Showing posts with label కార్తీక పూర్ణిమ. Show all posts
Showing posts with label కార్తీక పూర్ణిమ. Show all posts

Thursday, 6 November 2014

అరుణాచల శివ

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

చిదంబర దర్శనం, తిరువళ్ళూర్‌లో జన్మించడం, కాశీలో మరణించడం, అరుణాచల స్మరణం ముక్తిని ప్రసాదిస్తాయి. మనకున్న పంచభూత శివ క్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీకయైన అగ్నిలింగం అరుణాచలంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదం తీర్చడానికి, పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే మహాతేజోవంతమైన అగ్నిలింగంగా తన రూపాన్ని ప్రదర్శించాడని స్థలపురాణం.

అరుణాచలం పర్వతమే పరమశివుడు, పరమశివుడే అరుణాచల పర్వతం. అందుకే ఇక్కడ గిరిప్రదక్షిణం పేరున కొండ చుట్టు ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలం పర్వత గుహలలోనే శ్రీ దక్షిణామూర్తి ఇప్పటికి ఉన్నారు. అరుణాచలం ఒక అద్భుతం. ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. అరుణాచల పర్వతం మీద కార్తీక పూర్ణిమ రోజు వెలిగించే కార్తీక దీపం చూడడానికి దేశవిదేశాల నుంచి లక్షల మంది జనం తరిలివస్తారంటే తిశయోక్తి కాదు. ఈ రోజు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు. ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశవరుడు, అమ్మవారి పేరు అపితకుచాంబిక.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ, మేము ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగులోని వెళ్ళెదము గాకా అన్న ఉపనిషత్ వాక్యానికి ఈ జ్యోతియే నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ అరుణాచల కార్తీక దీపాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మన మనసుకు జ్ఞానం పొందేలా ప్రేరణ కలుగుతుంది.

చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు, తిరువళ్ళురులో జన్మించడం మన చేతిలో లేదు, కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళినవారందరూ అక్కడే మరణించరు, ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలోనే ఉంది. మీరు, నేను అనుకుంటే వచ్చేది కాదు ముక్తి, పైవాడి అనుగ్రహం ఉండాలి. అందుకోసం వాడి అనుగ్రహం పొందాలి. వాడి అనుగ్రహం కోసం నిత్యం అరుణాచలాన్ని స్మరించండి.   
     
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా

Wednesday, 5 November 2014

కార్తీక పౌర్ణమి

కార్తీక పౌర్ణమి విశేషాలు
జ్వాలాతోరణం - శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. మనకు ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు. ఈ రోజు చేసే స్నాన, పాన, దాన, దీప దానములతో పాటు చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం "జ్వాలతోరణం".

కార్తీకపౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయప్రాంగణంలో, ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు. దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు, భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం క్రింది నుంచి దాటుతారు.

దీనికి సంబంధించి రెండు కధలు ఉన్నాయి.

ఒకటి, త్రిపురాసురలనే 3 రాక్షసులను పరమశివుడు సంహరించింది ఈ రోజునే అని పురాణం చెప్తోంది. అందువల్ల దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడుం కైలాసానికి చేరగా, తన భర్తకు దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీమాత, దృష్టిదోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది.

రెండవ కధ అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతంకోసం దేవతలు,రాక్షసులు కలిసి క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు పొగలు కక్కుతూ హాలాహలం (కాలాకూట విషం) పుట్టింది. హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగుపరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమన్నారు. జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. లోకహితం కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు కానీ మ్రింగితే అయన కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే, దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు. అప్పుడు శివుడు గరళ కంఠుడు / నీల కంఠుడు అయ్యాడు. ఇది జరిగాక పరమశివునితో కలిసి పార్వతి దేవి కుటుంబసమేతంగా  మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది. ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుంది.

ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరింపబడతాయని,ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం చెప్తోంది. జ్వాలాతోరణం క్రిందినుండి వెళ్ళడం వలన నరకద్వారా ప్రవేశం తొలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే, ఆ ఆత్మను ఒక కుక్క భై అనే గట్టి అరుపులతో తరుముతుంది, తెలిసినా వాళ్ళు ఎవరు ఉండరు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు. అలా చాలా దూరం వెళ్ళాక, దూరంగా ఒక కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చన భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగెట్టి, ఒక భయకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి, నరకంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ వెంటపడి తరిమిన్న కుక్క భైరవుడు, శివగణాలలో ఒకడు. అప్పుడు ఆత్మ అనుభవించే బాధా వర్ణనాతీతం. అటువంటి పరిస్థితి రాకూడదని, తన బిడ్డలెవరు బాధపడకూడదని, మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీకపౌర్ణమి రోజున జ్వాలతోరణం దాటే వారికి ఈ నరకబాధ నుంచి విముక్తినిస్తాడు. అందుకే ప్రతి శివాలయంలో కార్తీకపౌర్ణమి నాడు విశేషంగా జ్వాలతోరణం జరుపుతారు.

ముఖ్యమైన విధులు: ఈ రోజు చేసే ఉపవాసానికి విశేషఫలం ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి.

కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||

ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు (insects), పక్షులు, దోమలు, చెట్లు,మొక్కలు, ఉభయచరాలు (amphibians) అన్ని కూడా, అవి ఏ ఏ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం.ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు. కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మనకు లాగే అవి భగవంతున్ని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి.

Tuesday, 4 November 2014

కార్తీక పౌర్ణమి - సముద్ర స్నానం

కార్తీకపూర్ణిమ, సముద్ర స్నానం.

శాస్త్రంలో సముద్రస్నానానికి ప్రత్యేకత ఉంది. ఆషాడ, కార్తీక, మాఘ, వైశాఖ పూర్ణిమలకు తప్పకుండా సముద్ర స్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి పూర్వమే చేయాలి.

కార్తీక మాసంలో చంద్రకిరణాల నుండి అమృతబిందువులు వర్షిస్తాయి, అవి మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాదు, చంద్ర కిరణాలతో మధుమేహానికి ఔషధం తయారుచేసే పద్ధతి మనం దేశంలో ఉంది. ఈ చంద్రకిరణాలు, చంద్రుడి ప్రభావం నీటిపై అధికంగా ఉంటుంది, పూర్ణిమ రోజున మరింత విశేషంగా ఉంటుంది. చంద్ర కిరణ ప్రభావిత నీటిలో చేసే స్నానం అనేక రోగాలను నయం చేస్తుంది. అందుకోసమే కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయానికి పూర్వమే సముద్రస్నానం చేయాలి.

ఇక ఆయుర్వేద పరంగా చెప్పుకుంటే, ఈ రోజు చేసే సముద్రస్నానం చలికారణంగా మన చర్మం మీద ఏర్పడిన పగుళ్ళను, గాయాలను నయం చేస్తుంది. శరీరంలో అధికంగా పేరుకుపోయి బద్దకాన్ని కలిగించే విద్యుత్ అయస్కాంత శక్తిని తొలగిస్తుంది. ఉదర, కాలేయ సంబంధిత రోగాల బారినపడకుండా రక్షిస్తుంది.  

కనుక సముద్ర స్నానం చేయాలనుకునేవారు తగిన ఏర్పాట్లు చేసుకోండి.     

Saturday, 16 November 2013

కార్తీక పూర్ణిమ - దీపారాధన

కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి.

కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షే
జలే స్థలే యే  విచరన్తి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||

ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు (insects), పక్షులు, దోమలు, చెట్లు,మొక్కలు, ఉభయచరాలు (amphibians) అన్ని కూడా, అవి ఏ ఏ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం.ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు. కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మనకు లాగే అవి భగవంతున్ని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి.