Showing posts with label పితృశాపం. Show all posts
Showing posts with label పితృశాపం. Show all posts

Sunday, 3 October 2021

వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం



వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం


అనాదిగా కుటుంబంలోని పెద్దలు పాటిస్తూ వస్తున్న ఆచారాలను ఖచ్చితంగా కొనసాగించాలి. కుటుంబ పెద్దలు కులదేవత (ఇంటిదేవుడు అని కూడా వ్యవహరిస్తారు) గా తరతరాలు ఎవరిని పూజిస్తూ వస్తున్నారో వారిని తప్పక అర్చించాలి. వారు ఆరాధించిన పద్ధతిలోనే పూజించాలి. అందులో మార్పులు చేయడం గానీ, వదిలేయ్యడం గానీ చేయగూడదు. ఒకవేళ కులదేవత తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఆరాధన పద్ధతిని తర్వాతి తరాలకు అందించాలి. అలాగే గ్రామదేవత యొక్క ఆరాధన కూడా. తరతరాలుగా మన పెద్దలు కొనసాగిస్తూ వస్తున్న ఆచారాలను విడిచిపెడితే వారి కోపానికి గురికావల్సి వస్తుంది, పితృశాపం తలుగుతుంది.


మతం మారితే మొత్తం వంశాచారం నాశనమవుతుంది. అది ఒక్కటే కాదు, కొత్తగా పుట్టుకొచ్చిన గురువులు చెప్పిన మాటలు విని, ఈ ఆచారాలు ఆరాధన పద్ధతులెందుకు? ఇవన్నీ అవసరం లేదు, ధ్యానం చేస్తే చాలు, బాహ్యంలో దీపం వెలిగించుట ఎందుకు? లోపల దీపం వెలిగించాలిగానీ ... లాంటి పిచ్చి మాటలను పట్టుకుని మీ పూర్వీకులు పాటిస్తూ వస్తున్న ఆచారాలను వదిలిపెడితే ఆ వంశం నశిస్తుంది. ఇక మన ధర్మంలోనే అనేక సంప్రదాయాలు. కొందరు శివుడిని పూజించరు, కొందరు విష్ణువును పూజించరు. కొత్తగా ఆ సంప్రదాయాల్లో చేరి మీ కులదేవతను విడిచిపెడితే, మీరు ఇప్పుడు పూజించే దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడు. మీ వంశాన్ని ఏ గురువులు కాపాడలేరు. అనేక కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. 


నేను చాలామందిని చూసాను. ఇలవేల్పు విష్ణువు ఉంటాడు, కానీ ఇష్టదైవం శివుడు. శివుడిని పూజించవద్దు అనలేదు గానీ ఇలవేల్పును కూడా ఆరాధించాలి. కానీ ఆరాధించరు. అదేమిటంటే శివుడే చూసుకుంటాడు అంటారు. కులదైవం శివుడుగా గలిగిన విష్ణుభక్తులు కూడా ఇలాగే అంటారు. నాకు ఇష్టంలేదు అంటారు. నారాయణుడే కాపాడతారు అంటారు. మరి కష్టాలు వచ్చినా, కులదేవతను విడిచిపెట్టినందుకు మీ ఇష్టదేవతయే కష్టం కలిగించిందని అంగీకరించే ధైర్యం మీకుందా?

బహుసా మీ వంశస్థులంతా ఆ దేవతను పూజిస్తామని మీ పూర్వీకులు ప్రమాణం చేశారేమో ! లేదా ఎప్పుడైనా ఆపదలో ఆ దేవత మీ వంశాన్ని కాపాడిందేమో లేదా కాపాడుతానని ప్రమాణం చేసిందో! 

పూర్వీకులు ఏర్పరిచిన వంశాచారాన్ని పాటించమని చెప్పేవారే, మీతో పాటింపజేసేవారే నిజమైన గురువులు. ఇవన్నీ అక్కర్లేదని చెప్పేవారు అసలు గురువులు కానేకారు.

Monday, 27 September 2021

పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది?



స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్|

జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్|| - గరుడ పురాణం


ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు.


"ప్రేత రూపం విడిపించని కులాన్ని (కులం = వంశం) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు."

ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.


వ్యక్తి మరణానంతరం చేయవలసిన ప్రతి కార్యం గురించి గరుడ పురాణం చెబుతోంది. అవి శ్రద్ధగా చేయాలి. కేవలం దహన సంస్కారమే కాదు, ఆ తర్వాత పదుకొండు రోజుల వరకు ప్రతి రోజూ కర్మ నిర్దేశించబడింది. అవిగాక మాసికాలు, సంవత్సరీకాలు మొదలైనవి చెప్పబడ్డాయి. వాటిని ఖచ్చితంగా శ్రద్ధతో చేయాలి. ఆత్మహత్య, అకాలమరణం, ప్రమాదవశాత్తు మరణించవారికి మరికొన్ని ప్రత్యేక ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. అప్పుడే మరణించినవారు ప్రేతరూపాన్ని విడిచి పైలోకాలకు వెళ్ళగలుగుతారు. లేదంటే ఆ కుటుంబాలను పితరులే నాశనం చేస్తారు. 

Sunday, 18 June 2017

నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా?

ఒకరడిగారు. నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా? లేక అలా చెప్తే భయపడి తప్పులు చేయరని ఆలోచిస్తున్నారా?


తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగా కన్నావా? కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము. అడిగి కనడం కాదు, వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీశాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం, పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు; సంతానం కలగదు, వ్యాపరంలో నష్టం మొదలైనవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది.

అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు. పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధ పడతారు. నిజానికి అనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే అధికంగా ఉంటుంది. గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పీడోపశాంతయే అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే భాద తొలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై దాని ప్రభావం ఉంటుంది.

కొన్ని ఉదాహరణలు - ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దత్తుడు ఉన్నాడు. తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.

పచ్చని చెట్ల పై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం,  స్త్రీ సంతానం ఉంటే వారు వైధవ్యం పొందడం వంటివి జరుగుతాయి. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి. అంటే ఆ పిల్ల పుటింట్లో కూర్చుని ఏడుస్తుంది, ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు.దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, 'పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో' అని పెద్దలంటారు.

భూములు లాక్కుంటారు. ముఖ్యంగా రాజకీయనాయకులు, బడా వ్యాపారవేత్తలు తమ అక్రమసంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో, మరొక విధంగానో భూమలను ఆక్రమించుకుంటారు. వ్యవసాయం మీద పన్ను లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమసంపాదనను చూపి సక్రమం చేసుకుంటారు. ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు, దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. భూమిని బలవంతంగా లాక్కుంటే, ఆ పితృదేవతలు ఏడుస్తారు. అది శాపంగా మారి లాక్కున వారి కడుపు కొడుతుంది. వారి పిల్లలు అకాల మరణం చెందుతారు, లేదా జీవచ్ఛవాలుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం. అసలు మనం ఒక భూమిని కొనాలన్నా, దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి. యోగులైతే ఒక భూమిని కొనెముందు పితృదేవతలను సంప్రదిస్తారు. మీరు ఉచితంగా ఇస్తానన్నా, వారు తీసుకోరు. ఎందుకంటే తమ వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు. విచిత్రం ఏమిటంటే మనదేశంలో ప్రభుత్వాలే భూములు లాక్కుంటాయి.

ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.

ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.