Friday 27 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (96)


ఈ శ్లోకంలోని ఉపాసకుడు సామాన్యుడు కాడు. అతడు 'తతః హేతోరితివిత్' అనగా న్యాయం తెలిసినవాడు. తర్కశాస్త్రం బాగా తెలిసిన వాడగుటచే బాగా ఆలోచించి పూర్వాపరాలను వీక్షించి నిర్ణయానికి వస్తాడు. అతడు వినాయకుని పట్ల ఎట్లా ప్రవర్తిస్తాడు?


అందరు దేవతలు ముందు విఘ్నేశ్వరుని పూజిస్తున్నారు. అప్పుడే వారికి ఆటంకాల బాధ ఉండడం లేదు. ఏ దేవతయైనా ఇతణ్ణి పూజించకపోతే ఇతడు వారికి ఆటంకాలను కల్గిస్తాడు. అందువల్ల ఇతని అనుగ్రహం కోసం కొలుస్తున్నారు. అందువల్ల అందరి దేవతలకంటే ఇతడధికుడు, ఫలప్రదాత. గణేశుని నామాలను పరికిస్తే ఇది తేలతెల్లమౌతుంది. 'లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి మొదలైన నామాలు. అనగా లక్ష్మి, సరస్వతి దుర్గ లిచ్చేవన్నీ ఇస్తాడన్న మాట. అంతేకాదు సర్వసిద్ది ప్రద గణపతి అనగా అన్నిటినీ ఈయగలదు. అందువల్లనే చాలా చోట్ల సిద్ధి వినాయక ఆలయాలు వెలిసాయి. అందువల్ల సమస్త దేవతల కంటే ఇతడధికుడని, తెలివైన భక్తుడు, తర్కజ్ఞానం గల భక్తుడు, ఇతజ్ణి ఏకం పరందేవంగా భావిస్తాడు.


ఒక్క విఘ్నేశ్వరుడు అన్నిటినీ ఇచ్చినపుడు మిగతా దేవతలను పూజింప నేల? తతఃహే తో రేవ తతః హేతుత్వే మధ్యే కింతేన? అనగా తతః హేతున్యాయం తెలిసినవాడు అతడు పరమ దైవమని భావించి అతని పూజకే కట్టుబడి యుంటాడు.


తతః హేతోరితి నీతివిదు: భజతే దేవం యం ఏకం పరం


ఇంకా ఏమంటాడు? మామూలు పూజ ఇతనికి చేసి, విస్తారమైన పూజ మిగతా దేవతలకు చేసినా ఇతనికి జరిగిన పూజతోనే సరిబెట్టుకుంటాడు. 


No comments:

Post a Comment