Thursday 16 May 2024

శ్రీ గరుడ పురాణము (177)

 


స్ఫటికరత్నం మనకు బలరాముడిచ్చిన వరం. ఈయన బలాసురుని మేధాభాగాన్నందు కొని కావేరి, వింధ్య, (నేటి చైనా), నేపాల ప్రాంతాల్లో ప్రయత్నపూర్వకంగా వెదజల్లాడు. ఆకాశ సమాన నీలవర్ణంలో తైల-స్పటిక అను పేరు గల రత్నాలు ఆయాప్రాంతాల్లో లభిస్తున్నాయి. ఇవి తెల్లకలువ, శంఖ వర్ణాల్లో వుంటాయి. ఈ ధవళ వర్ణమే కాక మరికొన్ని రంగుల్లో కూడా లభిస్తాయి. పాప వినాశనంలో ఈ మణికి సాటి లేదు. దీన్ని ధరిస్తే అన్ని పాపాలూ నశిస్తాయి. శిల్పకారులు దీనికి వెలకట్టగలరు.


విద్రుమమణి ఆదిశేషునిచే భూలోకానికి ప్రసాదింపబడింది. ఈయన బలాసురుని అంత్రభాగాన్ని గ్రహించి కేరళాది దేశాలలో వదిలాడు. ఈ మహాగుణ సంపన్నమైన విద్రుమ మణుల్లో కుందేలు రక్తం రంగులోనూ, గుంజాఫల లేదా జపాకుసుమ సదృశ ఎఱ్ఱటి వర్ణంలోనూ వున్నవి. శ్రేష్ఠతమాలుగా పరిగణింపబడుతున్నాయి. నీల, దేవక, రోమక దేశాలు ఈ మణులకు జన్మభూములు. అక్కడి విద్రుమమణులు చిక్కటి ఎరుపులో ప్రకాశిస్తుంటాయి. అన్యస్థానాల్లో కూడా విద్రుమాలు దొరుకుతున్నాయి గాని అవి ప్రశస్తాలు కావు. శిల్పకళలో విశేషమైన నేర్పు గలవారే వీటికి వెల కట్టగలరు. సుందరంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఎఱ్ఱగా వుండే ఈ మణులను ధరించేవారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది; అంతేకాక విషాదిక దుఃఖాలు దూరమవుతాయి" ఈ విధంగా వివిధ రత్నాలకు సంబంధించిన జ్ఞానాన్ని విష్ణువూ, బ్రహ్మా మనకు ప్రసాదించారు. 


(అధ్యాయాలు 74-80)

గంగాది తీర్థాల మహిమ


సూతుడు శౌనకాది మహామునులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు.


"శౌనకాచార్యాదులారా! ఇపుడు మీకు మన సమస్త తీర్థాలనూ వాటి మహిమనూ వినిపిస్తాను. అన్ని తీర్థాలలోనూ ఉత్తమము గంగ. గంగానది సర్వత్రా సులభమైనా హరిద్వార, ప్రయాగ, గంగా సాగర సంగమాల్లో దుర్లభం.


సర్వత్రసులభాగంగా త్రిషుస్థానేషు దుర్లభా ॥

గంగాద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే ।


(ఆచార... 81/1,2)


మరణించేవానికి ముక్తినీ, బతికున్నవానికి భుక్తినీ కూడా ప్రసాదించే ప్రయాగ పరమశ్రేష్ఠ తీర్థం. ఈ మహాతీర్థంలో స్నానం చేసి తమ పితరులకు పిండ ప్రదానం చేసేవారు తమ తమ పాపాలన్నీ పూర్తిగా నశింపగా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు.


Wednesday 15 May 2024

శ్రీ గరుడ పురాణము (176)

 


తమ కంఠంలో స్వర్ణసూత్రంలో ముడిపెట్టి ఈ విశుద్ధ భీష్మక మణిని ధరించినవారు సదా సుఖసమృద్ధితో సంపదల కలిమి కలుగగా జీవించగలరు. వీరు వనాలలో తిరుగుత్నుపుడు ఆ మణిని దూరం నుండే చూసి సింహ, వ్యాఘ్ర, శరభాది మహామృగాలూ, తోడేళ్ళవంటి హింస్రక జంతువులూ కూడా మరింత దూరం పారిపోతాయి. వారికి ఏ రకమైనా పీడా సోకదు; ఏ విధమైన భయమూ కలుగదు. మానవులు కూడా వారిని అపహాస్యం చేయడానికి గానీ నిందించడానికి గానీ జడుస్తారు.


ఈ భీష్మకమణినిపొదిగిన ఉంగరాన్ని ధరించి పితృకార్యం చేస్తే ఆ పితరులు కొన్నేళ్ళ దాకా గొప్ప సంతృప్తిని పొందుతారు. దీని ప్రభావం వల్ల సర్ప, వృశ్చికాదుల విషప్రభావం మణిధారి వంటికి ఎక్కదు. జల, శత్రు, చోర భయముండదు. నాచు మరియు మబ్బు రంగులోనుండి కఠోరమై, పచ్చటి కాంతులను వెదజల్లుతూ, మలినద్యుతినీ వికృతవర్ణాన్నీ కలిగియుండే భీష్మకమణిని దూరం నుండే చూసి మరింత దూరంగా తొలగిపోవాలి. అది అంత ప్రమాదకరం.


పులకమణి కూడా వాయుదేవుని చలవే. ఆయన బలాసురుని గోళ్ళ నుండి భుజాల దాకా గల శరీరాన్ని విధ్యుక్తంగా పూజించి శ్రేష్ఠ పర్వతాలలో, నదుల్లో, ఉత్తర దేశంలోని కొన్ని ప్రసిద్ధ స్థానాల్లో స్థాపితం చేశాడు. దశార్ణ, వాగదర, మేకల, కళింగాది దేశాల్లో ఈ ప్రకాశరూపియైన బీజం నుండి వచ్చిన పులకమణులు గుంజాఫల, అంజన, మధు, కమలనాళ వర్ణాలలో వుంటాయి. గంధర్వ, అగ్ని దేశాలలో పుట్టిన పులకమణులు అరటి పండు రంగులో వుంటాయి. ఈ వర్ణమణులన్నీ ప్రశస్తాలే. కొన్ని పులకమణులు విచిత్ర భంగిమలతో శంఖ, పద్మ, భ్రమర, సూర్య ఆకారాలలో వుంటాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం గుచ్చి మెడలో ధరిస్తే అసంఖ్యాకంగా సుఖాల్నీ, శుభాల్నీ కలుగజేస్తాయి. ఐశ్వర్యాభివృద్ధినీ ప్రాప్తింపజేస్తాయి. కొన్ని పులకమణులు మాత్రం మిక్కిలి భయంకరమైనవి. ముఖ్యంగా కాకి, గుఱ్ఱం, గాడిద, తోడేలు, రూపాలతో నున్నవి, మాంసంతో రక్తంతో నున్న గ్రద్ద ముఖ సమాన వర్ణంలో నున్నవి మృత్యుదాయకాలే. శ్రేష్ఠ, ప్రశస్త ఏకపల మాత్ర భారమున్న పులకమణి ధర అయిదువందల ముద్రలు పలుకుతుంది.


రుధిరాక్షరత్నం అగ్నిదేవుని అనుకంప (దయ) వల్ల మనకు దక్కింది. దానవరాజు బలాసురుని శరీరంలోని కొన్ని అంశాలను నర్మదానదీ తీర ప్రాంతంలోనూ మరికొన్ని అంశాలను దానికి దిగువ భూములలోనూ స్థాపించిన అగ్నిదేవుడే మనకు రుధిరాక్షరత్నం లభించడానికి కారకుడు. ఎఱ్ఱగా చిలకముక్కు రంగులోనూ, ఇంద్రగోప కీటవర్ణంలోనూ ఈ మణులు దొరుకుతున్నాయి. కొన్ని తెల్లగా నుండి మధ్య భాగంలో పాండుర వర్ణంతో అత్యంత విశుద్ధంగా వుంటాయి. ఆ రుధిరాక్షలు ఇంద్రనీలమణితో సమానమైన శక్తులను కలిగి వుంటాయి. ఈ రత్నాలను ధరించేవారికి అన్ని ఐశ్వర్యాలూ, భృత్యాది అభివృద్ధులూ అబ్బుతాయి. దీనిని పాకక్రియ ద్వారా శోధన చేస్తే దేవ వజ్రంలా మెరుస్తుంది.


Tuesday 14 May 2024

శ్రీ గరుడ పురాణము (175)

 


ఇతర మణులు


(పుష్యరాగ, కర్కేతన, భీష్మక, పులక, రుధిరాక్ష, స్పటిక, విద్రుమ)


పుష్యరాగ (పుష్కరాగ) మణి బలాసురుని చర్మం హిమాలయ పర్వతంలో పడిన చోటినుండి ఉద్భవించింది. ఇది మహాగుణ సంపన్నం. సంపూర్ణ పీత, పాండుర వర్ణముల సుందరకాంతులను వెదజల్లు పుష్యరాగాన్నే పద్మరాగమణిగా వ్యవహరిస్తారు. అదే లోహిత, పీతవర్ణాల కాంతులను వెలారుస్తుంటే 'కౌకంటక'మని వ్యవహరిస్తారు. పూర్ణలోహిత వర్ణము, సామాన్య పీత వర్ణము సంయుక్తంగా వుండి మెరిసే పాషాణాలను 'కాషాయక' మణులంటారు. ఈ మణుల పూర్వరూపమైన పుష్పరాగమణి వైదూర్యముతో సమానమైన మూల్యాన్నే కలిగి వుంటుంది. ఫలితం కూడా పురుషుల విషయంలో సమాన ఉన్నత ఫలమే. స్త్రీలు పుష్యరాగాన్ని ధరిస్తే పుత్రప్రాప్తి నొందగలరు.


కర్కేతనమణి పరమపూజ్యతమం. బలాసురుని రత్నబీజ స్వరూపాలైన గోళ్ళను వాయుదేవుడు అత్యంతాదరంతో గొనివచ్చి ప్రసన్నతాపూర్వంగా కమల వన ప్రాంతంలో వ్యాపింపజేశాడు. అవి పృథ్విపై కర్కేతన నామంతో జన్మించాయి. ఇవి రక్త, చంద్ర, మధు, తామ్ర, పీత, నీల, శ్వేత వర్ణాలలో లభిస్తున్నాయి. ఇన్ని రంగుల్లో దొరకడానికి కారణం రత్నవ్యాధి అనే దోషమని పెద్దల మాట. ఈ రత్నాలు కఠోరంగా వుండడానికీ అదే కారణం.


సంతాప, వ్రణ వ్యాధులు రత్నాలకు కూడా వుంటాయి. ఆ వ్యాధి లేకుండా స్నిగ్ధ, స్వచ్ఛ, సమరాగ, అనురంజిత, పీత, గురుత్వ ధర్మాలతో నిండి, విచిత్ర వర్ణ కాంతులీను కర్కేతనమణి విశుద్ధ, పరమపవిత్ర మణిగా పూజలందుకుంటుంది.


స్వర్ణపాత్రలో సంపుటితం చేసి అగ్నిలో వేసి తీస్తే అత్యధిక దేదీప్యమాన కాంతులతో ప్రకాశించే మణి విశుద్ధకర్కేతనమణి. ఇది సర్వరోగాలనూ నశింపజేయగలదు; కలిదోషాన్ని నివారించగలదు; కులవృద్ధినీ కలుగజేయగలదు; సుఖమునూ ఇవ్వగలదు. ఈ కర్కేతనాలను ధరించినవారు పూజలందుకోగలరు; ధనాఢ్యులు కాగలరు; బంధు బాంధవ సంపన్నులు, ప్రసన్నులు కాగలరు. దూషిత కర్కేతనాన్ని ధరించరాదు. అలా చేస్తే, అంటే ధరిస్తే, సర్వ కష్టాలూ సంప్రాప్తిస్తాయి.


భీష్మకమణి మహారత్నదాతయైన బలాసురుని వీర్యం హిమాలయ పర్వతప్రాంతాల్లో పడగా నేర్పడిన రత్నాకరంలో సముద్భవించింది. అక్కడి భీష్మకమణి శంఖ, పద్మ సమాన, సముజ్జ్వలములూ, మధ్యకాలీన సూర్య ప్రభాసమాన శోభలూ వెదజల్లుతూ వజ్రమంత తరుణంగా ఉంటుంది.

Monday 13 May 2024

శ్రీ గరుడ పురాణము (174)

 


వైదూర్యమణి - పరీక్షా విధి


(వై'డూ'ర్యమనే మాటే తెలుగులో ఎక్కువగా వాడబడుతోంది. కాని సంస్కృత మూలం విదూర-జ, వైదూర్య)


సూతుడిలా చెప్పసాగారు, "హే శౌనకాది మహామునులారా! వైదూర్యాది ఇతర మణులను అనగా వైదూర్య, పుష్ప, రాగ, కర్కేతన, భీష్మక మణులను గూర్చి బ్రహ్మదేవుడు మా గురువు గారికి చెప్పగా ఆయన నాకాజ్ఞానాన్ని ప్రసాదించారు.


బలాసురుని యొక్క నాదం ప్రళయకాల క్షుభిత సముద్ర ఘోషవలె నున్నపుడు దాని నుండి వివిధ వర్ణాలు గల, సౌందర్య సంపన్నములైన వైదూర్యాలుద్భవించాయి. బలాసురుని నుండి పుట్టిన మణి బీజము ఉత్తుంగ శిఖరాన్ని కలిగిన విదూరమను పేరు గల పర్వతానికానుకొనియున్న కామభూతిక సీమక్షేత్రంలో పడగా అదే రత్నగర్భగా మారింది.


ఈ వైదూర్యం మహాగుణసంపన్నం మూడు లోకాలలోనూ దీనికి పేరు ప్రతిష్ఠలున్నాయి. ఈ మణుల కాంతి ఎంత ఎక్కువగా వుంటుందంటే వాటి నుండి నిప్పురవ్వలు రాలుతున్నాయేమోననిపిస్తుంది.


పృథ్విపై పద్మరాగమణి ఎన్ని వర్ణాల్లో లభిస్తోందో వైదూర్యం కూడా అన్ని వర్ణాల్లోనూ దొరుకుతోంది. వీటిలో నెమలి కంఠం రంగూ, వెదురు పత్రం రంగూ వున్నవి శ్రేష్ఠాలుగా చెప్పబడ్డాయి. చషకనామక పక్షి వర్ణంలో వున్నవి ప్రశస్తం కావు.


గుణయుక్తమైన వైదూర్యం తన యజమానికి పరమ సౌభాగ్య సంపన్నునిగా చేయగలదు. దోషయుక్తమణి తన యజమానిని కూడా దోష సంయుక్తుని గావిస్తుంది కాబట్టి ఈ మణి విషయంలో గట్టి పరీక్ష అవసరం.

కొండగాజు, శిశుపాల, గాజు, స్పటిక మణులు కూడా వైదూర్యం లాగే వుంటాయి. దాని వలెనే కాంతులను కూడా వెలారుస్తాయి. కానీ జాగ్రత్తగా పరీక్షిస్తే లేఖన సామర్థ్యం లేకపోవడం వల్ల గాజు, గురుత్వభావహీనత్వం వల్ల శిశుపాల, కాంతి భేదం వల్ల గిరిగాజు, సముజ్జ్వల వర్ణం వల్ల స్ఫటికమణీ వైదూర్యాలు కావని తేలిపోతుంది. ఎనభై రత్తీల బరువున్న ఇంద్రనీలమూ రెండు పలంల బరువున్న వైదూర్యమూ ఒకే ధర పలుకుతాయి.


కొన్ని రాళ్ళు రత్నాల కంటె అధికంగా మెరుస్తాయి కాని రత్నాలకుండే స్నిగ్ధత, మృదుత్వం లఘుత వాటికుండవు. పట్టిచూడాలే గాని ఇంకా ఎన్నో భేదాలు కనిపిస్తాయి.


మంచిమణులను సజాతీయమణులనీ, కాని వాటిని విజాతీయ మణులనీ రత్నశాస్త్ర పరిభాషలో వ్యవహరిస్తారు.


రత్నాల గూర్చి బాగా తెలిసిన వానిని ఉపయోగం ద్వారా తద్ జ్ఞానాన్ని పొందిన వానిని మణిబంధకుడు, మణివేత్త అంటారు. వారు పరిశీలించి నిష్కర్షగా సజాతీయ మణి యేదో చెప్పగలరు. అటువంటి మణి సాధారణ మణి కంటే ఆరు రెట్లు ధర పలుకుతుంది. సముద్రతీరంలో ఆవిర్భూతమైన మణులకున్న విలువ భూమి నుండి ఇతర స్థానాల్లో తీయబడిన మణులు, సజాతీయాలైనా సరే, వాటికి వుండదు.


మనువు పదహారు మాశలు ఒక 'భారం'తో సమానమని నిర్ణయించాడు. దానిలో ఏడవ భాగమొక 'సంజ్ఞ'. నాలుగు మాశలు ఒక 'శాణ'. ఒక పలంలో పదోభాగం 'ధరణం'. అయిదు 'కృష్ణలాలు' ఒక 'మాశ'


(అధ్యాయం - 73)




Sunday 12 May 2024

శ్రీ గరుడ పురాణము (173)

 


ఈ మణులలో మట్టిమరకలు, మలినాలు ఉండిపోయినవి, కరకరమని శబ్దం వచ్చేవీ, నీలాకాశాన్ని కప్పే నల్లమబ్బుల రంగున్నవి మంచివి కావు. అవి వర్ణదోషదూషితాలు. వీటి మధ్యలోనే రత్నశాస్త్ర కోవిదులు ప్రశంసలతో ముంచెత్తే ఇంద్రనీలమణులు ఎక్కువగా జన్మిస్తాయి.


పద్మరాగమణిని ధరిస్తే కలిగే సత్ఫలితాలన్నీ ఇంద్రనీలమణిని ధరించినవారికీ కలుగుతాయి. ఈ మణిలో కూడా మూడు జాతులు కనిపిస్తున్నాయి. మణి యొక్క రత్న పరీక్ష కూడా రెండింటికీ ఒక్కటే.


అగ్ని పరీక్ష మణి నిర్ధారణకి మాత్రమే చేయాలి గాని మణిని మరింత వన్నెచిన్నెలతో శోభిల్లేలా చేయడానికి అగ్నిలో పడవేయరాదు. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. సద్గుణయుక్తమైన మణి దోషదూషితమై తనను అగ్నిలో అతిగా వేయించిన వానికీ వేసినవానికీ కీడును కలిగించవచ్చు.


గాజు, కలువ, గన్నేరు, స్పటిక, వైఢూర్యాది మణులు (ఇవన్నీ మణుల్లో రకాలే) ఇంద్రనీలమణి యొక్క పోలికలతో, గుణాలతో వున్నా కూడా రత్నశాస్త్రజ్ఞులు ఇంద్రనీలమణి వైపే మొగ్గు చూపుతారు. అందుచేత వీటిని క్షుణ్ణంగా పరీక్షించాలి. ముఖ్యంగా గురుత్వ కఠినత్వాలను చూడాలి. ఇంద్రనీలమణికి మధ్యలో ఇంద్రాయుధమైన వజ్రాయుధం కనిపిస్తే ఇక దానిని మించిన రత్నమే లేదు.


ఒక ఇంద్రనీలమణిని తీసుకొని దానికి వందరెట్లు పరిమాణమున్న స్వచ్ఛమైన పాలలో పడేస్తే, ఆ పాలన్నీ నీలవర్ణంలోకి వచ్చివేస్తే అది అచ్చమైన మణి. దీనిని మహా నీలమణి అని కూడా అంటారు. ఎలాగైతే మాశాదులతో మహాగుణశాలియైన పద్మ రాగమణిని తూస్తారో అలాగే సువర్ణ పరిమాణ (ఎనభై రత్తీలు)ములతో మహా గుణశాలియైన ఇంద్రనీలమణిని తూస్తారు”.


(అధ్యాయం - 72)


Saturday 11 May 2024

శ్రీ గరుడ పురాణము (172)

 


కొన్ని మణులకు ఔషధాలతో రంగును సృష్టించి తయారు చేయడం జరుగుతుంది. సహజ వర్ణాలున్న రత్నకాంతులు పైకి ప్రసరిస్తాయి. మందులు పూయబడ్డ రత్నాలను ఆభరణాలలో వాడడం వల్ల నష్టం లేదు కాని లాభం కూడా వుండదు. సహజత్వాన్ని నిర్ధారించే ఊర్ధ్వగామి కాంతులు కూడా ఒకే ఒక ఏటవాలుగా కోణంలో కనిపిస్తాయి. అవనత దృష్టికి అసలు కనిపించవు.


శుభఫలితాల కోసం మరకతాన్ని ధరించదలచుకున్నవారు స్నానం, ఆచమనం, రక్షామంత్ర విధివత్ జపం, గో- సువర్ణ దానాలు చేసి ధరించాలి. దోషాలు లేని గుణాలు కలిగిన బంగారు త్రాటిలో దీనిని పెట్టుకొని పెట్టుకోవచ్చు. అన్ని దేవ, పితృ కర్మలలో మరిన్ని మంచి ఫలాలకై మరకత మణిని ధరిస్తారు. విషపీడితులను ఆ పీడ నుండి రక్షించే శక్తీ, సంగ్రామంలో విజయాన్ని సమకూర్చే శక్తీ ఈ రత్నానికుంటాయి.


ఇది పద్మరాగమణికంటె అధికమూల్యాన్ని కలిగి వుంటుంది. (అధ్యాయం 71)


ఇంద్రనీలమణి లక్షణాలు, పరీక్షా విధి


ఎక్కడ సింహళ దేశపు రమణులు లవలీ అనే సుగంధిత పుష్పాలతో వాటి వాసనలతో మనసును దోచే వృక్షాలనూ, పొగడలనూ తమ కరాగ్రాల స్పర్శచే కరుణిస్తుంటారో అక్కడ మహాదాత బలాసురుని వికసిత కమల సదృశ శోభలతో వెలిగే కన్నులు వచ్చి పడినవి. రత్న సమాన కాంతులీను ఆ నేత్రప్రభతో సముద్రతీరమంతా వెలుగులమయమై భాసించింది. అక్కడొక విశాలమైన క్షేత్ర మేర్పడింది. అక్కడే ఇంద్రనీలమణులకు గని కూడా ఏర్పడింది. అయితే అక్కడ అన్ని మణులూ లభిస్తాయి. ముఖ్యంగా అక్కడి మరకతమణులు అన్ని రంగుల్లోనూ వుంటాయి. - శ్రీ కృష్ణబలరాములు ధరించే పట్టుపంచెల వలె పచ్చగా, నీలంగా, నల్ల తుమ్మెద రంగులోనూ, శారంగధనుర్యుక్తమైన విష్ణు భగవానుని భుజకాంతులతో, హాలాహలధరమైన శివుని కంఠం రంగులో కూడా వుంటాయి.


ఆ సాగర తీరానికీ అక్కడ పర్వతానికీ నడుమ నున్న క్షేత్రం ఎన్నో జాతి రత్నాలకు నెలవుగా మారింది. వాటిలో కొన్ని తేట నీటి తరంగాల తెలుపుతో ప్రకాశించగా కొన్ని మయూర వర్ణంలో దర్శనమిస్తాయి. మరికొన్ని నీటి బుడగల వలె నుండగా ఇంకొన్ని కోయిల గొంతు వలె నిగనిగలాడతాయి. వీటన్నిటిలోనూ సమానమైన నిర్మలతా, ప్రభాశక్తుల భాస్కరతా బలీయంగా వుంటాయి. అయితే, ఆ పర్వత రత్నగర్భంలో దొరికే అన్ని రకాల రత్నాలలోకీ పరమశ్రేష్టము, అత్యధిక గుణశాలియైనది ఇంద్రనీలమణి.


Friday 10 May 2024

శ్రీ గరుడ పురాణము (171)

 


గరుత్మంతునిచే, వాసుకిచే వదలబడిన బలాసురాత్మీయ భాగాలలో లభించునవే ఈ నాటికీ ప్రపంచంలో అత్యుత్తమ మణులుగా నెలకొనివున్నాయి. ఇవి చాలా చోట్ల నుండే వస్తున్నాయి గాని, ఏవైనా వాసుకి వదలిన, గరుత్మాన్ కదిలిన స్థానంలోపుట్టిన మణుల తరువాతనే.


రత్న విద్యా విశారదులైన విద్వజ్జనులు ఇలా వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమలకాంతులతో మెరుస్తూ, ముట్టుకొన్నా నొక్కినా గట్టిగా తగులుతూ, మధ్యభాగంలో బంగరుపొడి వున్నట్టుగా భ్రమింపజేస్తూ, సూర్యకిరణాలు గానీ వేరే ఉత్తమ కాంతులు గానీ సోకినపుడు మొత్తం మణి పచ్చగా మెరిసినా దాని మద్య భాగం నుండి సూర్యసమాన కాంతులు ఉజ్జ్వలంగా వెలువడి తొలుతటి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతూ వుండే మరకతమణి గొప్ప ప్రభావం కలది. దానిని చూడగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించి, వేళ్ళూనుకొని మనను పరవశింపజేస్తుంది. ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఏ ఇతరమణికీ వుండదు. ఈ లక్షణాలున్న మరకత మణినే సకల సద్గుణవతిగా భావించాలి.


వర్ణం బాగా వ్యాపించడం వల్ల ఉత్తమమైన మరకతమణి అంతర్భాగం నిర్మల స్వచ్ఛకిరణాలతో కూడుకొని వుంటుంది; దాని ఉజ్జ్వలకాంతి చిక్కగా, శుభ్రంగా, కోమలంగా, స్నిగ్ధంగా వుంటుంది.


(పై లక్షణాలు, కాంతులు వుండి నీలకంఠం అంటే నెమలి కంఠం రంగులో మెత్తగా వుండే మరకతమణులు కూడా మంచివే)


చిత్రవర్ణంలో వుండి, కఠోరంగా, మలినంగా, రూక్షంగా, బండరాయిలాగా తగులుతూ శిలాజిత్తనే ఔషధంలాగా వేడిని నిర్గమింపజేస్తూ వుండే మరకతమణి దోషపూరితం. సంధి ప్రదేశంలో శుష్కంగా వుండి, మధ్యలో విరిగి మరొక మణిగా తయారైతే... అటువంటి మరకతాలను తెచ్చిపెట్టడంకాని పెట్టుకోవడం కాని చేయరాదు. భల్లాతకీ, పుత్రికాయని రెండు శైల విశేషాలున్నాయి. కొన్ని రత్నాలు వాటి రంగుల్లో గాని, వాటి కలగలుపు రంగుల్లో గాని వుంటాయి. అటువంటి మరకతమణులు మంచివి కావు. అయితే, పుత్రికా వర్ణం క్షౌమవస్త్రంతో గట్టిగా ప్రయత్నిస్తే తొలగిపోతుంది. కాని మణి చిన్నదై పోయి గాజులా సన్నగా వుంటుంది. అదీ మంచిది కాదు.


Thursday 9 May 2024

శ్రీ గరుడ పురాణము (170)

 


మరకతమణి - లక్షణాలు, పరీక్షా విధి


నాగరాజు వాసుకి బలాసురుని పిత్తాన్ని తీసుకొని ఆకాశాన్ని చీల్చేటంత వేగంతో దేవలోకం వైపు సాగి పోతుండగా అతని తలపై నున్న మణి ప్రకాశం క్రింద నున్న సముద్రంపై పడి సాగరానికి వెండి సేతువు అమరినట్లుగా కాంతులు పఱచుకొన్నాయి. సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమ్యాకాశాలను కలగుండు పఱచే వేగంతో పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడిచేశాడు.


వాసుకి భయపడిపారిపోతూ ఆ బలాసురుని పిత్తాన్ని ఒక పర్వత సానువు వద్ద నుంచి వెడలిపోయాడు. ఆ పర్వతంపై మధుర సుస్వాదజల స్రవంతులు ప్రవహిస్తున్నాయి. నవకలికలతో సాంద్రసుగంధ పరిమళాలను వెదజల్లుతున్న సౌగంధిక వృక్షాలు, ఎన్నో మాణిక్యాలు కూడా, తురుష్క దేశానికి దగ్గరల్లో నున్న ఆ పర్వతం కొండకోనల్లో కొలువున్నాయి. బలాసురుని పిత్తం ఆ నీటిలో కలసి సముద్రంలోకి ప్రస్థానించి మహాలక్ష్మి సమీపానికి* దగ్గరగా పోగా, అది ప్రయాణించిన సరిత్తుల తీరాలలో నున్న భూమి మరకతమణులకు ఖజానా అయింది.


* సముద్రం మహాలక్ష్మికి పుట్టిల్లు


వాసుకి పరుగెడుతున్నపుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకొని పానం చేశాడు. వెంటనే ఆయనకి మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం (కక్కివేయుట) చేశాడు. ఆయన రెండు నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేల పైబడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గనిగా మారింది. ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోనూ, శిరీష పుష్ప వర్ణంలోనూ, మిణుగురు పురుగు వెనుకభాగం రంగులోనూ, హరిత తృణక్షేత్రంవలెనూ, నాచురంగులోనూ, సర్పభక్షిణి నెమలి కన్నుల వన్నెలలోనూ నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తుంటాయి. ఇవి లోకకళ్యాణ కారకాలు. గరుత్మంతుని స్పర్శ వలనయోమో గాని ఇక్కడి మరకతమణులు సర్వవిషవ్యాధులనూ నశింపజేసే శక్తిని కలిగి వుంటాయి. అయితే ఇవి దుర్లభాలు; దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకూ, మరెన్నో ఔషధాలకూ లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటాపంచలై పోతాయి.


Wednesday 8 May 2024

శ్రీ గరుడ పురాణము (169)

 


మలినవర్ణం వల్ల కలాశపుర పద్మరాగాలు, అల్పతామ్ర వర్ణ కారణంగా తుంబరు దేశీయాలు, కృష్ణ వర్ణపు కలిమిచే సింహళోత్పన్నాలూ, నీలవర్ణ, కాంతి విహీనతా వ్యాజానముక్త పాణి శ్రీ పూర్ణకీయ పద్మరాగాలూ స్వల్పంగా వాసి తక్కువ మణులుగా పేర్కొనబడుతున్నాయి.


వెలితి లేని ఎఱ్ఱదనం - అంటే గుంజబీజం (గురిగింజ) తో సమానమైన రంగుండే పద్మ రాగం అత్యుత్తమం. ఇది మెత్తగా వున్నట్లు చేతికి తగిలినపుడు అనిపిస్తుంది. కాని నొక్కి చూస్తే చాలా గట్టిగా వుంటుంది. నున్నదనంలో దీనికి సాటి లేదు. దానిని ఒక వైపు చేతితో నిమురుతుంటే రెండో వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ళ మధ్య పెట్టుకొని రాపిడి చేస్తే కొంత రంగును కోల్పోయినట్లు కనిపిస్తుంది. రాపిడి తీవ్రతరమైతే రంగును కొంతవఱకు కోల్పోవచ్చు. చేతబట్టుకొని పైకెగరేసి చూస్తే సూర్యకిరణాల చిక్కదనాన్ని బట్టి పద్మరాగం రంగులు మారుస్తుంది. ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే కాని వీటిని గమనించేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకుని అభిప్రాయం తీసుకోవాలి. సాన కూడా పట్టించి చూడాలి. ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించినవాడు ఏదో సరదాగా శత్రువుల మధ్యలోకి వెళ్ళినా ఆ రత్నము వానిని రక్షిస్తుంది. అదే దోషభూయిష్టమైన రత్నమైతే స్నేహితుల మధ్యలోనున్న వాడు కూడా ఆపదల పాలౌతాడు.


ఒకచోట పుట్టిన మణులన్నీ ఒకే ప్రభావాన్ని కలిగి వుంటాయనుకోరాదు. పోలికలుంటాయి; కాని భేదాలూ వుంటాయి. కాబట్టి రత్నాలను దేనికదిగానే కలివిడిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకునికిచ్చి శోధన చేయించాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్పప్రభావం గల రత్నాలతో కలిపి నిక్షేపించరాదు.


మహాగుణ సంపన్నములైన పద్మరాగాలను ఉడద ధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చాలి. అనగా తులన, ఆకలన, చేయాలి.


(అధ్యాయం - 70)


Tuesday 7 May 2024

శ్రీ గరుడ పురాణము (168)

 


స్పటికం నుండి పుట్టిన పద్మరాగం సూర్య కిరణాలు సోకగానే ఎంత దూరం దాకానైనా అవిచ్ఛిన్నంగా అన్ని ప్రక్కలకూ తన కాంతులను విరజిమ్మగలదు. కొన్ని రత్నాల వర్ణాలు కుసుంభ నీల వర్ణాల మిశ్రితాల కలగలుపు కాంతులతో కంటికింపు గొలుపుతాయి. కొన్ని పద్మరాగాలు కొత్తగా వికసించిన కమలం వంటి శోభతో మెరుస్తాయి. కొన్ని భల్లంటక, కంటకారి పుష్ప సమానకాంతులను వెలారుస్తాయి. ఇంగువ చెట్టు పూలరంగులో కొన్ని కళకళలాడగా, మరికొన్ని చకోర, పుంస్కోకిల, సారస పక్షుల కన్నుల కాంతులతో సమాన వర్ణాలలో వెలుగును వర్షిస్తుంటాయి. మొత్తానికి స్పటికోద్భూత పద్మ రాగాలలో కూడా గుణ ప్రభావాలు ఉత్తమంగానే వుంటాయి. రావణ గంగోత్పన్న మణులతో సమానంగానే వుంటాయి.


సౌగంధిక మణుల నుండి పుట్టిన పద్మరాగ మణులు నీలకమలాల రంగులోనూ ఎఱ్ఱ కలువల వర్ణంలోనూ వుంటాయి. కురువిందాల నుండి వచ్చిన వాటికి స్పటికోద్భూత పద్మరాగాలంత కాంతి వుండదు. అధికాంశ మణులలో కాంతి అంతర్నిహితమై అనగా లోపల్లోపలే వుంటుంది. అయినా ఆ రేఖా మాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుళ్యమే మనుజులను మైమరపించగలుగుతోంది.


వర్ణాధిక్యం, గురుత, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శత, తేజస్విత, మహత్త - ఇవన్నీ శ్రేష్టమణుల యొక్క గుణాలు. మణులు గరుకుగాను, పొడిపొడిగానూ, పరుషం గానూ, అక్కడక్కడ కన్నాలు పడి, వర్ణవిహీనంగా, ప్రభాహీనంగా, కడిగినా పోని మరకలతో వుంటే అవి దోషయుక్తాలని గ్రహించి వానిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే వాటి దుష్ప్రభావం వల్ల ధరించిన వానిని శోకం, చింత, రోగం, మృత్యువు, ధననాశాది ఆపదలు చుట్టుముడతాయి.


అన్ని సద్గుణాలూ అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నతులన చేయునపుడు కలాశపురం, సింహళం, తుంబరు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగమణులెంత జాజ్జ్వల్యమానా లైనప్పటికీ రావణగంగోత్పన్న పద్మరాగాలకంటే, తలవెంట్రుకవాసైనా, వాసి తక్కువగానే భావింపబడుతున్నాయి.


Monday 6 May 2024

శ్రీ గరుడ పురాణము (167)

 


పద్మరాగమణి - లక్షణాలు - పరీక్షావిధి


దేవతలపాలిటి మహాదాతయు, జగత్తికి సర్వరత్న ప్రదాతయునగు బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకొని వెళుతుండగా వినీలాకాశమార్గంలో లంకపై నుండి పోతున్నపుడు లంకాధిపతియైన రావణుడు అడ్డగించాడు. వారి పెనగులాటలో ఆ రక్తం అలా క్రిందికి జారి లంకాదేశంలో ఒక నదిలో పడిపోయింది.


రావణగంగగా ప్రసిద్ధమైన ఆ నది బహు ప్రశస్తమైనది. అందలి జలాలు లంకలోని అద్భుత సౌందర్యవతుల నితంబాల నీడలతో నిత్య సంపర్కం గలగడం వల్లనో ఏమో గాని పరమ రమణీయాలుగా పేరు గాంచాయి. నారీరత్న సంచయసంగ్రాహకులలో రావణుని మించిన వారుండరేమో కదా! ఆ నది యొక్క రెండు తటాలూ పోకచెట్లతో సుశోభాత్ శోభితాలై వుంటాయి. ఆ నదిని అక్కడి వారు గంగతో సమాన పవిత్రంగా చూసుకుంటారు. ఉత్తమ ఫలాలనివ్వడంలో ఆ నది గంగకి తీసిపోదు.


అందులో బలాసురుని రుధిరగతాకర్షక శక్తి ఒక ఆకస్మిక ధనలాభం వలె చేరగానే ప్రతిరాత్రి రత్నాలెక్కడి నుండో వచ్చి ఆ నదీతటంపై స్థిరపడసాగినవి. వాటి యొక్క కాంతులు బంగారు బాణాల్లాగా నదిలో నుండి పైకీ వెలుపలి నుండి నదిలోకీ పరావర్తితం కాసాగినవి. ఆ నదిలో దొరికినవే పద్మరాగమణులు.


ఇవి సౌగంధికాలు కూడ. వీటిలో కురువిందజ రత్నాల, స్పటిక రత్నాల ఉత్తమ, ప్రధాన గుణాలన్నీ వుంటాయి. వాటి స్వరూపం ఎఱ్ఱటి మెరుపుతో బంధూకపుష్పం, గుంజాఫలం, జపా కుసుమం, కుంకుమ, వీరబహుటి కీటవర్ణాలు, పలాశ పుష్పవర్ణం - ఇలా లేతగా కనీ కనిపించని ఎరుపు నుండి నలుపు కలిసిన చిక్కటి రక్తవర్ణం దాకా అన్ని ఎఱ్ఱని నీడలలోనూ అనగా చాయలలోనూ వుంటుంది. సిందూరం, నీలోత్పలం, రక్త కమలం, కుంకుమపూవు, లాక్షారసం రంగుల్లోనూ పద్మరాగం వుంటుంది. ఎంత చిక్కటి రంగులో నున్నా కాంతులు వెదజల్లుతూ వుంటుంది.


Sunday 5 May 2024

శ్రీ గరుడ పురాణము (166)

 


విశుద్దత కోసం ముత్యాలను సాధారణ అన్నపుకుండలలో జంబీర రసం నింపి, అందులో వేసి ఉడికిస్తారు. తరువాత వాటి ఆకారాలను మలచి కన్నాలను కూడా వేసేస్తారు.


దీనికి ముందుగానే బాగా తడిపిన మట్టితో మత్స్య పుట పాకమును జోడించి, అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత మట్టికి బిడాల పుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత వాటిని బయటికి తీసి పాలలో గాని నీటిలో గాని, మధు రసంలోగాని వేసి మరల వేడి చేస్తే అవి నున్నగా, మృదువుగా తయారవుతాయి. మంచి మెరుపు కూడా వస్తుంది. అపుడు స్వచ్ఛమైన వస్త్రంతో ప్రతి ముత్యాన్నీ గట్టిగా తోమాలి. చెప్పులను మెరుపు కోసం గుడ్డతో రాపిడి చేసే దాని కన్న నెక్కువగా వీటిని చేయాలి. (పాలిష్) వాటి మెరుపు రెండింతలు మూడింతలుగా పెరుగుతుంది. దోషాలన్నీ పోయి, గుణవంతమై సహజంగానే వుండే ముత్యం ఈ రకమైన శుద్ధి చర్యల వల్ల మరింత నయనానందకరమై పంకిలరహితమై శోభిస్తుంది. మహానుభావుడు, దయామయుడు, లోకబాంధవుడునగు వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్యాలపై జనులకు జ్ఞానాన్ని కలిగించాడు.


ఈ విధంగా రసశోధితమైన ముత్యం శుభ, సిద్ధి కారకమైన విశ్వాసపూర్ణాలంకారమై మానవశరీరాలపై అలంకారమై శోభిస్తుంది. సూర్యకాంతి సోకిన స్వచ్చమైన గాజులాగా మెరుస్తుంటుంది. స్వర్ణజటితమై వుంటే ఆ బంగారానికే ఒక కొత్త వెలుగునూ అందాన్నీ శోభన ప్రతిపత్తినీ ఇస్తుంది. ముత్యాన్ని బాగా శోధించి మంగళకారకం చేయడంలో సింహళీయులదే సింహభాగం.


ఏదేనా ఒక ముత్యం మీద అనుమానము వస్తే దానిని స్నేహద్రవం (ముత్యానికి హాని చేయనిది) వేడిచేసి, దానిలో ఉప్పు కలపగా వచ్చిన ద్రావకంలో ఒక రాత్రంతా ఉంచివేయాలి. తెల్లవారినాక ఆ ముత్యాన్ని బయటికి తీసి పొడిగుడ్డలో చుట్టి శ్రద్ధగా మర్దన చేసినంత గట్టిగా తుడవాలి. అలా అరగంట పాటుచేసి తీసి చూస్తే ఆ ముత్యం ఏ మాత్రమూ వన్నె తగ్గకుండా నిన్నటిలాగే మెరుస్తుంటే అది మంచిముత్యమే.


ఇదివఱకు చెప్పబడిన ప్రమాణాలతో పెద్దదై, తెల్లగా, నున్నగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, తేజస్సంపన్నంగా, సుందరంగా, గుండ్రంగా వుండే ముత్యం గుణసంపన్నమని శాస్త్రం 

వచిస్తోంది. ముత్యం అమ్ముడు పోయినా, పోకున్నా ఆనందాన్నే కలిగిస్తుంది. అమ్ముకుంటే 

డబ్బులొస్తాయి. అమ్ముకోకుండా వాడుకుంటుంటే దానికి గల అతీత శక్తుల వల్ల ఐశ్వర్యానందాలు కలుగుతూనే వుంటాయి.


సర్వసులక్షణ లక్షిత జాతయైన ముత్యము ఒక మారు ఒక మనిషి పూర్వజన్మ సుకృతం కొద్దీ అతన్ని చేరిందంటే అతనిని ఏ విధంగానూ చెడిపోనీయదు, బాధపడనివ్వదు, 

అనర్ధోత్పాదక శక్తులనతని దరి చేరనివ్వదు, దోష సంపర్కం కలుగనివ్వదు. ఇదీ మంచి ముత్యము యొక్క మాహాత్మ్యము. 


(అధ్యాయం - 69)


Saturday 4 May 2024

శ్రీ గరుడ పురాణము (165)

 


మేఘంలో పుట్టే ముత్యాలు భూగోళం దాకా రానే రావు. ఖేచరులైన దేవతలే వాటిని ఒడిసి పట్టేసుకుంటారు. ఆ ముత్యాలకి దిక్కుల మూలల్లోని చీకట్లను కూడా పారద్రోలి అంతవఱకు మనకి కనిపించని చీకటి కోణాలని ఆవిష్కరించేటంత తేజస్సుంటుంది. సూర్య సమాన కాంతులతో ప్రకాశించే ఆ ముత్యం ఆకారం కూడా స్పష్టంగా ఆ వెలుగులో కనిపించడం కష్టం. ఈ మేఘమణి సర్వజన సామాన్యానికీ సమస్త శుభదాయకం. ఈ మణి వున్న చోటి నుండి నలుదిక్కులూ సహస్రయోజనాల దాకా విస్తరించిన క్షేత్రంలో ఏ అనర్థమూ జరగదు.


దైత్యరాజు, మహాదాని బలాసురుని ముఖము నుండి రాలినదంత పంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ విచిత్ర వివిధ వర్ణకాంతులను వెలారుస్తూ అలా అలా సముద్రంలో పడింది. ఈ సముద్రం అప్పటికే అశేష జలరాశికే గాక అమూల్య రత్న సంపత్ ప్రపంచాధిపతి. సోముని యొక్క షోడశ కళలతో నిండిన వెలుగులను, కాంతిని, శాంతిని తలదన్నే రత్నాలకు ఆకారము ఆ చంద్రునికే పుట్టినిల్లు, రత్నగర్భయైన సముద్రము. సముద్రమే మహాగుణ సంపన్నాలైన సర్వరత్ననిధానము. అందులో పడిన బలాసురుని పలువరస ఒక కొత్త అమూల్య సంపదకు తెరతీసింది. ముత్యపు చిప్పగా అనంతర కాలంలో ప్రసిద్ధికెక్కిన శుక్తులలో ఈ పలువరుస వంశాభివృద్ధి జరుగుతోంది. ఈ ముత్యాలే సర్వశ్రేష్ఠములై మానవజాతిని సముద్దరిస్తున్నవి. సాగర తీర దేశాలు, ద్వీపాలునైన సౌరాష్ట్ర, పరలోక, తామ్రపర్ణ, పారశవ, కుబేర, పాండ్య, హాటక, హేమక, సింహళ ప్రాంతాలు ముత్యాలకు కోశాగారాలు (ఖజానాలు)గా పరిణతిచెందాయి.


ముత్యమెక్కడ పుట్టినా ముత్యమే. ఇది సర్వత్ర సర్వాకృతులలోనూ లభిస్తుంది. పురాణ కాలంలో ఒక ముక్తాఫలం విలువ ఒక వేయీ మూడు వందల అయిదు ముద్రలు. అరతులం బరువున్న ముత్యం పైన చెప్పిన ధరలో అయిదింట రెండవ భాగము (2/5) తక్కువ. మూడు మాశలు అధికంగా బరువుండే ముత్యము. రెండువేల ముద్రలు. అనంతర కాలంలో విలువలు ఈ దిగువ కలవు.


(ఈ ధరవరుల పట్టిక క్రిందటి శతాబ్దిది. విష్ణువు గాని సూతుడు గాని చెప్పినది కాదు)


పూర్తిగా పెరిగిన పెద్ద పరిమాణంలో వున్న చిప్ప నుండి వచ్చిన ముత్యం పదమూడు వందల బంగారు కాసుల (సావెరిన్ల) ధర పలుకుతుంది. ఆరు బియ్యపు గింజల బరువున్నది 460 కాసులు చేస్తుంది. అత్యుత్తమ స్థాయికి చెంది, తొమ్మిది గింజల బరువున్న ముత్యం ధర రెండు వేల కాసులుంటుంది. రెండున్నర గింజల బరువున్నది 1300 కాసులు, రెండు గింజల బరువున్నది 800 కాసుల విలువ చేస్తాయి. అరగింజ బరువే వుండి మూడువందల కాసుల ఖరీదు చేసే ముత్యాలు కూడా వున్నాయి. ఉత్తమస్థాయికి చెంది, 720 మిల్లిగ్రాముల బరువుండే ముత్యం వెల రెండు వందల కాసులు. ద్రావిక అను పేరు గల శ్రేష్ట ముత్యమొకటుంది. దీని బరువు 50 మిల్లి గ్రాములు వెల 110 కాసులు. భావకమను పేరు గల ముత్యం 35 మిల్లిగ్రాములు, ధర 97 కాసులు. శిక్య అని చిన్న ముత్యాలుంటాయి. అవైతే ఒక్కొక్కటి పాతిక మిల్లిగ్రాముల బరువు, 40 కాసుల ధర. సోమ ముత్యము 15 మిల్లిగ్రాములు, 20 కాసులు. అలాగే కుప్యా అనే రకానికి చెందిన ముత్యం 8 లేక 9 మిల్లిగ్రాముల బరువుండి తొమ్మిది లేదా పదకొండు కాసుల ధర పలుకుతుంది. (కాసులనగా బంగారుకాసులైన సావెరిన్లే)


Friday 3 May 2024

శ్రీ గరుడ పురాణము (164)

 


వెదురు, ఏనుగు, చేప, శంఖం, వరాహాల నుండి వచ్చే ముత్యాలు మంగళకరమైన కార్యాలకు ప్రశస్తములని చెప్పబడింది. రత్ననిర్ణాయక విద్వాంసులు ఎనిమిది రకాల ముత్యాలను పేర్కొంటూ వాటిలో శంఖ, హస్తి ప్రభూతాలు అధమాలని వచించారు.


శంఖం నుండి పుట్టిన ముత్యం ఆ శంఖము యొక్క మధ్యభాగం రంగులోనే వుండి బృహల్లోల ఫలం పరిమాణంలో వుంటుంది. ఏనుగు కుంభస్థలం నుండి వచ్చే ముత్యం పసుపురంగులో వుంటుంది. వీటి ప్రభావం ఏమీ వుండదు. చేప నుండి పుట్టే ముత్యాలు ఆ చేపపై భాగం రంగులోనే వుంటాయి. అందంగా, గుండ్రంగా, చిన్నవిగా ఉంటాయి. సముద్రంలోనే ఎక్కువ భాగం జీవించే చేప యొక్క వదన భాగం ఈ ముత్యాల జనకస్థానం.


వరాహం నుండి వచ్చే ముత్యాలు ఆ వరాహం దంత మూలాల రంగులోనే వుంటాయి. అయితే ఈ వరాహాలు మనకెప్పుడూ దర్శనమిచ్చే నల్ల ఊరపందులు కావు. ముక్తాజనకమైనది ఎక్కడో ఎప్పుడో అరుదుగా దొరికే శ్వేతవరాహరాజము.


వెదురు కణుపుల నుండి పుట్టే ముత్యాలు వడగళ్ళలాగ స్వచ్ఛ సముజ్జ్వల తెలుపు మెరుపుల కాంతులతో శోభాయమానంగా వుంటాయి. ఈ ముత్యాలకు జన్మనిచ్చే వెదుళ్ళు ఎక్కడో దివ్య, జనులను సేవించుకోవడానికి వారున్నచోటనే పుడతాయి గాని సామాన్యులకు దొరకవు.


సర్పముత్యాలు కూడా చేప ముత్యాల వలెనే విశుద్ధంగా వృత్తాకారంలో వుంటాయి. కత్తుల చివరల కాంతుల వలె అద్భుతంగా మెరుస్తాయి. పాము పడగలపై, అదీ అత్యున్నత జాతి నాగుల వద్దనే, దొరికే ఈ ముత్యానికి గొప్ప శక్తి వుంటుంది. దీనిని ధరించేవాడు అతిశయ ప్రభాసంపన్నుడై, రాజ్యలక్ష్మీయుక్తుడై, దుస్సాధ్యమైన ఐశ్వర్యానికధిపతియై తేజస్విగా, పుణ్యవంతునిగా వెలుగొందుతాడు.


ఈ ముత్యాన్ని రత్నశాస్త్రంపై ప్రపంచంలోనే సంపూర్ణ అధికారమున్న విద్వాంసుని చేత పరీక్ష చేయించి ఆయన తలయూచిన పిమ్మట శుభముహూర్తంలో నొక సమస్త విధి పూర్వక సంపన్నమైన భవనంపై స్థాపిస్తే ఆకాశం నుండి దేవదుందుభి ధ్వని వినిపిస్తుంది. దేవతల సంతోషం, ఆశీర్వాదం స్పష్టంగా తెలుస్తాయి. ఎవని కోశాగారంలోనైతే ఈ సర్ప ముత్యంవుంటుందో వానికి సర్ప, రాక్షస, వ్యాధి, ప్రయోగాల ద్వారా మృత్యు భయముండదు.


Thursday 2 May 2024

శ్రీ గరుడ పురాణము (163)


 

పుష్పరాగాది జాతిరత్నాలు ఇతర జాతిరత్నాలపై గీతను గీయగలవు. కాని హీరకము, కురువిందము (మాణిక్యం) తమ జాతి రత్నాలనే గీయగలవు.


వజ్రాన్ని వజ్రమే కోయగలదు. స్వాభావిక వజ్రానికి మాత్రమే తన కాంతులను పైపైకి అనగా ఆకాశదిశగా ప్రసరింపజేసే శక్తి వుంటుంది.


ఇంద్రాయుధ చిహ్నంకితములైన వజ్రాలు కొన్ని అరుదుగా వుంటాయి. వీటిపై ఆ గుర్తు స్పష్టంగానే కనిపిస్తుంటుంది. కేవలం ఇవి మాత్రమే... కోణాల వద్ద విరిగినా, బిందు, రేఖా చిహ్నదూషితాలైనా తమ శ్రేష్టతను పూజ్యతను నిలబెట్టుకొనే వుంటాయి. అనగా వీటిని ధరిస్తే నష్టం జరుగకపోగా ఉద్దిష్ట ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి.


మెరుపుతీగలలోని కాంతితో సముజ్జ్వలంగా వెలుగులను విరజిమ్మే వజ్రాలను ధరించే రాజు అతిశయ ప్రతాపవంతుడై జగదేకవీరుడై విలసిల్లగలడు. సమస్త సంతానాలతో వర్ధిల్లుతూ పెద్ద కాలముపాటు పుడమి నేలగలడు. (అధ్యాయం - 68)


ముత్యాలు - వాటిలో రకాలు లక్షణాలు - పరీక్షణ విధి


శ్రేష్ఠమైన ఏనుగు, మేఘం, వరాహం, శంఖం, చేప, పాము, వెదురు - వీటన్నిటి నుండీ ముత్యాలు వస్తాయి. అయినా శుక్తి అనగా ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే జగత్ప్రసిద్ధాలు.


రత్నమనిపించుకొనే స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికుంటుందని ముక్తాశాస్త్రం ఇది వివరిస్తోంది. అది ముత్యపు చిప్పలోనేపుడుతుంది. ఇదే సూదితో పొడిస్తే కన్నం పడుతుంది. మిగతావి పడవు.