరుగల పుత్రిక, కుశధ్వజుడనే తమ్ముడు ఉన్నట్టు తెలుస్తోంది. సీరధ్వజుని పుత్రుడైన భానుమంతుని వంశంలో క్రమంగా శతద్యుమ్నుడు, శుచి, ఊర్ణుడు, సనద్వాజుడు, కులి, అనంజనుడు, కులిజిత్తు, ఆధినేమికుడు, శ్రుతాయువు సుపార్శ్వుడు, సృంజయుడు, క్షేమారి, అనేనుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వవరుడు, సువర్చుడు, సుపార్శ్వుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, ధృతి, బహులాశ్వుడు, కృతి, జనకుడు రాజులైనారు.


ఈ జనక మహారాజు రెండు వంశాలవాడని తెలుస్తోంది. ఆయన రాజయోగిగా యోగమార్గాన్ని అనుసరించి దానిని అభివృద్ధి చేశాడు. (అధ్యాయం -138)


చంద్రవంశ వర్ణన


శ్రీహరి: పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. "నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి అత్రి, ఆయననుండి చంద్రుడు ప్రాదుర్భవించారు.


చంద్రుని నుండి అతని వంశంలో బుధుడు, పురూరవుడు కలిగారు. చంద్రుని మనుమడైన పురూరవునికి ఊర్వశి ద్వారా ఆరుగురు పుత్రులు కలిగారు. వారు శ్రుతాత్మక, విశ్వావసు, శతాయు, ఆయు, ధీమాన్, అమావసులు.


అమావసుని వంశంలో వరుసగా భీమ, కాంచన, సుహోత్ర, జహ్ను, సుమంతు, ఉపజాపక, బలాకాశ్వ, కుశులుద్భవించారు. కుశునికి నలుగురు కొడుకులు వారు కుశాశ్వ కుశనాభ వసు అమూర్తరయులు.


కుశాశ్వుని కొడుకు గాధి. గాధి కొడుకే సుప్రసిద్ధ రాజు, రాజర్షి, కడకు బ్రహ్మర్షి, గాయత్రి మంత్ర ద్రష్టయునగు విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. ఆయనకు దేవరాత, మధుచ్ఛందాది అనేక పుత్రులు కలిగారు. గాధి తన కూతురైన సత్యవతిని ఋచీకుడను బ్రాహ్మణోత్తమునకిచ్చి పెండ్లి చేశాడు. ఋచీక పుత్రుడు జమదగ్ని. జమదగ్ని కొడుకే పరశురాముడు.


బుధపుత్రుడైన ఆయువు కొడుకు నహుషుడు. ఇతని పుత్రులు అనేన, రాజి, క్షత్ర వృద్ధ, రంభకులు. క్షత్ర వృద్ధ (వృద్ధి) పుత్రుడు సుహోత్ర మహారాజుకు కాశ్య, కాశ, గృత్సమదులని ముగ్గురు తనయులు. గృత్సమదుని కొడుకే శౌనకుడు. కాశ్యపుత్రుడైన దీర్ఘతమునికి ధన్వంతరి జనించాడు. ఆతని వంశంలో క్రమంగా కేతుమాన్, భీమరథ, దివోదాస, ప్రతర్దను లుదయించారు. ప్రతర్దనునే శత్రుజిత్తని కూడా అంటారు.


శత్రుజిత్తుని వంశంలో వరుసగా ఋతధ్వజ, అలర్క, సన్నతి, సునీత, సత్యకేతు, విభు, సువిభు, సుకుమార, ధృష్టకేతు, వీతిహోత్ర, భర్గ, భూమికులు రాజ్యం చేశారు.


నహుష పుత్రుడైన రాజి లేదా రజికి అయిదువందలమంది కొడుకులు పుట్టారు. కానీ వారందరినీ ఇంద్రుడు సంహరించాడు. అక్కడ నహుష పుత్రుడైన క్షత్ర వృద్ధుని వంశం వర్దిల్లింది. వారి పేర్లు ప్రతిక్షత్ర, సంజయ, విజయ, కృత, వృషధన, సహదేవ, అదీన జయత్సేన, సంకృతి క్షత్ర ధర్ములు, ఇది నహషుని ఒక వంశం.