Tuesday 7 May 2024

శ్రీ గరుడ పురాణము (168)

 


స్పటికం నుండి పుట్టిన పద్మరాగం సూర్య కిరణాలు సోకగానే ఎంత దూరం దాకానైనా అవిచ్ఛిన్నంగా అన్ని ప్రక్కలకూ తన కాంతులను విరజిమ్మగలదు. కొన్ని రత్నాల వర్ణాలు కుసుంభ నీల వర్ణాల మిశ్రితాల కలగలుపు కాంతులతో కంటికింపు గొలుపుతాయి. కొన్ని పద్మరాగాలు కొత్తగా వికసించిన కమలం వంటి శోభతో మెరుస్తాయి. కొన్ని భల్లంటక, కంటకారి పుష్ప సమానకాంతులను వెలారుస్తాయి. ఇంగువ చెట్టు పూలరంగులో కొన్ని కళకళలాడగా, మరికొన్ని చకోర, పుంస్కోకిల, సారస పక్షుల కన్నుల కాంతులతో సమాన వర్ణాలలో వెలుగును వర్షిస్తుంటాయి. మొత్తానికి స్పటికోద్భూత పద్మ రాగాలలో కూడా గుణ ప్రభావాలు ఉత్తమంగానే వుంటాయి. రావణ గంగోత్పన్న మణులతో సమానంగానే వుంటాయి.


సౌగంధిక మణుల నుండి పుట్టిన పద్మరాగ మణులు నీలకమలాల రంగులోనూ ఎఱ్ఱ కలువల వర్ణంలోనూ వుంటాయి. కురువిందాల నుండి వచ్చిన వాటికి స్పటికోద్భూత పద్మరాగాలంత కాంతి వుండదు. అధికాంశ మణులలో కాంతి అంతర్నిహితమై అనగా లోపల్లోపలే వుంటుంది. అయినా ఆ రేఖా మాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుళ్యమే మనుజులను మైమరపించగలుగుతోంది.


వర్ణాధిక్యం, గురుత, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శత, తేజస్విత, మహత్త - ఇవన్నీ శ్రేష్టమణుల యొక్క గుణాలు. మణులు గరుకుగాను, పొడిపొడిగానూ, పరుషం గానూ, అక్కడక్కడ కన్నాలు పడి, వర్ణవిహీనంగా, ప్రభాహీనంగా, కడిగినా పోని మరకలతో వుంటే అవి దోషయుక్తాలని గ్రహించి వానిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే వాటి దుష్ప్రభావం వల్ల ధరించిన వానిని శోకం, చింత, రోగం, మృత్యువు, ధననాశాది ఆపదలు చుట్టుముడతాయి.


అన్ని సద్గుణాలూ అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నతులన చేయునపుడు కలాశపురం, సింహళం, తుంబరు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగమణులెంత జాజ్జ్వల్యమానా లైనప్పటికీ రావణగంగోత్పన్న పద్మరాగాలకంటే, తలవెంట్రుకవాసైనా, వాసి తక్కువగానే భావింపబడుతున్నాయి.


No comments:

Post a Comment