Showing posts with label శ్రీ రామనవమి. Show all posts
Showing posts with label శ్రీ రామనవమి. Show all posts

Wednesday, 5 April 2017

Friday, 15 April 2016

తోబుట్టువుల విలువ చెప్పిన రాముడు

ఈనాడు మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు చిన్న చిన్న కారణాలతో, అహంకారంతో, మనస్పర్ధలతో విడిపోతున్నారు. ఇటువంటి సమయంలో రామాయణం మొత్తం మానవాళికి ఒక ఆశాజ్యోతి. రాముడు తోబుట్టువుల గొప్పతనం గురించి రామాయణంలో చెప్పిన మాట అందరూ గుర్తించుకోదగినది.

ఇంద్రజిత్తు (మేఘనాధుడు) తో యుద్ధం చేసిన లక్ష్మణుడు అతడు చేసిన అస్త్రప్రయోగంతో మూర్ఛపోతాడు. రక్తపుమడుగులో ఉన్న తమ్ముడిని చూసిన రాముడికి ఎక్కడలేని దుఃఖం వచ్చి సుశేషునితో ఈ విధంగా అంటాడు.

నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ స్థితిలో చూసి నా శక్తి క్షీణించిపోతోంది. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే, నా జీవితానికి, సంతోషానికి అర్దమేముంది? నా వీరత్వం సిగ్గుపడుతోంది. చేతి నుంచి ధనుస్సు పడిపోయినట్టుంది. బాణాలు జారిపోతున్నాయి. కన్నీరుతో కళ్ళు నిండి దృష్టి కూడా కనిపించడంలేదు. నేను మరణించాలనుకుంటున్నాను అని రాముడు ఎంతో ఏడుస్తాడు.

ఓ శూరుడా! లక్ష్మణా! విజయం కూడా నన్ను తృప్తి పరచలేదు. దృష్టి కోల్పోయిన వ్యక్తికి జాబిల్లి (చంద్రుడు) ఏ విధంగా సంతోషాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు నేను పోరాడి సాధించేది ఏంటి? లక్ష్మణుడు మరణించి ఉంటే, నేను యుద్ధం చేసి లాభం ఏంటి? నువ్వు నన్ను ఏ విధంగా వనవాసానికి ముందు అనుసరించావో, అలాగే ఇప్పుడు నేను నిన్ను మృత్యువులో అనుసరిస్తాను. యముని వద్దకు నీ వెంట వస్తాను.

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః |
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతః సహోదరః ||

భార్యలు ఏ దేశంలోనైన దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ ఏ దేశానికి వెళ్ళిన తోబుట్టువులు మాత్రం దొరకరు. వారిని కోల్పోకూడదు అంటాడు శ్రీ రాముడు.

నేను ఇక్కడే, ఈ యుద్ధభూమిలోనే మరణిస్తాను, తిరిగి అయోధ్యకు వెళ్ళను, నాకు నీ కంటే ఎవరు ఎక్కువ కాదు అంటూ లక్ష్మణుని చూస్తూ రాముడు రోదిస్తాడు.

ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండ 101 సర్గలో ఉంది.

తోడబుట్టిన వారి విలువ ఎంత చక్కగా చెప్పాడు శ్రీ రాముడు. అహంకారాలాకు పోయి వారిని దూరం చేసుకుంటారా? కొత్తగా పెళ్ళై వచ్చిన జీవిత భాగస్వామి కోసం వారిని విడిచిపెడతారా? శ్రీ రాముడు మనకు ఆదర్శం కావాలి. బంధువులు, బంధుత్వాలు ఎన్నైనా కలుపుకోవచ్చు. కానీ తోబుట్టువులను తీసుకురాలేరు. వారితో కూడా కాలం గడపాలి, ప్రేమను పంచుకోవాలి. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులులాగా అప్యాయతతో జీవించాలి.

Friday, 27 March 2015

శ్రీ రామ నవమి

* శ్రీ రామ నవమి*
************************
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు  భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.


ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. మద్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ రాముడి కల్యాణం జరుగుతుంది. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు.

సేకరణ: Sahana Meenakshi​ గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో

*ఆయుర్వేద రహస్యం *
*******************************
ఈ రోజు బెల్లం, మిరియాలు కలిపి చేసిన పానకం, వడపప్పు (నానపెట్టిన పెసరపప్పు) నివేదన చేయాలి. దీనికి ఆయుర్వేదంలో ప్రాశస్య్తం ఉంది. రామనవమి వసంత నవరాత్రుల్లో చివరి రోజున చేస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు శిస్రఋతువు ముగుసి వసంతఋతువు ప్రారంభంలో వస్తాయి. ఋతువుమార్పు వలన ప్రజల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. పానకంలో వేసే మిరియాలు ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబులను నివారిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాని మిరియాలకు వేడిని కలిగించే లక్షణం ఉంది, దానికి విరుగుడుగా బెల్లం నీళ్ళు, వడపప్పు పెడతారు. ఇవి చలువ చేస్తాయి. పెరుగుతున్న ఎండల నుంచి తట్టుకోవాలంటే చలువ చేసే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అందుకోసమే వడపప్పు, పానకం నివేదన. కనుక శ్రీరామనవమి రోజు తప్పకుండా వడపప్పు, మిరియాలతో చేసిన బెల్లం పానకం తీసుకోవడం వలన రామనుగ్రహంతో పాటు ఆరోగ్యం రక్షించబడుతుంది.

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు