Thursday 9 May 2024

శ్రీ గరుడ పురాణము (170)

 


మరకతమణి - లక్షణాలు, పరీక్షా విధి


నాగరాజు వాసుకి బలాసురుని పిత్తాన్ని తీసుకొని ఆకాశాన్ని చీల్చేటంత వేగంతో దేవలోకం వైపు సాగి పోతుండగా అతని తలపై నున్న మణి ప్రకాశం క్రింద నున్న సముద్రంపై పడి సాగరానికి వెండి సేతువు అమరినట్లుగా కాంతులు పఱచుకొన్నాయి. సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమ్యాకాశాలను కలగుండు పఱచే వేగంతో పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడిచేశాడు.


వాసుకి భయపడిపారిపోతూ ఆ బలాసురుని పిత్తాన్ని ఒక పర్వత సానువు వద్ద నుంచి వెడలిపోయాడు. ఆ పర్వతంపై మధుర సుస్వాదజల స్రవంతులు ప్రవహిస్తున్నాయి. నవకలికలతో సాంద్రసుగంధ పరిమళాలను వెదజల్లుతున్న సౌగంధిక వృక్షాలు, ఎన్నో మాణిక్యాలు కూడా, తురుష్క దేశానికి దగ్గరల్లో నున్న ఆ పర్వతం కొండకోనల్లో కొలువున్నాయి. బలాసురుని పిత్తం ఆ నీటిలో కలసి సముద్రంలోకి ప్రస్థానించి మహాలక్ష్మి సమీపానికి* దగ్గరగా పోగా, అది ప్రయాణించిన సరిత్తుల తీరాలలో నున్న భూమి మరకతమణులకు ఖజానా అయింది.


* సముద్రం మహాలక్ష్మికి పుట్టిల్లు


వాసుకి పరుగెడుతున్నపుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకొని పానం చేశాడు. వెంటనే ఆయనకి మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం (కక్కివేయుట) చేశాడు. ఆయన రెండు నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేల పైబడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గనిగా మారింది. ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోనూ, శిరీష పుష్ప వర్ణంలోనూ, మిణుగురు పురుగు వెనుకభాగం రంగులోనూ, హరిత తృణక్షేత్రంవలెనూ, నాచురంగులోనూ, సర్పభక్షిణి నెమలి కన్నుల వన్నెలలోనూ నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తుంటాయి. ఇవి లోకకళ్యాణ కారకాలు. గరుత్మంతుని స్పర్శ వలనయోమో గాని ఇక్కడి మరకతమణులు సర్వవిషవ్యాధులనూ నశింపజేసే శక్తిని కలిగి వుంటాయి. అయితే ఇవి దుర్లభాలు; దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకూ, మరెన్నో ఔషధాలకూ లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటాపంచలై పోతాయి.


No comments:

Post a Comment