Showing posts with label దత్తాత్రేయ స్వామి. Show all posts
Showing posts with label దత్తాత్రేయ స్వామి. Show all posts

Sunday, 15 January 2023

శ్రీదత్త పురాణము (20)



అత్రి మునీంద్రా! నీ సంకల్పం గొప్పది. తపస్సు గొప్పది. నిరాకారము, నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించినా సాకారులమూ సగుణలమూ అయి మేము ముగ్గురము ధ్యానించిన నువ్వు త్రిగుణాత్మకుడవు కనుక ఇలా దర్శనమిచ్చాము. నీ కోరిక నెరవేరుతుంది. మా అంశలతో నీకు ముగ్గురు కుమారులు జన్మిస్తారు. దివ్యతేజస్వులై జగతిలో ప్రకాశిస్తారు. నీ యశస్సులు దశదిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి. తీవ్ర తపస్సును విరమించు. శుభం కల్గుతుంది అని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. 


అటుపైన బ్రహ్మాంశ వల్ల చంద్రుడు, విష్ణాంశ వల్ల దత్తుడు, శివాంశ వల్ల దూర్వాసుడు, అనసూయాత్రి దంపతులకు జన్మించారు. ఇది మైత్రేయుడు విదురునకు చెప్పిన దత్త జన్మవృత్తాంతం. నాయనా దీపకా దత్త జన్మ వృత్తాంతం విన్నావు గదా! ఇక దత్తదేవుని యొక్క యోగ విద్య తెలియచెప్తాను శ్రద్ధగా విను అన్నాడు వేదధర్ముడు.


బ్రహ్మర్షి వారదుడు ముల్లోకాలలో తిరుగుతూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు. ధర్మరాజు ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి రాజమందిరంలోనికి తీసుకువచ్చాడు. తన సోదరులు నలుగురిని సమావేశపరచాడు. ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. అందరూ నారదునకు నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలయ్యాయి. ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైన వృత్తాంతం చెప్పమని ధర్మప్రబోధం చేయమని అభ్యర్థించాడు. అన్ని ధర్మప్రభోదాలు తెలిసిన నీకు భగవానుడైన శ్రీకృష్ణుడే అండగా ఉండగా చెప్పవలసినవి ఏమున్నాయి. అయినా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతం చెప్తాను. పూర్వం ప్రహ్లాదుడు అడిగితే ఆజగరుడు చెప్పిన విశేషాలు ఉన్నాయి. అవి చెబుతాను వినండి అని చెప్పటం మొదలు పెట్టాడు.


ప్రహ్లాదుడు - అజగరుడు సంవాదం


లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధుసజ్జన బృందంతో బయలుదేరాడు. భూగోళం అంతా సంచరిస్తూ వింతలూ విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వతప్రాంతం చేరుకున్నారు. అక్కడ కావేరీ నదిలో స్నానసంధ్యలు గావించి నదీతీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంతదూరాన నేల మీద పడుకొని ఉన్న ఒక మహర్షిని చూచారు. ఆ మహర్షి శరీరం దుమ్ముకొట్టుకునిపోయి వుంది. కాని శరీరం నుంచి దివ్యతపః కిరణములు పెల్లుబుకుతున్నాయి. ఎవరీ మహర్షి? ఎందుకు ఇలా నేల మీద పడివున్నాడు. ఉలుకు పలుకూ లేదు. కదలిక మెదలికాలేవు. సమీపంలో ఆశ్రమంకానీ కుటీరంగాని లేదు. ఇది ఏమైనావ్రతమా? నియమమా? లేదా ఇంకేదైనా వుందా? తెలుసుకుందామని ఆ మహర్షి పాదముల చెంత కూర్చున్నాడు. పాదములకు శిరస్సు ఆన్చి నమస్కరించాడు. మృదువుగా ఆ పాదములను తన ఒడిలోకి తీసుకుని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావా! అని భయం భయంగా పలకరించాడు. ఆయన మెల్ల మెల్లగా కన్నులు తెరిచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లు చూచాడు. ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకుని ఇలా అడిగాడు.


Monday, 9 January 2023

శ్రీదత్త పురాణము (14)



ఒకరోజు తెల్లవారుఝామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యధావిధిగా గురువువారి శరీరాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన గంగాజలాన్ని కడవకెత్తుకుని గురువుగారు లేచారేమోననుకొని వడివడిగా కుటీరంలోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీవిశ్వనాధుడు దర్శనమిచ్చాడు. నువ్వుచేస్తున్న గురుసేవకు ధర్మనిష్టకూ సంతసించాను ఏదైనా వరం కోరుకో అన్నాడు విశ్వనాధుడు. దీపకుడు సంభ్రమాశ్చర్యములతో సాష్టాంగపడి విశ్వనాధుని సేవించి స్తుతించాడు. బ్రహ్మర్షులకు కూడా దక్కని నీ దర్శన భాగ్యం దక్కింది, నాకు వరంకూడా ఇస్తానంటున్నావు. ఆనందపారవశ్యంలో వున్నాను. ఏమని అడగాలో కూడా తెలియడం లేదు. ఓ నిమిషం ఆగు కుటీరంలోకి వెళ్ళి గురువుగార్ని అడిగివస్తాను, అంటూ కుటీరంలోకి ప్రవేశించాడు. గురుదేవా ! శివుడు ప్రత్యక్షమైనాడు. వరం కూడా ఇస్తానంటున్నాడు. గురుశుశ్రూషకు సంతోషించాడట. మీరు అనుమతి ఇస్తే మీ కుష్టత్వము, అంధత్వము అన్నీ పోయేటట్లుగా వరం అడుగుతాను అడగమంటారా అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో నాయనా దీపకా శివుడంతటివాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగడానికి నీకు ఇంకేమీ దొరకలేదా ఐహిక విషయములా అడగవలసింది. పైగా నారోగం పాప ఫలం అనీ, అనుభవించడం తప్ప వేరొక గత్యంతరం లేదని ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు. 


వేదధర్ముడి మాటల్లో విసుగుని గుర్తించాడు దీపకుడు. కుటీరం వెలుపలికివచ్చి శివునికి నమస్కరించి అష్టమూర్తి నీ వాత్సల్యానికి ధన్యవాదములు. నిన్నిప్పుడు అడగదగింది నాకు ఏదీ కనిపించడంలేదు క్షమించు అన్నాడు. అదేమిటి నాయనా అడగదగిందే కన్పించడం లేదా మీ గురువు ఆరోగ్యం సరిచేయమని కోరవచ్చు కదా! అంటూ శివుడు ప్రోత్సహించాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటివరం అడిగేందుకు గురువు అనుమతిలేదు. సెలవు ఇప్పించు గురువు గార్కి సేవజేసుకోవాలి అని రివ్వున కుటీరంలోకి వెళ్ళి గురుసేవలో నిమగ్నమయ్యాడు. శివుడు అంతర్దానం చెంది తన ఆస్థానమంటపంలో ఆ సాయంకాలం కొలువు తీరి వుండగా సకల దేవతల సమక్షంలో అందరూ వింటూవుండగా శ్రీమన్నారాయణునితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడంటే దీపకుడే భవధ్వాంతనాశకుడు. నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు.


శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాడే దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపకా నీ గురుసేవా పరాయణత్వం నన్ను ఆనందపరవశుల్ని చేసింది. నీ యిష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు.


దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేసాడు. అనేకానేక స్తోత్రములతో స్తుతించాడు. నారాయణా! వాసుదేవా! గురుసేవ అనేది హరిహరులను ఇద్దరినీ ఇంతగా ఆనందపరుస్తుందని తెలియదు. నా ధర్మంగానే నేను సేవజేస్తున్నాను. దిక్పాలకులకైనా అనుగ్రహించని దివ్య దర్శనం నాకు ప్రాప్తింపజేసారు. ఇది మీ కరుణకి సంకేతం. నాకు గురువే దైవం, జపము, తపము, తీర్థము, క్షేత్రము సర్వస్వమూ నాకు గురువే. వేదశాస్త్రాలు బోధించి, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, పరతత్వాన్ని తెలియపరచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్షదైవం. అనన్య చిత్తంతో గురుసేవ చేస్తున్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలముంటే అది మోక్షమే తప్ప కోరదగింది ఏమీలేదు. అయినా కరుణామూర్తివై వచ్చి ఏదైనా కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యేట్టు అనుగ్రహం ప్రసాదించు. నాకు తెలియని గురుమహిను ఏమైనా ఉంటే చెప్పు. ఇదే నిన్ను కోరే వరం.


Sunday, 8 January 2023

శ్రీదత్త పురాణము (13)



నాయనా దీపకా నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు కనుకనే నేను నిన్ను అడిగాను. కాని కాశిలో పాప ఫలాన్ని అనుసరించి నేను కుష్టు రోగపీడితున్ని కాబోతున్నాను. కుంటితనము, గ్రుడ్డితనము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఇరువది ఒక్క సంవత్సరముల పాటు అనుభవించవలసినవి. ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరములు సేవ చెయ్యాలి అన్నాడు. అప్పుడు దీపకుడు గురూత్తమా ! తప్పకుండా చేస్తాను. కాని నాదొక సందేహం ఆ పాపాన్ని మీరే అనుభవించాలా?


నాకు సంక్రమింప జేయండి అది నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు వేదధర్ముడు నాయనా ఎవరి పాపాలు వారు అనుభవించవలసినదే. పాప ఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యునకో, పుత్రునికో, లేదా ఇంకొకరికో పులముదామని అనుకొంటే అంటుకోవు కనుక నా పాప ఫలాలు నేను అనుభవిస్తాను.


అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు. కుష్టురోగికి సేవలు చేయడమంటే అది అనుభవించడంకన్నా కష్టం. దానికి నవ్వు అంగీకరించావు. పద వెంటనే కాశీకి చేరుకుందాం అని త్వరత్వరగా ఇద్దరూ మనోవేగంతో కాశి చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసారు. డుండి గణపతిని కాలభైరవుణ్ని అర్చించారు. అన్నపూర్ణ విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శించారు. ఉత్తర దిక్కుగా ఒక కంబలాశ్వతరు సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముప్పొద్దులా గంగాస్నానం, విశ్వనాధుని దర్శనం, చేసుకున్న తరువాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి. క్షణంలో కాళ్ళు చేతులు తిమ్మిరులెక్కాయి. పొక్కులు చితికి చీము, నెత్తురు కారసాగాయి. చూస్తూవుండగానే శరీరం అంతా పొడలుతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్ళు వంకరలు తిరిగాయి. కుష్టు తనము, కుంటి తనము, గ్రుడ్డి తనము ఒక్కసారిగా వేదధర్ముణ్ని ముంచెత్తాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. నిలబడలేక పోతున్నాడు, కూర్చో లేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అసలు కదలలేని స్థితి వచ్చింది. అన్నీ మంచంలోనే. భరించలేని దుర్వాసన, దీనికి తోడు కాశీలోని ఈగలన్నీ అతన్ని చుట్టు ముట్టాయి. రోగ బాధతో వికృతంగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా త్రిప్పి కనిపించని కన్నులతో దీపకా, దీపకా అని అరుస్తున్నాడు. దీపకుడు మాత్రం నిమిషం నీమారకుండా సకలసేవలూ చేస్తున్నాడు. పసి బిడ్డను కన్నతల్లిలా చూస్తున్నాడు. ఎంత దుర్గంధం అయినా ముఖం త్రిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు వున్న ప్రదేశాన్ని ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోలుతూ సేవచేస్తున్నాడు. గురువుగార్కి కొద్దిగా కునుకుపట్టిన సమయంలో గబాగబా నాలుగిళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తున్నాడు. కుష్టురోగికి కోపమెక్కువ అన్నారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ని తిట్టిపోస్తున్నాడు. ఈపాటి చెయ్యిలేనివాడివి ఎందుకొచ్చావని దెప్పిపొడుస్తున్నాడు. ఒకరకంగా కాదు, నానా దుర్భాషలు ఆడుతున్నాడు. మరుక్షణంలోనే మళ్ళీ సౌమ్యుడౌతున్నాడు. నాయనా దీపకా, తండ్రి దీపకా అని బుజ్జగిస్తున్నాడు. నిన్ను బాధపెడుతున్నానురా అని విలపిస్తున్నాడు. మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు. దీపకుడు మాత్రం అన్నింటికి ఓర్చుకుని చెరగని చిరునవ్వుతో, నిగ్రహంతో, సేవజేస్తున్నాడు. గురువులోనే విశ్వనాధున్ని, కాశీలోని దేవతలందర్ని గురువులోనే చూస్తూ సేవిస్తున్నాడు. తగినంత దొరక్క దొరికింది గురువుకీ సరిపోక పస్తులుంటూ సేవించుకొంటున్నాడు. ఏ నిమిషాన గురువు గారికి ఏ అవసరముంటుందోనని మంచం ప్రక్కనే వుండి రేయింబవళ్ళు మెలకువగా కూర్చుంటున్నాడు. కాశికి వచ్చింది మొదలు కంటినిండా నిద్రపోయిన రోజులేదు. కడుపునిండా తిన్న రోజులేదు. అయినా గురుసేవ చేస్తున్నావనే తృప్తి అతన్ని నిలబెడుతోంది. లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తోంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి.


Saturday, 7 January 2023

శ్రీదత్త పురాణము (12)



శౌనకాది మునులారా! బ్రహ్మదేవుడు కలికి చెప్పిన గురుశిష్యుల సంభాషణ ఇది. గురు శిష్యుల లక్షణాలు గుణగణాలు తెలిసాయి కదా! గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు అని గురుభక్తి గురుసేవయే భుక్తిముక్తిదాయకం అని పురాణములు బోధిస్తున్నాయి. అటువంటి గురు దత్తాత్రేయుడి చరిత్రను వినాలని అనుకోవటం మీ పూర్వపుణ్య విశేషం. చెబుతాను వినండి అని సూత మహర్షి అన్నాడు.


అప్పుడు మునులంతా ఇలా అన్నారు. మహర్షీ గురు శిష్యుల లక్షణాలు అద్భుతంగా చెప్పావు, ధన్యవాదాలు. దత్త చరిత్ర వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతుంది. కానీ దీపక వేదధర్ముల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. దీపకుడు తన దీక్షను నెరవేర్చుకొన్నాడా ? జీవితాంతం బ్రహ్మచారిగానే వుండి గురుసేవలో తరించాడా? కష్టాలు ఎదురైనాయా ? చివరికి అతనికి దక్కిన గురుఫలం ఎలాంటిది ? గురువు ఎలా అనుగ్రహించాడు ? ఇవన్నీ మాకున్న సందేహాలు అని అడిగారు.


అప్పుడు సూతమహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా చెప్పాడు. గురుశుశ్రూష తప్ప వేరొక ధ్యాసలేని దీపకుడ్ని ఒకరోజు వేద ధర్ముడు దగ్గరకి పిలచి నాయనా నీ సేవలకు ఆనందంగా వుంది. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే. నాకొక అవసరం వుంది ముందు విను తరువాత సమాధానం చెబుదువు గాని తొందరలేదు అని నాయనా, దీపకా, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి. అవి పూర్వజన్మ సంచితములు. తపస్సులతో కొంతరవకు నశింపజేసుకొన్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి నశింపజేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశికి వెడదామని అనుకొంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహా మహా పాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తములతో నశింపజేసుకోవచ్చు. పుణ్య ఫలాల మాదిరిగానే పాప ఫలాలు ఎక్కడికిపోవు. కర్త - అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా, కనుక్కోకుండా, సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనస్సుకి నీవు కనిపించావు నేను నిర్ణయిస్తే నీవు కాదనవని తెలుసు. కాని ఇది ఒకటి రెండు రోజులు కాదు ధృఢదీక్ష వుండాలి. అంకిత భావం వుండాలి. అన్యచింతలు దగ్గరికి రానివ్వని నిగ్రహం వుండాలి. అదీగాక నీవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయస్సులో వున్నావు విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు నీ మనస్సు ఏమంటుందో తొందరలేదు ఆలోచించుకొని చెప్పు అన్నాడు.


అప్పుడు దీపకుడు గురుదేవా ! మీరింతగా చెప్పాలా నేను మీ సేవకే అంకితమైనాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం, నా దీక్ష, మనస్సులో కూడా నన్ను శంకించకండి. కాశిలో వుండి మీ సేవ చేసుకొనే భాగ్యం ప్రసాదించండి అన్నాడు.


Friday, 6 January 2023

శ్రీదత్త పురాణము (11)



ఈ దేహము ఒక నౌకతో సమానం. సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది. దీన్ని సరియైన దారిలో పెట్టి గట్టుకి చేర్పించే వాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రధమ కర్తవ్యం, బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి. తపోనిష్టకావాలి. అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహం వుండాలి. వేదవేదాంగ పరిజ్ఞానం వుండాలి. వీటి అన్నింటికి మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే.


మానవరూపంలో అవతరించిన నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు. శ్రీరాముడు వశిష్ట విశ్వామిత్రులను గురువులుగా సేవించాడు. శ్రీకృష్ణుడు, సుదాముడు మొదలగు మిత్రులతో కలసి సాందీప మహర్షి వద్ద గురుసేవలు చేసి వేద విద్యలు అభ్యసించాడు. గురుకులవాసం చేసాడు. సహాధ్యాయులతో కలసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన సమిధలు, పండ్లు మొదలగునవి సేకరించి తెచ్చాడు. ఆ సమయంలో కష్టాలు అనుభవించాడు. గురువుల అనుగ్రహాన్ని పొందారు. శ్రీకృష్ణుడ్ని జగద్గురువుగా పరబ్రహ్మముగా గుర్తించిన తరువాత సహధ్యాయులు, గురువులు తమతమ భాగ్యానికి ఆనందించారు. లీలానాటక సూత్రధారి అని పొగిడారు. గురుశుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంక ఏ ధర్మాచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు. కనుక నాయనా దీపకా ! గురుమహిమ వర్ణనాతీతం. గురుప్రసాదం సకలార్ధ సాధకం.


ఇంక శిష్యుని గురించి చెబుతాను విను. మంచి మాటలతో గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు. భోగమోక్ష విషయంగా మంచి రెండు రకాలు. (గురువులో లేశ మాత్రమైన ఏమైనా లోపాలు వుంటే, దోషాలు, బలహీనతలు ఉంటే వాటిని పదిమందికి టముకు వేసి ప్రచారము చెయ్యకుండా కప్పివుంచేవాడు ఛాత్రుడు. నీడలాగ గురువెంటవుండి విద్యనభ్యసిస్తూ సేవిస్తూ జీవించేవాడు అంతేవాసి. ఇలాగ శిష్యులలో బేధాలు వున్నాయి) శిష్యునికి ఏది హితమని భావిస్తాడో దాన్నే గురువు బోధిస్తాడు. మారుమాట్లాడకుండా శిష్యుడు శిరసావహించాలి. ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో ముక్తిని ప్రసాదించేది, హితమంటే. ఒక్కొక్కప్పుడు గురువు చెప్పింది ఇహలోకంలో కష్టంగావచ్చు. అయినా శిష్యుడు కాదు ఆనకూడదు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణం అయిన సాధన సంపత్తిని నేర్పిస్తాడు. నిత్యానిత్యవస్తు వివేకం కలిగిస్తాడు. భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని కర్తవ్యం. తత్వజ్ఞానం ఉపదేశం పొందడానికి అర్హుడు వాడే. అనంతకాలంలో తానూ గురు పదవిని అధిష్టిస్తాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురుఋణ విముక్తుడవుతాడు. పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే వుంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు ఇలా గురుశిష్య సందేహాలు తీర్చుకొని ప్రశాంత చిత్తంతో గురువుకు సాష్టాంగ నమస్కారము చేసాడు.


Monday, 23 December 2019

దత్తసందేశం



ఇప్పుడు సమాజంలో లోపిస్తున్నది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్లన సమాజంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. ఇంద్రియ నిగ్రహం గురుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మనకు సోదాహరణంగా చెప్పారు.

జింకకు సంగీతం అంటే ఇష్టం. అందువల్ల జింకను వేటాడాలనుకునే వేటగాడు చక్కగా వేణువు ఊదుతాడు. ఆ సంగీతాన్ని ఇష్టపడిన జింక, వలలో చిక్కి వెటగాడి చేతిలో మృతి చెందుతుంది. అలాగే మనిషికి తన శ్రోత్రేయింద్రం అనగా చెవి (వినే విషయాలు) మీద నిగ్రహం లేనప్పుడు, అతడు కూడా పతనం అవుతాడు. అది నేను జింక నుంచి నేర్చుకున్నాను. అందుకే నాకున్న 24 మంది గురువులలో జింక ఒకటి అన్నారు శ్రీ గురుదత్తుడు. 

మనం కూడా సమాజంలో రకరకాల మాటలు వినడానికి ఇష్టపడతాము. అందులో కొన్ని అవసరమైనవి, కొన్ని అనవసరమైనవి. మంచి విషయాలను వినడానికి పెద్దగా ఇష్టపడము గానీ, ఇతరుల వ్యక్తిగత విషయాల, ఊహాగానలు, చెడు మాటలు, ఆశ్లీల సంభాషణలు వినాలనే ఆసక్తి ఉంటుంది. చెవి మీద మనకు నిగ్రహం ఉండదు. అలా నిగ్రహం లేకపోతే, వ్యక్తి కూడా అన్ని రకాలుగా పతనం అవుతాడు.  

దత్తుడు ఇలా చెబుతున్నారు - పతంగం (మిణుగురుపురుగు) నా గురువు. అది అగ్ని యొక్క అందానికి ఆకర్షితులై, అందులో దూకి బూడిద అవుతుంది. అలాగే మనిషి మూర్ఖుడై, తన కళ్ళు (చూపు) మీద నిగ్రహం లేని కారణంగా కళ్ళకు కనిపించే తాత్కాలిక సుఖాలే నిత్యమని భావించి, వాటిలో చిక్కుకుని పతనం అవుతాడు. సంసారసాగరంలో కొట్టుకుపోతాడు. అందువల్ల ప్రతి వ్యక్తీ తన దృష్టి మీద నిగ్రహం కలిగి ఉండాలని నేర్పిన పతంగం నాకు గురువు.


మనం కూడా అంతే. పతంగం వలె అనవసరమైన వాటిని చూడలని ఆశ పడతాము. ధర్మం కాదని తెలిసినా, చూపులను నిగ్రహించుకోము. అందరిలో దైవాన్ని చూడాలని తెలిసినా, స్త్రీలో అమ్మతతానికి బదులు ఆడతనాన్ని చూస్తారు. అంతేనా, ఏవి చూడకూడదో, ఏవి మనకు అనవసరమో, అవే చూస్తాము. మనల్ని సన్మార్గంలో పెట్టేవి మన కళ్ళకు ఇంపుగా కనిపించవు, అనిపించవు. అదే దత్తుడు చెబుతున్నారు.

చేపలను పట్టాలనుకునే జాలరి ఒక కర్రకు తాడు కట్టి, దాని క్రింద U ఆకారంలో ఉండే ఇనుప కొక్కాని కట్టి, అది కనిపించకుండా, దానికి వానపామును చుట్టి నీటిలోనికి వదులుతాడు. అక్కడుండే చేపలు తమ ఆహరమైన వానపామును చూసి, తన జిహ్వచాపల్యాన్ని నిరోధించలేక, దానిని తినే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆ ఇనుప కొక్కెం దాని నోట్లోకి చొచ్చుకునిపోయి, అది ఎటూ కదల్లేక కొట్టుకుంటుంది. అది గమనించిన జాలరి, దాన్ని నీటి నుంచి పైకి లాగి, తన పడవలో వేసుకుంటాడు. జిహ్వచాపల్యం కారణంగా, తన నోటి మీద నిగ్రహం లేని కారణంగా చేప తన ప్రాణాన్ని కోల్పోయింది. అందువలన రసేయంద్రియము (అనగా నాలుక) మీద నిగ్రహం కలిగి ఉండాలని నేను చేప ద్వారా నేర్చుకున్నాను. అందుకే చేప నా గురువు అన్నారు శ్రీ దత్తాత్రేయులవారు.


మనకు కూడా మన నోటి మీద అదుపు లేదు. కేవలం ఆహారం విషయంలోనే కాదు, మాట్లాడే విషయంలో కూడా. నోటి ఎంత వస్తే అంత మాట్లాడుతాము. ఎలా పడితే అలా మాట్లాడుతాము. ఏది పడితే అది, ఎలా పడితే అలా తింటాము. కొందరు మద్యం సేవిస్తారు, పైగా మద్యపానం పంచమహాపాతకాల్లో ఒకటి. అదేమిటంటే రుచి కోసం అంటారు. దత్తుడు అదే చెబుతున్నారు. మనకు మన జిహ్వ మీద అదుపు ఉండాలి. తినకూడనివి తినరాదు, మాట్లాడకూడనివి మాట్లాడరాదు, త్రాగకూడనివి త్రాగరాదు. లేదంటే చేప వలె మానవుడు కూడా పతనం అవుతాడు.

శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇలా చెబుతున్నారు - మగ ఏనుగుకు ఆడ ఏనుగును స్పృశించడం, దాని శరీరానికి తన శరీరాన్ని తాకించి, రాపిడి చేయడం ఎంతో ఇష్టం. అది మగ ఏనుగుకు ఉన్న బలహీనత. అది మావటివానికి తెలుసు. అందుకే మావటి వాడు ఏనుగులు సంచరించే ప్రదేశంలో ఒక గొయ్యి త్రవ్వి, దాని మీద వల వేసిం గొయ్యి కనిపించకుండా, గడ్డి, ఆకులతో కప్పేస్తాడు. దాని మీద గడ్డితో ఆడ ఏనుగు బొమ్మను తయారు చేసి నిలబెడతాడు. అటుగా వచ్చిన మగ ఏనుగు, ఆడ ఏనుగును చూసి, కామోద్రేకానికి గురై, దాన్ని సమీపించగానే ఆ గొయ్యిలో పడిపోతుంది. మావాటి వానికి చిక్కుతుంది. ఏనుగంటే భారీ శరీరము, దానికి కోపం, మదము కూడా అలాగే ఉంటాయి. అందుకే మావాటి వాడు, దాన్ని బంధించి, సరిగ్గా ఆహారం అందించకుండా, అప్పుడప్పుడు అందిస్తాడు. అది మాట వినని పక్షంలో, దాన్ని అనేకమార్లు శూలంవంటి పదునైన వస్తువుతో పొడుస్తాడు. పాపం ఆ ఏనుగు ఆ బాధను భరించలేదు. వాడు అదే పని పదే పదే చేస్తాడు. చివరకు ఏనుగు వాడు చెప్పినట్లు వినడం మొదలుపెడుతుంది. మావటి వాడు ఏనుగు ముందు చిన్న కర్ర పెట్టినా, భయానికి మౌనంగా నిల్చుంటుంది. అతడు చెప్పినట్లు ఆడుతుంది. ఏనుగు అనేది అత్యంత భారీజీవి, చాలా శక్తివంతమైనది కూడా. దానిని చూసి పెద్దపులులు, సింహాలు సైతం భయపడతాయి. కానీ కేవలం తన స్పర్శేంద్రియం మీద నిగ్రహం లేని కారణంగా బలహీనుడైన మావటి వానికి ఊడిగం చేసే స్థాయికి వెళ్ళింది. బక్కపలచని మావటికి భయపడుతుంది. మానవుడు కూడా తన స్పర్శేంద్రియం (చర్మం) మీద నిగ్రహం లేనప్పుడు, ఏనుగు వలె పతనం అవుతాడు. ఇది నేను ఏనుగు నుంచి నేర్చుకున్నాను. అందుకే ఏనుగు నాకు గురువు.


ఈ విషయం పెద్దగా విడమర్చి చెప్పనక్కర్లేదు. మానవులు కామోద్రేకులు ఇతరుల స్పర్శ కోరి, ధర్మబద్ధం కాని సంబంధాల్లోకి వెళతారు, లేదా అటువంటివి కలిగి ఉండాలని భావిస్తారు. అంత పెద్ద జీవి అయిన ఏనుగు మావటి వానికి ఊడిగం చేసిన విధంగా, తమ జీవితంలో పతనం అవుతారు. కనుక ఏనుగు మనకు నిగ్రహం కలిగి ఉండటం నేర్పిస్తోందని దత్తడు సెలవిస్తున్నారు.

దత్తుడు మనకేమీ చెబుతున్నాడు? నోటి మీద అదుపు లేకపోవడం వలన చేప, స్పర్శ మీద నిగ్రహం లేక ఏనుగు, వినికిడి మీద నిగ్రహం లేక జింక, కంటి మీద నిగ్రహం లేక మిడత పతనం అయ్యాయి. వాటికి కేవలం ఒక్క ఇంద్రియం మీద నిగ్రహం లేకపోవడం వల్లనే అవి నాశనమైతే, మనిషికి తన పంచేంద్రియాల మీద నిగ్రహం లేదు. అతడి పతనం ఎలా ఉంటుందో ఆలోచించండి. మనకు మన కళ్ళ మీద నిగ్రహం లేదు, ఏవి చూడకూడదో అవే చూస్తున్నాము. మన చెవుల మీద మనకు నిగ్రహం లేదు, ఏది వినకూడదో అదే వింటున్నాము. మనకు నోటి మీద నిగ్రహం అసలే లేదు. అనవసరమైనవంతా మాట్లాడుతున్నాము. అలాగే మనం పీల్చే వాసనలు మనలో ఉద్రేకాన్ని కలిగించేవిగా, తమో గుణాన్ని పెంచేవిగనే ఉంటున్నాయి. స్పర్శ విషయంలో కూడా అంతే.


మనం స్వీకరించిన ఆహారంలో 6 వ వంతు మనస్సుగా మారుతుందని ఛాందగ్యోపనిషత్తు చెబుతోంది. ఇంతకీ ఆహరం అంటే ఏంటి? కేవలం నోటి ద్వారా మాత్రమే తీసుకునేది కాదు, కళ్ళ ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, ముక్కు ద్వారా వాసన పీల్చేది, స్పృశించేది కూడా మనస్సుగా మారుతోంది. అవన్నీ ఆహారమే. మనకు ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు, నిషిద్ధమైన ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు, మంచి ఆలోచనలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి. మంచి పనులు చేయమంటే ఎలా చేస్తాము. మన శరీరమంతా అశుద్ధమైన, ధర్మబద్ధం కాని, అనైతికమైన ఆహారంతో ఏర్పడుతోంది, దానితోనే నిండుతోంది. అందుకే సమాజంలో మనుషులు పెడద్రోవ పడుతున్నారు.

పిల్లలకు మనం కుళ్ళిపోయిన ఆహారం పెడతామా? పోనీ మనం తింటామా? కుళ్ళిపోయిన, విషాహారం తింటే మన వ్యవస్థ కూడా చెడిపోయి, ఆనారోగ్యం వస్తుంది. వాంతులు, విరోచనాలు అవుతాయి. మరి మనం మన ఇంద్రియాలకు పెట్టే ఆహారం కూడా అలాంటిదే. ఇంద్రియాలు బయట ఉంటాయి, మనస్సు లోపల ఉంటుంది. ఇంద్రియాల ద్వారా మనస్సు ప్రపంచాన్ని చూస్తోంది. మనం బయట జరిగే కుళ్ళును, చెడును ఇంద్రియాల ద్వారా మనస్సుకు అందిస్తున్నాము. అందుకే మనస్సు చెడిపోయి, బయటకు అదే చెడును పంపిస్తోంది. ఆ కారణంగానే మానవుడు నేరాలు చేస్తున్నాడు.

మనిషి విన్నదానికంటే చూడటం ద్వారానే గ్రహిస్తాడు, విన్నది గుర్తుండకపోయినా, చూసినది మాత్రమే మనస్సులు చెరగని ముద్ర వేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. మరి మనం రోజూ ఏమి చేస్తున్నాం? మన మీడియా ఏమి చూపెడుతోంది. ఒక నేరం ఎలా జరిగింది అనేది మనకు అవసరమా? కానీ క్రైం వాచ్, హత్యలు-నేరాలు మొదలైన ఎన్నో కార్యక్రమాల పేరుతో మనకు టి.వి.చానెల్స్ లో కనిపించేవి నేరాలు, ఘోరాలే. అసలు నేరం ఎలా చేస్తే మనకెందుకు? వాడు తప్పించుకోవడానికి ఏమి చేసాడో మనకెందుకు? కానీ మీడియా చేసే పని ఏంటంటే, వాడు చేసిన నేరాన్ని మళ్ళీ పాత్రలతో చూపించి, వాడు ఏమి చేయడం వలన 'క్లూ' దొరికిందో కూడా చెబుతుంది. అంటే పట్టుబడకుండా నేరాలు ఎలా చేయాలో చెబుతుంది. తాను చూసే విషయాల్లో ఇదంతా అనవరమైన చెత్త. అదే మనస్సులోకి వెళుతోంది.

ఇక మీరు చూసే సినిమాలు/ ధారవాహికల సంగేతి సరేసరి. అందులో సగటున వారానికి ఒక అత్యాచార సంఘటన చూపిస్తారు. మీ మరియు మీ పిల్లల మనస్సులోకి అత్యాచారం అనేది ప్రతివారం పంపుతుంది సీరియల్. అదేగాక మద్యపానం, ధూమపానం, స్త్రీలను హింసించడం, ఏడిపించడం అనేవి ప్రతి సీరియల్లోనూ, సినిమా లోనూ కనిపిస్తాయి. మీరు పురాణాలు చూస్తే, అందులో కథానాయకుడు (హీరో) మరియు ప్రతినాయకుడు (విలన్) మధ్య తేడా స్పష్టంగా ఉంటుంది. రామాయణం తీసుకోండి. రాముడు స్త్రీలను కామంతో చూడడు, మద్యం సేవించడు, ధూమపానం చేయడు, ధర్మానికి కట్టుబడతాడు. రావణుడు దీనికి పూర్తిగా విరుద్ధం. కనిపించిన ప్రతి స్త్రీని ఎత్తుకువచ్చి అత్యాచారం చేసాడు, మద్యపానం, ధూమపానం, పరులను హింసించడం, ఋషులను ఏడిపించడం అతని లక్షణాలు.

కానీ ఇప్పటి సినిమాల సంగతి చూడండి. కథానాయకుడు మరియు ప్రతినాయకునికి మధ్య బేధం లేదు. ఇద్దరు అమ్మాయిలను ఏడిపిస్తారు, మద్యం సేవిస్తారు, ధూమపానం చేస్తారు, 'రూల్స్' అతిక్రమిస్తారు. వాళ్ళిద్దరికీ తేడా ఏముంది? ఏమీ లేదు. కథ చివరలో కథానాయకుడి చేతిలో ప్రతినాయకుడు ఓడిపోతాడు. మీ పిల్లలు సినిమాలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అయినా ఎవరిని తీసుకుంటే ఏమిటి? ఇద్దరు అంతే. అందుకే పిల్లలు నేరస్థులుగా మారుతున్నారు.

మనం చూసే సినిమాల్లో డైలాగులు పిల్లలను తప్పుద్రోవ పట్టించేవిగా ఉంటాయి. కొన్ని ఉదాహరణలు - అమ్మాయిలు బుద్ధిమంతులను ఇష్టపడరు, నీలాంటి కోతులనే ఇష్టపడతారు అని అంటుంది ఈ చిత్రంలో కథానాయిక. ఇలాంటి డైలాగులు మీ పిల్లలకు వినిపించి వాళ్ళు బుద్ధిగా ఉండాలని మీరు కోరుకుంటారు. ఎంత విచిత్రం?! దాదాపు ప్రతి చిత్రంలోనూ కథానయికను (హీరోయిన్) కథానాయకుడు (హీరో) ఏడిపిస్తాడు. అక్కడే వాళ్ళకు ప్రేమకు పునాది పడుతుంది. అది చూసే పిల్లలకు, యువత అమ్మాయిలను ఏడిపించకుండా ఉండాలని మీరు ఎలా భావిస్తారు? ఆడపిల్లను ఏడిపిస్తేనే ప్రేమ పుడుతుందని వాడు చూసిన సినిమా చెబుతోంది. కాదంటారా? ఒక చిత్రంలో ప్రతినాయకుడు (విలన్) కథానాయికను ఏడిపిస్తాడు, కొందరు స్త్రీలపై అత్యాచారం చేస్తాడు. వాడికి మద్దతు తెలుపుతూ ఆ వెనుకనున్న ఒక వ్యక్తి "వాడు మగాడు. వాడు ఏమైనా చేస్తాడు" అంటాడు. అంటే మగవాళ్ళు స్త్రీలను ఏమైనా చేయచ్చనే సందేశమే పిల్లలకు వెళుతుంది. ఇలాంటి డైలాగులు విన్న పిల్లలు సచ్ఛీలురై ఉండాలని మీరు ఎలా కోరుకుంటారు.

ఏవండీ ఇదంత నిజమేనా? పిల్లలు మంచినే నేర్చుకుంటారు అని అంటారేమో... తల్లి టి.వి.రిమోట్ ఇవ్వలేదని 15 ఏళ్ళ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఫోన్ చూడవద్దు అన్నారని 12 ఏళ్ళ బాలుడు, టి.వి.చానెల్ మార్చలేదని ఒక చిన్న పిల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అసలా ఆ వయస్సులో పిల్లకు ఆత్మహత్య అంటే ఏంటో తెలుసా? ఎలా చేసుకోవాలో తెలుసా? ఎవరు నేర్పించారు? మీరు చూపెట్టిన సినిమాలే. ఆ సినిమాల్లో, ధారవాహికల్లో ప్రతి వారం ఒక ఆత్మహత్య దృశ్యం ఉంటుంది, ఇంక వార్తల్లో చెప్పనక్కర్లేదు. అది తప్పో, ఒప్పో పిల్లలకు తెలియదు. వారికి అంత విచక్షణ ఉండదు. తాము కోరింది దక్కనప్పుడు తెర మీద పాత్రలు ఆత్మహత్యకు పాల్పడటం చూసి, వాళ్ళు ఉరేసుకుంటున్నారు.

నిజం చెప్పాలంటే చెవి ద్వారా విన్నప్పుడు మనస్సు ఆలోచిస్తుందేమో గానీ, కళ్ళ ద్వారా చూసినప్పుడు ఆలోచించదు. అక్కడ విచక్షణ పని చేయదు. చూసింది చూసినట్లు మనస్సులో ముద్ర పడిపోతుంది.

అలా కాక పిల్లలకు మీడియా ద్వారా మంచిని చూపించవచ్చు. సమాజం చెడిపోలేదు. సమాజంలో ఇంకా చాలా మంచి ఉంది. అందుకే మనం బ్రతకగలుగుతున్నాము. అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యల గురించి చూపెట్టేకంటే, అందరికీ సాయం చేస్తున్నవారి గురించి, సమాజసేవ చేసినవారి గురించి చెప్పచ్చు. అలాంటివి టి.వి.ల్లో ప్రసారం చేయవచ్చు. ఈ సమాజంలో మంచి ఇంకా చచ్చిపోలేదని, మంచిపనులు అనేకం చేయవచ్చని చెప్పొచ్చు. వారు వాటిని ఆదర్శంగా తీసుకుంటారు. చెడు ఎంటో తెలిస్తే చాలు, దాన్ని చూడక్కర్లేదు. కానీ మంచి మాత్రం చూడాలి. అప్పుడే మంచిపనులు చేయగలరు.

మంచి విషయాలను ఎంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారు? రాత్రి పడుకునే ముందు విన్నది బాగా గుర్తుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒకప్పుడు అమ్మమ్మలు, బామ్మలు, అమ్మలు పిల్లలకు నీతిని పెంచే కథలు చెప్పేవారు. రామాయణ, మహాభారతాలు చెప్పేవారు. అందుకే అప్పటి పిల్లలు గొప్పవాళ్ళయ్యారు. ఇప్పుడు మనమా పని ఎందుకు చేయము? ఆ ముష్టి టి.వి.ని, సెల్‌ఫోన్‌ను, యూట్యూబ్‌ను పిల్లలకు/ యువతకు ఎందుకు దూరం పెట్టము? పిల్లలకు వారి ఇంద్రియాల ద్వారా మంచి మంచి విషయాలను పంపించాలి. అది మెదడుకు ఆహారం అవుతాయి. అప్పుడు పిల్లలు సమాజంలో మంచిని పంచుతారు.

టి.వి.లు, యూట్యూబ్ మొదలైన వాటిల్లో వచ్చే చెత్తకు, చెడుకు మీరు, మీ పిల్లలు దూరంగా ఉండటం ఇంద్రియ నిగ్రహం. అదే నేటి సమాజానికి దత్తుని సందేశం.

ఇప్పుడు ఇది చెప్పుకున్నాము కనుక అసలు ఉపవాసం అంటే ఏంటో కూడా తెలుసుకుందాము.

కొందరు పదే పదే ఆహారం మానేసి, ఆ దేవుడికి ఉపవాసం ఉన్నాము, ఈ దేవుడికి ఉపవాశం ఉన్నాము అంటారు. వారి భావనలో ఉపవాసం అంటే నోటి ద్వారా తీసుకునే ఆహారం తగ్గించడం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. భగవంతునికి దగ్గరగా ఉండటం ఉపవాసం. ఇందులో కేవలం నోటి ద్వారా తీసుకునే ఆహారం మానేస్తే సరిపోదు. ఇంద్రియాల ద్వారా మనస్సు బాహ్య విషయాలను స్వీకరిస్తోంది. ప్రాపంచిక విషయాలు ఇంద్రియాలకు, మనస్సుకు ఆహారం. కనుక మనం ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను ఆ రోజు నిగ్రహించాలి. అంటే రెచ్చగొట్టే విషయాలను చూడకూడదు, వినకూడదు, అనవరమైనవి మాట్లాడకూడదు, సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. మనస్సును రెచ్చగొట్టే వాసనలు పీల్చకూడదు. పొద్దున వార్తపత్రిక తెరవగానే కనిపించేవి నేరాలు, ఘోరాలే. కనీసం ఆ రోజైనా అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సినిమాలు, సీరియళ్ళు చూడకూడదు. పెడార్ధాలు వచ్చే పాటలు వినకూడదు. సాధయమైనంతవరకు భగవత్ సంబంధమైన విషయాలను ఇంద్రియాల ద్వారా స్వీకరించాలి. భగవంతుని భజన చేయాలి, నామసంకీర్తనం చేయాలి, జపం చేయాలి. భగవత్ కథలు చదవాలి. భక్తిని పెంచే కీర్తనలు వినాలి. భగవంతునికి సంబంధించిన విషయాలను మాట్లాడాలి. అలా భగవంతునికి మానసికంగా, ఇంద్రియాల ద్వారా దగ్గరకు జరగాలి. అది నిజమైన ఉపవాసము.

ఉపవాసం ఇంద్రియ నిగ్రహాన్ని పెంచి, సాధనకు తోడ్పడుతుంది కదా అని ఒక భక్తుడు భగవాన్ రమణ మహర్షిని అడుగుతారు. దానికి సమాధానంగా భగవాన్ - కేవలం ఆహారం మానేయడం సబబు కాదని, ఆధ్యాత్మిక తృష్ణ ఆ రోజంతా మనస్సులో మెదులుతూ ఉండాలని చెప్పారు. పైగా ఉపవాసం ఉన్న రోజు మీరు చూసేవి, చేసేవి మనస్సుపై బలమైన ముద్ర వేసి, ఆ తర్వాత సంస్కారాలుగా ఏర్పడతాయని అంటారు.

మరి ఈనాడు మనం చేసేది ఏంటి? ఉపవాసం ఉండి చక్కగా ఒక సినిమా చూస్తాము, సిరియల్ చూస్తాము. అనవసరమైనవన్నీ చూస్తాము. ఏదైతే చెడు ఉందో, అదంతా మనస్సుకు మేతగా ఆ రోజే వేస్తున్నాము. ఇంక మనస్సు ఎలా అదుపులో ఉంటుంది? అసలు మనం చేసేది ఉపవాసమేనా?

మరి మనం ఇప్పుడు ఏమీ చేయాలి? మనస్సుకు ఇప్పటివరకు ఇంద్రియాల ద్వారా తామోగుణ ప్రధానమైన ఆహారాన్నే పంపాము. ఆహారశుద్ధ్వే సత్త్వశుద్ధిః అని ఉపనిషత్తు అంటుంది. శుచిగా వండిన మంచి ఆహారం తీసుకోవడం వలన మనశ్శుద్ధి ఏర్పడుతుంది. ముందుగా నోటి ద్వారా స్వీకరించే ఆహారంలో మనం మార్పులు చేసుకోవాలి. అత్యధికంగా సాత్త్వికహారం తీసుకుంటే మనలో సత్త్వగుణం పెంపొందుతుంది. కానీ మనం సాత్త్వీకాహారం ఎందుకు ఇష్టపడతాము. మనకు బిర్యానీలు కావాలి, బాగా మసాల దట్టించిన ఆహారం కావాలి. రజోగుణాన్ని పక్కన పెడితే, అవి తమోగుణ ప్రధానమైన ఆహారం. అవి మనస్సులో తమస్సును, బద్ధకాన్ని కలిగిస్తాయి. లౌకిక వాఛలను ప్రేరేపిస్తాయి. వాటికి తోడు పొద్దున లేవగానే త్రాగే టీ, కాఫీలు. టీ, కాఫీల్లో ఉండే కొన్న రకాల రసాయన పదార్ధాలు అవి తీసుకునేవారిలో లైంగిక వాంఛను ప్రేరేపిస్తాయి. మరి మనం పిల్లలకు పసివయస్సు నుంచే పాలకు బదులు, టీ, కాఫీలు అలవాటు చేస్తున్నాము. కొందరికైతే ఉదయం లేవగానే ఈ పానీయాలు త్రాగకపోతే ఇక వేరే ఏ పని చేయలేని స్థాయికి చేరారు. వాటికి బానిసలయ్యారు. ఇవి మనకు తెలియకుండానే లోపలున్న తమస్సును ప్రేరేపిస్తాయి.

యుక్తవయస్సులో ఉన్న పిల్లల మనస్సు ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. శరీరంలో జరిగే మార్పులు, మనస్సులో కలిగే ఆలోచనలతో వాళ్ళకు స్పష్టత ఉండదు. అలాంటి పిల్లలకు తల్లిదండ్రులు ఈ పానీయాలను అలావాటు చేస్తే, వీటి రసాయన చర్య వారి మనస్సుపై ప్రభావం చూపి, వారిని ఇంకా రెచ్చగొడుతుంది. పాపం! ఆ పిల్లలకు వారి మనస్సుపై ఇవి ప్రభావితం చేస్తున్నాయన్న సంగతి తెలియదు.

ఇక మద్యం గురించి చెప్పవలసిన పనిలేదు. ఇప్పుడు జరుగుతున్న అనేక నేరాల్లో, నేరం జరిగే సమాయానికి నేరస్థులంతా మద్యం సేవించే ఉంటున్నారు. మద్యం త్రాగితే తమ మీద తమకే నిగ్రహం ఉండదు. మరి అలాంటి మద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. మీరు చూసే సినిమాలు, హీరోలేమీ తక్కువగాదు. దాదాపు ప్రతి సినిమాలో కథానాయకుడు విద్యార్ధి దశలోనే మద్యం సేవిస్తూ, పార్టీలు చేసుకుంటూ కనిపిస్తాయి. అది చూసిన పిల్లలకు మద్యం త్రాగడం తప్పని ఎలా తెలుస్తుంది? పైగా ఇదంతా 'కామన్', 'ఫ్యాషన్' అంటూ సమాధానమిస్తారు. మనస్సు మరియు శరీరంపై నిగ్రహాన్ని తప్పించే ఆహారపనీయాలు మనం ఎందుకు తీసుకోవాలి?

మరి మిగితా ఇంద్రియాల సంతి ఏమిటి? వాటిని ఎలా నిగ్రహించాలి. మన మనస్సులో తప్పుడు భావన కలిగించే ఏవైనా విషయాలు మనకు తారసపడినా, వినబడినా ముందుగా ఇంద్రియాలను అక్కడి నుంచి దృష్టి మరల్చాలి. ఆ ప్రదేశం నుంచి, వ్యక్తుల నుంచి దూరం జరగాలి. ఈ విషయంలో తాబేలు మనకు ఉదాహరణ అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు ఏ విధంగానైతే తాబేలు తన పెంచులోకి ముడుచుకుని పోతుందో, అలానే సాధకుడు సైతం తన మనస్సును, ఇంద్రియాలను చెడు విషయాల నుంచి మళ్ళించాలి. దానితో పాటు మానసికంగా బలవంతులమవ్వాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే మనశ్శుద్ధి ద్వారా.

ఇప్పటికే అనేక జన్మలుగా మనస్సుకు బహిర్ముఖమై అనవరమైన విషయాలను స్వీకరించడం నేర్పించాము. మరి మనస్సు మాట వినదే. అప్పుడే మనకు సాయం చేసి భగవత్ ప్రార్ధన, పూజ, జపము. గురువు ఉంటే ఆయన ఉపదేశం చేసిన మంత్రం నిత్యం జపించాలి. ఒకవేళ గురువు లేకుంటే, శ్రీ రామ, శ్రీ రామ అంటూ శ్రీ రామ నామం; లేదా శివ, శివ అంటూ శివ నామం; అలా మన ఇష్టదైవం యొక్క నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉండాలి. ముందుగా ఒక సమయం పెట్టుకుని, ఉదయమో, సాయంకాలమో స్నానం చేయగానే, శుచిగా దేవుడి ముందు కూర్చుని జపం చేయాలి. ముందే ఒక సంఖ్యను గానీ, లేదా సమయాన్ని గానీ నిర్ణయం చేసుకుని క్రమం తప్పకుండా అది చేయాలి. రామ నామం లేదా గోవింద నామం లేదా శివ నామం 15 నిమిషాలు చేస్తే జప సంఖ్య 2,000 దాటుతుంది. రోజులో ఒక్క 15 నిమిషాలు కేటాయించలేమా?

రోజూ ఒక సమయం పెట్టుకుని ఆ సమయానికి పూజో, జపమో చేస్తుంటే, మనస్సు ఆ సమయానికి అక్కడ వచ్చి నిల్చుంటుంది. మొదట్లో నిరాకరించినా, క్రమంగా మనస్సు సహకరిస్తుంది. పైగా జపం అనేది మనస్సును శుద్ధి చేస్తుంది. ఆ విషయం మనకు వెంటనే తెలియకపోవచ్చు కానీ క్రమం తప్పకుండా చేస్తుంటే ఒక 6-7 నెలలకు అనుభూతిలో తెలుస్తుంది. అది కొనసాగించినప్పుడు, బయట పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా లోపల ప్రశాంతత ఉంటుంది. మానసిక బలం పెరుగుతుంది. అప్పుడు పొరపాటున మనమేది చూసినా, మనస్సు చలించదు.

ఈ విషయం మనకు శ్రీ హనుమంతులవారు సుందరకాండలో చూపించారు. సీతాన్వేషణ కోసం లంకకు వెళ్ళిన హనుమంతులవారు అక్కడున్న స్త్రీలందరిలో సీతమ్మను వెతుకుతారు. అది రాత్రి సమయం కావడంతో అందరూ నిద్రించి ఉంటారు. అందరికి వస్త్రాలు ఉండాల్సిన రీతిలో ఉండవు. హనుమంతుడు అందరిని చూసి, తర్వాత అంటారు. వారిని చూసినప్పుడు సీతమ్మను వారిలో వెతికాను కాని వేరే ఆలోచన లేదు. నా మనస్సు చెదరలేదు అని. మనకూ ఆ స్థితి రావాలి. అదే దత్తుడు చెబుతున్నారు.

Sunday, 3 December 2017

దత్తవాణి



That one God, Who shines within everything, who is formless like cloudless sky, Is the pure, stainless, self of all. Without any doubt, that is Who I am.

- Lord Dattatreya in avadhoota gita 

Tuesday, 13 December 2016

గాలి నా గురువు- దత్తాత్రేయ స్వామి



Air is my guru- I observed that air is pure and odorless in itself. And it blows on both sweet and foul-smelling things without any discrimination or preference. Though it momentarily seems to take on the smell of its surroundings, in a short while, it reveals its pristine quality. From this I learned that a spiritual aspirant should live in the world, unaffected by the dualities of life like joy and sorrow and by the objects of the senses. He should keep his heart’s feeling and his speech unpolluted by vain objects. As I have learned all this by observing it.

Sri Guru Dattatreya Swami

Monday, 12 December 2016

13 డిసెంబరు 2016, మంగళవారం, మార్గశిర పూర్ణిమ, దత్తపూర్ణిమ.



శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.

దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.

ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.

సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయులవారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్షపూర్ణిమనాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు. దత్తాత్రేయుడు మార్గశీర శుక్ల చతుర్దశిని అవతరించినా దత్తజయంతిని మహారాష్ట్రులు మార్గశీర పూర్ణిమనాడే జరుపుతారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవడం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు.

మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!

Source: http://archive.andhrabhoomi.net/content/dattatreya-jayanthi

Friday, 25 December 2015

తేనేటీగా నా గురువు - దత్తుడు

తేనెటీగ నా గురువు. తేనెటీగ తాను ప్రపంచమంతా తిరుగుతూ మకరందాన్ని సేకరిస్తుంది. తాను ఏ పువ్వు మీద వాలినా, ఆ పువ్వుకు ఎటువంటి హాని చేయకుండా, తన పని ఎంటో అదే తాను చేసుకుంటుంది. అలాగే ముక్తిని కోరే సాధకుడు కూడా అన్ని ఆధ్యాత్మిక గ్రంధాలను చదివినా, తన సాధనకు ఏది అవసరమో, ఎంత వరకు అవసరమో అంతవరకే గ్రహించాలని, అనవసరమైనవి, ఆధ్యాత్మిక సాధనను భంగం చేసే వాటిని విసర్జించాలని నేను తేనెటీగ ద్వారా గ్రహించాను.

తేనెటీగ ఆ పువ్వు, ఈ పువ్వు అని చూడదు. మకరందం ఎక్కడ దొరుకుతుందా అని మాత్రమే చూస్తుంది. అలాగే సాధకుడు కూడా మొహమాటానికి వెళ్ళకుండా, ఎక్కడ జ్ఞానం ఉన్నా, దాన్ని గ్రహించడానికి సదా సిద్ధంగా ఉండాలని తెలుసుకున్నాను.

శ్రీ గురు దత్తాత్రేయ


Thursday, 24 December 2015

గొంగళిపురుగు నా గురువు - దత్తుడు

నా గురువులలో గొంగళిపురుగు ఒకటి. కందీరిగ తన గొంగళి పురుగును తీసుకెళ్ళి తన గూట్లో పెట్టి, జుంకారం చేస్తూ దాని చుట్టు తిరుగుతుంది. అది చూసిన గొంగళిపురుగు, భయంతో మరే ఇతర ఆలోచన లేక తదేకంగా తన తల్లైన కందిరీగనే గమనిస్తుంది. మనసులో కందిరీగ తప్ప మరే ఇతర ఆలోచనా ఉండదు. దాన్నే తీక్షణంగా గమనిస్తుంది. ఆ కందిరీగ మీద తదేక ధ్యానం చేత, గొంగళిపురుగు క్రమంగా రెక్కలు వచ్చి, రూపాంతరం చెంది కందిరీగగా మారి, ఎగిరిపోతుంది. అదే విధంగా సాధకుడు కూడా తన మనసును తదేకంగా దేని యందు లగ్నం చేస్తాడో, అతడు ఆ స్వరూపాన్నే పొందుతాడని దాని ద్వారా నేను తెలుసుకున్నాను.

నిరంతరం మనసు దేనిని మననం చేస్తుందో, అది స్వరూపాన్నే సంతరించుకుంటుంది. కనుక ముక్తిని కోరే వ్యక్తి సదా ఆత్మ యందు ధ్యానం నిలిపితే, అతడు ఆత్మ స్థితి యందే స్థిరపడిపోతాడు.

శ్రీ గురు దత్తాత్రేయ స్వామి