Friday 26 April 2024

శ్రీ గరుడ పురాణము (160)

 


బలాసురుని ఎముకలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అవి వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి. హిమాచల, మాతంగ, సౌరాష్ట్ర, పౌండ్ర, కళింగ, కోసల, వేణ్వాతట, సౌవీర అను పేర్లు గల ఎనిమిది భూభాగాలు వజ్రక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. హిమాలయంలో పుట్టిన వజ్రాలు తామ్రవర్ణంలోనూ; వేణుకాతటంలో ప్రాప్తించినవి చంద్ర సమాన శ్వేతకాంతులలోనూ; సౌవీర దేశంలో లభిస్తున్నవి నీలకమల, కృష్ణమేఘ వర్ణంలోనూ; సౌరాష్ట్ర ప్రాంతీయ వజ్రాలు తామ్రవర్ణంలోనూ, కళింగ దేశీయ వజ్రాలు బంగారు రంగులోనూ వెలుగులను విరజిమ్ముతూ వుంటాయి. ఈ కోవలోనే చెప్పుకోతగ్గ కోసల దేశీయ వజ్రాల వర్ణం పసుపు పచ్చ కాగా పుండ్ర దేశీయ వజ్రాలు శ్యామల వర్ణంలోనూ మతంగ క్షేత్రపు వజ్రాలు లేత పసుపు రంగులోనూ వుంటాయి.


ఒక కొన్ని ప్రత్యేక లక్షణాలున్న వజ్రంలో నిత్యం ఎవరో ఒక దేవత నివసిస్తుండడం జరుగుతుంది. అత్యంత క్షుద్ర వర్ణం అంటే ఒక రంగు ఉందని అనిపిస్తుంటుంది గాని అది ఏ రంగో తెలియనంత లేత రంగు తొలి లక్షణం. ప్రక్కలలో స్పష్టంగా కనిపించే రేఖ, బిందు మాత్రం నలుపు కాక పదక (కాకి పాదం), త్రాసదోషరాహిత్యం, పరమాణువంత తీక్షమైన ధార - ఈ లక్షణాలు దేవవాస వజ్రానివి.


వజ్రం యొక్క రంగుని బట్టి అందులో ఏ దేవతలుంటారో శాస్త్రంలో వుంది. ఆకుపచ్చ తెల్ల, పచ్చ, పింగళ, నల్ల, రాగి రంగుల వజ్రాల్లో క్రమంగా విష్ణువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, మరుత్తులు ప్రతిష్టితులై వుంటారు.


ఏయే వర్ణాల వారికేయే రంగుల వజ్రాలు (ధరించుటకు) ప్రశస్తమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మణులకు శంఖ, కుముద, లేదా స్పటిక సమాన శుభ్ర వర్ణమున్న వజ్రాలు ప్రశస్తం. క్షత్రియులు శశ (చంద్ర) వర్ణం లేదా బభ్రు- ధూర వర్గాలు లేదా కనుపాపల రంగులో నుండు వజ్రాలను ధరించడం మంచిది. వైశ్యులు కుంకుమ లేదా లేత అరిటాకు రంగులో వున్న వకాలను పెట్టుకోవాలి. శూద్రులకు వెండి రంగులో నున్న వజ్రాలు శ్రేష్టం.


విద్వాంసులు రాజులకు ముఖ్యంగా రెండు రంగుల వజ్రాలు మిక్కిలి ప్రశస్తమనీ ఇవి మిగతా వర్ణాలకు అంతగా మేలు చేయవనీ చెప్తారు. జవావర్గం (ఎరుపులో ఒక రకం?), పగడ సమాన రక్తవర్ణం కలిపి వున్న వజ్రం లేదా మామిడిపండు రసం వంటి పసుపు రంగు వజ్రం రాజులకు లాభదాయకం.



Thursday 25 April 2024

శ్రీ గరుడ పురాణము (159)

 


దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు, ఆ బలాసురుని శరీరాన్ని ఆకాశమార్గంలో గొనిపోసాగినారు. ఆ యాత్రా వేగం వల్ల అతని శరీరం తనంతట తాను ముక్కలైపోయి పృథ్విపై అక్కడక్కడ పడినది.


సముద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో, మైదానాల్లో ఎక్కడెక్కడ రంచమాత్రమైనా (అత్యల్పపరిమాణం) ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో, అక్కడక్కడ, రత్నాల గనులేర్పడ్డాయి. వాటి నుండి వెలికితీయబడిన రత్నాలకూ (వజ్రాలకూ) అద్భుత శక్తులున్నట్లు కనుగొనబడింది. రత్నాలలో వజ్రం, ముక్తిమణి, పద్మరాగం, మరకతం, ఇంద్రనీలం, వైదూర్యం, పుష్పరాగం, కర్కేతనం, పులకం, రుధిరం, స్పటికం, ప్రవాళం మొదలగు పేర్లతో ప్రత్యేక లక్షణాలతో ఇవి ప్రకాశిస్తున్నాయి. జ్ఞానపు ఆవలియొడ్డును చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పారదర్శులు, విద్వజ్జనులు ఈ యీ రత్నాలకు ఆయా పేళ్ళను వాటి వాటి లక్షణాలను, కలిమి ఫలాలను కూలంకషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు.


ఈ విద్వాంసులు ముందుగా రత్నం యొక్క ఆకారం, రంగు, గుణం, దోషం, పరీక్ష, మూల్యాదుల జ్ఞానాన్ని తత్సంబంధిత సర్వశాస్త్రాలనూ అధ్యయనం చేసి దాని ఆధారంగా శుభాశుభాలను నిర్ణయిస్తారు. ఈ అధ్యయనం అరకొరగా వుంటే అశుభాలు కలుగుతాయి. ఇక్కడొక విచిత్రమేమిటంటే తప్పుడు రత్నాన్ని ధరించినవారికే గాక ఆ రత్నాన్ని పెట్టుకొమ్మని సలహా ఇచ్చిన వారికి కూడ దుష్ఫలితాలు కలుగుతుంటాయి. కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తరువాతనే రత్నశాస్త్రులయ్యే సాహసం చేయాలి.


ఐశ్వర్యాన్ని కోరుకొనేవారు గాని ఇతరులు గాని బాగా పరీక్ష చేయబడిన, అత్యంత శుద్ధమైనవిగా ధ్రువీకరింపబడిన రత్నాలనే ధరించాలి. రాజులైతే అట్టి రత్నాలను సంగ్రహించి వుంచాలి. కొన్నింటిని కాలానుగుణంగా ధరించాలి.


ఇక రత్న ప్రభావాల విషయానికొస్తే సర్వ ప్రథమంగా మహాప్రభావశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి.


Wednesday 24 April 2024

శ్రీ గరుడ పురాణము (158)

 


ప్రశ్నలు చెప్పేవారు అడిగేవారి నాడీ ప్రవాహస్థితిని గమనించాలి. తనకు శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా, లాభమొస్తుందా నష్టం వచ్చిపడుతుందా అని అడిగేవారికి అడుగుతున్నపుడు మధ్యమనాడి చలనంలో వుంటే అశుభమూ, నష్టమే కలుగుతాయి కాబట్టి జాగ్రత్తపడాలని చెప్పాలి. అదే, అదే సమయంలో ఇడా, పింగళనాడులు ప్రవహిస్తుంటే శుభం కలుగుతుందనీ, లాభమే వస్తుందనీ నిస్సందేహంగా చెప్పవచ్చును.


అలాగే అడిగేవారి గొంతుని బట్టి అది ఏ స్వరంలో వుందో ఆ స్వరం నాడీ మండలంలో ఎక్కడి నుండి వస్తోందో బాగా విచారించి సాధ్యాసాధ్యాలనూ, సిద్ధ్యసిద్ధులనూ పోల్చుకొనవచ్చును. దీనికి స్వరోదయ విజ్ఞానం తెలియాలి".


(అధ్యాయం - 67)


(గరుడ పురాణంలో ఇటువంటి విజ్ఞానమొకటి కలదనే విషయం మాత్రమే సూచింప బడింది. ఈ అంశంపై కృషి చేయదలచుకున్న వారు నాడీగ్రంథాలను అవలోకించాలి) 

రత్నాల పుట్టుక కథ వజ్ర పరీక్ష


“ప్రాచీన కాలంలో బలాసురుడను ఒక రాక్షసుడుండేవాడు. అతడు ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో జయించి దేవతల అసమర్థతనీ తన త్రైలోక్యాధిపత్యాన్నీ లోకానికి చాటుకున్నాడు. బలాసురునికి ఇచ్చిన మాటను తప్పకూడదనే నియమం వుండేది. దేవతలు బ్రాహ్మణ వేషాలలో అతని వద్దకు పోయి తామొక యజ్ఞాన్ని తలపెట్టామనీ బలిపశువు కోసం ఆతనిని యాచించడానికి వచ్చామనీ బలాసురుని బతిమాలుకున్నారు. అతడు వెంటనే వారికి కావలసిన బలిని తాను సమకూర్చగలనని మాట ఇచ్చాడు. వెనువెంటనే దేవతలు “నువ్వే కావాలి' అన్నారు. ఈ విధంగా తన వాగ్వజ్రానికి తానే బలి అయిపోయాడు బలాసురుడు.


బలాసురుని బలిదానం ఉత్తినేపోలేదు. లోకకల్యాణం జరిగింది. సామాన్యులు చేసే యజ్ఞానికే కీటకసంహారం, కాలుష్య నివారణం, నగరశాంతి వంటి లోకమంగళకర కార్యాలు జరుగుతాయి కదా, అలాంటిది ఇంద్రాదులంతటివారు ఒక మహాదాతను బలిపశువుగానే చేసిన యజ్ఞానికి సామాన్య ఫలితముంటుందా! ఒక లోకకల్యాణమేమి, త్రైలోక్య కల్యాణమే జరిగినది. బలాసురుని శరీరము ఈ విశుద్ధ కర్మ వలన పరమ విశుద్ధ శరీరముగా పరిణతి చెందినది. సత్త్వగుణ సంపన్నమై విరాజిల్లినది. అందలి అన్ని అంగములూ రత్నబీజములై ప్రపంచమునే సంపన్నము గావించినవి.


Tuesday 23 April 2024

శ్రీ గరుడ పురాణము (157)

 


స్వరోదయ విజ్ఞానం


మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని కొన్ని శబ్దాలు, పలికే స్వరాలు కూడా కొన్ని కొన్ని కార్యాల శుభాశుభ ఫలితాలను సూచింపగలవు.


మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. ఇవి నాభి ప్రదేశానికి దిగువగా వుండే కందస్థాన లేదా మూలాధారము నుండి బయలుదేరి శరీరమందంతటా విస్తరించి వుంటాయి. డెబ్బది రెండు వేల నాడులు నాభి మధ్య భాగంలోనే చక్రాకారంలో నిలచి వుంటాయి. వీటిలో వామ, దక్షిణ, మధ్యమ నామకాలైన మూడు శ్రేష్ఠ నాడులుంటాయి. వీటినే క్రమంగా ఇడా, పింగళా, సుషుమ్లా నాడులని వ్యవహరిస్తారు. వీటిలో వామ నాడి చంద్రుని వలెనూ దక్షిణ నాడి సూర్యుని వలెనూ, మధ్యమ నాడి అగ్ని వలెనూ ఫలాలనిస్తాయి. ఇవి కాలరూపిణులు.


వామనాడి అమృత రూప. ఇది జగత్తుని బ్రతికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనిని 'ఆప్యాయితా' అంటారు. దక్షిణ నాడి తన రౌద్రగుణం వల్ల జగత్తుని మాడ్చేస్తుంది. అంటే శోషిల్లజేస్తుంది. శరీరంలో ఈ రెండు నాడులూ ఒకేసారి ప్రవహిస్తే అన్ని కార్యాలూ నాశనం కావచ్చు, మృత్యువే సంభవించవచ్చు.


యాత్రాదులకు బయలుదేరినప్పుడు వామనాడీ ప్రవాహమూ, ప్రవేశ సమయంలో దక్షిణ నాడీ ప్రవాహమూ శుభకారకములని గ్రహించాలి. చంద్రుని వలె జగత్తుకి కూడా ఆనందాన్ని కలిగించే కార్యాలను, సౌమ్యకార్యాలను ఇడా అనగా వామనాడి శ్వాసప్రవాహ కాలంలో జరపాలి. సూర్యసమాన, తేజస్వీ సమక్రూర కార్యాలను ప్రాణవాయువు పింగళ నాడి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు చేపట్టాలి. యాత్రల్లో సర్వసామాన్య కార్యములందూ, విషాన్ని వదలగొట్ట వలసి వచ్చినపుడూ ఇడా నాడీ ప్రవాహం ప్రశస్తము. భోజనం, మైథునం, యుద్ధారంభాలలో పింగలనాడి సిద్ధిదాయకమవుతుంది. ఉచ్చాటన (మంత్ర) అభిచార కర్మలలోకూడా పింగల నాడి చలించాలి.


ముఖ్యంగా రాజులు మైథున, సంగ్రామ, భోజన సమయాల్లో శ్వాస కుడివైపున్న నాసికా రంధ్రంలోంచి బాగా ప్రవహిస్తోందో లేదో చూసుకోవాలి. అలాగే ఆయా అవసరాల్లో ఇడా నాడి ప్రవాహాన్నీ ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ వుండాలి. రెండు నాడులూ సమానంగా ప్రవహిస్తున్నపుడు ఏ ప్రముఖ కార్యాన్నీ మొదలెట్టకూడదు. విద్వాంసులైతే అటువంటి సమయాన్ని విషంతో సమానంగా పరిగణించి జాగ్రత్త పడాలి.


Monday 22 April 2024

శ్రీ గరుడ పురాణము (156)

 


హే శంకరదేవా! శాలగ్రామం, నైమిషం, పుష్కరం, గయ, నర్మద, చంద్రభాగం సరస్వతి, పురుషోత్తమ క్షేత్రం, మహాకాలుదధివసించియున్న ఉజ్జయని ఈ తీర్థాలన్నీ అన్నిపాపాలనూ నశింపచేసి భక్తి, ముక్తి ప్రదాయకాలవుతున్నాయి".*


శాలగ్రామోద్వారకం చ నైమిషు పుష్కరం గయా |

వారాణస్తీ ప్రయాగశ్చ కురుక్షేత్రం ద సూకరం | 

గంగా నర్మదా దైవ చంద్రభాగా సరస్వతీ | 

పురుషోత్తమో మహాకాల స్త్రీర్థాన్యేతాని శంకర ||

సర్వపాప హరాజ్యేన భక్తి ముక్తి ప్రదానివై |...


(ఆచార 66/6-8)


ఇక నామసార్థకాలైన మన అరవై సంవత్సరాల పేర్లను వినండి.


హే శంకరదేవా! శాలగ్రామం, నైమిషం, పుష్కరం, గయ, నర్మద, చంద్రభాగం సరస్వతి, పురుషోత్తమ క్షేత్రం, మహాకాలుదధివసించియున్న ఉజ్జయని ఈ తీర్థాలన్నీ అన్నిపాపాలనూ నశింపచేసి భక్తి, ముక్తి ప్రదాయకాలవుతున్నాయి",


ఇక నామసార్థకాలైన మన అరవై సంవత్సరాల పేర్లను వినండి.


1. ప్రభవ

2. విభవ

3. శుక్ల

4. ప్రమోదూత

5. ప్రజోత్పత్తి

6.అంగీరస

7. శ్రీముఖ

8. భావ

9. యువ

10. ధాత

11. ఈశ్వర

12. బహుధాన్య

13. ప్రమాది

14. విక్రమ

15. వృష

16. చిత్రభాను

17. స్వభాను

18. తారణ

19. పార్ధివ

20. వ్యయ

21. సర్వజిత్తు

22. సర్వధారి

23. విరోధి

24. వికృతి

25. ఖర

26. నందన

27. విజయ

28. జయ

29. మన్మథ

30. దుర్ముఖి

31. హేవిళంబి

32. విళంబి

33. వికారి

34. శార్వరి

35. ప్లవ

36. శుభకృతు

37. శోభకృతు

38. క్రోధి

39. విశ్వావసు

40. పరాభవ

41. ప్లవంగ

42. కీలక

43. సౌమ్య

44. సాధారణ

45. విరోధికృతు

46. పరీధావి

47. ప్రమాదీచ

48. ఆనంద

49. రాక్షస

50. నల

51. పింగళ

52. కాలయుక్త

53. సిద్ధార్ధి

54. రౌద్రి

55. దుర్మతి

56. దుందుభి

57. రుధిరోద్గారి

58. రక్తాక్షి

59. క్రోధన

60. అక్షయ


(ఆధ్యాయం - 60)


Sunday 21 April 2024

శ్రీ గరుడ పురాణము (155)

 


విస్తీర్ణ, పుష్టియుక్త, గంభీర, విశాల, దక్షిణావర్త, నాభీ, మధ్యభాగంలో త్రివళులూ. ఉత్తమనారీ లక్షణాలు, రోమరహితంగా, విశాలంగా నిండుగా, పుష్టిగా, చిక్కగా, ఒకదాని కొకటి సర్వసమానంగా, గట్టిగా వుండే స్తనాలు ఉత్తమ జాతి స్త్రీకుంటాయి. గ్రీవం దోమరహితంగా, ఓష్టం, అధరం అరుణకాంతులమయంగా ముఖం గుంద్రంగా, పుష్టిగా, దంతాలు కుండ పుష్పసమంగా, గొంతు కోయిల గొంతులా, ముఖం దాక్షిణ్యభావ యుక్తంగా, కన్నులు కరుణ రసాన్ని చిప్పిలుతూ వుండే స్త్రీ సర్వజన పూజితకాగలదు. ఇతరుల సుఖాన్ని గుణించే నిరంతరం ఆలోచిస్తూ సాధింపులూ వేధింపులూ ఎలా చేయాలో, కనీసం, తెలియని స్త్రీని అంతా గౌరవిస్తారు.


నీలికమలాల వలె కళ్ళు, బాలచంద్రుని వలె వంపు తిరిగిన కనుబొమలు, అర్ధచంద్రాకారంలో నుదురు గల స్త్రీకి, సర్వసంపదలూ ముంగిట్లో వచ్చి వాలతాయి. సుందరంగా, సరిసమానంగా పుష్టిగా వుండే చెప్పులు శుభలక్షణాలు, దట్టంగా వుండే కనుబొమ్మలూ, ఎండినట్లుండే చెవులూ శుభలక్షణాలు కావు, నున్నగా, మృదువుగా, మెత్తగా, నల్లగా, ఉంగరాలు తిరిగేజుట్టు ప్రశస్త లక్షణం. అరచేతిలో గాని, అరికాలిలో గాని అశ్వ, హస్తి, శ్రీ. వృక్ష, యూప, బాణ యన, తోమర, ధ్వజ, దామర, హాద, పర్వత, కుండల, వేది, శంఖ, చక్ర, పద్మ, స్వస్తిక, రథ, అంకుశాది గుర్తులలో కొన్ని వున్న స్త్రీలు రాజపత్నులౌతారు*  


* సాముద్రిక శాస్త్రంలో సంభోగ శృంగారానికి సంబన అంగాలణ పొదల లక్షణాలూ, స్నేవాని ద్రవాల వాసనల ద్వారా నిర్ధారింపబడే శుభాశుభాది లక్షణాలూ కూడా చెప్పబడ్డాయి. వీటిని ఇవ్వడం వల్లన అపార్ధాలెక్కువౌతాయనే భయం పల్ల ఈ గ్రంథంలో ఇవ్వబడుట లేదు.


(అధ్యాయము - 65)

చక్రాంకిత శాలగ్రామ శిలలు తీర్ధమాహాత్మ్యాలు అరవై సంవత్సరాల పేర్లు


దేవతలారా! చక్రాంకిత తాలగ్రామ శిలని పూజిస్తే సర్వశుభాలూ, సౌఖ్యాలూ, కలుగుతాయి.


శాలగ్రామంలో చక్రాల సంఖ్య     దానిపేరు

ఓఖటి                   సుదర్శన

రెండు                   లక్ష్మీనారాయన

మూడు                   అచ్యుత

నాలుగు                  చతుర్భుజ

అయిదు                   వాసుదేవ

ఆరు                   ప్రద్యుమ్న

ఏడు                     సంకర్షణ

ఎనిమిది                  పురుషోత్తమ

తొమ్మిది                  నవవ్యూహ

పది                          దశాత్మక

పదకొండు                     అనిరుద్ధ

పన్నెండు                         ద్వాదశాత్మక


పన్నెండు కన్న నెక్కువగా ఎన్ని చక్రాలున్నా ఆ శిలామూర్తి నామము అనంత భగవానుడే. సుందరమైన ఈ శాలగ్రామాలను పూజించినవారికి కోరికలన్నీ తీరుతాయి.


శాలగ్రామ, ద్వారకాశింల సంగమముండే చోట ముక్తి కూడా వుంటుందని ఇలా చెప్పబడింది.


శాలగ్రామ శిలాయత్ర దేవోద్వారవతీ భవః ॥

ఉభయోః సంగమోయత్ర తత్ర ముక్తిరసంశయః ॥


(ఆచార 66/5)



Saturday 20 April 2024

శ్రీ గరుడ పురాణము (154)

 


నాభి, స్వరం స్వభావం - ఈ మూడూ గంభీరంగా వుండాలి. లలాటం, ముఖం, వక్షస్థలం విశాలంగా వుండాలి. నేత్రాలు, కక్షలు, నాసిక, మెడ, తల, దీర్ఘంగా ఎత్తుగా వుండాలి. జంఘలు, గొంతు, లింగము, పిరుదులు పొట్టిగావుండాలి. నేత్రాంతాలు అనగా కనుకొలకులు, అరికాళ్ళు, నాలుక, పెదవులు - ఈ యేడూ రక్తవర్ణంలో వుండాలి. దంతాలు, వేళ్ళు, పర్వాలు, గోళ్ళు, కేశాలు - ఈ అయిదూ పొడవుగా వుండాలి. అలాగే స్తనాల మధ్యభాగమూ, రెండు భుజాలూ, దంతాలూ, నేత్రాలూ, నాసికా, దీర్ఘంగా వుండడం కూడా శుభలక్షణాలే.” 


స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడీ* విధంగా తెలిపాడని విష్ణుభగవానుడూ సూతమహర్షీ ప్రవచింపసాగారు. (* ఈ శాస్త్రం సముద్రునిచే కొంత వ్రాయబడి మరింత క్రోడీకరింపబడి ఆయన చేతనే ప్రపంచానికి ప్రసాదింపబడిది కాబట్టి ఆయన పేరిటనే సాముద్రికశాస్త్రంగా ప్రసిద్ధి గాంచింది. అయితే దీనిని ప్రారంభించినవారు మాత్రం 

శివపుత్రుడైన కార్తికేయుడు. ఈ మహావిషయం భవిష్య పురాణంలో వివరంగా చెప్పబడింది.) 


"రెండు పాదాలూ నున్నగా, సమాన తలాలతో, రాగి రంగులో మెరుస్తూ వుండే గోళ్ళతో, చిక్కని వేళ్ళతో, ఉన్నత అగ్రభాగాలతో నుండుట మహారాజ్ఞీ లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెళ్ళాడినవాడు తప్పనిసరిగా రాజవుతాడు.


గూఢమైన చీలమండలూ, పద్మపత్ర సమానాలైన అరికాళ్లూ శుభలక్షణాలు. చెమట పట్టని అరికాళ్ళు శుభసూచకాలు. వాటిలో మీన, అంకుశ, ధ్వజ, వజ్ర, పద్మ, హల చిహ్నాలున్నామె రాణి అవుతుంది. రోమరహిత, సుందరశిరావిహీన, కోలజంఘలున్న స్త్రీ శుభలక్షణం.


Friday 19 April 2024

శ్రీ గరుడ పురాణము (153)



నుదురు అర్ధచంద్రాకారంలో వుంటే చాలా మంచిది. అది తరగని ధన సంపదని సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా నుదురు విశాలంగా మెరుస్తూ వుంటే ఆచార్య పీఠం లభిస్తుంది. నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు. అది పాపకర్ముల లక్షణము. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో స్వస్తిక ముద్రతో ఎత్తయిన, సుందరమైన లలాటం గలవారు ధనవంతులవుతారు. కిందికీ, లోనికీ వంగిన నుదురున్నవారు చెఱసాల పాలౌతారు.


ఎవరైనా నవ్వినపుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్టులుగా గౌరవించవచ్చు. కన్నులు మూసుకొని నవ్వేవారిలో పాపాత్ములెక్కువ. మాటిమాటికీ అనవసరంగా నవ్వేవారిలో దుష్టులెక్కువ.


నూరేళ్ళాయుర్దాయం గలవారి మస్తకంపై మూడు రేఖలుంటాయి. నాలుగు రేఖలు రాజలక్షణం, ఆయుర్దాయం తొంబదియైదు. రేఖారహితమైన లలాటమున్నవారు తొంబది యేళ్ళు జీవిస్తారు. నుదుటి నిండా ముక్కలైన రేఖలున్నవారిలో వ్యభచరించే వారెక్కువ. నుదుటిపై వుండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతుంటే, ఆ విధమైన రేఖలున్నవారు ఎనభై యేళ్ళు బ్రతుకుతారు. అయిదు, ఆరు లేదా ఏడు రేఖలున్నవారు యాభై యేళ్ళే జీవిస్తారు. ఏడు కన్న నెక్కువ గీతలున్న వారిలో నలభై సంవత్సరాలు బతికే వారే ఎక్కువ.


బల్లపరుపుగా, అణగినట్లుగా తల వుండే వారికి పితృవియోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో తల గలవారికి పాపం వైపే మనసు వెళుతుంటుంది. ఒక కన్నంలో నుంచి ఒక తలవెండ్రుకే మొలవడం మంచిది. తద్విపరీతం ధనక్షయకరం. అతిశయరూక్షత - అనగా మొరటుదనం ఏ అంగంలోనూ మంచిది కాదు. మరీ పేలవంగా, రక్తమాంసరహితంగా వుండే అంగాలన్నీ అశుభసూచకాలే. మానవశరీరంలో మూడంగాలు విశాలంగా, మరో మూడు గంభీరంగా ఒక అయిదు పొడవుగా చిన్నగా, ఆరు ఎత్తుగా నాలుగు పొట్టిగా, మరొకయేడు రక్తవర్ణంలో వుండడం శుభలక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలవారు మహారాజులవుతారు.


Thursday 18 April 2024

శ్రీ గరుడ పురాణము (152)

 


సుందరమైన నాసిక గలవారు సుఖజీవనులవుతారు. శుష్కించినట్లున్న ముక్కు గలవారు దీర్ఘాయువులవుతారు. ముక్కు చివరి భాగం భిన్నంగా వుండి, నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుత లక్షణాలుండి, ఎవరికీ అందని వారి పొందును పొందగలుగుతారు. పొడవాటి ముక్కున్నవారు సౌభాగ్యసంపన్నులూ, కుంచించుకుపోయిన నాసిక గలవారు దొంగలూ కాగలరు. చప్పిడిగా అణగిపోయి వున్న ముక్కు అకాలమృత్యు సూచకము. కుడివైపు కాస్త వంగియున్న ముక్కు క్రూరత్వానికి చిహ్నము. చిన్న చిన్న గోళాలతో, సాపుగా, సొంపుగా వుండే నాసిక చక్రవర్తి కుంటుంది. 

వక్ర ఉపాంతభాగాలతో నుండి, పద్మపత్రము వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవనులకుంటాయి. పిల్లి కళ్ళు పాపాత్ములకీ మధు పింగళవర్ణంలో నేత్రాలు దురాత్ములకీ వుంటాయి. ఎండ్రకాయ కనుల వంటి కనులున్నవాడు (రు) క్రూర కర్ముడౌ (లౌ)తారు. ఆకుపచ్చటి కనులున్నవారు పాపకర్మలంటే ఇష్టపడతారు. ఏనుగు కన్నులున్నవారు సేనలను నడుపగలరు. గంభీర నేత్రాలు రాజ లక్షణం. స్థూలనేత్రాల వారు మంత్రులవు తారు. నీలికమలముల వంటినయనాలున్నవారు విద్వాంసులూ, నల్లకనులవారు సౌభాగ్యశాలులూ అవుతారు. మండలాకార నేత్రాలున్నవారు పాపాత్ములూ, ఎప్పుడూ దీనభావమే గోచరించే కనులున్నవారు దరిద్రులూ కాగలరు. సుందర విశాల నేత్రాలున్న వారు రకరకాల సుఖాల ననుభవిస్తారు. కళ్ళు ఎక్కువగా పైకి లేపేవాళ్ళు అల్పాయుష్కులౌతారు. విశాలంగా వుండి పైకి లేచే కనులున్నవారు సుఖపడతారు.


కనుబొమ్మలు విషమంగా వుండే వారు దరిద్రులవుతారు. పొడవుగా, దట్టంగా, పెద్దగా ఎడం లేకుండా, వక్రంగా, ఉన్నతంగా వంపు తిరిగియున్న కనుబొమ్మలు గలవారు గొప్ప ధనికులై మహాభోగములననుభవిస్తుంటారు. మధ్యలో తెగినట్లున్న, ఖాళీ గల కనుబొమ్మలు నిర్ధనులకూ, బాగా వంగియున్న కనుబొమలు అందని వారి పొందునందగలిగే వారికీ వుంటాయి. అయితే, వీరికి పుత్ర సంతానముండదు.


Wednesday 17 April 2024

శ్రీ గరుడ పురాణము (151)

 


మహారాజుల అరచేతుల్లో పరమశుభకరములైన శంఖ, ఛత్ర, శిబిక, గజ, పద్మాకార చిహ్నాలుంటాయి. కుంభ, అంకుశ, పతాక, మృణాళ చిహ్నాలు అతులనీయ ఐశ్వర్యం గల మహారాజల కరతలంపై వుంటాయి. అరచేతిలో త్రాటిగుర్తున్న వారికి గోధనం మెండుగా వుంటుంది. స్వస్తిక చిహ్నమున్నవారు సమ్రాట్లవుతారు. చక్రం, కత్తి, తోమరం, విల్లు, బల్లెం ఆకారంలో గుర్తులు అరచేతిలో నున్నవారు కూడా రాజులవుతారు.


చేతిలో రోకలి గుర్తున్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో నిష్ణాతులవుతారు; వేదికాకారమున్నవారు 'అగ్నిహోత్రి' అనే పదానికర్హులౌతారు; నూయి, దేవకుల్యం, త్రికోణం వున్నవారు ధార్మికులు.


అంగుష్ఠమూలంలో దళసరి రేఖలున్నవారికి కొడుకులూ, పలచటి గీతలున్నవారికి కూతుళ్ళూ ఎక్కువగా పుడతారు. చిటికెన వేలి మూలంలో మొదలై చూపుడు వేలి మూలందాకా పయనించే రేఖ గలవారు నూరేళ్ళూ జీవిస్తారు. కాని, ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే, చెట్టు మీది నుండి క్రిందపడి మరణిస్తారు. రేఖలు మరీ ఎక్కువగా నున్న మానవులు దరిద్రులౌతారు. చిబుకం కృశించిపోయినట్లుండుట ధనహైన్యానికీ, మాంస పుష్టితో నుండుట సంపన్నతకీ సూచనలు.


స్నిగ్ధంగా, దిట్టంగా సమానభాగాలలో వుండే సుందర, తీక్షదంతాలు శుభప్రదం. రక్తవర్ణంలో, సమతలంగా, నున్నగా, పొడుగ్గా వుండే నాలుక మంచి లక్షణం, ధనికుల ముఖాలు కొంచెం కోలగానూ, నిర్ధనుల వదనాలు పొడవుగానూ, రాజుల ముఖాలు, సౌమ్యంగా, బలంగా, నున్నగా, మలరహితంగానూ వుంటాయి. పాపకర్ముని మొగము భయాక్రాంతంగానూ, ధూర్తుని వదనం నలుపలకలుగానూ వుంటాయి. దింపుడు ముఖాలు పుత్రహీనులకూ, చిన్నముఖాలు పీనాసులకూ ఉంటాయి. భోగుల ముఖాలు, సుందరంగానూ, కాంతివంతంగానూ, కోమలంగానూ, మీసాలతోనూ వుంటాయి.


చోరవృత్తిని ఇష్టపడే పురుషుని ముఖం నిస్తేజంగా, ముడుచుకున్నట్లుండి, ఎఱ్ఱని మీసాలతో ఎఱ్ఱని గెడ్డంతో వుంటుంది; స్త్రీముఖంలో గెడ్డం, మీసాలు వుండవు. చిన్న చెవులూ, ఎఱ్ఱని, పెద్ద వెంట్రుకలూ గలవారు పాపకర్మం చేస్తూ మృతి చెందుతారు. శంకువు ఆకారంలో చెవులున్నవారు రాజులౌతారు గానీ చెవులలో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే శీఘ్రమరణముంటుంది. పెద్ద చెవులవారు ధనికులౌతారు. గండస్థలం క్రిందికున్నవారు భోగులౌతారు; పూర్ణంగా, సుందరంగానున్నవారు మంత్రులవుతారు.


Tuesday 16 April 2024

శ్రీ గరుడ పురాణము (150)

 


అరచేతి భాగాలు అణగిపోయినట్లుండేవారికి పిత్రార్జితం దక్కదు. మణికట్టు చక్కగా, బలంగా, సుగంధయుక్తగా వుండడం రాజ లక్షణం. ముక్కలుగా, భాగాలు కలిపినట్లుగా, శబ్దం చేస్తూ వుండే మణికట్టు గలవారు నిర్ధనులూ, నీచప్రవృత్తి గలవారూ కాగలరు.


గోళాకారంలో, లోతుగానున్న అరచేతులు ధనవంతులకుంటాయి. ఉన్నత కరతల మున్నవారు దాతలూ, విషమభాగాలున్నవారు కఠోర మనస్కులూ కాగలరు. లక్క రసం రంగులో అరచేతులున్నవారు రాజులవుతారు. పసుపు రంగు అరచేతులున్నవారిలో వ్యభిచరించే లక్షణముంటుంది. గరుకుగా అరచేతులున్నవారు నిర్దనులవుతారు.


ఊక (పొట్టు) రంగులో గోళ్ళున్నవారు నపుంసకులౌతారు. కుటిలంగానూ, బద్దలుగానూ గోళ్ళున్నవారు ధనహీనులవుతారు. రంగు విరిగినట్లున్న గోళ్ళున్నవారు తర్కం చేస్తారు. రాగివర్ణంలో రక్తం కనిపిస్తూ వుండే గోళ్ళున్నవారు రాజులు కాగలరు.


బొటనవ్రేలిలో యవచిహ్నము అత్యధిక ధనప్రాప్తి గల వారికుంటుంది; వైభవం కూడా వుంటుంది. అంగుష్ఠ మూలభాగంలో యవచిహ్నమున్న వారికి అధిక పుత్రసంతానం ప్రాప్తిస్తుంది. వేళ్ళలోని పర్వాలు పొడవుగా నున్నవారు పుత్రపౌత్రాభివృద్ధిని చూస్తూ చాలా కాలం జీవిస్తారు. విరళాంగళులు దారిద్య్ర సూచకములు. సఘనాంగళులున్నవారు ధన సంపన్నులవుతారు. మణికట్టులో పుట్టిన మూడురేఖలు కరతల భాగాన్ని దాటుకొని పోయి వ్రేళ్ళదాకా వెళితే చాలా మంచిది. అది చక్రవర్తి లక్షణము.


అరచేతిలో రెండు మీనరేఖలున్నవారు యజ్ఞకర్తలూ, దాతలూ అవుతారు; వజ్రాకార ముంటే ధనవంతులు, చేపతోక వంటి గుర్తులుంటే విద్వాంసులూ కాగలరు.


Monday 15 April 2024

శ్రీ గరుడ పురాణము (149)

 


ఉదరభాగంలో నొక సన్నని మడత (వళి, బలి) గలవారు శతాయువులు, రెండున్న వారు మహాభోగులు. త్రివతీయుక్తులు మహారాజ ఆచార్యపదాధికారులూ, వక్రవళులవారు. ఒక గమ్యం లేకుండా జీవించేవారూ కాగలరు.


పక్కలు (ఉదరపార్శ్వాలు) పుష్టిగా, మాంస యుక్తములై వుండుట రాజలక్షణము. కడుపుపై వుండే రోమాలు మృదువుగా కోమలంగా, సమదూరంలోనుండుట రాజలక్షణం. వీటికి విపరీతంగా దట్టంగా, గరుకుగా, విషమంగా రోమాలున్నవారు దూతకర్ములూ, నిర్దనులూ, సుఖరహితులూ కాగలరు.


గూళ్ళలో (భజసంధుల్లో) విషనుత, ఎముకల కలయికా గలవారు లేని వాడౌతాడు. అంటే నిర్దనుడౌతాడు. అవే సంధులున్నతంగా వుంటే భోగీ నిమ్నంగా వుంటే దరిద్రులూ అవుతారు. స్థూలంగా వుంటే ధనికులౌతారు.


పలక వలె నుండు కంఠమున్నవారు నిర్దనులూ, ఎత్తుగా రక్తనాళాలు కనిపిస్తూ వుండే కంఠం గలవారు సుఖజీవనులూ రాగలరు. మహిష సదృత గ్రీవులు వీరులూ, లేడి వంటి మెడ గలవారు. శాస్త్ర పారంగతులూ అవుతారు. శంఖసమాన కంఠమున్నవారు. రాజులూ, రాణులూ, పొడవు మెడవారు సుఖులూ, భోజనప్రియులూ అవుతారు.


రోమరహితంగా నున్నగా వుండేపిరుదులు శుభలక్షణం. మరోలా వుంటే అశుభ లక్షణం. సృష్టిగా, తిన్నగా, విశాలంగా, బలంగా, వృత్తాకారంలో, పూర్తిగా చాచితే మోకాళ్ళందేటంత పొడవుగా భుజాలున్నవారు రాజులో తత్సమానులో అవుతారు. చిన్నభుజాలు నిర్జనులకుంటాయి. ఏనుగు తొండం వలె నున్న భుజాలు శుభలక్షణం.


భవనంలో వాయు ప్రదేశం కోసమేర్పాటు చేసిన ద్వారాల ఆకారంలో వుండే వేళ్ళు శుభలక్షణం. చిన్నవేళ్ళు మేధావులకుంటాయి. బల్లపరుపుగా వుండే వేళ్ళు భృత్య లక్షణం. పెద్దవిగా వుండే వేళ్ళునిర్ధన లక్షణం. కృశించిన వేళ్ళుకలవాడు వినయసంపన్నుడై వుంటాడు. కోతి చేతుల వంటి చేతులు బలహీన లక్షణం, పులి పంజా లాంటి చేతులుబలీయ లక్షణం.


Sunday 14 April 2024

శ్రీ గరుడ పురాణము (148)

 


స్త్రీల, పురుషుల సామాన్య లక్షణాలు


పరమేశ్వరాదులారా! మీకిపుడు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలను వివరిస్తాను. ఈ పరిజ్ఞానం భూత, భవిష్యత్కాలాలను తెలుపుతుంది.


నడిచేటప్పుడు పాదాలు నేలపై విషమంగా పడే లక్షణమున్నవారు, కాషాయరంగులో పాదాలున్నవారు, అసాధారణమైన రంగులో పాదాలున్నవారు వంశనాశకులౌతారు. పాదాలు శంకువు ఆకారంలో నున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు, అందరాని పొందును వాంఛిస్తుంటాడు.


తలవెంట్రుకలు కుంచితమై వుండేవారికి విదేశంలో మృత్యువు వస్తుంది. ఏనుగు తొండం వంటి తొడలు రాజు, రాణి లకుంటాయి, గుంటనక్క తొడలు దరిద్రులకుంటాయి.


మోకాళ్ళపై మాంసం ఉండకపోవడం మంచిలక్షణం. అల్పమైన, చిన్నమోకాళ్ళు ప్రేమికులకుంటే, విశాలంగా వికటాకారంలో దరిద్రులకుంటాయి. జానువులు మాంస పరిపూర్ణమై వున్నవారికి రాజ్యప్రాప్తి వుంటుంది. పెద్ద మోకాళ్ళున్న వారు దీర్ఘాయువులౌతారు. మాంసపుష్టి గల తుంటి ఎముక, పక్కటెముక ప్రదేశమున్నవారు సుఖపడతారు. సింహసమానమైన ప్రక్కటెముక గలవారు రాజ పురుషులొతారు. (స్త్రీలకూ అదే స్థాయి దక్కవచ్చు) సింహసదృశ కటి ప్రదేశమున్నవారు పాలకులౌతారు, కోతి కటి వంటి కటి గలవారు నిర్దనులు.


సమానబాహు మూలములున్నవారు అత్యధిక భోగవిలాసులౌతాడు. అవి క్రిందికి వుంటే ధనహీనులూ, ఉన్నతంగా కానీ విషమంగా కానీ వుంటే కుటిలురూ కాగలరు. చేప కడుపువారు మిక్కిలి ధనవంతులుగా వుంటారు. విశాలమైన, సుశోభితమైన బొడ్డు గలవారు సుఖజీవనులు కాగా, లోతెక్కువున్న నాభి గలవారు కష్టాలనుభవిస్తారు.


త్రివళుల మధ్య భాగంలో క్రిందికి వంగియున్న బొడ్డుగలవారు శూల రోగగ్రస్తులవు తారు. ఎడమవైపు వంగిన నాభి శక్తి సంపన్నులకూ, కుడివైపు వంగిన బొడ్డ మేధావులకూ వుంటుంది. బొడ్డు ఒక వైపు విశాలంగావున్నవారు చిరంజీవులూ, ఎత్తుగా నున్నవారు ఐశ్వర్యవంతులూ, అధోముఖంగా వున్నవారు గోధనసంపన్నులూ, పద్మకర్ణిక సదృశనాభిగలవారు రాజత్వాధికారాలను పొందువారు కాగలరు.


Saturday 13 April 2024

శ్రీ గరుడ పురాణము (147)

 


పూర్ణచంద్రుని వంటి మొగమూ, బాల సూర్య సమానమైన అరుణకాంతులు గల మేనూ, విశాలనేత్రాలూ, బింబా ఫలము వంటి క్రింది పెదవీ గల కన్య చిరకాలం పాటు సర్వసుఖాలూ అనుభవిస్తుంది. అరచేతిలో ఎక్కువ రేఖలుండే స్త్రీకి కష్టాలెక్కువ. తక్కువ రేఖలుంటే ధనహీనతా, దుఃఖాలూ వుంటాయి. అలాగే రక్తవర్ణంలోవుండే రేఖలు సుఖజీవనాన్నీ నల్లగీతలు దాస్యవృత్తినీ, దూతిక బ్రతుకునీ సూచిస్తాయి. అరచేతిలో అంకుశం, కుండలం లేదా చక్రచిహ్నంతో శోభిల్లే కన్యరాజపత్నీ, సత్పుత్ర జనయిత్రీ అవుతుంది. అలాగే ప్రాకార, తోరణ చిహ్నాలున్న తరుణి దాసి ఇంట పుట్టినా రాజపత్ని అవుతుంది. బొడ్డు కాస్త పైకి వంగి వుండి, మండలాకారంలో కపిల వర్ణంలో అక్కడ రోమాలుండే స్త్రీ రాచయింట పుట్టినా దాసిగానే బ్రతుకీడుస్తుంది.


నడిచేటపుడు రెండు కాళ్ళ అనామికలూ, చిటికెన వ్రేళ్ళూ నేలకి తగలకుండా వుండే తరుణి భర్తృవినాశినీ స్వేచ్ఛావిహారిణీ కాగలదు.


సుందర, మనోహర నయనాలున్న వారి సౌభాగ్యశాలినీ, ఉజ్జ్వలంగా మెరిసే పలువరుస గల పడతి దంత సిరి గలదీ (రుచికరమైన భోజనాదులు జీవితాంతం లభించేది), కోమల, స్నిగ్ధచర కోణాలున్న కోమలి శ్రేష్ట వాహనాల యజమానురాలు అవుతారు.


మృదువుగా మెరుస్తూ పైకి పెరుగుతూ రాగి రంగుకి దగ్గరగా మన్న ఎరుపు రంగు గోళ్ళు వుండి, మీన, అంకుశ, పద్మ, పాల చిహ్నాలతో, స్వేదరహితంగా వుండే అరికాళ్ళతో శోభిల్లు సుందరి లక్ష్మీదేవి వలె సౌభాగ్యశాలి కాగలదు.


రోమరహిత, సుందరజంఘలూ, ఏనుగు తొండాల్లా వుండే ఊరువులూ, దక్షిణావర్తమైన గంభీరనాథ్, రోమరహిత త్రివళులూ, రోమరహిత స్తన ప్రదేశం- ఇవి ఉత్తమ స్త్రీ లక్షణాలు.


(ఆధ్యాయం - 64)


Wednesday 10 April 2024

శ్రీ గరుడ పురాణము (146)

 


స్త్రీల శుభాశుభ లక్షణాలు


మెడ మీద రేఖ వుండి, కనుకొలుకులలో ఎరుపు జీర గల స్త్రీ ఏ యింటికి వెళితే ఆ యిల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే వుంటుంది.


లలాటంపై త్రిశూలరేఖ వున్న లలన వేలాదిమంది దాసదాసీ జనానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడికనులు, అదే శరీరవర్ణము, తెల్లనై సమముగానున్న దంతాలు గల నారి ఉత్తమ స్త్రీ. కప్ప వంటి కడుపున్న కలికి ఒకే పుత్రుని కంటుంది. అతడే రాజవుతాడు.


హంస వలె మృదువచనము, తేనె వలె శరీర వర్ణము గల తెఱవ ధనధాన్య సమృద్ధిని కలిగియుంటూ ఎనిమిదిమంది పుత్రుల్ని కంటుంది. పొడవైన చెవులను, సుందరనాసికను, విల్లువలె వంపు తిరిగిన కనుబొమ్మలను కలిగిన కాంత అతిశయ సుఖాలననుభవిస్తుంది. మృదువుగా, నున్నగా, మెత్తగా నున్న తనువు, సన్నని రూపు, శ్యామల వర్ణం, మధుర భాషణం, శంఖ సమాన, కాంతులతో అతిశయ స్వచ్ఛత గల పలువరుస గల పడతి అన్ని రకాల ఐశ్వర్యాలనూ ప్రాప్తించుకోగలుగుతుంది.


విస్తారమైన జంఘలు, వేది వంటి మధ్యభాగము గల మగువ మహారాణి కాగలదు. ఎడమ స్తనంపై గానీ, చెవి, గుండె, చేతులపైగానీ ఉలిపిరి కాయైనా, అంతే పరిమాణం గల పుట్టుమచ్చయినా గానీ కల మహిళ తొలికాన్పులోనే సలక్షణుడైన పుత్రుని కంటుంది. రక్తవర్ణ పాదాలతో, ఎత్తు ఎక్కువగా లేని కాలిపై భాగంతో, చిన్న చీల మండలతో, సుందరములై కలిసియుండే వేళ్ళతో, లేత అరుణ నయనాలతో విలసిల్లే వనిత అదృష్టవంతురాలై అన్ని సుఖభోగాలకూ అర్హురాలవుతుంది. పెద్ద పెద్ద పాదాలు, అన్ని అంగాలపై రోమాలు, లావుగా నున్న చేతులు గల చేడియ దాసీదౌతుంది. పెద్ద పాదములు, వికృతవదనము, పైపెదవిపై రోమాలు వుండే పడతి పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు.


ఉంగరాలు తిరిగే తలవెండ్రుకలు, కోలముఖం, దక్షిణావర్తమైన నాభి గల స్త్రీ తన పురుషుని వంశాన్ని అన్ని విధాల వృద్ధి పఱస్తుంది. బంగారుమేని వర్ణము, ఎఱ్ఱ కమలం రంగులో అరచేతులు గల అతివ శ్రేష్టురాలు, పతివ్రత అవుతుంది. వంకరులు పోవు కేశాలూ కోలకన్నులూ గల వనిత దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది. ఆమెకు భర్తృ వియోగం కలుగుతుంది.


Tuesday 9 April 2024

శ్రీ గరుడ పురాణము (145)

 

అలాగుండి, దింపుడు కనులు కూడా వుండేవానికి పుత్రసంతానం కలుగదు; కలిగినా మిగలదు. నాల్గు కోణముల ముఖమున్నవాడు ధూర్తుడు.


కమలదళాల వలె కోమలములై కాంతివంతములైన కపోలాలు కలవాడు జీవితంలో కూడ శ్రేష్ఠ కాంతులతో ప్రకాశిస్తాడు; ధనవంతుడై స్వయంకృషితో పైకొస్తాడు. దానిమ్మపూవుతో సమానమైన నేత్రములున్నవాడు రాజు కాగలడు. పులి కన్నుల వాడు ముక్కోపి, ఎండ్రి కన్నులవాడు జగడాల మారి, పిల్లి లేదా హంస కన్నులున్నవాడు అధముడు అవుతారు. తేనెరంగు పింగలవర్ణము కలిసిన కనుల చాయగల వానిని లక్ష్మి ఎన్నడూ విడచి పెట్టదు. గోరోచనము, గురిగింజ, హరతాలము (వేషగాళ్ళు ముఖానికి పూసుకొనే పసుపు రంగు) కలిసిన పింగళవర్ణనేత్రుడు బలవంతుడు ధనవంతుడు.


నుదురు అర్ధచంద్రాకారంలో నున్నవాడు రాజు కాగలడు. పెద్ద నుదురు ధనసూచకం. చిన్న నుదురు ధర్మాత్మునికుంటుంది. లలాటమధ్యంలో అయిదు అడ్డరేఖలున్నవారు నూరేళ్ళు ఐశ్వర్యవంతులై జీవిస్తారు. నాలుగు రేఖలుంటే ఎనభై, మూడుంటే డెబ్బది, రెండుంటే అరవై, ఒకటుంటే నలభైయేళ్లు జీవిస్తారు. నుదుటిపై ఒక గీతా లేనివారికి పాతికేళ్ళే ఆయుర్దాయము. ఈ రేఖలు చిన్నవిగా ఉండే వ్యక్తికి ఆరోగ్యముండదు. లలాటంలో త్రిశూల చిహ్నంగాని, పట్టిసం గుర్తుగాని వున్నవాడు గొప్ప ప్రతాపవంతుడు, కీర్తి సంపన్నుడునైన రాజు కాగలడు.


శిరస్సు గొడుగులాగ వుండేవాడు రాజవుతాడు. పొడవు తలవాడు దరిద్రుడు, దుఃఖితుడు కాగలడు. గోళాకారంలో వుండి సమానమైన పొడవు వెడల్పులున్న తల గల గలవాడు సుఖపడతాడు. ఏనుగు తల ఆకారంలో శిరస్సు గలవాడు రాజసమానుడవుతాడు. విరలంగా, స్నిగ్ధమై, కోమలమై, తుమ్మెదల లేదా కాటుక రంగులో నున్న కేశములు గలవాడు అన్ని సుఖాలూ అనుభవిస్తాడు, రాజు కూడా కాగలడు. కఱకుగా బెరుకుగా వుండే కేశాలున్నవాడు, ముందు వైపు ముక్కలగు తల వెండ్రుకలున్నవాడు ఎక్కువగా దుఃఖాలనే అనుభవిస్తాడు.


(అధ్యాయం 63)


Monday 8 April 2024

శ్రీ గరుడ పురాణము (144)

 


పాము పొట్టవలె పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు, దరిద్రుడు అవుతాడు. విశాలంగా వెడల్పుగా, గంభీరంగా, గుండ్రంగా నున్న బొడ్డు గల పురుషునికి ధనధాన్యాలూ సకల భోగాలూ వుంటాయి. పొట్టిగా నీచంగా వుండే నాభి గల వానికి ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి (అనగా బొడ్డుకి పైన కడుపులోపడే సన్నటి మడత) క్రింద విషమంగా వుండే బొడ్డు గలవానికి ధనహాని కలుగుతుంది. దక్షిణావర్త నాభి బుద్దికీ, ఎడమవైపు వంగే బొడ్డు శాంతికీ సూచకాలు. నూరు దళాల కమలానికి వుండే కర్ణికలాంటి నాభి మహారాజు లక్షణం. పొట్టలో ఒక సన్నటి మడత వున్నవాడు శస్త్రంచే చంపబడతాడు. రెండున్నవాడు స్త్రీ భోగి, మూడున్నవాడు రాజు లేదా ఆచార్య పీఠము, నాలుగున్నవాడు అనేక పుత్రవంతుడు అవుతారు.


భుజాలు గట్టిగా, పుష్టిగా, సరిసమానంగా నున్న నరుడు రాజవుతాడు; సుఖపడతాడు. వక్షస్సు ఉన్నతంగా, సాపుగా, పుష్టిగా, విశాలంగా నున్నవాడు రాజ సమానుడవుతాడు. దట్టమైన రోమాలుండి, ఎగుడు దిగుళ్ళుగా, ఆర్చుకుపోయినట్లుండే వక్షం దరిద్రుడి కుంటుంది. వక్షం రెండు వైపులా సమానంగా ధనవంతుడికుంటుంది. పుష్టిగా వుండే వక్షఃస్థలం శూర వీర లక్షణం. గడ్డము వంకరగా వుండేవాడు ధనహీనుడు; ఉన్నతంగా సమానంగా వుండేవాడు భోగి. బలంగా లేకుండా అణగియున్నట్లుగా కనిపించే మెడ ధనహీనుని లక్షణం. ఎద్దు మెడలాగా పుష్టిగా వుండే మెడ శూర వీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే పిరికివాడుగా వుంటాడు. చిలుక, ఒంటె, ఏనుగు, కొంగల మెడల వలె పొడవుగా నుండి, శుష్కించినట్లుడే మెడ గలవాని వద్ద ధనం నిలువదు. చిన్న మెడవాడు ధనికుడు, భోగి కాగలడు. పుష్టి, దుర్వాసనలేమి, సమత, చిన్న రోమాల కలిమి బాహు మూలములకు మంచి లక్షణాలు. అవి ఐశ్వర్యవంతుని కుంటాయి.


భుజాలు పైకి లాగబడినట్లుండేవాడు బంధనాల్లో పడతాడు. చిన్న భుజాలు దాసుడికీ ఎగువ దిగువ భుజాలు దొంగకీ వుంటాయి. ఆజానుబాహువులు సర్వశుభ లక్షణం. చేతిపై భాగంలో గోతులున్నవాడికి పిత్రార్జితం లభించదు, పిరికితనం కూడా వుంటుంది.


ఎత్తుగా వుండే కరతలమున్నవాడు దాని కాగలడు. కరతలం విషమంగా వుండే వాడి జీవితం కూడా కలిమి లేముల మయమవుతుంది. లక్కవలె ఎఱ్ఱనైన అరచేతులు కలవాడు 

రాజవుతాడు. పచ్చని కరతలం వాడికి జీవితంలో ఒక గమ్యముండదు. అదే నల్లగా, 

నీలంగా వుంటే మత్తు పదార్థాలు సేవించే వాడవుతాడు. గరుకుగా వుంటే నిర్ధనుడౌతాడు.


చంద్రమండలము వంటి ముఖమున్నవాడు ధర్మాత్ముడవుతాడు. తొండం ఆకారంలో ముఖమున్నవాడు భాగ్యహీనుడు. వంకరగా, ముక్కలనతికినట్లుగా, సింహం ముఖం వలె 

ముఖమున్నవాడు దొంగ కాగలడు. సుందరమై కాంతియుక్తమై, మంచి జాతికి చెందిన 

ఏనుగు వలె పరిపుష్టమైన వదనము రాజ లక్షణము. గొట్టె కోతి ముఖ కవళికలు ధనవంతునికుంటాయి. సాధారణం కంటె పెద్ద, చిన్న, పొడవైన ముఖాలు క్రమంగా దరిద్ర, మూర్ఖ, పాపాత్మ లక్షణాలు. పురుషుని ముఖం ఆడదాని ముఖంలా వుండకూడదు.


Sunday 7 April 2024

శ్రీ గరుడ పురాణము (143)

 


కాలిబొటనవ్రేలు దిబ్బగా వుండేవాడు భాగ్యహీనుడు; వికృతంగా వుండేవాడు దుఃఖపీడితుడు. ఆ వేలు వంకరగా, చిన్నదిగా, విరిగినట్టు వుండేవాడు కష్టాలపాలవుతాడు.


కాలిచూపుడు వేలు బొటన వ్రేలికన్నా పెద్దది కలవానికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికెన వేలు సామాన్యంగా కంటే పెద్దది గలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్ళు పాడైపోయినట్లుగా కనబడేవానికి శీలముండదు, అలాగని కామభోగమూ అనుభవంలోకి రాదు.


తొడలపై రోమాలుంటే ధనం నిలువదు. తొడలు చిన్నవిగా వుంటే ఐశ్వర్యం పడుతుంది. కాని, బంధనాల్లో వుండిపోతుంది. లేడితో సమానమైన జంఘలున్నవాడు రాజ్యాన్ని సంపాదిస్తాడు. పొడవుగా దిబ్బగా వుండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహపు తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంసరహితంగా నున్న వానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్రహేతువు. మోకాళ్ళు కాస్త క్రిందికి వున్నవాడు ఏ ఆడదాన్నయినా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్ఠమైన పశు, పక్షి (సింహం, ఏనుగు, హంస) గమనము గలవాడు రాజుగాని గొప్ప ధనికుడు గాని కాగలడు.


కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు, నలుపు కలగలసిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిసే రక్తము గలవాడు ఏడు ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడి లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణము. పులి, సింహము లేదా కప్ప (కడుపు వంటి) కడుపు రాజలక్షణము. పులి వంటి పీఠము సేనాపతి లక్షణము. సింహం పీఠం వలె పొడవుగా నుండే పీఠము గల వానికి బంధనాలెక్కువ. తాబేలు పీఠము సకలైశ్వర్య సంపన్న లక్షణము. విశాలంగా, ఎత్తుగా, పుష్టిగా రోమయుక్తమైయున్న వక్షఃస్థలము గల పురుషుడు శతాయువు, ధనవంతుడునై అన్ని భోగాలనూ అనుభవింపగల అదృష్టవంతుడు కాగలడు.


చేతిలో మీనరేఖ గలవాడు గొప్ప కార్యసాధకుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు. తుల, వేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్నార్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు ధనికుడై యజ్ఞం చేస్తాడు. పర్వత, వృక్ష చిహ్నాలున్న వాని వద్ద లక్ష్మి స్థిరంగా వుంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము, బరిసె, బాణము, తోమరము, ఖడ్గము లేదా ధనుస్సు వంటి చిహ్నమేదైనా అరచేతిలో గలవాడు యుద్ధ విజయుడు. ధ్వజం కాని శంఖంగాని వుండే సముద్ర, ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్స, కమల, వజ్ర, రథ లేదా కలశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన రాజు కాగలడు. కుడిచేతి బొటన వ్రేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు, అన్ని విద్యలలో ఆరితేరినవాడవుతాడు; ప్రవక్త కూడా కాగలడు. చిటికెన వేలిక్రింది నుండి చూపుడు వేలి మధ్యదాకా ఆగకుండా పయనించే రేఖగలవాడు వందేళ్ళ దాకా (ప్రస్తుతం కాలంలో) జీవిస్తాడు.


Saturday 6 April 2024

శ్రీ గరుడ పురాణము (142)

 


చర, క్షిప్ర స్వభావాలున్న గ్రహాలు (అంటే బుధుడు, గురుడు) శాసించే వారాల్లో అంటే బుధ, గురు వారాల్లో యాత్రలు చేయాలి. శుక్ర, ఆది వారాల్లో గృహప్రవేశాది కార్యాలను చేపట్టాలి.


శని, మంగళవారాల్లో యుద్ధాలకు క్షత్రియవీరులు బయలుదేరవచ్చును.


రాజ్యాభిషేకాలకూ, అగ్ని కార్యాలకూ సోమవారం ప్రశస్తదినంగా పరిగణింప బడుతుంది. ఇల్లు కట్టడాన్ని, సున్నాలేయడాన్నీ కూడా ఈ రోజే మొదలెట్టవచ్చు.


గురువారంనాడు వేదపాఠాన్నీ, దేవపూజనీ, వస్త్రాలంకార ధారణనూ చేయవచ్చును. శుక్రవారం కన్యాదానానికీ, గజారోహణకీ, శనివారం గృహప్రవేశ, గజబంధనాలకీ మంచివి.


(అధ్యాయం - 62)


సాముద్రికశాస్త్రానుసారం స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు, మస్తక, హస్త రేఖలాధారంగా వ్యక్తుల ఆయుః పరిజ్ఞానం


మహేశా! ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి, చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను. 


అరికాళ్ళు, అరిచేతులు కోమలంగా, మాంసపుష్టితో, రక్తవర్ణంలో వుండి, పాదాలు, చేతులు ఎత్తుగా, చెమట పట్టకుండా, రక్తనాళాలూ, ముడులూ కనబడకుండా ఎవనికైతే వుంటాయో అతడు రాజవుతాడు. అరికాలిలో అంకుశ చిహ్నమున్న వాడు సుఖి. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరము, రక్తవర్ణంలో, ముక్కలు కాకుండా, నల్లగీతలు లేకుండా వుండే గోళ్ళు కూడా రాజలక్షణాలే. కాలివేళ్ళొకదానికొకటి తగులుతూ వుండడం ఐశ్వర్యం లక్షణం. అలా తగలకుండా విడివిడిగా నున్నవాడు, తెల్లగా పారల్లాటిగోళ్ళు, పాదంపై నరాలు, ముడులు కనిపించేవాడు దరిద్రుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టిరంగులో పాదాలున్న వాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు; నల్లనిపాదాల వారు తాగుబోతు; తెల్లని పాదాల వాడు తిండిపోతు.


Friday 5 April 2024

శ్రీ గరుడ పురాణము (141)

 


సింహ లగ్నంలో పుట్టినామెకు పుత్రసంతానం అల్పం. కన్యాలగ్నంలో పుట్టిన కలికి రూపవతి; తులా లగ్నంలో పుట్టిన తెఱవ రూపవతీ, ఐశ్వర్యవంతురాలూ కూడా అవుతుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వనితకి కర్కశ స్వభావముంటుంది. ధనుర్లగ్నంలోనైతే సౌభాగ్యవతీ, మకరలగ్నంలోనైతే తనకన్న తక్కువ స్థాయి పురుషుని పెండ్లి చేసుకొనేదీ అవుతుంది. కుంభలగ్నంలో పుట్టినామెకు మగ పిల్లలు తక్కువ. మీనలగ్నంలో పుట్టిన మీనాక్షి వైరాగ్యయుక్త అవుతుంది*. (* ఈ ఒక్క అంశాన్నే పట్టుకొని స్త్రీల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేయడం ప్రమాదం. ఇలాంటి అంశాలు కనీసం యాభై దాకా పరిశీలించి అప్పుడు ఆ స్త్రీ ఎలాంటిదో ఆలోచించాలి. కనీసం పది జ్యోతిశ్శాస్త్రగ్రంథాలైనా చదవకుండా జాతకాలు చెప్పెయ్యకూడదు.)


ఇక రాశుల చర, స్థిర భేదాలు చూద్దాం.


తుల, కర్కాటక, మేష, మకరాలు, చరరాశులు. ఈ రాశులున్నపుడు యాత్రకు వెళ్ళవచ్చు. సింహ, వృషభ, కుంభ, వృశ్చిక రాశులు స్థిరరాశులు. ఇవి ఉన్నపుడు స్థిరమైన కార్యాలు చేపట్టాలి.


కన్య, ధను, మీన, మిథునాలు ద్విస్వభావమున్న రాశులు. చర, స్థిర-రెండు స్వభావాలూ గల కార్యాలను, విద్వాంసులు, ఈ రాశులున్న కాలంలో చేపడతారు.


యాత్రలను చరలగ్నాలలోనూన, గృహప్రవేశాది స్థిరకార్యాలను స్థిరలగ్నాలలోనూ చేయాలి. దేవతాదుల స్థాపనా, వైవాహిక సంస్కారాలూ ద్విస్వభావ లగ్నాలలో జరగడం అన్ని విధాలా శ్రేయస్కరం.


పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మూడింటినీ, నందాతిథులంటారు. అలాగే విదియ, సప్తమి, ద్వాదశిలను భద్రా తిథులనీ, తదియ, అష్టమి, త్రయోదశులను జయాతిథులనీ అంటారు. ఇకపోతే చవితి, నవమి, చతుర్దశి ఈ మూడిటినీ రిక్తాతిథులని వ్యవహరిస్తారు. రిక్తాతిథులలో ఎట్టి శుభకార్యమునూ చేయరాదు.


సౌమ్యస్వభావుడైన బుధుడు చర స్వభావం గల గ్రహం. గురుడు క్షిప్ర, శుక్రుడు మృదు, రవి ధ్రువ ప్రకృతులు గలవారు. శని దారుణ, మంగళుడు ఉగ్ర, చంద్రుడు సమ తత్త్వములు గలవారు.


Thursday 4 April 2024

శ్రీ గరుడ పురాణము (140)

 


అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ఠ నక్షత్రాలు కొత్త సొమ్ములు పెట్టుకోవడానికి ప్రశస్తాలు. మృగశిర, అశ్వని, చిత్ర, పుష్య, మూల, హస్త నక్షత్రాలు కన్యాదానానికీ, యాత్రలకూ, ప్రతిష్ఠాది కార్యాలకూ శుభప్రదాలు.


జన్మలగ్నంలో శుక్రుడూ, చంద్రగ్రహమూ గల వారికి శుభఫలాల ప్రాప్తి ఎక్కువగా వుంటుంది. ఈ రెండు గ్రహాలూ రెండవ ఇంట నున్న వారికీ శుభాలే వుంటాయి. తృతీయ భావంలో (అంటే మూడోయింట) చంద్ర, బుధ, శుక్ర, బృహస్పతులూ, చతుర్ధ భావంలో మంగళ, శని, చంద్ర, సూర్య, బుధులూ శ్రేష్టతను ప్రసాదిస్తారు. అలాగే పంచమభావంలో శుక్ర, బృహస్పతి, చంద్ర, కేతువులూ, ఆరోయింట శని, సూర్య, మంగళులూ, సప్తమ భావంలో బృహస్పతి, చంద్రులూ, అష్టమభావంలో బుధ, శుక్రులూ కూడా శుభాలనే ఇస్తారు. అదేవిధంగా నవమ స్థానంలో బృహస్పతీ, దశమ భావంలో సూర్యశనులూ, చంద్రుడూ, ద్వాదశ స్థానంలో బుధ, శుక్రులూ సర్వ విధాల సుఖాలనూ సమకూరుస్తారు. ఇక ఏకాదశ స్థానంలో ఏ గ్రహమున్నా శుభాన్నే ప్రదానిస్తుంది.


సింహంతో మకరం, కన్యతో మేషం, తులతో మీనం, కుంభంతో కర్కాటకం, ధనుస్సుతో వృషభం, మిథునంతో వృశ్చికరాశి యోగిస్తే మంచిది. దీన్ని షడష్టక యోగమంటారు. ఇది ప్రీతికారకం*. (* ఒక్క గరుడ పురాణంలోనే షడష్టక యోగం మంచిదని చెప్పబడింది. వధూవరుల జాతకాలకు సంబంధించి మిగతా అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ ఇది అశుభకారకంగానే పరిగణింపబడింది. వరుని లేదా వధువు యొక్క జన్మ రాశి ఒకరిది రెండవవారికి ఆరవదిగాని ఎనిమిదవది గాని అగుటనే షడష్టకయోగమంటారు.)


(అధ్యాయం - 61)


లగ్నఫలాలు, రాశుల చర-స్థిరాది భేదాలు గ్రహాల స్వభావాల, ఏడు వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్తకార్యాలు.


ఈశ్వరాదులారా! సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాశులలో వుంటాడు. ఆయన దినంలో క్రమంగా ఆరురాశులను దాటుకొని పోయి రాత్రిలో కూడా ఆరురాశులను దాటి వస్తాడు.


మేషలగ్నంలో పుట్టిన ఆడది గొడ్రాలు అవుతుంది. వృషభలగ్నంలోనైతే కామిని, మిథున లగ్నంలో పుడితే సౌభాగ్యశాలినీ కర్కాటక లగ్నంలోనైతే *వేశ్యా అవుతుంది. (* వేశ్య అనేది ఇప్పటి అర్థంలో వాడబడిన మాట కాదు. సూతుడు శౌనకాది మహామునులకు చెప్తున్న కాలంలో అదొక వృత్తి; కొన్ని సందర్భాలలో అదొక గౌరవప్రదమైన వ్యవస్థ కూడానూ. ఇప్పుడీ విషయాన్ని పట్టించుకోనక్కర్లేదు.)


Wednesday 3 April 2024

శ్రీ గరుడ పురాణము (139)

 


గ్రహాల శుభాశుభస్థానాలు తదనుసారంగా శుభాశుభ ఫలాల సంక్షిప్త వివేచన


మహేశాదులారా! ఒక జాతకుని యేడవ ఇంట్లో ఉపచయంలో వుండే చంద్రుడు మంగళకారి అవుతాడు. శుక్ల విదియనాడూ, పంచమ, నవమ గృహాల్లోవుండే చంద్రుడు ఆ జాతక చక్రమున్న వానిని గురువు వలె పూజ్యుని, గౌరవ్యుని చేస్తాడు.


చంద్రునికి పన్నెండు అవస్థలు అనగా దశలుంటాయి. నక్షత్రాలు మూడేసి ఒక బృందం లేదా మండలంగా వుంటాయి కదా. అశ్వనితో మొదలుపెట్టి మూడేసి నక్షత్రాల కలయికలతో చంద్రునికి ఈ అవస్థలేర్పడతాయి ప్రవాసావస్థ, దృష్టావస్థ, మృతావస్థ, జయావస్థ, హాస్యావస్థ, నతావస్థ, ప్రమోదావస్థ, విషాదావస్థ, భోగావస్థ, జ్వరావస్థ, కంపావస్థ, సుభావస్థ.


ఫలితాలు కూడా అదే క్రమంలో ఇలా వుంటాయి ప్రవాసం, హాని, మృత్యువు, జయం, హాసం, రతి, సుఖం, శోకం, భోగం, జ్వరం, కంపం, సుఖం.


జన్మలగ్నంలో చంద్రుడుంటే తుష్టి, అదే చంద్రుడు ద్వితీయ భావం (రెండింట) వుంటే సుఖ-హాని, మూడవ ఇంట వుంటే రాజ సన్మానం, చుతర భావంలో వుంటే కలహం, పంచమభావంలో వుంటే స్త్రీ లాభం కలుగుతాయి. ఆరవ ఇంట చంద్రుడుంటే ధన, ధాన్య ప్రాప్తి కలుగుతాయి. అష్టమభావంలో చంద్రుడు అరిష్టదాయకుడై ఆ జాతకునికి ప్రాణ సంకటాన్ని తెచ్చే అవకాశాలున్నాయి. నవమస్థానంలో వుంటే కోశంలో ధనంబాగా పెరుగు తుంది. దశమస్థానంలో కార్యసిద్ది, ఏకాదశ స్థానంలో ఘన విజయం కలిగించే చంద్రుడు ఎవరికైనా పన్నెండవ ఇంటవుంటే మాత్రం మృత్యువు చేతిలోనికి పంపించి వేస్తాడు.


ఇక ఈ క్రింది నక్షత్రాలున్న గడియల్లో ఈ క్రింద సూచింపబడిన దిక్కుల వైపే యాత్రలకు బయలుదేరాలి. మరోలా కూడదు.


కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ధ్ర, పునర్వసు, పుష్య, ఆశ్లేష - తూర్పు 

మఖ, పూర్వఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ - దక్షిణ

అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ఠ - పశ్చిమ 

ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి - ఉత్తర  


Tuesday 2 April 2024

శ్రీ గరుడ పురాణము (138)

 


యాత్రలో ఎడమవైపు నక్క, ఒంటె, గాడిద కనిపించడం మంగళప్రదమే. కాని పత్తి, మందులు, నూనె, రగులుతున్న, అగ్ని జుట్టు విరబోసుకున్న మనిషి, పామును పట్టుకున్న వాడు, నగ్నంగా నున్న పెద్దవారు కనిపించడం అశుభసూచకం; మంచిది కాదు.


తుమ్ములు కూడా అన్నీ చెడ్డవి కావు. తూర్పు వైపు తుమ్ము వినిపిస్తే మంచిది. పడమటి నుండి తుమ్ము వినిపిస్తే తీపి పదార్థాలు లభిస్తాయి. వాయవ్యం నుండి వినిపిస్తే ధనప్రాప్తి వుంటుంది. ఉత్తరం వైపు నుండి వినిపిస్తే కలహం వస్తుంది.


ఆగ్నేయం నుండి తుమ్ము వినిపిస్తే శోక, సంతాపాలు కలుగుతాయి. దక్షిణం వైపు నుండైతే హాని వస్తుంది. నైరృత్యం ఆగ్నేయం వలెనే ఈశాన్యం వైపు నుండి వినిపించే తుమ్ము అత్యంత ప్రమాదకరం; మరణసమానమైన కష్టాలు కలుగుతాయి.


సూర్యభగవానుని ప్రతిమను మనిషి ఆకారంలోనే చేయాలి. సూర్య ప్రతిమను తయారు చేసిన రోజున ఆయన ఏ నక్షత్రంలో వున్నాడో చూసుకొని దాని నుండి మూడు తారలను లెక్కగట్టి వాటిని ఆ ప్రతిమ యొక్క మస్తకంపై నిర్మించాలి. ఆ రోజు వున్న నక్షత్రాన్ని ముఖంపై అంకితం చేయాలి. దానికి తరువాత వచ్చే నక్షత్రాలను భుజాలపై స్థాపించాలి. వాటి తరువాత రెండింటిని ఇరుహస్తాలపై చిత్రించాలి. అనంతరం వచ్చే అయిదు నక్షత్రాలనూ ప్రతిమ హృదయంపై లిఖించి, తరువాతి దానిని నాభి మండలం లోనూ, ఆ తరువాత నక్షత్రాన్ని పిరుదుల మధ్యా లిఖించాలి. తరువాత రెండు తారలను మోకాళ్ళపైనా, మిగిలిన వాటిని సూర్యదేవుని చరణాలపైననూ లిఖించాలి.


ఇక సూర్య చక్రం వివరాలను వినండి. దాని చరణాలపై జాతకుని జన్మ నక్షత్రం పడితే వాడు అల్పాయుష్కుడౌతాడు. మోకాళ్ళపై పడితే విదేశయానం చేస్తాడు. గుహ్యస్థానం పై పడితే స్త్రీలతో నెక్కువగా సుఖించేవాడవుతాడు. నాభిస్థానంపై పడితే అల్పసంతోషి అవుతాడు. జన్మనక్షత్రం సూర్యదేవుని హృదయస్థానం పై పడ్డవాడు మహేశ్వరుని యంతవాడు కాగలడు. చేతులలోపడితే దొంగవుతాడు. భుజాలపై అయితే అస్థిరుడూ, కంధాలపైనైతే (కుబేరునంత) ధనికుడూ, ముఖంపైనేతే తీపి పదార్థాలు ప్రాప్తించేవాడూ కాగలరు. 


మహేశా! ఏ మనిషి జన్మనక్షత్రమైతే సూర్యుని మస్తకంపై నున్న నక్షత్రమవుతుందో అతడు నిత్యం పట్టు వస్త్రాలే ధరించు ప్రధాన వ్యక్తి కాగలడు. 


(అధ్యాయం -60)


Monday 1 April 2024

శ్రీ గరుడ పురాణము (137)

 


చంద్రదశ ఐశ్వర్యాన్నిస్తుంది, సుఖాలను సృష్టించ ప్రసాదిస్తుంది, ఇష్టమైన, మనసుకి అనుకూలమైన అన్నాదులనిస్తుంది.


మంగళుని దశ దుఃఖాన్నే ఎక్కువగా ఇస్తుంది. రాజ్యాదులు నశిస్తాయి. బుధ మహాదశ చాలా మంచిది. ఈ దశలో దివ్యమై స్త్రీ లాభము, రాజ్యప్రాప్తి, కోశవృద్ధి వంటివి ఒనగూడు తాయి. శని మహాదశలో రాజ్యనాశం, బంధు బాంధవాదికష్టం జరుగుతాయి. (అంటే బంధువులకూ బాంధవులకూ కష్టాలొస్తాయని తాత్పర్యం) గురు మహాదశలో రాజ్యలాభం, సుఖసమృద్దీ కలుగుతాయి. ధర్మోద్దరణ బుద్ధి కలుగుతుంది. రాహుదశలో రాజ్యనాశనము, రోగములు పెరుగుట, దుఃఖాలూ సృష్టింపబడుట జరుగుతాయి. శుక్రమహాదశలో రాజ్య, గజ, అశ్వ, స్త్రీ లాభాలుంటాయి.


మంగళుని యొక్క క్షేత్రం మేష నక్షత్రం. అలాగే శుక్ర, బుధ, చంద్రగ్రహాలకు వృషభ, మిథున కర్కాటకాలు క్షేత్రాలు.


ఈ క్షేత్రాలపై వాటి ప్రభావం ఉంటుంది. బుధునికి కన్యారాశి కూడా క్షేత్రమే. సూర్య, శుక్రులకు సింహ తులారాశులు క్షేత్రాలు. మంగళునికి, వృశ్చిక రాశి కూడా క్షేత్రమే. బృహస్పతికి ధను, మీనాలు; శనికి మకర, కుంభాలు క్షేత్రాలు. సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి వెళ్ళినపుడు విష్ణువు శయనిస్తాడు. అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ట, నక్షత్రాలు ఆభూషణ ధారణకు ఉత్తమములు. అంటే ఈ నక్షత్రాలున్న సమయాల్లో కొత్త నగలనూ, ఉంగరాలు మున్నగు వాటినీ ధరిస్తే మంచిది.


యాత్రలో కుడివైపున లేడి, సర్పము, కోతి, గండుపిల్లి, కుక్క, పంది, నీలకంఠ, పక్షి, ముంగిస కనిపిస్తే మంచిదే. ఆ వ్యక్తికి ఆ యాత్ర మంగళప్రదమవుతుంది. బ్రాహ్మణ కన్య ఎదురుగా వచ్చినా, శంఖ మృదంగ వాద్యాలు వినిపించినా, సదాచారి, శ్రీమంతుడు నగు వ్యక్తి కనిపించినా కూడా మంచిదే. వేణువు, మంచి స్త్రీ, నీటి కుండ ఎదురుగా రావడం శుభసూచకం.


Sunday 31 March 2024

శ్రీ గరుడ పురాణము (136)

 


హే వృషభధ్వజా! శుక్రవారంతో భరణి, సోమవారంతో చిత్ర, మంగళవారంతో ఉత్తరాషాఢ, బుధవారంతో ధనిష్ట, బృహస్పతితో శతభిష (అంటే గురువారంతో) శుక్రవారంతో రోహిణి, శనివారంతో రేవతి కలిసొచ్చే కాలాలు మానవులకు కలిసొచ్చే కాలాలు ఏ మాత్రమూ కావు. వీటికి విషయోగాలని పేరు. అవి దుష్కాలాలు.


పుష్య, పునర్వసు, రేవతి, చిత్ర, శ్రవణ ధనిష్ట, హస్త, అశ్వని, మృగశిర, శతభిష నక్షత్రాలు దుర్యోగాలను తప్పిస్తే సామాన్యంగా మంచివి. ఈ నక్షత్రాలలో జాతకర్మాది సంస్కారాలు చేయడం ఉత్తమం.


విశాఖ ఉత్తరఫల్గునీ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మఖ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, కృత్తిక నక్షత్రాలు యాత్రలు చేయడానికి మంచివి కావు. మృత్యుభయముంటుంది.


(అధ్యాయం -59)


గ్రహదశ, యాత్రాశకున, సూర్యచక్రాది నిరూపణం

 

( పురాణంలో ఈయబడిన గ్రహాల మహాదశల యోగ్య సమయం, వాటి క్రమం పరాశర మహర్షి ద్వారా నిర్దిష్టమైన వింశోత్తరీ మహాదశతో అక్కడక్కడ ఏకీభవించడంలేదు. ఇందులో కేతుదశ కూడా కనబడుటలేదు)

 

మహేశాదులారా! ఇపుడు గ్రహాల మహా దశలను వర్ణిస్తాను. సూర్యుని దశ ఆరేళ్ళు, చంద్రునిది పదిహేను, మంగళునిది ఎనిమిది, బుధునిది పదిహేడు, శనిది పది, గురువుది పందొమ్మిది, రాహువుది పన్నెండు, శుక్రునిది ఇరవై ఒక్కటి.

 

సూర్యదశ (అనగా ఒక వ్యక్తి జీవితంపై సూర్యగ్రహాధిపత్యం కొనసాగే కాలం) దుఃఖములనే ఎక్కువగా కలిగిస్తుంది. ఉద్వేగాలను రేకెత్తిస్తుంది. రాజుని నాశనం దాకా తీసుకుపోతుంది.


Saturday 30 March 2024

శ్రీ గరుడ పురాణము (135)

 


కృష్ణపాడ్యమి, బుధవారంనాడు పడిన విదియ శుభదినాలు. మంగళునితో కలిసిన తదియ, శనితో కలిసిన చవితి, గురువారం నాడు పడిన పంచమి, శుక్రవారం షష్టి, షష్టి మంగళగ్రహం కలిసి పడిన రోజులు మంచి రోజులు. అలాగే బుధవారం సప్తమి, మంగళ లేదా ఆదివారాల్లో అష్టమి, సోమవారం నవమి, గురువారం దశమి కలసి వచ్చిన రోజులు శుభదినాలు. ఏకాదశి రోజున గురు లేదా శుక్రవారాలు, బుధవారం ద్వాదశి, శుక్ర మంగళవారాల్లో త్రయోదశి, శనివారం చతుర్దశి, గురువారం నాడు పడిన అమావాస్య పున్నమి రోజులు కూడా శుభప్రదాలే.


ద్వాదశి - ఆదివారం, ఏకాదశి సోమవారం, దశమి మంగళవారం, నవమి - బుధవారం, అష్టమి - గురువారం, సప్తమి - శుక్రవారం, షష్టి - శనివారం యోగించిన వాటిని దగ్ధ దినాలంటారు. ఇటువంటి తిథి - దగ్ధ యోగ సమయాల్లో యాత్రల వంటి శుభకార్యాలను మొదలెట్టకూడదు. పాడ్యమి, నవమి, చతుర్దశి అష్టమి తిథులు బుధవారం నాడు పడితే మరీ ప్రమాదం. ఆ రోజుల్లో పక్క వూరికి కూడా బయలుదేరే ఆలోచనే చేయరాదు.


మేష-కర్కాటక సంక్రాంతి అష్టమితో గాని, కన్య-మిథున సంక్రాంతి అష్టమితో, వృష కుంభ సంక్రాంతి చవితితో, మకర తుల సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి ద్వాదశితో, వృశ్చిక సింహ సంక్రాంతి దశమితో, ధను- మీన సంక్రాంతి చతుర్దశితో కలసి పడిన రోజులు మహాదగ్ధ దినాలు. ఇవి కష్టదాయకాలు. ఈ తిథుల్లో నూతన ప్రయత్నాలు చేయరాదు.


మహాదేవాదులారా! రవివారంతో విశాఖ, అనురాధతో జ్యేష్టతిథి, సోమవారంతో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు, మంగళవారంతో ధనిష్ఠ, శతభిష, పూర్వాభాద్రలు, బుధవారంతో రేవతి, అశ్వని, భరణులు, గురువారంతో రోహిణి, మృగశిర, ఆర్ద్రలు, శుక్రవారంతో పుష్య, ఆశ్లేష ముఖలూ, శనివారంతో ఉత్తరఫల్గుని, హస్త, చిత్రలూ యోగిస్తే ఆ దుర్యోగం ఉత్పాతాలను కలిగిస్తుంది. ఆయా కాలాల్లో యాత్రాదికార్యాలు ప్రారంభిస్తే ఉత్పాతాలు, మృత్యువు రోగాలు సంభవించవచ్చును.


ఆదివారంతో మూల, సోమవారముతో శ్రవణ, మంగళవారంతో ఉత్తరాభాద్ర, బుధవారంతో కృత్తిక, గురువారంతో పునర్వసు, శుక్రవారంతో పూర్వఫల్గుని, శనివారంతో స్వాతి కలిసొస్తే మాత్రం అది అద్భుత శుభయోగం. దాన్ని అమృత యోగమంటారు. ఆ రోజుల్లో చేపట్టే కార్యాలన్నీ సిద్ధిని పొందుతాయి.


విష్కంభయోగం అయిదు గడియలూ (120 నిముషాలు) శూలయోగం ఏడు గడియలూ, గండ, అతి గండయోగాల్లో ఆరేసి గడియలూ, వ్యాఘాత, వజ్ర యోగాల్లో తొమ్మిదేసి గడియలూ, వ్యతీపాత, వైదృతి, పరిఘ యోగాల్లో పూర్తికాలమూ మృత్యుతుల్యములు. మిక్కిలి కష్టదాయకములు. సర్వకర్మలనూ పరిత్యజించవలసిన సమయాలివి.


ఆదివారంతో హస్త, గురువారంతో పుష్య, బుధవారంతో అనురాధా నక్షత్రాలు, శనివారంతో రోహిణి, సోమవారంతో మృగశిర, శుక్రవారంతో రేవతి, మంగళవారంతో అశ్వని, యోగించినవి ఉత్తమ, శుభదినాలు. ఈ దినాలలో చేసే పనులకు సిద్ధియోగమూ, పాపనాశనమూ కూడా వుంటాయి. ఇవి సర్వదోషహరములు.


Friday 29 March 2024

శ్రీ గరుడ పురాణము (134)

 


అశ్వని, అనురాధ, రేవతి, మృగశిర, మూల, పునర్వసు, పుష్య, హస్త, జ్యేష్ఠ నక్షత్రాలున్న సమయాలు యాత్రకు ప్రశస్తాలు.


హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు నిత్యంగానూ, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర అశ్వని, రోహిణి, పుష్యమి, ధనిష్ఠ, పునర్వసు నక్షత్రాలు సామాన్యంగానూ నవీన వస్త్రధారణకు శ్రేష్ఠములు.


కృత్తిక, భరణి, ఆశ్లేష, మఘ, మూల, విశాఖ, పూర్వాభాద్ర, పూర్వాషాఢ, పూర్వఫల్గునీ నక్షత్రాలను అధోముఖీ నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాల్లో వాపీకూప తటాకాలనూ, సరోవరాలనూ, దేవాలయాదుల నిర్మాణంలో పునాదులనూ తవ్వించుట మొదలుపెట్టాలి. అలాగే భూమిలో దాగియున్న స్వర్ణాది లోహాలకూ, ఖనిజాలకూ పాతిపెట్టబడిన నిధులకూ భూమిని త్రవ్వడానికి ఈ నక్షత్రాలు బహు ప్రశస్తమైనవి.


రేవతి, అశ్వని, చిత్ర, స్వాతి, హస్త, పునర్వసు, అనురాధ, మృగశిర, జ్యేష్ఠా నక్షత్రాలను పార్శ్వముఖి నక్షత్రాలంటారు. ఈ నక్షత్రాలున్నపుడే ఏనుగు, ఒంటె, గుఱ్ఱం, ఎద్దు వంటి పశువులను వశపఱచుకొనే ప్రయత్నం చేయాలి. అంటే తాళ్ళు కట్టుట, జీను వేయుట, మచ్చిక వంటివి చేయాలి.


పైన చెప్పబడిన పార్శ్వముఖి నక్షత్రాలలోనే పొలాలలో విత్తులు నాటడం, రాకపోకలు, చక్ర యంత్రాలు, రథాలు, నౌకాదుల క్రయాలు, నిర్మాణ ప్రారంభాలూ చేయడం శుభకరం.

రోహిణి, ఆర్ద్ర, పుష్య, ధనిష్ఠ, ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, శతభిష (వారుణ) శ్రవణ ఈ తొమ్మిది నక్షత్రాలనూ ఊర్ధ్వముఖీ నక్షత్రాలంటారు. వీటిలో రాజ్యాభిషేకం, అధికార స్వీకరణం వంటి కార్యాలనుచేయాలి. అభ్యుదయ ప్రదాయకములైన కార్యాలను చేపట్టాలి.


చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పున్నమి తిథులు అశుభకారకాలు. ఈ తిథులలో శుభకార్యాలను చేయరాదు.


Thursday 28 March 2024

శ్రీ గరుడ పురాణము (133)

 


ఇక ఏయే తిథులలో ఏయే దిశలలో ఏయే యోగినులుంటారో వినండి.


తిథులు - యోగిని పేరు - దిశ


పాడ్యమి, నవమి - బ్రహ్మాణి - తూర్పు

విదియ, దశమి - మాహేశ్వరి - ఉత్తరం

పంచమి, త్రయోదశి - వారాహి - దక్షిణం

షష్టి, చతుర్దశి - ఇంద్రాణి - పశ్చిమం

సప్తమి, పున్నమి - చాముండ - వాయవ్యం

అష్టమి, అమావాస్య - మహాలక్ష్మి ఈశాన్యం

ఏకాదశి, తదియ - వైష్ణవి - ఆగ్నేయం

ద్వాదశి, చవితి - కౌమారి – నైరృత్యం

యోగిని నెదురుగా పెట్టుకొని యాత్రచేయరాదు. అనగా ఉదాహరణకి, దశమినాడు బయలుదేరేవారు ఉత్తరంలో లేదా ఉత్తరం వైపు బయలుదేరకూడదు. అంటే మాహేశ్వరి తప్ప మిగతా యోగినులున్న వైపు వెళ్ళవచ్చును.


Wednesday 27 March 2024

శ్రీ గరుడ పురాణము (132)


 

జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు, ముహూర్తాల వర్ణన


ముందుగా నక్షత్రాల కుండే దేవతల పేర్లను తెలుసుకుందాం.


కృత్తిక - అగ్ని

రోహిణి - బ్రహ్మ

మృగశిర - చంద్రుడు

ఆర్ధ్ర - రుద్రుడు

పునర్వసు - ఆదిత్య

పుష్య - తిష్యుడు

ఆశ్లేష - సర్పుడు

మఘ - పితృగణాలు

పూర్వఫల్గుని - భగుడు

ఉత్తరఫల్గుని - అర్యముడు

హస్త - సవిత

చిత్ర - త్వష్ట

స్వాతి - వాయువు

విశాఖ - ఇంద్రాగ్నులు

అనురాధ - మిత్రుడు

జ్యేష్ఠ - ఇంద్రుడు

మూల - నిరృతి

పూర్వాషాఢ - శివుడు

ఉత్తరాషాఢ - విశ్వేదేవులు

అభిజిత్ - బ్రహ్మ

శ్రావణ - విష్ణు

ధనిష్ఠ - వసువులు

శతభిష - వరుణుడు

పూర్వాభాద్ర - అజపాదుడు

ఉత్తరాభాద్ర - అహిర్బుధ్ని

రేవతి - పూష

అశ్వని - అశ్వనీకుమారులు

భరణి - యమధర్మరాజు


Tuesday 26 March 2024

శ్రీ గరుడ పురాణము (131)

 


విష్ణుశక్తి వల్ల తేజోమయులైన మహామునులు సూర్యమండలానికెదురుగా వుండి ఆయనను స్తుతిస్తుంటారు. గంధర్వులాయన యశోగానాన్ని కావిస్తుంటారు. అప్సరలు నర్తిస్తుంటారు. వాలఖిల్యులను పేరు గల మునులు, యక్షరాక్షస నాగ ప్రతినిధులూ రథమును పరివేష్టించి వుండి అవసరమైన మేరకు రక్షణ కలిపించే ఉద్దేశ్యంతో వుంటారు.


చంద్రరథానికి మూడు చక్రాలుంటాయి. గుఱ్ఱాలు కుంద పుష్పం రంగులో తెల్లగా వుంటాయి. వాటి సంఖ్య పది. చంద్రపుత్రుడైన బుధుని రథం నీరూ, నిప్పు కలిపిన ద్రవ్యంతో తయారు చేయబడుతుంది. గోధుమరంగులో వుండి వాయువేగంతో పోగలిగిన ఎనిమిది గుఱ్ఱాలుంటాయి.


శుక్రుని మహారథం సైన్య బలయుక్తమై, అనుకర్ణ (రథం కింద బలానికై పెట్టు మిక్కిలి దృఢమైన నిలువు, అడ్డకర్రలు) తో, ఎత్తయిన శిఖరంతో పతాకంతో, మిక్కిలి బలము, వేగము గల అశ్వాలతో శోభిస్తుంటుంది.


భూమి పుత్రుడైన మంగళుని రథం అగ్నిజ్వాలల్లోంచి అప్పుడే బయటికి తీసిన బంగారం రంగులో మెరిసిపోతుంటుంది. అగ్ని సంభవాలైన ఎనిమిది గుఱ్ఱాలుంటాయి. వాటి రంగు పద్మరాగమణుల అరుణ వర్ణం బృహస్పతి స్వర్ణరథంపై ఏడు పాండుర వర్ణం (తెలుపు పసుపు కలిసిన) లో ప్రకాశిస్తున్న గుఱ్ఱాలను పూన్చి ప్రయాణిస్తూ ఏడాదికొక రాశిలో నివసిస్తూ వుంటాడు.


శనిదేవుడు ఆకాశంలో పుట్టిన అనేక వర్ణములు గల అశ్వాలులాగే రథంపై తిరుగుతాడు. చాలా మెల్లగా కదులుతూ మందగామి అనే పేరును సార్థకం చేసుకుంటాడు.


రాహువు రథాశ్వాలు ఎనిమిది. ఇవి ధూసరవర్ణంలో అంటే పాండుర వర్ణంలో పసుపు కాస్త తక్కువగా కలిసిన రంగులో వుంటాయి. అవి ఒకమారు కదిలాక ఆగవు.


కేతువు రథానికుండే ఎనిమిది గుఱ్ఱాలూ లాక్షారసం వలె అరుణకాంతులను వెదజల్లుతుంటాయి. వీటి వేగం వాయువేగాన్ని మించి వుంటుంది.


ఈ విధంగా విష్ణువు యొక్క విశ్వరూపంలో భాగమైన భూమ్యాకాశాలలో ఆయన ఆదేశం మేరకు ఈ రథాలలో పరిభ్రమిస్తూ నవగ్రహాలు మానవుల, దేవతల జాతకాలను మారుస్తూ తిరుగుతుంటాయి.


(అధ్యాయం - 58)


Monday 25 March 2024

శ్రీ గరుడ పురాణము (130)

 


రౌరవ, సూకర, రోధ, తాళ, విశసన, మహాజ్వాల, తప్తకుంభ, లవణ, విమోహిత, రుధిర, కృమిశ, కృమిభోజన, అసిపత్రవన, కృష్ణ నానాభక్ష (లాలాభక్ష), దారుణ, పూయవశ, పాపవహ్నిజ్వాల, అధఃశిర, సందంశ, కృష్ణసూత్ర, తమస్, అవీచి, శ్వభోజన, అప్రతిష్ట, ఉష్ణవీచి అనేవి విభిన్న నరకాల పేర్లు.


ఈ లోకాలన్నిటికీ పైన జల, అగ్ని, వాయు, ఆకాశలోకాలున్నాయి. ఇంతవఱకు చెప్పబడిన దానిని బ్రహ్మాండమంటారు. దీనికి బాగా పైన దీనికి పదింతల పరిమాణంలో మరొక లోకముంది. అందులో శ్రీమన్నారాయణుడుంటాడు. (అధ్యాయాలు 56,57)


నవగ్రహాల రథాలు


దేవతలారా! సూర్యదేవుని రథం వైశాల్యము తొమ్మిది వేల యోజనాలు. దాని ఈషా దండానికీ అంటే కాడికీ రథ మధ్యానికీ మధ్య వుండే దూరం రథ వైశాల్యానికి రెట్టింపు వున్నది. ఇరుసు ఒక కోటీ ఎనభై యేడు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ ఇరుసుకి గల చక్రమొకటే. దానికి మూడు నాభులు (పూర్వ, మధ్య, అపర అన్జలు) అయిదు అరలు (పరివత్సరాదులు) ఆరునేములు (వసంతాది ఆరు ఋతువులు)


సంపూర్ణ కాలచక్రమే సూర్యదేవుని రథచక్రము. ఇరుసులలో రెండవది నలభై వేల యోజనాల పొడవుంటుంది. రథాక్షములు ఒక్కొక్కటీ అయిదున్నరవేల యోజనాల పొడవును కలిగియున్నవి. 


గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే ఏడు ఛందాలూ సూర్యభగవానుని సప్తాశ్వాలు.


సూర్యునికి పన్నెండు పేర్లు పన్నెండు తత్త్వాలు పన్నెండు ఆత్మలు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంతో ఆయన రథంలో వుంటాడు. ఆ రథం వెనుకనొక అప్సర, ఒక మహాముని, ఒక యక్షుడు, ఒక నాగుడు, ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు వుంటారు. (అనుబంధం-8లో చూడండి).