Wednesday 3 November 2021

శ్రీ హనుమద్భాగవతము (65)



కొద్దిదూరము వఱకు గాఢాంధకారము వ్యాపించి ఉండింది, కాని ముందుకు వెళ్ళగానే వారికి నిర్మలమైన జలముతో నిండిన సరోవరము సాల తాల తమాల, నాగ కేసర, అశోక, చంపక, నాగవృక్షములు, పుష్పములతోను, మధురమైన ఫలములతోను కూడియున్న వృక్షములు కనబడ్డాయి. ఇంతేకాక అక్కడ వారు అద్భుతమైన వస్త్రాలంకారములతో కూడి ఎంతో సుందరమైన ఒక భవనమును కూడా చూశారు. ఆ భవనమున దివ్యములైన భక్ష్యభోజ్యాది సామగ్రులన్నీ అమర్చబడి ఉన్నాయి. అక్కడ స్వర్ణ సింహాసనముపై , లావణ్యమయి అయిన ఒక రమణి (స్త్రీ) కూర్చుని ఉంది. ఆమె వల్కలములను, కృష్ణమృగచర్మమును ధరించి ధ్యానమగ్నమై ఉంది. ఆమెను చూసి ఆవానరులు ఒకరి ముఖము ఒకరు చూసుకొనసాగారు. ధ్యానమగ్నురాలైన ఆ యోగిని శరీరము నుండి తేజస్సు ప్రసరితమవుతోంది. భయాక్రాంతులైన వానరులు ఎంతో శ్రద్ధతో ఆమె చరణములకు ప్రణమిల్లారు.


తనకు నమస్కరించిన ఆ వానరులను చూసి యా యోగిని శాంతచిత్తముతో మధుర వాక్కులతో ఇట్లా అడిగింది -'మీ రెచటినుండి వచ్చారు? మీరెవరు? ఏ ఉదేశ్యముతో దుర్గమములైన ఈ ప్రదేశములలో విహరిస్తున్నారు? నా ఈప్రదేశాన్ని మీరెందుకు పాడుజేస్తున్నారు?'


విశాలకాయుడైన హనుమానుడు వినయముతో ఆమెకు ఇట్లా ప్రత్యుత్తరమిచ్చాడు - ఆదరణీయురాలైన ఓ దేవి! అయోధ్యాధిపతి అయిన దశరథుని పుత్రుడైన శ్రీరాముడు తన తండ్రి ఆజ్ఞననుసరించి ధర్మపత్ని అయిన జానకీ దేవితోనూ, సోదరుడైన లక్ష్మణునితోనూ కలిసి వనవాసమునకు బయలుదేరాడు. అక్కడ పరమసాధ్వియైన సీతను లంకాధిపతియైన రావణుడు హరించినాడు. శ్రీరామునితో స్నేహము చేసి యుండుటవలన సుగ్రీవుడు మమ్మల్ని జానకీ దేవిని వెదకుటకై పంపినాడు. ఆ శుభ కార్యమునకై మేము ఇటువచ్చాము. ఆకలిదప్పికలచే కలత జెందిన మేమీ పవిత్రమైన గుహలోనికి ప్రవేశించాము - ' దేవీ ! నీవెవరు ? దయయుంచి ఈ విషయమును మాకు చెప్పూ అని అడిగాడు.

No comments:

Post a Comment