Showing posts with label విష్ణువు. Show all posts
Showing posts with label విష్ణువు. Show all posts

Monday, 6 April 2020

Saturday, 15 November 2014

శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా?

సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.

ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు, మీరు, ఇంకా శివుడిలో ఎవరు గొప్పా అని అడిగారు. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది, రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవడు అని అన్నాడు విష్ణువు.  

ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహాఇంచడానికి ఏముంది? రాముడె ఈశ్వరుడుగా గలవాడు (రాముడు (విష్ణువు) తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని) అన్నాడు.

వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు.    

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

అసలు విళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. అందుకే శ్రుతి అంటుంది

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||

శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది.

శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.

సేకరణ : బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం

Sunday, 2 November 2014

భోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి

ఓం నమో నారాయణాయ

కార్తీక శుద్ధ ఏకాదశి, భోధన ఏకాదశి  


కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు.

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు.

ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరణ చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.

 ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. "ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగ ఒక జీవుడు,తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి  ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపాపరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈ ఏకాదశి  ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది" అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.

ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. 

ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు (uncertain death) దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి. అందువల్ల అందరు విష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూడండి, వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. అపమృత్యు (uncertain death) దోషం పరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహం కలుగుతుంది.

ఓం నమో నారాయణాయ

ఓం శాంతిః శాంతిః శాంతిః