Showing posts with label పితృదేవతలు. Show all posts
Showing posts with label పితృదేవతలు. Show all posts

Tuesday, 2 November 2021

దీపావళి - దివిటీలు - పితృ ఆరాధన




దీపావళి అమావాస్యలో లక్ష్మీపూజ ఎంత ముఖ్యమో పితృదేవతా స్మరణ కూడా అంతే ముఖ్యం. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సంక్రాంతికి కూడా పితృదేవతలతో సంబంధం వుంది. అందునా ఇది దక్షిణాయనం, అంటే పితృదేవతల కాలం. 


పితృ ఆరాధన అంటే అశుభం అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. పితృదేవతల అనుగ్రహం లేకుండా కుటుంబంలో శుభకార్యాలు జరగవు. కనుక ప్రతి శుభకార్యానికి ముందు వారిని స్మరించాలి. పెళ్ళిలో కూడా ముందుగా నాందీ శ్రాద్ధం అని క్రతువు ఉంటుంది. అందులో పెళ్ళికి పితరులను ఆహ్వానిస్తారు. కనుక పితృకర్మలు అశుభం అనే అపోహను హిందువులు వీడాలి.


దీపావళి నాడు పితృదేవతలకు తర్పణాలు తప్పకుండా వదలాలి. 

తర్పణాలు ఎవరైనా వదలవచ్చా అని అడుగుతున్నారు. తర్పణాలు కేవలం తల్లిదండ్రులు లేనివారు మాత్రమే వదలాలి. మిగితవారు పితృదేవతలను మనఃస్ఫూర్తిగా స్మరించాలి.

దీపావళి సాయంకాలం పితృదేవతల ప్రీత్యర్ధమై దివిటీలను వెలిగించి చూపించే ఆచారముంది. దీన్ని దివిటీలి కొట్టడమంటారు. కొన్ని ప్రాంతాల్లో కర్రలకు, కొన్ని చోట్ల గోంగూర కాడలకు వస్త్రం చుట్టి నూనెతో వెలిగించి వెలిగించి చూపించాలి. ఇది పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తుంది. కాకరపువ్వొత్తులు కాల్చామా, చిచ్చుబుడ్డీలు కాల్చామా అన్నది ప్రధానం కాదు, దీపావళి నాడు దివిటీలు వెలిగించామా లేదా అన్నది ప్రధానం. ఈ దివిటీలను కూడా పురుషులే కొట్టాలని, స్త్రీలు పక్కన నిల్చుని చూడాలని నండూరి శ్రీనివాస్ గారి విడియోలో చూశాను.


అలాగే దీపావళి పండుగ రోజు సూర్యోదయవేళ కూడా దీపాలు వెలిగించి ఇంటి ముంగిట పెట్టాలి. మా చిన్నప్పుడు మా పెద్దలు ఇంట్లో ఇలా చేయడం మేము చూసాము. కార్తీకమాసంలో కూడా ఇప్పుడు అందరూ సాయంకాల వెళ మాత్రమే కార్తీకదీపాలు వెలిగిస్తున్నారు గానీ ఈ నరకచతుర్దశి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రతి రోజు ఉదయం వేకువఝామునే దీపాలను వెలిగించి ఇంటి గడపల వద్ద, తులసిచెట్టు వద్ద పెట్టాలి.


నరకచతుర్దశి సాయంకాల వేళ కాళీమాతను, దీపావళి అమావాస్య సాయంకాలం వేళ మహాలక్ష్మీని పూజించాలి. 


వీటి గురించి అనేక విషయాలను తెలుసుకొనుటకు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, చాగంటి కోటేశ్వర రావు గారు, నండూరి శ్రీనివాస్ గార్ల ప్రవచనాలను వినవచ్చు.

Monday, 4 October 2021

మాసికాలు, పిండ ప్రదానాల రహస్యాలు



చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? 


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. 


ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుణ్ణి దేవతలు, మహర్షులు “మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?”అని అడగగా బ్రహ్మ “దేహం”, “దేహి”గురించి ఇలా చెప్పాడు.


 “మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.”

”ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది”

”ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి.”


”ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.”


నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.


కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.

యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.


ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.


దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.


అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.


సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.


దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.


వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నారు.

దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు)

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.

ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.

ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.

తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.


నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.

ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది. 

కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.

ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.

సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.

కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న విశేషాలు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 

నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.*

వాటిని కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం “పిండదానాలు చేయండి”అని మాత్రమే చెబుతారు. తమ పెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం  వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

Sunday, 3 October 2021

వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం



వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం


అనాదిగా కుటుంబంలోని పెద్దలు పాటిస్తూ వస్తున్న ఆచారాలను ఖచ్చితంగా కొనసాగించాలి. కుటుంబ పెద్దలు కులదేవత (ఇంటిదేవుడు అని కూడా వ్యవహరిస్తారు) గా తరతరాలు ఎవరిని పూజిస్తూ వస్తున్నారో వారిని తప్పక అర్చించాలి. వారు ఆరాధించిన పద్ధతిలోనే పూజించాలి. అందులో మార్పులు చేయడం గానీ, వదిలేయ్యడం గానీ చేయగూడదు. ఒకవేళ కులదేవత తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఆరాధన పద్ధతిని తర్వాతి తరాలకు అందించాలి. అలాగే గ్రామదేవత యొక్క ఆరాధన కూడా. తరతరాలుగా మన పెద్దలు కొనసాగిస్తూ వస్తున్న ఆచారాలను విడిచిపెడితే వారి కోపానికి గురికావల్సి వస్తుంది, పితృశాపం తలుగుతుంది.


మతం మారితే మొత్తం వంశాచారం నాశనమవుతుంది. అది ఒక్కటే కాదు, కొత్తగా పుట్టుకొచ్చిన గురువులు చెప్పిన మాటలు విని, ఈ ఆచారాలు ఆరాధన పద్ధతులెందుకు? ఇవన్నీ అవసరం లేదు, ధ్యానం చేస్తే చాలు, బాహ్యంలో దీపం వెలిగించుట ఎందుకు? లోపల దీపం వెలిగించాలిగానీ ... లాంటి పిచ్చి మాటలను పట్టుకుని మీ పూర్వీకులు పాటిస్తూ వస్తున్న ఆచారాలను వదిలిపెడితే ఆ వంశం నశిస్తుంది. ఇక మన ధర్మంలోనే అనేక సంప్రదాయాలు. కొందరు శివుడిని పూజించరు, కొందరు విష్ణువును పూజించరు. కొత్తగా ఆ సంప్రదాయాల్లో చేరి మీ కులదేవతను విడిచిపెడితే, మీరు ఇప్పుడు పూజించే దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడు. మీ వంశాన్ని ఏ గురువులు కాపాడలేరు. అనేక కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. 


నేను చాలామందిని చూసాను. ఇలవేల్పు విష్ణువు ఉంటాడు, కానీ ఇష్టదైవం శివుడు. శివుడిని పూజించవద్దు అనలేదు గానీ ఇలవేల్పును కూడా ఆరాధించాలి. కానీ ఆరాధించరు. అదేమిటంటే శివుడే చూసుకుంటాడు అంటారు. కులదైవం శివుడుగా గలిగిన విష్ణుభక్తులు కూడా ఇలాగే అంటారు. నాకు ఇష్టంలేదు అంటారు. నారాయణుడే కాపాడతారు అంటారు. మరి కష్టాలు వచ్చినా, కులదేవతను విడిచిపెట్టినందుకు మీ ఇష్టదేవతయే కష్టం కలిగించిందని అంగీకరించే ధైర్యం మీకుందా?

బహుసా మీ వంశస్థులంతా ఆ దేవతను పూజిస్తామని మీ పూర్వీకులు ప్రమాణం చేశారేమో ! లేదా ఎప్పుడైనా ఆపదలో ఆ దేవత మీ వంశాన్ని కాపాడిందేమో లేదా కాపాడుతానని ప్రమాణం చేసిందో! 

పూర్వీకులు ఏర్పరిచిన వంశాచారాన్ని పాటించమని చెప్పేవారే, మీతో పాటింపజేసేవారే నిజమైన గురువులు. ఇవన్నీ అక్కర్లేదని చెప్పేవారు అసలు గురువులు కానేకారు.

Wednesday, 29 September 2021

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?



- సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమమం. ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి.

- క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి ‘చేత భరణి లేక భరణి పంచమి’ తిథులలో అనగా..మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

- భార్య మరణించిన వాడు ‘అవిధవ నవమి’నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర,రవికెలగుడ్డ పెట్టి సత్కరించి పంపాలి.

- చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి.

- ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే...


1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త.

2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త.

3.ఇది పితృస్థానం. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.

4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.

5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో...కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ...మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక్క విషయం. మనిషన్నాక బలహీనతలు సహజం. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధివిధాన పితృకర్మలు నిర్వహించడం.., వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి, ఈ మహాలయ విధులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించి పతృదేవతల ఆశీస్సులు అందుకుంటారని ‘తెలుగు వన్’


- చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి. - ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి. మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే... 1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త. 2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త. 3.ఇది పితృస్థానం. తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. 4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. 5.ఇది సర్వ కారుణ్యస్థానo.


5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో...కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ...మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక్క విషయం. మనిషన్నాక బలహీనతలు సహజం. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధివిధాన పితృకర్మలు నిర్వహించడం.., వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి, ఈ మహాలయ విధులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించి పతృదేవతల ఆశీస్సులు అందుకుంటారని ‘తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది.


-Source and thanks.......యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

Tuesday, 28 September 2021

మహాలయ పక్షాల ప్రాధాన్యత



భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ ‘మహాలయ పక్షములు’ అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము.


పితృదేవతలకు ... ఆకలా?


అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


అన్నాద్భవంతి భూతాని - పర్జన్యాదన్న సంభవః

యఙ్ఞాద్భవతి పర్జన్యో - యఙ్ఞః కర్మ సముద్భవః


అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....

అన్నం దొరకాలంటే .... మేఘాలు వర్షించాలి.

మేఘాలు వర్షించాలంటే....దేవతలు కరుణించాలి.

దేవతలు కరుణించాలంటే...వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద ‘జీవాత్మ’గా అవతరించడానికి... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణిచిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే ‘మోక్షం’ అంటే. రేపు మనకైనా ఇంతే.


తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?


అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలా తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ...పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే... సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.


Source: తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది.

-thanks.......యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

Monday, 27 September 2021

పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది?



స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్|

జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్|| - గరుడ పురాణం


ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు.


"ప్రేత రూపం విడిపించని కులాన్ని (కులం = వంశం) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు."

ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.


వ్యక్తి మరణానంతరం చేయవలసిన ప్రతి కార్యం గురించి గరుడ పురాణం చెబుతోంది. అవి శ్రద్ధగా చేయాలి. కేవలం దహన సంస్కారమే కాదు, ఆ తర్వాత పదుకొండు రోజుల వరకు ప్రతి రోజూ కర్మ నిర్దేశించబడింది. అవిగాక మాసికాలు, సంవత్సరీకాలు మొదలైనవి చెప్పబడ్డాయి. వాటిని ఖచ్చితంగా శ్రద్ధతో చేయాలి. ఆత్మహత్య, అకాలమరణం, ప్రమాదవశాత్తు మరణించవారికి మరికొన్ని ప్రత్యేక ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. అప్పుడే మరణించినవారు ప్రేతరూపాన్ని విడిచి పైలోకాలకు వెళ్ళగలుగుతారు. లేదంటే ఆ కుటుంబాలను పితరులే నాశనం చేస్తారు. 

Saturday, 25 September 2021

పితృకర్మల్లో శ్రద్ధ మరియు మంత్రం ప్రధానం



పితృకర్మల్లో శ్రద్ధ మరియు మంత్రం ప్రధానం. కర్మ చేయించే బ్రాహ్మణుడు అపరకర్మలు చేయడంలో నిష్ణాతుడై ఉండాలి. అతడు చదివే మంత్రాల వల్లనే తర్పణాదులను పితృదేవతలు స్వీకరిస్తారు. పితృకర్మలను అపరకర్మలు అంటారు. వీటిని చేసే బ్రహ్మణులకు కూడా ప్రాయశ్చిత్తం విధించబడింది. వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నారని చాలామంది ఆరోపిస్తుంటారు. కానీ మనం అర్ధం చేసుకోవలసింది ఒకటుంది. పితృకర్మ చేయడానికి వచ్చే బ్రాహ్మణుని ఒంటి మీదకు పితృదేవతలు వస్తారు. అందుకే భోక్తలు చాలా ఎక్కువగా తింటారు. అలా తింటారని వారికి కూడా తెలీదు. పితృకర్మ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తంగా అతడు సహస్రగాయత్రి చేయాలి. ప్రాయశ్చిత్తం చేయని పక్షంలో ఆ బ్రాహ్మణుడు అనేక సమస్యలను ఎదురుకొంటాడు. విమర్శ చేసేవాళ్ళకి తెలిసింది కొంచమే, కానీ అపరకర్మలు చేసే బ్రాహ్మణుల జీవితంలోకి తొంగి చూస్తే అప్పుడు తెలుస్తుంది, అది ఎంత శక్తివంతమైన విషయం అనేది. రెండవది, పితృకర్మ చేసిన బ్రాహ్మణునకు సంతృప్తిగా భోజనం పెడితే, ఆ ఇంటి పితరులు సంతోషిస్తారు, ప్రేతశాంతి కలుగుతుంది. 


అయితే కేవలం బ్రాహ్మణుడు నిష్ణాతుడై ఉంటే సరిపోదు. కర్మ చేయించుకునేవారు కూడా శుచీశుభ్రత, పితృకర్మల యందు భక్తి, విశ్వాసాలు కలిగి ఉండాలి. బ్రాహ్మణుడు సక్రమంగా మంత్రం చదివినా, చేయించుకునేవారికి శ్రద్ధ లేకపోతే పితరులు ఆ పిండాలను, తర్పణాలను స్వీకరించరు. ఆ కుటుంబాలను శపిస్తారు. 


కొందరికి వీలుపడదని వేరొకరితో పిండప్రధానాలు చేయిస్తారు. ఇది కూడా శాస్త్రం అంగీకరించదు. కర్మ చేసే అధికారం కర్తకు మాత్రమే ఉంటుంది. కర్త అనగా ఎవ్వరు శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులకు కర్మ చేసే అధికారం గలవాడు. అది వెరొకరి ఇవ్వలేరు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప అన్ని వేళలా శాస్త్రం దాన్ని అంగీకరించదు. కనుక డబ్బులిస్తామూ కర్మ చేయండి అని అనకండి, వీలు కల్పించుకుని మరీ పితృపూజ చేయండి.

Friday, 24 September 2021

పితృపక్షాల్లో పితృదేవతలను తప్పక స్మరించాలి



పితృపక్షాల్లో పితృదేవతలను తప్పక స్మరించాలి. ఆ మాటకు వస్తే రోజూ ఒక్కసారైనా వారిని స్మరించాలి. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే ఉద్యోగ్యం, వ్యాపారాభివృద్ధి, వివాహం, సంతానం, కుటుంబంలో సఖ్యత మొదలైనవి ఉంటాయి. వంశం కొనసాగుతుంది.


బయట చాలా వింత పోకడలు కనిపిస్తున్నాయి. గతించినవారికి పిండాలు పెట్టడమేంటి, అది వారికి చేరుతుందా? ఇదంతా బ్రాహ్మణుల కుట్ర, బ్రాహ్మణులు పొట్ట నింపుకోవడం కోసం ఇవన్నీ చెబుతున్నారంటూ ప్రచారాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదు. పితృకర్మల్లో భక్తి,శ్రద్ధ, విశ్వాసాలు ప్రధానం. వీటికి తార్కికమైన వివరణల కోసం వెతకకండి.  


మహాలయ పక్షాల్లోనైనా పితరులకు పిండప్రధానాలు, తర్పణాలు వదిలి చూడండి. వచ్చే ఏడాదికి జీవితంలో ఎంత అభివృద్ధి కలుగుతుందో మీరే చూస్తారు. పితరుల పేరున అన్నదానం చేయాలనుకోవడం మంచిదే. కానీ అన్నదానం అనేది శ్రాద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. దేనికదే. పితృకర్మ చేసిన బ్రాహ్మణునికి దక్షిణ తప్పనిసరిగా ఇవ్వాలి.


పితృకర్మలు చేసే బ్రాహ్మణుడు సైతం చక్కని పండితుడై ఉండాలి. యక్షప్రశ్నల్లో మనకు రెండు విషయాలు కనిపిస్తాయి. శ్రాద్ధానికి ఏది తగిన కాలము అని యక్షుడు అడిగితే, దానికి "ఉత్తమ బ్రాహ్మణుడు దొరికిన కాలామే శ్రాద్ధానికి తగిన కాలము" అని ధర్మరాజు బదులిస్తాడు. శ్రాద్ధం ఎట్లా చెడిపోయినదవుతుంది అని యక్షుడు అడగ్గా వేదము చదివిన బ్రాహ్మణుడు లేకుండా పెట్టిన శ్రాద్ధము వ్యర్ధమవుతుందని ధర్మరాజు బదులిస్తాడు.  


దేవకార్యాల్లోనైనా ప్రయత్నలోపం ఉంటే దేవతలు సర్దుకుంటారేమో గానీ పితృకార్యాల్లో మాత్రం శాస్త్రవిధిని తప్పక పాటించాలి. మాకు పిండప్రధానం చేసి ఆచారం లేదండీ అనడానికి లేదు. మీ ఇంట్లో ఇంతకమునుపు ఇటువంటి ఆచారాం లేకున్నా మొదలుపెట్టాలి. మీరు ఏ వర్ణం వారైనా తప్పనిసరిగా పిండప్రధానాలు చేయాలి, తర్పణాలు వదలాలి. ఏది చేసినా అది మీ కుటుంబ వృద్ధి కోసమేనని గమనించాలి.