Friday, 31 March 2023

శ్రీదత్త పురాణము (95)

 


విరాగి, జ్ఞాని అనేవి కూడా పూర్ణ అర్ధంలో ఒక్కటే. ఈ విరాగి ప్రారబ్దాలను అనుభవిస్తూ, నిష్కామర్మ కర్మలు చేస్తూ క్రమంగా ముక్తిపొందుతాడు. అతడికి మరింక పునర్జన్మ లేదు. సకామంగా కర్మల్ని ఆచరిస్తే అనుభవించటానికి మళ్ళీ, మళ్ళీ పుట్టవలసిందే. ఫలానుభవం ఆశిస్తే కర్మలు నశింపవు. అందుకనే ఈ కర్మబంధాలు జన్మపరంపరను కలిగిస్తాయి. నిష్కామ కర్మాచరణమొక్కటే దీనికి తరుణోపాయం. అప్పుడు కర్మబంధాలు ఉండవు. 


జన్మ పరంపరలు ఉండవు. ఇది జన్మరాహిత్యప్రదమైన జ్ఞానమార్గం. ఇక యోగమార్గం చెబుతాను శ్రద్ధగా విను.


యోగమార్గంలో ప్రయాణించాలి అంటే ముందుగా మనస్సునూ ఇంద్రియాలను జయించాలి. ఇది అంత తేలిక కాదు. దృఢ నిశ్చయం తీవ్ర ప్రయత్నం నిరంతర సాధన ఉండాలి. ముందుగా ప్రాణాయామాన్ని అభ్యసించాలి. దీనితో శరీరంలోని కఫాది దోషాలన్నీ నశిస్తాయి. రెండవది - ధారణ - దీని వల్ల మనస్సులోని కిల్బిషాలన్నీ తొలగిపోతాయి. దాని తర్వాత ప్రత్యాహారం దీనితో ఇంద్రియ సంసర్గ దోషాలన్నీ నశిస్తాయి. ధ్యానం మూడవది. ఇది అనీశ్వర గుణాలను తొలగిస్తుంది. అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. రాగి, బంగారంలాంటి లోహాలను కొలిమిలో కాలిస్తే వాటిలోని దోషాలు పోయి శుద్ధి అయినట్లు ఈ ప్రాణాయామం వల్ల ఇంద్రియాలు పరిశుభ్రమవుతాయి. ప్రాణాయామము అంటే ప్రాణాపాన నిరోధం. ఇది లఘువు - మధ్యమం - ఉత్తమం అని మూడు విధాలు. ఇక్కడ కాలప్రమాణం గురించి నీవు తెలుసుకోవాలి. ఇక లఘువును ఉచ్ఛరించటానికి పట్టేకాలాన్ని లేదా కనురెప్ప మూసి తెరవటానికి పట్టే కాలాన్ని ఒక "మాత్ర" - అంటారు. పన్నెండు మాత్రల సేపు ప్రాణవాయువును నిరోధిస్తే దాన్ని లఘు ప్రాణాయామం అంటారు. దీని వల్ల స్వేదదోషం నశిస్తుంది. ఇరవై నాలుగు మాత్రలకాలం చేస్తే దాన్ని మధ్యమప్రాణాయామం అంటారు. దీనివల్ల వణుకు రోగం తగ్గుతుంది. ముప్పది ఆరు మాత్రలకాలం ప్రాణాయామం చేస్తే దాన్ని ఉత్తమం అంటారు. దీనితో విషాదదోషం అంతరిస్తుంది. ప్రాణవాయువును ఇంతంతసేపు నిరోధించటం సాధ్యమా అని విస్తుపోవద్దు. మహా మహా క్రూర జంతువులే మనిషికి మచ్చిక అవుతున్నాయి. చెప్పినట్టు వింటున్నాయి. అలాగే సాధన వల్ల ప్రాణవాయువు, మహాయోగికి చెప్పుచేతల్లో వుంటుంది. ప్రారంభంలో మావటివాడులాగా దానికి మనం లొంగి వుంటాం. ఆపైన ఆ ఏనుగు మనకు లొంగివస్తుంది.


Thursday, 30 March 2023

శ్రీదత్త పురాణము (94)

 


సంసార మహాయాత్రలో అలిసిపోయి భ్రాంతచిత్తులై దీని నీడకు చేరినవారికి సుఖమనేది ఎలా లభిస్తుంది చెప్పు? సత్సంగం అనే రాయి మీద బాగా పదును బెట్టిన జ్ఞానఖడ్గంతో ఈ మమతా మహాతరువుని నరికి వెయ్యగలిగిన వారికి ఆత్మమార్గం కనిపిస్తుంది. వారు ఆ దారిన ప్రయాణించి శాంతమూ నీరజస్కమూ నిష్కంటకమూ అయిన బ్రహ్మవనాన్ని చేరుకుంటారు. అప్పుడు అక్కడ పునరావృత్తి వర్జితమైన నివృత్తిని పరాప్రజ్ఞను అందుకుంటారు. పంచభూతాలతో పంచేద్రియాలతో నిర్మితమైన ఈ స్థూలశరీరం నువ్వు కావు. నేనూ కాను, పంచతన్మాత్రికాధికంతో ఏర్పడిన సూక్ష్మశరీరం నువ్వు కావు, నేను కాను.


రాజా! గుణాత్మకమూ సంఘాత రూపమూ అయిన ఈ దేహంతో ప్రధానుణ్ని దర్శించగలుగుతున్నావా?


మేడిపండు, మశకమూ, నీరు, చేప, నిషీకమూ ముంజుగడ్డి (ధర్భ) వీటి సంబంధం లాంటిదే క్షేత్ర ఆత్మల సంబంధం.


వీటి లోతును తెలుసుకున్నావు సంతోషం.


అలర్కుడికి దుఃఖం తొలగిపోయింది. కానీ మళ్ళీ అదే విషయాలు - రాజ్యమూ . రాజభోగాలూ ఆక్రమణలూ యుద్ధాలూ జ్ఞాపకం వస్తున్నాయి. దుఃఖం తొలగినట్టే తొలగి మళ్ళీ వచ్చి ఆవరిస్తోంది. శాశ్వతంగా దుఃఖాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. దత్తాత్రేయుల వారిని ప్రశ్నించాడు.


దత్తదేవా! నీ దయ వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. ప్రకృతి-పురుష వివేకం కలిగింది. నేను అంటే ఏమిటో తెలిసింది. దుఃఖం అంతరించింది. కానీ ఈ స్థితి స్థిరంగా ఉండేట్టు కనిపించటం లేదు. మళ్ళీ అజ్ఞానం ఆవరించి దుఃఖానుభవం తొంగి చూస్తోంది. దుఃఖరహితస్థితిని స్థిరపరచుకొనే ఉపాయం చెప్పు. ప్రకృతి బంధాన్ని శాశ్వతంగా తెంచుకోవటం ఎలాగో ఉపదేశించు. పునర్భవం లేకుండా నిర్గుణ పరబ్రహ్మంతో శాశ్వతంగా ఐక్యం మార్గం పొందే చూపించు. నువ్వు తప్ప నాకు శరణ్యులు లేదు. అనుగ్రహించు. అలర్కుడి ప్రార్థనను దత్తుడు మన్నించాడు. అతడిలో భక్తినీ, ఆర్తిని గుర్తించి అతి రహస్యమైన యోగవిద్యను ఇలా ఉపదేశించాడు.


అలర్క నృపాలా! నీ జిజ్ఞాసకు ఆనందించి ఈ రహస్య విద్యను ఉపదేశిస్తున్నాను. శ్రద్ధగా గ్రహించు. ప్రకృతి పురుషులు వేరు వేరని తెలుసుకున్నావు గదా! పురుషుడు ఆ ప్రకృతి గుణాలతో కలిసిపోకుండా బ్రహ్మపదార్థంతో కలవటమే ముక్తి అంటే.

ఈ శరీరం తుచ్చమూ, నశ్వరమూ అయినా, ఇది పూర్తిగా తిరస్కరింపతగినది, త్యజింపదగినది కాదు. దీని వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధర్మసాధనకు, కర్మసాధనకు మూలం ఇదే. ఈ శరీరంతోనే స్థిరమైన వివేకాన్ని సంపాదించుకోవాలి. అవివేకం వల్ల మమకారం, మమకారం వల్ల సంగం, సంగం వల్ల దుఃఖం కలుగుతున్నాయి. కనుక సంగాన్ని వదులుకోవాలి. అప్పుడే యోగసిద్ధి కలుగుతుంది. అదే ముక్తి అంటే. వీటిని తొలగించుకుంటూ వెళ్తూ సంగం వదిలించుకుంటే మమకారం నశిస్తుంది. మమకారం నశిస్తే వైరాగ్యం ఉదయిస్తుంది. ఇది ఉదయించగానే సృష్టిలో ఉన్న సమస్త పదార్థాలలో దోషాలు కనిపిస్తాయి. దోషాలు కనిపించినపుడు ఆ పదార్థాల మీద అనురాగం కలుగుతుందా? కలుగదు. అందుచేతనే జ్ఞానికి ఉన్న చోటనే ఇల్లు. తిన్నదే భోజనం. దేని మీద మమకారం ఉండదు. అభిలాష ఉండదు. ఈ కొంచెం (దినుసు) వైరాగ్యాన్నే జ్ఞానం అంటారు. ఇదే మోక్ష సాధనం. తక్కినదంతా అజ్ఞానం. జ్ఞానము, వైరాగ్యము పరస్పర పోషకాలు. 

Wednesday, 29 March 2023

శ్రీదత్త పురాణము (93)

 


అలర్కుడికి జ్ఞానోదయమయ్యింది. చిటికెలో దుఃఖం తొలగిపోయింది. దత్తాత్రేయులవారికి మళ్ళీ సాష్టాంగపడ్డాడు. సవినయంగా విన్నవించాడు. దత్తదేవా సమదృష్టితో ఆలోచించాను. తెలిసిపోయింది నాకు దుఃఖమన్నదే లేదు. అజ్ఞానం వల్ల ఇంతకాలమూ దుఃఖార్లవంతో త్రెళ్ళుతున్నాను. ఇప్పుడు తేలికపడ్డాను. దుఃఖకారణం తెలిసిపోయింది. 

మమకారమొక్కటే దుఃఖహేతువు. ఏకైక హేతువు. ఏయే వస్తువుల పట్ల మమత్వం పెంచుకుంటామో అదల్లా చివరికి దుఃఖమే మిగులుస్తుంది. ఒక పిల్లి మన పెంపుడుకోడిని చంపేస్తే మనకు దుఃఖం వస్తుంది. అదే పిల్లి ఏ ఎలకనో, పిచికనో భక్షిస్తే, మనకేమీ అనిపించదు. దానికి కారణం? కోడిని పెంచి దాని మీద మమకారం పెంచుకోవటం, ఎలుక మీదా, పిచుక మీదా అలా పెంచుకోకపోవటం.


నేను ప్రకృతి కంటే పరుణ్ని. కనుక నేను సుఖినీ కాదు. దుఃఖినీ కాదు. పంచభూతాల చేతనే పంచభూతాలకూ సుఖదుఃఖాలు కలుగుతున్నాయి. వాటికి అతీతుడనైన నాకు అవి రెండు లేవు. ఈ మాటలకు దత్తాత్రేయుడు సంతోషించాడు. అలర్కభూపతీ, నువ్వున్నది ముమ్మాటికీ సత్యం. “మమ" అనేది దుఃఖానికి మూలం. “న మమ" అనేది పరమసుఖానికి హేతువు.


నేను వేసిన ఒక చిన్నప్రశ్నతోనే నీకు ఇంతటి జ్ఞానం ఉదయించింది. క్షణంతో మమకారాన్ని దూదిపింజలా ఎగరగొట్టగలిగావు. ఇంక నీకు నేను ఉపదేశించవలసింది ఏముంది? నీ దుఃఖాన్ని నువ్వే తొలగించుకున్నావు. మహారాజా! మానవుల మనస్సుల్లో ఒక మహాతరువుంది. దానికి 'అహమ్' అనేది బీజం. "మమ" అనేది కాండం. ఇల్లు వాకిలీ పొలమూ పుట్రా అన్నవి శాఖోపశాఖలు. భార్యాపుత్రాదులు చిగుళ్ళు. ధనధాన్యాలు ఆకులు. అన్ని ఋతువుల్లోనూ వాకిలీ ఎళ్ళవేళలా ఎదిగే వృక్షమిది. పాపపుణ్యాలు దీని పువ్వులు. విచికిత్సలు తుమ్మెదలు. సుఖదుఃఖాలు దీని ఫలాలు, మోక్షమార్గానికి అడ్డంగా ఎదిగే మహావృక్షమిది. మూఢులు దీని నీడకు చేరతారు. దీన్ని పెంచి పోషిస్తారు.


Tuesday, 28 March 2023

శ్రీదత్త పురాణము (92)

 


అలర్కుడికి దత్తుడు ఉపదేశించిన యోగమార్గం దర్శనం -


దత్తాత్రేయుడు కరుణించాడు. రాజా! నీ దుఃఖాన్ని ఇప్పుడే తొలగిస్తాను. నిజం చెప్పు. నీకసలు ఈ దుఃఖం ఎందువల్ల కలిగింది? నువ్వు ఎవరివి? ఈ దుఃఖం ఎవరిది? 'నువ్వు' అంటే ఈ అవయవాలా? వీటి సంపుటియైన దేహమా? లేక అందులో దాగి ఉన్న ఆత్మయా? వీటిలో ఏది నువ్వు? ఈ దుఃఖం ఎవరిది? ఇది కొంచెం ఆలోచించి చెప్పు, దుఃఖం ఎవరిదో దుఃఖకారణమేమిటో, దుఃఖం ఎక్కడ ఉన్నదో తెలిశాక దాన్ని తొలగించటం ఏ పాటి చిటికెలో పని.


అలర్కుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే నేనెవణ్ని? నేను అంటే అవయవాలా? దేహమా? ఇవి రెండూ జడపదార్థాలుగదా! అవి "నేను" అని ఎలా అనుకుంటాము? అలా అనుకునేదేదో తెలిస్తే అదే దుఃఖానికి స్థానమవుతుంది. నేను అంటే శరీరం కాదు. అది పంచభూతాలతో నిర్మితమయ్యింది. కనుక నేను అనేది పంచభూతాలలో ఏ ఒక్కటీకాదు. మొత్తం వీటి కలయిక అయిన ఈ దేహాన్ని నేనుగా భ్రమపడుతున్నాను. ఈ భ్రాంతి వల్లనే సుఖదుఃఖాలు రెండూ కలుగుతున్నాయి. దీనికి సంభవించే సుఖదుఃఖాలకూ, ఈ దేహానికి అతీతుడనైన నాకూ ఏమిటి సంబంధం? నేను నవ్వడమేమిటి. నేను ఎడ్వడమేమిటి? నేను నిరంజనుణ్ని, నేను నిస్సంగుణ్ని. నేను నిత్యుణ్ని. నేను నిర్మలుణ్ని. ఎక్కువలూ, తక్కువలూ, పడటాలూ, లేవడాలు నాకు లేవు. మరి నాకు దుఃఖమేమిటి సుఖమేమిటి? ఏదీ లేదు.


ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలూ, ఐదు ప్రాణాలు, మనస్సు, అహంకారమూ అనే ఈ పదిహేడు తత్వాలతో కూడిన సూక్ష్మశరీరం ఒకటి ఉంది. ఈ రెండింటికి అతీతంగా నిలబడి వాటిని విడివిడిగా చూడగల్గుతున్న నాకు సుఖమేమిటి? దుఃఖమేమిటి? అంతా వట్టి భ్రాంతిగాక.


సుఖదుఃఖాలకు ఉనికి పట్టు మనస్సు. కనుక అవిదానివే తప్ప నావికాదు. నాకు వాటితో ఏ సంబంధమూ లేదు. నేను మనస్సును కాదుగదా! బుద్ధినీకాను. అహంకారమునూ కాను. స్థూలసూక్ష్మ శరీరాలు రెండూ కాను. వీటికి అతీతుణ్ని, వీటికన్నా విలక్షణుణ్ని. నాకు అత్యంత సమీపంలో ఉండి భ్రాంతి మూలకమే అయినప్పటికీ ఏదో కొంత సంబంధమే ఉన్న ఈ శరీరమే నేను కానప్పుడు, దీనికున్న అంతర్బహిరవయవాలలో ఏదీ నేను కానప్పుడు, ఎక్కడో దూరంగా ఏ సంబంధమ లేకుండా ఉన్న చతురంగ బలాలూ, కోశాగారాలూ, అంతఃపురాలూ, సింహాసనాలు - ఇవి "నేను" ఎలా అవుతాయి? వాటికీ నాకు సంబంధం ఏమిటి? అంతా భ్రమ. నాకు ఏమీ లేవు. రాజ్యం లేదు. కోశం లేదు. శత్రువు లేడు. మిత్రుడు లేడు. ఒక్కటే ఆకాశం అనేక పాత్రలలో విభిన్న రూపాలతో కన్పిస్తున్నట్టు ఒక్కటే ఆత్మ-ఉపాధి భేదాలను బట్టి అనేకంగా కనబడుతోంది. ఆలోచించి చూస్తే అందరిలోనూ ఉన్నది ఒక్కటే ఆత్మ, సుబాహువులో, కాశీపతిలో, ఈ ఆలర్కుడిలో ఉన్న 'నేను' అనబడే పదార్థం ఒక్కటే. మరి మేము ముగ్గురం విభిన్నులం ఎలా అవుతాం? ఉపాధులు వేరు. ఆ ఉపాధి 'నేను' కాదు. నేనైనది ముగ్గురిలోనూ ఒక్కటే. అంచేత మాకు శత్రుత్వమేమిటి? మిత్రత్వమేమిటి? అంతా ఒక్కటే ఆత్మ! పరమాత్మ! లేదు. 


Monday, 27 March 2023

శ్రీదత్త పురాణము (91)


 

సుబాహువు వెంటనే కాశీరాజును కలుసుకున్నాడు. మదాలసాకువల యశ్వులకు మేము నలుగురు పుత్రులం. పై ముగ్గుర్నీ కాదని నాల్గవవాడు అలర్కుడు రాజ్యం కాజేశాడని ఇది అన్యాయం కనుక నువ్వు దండెత్తి అతణ్ని ఓడించి రాజ్యద్రుష్ణుడ్ని చేసి తమ రాజ్యం తమకు అప్పగించమని వేడుకున్నాడు. కాశీరాజు ముందే దండయాత్రకు అంగీకరించలేదు. ముందుగా యోగ్యుడైన దూతను పంపాడు. సహజంగానే అలర్కుడు అహంకారంతో కాశీరాజు ప్రతిపాదనను తిరస్కరించాడు. సుబాహువునే స్వయంగా వచ్చి అర్థించమనండి మంచిగా అడిగితే ఇస్తాను. అంతేగానీ శత్రువులను ఆశ్రయించి ఇలా దూతలను పంపిస్తే మాత్రం బెదిరింపులకు లొంగను అని సమాధానం పంపాడు. సుబాహువు తన అభిమానం దెబ్బతిన్నట్లుగా నటించాడు. కాశీరాజును మాటలతో ఎగత్రోశాడు. మీరు పంపిన సందేశాన్ని తిరస్కరించటం అంటే మిమ్మల్ని తిరస్కరించటమే సమర్థుడైన క్షత్రియుడు తిరస్కారాలను భరిస్తాడా?


వెళ్ళి యాచిస్తాడా? ఇంకదండోపాయ మొక్కటే మార్గం అన్నాడు. కాశీరాజు అవునని సర్వసేనాసమేతుడై అలర్కుడిపై దండెత్తాడు. గిరిదుర్గాలను, వనదుర్గాలను ఆక్రమించుకుని ఆటవికరాజులను లోబరుచుకుని అలర్కుడి సామంతులను తొలగించి తన వారికి అప్పగించి ఇలా ఒక పథకం ప్రకారం అలర్కుడి రాజ్యాన్ని అన్నివైపుల నుండీ ఆక్రమించాడు కాశీరాజు. అలర్కుడి యొక్క ప్రతిఘటనలు, ప్రయత్నాలు ఫలించలేదు. దైవమే అనుకూలించనప్పుడు అన్నీ ఎదురుదెబ్బలే. అన్ని అపజయాలే. వృధాగా అహంకరించటం తప్ప మానవమాత్రుడు ఏ పాటి. అలర్కుడిలో భరింపరాని విషాదం అలుముకుంది. అలనాడు తల్లి ఇచ్చిన ఉంగరం గుర్తుకు వచ్చింది. భరింపరాని దుఃఖం కలిగినప్పుడు అది తెరిచి అందులో వున్న శాసనాన్ని చదవమంది తల్లి మదాలస. త్వరత్వరగా స్నానం చేసి శుచిగా ఆ వుంగరం విప్పిచూశాడు. అందులో చిన్న బంగారురేకు వుంది. మెల్లగా పైకితీశాడు. కళ్ళకి అద్దుకున్నాడు. ఆ రేకు మీద సన్నటి అక్షరాల్లో రెండు శ్లోకాలు వున్నాయి.


1.శ్లో: సంగసర్వాత్మనా త్యాజ్య: సుచేత్ త్యక్తుం న శక్యతే || 

స సబ్దిసృహ కర్తవ్యః సద్భిస్సంగోః స భేషజమ్ |


2.శ్లో: కామస్సర్వాత్మనా హేయః హాతుం చేత్ శక్యతే న సః॥ 

ముముక్షాం ప్రతి కర్తవ్యో సాపై తస్యాసి భీషణమ్ | 

విడువవలయు విడువవలయు సంగమ్ము విడువవలయు 

విడువలేని ఎడల వలయు సత్సంగ మొనరింపవలయు 

సతనము సంగ రోగౌషధము సత్సంగ మిలలో-

విడువవలయు విడువవలయు కామమ్ము విడువవలయు

విడువలేని ఎడల మోక్షకామమునెప్పుడు కోరవలయు

కామరోగౌషధమ్ము మోక్షకామమ్ము ఇలలో.


దేనితోనూ సంగం పనికిరాదు. దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. విడవడం సాధ్యం కాకపోతే దాన్ని సత్సంగంగా మలుచుకోవాలి. సజ్జనులతో సాంగత్యం పెంచుకుంటే అదే సంగవిముక్తికి మహాఔషధం. అలాగే కామమనేది అన్ని విధాల ప్రమాదకరమైనది. దాన్ని కూడా వదిలించుకోవాలి. అది శక్యంకాకపోతే దాన్ని మోక్షం వైపుకి మళ్ళించాలి. ముక్తి కాముకుడు కావాలి. కామత్యాగానికి ఇదొక్కటే సరియైన మందు. ఈ రెండు శ్లోకాలు పదాలు పదే పదే ఉచ్ఛరించాడు. భావం హృదయానికెక్కింది. ముక్తికామమే ఉత్తమోమమని విశ్చయించుకున్నాడు. దాన్ని సాధించాలంటే సత్సంగం. మొదటి మెట్టు అని గ్రహించాడు. సాధు సజ్జనుల కోసం ఆలోచించాడు. దత్తాత్రేయుడు గుర్తుకి వచ్చాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సహ్యాద్రికి బయలుదేరాడు. దత్తుణ్ని దర్శించాడు. పాదాలపై బడి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా నిన్ను శరణు వేడుతున్నాను. నీవేదిక్కు కరుణించు. దుఃఖార్తుడనై వచ్చాను. దయచేసి నా దుఃఖం తొలగించు - అని దీనాతిదీనంగా ప్రార్థించాడు.


Sunday, 26 March 2023

శ్రీదత్త పురాణము (90)



తనకు చేదోడు వాదోడుగా నిలుస్తూ సహకరిస్తున్న వేళ అలర్కుడి బుద్ధి కుశలతనూ, ధర్మ నిష్టనూ, కార్య నిర్వహణ దక్షతనూ గ్రహించి సంతృప్తి చెందాడు. రాజ్యభారం కొడుకు భుజాల మీద పెట్టవచ్చునని నిశ్చయించుకొని ఒక మంచి సుముహుర్తాన రాజ్య పట్టాభిషేకం జరిపించాడు. సింహాసనం అప్పగించాడు. మదాలసా సమేతుడై తాను వానప్రస్థానికి బయలుదేరాడు. మదాలస అలర్కుడ్ని ప్రేమగా దగ్గరకు తీసికొని మృదువుగా చివరి మాటగా కామోపభోగ ప్రక్షాళనకరమైన హితవు చెప్పింది. నాయనా నీవు గృహస్థ ధర్మంలో వున్నావు. రాజ్యభారాన్ని భుజాల మీదకు ఎత్తుకున్నావు. ఇవి రెండూ దుఃఖహేతువులే. మమకారాలకు బానిసయైన గృహస్థు తనకు తానే దుఃఖం కొనితెచ్చుకుంటున్నాడు. అందుచేత నీకు ఎప్పుడైనా భరింపలేని దుఃఖం కలిగితే అప్పుడు మాత్రమే, ఇదిగో నేను ఇస్తున్న ఈ ఉంగరం ముద్రను విప్పి అందులో బంగారు రేకు మీద సూక్ష్మాక్షరాలలో వున్న శాసనాన్ని చదువు అని చెప్పి ఉంగరాన్ని ఒక చిన్న బంగారు పెట్టెలో భద్రపరచి అందించింది.


శుభంభవతు! కళ్యాణమస్తు! అని అలర్కుణ్ని ఆశీర్వదించి మదాలసా కువలయాశ్వులు నిర్మలంగా అడవులకు వెళ్ళిపోయారు. రాజ్యపాలన బాధ్యత స్వీకరించిన అలర్కుడు వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాడు. భోగ భాగ్యాలు అనుభవిస్తూనే తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటా ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణలు చేస్తూ ధర్మబద్ధంగా శిక్షలు అమలు జరుపుతూ వున్నాడు. అనేకానేక యజ్ఞయాగాదులు నిర్వహించి ఆత్మసంతృప్తినీ అఖండ కీర్తిని సంపాదించాడు. ఆత్మజ్ఞానియై ధర్మంతో అర్ధాన్ని, అర్ధంతో ధర్మాన్ని పెంపొందించుకున్నాడు. ఈ రెండింటికీ మించిన విషయసుఖాలును అనుభవించాడు.


ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలన కొనసాగించినా రాజభోగాలు అనుభవించినా అలర్కుడికి తనివితీరడం లేదు. భోగాసక్తుడై వెంపర్లాడుతున్నాడే తప్ప వైరాగ్య భావనలు రావటం లేదు. రాజ్యాన్ని పుత్రులకు అప్పజెప్పి తామ తండ్రిలాగే అడవులకు పోదాం ఆముష్మికం గురించి ఆలోచిద్దాం ముక్కు మూసుకొని కాసేపు తపస్సు చేసుకొందాం. ఇలాంటి చింతనలే కలుగడం లేదు. అన్నగారైన సుభాహువు అలర్కుడి పరిస్థితి గమనించాడు. ఇతణ్ని నివృత్తి మార్గంలోకి మళ్ళించటం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి కష్టాలలోకి నెడితే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ఈ పని చేయాలనుకుంటే ఇతడి శత్రువులను ఆశ్రయించాలి. ఇరుగుపొరుగు రాజ్యాలు సహజశత్రువులు. అందువలన కాశీరాజును ఆశ్రయిస్తాను.


Saturday, 25 March 2023

శ్రీదత్త పురాణము (89)



ఈ రకమైన జోలలతో, బోధలతో బిడ్డల్ని పెంచింది. మొదటి ముగ్గురూ విరాగులై సామ్రాజ్యాన్ని సంసారాన్ని తృణీకరించి మునివృత్తిని స్వీకరించి అడవులకు వెళ్ళిపోయారు. తండ్రిగానీ రాజ గురువులుగానీ చేసిన ఏ ఉపదేశమూ వారి చెవికెక్కలేదు. బ్రహ్మవాదినియైన కన్నతల్లి చెప్పినదే వారికి వేదమయ్యింది. అదే రుచించింది. బ్రహ్మజ్ఞానులై వెళ్ళిపోయారు. కువలయాశ్వుడికి దిగులు పట్టుకుంది. నాల్గవవాడినైనా దక్కించుకోకపోతే సింహాసనమే కాదు వంశమే నిలబడదని గ్రహించాడు. అలర్కుడికి వైరాగ్య గీతాలు జోలలు పాడకుండా కట్టడిచేశాడు. నువ్వు నిజంగా పతివ్రతవే అయితే నా మాటజవదాటకూడదు. అలర్కుడికి జీవితంపట్ల రుచి కలిగించు. అనుకూల చింతననూ కలిగించు. నివృత్తి మార్గం కాదు. ప్రవృత్తి మార్గం బోధించు. సమర్థుడిగా, సద్గుణ సంపన్నుడిగా, సౌశీల్యం కలవానిగా మహావీరుడుగా, పరిపాలనా దక్షకుడిగా తీర్చిదిద్దు. ప్రయోజకుణ్ని చెయ్యి. దీనికి కావలసినవి అన్ని నూరిపొయ్యి. అటువంటి బుద్ధి పాటవాలను కలిగించు. ఇదేదో నావంశాన్ని నిలబట్టుకోవడానికో నా రాజ్యాన్ని కాపాడుకోవటానికో చెబుతున్న మాట కాదు.


ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు, అందరూ బ్రహ్మజ్ఞానులైపోయి నివృత్తి మార్గం వైపే ప్రయాణం చేస్తే కాంతాకవకాలను పరిత్యజిస్తే మరి గృహస్థాశ్రమం ఏమైపోవాలి? అదే లేకపోతే పితృదేవతలకి పిండ ప్రదానం చేసేదెవరు.? పితృదేవతల ఆత్మ సంతృప్తి చెందేలాగ బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమవాసులందరికీ పోషకుడు కదా గృహస్థు. దేవతలకూ అతిధులకూ పశుపక్ష్యాది జంతుమూలాలన్నింటికీ అన్నోదకాలు అందించేది గృహస్థులే కదా! ప్రజాతంతువు అవిచ్ఛిన్నంగా కొనసాగాలంటే, గృహస్థాశ్రమమే కదా మూల కందం. అందుచేత ఓ సాధ్వీమణీ! బ్రహ్మవాదినీ! ఈయన నాలుగో బిడ్డకు ఐహికా ముష్మిక జ్ఞానాలు రెండూ సరి సమానంగా భోదించు. సత్కర్మాచరణపట్ల గురి కుదుర్చు.


కువలయాశ్వుడి కోరిక ఆ పతివ్రత మదాలస అంగీకరించింది. ఆనాటి నుండి అలర్కుడికి సర్వధర్మాలను ఉపదేశించింది. రాజనీతిలో తీర్చి దిద్దింది. యుద్ధ విద్యల్లో పారంగతుణ్ని చేసింది. ధర్మాధర్మ వివేకం కలిగించింది. ప్రవృత్తి - నివృత్తుల సమ్మేళనం నేర్పింది. వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధకల్పం యజ్ఞదాన విధులూ ప్రజారంజక పరిపాలనం ఇలాగ ప్రవృత్తి మార్గం నేర్పింది. అలర్కుడు అన్ని విధాలా ప్రయోజకుడు అయ్యాడు తల్లిని మించినదైవమే కాదు. గురువుకూడా లేడు. కువలయాశ్వుడు కుమారుణ్ని చూసి సంబరపడి గర్వించాడు.