Sunday 29 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (98)

ఇట్టి ప్రణాళికలో విఘ్నాలను తొలగించడం అనే పనిని వినాయకునకు ఈశ్వరుడు నిర్దేశించాడు. కనుక వినాయకుడు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. వినాయక రూపంలో విద్యను, భాగ్యాన్ని, విజయాన్ని తిన్నగా ప్రసాదించడు. అట్టి పనులను వివిధ దేవతలకు పరమాత్మ, కేటాయిస్తాడు అయితే తతః హేతున్యాయం ఇక్కడ నప్పుతుందా?


ప్రభుత్వం ఏర్పడినప్పుడు వివిధ శాఖలను వివిధ మంత్రులకు కేటాయిస్తారు కదా! ఏ మంత్రియైనా వివిధ శాఖలను నిర్వహించగలడు. అతనికి అంతకుముందు ఆ విషయం తెలియకపోయినా. అయితే ఒక మంత్రికి కేటాయించిన శాఖలో మరొక మంత్రి తలదూర్చకూడదు. అట్లాగే జగత్ ప్రభుత్వం కూడా దేవతలచే అట్లా నిర్వహింపబడుతుంది. వారి వారి పరిధిలో ఆయా దేవతలు భక్తుల కోరికలను తీరుస్తారు.


ఇది సాధారణ నియమమన్నాను. అంటే ఏదో విశేష నియమం ఉండాలి కదా.


ఒక ప్రత్యేకమైన దేవత - అది వినాయకుడు కావచ్చు, మరొక దేవత కావచ్చు. పరమాత్మ మాదిరిగా ఒక ప్రత్యేక ఫలాన్నే ఈయడమే కాకుండా దేనినైనా ఈయగలడు. ఒక భక్తుడు తన ఇష్ట దైవాన్ని నీవే నాకు ఏకైక దైవం, ఇక ఏ దేవతను కొలవనని భీష్మించుకొని కూర్చుంటే ఆ దేవత, పరమాత్మ మాదిరిగా అన్నిటినీ ఇస్తుంది. తాను పరమాత్మనని ఎఱుక లేని దేవత కూడా, ఇట్టి సర్వార్వణ భావాన్ని అసలు పరమాత్మ గ్రహించి ఈ చిన్న దేవత ద్వారా భక్తుడు కోరిన అన్నిటినీ ప్రసాదింపజేస్తాడు. అది మానవ రూపంలోనూ ఉండవచ్చు. అట్లా సర్వార్పణ భావం, ఒకే దేవతపై గాఢభక్తి కలిగి యుండడం, ఎక్కడో గాని ఉండదు.


No comments:

Post a Comment