Wednesday, 8 May 2024

శ్రీ గరుడ పురాణము (169)

 


మలినవర్ణం వల్ల కలాశపుర పద్మరాగాలు, అల్పతామ్ర వర్ణ కారణంగా తుంబరు దేశీయాలు, కృష్ణ వర్ణపు కలిమిచే సింహళోత్పన్నాలూ, నీలవర్ణ, కాంతి విహీనతా వ్యాజానముక్త పాణి శ్రీ పూర్ణకీయ పద్మరాగాలూ స్వల్పంగా వాసి తక్కువ మణులుగా పేర్కొనబడుతున్నాయి.


వెలితి లేని ఎఱ్ఱదనం - అంటే గుంజబీజం (గురిగింజ) తో సమానమైన రంగుండే పద్మ రాగం అత్యుత్తమం. ఇది మెత్తగా వున్నట్లు చేతికి తగిలినపుడు అనిపిస్తుంది. కాని నొక్కి చూస్తే చాలా గట్టిగా వుంటుంది. నున్నదనంలో దీనికి సాటి లేదు. దానిని ఒక వైపు చేతితో నిమురుతుంటే రెండో వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ళ మధ్య పెట్టుకొని రాపిడి చేస్తే కొంత రంగును కోల్పోయినట్లు కనిపిస్తుంది. రాపిడి తీవ్రతరమైతే రంగును కొంతవఱకు కోల్పోవచ్చు. చేతబట్టుకొని పైకెగరేసి చూస్తే సూర్యకిరణాల చిక్కదనాన్ని బట్టి పద్మరాగం రంగులు మారుస్తుంది. ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే కాని వీటిని గమనించేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకుని అభిప్రాయం తీసుకోవాలి. సాన కూడా పట్టించి చూడాలి. ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించినవాడు ఏదో సరదాగా శత్రువుల మధ్యలోకి వెళ్ళినా ఆ రత్నము వానిని రక్షిస్తుంది. అదే దోషభూయిష్టమైన రత్నమైతే స్నేహితుల మధ్యలోనున్న వాడు కూడా ఆపదల పాలౌతాడు.


ఒకచోట పుట్టిన మణులన్నీ ఒకే ప్రభావాన్ని కలిగి వుంటాయనుకోరాదు. పోలికలుంటాయి; కాని భేదాలూ వుంటాయి. కాబట్టి రత్నాలను దేనికదిగానే కలివిడిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకునికిచ్చి శోధన చేయించాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్పప్రభావం గల రత్నాలతో కలిపి నిక్షేపించరాదు.


మహాగుణ సంపన్నములైన పద్మరాగాలను ఉడద ధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చాలి. అనగా తులన, ఆకలన, చేయాలి.


(అధ్యాయం - 70)


Tuesday, 7 May 2024

శ్రీ గరుడ పురాణము (168)

 


స్పటికం నుండి పుట్టిన పద్మరాగం సూర్య కిరణాలు సోకగానే ఎంత దూరం దాకానైనా అవిచ్ఛిన్నంగా అన్ని ప్రక్కలకూ తన కాంతులను విరజిమ్మగలదు. కొన్ని రత్నాల వర్ణాలు కుసుంభ నీల వర్ణాల మిశ్రితాల కలగలుపు కాంతులతో కంటికింపు గొలుపుతాయి. కొన్ని పద్మరాగాలు కొత్తగా వికసించిన కమలం వంటి శోభతో మెరుస్తాయి. కొన్ని భల్లంటక, కంటకారి పుష్ప సమానకాంతులను వెలారుస్తాయి. ఇంగువ చెట్టు పూలరంగులో కొన్ని కళకళలాడగా, మరికొన్ని చకోర, పుంస్కోకిల, సారస పక్షుల కన్నుల కాంతులతో సమాన వర్ణాలలో వెలుగును వర్షిస్తుంటాయి. మొత్తానికి స్పటికోద్భూత పద్మ రాగాలలో కూడా గుణ ప్రభావాలు ఉత్తమంగానే వుంటాయి. రావణ గంగోత్పన్న మణులతో సమానంగానే వుంటాయి.


సౌగంధిక మణుల నుండి పుట్టిన పద్మరాగ మణులు నీలకమలాల రంగులోనూ ఎఱ్ఱ కలువల వర్ణంలోనూ వుంటాయి. కురువిందాల నుండి వచ్చిన వాటికి స్పటికోద్భూత పద్మరాగాలంత కాంతి వుండదు. అధికాంశ మణులలో కాంతి అంతర్నిహితమై అనగా లోపల్లోపలే వుంటుంది. అయినా ఆ రేఖా మాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుళ్యమే మనుజులను మైమరపించగలుగుతోంది.


వర్ణాధిక్యం, గురుత, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శత, తేజస్విత, మహత్త - ఇవన్నీ శ్రేష్టమణుల యొక్క గుణాలు. మణులు గరుకుగాను, పొడిపొడిగానూ, పరుషం గానూ, అక్కడక్కడ కన్నాలు పడి, వర్ణవిహీనంగా, ప్రభాహీనంగా, కడిగినా పోని మరకలతో వుంటే అవి దోషయుక్తాలని గ్రహించి వానిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే వాటి దుష్ప్రభావం వల్ల ధరించిన వానిని శోకం, చింత, రోగం, మృత్యువు, ధననాశాది ఆపదలు చుట్టుముడతాయి.


అన్ని సద్గుణాలూ అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నతులన చేయునపుడు కలాశపురం, సింహళం, తుంబరు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగమణులెంత జాజ్జ్వల్యమానా లైనప్పటికీ రావణగంగోత్పన్న పద్మరాగాలకంటే, తలవెంట్రుకవాసైనా, వాసి తక్కువగానే భావింపబడుతున్నాయి.


Monday, 6 May 2024

శ్రీ గరుడ పురాణము (167)

 


పద్మరాగమణి - లక్షణాలు - పరీక్షావిధి


దేవతలపాలిటి మహాదాతయు, జగత్తికి సర్వరత్న ప్రదాతయునగు బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకొని వెళుతుండగా వినీలాకాశమార్గంలో లంకపై నుండి పోతున్నపుడు లంకాధిపతియైన రావణుడు అడ్డగించాడు. వారి పెనగులాటలో ఆ రక్తం అలా క్రిందికి జారి లంకాదేశంలో ఒక నదిలో పడిపోయింది.


రావణగంగగా ప్రసిద్ధమైన ఆ నది బహు ప్రశస్తమైనది. అందలి జలాలు లంకలోని అద్భుత సౌందర్యవతుల నితంబాల నీడలతో నిత్య సంపర్కం గలగడం వల్లనో ఏమో గాని పరమ రమణీయాలుగా పేరు గాంచాయి. నారీరత్న సంచయసంగ్రాహకులలో రావణుని మించిన వారుండరేమో కదా! ఆ నది యొక్క రెండు తటాలూ పోకచెట్లతో సుశోభాత్ శోభితాలై వుంటాయి. ఆ నదిని అక్కడి వారు గంగతో సమాన పవిత్రంగా చూసుకుంటారు. ఉత్తమ ఫలాలనివ్వడంలో ఆ నది గంగకి తీసిపోదు.


అందులో బలాసురుని రుధిరగతాకర్షక శక్తి ఒక ఆకస్మిక ధనలాభం వలె చేరగానే ప్రతిరాత్రి రత్నాలెక్కడి నుండో వచ్చి ఆ నదీతటంపై స్థిరపడసాగినవి. వాటి యొక్క కాంతులు బంగారు బాణాల్లాగా నదిలో నుండి పైకీ వెలుపలి నుండి నదిలోకీ పరావర్తితం కాసాగినవి. ఆ నదిలో దొరికినవే పద్మరాగమణులు.


ఇవి సౌగంధికాలు కూడ. వీటిలో కురువిందజ రత్నాల, స్పటిక రత్నాల ఉత్తమ, ప్రధాన గుణాలన్నీ వుంటాయి. వాటి స్వరూపం ఎఱ్ఱటి మెరుపుతో బంధూకపుష్పం, గుంజాఫలం, జపా కుసుమం, కుంకుమ, వీరబహుటి కీటవర్ణాలు, పలాశ పుష్పవర్ణం - ఇలా లేతగా కనీ కనిపించని ఎరుపు నుండి నలుపు కలిసిన చిక్కటి రక్తవర్ణం దాకా అన్ని ఎఱ్ఱని నీడలలోనూ అనగా చాయలలోనూ వుంటుంది. సిందూరం, నీలోత్పలం, రక్త కమలం, కుంకుమపూవు, లాక్షారసం రంగుల్లోనూ పద్మరాగం వుంటుంది. ఎంత చిక్కటి రంగులో నున్నా కాంతులు వెదజల్లుతూ వుంటుంది.


Sunday, 5 May 2024

శ్రీ గరుడ పురాణము (166)

 


విశుద్దత కోసం ముత్యాలను సాధారణ అన్నపుకుండలలో జంబీర రసం నింపి, అందులో వేసి ఉడికిస్తారు. తరువాత వాటి ఆకారాలను మలచి కన్నాలను కూడా వేసేస్తారు.


దీనికి ముందుగానే బాగా తడిపిన మట్టితో మత్స్య పుట పాకమును జోడించి, అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత మట్టికి బిడాల పుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత వాటిని బయటికి తీసి పాలలో గాని నీటిలో గాని, మధు రసంలోగాని వేసి మరల వేడి చేస్తే అవి నున్నగా, మృదువుగా తయారవుతాయి. మంచి మెరుపు కూడా వస్తుంది. అపుడు స్వచ్ఛమైన వస్త్రంతో ప్రతి ముత్యాన్నీ గట్టిగా తోమాలి. చెప్పులను మెరుపు కోసం గుడ్డతో రాపిడి చేసే దాని కన్న నెక్కువగా వీటిని చేయాలి. (పాలిష్) వాటి మెరుపు రెండింతలు మూడింతలుగా పెరుగుతుంది. దోషాలన్నీ పోయి, గుణవంతమై సహజంగానే వుండే ముత్యం ఈ రకమైన శుద్ధి చర్యల వల్ల మరింత నయనానందకరమై పంకిలరహితమై శోభిస్తుంది. మహానుభావుడు, దయామయుడు, లోకబాంధవుడునగు వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్యాలపై జనులకు జ్ఞానాన్ని కలిగించాడు.


ఈ విధంగా రసశోధితమైన ముత్యం శుభ, సిద్ధి కారకమైన విశ్వాసపూర్ణాలంకారమై మానవశరీరాలపై అలంకారమై శోభిస్తుంది. సూర్యకాంతి సోకిన స్వచ్చమైన గాజులాగా మెరుస్తుంటుంది. స్వర్ణజటితమై వుంటే ఆ బంగారానికే ఒక కొత్త వెలుగునూ అందాన్నీ శోభన ప్రతిపత్తినీ ఇస్తుంది. ముత్యాన్ని బాగా శోధించి మంగళకారకం చేయడంలో సింహళీయులదే సింహభాగం.


ఏదేనా ఒక ముత్యం మీద అనుమానము వస్తే దానిని స్నేహద్రవం (ముత్యానికి హాని చేయనిది) వేడిచేసి, దానిలో ఉప్పు కలపగా వచ్చిన ద్రావకంలో ఒక రాత్రంతా ఉంచివేయాలి. తెల్లవారినాక ఆ ముత్యాన్ని బయటికి తీసి పొడిగుడ్డలో చుట్టి శ్రద్ధగా మర్దన చేసినంత గట్టిగా తుడవాలి. అలా అరగంట పాటుచేసి తీసి చూస్తే ఆ ముత్యం ఏ మాత్రమూ వన్నె తగ్గకుండా నిన్నటిలాగే మెరుస్తుంటే అది మంచిముత్యమే.


ఇదివఱకు చెప్పబడిన ప్రమాణాలతో పెద్దదై, తెల్లగా, నున్నగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, తేజస్సంపన్నంగా, సుందరంగా, గుండ్రంగా వుండే ముత్యం గుణసంపన్నమని శాస్త్రం 

వచిస్తోంది. ముత్యం అమ్ముడు పోయినా, పోకున్నా ఆనందాన్నే కలిగిస్తుంది. అమ్ముకుంటే 

డబ్బులొస్తాయి. అమ్ముకోకుండా వాడుకుంటుంటే దానికి గల అతీత శక్తుల వల్ల ఐశ్వర్యానందాలు కలుగుతూనే వుంటాయి.


సర్వసులక్షణ లక్షిత జాతయైన ముత్యము ఒక మారు ఒక మనిషి పూర్వజన్మ సుకృతం కొద్దీ అతన్ని చేరిందంటే అతనిని ఏ విధంగానూ చెడిపోనీయదు, బాధపడనివ్వదు, 

అనర్ధోత్పాదక శక్తులనతని దరి చేరనివ్వదు, దోష సంపర్కం కలుగనివ్వదు. ఇదీ మంచి ముత్యము యొక్క మాహాత్మ్యము. 


(అధ్యాయం - 69)


Saturday, 4 May 2024

శ్రీ గరుడ పురాణము (165)

 


మేఘంలో పుట్టే ముత్యాలు భూగోళం దాకా రానే రావు. ఖేచరులైన దేవతలే వాటిని ఒడిసి పట్టేసుకుంటారు. ఆ ముత్యాలకి దిక్కుల మూలల్లోని చీకట్లను కూడా పారద్రోలి అంతవఱకు మనకి కనిపించని చీకటి కోణాలని ఆవిష్కరించేటంత తేజస్సుంటుంది. సూర్య సమాన కాంతులతో ప్రకాశించే ఆ ముత్యం ఆకారం కూడా స్పష్టంగా ఆ వెలుగులో కనిపించడం కష్టం. ఈ మేఘమణి సర్వజన సామాన్యానికీ సమస్త శుభదాయకం. ఈ మణి వున్న చోటి నుండి నలుదిక్కులూ సహస్రయోజనాల దాకా విస్తరించిన క్షేత్రంలో ఏ అనర్థమూ జరగదు.


దైత్యరాజు, మహాదాని బలాసురుని ముఖము నుండి రాలినదంత పంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ విచిత్ర వివిధ వర్ణకాంతులను వెలారుస్తూ అలా అలా సముద్రంలో పడింది. ఈ సముద్రం అప్పటికే అశేష జలరాశికే గాక అమూల్య రత్న సంపత్ ప్రపంచాధిపతి. సోముని యొక్క షోడశ కళలతో నిండిన వెలుగులను, కాంతిని, శాంతిని తలదన్నే రత్నాలకు ఆకారము ఆ చంద్రునికే పుట్టినిల్లు, రత్నగర్భయైన సముద్రము. సముద్రమే మహాగుణ సంపన్నాలైన సర్వరత్ననిధానము. అందులో పడిన బలాసురుని పలువరస ఒక కొత్త అమూల్య సంపదకు తెరతీసింది. ముత్యపు చిప్పగా అనంతర కాలంలో ప్రసిద్ధికెక్కిన శుక్తులలో ఈ పలువరుస వంశాభివృద్ధి జరుగుతోంది. ఈ ముత్యాలే సర్వశ్రేష్ఠములై మానవజాతిని సముద్దరిస్తున్నవి. సాగర తీర దేశాలు, ద్వీపాలునైన సౌరాష్ట్ర, పరలోక, తామ్రపర్ణ, పారశవ, కుబేర, పాండ్య, హాటక, హేమక, సింహళ ప్రాంతాలు ముత్యాలకు కోశాగారాలు (ఖజానాలు)గా పరిణతిచెందాయి.


ముత్యమెక్కడ పుట్టినా ముత్యమే. ఇది సర్వత్ర సర్వాకృతులలోనూ లభిస్తుంది. పురాణ కాలంలో ఒక ముక్తాఫలం విలువ ఒక వేయీ మూడు వందల అయిదు ముద్రలు. అరతులం బరువున్న ముత్యం పైన చెప్పిన ధరలో అయిదింట రెండవ భాగము (2/5) తక్కువ. మూడు మాశలు అధికంగా బరువుండే ముత్యము. రెండువేల ముద్రలు. అనంతర కాలంలో విలువలు ఈ దిగువ కలవు.


(ఈ ధరవరుల పట్టిక క్రిందటి శతాబ్దిది. విష్ణువు గాని సూతుడు గాని చెప్పినది కాదు)


పూర్తిగా పెరిగిన పెద్ద పరిమాణంలో వున్న చిప్ప నుండి వచ్చిన ముత్యం పదమూడు వందల బంగారు కాసుల (సావెరిన్ల) ధర పలుకుతుంది. ఆరు బియ్యపు గింజల బరువున్నది 460 కాసులు చేస్తుంది. అత్యుత్తమ స్థాయికి చెంది, తొమ్మిది గింజల బరువున్న ముత్యం ధర రెండు వేల కాసులుంటుంది. రెండున్నర గింజల బరువున్నది 1300 కాసులు, రెండు గింజల బరువున్నది 800 కాసుల విలువ చేస్తాయి. అరగింజ బరువే వుండి మూడువందల కాసుల ఖరీదు చేసే ముత్యాలు కూడా వున్నాయి. ఉత్తమస్థాయికి చెంది, 720 మిల్లిగ్రాముల బరువుండే ముత్యం వెల రెండు వందల కాసులు. ద్రావిక అను పేరు గల శ్రేష్ట ముత్యమొకటుంది. దీని బరువు 50 మిల్లి గ్రాములు వెల 110 కాసులు. భావకమను పేరు గల ముత్యం 35 మిల్లిగ్రాములు, ధర 97 కాసులు. శిక్య అని చిన్న ముత్యాలుంటాయి. అవైతే ఒక్కొక్కటి పాతిక మిల్లిగ్రాముల బరువు, 40 కాసుల ధర. సోమ ముత్యము 15 మిల్లిగ్రాములు, 20 కాసులు. అలాగే కుప్యా అనే రకానికి చెందిన ముత్యం 8 లేక 9 మిల్లిగ్రాముల బరువుండి తొమ్మిది లేదా పదకొండు కాసుల ధర పలుకుతుంది. (కాసులనగా బంగారుకాసులైన సావెరిన్లే)


Friday, 3 May 2024

శ్రీ గరుడ పురాణము (164)

 


వెదురు, ఏనుగు, చేప, శంఖం, వరాహాల నుండి వచ్చే ముత్యాలు మంగళకరమైన కార్యాలకు ప్రశస్తములని చెప్పబడింది. రత్ననిర్ణాయక విద్వాంసులు ఎనిమిది రకాల ముత్యాలను పేర్కొంటూ వాటిలో శంఖ, హస్తి ప్రభూతాలు అధమాలని వచించారు.


శంఖం నుండి పుట్టిన ముత్యం ఆ శంఖము యొక్క మధ్యభాగం రంగులోనే వుండి బృహల్లోల ఫలం పరిమాణంలో వుంటుంది. ఏనుగు కుంభస్థలం నుండి వచ్చే ముత్యం పసుపురంగులో వుంటుంది. వీటి ప్రభావం ఏమీ వుండదు. చేప నుండి పుట్టే ముత్యాలు ఆ చేపపై భాగం రంగులోనే వుంటాయి. అందంగా, గుండ్రంగా, చిన్నవిగా ఉంటాయి. సముద్రంలోనే ఎక్కువ భాగం జీవించే చేప యొక్క వదన భాగం ఈ ముత్యాల జనకస్థానం.


వరాహం నుండి వచ్చే ముత్యాలు ఆ వరాహం దంత మూలాల రంగులోనే వుంటాయి. అయితే ఈ వరాహాలు మనకెప్పుడూ దర్శనమిచ్చే నల్ల ఊరపందులు కావు. ముక్తాజనకమైనది ఎక్కడో ఎప్పుడో అరుదుగా దొరికే శ్వేతవరాహరాజము.


వెదురు కణుపుల నుండి పుట్టే ముత్యాలు వడగళ్ళలాగ స్వచ్ఛ సముజ్జ్వల తెలుపు మెరుపుల కాంతులతో శోభాయమానంగా వుంటాయి. ఈ ముత్యాలకు జన్మనిచ్చే వెదుళ్ళు ఎక్కడో దివ్య, జనులను సేవించుకోవడానికి వారున్నచోటనే పుడతాయి గాని సామాన్యులకు దొరకవు.


సర్పముత్యాలు కూడా చేప ముత్యాల వలెనే విశుద్ధంగా వృత్తాకారంలో వుంటాయి. కత్తుల చివరల కాంతుల వలె అద్భుతంగా మెరుస్తాయి. పాము పడగలపై, అదీ అత్యున్నత జాతి నాగుల వద్దనే, దొరికే ఈ ముత్యానికి గొప్ప శక్తి వుంటుంది. దీనిని ధరించేవాడు అతిశయ ప్రభాసంపన్నుడై, రాజ్యలక్ష్మీయుక్తుడై, దుస్సాధ్యమైన ఐశ్వర్యానికధిపతియై తేజస్విగా, పుణ్యవంతునిగా వెలుగొందుతాడు.


ఈ ముత్యాన్ని రత్నశాస్త్రంపై ప్రపంచంలోనే సంపూర్ణ అధికారమున్న విద్వాంసుని చేత పరీక్ష చేయించి ఆయన తలయూచిన పిమ్మట శుభముహూర్తంలో నొక సమస్త విధి పూర్వక సంపన్నమైన భవనంపై స్థాపిస్తే ఆకాశం నుండి దేవదుందుభి ధ్వని వినిపిస్తుంది. దేవతల సంతోషం, ఆశీర్వాదం స్పష్టంగా తెలుస్తాయి. ఎవని కోశాగారంలోనైతే ఈ సర్ప ముత్యంవుంటుందో వానికి సర్ప, రాక్షస, వ్యాధి, ప్రయోగాల ద్వారా మృత్యు భయముండదు.


Thursday, 2 May 2024

శ్రీ గరుడ పురాణము (163)


 

పుష్పరాగాది జాతిరత్నాలు ఇతర జాతిరత్నాలపై గీతను గీయగలవు. కాని హీరకము, కురువిందము (మాణిక్యం) తమ జాతి రత్నాలనే గీయగలవు.


వజ్రాన్ని వజ్రమే కోయగలదు. స్వాభావిక వజ్రానికి మాత్రమే తన కాంతులను పైపైకి అనగా ఆకాశదిశగా ప్రసరింపజేసే శక్తి వుంటుంది.


ఇంద్రాయుధ చిహ్నంకితములైన వజ్రాలు కొన్ని అరుదుగా వుంటాయి. వీటిపై ఆ గుర్తు స్పష్టంగానే కనిపిస్తుంటుంది. కేవలం ఇవి మాత్రమే... కోణాల వద్ద విరిగినా, బిందు, రేఖా చిహ్నదూషితాలైనా తమ శ్రేష్టతను పూజ్యతను నిలబెట్టుకొనే వుంటాయి. అనగా వీటిని ధరిస్తే నష్టం జరుగకపోగా ఉద్దిష్ట ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి.


మెరుపుతీగలలోని కాంతితో సముజ్జ్వలంగా వెలుగులను విరజిమ్మే వజ్రాలను ధరించే రాజు అతిశయ ప్రతాపవంతుడై జగదేకవీరుడై విలసిల్లగలడు. సమస్త సంతానాలతో వర్ధిల్లుతూ పెద్ద కాలముపాటు పుడమి నేలగలడు. (అధ్యాయం - 68)


ముత్యాలు - వాటిలో రకాలు లక్షణాలు - పరీక్షణ విధి


శ్రేష్ఠమైన ఏనుగు, మేఘం, వరాహం, శంఖం, చేప, పాము, వెదురు - వీటన్నిటి నుండీ ముత్యాలు వస్తాయి. అయినా శుక్తి అనగా ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే జగత్ప్రసిద్ధాలు.


రత్నమనిపించుకొనే స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికుంటుందని ముక్తాశాస్త్రం ఇది వివరిస్తోంది. అది ముత్యపు చిప్పలోనేపుడుతుంది. ఇదే సూదితో పొడిస్తే కన్నం పడుతుంది. మిగతావి పడవు.