Friday 31 December 2021

శ్రీ హనుమద్భాగవతము (118)




అన్నములు, వస్త్రములు, అభూషణములు, గజ తురగాదులు, అస్త్రములు మొదలగునవన్నీ అగ్నిలో పడి మండుచుండెను. తమ ప్రాణములను తాము దక్కించుకొనుటకు ప్రయత్నించుచున్న దానవులు వాటిని రక్షించుట కెట్టి ప్రయత్నము చేయలేకపోయారు. అనాథవలె, అసహాయురాలి వలె రావణుని లంకానగరము అగ్నిజ్వాలలలో బడి భగభగ మండనారంభించెను, పశువులు, స్త్రీలు, బాలకులు రోదించుచుండగా త్రైలోక్యవిజయులైన అసురులు అగ్నిని నివారింపలేక అసహాయులవలె చూచుచుండిరి. అగ్ని శాంతించిన గృహములకు పవననందనుడు మరల నిప్పుపెట్ట నారంభించెను. ఆయన లంకపై ఎగురుతూ లంకానగర దహన కార్యక్రమమును పర్యవేక్షించాడు.


తన మహత్తరమైన భవనము అగ్నికి ఆహుతి అగుట గాంచిన దశగ్రీవుని హృదయము కంపించింది. అయినను తన మనోగత భావములను దాచుకొని అతడు ఆంజనేయుని పట్టి వధింపవలసినదిగా రాక్షసులును ఆజ్ఞాపించెను.


ప్రభువు ఆజ్ఞ ఆలకింపగానే మేఘనాదాధి వీరులు శస్త్రములను ధరించి హనుమంతుని పట్టుటకు సమావేశమైరి. వారెచ్చోట దృష్టిసారించిన అచ్చోట కాలస్వరూపుడైన శ్రీ హనుమంతుని భయంకరమూర్తి కనబడసాగెను. జ్వలించుచున్న శ్రీ పవనాత్మజుని వాలము వజ్రతుల్యము, సుదీర్ఘము. ఎందఱో రాక్షసవీరులు వాలముపై కలియబడిరి. వారందఱు వాలాఘాతములకు గురియై అసువులను బాసిరి. ప్రబలమైన ప్రభంజనము యొక్క, భయంకరమైన అగ్నిజ్వాల యొక్క నడుమ అసహాయులైన అసురులు శ్రీ ఆంజనేయుని ఎదిరించ లేకపోయారు. వారు రావణుని ఎదుట విషణ్ణవదనులై తమ అశక్తతను ప్రకటించుకున్నారు.

లోకపాలకులు, దేవతలు మొదలైన వారందఱు రావణునకు వశులై ఉన్నారు. వారినందరిని శ్రీ ఆంజనేయుని నిర్జించుటకా రాక్షసరాజు పంపెను. లంకను దహించుచున్న శ్రీ హనుమంతుడు యముని తన నోటితో పటుకొని దేవతలను వాలముతో మోదాడు. ఆ మహావీరుని ధాటికి వారు నిలువలేక పలాయనము చిత్తగించిరి. యముడు శ్రీ ఆంజనేయునిచే బంధింపబడెను. సృష్టి కార్యములు స్తంభించెను. అపుడు దేవతాసహితుడై హంసను అధిష్ఠించి చతుర్ముఖుడైన బ్రహ్మ ఆ ప్రదేశమున కేతెంచి శ్రీహనుముతుని ప్రార్థించెను, శుభ ప్రదాతగా హనుమంతుడు యముని తన దంష్ట్రముల బంధమునుండి ముక్తుని గావించెను. యమును ఆ కాలమూర్తిని అనేక విధముల ప్రార్థించి నీ భక్తుల సమీపమునకు పోజాలనని ప్రతిజ్ఞ చేసెను.

Thursday 30 December 2021

శ్రీ హనుమద్భాగవతము (117)



"జయ శ్రీరామ జయ శ్రీరామ" అంటూ హనుమంతుడొక భవనము పైనుండి మరియొక భవనము పైకి ఎగురుతూ లంకకు నిప్పుబెట్టాడు. ఆయన ఒనరించిన భీషణ గర్జనములకు ఆకాశము ప్రతిధ్వనించింది. దాని వలన అసురులు ప్రాణములను కోల్పోయారు. అసురపత్నుల గర్భములు పతనమయ్యెను. మహావీరులైన రాక్షసుల హృదయములు కంపించాయి. ఇట్లు “జయ శ్రీసీతారాం” అంటూ మైనాక వందితుడు, మహావేగవంతుడైన కపీశ్వరుడు ఎగురుతూ ప్రహస్తుని మందిరము పైకి చేరి దానికి నిప్పుపెట్టి అచటనుండి మహాపార్శ్వుని గృహమును తగులబెట్టి క్రమముగా వజ్రదంష్ట్ర, తుళ, సారణ, మేఘనాథ, జంబుమాలి, సుమాలి మొదలగు అసురశ్రేష్ఠుల నివాసములను బూడిదగావించాడు. ప్రజ్వలిత భయంకరాగ్ని జ్వాలలతో అరుణవర్ణముతో ప్రకాశించు శ్రీమారుతాత్మజుడు ప్రత్యక్ష కాలస్వరూపునిగా గోచరించాడు. భయముతో వణకుచున్న అసురులు ఆయన వైపు చూచుటకైనా సాహసింపలేకపోయారు. అత్యంత వేగశాలియైన కవీశ్వరునిలో అద్భుతమైన స్ఫూర్తి కలదు. ఆయన ఒక సౌధమునుండి మఱియొక సౌధముపైకి దుకుతూ గవాక్షముల గుండా ప్రవేశించి తన వాలముతో శీఘ్రముగా నిప్పు పెడుతున్నాడు. ఆయన సర్వత్రా చరిస్తూ విలయతాండవం చేసాడు. శ్రీహనుమంతుడు ఎక్కడున్నాడో తెలిసికొనుట వారికి కఠినమయ్యింది. వారు సర్వత్రా మర్కటాధీశ్వరుడైన శ్రీ హనుమంతుడు నిప్పు పెట్టుచున్నట్లు గాంచారు. ఒక హనుమంతుడే ఉన్నాడా? లేక అసంఖ్యాకముగా ఉన్నారా యని రాక్షసులు భ్రమపడ్డారు.


ఇట్లు శ్రీహనుమంతుడు, రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు, రణోన్మత్తుడు, భుజగ్రీవుడు, భయానకుడు, విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, విశాలుడు, శోణితాక్షుడు, మకరాక్షుడు, నరాంతకుడు, కుంభుడు, దురాత్ముడు, నికుంభుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మ శత్రువు మొదలగు ప్రముఖులైన రాక్షసవీరుల భవనములను, ఆశ్వశాలలను, గజశాలలను, అస్త్రాగారములకు, సైన్య శిబిరములను తగులబెట్టాడు.


ఆ సమయములో కుమారుని కార్యమునకు సహాయమొనరించుటకై వాయు దేవుడు తన వేగమును తీవ్రముచేసెను. వాయు వేగమునకు అగ్ని అధికముగా ప్రజల్లుచు సర్వత్రా వ్యాపింపసాగింది. బంగారము, వెండి, రత్నాదులతో నిర్మించిన భవనములు మంటలకు కరగి భూమిపై ప్రవహించాయి. లంకా నగరములో గల స్త్రీ, పురుషులు, బాలకులు, వృద్ధులు మొదలగు అసురులందఱు మంటలకు తాళలేక 'రక్షింపుము రక్షింపుమనుచు, ఆక్రందించుచు అటునిటు పరుగిడ సాగిరి. లక్షలాది రాక్షసులు ఆ ప్రచండమైన అగ్నిజ్వాలలలో పడి మరణించారు. మిగిలిన వారు ప్రాణములను అర చేతబట్టుకొని పారి పోయారు.

శ్రీ హనుమద్భాగవతము (116)



బలబుద్ధినిధానుడైన హనుమానుని ఉద్దేశ్యము పరిపూర్ణమయ్యింది. ఆయన తన ఆకారాన్ని తగ్గించుకొనగానే అసురులు చేసిన బంధనాలు జారాయి. శ్రీ పవనకుమారుడు బంధవిముక్తుడై తన బృహద్రూపమును ధరించాడు. ఆయన మండుతున్న తన వాలమును గిరగిర త్రిప్పనారంభించాడు. వాలముతో రాక్షసులను మోదుచుండగా ఆ హఠాత్పరిణామమునకు వారు ఆశ్చర్యముతో భయభ్రాంతులైరి, శ్రీహనుమంతుని వాలాఘాతము వజ్రఘాత సదృశముగా వారికి తోచింది. బాలకులు, యువతీయువకులు, వృద్ధులైన రాక్షసులందఱు భయముతో పారిపోవసాగారు. కాని వారెచ్చోటకు పరిగెత్తినా అచ్చోటకు వారిని ప్రజ్వలిస్తూ వాలము వెంటాడి మోదనారంభించింది. అగ్నిజ్వాలలలో చిక్కి అసురులు మరణింపసాగారు. ఇట్లు ఆ ప్రదేశమందున్న రాక్షసులనందరిని సంహరించి శ్రీహనుమంతుడు లంకానగరములో గల ఎత్తయిన అట్టాలిక పైకెగిరాడు.


శ్రీహనుమంతుని వాలమునకు నిప్పంటించిన విషయమును కొందఱు రాక్షస స్త్రీలు పరుగుపరుగున సీతకడకు పోయి పలికారు. “జానకీ! నీతో మాటలాడిన వానరమును బంధించి అవమానపరుస్తూ లంకానగరమంతా త్రిప్పి వాని వాలమునకు నిప్పుబెట్టారు.”


ఈ వృత్తాంతమును ఆలకించగానే సీతాదేవి కంపించింది. ఆమె తల ఎత్తి చూడగా లంకానగరము అగ్నిజ్వాలలతో మండుతున్నది. ఆమె వ్యాకులచిత్తయై అగ్ని దేవునిట్లు ప్రార్థించింది. “అగ్ని దేవా ! నేను నా ప్రాణనాథునకు సేవకురాలనైతే, నా పాతివ్రత్యము తపము నున్నచో పవనపుత్రుడగు శ్రీహనుమంతునకు నీవు శీతలత్వమును ప్రసాదింతువుగాక! " పతివ్రతాశక్తి అతులనీయము, సాధ్వి తలంచినచో సకలసృష్టి స్తంభించును. సీతా దేవి పతివ్రతి మాత్రమే కాక సకలసృష్టికి అధిష్ఠాత్రి, జగజ్జనని, మూలప్రకృతి, ఈశ్వరి. ఆమె ఇట్లు ప్రార్థించగానే అగ్ని దేవుడు శ్రీ హనుమంతుని యెడల శీతలత్వము ధరించాడు. అగ్నిశిఖలు ప్రదక్షిణం ఒనరించుచున్నట్లు శ్రీహనుమంతునకు గోచరించగా ఆశ్చర్యచకితుడై ఇట్లా ఆలోచించాడు. ఆహా! అగ్ని యొక్క గుణము జ్వలించుట. అగ్నిస్పర్శచే గొప్ప భవనములే బూడిద అవుచున్నవి. కాని నా కెట్టి తాపము కలుగకపోగా చల్లదనమును అనుభవించుచుంటిని. నిశ్చయంగా ఈ వైచిత్రమునకు సీతా దేవి అనుగ్రహమో, శ్రీరామచంద్రుని ప్రభావమో, నా తండ్రికి అగ్ని దేవునకు గల స్నేహమో కారణము కావచ్చునని తోస్తున్నది.

Tuesday 28 December 2021

శ్రీ హనుమద్భాగవతము (115)



దుష్టుడైన దశాననుడు అసురగణమును ఇట్లా ఆజ్ఞాపించాడు. “దైత్య వీరులారా! ఈ వానరుని ధూషితూ లంకానగరమంతా తిప్పి, తుదకు వీని వాలమునకు నిప్పు బెట్టుడు.”


లంకా దహనము


సత్యగుణసంపన్నుడు, పరమపరాక్రమవంతుడు, కపికుంజరుడు అయిన శ్రీ అంజనానందవర్ధనుడు శ్రీరామకార్యమును పరిపూర్ణం ఒనరించుటకు తన దివ్యరూపాన్ని దాచియుంచాడు. లంకాధిపతియైన రావణుని ఆజ్ఞానుసారంగా రాక్షస యోధులు అనేక వస్త్రములను దెచ్చి వాటిని నేతిలో ముంచి హనుమంతుని వాలమునకు చుట్టడం ఆరంభించారు. దుష్టుడైన దశాననుని ఆజ్ఞాపాలకులైన అసురులు హనుమంతుని వాలమునకెన్ని వస్త్రములను చుట్టినా అది పొడవగుతూనే ఉంది, కపీశ్వరుని ఈ క్రీడ వలన లంకానగరములోని వస్త్రములకు, ఘృతమునకు కరవు ఏర్పడింది; కాని రాక్షసులు లంకా నగరములో వెదకి వెదకి వస్త్రములను దెచ్చి ఘృతములో తడిపి శ్రీఆంజనేయుని వాలమునకు జుట్టి అతనిని పగ్గములతో బంధించారు.


దృఢమైన రజ్జువులతో కట్టబడిన శ్రీకపికుంజరుడైన కేసరీకిశోరుని రాక్షసులు పట్టుకొని సంతోషముతో తీసుకుని పోవసాగారు. వారు భేరీమృదంగాదులను మ్రోగిస్తూ శ్రీహనుమంతుడు ఒనరించిన అపరాధములను వర్ణించుచు రాజమార్గములందు త్రిప్ప సాగారు. శత్రుదమనుడైన శ్రీహనుమంతుని వెనుక అసురులు, అసుర బాలకులు చప్పట్లు కొండుతూ అతనిని దూషించ ఆరంభించారు. కొందఱు శ్రీ పవనాత్మజునిపై రాళ్ళు వేయగా మణికొందఱు పిడికిళ్ళతో గ్రుద్దడం ఆరంభించారు; కాని బుద్ధిమంతుడైన శ్రీహనుమంతుడు తన ప్రభువు యొక్క కార్యసిద్ధికొఱకై కించిన్మాత్రమైనా బాధనొందక వారు పెట్టే యాతనలనన్నింటిని ప్రసన్నతాపూర్వకముగా సహించాడు, రాత్రి కాలమందు శ్రీహనుమంతుడు లంకానగర దుర్గ నిర్మాణాన్ని సాంగోపాంగముగా దర్శింపలేకపోయాడు: కాని ఇప్పుడు రావణుడు విధించిన ఈ దండనవలన లంకానగరమంతా తిరుగుతూ సావధానముగా పరికింపనారంభించాడు. ఆ నగరములో అద్భుతములైన పురములను, సుందరమైన అట్టాలికలను, సుందరగృహపంక్తులతో ఆవృతమైయున్న మార్గములను, ప్రఖ్యాతమైన రాక్షసుల నివాసములను, సైనిక స్థావరములను, మహత్వపూర్ణమైన ప్రదేశాలను శ్రీహనుమంతుడు చూసాడు.


రాక్షసులు కపీశ్వరుని బంధించి లంకానగర మంతా త్రిప్పారు. తనివిదీర దూషించారు. తుదకు వారు శ్రీహనుమంతుని ఒక కూడలియందు నిలిపి ఆనందోత్సాహములతో అట్టహాసములు ఒనరించుచున్నారు. అదే సమయములో ఒక ప్రముఖుడైన అసురవీరుడు వాలమునకు నిప్పు బెట్టాడు. వాలమున అగ్ని రగుల్కొనగానే రాక్షసులు, రాక్షసస్త్రీలు హర్షాతిరేకముచే నృత్యం చేస్తూ కరతాళధ్వనులు చేయసాగారు.


Monday 27 December 2021

శ్రీ హనుమద్భాగవతము (114)



భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనీనందనుడు దశకంఠుని శుభము కొఱకిట్లు అమృతసదృశమైన ఉపదేశమొనరించుచున్నాడు. కాని దుర్బుద్ధియైన రాక్షసరాజునకు దౌర్భాగ్యమూ వలన ఆ ఉపదేశం అప్రియంగా తోచింది. రావణుడు కోపించాడు. అతని నేత్రములు ఎఱుపెక్కాయి. శ్రీహనుమంతునితో రావణుడు ఇట్లా పలికాడు. “వానరాధమా! దుష్టబుద్ధీ! నా సమ్ముఖమున ఇట్లు వాచాలత్వముతో పల్కు దుస్సాహసం ఎట్లా చేశావు? వనవాసులైన శ్రీరాముడు, సుగ్రీవుడు ఏ పాటి శక్తిగలిగినవారు? మొదట నేను ఇచ్చోటనే నిన్ను సంహరింస్తాను. తదనంతరము సీతను జంపి, తుదకు శ్రీరామ లక్ష్మణ సుగ్రీవసహితముగా సకలసైన్యమును మృత్యుముఖమున బడవేస్తాను." దశకంఠుని ఈ మిథ్యాదర్పపుపలుకులను విశుద్ధాత్ముడైన శ్రీవానరేశ్వరుడు సహింపలేకపోయాడు. పండ్లు పటపట కొఱకుచు ఇట్లా పలికాడు. “అధముడా! రాక్షసరాజా! నీ తలపై మృత్యువు తాండవమాడుచున్నది. ఆ కారణమువలనే ఇట్లు ప్రలాపాలు ఒనరించుచున్నావు. నేను భగవంతుడైన శ్రీరామచంద్రునకు సేవకుడను. నా శక్తిపరాక్రమాదులను నీవు ఊహించనైనా ఊహించజాలవు. నీ వంటి పాపాత్ములు నన్నెదిరించలేరు.


దురాత్ముడైన రావణుడు క్రోధాగ్ని జ్వాలలతో జ్వలిస్తూ కేకలు పెడుతూ 'రాక్షసులారా! వెంటనే దుష్ట వానరమును వధించండీ అని అసురసైనికులను ఆజ్ఞాపించాడు. వీరులైన రాక్షసులు కపీశ్వరుని సంహరించుటకు ఉద్యుక్తులు కాగా మధుర వాక్యకుశలుడైన విభీషణుడు రావణుని శాంతింపవలసినదని ప్రార్ధిస్తూ ఇలా పలికాడు. “వీరవరుడా! లంకేశ్వరా! ధర్మమునకు వ్యాఖ్యానం ఒనరింపవలెనన్న, లోకాచారములను పరిపాలింపవలెనన్న, శాస్త్రీయసిద్ధాంతములను అవగత మొనరించుకొనవలెనన్న నీకంటెను సమర్థుడు మరి ఒకడులేడు, కోపమును పరిత్యజించి శాంతచిత్తుడవై ఆలోచించు. దూతను ఎక్కడైనా, ఏ సమయమందైనా, ఎట్టి పరిస్థితులలోనైనా సంహరింపరాదని సత్పురుషులు నొక్కి వక్కాణించారు. దూత మంచివాడైనా, చెడ్డవాడైనా శత్రువులచే పంపబడినవాడు కావున అతడు శత్రువర్గమునే కొని ఆడును. దూత ఎల్లప్పుడూ పరాధీనుడు, కావున వానికి మృత్యుదండన విధింపరాదు. దూత యొక్క అవయవములను ఖండించుట మొదలగు ఇతర దండనలను విధింపవచ్చును.


తన తమ్ముడైన విభీషణుడు దేశకాలమునకు ఉపయుక్తమైన హిత వచనములను పలుకగా రావణుడు శాంతించి ఇట్లు పలికాడు. “విభీషణా! నీవు చెప్పినది బాగుగా ఉన్నది. వీనికి మరణ దండనము తప్ప అన్యమైన శిక్షను విధించుట అత్యంతము ఉచితము. వానరులకు వారి వాలము ప్రియము: వాలమే వారికి ఆభూషణము, కావున వీని వాలమును తగుల బెట్టుము. ఈ వానరుడు తన స్వామి చెంతకు వెళ్ళి స్వయంగా అతనిని మృత్యు ముఖమునకు తోడొడ్కొనిరాగలడు.

Saturday 25 December 2021

శ్రీ హనుమద్భాగవతము (113)



ఆత్మ నిర్మలము, ఎల్లప్పుడును ఉపాధి రహితమని తెలుసుకోగానే మనుష్యుడీ సంసారము నుండి ముక్తుడగును. కావున ఓ మహామతీ! నేను నీకు అత్యంతికమైన మోక్ష సాధనమును ప్రవచిస్తాను. సానధానుడవై అవధరింపుము. (6)


విష్ణుభగవానుని శుద్ధభక్తి బుద్ధిని అత్యంత పవిత్రమొనరించును; దానిచే అత్యంత నిర్మలమైన ఆత్మజ్ఞానము లభిస్తుంది; ఆత్మజ్ఞానముచే శుద్ధుడైన జీవునకు ఆత్మతత్త్వానుభవము కలుగుతుంది. దృఢమైన ఆత్మజ్ఞానబోధ కలిగిన మనుష్యుడు పరమ పదప్రాప్తిని బొందును. (7)


కావున నీవు ప్రకృతికి అతీతుడు, పురాణపురుషుడు, సర్వ వ్యాపకుడు, ఆదినారాయణుడు, లక్ష్మీపతియైన శ్రీహరిని భజించు. హృదయములో గల శత్రుభావనను మూర్ఖత్వమును వదలి వేయుము. శరణాగతవత్సలుడైన శ్రీరామ చంద్రుని భజించు. సీతా దేవిని ముందుంచుకొని పుత్ర కళత్ర బంధు బాంధవ సహితుడవై భగవానుడైన శ్రీరాముని దివ్య చరణములును ఆశ్రయించు. దీని వలన నీవు భయము నుండి విముక్తుడవుతావు. (8) 

తనహృదయములో విరాజమానుడైయున్న వాడు, అద్వితీయుడు, సుఖస్వరూపుడు, పరమాత్మ అయిన శ్రీ రామచంద్రుని భక్తిపూర్వకంగా ధ్యానమొనరించనివాడు దుఃఖతరంగ భరితమైన ఈ సంసారసముద్రము నెట్లు దాటగలడు? (9)


నీవు శ్రీరామచంద్రుని భజింపనిచో అజ్ఞానరూపమైన అగ్నిలో దగ్ధమయ్యెదవు. నీవొనరించిన ఈ పాపముల చే భవిష్యత్తులో ఈ జన్మనుండి చ్యుతుడవయ్యెదవు. ఇక మోక్షము అసంభవము కాగలదు. (10)


అసురరాజా! నేను మాటిమాటికి నిన్ను ప్రార్థించుచున్నాను. నీవు సీతను అత్యంతాదర పూర్వకముగా ముందుంచుకొని భగవంతుడైన శ్రీరామచంద్రుని చెంతకు పొమ్ము. ఆయన చరణారవిందముల పైబడి నీ వొనరించిన అపరాధములను క్షమించమని ప్రార్థింపుము. నీవు నా వాక్యములను విశ్వసింపుము, నిశ్చయముగా దయాంతరంగుడైన శ్రీరామచంద్రుడు నిన్ను క్షమించి అనుగ్రహించగలడు. ఇక నీవు లంకలో నిష్కంటముగా సుఖములను అనుభవించగలవు. నీ లౌకిక పారలౌకిక జీవన ముద్ధరింపబడగలదు. నీజన్మ సఫలము కాగలదు. నీవు ధన్యుడవయ్యెదవు.


Friday 24 December 2021

శ్రీ హనుమద్భాగవతము (112)

 


శ్లో॥ త్వం బ్రహ్మణో హ్యుత్తమవంశ సమ్భవః 

పౌల స్త్యపుత్రోఽ సి కుబేర బాద్ధవః | 

దేహాత్మబుధ్యాపి చ పశ్య రాక్షసో 

నాస్యాత్మబుధ్యాపి కిము రాక్షసో సహి ||

శరీరబుద్ధాంద్రియదుఃఖసంత తిర్నతే

న చ త్వం తవ నిర్వికారతః |

అజ్ఞాన హేతోశ్చ తధైవ సంతతే 

రత్త్వమస్యాః స్వపతో హి దృశ్యవత్ ||

ఇదం తు సత్యం నాస్తి విక్రియా 

వికార హేతుర్న చతేఽద్వయత్వతః |

యథా నభః సర్వగతం న లిప్యతే 

తథా భవాన్ దేహగతోఽపి సూక్ష్మకః ||

దేహేంద్రియప్రాణశరీరసజ్ఞత 

స్వాత్మేతి బుద్ధ్వాఖలబద్ధభాగ్ భవేత్ |


చిన్మాత్ర మేవాహమజోఽహమక్షగో 

హ్యానన్ద భావోఽహమితి ప్రముచ్యతే | 

దేహోఽప్యనాత్మా పృధివీవికారజో 

న ప్రాణ ఆత్మానిల ఏష ఏవ సః ||

మనో@ప్యహంకారవికార ఏవ నో 

న చాపి బుద్ధిః ప్రకృతేర్వికారజా | 

ఆత్మా చిదానన్దమయేఽవికారవాన్ 

దేహాదిసంఘాద్వ్యతిరిక్త ఈశ్వరః ||


నిరంజనో ముక్త ఉపాధితః సదా 

జ్ఞాత్వైవ మాత్మానమితో విముచ్యతే | 

అతోఽహమాత్య నికమోక్ష సాధనం 

వక్ష్యే శృణుష్వవహితో మహామతే ||

విష్ణోర్హి భక్తిః సువిశోధనం ధియస్తతో 

భవేద్ జ్ఞాన నిర్మలమ్ | 

విశుద్ధతత్వానుభవో భవేత్తతః 

సమ్యగ్విదిత్వా పరమం పదం వ్రజేత్ ||


అతో భజస్వాద్య హరిం రమాపతిం 

రామం పురాణం ప్రకృతేః పరం విభుమ్ || 

విసృజ్య మౌర్ఖ్యం హృది శతృభావనాం 

భజస్వ రామం శరణాగతిప్రియమ్ ||


సీతాం పురస్కృత్య సపుత్ర బాంధవో 

రామం నమస్కృత్య విముచ్యసే భయాత్ ||


రామం పరాత్మానమభావయన్ జనో 

భక్త్యా హృదిస్థం సుఖరూపమద్వయమ్ || 

కథం పరం తీరమవాప్నుయాజ్జనో 

భవామ్బుధేర్దుఃఖ తరంగ మాలనః ||


నో చేత్త్వమజ్ఞానమయేన వహ్నినా 

జ్వల న్తమాత్మానమరక్షితారివత్ | 

నయస్యధోఽత్తః స్వకృత్తైశ్చ పాతకై 

ర్విమోక్షశ ఙ్కా న చ తే భవిష్యతి 


(ఆధ్యాత్మరామాయణము 5_416 11 25)


లంకాధిపతీ ! నీవు ఉత్తమమైన బ్రహ్మవంశములో ఉద్భవించినావు. పులస్త్యనందనుడైన విశ్రావసుపుత్రుడవు, కుబేరుని సోదరుడవు, నీవు దేహాత్మబుద్ధి చేకూడ రాక్షసుడవు కావు. ఇందెట్టి సందేహము లేదు (1)


నీవు సదా నిర్వికారుడవు, కావున యీ శరీరము, బుద్ధి, ఇంద్రియములు, దుఃఖాదులు నీవు కావు, నీగుణములు కావు. వీనియన్నింటికి కారణము అజ్ఞానము. ఈ విశ్వమంతయు స్వప్నమువలె అసత్యము. (2) 


నీ ఆత్మస్వరూపమున ఎట్టి వికారమును లేదనుట సత్యము. ఎందువలెననగా అద్వితీయమైన కారణమున ఎట్టి వికారమునుండదు. ఆకాశమంతట ఉన్నను పదార్థముల గుణ దోషములచే లిప్తము కానట్లు నీవు దేహమందున్నన సూక్ష్మస్వరూపుడవు కావున దేహము యొక్క సుఖదుఃఖాదులనంటవు. ఆత్మ దేహము, ఇంద్రియములు, ప్రాణము; శరీరము అంతా ఒక్కటియే అనే బుద్ధియే సమస్త బంధనములకు కారణమైయున్నది. (8)


నేను చిన్మయుడను, జన్మ లేనట్టివాడను, వినాశనం లేనివాడను, ఆనంద స్వరూపుడను అనే బుద్ధిచే జీవుడు ముక్తడగును. పృథ్వి యొక్క వికారమైన దేహము ఆత్మ కాదు. ప్రాణములు వాయురూపములు, అవి కూడ ఆత్మకావు. (4) 


అహంకారము యొక్క కార్యమైన మనస్సు లేదా ప్రకృతి వికారముచే ఉత్పన్నమైన బుద్ధి ఆత్మ కాజాలదు. ఆత్మ చిదానందస్వరూపము. వికారము లేనట్టిది. దేహాదుల సంఘాతము కంటె వేరుగ నున్నది. అది దేహాదులకు స్వామి యైయున్నది. (5)


Thursday 23 December 2021

శ్రీ హనుమద్భాగవతము (111)



నీవు నా స్వామిని ఎరుగనట్లు నటించినా ఆయన తన ధర్మపత్నిని హరించిన నిన్ను ఎలా మరువగలడు? రావణా! సర్వశక్తిసంపన్నుడు, మహాప్రభువైన ఆ శ్రీరామచంద్రుని దూతను నేను. మహాప్రతాపవంతుడైన వాయుదేవుని కుమారుడ నైన హనుమంతుడను.


కిష్కిందాధిపతీ, శ్రీరామచంద్రుని స్నేహితుడైన సుగ్రీవుడు సీతా దేవిని అన్వేషించుటకు కోటాను కోట్ల వానర భల్లూక వీరులను నాల్గుదిశలకు పంపాడు. వారిలో ఒకడనైన నేను శత యోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించి నీ లంకకు జేరాను. సీతను చుసాను. లంకను వినాశం ఒనరించు మహాకాల స్వరూపిణి సీతా దేవి అని తెలుసుకో. సీతా దేవి రూపమును ధరించి కాలపాశమే నీ చెంతకు వచ్చినది. రావణా! శ్రీరామాపరాధం చేసి సుఖించినవాడు త్రిలోకములందెవ్వడూ లేడు. మహాయశస్వియైన శ్రీ రామచంద్రుడు చరాచర ప్రాణిసహితంగా సమస్త విశ్వాన్ని నాశనము చేసి మరల సృష్టించగలడు. ఆ చతుర్ముఖుడైన బ్రహ్మ, త్రినేత్రుడైన త్రిపురారి, సహస్రాక్షుడైన ఇంద్రుడు, దేవతలు, దైత్యులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు మొదలగు వారందఱు కలిసివచ్చినా సమరాంగణములో శ్రీరాముని ఎదుట ఒక్కక్షణమైనా నిలువుజాలరు.


నేను నా ప్రభువు మొక్క ఆదేశానుసారంగా సీతా దేవిని దర్శించుటకు వచ్చాను. నాకు ఆకలి కాగా ఫలములను తిన్నాను. నా స్వభానుసారంగా వృక్షాలను విధ్వంసం చేసామి. కాని నీ సైనికులు నాపై దాడి చేసారు. నన్ను నేను రక్షించుకొనుటకు వారిని సంహరించాను. ఎవని శరీరము వానికి ప్రియము కదా! ఇందు నా దోషమేమిగలదు? అపరాధము నీ కుమారుడు చేసాడు. నన్ను అన్యాయంగా బంధించి తెచ్చుటను నీవే స్వయంగా చూస్తున్నావు గదా!


కపీశ్వరుడు, మహాభక్తుడైన హనుమంతుడు నిర్భయంగా చాతుర్యంగా పలికిన వచనములను ఆలకించి దేవగణములు ప్రసన్నములయ్యాయి. అసురగణములు భయాక్రాంతులై కంపింప సాగాయి. శ్రీరామచంద్రుని శక్తిని, మహిమను వినినతనే వారి మనోబలము సన్నగిల్లింది. రావణుడు క్రోధముతో పండ్లుకొరకడం ఆరంభించాడు. పరమబుద్ధిమంతుడు, మంగళ మూర్తి అయిన శ్రీ ఆంజనేయుడు అత్యంత శాంతి పూర్వకంగా దశగ్రీవుని హితార్థం ఇలా ఉదేశింపనారంభించాడు.


Wednesday 22 December 2021

శ్రీ హనుమద్భాగవతము (110)



దైత్యరాజైన రావణుడు తన ఎదుట పింగాక్షుడు, పింగ కేశుడు, పింగరోముడు, వానర శిరోమణియునైన శ్రీ ఆంజనేయుని చూసి రోషాగ్నిచే జ్వలించాడు. కాటుక కొండవలె నల్లనివర్ణము కల్గిన ప్రహస్తుడనే మంత్రిని చూసి రావణుడిలా పలికాడు. ప్రహస్తా! ఈ వానరుడు తానెవ్వడో ! ఎచ్చటనుండి వచ్చినాడో? వీని రాకకు కారణమేమో? అశోకవనమును విధ్వంసమేల చేసెనో ? అసురవీరులను నా కుమారుని సంహరించుటకు కారణమేమో ప్రశ్నింపుము.  

ప్రహస్తుడు హనుమంతుని చూసి ఇలా పలికింది. వానరా ! నీవు భయము చెందకు. ధైర్యము వహించు. నీవెవ్వరవు? ఎచ్చోటనుండి వచ్చావు? ఇచ్చటకు నిన్నెవరు పంపారు? సత్యం పలికితే నీకు ఎట్టి హానీ కలుగదు. మేము నిన్ను వదిలివేయగలము.


శ్రీరామభక్తుడైన ఆంజనేయుడు త్రైలోక్యవిజయుడైన రావణుని సభలో శంకారహితుడు, నిర్భయుడై ఉన్నాడు. ఆయన మహాప్రభువైన శ్రీరామచంద్రుని స్మరించి ఇలా పలుకనారంభించాడు. లంకాధిపతీ! రావణా! అనంతుడు, మహిమాన్వితుడు, దయామయుడు, మహాప్రభువైన ఎవ్వరి ఆశ్రయాన్ని పొంది మాయ సకలసృష్టి చేస్తుందో, ఎవని శక్తిచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిస్థితిలయములను చేస్తున్నారో, ఎవరి బలముపై ఆది శేషుడు ఈ విశ్వమును ధరించియున్నాడో, ఎవడు యుగయుగములందు గోబ్రాహ్మణులను, దేవతలను, భక్తులను, ధర్మమును రక్షించుటకు, భూమికి భారభూతులైన నీవంటివారిని సంహరించుటకు అవనిపై అవతరించాడో, ఆ శ్రీరామచంద్రుని దూతను నేను. కఠోరము దివ్యము, విశాలమైన శంకరభగవానుని ధనువును నీవు కదల్పనైనను కదల్ప లేకపోయావు. ఆ ధనుస్సును భగ్నం ఒనరించి దశరథనందనుడైన శ్రీరామచంద్రుని ఎరుగవా ? ఖరదూషణాదులు, త్రిశరుడు మొదలైన పదునాల్గువేల రాక్షసులను ఒక్కడే త్రుటిలో సంహరించిన శ్రీ రాముని ఎరుగవా? ఓరీ! నిన్ను తన చంకలో బంధించిన వాలిని ఒకే ఒక బాణముతో సంహరించాడు.

Tuesday 21 December 2021

శ్రీ హనుమద్భాగవతము (109)



బ్రహ్మాస్త్రముచే ముక్తుడయ్యి కూడా మంగళమయుడు, జ్ఞానమూర్తియైన పవనాత్మజుడు ఆ విషయమే తెలియనట్లు ప్రవర్తించడం ఆరంభించాడు. రాక్షసులు ఆంజనేయుని రావణసభకు తోడ్కొనిపోవ సాగారు. లంకానగర వాసులు దుర్భాషలాడుతూ పరిహసించసాగారు. కాని శ్రీ రామదూతైన శ్రీ ఆంజనేయుడు త నస్వామి కార్యము సంపూర్ణం ఒనరించుటకు సంకల్పించుకొనినవాడై అసురుల దూషణ తిరస్కారాదులను మౌనముగా భరించాడు. నగరములో గల సైన్యవిభాగ ప్రదేశాలను హనుమంతుడు జాగ్రత్తగ గమనించాడు. ఇట్లా మేఘనాథుడు ఆంజనేయుని రావణుని సభకు తోడ్కొనిపోయాడు.


హనుమంతుడు రావణునకు హితోపదేశము చేయుట 


తండి సమ్ముఖమునకు వచ్చి మేఘనాథుడు ఇలా పలికాడు... "పితృదేవా! అసాధారణమైన ఆ వానరము అసంఖ్యాకులగు మన రాక్షసవీరులను సంహరించింది. నేను బ్రహ్మాస్త్రముచే అతనిని బంధించి తెచ్చితిని. మీరు మంత్రులతో - సంప్రదించి ఏది ఉచితమో దాని చేయండి.”


నీతి నిపుణుడైన హనుమంతుడు రాక్షస చక్రవర్తియైన రావణు నిసభను జాగ్రత్తగా పరిశీలించాడు. తప్తమైన సువర్ణం వంటి తేజస్సు కలవాడు, బలసంపన్నుడు, బ్రహ్మవంశ కులోద్భవుడైన దశాననుడు నానారత్నములచే జటితమై - ప్రకాశించు విశాల స్ఫటికమణి సింహాసనముపై ఆసీనుడి ఉండుట హనుమంతుడు చూసాడు. రావణుని శిరముల బహుమూల్యములు, దీప్తిమంతములు, రత్నజటితము ప్రకాశిస్తూన్నది. మంత్రతత్వవేత్తలగు దుర్థరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అనే నల్వురు మంత్రులు రావణుని పరివేష్టించి ఉన్నారు.


ప్రకాశవంతుడైన ఆ రాక్షసరాజు యొక్క తేజముచే ప్రభావితుడై ధర్మమూర్తియైన పవనకుమారుడు తనలో తానిట్లా అనుకొన్నాడు. శక్తితో, ఈ అద్భుతరూపముతో, అనుపమాన శక్తితో, ఆశ్చర్యకరమైన తేజముతో సంపన్నుడైన రావణునిలో ప్రబలమైన ఈ (సీతాపహరణ మను) అధర్మము లేకున్నచో ఇతడు సకలవిశ్వమునకు సంరక్షకుడు కాగలిగేడివాడు.  


Monday 20 December 2021

శ్రీ హనుమద్భాగవతము (108)



మహాపరాక్రమవంతుడైన మేఘనాథుడు, తన దివ్యరథాని అధిరోహించి రాక్షససైన్యములచే పరివృతుడై పవన పుత్రుని సమీపమునకు వెళ్ళాడు. ఇంద్రజిత్తు చేసిన భయంకర సింహనాదాన్ని ఆలకించి సర్వసమర్థుడైన ఆంజనేయుడు లోహస్తంభమును ధరించినవాడై గగనమునకు ఎగిరాడు. ధనుర్థరుడైన మేఘనాథుడు మహాశరప్రయోగముచే హనుమంతుని నొప్పించాడు. బృహత్కాయుడైన ఆంజనేయుడు లోహ స్తంభప్రహారముచే రథమును, రథసారధిని చూర్ణం చేసాడు. మేఘనాథుని అపారసేనావాహిని ఆంజనేయుని ప్రహారములకు రక్తము గ్రక్కుతూ మరణించింది.


ఆ కపీశ్వరుని శక్తి ఎదుట ఏ అస్త్రములు నిలువజాలకపోవుట చూసి మేఘనాథుడు అస్త్ర శిరోమణియైన బ్రహాస్త్రమును ప్రయోగించాడు. నిత్యస్వరూపుడైన పవనకుమారునకు బ్రహ్మ దేవుడు బ్రహ్మాస్త్రమునకు బంధింప బడకుండనట్లు ఆశీర్వదించియుంన్నాడు. కాని ఆంజనేయుడు బ్రహ్మదేవుని గౌరవింపదలచాడు. ఆయన బ్రహాస్త్రము గౌరవించుటకై తనంతట తానే బంధితుడయ్యాడు.


మాయాతీతుడైన శంకరనందనుడు బ్రహ్మాస్త్రము చేత బంధితుడగుట చూసి భీతులై పారిపోవుచున్న రాక్షసులు మరలివచ్చారు. వారు హనుమంతుని అనేక విధాలుగా దూషిస్తూ గొలుసులతో బంధించారు. అన్య బంధముచే బ్రహ్మాస్త్రము తొలగింది. బ్రహ్మపాశబంధనము అన్యబంధనముచే విడిపోవునని మూర్ఖులైన అసురులకు తెలియదు.


బ్రహ్మపాశముక్తుడైన వానరశిరోమణి కేవలము లోహపుగొలుసులచే బంధింపబడి యుండుట చూసి ఇంద్రజిత్తు చింతాక్రాంతుడయ్యాడు. బ్రహ్మాస్త్రం ఒక్క పర్యాయము విఫలమైతే మరల ప్రయోగించుట అసంభవమని మంత్రజ్ఞుడైన ఇంద్రజిత్తునకు తెలుసు. తన విజయము తనకు అనుమానాస్పదమైంది.


Sunday 19 December 2021

శ్రీ హనుమద్భాగవతము (107)



అక్షయకుమారుడు మరణించాడని వినగానే రావణుడు చింతాక్రాంతుడయ్యాడు, ఎట్లో తన మనస్సును ఊరడించుకున్నాడు. ప్రజ్వలితమవుతున్న్న రోషాగ్నిచే దగ్ధుడవుతూ, మహాకాయుడైన రావణుడు తానే బయలు దేరగా స్వయముగా ఆంజనేయుని బంధించుటకు ఇంద్రజిత్తు తన తండ్రిని వారించి ఇలా పలికాడు. “పితృ దేవా! నేనుండగా నీ వేల దుఃఖించెదవు? ఒక్క క్షణములో నేను వానరుని బంధించి నీయెదుట ఉంచగలను.


ఇంద్రజిత్తు వానరేశ్వరుడైన హనుమంతునితో యుద్ధం ఒనరించుటకు బయలు దేరగా రావణుడు కుమారుని సావధానపఱస్తూ ఇలా పలికాడు.”


శ్లో || న మారుతస్యాస్తి గతిప్రమాణం | 

న చాగ్నికల్పః కరణేన హంతుమ్ | 


(వాల్మీకి. రా. 5.48-11) 


కుమారా! ఆ వానరుని గమనమునకు లేదా శక్తికి ప్రమాణము గోచరించుటలేదు (అనగా అవధులు లేవు) అగ్ని సమాన తేజస్వియైన ఆ వానరుని ఏ సాధనము చేతనైనా నిర్జించుట సాధ్యముకాదు.


కావున నీవు నీ ప్రతిపక్షమున నున్న వాడిని నీతో సమానుడైన పరాక్రమము కలవాడని తెలుసుకుని ధనుర్భాణముల యొక్క దివ్యప్రభావమును జ్ఞప్తి యందుంచుకొని (దివ్యాస్త్రములను స్మరిస్తూ) రణరంగంలో ప్రవేశించు. నీపరాక్రమాన్ని చూపు.


తన తండ్రి పలికిన వచనాలను ఆలకించి వీరవరుడైన మేఘనాథుడు దశకంఠునకు ప్రదక్షణములను ఆచరించి ఘోర యుద్ధము చేయ సంకల్పించినవాడై తన అద్భుతరథాన్ని అధిరోహించాడు. 


Saturday 18 December 2021

శ్రీ హనుమద్భాగవతము (106)



అప్పుడు హరాంశజుడైన అంజనీనందనుని ఆకారము భయంకరంగా పర్వతమువలె పెరిగిపోయింది. అతని భీషణాకృతి చేత ఆకాశమును విదీర్ణం ఒనరించు గర్జనముచేత అసురులు భీతులై ప్రాణము లేనివారయ్యారు. వారి అస్త్రశస్త్రములు శక్తిసంపన్నుడైన ఆంజనేయునకు ఆట వస్తువులవలె గోచరించాయి. క్షణకాలములోనే ఆ సర్వసైన్యమును ఐదుగురు సేనాధిపతులతో పాటు తన పదాఘాతములచే హనుమ సంహరించాడు. అసురులు శవములతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. వానరాధీశ్వరుడైన శ్రీపవనసుతుడు ఇనుప స్తంభమును ధరించి అన్యరాక్షస సైన్యముల కొఱకై నిరీక్షించుచున్నాడు. ఆ సమయములో క్రోధముచే రక్తపంకజ లోచనుడైన కపిసత్తముడు రాక్షస సంహారార్థమై విజృంభించిన భయంకరుడైన మహాకాలునిగా గోచరిస్తున్నాడు.


రావణుని సభకు ఈ ఐదుగురు సేనాధిపతులు ససైన్యముగా మరణించిన వృత్తాంతము చేరింది. ఈ దుర్ఘటనను ఆలకించగానే రావణుడు తన వీరకుమారుడైన అక్షయుని చూసాడు. యుద్ధము కొఱకు ఉత్కంఠితుడైన అక్షయకుమారుడు తండ్రి మనోభీష్టమును గ్రహించినవాడై, సువర్ణరథారూఢుడై కపీశ్వరుని బంధించుటకు బయలు దేరాడు. కాని రథములో ధనుర్భాణములు, చంద్రహాసము, శక్తి, తోమరము, గద మొదలైన ఆయుధములు, అస్త్రములు యథాస్థానమందు క్రమముగా ఉంచబడ్డాయి.


అక్షయకుమారుడు యుద్ధవీరుడైన హనుమంతుని పై ప్రచండ వేగముతో దాడి జరిపాడు. కాని భూధరాకారుడు, శ్రీమహా దేవాంశజుడైన హనుమంతుడు ఆకాశమార్గంలో పకెగిరినవాడై అక్షయునిరథము పైకి దూకాడు, ఆ తాకిడికి రథము, అశ్వములు, సారథి నశించారు. అక్షయకుమారుడు రథమునుండి దూకినవాడై ఆంజనేయునిపై అస్త్రములను ప్రయోగించడం ఆరంభిచాడు. అప్పుడు హనుమ ఆకాసానికి ఎగరగా అక్షయుడు వెంటబడ్డాడు. ఆకాశములో పవనకుమారుడు అక్షయకుమారుని రెండు కాళ్ళను పట్టుకొని గిరగిర త్రిప్పి భూమిపై పడేసాడు. అంతెత్తు నుండి క్రిందకు పడిన అసుర రాజు యొక్క ప్రాణప్రియపుత్రుని శరీరము తునాతునుకలయ్యింది. ఆ మహావీరుని ప్రాణము అనంత వాయువులో కలసిపోయింది. 


హనుమంతునిచే అక్షయకుమారుడు మరణించిన సమయంలో నక్షత్రమండలంలో విహరిస్తున్న మహర్షులు, యక్షులు, నాగులు, ఇంద్రాది దేవతలు ఆ ప్రదేశమునకు వచ్చి విస్మయముతో మహా తేజసంపన్నుడు, మహా కాలస్వరూపుడైన శ్రీరుద్రాంశజుని దర్శించి అనేక విధాల స్తుతించారు.  శ్రీ పవనకుమారుడు మరల యుద్ధము కొఱకు నిరీక్షింపసాగాడు.


Friday 17 December 2021

శ్రీ హనుమద్భాగవతము (105)

 


విశాలమైన అసురసైనము నశించుట రావణునకు తెలిసింది. అందులకు అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. అప్పుడు రావణుడు తన మంత్రియైన ప్రహస్తుని కుమారుడైన జంబు మాలిని వానరుని బంధించి తేవలసినదిగా ఆజ్ఞాపించాడు. జంబు మాలి విశాలకాయుడు, మహా క్రోధి, యుద్ధములో దుర్జయుడు. అతడు అసుర సైన్యాన్ని తోడ్కొని అశోకవనమునకు వెళ్ళాడు. చైత్యప్రాసాదభంజకుడైన హనుమంతుడు ఒక విశాలద్వారముపై నిలుచుంని ఉన్నాడు. అసురవీరులు తనను సమీపించుట చూసి, ప్రసన్నతాపూర్వకముగా గర్జించాడు. జంబుమాలి పవన పుత్రునిపై దివ్యాస్త్రములను ప్రయోగించాడు. వజ్రశరీరుడైన హనుమంతుడు చలింపక ముష్టిఘాతముచే జంబుమాలిని సంహరించాడు. తదనంతరము అసుర సైన్యాన్ని లోహ స్తంభముచే మోది సంహరించాడు.

 

ప్రహస్తకుమారుడైన జంబుమాలి, అతని కింకరులు మరణించుట రావణునకు తెలిసింది. రావణుని ఆశ్చర్యమునకు అంతులేదు. వెంటనే అతడు మహాబలవంతులు, దనుర్దారులు, అస్త్రవేత్తలందు శ్రేష్ఠులైన ఏడుగురు మంత్రి పుత్రులను ససైన్యముగా హనుమంతుని పైకి పంపాడు. ఆ ఏడుగురు మహావీరులు శస్త్ర సమన్వితములైన తమతమ సైన్యములతో కూడి ఒంటరివాడైన రుద్రాంశుని నిర్జించుటకు బయలు దేరారు. పరాక్రమవంతులైన ఆ మంత్రికుమారులు సువర్ణ ధనుష్టంకారం ఒనరించుచు హర్షయుక్తులై, ఉత్సాహవంతులై రణరంగమునకు చేరారు. సూర్యసమాన తేజస్వియైన శ్రీ హనుమంతుడు ప్రచండమైన లోహ స్తంభాన్ని ధరించి అసుర సైన్యము కొరకు నిరీక్షించుచున్నాడు. రాక్షసులందఱు ఒక్కుమ్మడిగా కొఱకు నిరీక్షించి హనుమంతునిపై బాణములను వర్షింపనారంభించారు. యుద్ధ ప్రియుడు, పరాక్రమవంతుడైన హనుమంతుడు తీక్షణమైన వారి శరాఘాతముల నుండి తన్ను తాను రక్షించుకుంటూ, భయంకర గర్జనములచే భయపెడుతూ వారిని ఎదుర్కొన్నాడు. క్షణములో మంత్రికుమారులతో పాటు అసుర సైన్యములు నేలకూలాయి. శేషించిన వారు భయభ్రాంతులై పలాయనము చిత్తగించారు.

 

ఇప్పుడు రావణుడు భయము పొందాడు; కాని మనస్సును దిటము చేసుకుని తన కర్తవ్యాన్ని నిశ్చయించుకొని హనుమంతుని బంధించి తీసుకొని రమ్మని మహావీరులు, రణనిపుణులు, ధైర్యవంతులైన విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే పేర్లు గల్గిన ఐదుగురు సేనాధిపతులను ఆజ్ఞాపించాడు.

 

దశకంఠుని ఆ ఐదుగురు సేనాధిపతులు తమ తమ సైన్యములతో అశోకవనమును చేరి హనుమంతునిపై దాడిచేసారు.    

Thursday 16 December 2021

శ్రీ హనుమద్భాగవతము (104)



వికృతముఖములు కల్గిన కొందఱు రాక్షస స్త్రీలు సీతా దేవి చెంతకు వెళ్ళి వానరాకారుడు, భయంకరుడైన ఈ వీరుడెవ్వడని ప్రశ్నించారు. అందులకు సీతా దేవి రాక్షసమాయలు మీకే తెలుస్తుంది, దుఃఖితురాలనైన నేనేమి చెప్పగలనని ప్రత్యుత్తరం ఇచ్చింది.


మృత్యువు నుండి బయటపడిన కొందఱు అసురవీరులు పరుగుపరుగున రావణుని సభకు వెళ్ళి ఇట్లా పలికారు. "ప్రభూ! వానరాకారములోనున్న ఒక ప్రాణి ఎచ్చట నుండియో వచ్చి అశోకవనమున ప్రవేశించినది. సీతాదేవితో సంభాషించి తదనంతరము అశోక వాటికను విధ్వంసం చేసింది. వనమునందు గల వృక్షములన్నో ధ్వంసమై అయ్యాయి; అంతేకాదు మణి నిర్మితమైన చైత్య ప్రాసాదమును భగ్నం చేసి ఎదురించిన అసురవీరులను సంహరించి ఆ మహావానరుడు నిర్భయుడై, నిశ్చింతుడై, ఆ వనములో కూర్చుని ఉన్నాడు. మేము ఇద్దరం మాత్రమే మృత్యువాత నుండి బయటపడిన వారమై మిమ్ము జేరాము.


రావణుడు ఎంతో కోపించాడు. అతడు ప్రాతః కాలమున దుఃస్వప్నములో కూడా వానరుడు లంకను ధ్వంసం చేస్తున్నట్లు చూశాడు.


అసురులు పలికిన వచనములను ఆలకించి లంకాధీశ్వరుడు రక్తపంకజలోచనుడై ఒక విశాలమైన అసుర సైన్యమును పంపాడు. 


ఆ సమయములో స్వర్ణ శైలసదృశుడైన కపిశ్రేష్ఠుడు విశాలమైన లోహ స్తంభమును బూని అసుర సైన్యము కొఱకై నిరీక్షించుచున్నాడు. మహా తేజస్వియైన ఆ పవనకుమారుని ముఖము అరుణవర్ణంగా ఉండింది. ఆతని ఆకృతి అత్యంత భయంకరంగా ఉంది. రక్కసుల విశాల సైన్యము వస్తుండటం చూసి ఉగ్ర వేగుడైన హనుమంతుడు భయంకరంగా గర్జించాడు. మల్ల విద్యకు పరమారాధ్యుడు, వికటమూర్తియైన ఆంజనేయుని భయంకర గర్జనాన్ని ఆలకించగానే రాక్షస వీరుల హృదయములు కంపించాడు. వారు వానరేశ్వరుడైన హనుమంతునిపై భయంకరమైన అస్త్రశస్త్రములను ఎన్నింటినో ఒక్కుమ్మడిగా వర్షింప ఆరంభించారు; కాని అమిత విక్రముడు, క్రోధముచే రక్త పంకజ లోచనములు గలవాడైన పవనకుమారుని ప్రహారముల ఎదుట ఆ అసుర వాహిని క్షణములో వివశయై మత్యువాతపడ్డాడు.


Wednesday 15 December 2021

శ్రీ హనుమద్భాగవతము (103)



అశోకవన విధ్వంసము


సకలశాస్త్రపారంగతుడు, విద్వాంసుడైన శ్రీ పవన కుమారుడు ఇట్లాలోచించాడు - “దూత యొక్క కార్యము స్వామి హితార్థమై మార్గమును సుగమం ఒనరించుటమే. రాక్షసేశ్వరుడైన రావణుని ఈ దుర్గం అభేద్యము. ప్రతి ద్వారమందు అద్భుతములు, విచిత్రములైన యంత్రముల మర్చబడియున్నవి. అవి ఉండగా ఎంతటి వీర సైన్యమైనా దుర్గమున ప్రవేశించుట అసంభవము. అదీగాక, అగమ్యమైన ఈ లంకానగరాన్ని రాత్రియందు చూసాను. దశకంథరుని వ్యక్తిత్వము, వాని వీరత్వము ఎలా అవగతం కాగలదు? శత్రు సైన్యముల శక్తియుక్తులను తెలుసుకోవడం అత్యంతావశ్యకము. అంతేకాదు, రావణుని, అతని మనో స్థైర్యమును సడలింపకేస్తే లాభము కలుగుతుంది. సీతామాతకు నేనిచ్చిన ఆశ్వాసనమునకు విశ్వాసము కల్గిస్తే ఆమె ధైర్యపూర్వకముగా శ్రీ రామాగమనముకొఱకై ఎదురుచూడగలదు, కావున లంకను బాగా పరిశీలించి లంకాధిపతియైన రావణుని కలుసుకొని మరలటమే ఎక్కువ ఉపయోగము కాగలదు, కాని అతనితో కలవటం ఎలా సంభవించగలదు? ఏ ఉపాయంతోనైనా ఈ అసురులను ఉత్తేజితులను చేస్తే, వారు నను నన్ను రావణుని సమ్ముఖమునకు కొనిపోగలరు.


ఇట్లా ఆలోచించుకొని పవనపుత్రుడైన హనుమంతుడు ఒక వృక్షముపైకి లంఘిచి మధుర ఫలములను ఆరగింప ఆరంభించాడు. కొన్ని ఫలములను కొరికి క్రిందపడవేస్తున్నాడు. ఒక వృక్షము యొక్క కొమ్మను విరచాడు, మఱియొక వృక్షాన్ని సామూలాగ్రంగా పెకలించి వెసాడు. ఈ ప్రకారంగా అశోక వనమును ధ్వంసం చేయడం ఆరంభించాడు. సీతా దేవి ఉన్న ప్రాంతము తప్ప అన్యమైన అశోక వాటికనతా అస్తవ్యస్తం చేసాడు. అమితసుందరమైన ఆ వనము క్షణంలో ధ్వంసమైపోయింది. హనుమంతుడు గగనాన్ని అంటుచున్న ఒక చైత్యప్రాసాదముపై ఎగిరికూర్చున్నాడు. శక్తిసంపన్నుడు, మహా దేవాత్మజుడు, పరమ తేజస్వీ, శివావతారుడైన కపీశ్వరుడు విశాలశరీరుడై లంక ప్రతిధ్వనించునట్లుగా అట్టహాసం చేస్తూ ఆ చైత్యప్రాసాదాన్ని ఖండఖండాలుగా భగ్నం చేశాడు. 


విశాలకాయుడైన హనుమంతుని గర్జనాన్ని ఆలకించి తమోగుణ సంపన్నులైన రాక్షసులు అదరిపడి లేచి భయపడసాగారు. వారు తక్షణమే నానావిధములైన ఖడ్గతోమరముద్గర గదాద్యస్త్రశస్త్రములను తీసుకుని చైత్య ప్రాసాదాభిముఖముగా పరుగెత్తసాగారు. మనోహరమైన అశోకవనము విధ్వంసమవ్వటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ అసురులు కోపించినవారై నఖదంష్ట్రాయుధములతో పవనకుమారునిపై దాడిచేయసాగారు. కాని మహాశక్తిసంపన్నుడైన శ్రీహనుమంతుని ఎదుట ఆ అసుర సైన్యము క్షణమైనా నిలువలేకపోయింది. భగ్నమైన ప్రాసాదము యొక్క, దాని ఖండముల యొక్క, తర శాఖల యొక్క క్రిందపడి వారు మరణించారు. 

Tuesday 14 December 2021

శ్రీ హనుమద్భాగవతము (102)



వానర శిరోమణీ, విశ్వరూపుడైన హనుమానుని వచనాలను ఆలకించగానే జానకీ దేవి సందేహము తొలగిపోయింది. ఆమె అత్యంత ప్రసన్నురాలయ్యింది. సీతాదేవి శ్రీ రామభక్తుడైన వీరహనుమంతుడిని ఆశీర్వదిస్తూ ఇలా పలికింది.” 


హోహు తాత బల శీల నిధాన ||

అజ అమర గుణనిధి సుత హోహూ |

కరహు బహుత రఘునాయక చోహూ |


-రామచరిత మానసము (5-16-1) 


"తండ్రీ! నీవు బలశాలివి, శీలవంతుడవు, జరారహితుడవు, అమరుడవు. గుణములకు నిధివి అగుదువుగాక ! శ్రీ రామ చంద్రుడు నీపై విశేష కృపను చూపుగాక!"


ప్రభుపు కృప చూపుగాక అనే ఆశీస్సును జగజ్జనని వలన ఆలకించి పవననందనుడు కృతార్థుడయ్యాడు. ఆయనకు సమస్త విశ్వమందుగల అమూల్యమైననిధులు ప్రాప్తించినట్లయ్యింది. తన విశ్వరూపమును విడచి హనుమంతుడు జనని చరణకమలములను ఆశ్రయించాడు. ఆయన ప్రేమానందమునకు అవధులు లేకపోయింది. ఆయన శరీరమంతా పులకించింది. నేత్రముల నుండి ఆనందాశ్రువులు ప్రవహించాయి. భువన పావనియైన జానకి యొక్క చరణ రేణువులతో శ్రీహనుమంతుని ముఖమండలము ప్రకాశించింది. హస్తములను ముకుళించి గద్గద స్వరముతో అతడి ఇట్లా పలికాడు. “జననీ! నేను కృతార్థుడనైయ్యాను. నా జీవనము ధన్యమయ్యింది. నాజన్మము సఫలమయ్యింది. విశ్వపావనీ! నీ ఆశీర్వాదం అమోఘము, జగత్ప్రసిద్ధము. అమ్మా! నాకు ఎందులకో ఆకలి కల్గుచున్నది. ఈ వనంలో ఎన్నో మధురఫలవృక్షములు ఉన్నాయి. అమ్మా! నీవు అనుజ్ఞ ఇస్తే ఈ ఫలములను ఆరగించి నా ఆకలిని తీర్చుకుంటాను. అపుడు జానకి ఇలా పలికింది. “కుమారా! నీవు ఫలములను ఆరగించి తృప్తిని పొందాలనే నేను ఆకాక్షిస్తున్నాను; కాని ఈ వనాన్ని బలవంతులు, శూరులు, వీరులైన దానవ సైనికులు రక్షించుచున్నారు.


నిర్భీకుడైన హనుమంతుడు “జననీ! నీ అనుజ్ఞ నాకు కావాలి. ఈ అసురులను గుఱించి నీవు చింతించవలదు” అని పలికాడు. 


సీతా దేవి మహావీనుడు, బలవంతుడు, బుద్ధిమంతుడైన హనుమంతుని చూసి ప్రసన్నురాలై ఇలా పలికింది. “కుమారా! శ్రీరామచంద్రుని స్మరించుకుంటూ ఇచ్ఛానుసారంగా మధుర ఫలములను ఆరగించు.”


Monday 13 December 2021

శ్రీ హనుమద్భాగవతము (101)



తల్లి పల్కిన పల్కులను ఆలకించి సాక్షాత్తు శివస్వరూపుడు, పవనాత్మజుడైన శ్రీహనుమానుడు మందహాసము చేసి తన విశ్వరూపమును ప్రదర్శించాడు.


చూస్తుండగానే హనుమంతుడు ఇంతటి వాడంతై మేరువంతై గగనమంతై ఏదిగిపోయాడు. ప్రజ్వలితాగ్ని సదృశమైన తేజస్సు కలవాడు, విశ్వరూపుడు, అగ్ని సదృశమైన నేత్రములుగలవాడు, పంచశిరములు కలవాడు, ప్రతి ముఖమందు త్రినేత్రములు కలవాడు, వజ్రసమములైనకోరలు కలవాడు, వాడియైన నఖములు (గొర్లు) కలవాడు, విశాలకాయుడు మహాబలీ అయిన హనుమదీశ్వరుని విశ్వరూపమును చూసి సీతాదేవి పరమాశ్చర్యచకితురాలయ్యింది. దేవతలు ఆ విశ్వరూపునిట్లా ప్రార్థింపనారంభించారు.


శ్లో॥ వద్దే వానర నారసింహ ఖగరాట్, క్రోడాశ్వవక్రాంచితం 

నానాలంకరణం త్రిపంచనయనం, దేదీప్యమానం రుచా 

హస్తాభ్జైరసి ఖేట పుస్తక సుధాకుంభాంకుశాద్రీన్ హలం 

ఖట్వాఙ్గం మణిభూరుహంచ, దధతం సర్వారి గర్వాపహం,


(పరాశర సంహిత)


వాసర నృసింహ గరుడ సూకర అశ్వముఖములు కలవాడు, అనేకములైన అలంకారములు కలవాడు, దేదీప్యమానంగా ప్రకాశించుచున్నవాడు, ప్రతి ముఖమునందు మూడు నేత్రములు కలవాడు, పద్మములవంటి కరములందు ఖేటము (డాలు)ను, పుస్తకమును, అమృతకలశమును, అంకుశమును, పర్వతమును, నాగలిని, ఖట్వాంగమును, (శివునివింటిని), మణులను, వృక్షమును ధరించినవాడు, వైరులందరి - గర్వమును హరించినవాడైన హనుమంతునకు నమస్కరించుచున్నాను.


విశ్వరూపమును ధరించి హనుమదీశ్వరుడు సీతా దేవికి నమస్కరించి ఇలా పలికాడు. “జననీ! నేను వన పర్వత తటాకలతో యుక్తమైన ఈ లంక నగరాన్ని రావణునితో పాటు పెకలించుకొని మరలిపోగలవాడను; కావున నీవు శంకింపవలదు. శ్రీరాముని దండులో నన్ను మించిన వారు అసంఖ్యాకముగా ఉన్నారు. శ్రీరామచంద్రుని కృపా విశేషముచే అల్పకీటకమైనను గరుత్మంతుని మ్రింగగలదు.”


Sunday 12 December 2021

శ్రీ హనుమద్భాగవతము (100)



తత్వ ప్రేమకర మమ అరు తోరా | 

జానత ప్రియా ఏక మను మోరా |

సో మను సదా రహత తోహి పాహీం | 

జాను ప్రీతి రను ఎతనేహి మహీం ||


(శ్రీ రామచరిత మానసము 5-15-3) 


సీతా! నీవు లేని నాకు ఈ సృష్టియందుగల వస్తువులన్నీ దుఃఖదాయకములైనవి. బయటకు చెప్పుకొన్న మనస్సులోని దుఃఖము కొంత తరుగగలదు. కాని నేనెవ్వరితో చెప్పుకోగలను? నా దుఃఖమును తెలిసికొన గలవారెవ్వరు? ప్రియా! నీనాప్రేమతత్వ రహస్యము నా మనస్సుకే తెలుసు. ఆ మనస్సు ఎల్లప్పుడు నీ చెంతనే ఉంటుంది. నా ప్రేమసారమంతా ఇదేనని తెలుసుకో. 


జీవనాధారుడైన శ్రీరఘునాథచంద్రుని ప్రియసందేశాన్ని ఆలకించి సీతాదేవి ఆనందమగ్నురాలయ్యింది. ఆమె హనుమంతుని సంబోధిస్తూ ఇలా పలికింది. సుపుత్రుడా! శీఘ్రాతిశీఘ్రముగా శ్రీరామచంద్రుడు నన్నుద్ధరించేటట్లు ప్రయత్నం చెయ్యి, విలంబనమొనరించకు.


వినీతాత్ముడైన శ్రీపవనాత్మజుడు ఇట్లా పలికాడు. తల్లీ! నీ విక చింతించకు. ధైర్యము వహించి పరమప్రభువైన శ్రీరామచంద్రుని స్మరిస్తూ ఉండు. నేను మరలిపోగానే శ్రీరామచంద్రుడు సపరివారముగా విచ్చేసి రాక్షసులను సంహరించి నిన్ను అత్యంతాదరముగా, ప్రీతిపూర్వకముగా అనుగ్రహింపగలడు. అమ్మా! స్వామి నాకనుజ్ఞ ఇవ్వలేదు. లేనిచో నేను ఈ క్షణమే నిన్ను నా భుజములపై ఎక్కించుకొని శ్రీరామచంద్రుని చెంతకు చేర్చెడివాడను.


స్వల్పమైన వానర రూపమున నున్న హనుమంతుడిలా పలుకగా సీతా దేవి నవ్వి ఇలా పలికింది. “కుమారా! హనుమంతుడా! ఈలంకలో నున్న రాక్షసులను నీవు చూసావు. వారి శక్తియుక్తులు అపారములు. సుగ్రీవుని సైన్యములో నున్న వానరులందఱు నీవంటి చిన్న శరీరములు కలవారా ఏమి? నాకు సందేహము కలుగుతుంది.”


Saturday 11 December 2021

శ్రీ హనుమద్భాగవతము (99)



హనుమంతుడు సీతా దేవికి శ్రీరామముద్రికను ఇచ్చాడు. ప్రకాశపుంజములను వెదజల్లుచున్న రత్నజటితము శ్రీరామనామాంకితము అయిన ముద్రికను జానకీ దేవి ధ్యానపూర్వకముగా చూసింది. ఆమె ఆనందమునకు అంతులేదు, అమె నేత్రములనుండి ప్రేమాశ్రువులు ప్రవహింప ఆరభించాయి. శ్రీరామచంద్రుని దూత అయిన హనుమంతునిపై పరిపూర్ణ విశ్వాసము కలుగగనే సీతా దేవి ఇలా పలికెను. ‘పవనపుత్రా! నీవు నా ప్రాణములను రక్షించావు. నిశ్చయంగా నీవు నా జీవితేశ్వరునకు అనన్యభక్తుడవు. నా ప్రభువు నీపై పరిపూర్ణమైన విశ్వాసముంచాడు. లేనిచో పరపురుషుని నా చెంతకు పంపరు. హనుమాన్! నీవు నా దశను చూశావు. క్రూరులైన ఈ నిశాచరుల నడుమ నేనెలా జీవించుచున్నానో చూశావు. శ్రీ రామచంద్రుని ఎడబాసి నేనెట్లు జీవించగలను. నా ప్రభువునకు నివేదించు. సమయము ముగియగానే పాపాత్ములైన రాక్షసులు నన్ను సంహరిస్తారు. నన్ను ప్రభువు ప్రాణము చూడాలనుకుంటే ఒక నెల లోపలనే లంకకు వచ్చి రాక్షస వంశమును సంహరించాలి. అంజనీనందనా! నీవుకూడ యుక్తియుక్తముగా స్వామికి విన్నవించి వెంటనే రాక్షసులను సంహరింపజేసి నన్నుద్ధరింపజేయ్యి.


సీతా దేవి వ్యాకులపాటుతో మరల ఇలా పలికింది - “హనుమా! ఆపత్సద్రమున మునుగుచున్న నాకు నీవు గొప్ప సహాయకుడవైనావు. ప్రభువునకు దూరమైన నేను నీటినుండి దూరమైన చేప వలె కొట్టుకొనుచున్నాను. దయామయుడైన ఆ ప్రభువు నన్నెప్పుడైనను తలుస్తున్నాడా?


బద్ధాంజలియై వినయపూర్వకంగా శ్రీ ఆంజనేయుడిట్లా పలికాడు. “తల్లీ ! నీ వియోగమువలన శ్రీ రామచంద్రుడు అనుభవించుచున్న దుఃఖమును వర్ణించుటకు సర్వదా నేను అసమర్థుడను. ఆర్యాంబికా! నిన్ను చూడని కారణమున శ్రీరామచంద్రుని హృదయము ఎల్లప్పుడూ శోకముతో నిండి ఉంటుంది, ఆయన మనస్పెప్పుడూ నీ ధ్యానమందే లఘ్నమై ఉంటుంది. నీ వియోగదుఃఖముచే శ్రీ రాముడు తన్ను తాను మరచిపోయాడు. నిన్ను గురించి తప్ప మఱియే విషయమును గురించి రాముడు ఆలోచించటం లేదు. నీ యెడ గల చింతతో ఆయన నిదురించుట లేదు. ఒక క్షణము కన్నుమూసినా 'సీతా! సీతా!' అంటూ మేల్కొనుచున్నాడు. అమ్మా ! శ్రీరామచంద్రుని శంకింపకు. ఆయన హృదయమున ద్విగుణీకృతమైన ప్రేమ నీ పైకలదు. కరుణానిధానుడైన ప్రభువు సజలనేత్రములతో నీకిట్లు సందేశాన్ని పంపాడు."

Friday 10 December 2021

శ్రీ హనుమద్భాగవతము (98)



సీతామాత ఆదేశాన్ని ఆలకింపగానే శ్రీరామభక్తుడైన హనుమంతుడు మెల్లమెల్లగా వృక్షము నుండి దిగి అత్యంత వినయంగా తల్లి చరణకమలముల చెంత తన శిరస్సును ఉంచి నమస్కరించాడు.


అత్యంత కుటిల స్వభావము కలిగిన రాక్షస స్త్రీల నడుమ పతివియోగ దుఃఖముచే దుఃఖితురాలై కాలము గడుపుతున్న విదేహరాజకుమారి తన ఎదుట విద్యుత్పుంజసమానుడు, అత్యంతపింగళవర్ణుడు, పక్షిసదృశమైన ఆకారము కలవాడైన వానరుని గాంచి కంపించింది. వానరుని నేత్రములు తప్త సువర్ణమువలె మెరయుచున్నాయి. ఆ చిన్ని వానరమును చూసి నన్ను మోసముతో వశపరచుకొనుటకు మాయావి యైన రావణుడు ఇక్కడికి వచ్చాడేమోనని సీతాదేవి అనుమానించింది. తలను దించుకొని ఉన్న సీతామాత తన కష్టములకు వ్యాకులచిత్తయై దుఃఖింపనారంభించింది.


సీతా దేవి తలవంచుకొని దుఃఖించుట చూసిన అంజనీ నందనుడు వ్యాకులుడై ఇలా పలికాడు. “జననీ! నీకు ఎలాంటి శంక అవసరంలేదు. నేను కరుణామయుడైన శ్రీరాముని సాక్షిగా శపథం చేసి పలుకుతున్నాను. నేను ప్రభువైన శ్రీ రాముని దాసానుదాసుడను. వానరరాజైన సుగ్రీవుని మంత్రిని. వారు పంపగా నిన్ను వెదకుతూ ఈ ప్రదేశమునకు వచ్చాను. నా తండ్రి మహాపరాక్రమవంతుడైన వాయు దేవుడు”. తన ఎదుట అత్యంత శ్రద్ధతో తలవంచుకొని హస్తములు జోడించి నమస్కరిస్తూ నిలుచుండియున్న శ్రీ పవనాత్మజుని చూసి కొంత ఊరడిల్లి జానకి ఇలా పలికింది. “నీవు శ్రీరఘునాథునిదాసుడవని చెప్పుచున్నావు; కాని మానవులకు, మీకు ఎట్లు మైత్రి కుదిరింది.”


నమస్కరిస్తూ అత్యంత వినయపూర్వకంగా హనుమంతుడిలా ప్రత్యుత్తరం ఇచ్చాడు - 'తల్లీ! శబరి ఆదేశానుసారంగా రామానుజునితో కలిసి శ్రీ రామచంద్రుడు ఋష్య మూక పర్వత ప్రాంతమునకు వచ్చాడు. గిరిశిఖరము పై నున్న సుగ్రీవుడు ఈ మహాతేజస్సంపన్నులను చూసి వారి వివరములను తెలిసికొనవలసినదిగా నన్ను పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషములో నేను స్వామిని సమీపించాను. భక్తపరాధీనుడు, నా దైవమైన నాశ్రీ రామచంద్రుడు నన్ను ఆంజనేయునిగా గుర్తించాడు. ఆయన చరణములపై బడి నేను లక్ష్మణసహితముగా భుజములపై ఎక్కించుకుని సుగ్రీవుని చెంతకు చేర్చాను. శ్రీరామునకు సుగ్రీవునకు మైత్రిని నెరిపాను. రాజ్యబహిష్కృతుడైన సుగ్రీవుడు శ్రీరామానుగ్రహము చేతనే మరల రాజ్యమును పొంది సుఖించుచున్నాడు. అతను పంపితేనే నేనిచటికి వచ్చాను. గురుతు కొఱకు ప్రభువు నాకీ రాజముద్రిక ఇచ్చాడు.


Thursday 9 December 2021

శ్రీ హనుమద్భాగవతము (97)



సీతా దేవి ఇట్లా ప్రాణములను అర్పించుటకు సిద్ధమగుటను చుసి సూక్ష్మరూపుడైన పవనపుత్రుడు అత్యంత మధుర స్వరముతో ఇట్లా పలకడం ఆరంభించాడు. "ప్రఖ్యాతమైన ఇక్ష్వాకువంశములో ప్రభవించిన దశరథుడను చక్రవర్తి మహాప్రతాపవంతుడు, ధర్మాత్ముడు; ఆయనకు శుభలక్షణ సంపన్నులు, దైవసమానులు, త్రైలోక్యవిఖ్యాతులు నైన శ్రీరామలక్ష్మణభరతశతృఘ్నులనే నలుగురు కుమారులు కలరు. అగ్రజుడైన శ్రీరాముడు తన ప్రాణాధిక ప్రియురాలు, సహధర్మచారిణి యైన జనక రాజపుత్రికతోనూ, తన అనుజుడైన లక్ష్మణునితోనూ తండ్రి ఆజ్ఞను పాలించుటకు రాజ్య త్యాగ మొనరించి అరణ్యమునకు వెళ్ళాడు. వారు మహర్షులను, మౌని వర్యులను దర్శించుచు దండకారణ్యమును చేరారు. కరుణావతారుడైన శ్రీరామచంద్రుడు గౌతమీ నదీతటముపై గల పంచవటి అనే ఆశ్రమములో నివసింపసాగింది. శ్రీ రామలక్ష్మణులు ఆశ్రమమునకు దూరముగా ఉన్న సమయములో దుష్టుడు, లంకాధిపతి అయిన దశాననుడు మోసంగా సీతాసాధ్విని అపహరించుకొనిపోయాడు. ఆశ్రమమునకు తిరిగివచ్చి సీతను కనుగొనని వాడై శ్రీరామచంద్రుడు శోకసంతుప్తుడయ్యాడు. లక్ష్మణునితో కలసి సీతను వెతుకుతూ దుఃఖతుడైన శ్రీ రామచంద్రుడు అరణ్యమార్గ మధ్యములో జటాయువును అనుగ్రహించి, ఋష్యమూక పర్వత ప్రాంతమున కేతెంచాడు. ఆ ప్రదేశములో ఆంజనేయునితో సమాగము జరిగింది. వానరచక్రవర్తియైన సుగ్రీవునకు, శ్రీరామచంద్రునకు మైత్రి కుదిరింది. అగ్రజుడైన వాలి వైరముతో సుగ్రీవుని రాజ్యమునుండి వెడలగొట్టాడు. 

దీర్ఘ బాహుడైన శ్రీరామచంద్రుడు ఆ వాలిని ఒకే ఒక బాణముతో సంహరించాడు. సుమిత్రానందను డైన లక్ష్మణుడు సుగ్రీవుని కిష్కింధారాజ్యసింహాసనముపై అభిషిక్తునిగా చేసాడు. కిష్కింధాధిపతీ, వానర రాజునైన సుగ్రీవుడు విదేహరాజకుమారి యైన సీతా దేవిని వెదకుటకు కోటానుకోట్ల వానర భల్లూక వీరులను నాల్గు దిక్కులకు పంపాడు. నేను ఆ కపిరాజైన సుగ్రీవుడు పంపగా వచ్చిన సామాన్యవానరుడను. మార్గమధ్యంలో జటాయువు యొక్క అగ్రజుడైన సంపాతిని కలుసుకున్నాను, ఆయన విదేహ రాజకుమారి యొక్క నెలవు తెలిపాడు.


సంపాతి చెప్పిన మార్గముఅను అనుసరించి నేను సాగరముకు దాటి లంకను చేరాను. లంకలో అన్వేషించుచున్న నేను విభీషణుని కలుసుకున్నాను. విభీణుడు చెప్పిన ప్రకారము నేను జగజ్జననియైన సీతా దేవిని దర్శించాను. నా యాత్ర సఫలమైనది, కాని ఆ తల్లి దుఃఖమును చూడగానే నా ధైర్యము చలించుచున్నది.


ప్రాణారాధ్యుడైన శ్రీరామచంద్రుని భవ్యచరితము ఆలకించుచున్న సీతా దేవి ఆశ్చర్యమునకు హద్దులు లేకపోయింది. ఇది సత్యమా? లేక స్వప్నమును గాంచుచున్నానా? పరనిందను నేనెన్నడు చేసి ఎఱుగను. అయినచో నేనెట్లు స్నప్నమును గాంచగలను? ప్రస్ఫుటమైన మధుర వాక్యముల ఆలకించుచున్నాను, ఇది భ్రమ కాజాలదని సీతాదేవి మనస్సులో ఆలోచించుకొని ఇలా పలికింది. “అమృతమయమైన నా ప్రాణనాథుని శుభ చరితమును గానం ఒనరించిన మహానుభావుడు నా ఎదుటకు రావలసినదిగా కోరుచున్నాను.”

Wednesday 8 December 2021

శ్రీ హనుమద్భాగవతము (96)



మీ అందరికి దుర్దినములు దాపురించినవి. మీకిక శరణు లభించదు. కావున మూర్ఖ స్త్రీలారా ! ఆమెను దుర్వచనములచే బాధించుట మానుకొని, ఆరాధించండి. సీతా దేవితో మధురంగా మాట్లాడుతూ సౌమ్యంగా వ్యవహరించండి. క్షమింపవలసినదిగా విదేహరాజపుత్రిని ప్రార్థించండి. ఇందులోనే మీకు శుభము కలదు.


త్రిజట పలికిన వచనములను ఆలకించి రాక్షసస్త్రీలు భయము చెంది సీతాదేవి పాదములపై బడి క్షమించమని ప్రార్థించి ఆ ప్రదేశము నుండి తొలగిపోయారు. సీతాదేవి దుఃఖమునకు అంతులేదు. ఆమె వ్యాకులయై త్రిజటతో ఇలా పలికింది. “తల్లీ ! ఈ విపత్కాలములో నీవు నాకు ఊరట కల్గింప ప్రయత్నించుచున్నావు; కాని ప్రాణనాథుని వియోగముచే దుఃఖించుచున్న నేను ఈ భయంకరులైన రాక్షసుల మధ్య జీవించి ఉండుటవలన ఎట్టి లాభమును లేదు. నీవు నాకొక సహాయం ఒనరించు. శుష్క కాష్ఠములను సమీకరించి చితిని పేర్చుము. దానిని జ్వలింపజేసి నేను అగ్నికి ఈ శరీరాన్ని ఆహుతి చేసెదను. నీ ఈ ఉపకారమును నేను మరువ లేను. భరింపలేను. ఈ కష్టములను నేనింక భరించలేను.


ఇట్లు పల్కి సీతాదేవి దుఃఖంపనారంభించింది. ఆమె దుఃఖమును గాంచి త్రిజట దుఃఖితురాలై అనేక ఉక్తులతో ఊరడించి సమాధానపరచి వెడలిపోయింది. సీతా దేవియొక్క కరుణాక్రందనమును విని వృక్షముపై దాగియున్న వజ్రాంగుడైన శ్రీహనుమంతుని హృదయము విదీర్ణమయ్యింది. ఆయన నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహింపనారంభించాయి. సీతాదేవి సమక్షమునకు తత్ క్షణమే వెళితే ఆమె భయపడుతుందేమో అనే శంకతో ఆగిపోయింది.


దుఃఖావేగముచే సీతా దేవి శరీర త్యాగమే ఉచితమని సంకల్పించుకొన్నాడు. ఆమె ఇట్లా ఆలోచింపసాగింది. “ఉరి తగిలించుకొని మరణించుటకు నా వేణి చాలును” అని ప్రాణములను విడచుటకు నిర్ణయించుకొని విదేహరాజకుమారి లేచి నిలుచుంది. ఆమె నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహించుచున్నాయి.

Tuesday 7 December 2021

శ్రీ హనుమద్భాగవతము (95)

అప్పుడు త్రిజట ఇట్లు పలికింది. “అసుర స్త్రీలారా ! నేను స్వప్నములో రావణుడు బోడితలతో, నూనెలో స్నానమాచరించి, ఎఱ్ఱని వస్త్రములను ధరించి ఉన్నట్లు గాంచాను”.



కరవీర (గన్నేరు) పుష్పమాలను ధరించి మదిరోన్మత్తుడైన రావణుడు పుష్పక విమానము నుండి భూమిపై పడుచున్నట్లు గాంచాను. బోడితల గలిగిన రావణునకు నల్లని వస్త్రములను ధరించాడు. వానిని ఒక నల్లనిస్త్రీ ఎచటికో ఈడ్చు కొని పోవుచున్నాడు. శరీరముపై ఎఱ్ఱని చందనము అలదుకొని, ఎఱ్ఱని పుష్పమాలను ధరించి, నూనెను త్రాగుతూ, అట్టహాసం ఒనరిస్తూ, గార్దభముపై ఎక్కి దక్షిణదిశగా రావణుడు పోతున్నాడు. ఒక్క విభీషణుడు తప్ప రావణునితో పాటు వాని పుత్రులు, సేనాపతులు, పరివారమంతా ముండిత మస్తకులై నూనెలో స్నానమాడుచున్నట్లు కాంచాను. రావణుడు సూకరముపై, మేఘనాథుడు శింశుమారము (మొసలి) పై, కుంభకర్ణుడు ఒంటెపై ఆసీనులై దక్షిణాభిముఖముగా పోవుచున్నట్లు చూచాడు. ఇంతే కాదు ఎఱ్ఱనిముఖముగల మహాతేజ స్సంపన్నుడైన వానరుడు అసురులను ఎక్కువ మందిని సంహరించి లంకకు నిప్పుపెట్టినట్లు, ఆ మంటలకు లంక భస్మమైనట్లు చూసాను. ప్రాతః కాలమున గల్గిన ఈ స్వప్నము త్వరలోనే సత్యమవుతుంది”.


భక్తురాలు, బుద్ధిమంతురాలైన త్రిజట ఆ రాక్షస స్త్రీలకు ఉపదేశిస్తూ ఇట్లా పలికింది. “రాక్షసస్త్రీలారా! మహాచక్రవర్తి యొక్క గారాల కోడలు సీతాదేవి సమస్తరాజ్య భోగాలను, వైభవాలను కాల తన్ని తన భర్తతో అరణ్య వాసమునకు వచ్చింది. మహావీరుడైన శ్రీరామచంద్రునితో ఆమె కుశ కంటకములతోనూ, రాళ్ళతోనూ కూడి ఉన్న అరణ్యమార్గములందు చరిస్తూ కష్టములను అనుభవించు చున్నా అది తనకు పరమసుఖమే అని భావించింది. అట్టి మహాపతివ్రతే, పరమాదరణీయురాలు, శ్రీరామచంద్రునకు పరమప్రియురాలైన సీతాదేవిని ఇట్లా భయపెడుతూ, బెదరిస్తూ ఉంటే కౌసల్యానందనుడైన శ్రీరామచంద్రుడు ఇట్లా సహించగలడు ? 

Monday 6 December 2021

శ్రీ హనుమద్భాగవతము (94)



తదనంతరము దశాననుడు అమిత భయంకరముఖములు గల రాక్షసస్త్రీలకు ఆదేశమిస్తూ ఇట్లా పలికాడు. “నిశాచర స్త్రీలారా ! ఆదరముతో గాని, ప్రలోభమునగాని, భయమునైన గాని, మఱి ఎట్లైనా సీత నాకు అనుకూలమవునట్లు ప్రయత్నించకు. ఒక నెలదినములలో ఈమె మనస్సు మార్చుకుంటే మహారాజుభోగములను అనుభవింపగలదు. లేనిచో మరణించి నాకు ఉదయమున ఫలహారము కాగలదు.


రావణుడు మరలిపోగానే వాని కోరిక ప్రకారము భయము గొల్పు రాక్షసస్త్రీలు శ్రీజానకీ దేవిని అనేక ప్రకారముల భయపెడుతూ బెదరించడం ఆరంభించారు. ఈ దృశ్యమును గాంచి శ్రీ పవనాత్మజుడు మిగుల కోపించాడు. ఈ రాక్షస స్త్రీల ఇప్పుడే సంహరించాలి అని సంకల్పించాడు; కాని నీతి నిపుణుడు మేధావియైన హనుమ శ్రీరాముని కార్యము సంపూర్ణం ఒనరించవలెనని సహనము వహించాలి.


దుష్టలైన ఆ రాక్షసస్త్రీలు పతీవియోగముచే దుఃఖించుచున్న సీతా దేవిని బాధించుటను త్రిజట అనే రాక్షస స్త్రీ చూసి వారిని వారిస్తూ ఇట్లు పలికింది. “అధమనిశాచర స్త్రీలారా ! నిశ్చయముగా మీకు చెడుకాలము దాపురించినది. లేనిచో విూరు జగన్నాయకుడైన శ్రీ రాముని అర్థాంగిని ఇట్లు బాధించెడివారలు కారు. నా నిద్రావస్థలో ఇంతకుమునుపే ఒక భయంకరస్వప్నమును గాంచాను. ఆ స్వప్నములో దశకంఠుని సహితముగా సకల రాక్షసవంశ వినాశమును, శ్రీ సీతారామ చంద్రుల సమాగమమును చూసాను”. త్రిజట పలికిన పలుకులు ఆలకించి రాక్షసస్త్రీలు భయవిహ్వలలై ఆ స్వప్న వృత్తాంతమును సాంగోపాంగముగా చెప్పవలసినదిగా ఆమె అడగటం ఆరంభించారు. 


Sunday 5 December 2021

శ్రీ హనుమద్భాగవతము (93)



క్రూరతముడైన దశముఖుని విషమయములు, బాణ సదృశములైన పరుష వాక్యములకు జానకీ దేవి కొంచమైనా చలించలేదు, భయపడలేదు. ఆమె తన ముందు ఒక గడ్డిపోచను పడవెసి తల దించుకొని ఇలా పలికింది. “అధముడవైన రాక్షసుడా ! నీ వేమి చేయదలచుకొంటివో దానిని వెంటనే చెయ్యి. నీవంటి పాపాత్మునికి లొంగుట కంటె మరణించుట మేలు. నిన్ను నీవు త్రైలోక్యవిజయుడవని తలంచుచున్నావు. ఓరీ ! నీచ శునకమా ! నాప్రాణనాథుడు లేని సమయమున నన్ను అపహరించి తెచ్చి నీ గృహములో అసహాయురాలనైన నా పై బింకములు పల్కుచున్నావు. శ్రీ రాఘవేంద్రుడు లంకలో అడుగిడునంతవఱకే నీవిట్టి వాచాలత్వమును చూపగలవు. త్వరలోనే నీ బంగారులంక అగ్నిలో కాలి బూడిద కాగలదు. నీవు నీ సకలపరివారముతో శ్రీరామచంద్రుని తీక్ష్ణశరములకు బలైతావు. శ్రీకోసలేంద్రుని శరవర్షముచే విదీర్ణుడవై నేల కొరిగినప్పుడు గాని ఆయన ప్రతాపము నీకు తెలియరాదు. ప్రభువు దూరముగా ఉన్నంతవరకే నీ విట్టి పిచ్చిమాటలను నీ ఇష్టానుసారంగా పలుతావు".


శ్రీరామవియోగం అనుభవించుచున్న సీతా దేవి పలికిన ఈ కఠోరవచనములును ఆలకింపగనే రావణుని నేత్రములు రక్త వర్ణములయ్యాయి. క్రోధోన్మత్తుడై ఆ అసురుడు వరనుండి ఖడ్గమును తీసి జనక నందినిని సంహరించుటకు సిద్ధము కాగా, పట్టమహిషియైన మండోదరి వాని కరమును పాట్టుకొని ఆపుతూ ప్రేమపూర్వకముగా ఇట్లు పలికాడు. “హృదయేశ్వరా! దుఃఖితురాలైన ఈ దీనురాలిని వదలివేయ్యి. ఈమెలో ఏమి కలదు? నిన్ను వరించుటకు దేవగంధర్వనాగాదులలో అధిక లావణ్యవతులైన స్త్రీలు ప్రతిక్షణము నిరీక్షించుచున్నారు”.


ఇట్లా రావణుని పాదములపైబడి మండోదరి ప్రార్థించగా రావణుడు క్రోధముతో ఇట్లా పలికాడు. “జానకీ ! నేటికి నిన్ను విడచుచున్నాను. కాని ఒక నెలదినములలో నీవు నన్ను అంగీకరించకపోతే నా చేతిలో నీ మరణము నిశ్చితమవుతుంది; కావున శీఘ్రముగా ఆలోచించుకొని నీ నిర్ణయమును తెలుపు”.

Saturday 4 December 2021

శ్రీ హనుమద్భాగవతము (92)



మరుక్షణమే తల్లి యొక్క దయనీయమైన దశను గాంచి హనుమంతుడు అత్యంత దుఃఖితుడయ్యాడు. ఆయన తానిప్పుడు ఏమి చేయవలెనో అని ఆలోచింప ఆరంభించాడు. అంతలో కోలాహలమును విని పవననందనుడు అశోకవృక్షము యొక్క కొమ్మలలో సావధానుడై దాక్కున్నాడు. జానకీ దేవి భయముతో ముడుచుకొని కూర్చున్నాడు.


కాటుక కొండవంటి వర్ణము గల దశముఖుడైన రావణుడు అనేక రాక్షససుందరీమణులతో పరివృతుడై వచ్చుటను పవన పుత్రుడు గాంచాడు. వారిలో రావణపట్టమహిషి మండోదరి కూడకలదు. 


సీతా దేవిని సమీపించి రావణుడిట్లా పలుక ఆరంభించాడు. “జనక రాజకుమారీ! నేనంటే నీవేందుకు భయపడుతున్నావు? నేను నిన్ను నా ప్రాణముల కంటె అధికంగా వాంఛించుచున్నాను; వ్యర్థముగా నీవెందుకు ఈ కష్టములను అనుభవించుచున్నావు? నీ ఈ అపారదుఃఖమును చూడలేకున్నాను. ఆ వనవాసియైన రామునిలో ఏమి కలదు ? ఆతనిలో ఎట్టి శక్తి ఉన్నా ఇచ్చటి వచ్చి నిన్ను బంధవిముక్తురాలుగా చేయగలిగెడ్వాడు; కాని నేను ముల్లోకములను జయించినవాడను. దేవతలైనను, అసురులైనను, నాగ కిన్నెర గంధర్వ కింపురుషాదులైనను నా పేరు విన్నంతనే కంపించెదరు. ఇక మానవులెంత? ! త్రికూటస్థితమైన ఈ లంకానగరములో గల దుర్భేద్య దుర్గమందు ఒక పక్షియైనా నా అనుజ్ఞలేక ప్రవేశించుట అసంభవము. ఇక శతయోజన విస్తీర్ణముగల సాగరమును దాటి ఆ వనవాసియైన రాముడీ ప్రదేశమునకు ఎట్లా రాగలడు ? అతడు అసమర్థుడు; మమకారము లేనివాడు; నిరభిమానుడు; మూర్ఖుడు. అట్టివాని కొఱకై ఎందులకు ఎదురు చూచెదవు ? నీవు నాదానివి కమ్ము, గంధర్వులు, నాగులు, యక్షలు, కిన్నెరులు మొదలైన వారందఱు వారివారి స్త్రీలతో కూడా నిన్ను సేవించెదరు. నేను అత్యంతసమర్థుడను. నేను సంకల్పించినచో నిన్ను బలాత్కారముగా నా దానిగా చేసికొనగలను; కాని నేను నిన్ను హృదయపూర్వకముగా ప్రేమించుచున్నాను. ఈ కారణము వలననే నీ కెట్టి క్లేశమును కలిగించుట ఉచితముకాదని ఆలోచించుచున్నాను. నీవు స్వయముగా నాకోరికను మన్నించు. ఇందులోనే నీకు శుభము కల్గును”.


ఎన్ని సార్లు బుజ్జగించినా, బెదరించినా సీతా దేవి పై ప్రలోభము యొక్క ప్రభావము ఏమాత్రము పడకుండుట చూసి దశకంఠుడు మరల ఇట్లు పలుకసాగాడు. “సుందరీ! నాలో రోషానలజ్వాల ప్రజ్వరిల్లక ముందే నీ నిర్ణయమును నాకు అనుకూలంగా చేసుకో, లేనిచో ఈ తీక్ష్ణకరవాలముచే నీ శిరమును ఖండిస్తారు. నీ శరీరమాంసమును ఈ రాక్షసులు భక్షింపగలరు. 


Friday 3 December 2021

శ్రీ హనుమద్భాగవతము (91)



హనుమంతుడు సీతాదేవికడకు చేరుట


బ్రాహ్మీముహూర్తమున అసురులు ఎక్కడివారక్కడ గాఢనిద్రామగ్నులై ఉన్నారు. శ్రీరామపరాయణుడుడైన పవనపుత్రుడు అశోకవనమును జేరుటకెట్టి విఘ్నములు సంభచపలేదు. ఆ సుందరవాటిక, నిర్మలసరోవరము, అద్భుతమైన దేవాలయము మొదలగు వానియొక్క శోభను ఎలా ఆంజనేయుడు తిలకించగలడు? ఆయన సీతాదేవి దర్శనముకొఱకై అధీరుడగుచున్నాడు, నేరుగా అశోకవృక్షమును చేరి దట్టమైన కొమ్మలపై దాగి కూర్చుండి క్రిందకు చూసాడు.


మూర్తీభవించిన కరుణాస్వరూపిణీ, పతివ్రతా, తేజోమూర్తీ అయిన సీతా దేవి తన చరణములవైపు దృష్టిని సారిస్తూ మౌనముగా కూర్చొని ఉంది. అప్పుడప్పుడు ఆమె నేత్రములనుండి అశ్రుధారలు ప్రవహించుచుండెను. శ్రీ జానకిని దర్శించి శ్రీరామభక్తుడైన అంజనీనందనుడు అత్యంత ప్రసన్నుడయ్యాడు. ఆయన ఆనందమునకు హద్దులు లేవు. తన అదృష్టమును పొగడుకొనుచు తనలో తానిట్లనుకొన్నాడు. 


శ్లో|| కృతార్ధోఽహం కృతార్ధోహం దృష్ట్వా జనక నందనీమ్ | 

మయైవ సాధితం కార్యం రామస్య పరమాత్మనః |


(ఆధ్యాత్మిక రామాయణం 5-2-11-12) 


నేడు జనకమహారాజుపుత్రికయైన జానకిని గాంచి కృతార్థుడనైయ్యాను. ఆహా! పరమాత్ముడైన శ్రీరాముని కార్యము సిద్ధించుటకు నేను కారణుడనైతినిగదా !


Thursday 2 December 2021

శ్రీ హనుమద్భాగవతము (90)



తదనంతరము శ్రీపవనపుత్రుడు సావధానుడై పలికాడు. ‘సోదరా ! విభీషణా ! నేను ప్రభువు యొక్క ఆదేశానుసారముగా నా తల్లిని వెదకుటకు వచ్చాను. సమయము పరిమితము. సూర్యోదయానంతరము వెలుగులో జనని చెంతకు పోవాలన్న అత్యంత కష్టమవుతుంది. అక్కడ సముద్రమునకు ఆవలితటముపై కోటాను కోట్ల వానర భల్లూక సేనలు అత్యంతోత్సాహముతో నాకొఱకై నిరీక్షించుచున్నారు. నేను స్వయముగా తల్లి దర్శనార్ధమై ఉత్కంఠత తోనున్నాను. నీవు కృపతో నా తల్లి దర్శనం ఎక్కడ కఅలుగుతుందో వివరించమని కోరుచున్నాను.


విభీషణుడు పలికాడు :


శ్రీరామభక్తాగ్రేసరా ! ఇచటికు ఆనతిదూరములో రాజ ప్రాసాదమునకు సమీపమున రావణునకు అత్యంతప్రియమైన అశోకవనము కలదు. ఆ వనము అనేకములైన సుగంధపుష్ప వృక్షములతోనూ, సుస్వాదుఫలములతో నిండిన వేలకొలది తరువులతోనూ నిండియున్నది. ఆ వనము భ్రమరముల ఝుంకారములతో, పక్షుల కిలకిలారవములతో ప్రతిధ్వనించుచుండును.


ఆ సుందర వాటిక యొక్క మధ్యభాగమున నిర్మలపూర్ణమైన సుందరసరోవరము కలదు. ఆ సరోవరతటముపై అసురకులపూజ్యుడైన శంకరభగవానుని విశాలరమణీయ మందిరము కలదు. ఆ ప్రాంతమును వేలకొలది రాక్షస స్త్రీలు శస్త్రములను ధరించి రక్షించుచుండెదరు. శివాలయమునకు ఆనతి దూరములో విశాల శాభాసమన్వితము, అత్యున్నతమైన అశోకవృక్షము కలదు. జననియైన సీత ఆ వృక్ష ఛాయలో ప్రభువుయొక్క వియోగముచే తపించుచు దుఃఖించుచున్నది. ఆమె సుదీర్ఘ కేశములు జటలుగా మారిపోయాయి. ఆహారమును విసర్జించిన కారణమున ఆమె శరీరము శుష్కించిపోయాయి. ఆమె శరీరముపై మాసిన వలువ తప్ప మరేమీ లేదు.


అత్యంత క్రూరలైన రాక్షసస్త్రీలు అహర్నిశలు ఆ సాధ్వీని భయపెడుతూ బెదిరించుచున్నారు. ఆ తల్లిని చేరుకొను అత్యంతకష్టము. నా భార్య నా జ్యేష్ఠ పుత్రిక అప్పుడప్పుడు తల్లిని దర్శించి ఊరడించి వస్తుంటారు. తల్లియొక్క ఆ కరుణ దశను తలచుకొనినంతనే నేను కంపిస్తాను. ఆమెకు ఒక వేయి మంది క్రూరరాక్షస స్త్రీలు శస్త్రములను ధరించి కాపున్నారు. వాయునందనా ! అత్యంత సావధానుడవై తల్లి చెంతకు వెళ్ళు. జగజ్జననియైన జానకీ దేవియొక్క యిట్టి కరుణాభరితమైన దశను ఆలకింపగానే కరుణాంతరంగుడైన అంజనీనందనునకు దుఃఖము పెల్లుబికింది. హనుమ విభీషణుని ఆలింగనమొనర్చుకొని ఇలా పలికాడు. “విభీషణా ! నీవు చింతింపవలసిన పనిలేదు. సర్వసమర్థుడైన ప్రభువు యొక్క దయవలన నేను జానకిని దరిస్తాను”.


హనుమ మరల సూక్ష్మరూపధారియై అశోక వాటిక దిక్కుగా తీవ్రగతితో పయనించాడు.


Wednesday 1 December 2021

శ్రీ హనుమద్భాగవతము (89)



శ్రీ రాముని స్మరణము చేత, ఆయన దూతయైన హనుమానుని ఎదురెదురుగా చూచుట చేత విభీషణుని స్థితి విచిత్రముగా ఉండింది. ఆయన నేత్రములు ప్రేమాశ్రువులతో నిండిపోయాయి, శరీరము పులకించింది. కంఠము రద్ధమయ్యింది. ఎట్లో తన్ను తాను సంబాళించుకొని అతడిట్లా పలికాడు - ' ఆంజనేయా! నేను రాక్షస రాజైన రావణుని సోదరుడను, నన్ను విభీషణుడంటారు. నేడు నీ దర్శనము చేత నా జన్మ ధన్యమైనది. నేనీ రాక్షసనగరమున దంతముల నడుమ నున్న నాలుకవలె జీవితాన్ని గడుపుతున్నాను. పవనపుత్రా! నేను రాక్షసకులమున జన్మించిన తామస పకృతిగల జీవిని. నా వలన ఎట్టి భజనము జరుగుట లేదు. శరణశరణుడు, భవాబ్ధిపోతయైన ఆ భగవానుని చరణములపై నాకు ప్రేమ కూడా లేదు. దయాళువైన శ్రీరాముడెప్పుడైన దీనుడు, హీనుడు, అసహాయుడు, అనాథుడైన ఈ విభీషణునిపై దయజూపగలడా! సురముని సేవిత చరణ కమలముల యొక్క పవిత్రమైన రజఃకణము నాకు కూడా ఎప్పుడైనా లభిస్తుందా? భగవత్కృప లేనిదే సత్పురుషులు దర్శనము లభించదని నాకు దృఢమైన విశ్వాసమున్నది. ఈనాడు కరుణామయుడైన శ్రీ రాముడు నాపై కృపజూపినాడు. కనుకనే నీవు దయతో అధముడైన నా ఇంటికి దయచేసావు.


భక్తులపై దయ చూపు హనుమానుడు భక్తుడైన విభీషణుని భగవత్రీతిని చూసి పులకితగాత్రుడయ్యాడు. ఆయన విభీషణునితో ఇలా పలుకసాగాడు - 'విభీషణా ! నీవు గొప్ప అదృష్టవంతుడవు. యోగీంద్రులకు, మునీంద్రులకు కూడా లభించని కరుణావతారుడైన శ్రీ రాముని భక్తి నీకు సహజముగానే లభించినది. శ్రీరాముని దృష్టిలో జాతి కుల లింగ భేదము లేదు. ఆయన కేవలము నిర్మలహృదయమును, శుద్ధ ప్రేమ కోరుతాడు. ఈ ప్రేమచే ఆయన భక్తులకు అమ్ముడు బోతాడు. వారి వెంటబడును. నా విషయమును గురించి ఆలోచించు. నేను ఏ శ్రేష్ఠవంశములో జన్మించాను ? అన్ని విధాలు నేను చంచలుడను, నీచుడైన వానరుడను. ఎవడైన ప్రొద్దుననే మా నామాన్ని వింటే అతడి ఆ దినమంతా ఉపవాసముండాలి. అట్టి నీచ కులమున జన్మించిన నా పైగూడ భక్తవత్సలుడైన ఆ భగవానుడు దయ చూపినాడు. ఆయన నన్ను స్వజనునిగా, స్వేకునిగా అనుగ్రహించాడు. నీవు స్వామినే సర్వస్వముగా భావించుచున్నావు. నిశ్చయముగా నీపై ఆయన తన అద్భుతమైన కృపను ప్రసరింపజేస్తాడు. నీవు గొప్ప భాగ్యవంతుడవు. ఈ అసురపురములో నీవంటి భాగవతోత్తమునితో నాకు పరిచయము లభించుట నా అదృష్టము. శ్రీరఘునాథచంద్రుని కృపా విశేషమే నీ దర్శన భాగ్యము”.


శ్రీ రాఘవేంద్రుని దివ్యగుణగానములో ఆ ఇర్వురు భక్తులు మైమరచిపోయారు. వారికి సమయము గాని, శరీరజ్ఞానము గాని తెలియరాలేదు. ఇరువురి శరీరములు పులకించాయి. నేత్రములు ప్రేమాశ్రుపూర్ణములయ్యాయి. వారిద్దరూ ఒకరికొకరు సన్నిహితులై సౌఖ్యవంతులు, సంతుష్టులు, ఆనంద విహ్వలురయ్యారు.

Tuesday 30 November 2021

శ్రీ హనుమద్భాగవతము (88)



వెంటనే హనుమానునిదృష్టి పవిత్రమైన ఒక భవనముపై పడీంది. అచట భగవానుని ఆలయమొకటి శోభిల్లుతున్నది. ఆ భవన కుడ్యములపై నంతట అనేకమైన అవతారముల యొక్క, లీలల యొక్క చిత్రములు, రామనామము అంకితమై ఉన్నాయి. దాని ద్వారముపై రాముని ఆయుధములైన ధనుర్బాణములచిహ్నములు అంకితమై ఉన్నాయి. అచట మణుల వెలుగులలో కుంకుమపువ్వుతో పాటు, ఇతరపుష్పములతో పాటు మడులలో తులసిమొక్కలు స్పష్టముగా కనిపిస్తున్నాయి. దీనిని చూడగానే హనుమంతుడు ఎంతో ఆశ్చర్యము చెందాడు, ధర్మమునకు, వేదపురాణములకు, యజ్ఞయాగములకు, గోవులకు, ద్విజులకు, దేవతలకు, భగవానునకు సహజశత్రువులైన రాక్షసుల పట్టణములలో ఈ ఆలయము౦డుటేమి?


అప్పుడే రావణుని సోదరుడైన విభీషణుడు నిద్ర నుండి లేచి శ్రీరాముని నానుమును స్మరింపసాగాడు. అతని నోటినుండి శ్రీరామనామము వినబడినంతనే నిజంగా ఇతడు భగవద్భక్తుడే అనే నమ్మకము హనుమానునకు కలిగింది. శరణాగత వత్సలుడైన హనుమానుడు వెంటనే బ్రాహ్మణవేషమును ధరించి భగవన్నామమును ఉచ్చరింపసాగాడు. రామనామమును విన్న వెంటనే విభీషణుడు బయటకు వచ్చి బ్రాహ్మణ వేషధారీ, జగత్పావనుడైన పవనపుత్రుని చరణములను ఆదరపూర్వకంగా నమస్కరించి ఇలా - ' బ్రాహ్మణ దేవా! మీరెవరు? మీరు భగవద్భక్తులే అని నా మనస్సు చెప్పుచున్నది. మిమ్ము చూసినంతనే నా మనస్సులో ప్రేమ ఉత్పన్నమవుతున్నది. లేదా మీరు మీ భక్తులకు సుఖమును కలిగించుటకై నన్ను ధన్యునిగా చేయుటకై వచ్చిన నా స్వామియైన శ్రీరాముడవు కావు గదా! దయ యుంచి నాకు మీ విషయమును చెప్పండి.


సంసారభయనాశకుడైన అంజనీనందనుడు పూర్ణమైన మధురవాక్కులను ఇట్లు పలికాడు. ప్రేమ 'నేను మహా పరాక్రమవంతుడైన వాయు దేవుని పుత్రుడను, నా పేరు హనుమానుడు. నేను శ్రీరాముని భార్య, జగజ్జనని అయిన జానకీ దేవీ జాడను తెలుసుకొనుటకై ఆయన ఆదేశాన్ని అనుసరించి ఇచటకు వచ్చాను. నిన్ను చూడగానే నా మనస్సు సంతోషముతో ఉప్పొంగినది. దయయుంచి వివరించండి”.


Monday 29 November 2021

శ్రీ హనుమద్భాగవతము (87)



మతిమంతుడైన హనుమానుడు రావణుని ఆ విశాల భవనమునంతటిని తిరిగి నిదురిస్తున్న వేలకొలది సుందరీమణులను శ్రద్ధగా చూసాడు. వెంటనే అతని మనస్సులో ఒక ఆలోచన వచ్చింది - 'నేను బాల బ్రహ్మచారిని, శ్రీరామునిదూతను, లోకమాతను వెదకుటకు వచ్చాను. కాని ఇచట నేను గాఢ నిద్రాముద్రితలై ఉన్న పరస్త్రీలను చూసాను, నాకిది తగదు. నా దృష్టి ఇంతవఱకెప్పుడూ నా తల్లిని విడచి మరియే స్త్రీ మీదను పడలేదు, కాని నేడు నేను ధర్మమునుండి చ్యుతుడనైతిని. 


ధర్మమూర్తియు, వీరకర్ముడైన హనుమానుడు ధర్మ భయముచే శంకితుడయ్యాడు, కాని మనస్సులోను, ప్రాణములోను ఆయన శరీరములోను, సర్వాంతర్యామియైన శ్రీరాముడే విరాజిల్లుచున్నాడు. అందువలన మరుసటి క్షణములోనే అతని మనస్సునకు సమాధానము తట్టినది. ఆయన ఇట్లా  ఆలోచింపసాగాడు -- ‘రావణుని స్త్రీలు సందేహము లేనివారై నిద్రించుచున్నారు. ఆ అవస్థలో వారిని నేను జాగ్రత్తగా చూసాను. కాని నా మనస్సులో ఎట్టి వికారమును కలుగలేదు. శుభాశుభములకు ప్రేరకము మనస్సు, నా ఈ మనస్సు సంపూర్ణముగా శాంతముగానూ, స్థిరముగానూ ఉన్నది. దానికి రాగముగాని ద్వేషముగాని లేదు. అందువలన నా ఈ స్త్రీ దర్శనమువలన ధర్మమునకు ఎట్టి లోపము కలిగియుండక పోవచ్చు. నేను కావాలని వారిని చూడలేదు. జానకిని అన్వేషించుటకు, గుర్తించుటకు వారిపై దృష్టిను ఉంచాను, స్త్రీ అగుట వలన సీతా దేవిని స్త్రీలలోనే వెదుకవలసివచ్చినది. ఆమెను నేను పరిశుద్ధమైన మనస్సుతోనే అన్వేషించాను, కనుక నేను పూర్తిగా దోషరహితుడనే.”


కామవిజేతయైన హనుమంతుడు జానకీ దేవిని అన్యస్థలములలో కూడా వెతికాడు. ఆయన లంకలో మిగిలిన గృహములను, వనములను, ఉపవనములను, వాటికలను, వాపీకూపములను, మందిరములను, పశుశాలలను, సభాభవనములను, సైనిక స్థావరములను, రహస్యస్థావరములను చూసాడు. ఇట్లాయన సావధానముగా రాత్రియంతా సీతను అన్వేషిస్తూనే ఉన్నాడు. కాని ఆమె జాడ ఎక్కడ తెలియరాలేదు. అతడు విచారగ్రస్తుడగుచున్నాడు. రాత్రి గడచుచున్నాడు. బ్రాహ్మముహూర్తము సమీపించుచున్నది.


Sunday 28 November 2021

శ్రీ హనుమద్భాగవతము (86)



ఇటు అటు చూస్తూ హనుమానుడు స్ఫటికమణినిర్మితమైన దివ్యమైన ఒక వేదికను చూసాడు. దానిపై రత్న నిర్మితమైన రావణుని పర్యకముండింది. దానికి నలువైవులు చాలా మంది స్త్రీలు నిలువబడి చామరములను ధరించి విసరుచున్నారు. ఉజ్జ్వలమైన ఆ పర్యంకముపై లంకాధిపతియైన రావణుడు సుఖముగా నిద్రించుచున్నాడు; అచట బ్రహ్మచారియైన హనుమానుడు రావణుని పత్నులను కూడా చూసాడు. వారాతని చరణములకు అటు నిటు నిద్రించుచున్నారు. సమీపమునందే అతనికి సంతోషమును గలుగ జేసే వీణావాదినులైన సుందరీమణులు గాఢనిద్రలో పడి ఉన్నారు. ఇంకా కొందఱి వక్షఃస్థలముపై వీణులు పడియే ఉన్నాయి. కోమలమైన వారివేళ్ళు వీణాతంత్రులను స్పృశించుచునే ఉన్నాయి. 


వారందఱికంటె వేఱుగా ఎంతో సుందరమైన శయ్యపై పరుండి ఉన్న అనుపమ రూపలావణ్యసంపన్నయైన ఒక యువతిని హనుమానుడు చూసాడు. కోమలములు, సుందరమైన ఆమె అవయవములపై ముత్యములతోనూ మణులతోనూ కూడిన వివిధమైన ఆభూషణాలు విరాజిల్లుచున్నాయి. ఆమె శరీరకాంతి సువర్ణమువలె మెఱయు చుండింది. అనుపమ రూపవతియైన ఆమె రావణుని భార్యయైన మండోదరి. ఆమెను చూసినంతనె హనుమానునకు 'ఈమె సీతా దేవియా' అనే అనుమానము కలిగింది. అతని సంతోషమునకు ఎంతు లేకపోయింది. హర్షిన్మత్తుడై ఆయన తన తోకను నేలపై కొడుతూ ముద్దిడు కొనసాగాడు. వానరుల ప్రకృతిని అనుసరించి ఆయన ఇటు అటు పరుగిడసాగాడు. ఆయన ఒక మారు స్తంభముల ఎక్కుతూ, వెంటనే మఱల క్రిందకు దూకాడు.


సద్గుణములకు నిలయమైన పవనకుమారునకు వెంటనే మఱియొక ఊహ తట్టెను - “పరమపతివ్రతయైన సీతా దేవి ప్రభువైన శ్రీరాముని వియోగమున ఎప్పుడూ అలంకరించుకొని వస్త్రాభరణములను ధరించదు. ఆమె భోజనము చేయదు, సుఖముగా శయనించదు, మద్యపానము స్వప్నమునందైనా చేయదు. శ్రీరామునితో సాటివచ్చు సౌందర్యవంతులు దేవ దానవనాగకిన్నరులలోగాని ఈ భూమిపై గల మానవులలో గాని ఎవ్వరునూ లేరు. ఇక సీత వంటి పతివ్రతా స్త్రీ పరపురుషునికడకు ఎలా వెళుతుంది? అందువలన ఈమె సీతా దేవి ఏ మాత్రమును గాదు”.


Friday 26 November 2021

శ్రీ హనుమద్భాగవతము (85)



మరల ఆయన రావణుని భవనము కడకు వేగముగా వెళ్ళాడు. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు లంఘించి రావణుని భవనములోనికి ప్రవేశించాడు. అచ్చట ఆయన శూలములు, ముద్గరములు, శక్తి, గదలు, పట్టిసములు, కోదండములు, ముసలములు, పరిఘలు, భిందిపాలములు, బల్లెములు, పాశములు, తోమరములు మున్నగు శస్త్రాస్త్రమములను ధరించి ఉన్న అసంఖ్యాకులైన రాక్షసులను, రాక్షసస్త్రీలను చూసాడు. వారందఱు విశాలకాయులు, వీరులు, అపారశక్తి సంపన్నులు. వారి దృష్టిలో పడకుండా పింగళకేశుడైన హనుమానుడు సూక్ష్మరూపముతో రావణుని భవనములోని ప్రతికక్ష్యును జాగ్రత్తగా చూస్తూ వెళ్ళుచున్నాడు. అచట ఆయన బంగారము వంటి కాంతిగలది, అనేకములైన రత్నములచే నిండినది, వివిధములైన వృక్షముల పుష్పములచే ఆచ్ఛాదితమైనది, అనుపమమైనదైన పుష్పకవిమానమును చూసాడు. అది తన దివ్యమైన కాంతిచే ప్రజ్వలితమగుచున్నట్లుంది. అద్భుతము, పరమమనోహరమైన విమానమును చూసి హనుమానుడు ఎంతో విస్మితుడయ్యాడు. కాని నలువైపులు తిరిగి చూసినా పూజనీయురాలైన సీతాదేవి కనబడకపోవుటచే అతడు చింతితుడయ్యాడు.


చింతితుడైన హనుమానుడు సీతాన్వేషణమునకై శస్త్రాస్త్రసంపన్నులైన రాక్షసవీరుల నుండి తప్పించుకొంటూ, రాక్షసరాజైన రావణుడు నివసించు ప్రదేశమునకు చేరాడు. అచట రాక్షసజాతీయపత్నులు, హరించి తెచ్చిన వేలకొలది రాజకన్యలు ఉన్నారు. అచట వరుసగా సువర్ణమయమైన దీపాలు ప్రజ్వరిల్లుచున్నాయి. అచటి నేల స్ఫటిక మణి నిర్మితము, సోపానములు మణిమయములు, వాతాయనములు సువర్ణ నిర్మితములు. 'రావణుని ఆ నివాసము స్వర్గముకంటెను ఎంతో గొప్పగా ఉన్నట్లు తోచుచున్నది.


సగమురాత్రి గడచింది. ఆ భవనమున పవనకుమారుడు రంగురంగుల వస్త్రమములను పుష్పమాలలను ధరించి అనేకమైన వేషభూషలచే విభూషితలైయున్న వేలకొలది సుందరీమణులను చూసాడు. మద్యపానము చేత, ఎక్కువగా మేలుకొని యుండుట చేత వారు ఆయా ప్రదేశములలో ఆ రాత్రి గాఢ నిద్రాపరవశలై ఉన్నారు. వారి వస్త్రములు అస్తవ్యస్తములై ఉన్నాయి. హనుమానుడు సీతా దేవిని ఇంతకుమునుపు ఎన్నడూ చూసి ఉండలేదు, కాని పతివ్రతయైబ జానకి యొక్క పరమ సాత్త్వికము, తేజస్వంతమైన రూపము గుర్తింపదగినట్లుంది. అందువలన హనుమానుడు ఆ సుందరీమణులను శ్రద్ధగా చుస్తున్నాడు.