Saturday, 31 August 2024

శ్రీ గరుడ పురాణము (280)

 


సుందరమైన స్వచ్ఛమైన నీటిలో మాలిన్యాన్ని పోస్తే తాగడానికి పనికిరాకుండా పోతుంది. అలాగే దుష్టునితోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు. (అటునుంచి ఇటుకాదు)


దుర్జనస్యహి సంగేన సుజనోఽపి వినశ్యతి । 

ప్రసన్నమపి పానీయం కర్దమైః కలుషీకృతం ॥


ధనాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తేనే ఆ ధనం సద్వినియోగమయిందనుకోవాలి. అంతేగాక సాధ్యమయినంతగా బ్రాహ్మణులను సర్వవిధాలా సన్మానించుకోవాలి. బ్రాహ్మణులు తినగా మిగిలినదానిని తినుటయే ఉత్తమ భోజనకర్మ అనబడుతుంది. పాపము చేయనివాడే బుద్ధిమంతుడు. హితము చెప్పి చేయువాడే మిత్రుడు. దంభరహితంగా, అనగా డాబు డప్పాలతో గొప్పలు చెప్పుకోకుండా ఆచరించే ధర్మమే వాస్తవిక ధర్మాచరణం.


తద్భుజ్యతేయ ద్విజ భుక్తశేషం 

సబుద్ధిమాన్ యోన కరోతిపాపం ।

తత్ సౌహృదం యత్రియతే పరోక్షే 

దంభైర్వినాయః క్రియతే స ధర్మః ॥


వృద్ధజనులు లేని సభ సభేకాదు. ధర్మోపదేశం చేయని వృద్ధుని వృద్ధునిగా పరిగణించరు. సత్యము నిముడ్చుకోని ధర్మము ధర్మమూ కాదు, కపటంతో నిండిన సత్యం సత్యమూ కాదు. కపటసత్యమనగా ఒక మనిషి చేసిన మంచిపనిని మన వాదనా పటిమతో కపట వ్యూహరచనాశక్తితో చెడ్డపనిగా నిరూపించి మనము లాభము పొందునట్టిది. ఇక్కడ మనం చెప్తున్నది సత్యమేకాని వక్రించి చెప్తాం. (ఉదాహరణకి పరశురాముడు కర్ణుని శపించడం సత్యమే. కాని కర్ణుడు బ్రాహ్మణుడు కాడు కాబట్టి శపించేశాడని చాలమంది అనేస్తున్నారు. పరశురాముడు బ్రాహ్మణులకే విద్య చెప్తానని 'బోర్డు' పెట్టుకొని కూర్చొనలేదు. భీష్మునికి పరశురాముడే గురుదేవుడు. ఆయన బ్రాహ్మణుడు కాదు కదా! పరశురాముడు కర్ణుని, అబద్ధమాడి మోసం చేసి విద్యను సంగ్రహించాడని కోపించి శపించాడు. కర్ణుడు శపింప బడడంసత్యమే. ఆతడు ఇతరులతో చెప్పుకున్నది మాత్రం కపటసత్యం. ఏకలవ్యుని విషయంలో కూడా ఇలాంటి కపట సత్యాలెన్నో జనశ్రుతిలో వున్నాయి. విశ్వనాథ పావని శాస్త్రిగారి 'ఆచార్య దాక్షిణ్యం' అనే నాటకం చదివితే ఆ కపట సత్యాలన్నీ కాలి బూడిదై పోతాయి.


నసాసభాయత్ర న సంతివృద్ధాః 

వృద్ధా నతే యేన వదంతి ధర్మం |

ధర్మః సనోయత్ర న సత్యమస్తి 

నైతత్ సత్యం యచ్ఛలే నానువిద్ధం ॥


(ఆచార .. 115/52)


మనుష్యులలో బ్రాహ్మణులు (అంటే కులం కాదు వర్ణధర్మం మాత్రమే) తేజస్సులో ఆదిత్యుడు, శరీరంలో శిరస్సు, వ్రతాలలో సత్యవ్రతం శ్రేష్ఠతమాలు.

Friday, 30 August 2024

శ్రీ గరుడ పురాణము (279)

 


ఈ సమాజంలో ఒక క్షణంలో పుట్టి మరొక క్షణానికే కనబడక మాయమైపోయే క్షణభంగురాలు చాలానే వున్నాయి. వాటిని నమ్ముకొనరాదు.


ఆకాశాన్ని కమ్ముకునే మబ్బునీడా, గడ్డిమంటా, నీచుడి సేవాభావం, దారిలో కనిపించే నీరూ, వేశ్యలకు ప్రేమా, దుష్టుని మనసులో పుట్టే ప్రీతీ ఈ ఆరూ క్షణభంగురాలు. మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకోరాదు. అలాగే మిగతా వాటినీ నమ్మరాదు.


అభ్రచ్ఛాయా తృణా దగ్నిర్నీచసేవా పథోజలం । 

వేశ్యారాగః ఖలే ప్రీతిః షడేతే బుద్బుదోపమాః ॥


(ఆచార .. 115-39)


బాల్యం తీరిన తరువాత నోరు పెట్టినా ఎవరూ పడరు. గౌరవం నోటిని బట్టి రాదు. బాలురకు మాత్రం రోదనమే బలం. నిర్బలులకు రాజే బలం. మూర్ఖునకు మౌనం బలం. దొంగకి అసత్యమే బలం. మనిషి శాస్త్రజ్ఞానాన్ని సంపాదిస్తున్న కొద్దీ వాని బుద్ధి వికసిస్తూ వుంటుంది. మరింత జ్ఞానాన్ని సంపాదించాలనిపిస్తుంది. అలాగే మనిషి జగత్కల్యాణం వైపు మనసును మళ్ళించగానే కొన్ని పనులు చేయడం ద్వారా కీర్తి లభించి, మనసు విశాలమై మరిన్ని మంచిపనులు చేయాలనిపిస్తుంది. అందుకే మంచి పని చేయాలనే ఆలోచన వచ్చిన ఉత్తరక్షణంలోనే దానిని అమలులో పెట్టెయ్యాలి.


యథాయథా హి పురుషః శాస్త్రం సమధి గచ్ఛతి!

తథా తథా స్యమేధా స్యాద్వి జ్ఞానంచాస్య రోచతే ॥

యథా యథా హి పురుషః కల్యాణే కురుతే మతిం |

తథా తథా హి సర్వత్ర శిష్యతే లోక సుప్రియః ॥ (ఆచార.. 115/42,43) 


లోభం ఎలాగూ మంచిదికాదు. ఒక్కొక్కప్పుడు చిన్నపొరపాట్లు, గట్టి నమ్మకము కూడా ప్రమాదిస్తాయి. కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అవసరం. భయం కూడా అలాటిదే. ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడి జాగ్రత్తగా వుండడం మంచిదేకాని ఆపద వచ్చేశాక మాత్రం భయాన్ని పూర్తిగా పరిత్యజించి ఆపదను ధైర్యంగా ఎదుర్కోవాలి.


ఋణశేషం అగ్నిశేషం వ్యాధిశేషం ఉంచినకొద్దీ ఋణాగ్ని వ్యాధులు పెరిగిపోతునే వుంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి. 


ఋణశేషం చాగ్నిశేషం వ్యాధిశేషం తథైవచ ।

పునః పునః ప్రవర్ధంతే తస్మాచ్ఛేషం న కారయేత్ ॥


(ఆచార .. 115/46)


మనతో కలిసి వుండి మిత్రుని వలె నటిస్తూ మన పరోక్షంలో మన పనులన్నిటినీ తన స్వార్థం కోసం చెడగొట్టేవానిని అసలు విషయం తెలియగానే తన్ని తగిలెయ్యాలి. మాయావియైన శత్రునివలె.


పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం | 

వర్ణయేత్ తాదృశం మిత్రం మాయామయ మరింతథా|| (115/48)


Thursday, 29 August 2024

శ్రీ గరుడ పురాణము (278)

 


నూరేళ్ళ జీవితం గొప్పనుకుంటాం కానీ ఈ నూరేళ్ళూ దేనికీ చాలదు. ఇందులో సగభాగం నిద్రలోనే గడచిపోతుంది కదా! మిగిలిన దానిలో సగభాగం వ్యాధి, దుఃఖం, వృద్ధాప్యంలచే తినివేయబడుతుంది. ఇక మిగిలిన దానిలోనే బాల్యము, ఇష్టజన వియోగ దుఃఖము లాంటి వన్నీ వుంటాయి కదా! ఇక జీవిక అనగా కొలువు. తిండికోసం పనిచేసే సమయం, దానిలోని సాధకబాధకాలు ఆ మిగతా సమయాన్ని మింగివేస్తాయి. కాబట్టి మనకి ఉన్న సమయంలోనే ధర్మాన్ని దైవకర్మాల్నీ ఆచరించాలి. అంతేకాని, దానికి 'చాలా వేళ వుందిలే' అనుకోకూడదు అని ఊరుకోకూడదు. సర్పం వాయువుని మింగేస్తున్నట్టు మృత్యువు ప్రతిక్షణం ఆయువును తినేస్తుంటుంది. అందుకనే మనం వయసు పెరుగుతోందని సరదాపడిపోకుండా ఆయువు తరుగుతోందని జాగ్రత్తపడాలి. 'యవ్వనవేళ' లోనే ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి.


మనిషికీ పశువుకీ గల ముఖ్యమైన తేడా ఏమిటంటే నడుస్తున్నా, ఆగివున్నా, మేలు కొనివున్నా, నిద్రలోనైనా లోకహితాన్ని గురించే ఆలోచించడం మనిషి ధర్మం. ఆ ప్రసక్తే లేనిది పశుధర్మం. తన తిండి తాను తింటూ తన కోసం, తన పరిధిలోని జనాలకోసం మాత్రమే ఆలోచిస్తూ బతికేవాడికీ పశువుకీ పెద్దగా తేడా వుండదు. పశువు కూడా పిల్లలకి పాలిస్తుందిగా!


గచ్ఛ తస్తిష్ఠతో వాపి జాగ్రతః స్వపతో నచేత్ । 

సర్వసత్త్వ హితార్థాయ పశోరివ విచేష్టితం ॥


హితమేదో కానిదేదో తెలియకుండానే గొప్ప వాడైపోయి, వేద, పురాణ, శాస్త్ర చర్చలవేళల్లో తర్క- వితర్కాలను రెచ్చిపోయి చేసేస్తూ, తన కడుపు నిండగానే తనివితీరి పోయిందనుకునే వాడికీ పశువుకీ ఏమి తేడా వుంది? వీడు వాగుతాడు, అది వాగలేదు. వీనిలో ఏ వైశిష్ట్యమున్నదని వీనిని పశువుకంటె భిన్నుడనుకోవాలి.


పరాక్రమం, విద్య, అర్థలాభములతో బాటు తపస్సు, దానబుద్ధి కూడా గలవాడై ప్రపంచంలో కీర్తి సంపాదించనినాడు ఆ మనిషికీ ఆతని మాత విసర్జించే మలానికీ, సమాన ప్రయోజనమే వుంటుంది. విజ్ఞానము, పరాక్రమం, యశము, అక్షుణ్ణ సమ్మానయుక్తమునగు జీవితాన్నెవడైతే ఒక ఏడాదిపాటైనను గడపగలడోవాడే మనిషిగా బతికినట్లు విజ్ఞులు గుర్తిస్తారు. వానిది భాగ్యవైభవము, వాని దవంధ్య జీవనము అంటూ కవులు కీర్తిస్తారు.


కాకివలె బతికి ఏమి లాభం? హంస వలె గానీ సింహమువలె గానీ జీవించవలె. కాకి పెంటను తిని బతుకుతుంది. ఎన్నేళ్ళయినా వుంటుంది. ధర్మంగా ధనాన్ని సంపాదించి గురువులనూ, భృత్యులనూ ధనంతో కంటె ప్రేమతో కట్టిపడవేయ గలిగినవానిదే మానవ జీవనమవుతుంది. మనిషికి ముందు తన పట్ల తనకి గౌరవ భావముండాలి. ఆత్మాభిమాన ముండాలి గాని అహంకారముండకూడదు. భూతదయ లేనివాడు, మిత్రులకు మంచి పనులలో పెద్ద మనసుచేసుకొని సాయపడనివాడు ఎంత ధనవంతుడైనా సరేవాడు పోయిన నాడు ఊరి ప్రజలు 'మొన్న ఒక కాకి పోయింది. నేడు ఈయన పోయాడు. ఊరికి ఒరిగిందీ లేదు తరిగిందీ లేదు' అనుకుంటే వాడి పుట్టుకలోనే అర్ధం లేదు.


యో వాత్మనీహ నగురౌ నచ భృత్యవర్గే 

దీనే దయాం నకురుతే నచ మిత్ర కార్యే । 

కిం తస్య జీవిత ఫలేన మనుష్యలోకే 

కాకో-పి జీవతి చిరం చ బలించ భుంక్తే ॥ 

స్వాధీన వృత్తేః సాఫల్యం న పరాధీన వర్తితా | 

యే పరాధీన కర్మాణో జీవంతో-పి చతే మృతాః ॥


స్వాతంత్య్రమే స్వర్గలోకం. పరాధీనులై జీవించువారు మృతకల్పులు (ఆచార.. 125/35,37)

Wednesday, 28 August 2024

శ్రీ గరుడ పురాణము (277)

 


మనిషికి అనేక సహస్ర చింతలుంటాయి గానీ వాటిలో నాలుగు మాత్రం తీక్షమైన కత్తివాదరలాగా మనసును కోసివేస్తుంటాయి. అవి నీచుడిచే అవమానింపబడడం, ఆలి ఆకలి, అనురాగం లేని ఆలు, ముఖ్యమైన ప్రాణాధార కార్యాలకు కలిగే అవరోధాలు. 


అనుకూలురైన కొడుకులు, ధనాన్ని సమకూర్చిపెడుతున్న విద్య, ఆరోగ్యం చెడని శరీరం, సత్సంగినీ మనోను కూలావశవర్తినీయైన భార్య ఈ పంచ భాగ్యాలూ పురుషుని దుఃఖాలన్నిటినీ దూరం చేస్తాయి.


లేడి, ఏనుగు, కీటకం, తుమ్మెద, చేప ఈ అయిదూ క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రసాలను ప్రమాదకరస్థాయిలో ఇష్టపడి సేవించి పీకలమీదికి తెచ్చుకుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా ఈ అయిదింటినీ ఇంద్రియ నిగ్రహం లేకుండా సేవించి సర్వజ్ఞుడనని చెప్పుకునే మనిషి కూడా నష్టపోతుంటాడు.


కురంగమాతంగ పతంగ భృంగ 

మీనా హతాః పంచభిరేవ పంచ । 


ఏకః ప్రమాదీ స కథం నఘాత్యో 

యః సేవతే పంచభిరేవ పంచ ॥


(ఆచార 115/21)


బృహస్పతితో సమానంగా చదువుకున్న బ్రాహ్మణులైనా ఈ అయిదుపనులనూ చేయరాదు. అవి ఏవనగా ధైర్యాన్ని కోల్పోవడం, కటువుగా ధుమధుమలాడుతూ వుండడం, గమ్యం లేకుండా జీవించడం, మలిన వస్త్రాలనే ధరించడం, అనాహూతంగా అంటే ఎవరూ పిలవకపోయినా సంబరాలకూ పెళ్ళిళ్ళకూ పోవడం. ఈ పనులలో ఒక్కటి చేసినా బ్రాహ్మణునికి పూజించేవారూ, గౌరవించేవారూ మిగలరు.


ఆయువు, కర్మ, ధనం, విద్య, మృత్యువు ఈ పంచాంశాలూ మనం పుట్టినపుడే నిశ్చితమైపోతాయి. మనం చేయవలసినదల్లా వాటిని మెరుగుపరుచుకొని జీవించడమే. భగవంతుని దయవుంటే మృత్యువు అనాయాసం కావచ్చు. ఆయువు ఆరోగ్యమయం కావచ్చు.


ఆయుః కర్మ చ విత్తం చవిద్యా నిధనమేవచ |

పంచైతాని వివిచ్యంతే జాయమానస్య దేహినః ॥


(ఆచార ...115/23)


మబ్బునీడ, దుష్టుని ప్రేమ, పరనారితోడు, యౌవనం, ధనం - ఈ అయిదూ అస్థిరాలు. మనిషికి సంబంధించినవన్నీ, ధర్మకీర్తులు తప్ప, అస్థిరాలే.


అభ్రచ్ఛాయాఖలే ప్రీతిః పరనారీషుసంగతిః । 

పంచైతే హ్యాస్థిరాభావా యౌవనాని ధనానిచ ॥


అస్థిరం జీవితం లోకే అస్థిరం ధనయౌవనం |

అస్థిరం పుత్ర దారాద్యం ధర్మః కీర్తిర్యశః స్థిరం ॥


(ఆచార ..115/25,26)

Tuesday, 27 August 2024

శ్రీ గరుడ పురాణము (276)

 


నీచుడైన వ్యక్తి ఇతరులతో గొడవ పడడానికే ప్రయత్నిస్తుంటాడు. మధ్యముడు ఎక్కువగా సంధికోసమే ప్రయత్నిస్తుంటాడు. ఉత్తముడు గొడవపడడు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు. మహాపురుషులకు మానమే ధనముకదా! సన్మానమే వుంటే ఇక ధనమెందుకు? మానమూ దర్పమూ నశించినవానికెంత ధనముండి ఏమి లాభము? వాడు జీవించుట మాత్రము దేనికి? మాన, స్వాభిమాన యుగళము లేక ధన, ఆయుర్యుగళ ముండీ లేనట్లే కదా!


నీచ ప్రకృతి గలవాడు ధనాన్నే కోరుకుంటాడు. మధ్యముడు ధన, మానాలు రెండూ కావాలంటాడు. ఉత్తముడు గౌరవాన్ని మాత్రమే అభిలషిస్తాడు.


అధమాధన మిచ్ఛంతి ధనమానౌహి మధ్యమాః ।

ఉత్తమా మానమిచ్ఛంతి మానోహి మహతాం ధనం ॥


(ఆచార 115/13)


అడవిలోని సింహానికెంత ఆకలేసినా ఇతర జంతువులచే చంపబడిన జంతు లేక నరమాంసాన్ని తినదు. ఉత్తమ వర్ణుడైన వ్యక్తి ధనహీనుడైపోయినా నీచకర్మను చేపట్టడు. వనంలో సింహాన్ని అభిషేకించకపోయినా అది మృగరాజే. సమాజంలో ఉత్తమునికి గౌరవ మర్యాదలూ అలాగే లభిస్తాయి.


నాభిషేకో న సంస్కారః

సింహస్య క్రియతే వనే |

నిత్య మూర్జిత సత్త్వస్య 

స్వయమేవ మృగేంద్రతా ||


బద్ధకస్తుడైన వర్తకుడు, అహంకారియైన సేవకుడు, కటువుగా మాట్లాడే వేశ్యా తమ వృత్తులలో రాణించలేరు.


దరిద్రుడై వుండీ దాత కావాలనే కోరికా, ధనికుడై యుండీ పీనాసితనమూ, అతి గారాబం చేసి కొడుకుని చెడగొట్టుకోవడమూ, మంచివాడై వుండి దుష్టులను సేవించడమూ, ఇతరులకి కీడు చేస్తూ చనిపోవడమూ మనిషిని దుశ్చరిత్రుని చేసే పంచలక్షణాలు.


దాతా దరిద్రః కృపణో- ర్దయుక్తః పుత్రో- విధేయః కుజనస్యసేవా । 

పరాపకారేషు నరస్య మృత్యుః ప్రజాయతే దుశ్చరితాని పంచ ॥


కాంతా వియోగః స్వజనాప మానంఋణస్యశేషః కుజనస్య సేవా । 

దారిద్య్ర్య భావాద్విముఖాశ్చ మిత్రా వినాగ్నినా పంచదహంతి తీవ్రాః ॥


(ఆచార 115-17,18)


అలాగే అగ్ని అవసరం లేకుండానే మనిషిని తీవ్రంగా దహించి పడవేసేవి అయిదుంటాయి. అవి పత్నీవియోగం, స్వజనులే చేసే అవమానం, మిగిలిపోయిన ఋణం, దుర్జనులను సేవించవలసిరావడం, ధనహీనత వల్ల మిత్రులు పెడమొగమై పోవడం. 

Monday, 26 August 2024

శ్రీ గరుడ పురాణము (275)

 


కొడుకు చెడిపోతే తల్లిదండ్రులకు దానికి మించిన నరకయాతన లేదు. అలాగే దురాచారిణియైన స్త్రీకి ప్రేమ వుండదు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కరికీ సుఖమూ వుండదు. దుర్జనుడైన మిత్రుని ఎలాగూ నమ్మలేము కదా! నమ్మకం లేని చోట సుఖమెట్లా వుంటుంది? ఇక రాజ్యంలో దుష్టులంతా కలిసి దుష్టశాసనాలనే ప్రజలపై రుద్దుతూ పోతుంటారు కాబట్టి ప్రభుత్వం చేత ప్రేమింపబడుతున్న ఏ పాతికశాతం మందో సుఖపడతారు. వారే ఈ శాసనకర్తలను నిలబెడతారు కూడ. మిగతావాళ్ళు ఈ దేశంలో పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎలాగో బతికేస్తుంటారు. ఎక్కువమంది ఇతరులపై ఆధారపడి బతికేస్తుంటారు. పరాన్నభుక్కు ఇంద్రుడైనా సరే వాని ఐశ్వర్యం చేజారిపోతుంది.


పరాన్నంచ పరస్వంచ పరశయ్యాః పరస్త్రీయః | 

పరవేశ్మని వాసశ్చ శక్రాదపి హరే చ్ఛ్రియం ॥


(ఆచార .... 115/5)


ఒక కుండలోని నీటిని ఇంకొక కుండలోని నీటితో కలిపినట్లు అంటురోగం కన్నను వేగంగా పాపం ఒకరినుండి ఒకరికి అంటుకుంటుంది. పాపితో నిత్యం మాట్లాడుతూ, శరీరాన్ని తగులుతూ, కలిసి తిరుగుతూ, తోడుగా భోంచేస్తూ, ఒకే ఆసనంపై, శయ్యపై మెలగుతూ ఒకే చోటికి వస్తూ పోతూ మంచివారెవరైనా ఎందరైనా సహజీవనం చేయవలసివస్తే ఆ పాపాత్ముడు మంచివాడు కాడు గానీ ఈ పుణ్యాత్ములంతా పూర్తిగా చెడిపోయి దురాత్ములై పోతారు. ఈ రకమైన సహజీవనం కలియుగంలో తప్పనిసరి.


స్త్రియో నశ్యంతిరూపేణ తపః క్రోధేన నశ్యతి |

గావో దూర ప్రచారేణ శూద్రా న్నేన ద్విజోత్తమః |


(ఆచార ... 115/7)


అందం వల్ల ఆడది చెడగా, క్రోధం వల్ల తపస్సు తగలబడిపోతుంది. దూర ప్రయాణాల వల్ల గోవులు దూరం కాగా, *శూద్రాన్నంవల్ల ఎంతటి ద్విజోత్తములైనా 

దిగజారిపోతారు.


*ఇక్కడ శూద్రాన్నం అంటే ఏ వెనుకబడిన కులంవారో, ఇప్పటి భాషలో, వండిపెట్టిన అన్నం కాదు. అది మూర్ఖపుటాలోచన, మడీ, తడీ, శుచీ శుభ్రతా లేని అన్నమే అప్పటి భాషలో శూద్రాన్నము. గొడ్డుకారము, గుప్పెడు ఉప్పు కలిసినది శూద్రాన్నము. నీచుతో నిండినది శూద్రాన్నము. అలాగే ద్విజులనగా బ్రాహ్మణులు మాత్రమే కారు. ఇలా ఎందుకు చెప్పవలసివస్తుందంటే ఈ 'శూద్ర' శబ్దాన్ని చూపించి పరదేశీయులు, వారి మానసపుత్రులు కపట వ్యూహరచన చేసి ఒక పథకం ప్రకారం గ్రంథాలు వ్రాసి, ఉపన్యాసాలిస్తూ ఇప్పటికే ఈ సమాజాన్ని విడగొట్టేయడంలో చాలావరకు విజయం సాధించారు.

పిల్లల, శిష్యులపట్ల బాధ్యతకు బదులుగా అతి గారాబం, స్వార్థం చోటు చేసుకోవడం వల్ల కలియుగంలో తల్లిదండ్రుల, గురువుల ప్రవర్తన కారణంగా యువతరానికి సరైన దిశా నిర్దేశం లేకపోతుంది. వృద్ధాప్యంలో మానవులకి నడక ఎక్కువవుతుంది. స్త్రీకి సంభోగం లుప్తమవుతుంది. పర్వతాలకు నీటి దెబ్బ తగులుతుంది. బట్టలు ఎక్కువ కాలం ఎండలో వుండడం వల్ల చివికిపోతాయి.

Sunday, 25 August 2024

శ్రీ గరుడ పురాణము (274)

 


పొరపాటున కూడా దుష్టునీ, శత్రవునీ ఉపేక్షించకూడదు. వాళ్ళు అల్పులే, పరవాలేదు అనుకోకూడదు. చిన్న నిప్పురవ్వే బ్రహ్మాండమును భస్మము చేయగలదని మరువరాదు.


యౌవనంలో కూడా శాంతంగా వుండగలవాడే నిజమైన శాంత స్వభావి. అన్నీ అయిపోయినవాడూ, శక్తులన్నీ ఉడిగిపోయినవాడూ శాంతుడు కాక చేసేదేముంటుంది?


నవే వయసి యఃశాంతః సశాంత ఇతి మేమతిః । 

ధాతుషుక్షీయమాణేషు శమః కస్య న జాయతే ॥


(ఆచార ... 114/73)


సంపదలన్నీ భగవంతుడివీ, ఆయన ప్రసాదించిన ప్రకృతివీనీ.


'ఈ సంపదంతా నాది' అని ఏ మనిషి భ్రమపడరాదు. (అధ్యాయాలు-113, 114) 


నీతిసారం


వివేకవంతుడు, నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నినీ, దుష్టమిత్రునీ, దురాచారియైన రాజునీ, కుపుత్రునీ, గుణహీనకన్యనీ, కుత్సిత దేశాన్నీ దూరం నుండే పరిత్యజిస్తాడు.


కలియుగంలో ధర్మం మానవ సమాజం నుండి దూరంగా పారిపోతుంది. తపస్సులో స్థిరత వుండదు; మానవుల హృదయాలకు సత్యం దూరమైపోతుంది. మనుష్యులు కపట వ్యవహారమగ్నులై బతికేస్తుంటారు; బ్రాహ్మణులు ఆశపోతులైపోయి ధనదాహంతో మసలుతుంటారు; పురుషులు స్త్రీల అడుగులకు మడుగులొత్తడమే తమ జీవిత పరమార్థంగా భావిస్తారు; స్త్రీలు తమ మనస్సును, బుద్ధిని స్థిరంగా పెట్టుకోలేకపోయినా తెలివితేటల, అందచందాల ఆసరాతో లోకాన్నే ఒక ఆట ఆడిస్తుంటారు.


కాబట్టి ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గల వారే పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్నేలుతూ మొత్తం లోకాన్నే భ్రష్టు పట్టించడంతో సుజనులకు సామాన్య జీవనం కూడా మిక్కిలి కష్టసాధ్యమైపోతుంది. పోయినవాళ్ళే ధన్యులనిపిస్తుంది. ఉన్నవాళ్ళు పోయిన వారికి తీపి గురుతులు కాకుండా చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఎప్పటికప్పుడే ‘ఆహా! మృతులెంత అదృష్టవంతులో కదా! ఈ అరాచకాన్నీ, ఈ దేశం ముక్కలైపోడాన్ని, ఈ సమాజం సర్వభ్రష్టత్వాన్ని, పరాసక్తలైన పత్నులనీ, దురాచారాసక్తులైన పుత్రులనీ చూడకుండానే పోయారు. వారు ఏ లోకంలో వున్నా ఈ లోకంలోని మనకంటే సుఖంగానే వుండివుంటారు అని వృద్ధులంతా తమలో తాము, తమతోతాము సంభాషించుకొంటుంటారు.