Tuesday 28 February 2023

శ్రీదత్త పురాణము (64)





దత్తాత్రేయుడు యధావిధిగా కూర్చునివున్నాడు. సరసన వున్న అనఘ రాశిపోసిన సౌందర్యంలా కూర్చుని విలాసంగా చిరునవ్వులతో కవ్విస్తుంది. రాక్షసుల దృష్టి హఠాత్తుగా సౌందర్యరాశిపై పడింది. ముఖ సౌందర్యానికి కొందరు, చిరునవ్వులకు కొందరు, కొంటె చూపులకు కొందరు, యౌవన సంపదకు కొందరూ, చేతుల్లోని కేలీ పద్మ విలాసానికి కొందరు. మృదుతర హస్తాంగుళీ విన్యాసానికి కొందరు, రత్న కంకణకాంతి ఝణత్కారాలకు కొందరు, కిరీటతాటంక రత్న హారకాంచీనూపుర శోభా సంపదలకు కొందరూ అంగరాగ ఘుమ ఘుమలకు కొందరూ, వినూత్న పట్టు వస్త్ర ధగధగలకు కొందరూ, పాదాంగుళీ మార్ధవాతిశయమునకు కొందరూ ఇలా రాక్షస వీరులందరూ ఆమెను చూచి సౌందర్యానికి ముగ్ధులయ్యారు. కామ వికారంతో వివశులవుతున్నారు. నాయకుడికి నమ్మిన బంటులు కనుక తిరుగులేని నిస్వార్ధ మూర్ఖ సేవకులు కనుక, ఆమెకోసం తమలో తాము కలహించుకోకుండా అందరూ కలిసి నిర్ణయించుకొని తమ నాయకుడి కొరకు ఆమెను అపహరించుకు పోవాలి అని అనుకున్నారు. ఆ ఆలోచన వాళ్ళకి రావడమే ఆలస్యం తమకున్న మాయాశక్తితో బంగారు పల్లకీ సృష్టించారు. ఆ సౌందర్యరాశిచుట్టూ తిరుగుతూ వికటాట్టహాసాలు చేస్తూ పిచ్చి గంతులు వేస్తూ మారుమాట్లాడకుండా ఈ పల్లకీలో కూర్చోమంటూ గద్దించారు. ఆమె ఒక్కసారిగా దత్తాత్రేయుడి వైపు చూసింది. ఆయన చిరునవ్వుతో వెళ్ళమని సైగ చేసాడు. అనుజ్ఞ అందుకొన్న ఆ సౌందర్యరాశి భయాన్ని, బెరుకును, నటిస్తూ లేచి ఒయ్యారంగా నడిచి వెళ్ళి పల్లకీలో కూర్చుంది. ఆ చర్య వారి మనసుల్ని మరింత ఆనందింపజేసింది. బంగారు పల్లకీలో వున్న బంగారు రాశిని భుజాల మీద మోసుకొని వెళ్ళడం కన్నా నెత్తి మీద పెట్టుకొని తీసికెళ్తే మరింత శోభగా వుంటుందని ఆమెను తమ నాయకుడు మరింత ఆనందిస్తాడని తలచి రాక్షసులు బంగారు పల్లకీని నెత్తులకు ఎత్తుకున్నారు. ఓహోం ఓహోం అంటూ పరుగులాంటి నడక అందుకున్నారు. వాళ్ళు అల్లంత దూరం వెళ్ళడం చూచి దేవతలంతా దత్తుడి వద్దకు చేరుకున్నారు.


పల్లకీ వెళ్తున్న వైపే చూస్తూ దత్తస్వామి ఇలా అన్నాడు - అయిపోయింది. ఈ రాక్షసుల పని ఈ రోజుతో అయిపోయింది అన్నాడు. దేవతలకి ఏమీ అర్ధంకాలేదు. స్వామివైపు ప్రశ్నార్ధకంగా చూసారు.


దేవతలారా మీ కోరిక నెరవేరింది లక్ష్మి రాక్షసులనెత్తికెక్కింది. అంటే ఇంక వాళ్ళు సర్వనాశనమయ్యారన్నమాట.


ఇంక వాళ్ళ దగ్గర నీ లక్ష్మీ నిలవదు. శరీరంలో ఏడు స్థానాలు దాటించి ఎవరైతే లక్ష్మిని నెత్తిపైకెక్కించుకుంటారో వాడు మరు క్షణంలోనే దరిద్రుడవుతాడు. లక్ష్మి పురుషుడికి పాదస్థానంలో వుంటే పెద్ద పెద్ద భవనాల్లో నివసించేటట్లుగా చేస్తుంది. కటిస్థానంలో వుంటే మణి మాణిక్యాలు, అతివిలువైన వస్త్రములను కలిగిస్తుంది. లక్ష్మి గుహ్యంలో వుంటే భార్యా సౌఖ్యం కలిగిస్తుంది. సందిటలో వుంటే సంతాన సంపద కలిగిస్తుంది. లక్ష్మి హృదయస్థానంలో వుంటే అభీష్టాలు సిద్ధింపజేస్తుంది. కంఠ ప్రదేశంలో వుంటే విలువైన రత్నాల హారాలు ధరింపజేసేటట్లు చేస్తుంది. లక్ష్మి ముఖ స్థానంలో వుంటే భోజన సౌఖ్యం, మాటకారితనం, కవన శక్తి, అమోఘవర్చస్సులు ప్రసాదిస్తుంది. ఈ ఏడు స్థానాలు దాటి లక్ష్మి శిరస్సుకి ఎక్కిందంటే ఇక అతణ్ణి విడిచిపెట్టి వెంటనే వెళ్ళిపోతుంది. వెంటనే మరొకన్ని ఆశ్రయిస్తుంది. ఇది లక్ష్మి యొక్క నియమం. మీరే చూశారు గదా వీళ్ళు లక్ష్మిని నెత్తి మీద ఎక్కించుకొని వెళ్తున్నారు. ఇంక కొద్ది క్షణాల్లోనే వాళ్ళను విడిచి వస్తుంది.


Monday 27 February 2023

శ్రీదత్త పురాణము (63)




వద్దు స్వామి వద్దు నీ పరీక్షలు నేనింక తట్టుకోలేను. నువ్వు జగన్నాధుడవని, శ్రీమన్నారాయణుడవని నాకు తెలుసు. ఈ నారీలలామ సాక్షాత్తూ లక్ష్మీదేవియే నాకు తెలుసు. ఈ విలాసిని బృందము ఈ మద్యపానము ఇదంతా నీ మాయ అని నాకు తెలుసు. భక్తుల్ని ఎంతగా పరీక్షిస్తావో ఎలా బురిడీలు కొట్టిస్తావో నేను ఎరుగుదును. ఎవరు నీవు, ఎందుకు సేవలు చేస్తున్నావంటే నన్ను అనుగ్రహించడానికి అని సంబరపడ్డాను. పరీక్షలు ముగిసాయి అని అనుకొన్నాను. ఇది ఇంకోరకం పరీక్ష అని తెలుసుకోలేకపోయాను. అనఘాత్మా! నువ్వు యోగినాం యోగిని ఋషీనాంఋషిని కవీనాం కవివి. నీకు అసాధ్యమంటూ లేదు. సంకల్పించాలే కాని సమస్తమూ నీ అధీనంలోదే. ఈ దీనుణ్ణి కనికరించి స్వర్గ సింహాసనం మీద పునః ప్రతిష్టితుణ్ణి చెయ్యాలి అనుకోవాలే గాని అది నీకు క్షణాల మీద పని. ఎందరెందరో మహారాక్షసుల్ని చిటికలో తుదముట్టించిన వాడివి. జంభాసురుడు నీకొక లెక్కా. నిజంగా మా సేవలు నీకు నచ్చివుంటే దయచేసి ఈ ఉపకారం చేసిపెట్టు. లేదంటే నీ సేవలో ఇలాగే మరికొంత కాలం గడిపే అదృష్టం కలిగించు. అంతేగాని కల్లబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని తప్పించుకోవాలని అనుకోకు. మా అపరాధ సహస్రాలన్నింటికి ఇదే విరుగుడు అంటూ దేవేంద్రుడు సాష్టాంగపడి నమస్కరించి దీనంగా అడిగాడు.


దత్తాత్రేయుడు పకపకా నవ్వాడు. ఇంద్రుణ్ని లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడు. శచీపతీ ఆందోళన చెందకు. నీ శత్రువుల్ని పారద్రోలి నీ ఇంద్ర లోకాన్ని నీకిప్పిస్తాను. స్వర్గలోకాన్ని రక్షిస్తాను. నిన్ను ఇంద్రలోక సింహాసనంపై కూర్చుండ బెడతాను. ఆ జంభాదిరాక్షసులు నాకు కన్పించేట్లుగా చేయి చాలు. మిగతా సంగతి అంతా నేను చూసుకుంటాను. వెళ్ళిరండి మీకు జయమవుతుంది అని ఆశీర్వదించి పంపించాడు.


ఇంద్రాది దేవతలు సంతోషించి బయలుదేరారు. జగన్నాటక సూత్రధారి ఈ విష్ణుమూర్తి రాక్షస బాధల్ని తప్పించటానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉపాయం పన్నుతూంటాడు. ఏదో ఒక కొత్త నాటకం ఆడుతూ వుంటాడు. ఈ సారి ఏమి చేయ సంకల్పించాడో చూద్దామని అనుకుంటూ స్వర్గలోకం సమీపించారు. నందన వనంలో పొదరిళ్ళలో, చెట్ల నీడల్లో, దివ్యభవనాల్లో దేవ కన్యలను అప్సరసలను బలాత్కరిస్తూ క్రూరంగా హింసిస్తున్న రాక్షసుల్ని చూసారు. అన్ని వైపుల నుండి ఒక్క సారిగా చుట్టుముట్టి హై హై హే హే అంటూ దేవతలు రాక్షసుల మీద విరుచుకుబడ్డారు. రాక్షసులు కూడా సన్నద్ధులై తిరగబడ్డారు. దేవతల్ని తరిమి తరిమి కొడుతున్నారు. వాళ్ళు తరుముతున్నంత సేపూ పారిపోతున్నట్లుగా నటిస్తూ వాళ్ళు ఆగినపుడు మళ్ళీ తిరగబడి ఉసిగొల్పుతూ మళ్ళీ పారిపోతూ మళ్ళీ తిరగబడి ఉసిగొల్పుతూ వాళ్ళు తమ వెంట బడేటట్లుగా చేసుకుని ఎలాగైతేనేమి తెలివిగా రాక్షసుల నందర్నీ దత్తాశ్రమ ప్రాంతానికి లాక్కు వచ్చారు దేవతలు. 


Sunday 26 February 2023

శ్రీదత్త పురాణము (62)

 


నీకు తెలుసుగదా మేమెంతటి యుద్ధ వీరులమో. అందుచేత రణరంగానికైతే రాలేం కానీ మీ వెంట ఉండి శిబిరాలలో క్షతగాత్రులకు సేవలు అందించగలం. ఈ పాటి సహకారం అందించడానికి మేమూ ఎప్పుడూ సిద్ధమే. నిజానికి అది మా అదృష్టంగా భావిస్తాం. దీనికి మీరు అభ్యర్థించాలా? ఆజ్ఞాపించండి. అంతటి సువర్ణావకాశం మాకు కలిగించండి. దేవతలకు సహకరించడంకన్నా తపస్వులకు కోరుకోవలసింది ఏమిటి ఉంటుంది ?


దత్తయోగీంద్రా! ఇది చాలా అన్యాయం. మాటలతో మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. స్వామీ! ఇప్పటికీ అన్ని విధాలా నలిగిపోయాం. కాపాడవలసిన నాథుడే పరాచికాలాడితే మేము ఏమైపోవాలి? మీరు అనుగ్రహిస్తే స్వర్గలోకం మళ్ళీ మాకు దక్కుతుంది. లేదంటే ఇక్కడే ఇలాగే మీ సేవలో ఉండిపోతాం. ఇంతకన్నా గొప్ప ఆనందమేదీ ఆ సింహాసనంలో లేదు. కాకపోతే నా విధులు నేను నిర్వహించాలి కనక, యజ్ఞయాగాదుల్ని సక్రమంగా జరిపించాలి. కనక, ఈ భాధ్యతల్ని అలనాడు మీరంతా నాకు అప్పగించారు కనుక, దుర్మార్గంగా అన్యాక్రాంతమైన స్వర్ణోకాన్ని- అదీ రాక్షసాంతమైన స్వర్గసీమను మళ్ళీ నాకు అప్పగించమని అభ్యర్ధిస్తున్నాను. తమరు దయమాలి నాతో ఆడుకుంటున్నారు. నా అదృష్టం ఇలా ఉంది. ఏం చెయ్యను. నన్ను నమ్ముకుని ఈ దేవతలు కూడా అగచాట్లు పడుతున్నారు.


దేవేంద్రా! నన్నూ నా మాటల్నీ అపార్ధం చేసుకుంటున్నావు. నిన్ను నొప్పించడంగానీ పరాచికాలాడటం కానీ నా ఉద్దేశం కాదు. నేను అంతటి వాణ్నికాను. నేనేమన్నా ఉపేంద్రుణ్ణా ఇంద్రుడితో పరాచికాలాడటానికి, సాధారణ తపస్విని. చూశావుగదా నా దిన చర్య. ఎంతటి భ్రష్టాచారుల్లో గ్రహించే ఉంటావు. మధ్యపానరతుణ్ణి, మదవతి లోలుణ్ని, సంయోగమే తప్ప యోగమంటూ ఎరగని వాణ్ణి. ఇదే తపస్సుగా ఇదే అద్వైత స్థితిగా మురిసిపోతున్న వాణ్ణి. ఈ పాటి ఇంద్రియాలనే జయించలేని నేను ఇంద్రుడికి సహకరించడమా? విడ్డూరం. కష్టాలలో ఉన్నావు గనుక ప్రతి గడ్డిపోచా నీ కంటికి ఇలాగే కనిపిస్తుంది. సహజం. కానీ నా శక్తి ఏమిటో నేను తెలుసుకోవద్దూ! అందుకని మరోసారి చెబుతున్నాను. ఆ రాక్షసులేమిటో ఆ యుద్ధాలేమిటో మీరు చూసుకోండి. మేము అందించగల సేవలేమిటో మాకు ఆజ్ఞాపించండి. ఆనందంగా చేస్తాం..


Saturday 25 February 2023

శ్రీదత్త పురాణము (61)

 


ఆశ్రమంలోకి ఇంతమంది సేవకులు ఒక్కసారిగా ఎప్పుడు వచ్చిపడ్డారో ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో ఆశ్రమ వాసులెవ్వరికీ అంతపట్టడంలేదు. అయినా ఎవరు ఎవరినీ అడిగిందిలేదు. అందరూ అందరితోనూ హాయిగా సేవలు చేయించుకుంటున్నారు. ఆనందిస్తున్నారు. కాలం గడుస్తోంది.


ఒకనాటి ఉదయాన దత్తయోగికి ఇలాంటి సందేహమే కలిగింది. తన అంతరంగిక సేవకుణ్ణి అడిగాడు. ఎవరు మీరందరూ? ఎందుకు మాకు ఈ సేవలు చేస్తున్నారు? మీ రూపురేఖావిలాసాలు చూస్తోంటే దైవాంశ సంభవుల్లా కనిపిస్తున్నారు. మీ వినయవిధేయతలూ సేవాతత్పరతలూ మమ్మల్ని అందర్నీ ఆనందపరవశుల్ని చేస్తున్నాయి. సేవలు చేస్తున్నారు. సంతోషమే. కాని ఏమి కోరి ఈ సేవలు చేస్తున్నారు? సేవలు చెయ్యమని మీకు ఎవ్వరు చెప్పారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు?


దత్తయోగి ఇలా ప్రశ్నల పరంపర కురిపిస్తోంటే దేవేంద్రుడు మరింత చేరువకి వచ్చి సాష్టాంగపడ్డాడు. సన్నిధిలో నిలబడ్డాడు. చేతులు కట్టుకొని ఊర్ద్వకాయాన్ని వినయంగా వినమ్రంగా రవ్వంత ముందుకి వంచి, తుంపురులు యోగేంద్రుడి మీద పడతాయేమో అనే శంకతో తన అరచెయ్యిని నోటికి గూడులా అడ్డం పెట్టి బదులు పలికాడు. దత్తయోగేంద్రా! అన్నీ తెలిసే ఏమీ ఎరగనట్టు మీరిలా ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అయినా మీరు అడిగారు కనుక నేను చెప్పాలి. మనవి చేస్తున్నాను. స్వామీ! నేను దేవేంద్రుణ్ని. ఈ పరిచారకులు అందరూ దేవతలు. జంభాసురుడు స్వర్గలోకం మీద దండెత్తి మమ్మల్ని పారద్రోలాడు. స్వర్గసీమను ఆక్రమించుకున్నాడు. దిక్కుతోచక మేమంతా నీ సన్నిధికి చేరుకున్నాము. మిమ్మల్ని సేవిస్తు మీ అనుగ్రహంకోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాము. ఈనాటికి తమకు దయకలిగింది. ఆ జంభాసురుడ్ని ఓడించి మళ్లీ మా రాజ్యం మాకు ఇప్పించండి. యజ్ఞయాగాది క్రతువులు సజావుగా సాగే అవకాశం కల్పించండి. దానికి మీరొక్కరే సమర్థులు. ఇంక ఎవరివల్లా ఇది సాధ్యంకాదు అనుగ్రహించండి.


ఏమిటీ! నువ్వు దేవేంద్రుడివా! వీరంతా దేవతలా! ఆశ్చర్యంగా ఉందే. అష్టదిక్పాలకులకు అధిపతిని. నీ సేవలు నేను పొందడమా? అపచారం అపచారం. నేనొక సాధారణ తపస్విని. అందునా ఆచార భ్రష్టుణ్ణి. నీ సేవలు నేను పొందడంగానీ నీ దేవతలు సేవలు మా ఆశ్రమవాసులు పొందడం గానీ తగనిపని, తెలియక జరిగిన పొరపాటు. ఈ క్షణం నుంచీ మీరందరూ సేవలు విరమించండి. మీకే మేమంతా సేవలు చేస్తాం. తరిస్తాం. నీ సామ్రాజ్యాన్ని జంభాసురుడు ఆక్రమించుకున్నాడన్నావు. దాన్ని తిరిగి పొందడానికి సహకరించమంటున్నావు. తప్పకుండా మేమంతా సహకరిస్తాం.


Friday 24 February 2023

శ్రీదత్త పురాణము (60)

 


జంభాసురుడు స్వర్గ సింహాసనాన్ని ఆక్రమించి అధిష్టించాడు. తలకొక దిక్కుగా పారిపోయిన దేవతలు ఒకానొక పర్వతారణ్య ప్రాంతంలో గుమికూడారు. అది వాలఖిల్యాది మహర్షులుండే అరణ్యం. దేవ గురువు బృహస్పతి కూడా అక్కడికే చేరుకున్నాడు. అందరూ ఆ మహర్షులతో మంతనాలు జరిపారు. స్వర్గలోకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలంటే విష్ణు మూర్తిని శరణువేడుట ఒక్కటే కర్తవ్యమని నిర్ధారించుకున్నారు. ఆ చతుర్భుజుడు ఇప్పుడు దత్తాత్రేయుడుగా అవతరించి సహ్యాద్రిసీమలో విహరిస్తున్నాడని మహర్షులు చెప్పారు.

అయితే అతడు మదవతీ మద్యలోలుడై నింద్యాచారుడుగా కనిపిస్తాడనీ, ఆ మదవతి సాక్షాత్తుగా లక్ష్మీదేవియే అనీ, అతడిని ప్రసన్నుణ్ణి చేసుకోవడం చాలా కష్టమనీ, అయినా మరి గత్యంతరం లేదు కనుక ప్రయత్నించండని మహర్షులు ఉపదేశించి నిండా ఆశీర్వదించి పంపించారు. బృహస్పతిని ముందు నిలుపుకుని ఇంద్రాదిదేవతలు సహ్యాద్రి చేరుకున్నారు. దత్తాశ్రమం వెదికి పట్టుకున్నారు. ఆశ్రమ మధ్యభాగంలో తీర్చిదిద్దిన చలువ పందిరి. సుగంధ పరిమళాలను వెదజల్లుతున్న పూల తోరణాలు, బంగారు జరీ నగిషీలు పొదిగిన మేల్కట్టు చాందినీలు. మధ్య భాగంలో పద్మకర్ణికాకారంలో మెత్తని వితర్లిక. దాని మీద దత్తాత్రేయుడు ఒక అందాల భామకు వీపుచేర్చి, ఎడమమోచెయ్యిని మరొక భామామణి ఊరు భాగాన అన్ని ఓరవాటుగా కూర్చుని ఉన్నాడు. కుడి చేతిలో బంగారు చేపకం. మరొక నారీలలామ (లక్ష్మీదేవి) ముందుగా తాను చవిచూసి రకరకాల మద్యాలను ఆ చపకంలోకి ఆధారంగా నింపుతోంది. దత్తయోగి అదే పనిగా సేవిస్తున్నారు. చుట్టూ చిన్న చిన్న వేదికల మీద కూర్చుని గంధర్వాప్సరసల్లాంటి యువతలు అనేక వాద్య విశేషాలను మృదువుగా శ్రావ్యంగా మ్రోగిస్తున్నారు. వాటితో శృతిగలిగిన ఏవో గీతాలు పాడుతున్నారు. వాటిని వింటూ ఒక్కొక్కప్పుడు తాళం వేస్తూ మరొకప్పుడు తానూ గొంతు కలుపుతూ దత్తయోగి ఆనందపరవశుడవుతున్నాడు. అవధులు దాటిన మద్యపానం వల్ల వశం తప్పిన శరీరం వొదులొదులుగా వూగుతోంది. ఎరుపెక్కిన కన్నులు, బూరటెల్లిన బుగ్గలు. చెమట చిత్తడితో జిడ్డుదేరిన ముఖం, చేతి నుంచి జారిపోతున్న మధుచపడాన్ని వారీలలామ అందుకుంటోంది. తానే స్వయంగా దత్తస్వామి నోటికి అందిస్తోంది. మెచ్చుకోలుగా ఆమెను పొదువుకునే ప్రయత్నం చేస్తున్నాడు యోగి. వివశుడై ఆమె పైకి ఒరిగిపోతున్నాడు.


ఇంద్రాది దేవతలకు కనిపించిన దృశ్యమిది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. పరస్పరం కన్నులతో సన్నలు చేసుకున్నారు. ఆశ్రమం అంతటా సర్దుకున్నారు. కొందరు పద్మవితర్ణిక చుట్టూ చేరుకున్నారు. దత్త యోగికి ఆశ్రమవాసులకూ అందరూ అందరికీ కను సన్నల్లో మెలుగుతున్నారు. ఇంద్రుడు స్వయంగా దత్తయోగికి అంతరంగిక సేవకుడయ్యాడు. కాళ్ళు పట్టడం దగ్గర్నుంచి అన్ని సేవలూ భక్తి శ్రద్ధలతో వినయవిధేయతలతో చేస్తున్నాడు.


Thursday 23 February 2023

శ్రీదత్త పురాణము (59)

 




మరింత అవాక్కులయ్యారు అమాత్యులందరూ. వారి వెంట నిలిచిన గర్గముని కార్తవీర్యుడి నిశ్చయానికి చాలా సంబరపడ్డాడు. పట్టుదలని గుర్తించాడు. తపస్సు చేస్తాడనీ అమోఘ ఫలాలు పొందుతాడనీ గ్రహించాడు. రాకుమారా! నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. నీ దృడ సంకల్పాన్ని ప్రశంసిస్తున్నాను. తపస్సులు ఫలించడమంటే అదొక సుధీర్ఘ యాత్ర. వేల సంవత్సరాల కృషి, లోక శ్రేయస్సు కోసం నీకొక దగ్గరిదారి చెబుతాను. ఆలకించు. సహ్యాద్రి ఎరుగుదువు కదా! దాని లోయల్లో ఒక చోట ఆశ్రమం నిర్మించుకొని దత్తాత్రేయుడు తపస్సు చేసుకుంటున్నాడు. అతడు అమోఘ యోగశక్తి సంపన్నుడు. యోగ విద్యా ప్రవర్తకుడు. ఈ జగత్తును కాపాడటం కోసం విష్ణుదేవుడి అంశతో అవతరించాడు. నువ్వు వెళ్ళి అతడిని ఆశ్రయించు. నీ సంకల్పం సత్వరం సిద్ధిస్తుంది. స్వర్గలోకాన్ని జంభాసురాదులు ఆక్రమించినప్పుడు దేవేంద్రుడంతటివాడు వచ్చి ఈ దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించాడు. అతడి కరుణవల్ల రాక్షసుల్ని జయించి మళ్ళీ తన స్వర్గపీఠం తాను అందుకోగలిగాడు. ఇటువంటి విజయగాధలు ఎన్నో ఉన్నాయి. నీకు జయం కలుగుతుంది. వెళ్ళిరా.


ఇది ఆదేశమా, ఆశీర్వచనమా అనిపించేట్టు గర్గముని పలికిన ఈ మాటలు కార్యవీర్యుణ్ణి ఆకట్టుకున్నాయి. అతడివైపు సభక్తికంగా చూస్తూ- మునీంద్రా ! నీ ఆదేశం నాకు శిరోధార్యం. అలాగే చేస్తాను. కానీ జంభాసురాదులు ఇంద్ర రాజ్యాన్ని ఎలా అపహరించారు. ఇంద్రుడు దత్తాత్రేయుణ్ణి ఎలా ఉపాసించాడు, తిరిగి తన స్వర్గపీఠాన్ని ఎలా పొందాడు? ఇవన్నీ సవివరంగా తెలుసుకోవాలని ఉంది. దయచేసి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యండి.


కార్తవీర్యుడి అభ్యర్ధనకు గర్గముని మురిసిపోయాడు. రాకుమారా! తప్పకుండా చెబుతాను. ఆలకించు అంటూ ప్రారంభించాడు.


ఇంద్రాది దేవతల దత్తోపాసన


వెనుకటి కాలంలో జంభాసురుడు ఘోరతపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అనేక దివ్యవరాలు పొందాడు. శివుణ్ణి మెప్పించి అనేక దివ్యాయుధాలు పొందాడు. వీటి గర్వంతో సమస్త లోకాలూ జయించాలనీ సకల సంపదలూ పొందాలనీ ఆశ కలిగింది. మహా రాక్షు సైన్యాన్ని లక్షల సంఖ్యలో సమకూర్చుకుని స్వర్గ మధ్య పాతాళలోకాలపైకి దండయాత్రకు బయలుదేరాడు. ముందుగా సరాసరి స్వర్గలోకాన్ని చుట్టుముట్టాడు. దేవాసురులకు భీకర సంగ్రామం కొన్ని సంవత్సరాలపాటు జరిగింది. జంభాసురుడూ, అతడి సైన్యమూ వరమహిమవల్ల నానాటికీ బలపడుతుంటే దేవసైన్యం క్షీణిస్తోంది. చివరికి దేవతలు ఓటమి అంగీకరించి స్వర్గలోకం విడిచిపెట్టి పలాయనం చిత్తగించారు.


Wednesday 22 February 2023

శ్రీదత్త పురాణము (58)

 


ఏది ఏమైనా రాకుమారా! ఇది నీవు తప్పించుకోలేని బాధ్యత. మీ వంశాలకు, మా వంశానికీ అనుబంధం ఈనాటిది కాదు. మీ తాత ముత్తాతల కాలం నుంచీ మా తాతముత్తాతలు మంత్రులుగా ఉన్నవారే. ఏనాడూ ఎవరూ మీ వంశీకుల్ని తప్పుదారి పట్టించిన దాఖలాలు లేవు. మీ తండ్రిగారికి మేమంతా నమ్మినబంటులం, ఆయనపట్ల అపారమైన గౌరవాదరాలు కలవాళ్ళం. లోకంలో వ్యక్తిగతంగా పదిమంది చేతా ధర్మపరుల మనిపించుకుంటున్న వాళ్ళం. మమ్మల్ని నువ్వు విశ్వసించవచ్చు. నీతో 'తప్పులు చేయించీ నిన్ను బలహీనపరిచీ మేము బావుకునేదీ ఏమీ ఉండదు. అలాంటి పనులు చేసేవారు తాత్కాలికంగా ఏవో లబ్ధులు పొందినా, చివరికి హత్యలు అవమానాలకూ గురికావడం చరిత్రలో అందరూ ఎరిగినదే. కూర్చున్న కొమ్మనూ నరుక్కునేంతటి మూర్ఖులమో, అహంకారులమో, అజ్ఞానులమో కాము. మమ్మల్ని విశ్వసించు. ధర్మ భంగం కలగకుండా ప్రజారంజకంగా నీ పరిపాలన సాగేటట్టు సహకరిస్తాం. అదీకాక ఒకరిమీద ఒకరికి తెలియకుండా చారులను నియోగించి నిఘాలు పెట్టి ఎక్కెడికక్కడ కదలికలు గమనించి ఎప్పటి కపుడు సమాచారం రాబట్టుకునే సువ్యవస్థితమైన పరిపాలనా విధానం మన రాజ్యంలో ఎప్పటి నుంచో నెలకొని ఉంది. దాన్ని మరింత చైతన్యపరిచే చాతుర్యం నీకు సమృద్ధిగా ఉంది. అందుచేత ఏ కోణం నుంచి ఆలోచించినా నువ్వు తిరస్కరించడానికి తగినంత కారణం నాకయితే కనిపించడంలేదు. మిమ్మల్ని విశ్వసించలేను అనేస్తే చెప్పలేను గానీ నువ్వు నిస్సందేహంగా అంగీకరించవచ్చునని మాత్రం చెప్పగలను.


అమాత్యులారా! దయచేసి నన్ను అపార్ధం చేసుకోకండి. మీ మీద నమ్మకంలేక నేను కాదనడంలేదు. నా అశక్తతవల్ల కాదంటున్నాను. అవమాన భయంతో కాదంటున్నాను. పాపభీతితో కాదంటున్నాను. ఇక బాధ్యత అంటారా, మీరందరూ లేరూ, సమర్ధులు, అనుభవజ్ఞులు, పరిపాలనకేమి నిశ్చితంగా నిరాటంకంగా సాగుతుంది. నేను వెళ్ళి తపస్సు చేస్తాను. యోగ సిద్ధులు సంపాదిస్తాను. బాహు శాలినై శస్త్రాస్త్రకోవిదుడనై అన్ని సామర్థ్యాలూ సంపాదించుకొని తిరిగివస్తాను. అప్పుడు రాజ్యభారం భుజాలకు ఎత్తుకుంటాను. అందాకా మీకిది తప్పదు. అనువంశికంగా వస్తున్న అమాత్యులు కనుక మీరు ఈ బాధ్యతను కాదనటానికి వీలు లేదు.


Tuesday 21 February 2023

శ్రీదత్త పురాణము (57)

 


గురువులు నేర్పుతున్న అన్ని విద్యలలోనూ ఆరితేరుతున్నాడు. క్రమ క్రమంగా యుక్తవయస్సు వచ్చింది. యువరాజుకు పట్టాభిషేకం చేయిద్దామని కృతవీర్యుడు ఉబలాటపడుతున్నాడు. పైకి అంటే ఎవరు ఏమి అంటారోనని గేలిచేస్తారేమోనని సంశయిస్తున్నాడు. తీరా సింహాసనంమీద కూర్చోబెడితే సరిగా పరిపాలన కొనసాగించలేకపోతే బిడ్డడికి ప్రజల ముందు తలవంపులు తెచ్చి పెట్టిన వాళ్ళమవుతామని దిగులుతో వున్నాడు. దీనికి పరిష్కారం ఎలాగ ? అవి రేయింబవళ్ళు ఆలోచిస్తున్నాడు. దారి దొరకడం లేదు. చిరవకు ఆయుర్దాయమే తీరిందో లేదా ఆ దిగులే ప్రాణాలు హరించిందో గాని కృతవీర్యుడు హఠాత్తుగా దివంగతుడయ్యాడు.


అరాచకం ఏర్పడకూడదని మంత్రి పురోహితులు అందరూ ఒకనాడు కార్తవీర్యార్జునుణ్ణి సమీపించి పట్టాభిషేకమునకు అంగీకరించమన్నారు. అతడు మాత్రం అంగీకరించలేదు. అవిటివాణ్ణి, ప్రజారక్షణ చెయ్యలేను. అది చెయ్యలేనపుడు పెట్టాభిషేకం జరిపించుకో కూడదు. ప్రజలు పన్నులు కట్టేదిరాజు రక్షిస్తాడని దానికి సమర్ధుడు కానివాడు సింహాసనమెక్కి ప్రజాధనాన్ని భోగాలకు ఖర్చుపెడితే వాడు చోరుడు క్రింద లెక్క. రౌరవాది నరకాలకు పోతాడు. పోనీ పరిపాలన రాజ్య సంరక్షణ బాధ్యతలు మీకందరికి అప్పగించి నేను నామ మాత్రపు రాజుగా కిరీటం పెట్టుకొని కూర్చుందామంటే అప్పుడు మీ చేతుల్లో కీలు బొమ్మను అవుతాను. ఇది గుర్తించిన ప్రజలు నన్ను అపహాస్యం చేస్తారు. ఇరుగు పొరుగు రాజులు నవ్వుతారు. అవమానిస్తారు. నేను స్వయంగా నా అంతటనేను చేసుకోలేని పరిపాలన పరుల మీద ఆధారబడిన ఏలుబడి ఎంత అందంగా ఉంటుందో మనందరకు తెలిసిందే. అపరాధుల్ని నిర్ధారించలేము. నిరపరాధుల్ని రక్షించలేము. న్యాయమే జరుగుతుందో అన్యాయమే జరుగుతుందో గుర్తించలేను. ఇంకొకరి ఇష్టాఇష్టాల ప్రకారంగా నిరపరాధుల్ని శిక్షింపజేయవచ్చు. అపరాధుల్ని విడిపించవచ్చు. నా పరిపాలన గ్రుడ్డి దర్భారుగా వుంటుంది. పాపఫలాలు మాత్రం మిగిలి నరకానికిపోతాను. నూరు కళ్ళతో పరిపాలన కొనసాగించిన తెలియక జరిగే అపచారాలు ఉంటాయి. కాబట్టి రాజ్యం నరకం ధ్రువమ్ అన్నారు. అలాంటి నేను మరొకరి చేతుల్లో కీలు బొమ్మనయితే ఈ పుట్టుకలోనే ఇక్కడే నరకం అనుభవించవలసివస్తుంది. ఏ జన్మలో ఎవరికి ఏ అపచారం తెలిసి చేసానో, తెలియక చేసానో ఈ అవిటితనం సంప్రాప్తించింది. ఇప్పుడిక తెలిసితెలిసి పాపం మూటగట్టుకోలేను. అందుచేత ఈ కిరీటాన్ని నేను మోయలేను.


Monday 20 February 2023

శ్రీదత్త పురాణము (56)



దత్తుడు ఉల్లాసంగా అమ్మపాదములకు నమస్కరించి అనుజ్ఞ తీసికొని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. అలా దత్తుడు సహ్యాద్రిని రాజధానిగా చేసుకొని ముల్లోకాలలోని భక్తులను ఉద్ధరిస్తూ, సాధుజనులను రక్షిస్తూ, క్రూర రాక్షసులను సంహరిస్తూ, యోగ రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆయన ప్రవృత్తి లోకోత్తరంగా వుంటుంది. ఆయన లీలలు ఊహాతీతంగా వుంటాయి. ఒకప్పుడు ఆయన శాంతమనోహరమైన యతిరూపాన్ని ధరిస్తే మరొకప్పుడు భీభత్స భయంకర రూపాన్ని పొందుతూ వుంటాడు. ఏ రూపంలో వున్నా పైకి ఎలా కన్పించినా ఆయన మాత్రం యోగ నిష్టుడే! ఆయన యోగానికి చ్యుతిలేదు. దానికి భంగంలేదు. ఆయన నామ స్మరణచాలు, మానవుల పాపాల్ని దహింపజేయడానికి. అశాంతిలో అల్లాడుతున్నవారు హృదయాన్ని నిర్మలం చేసుకోవాలంటే ఆయన కథల కన్నా ప్రశస్తమైన సాధనాలు లేవు. ఆయన కథలు, లీలలు అనంతములు. వాటిని వివరించి చెప్పాలంటే వేయితలల ఆదిశేషుడికైనా సాధ్యంకాదు.


మానవశరీరంతో అవతరించిన దత్తస్వామి ఎంతోమంది మానవులను పరిపరి విధాలుగా ఉద్ధరించాడు అంటూ సుమతి ముగించాడు. అప్పుడు సుమతి తండ్రి సుమతితో నాయనా రాజవంశంలో పుట్టి రజోగుణంతో జీవించే శ్రీకార్తవీర్యార్జునుడు దత్తుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకోవాలని వుంది. ఆ మహావీరుడి కథ చెప్పి, నా సంశయాలు తొలగించు అన్నాడు.


కార్త వీర్యార్జున వృత్తాంతం


తండ్రి తప్పకుండా చెబుతాను విను. హైహయవంశంలో కృతవీర్యుడు అనే రాజు వుండేవాడు. మాహిష్మతీపురమును రాజధానిగా చేసుకొని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ వుండేవాడు. సర్వ సద్గుణ సంపన్నుడతడు. వేద విహితకర్మలు తాను ఆచరిస్తూ ప్రజలచేత ఆచరింపజేసేవాడు. ప్రజలకు ఎంత ప్రేమ పాత్రుడో శత్రువులకు అంత భయంకరుడు. ఇతడికి చాలాకాలం సంతానం లేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది. వ్రతాలు చేసింది. తీర్థయాత్రలు చేసింది. కనిపించిన దేవతకల్లా మ్రొక్కింది. ఏ దేవత కరుణించిందో గాని ఏ మహనీయుడి ఆశీస్సులు ఫలించాయోగాని, చివరకు ఆమె కడుపుపండి నవమాసాలు మోసిన పిదప మగబిడ్డడు చొట్ట చేతులతో జన్మించాడు. రాజదంపతులు దిగులు చెందారు. ప్రజలంతా అయ్యోపాపం అనుకున్నారు. అసలు సంతానమే లేకపోతే ఒక బాధ. కానీ ఈ అవిటివాణ్ణి చూస్తూ రోజూ బాధే. వీడు పరిపాలనకు పనికిరాడే. నా తరువాత ఈ రాజ్య భారాన్ని ఎవరు మోస్తారు, అని కృతవీర్యుడు బెంగ పెట్టుకున్నాడు. చూద్దాం రాజవైద్యుల కృషి ఫలితంగా కాని, ఏ మహానీయుడు దయవల్లనో అవిటితనం పోకపోతుందా అని తమని తాము నమ్మపలుకుకుంటూ కాలంగడిపారు ఆ రాజదంపతులు. సకాలంలో జాతకర్మాదిక్రియలన్నీ జరిపించి, భూరిదక్షిణలతో వేదశాస్త్ర విద్వాంసులను సంతృప్తిపరచి అర్జునుడు అని నామకరణం చేసారు. కృతవీర్యుని పుత్రుడు కనుక కార్తవీర్యార్జునుడు అయ్యాడు. చేతులు చచ్చుబడ్డాయి అన్నమాటే గాని అర్జునుడి శరీరం అంతా వజ్ర తుల్యంగా వుంది. తెలివితేటలు అపారం. 

Sunday 19 February 2023

శ్రీదత్త పురాణము (55)

 


దత్తుని వైరాగ్య స్థితి - యోగం


తండ్రీ దత్తుని యోగస్థితిని తెలియజెప్పుతాను విను అంటూ చెప్తున్నాడు సుమతి. ముని కుమారులను పరీక్షించిన దత్తుడు ఆశ్రమం చేరుకున్నాడు. ఇన్నేళ్ళుగా ఎటుపోయాడో ఏమయ్యాడో అనుకున్న అనసూయమ్మ తన ముద్దు బిడ్డను చూచి ఆనందంతో పొంగిపోయింది.


దత్తస్వామి తల్లి పాదాలకు నమస్కరించి అమ్మా భక్త జనులను ఉద్దరించడానికి నేను సహ్యాద్రి పర్వతానికి వెళ్తాను అనుమతి ఇవ్వు అన్నాడు.


ఎన్నాళ్ళకో ఇంటికొచ్చిన కొడుకుని చూస్తున్న ఆనందం నీరుకారిపోయింది. చిరకాలంగా అనంత తపోసంపన్నురాలయినప్పటికి పుత్రవ్యామోహం ఆమెను దుఃఖసాగరంలో ముంచెత్తింది. వెళ్ళడానికి వీలులేదని దత్తస్వామిని నిర్బంధించింది.


దత్తస్వామి సంకల్పం చాలా కఠినం. తాను కూడా వెళ్ళక తప్పదన్నాడు. అనసూయ మాతకు దుఃఖం పట్టరానిదయింది. దుఃఖంచేత మోహంచేత ఆమె తెలివి మేఘం కప్పిన ఆకాశంవలె నిండిపోయింది. దత్తయోగీంద్రుడు కూడా మొండిపట్టువదలలేదు.


చివరకు దుఃఖము కోపము ఆగక ఆ తల్లి ఇలా అంది. దత్తా నువ్వు యోగివే అవ్వవచ్చు గురువుని అవ్వవచ్చు అయినా నాకు బిడ్డవని మర్చిపోకు. నీకీ చర్మ దేహం ఇచ్చింది నేను, మర్చిపోరు. కనుక నువ్వు వెళ్ళదలచుకుంటే నేనిచ్చిన ఈ చర్మం నాకిచ్చి వెళ్లు అన్నది.


అది విని దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ వున్నాడు. ఆ నవ్వు చూసి అనసూయమాత బిత్తరపోయింది. ఆమె ఆ తేరుకునే లోపునే దత్తుడు తన గోళ్ళతో చర్మాన్ని పరపరా చీల్చి అంగీ విప్పినట్లుగా విప్పి తల్లి చేతుల్లో పెట్టాడు. దత్తస్వామి అలా చర్మాన్ని వలుస్తూ వుంటే ఆ తల్లి మనసులోని అజ్ఞాన పొరలు వీడిపోతున్నట్లుగా అనిపించింది. చర్మావరణం లేకుండా రక్తమాంసమయమై దివ్యకాంతులు వెదజల్లుతున్న దత్తస్వామి వికృతరూపం చూసేసరికి ఆమె దృష్టి అంతర్ముఖమైంది. ఆ దృష్టికి అనిర్వచనీయమైన దివ్యజ్యోతి ఒకటి సాక్షాత్కరించింది. ఆ దివ్యజ్యోతి దర్శనంతో ఆమెకు అనన్యమైన, ఆనందమైన శాంతి, కాంతి లభించింది. దుఃఖ స్పర్శలేని ఆనందాన్ని దర్శించిన ఆ తల్లి ప్రశాంత వదనంతో మధురంగా బిడ్డవంక చూచి చేతుల్లో వున్న చర్మాన్ని అంగీ తొడుగుతున్నట్లుగా మరల తొడిగింది. అమ్మ గంభీరస్వరంతో ఇలా అంది. గురుదత్తా నీవు జగత్తులను చీకటిలో నుండి వెలుగులోకి నడిపించడానికి అవతరించిన జగద్గురుడవు. నీకు అవధులులేవు. జన్మ వినాశనాలు లేవు. నాకీ సత్యాన్ని దర్శింపజేశావు. ఇంక నీ ఇచ్ఛావరంగా సహ్యాద్రి పర్వతంపై కొలువుండి భక్తుల హృదయాలను ఏలుకో. విశ్వశ్య కళ్యాణమస్తు ! అన్నది.

Saturday 18 February 2023

శ్రీదత్త పురాణము (54)

 


అప్పుడు అమ్మ ఆలోచించి ధర్మాధర్మాల మధ్య చేజిక్కించుకో జూచిన వీరు సామాన్యులు కారని తలచి అయ్యలారా అలాగే వడ్డిస్తాను దయజేయమని వేడుకున్నది.


అనసూయదేవి కుటీరము లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలకు నమస్కరించి స్వామి గృహస్థుల ఇంటికి దేహి అని వచ్చిన వారికి చేతనయినది సమర్పించవలెనని నియమం. అట్లుగాక ఆ నియమాన్ని మీరితే ఆకలితో తిరిగివెళ్ళిపోయినవారు గృహస్థుల పుణ్యాన్ని తీసికొని పోతారు అన్నది శాస్త్ర వాక్యము. కనుక నేను వారు నా బిడ్డలనే భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొని నగ్నంగా భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురూ పసిపిల్లలై కేరింతలు కొడుతూ వున్నారు. అప్పుడు అమ్మకు స్తన్యం వచ్చింది. బట్టలను ధరించి ముగ్గురు పసిబాలురను మూడు ఉయ్యాలలలో పడుకోబెట్టి జరిగిన కథనే జోలగాపాడుతూ వుంది అమ్మ. ప్రపంచాన్ని సృష్టిచేసి అలసినవాడిలా బ్రహ్మ జగత్తు పాలించి సోలిపోయిన వానిలా విష్ణువు హాయిగా ఉయ్యాలల్లో ఆదమరచి నిద్రపోతున్నారు. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగింది తెలుసుకొని వారిని స్థుతించాడు. అతని సోత్రములకు తృప్తి చెందిన త్రిమూర్తులు తమతమ నిజరూపాలతో దర్శనమిచ్చారు. అత్రిమహర్షి అనసూయాదేవితో "దేవీ వీరు నీ పాతివ్రత్యం పరీక్షించడానికి వచ్చారు. నీకు కావలసినవరం కోరుకో" అన్నాడు. అప్పుడు అనసూయాదేవి పాపుల్ని ఉద్దరించడానికి లోకకళ్యాణ నిమిత్తం ధర్మాన్ని సంరక్షించటం కొరకు మీ ముగ్గురు పుత్రులుగా జన్మించాలని కోరిక అంది.


ఇంతలో అక్కడ ముగ్గురమ్మలు ప్రత్యక్షమై సిగ్గుతో తలలు వంచుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు, చూచారా, అమ్మ మహిమ అని తమతమ భార్యలతో అన్నారు. వారు మరింత సిగ్గుతో తలలు దించుకున్నారు. అపుడు త్రిమూర్తులు అమ్మతో " అమ్మా! మమ్ము మేము మీకు సంపూర్ణంగా దత్తత చేసుకుంటున్నాము. అలనాడు సుమతీ కౌశికుల విషయంలో మీకు వరం ఇచ్చాం కదా అని దివ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించారు. అట్టి వరప్రభావం వల్లనే అనసూయ గర్భాన్ని ధరించి త్రిమూర్తులను తన బిడ్డలుగా చేసుకోగలిగింది అని సుమతి తన తండ్రితో త్రిమూర్తుల ఆవిర్భావానికి గల పుణ్యగాధను వినిపించాడు.


Friday 17 February 2023

శ్రీదత్త పురాణము (53)


ఇంకొకసారి పాపరతులైన జనుల స్పర్శవల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడగా ఆ తల్లి తన కమండలంలోని జలాన్ని చల్లి గంగాదేవి కాలుష్యాన్నంతా క్షణంలో భస్మంచేసింది. ఇలాంటి మహాకార్యాలు చాలా చేసారు ఆ పుణ్యదంపతులు. అంతటి పుణ్యదంపతుల, తపోతేజోవంతుల గారాలబిడ్డడే మన దత్తుడు.


అంతే కాదు తండ్రీ! త్రిమూర్తులు వారి గర్భాన్నే జన్మించడానికి ఇంకా కారణాలు వున్నాయి. విను చెప్తాను. ఒకనాడు నారదుడు త్రిలోకాల్లో తిరుగుతూ తిరుగుతూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అనసూయాసాధ్వి గొప్ప దనాన్ని పొగుడుతూ వున్నాడు.


ఏం చిత్రమోగాని ముల్లోకాలు ఏలే ముగ్గురు అమ్మలకు సామాన్య మానవ మాత్రురాలను పొగుడుతూ వుంటే అసూయ బయలు దేరిందట. దాంతో వారు ఆమెను పరాభవించాలనే ఉద్దేశ్యంతో ఇనుప గుండ్లను సృష్టించి అవి వండించమని నారదుని చేతికిచ్చి పంపారట. నారదుడు ఇనుపగుండ్లను తీసికొని ఋక్షాద్రిపై తపస్సు చేస్తున్న అత్రి అనసూయల ఆశ్రమానికి వచ్చి అత్రి అనసూయల మహాత్మ్యాన్ని వేనోళ్ళ పొగిడి తన దగ్గరున్న శనగలు అమ్మచేతికిచ్చి అవి వండి పెట్టమని ప్రార్థించాడట. అవి మాత్రం ఇనుపగుళ్ళలా వున్నాయి. అనసూయామాత చేతి స్పర్శ వాటికి తగలగానే వాటిలో కఠినత్వం పోయిందట. అమ్మ తన సంకల్పబలంతో వాటిని అవలీలగా మ్రగ్గించి నారదుని చేతికిచ్చిందట. క్రమంగా అవి కమ్మని సువాసనలు వెదజల్లాయట. నారదుడు పరమానంద భరితుడై శెలవుతీసికొని వెళ్ళిపోయాడు.


నారదుని ఎదుట తమకు జరిగిన పరాభవం భరింపరానిదై ముగ్గురమ్మలు పట్టుబట్టి ఈమారు స్వయంగా తమ భర్తల్నే పంపించారు. అమ్మ పాతివ్రత్య మహిమను తగ్గించమని కోరారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో అత్రి ముని ఆశ్రమం చేరుకొని భవతీ భిక్షాందేహి అని అడిగారు.


అప్పుడు అనసూయాదేవి వారిని జూచి అయ్యలారా అత్రిముని తపస్సుకై అరణ్యంలోకి వెళ్ళారు. వారు వచ్చేంతవరకూ కూర్చుని మా ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరింది. అప్పుడు వారు అమ్మా మీ వారెప్పుడు వస్తారో తెలియదు. వారు వచ్చే వరకూ మేము ఉండలేము. ఆకలి మమ్మల్ని బాధిస్తున్నది. భోజనం పెట్టు అన్నారు. అనసూయాదేవి కుటీరంలోకి వెళ్ళి భోజనాలు త్వరత్వరగా సిద్ధంచేసి వారు కూర్చుని తినడానికి వీలుగా ఆసనాలు సిద్ధంచేసి వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చి భోజనానికి దయజేయమని వేడుకున్నది. అప్పుడు వారు అమ్మా మాకు ఆతిధ్యమిస్తానని మాట ఇచ్చావు కాని మాదొక నియమం ఉన్నది. నీవు కట్టుకున్న బట్టలను విడిచి నగ్నంగా మాకు వడ్డిస్తేనే మేము భోంచేస్తాము అన్నారు.


Thursday 16 February 2023

శ్రీదత్త పురాణము (52)

 

తన కుమారుడు యింతగా చెప్తుంటే తండ్రికి నమ్మిక నెమ్మది నెమ్మదిగా కుదురుతోంది. నాయనా! సుమతీ! అంతో ఇంతో అనుభవం ఉండి సాత్విక మార్గంలో తపస్సు చేసుకొనే మునికుమారులే దత్తుడి లీలలు అర్ధం చేసుకోలేక దూరమయ్యారంటే యిక నేనెంత. నా తెలివెంత? దత్తుని లీలలు అత్యద్భుతంగా ఉన్నాయి. యింకా యింకా వినాలనిపిస్తున్నది. సుమతీ! త్రిమూర్తిస్వరూపుడైన దత్తుని కనిన అనసూయాత్రిదంపతులు ఎంత పుణ్యాత్ములో వారి తపోమహిను ఎంతగొప్పదో కదా అని అడిగాడు.


అప్పుడు సుమతి ఇలా చెప్తున్నాడు. తండ్రీ! అత్రి మహర్షి ఋగ్వేదంలోని శాకల శాఖా పంచమ మండలాన్ని తన తపో మహిమతో దర్శించగలిగాడు. ఆ వేద భాగంలో అగ్నిలింగస్తుతి, అమరేంద్ర ప్రస్తావన మొదలైన అంశాలు ఉండటంవల్ల అది ఐహికాముష్మికాలు రెండింటిని నిరుపద్రవంగా సాధించగల సామర్ధ్యం కలది.


ఒకసారి కృత యుగంలో రోగాలు పెచ్చుపెరిగి ప్రాణిలోకానికి హాని అవుతుంటే అత్రి మహానుభావుడే ఆయుర్వేదమనే ఉపదేశాన్ని సందర్శించి ప్రాణికోటికి అందించాడు. మరొక్కప్పుడు మనువు చేత భోదింపబడిన ధర్మశాస్త్రం దురవగాహంగా వుందని ప్రజలంతా చింతిస్తూ వుంటే, తేట తేట మాటలతో తానే స్వయంగా ఒక ధర్మశాస్త్ర స్మృతిని ప్రవేశపెట్టాడు.


మరొకప్పుడు దేవదానవ యుద్ధంలో సూర్యచంద్రులు శత్రువులకు బందీలైన కారణంగా లోకం అంధకారమయం కాగా దేవతల ప్రార్ధనల వల్ల ఆ మహానుభావుడే తానే సూర్యుడు చంద్రుడు అయ్యి లోకాలకు వెలుగు అందించాడు.


అలా అత్రి మహర్షి లోక కళ్యాణ నిమిత్తమై చేసిన అద్భుత కృత్యాలు ఎన్నెన్నో. ఎన్నింటినని మనం చెప్పుకోగలం. ఇక అనసూయా సాధ్వి గురించి చెప్పాలంటే అద్వితీయ పాతివ్రత్య రూప మహాద్భుత తపః పరమావధియైన అమ్మ చేసిన మహత్తర కృత్యాలకు సాటిలేదు.


ఒకప్పుడు ఎండలు విపరీతమయి గంగానది ఎండిపోతే అనసూయమ్మ మునిజనుల సౌకర్యార్ధమై నదిని మరల పునరుజ్జీవింప చేసింది. మరొకప్పుడు మహాక్షామం సంభవించి నేలలో మొలకన్నది కూడా లేకుండా మాడిపోతూ వుంటె అనసూయా సాధ్వి అనేక వందల, వేల మంది మునిజనులకు తానే స్వయంగా వండి వడ్డించింది. వారందరికి కందమూల ఫలాలు ఇచ్చి పోషించింది.


Wednesday 15 February 2023

శ్రీదత్త పురాణము (51)

 


మరొక రోజు సాయంకాలం సరోవరంలో స్నానానికి దిగాడు, శిష్యగణం, మిత్రగణం కూడా వెంట ఉన్నారు. ఉన్నట్టుండి దత్తుడు మాయమయ్యాడు. శిష్యులు హాహాకారాలు చేసారు. ఇంతలో ఎవరో శిష్యులలో ఒకడు ఇది మనకు మరో పరీక్ష. కంగారుపడకండి అన్నాడు. అనుకున్నట్టే దత్తస్వామి సరోవర మధ్యభాగంలో ప్రత్యక్షమయ్యాడు. దివ్యాంబరాలు ధరించి, దివ్యమయిన భూషణములతో దత్తుడు ధగధగ లాడుతున్నాడు. చేతిలో మధుపాత్ర ఆరారగా మద్యం సేవిస్తున్నారు. ఎరుపెక్కిన కన్నులు తడబడుతున్న పలుకులు, ఒక అందాలరాశి బంగారు పాత్రతో మద్యం తెచ్చి పాత్రలోనింపింది. దత్తస్వామి ఆమె కొంగు పట్టుకొని లాగాడు. ఆమె వయ్యారంగా నాట్యభంగిమలో వచ్చి స్వామి వారి ఒడిలో వాలింది. ముద్దులు, మురిపాలు ఆలింగనాలు ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. మధ్యమధ్యలో యిద్దరు ఒకే పాత్రలోని మద్యము సేవిస్తున్నారు. ఒకరు మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటున్నారు. కూనిరాగాలు తీస్తున్నారు. గిలిగింతలు పెట్టుకుంటున్నారు. విరగబడి నవ్వుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు వాలిపోతున్నారు. బుగ్గలు కొరుక్కుంటున్నారు. నెట్టుకుంటున్నారు. అంతలోకే మళ్ళీ దగ్గరకు లాక్కొంటున్నారు.

గట్టుపై నిలబడి వింతగా చూస్తున్న శిష్యులు, మిత్రులు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏమిటీ దారుణమని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇతన్ని మనం గురువుగా నమ్మింది. ఇతడా మనకు మోక్షం ప్రసాదించేది? యోగ సాధనంటే యిదేనా? మద్యపానము, మదవతీగా నమూనా? అయ్యోయ్యో ఎంత పొరపాటు చేసాం, ఎన్ని వందల సంవత్సరాలు వ్యర్ధం చేసుకున్నాం. అందరి మనుస్సులో యిదే ఆలోచన బయలుదేరింది. పదండి పదండి అనుకున్నారు. అందరు సరస్సువైపు తిరిగి చీత్కారాలు చేస్తూ కొందరు, మెటికలు విరుస్తూ కొందరు, ముక్కున వేలుంచుకుంటూ కొందరు, మొత్తం మీద అందరూ ఈ ఆశ్రమం పరిసర ప్రాతాలలోనే మనం ఉండకూడదు, దూరంగా పోదాం పదండి అనుకుంటూ వెళ్ళిపోయారు. దత్తాత్రేయుడు హమ్మయ్య అనుకున్నారు. మాయామదవతిని, మధుపాత్రను ఉపసంహరించాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి గట్టుకు చేరుకున్నాడు. ఆశ్రమంలోకి ప్రవేశించి యోగనిష్ఠలో కూర్చున్నాడు.

తండ్రీ! విన్నావు కదా, నీ మనస్సులో చాలా సందేహాలు తలెత్తాయని నాకు తెలుసు, మహాయోగికి సాధ్యాసాధ్యములు లేవు. అతడు సాధారణ నియమాలన్నిటికీ అతీతుడు. తన యోగసిద్ధికోసం అన్నింటినీ వదులుకుంటాడు, ఏదైనా చేస్తాడు. సృష్టి అంతా అతనికి ఒక ఆటబొమ్మ. ఒక్కొక్క బొమ్మతో కాసేపు ఆడుకుంటాడు. మరుక్షణంలో దానినే నిర్దాక్షిణ్యంగా కాలదన్నుతాడు. ఆయన దేనికీ లోనుకాడు. తండ్రీ! దేనిని ఆశించినా వాయువుకి అంటులేనట్లే, మహాయోగులకు కూడా ఏ దోషాలు అంటవు. వారేది చేసినా అది ఒక క్రీడ మాత్రమే. ఈ రహస్యం తెలియాలంటే యోగసాధనలో ఒకమెట్టైనా ఎక్కాలి. లేకపోతే ఆ శిష్య బృందాలవలె, అపార్థాలతో అసహ్యంతో పారిపోవలసివస్తుంది. తెలుసుకోగలిగిన వారు గురుకటాక్షానికి పాత్రులై ముక్తిపొందుతారు. అలా పొందిన వారు చాలా మంది ఉన్నారు. అందులో కార్త వీర్యార్జునుడు ఒకడు. తండ్రీ, దత్తయోగీంద్రుడని తలచుకుంటే చాలు సకల పాపాలు పటాపంచలవుతాయి. ముక్తి కాంత స్వయంగా మన ఎదురు నిలుస్తుంది.

Tuesday 14 February 2023

శ్రీదత్త పురాణము (50)

 

నాయనా దీపకా వింటున్నావా అని వేద ధర్ముడు హెచ్చరించాడు. దీపకుడు ఆనందంతో తలవూపాడు. సుమతి తన తండ్రికి చెప్పిన కధ యిది. అనసూయ అత్రి మహర్షులు పుత్రవాంఛతో మదనాగ్నిని ప్రజ్వలింప చేసుకున్నారు. హోమగుండంలో పడబోతున్న హవిస్సును వాయుదేవుడు చెదరగొట్టాడు. ఒక అంశం వచ్చి మహర్షి కుడి కంటిలో పడింది. తక్కిన రెండు భాగాలు క్షణకాలం వ్యవధిలో అనసూయాదేవి గర్భకోశాన ప్రవేశించాయి. అత్రిముని కంటిలోపడిన భాగాన్ని ఆశ్రయించి బ్రహ్మచంద్రుడుగా ఉదయించాడు. అనసూయాసాధ్వి గర్భంలోకి ప్రవేశించిన ద్వితీయాంశను ఆశ్రయించి పురుషోత్తముడు దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. తృతీయాంశం రూపాన్ని ధరిస్తూ ఉండగా హైహయుడు అనే రాజు అడ్డగించాడు. ఇది గ్రహించిన రుద్రుడూ ఆ భాగాన్ని ఆశ్రయించి ఏడు రోజులు గర్భవాసం చేసి తమోగుణ ప్రధానుడై దూర్వాసుడుగా జన్మించాడు.


బ్రహ్మాంశ సంభవుడయిన చంద్రుడు రజోగుణ ప్రధానుడై లోకాలకు వెన్నెలను ప్రసాదిస్తున్నాడు. ప్రజాపతి పదవిని పొందాడు. కళలకు, ఔషధాలకు పోషకుడయ్యాడు. శివాంశ సంభవుడయిన దూర్వాసుడు రౌద్రగుణ ప్రధానుడై శాపాయుధుడై ఉన్మత్త వ్రత దీక్షతో వెలుగొందుతున్నాడు. కేశవాంశ సంభవుడయిన దత్తుడు యోగవిద్యా పారంగతుడై సత్వగుణ ప్రధానుడై తపోదీక్షతో తరచూ ఏకాంత వాసాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. ముని పుత్రులు చాలామంది ఆయనకు శిష్యులు అనుచరులు అయ్యారు. అందువల్ల ఆయన ఏకాంతానికి నిష్ఠకు భంగం కల్గుతోంది. వారిని పరీక్షించాలని కూడా దత్తుడు భావించి వెళ్ళి వెళ్ళి ఒక సరస్సులో మునిగిపోయాడు. ఎంతకాలానికి సరస్సు నుంచి బయటకు రాలేదు. అయినా శిష్యవర్గం విడిచిపెట్టలేదు. గట్టున నిలబడి నిరీక్షిస్తున్నారు. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండగానే నూరు సంవత్సరాలు గడిచి పోయాయి. అప్పుడు లేచివచ్చాడు. అఖండ తేజోమూర్తి సూర్యకాంతిలాంటి తేజస్సుతో, చంద్రబింబంలా సరస్సునుండి బయటకు వచ్చాడు. శిష్యులంతా కరతాళధ్వనులతో జయజయ నాదాలతో జయగురుదత్తా! శ్రీ గురుదత్తా అంటూ ఆనంద తాండవం చేసారు. కొందరైతే బుంగమూతులు పెట్టి గోముగా నిష్ఠురాలు పలికారు. అందరినీ సముదాయించి దత్తాత్రేయుడు చిరునవ్వులు పంచి పెడుతూ ఆశ్రమం వైపు నడక సాగించారు. శిష్యులంతా కోలాహలంగా ఆయన్ను అనుసరించారు.


దత్తగురు, ఇంకెప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు. మమ్మల్ని ఏకాకుల్ని చేయకు. నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేము. నీ విరహాన్ని మేము భరించలేము అన్నారు. శిష్యులు మిత్రులు ఇలా అడుగుతూ ఉంటే దత్తుడు చిరునవ్వులు చిందిస్తూ వారితో కొంతకాలం గడిపేడు. వారితో బంధం యోగసాధనకు ఆటంకమవుతోంది. అదీగాక వీళ్ళందరూ నిజంగా తన పట్ల గురుభావంతోనే ఉన్నారా? ఉంటే దాని లోతు ఎంత? వీరు ఎరిగిన విలువలకు భిన్నంగా నేను ప్రవర్తిస్తే ఎంతమంది సహిస్తారు. ఎంతమంది అసహ్యిస్తారు, పరీక్షిద్దామను కున్నాడు.


Monday 13 February 2023

శ్రీదత్త పురాణము (49)

 

అర్ఘ్యపాదాలతో పూజించారు. అతిధి మర్యాదలు జరిపారు. అనసూయాసాధ్వి వారిద్దరిని సకల సంపదలతో పుత్రాపౌత్రాభివృద్ధిగా వుండమని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యింది. ఇంక వెళ్ళొస్తాను సంధ్యకు వేళవుతున్నది. అక్కడ అత్రి మహర్షి ఎదురు చూస్తుంటారు అని చెప్పి బయలుదేరింది. ఇంతలో అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమైనారు. మాతా! మహాసాధ్వి! ముల్లోకాలను రక్షించావు నీ తపశ్శక్తి ధారపోశావు దీనికి ప్రత్యుపకారంగా నీకు వరం ఇవ్వాలని వచ్చాము కోరుకో అన్నారు.


అప్పుడు అనసూయాదేవి ఇలా అంది. త్రిమూర్తులారా! మీరు దర్శనం అనుగ్రహించారు. ఇంతకన్నా ఏమి కావాలి అయినా వరం కోరుకోమన్నప్పుడు కోరాలి కనుక అడుగుతున్నాను. అత్రి మహర్షి అంతరంగం ఎరిగి అడుగుతున్నాను. మీరెలాగూ నన్ను తల్లీ అని పిలిచారు కనుక ఆ పిలుపు సత్యమయ్యేట్లుగా వరం అనుగ్రహించండి. మీరు ముగ్గురూ నాకు బిడ్డలు అవ్వండి అని వరం కోరుకుంది.


త్రిమూర్తులు తధాస్తు! అని అంతర్ధానం చెందారు. అనసూయాదేవి ముఖంలో కొత్త ఆనందం పరవళ్ళు త్రొక్కింది. అమ్మాయీ, సుమతీ, మీ వల్ల నాకు మేలు జరిగింది. సాక్షాత్తూ త్రిమూర్తులే నాకు పుత్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను అత్రి మహర్షికి తెలియజెయ్యాలి. ఇంక వస్తాను సెలవు అంటూ వెళ్ళిపోయింది.


అనసూయాదేవి రాక కొరకు చిగురించిన గున్నమామిడి చెట్టు క్రింద అరుగు మీద కూర్చొని ఎదురుచూస్తూవున్నాడు అత్రి ముని సంధ్య ఉపాశించి కూర్చున్నాడు. ఉదయకిరాణాలు సోకినప్పుడే అనుకున్నాడు.


అనసూయమ్మ విజయం సాధించిందని, కౌశికుని మాట ఏమిటా అని ఆలోచిస్తూవున్నాడు. అదే సమయానికి అనసూయాదేవి ఆకాశమార్గమున తిరిగివచ్చి అత్రి మునికి నమస్కరించింది. పాదాభివందనం చేసింది. మహర్షి ఆమెను లేవనెత్తాడు. నీ ముఖంలో వెలుగు చూస్తుంటే తెలుస్తోంది. సుమతి మాంగల్యం నిలబెట్టావని. ముల్లోకాలకు కలిగిన ముప్పును తప్పించావు. బహుశా అందరూ నిన్ను పతివ్రతా శిరోమణివని పొగడి వుంటారు. అందుకే ఈ ఆనందం అంతా. అవునా? అంటూ ప్రేమగా పలకరించి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అత్రి మహర్షి. ఇదొక్కటే కాదు నా ఆనందమునకు కారణం ఇంకోటి వుంది అన్నది అమ్మ. అలాగా ఏమిటో చెప్తే మేమూ విని ఆనందిస్తాం అన్నాడు అత్రి మహాముని. అనసూయామాత త్రిమూర్తులు యిచ్చిన వరం సంగతి చెప్పింది.


Sunday 12 February 2023

శ్రీదత్త పురాణము (48)

 


నీ భర్తకు రోగానుభవకాలం అయిపోయింది. పూర్వ జన్మల పాపనిధులు కరిగిపోయాయి. ఇపుడు రోగ విముక్తుడు కావాలి. అందుకొరకు విధి పన్నిన వ్యూహం ఇది. ఇందులో ఆ సానిపిల్ల, ఈ మాండవ్యుడు పరికరాలు మాత్రమే. తల్లిగా నా మాట విశ్వసించు. నీ పాతివ్రత్యం లోకానికి వెల్లడి అయ్యింది. నీకు పతి సేవా పరాయణత్వం లభించింది. ఇన్నాళ్ళూ రోగిష్టి భర్తతో నానా అవస్థలు పడ్డావు. ఇక నుండి నీ జీవితంలో అంతా పండు వెన్నెలే. లే! లేచి సూర్య రధానికి అనుమతి ప్రసాదించు. నా తపస్సు ధారపోసి అయినా నీ మాంగల్యాన్ని నిలబెడతాము. ధ్యాన నిష్టలో వున్న నీ భర్త నిద్ర నుండి మేల్కొన్నట్లుగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో దివ్య తేజస్సుతో సుందర రూపంతో లేచి కూర్చుంటాడు అన్నది అనసూయాసాధ్వి.


సుమతి సరేనని ఊపిరి బిగించి కళ్ళు మూసుకొని సూర్యుణ్ణి ధ్యానించింది. సూర్యగమనంపై విధించిన ఆంక్ష సడలించింది. సూర్య రధం కదిలింది. తూర్పు దిక్కున వెలుగు రేఖలు మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి. సృష్టి అంతా క్రమక్రమంగా చైతన్యం పుంజకుంది. ధ్యాన సమాధిలో కూర్చున్న కౌశికుడు మంచం మీదికి ఒరిగిపోయాడు. అనసూయాదేవి లేచి నిల్చుంది. దేవతల వైపుకి చూసింది. దేవతలంతా మాండవ్యముని వైపు చూసారు. ఆయన తలపంకించాడు. యమధర్మరాజు రెండడుగులు ముందుకు వేసి తన అభయ హస్తం చూపించాడు. అనసూయాదేవి కౌశికుడి శరీరాన్ని రెండు చేతులతో ఆపాదమస్తకమూ స్పృశించింది. అప్పుడు అనసూయమ్మ గంభీరవదనంతో ఇలా అంది. రూప, శిల, వాక్కు, ఆలంకారములతో నేను పరపురుషుడ్ని భర్తృసమానుడుగా చూడని దానినే అయితే ఈ బ్రాహ్మణుడు ఆరోగ్యవంతుడై పునర్జీవించుగాక! త్రికరణ శుద్ధిగా నిత్యమూ భర్తను ఆరాధించిన దానినే అయితే ఈ ద్విజుడు సంపూర్ణ ఆయురారోగ్యములతో పునర్జీవించుగాక!


కౌశికుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అనసూయమ్మ కనిపించింది. అమ్మా అంటూ ముకుళిత హస్తములతో లేచి నిల్చున్నాడు. కళ్ళు మూసుకొని కూర్చునివున్న సుమతికి భర్తగొంతు వినిపించింది. రోగగ్రస్తుడు కాని రోజుల్లో భర్త కంఠలో వినిపించిన ధ్వని. కళ్ళు తెరిచింది. నవ యౌవనంతో సుందర రూపంతో కౌశికుడు కనువిందు చేసాడు. సుమతీ అన్నాడు. తనను తాను ఆపాదమస్తకమూ పరిశీలించుకున్నాడు. పతిసేవలో అలసిసాలసి పోయిన ఆమె శరీరం కూడా కొత్తకాంతితో నిండు యౌవనంతో వెలిగిపోతూవుంది. ఆమె శరీరం మీద ఆభరణములు అన్నీ తళుక్కు తళుక్కుమని మెరుస్తూ ప్రత్యక్షమయ్యాయి.


సుమతి ఒక నవ వధువులా మారిపోయింది. అనసూయమ్మ తనవైపే చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా తనవైపే చూస్తూవుంది. సుమతికి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. వీధివాకిలివైపు చూసింది. దేవతలు మాయమైనారు. ఇంటిలోపలికి చూసింది. కొత్త కాంతులతో, రంగవల్లికలతో, పచ్చని తోరణముతో, కళకళలాడుతూవుంది. పాత్ర సామాగ్రి తళతళమని మెరిసిపోతున్నాయి. సుమతీ కౌశికుల ఆనందానికి అవధులు లేవు. తల్లీ, అమ్మా అంటూ అనసూయాదేవికి పాదాభివందనం చేసుకున్నారు సుమతీ కౌశికుల దంపతులు.


Saturday 11 February 2023

శ్రీదత్త పురాణము (47)


 అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మ ఒడిలో వాలి అమ్మా అంటూ బావురుమంది. అనసూయ గంభీరవదనంతో చిరునవ్వుతో తలపంకిస్తూ సుమతి తల నిమురుతూనే వుంది.


పిచ్చితల్లీ ఎందుకింత భయం! మేమంతాలేమా! ఈ సృష్టిలో నీవొక్కతినే ఒంటరి దానవి అని అనుకుంటున్నావా? లే, లేచి ముఖం తుడుచుకో, ఇదిగో చూడు ఎవరెవరు వచ్చారో అంది.


అమ్మా! బాబయ్యగారు కూడా వచ్చారా? అత్రి ముని వచ్చాడేమో అతిధి మర్యాదలు చెయ్యాలిగదా అనుకొని తలపై కెత్తి చూసింది సుమతి. ఇంటి ముంగిట వైపు చూసింది. బృహస్పతి, దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు, సకల ఋషులు, అఖిల దేవతలు తమ తమ దివ్య తేజోమయ రూపాలతో కనిపించారు. అందరూ వినయంగా చేతులు కట్టుకొని నిలిచి వున్నారు. అందరి చూపుల్లో కాపాడుతల్లీ అన్న ప్రాధేయభావం కన్పిస్తూ ఉంది. ఆశ్చర్యపడుతూ అనసూయమ్మ వంక చూసింది సుమతి.


అమ్మా సుమతీ! అంతా దైవలీల. అతిధి మర్యాదల కొరకు ప్రయత్నించకు. నీ పాతివ్రత్య ప్రభావానికి మెచ్చి అందరూ నీ ఎదుట నిలచారు. నీ అనుగ్రహం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రతిజ్ఞ సడలించు. సూర్య రధాన్ని అనుమతించు. కారు చీకటిలో మునిగిపోయి సృష్టి అంతా వెలుగు కొరకు పరితపిస్తోంది అన్నది అనసూయమాత. అపుడు సుమతి అమ్మా మరి మాండవ్యశాపం అని ఆర్థ్రోక్తిలో ఆగిపోయింది. సుమతీ! ఏమీ ఫరవాలేదు. నేను ఉన్నానుగా మాండవ్యశాపము చెల్లుతుంది. నీ మాంగల్యమూ నిలుస్తుంది. పిచ్చితల్లీ మట్టి బొమ్మలు చేసి ఆడుకునేవాడు ఒక బొమ్మకు వంకరవస్తే ఏం చేస్తాడు. ఆ బొమ్మను ముద్దచేసి మళ్ళీ అచ్చులో ఒత్తుతాడు. అవునా అదే జరుగబోతుంది.


నీ భర్త రోగ విముక్తుడై రూప యౌవనములతో పునరుజ్జీవితుడు కాబోతున్నాడు. అది నేను చేస్తాను అన్నది అనసూయమ్మ.


అమ్మాయి సుమతీ! అన్నీ నీ మంచికే దైవలీలలు చిత్రాతి చిత్రంగా వుంటాయి. ఒక్క విషయం ఆలోచించు. ఒక్క విషయం ఆలోచించు. ఏనాడూలేనిది ఆరోగ్యం క్షీణించిన దశలో నీ పతికి కామవాంఛ కలగడం ఏమిటి? అదీ వేశ్యతో, అదీ నీ సహాయాన్నే అతను అర్ధించడం. పోనీ మీరున్న వీధీలో ఏనాడైనా సాని పాపలు అడుగు పెట్టే సాహసం చేసారా? మరి సానిపాప ఎలా రాగలిగింది? వచ్చివచ్చి ఇలా మీ ఇంటి ముందే నిలబడాలా? నీ పతినే చూడాలా? అది చూసేసరికి ఇలా ఆయన మనస్సు కరిగిపోవాలా? పిచ్చి దానా ఇదంతా శ్రీమన్నారాయణుని వ్యూహం. శృంగార వాంఛలు రూపయాననముల పునరాగమమునకు సంకేతములు. అది సరే కొరతకు వ్రేలాడుతూ కన్పించిన మాండవ్యుడు మళ్ళీ కనిపించాడా? పదిగజాల దూరం మాత్రమే నడిచావు వెనక్కి మళ్ళావు. అంతలోనే దారితప్పి పోవాలా ఆలోచించు. అడుగో మాండవ్యమహర్షి బృహస్పతి చాటున నిలబడి ఉపద్రవానికి తన శాపమే కారణము అనుకొని సిగ్గుపడుతున్నాడు. తానే కర్తని అనుకొంటున్నాడు పాపం. ఎంతటి జ్ఞానులకైనా ఈ భ్రమలు తొలగవు కదా!


Friday 10 February 2023

శ్రీదత్త పురాణము (46)



మానవులకన్నా దేవతలు మరింతగా కలవరపడ్డారు. సూర్యోదయం ఆగిపోతే కాలాన్ని కొలిచేదెలాగా? నిత్య నైమిత్తిక కర్మలు జరిగేదెలా? పాడి పంటలు అంతరించిపోతాయి. యజ్ఞయాగాదులు నిలచిపోతాయి. ప్రజలకే కాదు మనకూ నైవేద్యములు అర్పించే వారు వుండదు. ఇంతకీ ఈ విపరీతానికి కారణం ఏమిటి? అని దేవతలందరూ దేవ గురువైన బృహస్పతిని శరణు శరణు అన్నారు. ఆయన దివ్యదృష్టిసారించి కారణం చెప్పాడు. అయితే సుమతిని ప్రసన్నురాలిగా చేసుకోవడం ఎలాగ? మాండవ్య శాపాన్ని మళ్ళించడం ఎలాగ? ఏమీ పాలుపోలేదు. బ్రహ్మ దగ్గరికి పరుగులు తీసివెళ్ళారు. అప్పుడు బ్రహ్మ ఆలోచించి వారితో ఇది ఒక పతివ్రత చేసిన ప్రతిజ్ఞ. తన భర్త ప్రాణాలు కాపాడుకొనేందుకు సూర్యోదయాన్ని నిషేదించింది. ఆమె పాతివ్రత్యం ముందు మన శక్తి యుక్తులు సరిపోవు. మరొక పతివ్రత ఎవరైనా పూనుకోవాలి. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి మహా పతివ్రతామతల్లి. కరుణామయి. అందరూ వెళ్ళి శరణు వేడండి లోకహితం కోరి ఉపకారం చెయ్యమని అర్ధించండి. సుమతికి వచ్చిన ఆపదను తీర్చి ప్రతిజ్ఞను మళ్ళించగల సమర్థురాలు. ప్రయత్నించండి అన్నాడు బ్రహ్మ. 

దేవతలందరూ హుటాహుటిన అత్రిమహర్షి ఆశ్రమం చేరుకున్నారు. అనసూయాదేవి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేశారు. లోకానికి వచ్చిన ఉపద్రవాన్ని తొలగించమని వేడుకున్నారు. అంతా విని ఆ గంభీరవదనంతో నిశ్శబ్దంగా తలవూపి తమ పర్ణశాలలోనికి వెళ్ళిపోయింది. ఇంద్రాది దేవతలు అవాక్కయ్యారు. ఆశ్రమంలో అల్లంత దూరాన ఒక గున్న మామిడి చెట్టుక్రింద జపం చేసుకుంటున్న అత్రిమహర్షిని చేరుకున్నారు. మీరే కాపాడాలని ప్రాధేయపడ్డారు. సూర్యోదయం కాకపోతే జరిగే ప్రమాదాలన్నీ ఆయకు ఏకరువుపెట్టారు. బ్రహ్మ దేవుని ఆజ్ఞతోనే ఇలా వచ్చామని విన్నవించారు. అనసూయమ్మ అంతా విని లోపలకి వెళ్ళిపోయింది. మాకు భయంగావుంది. రక్షించు మహర్షీ అంటూ దేవతలంతా మూకుమ్మడిగా కాళ్ళమీద పడ్డారు. అత్రి ముని చిన్నగా నవ్వి అనసూయాదేవిని పిలిచాడు. లోకోపకారం కొరకు దేవతలంతా ప్రాధేయపడుతున్నారు. ఒక్కసారి వెళ్ళి సుమతితో మాట్లాడమని అన్నాడు. ఆ అనుమతికోసమే ఎదురు చూస్తున్నట్లుగా సరే అంది. పతి పాదాలకు నమస్కరించి ఆకాశమార్గాన దేవతలంతా వెంటరాగా బయలు దేరింది సుమతి ఇంటికి. సుమతి ఇంటి ముందు నిలిచి ఇంటి ముంగిట పంచలో ధ్యాన నిష్టలో నిమగ్నమైవున్న దంపతులను చూసింది. దేవతలందర్ని దూరంగా వుండమని తానొక్కతె శబ్దం చేయకుండా వెళ్ళి సుమతి ముందు కూర్చుంది.


మంచం మీద కుష్టురోగ పీడితుడైన కౌశికుడు ధ్యాన సమాధినిష్టలో వున్నాడు. పాదముల చెంత పద్మాసనంలో మమతి. సుమతి తల మీద చేయివేసి ప్రేమగా నిమిరింది అనసూయమ్మ. ఉపాశ్యదేవత ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహించి సహస్రార కమలంలో కరుణారస వృష్టి కురిపించిన అనుభూతి కలిగింది సుమతికి. ధ్యాన సమాధి నుండి బయటపడాలంటే ఇంతకు ముందు ఎంతో కష్టపడవలసివచ్చేది. ఇప్పుడేమో సడలింపు తనంత తానుగా కలిగింది. కన్నులు విప్పారాయి. ముంగిట అమోఘతేజస్సు, ఏమిటి పొరపాటున సూర్యోదయం కాలేదు కదా! క్షణకాలం సుమతిలో చైతన్య నిలిచిపోయింది. కాదు ఇది సూర్యకాంతి కాదు అలాగని చంద్ర తాపము కాదు. కన్నులకు కనిపించని కాంతి. ఆధ్యాత్మిక సాధనలో అనుభవం ఉన్న వారికి మాత్రమే తెలిసేది. పాతివ్రత్యం అనుగ్రహించిన వెలుగు, సుమతి పోల్చుకుంది. మరోసారి మృదువుగా తలనిమిరింది అనసూయాదేవి. సుమతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


Thursday 9 February 2023

శ్రీదత్త పురాణము (45)

 


సూర్యబింబం తూర్పు కొండకు అవతలి భాగంలో ఆగిపోయింది. సారధి అనూరుడు కొరడా ఝళిపించాడు. గుర్రాలు కదలలేదు. తోకనిక్కించి చెవులు రిక్కించి దిక్కులు పిక్కటిల్లేలాగా గుర్రాలు సకిలించాయి. సకల శక్తులూ కూడగట్టుకొని ఏడు గుర్రాలు ఒక్కసారిగా ప్రయత్నించాయి. అడుగు కదప లేకపోయాయి. నోటి నుండి నురగలు క్రక్కుకున్నాయి. సూర్యుడు (ధావయధావయ) తోలు తోలు అన్నాడు. సారధి అనూరుడు (లంఘయన్తు లంఘయంతు) లఘించండి లఘించండి అన్నాడు. గుర్రాలు కదలలేదు. రధం మెదలలేదు. బల్లకు అతికించిన ఏటవాలులో సూర్యరధం స్తంభించిపోయింది. ఈ వైపరీత్యం ఏమిటో అనూరుడికి అంతుపట్టలేదు. 

మందేహాది రాక్షసులు సూర్యరధాన్ని చుట్టుముట్టారు. భీకర రూపములతో భయంకరంగా గర్జిస్తూ రధాన్ని పట్టుకోవటానికి సిద్ధంగా వున్నారు. సూర్యభగవానుడు దివ్యదృష్టితో చూచాడు. విషయం అర్ధం అయ్యింది. సారధి అయిన అనూరునితో అనూరా ఇది పతివ్రతామహత్మ్యం. సుమతి కరుణిస్తే తప్ప మన రధం కదలదు. గుర్రాలను విప్పి నీవు కూడా విశ్రాంతి తీసుకో. ఇది మనకు అయాచితంగా దొరికన అవకాశం. విశ్రమించు. మన రధం కదలాలి. భూలోకంలో ఉషోదయమవ్వాలి. నైస్టికులు అర్థ్యాలు వదలాలి. అప్పటి వరకు ఈ నందేహాది రక్కసుల అలజడితప్పదు. చూస్తూ వుందాం. ఏమి జరుగనున్నదో అన్నాడు. అనూరుడు చిరునవ్వులు చిందించాడు.

భూలోకంలో ప్రాణికోటి మేల్కొంది. ఇంకాసేపట్లో చీకట్లు తొలగుతాయని ఎదురు చూస్తూవుంది. సరోవరాలలో స్నానాలు చేసి నిలబడిన నైష్టికుల చేతుల నుండి అర్హ్యజలాలు జారిపోయాయి. ఎంతకూ అరుణోదయం కాకపోవడంతో ఇదేదో ప్రళయం అనుకొని గట్లమీదకు చేరుకున్నారు. చెట్ల మీద పిట్టల కువకువలు వినిపిస్తున్నాయే తప్ప ఏ పిట్టా గూడు వదలి బయటికి రాలేదు. పువ్వులు రేకులు విప్పడం లేదు. పద్మాలలో తుమ్మెదలు గుంజుకుంటున్నాయి. పశువుల అంబా, అంబా అంటూ అరుస్తున్నాయి. లేగ దూడల ఆకలి అరుపులకు అవి మరింత గుంజుకుంటున్నాయి. కోడి కూసి జాము అయినా ఇంకా వెలుగు రేఖలు రాలేదేమా అని రైతులు విస్తుపోతున్నారు. పొలాలకు చేరే వారు దారిలో గుంపులు గుంపులుగా గుమికూడి చర్చించుకుంటున్నారు. ముంగిళ్ళలో కళ్ళాపు జల్లిన ఇల్లాండ్రు ముగ్గు బుట్టలతో నిలబడి ఇంకా తెల్లవారలేదేమి అని పలకరించుకుంటున్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ అందరిలో కలవరం పెరుగుతోంది. ఇంతలోకి ఎవరో గాలిలో పుకారు లేవదీశారు. ఇదేదో ప్రళయమట. ఇవాల్టితో ఇంక సరి అంట, అని పూరూరా రకరకాల పుకార్లు లేవదీశారు. భూగోళం అంతా హా హా కారాలు చెలరేగాయి.

Wednesday 8 February 2023

శ్రీదత్త పురాణము (44)



సుమతీ నిజంగా నాకు తెలియదు. ఏమి జరిగిందో చెప్పు ఇంటి దగ్గర బయలు దేరడం స్మశానంలో నడవడం ఇంత వరకే నాకు తెలుసు. ఆపైన ఏం జరిగిందో ఇసుమంతైనా నాకు తెలీదు. నిజం చెబుతున్నాను. మాండవ్యుడి శిరస్సుకి నా కాలు తగలడం ఏమిటి? అంతటి పాపం చేస్తానా? చేస్తే క్షమించమని ఆ మహర్షి పాదాలు పట్టుకుని క్షమించమని అడగనూ? ప్రాణాలు వదిలేస్తాను గాని పాపంజేసి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా వుంటానా? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ మహారోగం అనుభవిస్తున్నాను. తెలిసి తెలిసి ఇంకా పాపాలు చేస్తానా అసలు ఏం జరిగింది చెప్పు అన్నాడు.


సుమతి నివ్వెరపోయింది. క్షణం క్రింద కళ్ళ ఎదుట జరిగిన సంఘటన నాధుడికి తెలియదు. ఇది మరొక దైవలీల. నిజమే తెలిసివుంటే అంతసేపు నోరు మూసుకొని కూర్చుంటాడా? కనీసం క్షమించండి స్వామి అనడా సరే అని అనుకొని జరిగిందంతా నాధుడికి వివరించింది. కౌశికుడు సిగ్గుపడ్డాడు. భయపడ్డాడు. సుమతీ! వేశ్యా లేదు గీశ్యా లేదు. వెంటనే వెనక్కు వెళ్ళిపోదాం మాండవ్యుడి కొరత దగ్గరకు నన్ను తీసికెళ్ళు. మాండవ్యుడు బ్రతికివుంటె క్షమించమని అడుగుతాను. మృత్యువుకీ భయపడి మాత్రం కాదు. అధర్మానికి సిగ్గుపడుతున్నాను. ఇంతకీ నా కామ వాంఛ ఇన్ని దురవస్థలు తెచ్చిపెట్టింది. నిన్ను అవస్థలు పెడుతున్నాను. నేను అవస్థలు పడుతున్నాను. శాపం కొని తెచ్చుకున్నాను. ఇంక నేను జీవించేదికొన్ని ఘడియలు మాత్రమే. క్షణం వృధాచేయ వద్దు. తొందరగా మాండవ్యుడికి క్షమాపణ చెప్పి ఇల్లు చేరుకుందాం. హరినామ స్మరణతో చివరి ఘడియలు గడుపుతాను. పదపద అన్నాడు. పాపం సుమతి వెనక్కుమళ్ళింది. పిచ్చి ఆవేశమేదో ఆమెను ఆవరించింది. త్వరత్వరగా నడిచింది. పరిచయం లేని ప్రదేశం. కారు చీకటి. దుర్గంధం. లోపల ఆందోళన దారి తప్పింది. ఎంత తిరిగినా ఎటు తిరిగినా మాండవ్యుడి కొరత ప్రదేశం కన్పించలేదు. నాధా ఈ శ్మశానంలో మాండవ్యుడి శరీరం ఎక్కడుందో కన్పించడం లేదు. దారి మారి పూరిదారిలో వచ్చేశాం అంది.


సుమతీ నీవు ఏనాడైనా గుమ్మం దాటిన దావవా, ఎంత హింసిస్తున్నాను. పోనీలే ఇంటికి వెళ్లాం. మాండవ్యుడు ఇచ్చిన శాపానికి తిరుగులేదు. కాలయాపన చెయ్యకుండా పద పద అన్నాడు. సుమతి ఇంటికి చేరుకుని ఇంటి ముంగిటవున్న పంచలో నున్న మంచంపై అతన్ని దింపింది. తాను పెరట్లోకి వెళ్ళి బావివద్ద నీళ్ళతో కాళ్ళు కడుక్కుని తడి చేతులతో భర్త కాళ్ళు, చేతులూ, ముఖం తుడిచింది. అప్పటికీ కౌశికుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అతని చెంత ఆమె పద్మాసనం వేసుకొని కూర్చుని బిగించిన పిడికిలిలా కూర్చుంది. ఉపదేశం పొందిన మంత్రాన్ని ప్రాణాయామ పూర్వకంగా అనుసంధానం చేసింది.


Tuesday 7 February 2023

శ్రీదత్త పురాణము (43)



సుమతి భారంగా ఊపిరి పీల్చింది. చుట్టూ అంతా దుర్గంధం. భర్త పాదాలను రెండు చేతులతో స్పృసించింది. కళ్ళకు అద్దుకుంది. మరల నడక సాగించింది. ఇంత జరిగినా కౌశికుడు ఏమీ పట్టనట్లుగా వున్నాడు. పెద్ద పెట్టున విరగబడి నవ్వుతూ వున్నాడు. ఆ కదలికలకు సుమతి కాళ్ళు తడబడుతున్నాయి. కంగారు పడింది. రెండు పాదాలు పట్టుకొని స్వామి, నాధా అని పిలచింది. అప్పుడు కౌశికుడు నడు, నడు తొందరగా సానిపాప ఇంటికి చేరే సరికి తెల్లవారేలాగా వుంది అన్నాడు కౌశికుడు.


తెల్లవారితే తన భర్త తనకు లేడు. ఏమిటి చెయ్యడం ఏముంది ఒకటే దారి. సూర్యోదయాన్ని అడ్డుకోవడం. అడ్డుకుంటే సకల సృష్టి అల్లకల్లోలమవుతుంది. ఏమైతే నేమి నా భర్త నాకు ముఖ్యం. సుమతి త్వరగా ఒక నిశ్చయానికి వచ్చింది. “ఈ రేయి తెల్లవారకుండుగాక! సూర్యదేవా! నీకు ఇంక ఉదయాస్తమయాలు లేవు" అని బిగ్గరగా అంది. కౌశికుడు అదిరిపడ్డాడు. "సుమతీ ఏమిటి ఈ శాపం? ప్రత్యక్షదైవం సూర్యనారాయణున్నా నీవు శపించడం? నా కామవాంఛను పొడిగించడం కోసం ఈ రాత్రిని అనంతంగా పొడిగిస్తున్నావా? సూర్యుడే ఉదయించకపోతే సృష్టి అంతా ఏమయిపోతుంది ఆలోచించావా? ఇది మహా పాపం సుమతీ శాపాన్ని ఉపసంహరింపజేసుకో" అన్నాడు కౌశికుడు. నాధా సూర్యుడు ఉదయిస్తే నాకు మాంగళ్యం నిలువదు అంది. అదేమిటి ఎవరు చెప్పారు నేను బ్రతికి ఉండగా నీకు మాంగళ్యం ఉండక పోవడం ఏమిటి? అన్నాడు కౌశికుడు. ఇది మాండవ్యుడి శాపం. ఇపుడేగా శపించాడు. మీకు వినిపించలేదా అంది సుమతి.


ఏమిటి సుమతీ నీవు అంటున్నది. నాకేమీ అర్థం కావడంలేదు. మాండవ్యుడేమిటి శపించడమేమిటి? ఈ శ్మశానంలోకి ఆయన ఎలా వచ్చాడు? ఎందుకు శపించాడు? మనం ఏం తప్పు చేశాము?


సుమతి ఆశ్చర్యపోయింది. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు. జరిగిన దుఃస్సంఘటన ఈయనకి తెలియదా. ఇప్పుడేగా జరిగింది. ఏమీ తెలియనట్లు జరగనట్లు మాట్లాడుతున్నాడు ఏమిటి నాధా. పరీక్షిస్తున్నారా. లేదా గేలిచేస్తున్నారా. కొరతకు వ్రేల్లాడుతున్న మాండవ్యుడు శిరస్సుకి మీకాలు తగిలింది. ఆయన మండిపడుతూ శపించాడు. సూర్యోదయం అయితే నా మాంగళ్యం విలవదు. ఇది జరిగి రెండు క్షణాలు కాలేదు. ఏమీ ఎరగనట్లుగా అడుగుతున్నారు. వేళా కోళానికి ఇదేనా వేళ? '


Monday 6 February 2023

శ్రీదత్త పురాణము (42)

 

మాండవ్యుడు భాధతో మూలిగాడు. అతని నోటి నుండి చెవుల నుండి ముక్కు నుండి రక్తం ధారలు ధారలుగా కారుతూ అతని భుజాల నుండి కారుతూ నేలమీద మడుగులు కట్టింది. మహర్షీ మీ పరిస్థితి దయనీయంగా వుంది.


చివరి దశలోవున్న మీకు నీ ఉపకారము చేయలేకపోతున్నాం. ఇది గృహస్థాశ్రమానికి విరుద్ధం. ఇందుకు సిగ్గుపడుతున్నాను. నా భర్తను ఈనేల మీద దించలేను. దించి మళ్ళీ భుజాల మీద ఎత్తుకోలేను అశక్తురాలిని. నన్ను క్షమించండి. మహారాజు గర్వాంధుడు. వాళ్ళకి చెవులే కాని కళ్ళు వుండవు. సరే కారణం ఏదయితేనేమి మీరు ఈ భవ సాగరం నుంచి మరికొద్ది సేపట్లో విముక్తులు కాబోతున్నారు. యోగ విద్యాపారంగతులు మీరు అంతరగ్నిని ప్రజ్వలింపజేసుకొని బ్రహ్మగ్రంధితో ముక్తి మార్గాన పయనించగలరు. ఉపాధి తాలూకు నశ్వరత్వం మీకు తెలియంది కాదు. ఈ సమయంలో నా భర్తను శపించి అది రోగంతో వున్న బ్రాహ్మణున్ని శపించి నా నొసట వైధవ్యాన్ని లిఖించడం భావ్యంకాదు. కొరతతో మీ ప్రాణాలు తడబడుతున్నాయి. బరువుతో నా పరిస్థితి అలాగే వుంది. దయచేసి శాపాన్ని తొలగించండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులకి దండన వుండాలంటే ఇంకో శాపం ఏదైనా ఇవ్వండి. నేను వైధవ్యం భరించలేను. స్వామి దయచూపండి. శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇదే సాష్టాంగ నమస్కారమనుకోండి అన్నది.


అప్పుడా మహర్షి ఆమెతో సాధ్వి! నీ పతి సేవా పరాయణత్వమునకు సంతోషపడుతున్నాను. అయినా ఇచ్చిన శాపం తొలగించలేని అశక్తుణ్ని. ఇది కూడా దైవలీల. అందుకే నా నోటి నుండి శాపం అలా వచ్చింది. వెంటనే శిరస్సు వ్రక్కలైపోవుగాక అని నేను అనలేదు కదా. సూర్యోదయం వరకు వ్యవధివుంది కదా ప్రయత్నించు. నీ భర్తను కాపాడుకోగలుగుతావు. నీ పాతివ్రత్యమే నీకు శ్రీరామరక్ష వెళ్ళిరా శుభమగు గాక అన్నాడు. అప్పుడా సుమతి చాలు మహర్షి చాలు ఇంతటి ఆశీస్సులు ఇచ్చారు. ఇంక నాకు భయంలేదు. కానీ ఉపచారములు చెయ్యవలసిన సమయంలో మిమ్మల్ని ఈ స్మశానంలో ఒంటరిగా వదలి వెళ్తున్నాము. మన్నించండి. మీకు ఉత్తమ గతులు కల్గాలని ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తున్నాను. సెలవు అంటూ బయలు దేరింది.


Sunday 5 February 2023

శ్రీదత్త పురాణము (41)



అడ్డంగా వచ్చిన చెట్లకొమ్మలను రెమ్మలను లతలను కాళ్ళతో చేతులతో ఆడిస్తూ వున్నాడు. తలకు తగిలే చెట్లు కొమ్మల నుండి తప్పించుకుంటూవున్నాడు. గర్వంగా నవ్వుకుంటున్నాడు. పై బరువుల కదలికలతో సుమతి కాళ్ళు తడబడుతున్నాయి. అప్పుడప్పుడు తూలిపడిబోతోంది. చెట్లకొమ్మలు గీసుకుంటున్నా, కాళ్ళ క్రింద ముళ్ళూ రాళ్ళూ వున్నా లెక్కచేయకుండా నడుస్తూవుంది. ఎటుచూసినా కారు చీకటి. ఏనాడూ చూసి ఎరగని ప్రాంతం దారి ఎటో తెలియని స్థితి అడుగుదామంటే ఎవరూ కనిపించడం లేదు. అయినా నడుస్తోంది. ఇంతలో "చంపేశావురా నీచుడా” అంటూ మూలుగులాంటి కేక వినిపించింది. భారంగా ఆ మాట వినిపించింది. సుమతి నివ్వెరపోయింది. ఎవరది అంటు ఆ మూలుగు వినిపించిన వైపుకు చూసింది. చేరువలోనే మానవశరీరం. కొరత వేయబడి కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కనపడ్డాడు. చీకటిలో ఎవరో పోల్చుకోలేకబోయింది. సుమతి ఎవరు స్వామి తమరు అంది భయంభయంగా.


నన్నే గుర్తు పట్టలేకపోయావా? నేను మాండవ్య మహర్షిని. ఈ దేశం ఏలే మహారాజు గర్వాంధుడై నాకు చౌర్యం అంటగట్టి కొరత వేయించాడు. పరమాత్మని ధ్యానం చేసుకుంటూ ప్రాణాలుపోకడకు ఎదురుచూస్తున్నాను. నీ భుజాల మీద స్వారీ చేస్తున్న ఈ దుష్టుడు నా తలపై తన్నాడు. ప్రాణం జిల్లార్చుకుపోయింది. మహర్షి అనే మర్యాదలేదు. మనిషి అనే గౌరవంలేదు. చావుకి సిద్ధంగా వున్నాననే దయలేదు. దీనికి వీడు శిక్ష అనుభవించవలసిందే. వీడు సూర్యోదయం అయ్యేలోగా మరణించవలసిందే ఇది నా శాపం అన్నాడు. పాపం సుమతి నిలువునా ఒణికిపోయింది. మహర్షీ మహర్షీ అంటూ రెండు చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాదాలపైబడి ప్రాధేయపడలేని స్థితిలో వున్నాను. నా భుజాలపై నున్నది ఎవరో కాదు నా భర్త కౌశికులవారు. మేము మీకు తెలియని వాళ్ళంకాదు. వీరి ఆరోగ్యం బాగున్న రోజుల్లో తమరికి నేను చాలా మార్లు అతిధి మర్యాదలు చేసుకున్నాను. ఇటీవలే ఈ రోగంతో ఈయన ఇలా వున్నారు. కుష్టురోగంతో పరితపిస్తున్నారు. పాపం ఏమి చేస్తున్నారో వారికి తెలియడంలేదు. కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్కి పాపం స్పర్శ జ్ఞానాన్ని కోల్పోయారు. వీరి చిన్న కోరిక తీర్చడానికి నేను భుజాల మీద మోసుకెళ్తున్నాను. పాపం పొరబాటున వీరి కాలు మీ శిరస్సుకు తగిలింది. కళ్లు కనిపించని చీకటి ఇది. తెలిసి చేసిన పొరబాటు కాదు. కావాలని చేసిన అవమానం కాదు. మిమ్మల్ని అర్చించి ఆశీస్సులు పొందవలసిన వాళ్ళం. తెలిసి అవమానిస్తామా? అవమానిస్తే మాకు ఒరిగే దేమిటి? మహర్షులు అనుగ్రహిస్తే మహా రోగాలు సైతం ఉపశమింపజేసు కోవచ్చు. ఈ ఆశతో అర్చిస్తాము కాని అవమానిస్తామా? తెలియక జరిగిన ఈ తప్పు కాయండి. నా అవస్థ చూస్తున్నారుకదా. మూలిగే నక్క మీద పిడుగు పడ్డట్లుగా అయ్యింది నా పరిస్థితి. వైధవ్యం భరించలేను. దయచేసి శాపం ఉపసంహరించండి. ఆరోగ్యం కుదుటపడేటట్లు ఆశీర్వదించండి. జన్మజన్మలకు మీకు ఋణపడి వుంటాను అన్నది.


Saturday 4 February 2023

శ్రీదత్త పురాణము (40)

 

సుమతి మాటలతో కౌశికుడు కాస్తంత తేరుకున్నాడు. మరల సానిపాపనే తలుచుకుంటూ సూర్యాస్తమయము కొరకు ఎదురు చూస్తూ నడుం వాల్చాడు. వంటింటి పనులన్నీ చకచకా ముగించుకొని సుమతివచ్చి భర్తను చూచి కారణం ఏదైతేనేమి తన భర్త ఆనందంగా వున్నాడు. అనారోగ్యాన్ని పూర్తిగా మరచిపోయాడు ఇదే చాలునని తృప్తిపడి భర్తను లేవదీసి పీటవేసి దానిపై అతన్ని కూర్చోబెట్టి కుష్టురోగంతో కుళ్ళివున్న శరీరంపై వున్న కట్లను విప్పి చీమునెత్తురూ శుభ్రంచేసి మందులురాసి కొత్త గుడ్డలతో కట్లు కట్టింది. రోగకారణంగా సగానికి పైగా తినేసిన చేతి వ్రేళ్ళు కాలి వేళ్ళు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంది. రసికంపురాకుండా పరిమళ ద్రవ్యాలు శరీరం అంతా పులిమింది. నొసట వీభూతి కుంకమ అద్దింది. పట్టు పంచ కట్టించింది. పట్టు శాలువా రెండు భుజాల నిండుగా కప్పి అటు ఇటూ అందంగా వ్రేలాడేటట్లుగా సర్దింది. మల్లెల దండలు మెడలో, చేతిమణి కట్టులకు అలంకరించింది. గుండెల మీద భుజాల మీద మంచి గంధం రాసింది. కౌశికుడు పెళ్ళి కొడుకులా తయారయ్యాడు. నీళ్ళునిండిన కళ్ళతో సుమతి కళ్ళల్లోకి చూచి, సుమతీ ఉదయం కనిపించింది సానిపాప. సూర్యుడు అస్తమిస్తున్నా నన్ను వదలడంలేదు. హృదయంలో హత్తుకొనిపోయింది ఆసానిపాప చూసిన చూపు. ఆమెను పొందలేకపోతే నేను బ్రతుకలేను అన్నాడు.


సుమతి హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఇంట్లోకి వెళ్ళి అద్దంతెచ్చి భర్తకు చూపించింది. మందగించిన చూపుతో కౌశికుడు అద్దంలో తన బింబాన్ని చూసి మురిసిపోయాడు. వేశ్యలకు బంగారం ప్రాణమంటారు కనుక తన మెడలోవున్న కాసుల హారాన్ని తీసి భర్త మెడలో వేసింది. నాధా! సూర్యాస్తమవుతుంది, ఇంక బయలుదేరుదాం వేశ్యవాటిక మనింటికి చాలా దూరం మధ్యలో శ్మశానం దాటాలి, బయలుదేరుదాం అని కొంగు బిగించి కొంత ధనాన్ని మూట కట్టుకొని మంచానికి చేరువలో నేల మీద కూర్చుంది. కౌశికుడు మంచం మీద నుండి ముందుకు జరిగి ఆమె మెడకు అటుఇటూ కాళ్ళువేసి సర్దుకొని కూర్చున్నాడు. పూతగా ఆమె శిరస్సును పట్టుకున్నాడు. నేలకు చేతులు ఆనించి సుమతి అతి ప్రయత్నం మీద లేచింది. భర్త కాళ్ళను చేతులతో అదిమిపట్టుకొని బరువుగా అడుగులు వేస్తూ బయలుదేరింది. 


దారిలో కన్పించిన వారినందర్ని కౌశికుడు సరదాగా పలకరిస్తున్నాడు. వింతగా ఇకిలిస్తూవున్నాడు. చూసిన వాళ్ళంతా ఇతనికి పిచ్చిపట్టిందేమో అనుకున్నారు. తెలిసినవాళ్ళు ఏమోయి కౌశిక ఎందాక అంటే మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నాడు. సుమతి మాత్రం ఇక్కడికే వ్యాహ్యాళికి అని అంటోంది. ఇంతలో చీకట్లు కమ్ముకున్నాయి. వూరు దాటి స్మశానంలోకి అడుగుపెట్టారు. కౌశికుడులో ఉత్సాహం రెట్టింపు అయ్యి గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా కాళ్ళు అటు ఇటూ ఆడిస్తూ వెకిలిగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. 

Friday 3 February 2023

శ్రీదత్త పురాణము (39)

 

కౌశికునకు ఏదో కొత్తగా శక్తి ఆవరించినట్లయింది. లేచేందుకు తన ప్రయత్నం తాను చేశాడు. పూర్తిగా సుమతి పై వాలిపోకుండా తనకు తాను నిలబడటానికి ప్రయత్నం చేశాడు. సుమతీ ఒక చేత్తో నిన్ను పట్టుకుంటాను. ఒక చేత్తో గోడపట్టుకుంటాను. ఈ పాటి ఆసరా నాకు చాలు ఏదో కొత్తశక్తి ఆవరించింది నన్ను. నెమ్మదిగా వస్తాను వన్ను తొందరపెట్టకు అని తన ప్రయత్నం తాను చేశాడు. చిన్నగా నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. సుమతి కాళ్ళు కడిగి తుడిచి పీటవేసి కూర్చోబెట్టింది. వండినవి విస్తరిలో వడ్డించి ముద్దలు చేసి పెడ్తూ ప్రేమగా తినిపించింది. ఆనందంతో మాట్లాడబోయిన కౌశికుడికి పొలమారింది. దగ్గు వచ్చింది. సుమతి కంగారుతో అతని మాడుపై చిన్నగా తడ్తూ నెమ్మదిగా తినండి ఇంకా చీకటి పడటానికి చాలా సమయం వుంది అంటూ అతని చేత మంచినీళ్ళు త్రాగించింది. కౌశికుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కంఠాన్ని సవరించి సర్దుకున్నాడు. సుమతి ముఖంలో చిరునవ్వు మెరిసింది. మరోవైపు తిరిగి ఎడమచేత్తో పెరుగు అందుకొని అతనికి వడ్డిస్తూ అతన్ని కవ్వించాలని బహుశా సానిపాప మిమ్మల్ని తలుచుకుంటోందేమో అంది. కౌశికుడి ముఖంలో సిగ్గు ఉదయించింది. సుమతీ నేను చాలా సిగ్గుపడుతున్నాను. జీవితంలో ఏనాడూ కలగని కోరిక ఈనాడు కలిగింది. తప్పు అని నాకు అనిపిస్తుంది. అయినా మనస్సు నిగ్రహించుకోలేకపోతున్నాను. ఇది దైవ లీల అనుకుంటాను. ఏమి జరుగనున్నదో తెలియడంలేదు. అన్నింటిలోకి బాధిస్తున్న విషయం ఏ యుగంలో ఎంతటి నీచుడూ చెయ్యని పని నేను చేస్తున్నాను. సాని వాడకు తీసికెళ్ళమని కట్టుకున్న ఇల్లాలిని అడగడం ఎంత నీచం, దారుణం అని అంటూ కౌశికుడు దుఃఖంతో ఉండగా తెరలుగా దగ్గువచ్చి గొంతులో మెతుకులు అడ్డంపడ్డాయి. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు దగ్గుతో పాపం సుమతి కంగారుపడి భయపడి వూరడిల్లండి, వూరడిల్లండి అంటూ మంచినీళ్ళు అందించింది. ముక్కూమూతి తుడిచింది. చేతులు కడిగి కాళ్ళను తడిచేత్తో తుడిచింది. కౌశికుడు కొద్దిగా తేరుకున్నా ఇంకా బాధపడుతూనే వున్నాడు.


అప్పుడు సుమతి అతని దగ్గరగా వచ్చి కూర్చుని నాధా! మీరు ఇంతగా భాదపడవలసిన పనిలేదు. సానివాడకు మీరు తీసికెళ్ళమని నన్ను అడిగారా లేదు నా అంతట నేను అన్నాను. మరి సిగ్గు పడటం ఎందుకు? బాధపడటం ఎందుకు? భార్యలను మోసంచేసి సానివాడల్లో తిరిగే వారు ఎంతమంది లేరు. నా మగడు అటువంటి వాడు కాదు. నన్ను మోసంచేయడంలేదు. నా భర్త నా సహాయమే అడుగుతున్నాడు. ఇది నాకు గర్వకారణం. ఈ పరిస్థితుల్లో మీకు ఇలాంటి కోరిక కలగడం కేవలం కామవాంఛ అని నేను అనుకోవడం లేదు. మీరన్నట్లుగా ఇదేదో దైవలీల. లేవండి మంచం మీద కూర్చోబెడతాను. కాసేపు నడుంవాల్చండి. ఈలోగా నేను కూడా భోజనం చేసి వంటిల్లు సద్దివస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని ముస్తాబుచేస్తాను అన్నది.


Thursday 2 February 2023

శ్రీదత్త పురాణము (38)



క్షణానికొకసారి పెడబొబ్బలుతో పిలిచే భర్త ఈ పూట ఇంత ప్రశాంతంగా ఉన్నాడని ఆశ్చర్యపోతూ వంట ముగించుకొన్న సుమతి ఇంటి ముంగిటకు వచ్చింది. మనసులో మల్లగుల్లాలు పడుతున్న భర్తను గమనించింది. ప్రేమగా సరసన కూర్చుంది. వంట ఆలస్యమయిందని కోపం వచ్చిందా! లేవండి వడ్డిస్తాను అంటూ అతణ్ణి లేవనెత్తే ప్రయత్నం చేసింది. కోపంగా కౌశికుడు విదిలించుకున్నాడు. సుమతి నివ్వెరపోయింది. లేచి లోపలికి వెళ్ళబోయింది. ఇంతలో కౌశికుడు ఆమె చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి, సుమతీ ఇవాళ నాకు ఆకలిగా లేదు అని సరసమైన చూపుతో అన్నాడు. సుమతి బుగ్గలు ఎరుపెక్కాయి. అపుడు కౌశికుడు తెచ్చిపెట్టుకొన్న ప్రేమతో సుమతి బుగ్గపట్టుకొని సుమతీ నాకున్న దిక్కు మొక్కు నీవే. నీతోకాక ఎవరితో చెప్పుకుంటాను. కట్టుకొన్న భార్యను అడగకూడదు. అయినా అడగక తప్పటంలేదు, కాలు చెయ్యి తిన్నగా ఉండి ఈ రోగం రాకుండా ఉంటే అసలు నీకు తెలియనిచ్చేవాడినే కాదు. పాపం నీ దురదృష్టం. నాకేమో ఈ మాయ రోగం వచ్చింది. నీ సహాయం అడగక నీ తప్పట నువ్వు లేదు. కాదనవనే నమ్మకం నాకుంది. నీ పాతివ్రత్యం నాకు తెలుసుగదా! కౌశికుడు ఇలా మాట్లాడుతూ ఉంటే సుమతికి ఏమీ అర్ధంకాలేదు. నాధా అంటూ చేరువకు వచ్చింది. ఈ రోజేమిటి, మీ ప్రవర్తన వింతగా ఉంది. దాపరికం లేకుండా చెప్పండి. ఏనాడైనా మీ మాట కాదన్నానా! మీకు ఎదురు చెప్పానా! మీరు ఏది కోరినా మంచి చెడులతో నాకు సంబంధం లేదు. శక్తి మేరకు తీర్చడం నా ధర్మం. సంశయించకండి. మీ మనసులో ఉన్నదేమిటో ఆజ్ఞాపించండి. నా ప్రాణం అర్పించి అయినా సరే మీ కోరిక నెరవేరుస్తాను. మీ ఆనందమే నా ఆనందం. మీ సంతోషమే నా సంతోషం, త్వరగా చెప్పండి అన్నది.


ఈ మాటలతో కాశికుడికి ధైర్యం వచ్చింది. సుమతీ, యిది ఏమో విధి వైపరీత్యంలా ఉంది. దైవలీలలన్నీ చిత్ర, విచిత్రంగా ఉంటాయి. ఆరోగ్యం అన్ని విధాలా బాగున్న రోజుల్లో నిండు యవ్వనంలో ఏ రోజు కలుగనిదీ, ఈ రోజు కలిగింది నాకు ఆ కోరిక. ఎంత వింత! సుమతి! మన వీధికి ఏనాడైనా సానిపాపలు రాగా నీవు చూసావా! విన్నావా! అదే ఆశ్చర్యం. ఇందాక ఒక సాని పాప మన వీధిలో నడుచుకుంటూ వెళ్ళింది. మన ఇంటి ముందు క్షణం నిలబడి కొంటె చూపుల్ని నా గుండెల్లో గ్రుచ్చి వెళ్ళింది. నా మనస్సంతా కలచి వేసింది. ఇప్పుడు శరీరంలో క్రొత్తరోగం ప్రవేశించింది. ఆ రోగం పోవాలంటే సానిపాపను కలవవలసిందే. ఇపుడు నేను శారీరకంగా మన ఇంట్లో ఉన్నాను కాని, మానసికంగా సానిపాప ఇంటి గడపలో ఉన్నాను. చకచకా నడిచి వెళ్ళగలిగిన శక్తిలేదు. మాయరోగం నా కాళ్ళు, చేతులూ తినేసింది అంటూ దుఃఖ వదనంతో చెప్పాడు.


నాధా! ఇంత చిన్న పనికి హైరానా పడతారెందుకు! నేను ఏమనుకుంటానో అనే చింత వదిలివెయ్యండి. నేను మీ కొరకై జీవిస్తున్న వ్యక్తిని. మీ ముఖంలో ఇలాంటి కాంతి, తేజస్సు నేను చూసి ఎన్నాళ్ళయ్యిందో. మీ ఆనందం కన్నా నాకు ఏంకావాలి, దాని కోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను, కాళ్ళు, చేతులు ఆడటం లేదని నడవలేనని బాధపడకండి. నేను తీసుకువెళతాను. భుజాలపై కూర్చోబెట్టుకొని మీకు ఏ శ్రమ కలగకుండా హాయిగా తీసుకువెళతాను. ముందు లేవండి! భోజనం చెయ్యండి! కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఈ లోగా సాయంకాలం అవుతుంది. స్నానం చేయించి పట్టు వస్త్రాలు కట్టించి, చందన సుగంధద్రవ్యాలు చల్లి, మిమ్మల్ని అలంకరించి, సాని వాడకు తీసుకొని వెడతాను. నాది బాధ్యత. లేవండి భోజనం చేద్దురుగాని, అంటు సుమతి భర్తమ ప్రేమగా అనునయంగా మాట్లాడుతూ లేవనెత్తింది.


Wednesday 1 February 2023

శ్రీదత్త పురాణము (37)

 


సుమతీ కౌశికుల వృత్తాంతం


ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్యపేరు సుమతి. పేరుకు తగిన గుణవతి. మహా పతివ్రత. కొంతకాలంగా వాళ్ళిద్దరి యొక్క సంసారం అన్యోన్యంగా సాగింది. ఉన్నట్టుండి కౌశికుడికి ఏ పూర్వ జన్మ పాపమో కుష్టురోగం సోకింది. రోజులు గడుస్తున్న కొద్ది రోగం ముదిరి తనువంతా చీము, నెత్తురు కారుతుంటే సుమతి మనస్సులో కూడా ఏవగించుకోకుండా అతని శరీరాన్ని నీటితో కడిగి మెత్తని గుడ్డలతో వత్తి, వైద్యులిచ్చిన తైలములను మృదువుగా రాస్తూ ఉండేది. ఔషధాలను సమయానికి అందిస్తుండేది. మలమూత్రాలను ఎత్తిపోయడం, కంపు కొట్టే గుడ్డలు ఉతికి ఆరవేయడం, దగ్గరగా కూర్చుని వింజామరతో విసరడం, కాళ్ళు పట్టడం, మంచిగా చెప్పి ఇంత తినిపించడం, ఒకటేమిటి సకలోపచారాలు విసుగు విరామం లేకుండా చేసేది. రోగం తగ్గుముఖం పడుతుందని తొందరలోనే నయమవుతుందని ధైర్యం నూరి పోసేది. అయితే రోగబాధతో ఉన్న కౌశికుడు మాత్రం ఆమెపై అనుక్షణం మండిపడుతుండేవాడు. అయిన దానికి కాని దానికి తిట్టేవాడు. చిన్న, చిన్న విషయాలకే చిరాకు పరాకు ప్రదర్శించే వాడు. చేతికి ఏది అందితే అది తీసుకొని కొట్టేవాడు. నవ్వుతూ కనిపించినా, వీధిలోకి వెళ్ళి రావడం, క్షణం ఆలస్యమైన కుళ్ళు మాటలతో ఏడిపించేవాడు. అలాగని నవ్వకుండా ఉంటే ఏమీ నా సేవ చేయాలని ఏడుస్తున్నావా! ఎప్పుడు చస్తాడాని ఎదురుచూస్తున్నావా అంటూ చంపుకు తినేవాడు. పాపం సుమతికి నవ్వాలో ఏడ్వాలో తెలియదు. ఇది రోగ లక్షణం కాబోలు అనుకొని అలాగే సహనంతో, ప్రేమతో, భక్తితో సంవత్సరాల తరబడి సేవలు చేస్తూనే ఉంది.


ఒక రోజు ఉదయాన కౌశికుడుకి శరీరం అంతా శుభ్రం చేసి విభూధిరేఖలు దిద్ది శుభ్ర వస్త్రాలు కట్టి ఇంటి ముంగిట పంచలో మంచం వేసి, మెత్తని పడకలు ఏర్పరిచి సుఖంగా కూర్చోబెట్టి తాను వంట పనుల్లో తలదూర్చింది సుమతి. కౌశికుడు కులాసాగా వీధిన వచ్చిపోయేవాళ్ళని పలకరిస్తూ పుండ్ల మీద వాలుతున్న ఈగల్ని తోలుకుంటూ సరదాగా ఉన్నాడు.


అంతలోకే ఒక మెరుపు తీగలాంటి అమ్మాయి నడుచుకుంటూ ఆ వీధిలోకి వచ్చింది. 16 ఏళ్ళ పడుచుపిల్ల. ఆ పిల్ల చూపు మన్మధ భాణంగా ఉంది. ప్రతిష్ఠానపురంలో పెద్ద, పెద్ద ధనవంతుల కుమారులను సైతం లోకువకట్టి వెంట తిప్పుకొంటున్న సానిదాని కూతురు ఆ పిల్ల. కౌశికుడి కంటబడింది. కళ్ళు జిగేలుమన్నాయి. గుండెల్లోకి దిగింది మన్మధ బాణం. అసలే రోగంతో తిమ్మెరలు ఎక్కిన దేహం. జువజువలాడింది. ఆ కుర్రపిల్ల సోయగాలు విసురుతూ కౌశికుడు వైపుకు కొంటెచూపు విసిరి తుర్రుమని వెళ్ళిపోయింది. పాపం ఆ పిచ్చి బాపడు విలవిల్లాడిపోయాడు. ఆ హొయలు, వయ్యారం, రూపు, చూపు తలుచుకుంటూ మురిసిపోయాడు. తనవైపు ఎందుకు చూచిందీ అని ఆలోచించి కామంతో ఉడికిపోయాడు. కౌశికుడు తనని తాను చూసుకున్నాడు. అందంగా కనిపించాడు. ఏమైనాసరే సాని పాపను కలవాల్సిందే, లేదంటే మరణించవలసిందే. ఇందుకు శరీరం సహకరిస్తుందా! ఈ రోగంతో ఉన్న రూపాన్ని ఆమె అంగీకరిస్తుందా? ఇంతకీ వేశ్య ఇంటికి తనను తీసుకువెళ్ళేది ఎవరు? ఇలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి అతని మనస్సులో, ఆకలిదప్పికలు మరచిపోయాడు. ఇంతలో సూర్యుడు నడినెత్తికి చేరుకున్నాడు.