Monday 6 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 93 వ భాగం



ఇక 'వినా వినాయకం' ఏమిటి? శక్తి పంచాక్షరి విధానంలో ఈశ్వరుణ్ణి, అంబికతోను, స్కందునితోనే గాక వినాయకునితోనూ కలిపి అర్చించాలి. శంకరులు, షణ్మతాలలో గణపత్యాన్ని కూడా స్థాపించారు. ఎందుక అన్నాడు? శంకరులు వినాయకుడు లేనివారంటే, బుద్ధుడు లేనివారని అర్ధం. బుద్ధునకు, వినాయకుడని ఒక పేరు కూడా ఉంది.


వినాయకుడనగా ఒక గణానికి నాయకుడని అర్ధం. ఇతని కంటే మరొక నాయకుడు లేనివాడని కూడా అర్ధం. భూత గణాధిపతిగా గణపతిని కొలుస్తున్నట్లు బౌద్ధులు, బుద్ధుణ్ణి వినాయకుడని అంటారు. (బుద్ధుణే కాదు, బౌద్ధమత గురువులందర్నీ ఆ పదంతో పిలుస్తారని ఆప్టే నిఘంటువులో ఉంది.


అమరకోశంలో "షడభిజ్జో దశబలో.. ద్వయవాదీ వినాయకః" అని ఉంది. కైలాస శంకరుడు, వినాయకునితో ఉంటాడు. మన కాలడి శంకరులు వినాయకునితో అనగా బుద్ధునితో ఉండరు.


కనుక శంకరులు, పరమశివులే. పరమ శివుడే, అపూర్వ శంకరునిగా మారారు.


శంకరులిచ్చిన సాక్ష్యం


ఇక వీరి మాటలలో తామీశ్వరావతారమని ఎక్కడైనా అన్నారా?


వీరు వినయ సంపన్నులు కదా. ఎన్ని గ్రంథాలు వ్రాసినా తమ గురించి ఒక్క ముక్క వ్రాసికోలేదు. ఆయన గురించిన విషయాలు మిగతావారు చెబితేనే తెలిసాయి. అందుకునే వీరి పుట్టిన కాలం గురించి, స్థాపించిన సంస్థలు గురించి, వ్రాసిన గ్రంథాల గురించి, దర్శించిన స్థలాల గురించి భిన్న అభిప్రాయాలు వచ్చాయి. కనుక ఈయన తను ఈశ్వర అవతారమని ప్రత్యక్షంగా చెప్పకపోయినా, పరోక్షంగా ఈ సంగతిని గుర్తించవచ్చు.


తాను మనిషినని రాముడన్నాడు. కృష్ణుడు కొన్ని సందర్భాలలో దేవుడని ప్రకటించుకొన్నా చాలా సందర్భాలలో పరోక్షంగా తన గొప్పదనాన్ని ప్రకటించాడు. ఇదంతా వారి లీల.


No comments:

Post a Comment