Saturday, 7 January 2023

శ్రీదత్త పురాణము (12)



శౌనకాది మునులారా! బ్రహ్మదేవుడు కలికి చెప్పిన గురుశిష్యుల సంభాషణ ఇది. గురు శిష్యుల లక్షణాలు గుణగణాలు తెలిసాయి కదా! గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు అని గురుభక్తి గురుసేవయే భుక్తిముక్తిదాయకం అని పురాణములు బోధిస్తున్నాయి. అటువంటి గురు దత్తాత్రేయుడి చరిత్రను వినాలని అనుకోవటం మీ పూర్వపుణ్య విశేషం. చెబుతాను వినండి అని సూత మహర్షి అన్నాడు.


అప్పుడు మునులంతా ఇలా అన్నారు. మహర్షీ గురు శిష్యుల లక్షణాలు అద్భుతంగా చెప్పావు, ధన్యవాదాలు. దత్త చరిత్ర వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతుంది. కానీ దీపక వేదధర్ముల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. దీపకుడు తన దీక్షను నెరవేర్చుకొన్నాడా ? జీవితాంతం బ్రహ్మచారిగానే వుండి గురుసేవలో తరించాడా? కష్టాలు ఎదురైనాయా ? చివరికి అతనికి దక్కిన గురుఫలం ఎలాంటిది ? గురువు ఎలా అనుగ్రహించాడు ? ఇవన్నీ మాకున్న సందేహాలు అని అడిగారు.


అప్పుడు సూతమహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా చెప్పాడు. గురుశుశ్రూష తప్ప వేరొక ధ్యాసలేని దీపకుడ్ని ఒకరోజు వేద ధర్ముడు దగ్గరకి పిలచి నాయనా నీ సేవలకు ఆనందంగా వుంది. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే. నాకొక అవసరం వుంది ముందు విను తరువాత సమాధానం చెబుదువు గాని తొందరలేదు అని నాయనా, దీపకా, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి. అవి పూర్వజన్మ సంచితములు. తపస్సులతో కొంతరవకు నశింపజేసుకొన్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి నశింపజేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశికి వెడదామని అనుకొంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహా మహా పాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తములతో నశింపజేసుకోవచ్చు. పుణ్య ఫలాల మాదిరిగానే పాప ఫలాలు ఎక్కడికిపోవు. కర్త - అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా, కనుక్కోకుండా, సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనస్సుకి నీవు కనిపించావు నేను నిర్ణయిస్తే నీవు కాదనవని తెలుసు. కాని ఇది ఒకటి రెండు రోజులు కాదు ధృఢదీక్ష వుండాలి. అంకిత భావం వుండాలి. అన్యచింతలు దగ్గరికి రానివ్వని నిగ్రహం వుండాలి. అదీగాక నీవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయస్సులో వున్నావు విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు నీ మనస్సు ఏమంటుందో తొందరలేదు ఆలోచించుకొని చెప్పు అన్నాడు.


అప్పుడు దీపకుడు గురుదేవా ! మీరింతగా చెప్పాలా నేను మీ సేవకే అంకితమైనాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం, నా దీక్ష, మనస్సులో కూడా నన్ను శంకించకండి. కాశిలో వుండి మీ సేవ చేసుకొనే భాగ్యం ప్రసాదించండి అన్నాడు.


Friday, 6 January 2023

శ్రీదత్త పురాణము (11)



ఈ దేహము ఒక నౌకతో సమానం. సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది. దీన్ని సరియైన దారిలో పెట్టి గట్టుకి చేర్పించే వాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రధమ కర్తవ్యం, బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి. తపోనిష్టకావాలి. అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహం వుండాలి. వేదవేదాంగ పరిజ్ఞానం వుండాలి. వీటి అన్నింటికి మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే.


మానవరూపంలో అవతరించిన నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు. శ్రీరాముడు వశిష్ట విశ్వామిత్రులను గురువులుగా సేవించాడు. శ్రీకృష్ణుడు, సుదాముడు మొదలగు మిత్రులతో కలసి సాందీప మహర్షి వద్ద గురుసేవలు చేసి వేద విద్యలు అభ్యసించాడు. గురుకులవాసం చేసాడు. సహాధ్యాయులతో కలసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన సమిధలు, పండ్లు మొదలగునవి సేకరించి తెచ్చాడు. ఆ సమయంలో కష్టాలు అనుభవించాడు. గురువుల అనుగ్రహాన్ని పొందారు. శ్రీకృష్ణుడ్ని జగద్గురువుగా పరబ్రహ్మముగా గుర్తించిన తరువాత సహధ్యాయులు, గురువులు తమతమ భాగ్యానికి ఆనందించారు. లీలానాటక సూత్రధారి అని పొగిడారు. గురుశుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంక ఏ ధర్మాచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు. కనుక నాయనా దీపకా ! గురుమహిమ వర్ణనాతీతం. గురుప్రసాదం సకలార్ధ సాధకం.


ఇంక శిష్యుని గురించి చెబుతాను విను. మంచి మాటలతో గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు. భోగమోక్ష విషయంగా మంచి రెండు రకాలు. (గురువులో లేశ మాత్రమైన ఏమైనా లోపాలు వుంటే, దోషాలు, బలహీనతలు ఉంటే వాటిని పదిమందికి టముకు వేసి ప్రచారము చెయ్యకుండా కప్పివుంచేవాడు ఛాత్రుడు. నీడలాగ గురువెంటవుండి విద్యనభ్యసిస్తూ సేవిస్తూ జీవించేవాడు అంతేవాసి. ఇలాగ శిష్యులలో బేధాలు వున్నాయి) శిష్యునికి ఏది హితమని భావిస్తాడో దాన్నే గురువు బోధిస్తాడు. మారుమాట్లాడకుండా శిష్యుడు శిరసావహించాలి. ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో ముక్తిని ప్రసాదించేది, హితమంటే. ఒక్కొక్కప్పుడు గురువు చెప్పింది ఇహలోకంలో కష్టంగావచ్చు. అయినా శిష్యుడు కాదు ఆనకూడదు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణం అయిన సాధన సంపత్తిని నేర్పిస్తాడు. నిత్యానిత్యవస్తు వివేకం కలిగిస్తాడు. భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని కర్తవ్యం. తత్వజ్ఞానం ఉపదేశం పొందడానికి అర్హుడు వాడే. అనంతకాలంలో తానూ గురు పదవిని అధిష్టిస్తాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురుఋణ విముక్తుడవుతాడు. పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే వుంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు ఇలా గురుశిష్య సందేహాలు తీర్చుకొని ప్రశాంత చిత్తంతో గురువుకు సాష్టాంగ నమస్కారము చేసాడు.


Thursday, 5 January 2023

శ్రీదత్త పురాణము (10)

 


దీప వృత్తాంతం


అంగీరసుడు అనే బ్రహర్షి వుండేవాడు. ఆయన గోదావరీ తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకొనేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ మునులతో శిష్యులతో కళకళలాడుతూ వుండేది. ఎక్కడెక్కడ నుండో మునులు, ఋషులు వచ్చి అంగీరసుడ్ని అడిగి తమతమ సందేహాలు తీర్చుకుంటూ వుండేవారు. యోగరహస్యాలు తెలుసుకుంటూ వుండే వారు. ఎందరు వచ్చినా ఆ ఆశ్రమంలో కందమూల ఫలాలు కాని, పుష్పాలకు గాని లోటు ఉండేదికాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు, ఆయన పైలుని కుమారుడు. శిష్యబృందంతో వచ్చి ఆంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటూవున్నాడు. ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోను, గుణంలోనూ, వివయంలోనూ, విధేయతలలోనూ, నిష్టలోన చెప్పుకోదగిన వ్యక్తి, వేద వేదాంగాలు అభ్యసించాడు. అయినా గృహస్థాశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం వుండి గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. గురువుగారు సరేనని అంగీకరించాడు. దీపకుడు పరమానందభరితుడై గురుసేవలో కాలం గడుపుతున్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఇలా అన్నాడు. గురుదేవా ! నాదొక చిన్న సందేహం. అడగమంటే అడుగుతాను అన్నాడు. వేదధర్ముడు అడగమన్నాడు. అప్పుడు దీపకుడు గురుదేవుని పాదాలు నొక్కుతూ గురుశిష్య పదాలకు సమగ్రంగా అర్ధం వివరించండి అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్పుతున్నాడు.


నాయనా లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే ! ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధించేవాడు గురువే !


జీవితంలో మనిషికి చాలా మంది గురువులు వుంటారు. వారిలో ఉత్తములు ఉంటారు. మొట్టమొదట కన్నతల్లి గురువు. ఆ తరువాత, తండ్రి మరొక గురువు, ఇంటికి పెద్దవాడు గురువే. మేనమామ, పిల్లనిచ్చిన అత్తమామలు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు వీరంతా మన్చి చెప్తారు కనుక గురువులే ! ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్నతండ్రి గురువే ! వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుత్వం రెట్టింపు అవుతుంది. వేరొకరెవరైనా వేదాలు శాస్త్రాలు నేర్పితే అతడు ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యలు నేర్పిన వారెవరైనా గురువులుగానే పరిగణింపబడతారు. సంసార సాగరాన్ని తరించడానికి జనన మరణాల చక్రం నుండి బయటపడటానికి ఏకైక మార్గం అయిన బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించేవాడు పరమగురువు. అతడే పరతత్వం ! అతడే త్రిమూర్తి స్వరూపం ! అతడే సకల దేవతా స్వరూపం ! మానవ రూపంలో వున్నాడని అనుమానించవలసిన అవసరం లేదు. బ్రహ్మజ్ఞానంతో నిన్ను బ్రహ్మమును చేసే పరబ్రహ్మనుతడే. వీరు కాక రకరకాల దేవతా ఉపాసనలు, మంత్రాలు, వ్రతాలు, ఉపదేశించే గురువులు చాలామంది వుంటారు. దీక్షలు ఇచ్చే గురువులు వుంటారు. ఆచార్యులు వుంటారు. గురికుదుర్చుకొని శ్రద్ధతో గురుసేవ చెయ్యాలి. ఇహ పరాలలో శ్రేయస్సుని కలిగించేవాడు గురువు. సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ లేదు.


Wednesday, 4 January 2023

శ్రీదత్త పురాణము (9)



బ్రహ్మదేవా! గురువు అంత గొప్పవాడా? గురు శబ్దానికి అర్ధం ఏమిటి ? గురువంటే ఎవరు ? ఎలాంటివాడు.


గురువు ? ఎవరికి గురువు ? గురు స్వరూపం తెలియపరచి నన్ను కృతార్ధుణ్ని చేయమని కలిపురుషుడు అభ్యర్ధించాడు. కలిపురుషా ! నీ సందేహం తీర్చడం నా ధర్మం. గురు శబ్దంలో ఉకారం అచ్చు. అది ద్విరుక్తమయ్యింది. గకార రేఫలు రెండూ హల్లులు. వీటిలో గకారం సర్వసిద్ధి ప్రదం. రకారం సర్వ పాపనాశకం. ఉకారం అవ్యక్త అచింత్య విష్ణు తత్వానికి వాచకం. అందుకే రెండు హల్లులకు ప్రాణమయ్యింది.


అచ్చునే ప్రాణమంటారు. దాని వల్లనే హల్లులు ప్రాణులు అవుతున్నాయి. ఇంకా వీటిలో వర్ణాదిదేవతలు వున్నారు.


గకారానికి గణపతి, రకారానికి అగ్ని, ఉకారానికి విష్ణువు అధి దేవతలు. ఈ రకంగా గురు శబ్దమే మంత్రంతో సమానం. ఇది చతుర్విధ పురుషార్ధాలకు సాధనం. తల్లి, తండ్రి, పరాత్పరుడూ గురువే. శిష్యుడు మీద శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు. గురువుకే కోసం వస్తే శివుడు కూడా వాణ్ని ఏమీ చేయలేదు. గురువే పరతత్వం. అందుకే గురువును ఆశ్రయించాలి అంటున్నాయి వేదాలు, పురాణాలు. శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడైనా గురుభక్తినే కోరుకుంటారు ఉత్తమ వైష్ణవ భక్తులు. గురువు ప్రసన్నుడైతే నారాయణుడు ప్రసన్నం అయినట్లే. సకల పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించిన ఫలం దక్కుతుంది. సకల వ్రతాలు, తపస్సు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. శాస్త్ర పరిజ్ఞానం ధర్మాధర్మ వివేకం, భక్తి జ్ఞానవైరాగ్యాలు, సదాచారం సమస్తము గురుసేవ చేతనే లభిస్తుంది. నాయనా కలీ! ఒక్క మాటలో చెప్పాలంటే గురుమహిమ వర్ణనాతీతం. అంతట కలి, విధాతా! ఇక్కడ నాడొక ధర్మసందేహం ఉన్నది. మానవ మాత్రుడైన గురువుకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది. సకల దేవతా స్వరూపుడంటున్నావు, సర్వజ్ఞుడంటున్నావు ఇదెలా సాధ్యం అయింది? అని అడిగాడు. 


కలీ! మంచి సందేహం వచ్చింది. చెపుతున్నాను విను, గురువు లేకపోతే ఎవరికైనా శాస్త్ర పరిజ్ఞానం వుంటుందా? శాస్త్రాలు తెలియకపోతే ధర్మ స్వరూపం తెలుస్తుందా? ఇది తెలియనివాడు నీ బారి నుండి తప్పించుకోగలడా? కీలకం అంతా ఇక్కడే వుంది.


గురుమహిమను తెలియజెప్పే పురాణ గాధ ఉంది. చెబుతాను. ఆలకించు. నీ సందేహాలు అన్నీ తీరుతాయి అన్నాడు బ్రహ్మ.


Tuesday, 3 January 2023

శ్రీదత్త పురాణము (8)



కలి - బ్రహ్మ సంవాదం


పద్మ కల్పానికి ఆరంభంలో నారాయణుని నాభి నుండి కమలము ఉద్భవించి అందుండి బ్రహ్మ ఉద్భవించి పద్మాసనంలో కూర్చుని సకల చరాచర జగత్తును సృష్టించనారంభించినాడు. భూలోకంలో మానవులను సృష్టించాడు. వారికి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచి వాటిని అమలు చేయడానికి మనువులను సృష్టించాడు. కాలాన్ని యుగాలుగా ఏర్పరచాడు. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలను యుగాధిపతులుగా మనువులను ఏర్పరచాడు. ధర్మ రక్షణ భారాన్ని మనువులకు అప్పగించాడు. మొదటి ముగ్గురూ తమతమ విధి నిర్వహణకోసం బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి బయలుదేరారు. పిశాచ రూపుడు, కలహ శీలుడు అయిన కలి పురుషుడు మాత్రం దిగంబర రూపంలో గంతులువేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఒక చేత్తో మర్మాంగాన్ని, మరొక చేత్తో నాలుకను పట్టుకొని నిలబడ్డాడు.


విధాతా! సకల పాపాలకు ధర్మాలకు వినాశకుడిగా నన్ను రూపొందించావు. భూలోకంలో శత్రువులు నాకు చాలామంది వున్నారు. పుణ్యకార్యాలు ఆచరించే వారంతా శత్రువులే. శివనామం, హరినామం, గంగాస్నానం, దానం, సత్సంగం, పుణ్యక్షేత్ర సందర్శనం ఇవి ఆచరించే వారంతా నాకు శత్రువులే. వీటిని ఆచరించటం నాకు నచ్చటం లేదు. నాకు ఇలాంటి పాపకార్యాలు విధించావేమిటి ? అంటూ కలిపురుషుడు విలపించాడు.


అప్పుడు బ్రహ్మ నాయనా! కలిపురుషా! నీ విధులు నీవు నిర్వర్తించు. ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్న నీ శత్రువర్గాన్ని నీవు ఏమీ చేయలేవు. వ్యసనాలకు, అరిషడ్ వర్గాలకు, డాంభికులకు, ఆసత్య, అనాచారాలకు దాసులైన వారే నీ శిష్యులు. వారిని ఆక్రమించి శిక్షించడం నీ విధి. నీ బాధల నుండి తప్పించుకోవాలంటే జనులకు రెండు మార్గాలు వున్నాయి. ఒకటి పురాణ పఠనం, శ్రవణం. రెండు గురుసేవ. ఇవి చేసే వారిని నీవు హింసించలేవు. వారి దరిదాపులకు కూడా నీవు వెళ్ళలేవు. పురాణాలు వినిపించేవారు గురువులే! గురు సేవ చేసుకునే వారికి నీ బాధవుండదు. పూర్వ జన్మ సుకృతం వల్లనే ఉత్తమ గురువు లభ్యమవుతాడు. గురువు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు. శాస్త్రజ్ఞానం ఉంటేగానీ ధర్మాధర్మ వివేకం అబ్బదు. అది అబ్బకపోతే తత్వం తెలియదు. తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం కలుగదు. ఆత్మజ్ఞానం కలుగకపోతే ముక్తి లభించదు. కావున ముక్తి మూలం గురువే పురాకృత పుణ్యం లేని వారికి గురువు లభించడు. వారంతా నీకు చిక్కుతారు. ఇందులో మప్పు విచారపడవలసింది ఏమిలేదు. నీ ధర్మం నీవు ఆచరించు అని బ్రహ్మ కలిపురుషుడిని బుజ్జగించాడు.  


Monday, 2 January 2023

శ్రీదత్త పురాణము (7)



నాయనా, నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను. ఏమి కావాలో కోరుకో మృదుమధుర స్వరంతో పలికారు. ఆనందపారవశ్యంలో మునిగిన సూతుడు నోరు మెదపలేకపోయాడు. నాయనా నీ అభీష్టం నెరవేరుతుంది ఈ శౌనకాది మునులకు నా మహిమలు వినిపించు. నీకు అంతా కరతలామలకమవుతుంది. నీవు పరమ పదానికి చేరుకుంటావు అని వరముననుగ్రహించి దత్తదేవుడు అంతర్థానం చెందాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకుని ఆనంద భాష్పములతో నింపిన కన్నులు తుడుచుకొన్నాడు.


మునీంద్రులారా! దత్తదేవుడు అనుగ్రహించాడు. మీరడిగిన దత్త చరిత్రను వినిపిస్తాను. ఇది గురుశిష్య సంవాదంగా వుంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభీష్టప్రదం. దీన్ని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంపత్కరం. విద్యాప్రదాయకం, జ్ఞానప్రదం. సకలప్రదేశాలలో సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించినా దత్తుని ధ్యానించినవారికి విజయమే తప్ప అపజయమంటూ వుండదు. ఇది సకల బంధవిమోచకం. ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని గాని లేదా ఒక భాగాన్ని గాని పఠిస్తూ దత్తుని స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు.


దత్త నామాన్ని జపించినవారికి ఆ యోగీంద్రుని దయవల్ల ముక్తిని పొంది తీరుతారు. అలకించండి. సూత మహర్షీ! మరి గురుశిష్య సంవాదమన్నావు గదా అసలు గురువంటే ఎవరు ? శిష్యుడంటే ఎవరు ? వీరి లక్షణాలేమిటి ? వీరిలో శ్రేణులు ఏమైన వున్నాయా ? ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అడిగారు.


మునీంద్రులారా ! మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణ గాధ తెలుపుతాను దీనికి బ్రహ్మ - కలి సంవాదమని పేరు. ముందుగా అది వినిపిస్తాను, వినండి అని సూతుడు ప్రారంభించాడు.


Sunday, 1 January 2023

శ్రీదత్త పురాణము (6)



మునులంతా ఇలా అడిగే సరికి సూతుడు సంబరపడ్డాడు. వారితో ఇలా అన్నాడు. మునులారా! అందరికి వందనములు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్త మహిమలను వినాలనుకోవటం గొప్ప విశేషం. పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు. నన్ను కూడా కృతార్థుడిని చేస్తున్నారు. నా జన్మ కూడా చరితార్థమవుతుంది. మీరు బ్రహ్మనిష్టులు, తపోధనులు, మీసాంగత్యం లభించడం వల్ల నా జన్మ ధన్యమయ్యింది..


భగవదనుగ్రహం వల్ల గురుకటాక్షం వల్ల నా శక్తిమేరకు దత్తాత్రేయ చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకొని కన్నులు మూసుకొని ధ్యానసమాధిలోకి జారుకున్నాడు. వాణీ చతుర్ముఖులను, గౌరీశంకరులను, లక్ష్మీవాసుదేవులను స్మరించాడు. గజాననుడ్ని స్మరించాడు. అష్టదిక్పాలకుల్ని అఖిలదేవతలని, సమస్త ముని జనవందితులని తలుచుకుని నమస్కరించాడు. యోగమార్గంలో సకలేంద్రియాలను ఏకాగ్రపరచి హృదయపద్మంలో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు.


త్రిమూర్తి స్వరూపా | త్రివర్ణించితా ! వేదవేద్యా! విశ్వవంద్యా ! విశ్వరూపా! ఒకప్పుడు గరుత్మంతునిపై వుంటావు. ఒకప్పుడు పులితోలు ధరిస్తావు. ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు. మరొకప్పుడు శ్వేతవస్త్రం ధరిస్తావు. ఒకప్పుడు సర్ప యజ్ఞోపవీతం ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురం లక్ష్మీ వద్ద బిక్షతీసికొని సహ్యాద్రిపై సంచరిస్తావు.


మూడు యుగాలలోను అవతారాలను ధరించినవాడా ! శ్రీహరీ! నమోనమః


ఒకప్పుడు బాలుడుగా దర్శనమిస్తావు. ఒక్కొక్కసారి యువకుడిగా వృద్ధుడిగా దర్శనమిస్తావు. ఒక్కొక్కవేళ జటాధారిగా, ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడిగా వుంటావు. ఒక్కో ముహూర్తాన దివ్య మాలికా దివ్యాభరణ, దివ్యవస్త్రములను ధరించి దివ్యసుందర విగ్రహుడపై కనిపిస్తావు. ఒక్కోసమయంలో మదోన్మత్త చిత్తుడుగా మదిరతో మగువతో గోష్టి జరుపుతూ వుంటావు. ఒక్కోసారి దిగంబరుడవై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు. విభూతి పులుముకుంటూ కనిపిస్తావు, అనంత నామా! దత్తప్రభూ! నీకు నమోవాకములు. పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జునున్ని వేయిబాహువులుతో మహావీరుణ్ని చేసి, వేల సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి, సేవలు అందుకున్న ఘనత నీదే, నీకు ప్రణామములు. ప్రహ్లాదుడి భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వరా ! దిగంబర స్వరూపంతో వున్న నిన్ను సేవించిన యదుమహారాజుకీ, అలర్క మహారాజుకీ జ్ఞానోపదేశం జేసిన సద్గురూ! నీకు నమోవాకములు. యోగవిద్యా స్వరూపా! మహామాయా ! తేజస్వులలో తేజస్సు నీవు, బుద్ధిమంతులలో బుద్ధిని నీవు, బలవంతులలో బలంనీవు, విద్యావంతులలో విద్యవు నీవు, శాంతి, క్షాంతి, దయ, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే, భూత, భవిష్యత్, వర్తమానాలు నీవే, సర్వవ్యాకరణ స్వరూపుడవు నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది లేదు. నువ్వుకానిది లేదు. సర్వాత్మకా ! సర్వాంతర్యామా నీకివే నా నమస్సులు, వామనుడవై బలిని మూడడుగుల నేల దానమడిగావు. త్రివిక్రముడవై విజృంభించావు. ఆకాశంలోని సూర్యచంద్ర గోళాలు గొడుగులై, శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటిసూత్రమై అందెల మువ్వలై, నీ పాదాలకింద జారిపోయాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాద పద్మాలను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు. నీకాలిగోరు తగిలి బ్రహ్మాండం బ్రద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది. అది భూమిపై అవతరించి గంగానదియై తనలో మునిగిన సకల జీవులకూ జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తోంది. విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలు అందుకుంటోంది. సచ్చిదానంద స్వరూపా నీ అవతార లీలలు అచింత్యాలు, అప్రమేయాలు, ఆగమ్యగోచరములు. బ్రహ్మర్షులకే అంతుబట్టవు, దత్తా శరణు శరణు, ఇలా ధ్యానించిన సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చిందుతున్న ముఖ పద్మం. శిరస్సుపై పింగళ జటాజూటం, సూర్యచంద్రులు నేత్రాలుగా, కటియందు పీతాంబరం. ఆరుచేతులతో కరుణార్ద్ర హృదయుడు తనను స్మరించే వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే స్వామి ప్రత్యక్షమయ్యాడు.