Monday, 30 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (99)

 

అనేక దేవతల అవసరం


అనేక రుచులను ఇష్టపడతాం. నాటకంలో భిన్న రసాలుంటాయి. అది సంగీతమైతే భిన్నరాగాలుండాలి. కొందరు మండ్రస్థాయిని, కొందరు ద్రుత పద్ధతిని కోరుతారు. అట్లాగే ఉపాసనలో కూడా. సమాధి స్థితి చిట్టచివర దశలోనే. అందరూ ప్రాథమిక దశలో నున్నవారే. అట్టి మహోన్నత సమాధి స్థితి రావాలంటే పరమేశ్వరుని అనుగ్రహం తప్పనిసరి. అతడు నానా రూపాలను ధరిస్తాడు. రకరకాల కోరికలను తీరుస్తాడు. పూజలో కూడా భిన్నంగా ఉంటుంది. ఒక దేవతకు మారేడు, మరొక దేవతకు తులసి, మరొక దేవతకు మోదకం ఇష్టం. భిన్న రుచులతో కూడినది లోకమనే నానుడి యుంది కదా. లోకో భిన్న రుచి:


ఈశ్వరుని లీలలను లెక్కపెట్టలేం. కొందరికి ఇష్టదైవముండి అతణ్ణి కొలుస్తారు. పెక్కుమందిని కొలవనే కొలవరు. తాము కొలిచిన దేవతయే పరమాత్మయని భావిస్తారు. అందుకే సుబ్రహ్మణ్య భక్తులు, దేవీ భక్తులు, శివ భక్తులనే వ్యవహారం ఉంది. పరమాత్మ వీరి భక్తి తీవ్రతను గమనించి అన్ని ఫలాలనిస్తాడు.


ఇట్లా ఇష్ట దేవతయున్నా వినాయకుడే మాత్రం విస్మరించరు. శుక్లాం బరధరం అనకుండా పూజ నారంభించరు.

Sunday, 29 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (98)

ఇట్టి ప్రణాళికలో విఘ్నాలను తొలగించడం అనే పనిని వినాయకునకు ఈశ్వరుడు నిర్దేశించాడు. కనుక వినాయకుడు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. వినాయక రూపంలో విద్యను, భాగ్యాన్ని, విజయాన్ని తిన్నగా ప్రసాదించడు. అట్టి పనులను వివిధ దేవతలకు పరమాత్మ, కేటాయిస్తాడు అయితే తతః హేతున్యాయం ఇక్కడ నప్పుతుందా?


ప్రభుత్వం ఏర్పడినప్పుడు వివిధ శాఖలను వివిధ మంత్రులకు కేటాయిస్తారు కదా! ఏ మంత్రియైనా వివిధ శాఖలను నిర్వహించగలడు. అతనికి అంతకుముందు ఆ విషయం తెలియకపోయినా. అయితే ఒక మంత్రికి కేటాయించిన శాఖలో మరొక మంత్రి తలదూర్చకూడదు. అట్లాగే జగత్ ప్రభుత్వం కూడా దేవతలచే అట్లా నిర్వహింపబడుతుంది. వారి వారి పరిధిలో ఆయా దేవతలు భక్తుల కోరికలను తీరుస్తారు.


ఇది సాధారణ నియమమన్నాను. అంటే ఏదో విశేష నియమం ఉండాలి కదా.


ఒక ప్రత్యేకమైన దేవత - అది వినాయకుడు కావచ్చు, మరొక దేవత కావచ్చు. పరమాత్మ మాదిరిగా ఒక ప్రత్యేక ఫలాన్నే ఈయడమే కాకుండా దేనినైనా ఈయగలడు. ఒక భక్తుడు తన ఇష్ట దైవాన్ని నీవే నాకు ఏకైక దైవం, ఇక ఏ దేవతను కొలవనని భీష్మించుకొని కూర్చుంటే ఆ దేవత, పరమాత్మ మాదిరిగా అన్నిటినీ ఇస్తుంది. తాను పరమాత్మనని ఎఱుక లేని దేవత కూడా, ఇట్టి సర్వార్వణ భావాన్ని అసలు పరమాత్మ గ్రహించి ఈ చిన్న దేవత ద్వారా భక్తుడు కోరిన అన్నిటినీ ప్రసాదింపజేస్తాడు. అది మానవ రూపంలోనూ ఉండవచ్చు. అట్లా సర్వార్పణ భావం, ఒకే దేవతపై గాఢభక్తి కలిగి యుండడం, ఎక్కడో గాని ఉండదు.


Saturday, 28 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (97)

అన్ని ఫలాలూ అతడీయకపోయినా


వినాయకుడు శక్తిమంతుడైనా అతడన్నీ ఈయకుండా, ఉన్న ఆటంకాలను మాత్రమే తొలగిస్తాడని కాసేపు ఊహిద్దాం. మిగతా దేవతలే ఫలాలిచ్చేటట్లుగా చేస్తాడని భావిద్దాం. అతని గురించి ఎట్లా పరదైవమని అంటున్నామో మిగతా దేవతలను వర్ణించేటపుడూ ఎవరికి వారే పరమ దైవాలని పురాణ కథలంటున్నాయి కదా. అదీ సత్యమే. ఒక్క పరమాత్మయే భిన్న దేవతలుగా కన్పిస్తున్నాడు. మనపట్ల కూడా అంతే. మాయ, మనలను కప్పివేయడం వల్ల మనము అఖండాత్మ స్వరూపులమని గుర్తించలేకపోతున్నాం. అయితే దేవతా రూపాలలోనున్న వారు తాము పరమాత్మయనే గుర్తిస్తున్నారు.


ఈ పరమాత్మననే భావన అందరి దేవతలకూ ఉందా? అందుకొందరే భావిస్తున్నారని కొంత వరకే కొందరని ఒక అభిప్రాయముంది. ఇట్టి సందేహం మనం శివుణ్ణి, అమ్మవారిని, విష్ణువుని పూజించినప్పుడు కలగదు. వీరు ముగ్గుర్నీ రత్న త్రయంగా, పూర్ణ బ్రహ్మ శక్తి కలవారుగా అప్పయ్య దీక్షితులు పేర్కొన్నారు. వీరిని పూజించేటపుడు కూడా గణపతిని పూజిస్తాం.


సాధారణ నియమ మేమంటే ఏ దేవత యైనా అది తాను పరమాత్మనని తెలుసుకున్నా, పూర్తి ఫలాన్ని భక్తునకీయకుండా, భక్తుడు కోరినది మాత్రం ప్రసాదిస్తుంది. ఒక పరమాత్మ - భిన్న రూపాల లక్ష్యం ఇది కదా! ఈ సనాతన ధర్మంలో అనేక దేవతలుండాలని రకరకాలుగా అలంకరించి, వివిధ నైవేద్యాలు ఆయా దేవతలకు అర్పించవచ్చని భగవత్రణాళికగా ఉంది.


Friday, 27 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (96)


ఈ శ్లోకంలోని ఉపాసకుడు సామాన్యుడు కాడు. అతడు 'తతః హేతోరితివిత్' అనగా న్యాయం తెలిసినవాడు. తర్కశాస్త్రం బాగా తెలిసిన వాడగుటచే బాగా ఆలోచించి పూర్వాపరాలను వీక్షించి నిర్ణయానికి వస్తాడు. అతడు వినాయకుని పట్ల ఎట్లా ప్రవర్తిస్తాడు?


అందరు దేవతలు ముందు విఘ్నేశ్వరుని పూజిస్తున్నారు. అప్పుడే వారికి ఆటంకాల బాధ ఉండడం లేదు. ఏ దేవతయైనా ఇతణ్ణి పూజించకపోతే ఇతడు వారికి ఆటంకాలను కల్గిస్తాడు. అందువల్ల ఇతని అనుగ్రహం కోసం కొలుస్తున్నారు. అందువల్ల అందరి దేవతలకంటే ఇతడధికుడు, ఫలప్రదాత. గణేశుని నామాలను పరికిస్తే ఇది తేలతెల్లమౌతుంది. 'లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి మొదలైన నామాలు. అనగా లక్ష్మి, సరస్వతి దుర్గ లిచ్చేవన్నీ ఇస్తాడన్న మాట. అంతేకాదు సర్వసిద్ది ప్రద గణపతి అనగా అన్నిటినీ ఈయగలదు. అందువల్లనే చాలా చోట్ల సిద్ధి వినాయక ఆలయాలు వెలిసాయి. అందువల్ల సమస్త దేవతల కంటే ఇతడధికుడని, తెలివైన భక్తుడు, తర్కజ్ఞానం గల భక్తుడు, ఇతజ్ణి ఏకం పరందేవంగా భావిస్తాడు.


ఒక్క విఘ్నేశ్వరుడు అన్నిటినీ ఇచ్చినపుడు మిగతా దేవతలను పూజింప నేల? తతఃహే తో రేవ తతః హేతుత్వే మధ్యే కింతేన? అనగా తతః హేతున్యాయం తెలిసినవాడు అతడు పరమ దైవమని భావించి అతని పూజకే కట్టుబడి యుంటాడు.


తతః హేతోరితి నీతివిదు: భజతే దేవం యం ఏకం పరం


ఇంకా ఏమంటాడు? మామూలు పూజ ఇతనికి చేసి, విస్తారమైన పూజ మిగతా దేవతలకు చేసినా ఇతనికి జరిగిన పూజతోనే సరిబెట్టుకుంటాడు. 


Thursday, 26 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (95)



శ్లోకంలో రెండవ పంక్తిలో ఎవరిని తప్పక పూజించాలో అని ఉంది. మూడవ పంక్తిలో తతః హేతున్యాయం ప్రకారం మహోత్తమ దేవతగా ఎవనిని భావిస్తారో అని ఉంది. ఇందు కూడా ఆ ఒకని గురించి చెప్పలేదు. యం ఏకం పరం అని ఉంది. తేలిందేమిటి? సమస్త దేవతలకు మూలం పరబ్రహ్మం కదా! ఆ మాటను సూచిస్తూ ఏకంపరం ఉంది. ఆ ఒక్కడు, అద్వైతమైన పరబ్రహ్మమే అని చెప్పినట్లైంది. ఆ శ్లోక రచయిత పరవస్తువునే స్తుతిస్తున్నాడు తతః హేతున్యాయం ప్రకారం అతణ్ణే స్తుతిస్తున్నాడు.


శ్లోకం, అతని పేరు చెప్పకపోయినా అతడెవరో మనకు తెలుసు. మన వినాయకుడే. కనుక ఈ న్యాయం చెప్పి బాగా నప్పునట్లు చేసాడు రచయిత.


ఈ న్యాయం తెలిసినవారికి, తెలియనివారికి ఏం జరిగింది?


ఎవరైనా తమ ఇష్టదైవాన్ని ఒక ప్రధాన ప్రయోజనంతో కొలుస్తారు. ఏదైనా ఆటంకం వస్తుందేమోనని శంకిస్తారు. అయితే అట్లా శంకించడం ఆ దేవత పట్ల పూర్తి భక్తి విశ్వాసాలను ప్రకటించడం లేదని మనం నిర్ణయించవచ్చా! ఏదైనా ఆటంకం వస్తే తాను కొలచిన దేవత ఊరకే చూస్తూ కూర్చుంటాడా? అయితే బాధ పడడానికి కారణం ఉంది. పురాణాలు చూస్తే దేవతలు మంచి పనులను చేయాలని సంకల్పించినా ఆటంకాలెదురవడం, తరువాత గణపతి అట్లా చేయడం జరిగినట్లు చదువుకున్నాం. వాళ్ళే భయపడినపుడు మానవ మాత్రులం మనమెంత? పూజకోసం డబ్బు కూడబెట్టడంలో సామగ్రిని సేకరించడంలో, లేదా మనస్సు యొక్క ఏకాగ్రతలో ఆటంకాలు వస్తాయి. కనుక ఇట్టివి తొలగాలంటే దేవతలే పూజించిన గణపతిని మొదటగా ఆరాధిస్తే మంచిదే.

Wednesday, 25 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (94)



పాద పద్మం


పంకం నుండి పుట్టింది పంకేరుహం. పద్మం. మురికిగా నున్న బురదనుండి పుట్టి స్వచ్ఛంగా ఉంటోంది. ఇది ఏమని గుర్తు చేస్తోంది? ఏ స్థితిలో మనిషి పుట్టినా ఉత్తమునిగా తీర్చి దిద్దబడాలని, బడవచ్చని చెబుతోంది. పద్మం నీటిలో పుట్టడం వల్ల నీరజం, అంభోరుహం, సరసిజం అని పేర్లు వచ్చాయి బురదనుండి పుట్టడం వల్ల పంకేరుహమైంది. అట్లాగే సంశయాలతో కూడిన మనస్సు నుండే భగవానుని పాదపద్మం వికసించాలి.


అంతరాయహతయే = విఘ్నాలు పోవడానికి. ఇట్లా గణపతిని పూజించడం మంచికే కాదు, కార్యం తు అవశ్యం విదుః తప్పనిసరి కూడా అని తేలింది.


అందువల్ల ఇక్కడ ఫలానా వాడని చెప్పలేదు. ఆ ఎవరో చెప్పకపోవడం కవులు చేసే చమత్కారం. యత్ పాద పంకేరుహద్వంద్వారాధనం ఎవని పాద పంకేరుహాన్ని పూజిస్తే అన్నారు.


ఇతర దేవతలను పూజించాలన్నా ఆ ఒక్కణ్ణి అని చెప్పడం వల్ల అతని గొప్పదనం తెలియవస్తుంది. ఆ ఒక్కణ్ణి పూజించడం వారి లక్ష్యం కాదు అయినా ఆ ఒక్కణ్ణి పూజించి తీరాలి. ఇది అతని గొప్పదనాన్ని సూచించదా?


ఇతర దేవతలను పూజిస్తే వారికి విఘ్నాలను తొలగించే శక్తి లేదు. విఘ్నేశ్వరునకే అట్టి శక్తి.


Tuesday, 24 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (93)

మరొక ఉదాహరణతో ఈ న్యాయాన్ని వివరిస్తాను. మనకు బియ్యం బస్తాలు కావాలి. అది మన లక్ష్యం అనగా తతః. భూయజమాని దగ్గరే తీసుకొనవచ్చు. కనుక భూస్వామి ఇక్కడే హేతువు. కానీ అది స్థానికమైన కిరాణా వ్యాపారి సిఫార్సు చేస్తేనే ఇస్తాడు. ఈ కిరాణా వ్యాపారి ఎవరి సిఫార్సు అక్కఱలేకుండానే మనకిస్తాడు. కనుక ఇతడు మనకు ప్రత్యక్ష హేతువు. అటువంటప్పుడు ఇతని దగ్గరకే వెళ్ళి తీసుకోవచ్చు కదా. మధ్యలో భూ యజమాని ఎందుకు? ఇక్కడున్న దీపంలో చాలా వత్తులున్నాయి. తూర్పువైపు వెలుగు రావాలని అనుకున్నామనుకోండి. ఆ వైపున ఉన్న వత్తిని వెలిగిస్తే సరిపోతుంది. ముందు పడమరవైపు వెలిగించు, దానితో తూర్పువైపున ఉన్న దానిని ముట్టించని ఎవరైనా అంటారా? (అందరూ నవ్వారు) అట్లా తతః హేతుత్వేమధ్యే కింతేన ఈ న్యాయంతో ఆ శ్లోకంలోని గణపతిని ఎందుకు పూజించాలో చెబుతాను.


చదువుకై సరస్వతిని; డబ్బుకై లక్ష్మిని మొదలైనవి పూజించాలని చెప్పాను. వివిధ ఫలాలు కావాలంటే వివిధ దేవతలను పూజిస్తున్నాం. అయితే ఏ దేవతను పూజించినా ముందు గణపతినే పూజిస్తారెందుకు? ఇతర దేవతలను పూజించడంలో విఘ్నాలు రాకుండా ఉండడానికి అదే శ్లోకం ప్రథమ భాగంలో ఉన్నది.


అప్యన్యామరమారిరాధ యిషతా..


శ్లోకం మొదట్లో 'అపి' అని ఉంది. అంటే ఏదో చెప్పబోతున్నాడు. కుతూహలం ఏర్పడుతోంది కదా.


మిగతా దేవతలను పూజించేవారేమి చేస్తారు? వారిని పూజించేటపుడు కూడా ఆటంకాలు రాకుండా ఉండడానికి ఒకని పాద పద్మాన్ని అనగా గణపతిని పూజించాలి కదా, అదే సంస్కృతంలో యత్ పాదపంకే రుహ ద్వంద్వారాధనం, అంతరాయ పతయే కార్యం త్వవశ్యం విదుః అని ఉంది. పాదద్వంద్వం అంటే రెండు పాదాలను.