Sunday 22 December 2013

కంటితో జాగ్రత్తగా చూసి అడుగు వేయండి

చక్షుః పూతం పాదం నశ్యేత్ - కంటితో జాగ్రత్తగా చూసి అడుగు వేయండి అని మార్కండేయ పురాణంలో ఒక మాట. మనం నడిచేదారిలో ఏవో ఏవో జీవులు సంచరిస్తూ ఉండవచ్చు. మనం పొరపాటున ఏ జీవికి హాని తలపేట్టినా, జీవహింస చేసిన, అది మోక్షమార్గంలో మనిషి ప్రయాణానికి ఆటంకం అవుతుంది. ఆత్మజ్ఞానం పొందాలనుకునేవారు, యోగా చేసేవారు, ఆత్మను తెలుసుకోవాలనుకునేవారు, అసలు అందరూ కూడా అహింసను తప్పక పాటించాలనీ శృతులు, స్మృతులు, పురాణాలు గుర్తుచేస్తున్నాయి.

ఇప్పుడిది గుర్తు తెచ్చుకోవడానికి ఒక కారణం ఉంది. ఈ చలికాలం మనం దేశంలో కుక్కలు పిల్లలు పెట్టే సమయం. వీధికుక్కలు ఎక్కడపడితే అక్కడ పిల్లలు పెట్టేస్తాయి. అవే కాదు పిల్లులు, ఇంకా అనేక జీవులు కూడా. ఆ చిన్ని చిన్ని జీవులు తెలియక రోడ్ల పైకి రావడం, అధిక వేగంతో వాహానం నడిపేవారి వల్ల, ప్రమాదానికి గురై మృత్యువాతపడడం చూస్తూనే ఉంటాం. ఇవే కాక, హైవేల పై రోడ్ల మీదా పాములు, కోతులు కూడా వాహనప్రమాదంలో మరణించడం గమనిస్తూనే ఉంటాం. ఇది సాధరణ మనిషికి చిన్న విషయంగానే అనిపిస్తుంది. కానీ భగవంతునికి, ప్రకృతి ధర్మానికి ఇది పెద్ద అపచారంగా కనిపిస్తుంది. భగవంతునికి మనం ఎంతో, మిగితా జీవరాశి కూడా అంతే. ఆయన ఆత్మలను చూస్తాడే కానీ, శరీరాలను కాదు. మన వల్ల పొరపాటున ఏ జీవికి ప్రమాదానికి గూరైనా, ఆ పాపం మనలను ఆత్మసాక్షాత్కారంలో వెనక్కు లాగుతుంది. భగవంతునికి దూరం చేస్తుంది.

అవి అలా రోడ్ల మీదకు రావడం తప్పండీ అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేసేస్తాం. కానీ మనం ఒకటి అర్ధం చేసుకోవాలి. మనిషి మాత్రమే బుద్ధిజీవి. మనిషి మాత్రమే తన బుద్ధిని ఉపయోగించి సరిన మార్గంలో నడవగలుగుతాడు. మిగితా జీవరాశి వాటివాటి ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా మాత్రమే నడుచుకుంటాయి. వాటికి మనకులాగా ట్రాఫిక్ నిబంధనలు ఉండవు. కనుక నడిచే ముందు, వాహనం నడిపే ముందు, ఫోన్లు మాట్లాడకుండా, ప్రయాణించే మార్గం వైపు చూసి నడపండి.' చక్షుః పూతం పాదం నశ్యేత్' అన్న మార్కండేయ పురాణవచనాన్ని గుర్తుంచుకోండి. మీ వల్ల ఏ జీవికి హానీ కలగకుండా ఉండేలా చూడండి.            

అల్పజీవినైనా, అల్పవస్తువునైనా తృణీకార భావంతో చూడరాదు. ఒకరిపట్ల నువ్వు గౌరవం చూపితే వారు నీ పట్ల గౌరవం చూపుతారు. ఒక మూగజీవినైనా పాదాలతో తాకరాదు అని శ్రీ శారదాదేవి / శ్రీ శారదామాత అన్న మాటను గుర్తుంచుకోండి.

No comments:

Post a Comment