Thursday 21 November 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - వేంకటేశ్వరునికి పెళ్ళి సంబంధం మాట్లాడుట

ఓం నమో వేంకటేశాయ

పెళ్ళి సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతున్న వకుళమాతతో శ్రీనివాసుడు " అమ్మా! నువ్వు వెళ్తున్న దారిలో వచ్చే కపిల తీర్ధంలో స్నానం చేసి, కపిలేశ్వరుని దర్శనం చేసుకుని, ఆయనకు నమస్కారం చేసి, అటుపై పద్మతీర్ధంలో శ్రీ శుకాచార్యులు ప్రతిష్టించిన బలరామకృష్ణులను దర్శించుకునిం వారి అనుగ్రహం పొంది, అగస్త్యముని ఆశ్రమంలో అగస్త్యునిచే పర్తిష్టిమపడి, పూజింపబడిన అగస్తేశ్వరుడిని (శివుడు) అనుగ్రహం పొంది, దారిలో కనిపించే ఋషులకుం, మునులకు నమస్కారం చేసి, ఆశీర్వాదం పోందుతూ ముందుకు వెళ్తే కార్య సిద్ధిస్తుంది " అని పలుకుతాడు. ఒక గుర్రాన్ని సృష్టించి, దానిపై వెళ్ళమంటాడు.

కార్యం సిద్ధించడమేమిటి, స్వామి ఉండగా విఫలమవుతుందా? మరి ఎందుకు నమస్కరించమన్నాడు? ...... మన కోసం, మనకు సందేశం ఇవ్వడం కోసం. మనం కూడా అనేక పనుల మీద నిత్యం బయటకు వెళుతుంటాం. దారిలో ఎన్నో దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. మనం మన పని తొందరలో ఉండి, వటిని పట్టించుకోము. మనం ఎప్పుడు దైవానికి నమస్కరించినా, దైవం నుంచి వచ్చే శక్తి తరంగాల వలన మన బుద్ధి మంచి మార్గంలో నడవడానికి ప్రేరణ పొందుతుంది, మనం వెళుతున్న కార్యంలో విజయం పొందేందుకు దోహద పడుతుంది. పెద్దవాళ్ళు, జ్ఞానులు, బ్రాహ్మణులు, వేదపండితులు కనిపించినప్పుడు వారికి
కూడా నమస్కరించాలి. పెద్దల ఆశీర్వాదం ఉంటే పెద్ద పెద్ద గండాల నుంచి సులువుగా గట్టెక్కవచ్చు. మార్కండేయుడు పెద్దల ఆశీర్వాదం పొందడం వల్లనే, మృత్యువు జయించడానికి, శివపూజ చేయాలన్న సలహా లభించింది. పూజించాడు, శివుడిని మెప్పించి, దీర్గాయుషును పొందాడు. అందువల్ల ఎప్పుడైనా, మనం వెళ్ళె మార్గంలో దేవాలయాలు, జ్ఞానులు, సన్యాసులు కనిపిస్తే, తప్పక నమస్కారం చేయాలి. ఒకవేళ మనమే వాహనం నడుపుతుంటే, అప్పుడు మనసులో నమస్కారం చేయాలి ఎందుకంటే ఎప్పుడు ఒక్కో చేతితో నమస్కారం చేయకూడదు, అది ధర్మం అంగీకరించదు, తప్పు కూడా.

శ్రీ నివాసుడు చెప్పినట్టుగానే, వకుళమాత అగస్తేశ్వర ఆయలం చేరుకుని పూజ, అభిషేకం చేయిస్తుంటుంది. . ఇంతలో అక్కడికి ఆకాశరాజు పరివారం, పద్మావతిదేవి చెలికత్తెలు వస్తారు. (అగస్తేశ్వర ఆలయం తిరుపతికి దగ్గరలో, శ్రీనివాసమంగాపురం దగ్గర ఇప్పటికి ఉంది. అక్కడ స్వర్ణముఖి నదిలో విష్ణుపాదం కూడా ఉన్నది).

పద్మావతీదేవి చెలికత్తెలు, ఆమె పరివారం అగస్త్యేశ్వరునికి పూజలు చేయిస్తుండగా, వకుళమాత చూస్తారు. విషయమేమిటని అడుగగా, 'మా రాకుమార్తె పద్మావతీదేవీ ఉయానవనంలో ఒక యువకుడిని చూసి, జడుసుకుని, భయంతో జ్వరం పట్టింది. కారణం తెలియని తండ్రి ఆకాశరాజు తన గురువైన బృహస్పతిని సంప్రదించగా, అగస్త్యేశ్వర ఆలయంలో ఈశ్వరునకు అభిషేకం చేయిస్తే, ఆమె మనసులో ఉన్న సంకర్షణ తొలిగి కుడుటపడుతుందని సలహా ఇచ్చారు. ఆమె తరుపున మేమీ ఆలయానికి వచ్చి, పూఝ చేయిస్తున్నాము్" అంటూ వారు సమాధానం ఇస్తారు.

వారు వకుళమాతను మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటూ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా, తన పేరు వకుళ అని, వరాహస్వామి ద్వారా శ్రీ నివాసుడికి సేవ చేసే భాగ్యం కలిగిందని, వేంకటాచలం దగ్గర ఉంటున్నామని చెప్తుంది.

తాను ఎలాగూ ఆకాశరాజు ఇంటికి వెళుతోంది. భగవత్సంకల్పం వల్ల ఎదురుపడిన ఆకాశరాజు పరివారంతో తాను కూడా, నారాయణపురం వెళ్ళి, ఆకాశరాజును ధరణీదేవిని కలుసి మాట్లాడవలసిన పని ఒకటి ఉందని చెప్పి, వారితో తీసుకువెళ్ళమంటుంది.

వకుళమాత నారాయణపురం వెళ్ళెలోపు, తాను ముందే అక్కడికి వెళ్ళి, రంగం సిద్ధం చేస్తే, కార్యం త్వరగా పూర్తవుతుందని భావించిన శ్రీ నివాసుడు, ఎరుకలసాని వేషం ధరించి, సోది చెప్పడానికి బయలుదేరతాడు.

ఒక ముసలి ఎరుకలసాని వేషంలో, చిరిగిన చీర, గురిగింజలు మాలలు ధరించి, బ్రహ్మాండాన్నే వెదురుబుట్టగా తలపై పెట్టుకుని, బ్రహ్మదేవిడిని చిన్న శిశువుగా తన చీరకొంగులో వ్రేలాడదీసుకుని, రుద్రుని చేతికర్రగా పట్టుకుని నారాయణపురం వీధులలో ప్రవేశిస్తాడు.    

సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను, జరిగింది చెబుతాను, జర్గేది చెబుతాను, జరగబోయేది చెబుతాను అని గట్టిగా అరుచుకుంటూ శ్రీనివాసుడు ఎరుకలసాని రూపంలో నారయణపురం వీధుల్లో తిరుతున్నాడు. ఈ ఎరుకలసాని విషయం ఆకాశరాజు భార్య ధరణీదేవి పరిచారికలు చూసి, ఆమెకు చెప్తారు. పద్మావతీదేవికి బాలేదు, విషయం అడిగితే ఏదైన పరిష్కారం చూపెడుతుందేమొనని ఆమెను పిలుచుకు రమ్మంటుంది. ఎరుకలసానిని రాజమహలుకు తీసుకురావడానికి దాసీజనం వెళ్ళగా, రానని మొండికేస్తుంది. "నన్ను అవహేళణ చేయడానికి పిలుస్తున్నారా? లేక నిజంగా చెప్పినుకోవాలనుకుంటున్నారా? నన్ను గౌరవిస్తారా?" అంటూ ప్రశ్నలు అదిగి, గౌరవంగా చూస్తామన్న హామీ ఇచ్చాకా రాణి అంతఃపురానికి వస్తుంది.

ముంది ధరణిదేవిని శుచిగా స్నానం చేసి రమ్మంటుంది. తరువాత ఒక పెళ్ళెంలో బియ్యం తీసుకురమ్మంటుంది. బియ్యం తెచ్చి ముందు పెట్టిన తరువాత 'కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు.......... అంటూ దేవతనామస్మరణ చేస్తుంది ఎరుకలసాని. సకలతీర్ధాలు, పుణ్యక్షేత్రాల స్మరణ చేస్తుంది. బ్రహ్మ మొదలైన దేవతల మీద, ఆసేతుహిమాచలం ఉన్న పుణ్య క్షేత్రాల మీద, నదీనదాల మీద, తన బిడ్డ మీద ప్రమాణం చేసి అంతా సత్యమే పలుకుతాను అంటుంది.

'నీ కూతురు పద్మావతీదేవి ఉద్యానవనంలో ఒక యువకుడిని చూసి మోహించినాదమ్మ. ఈమెకు కామజ్వరం వచ్చినాది. అతనితో లగ్గం పెడితే (పెళ్ళి చేస్తే) బ్రతుకుతాది, లెకుంటే సచ్చిపోతాదమ్మ' అంటూ రాణికి చెబుతుంది.

ధరణీదేవి చాలా బాధపడుతుంది. "అతనికిచ్చి పెళ్ళి చేయమంటావు. సరే అనుకుంటే వెంటనే చేయకపోతే చనిపోతుండంటావు. అతనెర్వరి, ఎక్కడ ఉంటాడో, అతని వివరాలు ఏమి తెలియకుండా పెళ్ళీ చేయడం ఎలా? ఇప్పుడే చేయాలంటే నేనేం చేయగలను?" అని ప్రశ్నిస్తుంది ధరణిదేవి. నీ కూతురి ఆరోగ్యం కుదుటపడి, నీ బాధ తగ్గాలంటే, అతనిచ్చి వివాహం చేస్తానని ఇప్పుడె సంకల్పం చేయ్యి. అలా చేసినవెంటనే నయమవుతుందుఇ" అంటుంది ఎరుకలసాని.

ఈ ఎరుకలసాని సోది చెబుతున్న సమయంలో ఆమె పిల్లవాడు ఏడుపు మొదలుపెడతాడు. "ఈడు (వీడు) ఎప్పుడు ఇంతేనమ్మ, ఎప్పుడు ఆకలే ఈడికి, నా పిల్లోడు తినటానికి వండినదైన, వండనిదైనా, ఏదైనా సరే, మీ దగ్గర ఉన్న ఆహారం ఇప్పించండమ్మ" అంటుద్ని ఎరుకలసాని. వెంటనే బంగారుపళ్ళెంలో పాలతో ఉడికించిన పాయసం తెప్పిస్తుంది ధరణీదేవి. ఎరుకలసాని ఎంత తినమని చెప్పినా, పాయసం ముట్టుకోడు పిల్లవాడు. తిననని మారాం చేస్తాడు. ఇక కోపగించుకున్న ఎరుకలసాని పిల్లవాడితో "ఎవరు మాత్రం ఏం చేస్తారు. కందమూలాలలు, ఆకులు అలమలు తినే నీకు ఈ పాయసాన్నం తినే అదృష్టం ఉండాలి కదా" అంటూ తానే పాయసం తినేస్తుంది.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. బ్రహ్మదేవుడు కూడా పరమాత్మకు నైవెధ్యం సమర్పించకుండా భోజనం చేయడని. నివేదనకు అర్దం భగవంతునకు సమర్పించడం. ఈ భగవతర్పణ వలన అహకారం నశిస్తుంది. మనం పదేపదే 'నాకు ఎవరో అన్నం పెట్టడం లేదు, నా భోజనం నేనే తింటున్నా, ఇది నేను సంపాదించుకున్నా, ఇదంతా నాది, నాది నేను తింటున్నప్పుడు, ఇంకొకడికి సమాధానం చేప్పెదేమిటి? " ఇలా అనేక మాటలు అనుకుంటాం. నిజానికి భగవంతుని అనుగ్రహం ఉంది కనుక తినగలుగుతున్నాం. ఆహారం ప్రకృతి నుంచి వస్తుంది. ప్రకృతియే దైవస్వరూపం. ప్రకృతి ద్వారా అన్నాన్ని మనకు ఇస్తున్నవాడు పరమాత్మ.

కాదండీ, మేము డబ్బుతో కొనుక్కుంటున్నాం అంటారా ........... డబ్బు ఉన్న తినలేని స్థితిలో ఎందరో ఉన్నారు. కొందరికి కోట్లు ఉంటాయి కానీ, లోపలకి ఆహారం తీసుకుంటే అరగక కక్కేస్తారు, కాబట్టి పైపుల ద్వారా అన్నాన్ని ద్రవాహారంగా మార్చి శరీరంలోనికి పంపిస్తారు. ఎన్ని కొట్లు ఉండి ఏం లాభం? కడుపు నిండుగా తినడానికి అవకాశం లేనప్పుడు. ఆ అవకాశం మనకు పరమాత్ముడు ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా 'ఓ పరమాత్మ! ఈ ఆహారం నీదే. ఈ ఆహారానివి కూడా నీవే. ఇది నాకు దక్కడానికి కారణం నీవు, ఇది నేను తిన్నాకా, లోపల జీర్ణం చేసేది నీవు, జీర్ణమైన ఆహారం నుంచి ఈ దేహానికి లభించే శక్తి కూడా నీవే. అన్నీ నీవే, అంతటా నీవే, కనుక సర్వం నీకే సమర్పిస్తున్నా, నీ దయతో ఈ ముద్ద తింటున్నా, ఇది నీ బిక్ష స్వామి' అనే భావమే నివేదన. ఇక్కడ ఇక అహంకారానికి చోటు ఉండడు.  

నైవేద్యం ఆహారంలోని దోషాలను తీసివేస్తుంది. నివేదన చేసిన పదార్ధం అమృతతత్త్వాన్ని సంతరించుకుంటుంది. పూతన విషం నిండిన పాలతో కూడిన తన స్తన్యములను చిన్న కృష్ణుడికి ఇస్తుంది. ఆయన అది నివేదనగా భావించాడు. కృష్ణుడు ఒక్క గుక్కలో ఆమె దేహంలో ఉన్న విషంతో పాటు ఆమె శక్తిని, రాక్షసత్వాన్ని త్రాగేస్తాడు. ఆమెకు మొక్షాన్ని ప్రసాదించాడు.

ఇక రెండవది. తల్లిదండ్రులకు భోజనం పెట్టకుండా మనం తినడం తప్పు. చిన్నప్పటి నుంచి మనల్ని మన తల్లిదండ్రులు ఎంతో కష్టాలు ఓర్చి, పెంచి, పోషించారు. మన పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవించడానికి, పరమాత్మను చేరడానికి ఈ శరీరాన్ని ఇచ్చారు అమ్మనాన్నలు. వారి ఋణం ఎప్పటికి తీర్చుకోలేము. వారు బ్రతికి ఉన్నంతకాలం వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం. వారి తినలేకపోతే, మనమే తినిపించాలి. అందుకే బ్రహ్మదేవుడు కూడా తన తండ్రి తినకుండా తాను తినడం ఇష్టం లేదు కనుక, ముందు తల్లిదండ్రుల కడుపు నింపండి అన్న సందేశం లోకానికి ఇవ్వాలి కనుక తాను, ఆకలి అని ఏడ్చి, పాయసం తాను తినకుండా విష్ణుమూర్తితో తినిపించాడు.

ధరణీదేవికున్న అనుమానాల నివృత్తి కోసం కొన్ని ఎరుకలసానిని "ఎవరూ పిల్లను అడగకుండా కన్యాదానం ఏల చేస్తాం, వరుడు ఎవరో తెలియకుండా, వరుని తరుపువారు అడగకుండా ఉంటే మీమేం చేయాలి?" అంటూ అడుగుతుంది. మేరేమి కంగారు పడకండి. నేను వెళ్ళినకాసేపటికి ఒక వృద్ధురాలు పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వస్తుంది. పద్మావతీదేవి ఉద్యానవనంలో ఎవరిని చూసి మోహించిందో, ఎవరి కోసం తపిస్తోందో, నీవు ఎవరికిచ్చి వివాహం చేస్తానని సంకల్పం చేశావో, అతని తరుపునే వస్తుంది. ఆమె తెచ్చిన సంబంధానికి ఒప్పుకోండి అని చెప్పి ఎరుకలసాని వెళ్ళిపోతుంది. రాణి వెళ్ళి తన కూతురు పర్మావతితీ మాట్లాడి, ఆమెకు ఆ పురుషుని మీద ప్రేమ ఉందని, పద్మావతీదేవి జ్వరానికి కారణం అతనే అన్న సంగతి తెలుసుకుంటుంది.

కొంత సమయం తరువాత అక్కడికి రాణిగారి పరిచారికల ద్వారా వకుళమాత రావడం, ధరణీదేవిని కలవడం, ఆమెతో మాట్లాడడం జరుగుతుంది. వకుళమాత నుంచి సమాచారం అంతా తెలుసుకున్న ధరణీదేవి విచారామగా ఉండడం గమనించిన ఆకాశరాజుకు ఏమి చేయాలో తోచదు. తన గురువు అయిన బృహస్పతికి విషయం చెప్తే, ఆయన తగిన మార్గం సూచిస్తారని తలచి, బృహస్త్పతిని తీసుకురావడం కోసం తన కొడుకైన వసుదను స్వర్గలోకానికి పంపిస్తారు.

క్షణంలో గురువుతో ప్రత్యక్షమవుతాడు వసుద. గురువంటేనే సర్వజ్ఞుడు, ఆయనకు తెలియంది ఏముంటుంది? తన దివ్యదృష్టితో విషయం తెలుసుకున్న బృహస్పతి, భవంతునకు వివాహం చేసే అవకాశం మళ్ళీమళ్ళీ రాదని మనసులో తలచి, తప్పకుండా ఒప్పుకుని కన్యాదానం చెయమంటాడు. అయినా, మళ్ళి బృహస్పతి కల్పించుకుని 'నేను అంత జ్ఞానిని కాదు. భగవంతుని గురించి నాకంటే బాగా తెలిసిన శ్రీ శుకాచార్యులవారిని సంప్రదిస్తే బగుంటుంది, వారు పద్మసరోవరం దగ్గరే ఉంటారు' అని చెప్తారు. వెంటనే శ్రీ శుకులవారిని పిలుచుకురమ్మని, ఆకాశరాజు తన తమ్ముడైన తొండమానునికి చెప్తాడు.      

భగవంతుడి కల్యాణవార్త వినగానే శుకుడు ఆనందంతో పరవశించిపోతాడు. కమండలం విసిరేసి, కృష్ణాజినం లాగేసి, కట్టుకున్న నారవస్త్రాలు తిసేసి ఉన్మత్తునిలా నాట్యం చేస్తారు. వెంటనే బయలుదేరి ఆకాశరాజుతో సూదోర్హంగా మాట్లాడుతారు. సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడే శ్రీనివాసుడని, లోకైకనాధుడైన, ఆఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడని చెప్పి, వివాహం ఒప్పుకోమని ఆకాశరాజుకు చెప్తూనే, లోకానికి సందేశం ఇవ్వడం కోసం, వివాహం విషయంలో ఆడపిల్ల తండ్రి తీసుకోవలసిన జాగ్రత్తలను పూసిగుచ్చి వివరించారని పురాణం చెప్తున్నది.

వకుళాదేవి ద్వారా శ్రీనివాసుడి కులగోత్రాలు, నక్షత్రం, జాతకం తల్లిదండ్రులు, బంధుమిత్రుల వివరాలు అడిగి తెలుసుకుంటాడు. స్వామిది శ్రవణా నక్షత్రమనీ, దేవకీవసుదేవులు తల్లిదండ్రులనీ, మిగితా విషయాలను కూడా వకుళమాత చెప్తుంది. మధ్యలో ఆవిడ శుకబ్రహ్మతో 'స్వామీ! మీకు తెలియదా కృష్ణుడి గురించి? నన్ను అడిగి తెలుసుకోవాలా? అంటుంది. వ్యాసుడు శ్రీ మద్భాగవతం రాస్తే, శుకుడు దాన్ని ప్రచారం చేశాడు. భాగవత ప్రచారం చేసిన శుకుడికి కృష్ణుడి గురించి తెలియకపోవడమేమిటి? అందుకే వకుళమాత ఈ ప్రశ్న అడిగింది.

అమ్మా! ఆయన గురించి నీకు తెలుసు, నాకూ తెలుసు, కానీ లోకం కోసం చెప్పించాలి కదమ్మా! అందుకే అంటారు. ఇంతలో దేవకీదేవికి ఒప్క అనుమానం వస్తుంది. ఎంతైనా తల్లి కదా, బిడ్డల జీఇతం కోసం పడే ఆరాటం అటువంటిది.

అబ్బాయికి 24 ఏళ్ళు వస్తున్నాయి అన్నారు, మంచి గుణవంతుడు, అయినా ఇంకా వివాహం ఎందుకు కాలేదు? ఏదైనా లోపం ఉందేమొ? అనుకుని, ఇదే విష్యం వకుళమాతను అడుగుతుంది. అప్పుడు వకుళమాత 'అదేం లేదమ్మ! మా వాడికి ఇంతకముందే వివాహం జరిగింది. కానీ, సంతానం కలుగలేదు.అందుకే మళ్ళీ పెళ్ళి చేస్తున్నాం అంటుంది.

ఇద్దరి జాతకాలు సరిపోయాయని నిర్ధారించి ఆకాశరాజును సంబంధానికి ఒప్పిస్తారు. వివాహానికి అంగీకరించినట్లు శ్రీనివాసుడికి తెలియజేసేలా ఒక లేఖను రాయిస్తారు బృహస్పతి, శుకబ్రహ్మ.

ఎంతో మర్యాదతో, అత్యంత గౌరవంతో, తానూ లేఖ రాస్తున్నది సాక్షాత్తు దేవదేవుడైన శ్రీనివాసునకు అన్న విషయం తెలిసిన ఆకాశరాజు అందులో భక్తి కూడా జోడిస్తాడు. ఎవరి ద్వారానో పంపితే బాగుండదని, శుంక మహర్షి చేత లేఖ పమించాలనుకుంటాడు. శుకుడు వెంటనే ఆనందంతో ఒప్పుకుంటాడు. భగవంతుని దర్శనం లభిస్తుంటే అంతకంటే ఆనందం ఏముటుంది.

శ్రీనివాసుడు ఇంట్లో చాలా ఆదుర్దాగా ఎదురు చూస్తుంటాడు. సంబంధం మాట్లాడడానికి వెళ్ళిన వకుళమాత ఇంకా రాలేదేమిటి? ఆకాశరాజు వివాహానికి ఒప్పుకున్నాడా లేదా? ఇంత ఆలస్యం ఎందుకైంది? అని అలోచిస్తూ, దిగులుగా కుర్చుని ఉంటాడు. ఏమి తలియని వాడిలా, శుకుడు వెళ్ళగానే, దూరం నుంచే, కాయా? పండా? అని ప్రశ్నిస్తాడు. ఆయన జగన్నాటక సుత్రధారి, జగత్తు అనే ఒక మహానాటకాన్ని నడుపుతున్నాడు, ఇది కూడా అలాంటిదే. శుకుడు పండేనంటాడు.

మంచి కబురు చెప్పారు అంటూ శుకుడిని ఆలింగనం చేసుకుంటాడు. రామావాతారంలో సీతమ్మ జాడ చెప్పిన ఆంజనేయస్వామినే ఆలింగనం చేసుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు శుకుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆయన్ను ఆలింగనం చేసుకునే భాగ్యం అందరికి దక్కదు. ఆకాశరాజు పంపిన లేఖను ఆనందంతో స్వీకరించి, గౌరవంగా తలపై పెట్టుకుని, చాలా ఆనందపడుతూ, సంతోషం పట్టలేక గంతులేస్తాడు. ఎంతైనా ప్రేమ వివాహం సఫలం అవుతోంది కదా, మరి ఆ మాత్రం ఆనందం ఉండదా చెప్పండి!?

ఆకాశరాజు రాసిన పత్రానికి సమాధానంగా శ్రీనివాసుడు ప్రత్యుత్తరం రాస్తాడు. ఎంతో వినయంగా ఉంటుంది ఆ లేఖ. వైశాఖ శుద్ధ దశమి వివాహానికి ముహూర్తమని, పెళ్ళికి తరలి వస్తున్నానని చెప్పి రాసి, శుకుడికిచ్చి పంపిస్తాడు.

శుకుడు వెళ్ళగానే వకుళమాత వస్తుంది.

వకుళమాత చాలా సంతోషంతో వచ్చి, సంబంధం కుదిరిందనీ, ఆకాశరాజు పద్మావతీ దెవిని ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడని ఉత్సాహంగా చెప్తుంది. ఈ విషయం ముందే తెలిసినా, శ్రీనివాసుడు ఆమెను కించపరచలేదు. అమ్మ కళ్ళలో ఆనందం చూడాలి అనుకున్నాడు. బిడ్డల యొక్క ప్రధాన కర్తవ్యం తల్లిదండౄలను సంతోషంగా ఉంచడమే. అందుకే శ్రీనివాసుడు ఏమి తెలియనివాడిలా, ఆమె చెప్పవనీ ఆసక్తితో విన్నాడు. ఆమెయే కార్యాన్ని సాఫల్యం చేసిందనీ కృతజ్ఞతలు చెప్పాడు. ఆమె ఎంత ఉత్సాహంతో చెప్తుందో, అంతకంటే మికిలి ఉత్సాహంతో విషయాలు వింటూ ఆమెను ఆనందపరుస్తాడు. ఆమె చెప్పిందంతా వింటాడు.

కాసేపటికి 'అమ్మ! నాకీ పెళ్ళి వద్దు. నేను ఈ పెళ్ళి చేసుకోను. ఈ వివాహం జరగడం సమంజసం కాదు' అంటాడు. వకుళమాతకు మతిపోతుంది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపొతుంది. తరువాత 'అదేంటి నాయనా! పోయిన జనంలో నీవు ఎన్ని వివాహాలు చేసుకున్నా, ఒక్కటి చూసే భాగ్యం కలుగలేదు. నీ వివాహం చూపిస్తానని వరం ఇచ్చావు. ఈ జన్మ కోసం, నీ వివాహం చూడడం కోసం ఎంతో తపస్సు చేశాను. ఇంత ప్రయత్నం చేసి, పద్మావతీదేవి పరివారాన్ని ఒప్పించి, నీ పెళ్ళికి సిద్ధమవుతున్న సమయంలో కాదనటం సరికాదు. అయినా నీవు పెళ్ళి వద్దనడానికి కారణం ఏమిటి? పిల్ల నీకు నచ్చింది, నివు పిల్లకు నచ్చావు, ఇప్పుడీ ఆలోచనలేమిటయ్యా?' అంటుంది వకుళమాత.

అమ్మా! ఆకాశరాజు మహారాజు. బోలెడు పరివారం ఉంది. ఎంతో ఆస్తి ఉంది. అనేకమంది బంధువులు, స్నేహితులు ఉన్నారు, అధికారం ఉంది. మరి నా సంగతి? నాకు ఎవరున్నారు? నేనూ, నువ్వు తప్ప పెళ్ళికి వెళ్ళటానికి ఇంకెవరు ఉన్నారు? వియ్యానికైనా, కయ్యానికైనా సమఉజ్జీలై ఉండాలి. పరస్పరం వ్యతిరేకుల మధ్య వివాహం మంచిది కాదు. చూసినవారు ఏమంకుంటారు చెపు. పెళ్ళికొడుకు వాళ్ళు దరిద్రులు అనుకుంటారు. ఎంత అవమానం అంటాడు.

ఇది వకుళమాత జ్ఞానానికి, భక్తికి పరీక్ష. తాను ఎవరికి సేవ చేస్తోందో, ఎందుకు చేస్తోందో బాగా తెలుసు. అందుకే 'నాయనా! మళ్ళీ నన్ను మాయలో పడేద్దాం అనుకుంటున్నావా? నాకు నీ గురించి తెలియదనుకుంటున్నావా? నువ్వు 14 లోకాలకు ప్రభువువి, అంతటా వ్యాపించి ఉన్న పరమోత్కృష్ట తత్వానివి, చక్రవర్తులకే చక్రవర్తివి,దేవదేవలలో ఉత్తముడివి, ఆకిలాండకోటి బ్రహ్మాండా నాయకుడివి, ఆదిమద్యానరహితుడివి. ఆకాశరాజు పేరుకు మాత్రమే ఆకాశరాజు. ఎవరికి ఏది కావాలన్న నువ్వు అనుగ్రహించలసిందే. ఎవరికి ఏది ఉన్నా, అది నీ ప్రసాదమే. నువ్వు తల్చిన్న మరుక్షణం నీ ముందు దేవతలు చేతులు కట్టుకుని నిల్చుంటారు. నీకు సేవ చేయడానికి పూనుకుంటారు. నువ్వే ఐశ్వర్య కారకుడివి, లక్ష్మీపతివి, ఐహిక సుఖాలతో పాటు పరలోకపు సుఖాలను కూడా ప్రసాదించగలిగినవాడవి. పద్మావతీదేవిని, ఆకాశరాజు దంపతులను, నా వంటివారిని, నీ భక్తులను ...... ఇలా అనేకులను తరింపజేయడానికే కదా నీ ఈ లీలలు. కనుక ఇప్పటికైనా నీ ఆటలు మాని నన్ను అనుగ్రహించవయ్యా!' అంటుంది వకుళమాత.

ఇద్దరూ నిజమే చెప్పారు. ఆయనకు తల్లిదండ్రులంటూ ఎవరూ లేరు. 'అజాయమానో బహుదావిజాయతే' - పుట్టక అంటూ లేనీవాడు, ఎవరికి పుట్టని వాడు అనేక రూపాల్లో తనని తాను సృజించుకుంటాడు, రూపొందించుకుంటాడు, ఒక ఆకృతిని ధరిస్తాడు. ఆయన అనాది, ఎప్పటినుంచో ఉన్నవడు, ఎప్పటికి ఉండేవాడు, ఆత్మస్వరూపుడు. ఆయనకు ఎవరు లేరని చెప్పినా, ఆయన అందరివాడు.

వకుళమాత మాట వింటూనే ఒక చిరునవ్వు నవ్వి, తన మనసులో గరుత్మంతుడిని, ఆదిశేషుడిని తలుచుకుంటాడు. వెంటనే ఇద్దరూ ప్రత్యక్షమవుతారు. దేవతలందరికీ నా వివాహవిషయం చెప్పు, అందరిని వెంటనే రమ్మను అని గరుడునితో చెప్తారు. కొడుకు బ్రహ్మకు కూడా ఒక లేక పంపుతాడు. బ్రహ్మకు చెప్తే వెంటనే దేవతలందరిని పిల్చి ఒక సభ పెట్టి, దేవతలందరిని తమ పరివారంతో కూడి రమ్మని అజ్ఞాపిస్తాడని చెప్తాడు.

ఇక్కడే ఒక చమత్కారం జరుగుతుంది.

To be continued.........

No comments:

Post a Comment