Showing posts with label భేతాళ కథలు. Show all posts
Showing posts with label భేతాళ కథలు. Show all posts

Monday, 26 December 2022

భేతాళ కథలు - 27



ఏమని పిలవాలి?


'తండ్రి-కొడుకు” వరసయ్యే యిద్దరు కాశీకి వెళ్తున్నారు, కాలినడకన వెళ్తున్న వీరికి తమముందు ఎవరో వెళ్లినట్టు రెండు జతల అడుగుల జాడలు కనిపించాయి.


“ఈ పాదముద్రలు నిస్సందేహముగా స్త్రీలవే." అన్నాడు కొడుకు. “వారిలో ఒకరు వయసులో కొంచెం పెద్ద రెండోది చిన్నది” చెప్పాడు తండ్రి. "ఔను. ఒక జత పాదముద్రలు పెద్దవిగా ఉన్నాయి మరి” “ఆ పెద్ద పాదాల పెద్దదాన్ని నేను చేసుకుంటాను - అన్నాడు తండ్రి. “ఆ చిన్న పాదాల చిన్నదాన్ని నేను చేసుకుంటాను” అన్నాడు కొడుకు- తండ్రి ఆమాటెప్పుడంటాడా అని ఎదురు చూస్తున్నట్లు. “సరే. వేగంగా నడు వాళ్లని కలుసుకుందాం. వాళ్ల పాదముద్రలు పడి ఆట్టే సేపవలేదు కనుక వాళ్లు మరీ దూరంపోయి ఉండరు ” ఇద్దరూ గబగబనడవసాగారు. తొందరలోనే వారాస్త్రీలను కలుసుకోగలిగారు. "మీలో పెద్దపాదములు కలదానిని నేనూ, చిన్నపాదములు కలదానిని నా కొడుకూ వివాహం చేసుకుందామని మేము కోరుకున్నాం. మీ కంగీకారమే కదా అడిగాడు తండ్రి. "ఆ" అన్నారు ఆ స్త్రీలు, అప్పుడు బయటపడింది విచిత్రమయిన వాస్తవం. పెద్దపాదాలు కలది కూతురు చిన్న పాదాలు కలది తల్లి. అయినా సరే తాము ముందుగా అనుకున్న మాట తిరగకుండా పెద్దపాదాలు కల చిన్నదాన్ని తండ్రి, చిన్నపాదాలు కల పెద్దదాన్ని కొడుకు వివాహం చేసుకున్నారు.


రాజా! ఆ తండ్రీ కొడుకులకు పుట్టిన పిల్లలిద్దరు ఏ వరుసతో పిలుచుకోవాలి? "అడిగాడు భేతాళుడు. విక్రమార్కుడు నోరు విప్పకుండా శవాన్ని మోసుకు వెళ్లసాగాడు. తండ్రీ కొడుకులు మరొక తల్లీ కూతుళ్లను వివాహం చేసుకోడమన్నదే రాజుకి అసంగతమని తోచిందేమో. అది- జవాబుకి అర్హమయిన ప్రశ్నే కాదనిపించిందో? నీతి బాహ్యంగా ఉందనిపించిందో .. అతను పెదవి విప్పలేదు. అయినా అతనికి ఆపదా సంభవించనూలేదు.


అప్పుడు భేతుళుడిలా అన్నాడు. 'విక్రమార్కా! నేనెంతమంది రాజులనో చూసితిని కాని నీవంటి ధైర్యసాహసములు కలవారినినెవరినీ చూడలేదు. నీవు నా ప్రశ్నలన్నిటికీ ఓపికగా చక్కగా సమాధానాలు చెప్పావు. కనుక నీకక మేలు చేయాలనుకుంటున్నాను, విను. నువ్వు నన్ను ఏసన్యాసి వద్దకు తీసుకెళ్తున్నావో అతడు ఒక శక్తికి పూజలు చేస్తున్నాడు. ఆ క్షుద్రపూజకు - సకలగుణములు కలిగిన క్షత్రియునికాని సమస్త యోగజ్ఞానియగు సన్యాసిని కాని ఎవరు పూజాసమయంలో బలియిస్తారో వానికి నన్ను వశపరుతునని శక్తి వాగ్దానము చేసింది. అందుకంగీకరించి సన్యాసి నిన్ను మోసగించి యిలా తెచ్చి నిన్నా శక్తికి బలియివ్వబోతున్నాడు. అందుకే నన్ను తేవడానికి నిన్ను నియమించాడు. ఏమి జరుగబోతున్నదో తెలుసా? విక్రమార్కుడు మౌనం వదలలేదు. భేతాళుడే మళ్లీ చెప్పసాగాడు. "రాజా! నువ్వు నన్నక్కడికి చేరుస్తావు. అతను నిన్ను దేవిముందు సాష్టాంగ ప్రణామం చేయమంటాడు. ఆ భంగిమలో ఉండగా నిన్ను బలిద్దామని. కాని ... రాజా! నువ్వుప్పుడు నాకొకరిచే మోక్కించుకొనుటయేకాని నేను మరియొకరికి మొక్కుట ఎరుగను, కనుక అది ఎటులో మొక్కిచూపుము అను. అప్పుడు సన్యాసి శక్తిముందు మొక్కుతూ సాగిలపడతాడు. ఆ సన్యాసి సామాన్యుడు కాడు. అఖిలలోక సంపన్నుడు. అందుచేత నువ్వు నీ చేతికత్తితో వాని తలనరికి వేయి. అప్పుడు శక్తి తన కోరికను నీవు చెల్లించావు. కనుక - నీ ధైర్యమునకు మెచ్చుకుని నన్ను నీకు వశం చేస్తుంది" అని చెప్పాడు.


విక్రమార్కుడు భేతాళునితో కూడిన శవాన్ని సన్యాసి ముందుంచాడు. "వేగంగా ఆ కొలనులో స్నానం చేసి పవిత్రుడివయిరా” అని సన్యాసి చెప్పగానే స్నానం చేసి వచ్చాడు. "శక్తికి మొక్కు-" అన్నాడు సన్యాసి.


"ఎలా మొక్కాలో తమరు చేసి చూపించండి" అన్నాడు రాజు. అతివినయంగా. “ఇలా" అంటూ సన్యాసి దేవి ముందు సాష్టాంగ దండప్రణామం చేశాడు. తక్షణం విక్రమార్కుడు చంద్రాయుధమనే తన కత్తితో అతని తల నరికాడు.


శక్తి ప్రత్యక్షమయింది. విక్రమార్కుడి సాహసానికి మెచ్చుకుని భేతాళున్ని అతనికి వశపరచింది.


'రాజా! ఇక నుంచి నేను నీ పరమయ్యాను. నువ్వెప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు నేను నీముందు వాలుతాను. నాకు ప్రస్తుతం శలవివ్వు' అన్నాడు. శలవిచ్చి విక్రమార్కుడు ఉజ్జయిని చేరుకున్నాడు.


Sunday, 25 December 2022

భేతాళ కథలు - 26

 


పూర్వము ఒక వృక్షముపై అనేక పక్షలు తమ తేనితో జీవించుచున్నాయి. విక్రమార్కుడు భూసంచారము చేయుచు ఆ వృక్షచ్ఛాయను విశ్రమించుచున్న రాత్రి, పక్షులన్నియు గుమిగూడి కొలువు దీరియున్నాయి. "పక్షులారా! మనకిక్కడ శత్రుబాధ ఎక్కువగా యుంది. మన ప్రాణాలకు రక్షణ కనిపించుటలేదు. యింతకంటే మంచి సురక్షిత స్థానమును చూచిరమ్మన్నాను చూచివచ్చితిరా?' యని పక్షులతేడు అడిగాడు. "ప్రభూ! ఎక్కడ చూచినను ఏదియో యొక్క ఇక్కట్టు కనిపించుచునే యున్నది. కాని యుజ్జయిని నగరంబునట్లుగాదు. దాని పాలకుడు విక్రమాదిత్యుడు. అక్కడి జంతువులలో జాతి వైరములు, కులమత ద్వేషాలు, జారచోర బాధలు. అపమృత్యుభయము మొదలైవేవీలేవు. ఆ రాజు దైవ సమానుడు. పరోపకారపారీణుడు. దయాస్వభావుడు, మీదు మిక్కిలి జీవుల యెడ కరుణా స్వభావుడు. ఆతని రాజ్యములోనే ప్రాణానికెప్పుడునూ కీడు కలుగదు. మనమా ప్రాంతమున వసింపవచ్చును”నని పక్షులన్నియు ముక్త కంఠముతో చెప్పాయి. 'సరే'నని అంగీకారానికొచ్చాయి.


జంతుభాష నెఱింగిన విక్రమార్కుడిదంతయూ విన్నాడు. ఆదమరచి నిద్రిస్తుండగా తెల్లవారు ఝూమున ఎక్కడనుండియో ఒక ఆవును దరుముకొని ఒక పులి వచ్చుటయునుగాంచెను. గోవు కూడా విక్రమార్కుని శరణుజొచ్చినది. ఆతడునూ పులిని తన భయంకర ఖడ్గముచే చంపివేసెను. ఇదంతయు వృక్షము నుండి గమనించుచున్న పక్షులు జూచి ఈతడెవరని విచారించి యడిగి దెలిసికొని "ప్రభూ! పులిని జంపి పాడియావును గాపాడితివి. మమ్ములను గూడా రక్షించి మాన్యుడవు కమ్ము మమ్ములనొక రాక్షసుడు ప్రతిదినము భక్షించి పోవుచున్నాడు. మా వంశమంతరించి పోవుచున్నది. మమ్ము రక్షించి మా బాధలీడేర్చు”మని ప్రాధేయపడ్డాయి. విక్రమార్కుడు వాటికభయము నొసంగి యారాక్షసుడున్న ప్రదేశమునకరిగి ఆతనితో యుద్ధము జేసి యా రాక్షసుని సంహరించి, వధించిన వార్తను పక్షులకెఱింగించి "నిర్భయముగా నివసించండ”ని జెప్పి తన స్వస్థలమునకు పోయాడు. విక్రమార్కుని ఔదార్యమునకు కరుణా స్వభావతకు, జంతుప్రేమకు ఈ కథయే నిదర్శనము.


Saturday, 24 December 2022

భేతాళ కథలు - 25



పామర పండితులు


పూర్వము హరిహరపురమనే పట్టణమునందు వేదాంతి వరదయ్య, సిద్ధాంతి సిద్ధయ్యయనే యిరువురు భక్తులున్నారు. వారిలో నొకడు వరదయ్య విష్ణుభక్తుడు వీనికి శివభక్తులనిన అమితద్వేషము. రెండోవాడు సిద్ధయ్య శివభక్తుడు ఈతనికి విష్ణుభక్తులనిన అసహ్యము. అందుచే ఎవరికి వారు తమ తమ దైవములనే గొప్పవారిగా ప్రచారముగావించుకొని యితర దైవాల్ని దూషించేవారు.


వారిరువురూ వారి వారి యిష్టదైవముల పట్ల అమితభక్తి కలవారు. సాటిలేని నియమనిష్ఠలతో పూజలు చేసేవారు కలిసి నియమాలు, ఉపవాసదీక్షలు మున్నగు పూజలందుకొనే వారు ఒకరిని మించిన వారింకొకరు, వారిద్దరూ ఎదురు పడితే తమతమ దైవములను గూర్చి వాదించుకునే సమయాల్లో చండప్రచండులై చూచేవారికి భీతిగొల్పుతూ ఉండేవారు. వారిద్దరూ ఒకరి నొకరు చంపవలెనని ప్రయత్నములు సల్పుతూ బ్రాహ్మణ హత్యలు చేసీ ముఠాలు రెండింటిని చేరదీసి వారికి కావలసినంత ధనము నిచ్చి ప్రోత్సహించేవారు. కాని వారి పాపకర్మఫలమున వారిద్దరూ ఆయా ముఠాల చేతుల్లోనే తనువులు చాలించారు. వారిద్దరూ పోయిన పిదప ఆ పట్టణమంతా మతకలహాలు, కక్షలు లేక సుఖముగానుంది.


మరణించిన భక్తులిద్దరూ యమసదనానికేగారు. యమ ధర్మరాజు దారి దుష్కృత్యములను విచారించి "మీరెంత మాత్రము నరకలోకాన ఉండుటకు వీలులేదు. తక్షణమే పొండి" యని వెడలగొట్టాడు. తరువాత వారు వైకుంఠసదనానికేగారు. నారాయణ భటులు గూడా వారిని విచారించి "మీ రెంత మాత్రం యిక్కడుంటానికి వీలులేదు. దూరము పొండి" యని గెంటేశారు. ఏం జెయ్యటాన్కి పాలుబోక ఎక్కడి కెళ్ళాలో దెలియక మదనపడుతుండగా దైవము వారిద్దరిని దయ్యములుగా జేసి గెంటివేసింది. వారిద్దరూ దయ్యాలై ప్రజలను పీడించుచుండగా భూతవైద్యులు వారిని బంధించారు. ఈ విధముగా వారు నానాహింసలకు గురికాబడ్డారు.


"ఓ విక్రమార్క మహారాజా! వారిద్దరూ ప్రజ్ఞా వంతులైయుండి, శక్తిగలవారయ్యున్ను మీదు మిక్కిలి సదాచారభక్తి సంపన్నులైయుండి గూడా ఎందుకు ఈ దుర్గతిని పాల్పడ్డారు. వివరించమని" జెప్పగా విక్రమార్కడిట్లు చెప్పసాగాడు.


"భేతాళా! సహనములేని ప్రజ్ఞ, శక్తి, భక్తి, జ్ఞానసంపన్నులన్నియు ఎంత ఉన్నను నిష్ప్రయోజనమే, వరదయ్య, సిద్ధయ్యలిద్దరు మహాభక్తులే కాని జ్ఞాన శూన్యులు. పరమత ద్వేషం కలవారు. ఎంతటి వారికిని పరమత ద్వేషము, పరులను నిందించుట, కుల ద్వేషములు పనికి రావు. ఇవి సమాజమును భ్రష్టపట్టించున”ని జెప్పగా భేతాళుడు నిజస్థానమునకు పోయెను.


Friday, 23 December 2022

భేతాళ కథలు - 24



వరుసక్రమము - బంధుత్వము


విక్రమారా! పూర్వమొకగ్రామంలో ఒక రైతుండేవాడు. ఆతడు మిక్కిలి సహాయ స్వభావము కలవాడు. మంచివాడు. ఎవరికే ఆపద వచ్చిననూ ఆదుకొనేవాడు. కొన్ని కుటుంబములు వారాతని యింటియందు నివసించేవారు. ఆతనికొక్కడే కుమారుడు.


రైతొకనాడు పొలములో సేద్యము చేయుచు పనులు వత్తిడివలన మధ్యాహ్నం భోజనానికి రాజాలక పోయెను. పొలమునకే భోజనము పంపుడని తనవారినాదేశించెను. మధ్యాహ్న సమయానికి అత్తాకోడండ్రిద్దరూ ఆహారమును తీసుకొని పొలమునకు పోయారు. తండ్రి కొడుకులు పనియందు నిమగ్నులై వారి రాకను గమనించి కాళ్ళు కడిగికొని వచ్చి కూర్చొన్నారు. అత్తాకోడండ్రిద్దరూ ఎవరి తండ్రికి వారాహారము బెట్టి వెనుదిరిగారు. 'ఓ విక్రమార్క మహారాజా! వీరిద్దరూ తండ్రికొడుకులు. వారిద్దరూ అత్తాకోడండ్రు. వీరి బంధుత్వమెట్టిదియో యోచించి చెప్పుము'అని కోరాడు.


విక్రమార్కుడు చిఱునవ్వు నవ్వి "భేతాళా! ఆ రైతుకు కొడుకుకంటే పెద్దదైన కూతురు ఉంది. బావమరిదికే తన కూతురునిచ్చి పెండ్లి చేశారు. ఆ కూతురునకు పుట్టిన కూతురు అనగా మనుమరాలు తన కుమారునకు మేనకోడలు అవుతుంది. వారిద్దరికీ వివాహం జరుగుటచే ఆ మేనత్త కోడండ్రు రైతుకుమార్తెయు రైతు ముదిమనవరాండ్రు ఇరువురును అహారమునుగైకొని ఎవరి తండ్రికివారు అన్నము పెట్టుటలో ఔచిత్యమేమున్నది. ఈ విధముగా చెప్పినంతలో భేతాళుడు అంతర్థానమయ్యాడు.


Thursday, 22 December 2022

భేతాళ కథలు - 23



ఎవరు గుణవంతులు ?


“పూర్వం వేదపారాయణుడి కుమార్తె వివేకవతితో బాల్య నుండి కలసి చదువుకున్న అనురాగుడు అను యువకుడు ఒకనాడామెను సమీపించి – "వివేకవతీ! నాకు నీవన్న ఎంతయో ప్రేమ. ఎలాగేనా నువ్వు నా వాంఛ తీర్చాలి" అని ప్రాధేయపడ్డాడు. అందుకామె “అనురాగా! నా తండ్రి నన్ను ఇన్కొకనికిచ్చి వివాహం చేయబోతున్నాడు. వివాహం జరిగిన వెంటనే నా భర్త అనుమతి తీసుకుని ముందుగా నిన్నే ఆనందింపజేస్తాను” అంది.


వివేకవతికి కొద్దిరోజులలోనే వివాహం జరిగింది. శోభనం నిర్ణయించబడింది. శోభనగదిలో తన కోసం ఆత్రంగా నిరీక్షిస్తున్న భర్తపాదాలకు భక్తితో నమస్కరించి- స్వామి విధివశాత్తు నేను ఒక యువకునికి తొలిపొందు నిచ్చెదనని వాగ్దానం చేసితిని. దయచేసి నాకతనిని తృప్తిపరచి వచ్చుటకనుమతి ప్రసాదించాలి అని ప్రార్థించింది. ఆ భర్త ఒక్కసారి ఆలోచనలోపడ్డాడు. అంతగా అవసరమయితే మగవాడనే కనుక తను మరో వివాహం చేసుకొనవచ్చు కదా అనుకుని - "సరే వెళ్ళు” అని అనుమతించాడు. వివేకవతి వేగంగా అనురాగుని వద్దకు వెళ్ళింది. "అనురాగా! ఆనాడు నీకు చేసిన వాగ్దానమును చెల్లించవచ్చితిని-"అంది.


శోభనపు పెళ్లికూతురి దుస్తులలో అలంకరణలో ఉన్న వివేకవతిని చూస్తూ అతను నిశ్చేష్టుడే అయ్యాడు. ఇచ్చిన మాటకోసం ఆమెయిలా రావడం అతనికాశ్చర్యం కలిగింది. ఆమె ఔన్నత్యమూ తననైచ్యమూ అర్థమయ్యాయి. అతనిలో వివేకం మేలుకొంది. ఎంతో పశ్చాత్తాపంతో "అమ్మా నువ్వు నాకనులు తెరిపించావు. నీవంటి స్త్రీని కాని నీ భర్తవంటి పురుషోత్తముడుకాని అతి అరుదు” అంటూ ఆమెకు నమస్కరించి - ఆమెను వెంటబెట్టుకొని శోభనపు పెళ్లికొడుకు వద్దకు వెళ్లాడు.


వివేకవతి- జరిగినదంతా భర్తకు తెలిపింది. అనురాగుడు అతన్ని తన తప్పు క్షమాపణ కోరాడు. వివేకవతి భర్త వారిని సరిగా అర్థం చేసుకున్నాడు. భార్యయందెటువంటి సంశయముకాని భేదభావముకాని లేకుండా ఆమె అనురాగంతో కాపరం చేయసాగాడు. "అంతవరకూ కథచెప్పి అప్పుడు తన ప్రశ్నలను సంధించసాగాడు భేతాళుడు. "రాజా! అనురాగునకిచ్చిన మాట నిలబెట్టుకున్న వివేకవతి. ఆమె వాగ్దానము నిలబెట్టుకొనుటకు ఆమోదము తెలిపిన ఆమె భర్త. సరైన సమయంలో తన తప్పు తెలుసుకొని వివేకవతి వంటి సౌందర్యవతి పొందును త్యాగం చేసుకుంటూ ఆమెను మాతృమూర్తిగా భావించిన అనురాగుడు వీరు ముగ్గురిలో ఎవరు ఎక్కువ గుణవంతులు?


వారు ముగ్గురూ గుణవంతులే. ఏ భార్యా కోరరాని కోరిక కోరినా వివేకవతిని ఆమె వాగ్దానం నిలుపుకొనుటకు ఆంగీకరించడం అతని గుణవిశేషాన్ని సూచిస్తుంది. సర్వాలంకార భూషితయిన తానెన్నడో మనసుపడిన వివేకవతి చేరవచ్చినా- అప్పటి పరిస్థితిని అవగాహాన చేసుకుని ఆమెను తల్లిగా పరిగణించిన అనురాగుడు, వాగ్దానమును నిలబెట్టుకుందుకు ప్రయత్నించిన వివేకవతి- ఎవరికి వారే ఆదర్శప్రాయులు. అని విక్రమార్కుడు చెప్పగానే భేతాళుడు అదృశ్యమయ్యాడు.


Wednesday, 21 December 2022

భేతాళ కథలు - 22



స్వభావం


ఒక శూద్రునకు నలుగురు పుత్రులు. అతను చనిపోయేముందు. కొడుకులని పిలిచి-“తూర్పు ఇంటి అడ్డగోడకింద నాలుగువేల వరహాలు దాచాను. నా అనంతరం సమంగా పంచుకోండి." అని చెప్పి కన్నుమూశాడు. వారిలో ఒకడు మిగిలిన వారికి తెలియకుండా ఆ సొమ్ము అపహరించాడు. కొంతకాలానికి సోదరులు ఆ ధనాన్ని పంచుకోవాలని అక్కడ వెదికితే లేదు. దాంతో - నువ్వుతీశావంటే నువ్వుతీశావని కేకలు వేసుకుని రాజసభకు వచ్చి తగవు తీర్చమనిరి. "కొంతకాలమాగిరండి” అని రాజువారిని పంపివేశాడు. కొన్నాళ్లయ్యాక మళ్లీ ఆ నలుగురు అన్నదమ్ములూ రాజసభకు వచ్చారు.


“ఒకరాజు కొక కుమార్తె ఉండేది. ఆమెకు గురువుచే సమస్తవిద్యలూ నేర్పించాడు. ఆమె గురువుగారికి దక్షిణనీయబోయి బంగారుపళ్లెమునందు వస్త్రములు, నగలు మొదలయినివి పెట్టి తీసుకువెళ్లగా - 'నాకివి అక్కరలేదు.' అన్నాడు గురువు. రాకుమార్తె “మరేంకావాలి” అని అడగగా - నీ వివాహం రేపనగా అప్పుడు కోరుతాను. అన్నాడు. ఆమె “అలాగే” అని వెళ్లిపోయింది. రాకుమారికి వివాహదినం వచ్చింది. ముందురోజు గురువుకి సమాచారం పంపగా "శోభనం రాత్రి నీ భర్తతో కలిసే ముందు సకలాభరణభూషితవైరా' అని వర్తమానం పంపాడు. గుణవతి అయిన ఆ రాకుమారి వాగ్దానాన్ని నిలుపుకుందుకు శోభనంనాటి రాత్రి అలంకారభూషితయై గురువు వద్దకు వెళ్తూండగా దారిలో దొంగలడ్డగించారు.


చోరులారా! నేనొక చోటుకి పోవుచున్నాను. త్వరగానే తిరిగి వచ్చెదను. నగలన్నీ అప్పుడు మీకిచ్చేస్తాను. నన్నుమాట నిలబెట్టుకోనివ్వండి “అని కోరగా వారంగీకరించి ఆమెను అప్పుడు పోనిచ్చారు. ఆమె గురువును దర్శించుకోగా నీ భర్తతో కూడి కలకాలం సుఖంగా ఉండు " అని ఆశీర్వదించి సెలవిచ్చేశారు. ఆమెతిరిగి వస్తూ దొంగలను తననగలను తీసికొనమనగా- "ఆడి తప్పని నీవంటి గుణవతి వద్ద చౌర్యము చేయుటకు మా మనసంగీకరించడం లేదు- నీ భర్తతో సుఖంగా ఉండు" అని వారు ఆమెను సాగనంపారు. ఆమె- జరిగినదంతయూ భర్తకు చెప్పింది. అతనెంతో ఆనందించి కొంతకాలం తరువాత ఆమెను తన రాజ్యానికి తీసుకు వెళ్లిపోయాడు.


అంతవరకూ చెప్పిరాజు ఆ నలుగురి సోదరులనీ - “వీరిలో అధికులయిన గుణవంతులెవరు? రాజకుమారా? దొంగలా? రాజకుమారి భర్తా? గురువా?' ' అని ప్రశ్నించాడు. "శోభనపు పెళ్లికూతురిని పరపురుషుడి వద్దకు పంపిన -భర్త" అన్నాడు పెద్దవాడు. “ఆడితప్పని రాజపుత్రికి -”చెప్పాడు రెండోవాడు. "అంత సౌందర్యవతి అయిన కన్యవచ్చినా - మరో చింత చేయక - ఆశీర్వదించి పంపిన గురువు" అన్నాడు మూడోవాడు. “చేజిక్కిన నగలను దోచుకొనక ఆమెను వదలివేసిన దొంగలు - అన్నాడు నాలుగోవాడు.


వారిసమాధానాలను బట్టి దొంగెవరో గ్రహించినా -కొన్నాళ్ళాగాక చిన్నవాడిని పిలిచి-"నువ్వే దొంగవి సాక్ష్యాధారాలు కూడా లభించాయి.” అని రాజు గద్దించగా వాడు అంగీకరించి - అన్నదమ్ములవాటాలిచ్చేశాడు. “విక్రమార్కా! ఆ నలుగురిలోనూ నిజంగా గుణాధికులెవరు? ప్రశ్నించాడు భేతాళుడు. ఇలాంటి విషయాన్నే పరిష్కరించిన రాజు “రాజకుమార్తె, వాగ్దానాన్ని నిలుపుకుందుకామె చేసినంత సాహసం తక్కువదికాదు. ఆమె దాంపత్యానికే ముప్పు తేగలిగిన ఆపాయన్నెదుర్కుందామె ఆడినమాట కోసం " అని చెప్పడంతో భేతాళుడు మాయమయ్యాడు.


Tuesday, 20 December 2022

భేతాళ కథలు - 21



స్నేహం


"తక్షశిల విశ్వవిద్యాలయం చాలా ప్రసిద్ధి చెందింది. దానిలో - వసుదేవుడు, మహాదేవుడు అనే యిద్దరు విద్యార్థులు చాలా కాలంగా ప్రాణస్నేహితులయి మెలగుతుండేవారు. నేర్చుకోదగిన విద్యలు నేర్చుకోవడం పూర్తయింది. ఇళ్లకి వెళ్లిపోవు సమయం వచ్చింది. అప్పుడు వసుదేవుడు "మిత్రమా! మనమిన్నాళ్ళుగా స్నేహంతో మెలగుతూ వస్తున్నాం, కారణాంతరాల వల్ల నువ్వు నా వివాహానికి రాలేక పోయావు. ఇప్పుడేనా ఒకసారి మా వూరు వచ్చి మా యింటి యందొకటి రెండు దినాలయినా గడుపు-” అని మహదేవుడిని కోరాడు. అతను స్నేహితుడ్ని కాదనలేక అతనితో వాళ్ల గ్రామం వెళ్లాడు. “తర్వాత నువ్వు మా వూరు రావాలి" అని కోరి ఊరుచేరిన మర్నాడు వసుదేవ మహదేవులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బజారు వీధిలో నడస్తూంటే మహదేవుడొక అమ్మాయిని చూసి 'మదనతాపంతో మంచం పట్టేశాడు. అది ఎన్ని వైద్యాలకీ తగ్గకపోగా వసుదేవుడు మహదేవుని - “నీ బాధేమిటి?” అని తరచి తరచి అడిగాడు. - మహదేవుడు ప్రాణమిత్రుడికి తన మదన తాపాన్ని వెల్లడించాడు. ఆమె గుర్తులు చెప్పాడు.


వసుదేవుడు రహస్యముగా ఆమె యింటికి వెళ్లి ఆమెను కలుసుకుని - "రుక్మిణీ! నా మిత్రుడికి నీ యందు మోహము కలిగింది. నిన్ను పొందకున్న అతను జీవింపడు. నువ్వతనికేమీ చెప్పకు. నా మాట నిలబెట్టు. నా ప్రాణ మిత్రుడిని కాపాడు. " అని ఆమెను ప్రార్ధించినంత పని చేసి - అమెనొప్పించాడు. రాత్రి సమయంలో దొడ్డితోవన రహస్యంగా మహదేవుణ్నామె వద్దకు పంపాడు.


మహదేవుడు మహదానందంతో ఆమె గదిలో కూర్చుని ఆమెతో మాట్లాడుతున్నాడు. తన కోరిక నెరవేరుతుందన్న సంతోషంతో ఉన్న అతనికి - హఠాత్తుగా ఒక చిత్రం కనిపించింది. దానిలో - వసుదేవుడు, రుక్మిణీ వివాహ సందర్భంగా తీయించుకున్న చిత్రం.


మహదేవుడికి మతిపోయింది. “అయ్యో ఎంత పొరపాటు చేశాను!' మహదేవుడు తెగ విచారించాడు. “వసుదేవుడు రుక్మిణీ భార్యాభర్తలని ఎరగక ఎంత మహాపాపం చేశాను ” అని దుఃఖిస్తూ ప్రాయశ్చిత్తం చేసుకుందుకన్నట్లు - మేడమెట్ల ప్రక్కనున్న బావిలో పడిపోయాడు. మహదేవుడు బావిలో కురకడం గమనించిన రుక్మిణి “నాపై ఎంతో నమ్మకంతో నా భర్త అప్పగించిన పని నెరవేర్చలేకపోయాను. వారి  ప్రాణమిత్రుడిని కాపాడలేకపోయాను. వారికి నా మొహం ఎలా చూబెట్టేది? నేను బతికుండడం దేనికి?” అనుకుంటూ ఆమె కూడా ఆ బావిలోకే దుమికి మరణించింది.


చెప్పినట్లు తెల్లవారుఝామున మిత్రుడు తిరిగి రాకపోవడంతో వసుదేవుడు తనే ఆ యింటికి వచ్చాడు. మేడమీద గదిలో రుక్మిణికాని మహదేవుడు కాని కనపడకపోవడంతో వారిని వెదకుతూ... బావిలో పడి ఉండడం గమనించి తాను కూడా ఆ బావిలోకి ఉరికి ప్రాణాలు వదిలాడు. "మహారాజా! ఆ ముగ్గురి చావులకి ఎవరు అసలు కారణం? మిత్రుడి భార్యపై మనసుపడిన మహదేవుడా? నిజం చెప్పకుండా అతన్ని తన భార్య వద్దకంపిన వసుదేవుడా? భర్తకోరినంత మాత్రాన అనుచితమయిన కార్యమునకు సిద్ధపడిన రుక్మిణా?”


“వీరెవరూకారు. అసలు కారణం విధి. అంతా విధి నిర్ణయమే తప్ప మరొకటికాదు” అన్నాడు విక్రమార్కుడు. అతను పెదవి విప్పడంతో శవం అంతార్థానమయిపోయింది.


Monday, 19 December 2022

భేతాళ కథలు - 20



అపాత్రదానం


విక్రమార్కా! నీకు పుండరీకుడి కథ చెబుతాను. శ్రద్ధగా విను " అంటూ మొదలు పెట్టాడు భేతాళుడు. విక్రమార్కుడు చెప్పమనీ అనలేదు. భేతాళుడి వద్ద యిలాటి కథలు యిరవయ్యయిదున్నట్లు అంచనా. వాటన్నిటికీ తను జవాబులు చెప్పగలిగితే మంచిదే. లేదా.. తనకి నిజంగా సమాధానం తెలియని చిక్కు ప్రశ్న అతనడిగినా సరే. అప్పుడు తను మౌనంగా ఉండిపోవచ్చు. సమాధానం తెలిసి చెప్పకపోతే కదా బుర్ర వెయ్యి ముక్కలయ్యేది?” తెలియక మౌనంగా ఉండిపోతే బాధవేయదా?


"శ్యామలాపురంలో పుండరీకుడనే యువకుడుండేవాడు. అతను చాలా ధనవంతుడు. విలాస ప్రియుడు. భోగలాలసుడై జీవిస్తూంటే కొందరు దొంగలతని ధనమునంతయు దొంగిలించి అతన్ని చావగొట్టి నదిలో పారేశారు. అతను నదిలో కొట్టుకుపోతూంటే ఒక ముని చూసి బయటకు తీయించి సపర్యలు చేకూర్చి అతని ప్రాణాలు కాపాడాడు. తరువాత అతని కథంతా విన్నాడు. ఆ మునికి అతని మీద దయకలిగింది. తపోదీక్ష ప్రసాదించాలనిపించింది కానీ - 'ప్రస్తుతం యితనికి తపస్సువంటివి తగవు, ఇతని మనసు కామభోగములందే కొట్టుమిట్టాడుతోంది. కొన్నాళ్లిలాగే గడపనీ' ' అని తన తపోబలంతో - దగ్గరలోనే మేడలు, పూలతోటలు, కొలనులు, సౌందర్యవతులు, ధన, ధాన్య వస్తు, వాహన సముదాయాన్ని సృష్టించి పుండరీకుడికి యిచ్చాడు. వాటిని కొద్దికాలం అనుభవించాక - పుండరీకునికి వాటితో తనివి తీరలేదు. గురువుగారి వద్ద నున్న విద్యలన్నింటినీ సంపాదించినచో యింతకంటే ఎక్కువగా ఐశ్వర్య సుఖాలనుభవించవచ్చుకదా అనే దురాశతో తనకా మంత్రాలన్నింటినీ నేర్పమని ముని దగ్గర పట్టుపట్టాడు. అప్పుడు ఆ ముని మెల్లగా యిలా చెప్పాడు. పుండరీకా! కామభోగములనుండి మనసు విముక్తి చెందిన కాని యీ మంత్రములు పనికిరావు. ఈ మంత్రములు నేర్చుకునే తరుణం ముందుంది. సమయం కాని సమయంలో యిలాటి మంత్రాలు నేర్చుకోవడం అత్యంత ప్రమాదకరం” -


కాని పుండరీకుడు ముని హితవును వినక - “వెంటనే నేర్పండి” - అని మొండికెత్తాడు. చివరికా గురువుగారు అతన్ని నిలవరించలేక రహస్యాలయిన మంత్రాలను పుండరీకుడికు ఉపదేశం చేశారు. అంతే - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గంలో ఏ ఒక్క దుర్గుణాన్నీ జయించని పుండరీకుడు - హృదయం నిర్మలం కాకుండా పఠించడంతో ఆ మంత్రాలలో ఎన్నో పొరపాట్లు దొర్లాయి. మంత్ర పఠనంలోని దోషాలవల్ల అతని చుట్టూ అంతవరకూ ఉన్న సుందరాంగులందరూ దెయ్యాలయి పోయారు. ఆ మేడలూ, ఉద్యానవనాలూ స్మశానాలయి పోయాయి. దెయ్యాలయిన అందగత్తెలతనిని మింగేశాయి. పుండరీకుడు మరణించాడు.


రాజా! నేరం ఎవరిది? ఆ గురువుదా? పుండరీకుడిదా? నిర్ణయించి తెలియచెప్పు” “భేతాళా! పుండరీకుడు చిన్నవాడు. కామలోలుడు అతనికా వయసులో యుక్తాయుక్తాలు తెలియకపోవడం సహజమే. కాని పెద్దవాడు, సర్వమూ తెలిసిన వాడూ అయిన ముని అలాటి అమూల్యమయిన మంత్రాలను అనర్హుడయిన వానికి ఉపదేశించడం తప్పు. దేనినీ అపాత్రదానం చేయకూడదు కదా? కనుక నేరం గురువుదే” సమాధానమిచ్చాడు రాజు. అతను మౌనం వదిలి మాట్లాడడంతో - శవం అదృశ్యమయిపోయింది. -


Sunday, 18 December 2022

భేతాళ కథలు - 19



ధర్మం ధర్మమే


ఒకప్పుడు వంగరాజ్యంలో దొంగల బెడద చాలా ఎక్కువగా ఉండేది. ఆ చోరులను పట్టుకోడానికెన్ని విధాల ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరకు రాజుగారే స్వయంగా ఆ దొంగలని పట్టుకుందుకు రంగంలోకి దిగాడు. రాత్రివేళ మారువేషం ధరించి రాజధానిలో తిరుగుతూండేవాడు. ఒకనాడతనికి దొంగల ముఠా కనపించింది. కాని.. తనొక్కడు వారనేకమంది. అంతేకాక - వీరినేకాక దొంగలందరినీ పట్టుకోవాలి కదా? అందుకని- వారిని సమీపించి - "అయ్యలారా! నేనొక దొంగల ముఠాలో ఉండేవాడిని. రాజుగారు నన్ను బంధించి కారాగారంలో ఉంచగా నేనెలాగో తప్పించుకుని వస్తున్నాను. రాజభటులూ నన్ను వెంబడించు చున్నారు. మీరు నాకాశ్రయమిచ్చి కాపాడండి.” అని ప్రార్థించాడు. ఆ దొంగలు మారువేషంలో ఉన్న రాజును దొంగగానే భావించి తమ నివాసానికి తీసుకుపోయారు. రాజు జాగ్రత్తగా ఆ మార్గములను ప్రాంతాన్నీ గమనిస్తూ గుర్తుపెట్టుకుని మర్నాడు వారినుంచి తప్పించుకునివచ్చి - సేనలతో పోయి ఆ దొంగలందరినీ పట్టుకున్నాడు. అంతవరకూ వారు దొంగిలించి దాచుకున్న బంగారం, వెండి ధనము మొదలయిన వానినన్నింటినీ పేదసాదలకు పంచిపెట్టి ఆ దొంగలకు ఉరిశిక్ష విధించాడు.


రాజభటులు ఆ దొంగల నాయకుని ఉరికంబమెక్కించబోతూండగా ఒక పెద్దమనిషి పరుగు పరుగున వచ్చాడు.


"రాజా! నాకు లేకలేక ఒక్క పుత్రిక కలిగింది. ఆమె ఒకనిని వరించింది. అతనిని తప్ప అన్యులను వివాహమాడనని నిశ్చయించుకున్నది. అతన మీరు ఉరి తీయబోతున్నవాడే. మీరాతనిని ఉరితీసినచో 'నా అమ్మాయి తక్షణం ప్రాణత్యాగం చేయును. కనుక అతనిని క్షమించి వదలండి." అని ప్రార్థించాడు. కాని రాజతని ప్రార్థనను వినలేదు. రాజదండన అమలుపరచవలసిందే అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ దొంగని ఉరితీయడమేమిటి, అతన్ని వరించిన కన్య కూడా మరణించింది. వారిరువురి కళేబరాలను ఒకే చితిమీద దహనం చేశారు. విక్రమార్కా! ఆ కన్య మరణించినందుకు పాపం రాజుదా కాదా?" అని అడిగాడు భేతాళుడు. “రాజు తన ధర్మమును చక్కగా పాటించాడు. ఉచితానుచితాలెరుగకుండా దొంగను వరించుట కన్యదే పొరపాటు. ఆమె మరణమునకు రాజు బాధ్యత రవంతయినా లేదు. అతనికేవిధమయిన పాపమూ అంటదు. -" అని చెప్పాడు విక్రమార్కుడు. అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహా భేతాళుడదృశ్యమైపోయాడు.


Saturday, 17 December 2022

భేతాళ కథలు - 18



ఎవరితో కాపరం చెయ్యాలి?


విక్రమార్కా! పూర్వం ఒక కోటిశ్వరుడుండేవాడు. అతనిది విదేశాలతో వ్యాపారం. అందుచేత తరచుగా ఓడ ప్రయాణం చేస్తూ యితర ద్వీపాలకు వెళ్తూండేవాడు. ఆ రోజులలో ఓడ ప్రయాణమంటే ప్రమాదాలతో కూడుకున్నది. సముద్రం మీద దారి తప్పిపోవడం... తుఫానులకు ఓడలు పగిలి ప్రయాణికులు సముద్రంలో పడిపోయి మరణించడం.. దొంగల భయం... యిలాటివెన్నో జరిగేవి. అందుచేత - ఎటుపోయి ఎటు వస్తుందో అన్న భయంతో - అతను చాలా ప్రేమించే భార్యపేర కొంత ఆస్తిని దాన, విక్రయ (దానం చేయడానికి, అమ్మడానికీ) అధికారాలన్నిటి తోనూ రాసియిచ్చాడు. అంతేకాదు. నేను మూడు మాసములలో వస్తాను.” అని చెప్పి ప్రయాణమయ్యాడు. భర్త చెప్పిన గడువు దాటి ఆరుమాసాలయినా అతను తిరిగి రాకపోవడంతో అతని భార్యకీడు శంకించి మరొకరిని వివాహం చేసుకుంది. కొత్త భర్తతో ఆమె మూడు మాసాలు కాపరం చేశాక వ్యాపారి తిరిగివచ్చాడు. అతనికి భార్యంటే ప్రాణమే. ఆమెకీ అతనంటే ప్రేమే.


విక్రమారా! ఇప్పుడామె ఎవరితో కాపరం చేయాలి? ఎవరిని కాదనాలి?" అని ప్రశ్నించాడు భేతాళుడు. విక్రమార్కుడు ఆట్టే ఆలోచించకుండానే - "పునర్వివాహం జరగడంతోటే పూర్వవివాహం రద్దయిపోతుంది కనుక వ్యాపారికామె మీద హక్కుండదు, కాని - వారిద్దరికీ యిష్టమయినచో అమె వారిరువురితోనూ కాపరం చెయ్యవచ్చు" అన్నాడు. మౌనభంగంకావడంతో శవమూ దానిలోని భేతాళుడూ అదృశ్య మయ్యారు.

Friday, 16 December 2022

భేతాళ కథలు - 17



మార్పు


పూర్వము అమలాపురంలో హేమగుప్తుడనే వైశ్యుడుండేవాడు. అతడొక్కసారి వ్యాపారమునకై దూరదేశమునకు పోయి వచ్చుచుండగా దారిలో నలుగురు మనుషులొక పిల్లవాడిని చంపబోతూంటే చూసి " కారణమేమిటి" అని అడిగాడు.


"ఇతని తండ్రి మాకు వేయివరహాలు బాకీ. అతను చనిపోయాడు. ఆ బాకీ యితను చెల్లించవలసియున్ననూ చెల్లించుట లేదు. అందుకని యితనిని చంపుచున్నాము” అన్నారు వాళ్లు. "ఆ సొమ్మును నేనిచ్చెదను. ఇతనిని వదిలిపెట్టండి" అంటూ వారికి డబ్బిచ్చేసి కుర్రవాడికెవరూలేరంటే - తన వెంట తీసుకొచ్చి ఆశ్రయం కలిగించాడు. ఇలాగ సుబుద్ధి అతని యిల్లు చేరిన కొన్నాళ్లకే ఆ వైశ్యుడికి కొడుకు పుట్టాడు. అతని పేరు సమబుద్ధి.


అంతకు కొన్నేళ్ల ముందు అమలాపురం, పరిసరగ్రామాల మీద ఒక రాక్షసుడు పడి చిక్కినవారందరినీ చూసి తినేస్తూంటే - ఆ గ్రామస్తులందరూ అక్కడ పంచాయితీ జరిపి - రోజూ ఒక గ్రామంనుంచి ఒక మనిషిని పంపేందుకూ, రాక్షసుడు మిగిలినవారి జోలికి రాకుండానూ ఒక ఒడంబడిక(అంగీకారం.. అగ్రిమెంటు) చేసుకున్నారు.


ఆ వేళ రాక్షసుడికి ఆహారంగా మనిషిని పంపవలసిన వంతు హేమగుప్తునికి వచ్చింది. చేయగలిగేదేమీలేక అతను తన కొడుకు సమబుద్ధిని వెళ్లమన్నాడు రాక్షసునికాహారంగా. ఐతే హేమగుప్తునికి తెలియకుండా సమబుద్ధితోపాటు సుబుద్ధికూడా వెళ్లాడు. "మీరు యిద్దరెందుకు వచ్చారు?" అడిగాడు రాక్షసుడు.


"అయ్యా! మేము వరుసకు సోదరులం. నేను వీడి తండ్రికి జన్మించక పోయినా- వీరు నా కొకప్పుడు ప్రాణదానం చేశారు. అంతేకాదు. నన్ను చేరదీసి కుటుంబ సభ్యుడిని చేసుకుని యిన్నాళ్ళూ నన్ను చక్కగా పెంచుతూ పోషిస్తున్నారు. వారి రుణం తీర్చుకుందుకు నాకిది చక్కని అవకాశం. వారి కుటుంబాన్ని నిలపడానికి నా ప్రాణాన్నివ్వడం నాకు ధర్మమూ, విధీకూడా. కనుక తమరు సమబుద్ధిని విడచిపెట్టి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి” అని వినయంగా ప్రార్థించాడు. అంతలో సమబుద్ధి ముందుకొచ్చి - "అయ్యా! ఏ సుముహూర్తాన సుబుద్ధి మా యింటికి వచ్చెనో మరి, మా తండ్రిగారికన్నియూ శుభములే జరిగినవి. పుత్రోదయం కూడా అయినది. మా తండ్రిగారికితడనిన అమితమయిన ప్రేమ. ఇతడు అన్నగా నేను తమ్ముడిగా ఎంతో అభిమానంతో పెరిగాము. అది అలా వుంచండి. నా బదులు వీనిని మిమ్మల్ని తిననిచ్చినచో మా తండ్రిగారు రక్షించినవానిని - నేను భక్షించినట్లే అగును. అలా జరిగితే నేను మా తండ్రికింత ద్రోహం చేసినట్లే ఔతుంది. అందుచేత తమరటువంటి ప్రమాదమూ పొరపాటూ జరగనివ్వక-నన్నే భక్షించి సుబుద్ధిని వదలివేయుడు" అని కన్నీటితో వేడుకున్నాడు.


ఆ పిల్లల మాటలకు రాక్షసుడి మనసు కరిగిపోయింది. వాళ్ల మీద జాలితో పాటు అతని బుద్ధి కూడా వికసించింది. తన తప్పు తెలిసి వచ్చింది. మనసు మారిపోయింది. "మీలో ఒకరినే కాదు. ఇకపై నేనెవరినీ తినను” అన్నాడు. వాళ్లనింటికి వెళ్లిపొమ్మన్నాడు.


“విక్రమార్కా! ఆ వైశ్యబాలురు సుబుద్ధి, సమబుద్ధులలో ఎవరు గొప్పవారు? సూటిగా అడిగాడు భేతాళుడు. "నిజానికి మనం చెప్పుకోవలసింది - మంచివాడిగా మారిన రాక్షసుడి గురించే. ఎందుకంటే సుబుద్ధి, సమబుద్ధులకు మొదటి నుంచీ సంస్కారము ఉంది, జ్ఞానమూ ఉంది. కాని రాక్షసుడు మంచివాడిగా - మారడమే గొప్ప" అన్నాడు విక్రమార్కుడు. అతను మాటలాడడంతో- భేతాళుడదృశ్యమయి పోయాడు.


Thursday, 15 December 2022

భేతాళ కథలు - 16



వితంతువా, ముత్తయిదువా?


చంపానగరంలో కపిలుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతనికిద్దరు కొడుకులు. అన్నదమ్ములిద్దరూ ఒకమ్మాయినే ప్రేమించారు. ఎవరికివారికే తానే ఆమెను పెళ్లాడాలనే పట్టుదల పెరిగిపోయింది. ఇద్దరూ ఆమె దగ్గరకు వెళ్లారు. ఆమె విషయం విన్నది. "మీరిట్లు పంతం పట్టడం భావ్యంకాదు. మీరిద్దరూ ఒక నిర్ణీత స్థలంనుంచి బయలుదేరి -నియమిత కాలంలో పరుగెత్తండి. ఎవరెక్కువ దూరం పరుగెడతారో వారినే నేను వరిస్తాను' అంది తానుకూడా ఎటూ తేల్చుకోలేక.


ఆ పందెంలో అన్నదమ్ములిద్దరూ సమానంగా వచ్చారు. అందుచేత సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. అప్పుడు పెద్దలు కలుగజేసుకుని సోదరులారా! మీరిద్దరూ ఆమెను పరిణయమాడండి. ఆరునెలలొకరూ, ఆరునెలలింకొకరూ ఆమెతో కాపరం చేయండి. అంతకంటే మరో మార్గం మాకు తోచడంలేదు—” అన్నారు. వారి సలహా ప్రకారమే వీళ్లిద్దరూ ఆమెను పెళ్లిచేసుకుని సంసారం చేయసాగారు.


కొంతకాలానికి - ఆమె భర్తలలో పెద్దవాడు మరణించాడు. విక్రమారా! ఒక భర్త మరణించాడు కనుక ఆమె వితంతువై ఆ నియమాలు పాటించాలా? లేక భర్త సజీవంగానే ఉన్నాడు కనుక సుమంగళిగానే సుఖజీవితం సాగించాలా? సమాధానం తెలిసీ చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని హెచ్చరించాడు భేతాళుడు. విక్రమార్కుడు కొంచెం ఆలోచించి -


"భేతాళా! పెద్దవాడినే అనుసరించి ఆమె వైధవ్యం అనుభవించాలి కాని అతనే తన వివాహకాలంలో ఆమె ఐదోతనంలో తమ్ముడికి భాగమూ స్థానమూ యిచ్చి వున్నాడు. చిన్నవాడింకా జీవించే ఉన్నాడు కనుక ఆమె ముత్తయిదువుగా ఉండుటయే ధర్మం" అని చెప్పాడు. భేతాళుడతని తెలివిని మెచ్చుకుని - మాయమైపోయాడు.

Wednesday, 14 December 2022

భేతాళ కథలు - 15



అసలు తండ్రి ఎవరు?


జయంతీ నగరంలో తిలోత్తమ అను పేరుకల స్త్రీ ఉండేది. ఆమెకు బాల్యమందే వివాహం జరిగింది. (పూర్వకాలంలో చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు ఆడపిల్లలకి). కాని... భర్తవలన ఎటువంటి సంసారసుఖమూ అనుభవించ కుండానే ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. (అంటే- భర్తచనిపోయాడని. బాల్య వివాహాలవలన కలిగే అనేక నష్టాలలో యిదొకటి) వితంతువుకు అన్నీ అంక్షలే' అలా మొదలుపెట్టాడు భేతాళకథని.


విక్రమార్కుడు తలమీదున్న శవాన్ని గట్టిగా పట్టుకుని వినసాగాడు. "వైధవ్యమంటే వచ్చింది కాని ఆమెకి వృద్ధాప్యం రాలేదు కదా? యౌవనంలో ఉంది. అందగత్తె. కోరికలు ఊరికే పోవు మరి. అందుచేత తిలోత్తమ విధవయినా ఒక మగవానికి మనసిచ్చి అతనితో రహస్యంగా సుఖ భోగాలనుభవిస్తూండేది. ప్రకృతికి - స్త్రీ అనే తప్ప ఆమె విధవా (భర్తలేనిదా) సధవా (భర్తకలదా) అనే తారతమ్యం ఉండదు కనుక ఆమె గర్భవతయింది. భర్తలేని స్త్రీ గర్భవతయితే ఆక్షేపణ కనుక తన రహస్యం బయటకు పొక్కకుండా ఆమె ఎక్కడికోపోయి.. బిడ్డ కలిగాక తనవూరికి తిరిగివస్తూ - మధ్యతోవలో ఆ మగబిడ్డను వదిలేసి వచ్చింది.


ఆ బిడ్డ ఒక శ్రీమంతుడి కంటపడ్డాడు. అతనికి సంతానంలేదు. అందుచేత ఆ మగపిల్లవాడిని తన యింటికి తీసుకుపోయి - దత్తత చేసుకుని.. ఆ అబ్బాయిని పెంచి పెద్దచేసి తన ఆస్తులన్నిటినీ యిచ్చాడు. ఆ కురవాడికతను పెంపుడు తండ్రనే తెలియదు. కొంతకాలానికి అతను మరణించాడు. కొడుకు- తండ్రికి చేయవలసిన అపరకర్మలు (చనిపోయిన వారికి చేసే కర్మలు) చేస్తూ... పిండిప్రదానాలూ తర్పణాలు (ఆహారమూ, నీరూ వదులుతుంటే పితృలోకం (చనిపోయిన పెద్దలు పితృలోకంలో - ఉంటారని నమ్మకం) నుంచి అతని ముందు మూడు చేతులు చాచబడ్డాయి. మొదటిచేయి - తిలోత్తమను వివాహం చేసుకున్న వాడిది. రెండవది - తిలోత్తమకు గర్భం ప్రసాదించిన రహస్య ప్రియుడిది. (అతనూ చనిపోయాడదివరకే). మూడో చెయ్యి అతన్ని దత్తత చేసుకుని పెంచి పెద్దవానిని చేసి ఆస్తిపాస్తులనిచ్చిన పెంపుడు తండ్రిది.


రాజా! ఇప్పుడా కుమారుడు ఆ ముగ్గురి చేతులలోనూ ఎవరి చేతిలో పిండం ఉంచాలో, తర్పణం వదలాలో చెప్పు" అన్నాడు భేతాళుడు. ఒక్క నిముషమయినా ఆలోచించలేదు విక్రమార్కుడు. 'పిండప్రదానాలకు సంబంధించినవి కనుక యీ సమస్యను హిందూధర్మ శాస్త్రాలననుసరించి పరిష్కరించడమే యుక్తం, తిలోత్తమ విధవ అయినదే తప్ప భర్తనుండి విడాకులు పొందలేదు. కనుక ఆమెను పెళ్లి చేసుకున్నవాడే భర్త. ఆమె రహస్యంగా ప్రియుడితో సంబంధం ఏర్పరచుకుందే తప్ప అతన్ని వివాహం చేసుకోలేదు. కనుక ఆ పిల్లవాడి జన్మకు కారకుడయినా అతనా పిల్లవాడికి తండ్రి కాజాలడు. వివాహమాడిన భర్తదే సంతానమౌతుంది. ఐతే - దత్తతవలన కన్నతండ్రికి పుత్రుని వలన పొందే ఉత్తర క్రియాధికారాలు పోతాయి. అతను వాటిని వదులుకునే దత్తత యివ్వాలి. దత్తత తీసుకున్న తండ్రికే పుత్రుడినుంచి ఉత్తర క్రియలకు అందుకునే అధికారం సంక్రమిస్తూంది. కనక అతని దత్తత తండ్రిచేతియందే పిండప్రదానమూ, తర్పణమూ చేయడం సముచితమూ, ధర్మసమ్మతమూ. " అని తీర్మానించాడు.


విక్రమాదిత్యుడు. "సెహభాష్" అంటూనే అంతర్ధానమయ్యాడు శవమూ, దానిలోని భేతాళుడూ. విక్రమాదిత్యుడికి మళ్లీ మౌనం భగ్నమయింది.


Tuesday, 13 December 2022

భేతాళ కథలు - 14



ఆ పాపం ఎవరిది?


పాటలీపుత్రంలో నారాయణ దీక్షితుడనే పేరుకల బ్రాహ్మణునికి చాలా అందమయిన భార్య ఉండేది. ఆమె పేరు సుందరి. (ఈ పేరు కల్పితం) ఒకనాటి వెన్నెలరాత్రి నారాయణ దీక్షితుడు భార్యతో సౌదాగ్రమున మేడ మీద ఆరుబయట వెన్నెలపలలో ఆకాశం కనిపించేలా... నిద్రపోయాడు.


ఆ సమయంలో ఆకాశవీధిలో విహరిస్తున్న గంధర్వుడొకడా బ్రాహ్మణు స్త్రీ సౌందర్యానికి మురిసి - తన మంత్రశక్తితో ఆమెను అపహరించుకుపోయాడు.


ఉదయం నిద్రలేచిన నారాయణ దీక్షితులుకి భార్య కనపడలేదు.


ఆమెకోసం ఎన్నిచోట్ల వెదకినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆమె కనిపించలేదు. తిరిగి తిరిగి అతనొక అడవిని చేరుకోగా అక్కడొక మహాముని కనిపించాడు. దీక్షితులాయనికి ప్రణామం చేసి తనదీనావస్ధను కన్నీటితో విన్నవించుకున్నాడు.


ఆ జడధారి మనసు కరిగింది. తన దివ్యదృష్టితో సుందరి ఉన్న చోటుని కనుక్కున్నాడు. "ఆ గంధర్వుడి మదం అణచి నీ భార్యని చెరవిడిపించి తీసుకువచ్చే ప్రయత్నం మొదలు పెడుతున్నాను” అంటూ ఆ కార్యక్రమంలో దిగాడు.


ఆ గంధర్వుడు కూడా తన దివ్య దృష్టితో భూలోకంవేపు చూశాడు. సుందరి భర్తయిన దీక్షితులు తపస్వి సహాయం పొందాడని తెలుసుకుని - “ముందు నేనే అతన్ని చంపివేస్తే మంచిది కదా..” అనుకుని పాముగా మారి ఆ ముని ఆశ్రమప్రాంతంలో పొంచి ఉన్నాడు.


ఒకనాడు వినువీధిలో ఎగురుతున్న గద్ద ఆ పాముని చూసింది. - పాము కంటపడడమేమిటి, మెరుపు వేగంతో దానిని కాళ్లతో చిక్కించుకుని ఎగిరి ఒక చెట్టుకొమ్మ మీద ఉంచి నానా హింసలూ పెట్టసాగింది. అదే చెట్టుకింద తాగవలసిన పాలుఉన్న గిన్నెను పట్టుకుని పరధ్యానంగా కూర్చున్న దీక్షితులుకి తన తలపైన చెట్టుకొమ్మ మీద జరుగుతున్న అలజడి తెలియడమేలేదు. అతని ఆలోచనలన్నీ భార్యమీద ఉన్నాయి మరి. 


ఆ పాముని గద్ద జయించేసింది. తనకి ప్రాణాపాయం తప్పదని తేల్చుకున్న పాము విషం కక్కేసింది. నురుగులాటి ఆ విషం నారాయణ దీక్షితుల చేతిలో ఉన్న గిన్నెలోని పాలలోపడింది. ఐతే దీక్షితులు భార్యతలపులలో ఉండి - అది కూడా గమనించలేదు. చెట్టుకొమ్మ మీద పాముని చంపి తినేసింది గద్ద. నారాయణ దీక్షితులు గిన్నెలోని పాలను తాగాడు. అంతే మరుక్షణం మరణించాడు ఆ పాలలో కాలకూట విషప్రభావానికి". అంతవరకూ చెప్పి ప్రశ్నలు సంధించాడు భేతాళుడు. "మహారాజా! నారాయణ దీక్షితులు బ్రాహ్మణుడు. అతనిది సహజమరణం కాదు. ఒక విధంగా హత్యే. కనుక అతన్ని చంపిన వారికి బ్రహ్మహత్యాపాతకం అంటక తప్పదు. జాగ్రత్తగా నిర్ణయించి చెప్పు. ఆ బ్రహ్మహత్యాపాతకం ఎవరిది? పాముదా? గద్దదా?” ఆ ప్రశ్నలకు విక్రమార్కుడు. నిమిత్తమాత్రమయిన పాత్రే యీ సంఘటనలో, గంధర్వుడు మొదటినుంచీ అపరాధే. పరస్త్రీని మోహించడం.. ఆమెను అపహరించడం, చెరపట్టడం, ఆమె భర్తను చంపాలని ప్రయత్నించడం... అన్నీ నేరాలే. అతన్ని చంపడానికే గంధర్వుడు పాముగా మారాడు కదా. చివరికి నారాయణ దీక్షితుల మరణానికి కారణం కూడా ఆ పామువిషమే. కనుక నిస్సందేహంగా ఆ బ్రహ్మహత్యాపాతకం పామురూపం దాల్చిన గంధర్వుడిదే" అని వక్కాణించాడు. ఆ విధంగా విక్రమార్కుడి మౌనం చెదరిపోవడంతో శవం మాయమైంది.


Monday, 12 December 2022

భేతాళ కథలు - 13



స్త్రీ పురుషులలో ఎవరు మంచివాళ్లు? ఎవరు చెడ్డవాళ్లు?


పూర్వం ఒక రాజుగారి న్యాయస్థానానికి అతి విచిత్రమయిన కయ్యము విచారణకు వచ్చింది. కోశాధికారియింట్లో ఉండే పావురాల జంటలో కుటుంబ కలహం ఏర్పడి ఆ కలహం పెరిగి పెరిగి పెద్దదై - ధర్మముననుసరిస్తాడనే పేరొందిన రాజు వద్దకు వచ్చింది.


ఆడపావురం యిలా చెప్పుకుంది. "ప్రభూ! ప్రపంచంలో పురుషజాతి అతి క్రూరమైనది. రత్న గిరియందుండే శశాంకుడు నీచుడూ దుర్మార్గుడూ. అయినా అతని మీద దయతో క్షమాకారుడు తన కుమార్తె సుశీలనిచ్చి - వివాహం చేశాడు. పతియే దైవముగ భావించుచు కాపురం చేయుచున్న సుశీలను జదరీ, తాగుబోతూ అయిన శశాంకుడు నానాహింసలూ పెట్టేవాడు. కాపురాన్ని అప్పులపాలుచేశాడు.


సుశీల పుట్టింటికి వెళ్లి "మీ అల్లునకు వ్యాపారమందు నష్టమొచ్చింది' అంటూ తండ్రినుంచి డబ్బు తీసుకురాగా... శశాంకుడామె ధనమునంతయూ అపహరించి - వనభోజనం నేపంతో భార్యనొక అడవికి తీసుకెళ్ళి నూతిలోకి తోసేశాడు. కాని సుశీల ఎలాగో బతికి బయటపడి మళ్లీ పుట్టింటికి చేరి మగని దుర్మార్గమును బయటపెట్టక - ఏవో సాకులు చెప్పి మళ్లీ తండ్రినుంచి డబ్బు తీసుకుని వస్తుంటే శశాంకుడామెను - తోవలోనే చంపివేసి ఆ డబ్బును పట్టుకుపోయి తాగుచూ జూదమాడుచుండెను.


మగవారు కుటిలురూ, కుత్సితులూ అనడానికింకేం నిదర్శనం కావాలి?' అని ముగించింది. ఈసారి మగపావురం చెప్పసాగింది.


“అమరావతి నగరమందుండే ఉత్తముని భార్యరూపవతికి క్షయవ్యాధి వచ్చింది. బంధువులూ మిత్రులూ అందరూ - ఆ వ్యాధి నయమయ్యేది కాదనీ అనవసరంగా వైద్యం పేరిట ధనం వ్యర్థం చేయొద్దనీ బోధించినా భార్యని ఎంతో ప్రేమించే ఉత్తముడు తన ధనమునే కాక రక్తమును కూడా భార్యకి ధారపోశాడు. దాంతో రూపవతి వ్యాధినయమయి పరిపూర్ణారోగ్యం పొందింది. కాని -


రక్తమును కోల్పోయిన ఉత్తముడు తగిన ఆహారంలేక నీరసించిపోయి ధనార్జన చేయలేక భార్యనగలనమ్మాలనుకున్నాడు. రూపవతి - భర్త తన కోసం చేసిన త్యాగాన్నయినా తలచకుండా - తన పుట్టింటికి పోయి గ్రామంలో ఉన్న యువకులతో వ్యభిచరించుచూ జారిణికాగా – నిజం తెలిసిన ఆ యువకులు ఆమె ముక్కు చెవులు కోశారు. రూపవతి - తన భర్తే తన ముక్కు చెవులని కోశాడని ప్రచారం చేయగా రాజు ఉత్తముని ఉరితీయించాడు.


భార్యనెంతో ప్రేమించిన ఆ భర్తకు లభించిన ఫలమది. కనుక - ప్రపంచంలో స్త్రీజాతి ఎంత మాత్రమూ మంచిది కాదు.” విక్రమార్కా! వారి మాటలు విన్నావు కదా? స్త్రీ పురుషులలో ఎవరు మంచివాళ్లు? ఎవరు చెడ్డవాళ్లు?” అడిగాడు భేతాళుడు.


స్త్రీలయినా పురుషులయినా మానవజాతే. ఇద్దరికీ మానవవిలువలు సమానమే. ఆ విలువలను నిలబెట్టుకోలేకపోయిన వారు స్త్రీ అయినా పురుషుడయినా చెడ్డవారే. మంచి చెడులకి లింగ భేదముండదు." అన్నాడు. విక్రమార్కుడు. అతని మౌనానికి భంగమవడంతో భేతాళుడు అదృశ్యమైపోయాడు.


Sunday, 11 December 2022

భేతాళ కథలు - 12



అప్పుడు మళ్లీ అన్నదమ్ముల్లో ఆమెకోసం తగవు మొదలయింది. “నేను అద్దంలో చూచి చెప్పడం బట్టికదా మీకు పరిస్థితి, ప్రమాదమూ తెలిశాయి. కనుక నేనే మేనకోడలిని పెళ్లి చేసుకుందుకు తగినవాడిని-" అని వాదించాడు చిన్నవాడు. "అద్దంలో చూచి చెప్పినా సకాలంలో యిక్కడికి చేరకపోతే ఏం ప్రయోజనం? సకాలంలో మిమ్మల్నిక్కడికి కీలుగుర్రంమీద చేర్చింది నేను. కనుక మేనకోడలిని వివాహమాడడానికి అర్హుడిని నేనే" అని నిర్ద్వంద్వంగా చెప్పాడు రెండోవాడు. "నేనిక్కడకి చేర్చకపోతే బెత్తంతో ఆమెకు ప్రాణం తెప్పించడం కూడా సాధ్యపడేది కాదు.”


"అద్దంలో చూసి చెప్పినా... కీలుగుర్రం మీద వచ్చినా... ఆమెకి ప్రాణదాత నా బెత్తమే. కనక - మేనకోడలిని పరిణయమాడడానికి యోగ్యుణ్ని నేనే" అన్నాడు పెద్దవాడు. రాజా! ఆ అన్నదమ్ములు ముగ్గురిలోనూ ఆమెను వివాహం చేసుకునేందుకు అర్హులెవరు?" ప్రశ్నించాడు భేతాళుడు.


"భేతాళా! వింత వస్తువులను తేవడంతో ముగ్గురన్నదమ్ములూ సమానమే. కాని మేనరికమునందు తగిన వరుడు పెద్దవాడు. కనుక ఆ సౌందర్యవతికి మేనమామలయిన ఆ ముగ్గురన్నదమ్ములలోనూ పెద్దవాడికే ఆమెను వివాహం చేసుకునే అర్హతుంది. అదే శాస్త్రం." అని చెప్పాడు విక్రమార్కుడు. దాంతో అతని మౌనం భంగపడింది. భేతాళుడా సమాధానానికి మెచ్చుకుంటూనే అంతర్ధానమయిపోయాడు. 

Saturday, 10 December 2022

భేతాళ కథలు - 11

 


ఎవరు పెళ్లి చేసుకోవాలి?


స్వర్ణపురమనే మహానగరంలో నిగమశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతనికి సర్వాంగసుందరమయిన కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యానికి ముగ్ధులై మహారాజులు సైతం ఆమెను వివాహం చేసుకోదలచి వచ్చేవారు. కాని నిగమశర్మ - వారికి.


"అయ్యలారా! నా బిడ్డకు మేనమామలున్నారు. నేను భోగభాగ్యములకొరకు మేనరికమును వదలజాలను" అని వారిని పంపివేసేవాడు.


ఆమె మేనమామలు ముగ్గురూ ఒకేసారి వచ్చి - “మీ అమ్మాయిని నాకే యివ్వాలంటూ నిగమశర్మను కోరడమేకాక వారిలో వారక్కడే తగవులాడుకుని కొట్టుకొనుటకు సిద్ధపడిరి. అది గమనించిన గ్రామపెద్దలు -"యువకులారా! ఇటువంటి పరిస్థితిలో మీలో మీరెంత తగవులాడుకొన్ననూ ప్రయోజనముండదు. మీకు ఆరు నెలలు గడువిచ్చుచున్నాము. మీలో ఎవరయితే ప్రపంచంలోకెల్లా అతి విచిత్రమయిన వస్తువును తెస్తారో వారికే నిగమశర్మ కుమార్తెనిచ్చి వివాహము చేయుదుము" అని తీర్పు చెప్పారు. నిగమశర్మ కూడా అందుకంగీకరించాడు.


అన్నదమ్ములు ముగ్గురూ స్వర్ణపురంనుండి నూరామడల దూరమందున్న పట్టణము వరకూ కలసి ప్రయాణం చేశాక -"సోదరులారా! ఇకపై మన ముగ్గురమూ మూడు వైపులకి పోవుదము, తిరిగి యిక్కడికే వచ్చి కలుసుకొన్న తరవాత మామయ్య యింటికి వెళ్తాం..” అనుకుని ఒక్కొక్కరూ ఒక్కొక్క దిక్కుగా వెళ్లిపోయారు.


ఆరునెలలు పూర్తి కాబోయేటంతలో పెద్దవాడొక పేము బెత్తమునూ, రెండవవాడొక కీలుగుర్రాన్నీ, మూడవవాడొక అద్దము సంపాదించుకుని వచ్చి అక్కడ కలుసుకున్నారు.


చిన్నవాడు అద్దంలో చూచి - "సోదరులారా! మన శ్రమంతయూ బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమైపోయినది. మన మేనకోడలు మరణించినది. ఆమె శవమును స్మశానమునకు తీసుకుపోయి చితిపై ఉంచారు. కొన్ని నిమిషాలలో అగ్ని సంస్కారం జరుగగలదు" అన్నాడు. వెంటనే రెండవ వాడు కీలుగుర్రం మీద తన సోదరులిద్దరినీ ఎక్కించుకుని "ఓ అశ్వమా! మమ్ము తక్షణం మా మేనకోడలి శవమున్న స్మశానమునకు చేర్చుము." అన్నాడు. ఆ గుర్రం కన్ను మూసి తెరిచేంతలో వారిని చేరవలసిన చోటుకు చేర్చింది.


అప్పటికే శవమునకు అగ్నిసంస్కారం జరగడానికంతా సిద్ధంగా ఉంది. పెద్దవాడు చితిమీద ఉంచిన మేనకోడలి శవమును తన పేము బెత్తముతో మూడు దెబ్బలు కొట్టి "చిన్నదానా! లే." అని ముమ్మారన్నాడు. అంతే. ఆ సుందరి నిద్రలోంచి లేచినదానిలా చితిమీద లేచి కూర్చుంది.

Friday, 9 December 2022

భేతాళ కథలు - 10



మహాసుకుమారి


విక్రమార్కా! జాగ్రత్తగా విను. మదనపురాన్ని పాలించే మీనకేతుడికి ముగ్గురు భార్యలుండేవారు. రాజుకి ఆ ముగ్గురియందూ సమాన ప్రేమే. ఒకనాడతను మంత్రితో - "నేనొకరోజు పెద్ద భార్య అయిన సౌందర్యవతితో పూలవసంలో విహరిస్తూంటే - ఒక చెట్టునుంచి పువ్వు రాలి ఆమె చేతిమీద పడింది. అంతే క్షణంలో ఆమె చెయ్యి ఎర్రగా కందిపోయింది.


మరొకసారి నేను నా రెండో భార్య శుభాంగితో మేడమీద విహరిస్తున్నాను. ఆ వేళ పున్నమి. వెన్నెల వచ్చింది. అంతే ఆమె పున్నమి వెన్నెలను సహించలేక మూర్ఛపోయింది.


ఇక - నా మూడో భార్య విలాసవతి విషయం విను. ఒకసారామె చిన్న పిల్లవాడి రోదన వింటూనే చెవులు దిబ్బళ్ళు వేసి - స్మారకం (స్పృహ) తప్పిపడిపోయింది” అన్నాడు. "రాజా! వీరు ముగ్గురిలోనూ అత్యంత సుకుమారి ఎవరు?" అడిగాడు భేతాళుడు. సౌందర్యవతి చేతి మీదపడిన పువ్వులో ఏ కీటకమో ఉండి కుట్టుటచే ఆమె చేయికంది ఉండ వచ్చును. నిండు వెన్నెలకు - యౌవనంలో ఉన్నవారికున్మాదం కలిగించే గుణం ఉంది. శుభాంగికి అటువంటి వ్యాధి ఉండి వెన్నెల వలన ప్రకోపించి ఉండవచ్చును. కాని... విలాసవతి శరీరమేకాక మనసుకూడా మహాసుకుమారమయినది కనుకనే బాలుడి రోదనకే ఆమె సొమ్మసిల్లిపోయింది. ఆమే మహాసుకుమారి." చెప్పాడు విక్రమార్కుడు.  


Wednesday, 7 December 2022

భేతాళ కథలు - 9



ఆత్మహత్యకు అసలు కారణం 


భూలోకంలోని నగర రాజ్యాలన్నిటికీ కిరీటంలాటిది విజయనగరమనే పురం. దాని రాజు వంశకేతుడు. అతను నిత్యవ్రత అనే రాకుమారిని వివాహమాడి - ఆమెపై వలపు వీడలేక రాత్రింబవళ్ళు అంతఃపురంలోనే గడుపుతూ రాచకార్యములను పట్టించుకోవడం మానేశాడు.

అతని మంత్రి తీర్థదర్శి. పాలనా వ్యవహారాలు చూసేవాడు. దాంతో "ఈ మంత్రి ఎప్పుడో ఒకనాడు రాజునణచి రాజ్యము నపహరించును" అని పుకార్లు పుట్టసాగాయి. అవి మంత్రికి తెలిసాయి.


“లోకులు కాకులవంటివారు. వారికి నా మనసులోని ఉద్దేశం తెలియదు. నిజం తెలియకే యిలాటి నిందలు వేస్తున్నారు. లోకనింద భరించడం మహాకష్టం. ఇలా అపవాదుపడ్డాక రాజ్యం విడిచిపోవడమే మంచిది.” అనుకున్నాడు - తీర్థదర్శి. ఈ విషయం రాజుకి తెలిపి మరో మంత్రికి రాజ్యాధికారం యిచ్చాడు.


దేశత్యాగం చేసిన తీర్థదర్శి అనేక దేశాలు తిరిగి తిరిగి చివరకి సముద్రతీరంలో ఉన్న ఒక నగరాన్ని చేరుకుని అక్కడి వర్తకులలో ఒకరితో స్నేహం చేసి నిరంతరమూ అతనిని విడవకుండా ఉంటూండేవాడు.. ఒక రోజు - ఆ వర్తకుడు తన స్నేహితునితో - "నేనిప్పుడే బయలుదేరి ఓడపై ద్వీపానికి వెళ్తున్నాను. నేను పని చూసుకుని వచ్చేవరకూ నువ్విక్కడ నా బదులుగా అన్ని పనులూ చూడు" - అన్నాడు.


“నిన్ను విడచి నేనొక్కనిముషయినా ఉండలేను. నేనూ నీతోవస్తాను' ' అన్నాడు తీర్థదర్శి. అలాగ వారిద్దరూ ఓడమీద వెళ్తూ - ఒక ద్వీపంలో అద్భుత సౌందర్యవతినొకామెను చూశారు. ఆమెను చూసి అమితాశ్చర్యానికి లోనయిన తీర్థదర్శి - “ఈమె ఎవరు? అని అడిగాడు. వర్తకుడు - "ఈ కన్యారత్నమెవరో నాకు తెలియదు. కాని నేను ఓడమీద వచ్చిపప్పుడల్లా యీమెనిక్కడ తప్పకుండా చూస్తుంటాను" అని చెప్పాడు.


తరువాత తీర్థదర్శి కొంతకాలానికి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. తన మునుపటి రాజగు వంశకేతుడిని సందర్శించాడు. ఆ రాజు తీర్ధదర్శిని చూసి ఎంతో ఆనందించి కౌగలించుకొని, గౌరవించి కుశల ప్రశ్నలడిగి - “నన్నెందుకు విడచివెళ్లావు?” అని అడిగాడు.


“రాజా! నువ్వు స్త్రీలోలుడిపై అంతఃపురము విడచిరాక రాచకార్యములు నిర్వహింపకపోవుటచే నేనీ రాజ్యమును హరింతునని లోకోపవాదములు పుట్టాయి. ఆ నిందలు భరించలేకనే దేశం విడచి వెళ్లాను - " అని చెప్పాడు తీర్థదర్శి. రాజు విశేషాలేమిటని అడిగాడు. "ఒకచోట నేనొక వర్తకునితో స్నేహం చేసి.. అతనితో మరోద్వీపం ఓడమీద వెళ్లాను. అక్కడ ఒక చోట కాళికాలయముంది. దాని ముందున్న చెట్టు నీడలో ఒక కన్యారత్నం ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఎంత అందగత్తో నేను చెప్పలేను. నేనెన్నడూ అంత చక్కని స్త్రీని చూడలేదు.." అని తీర్థదర్శి చెప్పేసరికి వంశకేతుడు చాలా ఆశ్చర్యపోయి "తీర్థదర్శీ! నేనామెను చూడాలి! నా బదులు నవిక్కడుండు. త్వరలోనే వచ్చేస్తానులే” అంటూ అక్కడికి వెళ్లడానికవసరమయిన వివరాలు తెలుసుకుని - వర్తకునితో స్నేహంచేసి అతనా ద్వీపం వెళ్లేటప్పుడు వెంటవెళ్లి - మంత్రి చెప్పిన చోట ఆ కన్యకను చూసి ఆమె పట్ల మోహమూ, ప్రేమలో పడి కాళికాలయంలో పూజచేసి - - ప్రసాదం తీసుకుని ఆమె వద్దకు వచ్చాడు.


ఆమె అతన్ని చూసి దాక్కోబోగా ఆమె కొంగు పట్టుకుని వదలకుండా ఎన్నో విధాల ఆమెను ప్రార్ధించాడు. ప్రాధేయపడ్డాడు. అతను రాజని తెలిసి ఆమె అంగీకరించింది. వాళ్లిద్దరూ సుఖాలలో ఓలలాడారు. ఒకనాడు - వ్రతం నిమిత్తమామె నీటిలో మునగగా ఒక రాక్షసుడామెను మింగేశాడు. రాజు ఆ రాక్షసుడి పొట్టను తన కత్తితో చీల్చి తన భార్యను బయటకు తెచ్చాడు. కొన్నాళ్లు గడిచాక ఆమెను వెంటబెట్టుకుని తన రాజ్యానికి చేరుకున్న రాజు మునపటికంటె మరింతగా కాంతాలోలుడయి అంతఃపురందాటి బయటకు రావడం మానేశాడు.


అది చూసి మంత్రి విషం తాగి బలవంతంగా మరణించాడు? రాజు తిరిగి వచ్చాడనా? లేక తాను చూచినకాంత తనకి కాకుండా రాజుకి దక్కిందనా?” అడిగాడు భేతాళుడు. అందుకు - "భేతాళా! రాజు యిదివరకే స్త్రీలోలుడు. అది తెలిసి కూడా తానా స్త్రీ గురించి అతనికి చెప్పినందువల్లనే రాజు రాచకార్యములు మానేశాడు. ఆ అపవాదు తనమీదే పడుతుందని భయపడి మాత్రమే ఆ మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తప్ప మరే కారణమూకాదు-” అని జవాబిచ్చాడు విక్రమార్కుడు. అతని మౌనానికి భంగమవడంతో భేతాళుడు మాయమై యథాస్థానం చేరుకున్నాడు.


Tuesday, 6 December 2022

భేతాళ కథలు - 8



కార్పాటకుడంతకు ముందు మోహించిన నాగకన్య నిజంగానే అత్యద్భుత సౌందర్యంతో వెలిగిపోతుంది. మిగిలిన వారి మధ్య ఆమె చుక్కల్లో చంద్రుడిలాగే ఉంది.


ఆమె రాజును చూసినదే తడవుగా- అతని మీద మోహం చెంది అతని ముందుకు వచ్చి " రా రాజా! నీకేది కావాలంటే అది యివ్వగలను. దయయుంచి నా కోరిక తీర్చు. నీపైమోహంతో నేను తాళలేకపోతున్నాను' అంటూ వేడుకుంది. ఆమె మాటలకు - రాజు -" ఓ సుందరీ! ఇతను నా కొడుకు వయసులో ఉన్నాడు. నా కంటే అన్నివిధాలా గొప్పవాడు. ముందు అతని కోరిక తీర్చి సుఖాల్లో తేల్చు” అన్నాడు కార్పాటకుణ్ని చూపుతూ. రాజే అలా అన్నాక చేయగలిగిందేమీ కనిపించక నాగకన్య కార్పాటకుణ్ని అంగీకరించింది. రాజు వారిద్దరినీ ఒక చోట చేర్చి - "కార్పాటకా! ఆవేళ.. నేను అరణ్యంలో అతిదాహంతో బాధపడుతుండగా నువ్వు నాకిచ్చిన రెండు ఉసిరిపళ్లలోనూ ఒకదానికి యీ నాగకన్యను నీకు జతకూర్చుటతో సరిపోయినది. ఇంకొక పండుకు మాత్రమే నేను రుణపడి ఉన్నాను." అని మునుపు కార్పాటకుడు మునిగిన నీటిగుంటలో తాను మునిగి తన నగరమున తేలాడు. కార్పాటకుడు నాగలోకంలో సౌందర్యవతితో హాయిగా సుఖిస్తూ గడపసాగాడు.


రాజా వీరిద్దరిలో ఎవరు చేసిన ఉపకారము గొప్పదో నిర్ణయించి చెప్పు. సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ” అంటూ హెచ్చరించాడు. భేతాళుడు. విక్రమార్కుడికిదేమీ అంత జటిలమయిన ప్రశ్నలా అనిపించనట్లుంది. “భేతాళా! శకటశృంగుడు రాజు. కార్పాటకుడు అతని వద్ద సేవకుడు. సేవకుడు స్వామిభక్తిని ప్రదర్శించడం అతని విధే తప్ప అదనపు గొప్పతనమేమీ కాదు. కనుక - అరణ్యములో దాహముతో ఉన్న రాజుకు కార్పాటకుడు ఉసిరిపండ్లనిచ్చుటలో - విద్యుక్త ధర్మమే గోచరిస్తుంది. కాని రాజు భృత్యుడు చేసిన మేలుని మరవకపోవడమూ, ఆ మేలుని ఋణంగా భావించి, ప్రత్యుపకారం చేసి - తీర్చుకోవడమూ అతని చిత్తశుద్ధికి, విశాల హృదయాన్ని, సమాన భావాన్నీ తెలుపుతాయి. అందుచేత కార్పాటకుడు చేసిన ఉపకారంకంటే, శకటశృంగమహారాజు చేసిన ప్రత్యుపకారమే శ్లాఘించతగినది” అని చెప్పాడు.


“నిజమే” అంగీకరించాడు భేతాళుడు. 


విక్రమార్కుని మౌనానికి భంగం కలగడంతో - అతని తలమీదనున్న శవం మళ్లీ వెళ్లి మర్రి చెట్టుకు వేలాడసాగింది.


తప్పెవరిది?


మంత్రోపదేశం పొందిన నలుగురు అమాయకపు విప్రసోదరులు తమ మంత్రాలెలా పనిచేస్తాయో పరీక్షించాలనుకున్నారు. వాళ్లు నడుస్తున్న అడవిదారి పక్క ఒక ఎముక కనిపించింది. నాలుగోవాడు దానిని ముందుంచుకుని మంత్రం జపించేసరికి ఆ ఎముక తాలూకు జంతువు యొక్క అస్తిపంజరం ఏర్పడింది. మూడోవాడు తన మంత్రం పఠించేసరికి ఆ అస్తిపంజరానికి మాంసం, రక్తం, పేగులు మొదలయినవి అమిరాయి. రెండోవాడు తను నేర్చుకున్న మంత్రం ఉచ్చరించేసరికి - ఆ ఆకారానికి చర్మమూ, రోమాలూ (వెంట్రుకలు) గోళ్లూ ఏర్పడ్డాయి. అప్పుడేనా- అది పెద్దపులి అని ఆగకుండా పెద్దవాడు తను నేర్చిన మంత్రం చదివేశాడు. తొందరగానూ అమాయకంగానూ. దాంతో ఆ ఆకారానికి ప్రాణమూ చైతన్యమూ వచ్చేశాయి. ఆ పెద్దపులి-ఆకలిమీదుండి నలుగురన్నదమ్ములనీ తినేసింది. "రాజా! తప్పెవరిది? పాపమెవరిది?" అని అడిగాడు భేతాళుడు. "తప్పు కాని, పాపంకాని ఆనలుగురిలోనూ ఎవరిదీ కాదు ఎందుకంటే- నలుగురికి నలుగురూ అమాయకులు. వారిలో ఏఒక్కడికీ యితరులను చంపాలనే దుష్ట తలంపు లేనేలేదు. చెప్పాడు విక్రమార్కుడు. అతని మౌనం చెడడంతో భేతాళుడు శవంతో పాటే మాయమయ్యాడు.