Showing posts with label గాణాపత్యం. Show all posts
Showing posts with label గాణాపత్యం. Show all posts

Sunday, 19 September 2021

గాణాపత్యంలోని సౌందర్యం ఏమిటి?



మన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలు కొందరు దేవతలను ఒప్పుకోవు. పేర్లు చెప్పవలసిన పనిలేదు గానీ శివుడు, గౌరీ, గణేశుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతల ఆరాధన అక్కర్లేదని చెప్పే సంప్రదాయాలు కూడా మన ధర్మంలో కనిపిస్తాయి. అదేగాక ప్రతి మతము (సనాతన ధర్మలోని మతాలు - శైవ, శాక్తేయ, వైష్ణవ మొదలైనవి) తాము పూజించే దేవతయే పూర్ణమని, మిగితా దేవతలు కామ్యసిద్ధిని ఇస్తారే గానీ, మోక్షం ఇవ్వరని ప్రతిపాదన చేస్తాయి. కానీ గాణాపత్యంలోని సౌందర్యం ఏమిటంటే అది సకల దేవతలనూ సమానంగా చూస్తుంది. గణపతిని పూర్ణబ్రహ్మంగా ప్రతిపాదించినా; శివుడు, అంబిక, సూర్యుడు, విష్ణువు పరబ్రహ్మస్వరూపాలేనని ప్రతిపాదిస్తుంది. అన్యదేవతలను సైతం ప్రార్ధించాలని చెబుతుంది. ఈ రోజు ఏదైతే మన ధర్మానికి కావాలో అదే అందులో చెప్పబడింది. తాను పూజించే దేవతా మూర్తిని కీర్తిస్తూ, అన్యదేవతలను గౌరవించడం, తక్కువ చేయకపోవడం. 


ముద్గల పురాణంలో కూడా ఇదే విషయం విశేషంగా ప్రస్తావించబడింది. ఉన్నది ఒకటే బ్రహ్మము. అది సర్వకాల సర్వావస్థల్లో సర్వత్రా వ్యాపించి ఉంది. దాన్ని నీవు ఏ రూపంతో ఉపాసిస్తే ఆ రూపంతోనే కోరికలు తీరుస్తుంది. అది నారాయణ, శివ, శక్తి, సూర్య, సుబ్రహ్మణ్య, చివరకు గణేశుడైనా సరే, మనస్సుకు, మాటలకు అతీతుడైన ఆ పరబ్రహ్మమే. సర్వదేవతలకు, సర్వ సృష్టికి మూలం అదే అని ముద్గల మహర్షి స్పష్టంగా చెప్తారు.


మనమంతా ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన మార్గంలో నడుస్తున్నాము. మనకు శంకరులు చెప్పింది కూడా ఇదే. ఇష్టదేవతను ప్రధాన దేవతగా పూజిస్తూ, ఇతరదేవతలను ఆవరణ దేవతలుగా అర్చించడం. అదే పంచాయతనంలోనూ కనిపిస్తుంది.

Saturday, 18 September 2021

గణపతి అర్చనలో అత్యంత ముఖ్యమైన మూడు పువ్వులు



గణపతి అర్చనలో అత్యంత ముఖ్యమైనది, గణపతి త్వరగా సంతుష్టుడయ్యేది మూడింటితో. అవి గరిక, మందార పుష్పం మరియు శమీ పుష్పాలు.


దుర్వా గంధ మాత్రేణ సంతుష్ఠోసి గణాధిపః ||


గరిక పోచల వాసన తగలడంతోనే గణపతి సంతుష్ఠుడవుతాడు.


అయితే గరిక వాసన ఆయనకు ఎప్పుడు తగులుతుంది ? ముక్కుకు దగ్గరగా పెట్టుకున్నప్పుడు. అంటే గణేశుడి తొండానికి దగ్గరగా దుర్వా ఉంచినప్పుడు ఆయన సంతుష్ఠుడవుతాడు. అందుకే యోగిన్ద్ర మఠం (గాణాపత్య మఠం) పరంపరలో అర్చనా క్రమాన్ని ఈ విధంగా చెప్పారు.


ముందు అన్ని రకాల సుగంధ పుష్పాలతో అర్చన ప్రారంభించాలి. వాటి తరవాత ఎఱ్ఱని పుష్పాలు. తర్వాత బిల్వ పత్రాలు, బిల్వం మీద శమీ పుష్పాలు, వాటి మీద అర్క పుష్పాలు. జిల్లేడు పువ్వుల్లో నీలి రంగువి కనిష్టం, ఎరుపు మధ్యమం, తెలుపు శ్రేష్ఠం. కనుక నీలి అర్కపుష్పాల, వాటి మీద ఎఱుపు, ఆ తర్వాత తెల్లజిల్లేడు పూలు అర్పించాలి. వాటి మీద గరిక సమర్పించాలి. అందులోను పచ్చని దుర్వాలు, వాటి తరువాత శ్వేత దుర్వాలు అర్పించాలి.  


ఒకసారి దుర్వాలు అర్పించిన తర్వాత ఇక గణేశుడికి ఏదీ అర్పించకూడదు. దుర్వాల తర్వాత ఇక ఉత్తరపూజ అనగా ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.   

Friday, 17 September 2021

గాణాపత్యం - గురుమండలం



గాణాపత్యం కూడా ఒక విస్తారమైన మతము. మహారాష్ట్రలో ఇప్పటికీ గాణాపత్యులు ఉన్నారు. గాణాపత్యంలో మొత్తం 64 మంది గురువులతో గురుమండలం ఉంది. గణపతి మంత్ర ద్రష్ట గణక ఋషి. దత్తాత్రేయుడు, గౌడపాదాచార్యులు మొదలైన వారు ఈ పరంపరలో కనిపిస్తారు.  


వినాయక రహస్యం అనే ఒక గొప్ప గాణాపత్య గ్రంథం ఉంది. అందులో భవిష్యవాణి ఈ విధంగా చెప్పబడింది. "కలియుగంలో ఒక వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, గాణాపత్యంలోని పరమగురువైన గణక ఋషి ప్రయాగ వద్ద గౌడపాదులుగా అవతరిస్తారు. ఆయన తన శిష్యులకు జ్ఞానబోధ చేసి మోక్షమార్గం చూపుతారు. ఆయనకు సాక్షాత్తు శివుడే ఆదిశంకరులుగా అవతరించి గొప్ప శిష్యునిగా మారుతారు. అద్వైతవేదాంతాన్ని, వేదసారాన్ని వ్యాప్తి చేయడంలో ఈయన కీలకుడవుతాడు. 10 ఉపనిషత్తులకు వ్యాఖ్య రాసి మహావాక్యాల యొక్క సారన్ని బోధ చేస్తారు."  


గౌడపాదుల బోధలకు సమానమైనవి మనకు ముద్గల పురాణంలో సైతం కనిపిస్తాయి. ఇలా గణేశ భక్తులకు అద్వైత సంప్రదాయ రక్షణ మరియు వ్యాప్తి అనేది ముఖ్యమైన కర్తవ్యం. 


అయితే గాణాపత్యంలో బుద్ధుడిని కూడా గురుమండలంలో ఒక ఆచార్యునిగా గౌరవిస్తారు. గణపతి సహస్రనామంలో కూడా జైన, బౌద్ధ మతాల రూపంలో కూడా గణపతి ఉన్నాడని ప్రస్తావన కన్పిస్తుంది.  


ఓం శ్రీ గణేశాయ నమః 

Thursday, 16 September 2021

సర్వలోక గణపతి నామాలు



స్వానందలోకం అనేది కళ్ళకు కనిపించే పాంచభౌతికమైన లోకం కాదు. అది ఒక ఆధ్యాత్మిక స్థితి అయినప్పటికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వలోకమహేశ్వరుడైన గణేశుడు అనేక లోకాల్లో అనేక రూపాల్లో కొలువై ఉన్నాడు.


గణపతి ఏర్పాటు చేసుకున్న మొదటిలోకం చింతామణి. అది దేవతల ఊహకు సైతం అందని ప్రదేశంలో ఉంది. 

కైలాసానికి తూర్పు దిక్కున మలజాత అనే పేరుతో గణేశుడు ఉంటాడు, దాన్ని స్వర్గస్వానందం అంటారు.

భూలోకంలో మోర్గావ్ క్షేత్రంలో బ్రహ్మకమండలు నదీ తీరంలో మయూరేశ్వరుడనే పేరుతో నివసిస్తున్నాడు.

మణిమయమైన నాగలోకంలో శేషాత్మజుడుగా, విష్ణులోకమైన వైకుంఠంలో పుష్టిపతిగా, మణిద్వీపంలో ద్వారాపాలకుడు మహాగణపతిగా, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవునకు గురువుగా శారదేశుడనే పేరుతో గణపతి ఉన్నాడు.

ఇంద్రలోకంలో గణపతి కునితాక్షునిగా, అగ్నిలోకంలో రూపవినాయకునిగా, యమలోకంలో కాలునిగా, నైఋతి లోకంలో చండోద్ధండునిగా పూజలందుకుంటున్నాడు.

వరుణలోకంలో పాశపాణి, వాయులోకంలో ధూమ్రుడు, కుబేరునిలోకమైన అలకాపురిలో స్వర్ణాకర్షణ గణేశునిగా, కైలాసంలో శివగణాలకు అధిపతియై హేరంబగణపతిగా పిలువబడుతున్నాడు. 

దైత్యలోకంలో ద్విముఖునిగా, గంధర్వలోకంలో చందనునిగా, భూతలోకంలో ఘుర్ణితాక్షునిగా, సూర్యలోకంలో గణసూర్యునిగా గణపతి వసిస్తున్నాడు. స్కందలోకంలో షణ్ముఖునిగా కొలువై ఉన్నాడు. 

ఆయన ఎక్కడ ఉంటే అది స్వానందలోకం. తమను నరకంలో అగ్నికీలల యందు పడవేసినా, డండనాథుని రూపంలో గణేశుడినే దర్శిస్తామని గాణాపత్యులు అంటారు. గణపతియే సర్వమూ, సర్వమూ గణపతియే. ఇది పరమసత్యాన్ని ఋజువు చేయుటకే ఆయన అన్ని లోకాల్లో, అంతటా ఉంటాడు. గాణాపత్యుడు ఏనాడు కూడా స్వానందలోకం నుంచి క్రిందకు జారడు.


ఓం శ్రీ గణేశాయ నమః 

Monday, 13 September 2021

స్వానందలోకం - ఇతరలోకాలు



బహుదేవతారాధనయే సనాతనధర్మం యొక్క ప్రాణం, సౌందర్యం. ఇష్టదేవతనే పరబ్రహ్మంగా, మిగిలిన దేవతలను అంశలుగా ఉపాసించి, మోక్షం పొందే మార్గాన్ని సనాతన ధర్మం చూపింది. శైవులకు కైలాసం ఉత్కృష్ట లోకం కాగా, వైష్ణవులకు వైకుంఠం, శాక్తేయులకు మణిద్వీపం చేరుట లక్ష్యాలు. అలాగే గణేశోపాసకులకు స్వానందలోకం చేరుట పరమలక్ష్యం. 


గాణాపత్యాన్ని అనుసరించి స్వానందలోకం మధ్యలో ఉంటుంది. అందులో సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతి ఉంటాడు. స్వానందలోకానికి తూర్పున వైకుంఠం, దక్షిణాన కైలాసం, పశ్చిమాన మణిద్వీపం, ఉత్తారాన జ్ఞానమార్గం ఉంటాయి. అందుకే గణపతి ఉపాసనలో గణపతికి తూర్పున లక్ష్మీనారాయణులను, దక్షిణాన శివపార్వతులను, పశ్చిమాన రతీమన్మధులను, ఉత్తరాన భూదేవి వరహాస్వామి వారిని ప్రతిష్టించి ఉపాసిస్తారు. గణేశుడు మధ్యలోనున్న పూర్ణబ్రహ్మం, ఆదిమూలం. ఇంకా గణపతికి అంగదేవతలు, అనేకమంది పరివార దేవతలు చుట్టూతా ఉంటారు. లక్ష్మీనారాయణులు ధర్మానికి, శివపార్వతులు అర్ధానికి, రతీమన్మధులు కామానికి, వరహాస్వామిభూదేవులు మోక్షానికి సంకేతాలు. అనగా గణాపతి ఒక్కడిని గట్టిగా పట్టుకుంటే నాలుగు పురుషార్ధాలు వస్తాయి. భౌతికమైన సుఖాలు కలుగుతాయి, ఆధ్యాత్మిక గమ్యం నెరవేరుతుంది. అంటే ఆదిశంకరులు ప్రతిపాదించిన పంచాయాతనం అన్నమాట.


భూస్వానందంలో అనగా మోర్గావ్ క్షేత్రంలో సైతం గణపతికి నాలుగు దిక్కులా పైన చెప్పుకున్న నలుగురు దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీనారాయణులు వైష్ణవానికి, శివపార్వతులు శైవానికి, రతీమన్మధులు శక్తేయానికి సంకేతాలు కాగా భూదేవి-వరహా స్వామి వారు సౌరానికి; యోగ, జ్ఞాన మార్గాలకు సంకేతాలు. అంటే అన్ని మతాల పరమలక్ష్యం గణేశుడే అని సారం. మీరు ఏ మార్గంలో వెళ్ళినా, చివరకు గణపతినే చేరతారు. ఇక్కడొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే బౌద్ధం, జైనం వంటి అవైదిక, నాస్తిక మతాలు కూడా ఉత్తరభాగంలోనే ఉంటాయని గాణాపత్య ఆగమాలు చెబుతున్నాయి. అందుకే గణేశోపాసన అవైదిక, నాస్తిక మతాల్లో సైతం ఉన్నది. బౌద్ధులు, జైనులు కూడా గణాపతిని పూజిస్తారు. ఇలా గాణాపత్యం ఏ ఒక్క మతాన్ని తిరస్కరించక, అందరూ దేవతలను, అన్ని మార్గాలను సత్యమని అంగీకరిస్తూ పూర్ణబ్రహ్మమైన గణేశుడిని చేరే మార్గం చూపెడుతుంది. 


ఓం శ్రీ గణేశాయ నమః 

Sunday, 12 September 2021

గాణాపత్యానికి కేంద్రబిందువు మోర్గావ్ క్షేత్రం



గణేశోత్సవాలు అనాగానే గుర్తుకు వచ్చేది మహారాష్ట్ర. తరతరాలుగా గాణాపత్యం వర్ధిల్లింది ఇక్కడే. అందులోనూ గాణాపత్యానికి కేంద్రబిందువు మోర్గావ్ క్షేత్రం. ఇది అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ గణపతి పేరు మయూరేశ్వరుడు. వైష్ణవులకు శ్రీ రంగం, శైవులకు కాశీ ఎంత పవిత్రమో, గాణాపత్యులకు ఈ మోర్గావ్ క్షేత్రం అంత విశేషం. ఇది స్వర్గలోకం కంటే ఉన్నతమైనదని, ఈ మోర్గావ్ క్షేత్రంలో స్వామిని దర్శిస్తే, బ్రహ్మ పదివి అడిగినా వరిస్తుందని పురాణవచనం. ఈ క్షేత్రంలో స్వామి విగ్రహాన్ని చూసినంత మాత్రం చేతనే ఎన్నో వేల జన్మల పాపాలు దగ్ధమవుతాయని పురాణంలో చెప్పబడింది. ఆ స్వయంభూః స్వామి విగ్రహాన్ని చూడగానే భక్తులకు ప్రశాంతత ఆవరిస్తుంది. ఈ మోర్గావ్ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో విశేషంగా చెప్పబడింది. ఇక్కడ గణపతి చుట్టు, గ్రామం చుట్టూ కూడా అనేక దేవతలు ప్రతిష్టితమై ఉన్నారు.


శివునకు కైలాసం, విష్ణవులు వైకుంఠం, లలితాపరమేశ్వరికి మణిద్వీపం ఎలాగో, అలాగే గణపతి ఉండే లోకం పేరు స్వానంద లోకం. గణాపతిని స్వానందేశుడు అంటారు. స్వా అంటే ఆత్మ. ఆత్మానందాన్ని ఇచ్చే లోకం స్వానందలోకం, ఆత్మానందాన్ని ఇచ్చే స్వామి స్వానందేశుడు, ఆయనే మన గణనాథుడు. ఆనందానికి అధిదేవత గణేశుడు. అందుకే ఆయన రూపాన్ని చూసినా, స్మరించినా తెలియని ఆనందం కలుగుతుంది.


మోర్గావ్ క్షేత్రాన్ని భూస్వానందం అంటారు, అనగా ఈ భూమి మీదనున్న స్వానందలోకం. మయూరేశ్వరుడిని భూస్వానందేశ్వరుడు అంటారు. గణపతి భక్తులు తమ జీవితంలో ఒక్కసారైన దర్శించాల్సిన క్షేత్రం మోర్గావ్. ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. 


భూస్వానందేశో విజయతే 

ఓం శ్రీ గణేశాయ నమః 

Saturday, 11 September 2021

గాణాపత్యం



శివుడిని  పరబ్రహ్మంగా ఆరాధించేవారిని శైవులనీ, విష్ణువును పరబ్రహ్మంగా ఆరాధించేవారిని వైష్ణువులనీ, శక్తిని ప్రత్యేకంగా ఉపాసించేవారిని శాక్తేయులు, సూర్యారాధకులను సౌరులను, సుబ్రహ్మణ్యారాధకులను స్కాందులని అన్నట్లుగానే గణపతిని పరబ్రహ్మంగా పూజించేవారిని గాణాపత్యులు అంటారు. గాణాపత్యం కూడా సనాతనధర్మంలో అనాదిగా ఉన్న మతమే. గాణాపత్యానికి కూడా శైవ, వైష్ణవ, శాక్తేయాలకు ఉన్నన్ని ఆగమాలు, తంత్రశాస్త్రాం, పురాణకథలు, స్మృతిప్రమాణాలు, ఆరాధాన పద్ధతులు, విస్తారమైన వివరణలు, ఆచార్య పరంపర ఉన్నాయి. అనేకమైన ఋషులు, ద్రష్టలు సైతం మనకు గాణాపత్యంలో కనిపిస్తారు. గణపతికి ఏ పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏమేమి సమర్పించాలి, ఎలా సమర్పించాలి వంటి అనేక విషయాలు గాణాపత్యం విస్తారంగా చెబుతుంది.  


శైవులకు ప్రదోషం, మాసశివరాత్రి, మహాశివరాత్రి ఇత్యాదులు, వైష్ణవులకు ఏకాదశులు, శాక్తేయులకు అష్టమి, పూర్ణిమాది తిథులు ఎలా విశేషామో అలాగే గణేశ భక్తులకు చవితి తిథి అంత పవిత్రం. ప్రతి ఏకాదశికి ఒక పేరు, ఒక పురాణ కథ ఉన్నట్లుగానే ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష, కృష్ణ పక్ష చవితులకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి. గాణాపత్య ఆగమాల్లో వాటికి ప్రత్యేక కథలు ఉన్నాయి. ఆరాధన విధులు చెప్పబడ్డాయి. అవేగాక ఇతర పర్వదినాలకు గణపతికి ఉన్న సంబంధం, ఆయా తిథుల్లో గణపతిని పూజించాల్సిన విధులు వాటిల్లో చెప్పబడ్డాయి. మనకు ఇప్పటి వరకు తెలిసింది వినాయక నవరాత్రులు, సంకటహర చవితులు మాత్రమే. కానీ అవి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.  


శైవం, శాక్తేయం, స్కాందం (కౌమారం), సౌరం, వైష్ణవం లో గణపతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. (రామానుజుల శ్రీవైష్ణవం గురించి కాక ఇక్కడ ప్రస్తావించేది ఆదిశంకరుల వైష్ణవం గురించి). గణపతి ఉపాసన లేకుండా మిగితా 5 మతాల్లో ఉపాసన పూర్ణత్వానికి వెళ్ళదు. గణపతికి చెందిన శాస్త్రాలు తెలుసుకోవడం గణపతి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలగజేయడమే కాదు, గాణాపత్యం రక్షించబడుటకు సహాయపడుతుంది. 


ఓం శ్రీ గణేశాయ నమః