Sunday 16 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (23)



అతడు జ్ఞాని, జ్ఞాన గురువు కూడా


అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం

దనుజవనకృశానుం జ్ఞాని నామగ్రగణ్యం

సకలగుణనిధానం వానరాణామధీశం

రఘుపతి వరదూతం వాతజాతం నమామి


ఇది ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకం. తులసీదాస్ వ్రాసిన రామచరిత మానస్, ఉత్తర దేశంలో ప్రసిద్ధిని పొందింది. తమిళదేశంలో కంబ రామాయణం కంటే ఉత్తరదేశస్థులు తులసీరామాయణాన్ని భక్తి శ్రద్ధలతో పూజచేసి, పారాయణ చేస్తూ ఉంటారు. 400 సంవత్సరాల వెనుక వ్రాయబడిన గ్రంథమది.


తమిళ భాష మాదిరిగా హిందీ భాష ప్రాచీనమైనదికాదు. కాని ఈ రామాయణం వల్ల ఆ భాష వినుతికెక్కింది. సారస్వత స్థాయి ఎక్కువగా ఉన్నా ఇది విద్వాంసులు గణించే భాషలో వ్రాయబడలేదు. సామాన్య జనులు చదివి, విని, అర్థం చేసికొనే రీతిలో వ్రాసాడు. కనుక కంబరామాయణం కంటె ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ఇందు భక్తి, కవితా సౌందర్యమున్నా, కేవల భక్తి వల్లనే ప్రజలమన్ననలను పొందింది.


హిందువులు బలవంతంగా మహమ్మదీయ మతంలోకి మార్చబడే దశలో తులసీదాసు ఇది వ్రాసాడు. అనేకులు ఇతర మతంలోకి ప్రవేశించకుండా ఉండడానికి కారణం ఇతని రామాయణ రచనయే. ఒత్తిళ్లకు లొంగిపోగూడదనే భావన ప్రజలలో పాతుకొని పోవడానికి ఇదే కారణం. 40 చరణాలతో విడిగా హనుమాన్ చాలీసా కూడా వ్రాసేడు. ఇది హనుమ, కవచంగా వ్రాసి ఉంటాడని తెలియ చేస్తోంది. ఎవరు దీనిని చదివినా వెంటనే ఆకర్షింప బడతారు. బలహీనుడు చదివి బలాన్ని పుంజుకొంటాడు. ఇది తులసీదాసు కాలంలోనే ప్రసిద్ధిని పొందింది. మతం మార్పిడికి కంచెలా రక్షించింది.


No comments:

Post a Comment