Thursday 1 December 2022

భేతాళ కథలు - 3



విక్రమార్కుడు పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఐనా వదలలేదు భేతాళుడు. “విక్రమార్క మహీపాలా! నేను- నీకు అలసట తెలియకుండానూ, యీ నిశీధిలో నడచి నడచి విసుగురాకుండానూ. ఒక కథ చెబుతాను. సరేనా?' 'అతను ఔననికాని కాదని కాని ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు.


మళ్లీ భేతాళుడి అన్నాడు. “కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్నవేస్తాను. ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసికూడా చెప్పక పోయావో తక్షణమే నీ తల వెయ్యి ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను. కథ మొదలు పెడుతున్నాను. -”


భేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అని మొదట కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమార్కుడు నోరు మెదపకుండానే నడుస్తూ కథ వినసాగాడు.


ఎవరు భర్త? ఎవరు సోదరుడు? 


"రాజా శోభావతీ అనే పురముండేది. దానిని యశఃకేతుడనే రాజు పరిపాలించేవాడు. అతను దేవ బ్రాహ్మణభక్తి కలవాడు. అంతే కాకుండా గొప్ప రాజకీయవేత్తగూడా. తన వేగుల (రహస్యముగా యితర దేశముల విషయములు తెలుసుకొను వారు) ద్వారా యితర దేశముల రహస్యములను సేకరించేవాడు. పని కొచ్చే సమాచారం తెచ్చిన వేగులకు చక్కని బహుమానాలనీ, విరివిగా జీతాల్నీ యిచ్చేవాడు.


మాకెప్పుడూ యీ రాజే కావాలని ప్రజలు కోరుకునే రీతిలో అతి చక్కగా.. ధర్మంగా రాజ్యపాలన చేస్తూండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. 


ఆ నగరానికి బయట ఒక కాళికాలయం ఉండేది. ప్రతి సంవత్సరమూ ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయం కెదురుగా ఒక కోనేరుంది. జాతరని చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం ఆ చేసి, శుచిగా, దేవి నారాధించి వెళ్లేవారు.


ఒక యేడు-ఉత్సవం నాడు కొందరు ఆడవారు కొలనులో స్నానం చేస్తున్నారు. మరో దేశం నుంచి ఎక్కడికో వెళ్తూ తోవలో ఉన్న యీ చోటుకి అనుకోకుండా వచ్చిన ధవళుడను రజకుడు కోనేటిలో స్నానమాడుతున్న ఒక స్త్రీని చూశాడు. అతనికా సౌందర్యవతి మీద విపరీతమయిన మోహం కలిగింది.

No comments:

Post a Comment