Showing posts with label ఆదిశంకరాచార్యులు. Show all posts
Showing posts with label ఆదిశంకరాచార్యులు. Show all posts

Monday, 28 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 265 వ భాగం



రోజూ కంపా నదీతీరాన్ని ఆవాసంగా చేసుకొన్న కామేశ్వరిని అర్చించినట్లుంది.


ఇక్కడున్న మా మఠంలో చంద్రమౌళీశ్వర లింగాన్ని యోగ లింగమంటారు. దీని ప్రస్తావన శ్రీహర్షుని నైషధంలో కూడా ఉన్నట్లు లోగడ ఉపన్యాసాలలో చెప్పాను.


రక్షాక్షి నామ సంవత్సరంలోని వైశాఖ మాసంలో పంచమినాటికి 32 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఆ మాసంలో వచ్చే ఏకాదశినాడు సిద్ధి పొందారు.


చివరి ఘడియలలో ఉపదేశ మిమ్మనగా 'వేదో నిత్యమధీయతాం... మొదలైన అయిదు శ్లోకాలను చెప్పారు. దానినే సోపాన పంచకమని, ఉపదేశ పంచకమని అంటారు.


వాటి సారాంశం: ప్రతి దినమూ వేదాధ్యయనం చేయి. వైదిక కర్మలను ఆచరించు. వాటిని స్వలాభం కోసం కాకుండా ఈశ్వరపూజ చేస్తున్నట్లు భావించి ఫలితాలను వదులు. కోరికలతో కర్మలను విడిచి పెట్టు. పాపాలను పోగొట్టుకో.


సజ్జనులతో కలిసి యుండు. భక్తిని కలిగియుండు. శాంతాది గుణాలను అలవర్చుకో. ఓంకార మంత్రాన్ని అర్థించు. ఉపనిషద్వాక్యల అర్థాలను విచారించు. కుతర్కాన్ని విడిచిపెట్టు. బ్రహ్మననే భావనతో ఉండు. గర్వాహంకారాలను వీడు. ఆకలి దప్పికలనే వ్యాధికి చికిత్స చేయి. లభించిన పదార్థంతో తృప్తి పడు ద్వంద్వాల పట్ల ఓర్పుతో ఉండు. ఏకాంత ప్రదేశంలో మౌనంగా కూర్చుండి బ్రహ్మము పట్ల చిత్తాన్ని లగ్నం చేయి. ఈ జగత్తంతా పూర్ణ బ్రహ్మలో లీనమైనట్లుగా భావించు. ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ బ్రహ్మ నిష్టుడవై యుండు. జ్ఞానాన్ని ఆశ్రయించు. ఇట్లా వీరి ఉపదేశం సాగుతుంది.


ఆనందగిరీయంలో వీరు స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరంలో, మరల దానికి కారణ శరీరంలో లీనం చేసారని, అఖండ చైతన్యంలో లీనమైనారని ఉంది.


వారి చరిత్రలను విన్న తరువాత చిత్తశుద్ధి, శాంతి, ప్రేమలు మనలో కలిగితే వినిన ఫలం అపుడు దక్కుతుంది. వారు చెప్పినవి ఆచరణలో పెట్టినపుడే వినడమనేది సార్ధకమౌతుంది. ఎంతో జ్ఞాన భక్తులకు సంబంధించిన సాహిత్యాన్ని అందించారు. 


ఎవరేది చెప్పినా నీవు మోక్ష స్వరూపుడవే అని మాయవల్ల తెలిసికోలేకపోతున్నావని, జ్ఞానం వల్ల అట్టి చీకటి తొలగించగలిగితే, నీవే బ్రహ్మవని తెలిసికొంటావని అన్నారు.


ఏదో శాశ్వత నరకం ఉంటుందని, అందు పాపులుంటారని చెప్పడం కాకుండా, అట్టి పాపులను కూడా పరమాత్మ స్వరూపులుగా తీర్చిదిద్దారు. 'మంగలం గురు శంకర' అనే కన్నడంలోని పాటలో మహాపాపిని కూడా పరమాత్మగా వీరు మార్చారని ఉంది. జయ జయ శంకర అంటేనే మనలో నూత్న ఉత్సాహం వస్తుంది. అనండి. అంటూ మంచి పనులను చేయండి.


నమః పార్వతీ పతయే

హరహర మహాదేవ


Sunday, 27 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 264 వ భాగం



ఒకే ఒక పరమాత్మ, నానా రూపాలను ధరిస్తున్నాడని, దానిని గుర్తించినవాడు సర్వజ్ఞుడౌతాడు. శంకరులీ అర్ధంలోనే కాదు. ఒకటి నుండే అనేక శాస్త్రాలు ఆవిర్భవించాయి. అన్ని శాస్త్రాలను అవలోకనం చేసినవాడు. సర్వజ్ఞుడౌతాడు కదా! అతడే సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కడానికి అర్హుడు.


ఏదైనా పని చేయాలన్న ఇదేమైనా బ్రహ్మవిద్యా అని అంటాం. అట్టి బ్రహ్మ విద్యలోనూ వీరు పారంగతులే. సర్వజ్ఞ పీఠం ఎక్కేటప్పుడు దాని క్రింద అనేకమైన మెట్లుంటాయి. ఒక్కొక్క మెట్టెక్కినపుడు ఒక్కొక్క విద్యలో, నిష్ణాతుడు ప్రశ్నిస్తాడు. వానికి సమాధానం చెప్పి పై మెట్టునెక్కాలి. చివరగా, సరస్వతియే ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పగలిగితే సింహాసనం మీద కూర్చుండడానికి అర్హత వస్తుంది. అట్లా ఎక్కగలిగారు.


వారి వాఙ్మయాన్ని పరిశీలిస్తే అనేక శాస్త్రాలలో పారంగతులైనట్లు తెలుస్తుంది. జ్యోతిశ్శాస్త్రంపై శంకరాచార్యం అనే పేరుతో పుస్తకమొకటుంది. ఒక సంగీత శాస్త్రజ్ఞుడు వచ్చి సంగీత శాస్త్రంలో గతి - గమనం గీతం అనే - మాటలు వస్తాయని వాటి సాంకేతిక విషయాలు మాకే తెలియవని అన్నపుడు శంకరులు 'గళే రేఖాః త్రిసా అనే శ్లోకంలో సంగీత శాస్త్ర విషయాలను ముచ్చటించారని ఆశ్చర్య పడ్డాడు.


అంతేకాదు, కొబ్బరి చెట్టును వంచడమనే విద్యను నేర్చుకొన్నారని చెప్పాను. అట్లే చెప్పులు కుట్టేవాని విద్య గురించి చెప్పినట్లు లోగడ ఉపన్యాసాలలో చెప్పాను.


రామునకు పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యాన్ని పాలించాడు కాని శంకరులు అన్ని పనులూ నిర్వర్తించిన తరువాత వీరికి పీఠారోహణ ఉత్సవం జరిగింది. అనగా జ్ఞాన రాజ్యానికి తుది అంకం. శంకరాభ్యుదయం ఇట్లా చెప్పింది. 


'కంపాతీరనివాసినీం అనుదినం కామేశ్వరీం అర్చయన్ 

బ్రహ్మానందమవిందత త్రిజగతాం క్షేమం కరో శంకరః'


Saturday, 26 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 263 వ భాగం



(నవ్వుతూ ఇట్లా అన్నారు స్వామి ఇదేమిటి? నిష్క్రియత్వాన్ని బోధించే అద్వైతమెక్కడ? క్రియాశక్తి స్వరూపమైన అమ్మవారెక్కడ? క్రియారహితురాలై, క్రియతో కూడినట్లుగా ఉంటుంది. శంభువుని నిష్క్రియుని శంకరునిగా మార్చి క్రియాసహితునిగా చేసింది. పరబ్రహ్మము, అవతారంగా వస్తే పరాశక్తినుండే శక్తిని పొంది నిర్వహిస్తాడు. ఇట్లా చేయడానికి ఆమె దయయే కారణం. జీవుణ్ణి స్వస్వరూపునిగా తెలిసికొనేటట్లు చేసేది ఆమెయే, అద్వైత మోక్షాన్ని ఇచ్చేది ఆమెయే. ఆమెయే జ్ఞాన దాత్రియని శంకరులకు తెలుసు.


శ్రీవిద్య, బ్రహ్మవిద్య రెండూ అద్వైతానికి దారి చూపించేవే. శివ శక్తుల సమ్మేళనాన్ని ప్రతిపాదించేవే. జ్ఞాన మార్గానికి దారి చూపిన శంకరులే ఉపాసన మార్గం యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించారు.


శివశక్తుల సమ్మేళనాన్ని గుర్తించే మఠాలలో చంద్ర మౌళీశ్వర అర్చనతో బాటు శక్తిపీఠాల అర్చన కూడా ఉంటుంది. కంచిలో కామాక్షి పీఠం; ద్వారకలో భద్రకాళి పీఠం, పూరీలో విమలాపీఠం, శృంగేరీలో శారదాపీఠం, బదరిలో పూర్ణగిరి పీఠాలున్నాయి.


అమ్మవారు, గర్భగృహంలో గుహలో, ఒక బిలాలయంలో ఉన్నట్లుంటుంది. ఆమె దగ్గర శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి ఉగ్రకళను బంధించి, సౌమ్యమూర్తిగా, ఆమెను తీర్చిదిద్దారు. గురు రహస్యంలో ఇట్లా శంకరులు చేసారని ఉండగా, మాకు పుణ్యం అయ్యేటట్లు చేసారని గురు రత్నమాలలో ఉంది:


"ప్రకృతించ గుహాశ్రయాం మహోగ్రాం 

స్వకృతే చక్రవరే ప్రవేశ్య యోఽగ్రే 

అకృతాశ్రిత సౌమ్యమూర్తిం ఆర్యాం 

సుకృతం నః సచినోతు శంకరార్యః 


అమ్మవారి ఎదురుగా ఇట్టి యంత్ర ప్రతిష్ఠ చేసినట్లు చిద్విలాసీయంలో ఉంది.


'కామాఖ్యా పురతో దేశ శ్రీచక్రం స్వయమాలిఖతో' ఆనంద గిరియంలోనూ అట్లాగే ఉంది. ఇట్లా కామకోటి పీఠాన్ని ఉజ్జలంగానే చేసారు. వీరి శిష్యులు నలుమూలలా పర్యటించి గురువులందించిన షణ్మతాలను వైదిక పద్ధతిలో కొనసాగేటట్లు చేసారు.


Friday, 25 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 262 వ భాగం

 


కంచిలోని పూజా పద్ధతులను సంస్కరించారు. ఉగ్రరూపంలో నున్న అమ్మవారిని రాజరాజేశ్వరిగా తీర్చిదిద్దారు. వినాయకుని ఆలయం, ముక్తి మంటపం కాశీలో ఉన్నట్లు ఇక్కడా ఉంటాయి. విష్ణు కంచిలోని వరద రాజస్వామి ఆలయంలోని పూజాపద్దతిని సంస్కరించారు. దానికి పడమరగా మా మఠం ఉంది.


వారక్కడ ఉండగా, అందరి క్షేమాన్ని కోరి అక్కడి రాజుతో కాంచీపురం శ్రీ చక్రాకారంగా నిర్మించాలని, అందు బిందుస్థానంలో కామాక్షి ఆలయం ఉండేటట్లు పట్టణాన్ని నిర్మించాలని చెప్పారట. ఆ రాజు, రాజసేనుడు అనే చోళరాజు.


శ్రీ చక్రాకారంగానే ఉంటుంది కంచి. ఎందుకిట్లా చేసారు? ఎన్నో దేవతామూర్తులున్నా ఇది ప్రధానంగా దేవీ క్షేత్రమే. శక్తిపీఠాలు 3,18,36, 51, 56, 64, 96, 108, 6400 సంఖ్యలో ఉన్నాయని అంటారు. ఇందు ప్రధానంగా కంచి పేర్కొనబడింది. ఇది అమ్మవారి నాభి పడినచోటు. ఇది నాభిపీఠం, నాభి శరీరం మధ్యలోనే ఉంటుంది. అట్లాగే కంచి ప్రపంచానికే నాభి వంటిది. కాంచి యనగా మొలనూలు. అదే ఒడ్డాణం. ఇది నాభికి కవచంలా ఉంటుంది. ఇట్లా మేరుతంత్రం, కామాక్షీ విలాసం, కంచి మాహాత్యం చెప్పాయి. కంచి కామాక్షి జనరేటర్ వంటిది. అన్ని బల్బులు వెలగడానికి ఈమెయే కారణం. ఇది తెలివిడి చేయడం కోసం కంచి ప్రాంతంలో 50 శివాలయాలున్నా అమ్మవారి మూర్తి అక్కడ ఉండదు. సుందరేశ్వర ఆయలంలో మీనాక్షి; జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి; కపాలీశ్వర కోవెలలో కర్బగ అంబాళ్ ఉంటారు కాని, కామాక్షి ఆలయంలో ఈశ్వరుడుండడు. నాల్గు వైపులా గోపురముంటుంది. నాల్గువైపులా రాజవీధి యుంది. ఇట్టి గౌరవం, ఏకామ్రనాథునికి గాని, వరద రాజస్వామికి గాని లేదు.


శ్రీ విద్యా శాస్త్రంలో చెప్పబడినట్లుగా నాల్గు చేతులలో ధనుస్సు, అంకుశం, పాశంతో ఉంటుంది. తానిచ్చిన విద్యా శాస్త్రాన్ని, సౌందర్య లహరిగా అందించారు శంకరులు. ఇట్లా అన్ని కారణాల వల్ల ఇది శంకరులకు ప్రధాన కేంద్రమైంది. 


Thursday, 24 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 261 వ భాగం



ముక్తి క్షేత్రంగా పిలువబడే కంచిలో వీరు ముక్తిని పొందారు. వీరికి ముక్తి అంటే ఏమిటి? వారే ముక్తి స్వరూపులు కదా! వారెప్పుడూ జీవన్ముక్తులే. అట్లా భౌతిక శరీరాన్ని విడిచి పెట్టారు. నేను విదేహ ముక్తిని గురించి మాట్లాడుతున్నాను. కామాక్షి సన్నిధిలో జరిగినట్లుంది. బృహత్ శంకర విజయంలో అమ్మవారి సన్నిధిలో బ్రహ్మతత్వంలో లీనమైనట్లుంది.

'దేవ్యాః పురః పరతరే పురుషే విలీయే' 


ప్రాచీన శంకర విజయంలోనూ ఇట్లాగే ఉంది. 


కామాక్ష్యా సవిధే సజాతు నివసన్ ఉన్ముక్త లోక స్పృహో 

దేహం స్వంవ్యవహాయ దేవ్యాస్సుధామ ప్రపేదేపరం 


ఉన్ముక్తలోక స్పృహ = ప్రపంచ సంబంధం విడిచి పెట్టి అని ఉంది. వారికెప్పుడైనా బంధం ఉందా? లేదు. లోకానుగ్రహం కోసం పర్యటించారు. ధర్మ మార్గంలో నడిపించారు. అట్టి కోరికనూ విడిచి పెట్టారన్నమాట.


దేహం స్వంవ్యవహాయ - అమ్మవారి ఎదురుగా నిలబడి విడిచారని, 


ధామ ప్రపేదే పఠం - స్వస్థలానికి వచ్చారు. అది ఏది? బ్రహ్మ స్వరూపమే కేరళీయ శంకర విజయంలో అట్టి పరమ పదాన్ని వీరు పొందినా, కాంచీపురంలో ఉన్న ఆలయంలో మోక్షదాతగా నున్నారని చెప్పబడింది. అనగా వారి మూర్తి ఆలయంలో ఉంది కదా.


Wednesday, 23 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 260 వ భాగం



కంచిలో శంకరులు


అన్ని పుస్తకాలూ, కంచిలో శంకరులున్నట్లు పేర్కొన్నాయి. ఆనంద గిరియం, గురువంశ కావ్యం (శృంగేరి) లో కంచినుండే ఆర్గురు శిష్యులను పంపారని, షణ్మతాలను స్థాపించారని ఉంది. ఇక శంకరాభ్యుదయం, గోవింద నాధీయం, చిద్విలాసీయం, గురురత్న మాల గ్రంథాలు శంకరులిక్కడ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారని పేర్కొన్నాయి. బృహత్ శంకర, ప్రాచీన శంకర విజయాలను బట్టి జ్ఞాన పీఠం కాశ్మీరులో ఉంది. అయినా వారి జీవిత విశేషాలను బట్టి చూస్తే కొంతకాలం కంచిలో గడిపినట్లుంది. అసలు కంచినే కాశ్మీరమంటారని గోవిందనాధీయంలో ఉంది.


శివరహస్యం, మార్కండేయ సంహితలు ఇతిహాస పురాణాల వంటివి. వాటిల్లోను, కొన్ని శంకర విజయాలలోనూ కంచిలోనే వీరు తమ అవతారాన్ని చాలించారని చెప్పబడింది. కొన్ని పుస్తకాలలో కేదారనాథ్ లో లేక బదరీ నాథ్ లో అవతారం చాలించారు అని ఉంది.


వీటికి ఏకవాక్యత తీసుకొని రావడం కష్టం. వారేమీ స్వీయ చరిత్ర వ్రాయలేదు. తరువాత వచ్చినవారు అనేకాధారాలననుసరించి వ్రాసేరు. ప్రధానంగా చెప్పవలసిందేమిటంటే మనం వారి భక్తులం, శిష్యులం, పిల్లలం అని భావిస్తే చాలు. మనలో అణుమాత్రం ఎవరిపట్లా శత్రుత్వం లేకుండా అందరిపట్లా ప్రేమ, భక్తి ఉంటే చాలు. ఇక ఎట్టి పరిశోధన చేసినా అంతా దండుగే. సిద్ధ పురుషులు రెండు మూడు స్థలాలలో సిద్ధి పొందునట్లు కథలున్నాయి.


Tuesday, 22 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 259 వ భాగం



ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణువు - ఈ ముగ్గుర్నీ రత్నత్రయం అంటారు. వీరికి చెందిన దేవాలయాలు, ఇక్కడ ప్రసిద్ధిని పొందాయి. ఏకామ్రనాథుని ఆలయంలో పరమేశ్వరుని పృథ్వీలింగం ఉంది. కామకోష్టం, అమ్మవారికి చెందింది. విష్ణు కంచిలో వరదరాజ స్వామి యున్నాడు. వైష్ణవుల దివ్యదేశాలలో ఇది యొకటి. శ్రీరంగం, తిరుపతి తరువాత ఈ ఆలయాన్ని వైష్ణవులు తప్పక దర్శిస్తారు.


ఆనాడు విష్ణు కంచిని చిన్న కంచియని; శివకంచిని పెద్ద కంచియని అనేవారు. ఇవే కాకుండా షణ్మత మూర్తులున్నాయి. కంచిలో వినాయకుని ఆలయం ఉంది. కొంత ప్రాంతాన్ని పిళ్ళైయార్ పాలయం అంటారు. కామాక్షి ఆలయంలో ఆరేడు వినాయక మూర్తులున్నాయి. కంచి పృధ్వీక్షేత్రం, గణపతి, పృథ్వీ తత్వానికి చెందినవాడు.


ఇక్కడ కుమార కొట్టంగా పిలువబడే ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు. తమిళంలో స్కంద పురాణాన్ని వ్రాసింది ఇక్కడే అని అంటారు. విశిష్టత ఏమిటంటే ఈశ్వరాలయం, అమ్మవారి ఆలయం మధ్యలో కుమారస్వామి ఆలయం ఉంది.


కంచిలో కచ్ఛపేశ్వరాలయంలో సూర్యాలయం ఉంది. ఇందే మయూరుడు వ్రాసిన మయూర శతకం, గోడలపై చెక్కబడింది. కనుక ఇది సూర్యక్షేత్రం కూడా.


ఇట్లా షణ్మతాలకు నిలయంగా కంచి ప్రసిద్ధి పొందింది. షణ్మతాలకు శంకరులకు ముందే ప్రసిద్ధి యుండడం వల్ల ఇక్కడికి చివరి రోజులలో శంకరులు వచ్చారు. లేదా షణ్మత స్థాపనాచార్యులైన తరువాత ఇది ప్రసిద్ధిని పొంది యుండవచ్చు. సప్తమోక్షపురులలో ఇది యొకటని చెప్పాను కదా! ఇట్లా మతంలో, విద్యలో, రాజకీయాలలో వర్తక వాణిజ్యాలలో ప్రసిద్ధిని పొందడం వల్ల 'నగరేషు కాంచీ' అన్నారు.


Monday, 21 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 258 వ భాగం



మార్కండేయ సంహితలోనూ, ఆనందగిరీయంలోనూ సౌందర్యలహరి యని పేర్కొనబడకుండా సౌందర్య సారమని, అంబికాస్తవసారం అని చెప్పడం వల్ల ఈ కథకు బలం చేకూరింది. ఇది వాడుకలో నున్న కథ.


మొదటి భాగం అంతా మంత్రశాస్త్రమయం. నందికేశ్వరుడు కొంత దానిని తీసుకొని పోవడానికి విని సంతోషిస్తున్నాను. వీరు పూరించిన భాగం, కవిత్వంతో, భక్తితో, ఆమె సుందర రూపాన్ని వర్ణించడంలో దీనికి సాటివచ్చే గ్రంథం మరొకటి కనబడదు. వీరి గొప్పదనం లోకానికి ఇట్లా వెల్లడైనందులకు సంతోషం.


పరమేశ్వరుని అజ్ఞానుసారం శంకరులు శృంగేరిలో, కేదారంలో, నీల కంఠంలో, కంచిలో నాల్గు లింగాలను స్థాపించారు. ఇక సిద్ధి పొందుతున్నారనగా మోక్ష లింగాన్ని సురేశ్వరులకు చిదంబరంలో ప్రతిష్ఠించ వలసిందిగా ఇచ్చారట. ఈ మాట ఆనందగిరీయంలో ఉంది.

కంచి యొక్క ఘనత


దిగ్విజయ యాత్రయైన వెనుక చివరగా కాంచీపురానికి వచ్చారు. ఈ నగరం, ప్రాచీన సాహిత్యంలోనే పేర్కొనబడింది. ఇది ఒక గొప్ప విద్యాకేంద్రం. దేశం నలుమూలలనుండీ విద్యార్థులు వచ్చేవారు.


ఈ విద్యాకేంద్రానికే మరో పేరు ఘటికాస్థానం. సంస్కృత విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది. తమిళ గ్రంథమైన మణిమేఖలైలో అనేక మతనాయకులిందుండే వారని చెప్పబడింది. చరిత్ర పునరావృతం అవుతుందని అన్నట్లుగా శంకరుల కాలంలో జైన బౌద్ధాలు అస్తమించినా అవి తరువాతి కాలంలో తల ఎత్తినట్లు మత్తవిలాస ప్రహసనంలో కంచిలోని జైన బౌద్ధాల ప్రస్తావన ఉంది. ఇప్పటికీ బుద్ధ శిల్ప సంపద కంచిలో గోచరిస్తుంది. కంచిలో కొంత భాగానికి జినకంచియని పేరు.


Sunday, 20 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 257 వ భాగం



దీనిని వీరు వ్రాసేరా? అమ్మవారిచ్చిందా? ఆమె ఈయగా లోకంలో వ్యాప్తి చేసారా? అనే సందేహాలు కల్గుతూ ఉంటాయి. ఈ కథ, అనేక శంకర విజయాలలో లేకపోయినా పరంపరగా వస్తోంది.


కథ ఇట్లా ఉంది. అమ్మవారు తాళపత్ర సంపుటినీయగా అది తీసుకొని వీరు తిరిగి వస్తూ ఉన్నప్పుడు కైలాసం నుండి మంత్రశాస్త్రం తరలింపబడుతూ ఉందని నందికేశ్వరుడు అడ్డుకొని దానిని లాగుకున్నాడట. కాని శంకరుల చేతిలో కొన్ని యుండిపోయాయట. 100 తాళ పత్రాలలో 59 నందికేశ్వరుడు లాగుకుంటే మిగతా 41 పత్రాలను శంకరులు తీసుకొని వచ్చారట.


అంతా చిక్కలేదని వీరు బాధపడుతూ ఉండగా అశరీరవాణి వినబడింది. "ఇదంతా నా క్రీడ. నీవు నా మిగతా 59 శ్లోకాలూ వ్రాయవలసింది. నీ మాటలలో వ్రాస్తే విందామని యుంది. మిగిలిన శ్లోకాలకు దీటుగా నీవు వ్రాస్తే సంతోషిస్తాను" ఇది అమ్మవారే అందిట. వీరు వ్రాసి, ఇవి నేను వ్రాసేనా? అవి నీ పలుకులే అన్నారు.


'త్వదీయాభిర్వాగ్ని స్తవ జనని వాంచాంస్తుతిరియం'


ఈ 59 శ్లోకాలూ అమ్మవారి శిరస్సునుండి పాదాలవరకూ ఆమె రూపవర్ణనతో ఉంటాయి. అందు మూడవ శ్లోకంలో అనగా మొత్తం వందలోని 44వ శ్లోకంలో సౌందర్యలహరి అనే మాట ఉంటుంది. మొత్తం దీనిని సౌందర్యలహరి అని; మొదటి 41 శ్లోకాలను ఆనందలహరియని మిగిలిన 59 శ్లోకాలను సౌందర్య లహరియని అంటారు. మొదటిభాగంలో ఎనిమిదవ శ్లోకంలో ఆనందలహరి అనే పదం 'చిదానంద లహరీం' వాడబడింది.


Saturday, 19 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 256 వ భాగం



అయ్యవారు లింగాలనిస్తే అమ్మవారు ఊరుకొంటుందా? ఆమె ఒక తాళపత్ర సంపుటినిచ్చింది. అదే దేవీ స్తోత్రాలలో మకుటాయమానంగా ఉండే సౌందర్యలహరి, మార్కండేయ సంహితలో సౌందర్య సారమని ఉంది. ఆనంద గిరియం, దానిని అంబికాస్తవ సారం అన్నది. జగత్తును అనుగ్రహించడానికని = జగత్యను గ్రహాయ.


సౌందర్యలహరి యనగా సౌందర్యం యొక్క తరంగాలు. ఆమె సౌందర్య సముద్రం, స్తోత్రంలోని ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క తరంగంలా ఉంటుంది.


ఆమెకనేక నామాలున్నాయి. ఇందు సుందరిగానూ నుతింపబడింది. సుందరీ విద్యకు ఆమె అధిష్ఠాత్రి. ఇది దశమహావిద్యలలో ఒకటి. దీనినే శ్రీవిద్యయని అంటారు. ఈమెయే త్రిపుర సుందరి. మూడు భువనాలలోనూ ఇంతకుమించిన అందగత్తె లేదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో జ్ఞానానికి, దయకు నిలయమై అందమైన తల్లిగా అనగా త్రిపుర సుందరియైనది. ఆమె లలితాంబ.


శ్రీ చక్రాన్ని పూజ చేసేటపుడు చంద్రమౌళీశ్వరునకు శక్తిగా త్రిపుర సుందరిని ధ్యానిస్తాం. ఈమెకు చంద్రునితో సంబంధం ఉంది. పూర్ణ చంద్రుడు ఆయన నెత్తిపైనుండగా అందు మధ్యలో ఈమె యుంటుంది. "చంద్రమండల మధ్యగా" అని లలితా సహస్రనామాలలో ఒక నామం. ఈమెకు ప్రత్యేకమైన తిథి, పూర్ణిమయే. సాధన యొక్క చివరి దశలో చంద్రుని మాదిరిగా మన నెత్తిపై అమృతాన్ని కురిపిస్తుంది.


ఆ దివ్యదంపతులు, మధ్యాహ్నంలో తాపంతో బాధపడేవారికి అమృత కిరణాలను ప్రసరింపజేసి చల్లదనాన్ని కురిపిస్తారు. ఆయన చంద్రమౌళి, ఈమె త్రిపుర సుందరి. ఈమె నెత్తిపై చంద్రుడుంటాడు. లలితా సహస్రనామాలలో “చారు చంద్ర కళాధరా” అని యుంది.


Friday, 18 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 255 వ భాగం



ఈశ్వరుని లింగాకారంగానే ధ్యానించాలి. అందుకే ఆయన స్ఫటిక లింగాలనిచ్చాడు.


నిరాకారమైనదే అద్వైతానికి చేరువగా ఉంటుంది. అది ఆది, అంతము లేనిదని శ్లోకం అంటోంది. ఆ మాట అద్వైతానికి దగ్గరే. నిర్గుణ బ్రహ్మమునే పరమాత్మయని అద్వైతులంటారు. స్ఫటిక లింగానికి రంగు లేదు. అదీ అద్వైతానికి ఇష్టమే. పరబ్రహ్మలా శుద్ధమైనది. ఏ పువ్వును దాని దగ్గర పెడితే అదే రంగును చూపిస్తుంది.


అమృతంలో నెత్తి తడుపబడుట దయను చూపిస్తుంది. ఏది జ్ఞానామృతమో, ఏది చల్లనైనదో దానిచేత తడుపబడుతున్నాడు. పంచ భూతాలున్నట్లుగా పంచలింగాలనిచ్చాడు. అతడు పంచ కృత్యపరాయణుడు. అతనికి ఐదు ముఖాలు.


తెలిసి కొన్నవాడు, తెలియబడేది, తెలిసికొను బుద్ధి, ఒక్కటే అంటుంది అద్వైతం. అదే త్రిపుటి. ఇక్కడ కూడా త్రిపుటి యుంది. ఇచ్చినవాడు శివుడు. తీసుకున్నవాడు శివుడు, ఈయబడినది శివతత్త్వము.


అసలు శంకరులే స్ఫటిక చంద్రమౌళీశ్వరులని ఒక శ్లోకం గుర్తుకు వస్తోంది.


ఇది మాధవీయ శంకర విజయంలో ఉంది:


"మూర్ధని హిమకర చిహ్నం, నిటలే నయనాంక మంసయో శూలం వపుషి స్ఫటిక సవర్ణం ప్రాజ్ఞాస్తం మేనిరే శంభుం"


జ్ఞానులు, శిశురూపంలో నున్న శంకరులను చూసి రాబోవు విజయ చిహ్నాలను చూసారట. మూర్ధని హిమకర చిహ్నం నెత్తిపై చంద్రుని గుర్తుంది. అనగా చంద్రమౌళిత్వం; నిటలేనయనం = నుదుటి పై మాడవనేత్రముంది. అంసయోః శూలం = భుజాలపై శూలముంది. వపుషి స్ఫటిక సవర్ణం = మొత్తం శరీరం అంతా స్ఫటికంలా ఉందని. ఇతణ్ణి శంభునిగా గుర్తించారు పెద్దలు.


Thursday, 17 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 254 వ భాగం



అక్కడే శంకరుడు ఐదు స్ఫటికలింగాలనిచ్చాడు. ఈ మాట శివ రహస్యంలో, మార్కండేయ సంహితలోనూ ఉంది. కాశీలో ఇచ్చినట్లు శివరహస్యం చెప్పింది. వీటిని కైలాస లింగాలని అంటారు. ఇవి యోగలింగం, భోగలింగం, వీరలింగం, ముక్తి లింగం, మోక్ష లింగాలు. యోగలింగాన్ని కంచిలో, భోగలింగాన్ని శృంగేరీ మఠంలో; వరలింగాన్ని నేపాల్లోని నీలకంఠ క్షేత్రంలో; ముక్తి లింగాన్ని కేదారంలో; మోక్షలింగాన్ని చిదంబరంలో ప్రతిష్ఠించారు. ఇవి అన్నీ స్ఫటిక లింగాలే.


శివపూజా సమయంలో మనం, ఈ దిగువ శ్లోకాన్ని పఠిస్తాం:


ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావి స్ఫురత్

జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః 

అస్తో కాపుత మేక మీ శమనిశం రుద్రానువాకాన్ జపన్ 

ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో భిషించేచ్ఛివం


ముందు భాగంలో ఎట్లా శివుణ్ణి ధ్యానం చేయాలో చెప్పింది. స్వామిని అంతటా వ్యాపించిన జ్యోతి స్వరూపునిగా ధ్యానించాలి. స్ఫటిక లింగంగా ఉన్నట్లు భావించాలి. అతని నెత్తిపై పూర్ణ చంద్రుడున్నట్లు ధ్యానించాలి. ఆకారం లేని మూర్తిపై పూర్ణచంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆకారం ఉన్న మూర్తిపై తదియనాటి చంద్రుడుంటాడు. అందుకే వాటిని చంద్రమౌళీశ్వర లింగాలని అంటారు.


పూర్ణచంద్రుని నుండి అమృత స్రావం - ఆప్లుతం, అనగా దానిచే అభిషేకింపబడ్డాడు. అందుకే అతనికి అభిషేకం చేస్తాం. ఒక్క చుక్క వేసినా సంతోషిస్తాడు.


Wednesday, 16 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 253 వ భాగం



తరువాత కాశ్మీరునకు వెళ్ళారు. విద్వాంసుల నోడించారు. అక్కడే శారదా పీఠాన్ని అధిరోహించారు. అక్కడ ఒక విద్వాంసురాలైన యువతికి తలమీద తలపాగా ఉన్నట్లుగా ఉండే ఒక ఆభరణాన్ని బహూకరించారు. దానిని తరంగం అంటారట. ఇప్పటికీ ప్రజల వాడుకలో ఇది ఉంది.


శ్రీనగర్ లో శంకరాచార్య గిరి అనే పర్వతముంది. సుదూరమైన ఉత్తర ప్రాంతంలో వీరికట్టి గౌరవం లభించింది.


బదరి వెళ్ళినపుడు ఒక ముఖ్య సంఘటన జరిగింది. అక్కడ జ్యోతిర్మఠాన్ని స్థాపించారు. అక్కడ బదరీ నారాయణ విగ్రహం, అలకనందలో పడిందని, స్వామియే శంకరులకు కలలో కనబడి చెప్పాడని దానిని వీరు వెలికి తీసి ప్రతిష్ఠించారని అంటారు. అక్కడ వేడి నీటికుండం ఉంది. దానిని తప్త కుండమని అంటారు.


అక్కడ ఎందరో వీరికి పాదాభివందనాలు చేసి జగద్గురువని కీర్తించారు. శంకరులు తమ గురు, పరమ గురువులకు వందనాలను చెయ్యాలని సంకల్పించగానే వారూ వీరిపై అనుగ్రహంతో అక్కడ సాక్షాత్కరించారు. వీరు దక్షిణమూర్తి అష్టకాన్ని చదివి ప్రతి శ్లోకానికి ఒకమారు సాష్టాంగ నమస్కారం వారి గురువులకు చేసారట.


శివ శక్తి దర్శనం -


'మాతా చ పార్వతీ దేవీ! పితాదేవో మహేశ్వరః' అని వీరు వ్రాసేరు. వీరు అవతార పురుషులైనా పిల్లవాని మాదిరిగా ఉండి భక్తిని ప్రదర్శించవద్దా? ఇంతవరకు అర్చామూర్తులను దర్శించారు. ఇపుడు సాక్షాత్తు శివపార్వతుల దర్శనానికి కైలాసానికి యోగశక్తి ద్వారా వెళ్ళినట్లు చెబుతారు.


Tuesday, 15 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 252 వ భాగం



చెన్నైలోని మైలాపురంలో అమ్మవారు, మయూరియై పూజించినట్లు కథ, తిరువాట్రియార్ వెళ్ళిన శంకరులు, అక్కడకూ వెళ్ళే యుంటారు.


శివానందలహరిని, శ్రీశైలంలో వ్రాసి యుంటారు. ఆలయ గోపురం ముందు ద్వారంలో శంకరుల మూర్తి యుంది. శ్రీశైలం దగ్గర హాటకేశ్వరంలో ఒక మఱ్ఱి చెట్టు దగ్గర, ఒక వాగు సమీపంలో కొంతకాలం నిష్ఠలో గడిపారు.


కన్నప్ప అనే భక్తుణ్ణి స్మరించారు కనుక కాళహస్తి వెళ్ళియుంటారు. అక్కడ అమ్మవారు జ్ఞానాంబ. అది ప్రసిద్ధ క్షేత్రం. తిరుపతి స్వామిని దర్శించి ధనాకర్షణ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అందుకే ఎప్పుడూ అక్కడ కానుకల వర్షం. పండర్ పూర్లో పాండురంగాష్టకం; ఒరిస్సాలో జగన్నాథాష్టకం వ్రాసేరు. ఆ ప్రదేశాలను దర్శించినట్లే.


ద్వారకలో మఠాన్ని స్థాపించారు. అచ్యుతాష్టకం, గోవిందాష్టకం, ఇంకా పెక్కు స్తోత్రాలు కృష్ణునిపై ద్వారకలో, మధురలో, బృందావనంలో వ్రాసి యుంటారు. అయోధ్యలో రామభుజంగ స్తోత్రం వ్రాసి యుండవచ్చు.


శివ స్తోత్రాలను కాశీలో వ్రాసేరు. దీనికి సాక్ష్యం, అన్న పూర్ణా స్తోత్రమే. కాశీ పంచకం, గంగాష్టకం, మణికర్ణికాష్టకం మొదలైనవి వ్రాసేరు. యమునపై వీరి అష్టకం ఉంది. నర్మదలో సన్న్యాసం పుచ్చుకున్నారు కదా. నర్మదాష్టకం వ్రాసేరు.


Sunday, 13 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 250 వ భాగం



మాతృ మరణం


వీరి మాతృమూర్తికి చివరి ఘడియలలు రానే వచ్చాయి. అంత్యక్రియలను చేస్తానని మాట ఇచ్చారు కదా. గ్రహించి కాలడి వచ్చారు. స్తోత్రాలను వినిపించారు. అద్వైత ముక్తి రావాలనే వీరు కోరారు. అయితే ఆమెకది దక్కలేదు. అందువల్ల శివసంబంధ స్తోత్రాలను పఠించారు.


కైలాసం నుండి భూత గణాలు రాగా ఆమె భయపడింది. విష్ణు స్తోత్రమైన కృష్ణాష్టకాన్ని పఠించగా విష్ణు దూతలు వచ్చినట్లు, ఆమెకు వైకుంఠ ప్రాప్తి కల్గినట్లు ఐతిహ్యం.


అంత్య క్రియలు చేయబోతే అక్కడున్న పండితులు సన్యాసికి ఇట్టి అర్హత లేదని ఎదుర్కున్నారు. వారు సహకరించలేదు.


అందుచేత వీరు మాతృశవాన్ని ఇంటి పెరటిలోనికి తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు జరిపారు. ఈనాటికీ నంబూద్రీలు అట్లా చేస్తారు.


అక్కడ రెండు కుటుంబాల వారు వీరికి సహాయానికి వచ్చారని, ఇంటి పెరడులోని శరీరం తలదగ్గర, కాళ్ళ దగ్గర వారు నిలబడ్డారని అంటారు.


Saturday, 12 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 249 వ భాగం



కాశీలో సుమేరు మఠమని, పాదుకా మఠమని ఉన్నాయి. వీటిని పునరుద్ధరించాలని చాలామంది స్వాములు, పండితులు విజ్ఞప్తి చేస్తూ కాశీలో శంకరులు కొంతకాలం ఇక్కడ ఉన్నారని చెప్పబడింది.


గత శతాబ్దంలో ప్రచురింపబడిన Light of the East సంపుటాలలోని ఒక సంపుటంలో శంకరులు జ్యోతిర్మఠమే కాక, గంగోత్రిలోనూ ఒక మఠాన్ని స్థాపించినట్లుంది. గోరఖ్ పూర్లోని గీతా ప్రెస్ వారు ప్రకటించిన తీర్ధాంక్ లోని ఉపోద్ఘాతంలో గంగోత్రి మఠం, సుమేరు మఠాల గురించి యుంది.


త్రిచూర్లో ఐదు శంకర మఠాలున్నట్లు కొచ్చిన్ స్టేట్ మాన్యువల్ అనే పుస్తకం ప్రచురించింది. ప్రస్తుతం రెండే ఉన్నాయి. ఇందున్న దక్షిణ మఠంలో ఈ పీఠాన్ని 80 మంది అధిరోహించినట్లుంది. ఉత్తర మఠం, ఈనాడు బ్రహ్మ స్వమఠంగా పిలువబడి, అది వేద పాఠశాలగా మారింది. పూరీ జగన్నాథంలో ప్రధానమైన గోవర్ధన మఠంతో బాటు శంకరానంద మఠం, శివతీర్ధమఠం, గోపాల తీర్ధమఠాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అద్వైత సంప్రదాయానికి చెందినవే.


ఇక విద్యారణ్య స్వామివారు, క్రొత్త మఠాలను స్థాపించారని, పాత వాటిని పునరుద్ధరించారని 'నవమాది నాథులు' అనే బిరుదు వారికి వచ్చిందని కన్నడ ప్రాంతంలో, దానికి చేరువగానున్న తెలుగు ప్రాంతంలో అంటారు. పై తీర్ధాంక్ ని బట్టి కర్ణాటక, ఆంధ్ర, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాలలో 15 మఠాలున్నట్లు తెలుస్తోంది. దాని భూమికలో ఇవే కాకుండా రామేశ్వరం, శ్రీశైలంతో కలిపి 21 మఠాలున్నట్లు తేలింది.

 

పై మఠాలు శంకరుల శిష్యుల పేర్లతో ఉన్నాయి. త్రిచూర్ మఠాలను పద్మపాదుడు, సురేశ్వరాచార్యులు స్థాపించారని అంటారు. జ్యోతిర్మఠానికి అనుబంధంగా శకటపురం మఠాన్ని తోటకాచార్యులు స్థాపించినట్లుంది.


ఇట్లా పరిశోధన చేసినకొలదీ ఎవరే మఠాన్ని స్థాపించారనే విషయం తెలియవచ్చు. అయినా ఇట్టి పరిశోధన, జ్ఞానాన్ని గాని, భక్తిని గాని కలిగించదు. చాలావాటిని శంకరులు స్థాపించి యుండవచ్చు. ఇట్లా శంకరులు లేదా వారి శిష్యులు స్థాపించి యుండవచ్చు.


Friday, 11 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 248 వ భాగం



ఎందుకిట్లా చెబుతున్నానంటే అద్వైతి అట్టి పని చేయడు. విద్యారణ్య, అప్పయ్య దీక్షిత, వాచస్పతి మిశ్ర వంటివారు అద్వైత దిగ్ధంతులు. అయినా వారికి భిన్నమైన సిద్ధాంతాలపై వ్యాఖ్యలు వ్రాసేరు. ఇది స్పష్టాతి స్పష్టం. మరొక చిత్రమేమిటంటే అద్వైతులు కానివారు, భక్త్యావేశంలో అద్వైత సత్యాలను అప్రయత్నంగా పలికారు. బౌద్ధిక స్థాయిలోనే వారు అద్వైతాన్ని ఎదుర్కొన్నారు.


కవులు, రచయితలే కాదు, ఆధునిక కాలానికి చెందిన ఐన్స్టీన్, సర్ జేమ్సు జీన్సు వంటివారి రచనలలో అద్వైత వాసనయే కనబడుతుంది. ఒకే శక్తి, భిన్న పదార్థాలుగా కన్పిస్తోందని అనలేదా? శక్తికి, ద్రవ్యానికి అభేదాన్ని ప్రతిపాదించారు కదా. సాపేక్షిక సత్యం అని సైన్సు అనగా అద్వైతులు దానిని ప్రాతిభాసిక సత్యమన్నారు. అన్ని మతాల సారాంశమైన అద్వైతాన్ని అందించారు. మతానికి విరుద్ధం అనబడే సైన్సులోనూ అద్వైత సత్యం ఉంది. శంకరులంటేనే ప్రేమ, అనురాగం, సంతోషం. ఇట్లా జగత్తునకు అన్నిటినీ సమకూర్చారు. అందరినీ ప్రేమతో బంధించారు. వీరిపై ఏవో పరిశోధనలు చేసి ఆ పేరుతో ఏదో వ్రాయడం కంటె వీరి సమన్వయ ధోరణిని గుర్తించండి. మనమూ వారి సిద్ధాంతానుగుణంగా పరస్పరం ప్రేమించుకుంటే ఇంక కావలసినది ఏముంది?


శంకర మఠాలు


సిద్ధాంతాలు కలకాలం ఉండాలని మఠాలను స్థాపించారు. శిష్యులనందుంచారు. ఇవి అద్వైత సిద్ధాంతాన్ని మాత్రమే బోధించేవి కావు. సిద్ధాంత ప్రచారానికి ప్రత్యేక వ్యక్తులుంటారు. సామాన్య ప్రజలలో కర్మానుష్టానం, భక్తి, వేద శాస్త్రాలపై విశ్వాసం, శాస్త్ర సందేహాలను నివారించుట మొదలైన పనులుంటాయి.


ప్రసిద్ధమైన ఐదు మఠాలనే కాక ఎన్నిటినో స్థాపించి యుంటారు. విదేశీయుల దండయాత్రలలో అవి నేలమట్టమై పోయి ఉండవచ్చు. కాశీలోని విశ్వనాథ ఆలయాన్ని ఎన్నిసార్లు కూలగొట్టారు? ఎన్నిసార్లు మన వాళ్ళు పునరుద్ధరించారో తెలుసు కదా. అట్లాగే అయోధ్య, మధురలలో కూడా జరిగింది.


అట్లా ఎన్నో మఠాలు నేడు కనబడడం లేదు. మొత్తం దేశంలో ఐదు మఠాలున్నట్లుగా కాశీలోనే ఐదు మఠాలు, త్రిచూర్ లో ఐదూ ఉన్నాయి. గత శతాబ్దంలో ఇంద్ర పరంపరంలో ఉండే స్వాములు కాశీలో ఉండేవారు. శివాలయ ఘాట్ లోని బ్రహ్మేంద్ర మఠంలోని శాసనంతో వీరి ప్రస్తావన ఉంది. చంద్రశేఖర స్వామి యొక్క శిష్యుడైన విశ్వనాథ స్వామి గురించి యంది.


Thursday, 10 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 247 వ భాగం



ఒక ఎర్రని పువ్వును స్ఫటికం దగ్గర పెట్టామనుకోండి. స్ఫటికం, ఎర్రగా కనబడడం లేదా? సత్యమైన వస్తువు లేకుండా ఇట్టి భ్రాంతులు కలగవనే మాటను గుర్తించండి. ఇట్లా బ్రహ్మమునందు ఆరోపింపబడిన జగత్తు అసత్యము. అజ్ఞానంలో దేనిని సత్యమని భావిస్తున్నాడో జ్ఞానం కలిగిన తరువాత అది అసత్యమైపోతుంది. దానిని ప్రాతిభాసిక సత్యమన్నారు. ఎండలో ఆలుచిప్ప వెండిగా కనబడినట్లు, (మనకనుభవంలో ఉన్న సత్యం, కొంతకాలమే ఉంటుంది. అనగా వ్యావహారిక సత్యం, నిత్య సత్యం, పరబ్రహ్మమే. వ్యావహారిక సత్యం ఇళ్ళూ వాకిళ్ళూ వంటివి. కొంతకాలం ఉండి కనుమరుగై పోతుంది).


ఇట్లా భేదాలను వివరించాను. అయితే భిన్న మతాలలోని కొన్ని సూత్రాలను గ్రహించింది అద్వైతం. మీమాంసనుండి కర్మను; బౌద్ధులనుండి జగత్తు యొక్క అసత్యాన్ని; భక్తి సిద్ధాంతాన్ని; అట్లాగే న్యాయ, వైశేషిక, సాంఖ్యయోగాలలోని విషయాలను తగువిధంగా స్వీకరించింది. గీతాభాష్యంలో సాంఖ్యం గురించి చెబుతూ, వారి సిద్ధాంతంతో విభేదించినా వారు చెప్పిన త్రిగుణాల వల్ల (సత్త్వ రజస్తమోగుణాలు) జీవుడు సంతోషిస్తున్నాడనే మాటను స్వీకరిస్తున్నామని అన్నారు. మీమాంసనుండి ఆరు ప్రమాణాలను స్వీకరించింది.


వీరి యోగ తారావళిని చూస్తే, యోగాభ్యాసాన్ని వీరంగీకరించినట్లే. ఇట్లా అన్ని సిద్ధాంతాలూ అద్వైతానికి దోహదం చేసాయి. ఒక దశలో మిగిలిన వారు చెప్పినవి స్వీకరింపదగినవే అని వీరి అభిప్రాయం. వాటిని అనుసరిస్తూ లక్ష్యమైన అద్వైతాన్ని విస్మరించవద్దని అన్నారు. ఇది వీరి నిశ్చితమైన అభిప్రాయం.


అన్ని శాస్త్రాలను పరిశీలించారు. ద్వేషభావాన్ని ప్రకటించలేదు. ఉదాహరణకు, అమరసింహుని కథ చెబుతా. ఇతడు జైనుడు. శంకరుల చేతిలో ఓడిపోయి తాను వ్రాసిన గ్రంథాలను తగుల బెట్టాడు. అరెరె సిద్ధాంతాలను లేకుండా చేయడమేమిటని శంకరులక్కడికి వెళ్ళారు. అతని చేతిలో 'అమరకోశం' ఒక్కటే ఉంది. అది సంస్కృత నిఘంటువు. దీనిని అగ్నిలో వేయకుండా ఆ పుస్తకాన్ని రక్షించగలిగారు.


అయితే వీరు నిర్మూలించిన 72 మతాల గ్రంథాలూ కనబడడం లేదు. వీరికి ముందు వ్రాసిన వారి సూత్ర భాష్యాలూ దొరకడం లేదు. అట్లా అని వాటిని తగుల బెట్టారనే భ్రాంతి పడవద్దు సుమా! పైవారి అనుయాయులే వీరు వచ్చిన తరువాత వాటిని లేకుండా చేసియుండవచ్చు.


Wednesday, 9 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 246 వ భాగం



బౌద్ధంలో, మీమాంసలో సగుణ బ్రహ్మమైన ఈశ్వరుడు లేడు; నిర్గుణ బ్రహ్మమూ లేదు. సాంఖ్యంలో సగుణ బ్రహ్మము లేదు. యోగ, న్యాయ, వైశేషికాలలో సగుణ నిర్గుణ బ్రహ్మల ప్రస్తావన యున్నా ఒకదానికి మరొక దానికి సంబంధం చెప్పకుండా, జీవ జగత్తులకు సమన్వయించకుండా ఉంటాయి. భక్తి సిద్ధాంతాలలో కేవలం సగుణ బ్రహ్మయే ఉంటాడు. నిర్గుణ బ్రహ్మము గురించి ఎత్తుకోరు.


అద్వైతంలో రెండూ ఉన్నాయి. మాయ యనగా జడ ప్రకృతి, ప్రపంచాన్ని బ్రహ్మము నాధారంగా చేసుకుని సృష్టిస్తోందని అంటుంది. అనగా నిర్గుణ బ్రహ్మము, సగుణంగా మాయతో మారి జగత్తును చూపిస్తోందని అంటుంది. ఇట్లా నిర్గుణ సగుణ బ్రహ్మలకు, జీవ జగత్తులకు సమన్వయం ఉంటుంది.


ఇక సృష్టి గురించి - జగత్తును, ఈశ్వరుడు సృష్టించడమేమిటి? జగత్తు అనాదిగా ఉందని, కర్మలు చేస్తే ఫలాలు వస్తాయని మీమాంసకులంటారు.


జడ ప్రకృతిలోనున్న సహజ శక్తియే నడిపిస్తోందని చార్వాకులంటారు. ఇక స్వామి లేడు, కర్మలవసరం లేదు. కర్మ ఫలాలూ వట్టిమాటయని అంటారు. న్యాయ వైశేషికాలు జగత్తంతా అణుమయమని, ఈశ్వరుడు వీటిని కలుపుతున్నాడని, క్రొత్త వాటిని సృష్టిస్తున్నాడని అంటాయి. దీనిని ఆరంభ వాదమని అంటారు. సాంఖ్య, యోగాలు, సృష్టికి, ఈశ్వరునకు సంబంధం లేదని కొత్తవాటిని సృష్టించడం అంటూ లేదని అంటాయి. ప్రకృతి (మాయ) ప్రపంచంగా మారిందని దీనిని పరిణామవాదమంటారు.


అద్వైతం ఏమంటుంది? నిజమే లేనిదానిని సృష్టించడం అంటూ ఉండదు. అణువూ సత్యం కాదు, వీటిని కలపడం వల్ల జగత్తు ఏర్పడిందని అనడమూ తప్పే. పరిణమించడం అంటూ లేదు. అదే నిజమైతే మొదటి ప్రకృతి, కనుమరుగు కావాలి కదా! కనుక సృష్టి లేదు, మార్పులేదు. అయితే ఏమిటి? ఒక వస్తువు, మరొక వస్తువుగా అనగా చీకట్లో త్రాడు, పాముగా కనబడడమే జరుగుతోంది. అట్లా బ్రహ్మము, జగత్తుగా కన్పిస్తోంది. దేనివల్ల? మాయవల్ల. మరొక విధంగా చెప్పాలంటే మాయతో కూడిన నిర్గుణ పరబ్రహ్మము, సగుణ బ్రహ్మమై జగత్తుగా కన్పింపచేస్తున్నాడు. చీకట్లో త్రాడు, పాముని సృష్టించలేదు. ఇక త్రాడు, పాముగా మారలేదు. అట్లా జగత్తు సృష్టింపబడలేదు. పరిణామం చెందనూ లేదు. అట్లా కేవలం కన్పిస్తోంది. దీపం తీసుకుని వచ్చినపుడు చీకటి పోతోంది. త్రాడును, పాముగా చూడడమూ పోయింది. అట్లే జ్ఞానం కలిగినపుడు చీకటియనే మాయలేదు. ఇంతకుముందు జగత్తుగా కనబడినది, బ్రహ్మమే అనే అనుభూతి కల్గుతుంది.


సృష్టి లేకుండా, పరిణామం లేకుండా కేవలం ఇట్లా కనబడడాన్ని వివర్త వాదమంటారు.