Monday, 31 January 2022

శ్రీ హనుమద్భాగవతము (146)



శ్లో || సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః |

ఆప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్ల భఃః


(వా.రా. 1-16–21)


'రాజా! ఎల్లప్పుడు ప్రియమును గొల్పుమాటలను పల్కు వారు సులభముగా లభించెదరు; కాని వినుటకు ప్రియము లై నను పరిణామములో హితకరము లైన వచనములను పలుకు నా వారు, వినువారు కూడ దుర్లభులే'యని తెలిసికొనుము.

"అగ్రజా! నీవు నాకు పితృసమానుడవు. నీ పాద ప్రహారమునకు, కటుభాషణములకు నేను చింతించుటలేదు. కానీ నీవు నీ వినాశమును స్వయముగానే ఆహ్వానించుచున్న వాడవని నేను వ్యాకులము చెందుచున్నాను. నీవు నీ సభాసదులు కాలమునకు వశులైతిరి. కావుననే మీరు విపరీతముగా ఆలోచించుచున్నారు. నిర్ణయములను తీసికొనుచున్నారు. నీవు నీ పుత్రులు, సైన్యము, రాక్షసవంశము శ్రీ రామచంద్రునిచే సంహరింపబడుట నేను చూడలేను. ఈ కారణమువలననే శ్రీ రఘువీరుని శరణు వేడుటకు పోవుచున్నాను.”


విభీషణుడిట్లు పల్కి మంత్రులతో గూడినవాడై శ్రీరామచంద్రుని శరణువేడుటకు ఆకాశమార్గమున బయలుదేరెను, హృదయము ఆనందపుటలు ఉప్పొంగుచుండెను. శ్రీరామచంద్రుని దివ్యమంగళ విగ్రహమును దర్శింపవలెననియు, ఆయన చరణారవిందములను శరణు పొందవలెననియు విభీషణుని మనస్సు ఆతురత చెందుచుండెను. అతడు తానిట్లా ఆలోచించుకొనుచుండెను. “ఆహా! నా అనేక జన్మముల పుణ్యము నేడు ఫలించబోవుచున్నది. దేవతలు, మహర్షులు జన్మజన్మముల పర్యంతము తపమొనరించినను అ భక్తసుఖదాయకుని చరణారవిందములను పొందలేరు. పరమప్రభువగు శ్రీ రామ చంద్రుని అరుణారుణ చరణారవిందములను నేడు నేను దర్శింప గల్గెదను. ఎవ్వని చరణ కమలముల సంస్పర్శనముచే పాషాణమైన గౌతమునిపత్నియైన అహల్య స్వస్వరూపమును పొంది సంసారమును తరించెనో, ఎవని అరుణ చరణములను భగవతియైన సీతా దేవి తన హృదయమున ధరించియుండెనో, కర్పూర గౌరాంగుడైన శ్రీమహా దేవుడు తన హృదయాంతరంగములో సదా ధ్యానించుచుండునో, లోకపావనములైన ఎవని పాదుకలను భాగ్యవంతుడైన భరతుడు శ్రద్ధాభక్తులతో నిరంతరము పూజించుచుండెనో, అధముడను రాక్షసుడనునైన నేను శ్రీ రామచంద్రుని ఆ దివ్యచరణములను దర్శించు భాగ్యమును పొందబోవుచున్నాను.

Sunday, 30 January 2022

శ్రీ హనుమద్భాగవతము (145)



నేను మరల నీకు నమస్కరించుచున్నవాడనై విన్నవించుకొనుచున్నాను. “శ్రీ రామచంద్రుడు ధర్మాత్ముడు, సత్యపరాక్రముడు. నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తుగాని, మహాపాశ్వమహోదరకుంభ నికుంభాతి కాయాది రాక్షసవీరులైన గాని, తుదకు నీవైనకాని సమరాంగణములో శ్రీరామచంద్రుని ఎదుట ఒక్క క్షణమైనను నిలువజాలరు; కావున ఆయనతో శత్రుత్వము వహించుట నీకు ఉచితము కాదు. అమోఘములు, అప్రతిహతములైన ఆ కోసలేంద్రుని శరములను స్మరించి జనక రాజకుమారియైన సీతను ఆయనకు సమర్పించి క్షమింపుమని ప్రార్థించుటలో నీకు శుభము కల్గును.


విభీషణుడు పల్కిన హితవచనముల ఆలకింపగానే రావణుడు మిగుల కోపించెను. క్రోధముతో కంపించుచు ఇట్లు పలికెను. “అసురకులమునకు కళంకమైనవాడా! నేను అనుగ్రహించిన భోగ భాగ్యములచే శరీరమును బాగుగా పెంచిన వాడవైన నీవు నేడు నా ఎదుటనే శత్రువులను పొగడుచుంటివి. శత్రువుల ఎదుటనే అవమానము చెందుచుండగా చూడవలెనని నీవు ఆకాంక్షించుచున్నావు కాబోలు. అది అసంభవము. నా భయము వలన ముల్లోకములు కంపించును. కాని నీవు నన్నొక సామాన్యమానవుని ఎదుట భయపెట్టుటకు ప్రయత్నించుచున్నావు. ధిక్కారము, ధిక్కారము! నీవు దప్ప అన్యులెవ్వరైనను ఇట్లు పలికినచో వెంటనే అసువులు బాసియుండెడివారు”.


కోపోద్దీపిత మానసుడై రావణుడు విభీషణుని కాలితో తన్ని ‘ధూర్తుడా! పొమ్ము! ఆ వనవాసియైన మానవునితో చేతులుగలుపు'మని తిరస్కారముగా పలికెను.


దశకంఠుడు పల్కిన కటు వచనములను ఆలకించి వాని పాదప్రహారమును సహితము సహించి బుద్ధిమంతుడు, మహా బలవంతుడునైన విభీషణుడు అగ్రజుని చరణములకు నమస్కరించి, తన నలుగురు మంత్రులను తోడ్కొని, గదాధారియై ఆకాశమునకు ఎగిసినవాడై రావణునితో ఇట్లు పల్కెను.

Saturday, 29 January 2022

శ్రీ హనుమద్భాగవతము (144)



విభీషణుడు అమితమైన ఆదరముతో రావణునకు ఇట్లు నివేదించడం ఆరంభించెను. “మహా మతిమంతుడా! పులస్త్య మహర్షి తన శిష్యునితో నీ కొక సందేశమును పంపెను. నీవు అహంకారమును విడచి సీతను ప్రభువుల ప్రభువైన శ్రీ రామచంద్రునకు సవినయముగా సమర్పించి ఆ దేవాది దేవుని శరణు వేడుము. నా ఉద్దేశ్యములో నీవట్లు ఒనరించినచో నీకు, నాకు, మన వంశమునకు, లంకా నివాసులకు శుభము కల్గును.”


విభీషణుడు పల్కిన అక్షరసత్యమైన ఆలోచనను ఆలకింపగానే మాల్యవంతుడనే మంత్రి ప్రసన్నుడయ్యెను; అతడు దశగ్రీవునితో నమ్రతాపూర్వకముగా ఇట్లు పల్కెను. "స్వామీ! నీ కనిష్ఠ సోదరుడు, పరమనీతినిపుణుడైన విభీషణుడు ఉచితమైన వాక్యములను పల్కెను. వీని ఆలోచనను మన్నించుటచే నీకు మంగళమగును.”


కాని కాలప్రేరితుడై ఉన్న దశాననునకు వారు పల్కిన హితవచనములు అప్రియములయ్యెను. అతడు కోపముతో పండ్లుకొఱకుచు ఇట్లు పల్కెను. “అసురులారా! శత్రువులను ప్రశంసించుచున్న ఈ ఇర్వురు మూఢులను ఈ సభ నుండి బయటకు నెట్టుడు.”


రావణుని అజ్ఞ ఆలకింపగానే వాని తాత యైన మాల్యవంతుడు సభను వీడిపోయెను. తన సోదరుని శుభమును కాంక్షించిన విభీషణుడు మరల వినయపూర్వకముగా ఇట్లు పలుకనారంభించెను. “దైత్యకులావతంసా! నీవు కృపాపూర్వకముగానే పల్కిన హితవచనములను అలకింపుము. విదేహరాజకుమారియైన సీతా దేవి లంకను ప్రవేశించిన సమయములో అనేక దుశ్శకునములు సంభవించుట నీవు ప్రత్యక్షముగా చూచితివి. అపుడే ఆ దుశ్శకునములను గుఱించి వివరించుటకు మంత్రులు సంకోచించిరి. 

Thursday, 27 January 2022

శ్రీ హనుమద్భాగవతము (143)



రావణుని శిరముపై మృత్యువు నృత్యమొనరించుచుండెను. వానికి ముఖ ప్రీతికరములైన ఈ అసత్య వాక్యములు సత్యములుగా గోచరిం చెను; కాని అదే సమయములో నీతి కుశలుడు, రావణశుభచింతకుడు వాని తమ్ముడైన విభీషణుడు అన్నగారి చరణకమలములకు నమస్కరించి వినయ పూర్వకముగా ఇట్లు పల్కెను. "అగ్రజా! నీవు బుద్ధిమంతుడవు, విద్వాంసుడవు, సకలనీతిరహస్యములు నెఱిగినవాడవు, సావధానుడవై ఒకింత ఆలోచింపుము. ఈ సభాసదులందఱు సత్యముగా హితమును ఆలోచింపక నిన్ను సంతుష్టునిగా చేయుటకు ఇట్ల అసత్యప్రలాపములను ఒనరించుచున్నారు. శ్రీరామచంద్రుని దూతయైన ఒక్క వానరుడు దుర్లంఘ్యమగు లంకానగరమును ప్రవేశించి ప్రమదావన సహితముగా లంక నంతయు నష్ట భ్రష్టం ఒనరించెను. సైన్యస్థావరములను, వాహనములను, మహత్వపూర్ణములైన రహస్య ప్రదేశములను తగులబెట్టుటయేగాక అతడు అసంఖ్యాకులైన రాక్షసవీరులతో పాటు మన వీరకుమారుని కూడా సంహరించెను. అన్నా ! అంతటి వానరవీరులు కోటానుకోట్లుగా వచ్చినచో ఇక ఏమి సంభవించగలదో ఊహించుకొనుము. మన లంకానగరమంతా అనాథవలె అగ్నిజ్వాలలలో మండుచున్న సమయమున యీ బీరములు పల్కు వీరులందరు ఎచటకు పోయిరి ?


“రాక్షసేశ్వరా ! శ్రీరామచంద్రుడు ఒక సాధారణ మనుష్యుడనుకొంటివా? కాదు. ఆయన సాత్తుగా అవ్యక్తాత్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు, ధర్మపత్ని యగు సీతా దేవి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి. సీత ఈ లంకానగరమునకు యమపాశమువలె అఱుదెంచినది. కావున శ్రీరామచంద్రుని ధనువు నుండి తీక్షణములు కాలరూపములైన శరములు బయల్వెడలక మునుపే సమర ప్రియులు, నఖదంష్ట్రాయుధ విశారదులైన భల్లూక వానర వీర సమూములు లంకను ముట్టడించి నష్ట భష్ట మొనరింపక ముందే మేల్కొనుము. అసంఖ్యాకములైన రత్న రాసులతో మునుపే మిథిలా రాజకుమారిని శ్రీరామచంద్రునకు భక్తితో సమర్పింపుము. లేనిచో స్వయముగా కాలకంఠుడైన శంకరుడు యముడు మొదలగు వారందఱు నిన్ను రక్షించుచు సురపతి, పాతాళ లోకమును ప్రవేశించినను శ్రీరామచంద్రుని అమోఘమగు బాణము నుండి నిన్ను రక్షింపలేరు.”         


Wednesday, 26 January 2022

శ్రీ హనుమద్భాగవతము (142)



విశాలమైన రామదండు విశ్రాంతిని కూడా తీసుకొనక రేయింబవళ్ళు పయనించుచుండెను, వారందఱు శ్రీరాఘవేంద్రునితో మధ్యాచలమును, సహ్యాద్రిని, మనోహరములైన అరణ్యములను తరించుచు మార్గములో నేత్రానందకరములైన దృశ్యములను గాంచుచు తుదకు విశాలసాగరతటమును చేరిరి. ఆ ప్రదేశమందు వానర భల్లూక వీరులు అత్యధిక ప్రసన్నులై 'జయ శ్రీసీతారాం’ 'జయ శ్రీలక్ష్మణరాం' అనుచు గర్జించిరి.


కోటానుకోట్ల వానరభల్లూకవీరుల గర్జనముల ఎదుట సముద్రుని భయంకర గర్జనము ప్రభావహీనమయ్యెను. 


విభీషణునిపై అనుగ్రహము చూపుట 


మహావీరులైన వానర భల్లూక యోధులతో శ్రీ రామచంద్రుడు దక్షిణ సముద్ర తటమును చేరెను. ఈ సమాచారం అందగానే లంకానగరములో వ్యాకులత్వము వ్యాపించెను. రాక్షసులు, రాక్షస స్త్రీలు, మిగులు చింతితులై పరస్పరమిట్లు పలుకనారంభించిరి. ఒకే ఒక వానరుడు సమస్త లంకా నగరమునకు నిప్పు పెట్టి భయంకరమైన నష్టమును కలుగ జేసెను. ఇపుడు కోటానుకోట్ల వానరవీరులచే ఈ దేశమునకు ఎట్టి దుర్దశ పట్టునోకదా! తుదకు దశకంఠుడు కూడ భయము చెందెను. వాని మనస్సు వ్యాకులమయ్యెను; కాని తన మనోభావములను లోననే ఉంచుకొని పైకి గంభీరముగా నుండెను. సభాభవనములో అతడు రాక్షసవీరులను ఉద్దేశించి ఇట్లు పలికెను. “వీర యోధులారా! వానరసైన్యములను తోడ్కొని దశరథకుమారులైన శ్రీరామలక్ష్మణులు లంకను ముట్టడించుటకు సముద్రమునకు ఆవలి తటమును చేరిరి. కావున తుచ్చులైన ఆ వానరుల కెట్టి దండనము విధింపవలెనో యోచించి నిర్ణయించుడు”.


రాక్షసాధిపతి పల్కిన వచనములను ఆలకించి ముఖ ప్రీతి కొఱకై సభాసదులందఱు అతని దుర్జయత్వమును, పరాక్రమమును, బలమును, శక్తియుక్తులను ప్రశంసించడ, ఆరంభించిరి. ప్రహస్తుడు, దుర్ముఖుడు, వజ్రదంష్ట్రుడు, ఇంద్రజిత్తు, మహా పార్శ్యుడు, మహోదరుడు, కుంభుడు, అతికాయుడు, కుంభకర్ణుని కుమారుడైన నికుంభుడు మొదలగు రాక్షసవీరులందఱు రావణునకు నమస్కరించి వాని శౌర్యపరాక్రమములను పొగుడుచు నిట్లుపల్కిరి. 'రాజా! క్షుధార్తులమైన మాకు ప్రియహారమైన నరవానరులు కాలప్రేరణముచే స్వయముగా మన సమ్ముఖమునకు వచ్చుట మా భాగ్యము. పవనపుత్రుడు మేమందఱము అసావధానులమైయున్న సమయములో మా ఉదారతను ఆసరాగా తీసికొని లంకానగరమునకు-నష్టమును కలిగించి వెడలిపోయెను. సమరాంగణములో మీ ధనువునుండి బయల్వెడలు రెండునాల్కలు గలిగిన సర్పసమానములు, తీక్షములు, విషయుక్తములైన శరపరంపరలను దశరథరాజు కుమారులు చూచియుండలేదు. ఆ కారణమువలననే ప్రజ్వలిత దీపము పైబడి మరణించు పతంగములవలె ఈ ప్రదేశమునకు వచ్చుటకు ప్రయత్నించుచున్నారు. విచారించవలసినదేదీ లేదు. మీరు మాకు అనుజ్ఞను ప్రసాదింపుడు. ఈ క్షణముననే మేము సముద్రమునకు ఆవలి తటమును చేరి క్షుద్రవానరులను వెదకి వెదకి సంహరించెదము.


Tuesday, 25 January 2022

శ్రీ హనుమద్భాగవతము (141)



ఆ క్షణమందే సుగ్రీవుడు వానర భల్లూక వీరులను రణరంగమునకు తరలింపవలసినదిగా వానరసైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. ఆ వీరులందరి మనస్సులలో లంకానగరమును ధ్వంసమొనరింపవలెననెడి ఉత్సాహము నిండెను. వారందఱు ముక్త కంఠముతో శ్రీ సీతారామచంద్రులకు జయమగుగాక! శ్రీలక్ష్మణ సహితుడైన శ్రీరామచంద్రునకు జయమగుగాక! అనుచు జయజయారవములను ఒనరించిరి. సుగ్రీవాజ్ఞచే కోటానుకోట్ల వానరవీరులు, అసంఖ్యాకులైన భల్లూక వీరులు గుమిగూడిరి. వారి హృదయములలో ఆనందము, విజయోత్సాహము పరవళ్ళు త్రొక్కుచుండెను. ఆ అపారమైన విశాలసైన్య మధ్య భాగములో జటాజూటధారియైన శ్రీరామచంద్రుడు ధనుర్భాణధారియై భాగ్యవంతుడైన శ్రీ ఆంజనేయుని భుజస్కంధమును అధిష్ఠించెను. శ్రీ రామానుజుడు అంగదుని భుజముపై ఆసీనుడయ్యెను. సుగ్రీవుడు ఆ అన్నదమ్ముల వెంట నడిచెను. గజుడు, గవాక్షడు, మైందుడు, ద్వివిదుడు, నీలుడు, నలుడు, సుషేణుకు, మహావీరుడైన జాంబవంతుడు మొదలైన సేనాధిపతులందఱు ఆ మహా సైనిక వాహినిని నాల్గు వైపులనుండి సావధానులై నడుపుచున్నారు. చంచలురైన వానర వీరులు సుగ్రీవాజ్ఞచే అనుశాశితులై సైన్యాధిపతుల ఆదేశములను పాటించుచు, ఎగురుచు, దుముకుచు, గర్జించుచు, మార్గమధ్యములో మధురఫలములను ఆరగించుచు దక్షిణదిశగా బయలు దేరిరి.


ఆహా! ఆ వానర వీరుల సౌభాగ్యమేమని పొగడగలము. సురముని దుర్లభుడు, సవస్తసృష్టికి స్వామి దయాధాముడైన శ్రీరామచంద్రుని కార్యమును నిర్వర్తించుటకు వారందఱు ఆనందమగ్నులై ప్రయాణమును సాగించుచుండిరి. వారి సౌభాగ్యమును గాంచి ఇంద్రాది దేవతలందఱు మనస్సునందే ఆ వానర భల్లూక వీరులను ప్రశంసింప సాగిరి. భగవంతుడైన శ్రీరామచంద్రుడు ప్రసన్న హృదయాంతరంగుడై బయలు దేరగానే సీతాదేవి వామనేత్రము, భుజము అదర అరంభించెను. అదే సమయములో లంకానగరమందు అనేకములైన అపశకునములు ప్రారంభమయ్యెను. ఆ దుశ్శకునములను గాంచినవారై అసురులఁదఱు చింతామగ్నులైరి.          


Monday, 24 January 2022

శ్రీ హనుమద్భాగవతము (140)



దుఃఖశమనుడు, మహావీరుడు నగు శ్రీ ఆంజనేయుడు విషయములను అన్నిటిని విన్నవించి నవనీరద సుందరుడైన శ్రీరామచంద్రుని ముఖారవిందమును రెప్ప వేయక చూచుచుండెను. రుద్రావతారుని వచనములును ఆలకించి ప్రభువు అత్యంత ప్రసన్నుడై ఇట్లు పల్కెను.


శ్లో॥ కార్యం కృతం హనుమతా దేవైరపి సుదుష్కరమ్ | 

మనసాపి యదన్యేన స్మర్తుం శక్యం న భూతలే ||

శతయోజనవిస్తీర్ణం లంఘయేత్క : పయోనిధిమ్ | 

లంకాంచ రాక్షసైర్గుప్తాం కోవా ధర్షయితుం క్షమః || 

భృత్యకార్యం హనుమతా కృతసర్వమ శేషతః | 

సుగ్రీవస్యేదృషో లోకే న భూతో న భవిష్యతి ||

అహం చ రఘువంశశ్చ లక్ష్మణశ్చ కపీశ్వరః | 

జానక్యా దర్శనేనాద్య రక్షితాః తాః స్మోహనూమతా || ( ఆ.రా. 6.1.2 5 )


శ్రీ ఆంజనేయుడు ఒనరించిన ఈ కార్యము దేవతలకైనా అత్యంతకఠినము. ఈ పృథ్వీతలముపై ఆ విషయమును ఎవ్వరైనను మనస్సులో స్మరింపనైనను స్మరింపజాలరు. శతయోజన విస్తీర్ణమైన సముద్రమును లంఘించి రాక్షసులచే సురక్షితమైన లంకాపురమును ధ్వంసమొనరించుటలో మఱియొకరెట్లు సమర్థులు కాగలరు. శ్రీ ఆంజనేయుడు సేవక ధర్మమును బాగుగా పూర్తి చేసెను. ఈ సంఘటన వెనుక జరుగలేదు, ముందు జరుగబోదు. ఈ పవనాత్మజుడు సీతాదేవిని కనుగొని నేడు నన్ను, లక్ష్మణుని, రఘువంశమును, సుగ్రీవాదులను అందఱిని రక్షించినాడు.


తదనంతరము సీతాపతియైన శ్రీరాముడు కిష్కిందాధిపతియైన సుగ్రీవునితో ఇట్లు పలికెను. “మిత్రమా! సుగ్రీవా! ఈ సమయములో విజయమను ముహూర్తము జరుగుచున్నది. ఈ క్షణమే సమస్త వానరసైన్యమును లంకా నగరమును ముట్టడించుటకు బయలు దేరవలసినదిగా ఆ దేశమిమ్ము. ఈ ముహూర్తములో జైత్రయాత్రకు బయలుదేరి నేను అసురసహితముగా దుర్జయుడైన దశాననుని సంహరించి సీతా దేవిని రక్షించెదను.